AP 6th Class Telugu Important Questions Chapter 8 మేలుకొలుపు

These AP 6th Class Telugu Important Questions 8th Lesson మేలుకొలుపు will help students prepare well for the exams.

AP State Syllabus 6th Class Telugu 8th Lesson Important Questions and Answers మేలుకొలుపు

6th Class Telugu 8th Lesson మేలుకొలుపు Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

పరిచిత పద్యాలు

కింది పరిచిత పద్యాన్ని చదవండి. అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. మేలుకొనుమయ్య తరుణము మించకుండ
జన్మహక్కులకై పోరుసల్పు మిపుడె
హక్కుకై ప్రాణమిడుట ద్రోహంబు కాదు
స్వర్గపదమని నమ్ముము స్వాంతమందు
ప్రశ్నలు – జవాబులు:
అ) తరుణం మించకుండా ఏమి చేయాలి?
జవాబు:
తరుణం మించకుండా మేలుకోవాలి.

ఆ) దేని కోసం యుద్ధం చేయాలి?
జవాబు:
జన్మ హక్కుల కోసం యుద్ధం చేయాలి.

ఇ) ద్రోహం కానిది ఏది?
జవాబు:
హక్కుల
కోసం ప్రాణం ఇవ్వడం ద్రోహం కాదు.

ఈ) హక్కుల కోసం ప్రాణమివ్వడం దేనితో సమానం?
జవాబు:
హక్కుల
కోసం ప్రాణమివ్వడం స్వర్గ పదంతో సమానం.

AP 6th Class Telugu Important Questions Chapter 8 మేలుకొలుపు

2. పరుల ధన మాన ప్రాణ సంపదల ద్రుంచి
మనుచునుండుట పాతకంబని దలంచు
వారలెందున ధన్యులు వారికెల్ల
నంకితమొనర్తు దానినేనధికభక్తి
దేశమున శాంతి చేకూరి తేజరిలగ
ప్రశ్నలు – జవాబులు:
అ) పాతకమైనది ఏది?
జవాబు:
ఇతరుల ధన, మాన, ప్రాణాలు, సంపదలు హరించడాన్ని పాతకం అంటారు.

ఆ) ధన్యులు ఎవరు?
జవాబు:
ఇతరుల ధన, మాన, ప్రాణాలు, సంపదలు హరించనివారు ధన్యులు.

ఇ) కవి తన కవిత్వాన్ని ఎవరికి అంకితం చేస్తానన్నాడు?
జవాబు:
పాపం చేయని ధన్యులకు కవి తన కవిత్వాన్ని అంకితం చేస్తానన్నాడు.

ఈ) దేశంలో శాంతి ఉండాలంటే ఏమి జరగాలి?
జవాబు:
దేశంలో పాపాలు చేయని ధన్యులు ఉంటే శాంతి ఉంటుంది.

అపరిచిత పద్యాలు

1. కింది అపరిచిత పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరనుఁ గొల్చి మిదుకుట కంటెన్
వడి గల యెద్దులఁ గట్టుక
మడి దున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతీ !
ప్రశ్నలు – జవాబులు:
అ) ఎవరిని సేవించకూడదు?
జవాబు:
అడిగినా జీతం ఇవ్వని ప్రభువుని సేవించకూడదు.

ఆ) అటువంటి ప్రభువుని ఏమి చేయాలి?
జవాబు:
అటువంటి ప్రభువుని విడిచి పెట్టేయాలి.

ఇ) వేటిని కట్టుకొని పొలమును దున్నుకోవాలి?
జవాబు:
చురుకైన ఎద్దులను కట్టుకొని పొలము దున్నుకోవాలి.

ఈ) పై పద్యములోని నీతి ఏమిటి?
జవాబు:
లాభము లేని పనిని విడిచిపెట్టాలి.

AP 6th Class Telugu Important Questions Chapter 8 మేలుకొలుపు

2. కింది అపరిచిత పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఎలుక తోలు ఁదెచ్చి యేడాది యుతికిన
నలుపు నలుపె గాని తెలుపు గాదు
కొయ్య బొమ్మ ఁదెచ్చి కొట్టిన పలకదు
విశ్వదాభిరామ ! వినురవేమ !
ప్రశ్నలు – జవాబులు :
అ) ఎలుక తోలు ఎన్నాళ్ళు ఉతికారు?
జవాబు:
ఎలుక తోలు ఏడాది ఉతికారు.

ఆ) నలుపు రంగు తెలుపయ్యిందా?
జవాబు:
నలుపు రంగు నల్లగానే ఉంది కాని తెల్లబడలేదు.

ఇ) చెక్క బొమ్మ ఏం చేస్తే పలకదు?
జవాబు:
చెక్క బొమ్మని ఎంతగా కొట్టినా పలకదు.

ఈ) ఎవరికి ఎంత చెప్పినా చెవికెక్కదు?
జవాబు:
మూర్ఖునికి ఎంత చెప్పినా చెవికెక్కదు.

3. కింది అపరిచిత పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఎంత చదువు చదివి యెన్నెన్ని విన్నను
హీనుఁ డవ గుణంబు మానలేడు
బొగ్గు పాల ఁగడుగఁబోవునా మలినంబు
విశ్వదాభిరామ ! వినురవేమ !
ప్రశ్నలు – జవాబులు:
అ) హీనుడి గుణము ఎటువంటిది?
జవాబు:
ఎంత చదువు చదివినా, ఏం విన్నా హీనుడు చెడ్డగుణాన్ని విడువడు.

ఆ) బొగ్గు నలుపు దేనితో కడిగినా పోదు?
జవాబు:
బొగ్గు నలుపు పాలతో కడిగినా పోదు.

ఇ) ఈ పద్యము ఏ శతకములోనిది?
జవాబు:
ఈ పద్యము వేమన శతకములోనిది.

ఈ) ఈ పద్యమును రచించిన కవి ఎవరు?
జవాబు:
ఈ పద్యాన్ని రచించిన కవి వేమన.

AP 6th Class Telugu Important Questions Chapter 8 మేలుకొలుపు

4. క్రింది లేఖను చదివి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
జవాబు:

నెల్లూరు,
xxxxx.

ప్రియమైన లతకు,

మన రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో ఎంతోమంది పిల్లలు బడికి దూరంగా ఉంటున్నారు. వివిధ పరిశ్రమలలో బాలకార్మికులుగా పనిచేస్తున్నారు. మన ప్రభుత్వం అమ్మఒడి పథకం ద్వారా రూ. 15,000 ప్రతి విద్యార్థికీ ఇస్తోంది. మధ్యాహ్న భోజనం, బట్టలు, బూట్లూ, పుస్తకాలు ఇస్తున్నారు. విద్యా కానుక పథకం ద్వారా ప్రతి విద్యార్థికి అవసరమైనవన్నీ ఇస్తున్నారు. అందుచేత అందరినీ బడిలో చేరమని చెప్పు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అన్ని సదుపాయాలతో ఉన్నాయి.

ఇట్లు,
నీ స్నేహితురాలు,
కె. లలిత వ్రాలు

చిరునామా :
కె. లత
6వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
రామచంద్రాపురం, తూర్పుగోదావరి జిల్లా.

ప్రశ్నలు – జవాబులు:
అ) లతది ఏ ఊరు?
జవాబు:
లతది రామచంద్రాపురం.

ఆ) ప్రతి విద్యా ర్థికి రూ. 15,000 ఇచ్చే పథకం పేరేమిటి?
జవాబు:
ప్రతి విద్యార్థికి రూ. 15,000 ఇచ్చే పథకం పేరు అమ్మఒడి.

ఇ) ఈ ఉత్తరం ఎవరిని ఉద్దేశించి రాశారు?
జవాబు:
ఈ ఉత్తరం బాలకార్మికులను ఉద్దేశించి రాశారు.

ఈ) పై ఉత్తరం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
పై ఉత్తరం ఎవరు రాశారు?

AP 6th Class Telugu Important Questions Chapter 8 మేలుకొలుపు

5. కింది సంభాషణ చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

కవి : పుష్పమా ! నీ జీవితం ధన్యమైంది.
పుష్పం : ఔను కవీ ! నీవు కూడా మాతృభూమికి పూజచేసి, నీ జన్మ కూడా ధన్యం చేసుకో !
కవి : ఒకటి, రెండు రోజుల జీవితకాలంలో నీకేం మిగులుతుంది?
పుష్పం : నాకు తృప్తి మిగులుతుంది. నీవు కూడా నాలాగే బతికినంత కాలం నవ్వుతూ బతకడం. నేర్చుకో!
కవి : అలాగే ! నిన్ను చూస్తుంటే నాకానందంగా ఉంది.
ప్రశ్నలు:
అ) పుష్పం జీవితం ఎందుకు ధన్యమైంది?
జవాబు:
మాతృభూమికి పూజ చేయడం వలన పుష్పం జీవితం ధన్యమైంది.

ఆ) పుష్పం ఎన్నాళ్లు జీవిస్తుంది?
జవాబు:
పుష్పం ఒకటి, రెండు రోజులు జీవిస్తుంది.

ఇ) పుష్పం సందేశం ఏమిటి?
జవాబు:
బ్రతికినన్ని రోజులూ నవ్వుతూ బతకాలనేది పుష్పం యొక్క సందేశం.

ఈ) పై సంభాషణ ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ఎవరు ఆనందించారు?

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
కాళిదాసాది సత్కవి పుంగవుల వలన ప్రయోజనం ఏమిటి?
జవాబు:
కవులు తమ కావ్యాల ద్వారా చక్కటి విషయాలను రమ్యంగా వర్ణిస్తూ చెపుతారు. ఏది మంచో, ఏది చెడో కథల రూపంలో చెబుతారు. ఒక తండ్రి పిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలో, పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తించాలో కవులు తమ రచనల ద్వారా వ్యక్తపరుస్తారు. మానవ సంబంధాలను సక్రమంగా కొనసాగించటానికి మంచి మార్గాలను ఉపదేశిస్తారు. జంతు ప్రేమను, పక్షి ప్రేమను, ప్రకృతి పట్ల బాధ్యతను చెబుతారు. ఒక ఉత్తమ సమాజ నిర్మాణంలో కవులు కీలకపాత్రను పోషిస్తారు.

ప్రశ్న 2.
నీవు చూసిన పుణ్యక్షేత్రం గురించి వ్రాయి.
జవాబు:
నేను తిరుమల పుణ్యక్షేత్రాన్ని చూశాను. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి బస్సు వెడుతుంటే చాలా మలుపులు తిరుగుతుంది. పైకి చూస్తే కొండలు. కిందకు చూస్తే లోయలు. చుట్టూ పచ్చటి ప్రకృతి. ఆ అడవిలో నుండి అదో రకమయిన సువాసన మనసును ఆకర్షిస్తుంది. తిరుమల కొండపై చల్లగా ఉంటుంది. క్యూలైనులో నిలుచున్నప్పుడు మనసంతా భక్తి భావనతో నిండిపోతుంది. వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని నమస్కరిస్తే చాలా ఆనందం కలుగుతుంది. ఎటు చూసినా జనాలే. ఆ జనాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు. నాకు తిరుపతి లడ్డూ అంటే చాలా ఇష్టం. అది చాలా రుచిగా ఉంటుంది. ఎంత తిన్నా తనివి తీరదు.

AP 6th Class Telugu Important Questions Chapter 8 మేలుకొలుపు

ప్రశ్న 3.
మదత్రయమును వివరించండి.
జవాబు:
మదత్రయము అంటే మూడింటి వలన కలిగే గర్వము. అవి కుల గర్వం, విద్యా గర్వం, ధన గర్వం. కొంతమంది తమ కులాన్ని బట్టి తాము చాలా గొప్పవాళ్ళమని భావిస్తారు. తమ కులం వాళ్ళు మాత్రమే సమాజాన్ని చక్కదిద్దగలరని భావిస్తారు. గర్వపడతారు. అది మంచి పద్ధతి కాదు. కులాన్ని బట్టి కాక గుణాన్ని బట్టి గౌరవిస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుంది.

కొంతమంది ఉన్నత విద్యావంతులు ఉంటారు. తాము చాలా గొప్పవాళ్ళమని భావిస్తారు. తమను మించిన విద్యావంతులు కాని, తెలివైనవారు కాని ఉండరనే అహంకారంతో ప్రవర్తిస్తారు. తమకంటే తక్కువగా చదువుకున్న వారిని హీనంగా చూస్తారు. కించపరుస్తారు. కానీ మనిషికి విద్య వలన గౌరవం రాదు. మంచి ప్రవర్తన లేని విద్యావంతుని ఎవ్వరూ మెచ్చుకోరు.

కొంతమంది ధనవంతులుంటారు. వారు ధనవంతులమనే గర్వంతో ఉంటారు. పేదవారిని కనీసం మనుషులుగా కూడా చూడరు. అది చాలా తప్పు. మనిషికి ధనాన్ని బట్టి గౌరవం రాదు. దానగుణాన్ని బట్టీ, ఇతరులకు సహాయం చేసే స్వభావాన్ని బట్టీ పదిమందిలో గౌరవం పెరుగుతుంది.

ప్రశ్న 4.
‘మేలుకొనుమయ్య తరుణము మించకుండ’ అంటే మీకేమి అర్థమయ్యింది? వివరించండి.
జవాబు:
తరుణము అంటే తగిన సమయం. మేలుకొనుట అంటే జాగ్రత్తపడటం. సమయము మించిపోకుండా జాగ్రత్త పడాలి అంటే తగిన సమయంలో తగిన విధంగా పోరాడి హక్కులను సాధించుకోవాలి. మన హక్కులను ఇతరులు హరిస్తున్న సమయంలోనే ప్రతిఘటించాలి. ఆ సమయంలో మాట్లాడకుండా తరువాత ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదు. కనుక దేనికైనా తగిన సమయంలోనే ప్రతిస్పందించి మన హక్కులను సాధించుకోవాలని అర్థమయ్యింది.

ప్రశ్న 5.
ధన్యులెవరు? వివరించండి.
జవాబు:
ఇతరుల ధనమును, మానమును, ప్రాణమును, సంపదను పాడుచేయడం మహాపాపమని భావించేవారు ధన్యులు. ఎందుకంటే మనకు ఉన్నదానితోనే తృప్తి చెందాలి. ఇతరుల ధనమును ఆశించకూడదు. పరుల సొమ్ము పాము కంటే ప్రమాదకరమైనదని గొప్పవారు భావిస్తారు. అందుచేత పరుల ధనమును ఆశించనివారు, పాడుచేయనివారు ధన్యులు. ఇతరుల గౌరవానికి భంగం కలిగించకూడదు. ఇతరులను గౌరవిస్తేనే మనకు గౌరవం దక్కుతుంది. ఇతరుల గౌరవానికి గొప్పవారు భంగం కలిగించరు. ఇతరుల గౌరవాన్ని కాపాడేవారే ధన్యులు. ఎట్టి పరిస్థితుల్లోను ఇతరుల ప్రాణానికి హాని తలపెట్టకూడదు. ఒక ప్రాణాన్ని నిలబెట్టినవారిని దేవతలుగా పూజిస్తారు. అదే ప్రాణాన్ని తీసేవారిని రాక్షసులుగా పేర్కొంటారు. కాబట్టి ప్రాణదానం చేసేవారిని ధన్యులుగా చెబుతారు. పరుల ఐశ్వర్యాన్ని చూసి ఈర్ష్యపడకూడదు. ఐశ్వర్యమనేది భగవంతుడు ప్రసాదించేది. ఇతరుల ఐశ్వర్యాన్ని పాడుచేయాలనుకోవడం మహాపాపం. అటువంటి ఆలోచన లేనివారిని ధన్యులుగా చెబుతారు.

ప్రశ్న 6.
భరతమాత ఏకపాత్రాభినయం రాయండి.
జవాబు:
భరతమాత

పిల్లలూ నేను భరతమాతను. కాళిదాసు మొదలైన కవులు నా ముద్దుబిడ్డలు. వీరాధివీరులైన శ్రీకృష్ణదేవరాయలు వంటి వీరపుత్రులూ ఉన్నారు. కాశీ లాంటి పుణ్యక్షేత్రాలు నాలో ఎన్నో ఉన్నాయి. కోహినూరు వజ్రం లాంటి అపారమైన మణులు ఉన్నాయి.

కాని, నాకొక్కటే బాధ. కొంతమంది దీనులైన నా బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు. అస్పృశ్యత అనే అగ్ని నన్ను చాలా బాధపెడుతోంది. మీలో జాతిభేదాలు పోవాలి. మీరంతా నా పిల్లలే. విద్యాగర్వం, కులగర్వం, ధనగర్వం మీలో ఉండకూడదు. అవే మన ధర్మాన్ని పాడుచేస్తున్నాయి. మనకు చెడ్డ పేరు తెస్తున్నాయి. నా సంతానమంతా నాకు సమానమే. అందరూ అన్ని హక్కులూ సమానంగా అనుభవించాలి. అప్పుడే నాకు ఆనందం. మీరు పెద్దవాళ్లయ్యాక నన్ను సంతోషపెట్టండి. బాగా చదువుకోండి. మీకు, నాకూ మంచిపేరు తెండి. మీ అందరికీ నా ఆశీస్సులు.

AP 6th Class Telugu Important Questions Chapter 8 మేలుకొలుపు

ప్రశ్న 7.
కుసుమ ధర్మన్న. గారి గురించి మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

ఏలూరు,
xxxxx.

ప్రియమైన సంజీవ్ కు,

నీ మిత్రుడు సంజయ్ వ్రాయు లేఖ.

మొన్న మాకు స్కూల్లో మేలుకొలుపు పాఠం చెప్పారు. దానిని కుసుమ ధర్మన్న కవిగారు రచించారు. ఆయన రాజమండ్రిలో పుట్టారుట. చాలా కష్టపడి చదువుకొన్నారుట. ఆయన సంస్కృతం, తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ భాషలలో పండితుడట. మాకొద్దీ తెల్లదొరతనం గరిమెళ్ల వారు రచించారు కదా ! ధర్మన్నగారేమో మాకొద్దీ నల్లదొరతనం అని రాశారు. చాలా పుస్తకాలు రాశారు. మనం కూడా ఆయనలాగా చాలా భాషలు నేర్చుకోవాలి.

ఉంటాను మరి. జవాబు వ్రాయి.

ఆయన రచించిన పుస్తకాలన్నీ సంపాదించి చదువుదాం.

ఇట్లు,
నీ మిత్రుడు,
టి. సంజయ్ వ్రాలు.

చిరునామా :
ఆర్. సంజీవ్, 6వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
నాదెండ్ల, గుంటూరు జిల్లా.

III. భాషాంశాలు:

1. పర్యాయపదాలు:

రణము = పోరు, యుద్ధము
మాత = తల్లి, జనని
కాశీ = వారణాసి, కాశికా
అశృవులు = కన్నీరు
అనలము = అగ్ని, వహ్ని
భూమి = పుడమి, అవని
తరుణము = సమయము, కాలము
ప్రాణము = జీవము, అసువులు
కృష్ణుడు = శౌరి, నల్లనయ్య
వీరుడు = శూరుడు, సైనికుడు
పొలతి = నారి, రామ, స్త్రీ
మున్నీరు = సముద్రము, అంబుధి
దిక్కు = దిశ, ఆశ
రథము = తేరు, అరదము
ధనము = డబ్బు, సంపద
పాతకము = దురితము, పాపము

2. ప్రకృతి – వికృతులు:

విద్య – విద్దె
రాజు – రాయలు
రత్నము – రతనము
గుణము – గొనము
ధర్మము – దమ్మము
ప్రాణము – పానము
కృష్ణుడు – కన్నడు
పుణ్యము – పున్నెము
గర్భము – కడుపు
దుఃఖము – దూకలి
రథము – అరదము
భక్తి – బత్తి

AP 6th Class Telugu Important Questions Chapter 8 మేలుకొలుపు

3. వ్యతిరేక పదాలు :

ఆది × అంతం
విద్య × అవిద్య
అతుల × తుల
సద్గుణము × దుర్గుణము
యాచకుడు × దాత
అస్పృశ్యత × స్పృశ్యత
ధర్మము × అధర్మము
స్వ × పర
మేలుకొను × నిద్రించు
అధికము × అల్పము
సత్కవి × కుకవి
వీరుడు × భీరువు
పుణ్యము × పాపము
అఘము × అనఘము
దుర్గతి × సద్గతి
భేదం × అభేదం
మంగళం × అమంగళము
హితులు × అహితులు
స్వర్గము × నరకము
శాంతి × అశాంతి

4. సంధులు :

శూరులు + అగు = శూరులగు – (ఉత్వ సంధి)
మణులను + ఈని = మణులనీని – (ఉత్వ సంధి)
మీకు + ఒసగు = మీకొసగు – (ఉత్వ సంధి)
దుఃఖము + అణుగు = దుఃఖమణుగు – (ఉత్వ సంధి)
ధర్మమునకు + అడ్డుపడెడు = ధర్మమునకడ్డుపడెడు – (ఉత్వ సంధి)
నాశము + అందు = నాశమందు – (ఉత్వ సంధి)
మేలుకొనుము + అయ్య = మేలుకొనుమయ్య – (ఉత్వ సంధి)
హక్కులకు + ఐ = హక్కులకై – (ఉత్వ సంధి)
సల్పుము + ఇపుడె = సల్పుమిపుడె – (ఉత్వ సంధి)
ప్రాణము + ఇడుట = ప్రాణమీడుట – (ఉత్వ సంధి)
పదము + అని = పదమని – (ఉత్వ సంధి)
స్వాంతము + అందు = స్వాంతమందు – (ఉత్వ సంధి)
పాతకంబు + అని = పాతకంబని – (ఉత్వ సంధి)
వారలు + ఎందున = వారలెందున – (ఉత్వ సంధి)
అంకితము + ఒనర్తు = అంకితమొనర్తు – (ఉత్వ సంధి)
ఏను + అధిక = ఏనధిక – (ఉత్వ సంధి)
వారికి + ఎల్ల = వారికెల్ల – (ఉత్వ సంధి)
విద్యావతి + అన = విద్యావతియన – (యడాగమ సంధి)
వెలది + ఒప్పె = వెలదియొప్పె – (యడాగమ సంధి)
మాత + అన = మాతయన – (యడాగమ సంధి)
రత్నగర్భ + అన = రత్నగర్భయన – (యడాగమ సంధి)
సంఘాత + అఘవిదూర = సంఘాతయఘవిదూర – (యడాగమ సంధి)
కాళిదాసు + ఆది = కాళిదాసాది – (సవర్ణదీర్ఘ సంధి)
కృష్ణరాయ + ఆదులు = కృష్ణరాయాదులు – (సవర్ణదీర్ఘ సంధి)
భారత + అంబ = భారతాంబ – (సవర్ణదీర్ఘ సంధి)
బడబ + అనలం = బడబానలం – (సవర్ణదీర్ఘ సంధి)
సకల + అంగకంబులు = సకలాంగకంబులు – (సవర్ణదీర్ఘ సంధి)
సంచిత + ఆకృతి = సంచితాకృతి – (సవర్ణదీర్ఘ సంధి)
స్వ + అంతము = స్వాంతము – (సవర్ణదీర్ఘ సంధి)

AP 6th Class Telugu Important Questions Chapter 8 మేలుకొలుపు

5. కింది ప్రకృతి – వికృతులు జతపరచండి.

1. గుణము అ) అరదము
2. రథము ఆ) దమ్మము
3. ధర్మము ఇ) గొనము

జవాబు:

1. గుణము ఇ) గొనము
2. రథము అ) అరదము
3. ధర్మము ఆ) దమ్మము

6. కింది ఖాళీలను పూరించండి.

సంధి పదం విడదీసిన రూపం సంధి పేరు
1. మీకొసగు మీకు + ఒసగు ఉత్వ సంధి
2. హక్కులకై హక్కులకు + ఐ ఉత్వ సంధి
3. వారికెల్ల వారికి + ఎల్ల ఇత్వ సంధి
4. వెలది యెప్పె వెలది + ఒప్పె యడాగమ సంధి
5. మాతయన మాత + అన యడాగమ సంధి

7. ఈ క్రింది ప్రశ్నలకు సరైన జవాబులను బ్రాకెట్లలో గుర్తించండి.

1. పుంగవముతో పొలం దున్నుతారు. (అర్థం గుర్తించండి)
అ) నాగలి
ఆ) ట్రాక్టరు
ఇ) ఎద్దు
జవాబు:
ఇ) ఎద్దు

2. రణము వలన నష్టమే తప్ప లాభం లేదు. (అర్థం గుర్తించండి)
అ) యుద్ధం
ఆ) వ్యాపారం
ఇ) ప్రయాణం
జవాబు:
అ) యుద్ధం

3. నారిని గౌరవించాలి. (అర్థం గుర్తించండి)
అ) స్త్రీ
ఆ) భార్య
ఇ) చెల్లెలు
జవాబు:
అ) స్త్రీ

4. సన్నుతికి పొంగకు. (అర్థం గుర్తించండి)
అ) ఉద్యోగం
ఆ) పొగడ్త
ఇ) సంపద
జవాబు:
ఆ) పొగడ్త

AP 6th Class Telugu Important Questions Chapter 8 మేలుకొలుపు

5. మన ఆంధ్రుల విఖ్యాతి పెరగాలి. (అర్థం గుర్తించండి)
అ) సంపద
ఆ) పదవులు
ఇ) కీర్తి
జవాబు:
ఇ) కీర్తి

6. మున్నీరులో అన్ని నదులూ కలుస్తాయి. (అర్థం గుర్తించండి)
అ) సముద్రం
ఆ) నీరు
ఇ) గొయ్యి
జవాబు:
అ) సముద్రం

7. అనలముతో సరసం ప్రమాదం. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) నీరు, జలం
ఆ) అగ్ని, వహ్ని
ఇ) వాయువు, గాలి
జవాబు:
ఆ) అగ్ని, వహ్ని

8. ధనముపై ఆశ పనికిరాదు. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) డబ్బు, సంపద
ఆ) కీర్తి, ఖ్యాతి
ఇ) పదవి, హోదా
జవాబు:
అ) డబ్బు, సంపద

9. పాతకము చేయరాదు. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) దొంగతనం, తస్కరణ
ఆ) అధికారం, జులుం
ఇ) పాపం, దురితం
జవాబు:
ఇ) పాపం, దురితం

10. పరాయి స్త్రీని మాతగా గౌరవించాలి. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) చెల్లెలు, సోదరి
ఆ) తల్లి, జనని
ఇ) అక్క సహోదరి
జవాబు:
ఆ) తల్లి, జనని

11. విద్య వలన అజ్ఞానం నశిస్తుంది. (వ్యతిరేకపదం గుర్తించండి)
అ) అవిద్య
ఆ) విజ్ఞానం
ఇ) తెలివి
జవాబు:
అ) అవిద్య

AP 6th Class Telugu Important Questions Chapter 8 మేలుకొలుపు

12. పాపం వలన దుర్గతి కలుగుతుంది. (వ్యతిరేకపదం గుర్తించండి)
అ) పుణ్యం
ఆ) సద్గతి
ఇ) మంచి
జవాబు:
ఆ) సద్గతి

13. అఘము చేయుట మంచిది కాదు. (వ్యతిరేకపదం గుర్తించండి)
అ) ఆఘము
ఆ) అరఘము
ఇ) అనఘము
జవాబు:
ఇ) అనఘము

14. అధర్మం నశిస్తుంది. (వ్యతిరేకపదం గుర్తించండి)
అ) ధర్మం
ఆ) పుణ్యం
ఇ) దమ్మము
జవాబు:
అ) ధర్మం

15. పుణ్యాత్ములున్న చోటే స్వర్గం. (వ్యతిరేకపదం గుర్తించండి)
అ) మంచిది
ఆ) నరకం
ఇ) దివి
జవాబు:
ఆ) నరకం

16. విద్య నేర్చుకోవాలి. (వికృతిని గుర్తించండి)
అ) విద్దె
ఆ) అవిద్య
ఇ) విదేయ
జవాబు:
అ) విద్దె

17. పున్నెములు చేయాలి. (ప్రకృతిని గుర్తించండి)
అ) పున్నియము
ఆ) పుణ్యము
ఇ) పుము
జవాబు:
ఆ) పుణ్యము

18. మంచి గుణములు కలిగి ఉండాలి. (వికృతి గుర్తించండి)
అ) గునము
ఆ) గూన
ఇ) గొనములు
జవాబు:
ఇ) గొనములు

19. బత్తితో దేవుని పూజించాలి. (ప్రకృతి గుర్తించండి)
అ) భక్తి
ఆ) పత్తి
ఇ) మిత్తి
జవాబు:
అ) భక్తి

20. ధర్మము నెగ్గుతుంది. (వికృతిని గుర్తించండి)
అ) ధరమము
ఆ) దమ్మము
ఇ) దమ్ము
జవాబు:
ఆ) దమ్మము

AP 6th Class Telugu Important Questions Chapter 8 మేలుకొలుపు

21. మీకొసగును సౌఖ్యాలు. (సంధి పేరు గుర్తించండి)
అ) ఉత్వ సంధి
ఆ) ఇత్వ సంధి
ఇ) అత్వ సంధి
జవాబు:
అ) ఉత్వ సంధి

22. మేలుకొనుమయ్య (సంధి విడదీసిన రూపం గుర్తించండి)
అ) మేలు + కొనుమయ్య
ఆ) మేలుకొనుమ + అయ్య
ఇ) మేలుకొనుము + అయ్య
జవాబు:
ఇ) మేలుకొనుము + అయ్య

23. వారికెల్ల సుఖములు కలుగును. (సంధి పేరు గుర్తించండి)
అ) అత్వ సంధి
ఆ) ఇత్వ సంధి
ఇ) ఉత్వ సంధి
జవాబు:
ఆ) ఇత్వ సంధి

24. ఏమి + అంటివి – సంధి కలిసిన రూపం గుర్తించండి.
అ) ఏమంటివి
ఆ) ఏమాంటివి
ఇ) ఏముంటివి
జవాబు:
అ) ఏమంటివి

25. పూర్ణయ్య మంచి చురుకైనవాడు. (సంధి పేరు గుర్తించండి)
అ) ఇత్వ సంధి
ఆ) ఉత్వ సంధి
ఇ) అత్వ సంధి
జవాబు:
ఇ) అత్వ సంధి

26. కిందివానిలో అత్వ సంధి పదం గుర్తించండి.
అ) సుబ్బయ్యన్నయ్య
ఆ) సుబ్బారావు
ఇ) చింతారావు
జవాబు:
అ) సుబ్బయ్యన్నయ్య

27. విద్యావతియన (సంధి విడదీసిన రూపం గుర్తించండి)
అ) విద్య + ఆవతియన
ఆ) విద్యావతి + అన
ఇ) విద్యావతి + యన
జవాబు:
ఆ) విద్యావతి + అన

28. వెలది + ఒప్పె (సంధి కలిసిన రూపం గుర్తించండి)
అ) వెలదియొప్పె
ఆ) వెలదిప్పె
ఇ) వెలదప్పె
జవాబు:
అ) వెలదియొప్పె

29. సుఖమును, దుఃఖమును (సమాస పదం గుర్తించండి)
అ) సుఖం దుఃఖం
ఆ) సుఖమనెడు దుఃఖం
ఇ) సుఖదుఃఖాలు
జవాబు:
ఇ) సుఖదుఃఖాలు

AP 6th Class Telugu Important Questions Chapter 8 మేలుకొలుపు

30. తల్లీపిల్లలు వచ్చారు. (సమాసం పేరు గుర్తించండి)
అ) ద్విగువు
ఆ) ద్వంద్వం
ఇ) షష్టీతత్పురుష
జవాబు:
ఆ) ద్వంద్వం

చదవండి – ఆనందించండి

ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో….

AP 6th Class Telugu Important Questions Chapter 8 మేలుకొలుపు 1
ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో,
ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో,
ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో,
సంసారపు గోడల మధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచంలో విడిపోలేదో,
ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో,
ఎక్కడ అలసట నెరగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణతవైపు జాస్తుందో,
ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెడారిలో స్వచ్ఛమైన బుద్ది ప్రవాహం ఇంకిపోకుండా వుంటుందో,
ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ, కార్యాలలోకీ నీచే నడపబడుతుందో,
ఆ స్వేచ్ఛా స్వర్గానికి, తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు

కవి పరిచయాలు

రవీంద్రనాథ్ ఠాగూర్ (07.05.1861 – 07.08.1941)
విశ్వకవి, చిత్రకారుడు, సంగీతకర్త. విద్యావేత్త. బెంగాలీ, ఇంగ్లీషులో అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ విస్తృతంగా రచనలు చేశారు. 1913లో ఆయన రచించిన గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమానం పొందారు. జాతీయోద్యమ కాలంలో దేశాన్ని మేలుకొలిపిన మహనీయుడు. పై కవిత గీతాంజలిలోనిది.

గుడిపాటి వెంకట చలం (18.05.1894 – 04.05.1979)
కవి, కథా రచయిత, నవలాకారుడు, నాటక కర్త, వ్యాసకర్త. తెలుగు వచనాన్ని సానబట్టిన రచయిత. స్త్రీ స్వేచ్ఛ గురించి, సమానత్వాన్ని గురించి పరితపించారు. ఉపాధ్యాయుడిగా, పాఠశాలల పర్యవేక్షకుడిగా తాను గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ‘బిడ్డల శిక్షణ’ అనే పుస్తకాన్ని రాశారు. విద్యను, పెంపకాన్ని మేళవించ వలసిన అవసరాన్ని గుర్తించిన అరుదైన పిల్లల ప్రేమికుడు.