Students can go through AP Board 10th Class Social Notes 17th Lesson స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం to understand and remember the concept easily.
AP Board 10th Class Social Notes 17th Lesson స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం
→ నేపాల్, జపాన్, భారత రాజ్యాంగాలు మూడు కూడా ప్రజాక్షేమాన్ని, వ్యక్తి యొక్క సర్వతోముఖాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చాయని తెలుస్తుంది.
→ నేపాల్ లో 2007లో రాచరికం రద్దు అయింది. రాజ్యాంగాన్ని రూపొందించే ప్రక్రియ 2007లో ప్రారంభమై ఇంతవరకు (2014) కూడా పూర్తి కాలేదు.
→ భారతదేశంలో రాజ్యాంగసభకు 1946లో ఎన్నికలు జరిగినాయి. బ్రిటిష్ రాష్ట్రాల నుండి, సంస్థానాల నుండి సభ్యులను ఎన్నుకొనుట జరిగింది.
→ 1947 ఆగష్టు 14న పాకిస్తాన్ ఏర్పడింది. 1947 ఆగష్టు 15న భారతదేశం ఏర్పడింది. దీనివలన రాజ్యాంగసభ పాకిస్థాన్ రాజ్యాంగసభగా, భారత రాజ్యాంగసభగా విడిపోయింది.
→ ముసాయిదా సంఘం 1947లో డా|| బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పడింది.
→ ముసాయిదా సంఘం, రాజ్యాంగాన్ని రూపొందించింది. చివరిగా 1949 నవంబరు 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగసభ ఆమోదించింది.
→ రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది.
→ ముసాయిదా రాజ్యాంగంలో 315 అధికరణాలు, 8 షెడ్యూళ్ళు ఉన్నాయి.
→ ముసాయిదా, రాజ్యాంగంపై ప్రజాస్పందనల కోసం 8 నెలల పాటు రాజ్యాంగాన్ని ప్రజల ముందు ఉంచింది.
→ మన రాజ్యాంగం ప్రకారం మనది పార్లమెంటరీ, సమాఖ్య వ్యవస్థ అని చెప్పవచ్చు.
→ పార్లమెంటరీ విధానంలో నామమాత్ర అధ్యక్షుడు ఉంటాడు. వాస్తవాధికారాలు ప్రధానమంత్రి మరియు అతని మంత్రులు నిర్వర్తిస్తారు.
→ అమెరికా అధ్యక్ష విధానంలో అధ్యక్షుడే సర్వాధికారి. అన్ని అధికారాలను అధ్యక్షుడే నిర్వర్తిస్తాడు. అతని కింద వివిధ శాఖలకు సెక్రటరీలు బాధ్యత వహిస్తారు.
→ భారత అధ్యక్షుడికి మంత్రులకు పార్లమెంటులో మద్దతు ఉన్నంతవరకు మంత్రులను తొలగించే అధికారం లేదు.
→ రాజ్యాంగ రూపాలు రెండు రకాలు – 1) ఏకీకృత రాజ్యాంగం 2) సమాఖ్య విధానం.
→ మనది సమాఖ్య విధానం. దీని ప్రకారం కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలుంటాయి. అవి సర్వసత్తాకమైనవి. కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన కూడా జరిగింది.
→ మన సమాఖ్య విధానంలో ఏకపౌరసత్వం ఉంది. ఏకీకృత, అత్యున్నత న్యాయస్థానం ఉంది. దేశం మొత్తానికి వర్తించే అఖిల భారత సర్వీసులను కూడా కేంద్రమే నియమిస్తుంది.
→ కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాలను కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలుగా విభజించుట జరిగింది.
→ కొంతమంది రాజ్యాంగాన్ని “1935 భారత చట్టానికి నకలు” అని విమర్శించినారు.
→ షెడ్యూల్డ్ తరగతులు, షెడ్యూల్డ్ తెగలకు రాజ్యాంగంలో రిజర్వేషన్లను కల్పించినారు.
→ “లౌకిక, సామ్యవాదం” అనే పదాలను 1976లో 42వ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు.
→ ముసాయిదా సంఘం : రాజ్యాంగం జాతి ప్రాణమే కాక ఆ జాతి ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగ సభ, రాజ్యాంగాన్ని రూపొందించటానికి ముందుగా రాజ్యాంగ ప్రతిని’ రూపొందించుట కొరకు ఈ “ముసాయిదా సంఘం” ను 1947, ఆగస్టు 29న డా॥ బి. ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.
→ రాజ్యాంగ సభ : రాజ్యాంగ సభ అంటే దేశ రాజ్యాంగం రూపొందించే చర్చా వేదిక. దేశ ప్రాథమిక చట్టాన్ని రూపొందించే వ్యవస్థగా రాజ్యాంగ సభకు ప్రత్యేక హోదా ఉంటుంది.
1) మన దేశ రాజ్యాంగాన్ని నిర్మించుకొనుటకు రాజ్యాంగ సభ, 1946, డిసెంబరు 9న మొదటి సమావేశం జరిపింది.
2) రాజ్యాంగ సభకు 1946 జూలైలో ఎన్నికలు జరిగాయి. 1947 ఆగష్టులో దేశ విభజనతో రాజ్యాంగ సభను కూడా భారత్, పాక్ రాజ్యాంగ సభలుగా విభజించారు.
→ ప్రవేశిక : రాజ్యాంగ మూలతత్వాన్ని సంగ్రహంగా తెల్పే ఈ ప్రవేశిక “ఉపోద్ఘాతం” వంటిది. రాజ్యాంగంలో పొందుపరచిన సిద్ధాంతాలు, భావనలు, రాజ్యాంగ లక్ష్యాలు, ప్రయోజనాలు ఈ ప్రవేశిక ద్వారా తెలుసుకోవచ్చు.
→ ఉభయపద్దు : సమాఖ్య ప్రభుత్వ విధానం యొక్క ముఖ్య లక్షణం “అధికారాల విభజన.” రాజ్యాంగం అధికారాలను కేంద్ర, రాష్ట్రాల మధ్యనే కాకుండా ‘ఉభయపద్దు’ గా విభజించింది. ఈ ఉభయపద్దును “ఉమ్మడి జాబితా” అంటాము. ఇందులో 47 అంశాలుంటాయి. ఈ అంశాల మీద కేంద్రం, రాష్ట్రం రెండూ చట్టాలు చేయవచ్చు. అయితే కేంద్రం చేసే చట్టానికి విరుద్ధంగా రాష్ట్రం చట్టం చేస్తే కేంద్రం చేసిన చట్టమే చెల్లుబాటవుతుంది.
→ ఏకీకృత, సమాఖ్య సిద్ధాంతాలు: 1) ప్రభుత్వంలో ప్రభుత్వాధికారమంతా కేంద్ర ప్రభుత్వానికే ఉంటే అది “ఏకీకృత సిద్ధాంత” మని అంటాం.
2) ప్రభుత్వాధికారాలు కేంద్ర, రాష్ట్రాల మధ్య రాజ్యాంగబద్ధంగా పంపిణీ అయితే దానిని “సమాఖ్య సిద్ధాంత”మని అంటాం.
→ పౌరసత్వం : ఆధునిక రాజ్యాలలో రెండు విధాలైన ప్రజలున్నారు. వారు దేశీయులు మరియు విదేశీయులు. “ఏ ప్రజలు దేశంలో పౌర, రాజకీయ హక్కులను అనుభవిస్తుంటారో వారిని ఆ దేశ పౌరులని” అంటారు. విదేశీయులకు మానవతా దృష్ట్యా పౌరహక్కులను మాత్రమే కల్పిస్తారు. కాబట్టి ‘పౌరసత్వం’ అనే హోదాను రాజ్యం పౌరునికి కల్పించుటచే అతను పౌర, రాజకీయ హక్కులు అనుభవించగలడు. భారతదేశంలో ఏక పౌరసత్వం (భారత పౌరసత్వం ) ఉంది.
→ అధ్యక్ష, పార్లమెంటరీ తరహా వ్యవస్థ :
1) అధ్యక్ష విధానం : ఈ విధానంలో శాసనసభ, కార్యనిర్వాహక వర్గాలు రెండూ స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. కార్యనిర్వాహక వర్గం శాసనసభలో భాగం కాదు. అధ్యక్షుడే ప్రధాన కార్యనిర్వాహణాధికారి. అతడే వాస్తవ అధికారి. అధ్యక్షుడే అన్ని అధికారాలను స్వయంగా కాని, మంత్రుల ద్వారా కాని చెలాయిస్తాడు.
2) పార్లమెంటరీ వ్యవస్థ : ఈ విధానంలో కార్యనిర్వాహక శాఖకు, శాసనశాఖకు సన్నిహిత సంబంధం ఉంటుంది. శాసనశాఖ నుంచే కార్యనిర్వాహక శాఖ ఏర్పడుతుంది. శాసన శాఖకు బాధ్యత వహిస్తుంది. అధ్యక్షుడు నామమాత్రంగా ఉంటాడు. వాస్తవాధికారాలు ప్రధానమంత్రి మరియు ఇతర మంత్రులు నిర్వర్తిస్తారు.
→ సవరణ : చట్టాలను అప్పుడప్పుడు సవరించాల్సిన అవసరం ఏర్పడుతుందని రాజ్యాంగ నిర్మాతలు గుర్తించి, రాజ్యాంగంలోని అధికరణాలను సవరించటానికి అవకాశం కల్పించింది. ఈ సవరణలను పార్లమెంటు 2/3 వంతు మెజారిటీతో ఆమోదించాలి. సవరణలను దేశ అధ్యక్షుడు ఆమోదించాలి.
→ కేంద్ర జాబితా : సమాఖ్య విధానంలో అధికారాలు కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి అధికారాలుగా విభజింపబడినాయి. కేంద్ర జాబితాలో 97 అంశాలున్నాయి. ఈ అంశాలపై కేంద్రమే చట్టాలు చేస్తుంది. అవి దేశానికంతటికి వర్తిస్తాయి.
ఉదా : రక్షణ, రైల్వేలు, తంతి తపాలా వంటివి.
→ రాష్ట్ర జాబితా : రాష్ట్ర జాబితాలో 60 అంశాలున్నాయి. వాటి మీద రాష్ట్ర ప్రభుత్వమే చట్టాలు చేయగలదు.
ఉదా : పోలీసు, ప్రజా ఆరోగ్యం , జైళ్ళు మొదలైనవి.