AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 1 అమ్మకోసం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 1st Lesson అమ్మకోసం

8th Class Telugu 1st Lesson అమ్మకోసం Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి

ఆ.వె. తల్లి దండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి? వాడు గిట్టనేమి?
పుట్టలోన చెదలు పుట్టదా? గిట్టదా?
విశ్వదాభిరామ! వినురవేమ !

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కవి ఈ పద్యాన్ని ఎవరి గురించి చెప్పారు?
జవాబు:
కవి ఈ పద్యాన్ని తల్లిదండ్రులపై దయలేని కొడుకుల గురించి చెప్పారు.

ప్రశ్న 2.
చెదలతో ఎవరిని పోల్చారు?
జవాబు:
చెదలతో తల్లిదండ్రులపై దయలేని కొడుకులను పోల్చారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

ప్రశ్న 3.
మన ప్రాచీన కథలలో తల్లిదండ్రులకు సేవచేసిన వారి గురించి మీకు తెలుసా?
జవాబు:
మన ప్రాచీన కథలలో తల్లిదండ్రులకు సేవచేసిన వారు యజ్ఞదత్తుడు, పాండురంగడు మొ||గువారు. రామాయణంలో ‘యజ్ఞదత్తుడు’ అనే మునికుమారుడు గుడ్డివారైన తన తల్లిదండ్రులకు సేవలు చేస్తూ ఉండేవాడు. వారిని కావడిలో పెట్టి మోసుకుంటూ తీర్థయాత్రలకు తీసుకొని వెళ్ళేవాడు. వారికి కందమూల ఫలాలు తెచ్చి ఇచ్చి వారి కడుపు నింపేవాడు. అతని తండ్రి వైశ్యుడు. తల్లి శూద్ర స్త్రీ. వారు ఋషిదంపతులు. వారికి ఒకసారి నదీజలాన్ని తెచ్చి వారి దాహాన్ని తీర్చడానికి, యజ్ఞదత్తుడు, సరయూ నదికి వెళ్ళి, కలశాన్ని నదిలో ముంచాడు. నదిలో కలశం ముంచిన చప్పుడు విని, ఏనుగు నీరు త్రాగడానికి వచ్చిందని భావించి దశరథుడు ‘శబ్దభేది’
బాణంతో కొట్టాడు. ఆ బాణం దెబ్బతిని, యజ్ఞదత్తుడు మరణించాడు. తల్లిదండ్రులకు సేవచేసిన వారిలో ఈ యజ్ఞదత్తుడు ప్రసిద్ధుడు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
తల్లిదండ్రులు కష్టాల్లో ఉన్నప్పుడు పిల్లలు ఏం చేయాలి? ఎందుకు?
జవాబు:
“మాతృదేవోభవ, పితృదేవోభవ” అన్నారు పెద్దలు. తల్లిదండ్రులు దైవ సమానులు. వారు మనకు జన్మనిచ్చినవారు. తల్లిదండ్రులు కష్టాల్లో ఉంటే పిల్లలు తమ సమస్తాన్ని సమర్పించి, వారిని ఆదుకోవాలి. వారికి సేవచేయాలి. వారు మనలను పెంచి పెద్దచేసి చదువు చెప్పిస్తారు. మన అభివృద్ధికై వారు ఎంతో కష్టపడ్డారు. మనకు కావలసినవి సమకూరుస్తారు. వారు వృద్ధులయినపుడు వారిని పిల్లలు చక్కగా సేవించాలి. తల్లిదండ్రులను ఆదరించడం, దైవ సేవచేయడం వంటిది అని గుర్తించాలి.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

ప్రశ్న 2.
నేటికాలంలో తల్లిదండ్రులపట్ల పిల్లల వైఖరి ఎలా వుంది? దీనికి కారణాలు ఏమిటి?
జవాబు:
నేటి కాలంలో మానవ సంబంధాలు సరిగా ఉండడం లేదు. అందరిలోనూ స్వార్థం పెరిగిపోయింది. కని, పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రుల్ని కొంతమంది పిల్లలు ఆదరించడం లేదు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని మాత్రం అనుభవిస్తున్నారు. వారు కట్టించిన ఇళ్ళల్లో హాయిగా నివసిస్తున్నారు. కాని శక్తి ఉడిగి, మూలనపడిన తల్లిదండ్రులను ఆదరంగా చూడడంలేదు. తిండి పెట్టడం లేదు. వారి మాటకు గౌరవం ఇవ్వడం లేదు. కనీసం తమ పిల్లలను, తాతామామ్మల వద్దకు పంపడం లేదు. తాము తమ తల్లిదండ్రులను ఆదరించకపోతే, తిరిగి తమ పిల్లలు తమను అలాగే చూస్తారని వారు గ్రహించడం లేదు. . తల్లిదండ్రుల పట్ల, పిల్లల వైఖరికి వారి స్వార్థమే కారణం. తాము సంపాదించినదంతా, తమ భార్యాబిడ్డల సౌఖ్యానికే ఖర్చు చేయాలనే తాపత్రయమే, దీనికి ముఖ్య కారణం.

ప్రశ్న 3.
పాఠంలో ఏయే పద్యాలు మీకు నచ్చాయి? ఎందువల్ల?
జవాబు:
నాకు ఈ పాఠంలో మొదటి పద్యం, తొమ్మిదవ పద్యం, పదమూడవ పద్యం బాగా నచ్చాయి.

మొదటి పద్యంలో గరుత్మంతుడు తల్లితో తనకు గల బలాన్ని వివరించి చెప్పాడు. తాను దాస్యవృత్తిని ఎందుకు చేయవలసి వచ్చిందని తల్లిని అడిగాడు. తన దాస్యాన్ని వదిలించుకొని, స్వేచ్ఛగా జీవించాలనే గరుడుని కోరిక, నాకు నచ్చింది.

తొమ్మిదవ పద్యంలో, గరుత్మంతుడు నిప్పుల తోకచుక్కల సమూహంలా, తన రెక్కల గాలితో మేఘాల్ని చెదరగొట్టి, అమృతాన్ని రక్షించేవారు భయపడేటట్లు మనోవేగంతో వెళ్ళాడని, నన్నయ కవి చెప్పినది అక్షరరమ్యతతో చెవికి ఇంపుగా ఉంది. గరుత్మంతుని శక్తియుక్తులు నాకు ఆశ్చర్యం కల్గించాయి. దాస్యం నుండి స్వాతంత్ర్యం పొందాలనే కోరిక, నాకెంతగానో ఆనందాన్ని ఇచ్చింది.

అమృతాన్ని నాగులకు తెచ్చి ఇచ్చి, సూర్య, వాయు, చంద్రాగ్నుల సాక్షిగా, తల్లి దాస్యం తీరిందని చెప్పిన గరుడుని మాటను, తల్లి దాస్యం తొలగిపోవడంతో అతనికి కల్గిన ఆనందాన్ని పదమూడవ పద్యం ఎంతో చక్కగా తెలుపుతోంది.

II చదవడం, అవగాహన చేసుకోడం

ప్రశ్న 1.
అమృతం తేవడానికి వెళుతున్న గరుత్మంతుణ్ణి వర్ణించిన పద్యం ఏది? ఆ పద్యాన్ని, దాని భావాన్ని రాయండి.
పద్యం :
వితతోల్కాశనిపుంజ మొక్కొ యనఁగా విన్వీథి విక్షిప్త ప
క్షతి వాతాహతి దూలి, తూల శకలాకారంబులై వారిద
ప్రతతుల్ సాల్పడి నల్గడం ఖైదరఁగాఁ బాటెన్ మనోవేగుఁడై
పతగేంద్రుం డమృతాంతికంబునకుఁ దత్పాలుర్ భయం బందఁగన్.

భావం :
పక్షిరాజు మనో వేగంతో బయలుదేరాడు. అప్పుడతడు నిప్పుకణాలతో కూడిన తోకచుక్కలా ఉన్నాడు. ఆకాశంలో కదులుతూ ఉన్నప్పుడు అతని రెక్కల గాలివల్ల మేఘాలు దూదిపింజలై చెదరిపోతున్నాయి. అమృతాన్ని రక్షిస్తున్నవారు భయపడేటట్లుగా గరుత్మంతుడు మనోవేగంతో అమృతమున్న చోటుకు వెళ్ళాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

ప్రశ్న 2.
1, 9 పద్యాలకు ప్రతిపదార్థాలు రాయండి. ప్రతిపదార్థం అంటే పద్యంలోని ప్రతి ఒక్క పదానికి అర్థం రాయడం. ప్రతిపదార్థం రాయడంలో అన్వయక్రమం సాధించేందుకు పదాలవరస మార్చి రాయడం, పదాల మధ్య సంబంధం కోసం అక్కడక్కడా ప్రత్యయాలు చేర్చడం జరుగుతుంది.

ఉదాహరణ
చ. ‘అమితపరాక్రమంబును, రయంబును, లావును గల్గు ఖేచరో
త్తముఁడవు నీవు; నీదయిన దాస్యము వాపికొనంగ నీకుఁ జి
త్తము గలదేని, భూరిభుజదర్పము శక్తియు నేర్పడంగ మా
కమృతముఁ దెచ్చియి’ మ్మనిన నవ్విహగేంద్రుఁడు – సంతసంబునన్
ప్రతిపదార్థం :
నీవు = గరుత్మంతుడివైన నీవు
అమిత = అధికమైన
పరాక్రమంబును = శౌర్యమూ
రయంబును = వేగమూ,
లావును = బలమూ
కల్గు = ఉన్న
ఖేచర + ఉత్తముడవు = పక్షి శ్రేష్ఠుడివి;
నీది + అయిన = నీ (యొక్క)
దాస్యము = బానిసత్వాన్ని
పాపికొనంగ = పోగొట్టుకునేందుకు
నీకున్ = నీకు
చిత్తము = ఇష్టము (కోరిక)
కలదు + ఏని = ఉన్నట్లైతే
మాకున్ = ఉరగులమైన మాకు
భూరి = గొప్పదైన
భుజదర్పము = భుజగర్వము
శక్తియున్ = బలము
ఏర్పడంగ = ప్రకటితమయ్యేటట్లు
అమృతమున్ = అమృతాన్ని
తెచ్చి +ఇమ్ము = తెచ్చి ఇయ్యి
అనినన్ = అని పలుకగా,
ఆ+విహగ+ఇంద్రుడు = పక్షి శ్రేష్ఠుడైన ఆ గరుత్మంతుడు
సంతసంబునన్ = సంతోషంతో (ఇలా అన్నాడు……..)

1వ పద్యము

ఉ. ఆయతపక్షతుండహతి నక్కులశైలము లెల్ల నుగ్గుగాఁ
జేయు మహాబలంబును బ్రసిద్దియునుం గల నాకు నీపనిం
బాయక వీఁపునం దవడుఁబాముల మోవను, వారికిం బనుల్
సేయను నేమి కారణము సెప్పుము దీనిఁ బయోరుహాననా!
ప్రతిపదార్థం :
పయోరుహాననా (పయోరుహ + ఆననా) = పద్మము వంటి ముఖము కలదానా !
ఆయత క్షతుండహతిన్;
ఆయత = పెద్దవయిన
పక్ష = టెక్కలయొక్కయు
తుండ = ముక్కు యొక్కయు
హతిన్ = దెబ్బలచేత
అక్కులశైలము లెల్లన్;
ఆ + కులశైలములు + ఎల్లన్ = ఆ కులపర్వతాలు అన్నింటినీ
నుగ్గుగాన్ + చేయు = పొడిగా చేయగల
మహాబలంబును (మహత్ + బలంబును) = గొప్ప బలాన్నీ
ప్రసిద్ధియున్ = ప్రఖ్యాతియూ
కల, నాకున్ = పొందిన నాకు
ఈ పనిన్ = ఈ పనిని (ఈ దాస్యాన్ని)
పాయక = మానకుండా
వీపునందున్ = వీపు మీద
అవడు + పాములన్ = నీచములయిన పాములను
మోవను = మోయడానికిన్నీ
వారికిన్ = ఆ పాములకు
పనుల్ + చేయను = పనులు చేయడానికి (సేవలు చేయడానికిన్నీ)
ఏమి, కారణము = కారణము ఏమిటో
నాకున్ = నాకు
చెప్పుము = చెప్పుము

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

9వ పద్యము

మ. వితతోల్కాశనిపుంజ మొక్క యనఁగా విన్వీథి విక్షిప్త ప
క్షతి వాతాహతి దూలి, తూల శకలాకారంబులై వారిద
ప్రతతుల్ సాల్పడి నల్గడం జెదరఁగాఁ బాటెన్ మనోవేగుఁడై
పతగేంద్రుం డమృతాంతికంబునకుఁ దత్పాలుర్ భయం బందఁగన్.
ప్రతిపదార్థం :
వితతోల్కాశనిపుంజము + ఒక్కొ
వితత = విరివిగా గల
ఉల్క = మండే నిప్పుకణాల యొక్కయు,
అశని = పిడుగుల యొక్కయు
పుంజము + ఒక్కొ = సమూహమా
అనగా = అనేటట్లుగా
విన్వీథి (విన్ + వీథి) = ఆకాశమార్గంలో
విక్షిప్తపక్షతివాతాహతిన్; విక్షిప్త = విదల్చబడిన
పక్షతి = రెక్కల యొక్క
వాత = గాలి యొక్క
ఆహతిన్ = దెబ్బల చేత
తూలి = అటునిటు కదలి
పాఱెన్ = పరుగెత్తాడు.
వారిద, ప్రతతుల్ : మబ్బుల యొక్క సముదాయాలు
తూలశకలాకారంబులు + ఐ; తూల = దూది యొక్క
శకల = పింజల యొక్క
ఆకారంబులు + ఐ = రూపములు కలవై
చాల్పడి = వరుసకట్టి
నల్గడన్ (నల్ + కడన్) – = నాల్గువైపులా
చెదరగా = చెదరిపోగా
మనోవేగుడై (మనః + వేగుడు + ఐ) = మనస్సు యొక్క వేగం వంటి వేగం కలవాడై
పతగేంద్రుండు (పతగ + ఇంద్రుండు) – పక్షులకు ఇంద్రుడయిన గరుత్మంతుడు
అమృతాంతికంబునకున్ (అమృత + అంతికంబునకున్) = అమృతం దగ్గరకు
తత్ పాలుర్ = ఆ అమృత రక్షకులు
భయంబు + అందగన్ = భయపడగా

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

3. పాఠంలోని కింది పద్యపాదాలకు సమానార్థక వాక్యాంశాలను గుర్తించండి.
i) అనిమిషనాథ సుగుప్తమయిన యమృతము
అ) అనిమిషనాథునికి ఇష్టమైన అమృతం
ఆ) ఇంద్రుడు దాచిపెట్టిన అమృతం
ఇ) ఇంద్రునికి అయిష్టమైన అమృతం
ఈ) ఇంద్రుడు దాచి కాపాడుతూ ఉంచిన అమృతం
జవాబు:
ఈ) ఇంద్రుడు దాచి కాపాడుతూ ఉంచిన అమృతం

ii) ఆయత పక్షతుండ
అ) ఆయన పక్షి శ్రేష్ఠుడు
ఆ) ఆయన పక్షపాతి
ఇ) పెద్ద రెక్కలున్న వాణ్ణి
ఈ) పెద్ద పక్షిని నేను
జవాబు:
ఇ) పెద్ద రెక్కలున్న వాణ్ణి

iii) నీయట్టి సత్పుత్రుం బడసియు దాసినై యుండుదాననే?
అ) నీవంటి ఉత్తమకుమారుణ్ణి పొంది కూడా దాసిగానే ఉండనా?
ఆ) నీవంటి ఉత్తమకుమారుణ్ణి పొందాను కనుక ఇక దాసిగా ఉంటాను.
ఇ) నీవంటి గొప్పకుమారుణ్ణి పొంది కూడా దాసిగానే ఉన్నాను.
ఈ) నీ వంటి గొప్పకుమారుణ్ణి పొందినా దాసిగానే ఉంటాను.
జవాబు:
అ) నీవంటి ఉత్తమకుమారుణ్ణి పొంది కూడా దాసిగానే ఉండనా?

4. కింది మాటలు ఎవరు ఎవరితో అన్నారో ఏ సందర్భంలో అన్నారో రాయండి.
అ) మా యీ దాస్యము వాయు నుపాయము సేయుండు.
జవాబు:
ఈ మాటలు గరుడుడు కద్రువ పుత్రులతో అన్నాడు.

గరుత్మంతుడు తమ దాస్యమునకు కారణాన్ని తల్లి వల్ల తెలిసికొన్నాడు. తరువాత గరుత్మంతుడు కద్రువ పుత్రుల వద్దకు వచ్చి, వారికి ఏమి కావాలన్నా తెచ్చి యిస్తానని చెప్పి తమ దాస్యము పోయే ఉపాయం చెప్పమని వారిని అడిగిన సందర్భంలోనిది.

ఆ) నీ కతమున నా దాస్యము ప్రాకటముగఁ బాయునని
జవాబు:
ఈ మాటలు వినత తన కుమారుడు గరుత్మంతునితో అన్నది.

మనం ఎందుకు కద్రువకూ, ఆమె పుత్రులకూ దాస్యం చేయవలసి వచ్చిందని గరుత్మంతుడు తల్లి వినతను అగిగాడు. అప్పుడు వినత తాను కద్రువతో వేసిన పందెములో ఓడిపోవడం వల్ల దాసీత్వము వచ్చిందని చెప్పింది. ఆ దాసీత్వము గరుత్మంతుని కారణంగానే పోతుందని వినత గరుత్మంతుడికి చెప్పిన సందర్భంలోనిది.

ఇ) నీదయిన దాస్యము వాపికొనంగ నీకుఁ జిత్తము గలదేని
జవాబు:
ఈ మాటలు కద్రువ పుత్రులు గరుత్మంతునితో అన్నారు.

తనకూ తన తల్లికీ దాస్యం పోయే ఉపాయం చెప్పండని గరుత్మంతుడు కద్రువ పుత్రులను అడిగినప్పుడు, కద్రువ పుత్రులు గరుత్మంతునికి చెప్పిన మాటల సందర్భంలోనిది.

ఈ) దినకరపవనాగ్ని తుహినదీప్తుల కరిగాన్
జవాబు:
ఈ మాటలు గరుత్మంతుడు, కద్రువ పుత్రులతో అన్నాడు.

గరుత్మంతుడు దేవతలను జయించి, అమృతాన్ని తెచ్చి కద్రువ పుత్రులకు ఇచ్చాడు. ఆ తరువాత సూర్యుడు, వాయువు, అగ్ని, చంద్రుడు సాక్షిగా తమ దాస్యము పోయిందని, గరుత్మంతుడు కద్రువ పుత్రులతో చెప్పాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

5. కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా జవాబులు రాయండి.
అ) గరుడుడు తల్లిని ఏమని ప్రశ్నించాడు?
జవాబు:
ఓ తల్లీ ! విశాలమైన నా రెక్కలతో, వాడి అయిన ముక్కుతో కులపర్వతాలు అన్నింటిని పిండిగా చేయగలిగిన గొప్ప బలం, కీర్తి గలిగిన నేను, ఈ నీచులైన పాములను ఎప్పుడూ వీపు మీద మోయడానికి, వాటికి సేవలు చేయటానికి కారణము ఏమిటో చెప్పమని ప్రశ్నించాడు.

ఆ) కద్రువ కుమారులను గరుడుడు ఏమడిగాడు? దానికి వాళ్ళేమన్నారు?
జవాబు:
కద్రువ కుమారులను గరుడుడు నా తల్లికి, నాకు దాస్యం పోవడానికి ఆలోచన చేయండి, దీనికోసం మీకు ఇష్టమైనదేదో ఆజ్ఞాపించండి. దేవతలను లోబరుచుకొని అయినా దాన్ని సాధిస్తాను అని అడిగాడు.

“నీవు అంతులేని పరాక్రమం, వేగం, బలం కలిగిన పక్షి శ్రేష్ఠుడివి. నీకు దాస్యం పోగొట్టుకోవాలనే అభిప్రాయం ఉంటే, నీ భుజబలం సామర్థ్యమూ తెలిసేలా, మాకు అమృతాన్ని తెచ్చి ఇయ్యి” – అని కద్రువపుత్రులు, గరుత్మంతునితో చెప్పారు.

ఇ) అమృతాన్ని ఎవరు, ఎలా రక్షిస్తున్నారు?
జవాబు:
అమృతం దేవేంద్రుడి రక్షణలో ఉంది. కాపలాదార్లు అమృతాన్ని రక్షిస్తున్నారు. ఇంకా అమృతాన్ని భయంకరమైన రెండు సర్పాలు రక్షిస్తున్నాయి. ఆ పాములు ఆ సమీపానికి ఎవరినీ రానీయడం లేదు. వాటి ముఖాలు కోపాన్ని వెలిగ్రక్కుతున్నాయి. ఆ పాముల చూపులు విషము అనే అగ్నిని చిమ్ముతున్నాయి.

ఈ) అమృతం తెచ్చిన గరుడుడు కద్రువ కుమారులతో ఏమని చెప్పాడు?
జవాబు:
అమృతం తెచ్చిన గరుడుడు కద్రువ కుమారులతో “నేను దేవేంద్రుడి రక్షణలో ఉన్న అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చాను. దీనికి సూర్యుడు, గాలి, అగ్ని, చంద్రుడు, సాక్షులు. దీనితో నా తల్లి దాస్యం తొలగిపోయింది” అన్నాడు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ఎంతో కష్టమైనప్పటికీ, దాస్యవిముక్తి కోసం గరుడుడు అమృతం తెచ్చాడు కదా ! అయితే దాస్యవిముక్తికి లేదా స్వేచ్ఛకు ఉన్న గొప్పతనం ఏమిటో వివరించండి.
జవాబు:
బానిసత్వం నుండి విడిపించుకొని స్వేచ్ఛగా జీవించడమే దాస్యవిముక్తి. గరుత్మంతుడు తన తల్లికీ, తనకూ దాస్యం పోడానికి ఎంతో కష్టపడి, దేవేంద్రుని ఎదిరించి, అమృతం తెచ్చియిచ్చాడు. మన భారతమాత దాస్య బంధాన్ని విడిపించి, స్వతంత్రం పొందడానికి, మన దేశ నాయకులు ఎందరో ప్రాణాలు విడిచారు. జైళ్ళలో మగ్గిపోయారు. ఒకరికి సేవచేస్తూ, బానిసత్వంలో పడి ఉండడం, నరకంతో సమానం. స్వేచ్ఛా జీవితం అనుభవిస్తూ, తనకు లభ్యమయిన అన్న పానీయాలను తీసుకొని, కడుపునింపుకోవడం స్వర్గంతో సమానం.

ఆ) వినత తన విముక్తి కోసం కొడుకు మీద ఆశపెట్టుకుంది కదా ! నేటి కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లల వల్ల ఏమి ఆశిస్తున్నారు?
జవాబు:
నేటి తల్లిదండ్రులు తమ పిల్లలు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకుంటూ, బాగా సంపాదించాలని కోరుకుంటున్నారు. తమ పిల్లలకు చక్కని పెళ్ళి సంబంధాలు రావాలనీ మంచి కోడళ్ళూ, అల్లుళ్ళూ తమకు దొరకాలనీ కోరుకుంటున్నారు.

తమకు వృద్ధాప్యం వచ్చాక, తమ పిల్లలు తమను ప్రేమగా ఆదరంగా చూడాలని కోరుకుంటున్నారు. చివరి రోజులో పిల్లలు తమకు ఆసరాగా నిలిచి, తమకు దగ్గరగా ఉండి, కావలసిన సహాయాన్ని అందించాలని కోరుకుంటున్నారు.

ఇ) మీరు మీ తల్లిదండ్రులకు ఏ విధంగా సహాయపడుతున్నారు? ఇంకా వాళ్ళకు ఏ విధంగా సహకారం అందించాలని అనుకుంటున్నారు?
జవాబు:
నేను మా తల్లిదండ్రులకు సహాయం చేస్తున్నాను. నా సెలవు రోజుల్లో మా నాన్నగారితో పొలం పనులకు వెడతాను. సాయం చేస్తాను. మా అమ్మగారికి ఇంట్లో పనుల్లో సాయం చేస్తాను. కిరాణాకొట్టు నుండి సరకులు తెచ్చిపెడతాను. రేషను సరకులు తెస్తాను. విద్యుచ్ఛక్తి బిల్లులు కడతాను. వారం వారం, ఇల్లు శుభ్రం చేస్తాను.

నేను పెద్దయ్యాక మా తల్లిదండ్రులను మా ఇంటిలో మాతోనే ఉంచుకొని వారిని కంటికి రెప్పలా చూసుకుంటాను.

వృద్ధాప్యదశలో కలిగే కోరికలను నా శక్తిమేర తీర్చాలనుకుంటున్నాను. వారికి కావలసిన సదుపాయాలను అన్నింటిని సమకూరుస్తాను.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

ఈ) యోగ్యులైన పిల్లల వల్ల తల్లిదండ్రులకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?
(లేదా)
గరుత్మంతుడి లాంటి గొప్ప కొడుకులు ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో రాయండి. (S.A. III – 2016-17)
జవాబు:
గరుత్మంతుడి లాంటి గొప్ప కుమారులున్న తల్లిదండ్రులు అదృష్టవంతులు. సమర్థులైన కొడుకులు తల్లిదండ్రుల కష్టాలు తొలగిస్తారు. గరుత్మంతుడు సమర్థుడు. బలవంతుడు. కొండల్ని పిండి చేయగలడు. అందువల్లనే తమ దాస్య కారణాన్ని తల్లి నుండి అడిగి తెలుసుకొన్నాడు. అంతేకాక కద్రువ పుత్రుల వద్దకు వెళ్ళి తన తల్లి దాస్య విముక్తి కోసం వారడిగినది తెచ్చి ఇచ్చాడు.

పిల్లలు యోగ్యులైతే వారు తల్లిదండ్రులకు, అన్ని విధాలా సాయం చేస్తారు. తమ తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఆసరాగా ఉండి, వారికి కావలసిన సమస్త సదుపాయాలు, తమ శక్తిమేరకు సమకూరుస్తారు. తల్లిదండ్రులకు వైద్యసదుపాయాలు ఏర్పాటు చేస్తారు. తమకు తీరిక దొరికినప్పుడు తల్లిదండ్రుల వద్ద కూర్చుండి, ఇష్టాగోష్టిగా మాట్లాడి, వారి కష్టసుఖాల్ని తెలుసుకుంటారు. తల్లిదండ్రులు హాయిగా మనవలతో కాలక్షేపం చేసేలా ఏర్పాటు చేస్తారు. తల్లిదండ్రుల సలహాలను తాము తీసుకొని, సంసారాన్ని చక్కగా నడుపుకుంటారు. యోగ్యులైన పిల్లల వలన తల్లిదండ్రులు సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవనం గడుపుతారు.

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “సమర్థులైన కొడుకులు తల్లిదండ్రుల కష్టాలు తొలగిస్తారు”- ఈ వాక్యాన్ని సమర్థిస్తూ సొంతమాటలలో రాయండి.
(లేదా)
“సమర్ధులైన కొడుకులు తల్లిదండ్రుల కష్టాలను తొలగిస్తారు” ఈ మాటలను గరుత్మంతుడు ఎలా నిజం చేశాడో రాయండి. (S.A. I – 2019-207)
జవాబు:
కొన్ని పేద, మధ్య తరగతి కుటుంబాలలో తల్లిదండ్రులు తమకు ఆర్థికస్తోమత లేకపోయినా తమ బిడ్డల భవిష్యత్తు బంగారుమయం కావాలని ఆశిస్తారు. తామెన్ని వ్యయప్రయాసలు, కష్టనష్టాలకు అయినా ఓర్చి వారికి పెద్ద చదువులు చెప్పిస్తారు. అటువంటి కుటుంబాలకు చెందిన కొందరు సమర్థులైన పిల్లలు తమ శ్రేయస్సు కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని, తాపత్రయాన్ని గుర్తించి, చక్కగా చదువుకొని ఉన్నత స్థానానికెదిగి, మంచి ఉద్యోగాలు పొందుతున్నారు. వారు తమ తల్లిదండ్రులకు ఆర్థికంగా ఆసరాగా నిలవడమే కాక, వారికి అన్ని విధాలా తోడ్పాటు నందిస్తూ, శ్రద్ధాసక్తులతో గౌరవిస్తూ, వారి సలహాలను పాటిస్తూ, వారి కోర్కెలను తీరుస్తూ ఉత్తమ జీవనం సాగిస్తారు. తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఋణం తీర్చుకోవడానికి వారు శాయశక్తులా కృషి చేస్తారు.

మన పాఠంలో గరుత్మంతుడు సమర్థుడు. బలవంతుడు. కొండల్ని పిండి చేయగలడు. అందువల్లనే తమ దాస్య కారణాన్ని తల్లి నుండి అడిగి తెలుసుకున్నాడు. అంతేకాదు. కద్రువ పుత్రుల వద్దకు వెళ్ళి “మీకు ఇష్టమైనదేదో చెప్పండి. దేవతలనైనా జయించి తెస్తాను’ అని అన్నాడు. అలా అనడానికి అతనికి గల సమర్థత, శక్తి సామర్థ్యాలు కారణం.

మాట అనడమేకాదు, తన రెక్కల గాలితో దుమ్మును రేపి అమృతాన్ని రక్షించే పాములకు కళ్ళు కనబడకుండా చేశాడు. వాటి తలలను తొక్కి అమృతాన్ని తీసుకొని ఆకాశానికి ఎగిరాడు. అమృతాన్ని కద్రూ పుత్రులకు తెచ్చి ఇచ్చి తమ దాస్యాన్ని పోగొట్టుకున్నాడు.

దీనిని బట్టి సమర్థులైన కొడుకులు, తల్లిదండ్రుల కష్టాలు తీరుస్తారని చెప్పగలం.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

ఆ) ఈ పాఠం సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
గరుత్మంతుడు తన తల్లి దాస్యాన్ని ఏ విధంగా పోగొట్టాడో రాయండి. (S.A. I – 2018-19)
జవాబు:
కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత అని ఇద్దరు భార్యలు ఉన్నారు. పెద్ద భార్య కద్రువకు కశ్యపుని వరం వలన వేయిమంది కుమారులు కలిగారు. వారే కర్కోటకాది సర్పాలు. వినతకు అనూరుడు, గరుత్మంతుడు పుట్టారు. అనూరుడు, సూర్యుని రథసారథి. వినత ఒక పందెంలో ఓడిపోయి కద్రువకు దాసి అయింది. తల్లితో పాటు గరుత్మంతుడు కద్రువ కుమారులకు సేవలు చేస్తూ ఉండేవాడు.

మహాశక్తిమంతుడైన గరుత్మంతుడు తమ దాస్యానికి కారణం తెలుసుకోవడానికి తల్లి దగ్గరకు వెళ్ళాడు. తన తల్లిని మనము ఎల్లపుడూ నీచమైన పాములను వీపు మీద మోయడానికి కారణం చెప్పమని అడిగాడు.

వినత తన సనతి అయిన కద్రువతో పందెంలో ఓడిపోయి దాసీతనం పొందిన విషయాన్ని కొడుకుతో స్పష్టంగా చెప్పింది. గరుడుని వంటి యోగ్యుడైన పుత్రుని పొంది దాసీగానే ఉండాలా అని ప్రశ్నించింది.

తల్లికి దాస్యవిముక్తి చేయటం కోసం గరుత్మంతుడు పాములతో ‘మీకు ఇష్టమైనది ఆజ్ఞాపించండి, దాన్ని సాధిస్తాను’ అని చెప్పాడు.

అప్పుడు కద్రువ కుమారులు జాలిపడి గరుత్మంతుడితో ‘నీ భుజబలం, సామర్థ్యం తెలిసేలా మాకు దేవేంద్రుని వద్ద వున్న అమృతాన్ని తెచ్చి ఇవ్వు” అన్నారు.

గరుడుడు తల్లి ఆశీస్సులతో అమృతం తేనటానికి వెళ్ళాడు. తన రాకతో అమృతాన్ని రక్షిస్తున్నవారు భయపడేటట్లుగా గరుత్మంతుడు మనోవేగంతో అమృతం ఉన్న చోటుకు వెళ్ళాడు.

అమృతాన్ని రక్షిస్తున్న భయంకరమైన రెండు సర్పాలు ఆ సమీపానికి ఎవరినీ రానీయడం లేదు. గరుడుడు తన రెక్కలవల్ల రేగిన దుమ్ముతో వాటి కళ్ళు కనబడకుండా చేశాడు. వాటి తలలను తొక్కిపట్టాడు. అమృతాన్ని తీసుకొని ఆకాశానికి ఎగిరాడు.

దాన్ని పాములకు చూపించి “దేవేంద్రుడి రక్షణలో ఉన్న అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చాను. దీనికి సూర్యుడు, గాలి, అగ్ని, చంద్రుడు సాక్షులు – దీనితో నా తల్లి దాస్యం తొలగిపోయింది” అన్నాడు.

IV. పదజాలం – వినియోగం

1. కింది పేరా చదవండి. పేరాలో గీత గీసిన పదాలకు ఒక్కొక్క దానికి మూడు సమానార్థక పదాలు పేరా కింద ఉన్నాయి. వాటిలో నుంచి సరైన పదాలను ఎంపిక చేసి రాయండి.

నభమున దట్టమైన వారిదములు విస్తరించాయి. ఉరుములు మెరుపులతో పాటు కులిశములు రాలాయి. దీనితో విపినంలో ఉండే వృక్షాలు కూలిపోయాయి. పన్నగాలన్నీ పుట్టలలోనికి దూరాయి. మబ్బులు వీడగానే పతంగుడు మళ్ళీ దర్శన మిచ్చాడు.

(ఆకాశం, పాము, పిడుగు, మేఘం, సూర్యుడు, అడవి, అరణ్యం, రవి, మబ్బు, అశని, ఫణి, గగనం, వనం, సర్పము, నిర్ఘాతము, అభ్రము, భానుడు, అంబరం.)
సమానార్థక పదాలు :
1. నభము = ఆకాశం, గగనం, అంబరం
2. వారిదము = మేఘం, మబ్బు, అభ్రము
3. కులిశము = పిడుగు, అశని, నిర్ఘాతం
4. వివినము = అడవి, అరణ్యం, వనం
5. పన్నగము = పాము, సర్పం, ఫణి
6. పతంగుడు = భానుడు, సూర్యుడు, రవి

2. కింది పదాలకు అర్థాలు రాయండి, సొంతవాక్యాల్లో ప్రయోగించండి.

అమితం, పరాక్రమం, దాస్యం, సత్పుత్రుడు, ప్రసిద్ధి, విముక్తి

1) అమితము = అంతులేని
సముద్రంలో అమితమైన జలరాశులు ఉన్నాయి.

2) పరాక్రమం = గొప్పశక్తి
అశోకుడు కళింగయుద్ధంలో గొప్ప పరాక్రమం చూపాడు.

3) దాస్యం = బానిసత్వం
ఆంగ్లేయుల పాలనలో భారతీయులు దాస్యంలో నలిగిపోయారు.

4) సత్పుత్రుడు = మంచి కుమారుడు
దశరథునికి శ్రీరాముడు సత్పుత్రుడు.

5) ప్రసిద్ధి = ఖ్యాతి
కొండపల్లి కొయ్యబొమ్మలకు ప్రసిద్ధిగాంచింది.

6) విముక్తి = స్వేచ్ఛ
భారతీయులకు ఆంగ్లేయుల నుంచి 1947లో విముక్తి లభించింది.

V. సృజనాత్మకత

* పాఠం ఆధారంగా గరుడునికీ, కద్రువ కుమారులకూ మధ్య జరిగిన చర్చను సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
గరుత్మంతుడు : అన్నలారా! మీరు నాకు ఒక ఉపకారం చేయండి.

కద్రువ కుమారులు : గరుత్మంతుడా! నీవు దాసీపుత్రుడవు. మాకు బానిసవు.

గరుత్మంతుడు : అవును. నా తల్లికీ, నాకూ దాస్యం పోవడానికి, ఏదైనా మీరు ఉపాయం చెప్పండి.

కద్రువ కుమారులు : మరి మాకు ఇష్టమైన పని చేస్తావా?

గరుత్మంతుడు : సరే! తప్పక చేస్తాను, మీకు ఇష్టమైన పని ఏమిటో ఆజ్ఞాపించండి.

కద్రువ కుమారులు : నీవు శక్తికలవాడవే, కాని, దేవతలను లొంగదీయగలవా?

గరుత్మంతుడు : లొంగదీసుకొని మీ కిష్టమైనది తప్పక తెస్తా!

కద్రువ కుమారులు : నీవు అంతులేని పరాక్రమం, వేగం కల పక్షి రాజువి. మరి మీ దాస్యం పోవాలంటే ఓ పని చేయాలి.

గరుత్మంతుడు : తప్పక చేస్తా. అదేమిటో చెప్పండి. నేను మాటతప్పను.

కద్రువ కుమారులు : అయితే నీ భుజబలం, సామర్థ్యం తెలిసేలా దేవతలను జయించి మాకు అమృతాన్ని తెచ్చి ఇవ్వు.

గరుత్మంతుడు : సరే, అన్నలారా! నేను తప్పక స్వర్గం నుంచి అమృతం తెచ్చి, మీ కిచ్చి దాస్య విముక్తి పొందుతా. (గరుడుడు అమృతం తెచ్చాడు.)

గరుత్మంతుడు : అన్నలారా! ఇదిగో అమృతం. దేవేంద్రుడి రక్షణలో ఉన్న అమృతాన్ని తెచ్చాను. సూర్యచంద్రాగ్నులు సాక్షిగా మా తల్లి దాస్యం పోయింది.

కద్రువ కుమారులు : సరే, నీవూ, నీతల్లి దాస్య విముక్తులయ్యారు. వెళ్ళండి.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

VI. ప్రశంస

* పొరుగూరిలో మీకు మంచి స్నేహితుడున్నాడు. ఆ మిత్రుడు అనారోగ్యంతో ఉన్న తండ్రికి సేవలు చేస్తూ తల్లిదండ్రుల అభిమానం పొందాడని తెలుసుకున్నారు. అతణ్ణి ప్రశంసిస్తూ లేఖ రాయండి.
జవాబు:

విజయవాడ,
x x x x x x x

ప్రియమైన మిత్రుడు నిరంజన్‌కు,

నీ మిత్రుడు రాయు లేఖ ఏమనగా ఇక్కడ నేను క్షేమము. అక్కడ నీవు ఎలా ఉన్నావు ? నిన్న నీవు వ్రాసిన ఉత్తరం అందింది. అది చదివి నేను చాలా సంతోషించాను. మీ నాన్నగారికి ఆరోగ్యం సరిగా లేదని, నీవు మీ నాన్నగారికి ఇంటివద్ద సేవలు చేస్తున్నావని తెలిపావు. ఇది చాలా ఆనందించవలసిన విషయం. తల్లిదండ్రులు మనకు దైవ సమానులు. వారికి సేవచేయటం మన బాధ్యత. “తల్లిదండ్రుల మీద దయలేని కొడుకు పుట్టలోని చెదలు” వంటి వాడని, వేమన్న అన్నాడు. నీవంటి పుత్రుని కన్నందుకు మీ తల్లిదండ్రులు ధన్యులు. నీకు అభినందనలు.

ఇట్లు,
నీ మిత్రుడు,
ఎస్. శశికాంత్,
8వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
విజయవాడ.

చిరునామా :
జి. నిరంజన్,
S/o జి.వెంకటేశ్వర్లు,
డోర్.నెం. 4/87,
రామాలయం వీధి,
గుంటూరు.

ప్రాజెక్టు పని

* “కష్టపెట్టబోకు కన్నతల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్నపనులు” వంటి పద్యాలు “అమ్మను మించిన దైవం లేదు” వంటి సూక్తులు కొన్నింటిని సేకరించి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
పద్యాలు :
1. పుత్రోత్సాహంబు తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జను లా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ !

2. ఉన్నను లేకున్నను పై
కెన్నడు మర్మంబుఁ దెలుప నేరకుమీ నీ
కన్న తల్లిదండ్రుల యశం
బెన్నఁ బడెడు మాడ్కిఁ దిరుగు మేలమిఁ గుమారా!

3. తనయుడు చెడుగై యుండిన
జనకుని తప్పన్న మాట సత్యమెఱుఁగుం గా
వున నీ జననీ జనకుల
కు నపఖ్యాతి యగురీతి గొనకు కుమారా !

సూక్తులు :
1. తల్లిదండ్రులు ప్రత్యక్షదైవాలు.
2. అమ్మ ప్రేమకు మారుపేరు – అమ్మ మనసు పూలతేరు.
3. తల్లిదండ్రులను పూజింపుము.
4. తల్లిదండ్రులు తమ సంతానానికి అందించిన వాటికి ప్రతిఫలం ఈ సృష్టిలోనే లేదు. – వాల్మీకి

VII. భాషను గురించి తెలుసుకుందాం

1. సమాపక, అసమాపక క్రియలు

(అ) కింది క్రియాపదాలను చదవండి.
తిని, చూసి, వండి, విని, చూస్తే, చేస్తూ, వింటే, ఆడుతూ

పై క్రియలలో పని పూర్తికాలేదని తెలుస్తుంది. ఇలా పని పూర్తికాని క్రియలను అసమాపక క్రియలని అంటారు. అట్లే తిన్నాడు, చదివాడు, చూశాడు, వండింది, విన్నది, చేస్తాడు మొదలగు క్రియాపదాల వల్ల పని పూర్తి అయినట్లు తెలుస్తుంది. ఇలా పూర్తి అయిన క్రియలను సమాపక క్రియలు అంటారు.

(ఆ) కింది వాక్యాలు చదవండి. సమాపక, అసమాపక క్రియాపదాల కింద గీత గీయండి.
* రాజు అన్నం తిని బడికి వెళ్ళాడు.
* గీత వంట చేసి అందరికి వడ్డించి తాను తిని నిద్రపోయింది.
* రజని నిద్ర లేచి స్నానంచేసి పూజచేసి అన్నం తిని బడికి వచ్చింది.

సమాపక క్రియలు అసమాపక క్రియలు
వెళ్ళాడు తిని
నిద్రపోయింది చేసి
వచ్చింది వడ్డించి
లేచి

2. సామాన్య వాక్యాలు
అ) రాజు అన్నం తిన్నాడు.
ఆ) గోపి పరీక్ష రాశాడు.
ఇ) గీత బడికి వెళ్ళింది.

పై వాక్యాలు గమనించండి. ఆ వాక్యాల్లోని తిన్నాడు, రాశాడు, వెళ్ళింది అనే క్రియలు సమాపక క్రియలు.

ప్రతి వాక్యంలో ఒకే ఒక సమాపక క్రియ ఉంది. అలా ఒకే ఒక సమాపకక్రియ ఉంటే ఆ వాక్యాలను సామాన్య వాక్యాలు అని అంటారు. కొన్ని సామాన్య వాక్యాలు క్రియ లేకుండా కూడా ఉంటాయి.
ఉదా :
ఢిల్లీ దేశ రాజధాని

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

3. సంక్లిష్ట వాక్యాలు

గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది.
పై వాక్యాలలో గీత నామవాచకం. గీత మొదటి వాక్యంలో ఉన్నందువల్ల రెండో వాక్యంలో పునరుక్తమైన నామవాచకం తొలగించి, మొదటి వాక్యంలోని క్రియ ‘వెళ్ళింది’ని ‘వెళ్ళి’ అనే అసమాపక క్రియగా మార్చి రాస్తే సంక్లిష్ట వాక్యం ఏర్పడుతుంది.

గీత బజారుకు వెళ్ళి, కూరగాయలు కొన్నది.
కింది సామాన్య వాక్యాల్ని సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
అ) విమల వంట చేస్తుంది. విమల పాటలు వింటుంది.
జవాబు:
విమల వంట చేస్తూ, పాటలు వింటుంది.

ఆ) అమ్మ నిద్రలేచింది. అమ్మ ముఖం కడుక్కుంది.
జవాబు:
అమ్మ నిద్రలేచి, ముఖం కడుక్కుంది.

ఇ) రవి ఊరికి వెళ్ళాడు. రవి మామిడిపండ్లు తెచ్చాడు.
జవాబు:
రవి ఊరికి వెళ్ళి, మామిడిపండ్లు తెచ్చాడు.

కింది సంక్లిష్ట వాక్యాల్ని సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.
అ) తాత భారతం చదివి నిద్రపోయాడు.
జవాబు:
తాత భారతం చదివాడు. తాత నిద్రపోయాడు.

ఆ) చెట్లు పూతపూసి కాయలు కాస్తాయి.
జవాబు:
చెట్లు పూత పూసాయి. చెట్లు కాయలు కాస్తాయి.

ఇ) రాము నడుచుకుంటూ వెళ్ళి తన ఊరు చేరాడు.
జవాబు:
రాము నడుచుకుంటూ వెళ్ళాడు. రాము తన ఊరు చేరుకున్నాడు.

4. కింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి.

అ) ఔరౌర = ఔర + ఔర – ఆమ్రేడిత సంధి
ఆ) దధ్యోదనము = దధి + ఓదనము – యణాదేశ సంధి
ఇ) ప్రథమైక – ప్రథమ + ఏక – వృద్ధి సంధి
ఈ) చిట్టచివర = చివర + చివర – ఆమ్రేడిత ద్విరుక్తటకారాదేశ సంధి
ఉ) అత్యుగము = అతి + ఉగ్రము – యణాదేశ సంధి

5. కింద పదాలను కలిపి సంధుల పేర్లను రాయండి. సంధి సూత్రాలు తెల్పండి.

అ) మొదట + మొదట = మొట్టమొదట = ఆమ్రేడిత ద్విరుక్తటకారాదేశ సంధి
సూత్రము :
ఆమ్రేడితం పరంగా ఉంటే, ‘కడ’ మొదలైన శబ్దాల మొదటి అచ్చు మీద అన్ని అక్షరాలకూ ‘ట్ట’ వస్తుంది.

ఆ) దేవ + ఐశ్వర్యం = దేవైశ్వర్యం = వృద్ధిసంధి
సూత్రము :
అకారమునకు ఏ, ఐలు పరమైనపుడు ఐ కారమూ, ఓ, ఔ లు పరమయితే ఔ కారమూ ఏకాదేశంగా వస్తాయి.

ఇ) దేశ + ఔన్నత్యం = దేశాన్నత్యం = వృద్ధి సంధి
సూత్రము :
అకారమునకు ఏ, ఐలు పరమైనపుడు ఐ కారమూ, ఓ, ఔ లు పరమయితే ఔఔ కారమూ ఏకాదేశంగా వస్తాయి.

ఈ) కడ + కడ . = కట్టకడ – ఆమ్రేడిత ద్విరుక్తటకారాదేశ సంధి
సూత్రము :
ఆమ్రేడితం పరంబగునపుడు కడాదుల తొలియచ్చు మీది వర్ణంబులకు ద్విరుక్తటకారంబగు.

ఉ) అతి + ఉగ్ర = అత్యుగ్ర = యణాదేశ సంధి
సూత్రము :
ఇ, ఉ, ఋ లకు అవసవర్ణమైన అచ్చులు పరమైతే, య, వ రలు ఆదేశంబగు.

6. ఆమ్రేడిత సంధి :
ఏడో తరగతిలో ఆమ్రేడిత సంధిని గురించి కొంత నేర్చుకొన్నాం గదా ! ఆమ్రేడిత సంధికి సంబంధించిన మరో సూత్రాన్ని తెలుసుకుందాం.
ఔర + ఔర = ఔరౌర (ఆమ్రేడిత సంధి)
ఆహా + ఆహా = ఆహాహా (ఆమ్రేడిత సంధి)
అచ్చుకు ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి అవుతుంది. అయితే –
1. పగలు + పగలు = పట్టపగలు
2. చివర + చివర = చిట్టచివర
3. కడ + కడ = కట్టకడ

పై పదాలు పరిశీలిస్తే ఇవీ ఆమ్రేడితమున్న రూపాలే. కాని పై సూత్రం ఇక్కడ వర్తించడం లేదు.

పగలు + పగలు = పట్టపగలు అవుతుంది. అంటే “ప” తర్వాత ఉన్న ‘గలు’ ఉన్న అక్షరాలకు బదులుగా ‘ట్ట” వచ్చింది. ‘మీ’ వచ్చి పట్టపగలు అయింది.

చివర + చివర అన్నప్పుడు ‘చి’ తర్వాత రెండక్షరాల మీద ‘ఋ’ వచ్చి చిట్టచివర అయింది.
కడ + కడ అన్నపుడు ‘డ’ స్థానంలో ‘మీ’ వచ్చి కట్టకడ అయింది.

ఇప్పుడు కింది వాటిని కలిపి రాయండి.
ఎదురు + ఎదురు = ఎట్టయెదురు
కొన + కొన = కొట్టకొన
మొదట + మొదట = మొట్టమొదట

ఆమ్రేడితం పరంగా ఉంటే కడ మొదలైన శబ్దాలు మొదటి అచ్చుమీద అన్ని అక్షరాలకు ‘మీ’ వస్తుండడం గమనించాం కదా ! అలానే మరిన్ని ఉదాహరణలను గమనించండి.
బయలు + బయలు = బట్టబయలు – మొదటి ‘యలు’ స్థానంలో ‘మీ’ వచ్చి, బట్టబయలు అయింది.
తుద + తుద = తుట్టతుద – మొదటి ‘ద’ స్థానంలో ‘ఓ’ వచ్చి, తుట్టతుద అయింది.
నడుమ + నడుమ = నట్టనడుమ – మొదటి ‘డుమ’ స్థానంలో ‘మీ’ వచ్చి, నట్టనడుమగా మారింది.

పై ఉదాహరణల ఆధారంగా సూత్రం తయారుచేద్దాం.

ఆమ్రేడితం పరంగా ఉంటే కడాదుల తొలి అచ్చు మీది అన్ని అక్షరాలకు అదంతమైన ద్విరుక్తటకారం వస్తుంది. కింది పదాలను కలిపి రాయండి. ఏం మార్పు జరిగిందో రాయండి.
పిడుగు + పిడుగు = పిట్టపిడుగు – మొదటి ‘డుగు’ స్థానంలో ‘ఋ’ వచ్చి, పిట్టపిడుగు అయింది.
బయలు + బయలు = బట్టబయలు – మొదటి ‘యలు’ స్థానంలో ‘మీ’ వచ్చి బట్టబయలుగా మారింది.

చదవండి – ఆనందించండి

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం 1

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

తల్లి : మాత, జనని, అంబ
కొడుకు : వస్త్రము, కుమారుడు, తనయుడు
అభీష్టం : కోరిక, వాంఛ, ఈప్సితం
గుప్తము : రహస్యం, గోప్యము, గుట్టుగ
అమరులు : దేవతలు, సురలు, నిర్దరులు
శైలం : పర్వతం, కొంగ, అద్రి, నగము
వృష్టి : వాన, వృద్ధి
ఖగము : పక్షి, పులుగు, విహంగము
పాము : పవనాశనము, పన్నగము, భుజంగము
అగ్ని : వహ్ని, జ్వలనము, చిచ్చు
అమృతం : పీయుషం, సుధ, కంజము
గగనం : ఆకాశం, నింగి, నభము
పవనాశం : పాము, సర్పం, ఫణి
దినకరుడు : సూర్యుడు, రవి, ఆదిత్యుడు

వ్యుత్పత్యరాలు

ఉరగము – పొట్టతో పాకేది (పాము)
ఇతిహాసం – ఇలా జరిగిందని చెప్పేది (చరిత్ర)
అనిమిషులు – రెప్పపాటు లేనివారు (దేవతలు)
అమృతం – మరణమును పొందిపనిది (సుధ)
దినకరుడు – దినాన్ని ఏర్పరిచేవాడు (సూర్యుడు)
నందనుడు – సంతోషమును కలిగించువాడు (పుత్రుడు)
పుత్రుడు – పున్నామ నరకం నుండి రక్షించువాడు (కుమారుడు)
వైనతేయుడు – వినత యొక్క కొడుకు (గరుత్మంతుడు)
అనిమిషనాథుడు – అనిమిషులకు నాథుడు (ఇంద్రుడు)
భేఛరము – ఆకాశమున సంచరించునది (పక్షి)

నానార్థాలు

పక్షము = రెక్క పదిహేను రోజులకాలం, ఒకభాగం, వరుస
తుండము = పక్షి ముక్కు, నోరు, ఖండం
ఖగము = పక్షి, బాణం, సూర్యుడు, గాలి
కుశ = తాడు, దర్భ, ఒక ద్వీపం
ఉల్క = నిప్పుకణం, బూడిద
లావు = బలము, సామర్థ్యము, శక్యము
అర్థం = ధనం, శబ్దార్థము సగభాగం
రయము = వేగము, వెల్లువ
అనలం = అగ్ని, కృత్తిక, నల్లకోడి, మూడు అంకె
అనిమిషం = చేప, దేవత
అరుణం = ఎరువు, కాంతి, కుష్ఠురోగం, బంగారం
అశని = వజ్రము, పిడుగు
గగనం = ఆకాశం, శస్త్రం, శూన్యము
వారి = నీరు, సరస్వతి, కుండ

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

ప్రకృతి – వికృతులు

పక్షి – పక్కి
అగ్ని – అగ్గి
శక్తి – సత్తి
దృష్ఠి – దిస్టి
ముక్తి – ముత్తి
హృదయం – ఎద
దాస్యము – దాసము
సంతోషం – సంతసం
దుఃఖము – దూకల
వీధి – వీది
పుత్రుడు – బొద్దె
పక్షం – పక్కం
కులము – కొలము
ముఖము – మొగము
కథ – కత

సంధులు

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు అవే (సవర్ణ) అచ్చులు పరమైనప్పుడు వానికి దీర్ఘములు ఏకదేశమగును.

అమృతాంశుడు = అమృత + అంశుడు – సవర్ణదీర్ఘ సంధి
అభీష్టములు = అభి = ఇష్టములు – సవర్ణదీర్ఘ సంధి
విషాగ్ని = విష + అగ్ని – సవర్ణదీర్ఘ సంధి
పవనాగ్ని = పవన + అగ్ని – సవర్ణదీర్ఘ సంధి
కుంశాభిరక్ష = కులశ – అభిరక్ష – సవర్ణదీర్ఘ సంధి
దారుణాక్షములు = దారుణ + అక్షములు – సవర్ణదీర్ఘ సంధి
అమృతాంతికము = అమృత + అంతికము – సవర్ణదీర్ఘ సంధి

గుణసంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమగునపుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఆదేశమగును.

ఖగేంద్ర = ఖగ + ఇంద్ర – గుణసంధి
ఖేచరోత్తమ = ఖేచర + ఉత్తమ – గుణసంధి
వితతోల్కాశ = వితత + ఉల్కాస – గుణసంధి
గగనోన్ముఖుడు = గగన + ఉన్ముఖుడు – గుణసంధి
పతాగేంద్రుడు = పతాగ + ఇంద్రుడు – గుణసంధి

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి.

పనులెల్ల = పనులు + ఎల్ల – ఉత్వసంధి
ముఖ్యులెల్ల = ముఖ్యులు + ఎల్ల – ఉత్వసంధి ఇట్లని
ఇట్లునియె = ఇట్లు + అనియె – ఉత్వసంధి
శైలములెల్ల = శైలములు + ఎల్ల – ఉత్వసంధి

యడాగమ సంధి
సూత్రం : సంధి లేనిచోట సర్వంబు కంటే పరంబైన స్వరంబునకు యడాగమంబగు.

అనియడిగిన = అని + అడిగిన – యడాగమ సంధి
నీయట్టి = నీ + అట్టి – యడాగమ సంధి
చేకొనియైన = చేకొని + ఐన – యడాగమ సంధి
ఏయది = ఏ + అది – యడాగమ సంధి
తెచ్చియిమ్ము = తెచ్చి + ఇమ్ము – యడాగమ సంధి

ఇత్వసంధి
సూత్రం : ఏమ్యాదులలోని, క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికముగానగును.
తల్లికిట్లనియె = తల్లికి + ఇట్లనియె – ఇత్వసంధి

అత్వసంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళంబుగానగు.
ఉన్నంత = ఉన్న + అంత – అత్వసంధి

త్రికసంధి
సూత్రం : 1. ఆ, ఈ, ఏ అను సర్వనామములు త్రికములనబడును.
2. త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
3. ద్విరుక్తంబగు హల్లు పరంబగునపుడు ఆచ్ఛికంబగు దీర్ఘంబునకు హ్రస్వంబగు.

అవ్విహగేంద్రుడు = ఆ + విహగేంద్రుడు – త్రికసంధి
అమ్మారుండు = ఆ + మారుండు – త్రికసంధి

అత్మసంది
సూత్రం : అత్తునకు సంధి బహుళంబుగానగు.
ఉన్నంత = ఉన్న + అంత -అత్వసంధి

గసడదవాదేశ సంధి
సూత్రం : ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళంబుగానగు.

కారణము సెప్పుడు = కారణము + చెప్పుము -గసడదవాదేశ సంధి
దాస్యమువాయు = దాస్యము + పాయు – గసడదవాదేశ సంధి
అమృతంబుదెచ్చి = అమృతంబు + తెచ్చి – గసడదవాదేశ సంధి
ఉపాయము సేయంగ = ఉపాయము + చేయంగ – గసడదవాదేశ సంధి

సరళాదేశ సంధి
సూత్రం :
1. ద్రుతప్రకృతికము మీది పరుషములకు, సరళములగు.
2. ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందుసంశ్లేషలు విభాషనగు.
నుగ్గుగాఁజేయు = నుగ్గుగాన్ + చేయు – సరళాదేశ సంధి
గరుడునింబదరి = గరుడునిన్ + పదరి – సరళాదేశ సంధి

ఆమ్రేడిత సంధి
సూత్రం : 1) అచ్చునకు ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి అవుతుంది.
పట్టపగలు = పగలు + పగలు – ఆమ్రేడిత సంధి
చిట్టచివర = చివర + చివర – ఆమ్రేడిత సంధి
కట్టకడ = కడ + కడ . – ఆమ్రేడిత సంధి

2) ఆమ్రేడితం పరంగా ఉంటే కడాదుల తొలి అచ్చు మీది అన్ని వర్ణాలకు ద్విరుక్తటకారం వస్తుంది.
నట్టనడుమ = నడుమ + నడుమ – ఆమ్రేడిత సంధి
బట్టబయలు = బయలు + బయలు – ఆమ్రేడిత సంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
వినతాసుతుడు వినత యొక్క సుతుడు షష్ఠీ తత్పురుష సమాసం
పయోరుహానన పయోరుహము వంటి ఆననము కలది బహుప్రీహి సమాసం
భుజదర్పము భుజముల యొక్క దర్పము షష్ఠీ తత్పురుష సమాసం
జననీదాస్యము జనని యొక్క దాస్యము షష్ఠీ తత్పురుష సమాసం
కులిశక్షతి కులిశము యొక్క క్షతి షష్ఠీ తత్పురుష సమాసం
మారుతజవము మారుతము యొక్క జవము షష్ఠీ తత్పురుష సమాసం
ఖగేంద్రుడు ఖగములలో ఇంద్రుడు షష్ఠీ తత్పురుష సమాసం
ఖేచరోత్తముడు ఖేచరులలో ఉత్తముడు షష్ఠీ తత్పురుష సమాసం
విహగేంద్రుడు విహగములలో ఇంద్రుడు షష్ఠీ తత్పురుష సమాసం
అమృతహరణము అమృతము యొక్క హరణము షష్ఠీ తత్పురుష సమాసం
పక్ష్మయుగ్మము పక్ష్మముల యొక్క యుగ్మము షష్ఠీ తత్పురుష సమాసం
గగనోన్ముఖుడు గగనమునకు ఉన్ముఖుడు షష్ఠీ తత్పురుష సమాసం
తల్లిదీవెనలు తల్లి యొక్క దీవెనలు షష్ఠీ తత్పురుష సమాసం
శోక స్థితి శోకము యొక్క స్థితి షష్ఠీ తత్పురుష సమాసం
అనిమిషనాథుడు అనిమిషులకు నాథుడు షష్ఠీ తత్పురుష సమాసం
ఉగ్రభుంజగములు ఉగ్రములైన భుజంగములు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మహావృష్టి గొప్పదైన వృష్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మహాబలము గొప్పదైన బలము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
అమితపరాక్రమము అమితమైన పరాక్రమము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
అమృతాంశుడు అమృతమయమైన కిరణములు కలవాడు బహుబ్లిహి సమాసం
గగనగది గగనము నందు గది సప్తమీ తత్పురుష సమాసం
తల్లిదండ్రులు తల్లియును, తండ్రియును ద్వంద్వ సమాసం
సత్పుత్రుడు ఉత్తముడైన పుత్రుడు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విషాగ్ని విషము అనెడి అగ్ని రూపక సమాసం
దాస్యవిముక్తులు దాస్యము నుందు విముక్తులు పంచమీ తత్పురుష సమాసం

8th Class Telugu 1st Lesson అమ్మకోసం కవి పరిచయం

కవి : నన్నయ.

కాలం : 11వ శతాబ్దం

బిరుదులు : ఆదికవి, వాగనుశాసనుడు

నన్నయ కవితాలక్షణాలు : అక్షరరమ్యత, ప్రసన్నకథా కలితార్థయుక్తి, నానారుచిరార్థ సూక్తినిధిత్వం నన్నయ కవిత్వంలోని ప్రధాన లక్షణాలు.

ఎవరి ఆస్థాన కవి : తూర్పు చాళుక్యరాజు రాజరాజనరేంద్రుని ఆస్థానకవి.

కవిత్రయకవి : సంస్కృతంలో వేదవ్యాసుడు రచించిన మహాభారతాన్ని తెనిగించిన ముగ్గురు కవులనూ ‘కవిత్రయము’ అంటారు. వారిలో ‘నన్నయ’ మొదటివాడు.

వ్యాకరణ రచన ఆ: నన్నయ, ‘ఆంధ్రశబ్దచింతామణి’ అనే తెలుగు వ్యాకరణ గ్రంథం రచించాడు.

భారత రచన : నన్నయ, ఆంధ్రమహాభారతంలో ఆదిపర్వము, సభాపర్వము, అరణ్యపర్వము 4వ ఆశ్వాసంలోని 142 వ పద్యం వరకు ఆంద్రీకరించాడు.

ఇతర రచనలు : చాముండికా విలాసము, ఇంద్ర విజయము.

పద్యాలు – ప్రతిపదార్థాలు-భావాలు

1వ పద్యము – (కంఠస్థ పద్యం)

*ఉ. ఆయతపక్షతుండహతి నక్కులశైలము లెల్ల నుగ్గుగాఁ
జేయు మహాబలంబును బ్రసిద్ధియునుం గల నాకు నీపనిం
బాయక వీఁపునం దవడుఁబాముల మోవను, వారికిం బనుల్
సేయను నేమి కారణము సెప్పుము దీనిఁ బయోరుహాననా!
ప్రతిపదార్థాలు:
పయోరుహాననా (పయోరుహ + ఆననా) = పద్మము వంటి ముఖము కలదానా !
ఆయత పక్షతుండతుండహతిన్; ఆయత = పెద్దవయిన
పక్ష = ఱెక్కల యొక్కయు
తుండ = ముక్కు యొక్కయు
హతిన్ = దెబ్బలచేత
అక్కులశైలము లెల్లన్, ఆ + కులశైలములు + ఎల్లన్ = ఆ కులపర్వతాలు అన్నింటినీ,
నుగ్గుగాన్ + చేయు = పొడిగా చేయగల
మహాబలంబును (మహత్ + బలంబును) = గొప్ప బలాన్నీ
ప్రసిద్ధియున్ = ప్రఖ్యాతియూ
కల నాకున్ = పొందిన నాకు
ఈ పనిన్ = ఈ పనిని (ఈ దాస్యాన్ని)
పాయక = మానకుండా
వీపునందున్ = వీపు మీద
అవడు + పాములన్ = నీచములయిన పాములను
మోవను = మోయడానికిన్నీ
వారికిన్ = ఆ పాములకు
పనుల్ + చేయను = పనులు చేయడానికి (సేవలు చేయడానికిన్నీ)
ఏమి, కారణము = కారణము ఏమిటో
నాకున్ = నాకు
చెప్పుము = చెప్పుము

భావం :
పద్మము వంటి ముఖము కల ఓ తల్లీ ! కులపర్వతాలను అన్నింటినీ నా విశాలమైన టెక్కలతోనూ వాడియైన ముక్కుతోనూ దెబ్బతీసి వాటిని పొడిగా చేయగల గొప్పబలమూ, ప్రసిద్ధి నాకు ఉన్నాయి. అటువంటి నాకు మానకుండా దాస్యము చేస్తూ, ఈ నీచమైన పాములను నా వీపుపై మోస్తూ వీటికి సేవలు చేయడానికి గల కారణము ఏమిటో చెప్పు.

విశేషాంశాలు :
కులపర్వతాలు ఏడు –
1) మహేంద్రం
2) మలయం
3) సహ్యం
4) శుక్తిమంతం
5) గంధమాదనం
6) వింధ్యం
7) పారియాత్రం

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

2 వచనము

వ. అని యడిగిన వినత తనకుం గద్రువతోడి పన్నిదంబున నైన
దాసీత్వంబును, జెప్పి యిట్లనియె.
ప్రతిపదార్థాలు :
అని = అనిన
అడిగిన = గరుత్మంతుడు అడుగగ
వినత = గరుత్మంతుని తల్లి వినత
తనకున్ = తనకు
కద్రువతోడ = తన సవితియైన కద్రువతో
పన్నిదంబునన్ = పందెమువల్ల
ఐన = ఏర్పడిన
దాసీత్వంబును = దాసీతనాన్ని గూర్చి
చెప్పి = కుమారుడైన గరుత్మంతు నకు చెప్పి
ఇట్లు + అనియె = ఇలా అన్నది

భావం :
అని గరుడుడు అడుగగా, వినత తన సవతియైన కద్రువతో పందెంలో తాను ఓడిపోయినందువల్ల కలిగిన దాసీతనాన్ని గురించి కొడుకుతో చెప్పి ఇలా అంది.

3వ పద్యము

కం. నీ కతమున నా దాస్యము
ప్రాకటముగఁ బాయు ననిన పలు కెడలోనం
జేకొని, యూఐడి నిర్గత
శోక స్థితి నున్నదానఁ జూనె ఖగేంద్రా !
ప్రతిపదార్థాలు :
ఖగేంద్రా (ఖగ + ఇంద్రా!) = ఓ పక్షిరాజా ! (గరుత్మంతుడా !)
నీ కతమునన్ = నీ కారణంగా
నా దాస్యము = నా దాసీతనము
ప్రాకటముగన్ = ప్రసిద్ధముగా (అందరికీ తెలిసేటట్లుగా)
పాయున్ = పోతుంది
అనిన = అని అనూరుడు చెప్పిన
పలుకు = మాట
ఎదలోనన్ = (నా) మనస్సులో
చేకొని = గ్రహించి (ఉంచుకొని)
ఊఱడి = ఓదార్పును పొంది
నిర్గతశోక స్థితిన్ = పోయిన దుఃఖముగల స్థితిలో (దుఃఖం లేకుండా)
ఉన్నదానన్ + చూవె = ఉన్నాను సుమా !

భావం :
ఓ పక్షి శ్రేష్ఠుడా ! కుమారా ! నీ కారణంగా నా దాసీతనము పోతుందని అనూరుడు చెప్పిన మాటను మనస్సులో ఉంచుకొని, బాధను విడచి, దుఃఖము లేనిదాననై ఉన్నాను సుమా !

4 వచనము

వ. ‘కొడుకులు సమర్థులైనం దల్లిదండ్రుల యిడుములు వాయుట యెందునుం గలయది గావున నీయట్టి సత్పుత్రుం బడసియు దాసినై యుండుదాననే,’ యనిన విని వైనతేయుండు దద్దయు దుఃఖితుండై, యొక్కనాఁడు కాద్రవేయుల కిట్లనియె.
ప్రతిపదార్థాలు:
కొడుకులు = కుమారులు
సమర్థులు + ఐనన్ = శక్తి కలవారయితే
తల్లిదండ్రుల = తల్లిదండ్రుల యొక్క
ఇడుములు = కష్టాలు
పాయుట = పోవటం
ఎందునున్ + కల + అది = ఎక్కడనైనా ఉన్నదే
కావునన్ = అందువల్ల
నీయట్టి (నీ + అట్టి) = నీవంటి
సత్పుత్రున్ (సత్ + పుత్రన్) = మంచి కుమారుణ్ణి
పడసియున్ = పొందికూడా
దాసినై (దాసిని + ఐ) = దాస్యము చేసే దానినై
ఉండుదానను + ఏ = ఉంటానా?
అనినన్ = అని వినత చెప్పగా
విని = విని
వైనతేయుండు = వినత కుమారుడైన గరుత్మంతుడు
తద్దయున్ = మిక్కిలి (ఎక్కువగా)
దుఃఖితుండు + ఐ = దుఃఖం పొందినవాడై
కాద్రవేయులకున్ = కద్రువ కుమారులయిన పాములకు
ఇట్లు + అనియె = ఇలా చెప్పాడు

భావం :
“కొడుకులు శక్తిమంతులైతే తల్లిదండ్రుల కష్టాలు తొలగిపోవడం సహజమే. కాబట్టి నీవంటి యోగ్యుడైన కుమారుణ్ణి పొంది, నేను ఇంకా దాసీగానే ఉండలా?” అనగానే గరుడుడు దుఃఖించి, కద్రువ పుత్రులైన పాములతో ఇలా అన్నాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

5వ పద్యము

కం. మా యీ దాస్యము వాయు ను
పాయము సేయుండు, నన్నుఁ బనుపుం డిష్టం
బేయది దానిన తెత్తు న
జేయుఁడనై యమరవరులఁ జేకొనియైనన్.
ప్రతిపదార్థాలు:
మా + ఈ, దాస్యము = మా తల్లియైన వినతకూ, నాకూ గల ఈ బానిసతనము
పాయు + ఉపాయము = పోయే ఆలోచనను (ఉపాయాన్ని)
చేయుండు = చెయ్యండి; (చెప్పండి)
నన్నున్ = నన్ను
పనుపుండు = ఆజ్ఞాపించండి (పంపించండి)
ఇష్టంబు + ఏ + అది = మీరు ఏది కోరుకుంటారో
దానిన్ + అ = దాన్నే
అమరవరులన్ = శ్రేష్ఠులయిన దేవతలను
చేకొని + ఐనన్ = లోబరచుకొనియైనా
అజేయుడనై = జయింపబడనివాడనై (ఓడింపబడనివాడనై)
తెత్తున్ = తెస్తాను (తెచ్చి ఇస్తాను)

భావం :
నా తల్లి యొక్క, నా యొక్క దాస్యము పోవటానికి ఉపాయము చెప్పండి. నన్ను ఆజ్ఞాపించండి. శ్రేష్ఠులయిన దేవతలను లోబరచుకొని అయినా మీకు ఇష్టమైన దానిని అజేయుడనై తెస్తాను.

6 వచనము

వ. అనిన నయ్యురగులు కరుణించి గరుడుని కిట్లనిరి.
ప్రతిపదార్థాలు:
అనినన్ = అట్లు గరుత్మంతుడు చెప్పగా
అయ్యురగులు; (ఆ + ఉరగులు) = ఆ పాములు
కరుణించి = జాలిపడి
గరుడునకున్ + ఇట్లు + అనిరి = గరుత్మంతునితో ఇలా చెప్పారు.

భావం :
అని గరుడుడు అడుగగా, ఆ నాగులు జాలిపడి గరుత్మంతునితో ఇలా చెప్పారు.

7వ పద్యము (కంఠస్థ పద్యం)

*చ. ‘అమితపరాక్రమంబును, రయంబును, లావును గల్గు ఖేచరో
త్తముఁడవు నీవు; నీదయిన దాస్యము వాపికొనంగ నీకుఁ జి
త్తము గలదేని, భూరిభుజదర్పము శక్తియు నేర్పడంగ మా
కమృతముఁ దెచ్చియి’ మ్మనిన నవ్విహగేంద్రుఁడు సంతసంబునన్
ప్రతిపదార్థాలు :
నీవు = నీవు
అమిత పరాక్రమంబును = అంతులేని విక్రమాన్ని
రయంబును = వేగాన్నీ
లావునూ = బలాన్నీ
కల్గు = కలిగిన (ఉన్న)
ఖేచరోత్తముడవు (ఖేచర + ఉత్తముడవు) = పక్షులలో గొప్పవాడవు (పక్షి శ్రేష్ఠుడవు)
నీదయిన (నీది + అయిన) = నీకు కలిగిన
దాస్యమున్ = బానిసత్వమును
పాపికొనంగన్ = పోగొట్టుకొనటానికి
నీకున్ = నీకు
చిత్తము = మనస్సు (అభిప్రాయము)
కలదు + ఏనిన్ = ఉన్నట్లయితే
భూరి = అధికమైన
భుజదర్పము = నీ భుజాల యొక్క గర్వమున్నూ
శక్తియున్ = నీ సామర్థ్యమునూ
ఏర్పడంగన్ = స్పష్టమయ్యేటట్లు
మాకున్ = మాకు
అమృతమున్ = అమృతమును
తెచ్చి, ఇమ్ము + అనినన్ = తీసుకొనివచ్చి ఇమ్మని పాములు చెప్పగా
అవ్విహ గేంద్రుడు (ఆ + విహగ + ఇంద్రుడు) = ఆ పక్షిశ్రేష్ఠుడైన గరుత్మంతుడు
సంతసంబునన్ = సంతోషముతో (తెలిసేటట్లు)

భావం :
“నీవు అంతులేని పరాక్రమాన్నీ, వేగాన్నీ, బలాన్ని కలిగిన పక్షి శ్రేష్ఠుడవు. నీకు కలిగిన దాస్యము పొగొట్టుకొనాలనే అభిప్రాయము నీకు ఉన్నట్లయితే, నీ యొక్క గొప్ప భుజబలగర్వమునూ, శక్తియూ తెలిసేటట్లు
మాకు అమృతాన్ని తెచ్చి ఇమ్ము” అని పాములు చెప్పగా, ఆ పక్షి శ్రేష్ఠుడు సంతోషించాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

8 వచనము

వ. ‘అట్ల చేయుదు, నమృతంబు దెచ్చి మీ కిచ్చి, యేనునుం,
దల్లియు దాస్యంబువలన విముక్తుల మగువార’ మని నొడివి,
తద్వృత్తాంతం బంతయుం దల్లికిం జెప్పి ‘యమృతహరణార్థం బరిగెద
నని మ్రొక్కి, తల్లి దీవనలు గైకొని గమనోన్ముఖుండై ….
ప్రతిపదార్థాలు:
అట్ల (అట్ల + అ) = ఆ విధంగానే
చేయుదన్ = చేస్తాను
తెచ్చి = తీసుకొని వచ్చి
మీకిచ్చి (మీకున్ + ఇచ్చి) = నాకు ఇచ్చి
ఏనునున్ = నేనూ
తల్లియున్ = మా అమ్మ వినతయూ
దాస్యమువలనన్ = బానిసత్వము నుండి
విముక్తులము + అగువారము = విడువబడిన వారము అవుతాము
అని, నొడివి = అని చెప్పి
తద్వృత్తాంతము (తత్ + వృత్తాంతము) = ఆ విషయం
అంతయున్ = అంతయు
తల్లికిన్ = తల్లియైన వినతకు
చెప్పి = చెప్పి
అమృతహరణ + అర్థంబు = అమృతాన్ని హరించే నిమిత్తం
అరిగెదన్ = వెడలుతాను
అని = అని
మ్రొక్కి = నమస్కరించి
తల్లి దీవనలు = తల్లి ఆశీస్సులు
కైకొని = స్వీకరించి
అమృతంబు = అమృతము
గమనోన్ముఖుండై గమన = వెళ్ళడానికి
ఉన్ముఖుండు + ఐ = సిద్ధమైనవాడై

భావం :
“అలాగే చేస్తాను. స్వర్గం నుంచి అమృతం తెచ్చి, మీకు ఇచ్చి, నేనూ, మా తల్లి వినతా, దాస్యం నుంచి విముక్తి పొందుతాం” అని పలికి, ఆ విషయమంతా తల్లికి చెప్పి, “అమృతం తేవడానికి వెడుతున్నాను” అని చెప్పి నమస్కరించి, తల్లి ఆశీస్సులు పొంది, వెళ్ళడానికి సిద్ధమై……

9వ పద్యము (కంఠస్థ పద్యం)

*మ. వితతోల్కాశనిపుంజ మొక్క యనఁగా విన్వీథి విక్షిప్త ప
క్షతి వాతాహతిఁదూలి, తూల శకలాకారంబుఁ లై వారిద
ప్రతతుల్ సాల్పడి నల్గడం జెదరఁగాఁ బాటెన్ మనోవేగుఁడై
పతగేంద్రుం డమృతాంతికంబునకుఁ దత్పాలుర్ భయం బందఁగన్.
ప్రతిపదార్థాలు :
వితతోల్కాశనిపుంజము + ఒక్కొ వితత = విరివిగా గల
ఉల్క = మండే నిప్పుకణాల యొక్కయు
అశని = పిడుగుల యొక్కయు
పుంజము + ఒక్కొ = సమూహమా
అనగా = అనేటట్లుగా
విన్వీథి (విన్ + వీథి) = ఆకాశమార్గంలో
విక్షిప్తపక్షతివాతాహతిన్; విక్షిప్త = విదల్చబడిన
పక్షతి = రెక్కలయొక్క
వాత = గాలియొక్క
ఆహతిన్ = దెబ్బల చేత
తూలి = అటునిటు కదలి
వారిద, ప్రతతుల్ = మబ్బుల యొక్క సముదాయాలు
తూలశకలాకారంబులు + ఐ; తూల = దూదియొక్క
శకల = పింజల యొక్క
ఆకారంబులు + ఐ = రూపములు కలవై
చాల్పడి = వరుసకట్టి
నల్గడన్ (నల్ + కడన్) = నాల్గువైపులా
చెదరగా = చెదరిపోగా
మనోవేగుడై (మనః + వేగుడు + ఐ) = మనస్సు యొక్క వేగం వంటి వేగం కలవాడై
పతగేంద్రుండు (పతగ + ఇంద్రుండు) = పక్షులకు ఇంద్రుడయిన గరుత్మంతుడు
అమృతాంతికంబునకున్ (అమృత + అంతికంబునకున్) = అమృతం దగ్గరకు
తత్ పాలుర్ = ఆ అమృత రక్షకులు
భయంబు + అందగన్ = భయపడగా
పాఱెన్ = పరుగెత్తాడు

భావం :
పక్షి రాజు మనోవేగంతో బయలుదేరాడు. అప్పుడతడు నిప్పు కణాలతో కూడిన తోక చుక్కలా ఉన్నాడు. ఆకాశంలో కదలుతూ ఉన్నప్పుడు, అతని రెక్కల గాలి వల్ల మేఘాలు దూది పింజలై చెదరిపోతున్నాయి. అమృతాన్ని రక్షిస్తున్నవారు భయపడేటట్లుగా, గరుత్మంతుడు మనోవేగంతో అమృతం ఉన్నచోటికి వెళ్ళాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

10వచనము
వ. అంత,
అప్పుడు

11వ పద్యము

ఉ. ఘోరవికార సన్నిహిత కోపముఖంబులు, దీప్తవిద్యుదు
ల్కారుణ దారుణాక్షములునై, నిజదృష్టి విషాగ్ని నన్యులం
జేరఁగనీక యేర్చుచుఁ బ్రసిద్ధముగా నమృతంబు చుట్టు ర
క్షారతి నున్న యుగభుజగంబుల రెంటిని గాంచి చెచ్చెరన్.
ప్రతిపదార్థాలు:
ఘోర, వికార, సన్నిహిత, కోపముఖంబులు; ఘోర = భయంకరాలయి
వికార = వికారంతో
సన్నిహిత = కూడిన
కోప = కోపము కల
ముఖంబులు = నోళ్ళు కలవీ
దీప్త విద్యుదుల్కారుణ దారుణాక్షములునై; దీప్త = వెలుగుతున్న
విద్యుత్ = మెఱపులవలె
ఉల్క = నిప్పులవలె
అరుణ = ఎఱ్ఱనైన
దారుణ = భయంకరాలయిన
అక్షములును + ఐ = కన్నులు కలవై
నిజదృష్టి విషాగ్నిన్; నిజ = తనయొక్క
దృష్ఠి = చూపుల నుండి ప్రసరించే
విష = విషము అనే
అగ్నిన్ = అగ్నితో
అన్యులన్ = ఇతరులను
చేరగన్ + ఈక = దగ్గరకు రానీయకుండా
ఏర్చుచున్ = దహిస్తూ (మండిస్తూ)
ప్రసిద్ధముగాన్ = ప్రకటమయ్యేటట్లు
అమృతంబు = అమృతము యొక్క
చుట్టు = చుట్టునూ
రక్షారతిన్; రక్షా = రక్షించడంలోని
రతిన్ = ఆసక్తితో
ఉన్న = ఉన్నటువంటి
ఉగ్ర భుజగంబులన్; ఉగ్ర = భయంకరమైన
భుజగంబులన్ = పాములను
రెంటిని = రెండింటిని
కాంచి = చూచి
చెచ్చెరన్ = వెంటనే

భావం :
అమృతాన్ని రక్షిస్తున్న భయంకరమైన రెండు పాములను గరుత్మంతుడు చూశాడు. అవి ఆ సమీపానికి ఎవరినీ రానీయడం లేదు. ఆ పాముల ముఖాలు కోపాన్ని వెలిగ్రక్కు తున్నాయి. వాటి చూపులు విషము అనే అగ్నిని చిమ్ముతున్నాయి.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

12 వచనము

వ. అయ్యురగంబులం దనపక్షరజోవృష్టి నంధంబులం జేసి, వాని శిరంబులు దొక్కి, పరాక్రమం బెసంగ నమృతంబు గొని, గరుడుండు గగనంబున కెగసి…. యురగుల యొద్దకు వచ్చి, మరకతహరితం బైన కుశాస్తరణంబున నమృతకలశంబు నిలిపి, యురగులకుం జూపి యిట్లనియె.
ప్రతిపదార్థాలు:
అయ్యురగంబులన్ (ఆ + ఉరగంబులన్) = ఆ అమృతాన్ని రక్షిస్తున్న పాములు రెంటినీ
తన = తన యొక్క
పక్షరజోవృష్టిన్; పక్ష = రెక్కల వలన ఏర్పడిన
రజః + వృష్టిన్ = దుమ్ము యొక్క వర్షంతో
అంధంబులన్ = గ్రుడ్డివాటినిగ చేసి
వాని = ఆ పాముల
శిరంబులు = తలలు
తొక్కి = తొక్కి
పరాక్రమంబు = పరాక్రమం
ఎసంగన్ = ఎక్కువకాగా
అమృతంబు = అమృతం
కొని = తీసుకొని
గరుడుండు = గరుత్మంతుడు
గగనంబునకున్ = ఆకాశానికి
ఎగసి = ఎగిరి
ఉరగుల + యొద్దకున్ = పాముల వద్దకు
వచ్చి = వచ్చి
మరకతహరితంబు + ఐన మరకత = మరకత మణులవలె
హరితంబు + ఐన = ఆకుపచ్చనైన
కుశాస్తరణంబునన్ (కుశ + ఆస్తరణంబునన్) – దర్భల పరుపు మీద
అమృతకలశంబు = అమృత కలశపాత్రను
నిలిపి = ఉంచి
ఉరగులకున్ = పాములకు
చూపి = చూపించి
ఇట్లు + అనియెన్ = ఇలా అన్నాడు

భావం :
గరుడుడు తన రెక్కల వల్ల రేగిన దుమ్ముతో వాటి కళ్ళు కనబడకుండా చేశాడు. వాటి తలలను తొక్కి పట్టాడు. అమృతాన్ని తీసుకొని ఆకాశానికి ఎగిరాడు. కద్రువ కుమారుల దగ్గరకు వచ్చాడు. మరకత మణుల వలె పచ్చగా ఉన్న దర్భల పరుపుపై అమృతం ఉన్న పాత్రను పెట్టాడు. దాన్ని పాములకు చూపించి ఇట్లా పలికాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

13వ పద్యము

కం. అనిమిషనాథ సుగుప్త మ
యిన యమృతము దెచ్చి మీకు నిచ్చితి, నస్మ
జ్జననీదాస్యము వాసెను,
దినకరపవనాగ్నితుహినదీప్తుల కరిగాన్
ప్రతిపదార్థాలు:
అనిమిషనాథసుగుప్తము + అయిన; అనిమిష = దేవతలకు
నాథ = రాజయిన ఇంద్రుడిచేత
సుగుప్తము + ఐన = బాగుగా రక్షింపబడిన
అమృతము = అమృతము
తెచ్చి = తీసుకువచ్చి
మీకున్ = మీకు
ఇచ్చితిన్ = ఇచ్చాను
అస్మజ్జననీ దాస్యము అస్మత్ = నా యొక్క
జననీ = తల్లి అయిన వినత యొక్క
దాస్యము = దాసితనం
దినకరపవనాగ్ని తుహినదీప్తులు + అ; దినకర = సూర్యుడు
పవన = వాయువు
అగ్ని = అగ్నిదేవుడు
తుహిన దీప్తులు + అ = మంచు కిరణాలు గల చంద్రుడు అనే వారు
కరిగాన్ (కరి + కాన్) = సాక్షిగా
పాసెన్ = తొలగింది (పోయింది)

భావం :
దేవేంద్రుడి చేత బాగా రక్షింపబడిన అమృతాన్ని తెచ్చి, మీకు ఇచ్చివేశాను. సూర్యుడు, గాలి, అగ్ని, చంద్రుడు అనే వాళ్ళు సాక్షులుగా, నా తల్లి అయిన వినత యొక్క దాసీతనం పోయింది.