AP Inter 1st Year History Study Material Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 4th Lesson తొలి సమాజాలు, మతోద్యమాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 4th Lesson తొలి సమాజాలు, మతోద్యమాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
క్రీ.పూ. 6వ శతాబ్దంలో సాంఘిక, వర్గ విభేదాలను, సాంఘిక పురోగతిని వర్ణించండి.
జవాబు:
సమాజాలు: క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి తెగల సంస్కృతి తెరమరుగై సమాజంలో వర్ణవ్యవస్థ అమల్లోకి వచ్చింది. సమాజంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయి. వర్ణాశ్రమ ధర్మాలు అమల్లోకి వచ్చాయి. ఋగ్వేదంలోని పురుష సూక్తం వర్ణ విభజనను, బ్రాహ్మణుల ఆధిక్యాన్ని పేర్కొంది.
పురుష సూక్తంలో ప్రజాపతి దేహం నుంచి నాలుగు వర్ణాలు ఆవిర్భవించినట్లు చెప్పబడింది.

బ్రాహ్మణులు – తల నుంచి
క్షత్రియులు – దేహం నుంచి
వైశ్యులు – తొడల నుంచి
శూద్రులు – పాదాల నుంచి ఏర్పడ్డారని పేర్కొంది

వర్ణధర్మాన్ని ప్రజలు ఉల్లంఘించడంతో ధర్మశాస్త్రాలు, ధర్మసూత్రాలను తయారుచేశారు. వీటన్నింటివల్ల దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడం అనేది రాజు కర్తవ్యంగా మారింది. ఫలితంగా రాజుకు న్యాయాధికారాలు లభించాయి. నాడు నాలుగు వర్ణాలే నాలుగు కులాలుగా మారాయి. వీరిలో బ్రాహ్మణులు ఉన్నత వర్గంగా, శూద్రులు తక్కువ వర్గంగా పేరుపొందారు.

రక్త సంబంధం వివాహాలు: రక్త సంబంధీకులందరూ కుటుంబంలో ఉండేవారు. కొన్ని కుటుంబాల్లో రక్త సంబంధీకులనే వివాహం చేసుకొనే ఆచారం ఉండేది. తొలి సమాజాల్లోని కుటుంబ వ్యవస్థ కుటుంబీకుల సంబంధాలను తెలుసుకోవడం కష్టం.

ఈ కాలంలో పితృస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేది. ఆడపిల్లలను భారంగా భావించేవారు. రక్త సంబంధం ఉన్న వారిని కాకుండా ఇతరులను వివాహం చేసుకొనేందుకు ఆసక్తి కనబరిచేవారు ‘కన్యాదానం’ చేయడం ఆచారమైంది. అయితే మారుతున్న వ్యవస్థ ఫలితంగా ఈ ఆచారాలను ప్రశ్నించడం ఆరంభమైంది. ఇలాంటి స్థితిలో ధర్మసూత్రాలు, ధర్మశాస్త్రాలు ఏర్పడ్డాయి. మనుస్మృతిలో ఎనిమిది రకాల వివాహ పద్ధతులు వివరించబడ్డాయి.

AP Inter 1st Year History Study Material Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

సామాజిక విభేదాలు: ధర్మశాస్త్రాలు, ‘వర్ణధర్మాలు’, ‘వృత్తిధర్మాలను’ వివరించాయి. పుట్టుకను బట్టి వర్ణం నిర్ణయించబడుతుంది. మనదేశంలో ఈ కాలంలోనే న్యాయవ్యవస్థ ఏర్పడింది. వర్ణ ధర్మాలను బట్టి సివిల్, క్రిమినల్ శిక్షల్లో హెచ్చుతగ్గులు ఉండేవి. వర్ణ ధర్మాలను బట్టి సమాజంలో గౌరవం, పదవులు, వివాహాలు నిర్ణయింపబడ్డాయి. వర్ణ ధర్మాలను ఉల్లంఘించిన శూద్రులకు శిక్షలు అమానుషంగా ఉండేవి: ఉదా: తలలు తీసివేయడం, నాలుక కోయడం, కంటికి కన్ను, పంటికి పన్నుగా ఉండేవి. శూద్రులు, ద్విజులకు బానిసలుగా, వ్యవసాయ కూలీలుగా ఉండటం వల్ల వారిని తాకడం, స్నేహం చేయడం, వివాహాలు చేసుకోవడం నిషేధంగా ఉండేది.

వర్ణ తారతమ్యాలు: ఈ క్రింది పట్టిక పని విభజనను తెలుపుతుంది.

1. బ్రాహ్మణులు – 1. వేదాల అధ్యయనం, బోధన, యజ్ఞ యాగాదులు చేయటం, బహుమతుల స్వీకరణ.
2. క్షత్రియులు – 2. యుద్ధాలు చేస్తూ ప్రజలను రక్షించడం పరిపాటి.
3. వైశ్యులు – 3. వేదాధ్యయనం, యజ్ఞయాగాదుల నిర్వహణ, వ్యవసాయ వ్యాపారాల నిర్వహణ.
4. శూద్రులు – 4. పై మూడు వర్ణాల వారికి సేవలు, వ్యవసాయ కార్యక్రమాల నిర్వహణ.

సామాజిక పురోగతి: వర్ణాలు నాలుగుగా విభజింపబడినట్లు పై పట్టిక తెలియజేస్తుంది. అయితే సమాజ పురోగతిలో జాతులు కూడా కలిసిపోయాయి. ఇతర గ్రంథాల్లో జాతులను కూడా వర్ణాలుగా పేర్కొనడమైంది. వర్ణాలు నాలుగుగా విభజింపబడగా, జాతులకు నిర్దిష్ట సంఖ్య లేదు. జాతులను వర్ణాలుగా బ్రాహ్మణులు ఒప్పుకునేవారు కాదు. ఉదా: బంగారుపని చేసే కొందరు నిషాధుల్ని ‘స్వర్ణకారు’ అనడానికి బ్రాహ్మణులు ఒప్పుకొనేవారు కాదు. అందువల్ల ‘జాతులు ‘శ్రేణులుగా’ ఏర్పడి అన్ని వృత్తులు నిర్వహించేవారు. శూద్రులు ఈ కాలానికి సేవకుల స్థాయి నుంచి వ్యవసాయదారులుగా పురోగమించారు.

సమాజంలో స్త్రీల పరిస్థితి: మనుస్మృతి, ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీలకు ఆస్తిలో భాగం లేదు. వివాహ సందర్భంలో స్త్రీలకు ఇచ్చే కానుకలను వారు స్త్రీ ధనంగా పొందవచ్చు. ఈ ధనంపై స్త్రీకి పూర్తి హక్కులు ఉంటాయి. దీనిపై భర్తకు హక్కు లేదు. మనుస్మృతి భర్త అనుమతి లేకుండా స్త్రీలు ఆస్తి కలిగి ఉండటం నేరంగా పేర్కొంది.

స్త్రీలు బయట సమూహం నుంచి వివాహం చేసుకోవడాన్ని ‘ఎక్సోగమి’ అంటారు. తండ్రి ‘కన్యాదానం’ చేయడాన్ని ముఖ్య బాధ్యతగా, గౌరవ మర్యాదలుగా భావించి సరైన సమయంలో వివాహం చేసేవారు. ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల దూర ప్రాంతాలలో ఏర్పడిన వర్తక సంబంధాల వల్ల సంప్రదాయాలు, విశ్వాసాలు, విమర్శలకు దారితీయడంతో బ్రాహ్మణులు క్రీ.పూ. 600వ సం||లో వివాహ వ్యవస్థలో మార్పులు తెచ్చారు.

ప్రశ్న 2.
బ్రాహ్మణ మతంలోని గోత్రం, రక్త సంబంధం, వివాహ పద్ధతులను చర్చించండి.
జవాబు:
క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి తెగల సంస్కృతి తెరమరుగై సమాజంలో వర్ణవ్యవస్థ అమల్లోకి వచ్చింది. సమాజంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయి. వర్ణాశ్రమ ధర్మాలు అమల్లోకి వచ్చాయి. ఋగ్వేదంలోని పురుషసూక్తం వర్ణ విభజనను, బ్రాహ్మణుల ఆధిక్యాన్ని పేర్కొంది. నాలుగు వర్ణాలే నాలుగు కులాలుగా మారాయి. వీరిలో బ్రాహ్మణులు ఉన్నతవర్గంగా, శూద్రులు తక్కువ వర్గంగా పేరుపొందారు. క్రీ.పూ. 1000వ సం॥లో బ్రాహ్మణులు రూపొందించిన మరొక సామాజిక విధానం గోత్రం.

గోత్రం: గోత్రం అనే పద్ధతి బ్రాహ్మణులతో ప్రారంభమై, బ్రాహ్మణ వ్యవస్థలోనే కొనసాగుతూ ఉంది. అసలు ‘గోత్రం’ అనే పదానికి అర్థం ‘ఆవులకు సంబంధించినది’. బహుశా ఆవులను బట్టి ఆ సమూహ బ్రాహ్మణులు ఆయా గోత్రాలను పెట్టుకొని ఉండవచ్చు. ఆ తరువాత కాలంలో గోత్రం సమూహ పెద్ద పేరుతో కొనసాగింది. చాలాకాలం తరువాత ఏడుమంది ఋషుల పేర్లతో గోత్రనామాలు ఏర్పడినట్లు గృహ్య సూత్రాలు పేర్కొంటున్నాయి. సగోత్రీకులు అంటే ఒకే గోత్రం వారు వివాహం చేసుకోకూడదు అని చెప్పబడింది.

రక్త సంబంధం: కుటుంబంలోని వారందరూ ఆహారం, పని, వనరులు, పూజా కార్యక్రమాలను పంచుకొనేవారు. రక్త సంబంధీకులందరూ కుటుంబంలో ఉండేవారు. కొన్ని కుటుంబాల్లో రక్త సంబంధీకులనే వివాహం చేసుకొనే ఆచారం ఉండేది. తొలి సమాజాల్లోని కుటుంబ వ్యవస్థ, కుటుంబీకుల మధ్య సంబంధాలను తెలుసుకోవడం కష్టం. సంస్కృత గ్రంథాల ప్రకారం ‘కులం’ కుటుంబాలకు గుర్తింపును ఇస్తుంది. వంశం అనేది వారి ‘పుట్టుకను’ తెలియజేస్తుంది.

వివాహాలు: ఈ కాలంలో పితృస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేది. ఆడపిల్లలను భారంగా భావించేవారు. రక్త సంబంధం ఉన్న వారిని కాకుండా ఇతరులను వివాహం చేసుకొనేందుకు ఆసక్తి కనబరిచేవారు. ‘కన్యాదానం’ చేయడం ఆచారమైంది. అయితే మారుతున్న ఆర్థిక వ్యవస్థ ఫలితంగా ఈ ఆచారాలను ప్రశ్నించడం ఆరంభమైంది. ఇలాంటి స్థితిలోనే ధర్మసూత్రాలు, ధర్మశాస్త్రాలు ఏర్పడ్డాయి. మనుస్మృతిలో ఎనిమిది రకాల వివాహ పద్ధతులు వివరించబడ్డాయి.

వివాహ రీతులు:

  1. ఎండోగమి – అదే ప్రాంతానికి చెందిన వారిని వివాహం చేసుకోవడం.
  2. ఎక్సోగమి – ఇతర ప్రాంతాల వారిని వివాహం చేసుకోవడం.
  3. పోలోగమి – బహుభార్యత్వ
  4. పోలయాండ్రి – బహు భర్తృత్వం

మొదలగు వివాహ రీతులు 6వ శతాబ్దంలో అమలులో ఉండేవి.

ప్రశ్న 3.
జైనమత బోధనలను, భారత సమాజంపై వాటి ప్రభావాన్ని వర్ణించండి.
జవాబు:
జైనమతం, బౌద్ధమతం కంటే ప్రాచీనమైనది. జైనమత ప్రబోధకులను తీర్థంకరులు అంటారు. వారు 24 మంది. వారిలో మొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. 24వ వాడైన మహావీరుడు ఆఖరి తీర్థంకరుడు. మహావీరుడు జైనమత స్థాపకుడు కాదని, ఆ మతాన్ని సంస్కరించి చక్కని రూపాన్ని అందించినవాడని జైనుల విశ్వాసం.

వర్ధమాన మహావీరుడు: వర్ధమాన మహావీరుడు జైనమత 24వ తీర్థంకరుడు. మహావీరుని అసలు పేరు వర్ధమానుడు. అతడు క్రీ.పూ. 540వ సంవత్సరంలో వైశాలి సమీపంలోని కుంద గ్రామంలో జ్ఞాత్రిక క్షత్రియ వంశంలో సిద్ధార్థుడు, త్రిశలకు జన్మించాడు. ఇతని భార్య యశోద, కుమార్తె ప్రియదర్శిని. వర్ధమానుడు 30 ఏళ్ళు నిండకముందే జీవిత సుఖాలను వదిలి, ఇంటి నుంచి నిష్క్రమించి, సత్యాన్వేషణ కోసం బయలుదేరాడు. 12 సంవత్సరాల కఠిన తపస్సు చేసి జ్ఞానోదయాన్ని పొందాడు. పరిపూర్ణ జ్ఞానము పొందిన పిమ్మట ‘జినుడు’ అని, ధైర్యసాహసములతో తపస్సు సాగించుటచేత “మహావీరుడని”, మహాజ్ఞాని అయినందువల్ల “కేవలుడు” అని సమస్త భవబంధములను తెంచుకొనుటచే ‘నిగ్రంథుడ’ని పిలువబడ్డాడు. మహావీరుడని “జినుడు” (జయించినవాడు) అను బిరుదు నుంచి ఈ మతానికి జైనమతమనే పేరు వచ్చింది. మానవుల మోక్షసాధన కోసం మహావీరుడు పంచవ్రతాలను, త్రిరత్నాలను, సల్లేఖన వ్రతమును బోధించాడు. వీటిని ఆచరించుట ద్వారా మానవులు మోక్షము లేదా కేవలావస్థను పొందగలరని బోధించాడు. తన సందేశాన్ని నిర్విరామంగా ప్రచారం చేస్తూ మహావీరుడు తన 72వ ఏట పావా అనే నగరములో హస్తిపాలుడనే రాజు గృహములో క్రీ.పూ. 468లో మరణించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

మహావీరుని బోధనలు:
1) పంచవ్రతాలు: జైనమత 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు నాలుగు సూత్రములను బోధించాడు. అవి: ఎ) జీవహింస చేయరాదు. బి) అసత్యమాడరాదు. సి) దొంగతనము చేయరాదు. డి) ఆస్తిపాస్తులు వుండరాదు. ఈ నాలుగు సూత్రాలకు లేక వ్రతాలకు 24వ తీర్థంకరుడైన మహావీరుడు బ్రహ్మచర్యము అనే ఐదవ సూత్రాన్ని జోడించాడు. ఈ ఐదు సూత్రాలను పంచవ్రతాలు లేక పంచకళ్యాణాలు అంటారు.

2) త్రిరత్నాలు: పంచవ్రతాలతోపాటు త్రిరత్నాలను కూడా మోక్ష సాధనకోసం పాటించాలని మహావీరుడు ప్రబోధించాడు. అవి: ఎ) సమ్యక్ దర్శనం లేక సరియైన విశ్వాసం. బి) సమ్యక్ జ్ఞానం లేక సరియైన జ్ఞానం. సి) సమ్యక్ చరిత్ర లేక సరియైన క్రియ. తీర్థంకరుల బోధనలకై శ్రద్ధను కలిగివుండటమే సమ్యక్ దర్శనము. వాటిలో సత్యాన్ని గ్రహించటమే సమ్యక్ జ్ఞానము. వాటిని పాటించడమే సమ్యక్ చరిత్ర. ఈ మూడింటిని త్రిరత్నాలు అంటారు. వీటిని అనుసరించుట ద్వారా దుఃఖలేశం లేని మోక్షం లేదా కైవలావస్థను మానవుడు పొందగలుగుతాడు.

3) సల్లేఖనా వ్రతం: పార్శ్వనాథుడు చేతన, అచేతన వస్తువులన్నింటిలో జీవముందని బోధించాడు. ఆత్మ శరీరమంతటా వ్యాపించి ఉంటుందని తపస్సు మాత్రమే కర్మ బంధాన్ని తొలగిస్తుందని చెప్పాడు. ప్రాపంచిక బంధాల నుంచి, కర్మ నుంచి విముక్తిని సాధించటమే మోక్షమని ఆయన ప్రవచించాడు. కర్మచేయటం ద్వారా కర్మఫలాన్ని అనుభవించటం కోసం పునర్జన్మను ఎత్తవలసి వస్తుందని, కనుక కర్మను నాశనం చేయటం ద్వారానే మోక్షప్రాప్తిని పొందగలమని ఆయన బోధించాడు. కనుక ఉపవాసములచేత శరీరమును శుష్కింపచేసుకొని ప్రాణత్యాగము చేయటం ద్వారా కర్మను అణచివేయవచ్చునని ఆయన బోధించాడు. ఈ ప్రక్రియనే “సల్లేఖనా వ్రతము” అంటారు.

4) కైవల్యం: జైనమతం యొక్క అంతిమ లక్ష్యం కైవల్యం లేక మోక్షము. పంచవ్రతాలను, త్రిరత్నాలను, సల్లేఖనా వ్రతమును ఆచరించుట ద్వారా మోక్షాన్ని సాధించవచ్చునని ఆయన ప్రవచించాడు. దుఃఖరహితము, అనంత సౌఖ్యప్రదము అయినదే మోక్షము. దీనినే కైవల్యావస్థ అంటారు. కైవల్యావస్థ పొందుట ద్వారా మానవుడు కర్మ, పునర్జన్మ వలయము నుండి శాశ్వత విముక్తిని పొందగలుగుతాడు.

5) ఇతర సూత్రాలు: జైనమతం కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంది. దేవుడున్నాడా లేదా అనే విషయానికి ఈ మతంలో ప్రాముఖ్యత లేదు. మోక్షాన్ని పొందటం, ఆత్మశుద్ధి, భవబంధ విముక్తి అనే వైదిక మత సూత్రాలపై ఆధారపడివుంది. వర్థమాన మహావీరుడు వర్ణవ్యవస్థను ఖండించలేదు. నాటి సామాజిక అసమానతలకు ఆలవాలమైన వర్ణవ్యవస్థను వ్యతిరేకించకుండా పూర్వజన్మ సుకృతాన్నిబట్టి మానవుడు అగ్ర లేక అధమ వర్ణాల్లో జన్మిస్తాడని అభిప్రాయపడ్డాడు. జైనమతం జంతు బలులను, బ్రాహ్మణ ఆధిక్యతను, వేదాల ఆధిక్యతను నిరసించినది.

జైనమత వ్యాప్తి: జైనమత ప్రచారం కోసం మహావీరుడు జైన సంఘాన్ని స్థాపించాడు. స్త్రీ, పురుషులిద్దరు ఈ సంఘంలో సభ్యులు కావచ్చు. ఈ సంఘాలలో జైన భిక్షువులే కాక, తమ మత సూత్రాల ప్రకారం జీవితం గడుపుతూ విరాళాలు, కానుకల ద్వారా ఆ సంస్థలను పోషించే ఉపాసకులు కూడా వుండేవారు. మహావీరుడు సంవత్సరంలో నెలలు పర్యటన చేస్తూ తన బోధనలను ప్రచారం చేసేవాడు. జైనమతానికి రాజాదరణ కూడా లభించింది. మగధ పాలకులైన హర్యంక, నందవంశ రాజులు, చంద్రగుప్త మౌర్యుడు, కడపటి మౌర్యరాజైన సంప్రతి జైనమతాన్ని పోషించారు. భారతదేశంలో జైనమతం రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలలో బాగా ప్రచారంలో వుంది.

ప్రశ్న 4.
బౌద్ధమత బోధనలను, భారత సమాజంపై వాటి ప్రభావాన్ని వర్ణించండి.
జవాబు:
క్రీ.పూ. భారతదేశంలో జనించిన అనేక మతాలలో బౌద్ధమతం ఒకటి. దీని స్థాపకుడు గౌతమబుద్ధుడు. గౌతమబుద్ధుని జీవితం: గౌతమబుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. ఇతడు క్రీ.పూ. 563వ సం||లో ‘శాక్య’ వంశమునకు చెందిన శుద్దోధనుడు, మాయాదేవీలకు లుంబినీవనమున జన్మించాడు. చిన్నతనమునే తల్లిని కోల్పోయి సవతి తల్లి ప్రజాపతి గౌతమిచే పెంచబడి ‘గౌతముడు’ అని పిలువబడ్డాడు. ఇతనికి ‘యశోధర’ అను రాకుమార్తెతో వివాహం జరిగింది. వారి కుమారుడు ‘రాహులుడు’.

మహా పరిత్యాగము: సిద్ధార్థుడు తన 29వ ఏట ఒక ముదుసలిని, రోగిని, శవాన్ని, సన్యాసిని చూచి వైరాగ్యానికి లోనై సకల సంపదలను, భోగభాగ్యాలను, భార్యాబిడ్డలను వదిలి ఇల్లు విడిచి వెళ్ళాడు. ఈ సంఘటనతో అతని మనస్సు వికలమైంది. ప్రపంచమంతా దుఃఖమయమని, జీవితము అశాశ్వతమని గ్రహించి బవబంధములను తెంచుకొని అడవులకు వెళ్ళి సన్యసించాడు. ఈ సంఘటననే ‘మహా పరిత్యాగము’ లేక ‘మహాభినిష్క్రమణము’ అంటారు.

జ్ఞానోదయమును పొందుట సన్యసించిన పిమ్మట సిద్ధార్థుడు సత్యాన్వేషణకై గయను చేరి అచ్చట ఒక అశ్వత్థ వృక్షము క్రింద 40 రోజులు ధ్యానము చేసి జ్ఞానమును పొందాడు. ఈ సంఘటనకే సంబోధి అని పేరు. అప్పటి నుండి సిద్ధార్థుడు బుద్ధుడు అని పిలువబడినాడు. బుద్ధుడు అనగా జ్ఞానము పొందినవాడు అని అర్ధము. బుద్ధుని శాక్యముని అని, తథాగతుడు అని పిలుస్తారు. నాటి నుండి అశ్వత్థ వృక్షము బోధి వృక్షముగాను, గయ బుద్ధగయగాను ప్రసిద్ధి చెందాయి.

ధర్మచక్ర ప్రవర్తనము: బుద్ధుడు గయ నుండి సారనాథ్ చేరి సమీపమున గల జింకల తోటలో తన పూర్వ సహవాసులైన బ్రాహ్మణులకు మొదటిసారిగా తాను ఆర్జించిన జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఈ సంఘటననే ధర్మచక్ర ప్రవర్తనము అంటారు. అప్పటి నుండి అనేక సంవత్సరములు బుద్ధుడు తన బోధనలను ప్రచారం చేశాడు. తన శిష్యులలో ప్రముఖులైన వారిని సంఘంలో ఏర్పరచాడు.

నిర్వాణం: విస్తృతంగా బౌద్ధమతాన్ని ఉత్తరాపథమంతటా ప్రచారం చేసి బుద్ధుడు తన 80వ ఏట మల్ల రాజధానియైన కుశి నగరమున క్రీ.పూ. 483లో నిర్వాణం పొందాడు.

AP Inter 1st Year History Study Material Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

బుద్ధుని బోధనలు: బుద్ధుని బోధనల ప్రకారం మానవ జీవితం కార్యకారణ సంబంధంతో ముడిపడి ఉన్నది. మానవుడు చేసిన కర్మఫలము వలననే ఈ శరీరము మరల మరల జన్మనెత్తవలసి వస్తున్నది. కర్మ ఆచరణకు కోర్కెలే మూలము. అజ్ఞానము వలన కోర్కెలు జనించుచున్నాయి. కోర్కెల వలన మానవుడు కర్మలు ఆచరిస్తాడు. ఈ కర్మ ఫలితమే పునర్జన్మ. పునర్జన్మలేని సుఖమైన, ప్రశాంతమైన జీవనమే నిర్వాణము అని బుద్ధుడు బోధించాడు. నిర్వాణ సాధనకు మానవుడు ఆర్య సత్యములను గ్రహించి అష్టాంగ మార్గమును, దశసూత్ర నీతిని పాటించవలెను.

ఆర్య సత్యములు: గౌతమ బుద్ధుడు తన దివ్య పరిజ్ఞానము వలన నాలుగు ప్రధానమైన సత్యములను గ్రహించాడు. వీటినే ఆర్య సత్యములు అంటారు. అవి:

  1. ప్రపంచమంతా దుఃఖమయము.
  2. దుఃఖమునకు కారణము కోర్కెలు.
  3. దుఃఖమును అంతము చేయుటకు కోర్కెలను నిరోధించవలెను.
  4. కోర్కెలను నిరోధించుటకు అష్టాంగమార్గమును అవలంబించవలెను.

అష్టాంగ మార్గము: నిర్వాణమును పొందుటకు మానవుడు తన నిత్య జీవితంలో ఈ అష్టాంగ మార్గమును అనుసరించిన చాలని బుద్ధుడు బోధించాడు. అవి: 1) సరియైన విశ్వాసము 2) సరియైన జ్ఞానము 3) సరియైన వాక్కు 4) సరియైన క్రియ 5) సరియైన జీవనము 6) సరియైన ప్రయత్నం 7) సరియైన ఆలోచన 8) సరియైన ధ్యానము. అష్టాంగ మార్గము ద్వారా ప్రతి వ్యక్తీ శీలసంపదను పెంపొందించుకొని జ్ఞాని కాగలడు. ఈ మార్గము అందరికీ అందుబాటులో ఉండుటచే దీనిని మధ్యేమార్గం అని అంటారు.

దశసూత్ర నీతి: ఆర్యసత్యములు, అష్టాంగ మార్గములతోపాటు బుద్ధుడు పది అంశములు గల దశసూత్ర నీతిని ప్రబోధించాడు. ఈ సూత్రాలు:

  1. జీవహింస చేయరాదు
  2. అసత్యమాడరాదు.
  3. దొంగతనము చేయరాదు.
  4. ఆస్తిపాస్తులు సమకూర్చుకొనరాదు.
  5. బ్రహ్మచర్యను పాటించవలెను.
  6. మత్తు పదార్దములు సేవించరాదు.
  7. పరుష వాక్యములు వాడరాదు.
  8. ఇతరుల ఆస్తులను కోరరాదు.
  9. అవినీతి పనులు చేయరాదు.
  10. విలాసాలను విడనాడాలి.

నిర్వాణము: ఆర్యసత్యములను గ్రహించి, అష్టాంగ మార్గమును, దశసూత్ర నీతిని ఆదరించటం వలన మానవుడు మోక్షమును పొందుటకు అర్హుడవుతాడు. మోక్షమనగా పునర్జన్మలేని జన్మరాహిత్యము. దీనినే బుద్ధుడు నిర్వాణంగా పేర్కొన్నాడు. నిర్వాణ సాధనే ప్రతి వ్యక్తి ధ్యేయం కావలెను అని బుద్ధుడు బోధించాడు.

బౌద్ధమతతత్వం: బుద్ధుడు భగవంతుని ఉనికిని గురించి, ఆత్మను గురించి మౌనం వహించాడు. హిందూమతమందలి కర్మ, పునర్జన్మ, మోక్ష సిద్ధాంతాలను అంగీకరించాడు. మహావీరుని వలె బుద్ధుడు కూడా యజ్ఞయాగాదులను, జంతుబలులను, బ్రాహ్మణుల ఆధికత్యను ఖండించాడు. వేదములను ప్రామాణిక గ్రంథములుగా బుద్ధుడు అంగీకరించాడు.

ముగింపు: ప్రపంచమునకు శాంతి సందేశమునందించుటకు అవతరించిన మహాపురుషులలో సుప్రసిద్ధుడు గౌతమ బుద్ధుడు. కామ, క్రోధములతో, హింసాత్మక చర్యలతో కొట్టుమిట్టాడుతున్న మానవకోటిని ధర్మం, అహింస, కరుణ, మానవత అనే మహోన్నత ఆశయాలతో తీర్చిదిద్దుటకు అవతరించిన పుణ్య పురుషుడు. అందువల్లనే ఆసియా జ్యోతియని, ప్రపంచ జ్యోతియని శ్లాఘించబడ్డాడు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వర్ణ వ్యవస్థ సమాజం
జవాబు:
ధర్మశాస్త్రాలు, ధర్మసూత్రాలు ‘వర్ణధర్మాలు’ ‘వృత్తి ధర్మాలను’ వివరించాయి. పుట్టుకను బట్టి వర్ణం నిర్ణయించబడుతుంది. వర్ణ ధర్మాలను బట్టి సివిల్, క్రిమినల్ శిక్షల్లో హెచ్చుతగ్గులు ఉండేవి. వర్ణ ధర్మాలను బట్టి సమాజంలో గౌరవం, పదవులు, వివాహాలు నిర్ణయింపబడ్డాయి. వర్ణ ధర్మాలను ఉల్లంఘించిన శూద్రులకు శిక్షలు అమానుషంగా ఉండేవి. ఉదా: తలలు తీసివేయడం, నాలుక కోయడం.

ప్రశ్న 2.
జాతి అంటే ఏమిటి ?
జవాబు:
ఒకే రకమైన మానసిక భావాలను కలిగి ఉమ్మడి లక్ష్యంతో నివసించే ప్రజా సముదాయమే జాతి. ఒక రాజ్యంలో నివసించే ప్రజలందరూ ఒకే ఉమ్మడి రక్త సంబంధం, పుట్టుకలకు సంబంధించినవారు కాకపోవచ్చు. అయినప్పటికీ పరస్పర గౌరవంతో కూడిన జాతులుగా మెలుగుతున్నాయని చెప్పవచ్చును.

AP Inter 1st Year History Study Material Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

ప్రశ్న 3.
రక్త సంబంధం
జవాబు:
కుటుంబంలోని వారందరూ ఆహారం, పని, వనరులు, పూజా కార్యక్రమాలను పంచుకొనేవారు. రక్త సంబంధీకులందరూ కుటుంబంలో ఉండేవారు. కొన్ని కుటుంబాల్లో రక్త సంబంధీకులనే వివాహం చేసుకొనే ఆచారం ఉండేది. ఈ కాలంలో పితృస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేది. ఆడపిల్లలను భారంగా భావించేవారు. రక్త సంబంధం ఉన్న వారిని కాకుండా ఇతరులను వివాహం చేసుకొనేందుకు ఆసక్తి కనబరిచేవారు.

ప్రశ్న 4.
త్రిరత్నాలు
జవాబు:
జైనమత సూత్రాలను త్రిరత్నాలు అని అంటారు. అవి:

  1. సరైన నమ్మకం
  2. సరైన జ్ఞానం
  3. సరైన శీలం.

ప్రశ్న 5.
బౌద్దమత సూత్రాలు
జవాబు:
బుద్ధుడు నాలుగు ఆర్య సత్యాలను ప్రబోధించాడు. అవి:

  1. ప్రపంచం దుఃఖమయం.
  2. దుఃఖానికి కోరికలు కారణం.
  3. కోరికలను నిరోధిస్తే దుఃఖం నశిస్తుంది.
  4. దానికి మార్గం ఉన్నది. అదే అష్టాంగ మార్గం.

ప్రశ్న 6.
అజవికులు
జవాబు:
అజవికుల ప్రచారకుడు మక్కలి గోసలి. ఇతడు నగ్నంగా తిరుగుతూ, తాగుతూ ఉండేవాడు. ఇతని విపరీత ధోరణి వల్ల ప్రజలకు ఎక్కువగా చేరలేదు. ఏదీ మానవుడి చేతిలో లేదు. జరగాల్సింది జరిగి తీరుతుంది’ అని ఈ బాబావారి నమ్మకం. ఈ అజవికులు ఒక సన్యాస వర్గంగా ఏర్పడి తమ మత ప్రచారం చేశారు. మక్కలి గోసలి గురువు పురాణ కశ్యపుడు.

ప్రశ్న 7.
తీర్థంకరులు
జవాబు:
జైనమతంలో మొత్తం 24 మంది తీర్థంకరులు కలరు. వీరిలో మొదటివాడు వృషభనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడు వర్థమాన మహావీరుడు. తీర్థంకరులు అనగా ‘మత గురువులు’ లేదా జీవనస్రవంతిని దాటుటకు మార్గాన్ని చూపించేవారని అర్థం.

AP Inter 1st Year History Study Material Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

ప్రశ్న 8.
బహుభార్యత్వం
జవాబు:
బహు భార్యత్వం అనగా ఒక వ్యక్తి ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకొనుట. దీనినే ‘పోలోగమి’ అని కూడా అంటారు. పూర్వం ఋగ్వేద, మలివేద కాలంలో రాజులలో ఈ పద్ధతి ఉండేది.

ప్రశ్న 9.
ఎక్సోగమి
జవాబు:
స్త్రీలు బయట సమూహం నుంచి వివాహం చేసుకోవడాన్ని ఎక్సోగమి అని అంటారు. తండ్రి. ‘కన్యాదానం’ చేయడాన్ని ముఖ్య బాధ్యతగా, గౌరవ మర్యాదలుగా భావించి, సరైన సమయంలో వివాహం చేసేవారు.

AP Inter 1st Year History Study Material Chapter 9 భక్తి, సూఫీ సంప్రదాయాలు (క్రీ.శ. 8 – 16 శతాబ్ధాలు)

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 9th Lesson భక్తి, సూఫీ సంప్రదాయాలు (క్రీ.శ. 8 – 16 శతాబ్ధాలు) Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 9th Lesson భక్తి, సూఫీ సంప్రదాయాలు (క్రీ.శ. 8 – 16 శతాబ్ధాలు)

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భక్తి ప్రబోధకుల ప్రధాన లక్షణాలను తెలపండి.
జవాబు:
ప్రాచీన కాలం నుంచి మధ్యయుగం వరకు నడిచిన భక్తి ఉద్యమంలో క్రింది ప్రధాన లక్షణాలను గమనించవచ్చు.
1) ఈశ్వరుని ఏకత్వంపై గాఢానురక్తి ప్రధాన లక్షణం. ఇందులో ముక్తి సాధనకై భగవంతుడి కృపను పొందడమే భక్తుడి లక్ష్యంగా భావించబడింది.

2) పూజా పునస్కారాలు, కర్మకాండలను వ్యతిరేకించిన భక్తి ఉద్యమకారులు పవిత్రమైన మనస్సు, జీవనం, మానవత్వం, భక్తి వంటివి అనుసరించడం ద్వారా భగవంతుడి కృపను పొందవచ్చు అని బోధించారు.

3) భక్తి ఉద్యమకారులు ఏకేశ్వరోపాసనను బోధించారు. కొందరు సగుణోపాసనను, మరికొందరు నిర్గుణోపాసనను ప్రోత్సహించారు. వైష్ణవుల్లో సగుణోపాసన ప్రసిద్ధమైంది. వారు శ్రీమహావిష్ణువు అవతారాలైన రాముడు లేదా కృష్ణుడిని తమ దేవుడిగా భావించారు. కాగా నిర్గుణోపాసన విగ్రహారాధనను వ్యతిరేకించింది. దేవుడు సర్వాంతర్యామి, మానవుల హృదయాల్లోనే భగవంతుడు ఉన్నాడు అని వారు ప్రచారం చేశారు. సగుణోపాసన, నిర్గుణోపాసనలను రెండింటినీ చిన్న మార్పులతో శంకరాచార్యుడి అద్వైత సిద్ధాంతములో చెప్పబడ్డాయి.

4) ఉత్తర, దక్షిణ భారతదేశ భక్తి ఉద్యమకారులు జ్ఞానం పొందడం ‘భక్తి’లో భాగంగా చెప్పారు. నిజమైన జ్ఞానాన్ని పొందేందుకు గురువు అవసరమని వారు బోధించారు.

5) భక్తి ఉద్యమకారులందరూ కుల వ్యవస్థను వ్యతిరేకించారు. అందువల్ల తక్కువ కులాలవారికి వారు ఆశాజ్యోతి అయ్యారు. భక్తి ఉద్యమకారుల్లో అధికమంది తక్కువ వర్గాల నుంచి వచ్చిన వారు కావడం విశేషం. నామదేవుడు (1270-1350), దర్జీ కుటుంబం, తుకారామ్ (1601-1649) శూద్ర కుటుంబం, కబీర్ దాస్ ముస్లిం మతంలోని నేతకుటుంబం నుంచి వచ్చారు.

6) భక్తి ఉద్యమకారులు పూజారులు పెత్తనాన్ని, సంస్కృత భాషను వ్యతిరేకించారు. ప్రజల భాషలోనే తమ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. అందువల్ల బెంగాలీ, గుజరాతీ, మరాఠి, హిందీ వంటి ప్రాంతీయ భాషలకు స్వర్ణయుగం ప్రారంభమై అభివృద్ధి చెందాయి.

ప్రశ్న 2.
రామానందుడు, కబీర్లు భక్తి ఉద్యమానికి చేసిన సేవను వివరించండి.
జవాబు:
రామానందుడు : భక్తి ఉద్యమ ప్రవక్తలలో మొదటివాడు రామానందుడు. తమ సొంత బ్రాహ్మణ కులానికి చెందినవారి ఆధిపత్యాన్ని తిరస్కరించాడు. గంగాతీర ప్రాంతంలో తన సిద్ధాంత ప్రచారానికి హిందీ భాషను ఉపయోగించారు. రామానుజాచార్యుల విశిష్టాద్వైత మతాన్ని స్వీకరించి మరింత ప్రచారం కల్పించాడు. సాంఘిక దురాచారాలను, కర్మకాండలను తిరస్కరించిన రామానందుడు సంస్కృతం, హిందీ భాషకు ప్రాధాన్యం ఇచ్చాడు. తన రచన ‘ఆనంద భాష్యం’లో శూద్రులు వేదాలను అధ్యయనం చేయడాన్ని గుర్తించలేదు. తక్కువకులం వారిని శిష్యులుగా స్వీకరించాడు. ఇతని శిష్యుల్లో ధర్మాజాట్, సేనానాయి బ్రాహ్మణుడు, రవిదాస్ చర్మకారుడు, కబీర్ మహ్మదీయుడు, మహిళలు కూడా తన శిష్యులయ్యారు. వారిలో పద్మావతి, సురస్త్రీలు.

కబీర్ (1440–1510) : కబీర్ మధ్యయుగంలోని ప్రముఖ సంఘ, మతసంస్కర్త. రామానందుడి శిష్యుల్లో కబీర్ విప్లవ భావాలు కలవాడు. తన గురువు సాంఘిక సిద్ధాంతానికి అచరణాత్మక రూపును ప్రసాదించాడు. కబీర్ కులవ్యవస్థను ఖండించాడు. ఇతడు విగ్రహారాధనను, కర్మకాండలను ఖండించాడు. తీర్థయాత్రలను చేయడాన్ని వ్యతిరేకించాడు. మహిళల పరదా పద్ధతిని తిరస్కరించాడు. కబీర్ సాధారణ జీవనాన్ని విశ్వసించాడు. కబీర్ స్వయంగా బట్టలు కుట్టి వాటిని మార్కెట్లో విక్రయించాడు. ఆయనకు ‘లోయ్’ అనే మహిళతో వివాహం అయ్యింది. ఆయన కుమారుడు కమల్. ఆలోచనా పరుడు, భక్తుడు, దేవుడు ఒక్కడే అని కబీర్ విశ్వాసం. రాముడు, రహీం ఒక్కరే అని ప్రచారం చేశాడు. హిందూ-ముస్లింల మధ్య మైత్రి సాధించడానికి కబీర్ తీవ్రంగా కృషి చేశాడు. “హిందూ, ముస్లింలు ఇద్దరూ సర్వోన్నతమైన భగవంతుడి బిడ్డలు అని స్పష్టంగా అనేకసార్లు గట్టిగా చెప్పిన మొట్టమొదటి సాంఘిక, మతసంస్కర్త కబీర్” అని కె.ఎస్. లాల్ అనే పండితుడు పేర్కొన్నాడు. కబీర్ శిష్యులను “కబీర్ పంథీస్” అని అంటారు. కబీర్ రచించిన దోహాలకు ‘బీజక్’ అని పేరు. వీరు ఇరువురు ఒకే మట్టితో చేసిన రెండు కుండల వంటి వారని కబీర్ పేర్కొన్నాడు. ‘పవిత్రమైన హృదయం లేకుండా విగ్రహాన్ని ఆరాధించడం వల్ల, గంగానదిలో స్నానమాచరించడం వల్ల ప్రయోజనం ఏముంది ? మక్కాకు యాత్ర చేయడం వల్ల ప్రయోజనం ఏముంది ? అని కబీర్ ప్రశ్నించాడు.

ప్రశ్న 3.
సూఫీ మతాన్ని నిర్వచించి, దాని లక్షణాలను వివరించండి.
జవాబు:
మధ్యయుగ భారతదేశంలో భక్తి ఉద్యమం లాగానే సూఫీ ఉద్యమం కూడా హిందూ ముస్లింలను ఒకే వేదికపైకి తేవటానికి ప్రయత్నించింది. ముస్లిం మత విశ్వాసానికి మరొక పేరే సూఫీమతం. అరేబీయాలో సూఫీ మతం ప్రారంభమై తరువాత భారతదేశానికి వ్యాప్తి చెందింది. సూఫీమతాన్ని భారతదేశానికి తెచ్చిన ఘనత అరబ్బులకే దక్కుతుంది.
క్రీ.శ 19వ శతాబ్దంలో ‘సూఫీఇజం’ అనే ఆంగ్లపదం వాడుకలోని వచ్చింది. సూఫీ అనే పదం ‘తసావూఫ్’ అనే ఇస్లాం గ్రంథాల్లో ఉంది. ‘సపా’ అనే పదం నుంచి సూఫీ ఆవిర్భవించిందని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. మరికొందరు ‘సుఫా’ అనే పదం నుంచి ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ‘సుఫా’ అంటే మహ్మద్ మసీదు వెలుపల ఆయన శిష్యులు మత సమావేశాలను జరిపే ‘అరుగు’ అని అర్థం. బస్రాకు చెందిన జహీజ్ మొదటిసారిగా సూఫీ అనే పదాన్ని ఉపయోగించాడు. క్రీ.శ 10వ శతాబ్దం కంటే పూర్వం సూఫీ మతం అరేబియా, పర్షియా ప్రజల సాంఘిక, మత జీవనాన్ని ప్రభావితం చేసింది. భగవంతుడిని ప్రేమించడమే అతన్ని చేరే ప్రధాన మార్గమని సూఫీ బోధకుల దృఢ నమ్మకం. ఎక్కువ మంది సూఫీ బోధకులు సమాజానికి దూరంగా ఏకాంతంగా గడిపి మోక్ష సాధనకై ప్రయత్నించారు. ఉలేమాల ఆధిపత్యాన్ని వారి ఖురాన్ వర్గీకరణను సూఫీ బోధకులు వ్యతిరేకించారు. ఉలేమాలు ఖురాన్ వాస్తవ స్ఫూర్తి అయిన ప్రజాస్వామ్య సమానత్వ భావాలకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు. సూఫీ బోధకులు హిందూ, జైన, బౌద్ధ, క్రైస్తవ, జొరాస్ట్రియన్ మతాల వల్ల ప్రభావితులయ్యాయి.

హిజ్రా యుగానికి చెందిన మొదటి రెండు శతాబ్దాల్లో సూఫీ బోధకులు పశ్చాత్తాపం, దేవుడిపై విశ్వాసం వంటి ప్రాథమిక సూత్రాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వారు కఠిన నియమాలను పాటించారు. మంచి ప్రవర్తన, స్వయంకృషి, సమానత్వాన్ని బోధించారు. వారు గురువులను ‘పీర్ ‘గా గౌరవంగా పిలిచేవారు. వారు బహుమతులను స్వీకరించక దయ, నిరాడంబరత, సహనం, దైవంపై అపార విశ్వాసం, మోక్షాలను విశ్వసించారు.

ప్రశ్న 4.
చిట్టీ, సూఫీ బోధకుల విజయాలను చర్చించండి.
జవాబు:
భారతదేశంలోని చిట్టీ, సూఫీ బోధకుల్లో ఖ్వాజా మొయినుద్దీన్ శిష్యులైన షేక్ హమీదుద్దీన్, షేక్ కుతుబుద్దీన్ భక్తియార్ కాకిలు ప్రధానమైనవారు. వారు సమానత్వాన్ని బోధిస్తూ సామాన్య జీవితాన్ని గడిపారు. శాకాహారులైన వారు స్థానిక హిందువులతో సన్నిహితంగా మెలిగారు. రాజపోషణ, దానాలు తీసుకోవడాన్ని వారు వ్యతిరేకించారు. గాత్ర, వాయిద్య సంగీతాలలో గొప్ప ఆధ్యాత్మికత ఉన్నట్లువారు పేర్కొన్నారు. భక్తియార్ కాకికి ఆధ్యాత్మిక సంగీతం అంటే ఇష్టం. సూఫీ బోధకులు తమ ఆశ్రమాల్లో ఏర్పాటు చేసిన హిందూ, ముస్లిం సంగీత విభావరులు అశేష ప్రజానీకాన్ని ఆకట్టుకొన్నాయి.

షేక్ ఫరీద్ లేదా బబాఫరీద్ ఢిల్లీ సుల్తానుల కాలానికి చెందిన మరొక సూఫీ బోధకుడు. అతడు అతి సామాన్య జీవితాన్ని గడిపాడు. భక్తి బోధకుల సంగీతాన్ని ఇష్టపడేవాడు. ఆయన శిష్యుల్లో నిజాముద్దీన్ అలియా ముఖ్యుడు. ఢిల్లీలోని ఘజియాపూర్లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.

హజరత్ నిజాముద్దీన్ వినయశీలి. ఇతడు అత్యంత సామాన్య జీవితాన్ని గడిపాడు. పేదవారిని ప్రేమించాడు. ఢిల్లీ సుల్తానుల బహుమానాలను ఆయన తిరస్కరించాడు. నసీరుద్దీన్ చిరాగ్, షేక్ సలీం చిష్టిలు ఆయన ప్రధాన శిష్యులు. షేక్ సలీమ్ చిష్టీ అక్బర్ సమకాలీకుడు. ఇతని సిద్ధాంతాలు, జీవనవిధానం అక్బర్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అక్బర్ స్వయంగా ఫతేపూర్ సిక్రిని సందర్శించి చిష్టీ ఆశీస్సులను పొందాడు. తనకు కుమారుడు జన్మించాక అతనికి సలీమ్ అని అక్బర్ నామకరణం చేశాడు. చిష్తీ సమాధిపై అక్బర్ నిర్మించిన దర్గా ఉరుసు సందర్భంగా అన్ని ప్రాంతాల, అన్ని మతాల ప్రజలను విశేషంగా ఆకర్షిస్తూ ఉంది.

ప్రశ్న 5.
సుహ్రవర్థీ సిల్సిలా గురించి వ్రాయండి.
జవాబు:
సుహ్రవర్థి సిల్సిలా రెండవ ప్రసిద్ధ శాఖ. ఈశాన్య వాయువ్య భారతదేశంలో విలసిల్లింది. ముల్తాన్ దీవి ప్రధాన కేంద్రమైన తరువాత కాలంలో ‘సింధు’కు విస్తరించింది. భారతదేశంలో దీన్ని ముల్తాన్కు చెందిన షేక్ బహఉద్దీన్ స్థాపించాడు. ఆయన ముస్లిం విజ్ఞాన కేంద్రాలతో పాటు మక్కా – మదీనా, సమర్ఖండ్, బాగ్దాద్లను సందర్శించి ప్రజలు వారి సంస్కృతిని గురించి అనేక విషయాలను తెలుసుకొని తన గురువు షేక్ షహబుద్దీన్ సుహ్రవర్థీ (బాగ్దాద్)ని అనుకరించాడు. పేదరికంలో జీవించడాన్ని వ్యతిరేకించటంతో పాటు కఠిన ఉపవాసాన్ని తిరస్కరించాడు. ఆయన క్రీ.శ 1262లో మరణించాడు. షేక్ బహానంద్ దీన్ జకారియా సుహ్రవర్దీ మరణానంతరం ఈ సిల్సిలా రెండు భాగాలుగా చీలిపోయింది. అతని కుమారుడు బదర్ ఉద్దీన్ ఆరిఫ్ నాయకత్వంలో ముల్తాన్ శాఖ, సయ్యద్ జలాలుద్దీన్ సురఖ్ బుఖారి నాయకత్వంలో ఉచ్ శాఖలుగా విడిపోయాయి. సుహ్రవర్థీ సిల్సిలా చాలా విషయాల్లో చిష్టీ సిల్సిలాను వ్యతిరేకించింది. సుహ్రవర్ధలు పాలకుల మన్నన పొంది వారిచే కానుకలను స్వీకరించడం వంటివి చేశారు. వారు పేద, సామాన్య ప్రజలను గురించి పట్టించుకోలేదు.

సుహ్రవర్దీ సిల్సిలా తమ దర్గాలలో కేవలం సంపన్నులు, ఉన్నత వర్గాల సందర్శకులనే అనుమతించారు. మూడవ ప్రధానమైన సిల్సిలా ‘నక్షాబందీ సిల్సిలా’ దీన్ని ఖ్వాజాపీర్ మహ్మద్ స్థాపించాడు. ఇతడి శిష్యుడైన ఖ్వాజా బాకీభిల్లా భారతదేశం అంతటా దీన్ని వ్యాప్తి చేశాడు. పరిషత్ న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చిన వీరు చిష్టీ సిల్సిలాలు, ఇతర సిల్సిలాలు ముస్లింలలో ప్రవేశపెట్టిన మార్పులను వ్యతిరేకించారు. ఈ సిల్సిలాతో పాటు ఖాద్రీ, ఫిరదౌసియా సిల్సిలాలు కూడా సమాజంలోని కొన్ని వర్గాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందాయి.

ప్రశ్న 6.
భక్తి, సూఫీ ఉద్యమాలు సమాజంపై ఎటువంటి ప్రభావాన్ని చూపాయో వివరించండి.
జవాబు:
భక్తి, సూఫీ ఉద్యమకారుల బోధనలు భారతీయులకు కొత్త వేదికను సమకూర్చాయి. వీరి ఉదార, మానవతావాద బోధనలు అనేకమంది సామాన్యులను ఆకర్షించాయి. వీరి భావనలు బ్రాహ్మణుల, పూజారుల మౌల్వీల ఆధిపత్యాన్ని ప్రశ్నించాయి. ప్రజల భాషల్లో బోధన చేసి వీరు సామాన్యులను ఆకట్టుకున్నారు. కబీర్, నానక్ వంటి భక్తి ఉద్యమకారుల ముస్లింల మధ్య ఉన్న విభేదాలను తగ్గించాయి. అన్ని వర్గాల ప్రజలకు నీతితో కూడిన ఆత్మ విశ్వాసంతో జీవించాలని పిలుపునివ్వడంతో పాటు కుల వ్యవస్థను వ్యతిరేకించారు. వీరి విధానాల సమానత్వాన్ని బోధించి మత మార్పిడులను నిరోధించాయి. భక్తి, సూఫీ సన్యాసులు తమ నిరాడంబర జీవితం, పవిత్రమైన వ్యక్తిత్వం ద్వారా పరస్పరం ప్రభావితులయ్యారని ప్రముఖ చరిత్రకారుల యూసఫ్ హుస్సేన్ ఎ.ఎల్. శ్రీవాత్సవ, ఆర్.సి. మంజూందార్, జె.ఎన్. సర్కార్ వంటి వారు అభిప్రాయపడ్డారు. వారిరువురూ హిందూ ముస్లింల మధ్య పెరుగుతున్న స్పర్ధను తగ్గించేందుకు కృషి చేశారు. ఈ ఉద్యమాల వల్ల ప్రాంతీయ భాషలు అభివృద్ధి చెందడంతోపాటు సమాజానికి కొత్త ఆశలు, రూపం ప్రసాదించబడ్డాయి.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆళ్వారులు, నాయనార్లు
జవాబు:
క్రీ.శ. 6వ శతాబ్ద కాలంలో తమిళదేశంలో ఆళ్వారులు (వైష్ణవాచార్యులు), నాయనార్ల (శైవాచార్యులు) నాయకత్వంలో వాస్తవంగా భక్తి ఉద్యమం ప్రారంభమైంది. వారు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ వారి దేవతలను గురించి పాటలు పాడుతూ భక్తిని ప్రచారం చేశారు.

ఆళ్వార్లు, నాయనార్లు కులవ్యవస్థను బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించినట్లు కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. తొండరిప్పొడి ఆళ్వారు, అప్పార్ అనే నాయనార్లు కులవ్యవస్థను వ్యతిరేకించడంతోపాటు ఉపయోగంలేని గోత్రాలు, శాస్త్రాలను తిరస్కరించారు. స్త్రీ అయిన ఆండాళ్ (ఆళ్వారు) తన రచనల్లో విష్ణువును ప్రస్తుతించింది. కరైకాల్ అమ్మయార్ (నాయనారు) మోక్ష సాధనకు కఠినమైన సన్యాసాన్ని అనుసరించింది. వీరిద్దరూ తమ రచనల్లో సనాతన సాంఘిక కట్టుబాట్లను వ్యతిరేకించారు.

ప్రశ్న 2.
శంకరాచార్యుడు
జవాబు:
భక్తి ఉద్యమ ప్రబోధకుల్లో శ్రీ శంకరాచార్యులను ఆద్యులుగా చెప్పవచ్చు. శంకరాచార్యుడు బోధించిన సిద్ధాంతం అద్వైత సిద్ధాంతంగా ప్రసిద్ధిచెందింది. బెనారస్క చెందిన గోవిందయోగి బోధనలు శంకరాచార్యుడిని ప్రభావితం చేశాయి. శంకరాచార్యుడు హిందూమతానికి నూతన తాత్వికతను జోడించాడు. శంకరాచార్యుడు చేసిన ప్రయత్నాలు హిందూ మతస్తులకు నమ్మకాన్ని కల్పించడంతోపాటు మతాన్ని వదిలి వెళ్ళినవారు తిరిగివచ్చేలా చేశాయి. ఈ విధంగా శంకరాచార్యుడు భక్తి ఉద్యమానికి పునాదులువేసి నూతన హిందూమత రక్షకుడుగా పేరుపొందారు. మోక్షం పొందేందుకు జ్ఞాన మార్గాన్ని శంకరాచార్యులు బోధించాడు. అయితే శంకరాచార్యుల బోధనలు, సిద్ధాంతాలు సామాన్యుడికి అర్థమయ్యేలా లేకపోవడంతో తర్వాత భక్తి ప్రబోధకులు ప్రజలకు అర్థమయ్యే మార్గాన్ని బోధించేందుకు పూనుకొన్నారు.

ప్రశ్న 3.
రామానుజాచార్యుడు
జవాబు:
భక్తి ఉద్యమకారుల్లో శంకరాచార్యుని తరవాత రామానుజాచార్యుడు ప్రధానమైనవారు. మోక్షం సాధించేందుకు శంకరాచార్యుని జ్ఞాన మార్గాన్ని కాదని మోక్ష మార్గాన్ని బోధించాడు. తన గురువు యాదవ్ ప్రకాశ్ బోధించిన ఈ ప్రపంచమంతా మాయ, సంపూర్ణ ఏకేశ్వరోపాసన వంటి సిద్ధాంతాలను రామానుజాచార్యుడు వ్యతిరేకించాడు.
భగవంతుడిని చేరుకొనేందుకు ‘భక్తి’ ప్రధానమైన మార్గం. అన్ని కులాల వారు వారికి ఇష్టమైన దేవుడిని ఆరాధించేందుకు అర్హులేనని రామానుజాచార్యుడు బోధించాడు. ఈయన 120 సంవత్సరాల వయస్సులో సమాధి అయ్యారు.

ప్రశ్న 4.
గురునానక్
జవాబు:
కాలూరామ్, తృష్ణాదేవి దంపతులకు క్రీ.శ 1469 లో తల్వాండిలో గురునానక్ జన్మించాడు. ఆయన భార్య సులాఖని. వారికి శ్రీచంద్, లక్ష్మీచంద్ అనే కుమారులు కలిగారు. ఢిల్లీ సుల్తానుల పాలనలోని సుల్తాన్పూర్ రాష్ట్ర ధాన్యాగారంలో గురునానక్ పనిచేశాడు. క్రీ.శ. 1494 సంవత్సరంలో గురునానక్కు జ్ఞానోదయం అయ్యింది.
గురునానక్ పండితుడు, పర్షియా, హిందీ, పంజాబీ భాషలను అధ్యయనం చేశాడు. గురునానక్ బోధనలన్నీ ‘ఆదిగ్రంథ్’ అనే పుస్తక రూపంలో వెలువడ్డాయి. హిందూ, ముస్లింల ఐక్యతను ప్రచారం చేసిన గురునానక్ పేద ప్రజల కోసం ఆశ్రమాలను ఏర్పాటు చేశాడు. గురునానక్ అనుచరులు ఈ ఆశ్రమాలను నిర్వహించి పేదవారికి ఆహారాన్ని | సమకూర్చారు. చివరకు గురునానక్ అనుచరులు సిక్కు అనే మతాన్ని ఏర్పాటుచేశారు.

ప్రశ్న 5.
చైతన్యుడు.
జవాబు:
‘శ్రీ గౌరంగ’ అనే పేరుతో కూడా ప్రసిద్ధికెక్కిన చైతన్యుడు బెంగాలుకు చెందిన వైష్ణవ ఉద్యమకారుడు, సంఘసంస్కర్త. 25 సంవత్సరాల వయస్సులో కేశవభారతి నుంచి సన్యాసం స్వీకరించిన చైతన్యుడు పూరి, సోమనాథ్, ద్వారక, పండరీపురం, మధుర, బృందావనంలో పర్యటించి అక్కడ ప్రజల సంప్రదాయాలను పరిశీలించాడు. చివరకు ఒరిస్సాలోని పూరిలో స్థిరపడ్డాడు. సర్వాంతర్యామి ఒక్కడేనని అతడే శ్రీకృష్ణుడు లేదా హరి అని చైతన్యుడు బోధించాడు. ప్రేమ, భక్తి, గానం, నృత్యాల ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చు అని ప్రబోధించాడు. కుల వ్యవస్థను వ్యతిరేకించి విశ్వమానవ సోదర ప్రేమచాటాడు. ఇతడు బెంగాలీ భాషలో ‘శిక్ష అస్తక్’ రచించాడు. బ్రహ్మచర్యాన్ని ‘సన్యాసులు’ అనుసరించాలని, సంకీర్తనలను గానం చేయాలనే అంశాలను అనుచరులచేత ఆచరింపచేశాడు.

ప్రశ్న 6.
మీరాబాయి
జవాబు:
క్రీ.శ. 16వ శతాబ్ద ప్రారంభంలో ఆవిర్భవించిన మహిళా భక్తిబోధకురాలు మీరాబాయి. మేర్తా పాలకుడు రతన్ సింగ్ రాథోడ్ ఏకైక కుమార్తె అయిన మీరాబాయి 18 సంవత్సరాల వయస్సులో 1516 సంవత్సరంలో మేవాడ్ రాజైన రాణాసంగా కుమారుడు భోజోజ్ని వివాహం చేసుకొంది. చిన్నతనం నుంచే మత విశ్వాసాన్ని కలిగిన ఆమె తన పూర్వీకుల లాగానే కృష్ణుడిని ఆరాధించింది. భర్త మరణానంతరం మామగారి నుంచి కష్టాలను ఎదుర్కొన్న ఆమె చివరకు తన జీవితాన్ని కృష్ణుడి ఆరాధనకు అంకితం చేసి పాటలు పాడటం ప్రారంభించింది. బృందావనంలో స్థిరపడి మరణించేవరకు అక్కడే ఉంది.

ప్రశ్న 7.
షేక్ ఫరీద్
జవాబు:
షేక్ ఫరీద్ లేదా బాబా ఫరీద్ (క్రీ.శ 1175 – 1265) ఢిల్లీ సుల్తానుల కాలానికి చెందిన మరొక సూఫీ బోధకుడు. అతడు అతి సామాన్య జీవితాన్ని గడిపాడు. భక్తి బోధకుల సంగీతాన్ని ఇష్టపడేవాడు. ఆయన శిష్యుల్లో నిజాముద్దీన్ అలియా ముఖ్యుడు. ఢిల్లీలోని ఘజియాపూర్లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.

ప్రశ్న 8.
షేక్ సలీం చిష్టీ
జవాబు:
షేక్ సలీం చిష్టీ అక్బర్ చక్రవర్తి సమకాలికుడు. సలీం చిష్టీ సిద్ధాంతాలు, జీవన విధానం అక్బర్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అక్బర్ స్వయంగా ఫతేపూర్ సిక్రీని సందర్శించి చిష్టీ ఆశీస్సులను పొందాడు. తనకు కుమారుడు జన్మించాక అతనికి సలీం అని అక్బర్ నామకరణం చేశాడు. చిట్టీ సమాధిపై అక్బర్ నిర్మించిన దర్గా ఉరుసు సందర్భంగా అన్ని ప్రాంతాల, అన్ని మతాల ప్రజలను విశేషంగా ఆకర్షిస్తూ ఉంది.

ప్రశ్న 9.
భక్తి సాహిత్యం
జవాబు:
భారతీయ సమాజంలోని అన్ని వర్గాలను భక్తి ఉద్యమం ఆకర్షించింది. ఈ ఉద్యమం ప్రజలకు ఒక నూతన మార్గాన్ని చూపింది. భక్తి ఉద్యమకారులు పూజారుల పెత్తనాన్ని, సంస్కృత భాషను వ్యతిరేకించారు. ప్రజల భాషలోనే తమ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. అందువల్ల బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, హిందీ వంటి ప్రాంతీయ భాషలకు స్వర్ణయుగం ప్రారంభమై అభివృద్ధి చెందింది.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 – 1526)

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 7th Lesson ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 – 1526) Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 7th Lesson ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 – 1526)

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
తురుష్కుల దండయాత్రల ఫలితాలు.
జవాబు:
భారతదేశ చరిత్రలో అరబ్బుల సింధు విజయము “సత్ఫలితాలివ్వని ఘన విజయము” అని స్టాన్లీ లేనప్పూల్ వర్ణించాడు.
1) అరబ్బులు విశాల భారతదేశమున అత్యల్ప భాగమును మాత్రమే జయించుట వలన అది పెద్దగా గుర్తించబడలేదు.

2) పటిష్టమైన వర్ణవ్యవస్థ గల హిందువులు, అరబ్బుల సాంగత్యమును పరిహసించారు.

3) అరబ్బులు ఎంత ప్రయత్నించినను ఇస్లాంను ఇండియాలో వ్యాప్తి చేయలేకపోయారు. కాని తరువాత ముస్లిం విజేతలకు మార్గదర్శకులయ్యారు.

4) హిందువుల కంటే సాంస్కృతికంగా వెనుకబడి వున్న అరబ్బులు హిందూవేదాంతం, ఖగోళ శాస్త్రము, గణితము, వైద్యము మొదలగు శాస్త్రాలను వారి నుండి అభ్యసించారు. బ్రహ్మసిద్ధాంతము, పంచతంత్రము, చరకసంహిత వంటి గ్రంథాలు అరబ్బీ భాషలోకి అనువదించబడ్డాయి. అరబ్బులు భారతీయ చిత్రకారులను, శిల్పులను, పండితులను ఆదరించారు. మొత్తము మీద కొన్ని ప్రాచీన కట్టడాలు తప్ప అరబ్బుల దండయాత్ర భారతదేశమున మిగిల్చినదేమీ లేదు. కాని అరబ్బుల విజయం నుంచి హిందువులు మాత్రం ఎటువంటి గుణపాఠాన్ని గ్రహించలేకపోయారు. మహమ్మదీయులలోని సమతాభావాన్ని గాని, ఐకమత్యాన్నిగాని, వారి యుద్ధతంత్రాన్నిగాని నేర్చుకోలేకపోవటం వల్ల తరువాత కాలంలో తురుష్కుల దండయాత్రలను తిప్పికొట్టలేకపోయారు.

ప్రశ్న 2.
రజియా సుల్తానా.
జవాబు:
ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన ఏకైక మహారాణి సుల్తానా రజియా. ఇలుట్మిష్ కొడుకులు సమర్థులు కానందువల్ల తన వారసురాలిగా తన కుమార్తె రజియాను సుల్తానుగా ప్రకటించాడు. కాని ఇల్లుట్మిష్ మరణానంతరం ఢిల్లీ. సర్దారులు ఇల్టుట్మిష్ కొడుకుల్లో పెద్దవాడైన ఫిరోజ్ షాను ఢిల్లీ సుల్తాన్ గా ప్రకటించారు. అయితే అతడు వ్యసనపరుడు కావటంచేత అతడి తల్లి షా తుర్కాన్ పాలించసాగింది. కాని ఆమె అవినీతిపరురాలవటం చేత రజియా సైనికదళ సానుభూతితో ఫిరోజ్న వధించి, ఢిల్లీ సింహాసనాన్ని (క్రీ.శ. 1236-1240) అధిష్టించింది. ఈమె గొప్ప ధైర్యసాహసాలున్న స్త్రీ, సైన్యాలను నడపటంలోను, ప్రభుత్వ నిర్వహణలోను కడు సమర్థురాలు. కాని ఒక స్త్రీ సుల్తాను కావటం తురుష్క సర్దారులు అవమానంగా భావించారు. ఇల్ల్యుట్మిష్ కాలంలో బానిసలుగా చేరిన వీరు క్రమంగా అమీరులై తమ ప్రాబల్యమును పెంచుకొని ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఈ కూటమినే చిహల్గనీ అంటారు. ఈ కూటమి రజియాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నసాగింది. చిహల్గానీ నిరంకుశాధికారాలను నిర్మూలించి, సుల్తాన్ అధికారమును పెంపొందించటానికి రజియా కొన్ని చర్యలు చేపట్టింది. తురుష్కులు కాని వారికి అనేక ఉన్నతోద్యోగములలో నియమించింది. రాష్ట్ర గవర్నర్లుగా కొత్త వారిని ఎంపిక చేసింది. మాలిక్ యాకూబ్ అనే అబిసీనియా బానిసను అత్యంత గౌరవప్రదమైన అశ్వదళాధిపతిగా నియమించి అతని పట్ల ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించింది. రజియా యాకూబ్పై అభిమానము చూపటాన్ని సహించలేని ఢిల్లీ సర్దారులు రజియాను పదవీచ్యుతురాలిగా చేయుటకు భటిండా రాష్ట్ర పాలకుడైన కబీర్ ఖాన్ చేతులు కలిపి రజియాపై కుట్రచేసి ఆమెను అంతము చేయదలచారు. ఈ విషయము తెలిసిన రజియా అపార సైనిక బలముతో బయలుదేరి మొదట లాహోర్ పాలకుడైన కబీర్ ఖాన్ తిరుగుబాటును అణచివేసింది. కాని అల్ తునియా చేతిలో ఓటమి పొంది బందీగా చిక్కుకుంది. ఢిల్లీ సర్దారులు యాకూబ్ను వధించారు. అంతట రజియా ఢిల్లీ నుంచి పారిపోయి అజ్ఞునియాను వివాహం చేసుకొని పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని ఢిల్లీపై దండెత్తింది. కాని మార్గమధ్యంలోనే రజియా, అల్ తునియాలు హత్యకు (క్రీ.శ 1240) – గురయ్యారు.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 - 1526)

ప్రశ్న 3.
బాల్బన్ రాజధర్మ స్వరూపం.
జవాబు:
ఢిల్లీ సుల్తాన్ హోదాను, అధికారాన్ని, సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి ఇనుమడింపచేయడానికి బాల్బన్ తన రాజకీయ అభిప్రాయాలను ఆచరణలో పెట్టి విజయం సాధించాడు. బాల్బన్ ‘రాజరికం దైవదత్తం’ అని ప్రగాఢంగా విశ్వసించాడు. ‘నియాబత్-ఇ-ఖుదాయి’ (కింగ్ ఈజ్ వైస్ రిజెన్సీ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్) ‘రాజు భూమండలంపై భగవంతుని ప్రతినిధి, నీడ అని అతని భావం’, సుల్తాన్ హోదాకు గౌరవస్థానం కల్పించి, ప్రజల్లో, సర్దారుల్లో, ఉన్నతాధికారుల్లో అతనంటే ప్రత్యేక గౌరవభావన పెంపొందించి బాల్బన్ అనేక కొత్త ఆచారాలు, సంప్రదాయాలు, నియమ నిబంధనలు ప్రవేశపెట్టాడు. రాజరికం ‘నిరంకుశత్వానికి ప్రతిబింబం’ అని తన కుమారుడైన బుఖాన్కు బోధించాడు. తాను ‘జిల్లీ ఇల్హా’ (భగవంతుని నీడ) అని ప్రకటించాడు. సుల్తాన్ పట్ల గౌరవాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో పర్షియన్ సుల్తానుల దర్బారులో ఆచరణలో ఉన్న ‘జమిన్ బోస్’, ‘పాయిబోస్’ సుల్తాన్కు సాష్టాంగ నమస్కారం చేయడం లేదా సుల్తాన్ పాదాలను గాని సింహాసనాన్ని గాని ముద్దుపెట్టుకోవడం వంటి పద్ధతులు ప్రవేశపెట్టాడు. సుల్తాన్ అన్ని వేళలా రాజదర్పం ఉట్టిపడేలా రాజదుస్తుల్లో కనబడాలని కోరుకొన్నాడు. తాను సుల్తాన్ గా పదవి చేపట్టిన తరువాత తన హోదాకు తగిన అధికారులతోనే మాట్లాడేవాడు. బహిరంగంగా సమావేశాల్లో నవ్వేవాడు కాదు. దర్బారులో మద్యం సేవన, జూదం ఆడటం నిషేధించాడు. క్రమశిక్షణకు ప్రాధాన్యత కల్పించాడు. తాను ముద్రించిన నాణాలపై ఖలీఫా పేరును ముద్రించాడు. సుల్తాన్ పట్ల ప్రజలు, అధికారులు గౌరవంతో ప్రేమతో వ్యవహరించాలనీ, అదే విధంగా సుల్తాన్ ప్రజలను తన కన్నబిడ్డల్లా భావించి వారి సంక్షేమానికి సర్వవేళలా శ్రమించాలని పేర్కొన్నాడు. పటిష్టమైన క్రమశిక్షణ కలిగిన సైన్యం రాజ్య రక్షణకు అత్యావశ్యకమని గుర్తించి అనేక సైనిక సంస్కరణలు చేశాడు. ‘దివాన్-ఇ-ఆరీజ్’ (సైన్య వ్యవహారాలు) శాఖాధిపతులుగా తనకు విశ్వాసపాత్రుడైన ఇమాద్-ఉల్-ముల్క్న నియమించాడు. సైనికులకు జీతభత్యాల ఏర్పాటు చేశాడు. జాగీరులను రద్దుచేయించాడు. ప్రతి సైనికుడికి శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత దివాన్-ఇ-అరీజ్ శాఖకు, ఉన్నత సైనికాధికారులకు అప్పగించాడు. కోటలను నిర్మించారు. పాత కోటలకు మరమ్మత్తులు చేయించాడు.

ప్రశ్న 4.
అల్లావుద్దీన్ – ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలు.
జవాబు:
అల్లావుద్దీన్ సంస్కరణలన్నింటిలో అత్యంత ఉత్తమమైనవి, ప్రశంసలందుకొన్నవి, అతను ప్రవేశపెట్టిన మార్కెట్ సంస్కరణలు. ఇందుకు ముఖ్యకారణం, ప్రభుత్వం చెల్లించే జీతంలో ఒక సాధారణ సైనికుడు సుఖంగా జీవించడానికి వీలుగా నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో పెట్టాలని నిర్ణయించాడు. వస్తువుల ధరలను నిర్ణయించడమే కాకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వ్యాపారులు సరుకులను అమ్మాలని అల్లావుద్దీన్ నిర్దేశించాడు. ఈ నియమాలను ఉల్లంఘించిన వారిని, తప్పుడు తూకాలు, కొలతలు వాడిన వారిని ఇతడు అతి కఠినంగా శిక్షించేవాడు. వ్యాపారస్థులు వారు అమ్మే వ్యాపార వస్తువులను ముందుగా ప్రకటించి, వారి పేర్లతో ప్రభుత్వం దగ్గర రిజిష్టర్ చేసుకోవాలని ఆదేశించాడు. వ్యాపారస్థులపై అజమాయిషీకి “దివానీ రియాసత్’, ‘షహనాయి మండి’ అను ఇద్దరు అధికారులను నియమించాడు. ఘనత : పరిపాలనలో మొట్టమొదటిసారిగా ఖచ్చితమైన సంస్కరణలు ప్రవేశపెట్టినవాడు అల్లావుద్దీన్. తన పాలనా సంస్కరణల ద్వారా అల్లావుద్దీన్ భారతదేశంలో తురుష్క సామ్రాజ్య పునాదులను పటిష్టపరిచాడు.

ప్రశ్న 5.
మహ్మద్ – బీన్ – తుగ్లక్ సంస్కరణలు.
జవాబు:
జునాఖాన్ మహమ్మద్ బీన్ తుగ్లక్ అనే బిరుదుతో క్రీ.శ. 1325లో ఢిల్లీ సింహాసనమధిష్టించి 1351 వరకు రాజ్యమేలాడు. ఢిల్లీ సుల్తానులలోనే గాక, మధ్యయుగ చక్రవర్తులందరిలో ప్రత్యేకమయిన వ్యక్తిత్వము ఉన్నవాడు తుగ్లక్.
పరిపాలనా సంస్కరణలు :
1) అంతర్వేది ప్రాంతంపై పన్నుల హెచ్చింపు: మహమ్మద్ బీన్ తుగ్లక్ తన రాజ్య ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచుటకై గంగా, యమునా, అంతర్వేది ప్రాంతంలో పన్నులను విపరీతముగా పెంచాడు. పుల్లరి, ఇంటిపన్ను, భూమిశిస్తు అమితముగా విధించుటయే గాక క్రూరముగా వసూలు చేశాడు. అసలే కరువుతో కటకటలాడుతున్న ప్రజలు ఈ పన్నుల భారము భరించలేక భూములు వదిలివెళ్ళారు. ఆ తరువాత సుల్తాన్ వారికి సహాయ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అవి ఫలించలేదు. ప్రజలలో సుల్తాన్ పట్ల విరక్తి కలిగింది.

2) వ్యవసాయ శాఖ ఏర్పాటు: మహమ్మద్ బీన్ తుగ్లక్ బంజరు భూములను సాగులోకి తెచ్చుట కొరకు వ్యవసాయ శాఖను ఏర్పరచాడు. ఇందుకుగాను ప్రభుత్వము 60 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. కాని ఉద్యోగుల అవినీతి వలన ఈ పథకం విఫలమైంది.

3) రాజధానిని మార్చుట : మంగోలుల దండయాత్రలకు దూరముగా దేశమునకు మధ్యభాగంలో రాజధాని వుండటం మంచిదని తుగ్లక్ తలచి తన రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చాడు. ఢిల్లీ పౌరులందరు తమ వస్తు, వాహనాలతో దేవగిరికి తరలివెళ్ళాలని ఆజ్ఞ జారీ చేశాడు. 700 కిలోమీటర్ల ప్రయాణంలో ప్రజలు అనేక కష్టనష్టాలు అనుభవించారు. అనేకమంది మార్గమధ్యంలో మరణించారు. దేవగిరికి దౌలతాబాద్ అని నామకరణం చేశాడు. కాని మహమ్మదీయులు ఎవ్వరూ చిరకాలము అచ్చట వుండటానికి ఇష్టపడకపోవటం వలన ఈ పథకం కూడా విఫలమైంది. పైపెచ్చు ఢిల్లీలో సైనిక దళాలు లేవని తెలిసి మంగోలుల దండయాత్రలు పెరిగాయి. సుల్తాన్కు కూడా దౌలతాబాద్ వాతావరణం సరిపడలేదు. అందువలన పౌరులందరు మరల ఢిల్లీకి పోవాలని శాసించాడు. సుల్తాన్ చర్య వృథా ప్రయాసకు చిహ్నమని నిశితంగా విమర్శించారు.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 - 1526)

4) రాగి నాణేల ముద్రణ : నాణేల సంస్కరణలో సుల్తాన్కు ఆసక్తి ఎక్కువ. అతడు విభిన్నమైన నాణేలను ముద్రించి, వాని విలువలు భిన్నంగా నిర్ణయించాడు. రాగి నాణేలను ముద్రించి వాని విలువలను వెండి, బంగారు నాణెములతో సమానం చేశాడు. ఫలితంగా స్వార్థపరులైన ప్రజలంతా సొంతంగా నాణెములు ముద్రించుట మొదలుపెట్టారు. వారు బంగారం, వెండి దాచి, రాగి నాణెములు తయారుచేయుట ప్రారంభించారు. దీని ఫలితంగా డబ్బు విలువ పడిపోయి వస్తువుల ధరలు పెరిగాయి. వీరి చర్యలను సుల్తాన్ అరికట్టలేకపోయాడు. విదేశీ వర్తకులు ఈ నాణెములు నిరాకరించుటచేత, వర్తక వాణిజ్యాలు స్తంభించాయి. అరాచక పరిస్థితులేర్పడటం చేత రాగి నాణేలను ఉపసంహరించవలసి వచ్చింది. రాగి నాణేలకు బంగారు, వెండి నాణెములు ఇచ్చుటచే ప్రభుత్వ ధానాగారం ఖాళీ అయింది.

5) న్యాయపాలన: మహమ్మద్ బీన్ తుగ్లక్ మత విధానమునందు సామరస్య ధోరణి ప్రదర్శించాడు. మత సిద్ధాంతాలను పట్టించుకోక లౌకిక సూత్రాలపై పాలన సాగించాడు. మహమ్మదీయేతరుల పట్ల మత సహనం పాటించిన తొలి ముస్లిం పాలకుడు ఇతడే.

విదేశాంగ విధానము : దురదృష్టవశాత్తు ఇతని విదేశాంగ విధానం కూడా ఘోరంగా విఫలమైంది.
1) ఖురాసాన్ దండయాత్ర : ఖురాసాన్ ప్రముఖులచే ప్రేరేపింపబడి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఖురాసాన్, ఇరాన్ ట్రాన్-ఆగ్జియానా ప్రాంతాలను జయించదలచాడు. అందుకు పెద్ద సైన్యమును సిద్ధపరచి ఒక ఏడాది జీతాన్ని ముందుగానే చెల్లించాడు. కాని తగిన నిధులు లేకపోవుటచే ఈ ప్రయత్నం నుండి విరమించవలసి వచ్చింది.

2) నాగర్ కోట, కారాజాల్ విషయములు : పంజాబులోని భాంగ్రా జిల్లాయందలి నాగర్ కోటను తుగ్లక్ జయించాడు. హిమాలయ ప్రాంతంలోని కారాజాల్ను ఆక్రమించుటకు పెద్ద సైన్యాన్ని పంపాడు. విపరీతమైన జన, ధన నష్టములకు ఓర్చి, ఢిల్లీ సైన్యం కారజాల్ను ఆక్రమించింది.

3) మంగోలులకు లంచములు ఇచ్చుట : మహమ్మద్ బిన్ తుగ్లక్ మంగోలులను ఎదిరించలేక వారికి లంచములు ఇచ్చి, శాంతింపచేయుటకు ప్రయత్నించాడు. సుల్తాన్ బలహీనతను గమనించిన మంగోలులు వారి దాడులను అధికం చేశారు.
తిరుగుబాట్లు : సుల్తాను చేపట్టిన పాలనా సంస్కరణల వల్ల, క్రూరమైన శిక్షల వల్ల విసుగు చెందిన గవర్నర్లు తిరుగుబాట్లు చేయసాగారు. మొత్తం మీద 22 తిరుగుబాట్లు జరిగాయి. మాబార్, వరంగల్, బెంగాల్ స్వాతంత్ర్యం పొందాయి. విజయనగర, బహమనీ రాజ్యాలు దక్షిణాపథంలో స్థాపించబడ్డాయి. సింధు ప్రాంతంలో జరిగిన తిరుగుబాటును అణచుటకు వెళ్ళిన మహమ్మద్ క్రీ.శ. 1351 లో థట్టా సమీపంలో మరణించాడు. అంతటితో “ప్రజలకు అతని పీడ, అతనికి ప్రజల పీడ” తొలగింది.

ప్రశ్న 6.
ఢిల్లీ సుల్తానుల కాలంలో ఆర్థిక పరిస్థితులు.
జవాబు:
భారతదేశం ముస్లిం దాడులకు ముందు అపార సిరిసంపదలతో తులతూగుతుండేది. కాని వీరి అధికార స్థాపన అనంతరం ఆర్థికంగా చాలా నష్టపోయింది. అల్బెరూనీ, ఇబన్ బటూటా, మార్కోపోలో మొదలైన వారి వర్ణనలు ఆనాటి పట్టణ ఆర్థిక వ్యవస్థ విశేషాలను తెలియజేస్తున్నాయి. ఆధునిక చరిత్రకారులైన ఆచార్య ఇర్ఫాన్హాబీబ్, ఆచార్య యూసుఫ్ హుస్సేన్, డా॥ సతీష్ చంద్రల రచనలు ఢిల్లీ సుల్తానుల కాలం నాటి గ్రామీణ జీవనాన్ని, ఆర్థిక స్థితిగతులను వివరిస్తున్నాయి. వ్యవసాయమే ఆనాటి ప్రధాన వృత్తి. చేతివృత్తులు, కుల వృత్తులు ఆదరణ పొందాయి. అనేక కొత్త పట్టణాలు, నిర్మించబడ్డాయి. వర్తక వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. ఆహార ధాన్యాలు, పండ్లు, పూలు పుష్కలంగా పండించారు. పత్తి పంట ఉత్తర భారతదేశంలో ప్రధానంగా పండించారు. ఇబన్ బటూటా నీరు పుష్కలంగా ఉండి, సారవంతమైన ప్రాంతాల్లో రైతులు ఏడాదికి మూడు పంటలు కూడా పండించారని పేర్కొన్నాడు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ వీరి కాలంలో విచ్ఛిన్నమైంది. నిరంతర దాడులు, అధిక పన్నుల భారం ప్రజలను పీడించింది. వస్త్రాల ఉత్పత్తి కొంత మందికి జీవనభృతి కల్పించింది. సామాన్య ప్రజానీకం దుర్లభజీవనఁ గడిపారు. ప్రజలపై ఢిల్లీ సుల్తానులు విపరీత పన్నులు విధించారు. కొన్ని ప్రాంతాల్లో లోహ పరిశ్రమ కొనసాగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలు కొంతమేరకు సైనికుల సంక్షేమానికి ఉపయోగపడ్డాయి. మహ్మద్-బీన్-తుగ్లక్ భూమిశిస్తు, టోకెన్ కరెన్సీ సంస్కరణలు విఫలమయ్యాయి. స్వదేశీ, విదేశీ వ్యాపారం భారీ ఎత్తున కొనసాగింది. బెంగాల్ నుంచి మేలురకం బియ్యం మలబార్, గుజరాతు సరఫరా చేయడమైంది. గోధుమలు, అవధ్, కారా, అలహాబాద్లలో భారీగా పండించేవారు. రవాణా వ్యవస్థ అంతగా అభివృద్ధిచెందలేదు. ఎడ్లబండ్లపై, గుర్రాలపై సరుకుల రవాణా జరిగేది. ముల్తాన్, లాహోర్, దేవగిరి, ఢిల్లీ, సింధ్ ముఖ్య వర్తక కేంద్రాలు. తూర్పు ఆసియా దేశాలతో చైనాతో విదేశీ వర్తకం కొనసాగేది. జిటాల్, టంకా ప్రధాన నాణాలు. దేవాలయాలు, మసీదులు కూడా సొంత మాణ్యాలు, స్థిరాస్తులు కలిగి ఉండేవి. ముస్లిందాడుల వల్ల హిందూ మతసంస్థల ఆర్థిక స్థితి క్షీణించింది.

ప్రశ్న 7.
ఫిరోజ్ షా – తుగ్లక్ ఆంతరంగిక విధానం.
జవాబు:
మహమ్మద్ బీన్ తుగ్లక్ మరణానంతరం అతని పినతండ్రి కుమారుడు ఫిరోజ్ తుగ్లక్ ఢిల్లీ సింహాసనాన్ని (క్రీ.శ. 1351-1388) అధిష్టించాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహమ్మద్ బీన్ తుగ్లక్ వైఫల్యానికి దారితీసిన కారణాలను గుర్తించి వాటిని సరిదిద్దటానికి పూనుకున్నాడు.
1) యమునా నది నుంచి హిస్సార్ వరకు, సట్లేజ్ నుండి గాగ్రా వరకు, సిరూర్ పరిసర ప్రాంతాల నుంచి హన్సీ వరకు, గాగ్రా నుంచి ఫిరోజాబాద్ వరకు, యమునా నది నుంచి ఫిరోజాబాద్ వరకు మొత్తం ఐదు కాలువలను త్రవ్వించి నీటి వనరులను కల్పించి, బంజరు భూములను సాగులోనికి తీసుకువచ్చి వ్యవసాయమును అభివృద్ధి చేశాడు. దీనివల్ల నీటి పారుదల పన్ను రూపంలో చాలా ఆదాయం రావటమే కాక బంజరు భూములు సాగువల్ల భూమి శిస్తు కూడా గణనీయంగా పెరిగింది.

2) ఫతేబాద్, హిస్సార్, ఫిరోజాబాద్, జౌన్పూర్ మొదలగు నగరాలను నిర్మించాడు. ఢిల్లీ చుట్టూ 1200 ఉద్యానవనాలను వేయించాడు. మహమ్మదీయ పకీర్లకు, హిందూ సన్యాసులకు ఎంతో ధనాన్ని విరాళాలుగా ఇచ్చాడు. దివానీ ఖైరత్ అనే పేర ఒక భవనాన్ని నిర్మించి దానిలో పేద మహమ్మదీయ బాలికలకు వివాహాలు జరిపించేవాడు.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 - 1526)

3) సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేయక సామంతరాజులు సరఫరా చేసే సైన్యం మీదనే ఆధారపడ్డాడు.

4) సైనికులకు జాగీర్లను ఇచ్చే పద్దతిని తిరిగి ప్రవేశపెట్టాడు. దీనివల్ల ప్రతిభ ఆధారంగా సైనికులను నియమించే పద్ధతి అంతమొంది అదీ సుల్తానత్ పతనానికి ఒక కారణమైంది.

5) బానిసల అవసరాల కోసం ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశాడు. ఈ శాఖ కింద 1,80,000 మంది బానిసలుండేవారు. వీరి నిర్వహణ ఖజానాకు చాలా భారమైంది. పైగా బానిసలు రాజ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకొని అనేక కుట్రలు చేసి సుల్తానత్ పతనానికి కారకులయ్యారు.

6) శిస్తును వసూలు చేసుకొనే అధికారాన్ని సర్దారులకు ఇచ్చి వారి అభిమానాన్ని పొందాడు.

7) కఠిన శిక్షలను రద్దు చేశాడు.

8) రాజ్య వ్యవహారాలలో ఉలేమాల జోక్యాన్ని అనుమతించాడు. మత మౌఢ్యంతో హిందువుల పట్ల అసహనవైఖరిని అవలంబించాడు. వారి నుంచి జిజియా పన్నును వసూలు చేశాడు. ఒరిస్సాలో వున్న భువనేశ్వర ఆలయం, మాళ్వా, నాగర్కోటలలోని దేవాలయాలను ధ్వంసం చేశాడు. ఇతడు సున్నీ మతస్థుడైనందువల్ల షియాల పట్ల కూడా కఠినవైఖరి అవలంబించాడు. ఈ మతవిధానం ప్రజల్లో ఇతని పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణమైంది.

ప్రశ్న 8.
ఢిల్లీ సుల్తానుల కాలంలో వాస్తు – శిల్పకళ.
జవాబు:
ఢిల్లీ సుల్తానుల యుగంలో భారతదేశంలో ఒక కొత్తతరహా వాస్తు శిల్పకళ రూపుదిద్దుకొంది. ఢిల్లీలో, అజ్మీర్, లాహోర్, దౌలతాబాద్, ఫిరోజాబాద్ లో ఢిల్లీ సుల్తానులు వారి అధికారులు అనేక మసీదులు, కోటలు, రాజభవనాలు, కార్యాలయాలు నిర్మించారు. ఇస్లామిక్ వాస్తుకళ ముఖ్య లక్షణాలు 1. ఆర్చ్ & డోమ్ 2. సున్నపు మట్టిని గచ్చుగా వాడటం, 3. రాతిని, జిప్సంని వాడటం, 4. అలంకరణ అరేబియా, మధ్య ఆసియా, పర్షియా మొదలైన దేశాల నుంచి మేస్త్రీలు, వాస్తు శిల్పులు భారతదేశానికి ఆహ్వానించబడ్డారు. ఢిల్లీలో కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించిన కువ్వత్-ఉల్-ఇస్లాం-మసీద్ ఒక గొప్ప కట్టడం.

కుతుబ్మనార్ ఒక మహోన్నత కట్టడం. దీని నిర్మాణ లక్ష్య నమాజ్ కోసం, ఇరుగుపొరుగు ముస్లింలను ఆహ్వానించడానికి ఉద్దేశించింది. సుప్రసిద్ధ వాస్తు మేధావి పెర్గూసన్ దీని నిర్మాణ కౌశల్యాన్ని ఎంతో ప్రశంసించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ, అలియా దర్వాజాను, ఢిల్లీలో నిజాముద్దీన్ ఔలియా మసీదు నిర్మించాడు. సిరి పట్టణాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ కట్టించాడు. ఇబన్ బటూటా ఇక్కడి రాజప్రాసాద సౌందర్యాన్ని ఎంతో పొగిడాడు. నసీముద్దీన్ లాల్గుంబద్ అనే భవనాన్ని కట్టించాడు. ఢిల్లీలోని మోతీమసీదు సికిందర్ లోడీ వజీరైన ముబారక్షా కట్టించాడు. ఈ విధంగా ఢిల్లీ సుల్తానుల కాలంలో ఇండో- ఇస్లామిక్ అనే కొత్త శైలి వాస్తుకళ రూపుదిద్దుకొంది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అరబ్ సింధ్ ఆక్రమణ.
జవాబు:
అరబ్బుల దండయాత్ర నాటికి సింధు ప్రాంతమును దాహిర్ పాలించుచున్నాడు. అతడు అసమర్ధుడు, బలహీనుడు కావటం చేత అతని పాలన ప్రజారంజకముగా లేదు.
సింధూను జయించుటకు రెండుసార్లు బలీయమైన సైన్యదళములను హజాజ్ పంపాడు. కాని అరబ్బు సేనాపతులు రెండుసార్లు ఓడిపోయారు. తుదకు హజాజ్ తన అల్లుడైన మహమ్మద్ బీన్ ఖాసిం అనువానిని అపారసైన్యంతో పంపాడు. ఖాసిమ్ యువకుడు, శక్తిశాలియైన సేనాధిపతి.

ఖాసిం 25,000 అరబ్బు సైన్యముతో దేబాల్ను ఆక్రమించి దారుణ రక్తపాతానికి తలపడ్డాడు. ఇస్లాంమతము స్వీకరించని వారిని కత్తికి బలి ఇచ్చాడు. నెరూన్, శ్వాన్, శీలమ్ ప్రాంతములు తేలికగా ఆక్రమించుకున్నాడు. తుదకు క్రీ.శ. 712లో రోర్ యుద్ధరంగంలో దాహిర్ మరణించాడు. ఆ తరువాత బ్రాహ్మణాబాదు, సింధూ రాజధానియైన ఆలోర్ను ఖాసిం వశపరచుకున్నాడు. ఇట్లు సింధూ ప్రాంతాన్ని ఆక్రమించి, ముల్తాన్ను కూడా జయించాడు. కనోజ్పై దండెత్తుటకు ప్రయత్నములు చేయుచున్నప్పుడు ఖాసింను ఖలీఫా వెనుకకు పిలిపించి క్రూరముగా చంపాడు.

ప్రశ్న 2.
మహమ్మద్ ఘోరీ.
జవాబు:
ఘజనీ వంశ పరిపాలన తరువాత ఘోరీ వంశం సుల్తానులు అధికారంలోకి వచ్చారు. హీరాట్-ఘజనీ రాజ్యాల మధ్య పర్వత పంక్తుల్లో కేంద్రీకృతమై ఉన్న చిన్న రాజ్యంపై ఘోరీలు అధికారం నెలకొల్పారు. ఘోరీ వంశ మూల పురుషుడు ఘియాజుద్దీన్ మహ్మద్. ఇతడు కడపటి ఘజనీల నుంచి ఘజనీ రాజ్యాన్ని ఆక్రమించాడు. దాని రాష్ట్రపాలకుడిగా తన సోదరుడైన ముయిజుద్దీన్ ను నియమించాడు. చరిత్రలో ఇతడే మహ్మద్ ఘోరీగా కీర్తి గడించాడు. క్రీ.శ. 1173వ సం॥లో ఇతడు ఘోరీ రాజ్య సింహాసనం అధిష్టించాడు. మహ్మద్ ఘోరీ సమర్థ నాయకుడు, గొప్ప సేనాధిపతి.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 - 1526)

ప్రశ్న 3.
ఆల్బెరూనీ.
జవాబు:
ఆల్బెరూనీ మహమ్మద్ గజనీ ఆస్థానకవి, పర్షియా దేశస్థుడు. సంస్కృత పండితుడు. మహమ్మద్ వెంట భారతదేశానికి వచ్చాడు. తారిఖ్-ఉల్-హింద్ అనే గ్రంథాన్ని రచించాడు.

ప్రశ్న 4.
జియాఉద్దీన్ – బరనీ
జవాబు:
తారీఖ్-ఇ-ఫిరోజ్ షాహి గ్రంథ రచయిత జియా-ఉద్దీన్-బరౌనీ. ఉన్నత విద్యావంతులైన కుటుంబానికి చెందిన బరౌనీ, తండ్రి ముయిద్-ఉల్-ముల్క్, మామయ్య అలా-ఉల్-ముల్క్లు, బాల్బన్, జలాలుద్దీన్ ఖిల్జీ, అల్లావుద్దీన్ ఖిల్జీ మొదలైన సుల్తానుల సేవలో వివిధ పదవులు నిర్వహించినందువల్ల బరేనీకి సుల్తానులతో సన్నిహిత సంబంధాలుండేవి. ఇతడి రచన 14వ శతాబ్దం నాటి రాజకీయ వ్యవస్థ, ఆర్థిక విధానాలు, సాంఘిక స్థితిగతులు, న్యాయ విధానం మొదలైన అంశాల గురించి విలువైన సమాచారం అందిస్తుంది. బానిస, ఖిల్జీ, తుగ్లక్ వంశ సుల్తానుల వివిధ విధానాలను వివరించే గొప్ప రచనే తారీఖ్-ఇ-ఫిరోజ్-షాహి.

ప్రశ్న 5.
కుతుబ్మనార్.
జవాబు:
కుతుబుద్దీన్ ఐబక్ దీనిని భక్తియార్ ఖాదిర్ అను సూఫీ సన్యాసి గౌరవార్ధం దీనిని ప్రారంభించగా ఇల్లుట్మిష్ దీనిని పూర్తి చేశాడు. ఇది ఢిల్లీలోని మొహరేవి వద్ద కలదు. దీని ఎత్తు 71.4 మీటర్లు. భారత్ పశ్చిమాసియా భవన నిర్మాణ సాంప్రదాయాలు అన్నీ దీనిలో ఉన్నాయి.

ప్రశ్న 6.
మంగోల్ దాడుల ప్రభావం.
జవాబు:
మంగోలులు ఒక సంచార జాతి. వారు ప్రథమం నుండి ఢిల్లీపై దాడులు జరిపి, తీవ్రనష్టం కలిగించారు. ముఖ్యముగా ఇల్టుట్మిష్ వీరి దాడి నుంచి తన రాజనీతిజ్ఞతతో ఢిల్లీని కాపాడెను. బాల్బన్ వీరి దాడుల నుంచి ఢిల్లీని కాపాడుటకు గట్టి ప్రయత్నం చేసెను. అయితే తన కుమారుడిని మంగోలాడుల వల్ల కోల్పోయెను. అల్లావుద్దీన్ ఖిల్జీ | కాలములో కూడా వీరు దాడులు జరిపి, ఢిల్లీకి తీవ్రనష్టము కల్గించారు.

ప్రశ్న 7.
టోకెన్ కరెన్సీ సంస్కరణలు.
జవాబు:
మహ్మద్-బీన్-తుగ్లక్ ఢిల్లీ సింహాసనము అధిష్టించేనాటికి అతని సామ్రాజ్యంలో వెండి, బంగారు లోహాలతో చేసిన టంకా, జిటాల్ వంటి నాణాలు వాడుకలో ఉన్నాయి. కాని అదేకాలంలో బంగారం, వెండి లోహాల తీవ్రకొరత ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించడానికై సుల్తాన్ కొత్త పథకం రూపొందించాడు. కాని స్పష్టమైన మార్గ నిర్దేశనాలు లేనందువల్ల రాగి, ఇత్తడి నాణాలు ప్రతి కంసాలి ఇంట్లో ముద్రించబడ్డాయి. ద్రవ్యం విలువ గణనీయంగా పడిపోయింది. తప్పును గ్రహించిన సుల్తాన్ టోకెన్ కరెన్సీని రద్దు చేశాడు. అప్పటికే చాలా నకిలీ నాణాలు మార్కెట్లో చెలామణి అయ్యాయి. చివరకు ఈ పథకాన్ని సుల్తాన్ రద్దు చేశాడు.

ప్రశ్న 8.
మొదటి పానిపట్ యుద్దం.
జవాబు:
బాబర్ భారతదేశ ఆక్రమణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకొన్నాడు. 1525లో దౌలతాన్ను తరిమివేసి పంజాబ్ను స్వాధీనపరచుకున్నాడు. ఆ తరువాత తన సైన్యాన్ని ఢిల్లీ వైపుకు నడిపించాడు. ఢిల్లీ పాలకుడైన ఇబ్రహీంలోడీ ఒక లక్ష సైన్యంతో పానిపట్టు వద్ద బాబర్కు ఎదురునిలిచాడు. 1526 ఏప్రియల్ 21న ఈ ప్రదేశం వద్ద జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీంలోడీ వధించబడ్డాడు. ఢిల్లీ, ఆగ్రాలు బాబర్ వశమయ్యాయి. మొదటి పానిపట్టు యుద్ధం చారిత్రాత్మకమైనది. లోడీ సైనిక పాటవం సర్వనాశనమైంది. భారతదేశంలో మొగల్ సామ్రాజ్య స్థాపన జరిగింది. హిందూస్థాన్ సార్వభౌమత్వం ఆఫ్ఘనుల నుంచి మొగలుల చేతిలోకి పోయింది. మొగలుల వారసత్వం భారతదేశంలో 200 సంవత్సరాలు కొనసాగింది. మొగల్ పరిపాలనవల్ల భారతదేశంలో హిందూ, ముస్లిం సంస్కృతులు సంగమం చెంది మిశ్రమ సంస్కృతి విరాజిల్లింది.

మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ విజయానికి అనేక పరిస్థితులు దోహదం చేశాయి. ఇబ్రహీంలోడీ అనుసరించిన అనుచిత రాజకీయ విధానం బాబర్కు సహకరించింది. బాబర్ యుద్ధ వ్యూహం, శతఘ్ని దళం, సుశిక్షితులైన సైనికులు బాబర్ విజయానికి దోహదపడ్డారు.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 - 1526)

ప్రశ్న 9.
ఢిల్లీ సుల్తానుల కాలంలో సాహిత్య వికాసం.
జవాబు:
ఢిల్లీ సుల్తానుల అధికార స్థాపనతో భారతదేశంలో స్వదేశీ భాషలకు ఆదరణ కరువైంది. పర్షియన్, అరబిక్ భాషలు సుల్తానుల ఆదరణ, పోషణ పొందాయి. ఈ భాషలో అనేక గొప్ప రచనలు జరిగాయి. ఉర్దూ అవతరించింది. స్వదేశీ పదాల కలయికతో ఉర్దూ బాగా ఆదరణ పొందింది. భక్తి-సూఫీ ఉద్యమకారులు స్థానిక భాషల్లో వారి బోధనలు కొనసాగించారు. దీంతో హిందీ, అవధ్, మరాఠి, కన్నడ, తమిళ, మైథిలీ, బెంగాలీ భాషలు అభివృద్ధి సాధించాయి. సామాన్య ప్రజలు వారు మాట్లాడుకొనే భాషలోనే భక్తి ప్రబోధకులు భక్తి మార్గాన్ని, ఐక్యత, మానవతా విలువలను, ప్రబోధించారు. దీంతో వారిలో సోదరభావం పెంపొందింది.

ప్రశ్న 10.
ఢిల్లీ సుల్తాన్ల పతనం.
జవాబు:
క్రీ.శ. 1206లో కుతుబుద్దీన్ ఐబక్ తో ప్రారంభమైన ఢిల్లీ సుల్తానుల పాలన సుమారు మూడువందల ఇరవై ఏళ్ళపాటు కొనసాగి ఇబ్రహీం లోడీతో క్రీ.శ. 1526లో ముగిసింది. ఈ సుదీర్ఘ కాలంలో దేశంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఐదు వంశాల పాలన కొనసాగింది. సుల్తాన్ల పతనానికి అనేక కారణాలు దోహదం చేశాయి.

  1. సామ్రాజ్య విస్తీర్ణం గణనీయంగా పెరిగినప్పటికీ, సుల్తానులు అన్ని ప్రాంతాలపై కేంద్ర అధికారాన్ని సమర్ధంగా చెలాయించలేకపోవటం.
  2. సుల్తాన్ స్వార్ధపూరిత విధానాలు, సర్దారుల తిరుగుబాట్లు.
  3. స్థానిక ప్రజల అభిమానం పొందలేకపోవడం, హిందూమత వ్యతిరేక విధానాలు.
  4. రాష్ట్రాల పాలకుల తిరుగుబాట్లు.
  5. సైన్యంలో క్షీణించిన పట్టుదల.
  6. మహ్మద్-బీన్-తుగ్లక్ విధానాల వైఫల్యం.
  7. తైమూర్ దండయాత్ర.
  8. దక్షిణాపథంలో వెలమ, రెడ్డి, విజయనగర, బహమనీ రాజ్యాల
  9. మితిమీరిన పన్నుల భారం.
  10. ముస్లిం వర్గాల్లో ఉన్న విభేదాలు మొదలైనవి.

AP Inter 1st Year History Study Material Chapter 3 తొలి రాజ్యాలు, సామ్రాజ్యాలు, ఆర్థిక పరిస్థితి

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 3rd Lesson తొలి రాజ్యాలు, సామ్రాజ్యాలు, ఆర్థిక పరిస్థితి Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 3rd Lesson తొలి రాజ్యాలు, సామ్రాజ్యాలు, ఆర్థిక పరిస్థితి

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మగధ రాజ్య విజృంభణకు దారితీసిన కారణాలను తెలపండి.
జవాబు:
క్రీ.పూ. 6వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో షోడశ మహాజనపదాలనబడే 16 రాజ్యాలు ఏర్పడ్డాయి. వాటిలో మగధ రాజ్యం ఒకటి. మగధ రాజ్యం క్రమంగా శక్తివంతంగా రూపొంది విజృంభించింది.

మగధ సామ్రాజ్య ఆవిర్భావానికి కారణాలు: క్రీ.పూ. 6వ శతాబ్దంలో గంగా, యమున మైదాన ప్రాంతంలో 16 జనపదాలు వెలిశాయి. ఈ మహాజనపదాల మధ్య ఆధిపత్యం కోసం నిరంతరం సంఘర్షణలు జరుగుతుండేవి. సార్వభౌమాధికారాన్ని పొందాలనే తలంపుతో ప్రతి జనపదం కూడా సమర్థవంతమైన సైనిక వ్యవస్థను పోషించింది. ఈ రాజకీయ, సైనిక ప్రయోజనాల వెనుక ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతం వాయువ్య దిశ నుంచి వచ్చే విదేశీ దాడుల ప్రమాదానికి దూరంగా ఉంది. గంగానది, దాని ఉపనదులతో ఈ ప్రాంతం ఐశ్వర్యవంతమైంది. రాజకీయాధిక్యత కోసం కాశీ, కోసల, మగధ, వజ్జి రాజ్యాలు పోటీపడ్డాయి. వాటిలో మగధ విజృంభించి ఇతర రాజ్యాలపై ఆధిపత్యాన్ని నెలకొల్పి భారతదేశ చరిత్రలో ప్రప్రథమ రాజ్యంగా వెలిసింది.

మగధ రాజ్య విజృంభణకు అనేక పరిస్థితులు దోహదపడ్డాయి.

  1. మగధలో ప్రకృతిసిద్ధమైన అనేక వనరులున్నాయి. గంగానది, దాని ఉపనదులైన శోణ్, గండక్, గోగ్రా నదులు మగధకు సహజ రక్షణను, రాకపోకల సౌకర్యాలను సమకూర్చాయి.
  2. ఈ ప్రాంతంలో ఇనుప ఖనిజగనులు అందుబాటులో ఉన్నందువల్ల మగధ ఆయుధ నిర్మాణంలో ముందంజ వేసింది.
  3. మధ్యగంగా మైదాన ప్రాంత మధ్యభాగంలో ఉన్నందువల్ల ఆ రాజ్యం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందింది.
  4. ఈ ప్రాంతంలో ఏనుగులు అధిక సంఖ్యలో ఉండేవి. మగధ పెద్ద ఎత్తున ఏనుగులను సమీకరించి యుద్ధ వ్యూహంలో ముందున్నది.
  5. మగధకు రాజధాని నగరాలైన గిరివ్రజం, పాటలీపుత్రం రాజ్యానికి ప్రకృతిసిద్ధమైన రక్షణను కల్పించాయి.
  6. ఈ ప్రాంతం తరచుగా విదేశీ దండయాత్రలకు గురయ్యే వాయువ్య ప్రాంతానికి దూరంగా ఉన్నందువల్ల దండయాత్రల బెడద లేదు.
  7. పైగా కొత్తగా ఆర్య సంస్కృతి ప్రభావం కిందికి వచ్చిన మగధ ప్రజల్లో ఇతరుల కంటే సామ్రాజ్య విస్తరణ కాంక్ష అధికంగా ఉండేది. ఈ విధమైన కారణాలు ఉన్నందువల్లనే మగధ ఒక సామ్రాజ్యంగా రూపొందింది.
  8. మగధను పాలించిన రాజవంశాలు మగధ రాజ్య విజృంభణకు దోహదపడ్డాయి.

AP Inter 1st Year History Study Material Chapter 3 తొలి రాజ్యాలు, సామ్రాజ్యాలు, ఆర్థిక పరిస్థితి

ప్రశ్న 2.
క్రీ.పూ. 6వ శతాబ్దంనాటి గ్రామీణ జీవనం గురించి తెలపండి.
జవాబు:
క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి పశుపోషణ స్థానంలో వ్యవసాయం చేరింది. గ్రామాల్లో ప్రజలు వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడి జీవించారు. ఆనాటి గ్రామాల్లో పంట భూములు కుటుంబ పెద్దల ఆధ్వర్యంలో ఉండేవి. విస్తారమైన భూములు అరుదుగా ఉండేవి. పశువులను కాపర్లు పచ్చిక బయళ్ళలో మేతకు తీసుకొని వెళ్ళేవారు. విస్తారమైన భూముల్లో కూలీలను, బానిసలను ఉపయోగించేవారు.

గ్రామ ప్రజలే గ్రామంలోని వ్యవసాయ పనులు, రహదారులు, భవనాలు, చెరువులు, నీటి పారుదల సౌకర్యాలను ఏర్పాటుచేసుకొనేవారు. గ్రామప్రజలందరు తమ పంటలకు సమీపప్రాంతంలో స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. వీటికి కేంద్రంగా పట్టణం ఉండేది. గ్రామమే సామాజిక, ఆర్థిక వ్యవస్థకు మూలం. నాడు మూడు రకాల గ్రామాలు ఉండేవి. అవి:

  1. భోజక
  2. పట్టణ గ్రామాలు
  3. సరిహద్దు గ్రామాలు.

కొన్ని అటవీ ప్రాంత గ్రామాల పరిసరాలు చుట్టూ పచ్చిక బయళ్ళు బీడు భూములు ఉన్నాయి. ఇవి ప్రభుత్వ ఆస్తిగా పరిగణించబడుతుంది. శూద్రులు అటవీ ప్రాంతాలను చదును చేసి వ్యవసాయ యోగ్యంగా మార్చుకునేవారు. శూద్రులు ఎక్కువగా వ్యవసాయ కూలీలుగా ఉండడంవల్ల సమాజంలో వారి స్థాయి తక్కువగా ఉండేది. శూద్రుల కంటే కింది స్థాయిలో అంటరానివారిగా పరిగణింపబడే వర్గం ఉండేది. వీరు వేట జంతు చర్మాలతో వస్త్రాలు మొదలైన పనులు చేయడంవల్ల వీరిని తక్కువస్థాయి వారిగా చూసేవారు.

నాడు అనేక చేతివృత్తులు అభివృద్ధి చెందాయి. ఎక్కువ మంది వీటి మీద ఆధారపడి పనిచేసేవారు. ఆ కాలంలో దాదాపు అరవై నాలుగు రకాల వృత్తులు ఉన్నట్లు తెలుస్తుంది. నాడు దాదాపు 18 ముఖ్యమైన వృత్తులవారు ‘శ్రేణులు’గా ఏర్పడ్డారు. ఈ శ్రేణులు నిర్ణయించిన విధి విధానాలను సభ్యులు అంగీకరించాలి.

చేతి వృత్తులతో ఉత్పత్తి అయిన వస్తువులను దూర ప్రాంతాలకు వర్తకులు తీసుకొని వెళ్ళేవారు. 500 ఎడ్లబండ్ల మీద వస్తు రవాణా జరిగినట్లు తెలుస్తున్నది. వస్త్రాలు, దంతపు వస్తువులు, మట్టిపాత్రలు రవాణా అయ్యేవి. వర్తక పట్టణాలన్నీ నదీ తీరాలలో ఉండేవి. ఈ వ్యాపారాభివృద్ధికి నాణాలు వాడినారు. ‘శతమాన’ ‘నిష్క’ మొదలైన నాణాలు
వేదకాలం నుంచి ఉండేవి.

ప్రశ్న 3.
మగధను పాలించిన వివిధ రాజులు ఏ విధంగా రాజ్య విస్తరణ కావించారో తెలపండి.
జవాబు:
మగధ రాజ్య ఆవిర్భావము: మగధ రాజ్య చరిత్రను తెలుసుకోవటానికి పురాణాలు, జైన, బౌద్ధ, వాఙ్మయము, గ్రీక్ రచనలు ఉపకరిస్తున్నాయి. ఇతిహాస యుగంలో మగధను బృహద్రధ రాజవంశం పాలించింది. ఈ వంశానికి చెందిన రాజుల్లో జరాసంధుడు కడు సమర్థుడు. అతని రాజధాని గిరివ్రజము. ఈ వంశంలో చివరి రాజైన రిపుంజయుని హర్యంక వంశస్థులు ఓడించి తమ వంశ పాలనను ప్రారంభించారు.

హర్యంక వంశం (క్రీ.పూ. 544 – 413): మగధ రాజ్య విజృంభణకు పునాదులు వేసింది హర్యంక వంశం. ఈ వంశ స్థాపకుడైన బింబిసారుడు (క్రీ.పూ. 544 – 493) బుద్ధునికి సమకాలికుడు. అతడు కోసల, లిచ్ఛవి, మద్ర, విదేహ రాజకన్యలను వివాహం చేసుకొని, వారి మైత్రితో హర్యంకుల బలాన్ని పెంచాడు. కోసల రాజకుమారిని పెళ్ళాడి సంవత్సరానికి లక్ష సువర్ణాల ఆదాయాన్నిచ్చే కాశీ నగరాన్ని కట్నంగా పొందాడు. అంగరాజును జయించి ఆ రాజ్యాన్ని వశపరచుకొన్నాడు. రాజ్య విస్తరణతోపాటు అతనికి ఆర్థికబలం కూడా సమకూరింది. బింబిసారుని తరువాత అతని కుమారుడు అజాత శత్రువు (క్రీ.పూ. 493 462) రాజ్యానికి వచ్చాడు. అతడు తన 30 సంవత్సరాల పాలనా కాలంలో తన తండ్రి విధానాలను అనుసరిస్తూ మగధ సామ్రాజ్య ఔన్నత్యాన్ని ఇనుమడింపచేశాడు. కోసల, కాశీ రాజులను జయించి వారి రాజ్యాలను మగధ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. వజ్జి గణరాజ్యంలో 16 సంవత్సరాలు దీర్ఘకాలిక పోరాటం చేసి విజయాన్ని సాధించాడు. అవంతి, వత్స, సౌరవి రాకుమార్తెలను పెళ్ళిచేసుకొని ఆ రాజ్యాలమైత్రిని, అండదండలను పొందాడు. పాటలీగ్రామ జలదుర్గాన్ని నిర్మించాడు.

అజాత శత్రు మరణానంతరం రాజ్యానికి వచ్చిన ఉదయనుడు (క్రీ.పూ. 461-444) మగధ రాజధానిని పాటలీపుత్రానికి మార్చాడు. ఇతని తరువాత పాలించిన నలుగురు పాలకులు పితృహంతకులు కావటంతో విసుగు చెందిన ప్రజలు చివరి రాజైన నగదాసకుడ్ని పదవీచ్యుతుడ్ని చేసి, అతని మంత్రియైన శిశునాగుడ్ని రాజుగా చేశారు. దీనితో హర్యంక వంశం అంతరించింది.

శైశునాగవంశం: శిశునాగుడు ఈ శైశునాగ వంశస్థాపకుడు. ఇతడు రాజధానిని పాటలీపుత్రం నుండి రాజగృహానికి మార్చాడు. అవంతి, వత్స రాజ్యాలను మగధ సామ్రాజ్యంలో కలిపాడు. ఇతని తరువాత రాజ్యానికి వచ్చిన ఇతని కుమారుడు కాలాశోకుని కాలంలో 2వ బౌద్ధ సంగీతి జరిగింది. కాలాశోకుడిని, అతని 10 మంది కుమారులను చంపి నంద వంశస్థుడైన మహాపద్మనందుడు మగధను ఆక్రమించాడు.

నంద వంశం: నంద వంశ స్థాపకుడు మహాపద్మనందుడు. గ్రీకు రచనల వలన మహాపద్మనందుని తండ్రి శూద్రుడని తెలుస్తున్నది. మహాపద్మనందుడు కాశీ, మిథిల, కళింగ వంటి అనేక రాజ్యాలను ఆక్రమించినట్లు తెలుస్తున్నది. అతడు మహాక్షత్రాంతక అనే బిరుదు పొందాడు. మహాపద్మనందుడి పాలన నుండి చివరి నందరాజు వరకు గల నందుల చరిత్ర తెలియరాదు. అయితే ఈ రాజులను నవనందులు అని వ్యవహరిస్తున్నారు. నందులలో చివరివాడైన ధననందుడు అధిక పన్నుల భారంతో, నిరంకుశ పాలనతో ప్రజలను పీడించాడు. దానితో విసుగు చెందిన ప్రజలకు చంద్రగుప్తు మౌర్యుడు నాయకత్వం వహించాడు. చంద్రగుప్తుడు చాణుక్యుని సాయంతో నంద వంశాన్ని నిర్మూలించి మగధలో మౌర్యవంశాన్ని స్థాపించాడు.

మగధ చరిత్రలో నందులకు విశిష్ట స్థానం ఉంది. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించగలిగిన వంశం ప్రాచీన మగధ చరిత్రలో మరొకటి లేదు. శక్తివంతమైనదిగా ఖ్యాతిగాంచిన నంద వంశ సామ్రాజ్యాన్ని కబళించటానికి, ప్రపంచ విజేతగా పేరుగాంచిన అలెగ్జాండర్ కూడా సాహసించలేకపోయాడు. అట్టి సామ్రాజ్య పునాదులపైనే మౌర్య సామ్రాజ్యం నిర్మితమైంది.

AP Inter 1st Year History Study Material Chapter 3 తొలి రాజ్యాలు, సామ్రాజ్యాలు, ఆర్థిక పరిస్థితి

ప్రశ్న 4.
క్రీ.పూ. 6వ శతాబ్దకాలం నాటికి ఎన్ని రకాల గ్రామాలు ఉన్నాయి? అవి ఏవి?
జవాబు:
క్రీ.పూ. 6వ శతాబ్దము నాటి గ్రామములే సామాజిక, ఆర్థిక వ్యవస్థకు మూలం. పాళీ గ్రంథాల ప్రకారం ఆనాడు మూడు రకాల గ్రామాలు ఉండేవి. అవి:

  1. భోజక
  2. పట్టణ గ్రామాలు
  3. సరిహద్దు గ్రామాలు.

1. భోజక: ఈ గ్రామంలో అనేక రకాల కులాలు, వర్గాలు ఉండేవి. ఈ గ్రామ పెద్దను ‘భోజక’ అని పిలుస్తారు.

2. పట్టణ గ్రామాలు: ఈ విధంగా ఉన్న గ్రామాల్లో చేతి వృత్తులు, హస్తకళల వృత్తులవారు ఉండేవారు. ఇవి గ్రామాలకు మార్కెట్లుగా పనిచేశాయి.

3. సరిహద్దు గ్రామాలు: ఈ గ్రామాలు దాదాపు అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉండి సరిహద్దు గ్రామాలుగా ఉండేవి. కొన్ని అటవీ ప్రాంత గ్రామాల పరిసరాల చుట్టూ పచ్చికబయళ్ళు, బీడు భూములు ఉన్నాయి. ఇవి ప్రభుత్వ ఆస్తిగా భావించేవారు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
క్రీ.పూ. 6వ శతాబ్ద కాలానికి సంబంధించిన ఆధారాలు ఏవి?
జవాబు:
క్రీ.పూ. 6వ శతాబ్ద కాలం నాటి పరిస్థితులు తెలుసుకోవటానికి ఉన్న ఆధారాలను రెండు రకాలుగా విభజించవచ్చు. అవి:

  1. సాహిత్య ఆధారాలైన సంస్కృత గ్రంథాలు, త్రిపీటకాలు, త్రిపీటకాలపై వ్యాఖ్యానాలు, జాతక కథలు, దీపవంశం, మహావంశం మొదలైనవి.
  2. పురావస్తు ఆధారాలైన బార్హూత్, సాంచి, అమరావతి స్థూపాలు, మృణ్మయ పాత్రలు మొదలగునవి.

ప్రశ్న 2.
PUNCH – Marked నాణాలను తెలపండి.
జవాబు:
ఈ నాణాలు కొండలు, చెట్లు, చేపలు, ఎద్దు, ఏనుగు, చంద్రవంక మొదలైన బొమ్మలతో అచ్చువేసి ఉండే చిన్న చిన్న నాణాలు.

ప్రశ్న 3.
గణతంత్ర ప్రభుత్వం అంటే ఏమిటి?
జవాబు:
గణతంత్ర రాజ్యాలు ఎక్కువగా పర్వత ప్రాంతాల వద్ద వెలిశాయి. ఇవి సాధారణ భూములున్న ప్రాంతాలలో వెలిశాయి. గణతంత్ర ప్రభుత్వములు సాంప్రదాయకతను పాటిస్తూ అభివృద్ధి చెందాయి. గణతంత్ర ప్రభుత్వంలో రాజు అధికారములను నియంత్రించుటకు సభ, సమితి అనేవి కీలకపాత్ర వహించును. రాజ్య పాలకుడు సభ, సమితి నిర్ణయాలకు లోబడి పనిచేయవలెను. ఈ ప్రభుత్వములు వారసత్వంగా వచ్చేవికాదు.

ప్రశ్న 4.
క్రీ.పూ. 6వ శతాబ్దంనాటికి ఉన్న ప్రధాన రహదారి మార్గాలు ఏవి?
జవాబు:

  1. కౌశాంబి నుండి గంగా మైదాన ప్రాంతాల ద్వారా పంజాబ్, తక్షశిల రహదారుల ద్వారా ఇరాన్, మధ్య ఆసియా, ఐరోపా దేశాలకు ఒక రహదారి.
  2. రాజగృహ నుంచి కౌశాంబి, ఉజ్జయినులు ద్వారా బరుకచ్చం నుంచి పశ్చిమ దేశాలకు రెండవ రహదారి.
  3. గంగా మైదానాల ద్వారా బర్మాకు ముఖ్యమైన రహదారి.
  4. గంగా మైదానాల ప్రాంతం నుంచి, నదీతీర ప్రాంతం ద్వారా దక్షిణ తూర్పు ప్రాంతాలకు ఇంకొక రహదారి మార్గం.

AP Inter 1st Year History Study Material Chapter 3 తొలి రాజ్యాలు, సామ్రాజ్యాలు, ఆర్థిక పరిస్థితి

ప్రశ్న 5.
క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి వెలసిన ముఖ్య వృత్తులు ఏవి?
జవాబు:
6వ శతాబ్దం నాటికి దాదాపు అరవై నాలుగు రకాల వృత్తులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వృత్తులను రెండు రకాలుగా భావించారు. అవి కొన్ని ఉన్నత స్థాయి, కొన్ని క్రింది స్థాయి వృత్తులుగా భావించారు. వడ్రంగులు దంతపు వస్తువుల తయారీదార్లు, నేత పనివారు, కంసాలి మొదలైనవి ఉన్నత వృత్తులుగా భావించబడ్డాయి. వేటగాళ్ళు, చేపలు పట్టేవారు, కటిక వృత్తి, చెప్పులు కుట్టడం, కుమ్మరులను తక్కువ వృత్తికారులుగా భావించేవారు.

ప్రశ్న 6.
క్రీ.పూ. 6వ శతాబ్దంలో వెలసిన ముఖ్య చేతివృత్తులను తెలుపుము.
జవాబు:
క్రీ.పూ. 6వ శతాబ్ద కాలంలో అనేక చేతి వృత్తులు అభివృద్ధి చెందాయి. ఎక్కువమంది వీటి మీద ఆధారపడి పనిచేసేవారు. ఆ కాలంలో దాదాపు అరవై నాలుగు రకాల వృత్తులు ఉన్నట్లు తెలుస్తుంది. అవి: వడ్రంగి, నేతపని, కంసాలి, వేటగాళ్ళు, చేపలు పట్టేవారు, కటిక వృత్తి, చెప్పులు కుట్టడం మొదలైనవి చేతివృత్తులు.

AP Inter 1st Year History Study Material Chapter 2 ప్రాచీన నాగరికత – సంస్కృతులు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 2nd Lesson ప్రాచీన నాగరికత – సంస్కృతులు Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 2nd Lesson ప్రాచీన నాగరికత – సంస్కృతులు

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హరప్పా లిపిని గురించి రాయండి.
జవాబు:
సింధూలోయ నాగరికత త్రవ్వకాలలో రాతితో, మట్టితో చేసిన అనేక ముద్రికలు బయటపడ్డాయి. వాటిపై సింధూ ప్రజల లిపి లిఖించబడివున్నది. ఈ లిపిని ‘బొమ్మల లిపి లేక చిత్ర లిపి’ అంటారు. సింధూ ప్రజలు తమ భావాలను బొమ్మల ద్వారా వ్యక్తపరిచారని ఈ లిపి వల్ల తెలుస్తున్నది. ఈ లిపిలో ఒక వరుసను ఎడమ నుంచి కుడికి, తరువాత వరుసను కుడి నుండి ఎడమకు వ్రాసి ఉండవచ్చునని కొందరి నమ్మకము. సింధూ లిపి నుంచి బ్రాహ్మీ లిపి పుట్టినట్లు కొందరి నమ్మకము. ఈ లిపికి ప్రాచీన ఈజిప్టు, మెసపుటేమియాల లిపిలకు సంబంధం ఉందని కొందరి నమ్మకం. ఈ లిపిని ఇంకా ఎవ్వరూ పూర్తిగా చదవలేదు. ఈ లిపిని బట్టి సింధూ ప్రజలు విద్యావంతులని చెప్పవచ్చు. ఈ లిపి నుంచే ప్రాచీన తమిళభాష తన రూపాన్ని సంతరించుకుందని ఫాదర్ హీరాస్ పేర్కొనగా, కన్నింగ్రమ్, పాండే మొదలైన వారు అశోకుని బ్రాహ్మీ లిపి, సింధూ ప్రజల లిపి నుండి ఉద్భవించిందని పేర్కొన్నారు.

ప్రశ్న 2.
హరప్పా మత జీవితంలోని ప్రధాన లక్షణాలను రాయండి.
జవాబు:
సింధూ ప్రజల మతం ఆచారాలు వివిధ నమ్మకాలతో కూడుకొన్నవి అని ఆచార్య వీలర్ పండితుని అభిప్రాయం. సింధూ త్రవ్వకాలలో ఎటువంటి దేవాలయములు గాని, దేవతా ప్రతిమలు గాని దొరకలేదు. అయితే సింధూ త్రవ్వకాలలో దొరికిన వివిధ ‘ముద్రల’ (సీల్స్) పై ఉన్న చిత్రాలు మరియు టేరాకోటా (మట్టి) బొమ్మల ద్వారా వారి మతం ఆచారాలు మెచ్చుకోవచ్చును.

ఎ) టేరాకోటా – మట్టి బొమ్మలు: నాటి టెరాకోటా బొమ్మలు బాగా మెరుగుపెట్టినట్లు తెలుస్తుంది. ఆ బొమ్మలలో “మాతృదేవతా మూర్తి” (చరిత్రకారులు అమ్మతల్లిగా పేర్కొనిరి) పెద్దశిరోవేష్టం, నడుముకు వడ్డాణం, ఇంకా కంఠహారాలు, చెవికమ్మలతో కనిపిస్తుంది. కొన్ని బొమ్మలకు నూనెదీపాల పొగ అంటినట్లు కనిపిస్తుంది. ఇది బహుశా నూనెదీపాలు, గుగ్గిలం లేదా సాంబ్రాణి వెలిగించి పూజించడం వల్ల అయి ఉండవచ్చును. సింధూ నాగరికతలో కనిపించే మాతృదేవతా మూర్తులు వంటివి, దక్షిణ భారతదేశంలోని గ్రామాల్లో కనిపించే స్త్రీ దేవతలుగా పేర్కొనవచ్చును. అటులనే ఈజియన్ సముద్రం నుండి పర్షియా వరకు ఉన్న ప్రాంతంలో కొనసాగిన ప్రాచీన నాగరికతలలో ఈ మాతృదేవతా మూర్తులు కనిపిస్తూనే ఉంటాయి.

AP Inter 1st Year History Study Material Chapter 2 ప్రాచీన నాగరికత – సంస్కృతులు

బి) ముద్రికలు:
1) సింధూ త్రవ్వకాలలో దాదాపు రెండువేలకు పైగా ఈ ముద్రికలు లభించాయి. ముద్రికలపై వివిధ చిత్రాలు కనబడుతున్నాయి. ఒక ముద్రికపై దేవతామూర్తి ముందు ఒక స్త్రీ రోదిస్తూ చెయ్యెత్తి హరిస్తున్నట్లు కనిపిస్తుంది. అటులనే ఎదురుగా ఎత్తిన చేతిలో కొడవలితో ఒక పురుషుడు కనిపిస్తున్నాడు. ఈ బొమ్మలనుబట్టి హరప్పా ప్రజలు బహుశ ‘నరబలి’ ఇచ్చే ఆచారమును కలిగివుండవచ్చునని చరిత్రకారుల అభిప్రాయం.

2) మరొక ముద్రికలో మాతృదేవతామూర్తి గర్భం నుండి జల ప్రవాహం ఉద్భవిస్తున్నట్లు కనిపిస్తుంది. మరొక ముద్రికలో రావిచెట్టు కొమ్మల మధ్య మాతృదేవతామూర్తి, ఎదురుగా మేకను పట్టుకొన్న మనిషి, ఈ బలి – కాండలో పాల్గొంటున్న కొంతమంది మనుషులు మరొక ముద్రికలో కనిపిస్తున్నారు. సింధూ నాగరికత ప్రజలలో ‘నరబలి’ అటులనే ‘జంతుబలి’ మొదలగు ఆచారాలున్నట్లు పేర్కొనవచ్చును. ముఖ్యముగా ముద్రికలలో “రావిచెట్టు” చిత్రీకరణను బట్టి సింధూ ప్రజలు రావిచెట్టును ఆరాధించినట్లు తెలుస్తుంది.

3) మరో ముద్రికలో కొమ్ములున్న శిరోవేష్టం ధరించిన పురుషదేవతామూర్తి కనిపిస్తుంది. వేదికపై ప్రతిష్టితుడై ఉన్న ఈ మూర్తికి మూడు శిరస్సులున్నాయి. వేదిక దిగువన లేడి, ఏనుగు, పులి, మహిషాల ఆకృతులు చిత్రించబడినాయి. ముఖ్యముగా దేవతామూర్తి అర్ధనిమీలిత నేత్రాలతో పద్మాసనంలో ఆసీనుడై ఉన్నాడు. ఈ ముద్రికలోని చిత్రాలను పరిశీలించిన చరిత్రకారులు ‘త్రిముఖాలు కలిగిన పశుపతి”గా, “మహాయోగి” గా శివుని చూపుతుందని పేర్కొనిరి.

4) మరో ముద్రికలో త్రిమూర్తి శిరస్సులో నుంచి ఆకులు-పూలు ఉద్భవిస్తున్నట్లు చిత్రించబడెను. రెండు పార్శ్వ. శిరస్సులు, పార్శ్వభంగిమలో కనిపిస్తున్నాయి. కొమ్ములు శిరోవేష్టం ఉంది. ఇది ఉత్పత్తి సౌరశక్తుల అధిదేవతగా శివుని చూపుతుంది.

5) సింధూ త్రవ్వకాలలో లింగరూపంలో శిలలు బయటపడ్డాయి. అటులనే కొన్ని శివలింగాలు స్నాన ఘట్టంపై ప్రతిష్టించబడినాయి.

6) కొన్ని ముద్రలపై జంతురూపాల సమ్మేళనం చిత్రించబడినది. మానవ దేహంపై వృషభం, శిరస్సు, కొమ్ములున్న పులి (సుమేరియన్ పురాణగాథల్లోని ఎంకిడు) అటులనే కొమ్ములున్న పులితో పోరాడుతున్న యోధుడు (సుమేరియన్ పురాణ గాథల్లోని గిల్గమేష్) ఈ చిత్రాలతో పాటు వృషభం, ఏనుగు, మహిషం, కారెనుముల చిత్రాలు కూడా ముద్రికల్లో చిత్రించబడినాయి. కొన్ని ముద్రల్లో జంతురూపాల ముందు ఆహారపు తొట్లు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి సింధూ ప్రజలు జంతువులను ఆరాధించినట్లు చెప్పవచ్చును.

7) సింధూ ప్రజలు ప్రకృతి దేవతలను ఆరాధించినట్లు పేర్కొనవచ్చును. కొన్ని ముద్రికల్లో చెట్లు, అగ్ని, నీరు కూడా ముద్రించబడి ఉంది.

8) కొన్ని ముద్రికల్లో చక్రం, స్వస్తిక్ చిహ్నరూపాల్లో సూర్యునిమూర్తి చిత్రించబడి ఉంది.

9) సింధూ ప్రజలు నాగపూజ ఆరాధకులని కూడా చెప్పవచ్చును. కొన్ని ముద్రికలలో ‘పడగ విప్పిన నాగసర్పం’ ముందు ఆరాధకులు చిత్రించబడి ఉంది.

10) సింధూ ప్రజలకు మరణానంతర జీవితంపై కూడా నమ్మకము కలదు.

ప్రశ్న 3.
హరప్పా నాగరికత ఏ విధంగా పతనమైందో వివరించండి ?
జవాబు:
క్రీ.పూ. 2300 నుండి క్రీ.పూ. 1750 వరకు ఈ నాగరికత వర్ధిల్లింది. ఈ నాగరికత ఎట్లా అంతర్థానమైందో ఎవ్వరికీ అవగాహన కావటం లేదు. సింధూ నది వరదల కారణంగా ఈ నాగరికత అంతరించిందని కొందరు, ఆర్యుల దండయాత్రల వలన నశించిందని కొందరు, వ్యాధిగ్రస్తులై ప్రజలు మరణించటం వలన పతనమైందని మరికొందరు అభిప్రాయపడ్డారు. అయితే సింధూ నాగరికత పతనానికి అనేకమంది చరిత్రకారులు అనేక కారణాలు పేర్కొన్నారు.

క్రీ.శ. 1953వ సంవత్సరములో సర్ మార్టిమర్ వీలర్ హరప్పా నాగరికత పతనానికి ఆర్యుల దండయాత్రలే కారణం అని పేర్కొన్నాడు. అందుకు మొహంజోదారోలోని వివిధచోట్ల లభ్యమైన వివిధ జాతులకు చెందిన 37 అస్థిపంజరాలను, యుద్ధాలు, కోటలను గురించి వేదాల్లో పేర్కొనడాన్ని ఆధారాలుగా చూపించాడు. అయితే వీలర్ సిద్ధాంతాన్ని తిరస్కరించడం ప్రారంభించారు. అందుకు అస్థిపంజరాలు నగరాలు నాశనం అయిన తరువాత కాలానికి చెందనవనీ, అవి కోటకు సమీపంలో లభించలేదని వారు పేర్కొన్నారు. క్రీ.శ. 1994లో కెన్నెత్ కెన్నడీ చేసిన పరిశోధనలు అస్తి పంజరాలపై ఉన్న గుర్తులు దౌర్జన్యకరమైన యుద్ధాల వల్ల కాకుండా కోతల వల్ల ఏర్పడినవని వెల్లడించాడు. ఈనాడు అనేకమంది చరిత్రకారులు కరువు వల్ల, ఈజిప్ట్, మెసపటోమియాల్లో వ్యాపార సంబంధాలు దెబ్బతినడం వల్ల సింధూ నాగరికత పతనమైనట్లు పేర్కొన్నారు. వీటికి తోడు నూతన వ్యక్తులు వలస రావడం, అడవులు నశించడం, వరదలు, నదులు ప్రవాహ దిశను మార్చుకోవడం వంటి కారణాల వల్ల సింధూ లోయ నాగరికత పతనమైనది.

ప్రశ్న 4.
ఋగ్వేద సంస్కృతిని గురించి రాయండి.
జవాబు:
భారతీయ సంస్కృతిని తీర్చిదిద్ది దానికొక విశిష్ట రూపాన్ని ఇచ్చినవారు ఆర్యులు. వారు వేద సాహిత్యాన్ని రచించడంచేత వారి కాలానికి వేదకాలమని పేరు వచ్చింది. క్రీ.పూ. 2000 నుండి క్రీ.పూ. 500 వరకు వేదకాలమని భావిస్తారు. వేద కాలాన్ని ఋగ్వేద కాలం, మలివేద కాలం అని రెండు కాలాలుగా విభజించారు. ఋగ్వేదకాలం-సంస్కృతి (క్రీ.పూ. 1500 – 900): వైదిక వాఙ్మయంలో మొదట రచించిన గ్రంథాలు వేదాలు. వాటిలో అతిపురాతనమైనది ఋగ్వేదము. భారతదేశంలో ఆర్యులు మొదట రచించిన గ్రంథం ఋగ్వేదము. కనుక ఋగ్వేదం వ్రాయబడిన నాటి వరకుగల కాలాన్ని ఋగ్వేదకాలం అంటారు. ఈ కాలంలో ప్రజల జీవన విధానాన్ని గురించి ఋగ్వేదంలో వివరణ ఉంది.
ఋగ్వేదకాలపు ఆర్యుల భౌగోళిక విస్తరణ ఋగ్వేదంలో సింధు, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లేజ్ నదులను పేర్కొన్నారు. ఈ నదుల ప్రాంతాన్ని సప్తసింధు ప్రాంతం అంటారు. ఋగ్వేదంలో యమున, గంగా నదుల ప్రస్తావన, హిమాలయాల గురించి వివరణ కూడా ఉంది. దీనిని బట్టి ఋగ్వేద ఆర్యులు సప్తసింధూ ప్రాంతంలోను, గంగా, యమున తీరప్రాంతాల్లోను స్థిరపడినట్లు తెలుస్తున్నది.

AP Inter 1st Year History Study Material Chapter 2 ప్రాచీన నాగరికత – సంస్కృతులు

రాజకీయ పరిస్థితులు: ఆర్యులు ఒకే జాతికి చెందినవారే అయినప్పటికి వారిలో అనేక తెగలున్నాయి. ఈ తెగల్లో భరత, మత్స్య, తుర్వస, యదు అనేవి ముఖ్యమైనవి. ఈ తెగల్లో భరతుల తెగ ప్రధానమైనందున భారతదేశంగా ఈ దేశానికి నామకరణం జరిగింది. ఈ కాలంలో రాజ్యానికి రాజే సర్వాధికారి. రాచరికం వంశపారంపర్యంగా సంక్రమించేది. గణతంత్ర రాజ్యాల్లో అధిపతులను ప్రజలే ఎన్నుకొనేవారు. శత్రువుల నుంచి రాజ్యరక్షణ, ప్రజలకు రక్షణ మొదలైనవి రాజు ముఖ్య విధులు. ప్రజల ఆస్తిని సంరక్షించటం కూడా రాజు యొక్క విధి. ఇందుకు ప్రతిఫలంగా ప్రజలు రాజుకు బహుమతులిచ్చేవారు. సేనాని, పురోహితుడు వంటి అధికారుల సహాయంతో రాజు పరిపాలన సాగించేవాడు. పరిపాలనా వ్యవహారాల్లో సభ, సమితి అనే పౌరసభలు రాజుకు సహాయపడేవి. ఈ కాలంలో శిక్షలు కఠినంగా ఉండేవి. పరిపాలనా పునాది గ్రామము. గ్రామాలు స్వయంపోషకాలు. కొన్ని సందర్భాలలో రక్షణ కోసం గ్రామం చుట్టూ ప్రాకారాన్ని నిర్మించేవారు. ఋగ్వేదార్యులు అనార్యులతోను, వారిలో వారు యుద్ధాలు చేసేవారు. విల్లంబులు, కత్తులు, శూలాలు, ఈటెలు, గండ్రగొడ్డళ్ళు వంటి ఆయుధాలను, గుర్రాలను పూన్చిన రథాలను యుద్ధంలో వాడేవారు.

ఆర్థిక పరిస్థితులు: ఋగ్వేదకాలం నాటి ఆర్యులు గ్రామీణ జీవితాన్ని గడిపారు. పశుపాలన, వ్యవసాయం వారి ప్రధాన వృత్తులు. వారు అడవులను నరకటం ద్వారా క్రొత్త భూమిని సాగులోకి తీసుకొని వచ్చి వ్యవసాయాన్ని పెంపొందించారు. వరి, గోధుమ, బార్లీ, నువ్వులు నాటి ప్రజల ముఖ్యమైన పంటలు. పశుసంపదను వీరు ప్రాణప్రదంగా భావించేవారు. వర్తకంలో వస్తుమార్పిడి పద్ధతి అమలులో ఉండేది. “నిష్కమణ” అనే ఆభరణాన్ని నాణెంగా ఉపయోగించేవారు. సరుకు రవాణాకు గుర్రాలను, ఎడ్లను, రథాలను ఉపయోగించేవారు.

సాంఘిక పరిస్థితులు: ఋగ్వేద ఆర్యులు ఉమ్మడి కుటుంబాలలో జీవించేవారు. కుటుంబానికి పెద్ద తండ్రి. తండ్రిని ‘గృహపతి’ లేక ‘దంపతి’ అని పిలిచేవారు. సమాజంలో స్త్రీలకు గౌరవప్రదమైన స్థానం ఉంది. వారు సభ, సమితి సమావేశాల్లో పాల్గొనేవారు. తమ భర్తలతో పాటు యజ్ఞయాగాదుల్లో కూడా పాల్గొనేవారు. సంపన్న కుటుంబాలలో బహుభార్యత్వం ఉండేది. బాల్యవివాహాలు లేవు. వృత్తుల ఆధారంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అను నాలుగు వర్ణాలేర్పడ్డాయి. శూద్రులకు సంఘంలో అట్టడుగు స్థానాన్ని ఇచ్చారు. ఋగ్వేద ఆర్యులు బియ్యం, బార్లీ, పాలు, పెరుగు, వెన్న, కూరగాయలు, పళ్ళు, మాంసం మొదలైన వాటిని ఆహారంగా తీసుకొనేవారు. సోమ, సుర అనే మత్తు పానీయాలను సేవించేవారు. ఉన్ని, నూలు, చర్మసంబంధమైన వస్త్రాలను ధరించేవారు. స్త్రీ, పురుషులిరువురు ఆభరణాలను ధరించేవారు. గుర్రపు పందాలు, రథాల పందాలు, చదరంగం, సంగీతం వారి ముఖ్య వినోదాలు.

మత పరిస్థితులు: ఋగ్వేద ఆర్యులు ప్రకృతి శక్తులను ఆరాధించేవారు. వారు తమ దైవాలను స్వర్గ దైవాలు, అంతరిక్ష దైవాలు, భూదైవాలు అను మూడు రకాలుగా వర్గీకరించారు. ద్యుస్ (ఆకాశం), ఇంద్రుడు, వరుణుడు, వాయువు, అగ్ని, సోమ వంటి పురుషదేవతలనే కాక అదితి, పృథ్వి వంటి స్త్రీ మూర్తులను కూడా వారు ఆరాధించారు. దైవాలకు ఆగ్రహానుగ్రహాలు ఉంటాయని ప్రజలు నమ్మేవారు. ప్రార్థనలు, యజ్ఞాలు, యాగాలు ఋగ్వేద ఆర్యుల పూజా విధానంలో ముఖ్యమైన అంశాలు. యజ్ఞాల్లో పాలు, ధాన్యం, నెయ్యి వంటి పదార్థాలతో పాటు సోమరసాన్ని కూడా దేవతలకు నైవేద్యంగా సమర్పించేవారు. అయితే ఈ కాలంలో ఏ దైవం కూడా ప్రత్యేక ప్రాధాన్యతను పొందలేదు. “దేవతామూర్తులందరూ ఒక్కటే. వారిని వర్ణించే విధానం వేరు” అనే విషయాన్ని ఆర్యులు నమ్మేవారు. ఈ కాలంలో దేవాలయాలు లేవు. విగ్రహారాధన లేదు. పశుగణాభివృద్ధి, సంతానాభివృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ఈ పూజల లక్ష్యాలని తెలుస్తున్నది.

ప్రశ్న 5.
మలివేద కాలంనాటి సాంఘిక, ఆర్థిక వ్యవస్థలను గురించి రాయండి.
జవాబు:
ఋగ్వేదానంతర కాలంలో ఆర్యులు తూర్పు, దక్షిణ దిశల్లో విస్తరించసాగారు. ఈ కారణంగా తెగల మధ్య పోరాటం తప్పలేదు. ఫలితంగా బలవంతుల తెగకు బలహీనమైన తెగలు లొంగిపోయి ఆ తెగలతో కలిసిపోయేవి. అలా కొన్ని తెగలు అంతరించి, కొత్త తెగలు ఏర్పడ్డాయి. పురు, భరత తెగలు కలసిపోయి ‘కురుతెగ’ ఏర్పడింది. వారి యొక్క సాంఘిక, ఆర్థిక పరిస్థితులు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

సామాజిక వ్యవస్థ: కుల వ్యవస్థ నిర్దిష్టమైంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే నాలుగు కులాలు లేదా వర్ణాలుగా సమాజ విభజన జరిగింది. బ్రాహ్మణులు యజ్ఞయాగాదుల నిర్వహణను, దేవతారాధనను, అధ్యయనాన్ని చేపట్టేవారు. దేశ రక్షణ, రాజ్యపాలన, క్షత్రియుల విధి. వ్యవసాయం, పశుపోషణ, వ్యాపారాలను వైశ్యులు నిర్వహించేవారు.
మూడు కులాల వారిని సేవించేవారు, వారికి సహాయపడేవారు శూద్రులు. క్రమంగా వృత్తులు వంశపారంపర్యమయ్యాయి. వృత్తి మార్పిడి జరగలేదు. వర్ణవ్యవస్థ దృఢమైంది. ఆశ్రమ ధర్మాలు కూడా ప్రవేశించాయి. స్త్రీకి గౌరవం తగ్గింది. వివాహాలకు కఠిన నిబంధనలు విధించారు. విద్యావకాశాలు అగ్రవర్ణాల వారికే పరిమితమయ్యాయి.

మతం: ఈ యుగంలో మతం సంక్లిష్టంగా తయారైంది. అగ్ని, ఇంద్రుడు వంటి దేవతలకు ప్రాధాన్యత తగ్గింది. విష్ణువు, రుద్రుడు వంటి దైవాల పట్ల భక్తి పెరిగింది. సృష్టికర్తగా ప్రజాపతి స్థానం పెరిగింది. పశుపోషణ తగ్గడంతో, పశుసంరక్షకుడు “పుషాన్” దేవుడి ఆరాధన తగ్గింది. కర్మకాండలకు, యజ్ఞయాగాదులకు ప్రాముఖ్యత పెరిగింది. ఖర్చుతో కూడుకున్నందువల్ల యజ్ఞయాగాదులు సామాన్య ప్రజలకు అందుబాటులో లేవు. భూత, ప్రేతాల్లో నమ్మకాలు బలపడసాగాయి. జంతుబలులు పెరిగాయి. యజ్ఞయాగాదుల్లో బ్రాహ్మణులకు గోవులు, బంగారం, అశ్వాలు, వస్త్రాలను “దక్షిణ”గా సమర్పించేవారు. ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఉపనిషత్తుల తత్వజ్ఞానం సామాన్యునికి అందుబాటులో లేకుండా పోయింది. ఈ యుగాలలో షడ్ దర్శనాలు ఆవిర్భవించాయి.

ఆర్థికవ్యవస్థ: రాజ్యం విస్తరించడంతో కొత్త భూములు సాగులోకి వచ్చి వ్యవసాయం విస్తృతమైంది. వ్యవసాయాభివృద్ధి వర్తకానికి దోహదపడింది. జనాభా పెరిగింది. పరిశ్రమలు, చేతిపనుల వృత్తులు అభివృద్ధి చెందాయి. పరిశ్రమలు, వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెందడంతో పట్టణాలేర్పడ్డాయి. తక్షశిల, హస్తినాపురం, కౌశాంబి, వైశాలి, కాంపిల్య, శ్రావస్తి, వారణాసి పట్టణాలు ఇందుకు ఉదాహరణలు. వస్తు మార్పిడి బదులు శతమానం, కర్షపణ నాణేల వాడకం మొదలైంది. వ్యాపారాభివృద్ధికి అడ్డంకులు పోయాయి. బంగారం, వెండి, రాగి లోహాలతో నాణేలు తయారయ్యాయి. ఐశ్వర్యం అభివృద్ధి చెందడంతో పశుపోషణ తగ్గింది.

ప్రశ్న 6.
ఆశ్రమ విధానం గురించి రాయండి.
జవాబు:
మలివేద కాలంలో ఆశ్రమ ధర్మాలు ఏర్పడ్డాయి. ఇవి నాలుగు. వీటినే చతురాశ్రమ ధర్మాలు లేదా ఆశ్రమ ధర్మాలు అంటారు.
1. బ్రహ్మచర్యం: సాత్వికాహారం తింటూ గురుకులంలో విద్యనభ్యసిస్తూ, గురువుకు తగిన సేవ చేయాలి.

2. గృహస్థాశ్రమం: విద్యాభ్యాసము పూర్తి అయిన తదుపరి యుక్త వయస్సు రాగానే వివాహితుడై గృహస్థు ధర్మాలు పాటించి, సంతానవంతుడై వంశాన్ని నిలపాలి.

3. వృద్ధాప్యం: వృద్ధాప్యంలో భగవంతుని ధ్యానము, దానధర్మాలు చేయుట, తీర్థయాత్రలు చేయుట, ముక్తికి మార్గాలను అన్వేషించుట మొదలగు కార్యక్రమాలు చేపట్టాలి.

4. వానప్రస్థం: జీవిత అంతిమ కాలంలో అడవికి వెళ్ళి తపోమార్గంను అనుసరించి, భౌతిక వాంఛలకు, ఐహిక బంధాలకు లోను కాకుండా జీవనం గడపాలి.

జైన, బౌద్ధ మతములలోని సన్యాసి సంప్రదాయానికి దగ్గరగా ఆర్యులు ఆశ్రమ ధర్మాలను చేపట్టారని కొందరి అభిప్రాయం.

AP Inter 1st Year History Study Material Chapter 2 ప్రాచీన నాగరికత – సంస్కృతులు

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మహా స్నానవాటిక
జవాబు:
మొహంజొదారో నగరంలో గల పౌర నిర్మాణాలలో చెప్పుకోదగినది మహాస్నానవాటిక. దీని మధ్య పెద్ద కొలను ఉన్నది. ఈ కొలనులో ఉత్తర, దక్షిణ దిశలలో పెద్ద మెట్లను నిర్మించారు. ఈ కొలనులోకి నీళ్ళు రావడానికి సదుపాయం కూడా ఉంది. మరో మార్గం నుంచి వేడినీటిని లోపలికి పంపేందుకు ఏర్పాట్లున్నాయి. దీని అడుగుభాగాన్ని ఇటుకలతోను, జిప్సంతోను నిర్మించారు. దీనిలో ఈత పందాలు నిర్వహించి ఉండవచ్చు.

ప్రశ్న 2.
ముద్రికలు
జవాబు:
హరప్పా ప్రజలు వివిధ రకాలైన ముద్రికలను వాడేవారు. సుమారు రెండువేల ముద్రికలు వివిధ ప్రాంతాల్లో తవ్వకాల్లో లభించాయి. ఈ ముద్రికలపై వివిధ రకాల జంతువుల బొమ్మలతో పాటు హరప్పా లిపి గుర్తులు కూడా ఉన్నాయి. కొమ్ములున్న శిరోవేష్ఠనం ధరించిన పురుష దేవత ఉన్న ఒక ముద్రిక ప్రధానమైనది.

ప్రశ్న 3.
వేదాలు
జవాబు:
‘వేద’ అనే పదం ‘జ్ఞానం’ అని అర్థం ఇచ్చే ‘విద్’ నుంచి ఆవిర్భవించింది. మరోరకంగా ‘వేదం’ అనే పదానికి గొప్ప జ్ఞానం అని అర్థం చెప్పబడింది. వేదాలు నాలుగు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. వీటిలో 1028 మంత్రాలు ఉన్న ఋగ్వేదం ప్రాచీనమైన వేదం. ఈ మంత్రాలన్నీ వివిధ దేవతలను స్తుతిస్తున్న మంత్రాలే. యజ్ఞయాగాది క్రతువుల్లో ఉచ్ఛరించే మంత్రాలు యజుర్వేదంలో ఉన్నాయి. సామవేదం భారతీయ సంగీతానికి మూలమైంది. అధర్వణ వేదంలో మంత్రతంత్రాలు ఉన్నాయి. వేదాలతో పాటు బ్రహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వంటివి ఉన్నాయి.

ప్రశ్న 4.
దర్శనాలు
జవాబు:
ఆరు విధాలైన దర్శనాలు ఉన్నాయి. వీటిని ‘షడ్దర్శనాలు’ అని అంటారు. న్యాయం, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వ ఉత్తర మీమాంస అనేవి షడ్దర్శనాలు. ఇవన్నీ అంతర్గత జీవన విధానాన్ని వివరించి బహిర్గత కర్మలను వ్యతిరేకించాయి. న్యాయ దర్శనాన్ని గౌతమ, వైశేషిక దర్శనాన్ని కన్నడుఋషి, సాంఖ్య దర్శనాన్ని కపిలుడు, యోగధర్శనాన్ని పతంజలి, పూర్వ మీమాంసను జైమిని, ఉత్తర మీమాంసను బాధరాయణుడు రచించారు.

ప్రశ్న 5.
సభ, సమితి
జవాబు:
వేదకాలంనాటి ఆర్యులు రాజ్యాలవలె కాకుండా తెగలుగా ఏర్పడ్డారు. తెగ నాయకున్ని ‘రాజన్’ అని పిలిచేవారు. రాజు స్వేచ్ఛను సభ, సమితి అనే ప్రజాసభలు అడ్డుకొనేవి. సభ అనుమతి లేనిదే రాజన్ అధికారాన్ని స్వీకరించే వీలులేదు. సభలో తెగలోని ఉన్నత వర్గాలవారు సభ్యులు కాగా, సమితిలో సామాన్య ప్రజలు సభ్యులుగా ఉండేవారు.

AP Inter 1st Year History Study Material Chapter 2 ప్రాచీన నాగరికత – సంస్కృతులు

ప్రశ్న 6.
కుల వ్యవస్థ
జవాబు:
మలివేద కాలంలో కులవ్యవస్థ పటిష్టమైంది. సమాజంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు కులాలుగా విభజింపబడింది. యజ్ఞయాగాలు, పూజా సంస్కారాలు, కర్మకాండలు చేయడం బ్రాహ్మణుల ప్రధాన వృత్తి. రెండవ వారు క్షత్రియులు యోధ ధర్మాన్ని నిర్వహించేవారు. మూడవ స్థానాన్ని పొందిన వైశ్యులు వ్యాపారం చేసేవారు. నాలుగు కులాల్లో శూద్రులు తక్కువవారుగా గుర్తింపు పొందారు.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 6th Lesson దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 6th Lesson దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
క్రీ.శ. 8వ శతాబ్దం వరకు గల దక్కన్ చరిత్రను అధ్యయనం చేయడానికి సహకరించే ముఖ్య ఆధారాలను చర్చించండి.
జవాబు:
దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్రను అధ్యయనం చేసేందుకు అనేక సాహిత్య ఆధారాలతోపాటు శాసనాలు దోహదపడుతున్నాయి సంగం యుగంలోని తమిళ రచనల్లో తోలకప్పియార్ రచించిన ‘తోలకప్పియం’ అనే వ్యాకరణ గ్రంథం సంగం యుగం నాటి సామాజిక, సాంస్కృతిక స్థితులను గురించి విలువైన సమాచారం అందిస్తోంది. ప్రసిద్ధ తమిళ రచయిత తిరువళ్ళువార్ రచించిన ‘తిరుక్కురల్’ తమిళ దేశానికి బైబిల్ వంటిది. ఈ రచన ఆ కాలం నాటి సాంఘిక జీవనం, నైతిక విలువలకు అద్దం పడుతుంది.

శాతవాహనుల కాలంనాటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులకు మత్స్య, వాయు, విష్ణు, బ్రహ్మ పురాణాలు, గుణాడ్యుడి బృహత్కథ, హాలుడి గాథా సప్తసతి, వాత్సాయనుడి కామసూత్రాలు, మెగస్తనీస్ ఇండికా పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీలతోపాటు ప్లినీ, టాలేమీ రచనలు అద్దం పడుతున్నాయి. మొదటి మహేంద్రవర్మ ‘మత్తవిలాసప్రహసనం’ అనే గొప్ప కావ్యాన్ని రచించాడు. భారవి ‘కిరాతార్జునీయం’ దండిన్ ‘దక్షకుమార చరిత్ర’ అనే గ్రంథాలు తమిళ ప్రజల సాంఘిక, మత, జీవనానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించాయి. చైనా యాత్రికుడు హుయానా త్సాంగ్ రచనలు పల్లవ, చాళుక్య యుగాలకు చెందిన విలువైన చారిత్రక విషయాలను వెల్లడించాయి.

శాసనాలు కూడా దక్షిణ భారతదేశ పాలకులకు సంబంధించిన విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. శాతవాహనుల శాసనాలు నాసిక్, కార్లే, బెడ్స, అమరావతి, ధరణీకోట, నానాఘాట్, కొండాపూర్, పైథాన్, భట్టిప్రోలు, నాగార్జున కొండల్లో లభించాయి. వీటిలో శాతవాహనుల సాంఘిక, ఆర్థిక, రాజకీయ, మత విషయాలు వివరించబడ్డాయి.

చాళుక్యుల శాసనాల్లో బాదామి చాళుక్యుల ఐహోలు శాసనం రెండవ పులకేశి హర్షవర్ధనుడిపై సాధించిన విజయాన్ని వివరిస్తుంది. ఈ శాసనాలతో పాటు నాణాలు కూడా దక్షిణ భారతదేశ చరిత్ర అధ్యయనానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ప్రశ్న 2.
సంగం యుగంలోని ప్రధాన అంశాలను వివరించండి.
జవాబు:
సంగం యుగంలో ఈ క్రింది అంశాలు కలవు. అవి.
రాజకీయ వ్యవస్థ: నాడు నిరంకుశ రాజరికపు వ్యవస్థ అమల్లో వుంది. రాజుకు సర్వాధికారాలు ఉండేవి. సభ అనే ప్రజాసభ పరిపాలన, న్యాయ వ్యవహారాల్లో రాజుకు సలహాలను ఇచ్చేది. గ్రామపాలనను గ్రామ సంఘాలు నిర్వహించేవి. చతురంగ బలాలతో పాటు రాజు నౌకాదళాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. యుద్ధంలో పాల్గొనడం, యుద్ధంలో వీరమరణం పొందడం గౌరవప్రదమైందిగా భావించేవారు.

సాంఘిక,ఆర్థిక, మతజీవనం: చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉండేది. వనం, వరైని, తుడియం, కడంబన్ అనేవి చతుర్వర్ణాలు. అయితే వర్ణ వ్యవస్థ నిరంకుశంగా ఉండేది కాదు. సమాజంలో బ్రాహ్మణులు గౌరవప్రదమైన స్థానాన్ని అనుభవించేవారు. వ్యాపారులు, సంపన్నులు సుఖమయమైన జీవితాన్ని గడిపారు. బానిస వ్యవస్థ అమలులో ఉన్నట్లు
ఆధారాలున్నాయి.

వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తి, పశుపోషణ, కుండల తయారి, నేతపని వంటి వృత్తులు కూడా ఉండేవి. ప్రజల ఆర్థిక జీవనాన్ని శ్రేణులు క్రమబద్ధీకరించేవి. శ్రామికులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళే పద్ధతి అమలులో వుంది.

ప్రజల మత జీవనంలో వైదిక పద్ధతి, తమిళ సంప్రదాయం మిళితమై కనిపిస్తాయి. ప్రాచీన తమిళులు ప్రకృతి శక్తులు, సర్పాలు, వివిధ పిశాచాలను ఆరాధించేవారు. దేవతలకు యజ్ఞయాగాలను సమర్పించారు. దేవాలయ పూజా విధానంలో సంగీత, నృత్యాలు భాగంగా ఉండేవి. నాడు ప్రజలు శైవమతాన్ని అధికంగా అవలంబించారు. శివుడు, సుబ్రహ్మణ్యస్వామి ప్రధాన దేవతలు.

సాహిత్యం: సంగం యుగంలో తమిళ సాహిత్య చరిత్ర ప్రారంభమైంది. ‘తోలకప్పియం’ అనే వ్యాకరణ గ్రంథాన్ని ‘తోలకప్పియార్’ రచించాడు. ‘కురల్’ అనే ప్రసిద్ధ కావ్యాన్ని తిరువళ్ళువార్ రచించాడు. నైతిక విలువలతో కూడిన ఈ కావ్యం తమిళుల జీవితాల్లో ప్రధాన పాత్ర పోషించింది. జైన, బౌద్ధ కవులు, రచయితలు కూడా సంగం సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు.

ప్రశ్న 3.
గౌతమీపుత్ర శాతకర్ణి గొప్పతనాన్ని అంచనా వేయండి.
జవాబు:
శాతవాహన పాలకులలో గౌతమీపుత్ర శాతకర్ణి (క్రీ.శ. 78-102) 23వ వాడు. ఇతని తల్లి గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం వలన ఇతని ఘనతను తెలుసుకోవచ్చు. ఈ శాసనం వలన ఇతడు శక, యవన, పహ్లవ, క్షహరాట వంశాలను నాశనం చేశాడని, శాతవాహన వంశ ప్రతిష్టను పునరుద్ధరించాడని తెలుస్తున్నది. గౌతమీ బాలశ్రీ మరొక నాసిక్ శాసనంలో తాను గొప్ప చక్రవర్తికి తల్లినని, మరొక రాజుకు “మహారాజ పితామహి”నని చెప్పుకుంది. దీనిని బట్టి శాతకర్ణి గొప్ప యుద్ధవీరుడని తెలుస్తున్నది. ఇతడు అనేక క్షత్రియ రాజవంశాలను జయించి “క్షత్రియ దర్పమానమర్ధన” అనే బిరుదు ధరించాడు. మూడు సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించి “త్రిసముద్రతోయ పీతవాహన” అను బిరుదును ధరించాడు. మహారాష్ట్ర, ఉత్తర కొంకణ, సౌరాష్ట్ర, మాళవ, విదర్భ రాజ్యాలు ఇతని ఆధీనంలో ఉన్నాయి. నాసిక్ శాసనాల వలన గౌతమీపుత్ర శాతకర్ణి ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని న్యాయబద్ధంగా పన్నులు విధించేవాడని, పేదవారికి, బ్రాహ్మణులకు భూదానాలు చేసేవాడని తెలుస్తున్నది. ఈ శాసనాలే గౌతమీపుత్ర శాతకర్ణికి వర్ణవ్యవస్థ మీద ప్రగాఢమైన నమ్మకముందని, బ్రాహ్మణ కులాన్ని వర్ణసంకరం కాకుండా రక్షించాడని, “ఏకబ్రాహ్మణుడు” అనే బిరుదు ధరించాడని పేర్కొన్నాయి. ఇతడికి ఉన్న “ఆగమనిలయ” అను బిరుదు వల్ల ఇతనికి ఆగమశాస్త్రాలపై అవగాహన ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ కారణాల వలన గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహనుల్లో గొప్పవాడని చెప్పవచ్చు.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ప్రశ్న 4.
పల్లవ పాలకులైన మహేంద్రవర్మ, మొదటి నరసింహ వర్మ సాధించిన విజయాలను చర్చించండి.
జవాబు:
మొదటి మహేంద్రవర్మ (క్రీ.శ. 600-630): ఇతను సింహవిష్ణువు కుమారుడు. గొప్ప యోధుడు. ఇతను ఉత్తరాన కృష్ణానది వరకు తన అధికారాన్ని విస్తరింపచేశాడు. ఇతని కాలంలోనే పల్లవులకు చాళుక్యులకు మధ్య స్పర్థ ఆరంభమైంది. క్రీ.శ. 630లో చాళుక్య రాజైన రెండోపులకేశి పల్లవ రాజ్యం మీద దండెత్తి, పుల్లలూరు యుద్ధంలో మహేంద్రవర్మను ఓడించాడు. యుద్ధం తర్వాత కొద్ది కాలానికే మహేంద్రవర్మ మరణించాడు. మహేంద్రవర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇతను మొదట జైనమతస్థుడైనప్పటికీ తర్వాత అప్పార్ బోధనలవల్ల శైవమతస్థుడయ్యాడు. ఇతను కవి. ‘మత్త విలాస ప్రహసన’మనే నాటకాన్ని రచించాడు. సంగీతంలో ఆసక్తి, ప్రవేశమూ ఉన్నవాడు. వాస్తు, శిల్ప, చిత్ర లేఖనాలను పోషించాడు. ఇన్ని విశిష్ట గుణాలున్నవాడవటం వల్ల ఇతను ‘చిత్రకారపులి’ అని, ‘విచిత్రచిత్తుడ’నే ప్రశంసనందుకొన్నాడు.

మొదటి నరసింహవర్మ (క్రీ.శ. 630-668): ఇతను మహేంద్రవర్మ కుమారుడు. పల్లవ రాజులందరిలోనూ అగ్రగణ్యుడు. సింహాసనమెక్కిన వెంటనే నరసింహవర్మ చాళుక్యుల దండయాత్రను ఎదుర్కోవలసి వచ్చింది. క్రీ.శ. 641లో రెండో పులకేశి పల్లవ రాజ్యంపైకి దండెత్తినప్పుడు పల్లవసేనలు అతణ్ణి ఓడించి తరమడమేకాక నరసింహవర్మ నాయకత్వంలో బాదామి వరకు నడిచి పులకేశిని వధించి బాదామిని దోచుకొన్నాయి. తర్వాత చోళ, పాండ్య ప్రభువులు నరసింహవర్మకు సామంతులయ్యారు. ఈ విజయాలకు నిదర్శనంగా నరసింహవర్మ ‘వాతాపికొండ’, ‘మహామల్ల’ బిరుదులను ధరించాడు.

నరసింహవర్మ కూడా తండ్రి మహేంద్రవర్మలాగా సారస్వతాన్నీ, వాస్తు, లలిత కళలనూ పోషించాడు. ఇతను మహామల్లపురం (మహాబలిపురం)లో ఏకశిలా రథాలనే దేవాలయాలను నిర్మింపచేశాడు. సంస్కృతంలో ‘కిరాతార్జునీయం’ అనే కావ్యాన్ని రచించిన భారవి కవిని ఇతను ఆదరించినట్లుగా తెలుస్తున్నది. నరసింహవర్మ కాలంలోనే హుయాన్ త్సాంగ్ అనే చైనా యాత్రికుడు కాంచీపురాన్ని దర్శించాడు. పల్లవుల రాజ్యాన్ని తమిళ దేశంగా వర్ణిస్తూ ఇక్కడి ప్రజలు నీతిపరులని, సత్యప్రియులని, శ్రమజీవులని, వీరికి విద్యావ్యాసాంగాలలో శ్రద్ధాసక్తులు అధికమని చెప్పాడు. కాంచీపురంలో దాదాపు 100 బౌద్ధారామాలు, 80 దేవాలయాలు ఉన్నట్లుగా కూడా ఇతను తెలిపాడు. నలందా విశ్వవిద్యాలయానికి ఆచార్యుడైన ధర్మపాలుడి జన్మస్థలం కాంచీపురమని ఇతను రాశాడు.

ప్రశ్న 5.
పల్లవయుగంలోని రాజకీయ, సామాజిక ప్రధాన అంశాలను వివరించండి.
జవాబు:
పల్లవుల రాజకీయ వ్యవస్థ: పల్లవులు దక్షిణ భారతదేశంలో సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు. భారతదేశ సాంస్కృతిక చరిత్రలో పల్లవయుగం గొప్పదశ. భారతదేశ సాంస్కృతిక ఐక్యత వీరి కాలంలో జరిగింది. పల్లవులు సంప్రదాయ నిరంకుశ రాజరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. పరిపాలనా వ్యవస్థకు రాజే ప్రధాన సూత్రధారి. రాజుకు సర్వాధికారాలు ఉండేవి. అయినా నిరంకుశుడు కాదు. ధర్మాన్ని రక్షిస్తూ ఉండేవాడు. దైనందిన పరిపాలనలో రాజుకు అనేకమంది అధికారులు సహకరించేవారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రాలు, కొట్టాలు, గ్రామాలుగా విభజించారు. భూమిశిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయం. దీనికి తోడు వాణిజ్య పన్నులు, వస్తువులపై పన్నుల ద్వారా ఆదాయం లభించేది.

మతాభివృద్ధి: పల్లవులు వైదిక మతాభిమానులు. వీరిలో చాలామంది శైవులు. రాజసింహుడు వంటి కొంతమంది వైష్ణవ మతాభిమానులుండేవారు. శైవులను నాయనార్లని పిలిచేవారు. వీరిలో ‘అప్పార్’, ‘సంబంధార్’, ‘సుందరమూర్తి’, ‘మాళిక్కవాళగర్’ మొదలైనవారు శైవమత వ్యాప్తికి ఈ యుగంలో అంకితమయ్యారు. విప్రనారాయణ, తిరుమంగై మొదలైన ఆళ్వారులు వైష్ణవమత వ్యాప్తికి అంకితమయ్యారు. పల్లవ యుగంలో తిరుపతి, శ్రీరంగం మొదలైన వైష్ణవ క్షేత్రాలు భక్తులను ఆకర్షించాయి. జైన, బౌద్ధమతాలు కూడా ఈ యుగంలో విలసిల్లాయి. కాంచీపురంలో 180 బౌద్ధారామాలున్నట్లు హుయాన్ త్సాంగ్ రాశాడు. అయితే శైవమతం, వైష్ణవమతాల వ్యాప్తితో జైన, బౌద్ధమతాలు కొంతవరకు క్షీణించాయి.

విద్యాసారస్వతాల ప్రగతి: ప్రాచీన పల్లవుల కాలంలో సంస్కృతం రాజభాష అయింది. నవీన పల్లవులు తమ శాసనాలన్నిటినీ సంస్కృతంలోనే వేయించారు. వీరు ఘటికలను స్థాపించి, సంస్కృతాన్ని, వైదిక విద్యలను పోషించారు. ఈ ఘటికల్లో చతుర్విద విద్యలు అంటే అన్వీక్షకి (Philosophy), త్రయీ (Three vedas), వార్తా (Economics), దండనీతి (Politics) బోధించేవారు. కాంచీపుర ఘటికా స్థానం, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి వహించి, దూర ప్రాంతాల నుంచి విద్యార్థులను ఆకర్షించింది. సంస్కృత కవులైన భారవి, దండి వీరి కాలం వారే. విద్యలతోబాటు, తమిళదేశంలో నాట్య సంగీతాల్లో కూడా విశేషమైన కృషి జరిగింది. ఆనాటి వాఙ్మయంలో మృదంగం, యాళి, విరళి మొదలైన వాయిద్యాల పేర్లున్నాయి.

వాస్తు శిల్పాల్లో పల్లవుల కృషి: దక్షిణ భారతదేశంలో వాస్తు చరిత్ర పల్లవుల కాలంలోనే ప్రారంభమైందని విన్సెట్ స్మిత్ అభిప్రాయం. మనోహరమైన భారతీయ శిల్పరీతుల్లో పల్లవశైలి ఒకటి. వీరి కాలంనాటి శిల్పాలు, నిర్మాణాలు అపురూప కళాఖండాలు. ముఖ్యంగా కొండను తొలిచి ఆలయాలను నిర్మించే అద్భుతమైన కొత్త పద్ధతిని, మహేంద్రవర్మ తమిళ దేశంలో ప్రవేశపెట్టాడు. ఇదే పద్ధతిలో నరసింహవర్మ మహామల్లవరం (మహాబలిపురం)లో పంచపాండవుల రథాలను తొలిపించాడు. రాజసింహుడు మహాబలిపురంలో తీరదేవాలయాన్ని, కాంచీపురంలో కైలాసనాథ ఆలయాన్ని నిర్మించాడు. పల్లవుల వాస్తు ప్రత్యేకత కైలాసనాథ ఆలయంలో ప్రతిబింబిస్తుంది. శిల్పాల్లో మహామల్లపురంలో ఉన్న ”గంగావతరణ’ శిల్పం విదేశీ కళావిమర్శకుల ప్రశంసలందుకున్నది.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ప్రశ్న 6.
రెండవ పులకేశి గొప్పతనాన్ని అంచనా వేయండి.
జవాబు:
రెండోపులకేశి (క్రీ.శ. 609-642): రెండో పులకేశి బాదామి చాళుక్యుల్లోనే గాక ప్రసిద్ధ భారతీయ చక్రవర్తుల్లో ఒకడు. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత దక్షిణాపథాన్ని పూర్తిగా జయించి ఏలిన మొదటి సార్వభౌముడు రెండో పులకేశి. ఇతని విజయాలను రవికీర్తి అనే జైన పండితుడు ‘ఐహోలు’ (ఐహోళి) శాసనంలో వివరించాడు. అధికారాన్ని సుస్థిరం చేసుకున్న తర్వాత, రెండో పులకేశి దిగ్విజయ యాత్రలు సాగించాడు. ఇతడు బనవాసి, కొంకణ రాజ్యాలను జయించాడు. లాట, మాళవ, అళుప (ఉడిపి మండలం), ఘూర్జర ప్రభువులనణచి సామంతులుగా చేసుకున్నాడు. దక్షిణ కోసల, కళింగ రాజ్యాల మీద దండయాత్రలను నిర్వహించాడు. పిష్ఠపురం, కునాల (కొల్లేరు) యుద్ధాల్లో విజయాన్ని సాధించి వేంగిని ఆక్రమించాడు. అనంతరం తన తమ్ముడైన కుబ్జవిష్ణువర్ధనుణ్ణి ఈ ప్రాంతానికి రాజుగా నియమించాడు. పులకేశి మరణం తర్వాత, వేంగీ పాలకులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని, తూర్పు చాళుక్యులు లేదా వేంగీ చాళుక్యులుగా ప్రసిద్ధి గాంచారు. తర్వాత ఇతడు చేర, చోళ, పాండ్యరాజుల మైత్రిని సంపాదించి, పల్లవ రాజ్యంపై దండెత్తి, మహేంద్రవర్మను పుల్లలూరు యుద్ధంలో ఓడించాడు. చాళుక్య, పల్లవ రాజ్యాల మధ్య సంఘర్షణకు ఇది నాంది. పులకేశి విజయాలన్నిటిలో ఘనమైంది హర్షవర్ధనుణ్ణి ఓడించడం. ‘సకల ఉత్తరాపథేశ్వరుడైన, హర్షవర్ధనుడు దక్షిణాపథాన్ని జయించాలని దండెత్తి వచ్చినప్పుడు పులకేశి అతణ్ణి నర్మదానది ఒడ్డున ఓడించి ‘పరమేశ్వర’ బిరుదును స్వీకరించాడు.

ఈ విజయ పరంపరలతో పులకేశి కీర్తి ప్రతిష్ఠలు దిగంతాలకు వ్యాపించాయి. పారశీక చక్రవర్తి రెండో ఖుస్రూ పులకేశి శక్తి సామర్థ్యాలను గురించి విని అతనితో దౌత్య సంబంధాలను నెలకొల్పుకున్నాడు. అజంతా మొదటి గుహలోని రెండు చిత్రాలు, ఈ రాయబారాలకు సంబంధించినవేనని కొందరి అభిప్రాయం. క్రీ.శ. 640-641 ప్రాంతంలో చైనా యాత్రికుడైన హుయాన్సాంగ్ చాళుక్య రాజ్యాన్ని దర్శించి తన అనుభవాలను వివరించాడు. పులకేశి సామ్రాజ్యం సారవంతమై, సిరి సంపదలతో తులతూగుతున్న దేశమని అతను తెలిపాడు. అక్కడి ప్రజలు యుద్ధప్రియులని, మేలు చేసిన వారిపట్ల కృతజ్ఞులై ఉంటారని వారికోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సంసిద్ధులవుతారని, అలాగే కీడు తలపెట్టిన వారిపై ప్రతీకారం తీర్చుకోనిదే నిద్రపోరని అతను వివరించాడు. వారి రాజు పు-లో-కే-షి (పులకేశి) క్షత్రియ వీరుడని, తన ప్రజలను, సైనిక బలాన్ని చూసుకుని అతడు గర్విస్తాడని, పొరుగు రాజ్యాలంటే అతనికి లక్ష్యం లేదని అతను వర్ణించాడు.

ఇన్ని గొప్ప విజయాలను సాధించిన పులకేశి జీవితం విషాదాంతమైంది. క్రీ.శ. 641లో పులకేశి రెండోసారి పల్లవరాజ్యం మీద దండెత్తినపుడు పల్లవరాజైన నరసింహవర్మ పులకేశిని బాదామి వరకు తరిమి వధించాడు. ఈ పరాజయం నుంచి బాదామి చాళుక్యులు ఒక శతాబ్దం వరకు కోలుకోలేదు.

ప్రశ్న 7.
అమోఘవర్ష సాధించిన విజయాలను చర్చించండి.
జవాబు:
రాష్ట్రకూట పాలకుల్లో మొదటి అమోఘవర్ష (క్రీ.శ. 814-878) గొప్ప పాలకుడు. ఇతడు మూడవ గోవిందుడి కుమారుడు. అతడు స్థానిక పాలకులు, సామంతుల తిరుగుబాట్లను అణచివేశాడు. అతడు వేంగి పాలకుడు విజయాదిత్యుడితో వివాహ సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాడు. గంగరాజును ఓడించాడు. అతడు స్వయంగా గొప్పకవి, కవిపండిత పోషకుడు. కన్నడంలో ‘కవిరాజమార్గం’ అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. ‘మంఖేడ్’ అనే నూతన రాజధాని నగరాన్ని నిర్మింపచేశాడు. అమోఘవర్ష తరువాత అతని కుమారుడైన రెండవ కృష్ణుడు సింహాసనాన్ని అధిష్టించాడు. రెండవ కృష్ణుడి పాలనాకాలంలో రాష్ట్రకూట రాజ్యం ప్రాభావాన్ని సంతరించుకొన్నది. చివరకు రాష్ట్ర కూట రాజ్యాన్ని (క్రీ.శ. 974-975 సం॥లో) తూర్పు చాళుక్య రాజు రెండవ శైలుడు అంతమొందించి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు.

ప్రశ్న 8.
రాజరాజ చోళుడు సాధించిన విజయాలను వివరించండి.
జవాబు:
మొదటి రాజరాజు కాలం నుంచి చోళ రాజ్యంలో నూతన శకం ప్రారంభమైంది. రాజరాజు అనేక ఘన విజయాలను సాధించి చోళ రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా విస్తరింపచేశాడు. రాజరాజుకు ‘జయంగొండ’, ‘చోళమార్తాండ’ మొదలైన బిరుదులున్నాయి. పాండ్యులను, చేర రాజులను ఓడించి వారి సామ్రాజ్య భాగాలైన కొడమలై, కొళ్ళంలను యుద్ధం చేసి ఆక్రమించాడు. నౌకాదళంతో దాడి చేసి, మలయా ద్వీపాన్ని ఆక్రమించడమే కాకుండా శ్రీలంక మీద అనూరాధపురాన్ని (ఉత్తర సింహళం) నాశనం చేశాడు. ఉత్తర సింహళానికి “ముమ్ముడి చోళమండల”మని నామకరణం చేశాడు. ఇతని కాలంలోనే కళ్యాణి చాళుక్యులకు, వేంగీ చాళుక్యులకు పోరు ప్రారంభమైంది. రాజరాజు వేంగీ చాళుక్యులకు మద్దతునిచ్చి తన ప్రాబల్యాన్ని వేంగీలో నెలకొల్పాడు.

రాజరాజు తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడమే కాకుండా క్రమబద్ధమైన పాలనా విధానాన్ని ప్రవేశపెట్టాడు. పంటపొలాలను సర్వేచేయించి, న్యాయసమ్మతమైన పన్నులను వసూలు చేశాడు. రాజరాజు శివభక్తుడు. తంజావూర్లో ‘రాజరాజేశ్వర’మనే పేరున్న బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. శైవుడైనప్పటికీ రాజరాజు పరమత సహనం ఉన్నవాడు. శైలేంద్ర రాజైన శ్రీమార విజయోత్తుంగ వర్మకు నాగపట్టణంలో బౌద్ధ విహారాన్ని నిర్మించడానికి అనుమతినివ్వడమే కాకుండా ఆ విహారానికి ఒక గ్రామాన్ని దానం చేశాడు. ఇతను లలితకళల అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేశాడు.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ప్రశ్న 9.
మొదటి రాజేంద్ర చోళుడి విజయాలను చర్చించండి.
జవాబు:
మొదటి రాజేంద్రుడు (క్రీ.శ. 1014-1044): రాజరాజు తరువాత చోళ సింహాసనాన్ని అధిష్టించినవాడు అతని కుమారుడు రాజేంద్ర చోళుడు. ఇతడు తండ్రిని మించిన శూరుడుగా కీర్తి ప్రతిష్టలను పొందాడు. అతడు తండ్రివలెనే దిగ్విజయ యాత్రలు సాగించి సామ్రాజ్య వ్యాప్తికి పాటుపడ్డాడు. మొదట పాండ్య, చేర రాజ్యములను జయించాడు. ఆ తరువాత సింహళముపై నౌకాదండయాత్రలు సాగించి దానినంతటిని జయించి తన ఆధిపత్యము క్రిందకు తెచ్చాడు. చాళుక్యరాజ్యంలో జరిగిన వారసత్వ యుద్ధాల్లో వేంగి చాళుక్యుల పక్షాన నిలిచి రాజరాజ నరేంద్రునకు సహాయం చేశాడు. రాజరాజనరేంద్రునికి తన కుమార్తె అమ్మంగదేవినిచ్చి వివాహం చేశాడు. తరువాత గంగానది వరకు దండయాత్రలు చేసి, బెంగాల్ పాలవంశీయుడైన మహీపాలుని ఓడించి “గంగైకొండచోళ” అను బిరుదు ధరించాడు. ఈ విజయానికి గుర్తుగా “గంగైకొండ చోళాపురము” అను నగరాన్ని నిర్మించి దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. తరువాత గొప్ప నౌకాబలమును రూపొందించుకొని జావా, సుమత్రా ప్రాంతములను పాలించే శ్రీవిజయ సామ్రాజ్యాధినేతయైన సంగ్రామ విజయోత్తుంగవర్మను ఓడించి, అతని రాజధాని కడారం స్వాధీనం చేసుకొన్నాడు. ఈ విజయమునకు చిహ్నంగా “కడారంకొండ” అనే బిరుదును ధరించాడు. ఇట్టి దిగ్విజయముల వలన రాజేంద్రచోళుడు భారతదేశ సుప్రసిద్ధ పాలకులలో ఒకడుగా కీర్తిని పొందాడు. ఇతడు తన తండ్రివలె గొప్ప పరిపాలనాదక్షుడు. వ్యవసాయాభివృద్ధి కొరకు అనేక నీటివనరులను ఏర్పరచాడు. వైదిక కళాశాలను స్థాపించి, దాని పోషణకు కొంత భూభాగమును దానము చేశాడు. ఇతడు గొప్ప భవన నిర్మాత. ప్రజాసంక్షేమ పాలన సాగించి, “తండ్రిని మించిన తనయుడు” అనే కీర్తిని పొందాడు. ఇతడు శిల్పకళను ఆదరించాడు. గంగైకొండ చోళపురంలో ఒక శివాలయాన్ని నిర్మించాడు.

ప్రశ్న 10.
చోళుల స్థానిక స్వపరిపాలనలోని గొప్ప అంశాలను తెలియచేయండి.
జవాబు:
చోళుల పాలనా వ్యవస్థలోని ముఖ్య లక్షణం వారి స్థానిక స్వపరిపాలనా విధానం. చోళుల గ్రామ పరిపాలననే “స్థానిక స్వపరిపాలన” అని కూడా అంటారు. మొదటి పరాంతకుని ఉత్తరమేరూర్ శాసనంలోను, కులోత్తుంగుని శాసనాల్లోను చోళుల గ్రామ పాలనా పద్ధతి వివరించబడింది.

గ్రామ పాలన: చోళుల సామ్రాజ్యంలో ప్రతి గ్రామానికి స్వయం పాలనాధికారం ఉంది. ప్రతి గ్రామంలోను గ్రామ పెద్దల సభ వుండేది. ఈ గ్రామ సభ స్వరూప స్వభావాలను గ్రామ గ్రామానికి మారుతుండేవి.

గ్రామ సభలు: చోళుల కాలంలో గ్రామాల్లో మూడు రకాల సభలుండేవి. అవి: 1) ఊర్. 2) సభ. 3) నగరం. ఊర్ అనే సభలో గ్రామంలోని భూస్వాములందరూ సభ్యులే. “సభ”లో బ్రాహ్మణ అగ్రహారంలోని వారు మాత్రమే సభ్యులుగా ఉండేవారు. ‘నగరం’ అనేది వర్తకులకు సంబంధించిన సభ. బ్రాహ్మణ అగ్రహారంలోని సభ్యులకు దేవాలయమే సమావేశపు స్థలం. కొన్ని గ్రామాల్లో ప్రత్యేకించి కచేరీలుండేవి.

సభ్యుల ఎన్నిక: చోళుల కాలంలో ప్రతి గ్రామాన్ని 30 వార్డులుగా విభజించారు. ప్రతి వార్డు నుండి ఒక సభ్యుడ్ని లాటరీ పద్ధతిపై ఎన్నుకునేవారు. ఈ సభ్యులను గ్రామసభ ఉపసంఘాలుగా నియమించేది. చెరువులు, సత్రాలు, ఆలయాలు, తోటలు, పాఠశాలలు, నేర విచారణ, పన్నుల వసూలు మొదలైన వాటికి ప్రత్యేక ఉపసంఘాలుండేవి. “పంచదార వారియం” అనే ఉపసంఘం మిగిలిన సంఘాల కార్యక్రమాలను పరిశీలించేది.

అర్హతలు: గ్రామసభలోని సభ్యుల అర్హతలను గురించి ప్రత్యేక నిబంధనావళిని రూపొందించి అమలు చేశారు. సభ్యులుగా ఎన్నుకోబడుటకు ఒక వ్యక్తికి కొన్ని అర్హతలుండాలి. అతడు

  1. 30 నుండి 70 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.
  2. విద్యావంతుడై వుండాలి.
  3. సొంత ఇల్లు కలిగి భూమికి యజమానై వుండాలి.

అనర్హతలు: గ్రామసభ సభ్యులకు కొన్ని అర్హతలతో పాటు కొన్ని అనర్హతలు కూడా నిర్దేశించారు. గ్రామసభకు ఎన్నుకోబడదలచుకున్న వ్యక్తి

  1. పంచ మహాపాపాలు చేసినవాడై ఉండకూడదు.
  2. గత మూడు సంవత్సరాలుగా ఏ ఉపసంఘంలోను సభ్యుడిగా ఉండరాదు.
  3. ఒకసారి సభ్యుడిగా ఉండి లెక్కలను సరిగా అప్పగించని వాడు కూడా అనర్హుడే.
  4. నేరస్తులు వారి బంధువులు కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనకూడదు.

గ్రామ సభ అధికారాలు: గ్రామంలోని భూములపై యాజమాన్యపు హక్కు సభకు ఉన్నది. పన్నులను విధించుట, అడవులను నరికించి కొత్త భూములను సాగులోకి తీసుకువచ్చుట మొదలగునవి ఈ సభ ముఖ్య విధులు. వీటితోపాటు భూమి, నీటి తగవులను పరిష్కరించుట, నేరాలను విచారించుట కూడా దీని విధులుగా చెప్పుకోవచ్చు. అయితే ఆదాయ వనరులు తక్కువ కావటంతో కేంద్ర ప్రభుత్వమే రహదారులు నిర్మించగా వాటిపై అజమాయిషీని సభ నిర్వహించేది. గ్రామసభలకు సలహాలివ్వటానికి అధికారులుండేవారు. కేంద్ర ప్రభుత్వము యొక్క అనవసర జోక్యము ఈ సభలలో ఉండేది కాదు.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ముగింపు: చోళుల గ్రామ పాలన సమర్థవంతమైనది, ఆదర్శవంతమైనది. చోళులు గ్రామ పరిపాలనను ఏర్పరచి అందులో ప్రజలను భాగస్వాములను చేయటం వల్ల పాలనలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమన్వయం సాధ్యపడింది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
దక్కన్, దక్షిణ భారతదేశం అనే పదాలను నిర్వచించండి.
జవాబు:
‘దక్కన్’ అనే పదానికి భాషాపరంగా భారతదేశ భూభాగంలోని దక్షిణ, ద్వీపకల్పభాగం అని అర్థం. క్రీ.శ. 1945సం||లో హైద్రాబాద్ లో జరిగిన దక్షిణ భారతదేశ చరిత్ర సమావేశంలో దక్కన్ భౌగోళిక సరిహద్దులను పేర్కొన్నారు. దీని ప్రకారం ఉత్తరాన తపతి నది నుంచి దక్షిణాన చివరి భూభాగం వరకు, తూర్పు సముద్రం నుంచి పడమర సముద్రం వరకు ఉన్న భూభాగమే దక్కన్. సాధారణంగా వింధ్య పర్వతాలు, నర్మదానదికి దక్షిణాన తూర్పు నుంచి పడమర వరకు ఉన్న భూభాగాన్ని దక్షిణ భారతదేశంగా వ్యవహరిస్తారు.

ప్రశ్న 2.
సంగం యుగం నాటి సాహిత్యం
జవాబు:
సంగం యుగంలో తమిళ సాహిత్య చరిత్ర ప్రారంభమైంది. ‘తోలకప్పియం’ అనే వ్యాకరణ గ్రంథాన్ని తోలకప్పియార్ రచించాడు. ‘కురల్’ అనే ప్రసిద్ధ కావ్యాన్ని తిరువళ్ళువార్ రచించాడు. నైతిక విలువలతో కూడిన ఈ కావ్యం తమిళుల జీవితాల్లో ప్రధానపాత్ర పోషించింది. జైన, బౌద్ధ కవులు, రచయితలు కూడా సంగం సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు.

ప్రశ్న 3.
కరికాల చోళుడు.
జవాబు:
చోళ రాజుల్లో కరికాల చోళుడు (క్రీ.శ.190) గొప్పవాడు. అతను ‘వెన్ని’ వహైప్పరండలై యుద్ధాలలో చేర, పాండ్య రాజులపై గొప్ప విజయాన్ని సాధించాడు. పూహర్ (కావేరీ పట్టణం) అనే నూతన రాజధాని నగరాన్ని నిర్మింపచేశాడు. ప్రజాసంక్షేమానికి కృషి చేసి వ్యవసాయ, వ్యాపార వాణిజ్యాలను ప్రోత్సహించాడు. శ్రీరంగం సమీపంలో కావేరీనదిపై ఆనకట్టను నిర్మింపచేసి వ్యవసాయానికి నీటిపారుదల వసతిని కల్పించాడు. వైదిక మతాన్ని ప్రోత్సహించి యజ్ఞయాగాలను నిర్వహించాడు.

ప్రశ్న 4.
శాతవాహనుల శిల్పకళ
జవాబు:
శాతవాహనుల కాలంలో శిల్పకళ బాగా అభివృద్ధి చెందింది. ఆంధ్రదేశంలో బౌద్ధ విహారాలు, చైత్యాలు, స్థూపాలు, అధికంగా నిర్మించబడ్డాయి.. బుద్ధుడు లేదా బౌద్ధ భిక్షువుల అవశేషాలపై నిర్మించిన గొప్ప నిర్మాణమే స్తూపం. చైత్యం ఆరాధన ప్రదేశం. ప్రస్తుత గుంటూరు జిల్లాలోని కృష్ణానది తీరంలోగల అమరావతిలో ఉప స్థూపం శాతవాహనుల కాలం నాటి శిల్పకళావైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ప్రశ్న 5.
శాతవాహనుల కాలంలో మతం
జవాబు:
హిందువులు ఉన్నత స్థితిలో ఉండేవారు. వారిలో కొందరు శైవులు, మరికొందరు వైష్ణవులు. పశుపతి, గౌరి, రుద్రుడు, పార్వతి, లక్ష్మీనారాయణులను దైవాలుగా ప్రజలు పూజించేవారని గాథాసప్తశతి పేర్కొంది. అయితే వారందరిలోనూ త్రివిక్రముణ్ణి గొప్ప దైవంగా పేర్కొంది. కృష్ణుడి కథలు, లీలలు కూడా పరిచితమే. ఈ దేవతలతోబాటు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, వరుణుడు, కుబేరుడు మొదలైన దేవతల ప్రసక్తి కూడా ఉంది.

రాజులు వైదిక మత క్రతువులను నిర్వహించేవారు. పుణ్యక్షేత్రాలను దర్శించడం, పుణ్యతీర్థాల్లో స్నానమాచరించడం వాడుకలోకి తెచ్చారు. బావులు, చెరువులను తవ్వించడం, బాటలకిరువైపుల చెట్లను నాటించడం, మార్గమధ్యంలో సేద తీర్చుకోవడానికి సత్రాలు కట్టించడం, మత సంస్థలకు విరాళాలు ఇవ్వడం, బ్రాహ్మణులకు ఎన్నో రకాల దానాలు చేయడం ఆనాటి రాజులు చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలు.

బౌద్ధమతానికి కూడా విశేష ప్రజాదరణ లభించింది. ముఖ్యంగా రాణుల ప్రోత్సాహంలో, బౌద్ధభిక్షువులు అంకిత భావంతో ప్రచారం చేయడం వల్ల బౌద్ధమతం ఎంతో అభివృద్ధి చెందినది.

ప్రశ్న 6.
ఐహోలు శాసనం
జవాబు:
ఐహోల్ కర్ణాటక రాష్ట్రములో ఉన్నది. ఈ ప్రదేశంలో పశ్చిమ చాళుక్యరాజు రెండవ పులకేశి యొక్క సేనాని రవికీర్తి వేయించిన “ఐహోల్” శాసనం ఉంది. ఈ శాసనంలో రెండవ పులకేశి యొక్క దిగ్విజయ యాత్ర, హర్షునిపై అతని విజయం వర్ణించబడ్డాయి. ఐహోల్లో పశ్చిమ చాళుక్యుల నాటి దేవాలయాలున్నాయి.

ప్రశ్న 7.
పల్లవుల శిల్పకళ
జవాబు:
భారతీయ వాస్తు శిల్పకళా రంగాల్లో పల్లవుల కళకు విశిష్ట స్థానం ఉంది. భారతీయ శిల్పకళ దక్షిణ భారతదేశంలో పల్లవులతోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. కట్టడాల్లో రాతిని ఎక్కువగా ఉపయోగించింది మొట్టమొదటగా పల్లవులే కావటం విశేషం. కాంచీపురం, మహాబలిపురం పల్లవుల కాలం నాటి గొప్ప శిల్పకళా కేంద్రాలు. మహేంద్రవర్మ అనేక ఏకశిలా ఆలయాలను నిర్మింపచేశాడు. అందుకు మహాబలిపురంలోని వరాహ, దుర్గ గుహలు చక్కని తార్కాణం. మొదటి నరసింహవర్మ మహాబలిపురంలో అద్భుతమైన ఏడు పగోడాలను నిర్మింపచేశాడు. వీటినే ఏడు రథాలు అంటారు. కాంచీపురంలోని కైలాసనాథ ఆలయం, మహాబలిపురంలోని తీర దేవాలయాలు పల్లవుల నిర్మాణశైలికి, శిల్పకళకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ప్రశ్న 8.
బృహదీశ్వర ఆలయం
జవాబు:
తంజావూరులోని బృహదీశ్వరాలయాన్ని చోళరాజు మొదటి రాజరాజు క్రీ.శ. 1009లో నిర్మించాడు. ఇది శివాలయం. ఇది భారతదేశ నిర్మాణాలన్నింటిలో పెద్దది. దీని విమానం ఎత్తు 200 అడుగులు. ఈ ఆలయం వెలుపలి గోడల నిండా మనోహరమైన శిల్పాలు, లోపలి భాగంలో వర్ణచిత్రాలు ఉన్నాయి. ఈ ఆలయం దక్షిణ భారతదేశ ఆలయ వాస్తు సాంప్రదాయానికి మకుటాయమానం వంటిది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 5th Lesson క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మౌర్యుల పరిపాలనపై వ్యాసం వ్రాయండి.
జవాబు:
భారతదేశంలో ప్రప్రథమంగా ఒక నిర్దిష్టమైన పరిపాలనా విధానాన్ని ఏర్పాటు చేసింది మౌర్యులే. వీరి పాలనావిధానాన్ని తెలుసుకోవటానికి కౌటిల్యుని ‘అర్థశాస్త్రం’, మెగస్తనీస్ ‘ఇండికా’ గ్రంథం ముఖ్య ఆధారాలు.
1. కేంద్ర ప్రభుత్వం: మౌర్య పాలనావ్యవస్థలో చక్రవర్తి సర్వోన్నత అధికారి. అతడే ఉన్నత కార్యనిర్వహణాధికారి, శాసనాధికారి, న్యాయాధికారి కూడా. స్వధర్మాన్ని అమలుచేయటం, ప్రజల ప్రాణాలను కాపాడటం, వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమల ప్రగతికి కృషిచేయటం, న్యాయాన్ని పంచటం, విదేశీ వ్యవహారాల నిర్వహణ, సాహిత్య, లలితకళల పోషణ మొదలైన విషయాలను రాజు ఆచరించవలసిన ముఖ్య ధర్మాలుగా పరిగణించారు. మౌర్య చక్రవర్తులు నిరంకుశులైనప్పటికి ప్రజాసంక్షేమాన్ని ధ్యేయంగా పెట్టుకొని పాలించారు. “ప్రజల సుఖమే తన సుఖంగా, వారి కష్టాలే తన కష్టాలుగా చక్రవర్తి భావించాలి” అని కౌటిల్యుడు చెప్పడాన్నిబట్టి మౌర్య చక్రవర్తి నియంతగా వ్యవహరించి ఉండకపోవచ్చునని భావించవచ్చు.

ఎ) మంత్రిపరిషత్తు: పరిపాలనలో చక్రవర్తికి సలహాలను ఇవ్వడం కోసం ఒక మంత్రిపరిషత్తు ఉండేది. మంత్రిపరిషత్తు సభ్యుల్లో మంత్రి, పురోహితుడు, యువరాజు, సేనాపతి మొదలగువారు ముఖ్యులు. మంత్రిపరిషత్తును విధిగా సంప్రదించాలనే నిబంధన లేనప్పటికి ప్రజాసంక్షేమాన్ని ధ్యేయంగా పెట్టుకొని సాధారణంగా మంత్రుల సూచనలను చక్రవర్తి పాటించేవాడు.

బి) ప్రజా సభలు: మౌర్య చక్రవర్తులు ప్రజాభిప్రాయాలకు విలువనిచ్చేవారు. నాడు పౌరసభ, జానపదసభ అనే ప్రజాప్రతినిధులతో కూడిన సభలుండేవి. ఆ సభలను సమావేశపరచి వాటితో ప్రభుత్వ కార్యక్రమాలను చర్చించేవారు. అశోకుని కాలంలో ధర్మ ప్రచారార్థం ధర్మమహామాత్రులు అను ప్రత్యేక అధికారులు నియమింపబడ్డారు. ప్రభుత్వ వ్యవహారాలు 32 శాఖలుగా విభజించబడి అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించబడేవి.

సి) సైనిక వ్యవస్థ: మౌర్యులు సమర్థవంతమైన సైనిక వ్యవస్థను నిర్మించారు. మౌర్య సైన్యంలో 6 లక్షల కాల్బలం, 30 వేల అశ్వదళం, 9 వేల గజబలం, 8 వేల రథాలు వున్నట్లు గ్రీకు చరిత్రకారులు పేర్కొన్నారు. సైన్యానికి అనుబంధంగా నౌకాదళం కూడా ఉంది. సైనిక పర్యవేక్షణ బాధ్యతను 30 మంది సభ్యులున్న ఒక సంఘానికి అప్పగించారు. ఈ సంఘం ఐదేసి సభ్యులు గల 6 ఉపసంఘాలుగా విడివడి గజ, అశ్వక, రథ, పదాతి, నౌకాదళాల రవాణా, సరఫరా శాఖల నిర్వహణా బాధ్యతలను చేపట్టేది. మౌర్యుల కాలంలో గూఢచారి దళం కూడా అప్రమత్తతతో పనిచేసి, కీలకమైన రహస్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందించేది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

డి) భూమిశిస్తు: మౌర్య సామ్రాజ్యానికి ప్రధానమైన ఆదాయం భూమిశిస్తు నుండి లభించేది. పండిన పంటలో 6 నుంచి 4వ వంతు వరకు భూమిశిస్తుగా వసూలు చేసేవారు. అశోకుడు బౌద్ధమతము యెడల భక్తితో లుంబినీ వనములో భూమిశిస్తును 8వ వంతుకు తగ్గించాడు. రాచపొలాలు, గనులు, నౌకాకేంద్రాలు, తదితర మార్గాల నుంచి కూడా ప్రభుత్వానికి ఆదాయం లభించేది. గోపుడు భూమిశిస్తును వసూలు చేసేవాడు. ఆదాయశాఖకు ముఖ్య అధికారి సమాహర్త. ప్రభుత్వ ఆదాయంలో 4వ వంతు ఉద్యోగుల జీతాలు, ప్రజాపనుల పద్దుల క్రింద ఖర్చయ్యేది.

ఇ) న్యాయపాలన: మౌర్యుల పాలనలో చక్రవర్తీ సామ్రాజ్యానికి ఉన్నత న్యాయాధిపతి. రాజాస్థానమే అత్యున్నత న్యాయస్థానం. ఆస్తి తగాదాలు మొదలగు సివిల్ కేసుల పరిష్కారానికి ధర్మస్థియ అను న్యాయస్థానాలు కృషిచేసేవి. అపరాధ విచారణ కోసం కంటకశోధన అనే క్రిమినల్ న్యాయస్థానాలుండేవి. నేరస్తులను దివ్యపరీక్షల ద్వారా విచారించేవారు. శిక్షలు కఠినంగా ఉండేవి. అయితే అశోక చక్రవర్తి కాలంలో ఈ కాఠిన్యాన్ని కొంతవరకు సడలించారు.

2. రాష్ట్ర ప్రభుత్వం: పరిపాలనా సౌలభ్యం కోసం మౌర్య సామ్రాజ్యాన్ని జనపదాలుగా విభజించారు. అశోకుని కాలంలో తక్షశిల, అవంతి, పాటలీపుత్రం, గిర్నార్లు రాజధానులుగా గల ఉత్తరాపథ జనపదాలు, ఉజ్జయిని, కళింగ, సౌరాష్ట్ర అను దక్షిణాపథ జనపదాలు వుండేవి. జనపదాలకు పాలకులుగా రాజకుమారులను నియమించేవారు. జనపదాన్ని తిరిగి ఆహారాలు, విషయాలు, ప్రదేశాలుగా విభజించారు. ప్రదేశానికి అధికారి ప్రాదేశికుడు. పరిపాలనా యంత్రాంగానికి గ్రామమే ప్రాతిపదిక. గ్రామానికి అధికారి గ్రామికుడు.

3. నగరపాలన: మౌర్యుల కాలంలో నగరపాలన గురించి మెగస్తనీస్ తన ఇండికా అను గ్రంథంలో పేర్కొన్నాడు. పాటలీపుత్ర నగరపాలన గురించి, సైనిక మండలుల గురించి సవివరంగా వర్ణించాడు. ఈ కాలంలో నగరపాలనకు ఒక విశిష్ట స్థానం ఉంది. నగరపాలనను నాగరికుడు అనే అధికారి నిర్వహించేవాడు. పాటలీపుత్ర నగరపాలన నిర్వహణలో నాగరికుడికి 30 మంది సభ్యులున్న ఒక సంఘం తోడ్పడేది. ఈ సంఘం ఐదేసి సభ్యులు గల 6 పంచాయితీలుగా ఏర్పడి 1) పరిశమ్రలు 2) విదేశీయుల సౌకర్యాలు 3) జనన, మరణాల లెక్కలు 4) వాణిజ్యం, వ్యాపారం, తూనికలు, కొలమానాలు 5) వస్తువిక్రయం 6) సుంకాల వసూలు అనే శాఖలకు సంబంధించిన విధులను నిర్వహించేది.

ముగింపు: మౌర్యుల పాలనలో కొన్ని గుణదోషములున్నాయి. ఉద్యోగుల పీడన, కఠిన శిక్షలు ఇందులోని లోపాలు. పౌర, సైనిక శాఖలు వేర్వేరుగా ఉండటం, సమర్థవంతమైన నగరపాలన, ప్రజాసంక్షేమ పాలన అనునవి. ఇందులోని సుగుణాలు. మౌర్యుల పరిపాలనా విధానం ఉత్తమము, ఉదారము, ఆదర్శప్రాయమైనది. వీరి పాలన మొఘలుల పాలన కంటే విశిష్టమైనదని వి.ఎ. స్మిత్ అను పండితుడు వ్యాఖ్యానించాడు. నేటి పాలనా వ్యవస్థలోని మౌలికాంశాలు మౌర్యులనాటివే అని సర్దార్ కె.ఎమ్. పణిక్కర్ అభిప్రాయపడ్డాడు.

ప్రశ్న 2.
గుప్తుల పాలనా లక్షణాలు పరిశీలించండి.
జవాబు:
గుప్త చక్రవర్తులు ఉత్తర భారతదేశమున రాజకీయ ఐక్యతను సాధించి సుభిక్షమైన పాలనావ్యవస్థను ప్రవేశపెట్టారు. వీరి పాలనలో ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగుల బాధ లేదు. ఫాహియాన్ “గుప్త పాలన ఉదారమైనది, ప్రభుత్వము ప్రజల విషయములో అనవసరముగా జోక్యం చేసుకొనెడిది కాదు” అని పేర్కొన్నాడు. అట్టి ఉదాత్త పాలనలో ప్రజలు సుఖశాంతులను అనుభవించారనుట అతిశయోక్తి కాదు.

కేంద్ర ప్రభుత్వము: గుప్త సామ్రాజ్యమునకు సర్వాధికారి చక్రవర్తి. గుప్త చక్రవర్తులు మహేశ్వర్, మహారాజాధిరాజా, పరమభట్టారక మొదలగు బిరుదులు ధరించారు. రాచరికం వంశపారంపర్యంగా లభించేది. రాజు దైవాంశ సంభూతుడని ప్రజలు విశ్వసించారు. రాజు నిరంకుశుడైనా ప్రజాక్షేమమే తన క్షేమముగా భావించేవాడు. పరిపాలనలో రాజుకు సలహాలు ఇవ్వడానికి ఒక మంత్రిమండలి ఉండేది. ఈ మండలిలో 1. మహాప్రధానామాత్యుడు 2. సచివుడు 3. కుమారామాత్యుడు 4. సంధి విగ్రహకుడు 5. మహాదండ నాయకుడు 6. రణభండారికుడు అనే ఉద్యోగులుండేవారు. వీరే కాకుండా కంచుకి అనే ఉద్యోగి చక్రవర్తికి, మంత్రిమండలికి మధ్యవర్తిగా వ్యవహరించేవాడు. ఉద్యోగుల నియామకంలో కుల, మత భేదములను పాటింపక అభ్యర్థుల శక్తిసామర్థ్యములను పరిగణనలోనికి తీసుకునేవారు. ఈ కాలంలో గూఢచారి వ్యవస్థ అమలులో ఉంది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

రాష్ట్ర ప్రభుత్వం: పరిపాలనా సౌలభ్యం కోసం గుప్త చక్రవర్తులు తమ సామ్రాజ్యాన్ని భుక్తులుగా, భుక్తులను విషయాలుగా, విషయాలను ప్రదేశాలుగా విభజించారు. భుక్తికి అధిపతిని ఉపరిక అని పిలిచేవారు. విషయానికి అధిపతి విషయపతి. విషయపాలనలో విషయపతికి సహకరించేందుకు 5గురు సభ్యులు గల సభ సహాయపడేది. వారు నగరశ్రేష్టి, సార్ధవాహుడు, ప్రథమకులికుడు, ప్రథమ కాయస్థుడు, పుస్తపాలడు మొదలైనవారు. పాలనా వ్యవస్థలో చివరిది గ్రామము. గ్రామానికి పెద్ద గ్రామికుడు. గ్రామ పాలనలో గ్రామ పంచాయితీ అతడికి తోడ్పడేది.

నగరపాలన: నగర పరిపాలనకు గుప్తుల కాలంలో ప్రత్యేక ఏర్పాటు ఉంది. నగర పరిపాలనాధికారిని ”పురపాలుడు’ అనేవారు. పరిపాలనలో అతనికి సహాయపడేందుకు ఒక నగరసభ ఉండేది.

భూమిశిస్తు: గుప్త చక్రవర్తులకు ఆదాయం ముఖ్యంగా భూమిశిస్తు నుండి లభించేది. పండిన పంటలో 1/3వ వంతు పంటను భూమిశిస్తుగా నిర్ణయించేవారు. భూమిశిస్తును భాగకర, ఉద్యంగ అనేవారు. భూమిశిస్తుతో పాటు వృత్తిపన్ను, ఉప్పుపన్ను, వర్తక సుంకం, వాణిజ్య పన్నులు, రేవులు, అడవులు, గనులు మొదలగు వానిపై కూడా ప్రభుత్వానికి ఆదాయం లభించేది.

న్యాయపాలన: గుప్త పాలకులు ప్రజలకు నిష్పక్షపాతమైన, సమర్థవంతమైన పాలనను అందించారు. న్యాయ వ్యవహారాలలో చక్రవర్తి మాటకు తిరుగులేదు. ఆయనే ఉన్నత న్యాయాధీశుడు. న్యాయశాఖలో మహాదండ నాయకుడు, మహాక్షపతిలక వంటి న్యాయాధికారులుండేవారు. రాజదండన కఠినంగా ఉండేది కాదు. కాని తిరుగుబాటు చేసిన వారిపట్ల కఠినంగా వ్యవహరించేవారు. శిక్షగా వారి కుడిభుజాన్ని ఖండించేవారు లేదా కళ్ళు పీకించేవారు. మరణదండన తప్పనిసరైనప్పుడు అట్టివారిని ఏనుగులతో తొక్కించి చంపేవారు.

సైనిక వ్యవస్థ: గుప్త సామ్రాజ్యానికి చక్రవర్తే సర్వసైన్యాధ్యక్షుడు. గుప్త చక్రవర్తులు సంప్రదాయంగా అనుసరించబడుతున్న చతురంగ బలాలను పోషించారు. సైనిక రంగంలో సేనాపతి, మహాసేనాపతి, దండనాయకుడు మొదలైన ఉద్యోగులుండేవారు.

ముగింపు: గుప్తుల పరిపాలనలో అధికార వికేంద్రీకరణ చోటుచేసుకుంది. రాష్ట్రపాలకులు ఎక్కువ అధికారాలు అనుభవించారు. ప్రభువులు ప్రజాక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని పరిపాలన సాగించటం గుప్త పాలనలోని విశేషం.

ప్రశ్న 3.
పుష్యభూతి వంశస్థుల పాలనలో రాజకీయ పరిస్థితులను వివరించండి.
జవాబు:
గుప్త సామ్రాజ్య పతనం తర్వాత దాని శిథిలాలపై ఉత్తర భారతదేశంలో అనేక చిన్నచిన్న స్వతంత్ర రాజ్యాలు వెలిశాయి. అవన్నీ దాదాపు ఒకప్పుడు గుప్త సామ్రాజ్యానికి సామంత రాజ్యాలుగా ఉన్నటువంటివే. అలాంటి రాజ్యాలలో ఒకటి స్థానేశ్వర రాజ్యం.

గుప్తులకు సామంతులుగా ఉన్న ఈ రాజ్య పాలకులు బలపడి ఇతర సామంత పాలకులను తమ అధికార పరిధిలోకి తెచ్చుకుని ఉత్తర భారతదేశంలో మళ్ళీ రాజకీయ సమైక్యతను, సుస్థిరతను సాధించగలిగారు. పుష్యభూతి వంశస్థులు స్థానేశ్వరాన్ని రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించగా ఈ వంశంలోనివాడైన హర్షవర్ధనుడి కాలంలో ఉత్తరాపథం తిరిగి మహోన్నత దశకు చేరుకుంది.

పుష్యభూతి వంశ చరిత్ర: మహాశివభక్తుడైన పుష్యభూతి ఈ వంశానికి మూలపురుషుడైనందువల్ల, ఈ వంశానికి ఆ పేరు వచ్చినట్లు బాణుని “హర్షచరిత్ర” వల్ల తెలుస్తున్నది. ఈ వంశంలో మూడోతరంవాడైన ఆదిత్యవర్ధనుడి కుమారుడు ప్రభాకరవర్ధనుడు. ఇతను “మహారాజాధిరాజు” బిరుదాన్ని ధరించాడు. ప్రభాకరవర్ధనుణ్ణి ‘హూణ హరిణకేసరి” అంటూ
”హర్షచరిత్ర’ వర్ణించింది. ఇతని పట్టపురాణి యశోమతీదేవి మాళవరాజైన యశోధర్ముడి కుమార్తె కావడం వల్ల యశోధర్ముడితోపాటు ప్రభాకరవర్ధనుడు కూడా హూణులతో పోరాటంలో పాల్గొన్నాడని భావించవచ్చు. ప్రభాకరవర్ధనుడికి రాజ్యశ్రీ అనే కుమార్తె, రాజ్యవర్ధనుడు, హర్షవర్ధనుడనే కుమారులున్నారు. కుమార్తె రాజ్యశ్రీని మౌఖరీ రాజైన గృహవర్మకిచ్చి వివాహం జరిపించాడు.

క్రీ.శ. 604లో స్థానేశ్వర రాజ్యంపై హూణులు దండెత్తినప్పుడు, ప్రభాకరవర్ధనుడు తన పెద్ద కుమారుడు రాజ్యవర్ధనుణ్ణి హూణులను ఎదుర్కొనేందుకు పంపాడు. వారిపై విజయాన్ని సాధించి రాజ్యవర్ధనుడు రాజ్యానికి తిరిగి వచ్చేసరికి ప్రభాకరవర్ధనుడు జబ్బుచేసి మరణించాడని, యశోమతి సతీసహగమనం చేసిందని తెలిసింది. ఈ కారణంగా రాజ్యవర్ధనుడు పట్టాభిషక్తుడయ్యాడు.

ఇదేసమయంలో మాళవ రాజైన దేవగుప్తుడు గౌడ రాజైన శశాంకుడితో కలిసి కనోజ్పై దండెత్తి రాజ్యశ్రీ భర్త గృహవర్మను వధించాడు. ఇది తెలుసుకున్న రాజ్యవర్ధనుడు సైన్యంతో కనోజ్పై దండెత్తి దేవగుప్తుణ్ణి ఓడించాడు. రాజ్యశ్రీని బందిఖానా నుంచి విడిపించడానికి ముందే, దురదృష్టవశాత్తు రాజ్యవర్ధనుడు శశాంకుడి కుట్రకు బలయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో హర్షవర్ధనుడు స్థానేశ్వర సింహాసనాన్ని అధిష్టించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

రాజకీయ పరిస్థితులు: హర్షవర్ధనుడు గొప్ప విజేతగాను, గొప్ప పరిపాలనదక్షుడిగాను పేరుపొందాడు. హర్ష చరిత్ర, సి-యూ-కి గ్రంథాల్లో హర్షుణ్ణి ఆదర్శవంతమైన ప్రభువుగా వర్ణించారు. హర్షుడు పరిపాలనలో స్వయంగా శ్రద్ధ వహించాడు. రాజ్యంలో స్వయంగా పర్యటించి, ప్రజల కష్టసుఖాలను స్వయంగా విచారించి, తక్షణమే న్యాయం చేకూర్చేవాడు. ప్రజాహిత కార్యక్రమాలను నిర్వహించడంలో హర్షుడికి వ్యవధి చాలేది కాదని, సి-యూ-కి గ్రంథంలో వివరంగా ఉంది.

పరిపాలన సౌలభ్యం కోసం సామ్రాజ్యాన్ని భుక్తులుగాను, భుక్తులను విషయాలుగాను, విషయాలను గ్రామాలు గాను విభజించారు. పాలనా విధానంలోను, విద్యా, సాంస్కృతిక రంగాల్లోను హర్షుడు గుప్తయుగం సంప్రదాయాలనే అనుసరించాడు. రాజుకు సలహాలిచ్చి సహాయం చేయడానికి మంత్రిపరిషత్ ఉండేది. ప్రభుత్వ విధానంలో మంత్రి పరిషత్కు గౌరవప్రదమైన స్థానం ఉంది. వారసత్వాన్ని నిర్ణయించడానికి కూడా మంత్రిపరిషత్తుకు అధికారం ఉంది. హర్షచరిత్ర నుంచి, శాసనాల నుంచి అనేకమంది ఉద్యోగుల పేర్లు తెలుస్తున్నాయి. వారిలో మహాసంధి-విగ్రహాధికృత (యుద్ధ వ్యవహారాలు), రాజస్థానీయ (విదేశీ వ్యవహారాలు), మహాబలాధికృత (సేనాపతి), ఆయుక్తక, భోగక (పన్నుల వసూలు), భాండాగారాధికృత (కోశాధికారి) మొదలైనవారు ముఖ్యులు. వీరికి జీతాలకు బదులు భూములను ఇచ్చేవారు. సైనికోద్యోగులకు మాత్రం జీతాలిచ్చేవారు.

భుక్తికి అధికారి ఉపరిక. ఇతనికే ‘భోగపతి’ అనికూడా పేరు ఉంది. విషయానికి అధికారి ‘విషయపతి’. ఇతనిని ‘కుమారామాత్య’ అనికూడా పిలిచేవారు. గ్రామమే ప్రభుత్వానికి పునాది. గ్రామంలో అక్షపడలిక, కరణిక అనేవారు ఉద్యోగులు. వీరికి గ్రామ వృద్ధుల సహకారం ఉండేది.

ఆదాయం: భూమిశిస్తు రాజ్యానికి ముఖ్య ఆదాయం. ప్రజలపై పన్నుల భారం ఎక్కువగా ఉండేది కాదు. పంటలో ఆరోవంతును మాత్రమే పన్నుగా వసూలుచేసేవారు. పన్నులను ధాన్యరూపంగాగాని, ధనరూపంగాగాని చెల్లించవచ్చు. బాటల మీద, రేవుల మీద సుంకాలుండేవి. వస్తువుల అమ్మకాల మీద కూడా పన్నులు ఉండేవి. అయితే ఇవి ఆయా వస్తువుల బరువులనుబట్టి, విలువలనుబట్టి ఉండేవి. ఈ విధంగా వస్తువుల బరువు ఆధారం చేసుకొని వసూలు చేసే అమ్మకం పన్నునే ‘తుల్యమేయ’ అన్నారు. పన్నులను వసూలు చేయడానికి ధ్రువాధికరణ, గౌల్మిక మొదలైన ఉద్యోగులు ఉండేవారు. ప్రభుత్వాదాయాన్ని ముఖ్యంగా నాలుగు పద్దుల మీద ఖర్చు పెట్టేవారు. అవి: 1. ప్రభుత్వ యంత్రాంగం 2. రాజప్రాసాదం 3. పండిత సత్కారం 4. దానధర్మాలు.

హర్షయుగంలో నేరాలు ఎక్కువని తెలుస్తున్నది. ఆ కారణంగా శిక్షాస్మృతి కఠినతరమైంది. దేశద్రోహ నేరానికి యావజ్జీవ కారాగార శిక్ష, సాంఘిక నియమావళిని ధిక్కరించిన వారికి, తల్లిదండ్రుల పట్ల అవిధేయులైన వారికి అంగచ్ఛేద శిక్షగాని లేదా దేశబహిష్కార శిక్షగాని అమలుపరిచేవారు. చిన్నచిన్న నేరాలకు జరిమానాలను విధించేవారు. నేర నిర్ణయానికి ‘దివ్య పరీక్షలుండేవి. రాజ పట్టాభిషేకం వంటి విశేష సందర్భాల్లో బాధితులను విడిచిపెట్టే ఆచారం ఉండేది.

సైన్యం: హర్షుడు పెద్ద సైన్యాన్ని పోషించాడు. సైన్యంలో చతురంగ బలాలుండేవి. క్రమంగా రథానికి ప్రాముఖ్యం తగ్గింది. హర్షుని సైన్యంలో 5000 ఏనుగులు, 2000 అశ్వాలు, 50,000 కాల్బలం ఉన్నట్లు తెలుస్తున్నది.

ప్రశ్న 4. క్రీ.పూ. 3 నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు భారతదేశ ఆర్థిక పరిస్థితిని పరిశీలించండి.
జవాబు:
క్రీ.పూ. 3 నుంచి క్రీ.శ. 7 వరకు గల ఆర్థిక పరిస్థితులు:
మౌర్యుల ఆర్థిక వ్యవస్థ:
1) వ్యవసాయం: మౌర్యుల కాలంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందింది. పన్నులు వసూలు చేయడంతో ఆర్థిక, సాంఘిక భద్రత ఉన్నట్లు భావించారు. రాజు తన సొంతభూముల ద్వారానే కాకుండా, రాజ్య భూముల నుంచి కూడా పన్నులు వసూలుచేసేవారు. రాజ్య ప్రధాన ఆదాయం పంటలో 1/4 నుంచి 1/6 వ వంతు శిస్తుగా వసూలు చేసేవారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి శిస్తులు మారేవి. మధ్యవర్తులు లేకుండా అధికారులే స్వయంగా శిస్తు వసూలు చేసేవారు.

2) పారిశ్రామిక వృత్తులు:
లోహ పరిశ్రమ: వివిధ రకాల లోహాలను ఇనుము, రాగి, తగరం, బంగారం, వెండి లోహాలను తమ పరిజ్ఞానంతో వెలికితీసి వివిధ రకాలైన వస్తువులు తయారుచేశారు. దారు (కొయ్య) పరిశ్రమ, రాతి పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ వంటివి. మధుర, కాశీ, పాటలీపుత్రం, వంగ, మహీశ మొదలైన నగరాల్లో కుండల తయారీ, మౌర్య రాజ్యంలోని వివిధ ప్రాంతాలలోనూ అభివృద్ధి చెందింది.

3) కుషాణుల పాలనలో వర్తక, వాణిజ్యం: మౌర్యుల కాలానికి భిన్నంగా క్రీ.పూ. 200 నుంచి క్రీ.శ. 300 కాలంలో అనేక చిన్నరాజ్యాలు ముఖ్యంగా విదేశీ రాజ్యాలు ఏర్పడ్డాయి. అందుకే సనాతన చరిత్రకారులు ఈ కాలాన్ని ‘అంధయుగం’గా భావించారు. అయితే ఆధునిక చరిత్రకారులు ఈ కాలాన్ని ‘భారతదేశ వాణిజ్యయుగం’గా చెప్పారు. ఎందుకంటే ఆ కాలంలో వర్తక వాణిజ్యాలు చాలా బాగా అభివృద్ధి చెందినాయి.

4) గుప్తుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థ: మౌర్యులలాగా గాక, గుప్తులు గొప్ప బిరుదులను ధరించారు. ‘మహారాజాధిరాజ’ అనే బిరుదు వల్ల చిన్న రాజ్యాలు, రాజులు ఉండేవారని తెలుస్తుంది. గుప్తులు జయించిన చాలా రాజ్య భాగాలు భూస్వాముల పాలనలో ఉండేవి. బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాజ్యభాగాలు కేంద్రంగా గుప్త సామ్రాజ్య పాలన జరిగింది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

5) భూస్వామ్య అంశాల అభివృద్ధి:

  • భూదానాలు చేయడం: పురోహితులకు దేవాలయాల భూములు, గ్రామాలు విరాళాలుగా ఇచ్చి, పన్నులు వసూలు, పాలనాధికారులు ఇవ్వడంతో అది వికేంద్రీకరణకు దారితీసింది. సేద్యపు కూలీల అణచివేత, దానం చేసిన గ్రామాల ప్రజల అణచివేతతో వారిపై పెత్తనం పెరిగింది.
  • సేద్యపు బానిసలు: భూదానాలు భూస్వామ్య వ్యవస్థకు దారితీసింది. చాలా శాసనాల్లో సేద్యపు బానిసత్వం గురించి తెలిపారు. భూములు అమ్మినప్పుడు ఇతరులకు ఇచ్చినప్పుడు దానితో సేద్యపు బానిసలను కూడా ఇచ్చారు.

6) పుష్యభూతి పాలనలో ఆర్థికవ్యవస్థ: పుష్యభూతి వంశపాలనలో ఆర్థికవ్యవస్థ స్వయంసమృద్ధిగా, మరింత భూస్వామ్య విధానాలతో ఉండేది. గుప్తుల కాలంలో ప్రారంభమైన వర్తక, వాణిజ్య క్షీణత, హర్షుని కాలంలో కూడా కొనసాగింది. వర్తక కేంద్రాలు క్షీణత నాణాల కొరత, వర్తక సంఘాలు లేకపోవటం దీనికి ఉదాహరణ. చేతివృత్తులు, ఇతర పరిశ్రమలు దెబ్బతిన్నాయి. తత్ఫలితంగా వ్యవసాయం కూడా పరోక్షంగా దెబ్బతిన్నది.

ప్రశ్న 5.
మౌర్యుల నుంచి పుష్యభూతి వంశం వరకు జరిగిన కళ, శిల్ప, నిర్మాణ అభివృద్ధిని చర్చించండి.
జవాబు: మౌర్యుల కళలు:
1) స్తంభాలు, శిల్ప నిర్మాణాలు: మౌర్యుల కళకు చాలా అందమైన నిర్మాణాత్మక నిదర్శనాలుగా అశోకుడు నిర్మించిన స్తంభాలు ఉన్నాయి. అశోకుని శాసనాలతో కూడిన స్తంభాలు, స్థూపాలు నగరాల్లో, కూడళ్లలో ప్రతిష్టించాడు. స్తంభాలను రెండు రకాలైన రాతితో నిర్మించారు. అవి:

  1. మధుర ప్రాంతానికి చెందిన ఎరుపు, తెలుపు మచ్చలలో ఉన్న ఇసుక రాయితో కొన్ని నిర్మించబడ్డాయి.
  2. బాగా పొడిచేసిన ఇసుకరాయి, బనారస్ సమీపంలోని చూనార్ వద్ద లభ్యం అవుతుంది. ఎక్కడైతే స్తంభాలు నిర్మిస్తారో అక్కడికి మధుర, చూనార్ నుంచి రాతిని రవాణాచేసి, అక్కడ శిల్పకారులు, తక్షశిల నుంచి వచ్చిన వారు తమ నైపుణ్యంతో చెక్కారు.

2) స్తూపాలు: స్తూపం అనేది ఇటుక లేదా రాయితో నిర్మించిన అర్ధగోళాకార నిర్మాణం. క్రింద గుండ్రని ఆధారపీఠం ఉంటుంది. చుట్టూ గొడుగు ఆకారం సార్వభౌమాధికారానికి గుర్తుగా ఉంటుంది. అశోకుడు భారతదేశంలోను, ఆఫ్ఘనిస్థాన్లలో ఎనభై నాలుగువేల స్థూపాలు నిర్మించాడు. క్రీ.శ. 7వ శతాబ్దంలో హుయన్ త్సాంగ్ తన భారత పర్యటనలో వీటిని చాలావరకు చూశాడు. వీటిలో మంచి ఉదాహరణగా చెప్పదగింది భోపాల్ సమీపంలోని సాంచి స్తూపం.

3) గుహలు: మౌర్యుల కట్టడాల్లో ముఖ్యమైనవి గుహలు. గట్టిరాళ్ళు, చీలిన రాళ్ళతో చెక్కబడినవి. గుహల లోపలి గోడలు బాగా నునుపుగా, అద్దంలాగా ఉంటాయి. ఈ అద్భుత కట్టడాలు సన్యాసుల నివాసగృహాలు, అసెంబ్లీ గదుల వలె ఉపయోగపడ్డాయి.

గాంధార, మధుర అమరావతి శిల్ప నిర్మాణాలు:
A. గాంధార శిల్పం:
1) కాలం, ప్రదేశం, పోషకులు: క్రీ.పూ. 1వ శతాబ్దం మధ్యకాలం నుండి క్రీ.శ. 5వ శతాబ్దం చివరి వరకు గాంధార ప్రాంతంలో ఉన్న అద్భుత శిల్పాలను గాంధార శిల్పాలు అంటారు. భారతీయ గ్రీకు శిల్పకళా సమ్మిళిత నిర్మాణంగా చెబుతారు. బాక్ట్రియా గ్రీకు రాజులు, వాయువ్య భారతం నుంచి ఆవిర్భవించాయి. శకులు, కుషాణులు
వీటి పోషకులు.

2) గాంధార శిల్ప లక్షణాలు: గ్రీకు, రోమన్ సంప్రదాయాల్లో బుద్ధుని విగ్రహాలు నిర్మించబడ్డాయి. మానవ శరీరాన్ని చాలా సహజంగా శిల్పులు చెక్కారు. కండరాలు, మీసాలు, ఉంగరాల జుత్తు మొదలైనవి చక్కగా ఉంటాయి.

B. మధుర శిల్పం: జైనమతం స్ఫూర్తితో ధ్యానంలో ఉన్న దిగంబర తీర్థంకరుల శిల్పాలను మధుర శిల్పులు నిర్మించారు. మొదట్లో బుద్ధుని, బోధిసత్వుని ప్రతిమలు నిర్మించారు. తర్వాత కాలంలో మత భావనలు ప్రదర్శితమయ్యేట్లు నిర్మించారు. బుద్ధుని ప్రతిమలు బిగుతు కండరాలు, బలమైన శరీరంతో హుందాగా, భక్తిభావంతో ఉండే విగ్రహాలను మధుర శిల్పులు నిర్మించారు. వైదిక దేవతలైన శివుడు, విష్ణువు, పార్వతి, లక్ష్మీ ప్రతిమలు కూడా ఈ శిల్పశైలిలో నిర్మించడం జరిగింది.

C. అమరావతి శిల్పం: అమరావతి స్తూపం దీనికి గొప్ప ఉదాహరణ. సున్నపురాయి సొబగులు, బుద్ధుని జీవితానికి సంబంధించిన చిత్రాలు, స్వతంత్రంగా ఉన్న బుద్ధుని విగ్రహాలు చుట్టూ ప్రదర్శితం అవుతాయి. భారతీయ శిల్పానికి అది గొప్ప మకుటంలాంటిది.

గుప్తుల కాలం నాటి సంస్కృతి:
1) నిర్మాణాలు: భారతీయ నిర్మాణాలలో గుప్తుల కాలానికి ప్రత్యేక స్థానం ఉంది. నగర, ద్రావిడ పద్ధతుల్లో గుప్తుల కళ భారతీయ నిర్మాణ చరిత్ర వైభవానికి ప్రతీకగా నిలిచింది.
a. రాతి గుహలు: అజంతా, ఎల్లోరా, బాగ్ గుహలు రాతి గుహలకు ప్రతీకలుగా నిలుస్తాయి.
b. దేవాలయాలు: దేవాలయాల్లో ముఖ్యమైనవి.

  1. చతురస్రాకార చదరపు పైకప్పు దేవాలయం.
  2. రెండో అంతస్తు (విమాన) గల చతురస్రాకార చదరపు పైకప్పు దేవాలయం.
  3. ఒక శిఖరంతో చతురస్రాకార దేవాలయం.
  4. దీర్ఘచతురస్రాకార దేవాలయం.
  5. వృత్తాకార దేవాలయం.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

నచనాకుధార వద్ద గల పార్వతీ దేవాలయం, భూమ్రా వద్ద గల శివాలయం రెండో రకం దేవాలయానికి చెందినవి. మధ్యప్రదేశ్లోని దేవఘడ్, భట్టార్గాంవ్ దేవాలయాలు మూడో రకానికి చెందినవి. వీటి ప్రాధాన్యత ఏమిటంటే గర్భగుడిపైన శిఖరం ఉంటుంది. ఇది నగరశిల్ప నిర్మాణశైలి.

గుప్తుల కళ: గుప్తుల కాలం శిల్ప కళారంగం స్వర్ణయుగంగా ప్రసిద్ధిచెందింది. భవనాలు, దేవాలయాలు, స్తంభాలు, స్తూపాలు అనేకం నిర్మించారు. వీరు నిర్మించిన అద్భుతమైన దేవాలయాల్లో హూణులు, ముస్లిం దాడుల తరువాత మిగిలినవి

  1. ఝాన్సీ జిల్లాలోని దేవఘడ్ వద్దగల దశావతార దేవాలయం.
  2. మధ్యప్రదేశ్లోని భూమారా వద్దగల శివాలయం.

పెర్సీ బ్రౌన్ అభిప్రాయంలో భిట్టర్గావ్ దేవాలయ శిల్ప నిర్మాణం సుదీర్ఘ సంప్రదాయానికి ప్రతీకగా ఉంది. ఇంకా కొన్ని స్తూపాలు, గుహలు, విహారాలు కూడా నిర్మించబడ్డాయి. సారనాధ్ స్తూపం, అజంతా, ఉదయగిరి గుహలు ఆనాటి గొప్ప నిర్మాణాలు. అందమైన బుద్ధుని విగ్రహాలు రాతితో, లోహంతో, బంకమట్టితో చేయడంతోపాటు వివిధ పౌరాణిక బొమ్మలు రాతిపై అందంగా చెక్కారు.

శిల్ప నిర్మాణం:
a. రాతి శిల్పం: సారనాధ్ బుద్ధ విగ్రహం, ఉదయగిరి వద్దగల గుహ ప్రవేశ ద్వారం వద్దగల వరాహ ప్రతిమ చక్కటి ఉదాహరణలు. గ్వాలియర్ వద్ద ఒక నృత్యకారిణితో మహిళా సంగీత విద్వాంసులు చిత్రాలు అద్భుతమైనవి.

b. లోహ నిర్మాణం: 18 అడుగుల ఎత్తైన బుద్ధుని రాగి విగ్రహం, క్రీ.శ. 6వ శతాబ్దంలో బీహారులో నలంద వద్ద నిర్మించారు. సుల్తాన్ గంజ్ లోని బుద్ధ విగ్రహం 7/2 అడుగుల ఎత్తు ఉంది. ఢిల్లీలో మెహరోలి వద్ద ఉన్న ఇనుప స్తంభం గుప్తుల సాంకేతిక పరిజ్ఞానానికి మచ్చుతునక.
కనిష్కుడు గొప్ప భవన నిర్మాత. కనిష్కపురం, పురుషపురం అనే రెండు నగరాలను నిర్మించాడు.

ప్రశ్న 6.
గుప్తుల కాలాన్ని ‘స్వర్ణయుగం’ అని ఎందుకు అంటారు ?
జవాబు:
ప్రాచీన భారతదేశ చరిత్రలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగమంటారు. ఈ కాలాన్ని గ్రీస్ చరిత్రలోని పెరిక్లిస్ యుగంతోను, రోమన్ చరిత్రలోని అగస్టస్ యుగంతోను పోలుస్తారు. ఈ యుగంలో భారతదేశం అన్ని రంగాల్లోను అభివృద్ధిని సాధించింది.

రాజకీయ ఐక్యత: గుప్తపాలకులు ఉత్తర భారతదేశాన్ని అనైక్యత నుండి కాపాడి, దేశ సమైక్యతను సాధించారు. మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, చంద్రగుప్త విక్రమాదిత్యుడు మొదలగు పాలకులు తమ దిగ్విజయ యాత్రల ద్వారా దేశ రాజకీయ ఏకీకరణను సాధించారు.

విజ్ఞులైన చక్రవర్తులు: గుప్త చక్రవర్తులు సమర్థులు, పండితులు, శూరులు. వీరిలో సముద్రగుప్తుడు అగ్రగణ్యుడు. ఇతడు అజేయుడైన వీరుడే కాక మంచి కవి కూడా. గుప్త చక్రవర్తులందరూ మత సహనమును పాటించారు. వీరి వ్యక్తిగత ప్రతిభాసంపత్తి గుప్తయుగము స్వర్ణయుగము కావటానికి దోహదపడింది.

ఆర్థికాభివృద్ధి: గుప్తుల సమర్థవంతమైన పాలన వలన రాజ్యంలో సుఖశాంతులు ఏర్పడి ఆర్థికాభివృద్ధి జరిగింది. ప్రజలు సంపన్నులై, సంతోషంగా జీవించేవారని ఫాహియాన్ పేర్కొన్నాడు. శిక్షలు స్వల్పంగా ఉండేవి. బాటసారులకు దొంగల భయం లేకుండా ఉండేది. స్వదేశీ, విదేశీ వాణిజ్యం పురోగమించుటచే దేశసంపద పెరిగింది. పరిశ్రమలు వర్ధిల్లాయి. వ్యవసాయమునకు మంచి ప్రోత్సాహం లభించింది.

మతసామరస్యము:
ఎ) గుప్త చక్రవర్తులు హిందువులవటంతో అశ్వమేథము మొదలగు వైదిక కర్మలను ఆచరించారు. త్రిమూర్తులకు ప్రాధాన్యతనిచ్చారు. గుప్తుల ఇష్టదైవం విష్ణువు కనుక విష్ణుపురాణం, విష్ణుస్మృతి, భాగవతం మున్నగు గ్రంథములు ఆదరింపబడ్డాయి. శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి మున్నగు దేవతలను కూడా వీరు పూజించారు. ఈ కాలంలో సగుణోపాసనకు ప్రాముఖ్యం పెరిగింది.

బి) తాము వైదిక మతమును అవలంబించినప్పటికి గుప్త చక్రవర్తులు జైన, బౌద్ధమతముల యెడల అపారమైన సహనాన్ని పాటించారు. ప్రసిద్ధ బౌద్ధపండితుడైన వసుబంధుని సముద్రగుప్తుడు ఆదరించాడు. సింహళ ప్రభువు మేఘవర్ణుడు భారతదేశములో బౌద్ధవిహారము నిర్మించుటకు ఇతడు అనుమతించాడు. కుమారగుప్తుడు నలందా బౌద్ధ విశ్వవిద్యాలయమును స్థాపించాడు. నాటి బౌద్ధ, జైన ప్రతిమలు అసంఖ్యాకముగా లభించుటయే గుప్తుల మత సహనమునకు తార్కాణం. కాలక్రమేణా బౌద్ధమతం క్షీణించింది. మహాయాన బౌద్ధమతము హిందూమత శాఖవలె తోచుటయే ఇందుకు కారణం. జైనమతం మాత్రమే కొన్ని ప్రాంతాలలో కొనసాగింది. గుప్తులు ఉన్నత ఉద్యోగాలలో మత ప్రమేయం లేకుండా బౌద్ధులను, జైనులను నియమించారు.

సారస్వతాభివృద్ధి: గుప్తుల కాలంలో సంస్కృత భాష పూర్తి వికాసాన్ని పొందింది. సముద్రగుప్తుడు స్వయంగా కవి. “కవిరాజు” అను బిరుదాంకితుడు. సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు అలహాదాబ్ ప్రశస్థి శాసనాన్ని వ్రాశాడు. రెండో చంద్రగుప్తుని ఆస్థానంలో ‘నవరత్నాలు’ అనే కవులుండేవారు. వారు 1) కాళిదాసు 2) అమరసింహుడు 3) శంకు 4) ధన్వంతరి 5) క్షపణికుడు 6) భేతాళభట్టు 7) ఘటకర్షకుడు 8) వరరుచి 9) వరాహమిహిరుడు. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతల’మనే కావ్యం అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. ‘మృచ్ఛకటికం’ నాటకాన్ని రచించిన శూద్రకుడు ఈ కాలంవాడే. నాడు వసుబంధు, దిజ్ఞాగుడు, బుద్ధపాలితుడు, భావవివేకుడు వంటి బౌద్ధ రచయితలు నిరుపమానమైన రచనలు చేశారు. ఈ రచనల ద్వారా ఆనాటి రాజాస్థాన జీవితం, ప్రభువర్గాల జీవన విధానం గురించి తెలుస్తుంది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

విజ్ఞాన శాస్త్రాభివృద్ధి: విజ్ఞానశాస్త్రంలో కూడా గుప్తుల కాలం అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఆర్యభట్టు ‘సూర్యసిద్దాంత’మనే గ్రంథాన్ని, వరాహమిహిరుడు ‘బృహత్సంహిత’ అనే గ్రంథాన్ని రచించారు. బ్రహ్మగుప్తుడు గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టి తన పుస్తకం ద్వారా దానిని లోకానికి వెల్లడి చేశాడు. వైద్యశాస్త్రాభివృద్ధికి విశేషంగా కృషిచేసిన శుశ్రుతుడు, వాగ్భటుడు, ధన్వంతరి మొదలైనవారు గుప్తులకాలం వారే.

కళాభివృద్ధి: గుప్తుల కాలంలో కళలు కూడా పరాకాష్టనందుకొన్నాయి. ఈ కాలంలో జరిగిన నిర్మాణాలన్నీ మతం వలన ప్రేరేపితమైనవే. ఉదా: దేవఘర్లోని దశావతార దేవాలయం, తిగావా, భూమారా ఆలయాలు, సాంచి, సారనాధ్ లోని బౌద్ధాలయాలు ఈ కాలంలో వాస్తుకళ సాధించిన ప్రగతికి నిదర్శనాలు. గుప్తుల కాలంలో శిల్పకళ కూడా పరిపక్వతను పొందింది. అజంతా గుహల్లోని కొన్ని కుడ్యచిత్రాలు ఈ కాలానికి చెందినవే. లోహాలతో విగ్రహాలను, ఉక్కుతో స్తంభాలను పోతపోయడంలోను, రకరకాల అందమైన నాణాల తయారీలో కూడా గుప్తయుగం తన ప్రత్యేకతను నిలబెట్టుకొంది.

ముగింపు: గుప్తుల యుగం భారతదేశ చరిత్రలో ఒక విశిష్టయుగం. ఈ విశిష్టత ప్రధానంగా సాహిత్యం, విజ్ఞానశాస్త్రాలు కళారంగాలలో కనిపిస్తుంది.

7. క్రీ.పూ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు జరిగిన సాహిత్యాభివృద్ధిని తెలపండి. జవాబు: మౌర్యుల కాలంలో విద్యారంగంలో చాలా అభివృద్ధి జరిగింది. ప్రజలను విద్యావంతులను చేయడానికి పాలకులు చాలా శ్రద్ధ తీసుకొన్నారు. అశోకుని శాసనాలు సామాన్య ప్రజలు కూడా చదివి అర్థం చేసుకొనేట్లు ఉంటాయి. ప్రాచీన భారతదేశంలో తక్షశిల అతిప్రాచీన విద్యాలయం. ఇది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు సమానంగా విద్యాభ్యాసం చేయగల అత్యంత ప్రామాణిక విశ్వ విద్యాలయం. భారతదేశం నలుమూలల నుంచేగాక, ఇతర దేశాల నుంచి కూడా విద్యార్థులు కుల, మత, భేదాలు లేకుండా తక్షశిలకు వచ్చి విద్యాభ్యాసం చేశారు.

సారస్వత కార్యక్రమాలు: సారస్వత సంబంధ ప్రగతిలో మౌర్యుల కాలం ఉన్నత ప్రగతి సాధించింది. అశోకుని శాసనాల ద్వారా రెండు లిపులు ఉన్నట్లు తెలుస్తోంది. అవి బ్రహ్మ, ఖరోష్ఠి, కౌటిల్యుడు వ్రాసిన ‘అర్థశాస్త్రం’, భద్రుడు వ్రాసిన ‘కల్ప సూత్రాలు’, బౌద్ధ గ్రంథాలు కథావస్తువు, ధర్మ సూత్రాలు, గృహ సూత్రాలు ఈ కాలంలో రచించబడ్డాయి. కౌటిల్యుని ‘అర్థశాస్త్రం’ మౌర్యుల కాలంనాటి ప్రసిద్ధ గ్రంథం. మౌర్యుల పరిపాలన గురించి సమాచారం ఈ గ్రంథంలో ఉంది.

కనిష్కుడు – గొప్ప సాహిత్య పోషకుడు: కనిష్కుడు గొప్ప సాహిత్య, కళాపోషకుడు. అతడి ఆస్థానంలో చాలామంది పండితులు పోషణను అందుకొన్నారు. అశ్వఘోషుడు, నాగార్జునుడు, వసుమిత్రుడు, చరకుడు సుప్రసిద్ధ బౌద్ధ పండితులు. కనిష్కుడు ఆస్థానంలో ఉన్న అశ్వఘోషుడు వ్రాసిన గ్రంథాలు “బుద్ధచరిత్ర”, “సౌందరానంద కావ్యం”, “సరిపుత్త ప్రకరణ” ముఖ్యమైనవి. నాగార్జునుడు, వసుమిత్రుడు, చరకుడు తమ గ్రంథాలను సంస్కృతంలో వ్రాశారు. కనిష్కుని కాలంలో సంస్కృత భాష విరాజిల్లింది. కనిష్కుడు గొప్ప భవన నిర్మాత. కనిష్కపురం (కాశ్మీరు), పురుషపురం అనే రెండు నగరాలను నిర్మించాడు. బుద్ధుడి విగ్రహాలను గాంధార శిల్ప శైలిలో నిర్మింపజేశాడు. గ్రీకు – భారతీయ శిల్పకళా సమ్మేళనమే గాంధార శిల్పం.

గుప్తుల సారస్వతాభివృద్ధి గుప్తుల కాలంలో సంస్కృతభాష పూర్తి వికాసాన్ని పొందింది. సముద్రగుప్తుడు స్వయంగా కవి. “కవిరాజు” అను బిరుదాంకితుడు. సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు అలహాబాద్ ప్రశస్తి శాసనాన్ని వ్రాశాడు. రెండో చంద్రగుప్తుని ఆస్థానంలో “నవరత్నాలు” అనే కవులుండేవారు. 1) కాళిదాసు 2) అమరసింహుడు 3) శంకు 4) ధన్వంతరి 5) క్షపణికుడు 6) భేతాళభట్టు 7) ఘటకర్షకుడు 8) వరరుచి 9) వరాహమిహిరుడు. కాళిదాసు రచించిన “అభిజ్ఞాన శాకుంతలం’ అనే కావ్యం అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. “మృచ్ఛకటికం” నాటకాన్ని రచించిన శూద్రకుడు ఈ కాలం వాడే. నాడు వసుబంధు, దిజ్ఞాగుడు, బుద్ధపాలితుడు, భావవివేకుడు వంటి బౌద్ధ రచయితలు నిరుపమానమైన రచనలు చేశారు. ఈ రచనల ద్వారా ఆనాటి రాజాస్థాన జీవితం, ప్రభు వర్గాల జీవన విధానం గురించి తెలుస్తుంది.

పుష్యభూతి వంశస్తుల సాంస్కృతిక ప్రగతి: హర్షుడు గొప్ప సాహిత్య, కళా పోషకుడు స్వయంగా పండితుడు. డా॥ రాయిచౌదరి హర్షుని గురించి ఇలా చెప్పాడు. “హర్షుడు గొప్ప సేనాపతి, పరిపాలనాదక్షుడు. మతపోషకుడిగా, సాహిత్య పోషకుడిగా ప్రఖ్యాతిగాంచాడు. విద్యా బోధనకు, పండితుల పోషణకు ఉదారంగా విరాళాలిచ్చాడు. సంస్కృతంలో హర్షవర్ధనుడు ‘నాగానందం’, ‘రత్నావళి’, ‘ప్రియదర్శిక’ అనే గ్రంథాలు వ్రాశాడు. అతడి ఆస్థానంలో ఉన్న బాణభట్టు గొప్ప పండితుడు. హర్షుడు ఉదార దానాల ద్వారా విద్యావ్యాప్తికి కృషిచేశాడు. నలంద విశ్వవిద్యాలయ పోషణకు వంద గ్రామాలను దానం చేశాడు. చాలామంది విద్యార్థులు సుదూర ప్రాంతాలైన చైనా, టిబెట్, మంగోలియా దేశాల నుంచి విద్యాభ్యాసం కోసం వచ్చారు. ఈ విశ్వవిద్యాలయంలో 1500 మంది అధ్యాపకులు ఉన్నారు. శీలభద్రుడు విశ్వవిద్యాలయ అధ్యక్షులు వేదాలు, వ్యాకరణం, ఖగోళశాస్త్రం, గణితం, జ్యోతిష్యం, సాహిత్యం, నైతిక విలువల బోధన సంస్కృత భాషలో చేశారు. హుయన్ త్సాంగ్ ఈ విశ్వవిద్యాలయ విద్యార్థి, ధర్మపాలుడు, చంద్రపాలుడు, గుణమతి, స్త్రీర్మతి, ధ్యాన్ చంద్ర, కమల్ శీల మొదలైనవారు ఆచార్యులు. డా॥ R.C. మజుందార్ అభిప్రాయంలో “హర్షుడు యుద్ధం, శాంతి, కళలలో సమాన ప్రతిభ కలిగి ఉన్నాడు. కలం, కత్తి సమానంగా వాడగల నిపుణుడు, మేధావి అతడు”.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మౌర్యులకు చెందిన ప్రధాన చారిత్రక ఆధారాలు తెలపండి.
జవాబు:
భారతదేశ చరిత్రలో మౌర్య వంశానికి ఒక విశిష్టస్థానం ఉంది. ఈ వంశంవారు ప్రప్రథమంగా సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి దేశ సమైక్యతను చాలావరకు సాధించారు. తత్ఫలితంగా మౌర్య సామ్రాజ్య స్థాపనతో ఉత్తర భారతదేశ చరిత్రలో సామ్రాజ్యాల యుగం ప్రారంభమైనది. తమిళ, కేరళ ప్రాంతాలు మినహా మిగిలిన భారతదేశమంతా వీరి సార్వభౌమాధిపత్యం క్రిందికి రావడం గమనించదగ్గ విషయం. వీరు సమర్థవంతమైన పాలనావ్యవస్థను రూపొందించి ప్రజారంజకంగా పాలించారు. విశ్వమానవ కళ్యాణం, పరమత సహనం, శాంతి, అహింస, సర్వ మానవ సౌభ్రాతృత్వం వంటి ఉదాత్త లక్ష్యసాధనకు చివరి వరకు అహోరాత్రులు కృషిచేసిన విశ్వవిఖ్యాతులైన సామ్రాట్టులో అగ్రగణ్యుడైన అశోక చక్రవర్తి ఈ వంశానికి చెందినవాడు. ఇటువంటి మౌర్యుల చరిత్రను తెలుసుకొనుటకు ఈ క్రింది చారిత్రక ఆధారాలు ప్రధానమైనవి. అవి:

మౌర్యుల చరిత్ర అధ్యయనానికి ఉపకరించే ప్రధానమైన ఆధారాలు. శిలలపై రాతిస్తంభాలపై కనిపించే అశోకుడి శాసనాలు, కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం గ్రీకు రచయితల రచనలు. అంతేగాక పురాణాలు బౌద్ధమత గ్రంథాలు, ‘ముద్రారాక్షసం’ అనే నాటకం కూడా వీరి చరిత్ర అధ్యయనానికి ఉపయోగపడుతున్నాయి.

ప్రశ్న 2.
చంద్రగుప్త మౌర్యుడు మొదటి జాతీయ పాలకుడు – చర్చించండి.
జవాబు:
మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. ఇతడు చాణిక్యుని నేతృత్వంలో సకల విద్యాపారంగతుడై ఉత్తమ సైనికుడిగా రూపుదిద్దుకున్నాడు. చంద్రగుప్త మౌర్యుడు రెండు ఘనకార్యాలు సాధించాడు. మొదటిది వాయువ్య భారతదేశాన్ని గ్రీకుల నుంచి స్వాధీనం చేసుకోవటం కాగా, నందరాజులను ఓడించి మగధను ఆక్రమించటం రెండవది. అలెగ్జాండర్ భారతదేశమును వదిలివెళ్ళిన పిమ్మట చాణక్య, చంద్రగుప్త మౌర్యుడు మొదటగా పంజాబ్ ప్రాంతంలో ధైర్యసాహసాలకు పేరుబడ్డ జాతులవారిని చేరదీసి ఒక శక్తివంతమైన సైన్యమును సమకూర్చుకున్నారు. ఈ సైన్యం సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు ప్రథమంగా గ్రీకులను పారద్రోలి పంజాబును విదేశీపాలన నుండి విముక్తి చేశాడు. ఆ తరువాత నందరాజు నిరంకుశత్వాన్ని నిర్మూలించి మగధ సింహాసనాన్ని అధిష్టించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. జైన, బౌద్ధ ఐతిహ్యాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు రెండుసార్లు మగధపై దండయాత్ర జరిపాడని, రెండవ దండయాత్రలో విజయం సాధించి సామ్రాజ్య స్థాపనగావించాడని తెలుస్తున్నది. క్రీ.పూ. 305లో భారతదేశముపై దండెత్తి వచ్చిన గ్రీకు సేనాని సెల్యూకస్ నికటార్ను ఓడించి అతని వద్ద నుండి కాబూల్, కాందహార్, హీరట్, బెలూచిస్థాన్లను వశపరచుకొన్నాడు. చంద్రగుప్త మౌర్యుడు 6 లక్షల సైన్యంతో భారతదేశమంతటిని జయించాడని ప్లూటార్క్ అనే గ్రీకు చరిత్రకారుడు పేర్కొన్నాడు. ఈ దండయాత్రల వలన చంద్రగుప్త మౌర్యుని మౌర్య సామ్రాజ్యం పశ్చిమాన పర్షియా నుండి తూర్పున బీహార్ వరకు, దక్షిణాన తిరునల్వేలి జిల్లా వరకు విస్తరించింది.

భారతదేశంలోని అధిక భాగాలను ఒకే సామ్రాజ్య పరిధిలోనికి తీసుకొనివచ్చిన ఘనత చంద్రగుప్తు మౌర్యునికే దక్కుతుంది. అందువలన భారతదేశ చరిత్రలో చంద్రగుప్తమౌర్యుని జాతీయ పాలకుడుగా భావిస్తారు.

ప్రశ్న 3.
అశోకుని గొప్పతనాన్ని సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
భారతీయ చక్రవర్తులలోనే గాక ప్రపంచ చక్రవర్తులలో కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నవాడు అశోకుడు. అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యం ఆసేతు హిమాచల పర్యంతం విస్తరించింది.

తొలి జీవితం: అశోకుడు బిందుసారుని కుమారుడు. తండ్రి మరణానంతరం క్రీ.పూ. 273లో మౌర్య సింహాసనాన్ని అధిష్టించాడు. అయితే అశోకుడికి, అతని సోదరులకు మధ్య సింహాసనం కోసం పోరాటం జరగటం వల్ల అశోకుడు తన పట్టాభిషేకాన్ని క్రీ.పూ. 269లో జరుపుకున్నాడు. సింహళ చరిత్ర గ్రంథాలు అశోకుని స్వభావం క్రూరమైనదని, తండ్రి మరణానంతరం తన 99 మంది సోదరులను వధించి సింహాసనాన్ని ఆక్రమించాడని వివరిస్తున్నాయి. అయితే అశోకుడు ఒక శిలాశాసనంలో తన సోదరుల, బంధువుల సంక్షేమానికి తీసుకున్న శ్రద్ధను ప్రస్తావించాడు. కాబట్టి అశోకుని వ్యక్తిత్వాన్ని మార్చటంలో బౌద్ధమతం యొక్క గొప్పదనాన్ని నొక్కిచెప్పటం కోసం ఈ ఐతిహ్యాన్ని సృష్టించారని, అది వాస్తవం కాదని కొందరు చరిత్రకారుల అభిప్రాయం.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

అశోకుని చరిత్రకు ఆధారాలు: అశోకుని ఉదాత్త లక్ష్యాలు, ఆదర్శాలు, పరిపాలనా కాలంలోని ముఖ్య సంఘటనలను తెలుసుకోవడానికి అతడు దేశంలో వివిధ ప్రాంతాల్లో వేయించిన శిలాస్తంభ శాసనాలు ఎంతో ఉపకరిస్తాయి. ఈ శాసనాలు బ్రాహ్మీలిపిలో వున్నాయి. బౌద్ధమత గ్రంథాలైన “మహావంశ”, “దివ్యావదాన” కూడా అశోకుని చరిత్రకు సంబంధించిన అంశాలను వివరిస్తాయి. అశోకుడు తన శాసనాలలో తనను ‘దేవానాంప్రియ’ (దేవతలకు ప్రియమైనవాడు), ‘ప్రియదర్శి’ (చక్కని రూపం కలవాడు) అని చెప్పుకున్నాడు.

కళింగ యుద్ధం: అశోకుడు మౌర్య సింహాసనాన్ని అధిష్టించక పూర్వం ఉజ్జయిని పాలకుడుగా పనిచేసి పరిపాలనానుభవాన్ని గడించాడు. పట్టాభిషేకం జరుపుకున్న 9 సంవత్సరాలకు (క్రీ.పూ. 261) సామ్రాజ్య విస్తరణకాంక్షతో కళింగపై దండెత్తాడు. అందుకు కారణం మగధ సామ్రాజ్యంలో భాగంగా వున్న కళింగ, నందరాజుల పతనంతో స్వతంత్రించింది. పైగా దక్షిణ భారతదేశానికి వున్న, భూ, జల మార్గాలు కళింగ ద్వారా వుండటం వల్ల దానిని స్వాధీనం చేసుకోదలిచాడు. క్రీ.పూ. 261లో జరిగిన కళింగ యుద్ధంలో లక్షమంది హతులైనట్లు, లక్షన్నర మంది ఖైదీలుగా పట్టుబడినట్లు అశోకుడు తన 13వ శిలాశాసనంలో పేర్కొన్నాడు. ఈ విజయంతో కళింగ మౌర్య సామ్రాజ్యంలో అంతర్భాగమైంది. కళింగ యుద్ధం అశోకునిలో వినూత్నమైన హృదయ పరివర్తనను తెచ్చింది. చండాశోకుడు ధర్మాశోకుడుగా మారాడు. ఇకముందు యుద్ధాలు చేయకూడదని, ధర్మప్రచారం, ప్రజాసంక్షేమం కోసం పాటుపడాలని నిశ్చయించుకొన్నాడు. ఉపగుప్తుడనే బౌద్ధమతాచార్యుని వద్ద బౌద్ధమత దీక్ష తీసుకున్నాడు. రెండు సంవత్సరాల తరువాత బౌద్ధ భిక్షువుగా మారి బుద్ధగయ, లుంబిని, కపిలవస్తు, శ్రావస్తి, కుశ నగరాలను సందర్శించాడు. బౌద్ధభిక్షువుగానే రాజ్యభారాన్ని నిర్వహించాడు.

సామ్రాజ్య విస్తీర్ణం: అశోకుని సామ్రాజ్యం సువిశాలమైనది. తమిళనాడు, అస్సాం ప్రాంతాలు మినహా మిగిలిన భారతదేశమంతా అశోకుని సామ్రాజ్యంలో భాగంగా వుంది. భారతదేశం వెలుపలి ప్రాంతాలైన కాబూల్, కాందహార్, హీరత్, బెలూచిస్థాన్లు ఇతని సామ్రాజ్యంలో చేరివున్నాయి.

బౌద్ధమత వ్యాప్తి: బౌద్ధమతాన్ని స్వీకరించిన తరువాత అశోకుడు స్వదేశంలోను, విదేశాల్లోను బౌద్ధధర్మ ప్రచారం కోసం సంఘాలను ఏర్పాటు చేశాడు. బౌద్ధ ధర్మసూత్రాలను శిలలు, స్తంభాలపై చెక్కించి జనసమ్మర్ధ ప్రదేశాలలో, యాత్రాస్థలాల్లో వాటిని నెలకొల్పాడు. అహింసా సిద్ధాంతానికి అనుగుణంగా జంతు బలులు, వేటలు, మాంసాహార వంటకాలను నిషేధించాడు. పాటలీపుత్రంలో మూడవ బౌద్ధ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ధర్మబోధన చేయటానికి ధర్మ మహామాత్రులనే ప్రత్యేక అధికారులను నియమించాడు. మత ప్రచారకులను ఈజిప్టు, మాసిడోనియా, సైప్రస్, ఎపిరస్ మొదలైన దేశాలకు పంపాడు.

అశోకుని ధర్మం: తన సామ్రాజ్య పటిష్టత కోసం అశోకుడు ఒక ధర్మాన్ని ప్రవచించాడు. అశోకుని ఆదర్శాలు, ఆలోచనలు అశోకుని ధర్మంలో కనిపిస్తాయి. అన్ని మతాల మహోన్నత ఆదర్శాలకు ఈ ధర్మం అద్దంపడుతుంది. ఈ ధర్మసూత్రాల్లో ప్రధానమైనవి: జీవహింస చేయరాదు. ఇతరుల విశ్వాసాలు, భావాలపట్ల సహనాన్ని చూపాలి. సర్వప్రాణులపట్ల కరుణ, జాలి చూపాలి. బానిసలు, సేవకుల పట్ల దయతో మెలగాలి. గృహస్థులను, బ్రాహ్మణులను, సన్యాసులను దయతో సత్కరించాలి. వారికి ధనసహాయాన్ని చెయ్యాలి. మాటలను అదుపులో పెట్టుకొని ఇతరుల మతాన్ని గౌరవించటం ద్వారానే తమ మతాన్ని, మత పలుకుబడిని పెంచుకోవాలి. ఈ సార్వజనీనమైన సూత్రాలను ఆచరించినట్లయితే మానవుడు సత్ప్రవర్తన, నైతికతలను సాధించి మోక్షాన్ని పొందుతాడు.

అశోకుని పరిపాలన: అశోకుడు తన సామ్రాజ్యంలో రాష్ట్రస్థాయిలో పరిపాలనా వికేంద్రీకరణను ప్రవేశపెట్టాడు. పరిపాలనలో అతనికి యువరాజు, రాజకుమారుడు, కుమార, ఆర్యపుత్ర మొదలైనవారు సహాయపడేవారు. తక్షశిల, ఉజ్జయిని, వైశాలిలను రాష్ట్రాలకు కేంద్రాలుగా చేసి వాటికి కుమారులను రాష్ట్రపాలకులుగా నియమించాడు. రాజ్య వ్యవహారాల్లో రాజుదే తుదినిర్ణయం. న్యాయవిచారణలో అశోకుడు న్యాయమూర్తుల జాగు, అసహనాలను తొలగించి ప్రశంసనీయమైన మార్పులను ప్రవేశపెట్టాడు.

ప్రశ్న 4.
అశోకుని ధర్మము అంటే ఏమిటి ?
జవాబు:
అశోకుని కాలంలో వివిధ మతశాఖలు సామాజిక ఉద్రిక్తతను సృష్టించాయి. నగరాల్లో వ్యాపారవర్గాలు బలపడటంవల్ల నూతన సామాజిక స్థితి ఏర్పడింది. సామ్రాజ్య సువిశాలత్వం కూడా కొన్ని సమస్యలను సృష్టించింది. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొని, దేశ సమైక్యతను సాధించటానికి ఒక క్రొత్త విధానం కావలసి వచ్చింది. అందువలననే అశోకుడు తన ధర్మాన్ని ప్రతిపాదించాడు.

అశోకుని ఆదర్శాలు, ఆలోచనలు అతనిలో కనిపిస్తాయి. బౌద్ధధర్మం, అశోకుని ధర్మం ఒకటి కాదు. ప్రజలకు సులభంగా అర్థమయ్యే ప్రాకృత భాషలో అశోకుడు తన ధర్మాన్ని శిలాశాసనాల్లో పొందుపరిచాడు. అన్ని మతాల మహోన్నత ఆదర్శాలకు ఈ ధర్మం అద్దం పడుతుంది. అశోకుని ధర్మం ముఖ్యంగా మానవుల ప్రవర్తన, నీతికి సంబంధించిన నియమావళికి వర్తిస్తుంది. ఈ ధర్మసూత్రాల్లో ప్రధానమైనవి:

  1. జీవహింస చేయరాదు.
  2. ఇతరుల విశ్వాసాలు, భావాలపట్ల సహనాన్ని చూపాలి.
  3. సర్వప్రాణులపట్ల కరుణ, జాలి చూపాలి.
  4. బానిసలు, సేవకులపట్ల దయతో మెలగాలి.
  5. గృహస్థులను, బ్రాహ్మణులను, సన్యాసులను దయతో సత్కరించాలి. వారికి ధనసహాయాన్ని చేయాలి.
  6. మాటలను అదుపులో పెట్టుకొని ఇతరుల మతాన్ని గౌరవించటం ద్వారా తమ మతాన్ని, మత పలుకుబడిని పెంచుకోవాలి.

ఈ సార్వజనీనమైన సూత్రాలను ఆచరించినట్లయితే మానవుడు సత్ప్రవర్తన, నైతికతలను సాధించి మోక్షాన్ని పొందుతాడు. అశోకుడు కర్మకాండను, మూఢాచారాలను ఖండించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

ప్రశ్న 5.
భారతదేశ ఆర్థిక, సాంస్కృతిక జీవనంలో కుషాణుల కాలానికి గల ప్రాధాన్యత తెలపండి.
జవాబు:
కనిష్కుడి ఆస్థానం ఎంతోమంది పండితులకు ఆశ్రయం కల్పించింది. పార్శ్వుడు, వసుమిత్రుడిలాంటి బౌద్ధ పండితులు నాల్గవ బౌద్ధసంగీతిని నిర్వహించారు. ‘బుద్ధచరిత్ర’, ‘సౌందరనందం’ అనే గ్రంథాలు వ్రాసిన అశ్వఘోషుడు గొప్ప తత్వవేత్త, కవి. మహాయాన మతాన్ని ప్రచారం చేసిన నాగార్జునుడు కూడా కనిష్కుని కాలంవాడే. వీరిరువురు కనిష్కుని ఆదరణ అందుకొన్నారు. కనిష్కుడు మత గ్రంథాలనే కాకుండా లౌకిక గ్రంథాలు, శాస్త్రాలను కూడా ఆదరించాడు.

మాతంగుడనే రాజకీయ దురంధరుడు కనిష్కుడి అమాత్యుడు. ‘చరక సంహిత’ను రచించిన చరకుడు కనిష్కుని ఆస్థాన వైద్యుడు. ఈ చరక సంహితలో రోగనిర్ధారణ, రకరకాల రోగాలు, అవి రావడానికి కారణాలు, రక్తప్రసరణ-పరీక్ష, మానవ శరీరశాస్త్రం, పిండోత్పత్తి (embryology) మొదలైనవి విపులీకరించడం వల్ల పారశీకం మొదలైన భాషల్లోకి ఈ గ్రంథం అనువాదాలు వెలువడ్డాయి.

కళాసేవ: అశోకుడిలాగా ఎన్నో శిల్పాలు చెక్కించడానికి, కట్టడాలు నిర్మించడానికి, చిత్రాలు గీయించడానికి కనిష్కుడు పూనుకొన్నాడు. ‘కనిష్కపురం’ లోని 13 అంతస్తుల స్తంభం (Tower), మధురలోని శిల్పాలు, ‘పురుషపురం’ లోని బౌద్ధవిహారం, స్తూపం ఎంతో ప్రసిద్ధిచెందాయి. రాజధాని పురుషపురంలో 400 అడుగుల ఎత్తు గోపురం నిర్మించి అందులో నిలువెత్తు బుద్ధ విగ్రహం ప్రతిష్టించాడు. గాంధార శిల్పం ఇతని కాలంలోనే ఉచ్ఛస్థితికి చేరుకుంది. శిల్పాలకు మధుర కేంద్రమయింది. అనేక భంగిమలలో బుద్ధుని ప్రతిమలు మలచబడ్డాయి.

కనిష్కుడు విదేశీయుడైనా 41 సంవత్సరాల సుదీర్ఘపాలనలో భారతదేశ చరిత్రలో గొప్ప చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నాడు. చరిత్రలో ఉత్తమ స్థానాన్ని సంపాదించుకున్నాడు. అతని తర్వాత వచ్చిన రాజుల (హనిష్కుడు, వసిష్కుడు) బలహీనత వల్ల, కుషాణుల రాజ్యం అంతరించింది.

ప్రశ్న 6.
గుప్తుల కాలానికి సంబంధించిన ప్రధాన చారిత్రక ఆధారాలను తెలపండి.
జవాబు:
కుషాణ సామ్రాజ్య పతనానంతరం భారతదేశంలో, ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో, క్రీ.శ. 4వ శతాబ్ది వరకు ఏ రాజ వంశము సామ్రాజ్యాధికారాన్ని నెలకొల్పలేదు. క్రీ.శ. 4వ శతాబ్ది ప్రథమార్థంలో గుప్త సామ్రాజ్య స్థాపన మగధలో జరిగింది. అంతవరకు, ఈ ప్రాంతమంతటా చిన్నచిన్న రాజ్యాల వ్యవస్థ కొనసాగింది. ఈ చిన్నచిన్న రాజ్యాల్లో రాజకీయ అస్థిరత్వం నెలకొనడంతో రాజకీయ ఆధిక్యత కోసం ఇక్కడి రాజులు తరచు యుద్ధాలు చేశారు. ఇటువంటి రాజకీయ కల్లోల పరిస్థితుల్లో, రాజకీయంగా, సాంస్కృతికంగా, దేశాన్ని సమైక్యపరిచి అన్నివిధాలా స్వర్ణయుగాన్ని సృష్టించడానికి కృషి చేసినవారు గుప్తులు. వీరు క్రీ.శ. 4వ శతాబ్ది నుంచి క్రీ.శ. 6వ శతాబ్ది మధ్య వరకు, భారతదేశాన్ని
పరిపాలించారు.

గుప్తుల కాలంనాటి ప్రాచీన భారతదేశ చరిత్ర రచనకు ఆధారాలు అనేకం ఉన్నాయి. ఆ ఆధారాలను మూడు విభాగాలు చేయవచ్చు. అవి 1. గ్రంథాలు 2. శాసనాలు 3. జ్ఞాపకచిహ్నాలు, ముద్రలు, కళాఖండాలు, చిత్రాలు, నాణాలు మొదలైనవి.

గ్రంథాల్లో ముఖ్యమైనవి, విశాఖదత్తుడు రచించిన ‘ముద్రారాక్షసం’, ‘దేవి చంద్రగుప్తం’ మొదలైన స్వదేశీ గ్రంథాలు, హుయాన్ త్సాంగ్, ఫాహియాన్ అనే విదేశీ రాయబారులు రచించిన సి-యూ-కి, షో-కువో-కి అనేవి.

శాసనాల్లో ముఖ్యమైనవి రెండో చంద్రగుప్తుడి కాలంనాటి ఉదయగిరి గుహల్లోని శాసనాలు, మధుర శిలా శాసనం, సాంచి శిలా శాసనం మొదలైనవి. ఇవి ఆనాటి ప్రభుత్వ విధానాన్ని, మత విధానాన్ని తెలియజేస్తాయి. జునాగఢ్ శాసనం, ఇండోర్ రాగి రేకు శాసనం, స్కంధగుప్తుని గురించి తెలుపుతున్నాయి.

ఇంకా గుప్తుల కాలంనాటి జ్ఞాపక చిహ్నాలైన అజంతా, ఎల్లోరా గుహల్లోని చిత్రలేఖనం, వారు ప్రవేశపెట్టిన వివిధ రకాలైన నాణాలు వారి ఆర్థిక, సాంస్కృతిక రంగాల ప్రగతిని తెలియజేస్తున్నాయి.

ప్రశ్న 7.
సముద్రగుప్తునిపై సంక్షిప్త వ్యాసం రాయండి.
జవాబు:
గుప్తచక్రవర్తులలో సముద్రగుప్తుడు (క్రీ.శ. 335-380) అగ్రగణ్యుడు. సముద్రగుప్తుని విజయాలను, వ్యక్తిత్వాన్ని అతడు జారీచేసిన శాసనాల ఆధారంగా తెలుసుకోవచ్చు.

తొలి జీవితం: సముద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుడు, కుమారదేవీలకు జన్మించాడు. మొదటి చంద్రగుప్తుడు తన వారసుడిగా సముద్రగుప్తుడిని నియమించాడు. కాని సముద్రగుప్తుడు జ్యేష్ఠుడు కానందున వారసత్వయుద్ధం జరిగిందని, అందులో తన అన్న “కచుని” సముద్రగుప్తుడు ఓడించాడని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. కాని “కచుడు” అనునది సముద్రగుప్తునికి గల మరియొక పేరని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.

సైనిక విజయాలు: సముద్రగుప్తుడు గొప్ప విజేత. విదేశీదాస్యం నుంచి భారతదేశానికి విముక్తిని కలిగించి భారతదేశమంతటిని ఒకే పాలన క్రిందకు తీసుకురావాలని ఇతడు ఆశించాడు. ఇతని ఆస్థాన పండితుడు, సేనాపతి అయిన హరిసేనుడు అలహాబాద్ లో అశోక స్తంభం మీద వ్రాయించిన “అలహాబాద్ ప్రశస్థి” ద్వారా ఇతని సైనిక విజయాలను తెలుసుకోవచ్చు. దీని ప్రకారం సముద్రగుప్తుని విజయాలను మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి: 1) మొదటి ఆర్యావర్త విజయాలు 2) దక్షిణభారత విజయాలు 3) రెండో ఆర్యావర్త విజయాలు.

1) మొదటి ఆర్యావర్త విజయాలు: సింహాసనాన్ని అధిష్ఠించిన వెంటనే సముద్రగుప్తుడు తన అధికారాన్ని ధిక్కరించిన ఉత్తర భారతంలోని రాజులను జయించి పాటలీపుత్రంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ యుద్ధాల్లో సముద్రగుప్తుడు ఓడించిన రాజులు: అహిచ్ఛత్రాన్ని పాలిస్తున్న అచ్యుతుడు, గ్వాలియర్ సమీపంలో పద్మావతీపురాన్ని పాలిస్తున్న నాగసేనుడు, మధురాపురాధీశుడైన గణపతి నాగుడు, ఇంకా చంద్రవర్మ, రుద్రదేవ వంటి మొత్తం 9 మంది రాజులను అణచి సముద్రగుప్తుడు తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇతని పరాక్రమాన్ని గుర్తించి సరిహద్దు రాజ్యాలైన సమతట, కామరూప, నేపాల్, దావక, కర్రిపుర మొదలైన రాజ్యపాలకులు సముద్రగుప్తుడితో మైత్రి చేసుకున్నారు. మాళవ, యౌధేయ, అభీర వంటి గణరాజ్యాలు ఇతని ఆధిపత్యాన్ని అంగీకరించాయి. ఈ విజయాల ఫలితంగా ఇతని సామ్రాజ్యం హిమాలయాల నుంచి ‘భిల్సా’ వరకు, పంజాబ్ నుంచి బెంగాల్ వరకు విస్తరించింది.

2) దక్షిణ భారత విజయాలు: మొదటి ఆర్యావర్త యుద్ధాల తరువాత సముద్రగుప్తుడు దక్షిణభారతంపై దండెత్తాడు. ఈ దండయాత్రలో సముద్రగుప్తుడు 12 మంది రాజ్యపాలకులను ఓడించి వారి రాజ్యాలను తిరిగి వారికే అప్పగించాడు. ఆ పాలకులు 1) కోసల పాలకుడైన మహేంద్రరాజు 2) మహాకాంతార పాలకుడైన వ్యాఘ్రరాజు 3) ఏరండపల్లి దమనుడు 4) పిష్టపుర రాజు మహేంద్రుడు 5) కొత్తూరును పాలించే స్వామిదత్తుడు 6) దేవరాష్ట్ర పాలకుడైన కుబేరుడు 7) వేంగి పాలకుడైన హస్తివర్మ 8) పాలక్క రాజైన ఉగ్రసేనుడు 9) కేరళ రాజ్యాన్ని పాలించే మంత్రరాజు 10) కుశస్థలపురం పాలకుడు ధనంజయుడు11) అవముక్త పాలకుడు నీలరాజు 12) కంచిని పాలించిన విష్ణుగోపుడు.
సముద్రగుప్తుని ఈ దండయాత్ర మార్గాన్ని గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు వున్నాయి.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

3) రెండో ఆర్యావర్త విజయాలు: సముద్రగుప్తుడు దక్షిణ భారత విజయాల్లో మునిగివున్న సమయంలో ఉత్తరభారతంలోని రాజులు వాకాటక రాజు రుద్రసేనుని నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. సముద్రగుప్తుడు వారిని “కౌశాంబి” యుద్ధంలో ఓడించి, అశ్వమేధయాగాన్ని చేసి సామ్రాట్టుగా ప్రకటించుకున్నాడు. ఈ విజయాలను గుర్తించి మధ్యభారతంలోని అనేక అటవీ రాజ్యాల అధిపతులు ఇతని ఆధిపత్యాన్ని అంగీకరించారు.

ఇట్టి విజయ పరంపరల వలన చరిత్రకారులు సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అని కీర్తించారు.

ఇతర దేశాలతో సంబంధాలు: విజేతగా సముద్రగుప్తుడి కీర్తి, ప్రతిష్టలు విదేశాలకు కూడా వ్యాపించాయి. అనేకమంది విదేశీరాజులు ఇతనితో దౌత్య సంబంధాలనేర్పరుచుకొన్నారు. సింహళరాజైన మేఘవర్ణుడు క్రీ.శ. 351లో ఇతని ఆస్థానానికి రాయబారులను, కానుకలను పంపడమే కాకుండా తన దేశం నుంచి భారతదేశం వచ్చే బౌద్ధ యాత్రికుల కోసం బుద్ధగయ సమీపంలో ఒక విహారాన్ని నిర్మింపజేశాడు.

ప్రశ్న 8.
గుప్తుల పాలనలో సమాజం, ఆర్థిక స్థితి, మతం వివరించండి.
జవాబు:
సమాజం: సామాజిక ఏర్పాటుకు కుల వ్యవస్థ ఆధారం. సమాజం నాలుగు వర్గాలుగా విభజించబడింది. బ్రాహ్మణులు, క్షత్రియ, వైశ్య, శూద్రులు. బ్రాహ్మణులు సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవించబడ్డారు. చక్రవర్తులు కూడా వీరిని సత్కరించేవారు. అనేక విషయాల్లో పురోహితుడే చక్రవర్తికి ప్రధాన సలహాదారుడు. బ్రాహ్మణుల తరువాత క్షత్రియులు, వైశ్యులు గౌరవ స్థానాల్లో ఉన్నారు. ‘చండాలుర’ గురించి ఫాహియాన్ తెలిపాడు. సాధారణంగా వారు వేటగాళ్ళు, మత్స్యకారులు, కసాయి వారు అయి ఉండవచ్చని తెలుస్తుంది.

స్త్రీ స్థానం: కొన్ని అంశాల్లో స్త్రీ హోదా గుప్తుల కాలంనాటి సమాజంలో తగ్గింది. బాల్య వివాహాలు విస్తారంగా జరిగేవి. ‘సతీసహగమనం’ క్రమంగా వాడుకలోకి వచ్చింది.

ఆర్థిక వ్యవస్థ: మౌర్యులలాగా గాక గుప్తులు గొప్ప బిరుదులను ధరించారు. ‘మహారాజాధిరాజ’ అనే బిరుదు వల్ల చిన్న రాజ్యాలు, రాజులు ఉండేవారని తెలుస్తుంది. గుప్తులు జయించిన చాలా రాజ్య భాగాలు భూస్వాముల పాలనలో ఉండేవి. బెంగాలు, బీహారు, ఉత్తరప్రదేశ్ రాజ్య భాగాలు కేంద్రంగా గుప్త సామ్రాజ్య పాలన జరిగింది.

పెద్ద కేంద్ర సైన్యం, అధికార వర్గం లేకపోవడం: మౌర్యులకు భిన్నంగా, గుప్తులకు పెద్ద వ్యవస్థీకృత సైన్యం లేదు. భూస్వాములు పంపే సైన్యమే గుప్తుల సైన్యంలో ప్రధాన భాగం. అదేవిధంగా అధికార వర్గం కూడా లేదు. వీటివల్ల పాలనా యంత్రాంగంపై చక్రవర్తి నియంత్రణ తగ్గింది.

భూస్వామ్య అంశాల అభివృద్ధి:

  • భూదానాలు చేయడం: పురోహితులకు, దేవాలయ భూములు, గ్రామాలు విరాళాలుగా ఇచ్చి, పన్నులు వసూలు, పాలనాధికారులు ఇవ్వడంతో అది వికేంద్రీకరణకు దారితీసింది. సేద్యపు కూలీల అణచివేత, దానం చేసిన గ్రామాల ప్రజల అణచివేతతో వారిపై పెత్తనం పెరిగింది.
  • సేద్యపు బానిసత్వం: భూదానాలు, భూస్వామ్య వ్యవస్థకు దారితీసింది. చాలా శాసనాల్లో సేద్యపు బానిసత్వం గురించి తెలిపారు. భూములు అమ్మినప్పుడు, ఇతరులకు ఇచ్చినప్పుడు దానితోపాటు సేద్యపు బానిసలను కూడా ఇచ్చారు.

ప్రశ్న 9.
హర్షవర్ధుని గొప్పతనాన్ని అంచనా వేయండి.
జవాబు:
గుప్త సామ్రాజ్యం పతనానంతరం ఉత్తర భారతదేశం అనేక చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. వాటిలో ఒకటి స్థానేశ్వర రాజ్యం. స్థానేశ్వర పాలకులలో హర్షుడు ప్రముఖుడు. (క్రీ.శ. 606-647). హర్షుడు తన జైత్రయాత్ర ద్వారా ఉత్తర భారత రాజకీయ ఏకీకరణను సాధించాడు.

చారిత్రక ఆధారాలు: హర్షుని చరిత్రను తెలుసుకోవటానికి బాణుడు రచించిన హర్షచరిత్ర, హుయాన్ త్సాంగ్ రచించిన సి-యూ-కి, హర్షుడు వేయించిన బన్సీభేరా, మధుబన్, సోనేపట్ శాసనాలు ముఖ్య ఆధారాలు. హర్షుడు రచించిన నాటకాలు కూడా నాటి సాంఘిక పరిస్థితులను వివరిస్తాయి.

తొలి జీవితం: హర్షుడు పుష్యభూతి వంశస్థుడు. ఇతడి తండ్రి ప్రభాకర వర్ధనుడు. ప్రభాకర వర్థనుడి మరణానంతరం హర్షుని సోదరుడు రాజ్యవర్ధనుడు రాజ్యానికి వచ్చాడు. అయితే గౌడ శశాంకుని కుట్రకు రాజ్యవర్ధనుడు బలైపోయాడు. అంతట క్రీ.శ. 606 లో హర్షుడు తన 16వ ఏట స్థానేశ్వర రాజ్య సింహాసనాన్ని ‘రాజపుత్ర’ అను బిరుదుతో అధిష్టించాడు.

తొలి ఘనకార్యాలు: సింహాసనానికి వచ్చిన వెంటనే హర్షుడు కామరూప దేశాధిపతియైన భాస్కరవర్మతో మైత్రిని పొందాడు. తరువాత మాళవ, గౌడాధీశులను ఓడించాడు. వింధ్య అడవులకు పారిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న తన సోదరి రాజ్యశ్రీని రక్షించాడు. అంతట కనోజ్ మంత్రి పరిషత్ విన్నపం మేరకు స్థానేశ్వరం, కనోజ్ రాజ్యాలను కలిపి “శ్రీలాదిత్య” అను బిరుదుతో పరిపాలనను ప్రారంభించాడు. తన రాజధానిని స్థానేశ్వరం నుంచి కనోజ్కు మార్చాడు. క్రీ.శ. 606 నుండి 647 వరకు హర్షుడు రాజ్యశ్రీతో కలిసి పాలించినట్లు తెలుస్తున్నది.

జైత్రయాత్రలు: శూరుడైన హర్షుడు విశాల సైన్యాన్ని సమకూర్చుకొని 6 సంవత్సరాలపాటు నిరంతరంగా దిగ్విజయ యాత్ర సాగించి సామ్రాజ్యాన్ని విస్తరింపచేసినట్లు హుయాన్ త్సాంగ్ పేర్కొన్నాడు. మొదట గృహవర్మ మరణానికి కారకుడైన మాళవరాజు దేవగుప్తుడిని తొలగించి, అతని తమ్ముడు మాధవగుప్తుడికి సింహాసనాన్ని అప్పగించి తనకు సామంతుడిగా చేసుకున్నాడు. వల్లభిరాజు ధృవసేనుడిని ఓడించి అతనికి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేశాడు. క్రీ.శ. 637లో తూర్పు ప్రాంతానికి దండయాత్రలకు వెళ్ళి వంగ, మగధ, గంజామ్ (ఒరిస్సా) ప్రాంతాలను పాలిస్తున్న శశాంకుడిని ఓడించాడు.

పులకేశి చేతిలో ఓటమి: ఉత్తరాపథంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకొని దక్షిణాపథాన్ని కూడా జయించాలని హర్షుడు నిర్ణయించుకున్నాడు. ఈ ఆలోచనతో దక్షిణాపథంపై దండయాత్రకు బయలుదేరాడు. కాని పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి హర్షుని నర్మదానదీ తీరప్రాంతంలో ఓడించి వెనుకకు మళ్ళించాడు. నర్మదానది ఇరువురి రాజ్యాలకు మధ్య సరిహద్దు అయింది. ఈ విషయాన్ని రెండవ పులకేశి తన ఐహోల్ శాసనంలో వివరించాడు.

రాజ్య విస్తీర్ణం: హర్షుని సామ్రాజ్యంలో తూర్పు పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, గంజామ్ ప్రాంతాలు మాత్రమే చేరాయి. రెండవ పులకేశి తన ఐహోల్ శాసనంలో హర్షుని “సకలోత్తరపధేశ్వరుని”గా వర్ణించటాన్ని బట్టి ఉత్తర భారతదేశమంతా హర్షుని ఆధీనంలో ఉన్నట్లుగా తెలుస్తున్నది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

పాలన: హర్షుడు సమర్ధవంతుడైన పాలకుడు. ప్రజాసంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాడు. ప్రజల స్థితిగతులను కనుగొనుటకు అతడు విస్తృతంగా పర్యటించేవాడు. హర్షుడు విరామమెరుగక రాజ్యభారాన్ని నిర్వహించేవాడని హుయాన్ త్సాంగ్ వ్రాశాడు. హర్షుడు తన సామ్రాజ్యాన్ని భుక్తులుగాను, విషయాలుగాను, గ్రామాలుగాను విభజించాడు. పండిన పంటలో 6వ వంతును మాత్రమే పన్నుగా వసూలు చేసేవాడు. హర్షుని శిక్షాస్మృతి కఠినంగా ఉండేది. నేరములు అధికంగా ఉండేవి. హర్షుని సైన్యంలో 5వేల ఏనుగులు, 2వేల గుర్రాలు, 50వేల కాల్బలము ఉన్నట్లు తెలుస్తున్నది.

దాన ధర్మాలు: బీదలకు దానధర్మములు చేయుటలో హర్షుడు అశోకుని అనుసరించాడు. రోగులకు, బాటసారులకు అనేక సౌకర్యములు కల్పించాడు. ప్రయాగలో మహామోక్షపరిషత్తును ఐదేండ్లకొకసారి జరుపుచూ, సర్వస్వదానము అను మహావ్రతమును చేశాడు. అందు మొదటిరోజు బుద్ధుని, రెండవ రోజు సూర్యుని, మూడవ రోజు శివుని పూజించి 5 లక్షల జనులకు దానధర్మములు చేశాడు.

విద్యా, సారస్వత పోషణ: హర్షుడు విద్యా, సారస్వతాలను కూడా ఆదరించాడు. నలందా విశ్వవిధ్యాలయానికి 100 గ్రామాలను దానం చేశాడు. పండిత పోషణకు తన ఆదాయంలో 4వ వంతును వినియోగించాడు. హర్షుడు స్వయంగా కవి. ఇతడు రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక అనే నాటకాలను రచించాడు. ఇతని ఆస్థాన కవి బాణుడు “హర్షచరిత్ర”, “కాదంబరి” అను వచన కావ్యాలను రచించాడు. సుభాషిత శతకాన్ని రచించిన భర్తృహరి, సూర్య శతకాన్ని రచించిన మయూరుడు, మతంగ దివాకరుడు హర్షుని ఆస్థానంలోనే వారే.

ఘనత: ప్రాచీన చరిత్రలో అగ్రగణ్యులైన చక్రవర్తులలో హర్షుడు ఒకడు. ఇతడు బహుముఖ ప్రజ్ఞాశాలి. విజేతగా, సామ్రాజ్య నిర్మాతగా, ధర్మతత్పరుడిగా, ఉదార పాలకుడిగా, సాహితీవేత్తగా, విద్యాభిమానిగా హర్షుడు విశిష్ట స్థానాన్ని ఆక్రమించాడు. ఇతనిలో అశోకుడు, సముద్రగుప్తుడు, భోజరాజువంటి ప్రముఖుల విశిష్ట లక్షణాలన్నీ ఉన్నాయి. గుప్త యుగానికి, రసపుత్ర యుగానికి మధ్య వారధిగా హర్షుని చరిత్రకారులు పేర్కొన్నారు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కౌటిల్యుని ‘అర్థశాస్త్రం’
జవాబు:
అర్థశాస్త్ర రచయిత కౌటిల్యుడు. ఇతడు చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి. మౌర్యుల చరిత్రను తెలుసుకొనుటకు గల ఆధారములలో అర్థశాస్త్రము ప్రముఖమైనది. అర్థశాస్త్రమనగా ఆర్థికశాస్త్రము కాదు. ఇది రాజనీతి శాస్త్రము. ఇందు చక్రవర్తి యొక్క విధులు, సైనిక విధానము, దండనీతి మొదలగు అంశములు పేర్కొనబడెను. అయితే రాజనీతి అంశములతోపాటు ఆర్థిక విషయములు కూడా పేర్కొనబడెను. అర్థశాస్త్రమందు కౌటిల్యుడు “రాజ్యమును సంపాదించుటకు కుటిల మార్గములను” కూడా పేర్కొనెను. అటులనే చెరువులో గల చేపలు నీరు త్రాగకుండా ఎట్లు ఉండలేవో, ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు కూడా తీసుకోకుండా ఉండలేరు అని పేర్కొనెను.

ప్రశ్న 2.
ఇండికా
జవాబు:
చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో గ్రీకు రాజైన సెల్యూకస్ రాయబారి మెగస్తనీస్. భారతదేశంలో ఉన్నంతకాలం తాను చూచిన, విన్న విషయాలను ఇండికా అను పేరుతో గ్రంథస్తం చేశాడు. అయితే ఇండికాలోని కొన్ని భాగాలు మాత్రమే నేడు లభ్యమౌతున్నాయి. ఈ గ్రంథం వల్ల నాటి పాలనావిధానం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తున్నాయి. భారతదేశంలో బానిసవ్యవస్థ లేదని, భారతీయులలో 7 కులాలవారున్నారని మెగస్తనీస్ ఈ గ్రంథంలో పేర్కొన్నాడు. పాటలీపుత్ర నగరపాలన గురించి, సైనిక మండలుల గురించి మెగస్తనీస్ సవివరంగా వివరించాడు. ఇతడు విదేశీయుడు. ఇతనికి భారతీయ సంస్కృతీ పరిజ్ఞానం పూజ్యం కాబట్టి ఇతని రచనను స్వవిమర్శతో స్వీకరించవలసి ఉంటుంది.

ప్రశ్న 3.
ధమ్మ మహామాత్రులు
జవాబు:
అశోకుడు నూతన నైతిక నియమావళిని ప్రజలముందుంచాడు. ప్రజల నైతికతను అభివృద్ధి చేయాలనుకొన్నాడు. తన మతాన్ని వ్యాప్తిచేయడానికి ‘ధమ్మ మహామాత్రులు’ అనే ఉద్యోగులను నియమించాడు. 13వ శిలాశాసనంలో అశోకుడు ధమ్మ మహామాత్రుల నియామకం గురించి ఇలా అన్నాడు. “అన్ని మత శాఖలకు ధమ్మ మహామాత్రులను నియమించాను వారు అన్ని ధార్మిక ప్రదేశాలను పరిరక్షిస్తూ ఉంటారు. ప్రజలకు తన మత నైతిక నియమావళిని బోధించడమే వారి విధి. మానవుల సంక్షేమం, వివిధ మత, ధార్మిక కార్యక్రమాల అమలుకు కృషిచేయాలి”. 6వ శిలాశాసనంలో ‘ధమ్మ మహామాత్రుల పనితీరుపై పర్యవేక్షణ కోసం తగిన ఏర్పాట్లు అశోకుడు చేశాడు’ అని పేర్కొనబడింది.

ప్రశ్న 4.
కళింగ యుద్ధం
జవాబు:
కళింగ ప్రాభవం తగ్గించడానికి అశోకుడు కళింగ యుద్ధం (క్రీ.పూ. 261) చేశాడు. అనేకమంది చంపబడటం తీవ్ర రక్తపాతానికి దారితీసింది. చివరికి అశోకుడు యుద్ధంలో గెలిచాడు. కళింగ యుద్ధ వివరాలు అశోకుని 13వ శాసనంలో ఉన్నాయి. ఇది చాలా ప్రాధాన్యత ఉన్న యుద్ధంగా గుర్తించబడింది. ఎందుకంటే ఈ యుద్ధానంతరం అశోకుడు ధర్మ అశోకుడిగా గుర్తించబడ్డాడు.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

ప్రశ్న 5.
సారనాధ్
జవాబు:
అశోకుడు నిర్మించిన స్తంభాలలో మిక్కిలి ప్రఖ్యాతి గాంచినది సారనాధ్ స్తంభం. సారనాధ్ స్తంభంపై గంట, ఫలక, నాలుగు దిక్కులను తెలిపే నాలుగు జంతువులు (ఏనుగు, గుర్రం, ఎద్దు, సింహం) ఉన్నాయి. జంతువుల మధ్య ధర్మచక్రం ఉంది. వీటికిపైన నాలుగు సింహాల ప్రతిమలు ఉన్నాయి. అవి నాలుగు దిక్కులకు అభిముఖంగా, తమ వెనుక భాగాలు ఒకదానితో ఒకటి తాకుతున్నట్లుగా నిలిచి ఉన్నాయి. స్తంభపీఠం అంచులచుట్టూ మృగాలు, పుష్పాలు, పక్షులు మనోహరంగా చిత్రించబడి ఉన్నాయి. నాలుగు సింహాలలో మూడు మాత్రమే మనకు కనిపిస్తాయి. సింహాల క్రింద భాగంలో ‘సత్యమేవజయతే’ (సత్యమే జయిస్తుంది) అని వ్రాసి ఉంది.’ ఈ సూక్తిని మండకోపనిషత్ నుండి గ్రహించారు. ఈ సారనాధ్ సింహాల కిరీటాన్ని భారత ప్రభుత్వం అధికార చిహ్నంగా స్వీకరించింది.

ప్రశ్న 6.
ఫాహియాన్
జవాబు:
గుప్త చక్రవర్తి చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఫాహియాన్. బుద్ధుడు జన్మించిన పవిత్రభూమిని చూడాలని, బుద్ధుని ధాతువులను, బౌద్ధ గ్రంథాలను సేకరించాలని ఇతడు భారతదేశం వచ్చాడు. గుప్తుల కాలంనాటి భారతదేశ స్థితిగతులను తన పో-కూ-వో-కి అను గ్రంథంలో వివరించాడు.

ప్రశ్న 7.
అలహాబాద్ స్తంభ శాసనము
జవాబు:
అలహాబాద్ ప్రశస్థిని సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు సంస్కృతభాషలో వ్రాయించాడు. ఇది ఒక శాసనం రూపంలో ఉంది. దీనిలో సముద్రగుప్తుని దిగ్విజయాలు వివరించబడ్డాయి. దీనిని కావ్యశైలిలో రచించారు. ఇది అలహాబాద్ లోని అశోక స్తంభంపై వ్రాయబడి ఉంది.

ప్రశ్న 8.
కాళిదాసు
జవాబు:
గుప్త చక్రవర్తి చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానమును అలంకరించిన నవరత్నములు అను కవులలో అగ్రగణ్యుడు కాళిదాసు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలము, కుమార సంభవము, విక్రమోర్వశీయము, మేఘసందేశము, మాళవికాగ్నిమిత్రము మొదలగు ప్రముఖ గ్రంథములు రచించాడు.

ప్రశ్న 9.
అజంతా గుహలు
జవాబు:
భారతీయ నిర్మాణాలలో గుప్తుల కాలానికి ప్రత్యేక స్థానం ఉంది. నగర, ద్రావిడ పద్దతుల్లో గుప్తుల కళ భారతీయ నిర్మాణ చరిత్ర వైభోగానికి ప్రతీకగా నిలిచిన అజంతా గుహలు ముఖ్యమైనవి. ఈ అజంతా గుహలు మహారాష్ట్రలో కలవు. ఈ గుహల నిర్మాణం ఆనాటి కళానైపుణ్యమునకు నిదర్శనం.

ప్రశ్న 10.
కనిష్కుడు
జవాబు:
కనిష్కుడు గొప్ప సాహిత్య కళాపోషకుడు. అతడి ఆస్థానంలో చాలామంది పండితులు పోషణను అందుకొన్నారు. అశ్వఘోషుడు, నాగార్జునుడు, వసుమిత్రుడు, చరకుడు సుప్రసిద్ధ బౌద్ధ పండితులు. కనిష్కుని ఆస్థానంలో ఉన్న అశ్వఘోషుడు రాసిన గ్రంథాలు ‘బుద్ధ చరిత్ర’, ‘సౌందరానంద కావ్యం’ ముఖ్యమైనవి. ఇతని కాలంలో సంస్కృత భాష విరాజిల్లింది. కనిష్కుడు గొప్ప భవన నిర్మాత, కనిష్కపురం, పురుషపురం అనే రెండు నగరాలను నిర్మించాడు.

ప్రశ్న 11.
గాంధార శిల్పం
జవాబు:
భారతదేశ వాయువ్య ప్రాంతంలో సింధూ నదికి ఇరువైపులావున్న ప్రాంతాన్ని గాంధారము అంటారు. ఈ ప్రాంతంలో ఉద్భవించిన కళను గాంధార కళ అంటారు. ఇక్కడి బౌద్ధశిల్పాలు భారతీయ, గ్రీకో-రోమన్ లక్షణాలను కలిగివుంటాయి. కనుక భారతీయ, గ్రీకు, రోమన్ శిల్పకళల సమ్మేళనాన్ని గాంధార శిల్పకళ అంటారు. ఈ శిల్పంలో మలచబడిన బుద్ధుని విగ్రహాలకు పలుచని వస్త్రాలు, రోమన్ ఉంగరాల జుట్టు, సహజత్వం, కండలు తిరిగిన శరీర భాగాలు ఎంతో అందంగా ఉంటాయి. అందువల్లనే గాంధార శిల్పికి భారతీయుల హృదయము, గ్రీకుల నేర్పరితనము ఉన్నాయని అంటారు. ఈ కళ ఇండో-గ్రీకుల కాలంలో భారతదేశంలోకి ప్రవేశించింది. కుషాణుల కాలంలో, ముఖ్యంగా కనిష్కుని కాలంలో ఉచ్ఛస్థితికి చేరుకుంది.

ప్రశ్న 12.
మధుర కళ
జవాబు:
జైన మతం స్ఫూర్తితో ధ్యానంలో ఉన్న దిగంబర తీర్థంకరుల శిల్పాలను మధుర శిల్పులు నిర్మించారు. మొదట్లో బుద్ధుని, బోధిసత్వుని ప్రతిమలు నిర్మించారు. తర్వాత కాలంలో, మత భావనలు ప్రదర్శితమయ్యేటట్లు నిర్మించారు. బుద్ధుని ప్రతిమలు బిగుతు కండరాలు, బలమైన శరీరంతో హుందాగా, భక్తి భావంతో ఉండే విగ్రహాలను మధుర శిల్పులు నిర్మించారు. వైదిక దేవతలైన శివుడు, విష్ణువు, పార్వతి, లక్ష్మీ ప్రతిమలు కూడా ఈ శిల్ప శైలిలో నిర్మించడం జరిగింది.

ప్రశ్న 13.
హుయన్సాంగ్
జవాబు:
హర్షుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయన్ త్సాంగ్ (క్రీ.శ. 630-644). ఇతడు దేశంలోని అనేక ప్రాంతాల్లో, బౌద్ధమత పవిత్ర స్థలాల్లో నలందా విశ్వవిద్యాలయంలో గడిపి అనేక బౌద్ధ గ్రంథాలను అధ్యయనం చేశాడు. హర్షునికి సన్నిహితుడైనాడు. హర్షుడు కనోజ్, ప్రయాగలలో జరిపిన మోక్ష పరిషత్లలో పాల్గొన్నాడు. భారతదేశంలో అనేక బౌద్ధ గ్రంథాలను, బుద్ధుని ధాతువులను సేకరించాడు. తన పర్యటన అనుభవాలను సి-యూ-కి అను గ్రంథంగా రచించాడు. ఈ గ్రంథం హర్షుని రాజ్యంలోని రాజకీయ, సాంఘిక, మత పరిస్థితులను వివరిస్తుంది.

 

ప్రశ్న 14.
మహామోక్ష పరిషత్
జవాబు:
హర్షుడు ప్రయాగ వద్ద ప్రతి 5 సంవత్సరములకొకసారి సర్వస్వదాన కార్యక్రమాన్ని నిర్వహించేవాడు. దీనినే మహామోక్ష పరిషత్ అంటారు. ఇటువంటి పరిషత్లను హర్షుడు ఆరింటిని జరిపాడు. క్రీ.శ. 643లో జరిగిన 6వ పరిషత్కు హుయాన్ త్సాంగ్ హాజరయ్యాడు. ఈ పరిషత్తులో హర్షుడు తన సర్వస్వాన్ని బ్రాహ్మణులకు, అనాథలకు పంచి, కట్టుగుడ్డలతో రాజధానికి తిరిగి వచ్చేవాడట.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

ప్రశ్న 15.
హూణులు
జవాబు:
హూణులు చైనా పరిసర ప్రాంతాలకు చెందిన అనాగరిక మోటుజాతి ప్రజలు. వీరిలో నల్లహూణులు, తెల్లహూణులు అను రెండు శాఖలవారున్నారు. తెల్లహూణులు భారతదేశముపై దాడిచేసి గుప్తుల సామ్రాజ్యంలో శాంతిభద్రతలకు అంతరాయం కలిగించారు. వీరిలో తోరమాణుడు, మిహిరకులుడు ముఖ్యులు. వీరి దండయాత్రల వలన గుప్త సామ్రాజ్యం బలహీనపడింది. గణతంత్ర రాజ్యాలు అంతరించాయి. బౌద్ధమతం నాశనమైంది. కాలక్రమంలో హూణులు క్షత్రియులుగా గుర్తింపు పొందారు.

ప్రశ్న 16.
బాణుని ‘హర్ష చరిత్ర’
జవాబు:
హర్షచరిత్ర అను గ్రంథాన్ని హర్షుని ఆస్థానకవి బాణుడు రచించాడు. మహాశివభక్తుడైన ‘పుష్యభూతి’ ఈ వంశానికి మూలపురుషుడైనందువల్ల హర్షుని వంశానికి పుష్యభూతి వంశమని పేరు వచ్చినట్లు ఈ గ్రంథం వల్ల తెలుస్తున్నది. ఈ గ్రంథం హర్షుని తండ్రి ప్రభాకరవర్ధనుని ‘హూణ హరిణకేసరి’ అని వర్ణించింది. ఈ గ్రంథము హర్షుని జీవితమును, |అతని పాలనాకాలం నాటి దేశ, కాల పరిస్థితులను తెలుసుకొనుటకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

AP Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర అంటే ఏమిటి?

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 1st Lesson చరిత్ర అంటే ఏమిటి? Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 1st Lesson చరిత్ర అంటే ఏమిటి?

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న1.
చరిత్ర రచనా శాస్త్రానికి హెరొడోటస్ చేసిన సేవలు తెలపండి.
జవాబు:
చరిత్ర పితామహుడైన హెరొడోటస్ (క్రీ.శ. 484-430) “గతంలో మానవుడు పొందిన వైఫల్యాలను గురించి కాకుండా మానవుడి వివిధ చర్యలను తెలిపేదే చరిత్ర” అని పేర్కొన్నాడు.

హెరొడోటస్ ప్రకారం చరిత్ర శాస్త్రీయమైంది, హేతుబద్ధమైంది, మానవీయమైంది. ఇతడు రచించిన ‘హిస్టోరియా’ అనే గ్రంథం ప్రసిద్ధ పారశీక యుద్ధాన్ని (క్రీ.పూ. 490 నుంచి 480) సవివరంగా వివరించింది. ఈ గ్రంథం తొలి క్రమబద్ధమైన రచన.

నిర్దిష్టమైన ఆధారాలను పరిశీలించి ఒక క్రమపద్ధతిలో రచించినదే చరిత్ర. వివిధ కాలాలు, పరిస్థితుల్లో మానవుల ‘చర్యలను గురించి తెలుపుతున్నందువల్ల ఇది మానవీయ శాస్త్రం. కారణాలను విశ్లేషించి తర్కించి వివేచనతో రచింపబడుతుంది. కాబట్టి చరిత్ర హేతుబద్ధ శాస్త్రం అని హెరొడోటస్ తెలిపాడు.

ఈ విధంగా చరిత్ర హెరొడోటస్ ప్రకారం మానవుని చర్యలు, వాటి వెనుక ఉన్న ఆలోచనలను తెలుపుతుంది. చరిత్ర అనేది కేవలం పేర్లు, తేదీల విషయాలను తెలిపేది మాత్రమే కాదు. సొంతంగా జ్ఞానాన్ని వృద్ధి చేసుకొనేందుకు రాచబాటవంటిది.

AP Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర అంటే ఏమిటి?

ప్రశ్న 2.
చరిత్ర గురించి కారల్ మార్క్స్ అభిప్రాయాలు తెలపండి.
జవాబు:
“కోరికలు, ఆశలు నెరవేర్చుకొనే క్రమంలో మానవులు చేసే కార్యకలాపాలే చరిత్ర” అని కారల్ మార్క్స్ (1818-1883) పేర్కొన్నాడు. మానవులు, సమూహాలు తమ అవసరాలు తీర్చుకొని సంతృప్తి పొందేందుకు చేసే కార్యక్రమాలే చరిత్రలో ఉంటాయని పేర్కొన్నాడు. చరిత్ర గొప్ప సంఘర్షణ, వర్గపోరాటం అని మార్క్స్ భావన. అంటే, ఉత్పత్తి సాధనాలను స్వాధీనంలో ఉంచుకొన్న పెట్టుబడిదారీ వర్గానికి, తమ శ్రమను అమ్ముకొని జీవించే శ్రామిక వర్గానికి మధ్య సంఘర్షణగా పేర్కొన్నాడు. ఉనికిలో ఉన్న అన్ని సమాజాల చరిత్ర మొత్తం వర్గపోరాటాలతో కూడినదే ! అన్నది మార్క్స్ వాదన.

వర్గ పోరాటమే చరిత్ర ఇతివృత్తమనీ, దానినే గతితర్కం అని కారల్ మార్క్స్ అభిప్రాయం. చరిత్ర గతిలో ఆయన ఆర్థికాంశాల ప్రాధాన్యతను ఎక్కువ ప్రస్తావించెను. ‘హెగెల్’ తత్వవేత్త ప్రతిపాదించిన ‘యోజన’, ప్రతియోజన, సంయోజన అనే సూత్రాన్ని చరిత్రకు అనువర్తింపచేసి, సామాజిక శాస్త్రాల రచన- అధ్యయనాలకు పనికొచ్చే విలువైన సూత్రాలను నిగమనం చేసినది కారల్ మార్క్స్. చరిత్రను అధ్యయనం చేసి పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుడుతుందనీ, సమాజంలో వర్గాలున్నంత కాలం, ఘర్షణ కొనసాగుతుందనీ, వర్గ పోరాటమే చరిత్ర ఇతివృత్తమనీ సామాజిక పరిణామ క్రమంలో వర్గరహిత సమాజమే చివర దశ అని మార్క్స్ అభిప్రాయపడెను.

ప్రశ్న 3.
చరిత్ర పరిధి గురించి రాయండి.
జవాబు:
చరిత్ర పరిధి ఏది, ఎంత ? అనే ప్రశ్నకు సమాధానంగా ఏం జరిగింది ? ఎట్లా జరిగింది ? ఎందుకు జరిగింది ? అనే ఈ మూడు ప్రశ్నలే చరిత్ర పరిధిని నిర్వచిస్తాయి మరియు నిర్ణయిస్తాయి. ఒకప్పుడు రాజులు, రాణులు, మంత్రులు, యుద్ధాలు మాత్రమే చరిత్రలో ముఖ్యాంశాలుగా ఉండేవి. వారికి సంబంధించిన అంశాలే చరిత్రకు ఇతివృత్తాలు అయినాయి. నేడు “మానవుడే” అన్ని అధ్యయనాంశాలకు కేంద్రం. మానవుని కార్యకలాపాలు, ఆలోచనలు, అభిరుచులు, వ్యాపకాలు మొదలగు అంశాలు పెరిగిన కొద్ది చరిత్ర పరిధి విస్తరించును. నేడు చరిత్ర మానవ నాగరికత పరిణామంలో రెండు ముఖ్యమైన ఘట్టాలు అయిన సమాజ నిర్మాణం, రాజ్య నిర్మాణం అనే అంశాలను అధ్యయనం చేస్తుంది. ఫలితంగా చరిత్ర యొక్క పరిధి విస్తృతమైంది.

క్రీ.శ. 18వ శతాబ్దం ప్రారంభం వరకు గత సంఘటనలను వివరించేందుకే చరిత్ర పరిమితమై ఉండేది. అయితే నేడు కాలం, ప్రాంతాలను ఆధారంగా చేసుకొని మానవుని కార్యక్రమాలను అధ్యయనం చేయడం వల్ల చరిత్ర పరిధి విస్తృతమైంది. మానవ ఆవిర్భావం నుంచి నేటిదాకా దీని పరిధి విస్తరించి ఉంది. చరిత్ర గతకాలంలో ప్రారంభించి, వర్తమానాన్ని తయారుచేసి, భవిష్యత్తుకు మార్గ నిర్దేశకత్వం చేస్తుంది. యుద్ధాలు, విప్లవాలు, సామ్రాజ్య ఔన్నత్య పతనాలు, చక్రవర్తుల అదృష్ట, దురదృష్టాలు, సామాజిక వ్యవస్థ పరిణామం, సామాన్యుల జీవితాలు, చరిత్రకు ప్రధాన విషయాలు. అన్ని లక్షణాలు కలిగిన సమగ్ర శాస్త్రమే చరిత్ర. అన్ని విజ్ఞాన శాస్త్రాలు, పాఠ్యాంశాలను కలుపుకొని ఉన్న చరిత్ర పరిధికి హద్దులు నిర్దేశించలేము.

ప్రశ్న 4.
చరిత్రకు ఇతర సాంఘిక శాస్త్రాలతోగల సంబంధాలు తెలపండి.
జవాబు:
చరిత్రకు ఇతర సామాజిక శాస్త్రాలతో దగ్గర సంబంధం కలదు.
1) చరిత్ర సమాజ విజ్ఞానశాస్త్రం: చరిత్రకు, సమాజ విజ్ఞాన శాస్త్రం (సోషియాలజీ)నకు మధ్య సంబంధం కలదు. ముఖ్యముగా కుటుంబం, తెగ, జాతి, ఆచార వ్యవహారాలు, సమాజం, మతం మొదలగు అంశాలపై ఇరు శాస్త్రాలు ఆధారపడి ఉన్నాయి.

2) చరిత్ర – రాజనీతిశాస్త్రం: చరిత్ర రాజనీతి శాస్త్రాల మధ్య కూడా సంబంధం కలదు. రాజ్య నిర్మాణం, రాజ్య స్వరూపంలో పరిణామం, రాజ్యంలోని ఇతర ముఖ్యాంశాలు, వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి ఇరు శాస్త్రాలు ఒకదానిపై, మరొకటి ఆధారపడి ఉన్నాయి.

3) చరిత్ర – అర్థశాస్త్రం: చరిత్రకు అర్థశాస్త్రానికి కూడా అనేక విషయాలలో సంబంధం కలదు. ముఖ్యముగా ఆర్థిక వ్యవస్థ ప్రారంభం, పరిణామం, వివిధ రూపాలు, వాటి పని, తీరుతెన్నులు, సూత్రాలు, వాటివల్ల ప్రయోజనాలు మొదలైన అంశాలపై ఇరుశాస్త్రాలు ఒకదాని నుండి మరొకటి ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో ఉంటాయి.

4) చరిత్ర ఇతర సామాజిక శాస్త్రాలు: చరిత్రకు మరికొన్ని ఇతర శాస్త్రాలైన ప్రభుత్వపాలనా శాస్త్రం, సాహిత్యం, పురావస్తు శాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం (సైకాలజీ) మరియు మానవ శాస్త్రం (ఆంథ్రోపాలజీ) మొదలగు వాటితో సంబంధం కలదు.

ముగింపు: మానవ జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ మూలాధారాలు చరిత్ర నుండే లభించును. ప్రతి శాస్త్రానికి అధ్యయనాంశానికి చారిత్రక నేపథ్యం పొందుపరచటం ఒక శాస్త్రీయమైన పద్ధతి అయింది. వివిధ అధ్యయనాంశాలకు చరిత్ర ఆధారాలు మరియు సమాచారం ఇస్తుంది. అటులనే వాటి నుండి తిరిగి తీసుకుంటుంది. అందువలన చరిత్రకు, ఇతర సామాజిక శాస్త్రాలకు అవినాభావ సంబంధం కలదు.

AP Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర అంటే ఏమిటి?

ప్రశ్న 5.
చరిత్ర రచనా శాస్త్రానికి ఇబన్ ఖల్టూన్ చేసిన సేవలు తెలపండి.
జవాబు:
మధ్య ప్రాచ్యంలో ఇస్లాం మత ఆవిర్భావంతో చరిత్ర రచనలో మార్పులు చోటుచేసుకొన్నాయి. చరిత్రపట్ల ఆసక్తిగల అరబ్బులు మత ప్రేరణతో చరిత్ర రచనలో ధోరణులు, పోకడలను అనుసరించారు. అటువంటి చరిత్రకారుల్లో చరిత్రను సంస్కృతీ శాస్త్రంగా తీర్చిదిద్దిన ఇబన్ ఖల్టూన్ ప్రముఖుడు.

చరిత్ర అనేది గత సంఘటనలను, వాటి వెనక ఉన్న కోణాలను తార్కికంగా వివరించేది అయినా ప్రాచీన భారతీయులు చరిత్రపట్ల ఎక్కువ ఆసక్తిని కనబరచలేదు. అయినా గాథలు, పురాణాలు, సంప్రదాయాలు, ఇతిహాసాలు వంటి సాహిత్య రచనల్లో కొంతమేరకు చరిత్ర దాగి ఉంది. సన్యాసుల, ప్రబోధకుల, మత బోధకుల జీవితాలవంటి పాక్షిక చరిత్ర రచనలు ఉన్నాయి. అందుకు అశ్వఘోషుడు రచించిన ‘బుద్ధ చరిత్ర’, బాణుడి ‘హర్ష చరిత్ర’ బిల్హణుడి ‘విక్రమాంక దేవ చరిత్ర’ వంటివి ఉదాహరణలు. కౌటిల్యుడి అర్థశాస్త్రం, 1306వ సం॥లో రచించిన ‘ప్రబంధ చింతామణి’లు ప్రాచీన భారతదేశంలోని చారిత్రక రచనలు.

ప్రశ్న 6.
చరిత్ర విజ్ఞానశాస్త్రమా ? మానవశాస్త్రమా ?
జవాబు:
చరిత్ర అనేది విజ్ఞానశాస్త్రమా, మానవశాస్త్రమా లేదా కళ అనేది చర్చనీయాంశం. విమర్శనాత్మక ప్రక్రియ ద్వారా రూపొందిన చరిత్రకు శాస్త్ర విజ్ఞాన హోదా లభిస్తుందని రాంకీ పేర్కొన్నాడు. ఖచ్చితంగా జరిగిన విషయాలను చెప్పడమే చరిత్రకారుని ప్రథమ ధర్మం అన్నాడు. రాంకేను అనుసరించిన జె.బి. బ్యురి చరిత్రను ఖచ్చితంగా విజ్ఞాన శాస్త్రంగా పేర్కొన్నాడు.

విజ్ఞాన శాస్త్రం: విజ్ఞాన శాస్త్రం ప్రయోగాలతో కూడుకొని ఫలితాలు పునరావృతమవుతాయి. జరగబోయేది శాస్త్ర విజ్ఞానంలో ముందే ఊహించవచ్చు అదే ప్రయోగాలను శాస్త్రవేత్తలు మళ్ళీ మళ్ళీ నిరూపించగలరు. కాలచక్రాన్ని చరిత్రకారుడు వెనక్కు తిప్పలేడు. కాబట్టి గతకాలపు సంఘటనలు పునరావృతం చేయలేడు. మానవుల ఆలోచన,
నడవడికలు ఒకేరకంగా ఉండక వైరుధ్యాలతో కూడుకొని ఉంటాయి. చరిత్ర భౌతిక రసాయన శాస్త్రాలవంటి శాస్త్రం కాదు. చరిత్ర దాదాపు కాలగమనంలో పేర్చిన సమాహారమే ! చారిత్రక సంఘటనలకు నకిలీ రూపాలు ఉండవు. కానీ చరిత్ర రచనకు ఉపయోగించే శాస్త్రీయ అన్వేషణ, సత్యనిరూపణ, కృషి, విమర్శనాత్మకత చరిత్రను విజ్ఞాన శాస్త్రానికి దగ్గర చేస్తాయి.

మానవ శాస్త్రం లేదా కళ: గ్రంథస్థం చేసిన గతకాలపు మానవుల జీవనమే చరిత్ర. చరిత్రకారుడు మనోరంజకంగా దాన్ని రచిస్తాడు. అందుకు అతడు కళాకారుడు అయి ఉండాలి. ఒక క్రమపద్ధతిలో లక్ష్యాన్ని చేరుకోవడమే కళ లేదా మానవ శాస్త్రం లక్ష్యం. ఉదా: సంగీతం, నాట్యం, ఈత వంటివి కళలు. గతకాలపు వాస్తవాలను రచించే చరిత్రకారుడికి నేర్పు అవసరం. అందువల్ల చరిత్ర అనేది శాస్త్రమే కాక ప్రజలకు ఉపయోగపడే సాహిత్య రూపం అని కూడా చెప్పవచ్చు. చరిత్ర విజ్ఞాన శాస్త్రం, మానవ శాస్త్రం అని కూడా ట్రెవిలియన్ అభిప్రాయపడ్డాడు.

ప్రశ్న 7.
చరిత్ర రచనలో సాహిత్యాధారాల ప్రాధాన్యత వివరించండి.
జవాబు:
చారిత్రక అంశాలను రాబట్టేందుకు సాహిత్యం బలమైన ఆధారంగా ఉపయోగపడుతుంది. పాలకులు సాధించిన విజయాలు, రాజకీయ, సాంఘిక, మత విషయాలను సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. సాహిత్య ఆధారాలు రెండు విధాలు.
1) స్వదేశీ సాహిత్యం: వేదకాలం నుండి విజయనగర కాలం వరకు ఉన్న విలువైన రచనలు రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక చరిత్రకు అద్దం పడుతున్నాయి. బౌద్ధ, జైన సాహిత్యం చరిత్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుంది. పురాణాలు, శాస్త్రాలు, సంప్రదాయాలను వివరిస్తున్నాయి. కల్హణుడి రాజ తరంగిణి, కౌటిల్యుడి అర్థశాస్త్రం ప్రసిద్ధ
రచనలు.

2) విదేశీ సాహిత్యం: మెగస్తనీస్ ఇండికా, పెరిప్లన్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ వంటి గ్రీకు, రోమన్ రచనలు రోమ్, ఆగ్నేయాసియాతో భారత్ సంబంధాలను వెల్లడిస్తున్నాయి. టాలేమి రచన ‘జాగ్రఫీ’ భారతదేశంలోని వివిధ ప్రాంతాలను ప్రస్తావించింది. చైనాకు చెందిన ఫాహియాన్, హుయన్ త్సాంగ్ రచనలు భారతదేశ ప్రజల స్థితిగతులను, బౌద్ధ కేంద్రాలను వివరించాయి. ఆల్బెరునీ వంటి ముస్లిం యాత్రికులు భారతదేశాన్ని గురించి వివరించారు. మిన్హాజుద్దీన్ సిరాజ్ తన ‘తబాకత్-ఇ-ఇనాసిరి’ లో ఘోరి దండయాత్రలను వివరించాడు. అమీర్ ఖుస్రూ, జియాఉద్దీన్ బరౌనీ రచనలు మధ్యయుగ భారతదేశ చరిత్రను గురించి విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. నికోలోకాంటే, డోమింగ్ పేస్, అబ్దుల్ రజాక్ వంటి ఇటలీ, పోర్చుగీసు, పర్షియన్ యాత్రికుల రచనలు విలువైన చారిత్రక అంశాలను వెల్లడించాయి.

AP Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర అంటే ఏమిటి?

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
థూసిడైడిస్
జవాబు:
థూసిడైడిస్ (క్రీ.పూ. 460-400) అనే గ్రీకు చరిత్రకారుడు “జ్ఞాపకం ఉంచుకోగల సంఘటనల సమాహారమే చరిత్ర” అని పేర్కొన్నాడు. ప్రత్యేకమైన, విశిష్ఠమైన గుర్తుంచుకోదగ్గ సంఘటనల కూర్పు అయిన చరిత్ర ప్రజలపై ప్రభావాన్ని కనబరుస్తుందనీ, సమాజం అభివృద్ధి చెందేందుకు ప్రేరణ కలిగిస్తుందని ఆయన వివరించాడు. ఆధారం |కోసం అన్వేషణ సాగించాడు. నిష్పాక్షికంగా పరిశోధన సాగించాలన్న ధూసిడైడిస్ తరతరాల ప్రజల చరిత్రను ఒకరి నుంచి ఒకరికి అందించేది కాకుండా అన్ని కాలాలకు విలువలను అందించేదిగా ఉండాలని పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
థామస్ కార్లెల్
జవాబు:
థామస్ కార్లెల్ (1795-1881) అసంఖ్యాక జీవిత చరిత్రల సమాహారమే చరిత్ర” అని పేర్కొన్నాడు. మహా పురుషులు, పాలకులు, కళాకారులు, ప్రబోధకుల జీవితాలే ఆయన చరిత్రగా పేర్కొన్నాడు. అంతేకాకండా సామాన్య మానవులు కాకుండా గొప్పవారి మానసిక, ఆధ్యాత్మిక జీవన స్థితిగతులను చరిత్రలో చెప్పాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. నిరాశా నిస్పృహలతో ఉండే సామాన్యులు కాకుండా మేధావులు మాత్రమే చరిత్రకు అవసరం అని కార్లైల్ పేర్కొన్నాడు.

ప్రశ్న 3.
ఇ.హెచ్. కార్
జవాబు:
ఇ.హెచ్.కార్ తన గ్రంథమైన ‘వాట్ ఈజ్ హిస్టరీ’ అనే గ్రంథంలో “చరిత్రకారుడికి, యదార్థాల మధ్యగల నిరంతరంగా సాగే పరస్పర కార్య విధానం, గీతానికి వర్తమానానికి నిరంతరముగా జరిగే అనంతమైన సంభాషణే చరిత్ర” అని వివరించాడు. ప్రకటనల రూపంలో చారిత్రక వాస్తవాలను నమోదు చేయడం ముఖ్యం కాదు. వాటిని సమీక్షించి, అన్వయించి వ్యాఖ్యానించడం చరిత్రకారుడి ప్రధాన కర్తవ్యం. మరో విధంగా చరిత్ర అంటే వ్యాఖ్యానించడం’ అని పేర్కొన్నాడు.

ప్రశ్న 4.
నిష్పక్షపాతమైన చరిత్ర రచన
జవాబు:
చరిత్రలో ఉన్నత ప్రమాణాలను సాధించే సాధనమే విషయ నిష్ఠత. నిష్పాక్షికత, విషయ నిష్ఠతకు మరో పేరు. జరిగిన విషయాలను యధాతథంగా వాస్తవాల ఆధారంగా పొందుపరచడమే నిష్పాక్షిక చరిత్ర రచన. ఇందులో వ్యక్తిగత అభిప్రాయాలకు, పక్షపాతాలకు తావులేదు. చారిత్రక వాస్తవాలకు చరిత్ర వ్యాఖ్యానికి మధ్య అర్థవంతమైన సంబంధం ఉండేటట్లు చరిత్ర రచన సాగాలి.

ప్రశ్న 5.
కల్హణుడు
జవాబు:
ప్రాచీన భారతదేశంలోని ముఖ్యమైన చారిత్రక రచన కల్హణుడు రచించిన ‘రాజ తరంగిణి’. ఇది క్రీ.శ. 1148 సం॥లో రచించబడినది. ఇది కాశ్మీర్ రాజుల చరిత్ర, కాశ్మీర్ వారు చరిత్రపట్ల అత్యంత ఆసక్తిని కనబరిచారని కల్హణుడు తెలియజేసినాడు. చరిత్రపట్ల ఆసక్తిని కలిగిన కల్హణుడు లభించిన ఆధారాలను ఉపయోగించి గొప్పగా
రచించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర అంటే ఏమిటి?

ప్రశ్న 6.
అమీర్ ఖుస్రూ
జవాబు:
భారతదేశంలో ఇస్లాం మతం ప్రవేశించడంతో చరిత్ర రచనలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాలంనాటి చరిత్రకారులు గత కాలంలో జరిగిన అంశాలను, యుద్ధాలు, దండయాత్రలు, పాలనలను వరుసక్రమంలో వివరించారు. కానీ వాటి వెనక ఉన్న కారణాలను పరిగణలోనికి తీసుకోలేదు. ప్రసిద్ధ చరిత్రకారుడు అమీర్ ఖుస్రూ సంఘటనలకు ప్రాధాన్యత ఇచ్చి చరిత్ర రచనచేశాడు. కానీ ఈయన రచనల్లో హేతుబద్ధత కంటే వేదాంత ధోరణి కనిపిస్తుంది.

ప్రశ్న 7.
శాసనాలు
జవాబు:
శాసనాలు చరిత్ర రచనకు ముఖ్య ఆధారాలు. భారతీయ రాజులు మతాధికారులు, ముఖ్యమైన వారికి భూములు, ధనం కానుకలుగా ఇచ్చారు. వీరు ఈ విషయాలను రాయి, రాగి రేకుల మీద చెక్కించారు. అవి ప్రాచీన చరిత్రకు ముఖ్యమైన ఆధారాలు, అశోకుడి శాసనాలు, శాతవాహనుల శాసనాలు, అలహాబాద్ ప్రశస్తి, రెండవ పులకేశి ఐహోలు శాసనం వంటివి ముఖ్యమైన శాసనాలు. ఇవి సామ్రాజ్యాల, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు, భాషా పరిణామానికి శాసనాలు అద్దం పడుతున్నాయి.

AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e)

Practicing the Intermediate 2nd Year Maths 2B Textbook Solutions Chapter 6 సమాకలనం Exercise 6(e) will help students to clear their doubts quickly.

AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Exercise 6(e)

అభ్యాసం 6(ఇ)

I. కింది సమాకలనులను గణించండి.

ప్రశ్న 1.
∫\(\frac{x-1}{(x-2)(x-3)}\) dx
సాధన:
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e) 1
= ∫\(\left(1+\frac{2}{x-3}\right)\) dx – ∫\(\left(1+\frac{1}{x-2}\right)\) dx
= x + 2ln |x – 3| – x – ln |x – 2| + C
= 2log |x – 3| – log |x – 2| + C

ప్రశ్న 2.
∫\(\frac{x^2}{(x+1)(x+2)^2}\) dx
సాధన:
\(\frac{x^2}{(x+1)(x+2)^2}\) ≡ \(\frac{A}{x+1}\) + \(\frac{B}{x+2}\) + \(\frac{C}{(x+2)^2}\)
⇒ x2 = A(x + 2)2 + B(x + 1)(x + 2) + C (x + 1)
x = -2 లో (1)
(-2)2 = A(0) + B(0) + C(-2 + 1) ⇒ C = -4
x = -1 లో (1)
(-1)2 = A(-1 + 2)2 + 8(0) + C(0)
⇒ A = 1
(1) లో x2 గుణకాలను సమానం చేయండి.
1 = A + B
⇒ B = 1 – A = 1 – 1 = 0
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e) 3

AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e)

ప్రశ్న 3.
∫\(\frac{x+3}{(x-1)\left(x^2+1\right)}\) (May 07)
సాధన:
\(\frac{x+3}{(x-1)\left(x^2+1\right)}\) = \(\frac{A}{x-1}\) + \(\frac{\mathrm{Bx}+\mathrm{C}}{\mathrm{x}^2+1}\) అనుకొనుము
⇒ (x + 3) = A(x2 + 1) + (Bx + C) (x – 1) – (1)
(1 ) లో x = 0 ప్రతిక్షేపించగా
3 = A(1) + C(-1)
⇒ A – C = 3 ⇒ C = A – 3 = 2 – 3 = 1
(1) లో x2 గుణకాలను సమానం చేయండి.
0 = A + B
⇒ B = -A = -2
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e) 2

ప్రశ్న 4.
∫\(\frac{d x}{\left(x^2+a^2\right)\left(x^2+b^2\right)}\)
సాధన:
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e) 4

ప్రశ్న 5.
∫\(\frac{d x}{e^x+e^{2 x}}\)
సాధన:
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e) 5

ప్రశ్న 6.
∫\(\frac{d x}{(x+1)(x+2)}\)
సాధన:
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e) 6

ప్రశ్న 7.
∫\(\frac{1}{e^x-1}\) dx
సాధన:
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e) 7

ప్రశ్న 8.
∫\(\frac{1}{(1-x)\left(4+x^2\right)}\) dx
సాధన:
∫\(\frac{1}{(1-x)\left(4+x^2\right)}\) = \(\frac{A}{1-x}\) + \(\frac{B x+C}{4+x^2}\) అనుకోండి
⇒ 1 = A(4 + x2) + (Bx + C)(1 – x) —- (1)
(1) లో x = 1 ప్రతిక్షేపించగా
1 = A(4 + 1) ⇒ A = \(\frac{1}{5}\)
(1) లో x = 0 ప్రతిక్షేపించగా
1 = A(4) + C(1)
⇒ C = 1 – 4A = 1 – 4\(\left(\frac{1}{5}\right)\) = \(\frac{5-4}{5}\) = \(\frac{1}{5}\)
(1) లో x2 గుణకాలను సమానం చేయగా
0 = A – B
⇒ B = A = \(\frac{1}{5}\)
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e) 8
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e) 9

ప్రశ్న 9.
∫\(\frac{2 x+3}{x^3+x^2-2 x}\) dx
సాధన:
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e) 10
⇒ (1) లో x = 0 ప్రతిక్షేపించగా
3 = A(2)(-1) + B(0) + C(0)
⇒ A = –\(\frac{3}{2}\)
(1) లో x = 1 ప్రతిక్షేపించగా
2 + 3 = A(0) + B(0) + C(1)(3)
⇒ C = \(\frac{5}{3}\)
(1) లో x = -2 ప్రతిక్షేపించగా
2(-2) + 3 = A(0) + B(-2)(-2 – 1) + C(0)
⇒ -1 = 6B ⇒ B = \(\frac{-1}{6}\)
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e) 11
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e) 12

II. కింది సమాకలనులను గణించండి.

ప్రశ్న 1.
∫\(\frac{d x}{6 x^2-5 x+1}\)
సాధన:
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e) 13

AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e)

ప్రశ్న 2.
∫\(\frac{d x}{x(x+1)(x+2)}\)
సాధన:
\(\frac{1}{x(x+1)(x+2)}\) ≡ \(\frac{A}{x}\) + \(\frac{\mathrm{B}}{\mathrm{x}+1}\) + \(\frac{c}{x+2}\)
⇒ 1 ≡ A(x + 1)(x + 2) + B(x)(x + 2) + C(x)(x + 1)
x = 0 ప్రతిక్షేపించగా
1 = A(1) (2) + B(0) + C(0) ⇒ A = \(\frac{1}{2}\)
x = -1 ప్రతిక్షేపించగా
1 = A(0) + B(-1)(-1 + 2) + C(0)
⇒ 1 = -B ⇒ B = -1
x = -2 ప్రతిక్షేపించగా
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e) 14

ప్రశ్న 3.
∫\(\frac{3 x-2}{(x-1)(x+2)(x-3)}\) dx
సాధన:
\(\frac{3 x-2}{(x-1)(x+2)(x-3)}\) ≡ \(\frac{A}{x-1}\) + \(\frac{B}{x+2}\) + \(\frac{c}{x-3}\)
⇒ 3x – 2 = A(x + 2) (x – 3) + B(x – 1)(x – 3) + C(x – 1)(x + 2)
x = 1 ప్రతిక్షేపించగా
3(1) – 2 = A(1 + 2)(1 – 3) + B(0) + C(0)
⇒ A = \(\frac{-1}{6}\)
x = 3 ప్రతిక్షేపించగా
3(3) – 2 = A(0) + B(0) + C (3 – 1) (3 + 2)
C = \(\frac{7}{10}\)
x = -2 ప్రతిక్షేపించగా
3(-2) – 2 = A(0) + B(-2-1)(-2-3) + C(0) – 8
= 15B ⇒ B = \(\frac{-8}{15}\)
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e) 15

ప్రశ్న 4.
∫\(\frac{7 x-4}{(x-1)^2(x+2)}\) dx
సాధన:
\(\frac{7 x-4}{(x-1)^2(x+2)}\) ≡ \(\frac{A}{x-1}\) + \(\frac{B}{(x-1)^2}\) + \(\frac{c}{x+2}\)
⇒ 7x – 4 = A(x – 1) (x + 2) + B(x + 2) + C(x – 1)2 —- (1)
x = 1 లో ప్రతిక్షేపించగా
7 – 4 = A(0) + B(1 + 2) ⇒ B = 1
x = -2 లో (1) ప్రతిక్షేపించగా
7(-2) – 4 = A(0) + B(0) + C(-2-1)2
⇒ -18 = 9C ⇒ C = -2
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e) 16

III. కింది సమాకలనులను గణించండి.

ప్రశ్న 1.
∫\(\frac{1}{(x-a)(x-b)(x-c)}\) dx
సాధన:
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e) 17
x = b ప్రతిక్షేపించగా
1 = A(0) + B(b – a) (b – c) + C(0)
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e) 18
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e) 19

ప్రశ్న 2.
∫\(\frac{2 x+3}{(x+3)\left(x^2+4\right)}\) dx
సాధన:
\(\frac{2 x+3}{(x+3)\left(x^2+4\right)}\) = \(\frac{A}{x+3}\) + \(\frac{B x+C}{x^2+4}\) అనుకోండి
2x + 3 = A(x2 + 4) + (Bx + C) (x + 3)
x = -3 ⇒ -3 = A(9 + 4) = 13 A
A = –\(\frac{3}{13}\)
x2 గుణకాలు సమానం చేయగా
0 = A + B ⇒ B = -A = \(\frac{3}{13}\)
స్థిరపదాలు సమానం చేయగా
3 = 4A + 3C
3C = 3 – 4A = 3 + \(\frac{12}{13}\) = \(\frac{39+12}{13}\) = \(\frac{51}{13}\)
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e) 20

AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e)

ప్రశ్న 3.
∫\(\frac{2 x^2+x+1}{(x+3)(x-2)^2}\) dx
సాధన:
\(\frac{2 x^2+x+1}{(x+3)(x-2)^2}\) = \(\frac{A}{x+3}\) + \(\frac{B}{x-2}\) + \(\frac{C}{(x-2)^2}\) అనుకోండి
2x2 + x + 1 = A(x – 2)2 + B(x + 3) (x – 2) + C(x + 3)
x = 2 ⇒ 8 + 2 + 1 = C(2 + 3) = 5C
⇒ C = \(\frac{11}{5}\)
x = -3 ⇒ 18 – 3 + 1
= A(-5)2 = 25A ⇒ A = \(\frac{16}{25}\)
x2 గుణకాలు సమానం చేయగా
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e) 21

ప్రశ్న 4.
∫\(\frac{d x}{x^3+1}\)
సాధన:
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e) 22
⇒ 1 = A(x2 – x + 1) + (Bx + C)(x + 1) —– (1)
(1) లో x = -1 ప్రతిక్షేపించగా
1 = A(1 + 1 + 1) + (-B + C)(0)
⇒ 3A = 1 ⇒ A = \(\frac{1}{3}\)
(1) లో x = 0 ప్రతిక్షేపించగా
1 = A(1) + C(1)
⇒ C = 1 – A = 1 – \(\frac{1}{3}\) = \(\frac{2}{3}\)
x2 గుణకాలు సమానం చేయగా
O = A + B ⇒ B = -A = –\(\frac{1}{3}\)
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e) 23
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e) 24

ప్రశ్న 5.
∫\(\frac{\sin x \cos x}{\cos ^2 x+3 \cos x+2}\) dx
సాధన:
cos x = t ⇒ – sin x dx = dt
∫\(\frac{\sin x \cdot \cos x d x}{\cos ^2 x+3 \cos x+2}\) = ∫\(\frac{-t d t}{t^2+3 t+2}\)
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e) 25
(2) లో t = -1 ప్రతిక్షేపించగా
-1 = A(-1 + 2) ⇒ A = -1
(2) లో t = -2 ప్రతిక్షేపించగా
-2 = B(-2 + 1) ⇒ B = 2
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(e) 26

AP Inter 1st Year History Notes Chapter 12 భారత జాతీయోద్యమం

Students can go through AP Inter 1st Year History Notes 12th Lesson భారత జాతీయోద్యమం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year History Notes 12th Lesson భారత జాతీయోద్యమం

→ సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో సామాజిక మత ఉద్యమాలు ప్రారంభమయ్యాయి.

→ ప్చాత్య ఆధునిక విద్య, సమాచార నివృత్తి పత్రికల వృద్ధి, రాజకీయ సంస్థల ఆదిర్చావం సహా పలు కారణాల వల్ల 19వ శతాబ్దపు రెండో అర్ధభాగంలో జాతీయ భావం మరింత బలపడింది.

→ కాంగ్రెస్ మొదట్లో మితవాద పద్ధతులను, తర్వాత అతివాద పద్ధతులను అవలంబించినది.

→ భారత స్వాతంత్య్ర పోరాటం వందేమాతరం ఉద్యమంతో ప్రారంభమైంది.

→ గాంధీజీ నాయకత్వంలో సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన ఉద్యమాల ద్వారా ప్రజా ఉద్యమం రూపుదాల్చింది.

→ క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్ పాలనపై భారతీయుల వ్యతిరేకత అత్యున్నతస్థాయికి చేరింది.

→ భారతదేశపు చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్బాటెన్.

AP Inter 1st Year History Notes Chapter 12 భారత జాతీయోద్యమం

→ భారతదేశ చరిత్రలో 1947వ సంవత్సరం అత్యంత ప్రాముఖ్యమైంది.

→ 1950 జనవరి 26న భారతదేశం, సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

→ 1947 ఆగస్టు 15న భారతదేశంనకు స్వాతంత్ర్యం వచ్చింది.

AP Inter 1st Year History Notes Chapter 11 వలస పాలనలో భారతదేశం

Students can go through AP Inter 1st Year History Notes 11th Lesson వలస పాలనలో భారతదేశం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year History Notes 11th Lesson వలస పాలనలో భారతదేశం

→ ఇతర దేశాలను ఆక్రమించి ఆ దేశాలపై నియంత్రణ కొనసాగించే పద్ధతినే వలస విధానం అంటారు.

→ 1600 సం||లో లండన్లో ఈస్ట్ ఇండియా కంపెనీని ప్రారంభించడంతో ఒక కొత్త శకం మొదలైంది.

→ భారతదేశానికి సముద్రమార్గం కనుకోవడంతో పోర్చుగీసువారు మొదట విజయం సాధించారు.

→ ప్రాన్సిస్-డి-అల్మేదా భారతదేశంలో మొట్టమొదటి పోర్చుగీస్ గవర్నర్గా నియమించబడ్డాడు.

→ హాలెండ్ దేశ ప్రజలనే ‘డచ్’ ప్రజలు అని పిలుస్తారు. వీరు భారతదేశం తూర్పు తీరంలోకి ప్రవేశించారు.

→ డేన్లు అంటే డెన్మార్క్ దేశ ప్రజలు.

→ ఇంగ్లాండ్లో మొదటి జేమ్స్ కాలంలో కెప్టెన్ హాకిన్స్ అనే రాయబారి మొదటిసారిగా జహంగిర్ కొలువును క్రీ.శ. 1608లో సందర్శించాడు.

AP Inter 1st Year History Notes Chapter 11 వలస పాలనలో భారతదేశం

→ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని 1664లో కాలర్ట్ స్థాపించాడు.

→ వారసెస్టింగ్ బెంగాల్ తొలి గవర్నర్ జనరల్గా 1773లో నియమింపబడ్డాడు.

→ క్రీ.శ. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటును భారతదేశ చరిత్రలో చాలా విశిష్టమైన సంఘటనగా అభివర్ణించవచ్చు.

AP Inter 1st Year History Notes Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

Students can go through AP Inter 1st Year History Notes 10th Lesson క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year History Notes 10th Lesson క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

→ క్రీ.శ 10వ శతాబ్దం నుంచి క్రీ.శ. 19వ శతాబ్దం మధ్యకాలంలో దక్కన్ దక్షిణాపథాన్ని కాకతీయ, విజయనగర, బహమనీ కుతుబ్షాహి, ఆసఫ్జాహి పాలకులు పాలించారు.

→ మధ్యయుగంలో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన కాకతీయుల పరిపాలనా కాలానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది.

→ హనుమకొండ వేయిస్తంభాల గుడి శాసనము రుద్రమదేవుని పాలనా విశేషాలను వివరిస్తుంది.

→ కాకతీయ వంశ పాలకుల్లో గణపతిదేవుడు అత్యంత శక్తిసామర్థ్యాలు గల పరాక్రమవంతుడు.

→ మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రుద్రమదేవి సింహాసనం అధిష్ఠించడం ఒక ప్రధాన ఘట్టం.

→ హరిహర బుక్కరాయలు 1336 సం॥లో విజయనగర రాజ్యస్థాపన చేసినారు.

AP Inter 1st Year History Notes Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

→ శ్రీకృష్ణదేవరాయలు తుళువ వంశ చక్రవర్తుల్లోనే కాక విజయనగర రాజ్యాన్ని పాలించిన చక్రవర్తులందరిలో కెల్లా గొప్పవాడు.

→ శ్రీకృష్ణదేవరాయలు సాధించిన సైనిక విజయాలను “ఆముక్తమాల్యద” వివరిస్తుంది.

→ 1347 సం॥లో అల్లావుద్దీన్హాసన్ – గంగ్ బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు. దీని రాజధాని గుల్బార్గా.

→ గోల్కొండ రాజధానిగా స్వతంత్ర కుతుబ్షాహీ వంశాధికారాన్ని క్రీ.శ 1512లో సుల్తాన్ కులీ – కుతుబ్-ఉల్-ముల్క్ స్థాపించాడు.