AP Inter 2nd Year Civics Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు – ఆదేశక సూత్రాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 2nd Lesson ప్రాథమిక హక్కులు – ఆదేశక సూత్రాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 2nd Lesson ప్రాథమిక హక్కులు – ఆదేశక సూత్రాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రాథమిక హక్కుల రకాలను వివరింపుము.
జవాబు:
భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 12వ అధికరణం నుండి 35వ అధికరణం వరకు గల అంశాలు ప్రాథమిక హక్కులను వివరిస్తాయి. ప్రాథమిక హక్కులు ప్రజల స్వేచ్ఛకు, సర్వతోముఖ వికాసానికి అవసరం. ఇవి ప్రజాస్వామ్యాన్ని సార్ధకం చేస్తాయి. ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులున్నాయి. వీటిని కోర్టు ద్వారా రక్షించుకోవచ్చు.

వీటిని గురించి విపులంగా చర్చిద్దాం
1) సమానత్వపు హక్కు (14 నుండి 18 వరకు గల ప్రకరణలు): ప్రాథమిక హక్కులలో సమానత్వపు హక్కు భారత పౌరులందరికి ‘చట్ట సమానత్వాన్ని కల్పించింది. రాజ్యాంగంలోని 14వ ప్రకరణ భారతదేశంలో నివసించే వ్యక్తులందరికి చట్టం ముందు సమానత్వాన్ని, చట్టం ద్వారా సమానమైన రక్షణ, సదుపాయాలను కల్పించింది.
పౌరుల మధ్య మతం, తెగ, కులం, లింగ, జన్మస్థల సంబంధమైన వివక్షతలను రాజ్యం పాటించరాదని 15వ ప్రకరణ స్పష్టం చేసింది. అలాగే బహిరంగ ప్రదేశాలు సందర్శించే విషయంలో పౌరుల మధ్య ఎలాంటి వివక్షత చూపించకూడదని పేర్కొంది.

16వ ప్రకరణ ప్రకారం రాజ్యానికి సంబంధించిన ఏ ఉద్యోగం లేదా నియామకానికైనా పౌరలందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరమైన విషయాలలో మతం, తెగ, కులం, లింగం, పుట్టుక వంటి అంశాలేవి ప్రధానమైనవి కావని ఆ ప్రకరణ పేర్కొంది.

17వ ప్రకరణ అస్పృశ్యత లేదా అంటరానితనం పాటించడాన్ని నేరంగా పేర్కొంది. ఈ విషయంలో 1955లో పార్లమెంటు అస్పృశ్యత నివారణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని 1976 నుంచి పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా వ్యవహరించడమైంది.

18వ ప్రకరణ ప్రకారం పౌరలకు సైనిక లేదా విద్యా విషయం బిరుదులు మినహా ఇతర బిరుదులను రాజ్యం ప్రసాదించకూడదు. భారత రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశాలు ప్రకటించే బిరుదులను పౌరులు స్వీకరించరాదు.

2) స్వేచ్ఛా హక్కు (19 నుండి 22 వరకు గల ప్రకరణలు): 19వ రాజ్యాంగ ప్రకరణ భారత పౌరులకు 7 రకాల స్వాతంత్ర్యాలను ప్రసాదించింది. అవి

  1. వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వాతంత్య్రం.
  2. శాంతియుతంగా సమావేశమయ్యే స్వాతంత్య్రం.
  3. సంఘాలు, యూనియన్లు ఏర్పాటు చేసుకొనే స్వాతంత్య్రం.
  4. దేశమంతటా స్వేచ్ఛగా సంచరించే స్వాతంత్య్రం.
  5. దేశంలో ఎక్కడైనా నివసించడానికి, స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి స్వాతంత్ర్యం.
  6. ఆస్తిని సంపాదించుకొనుటకు, ఆర్జించుటకు, దానధర్మాలు, విక్రయాలు చేసుకొనే స్వాతంత్య్రం.
  7. ఏ వృతినైనా, వ్యాపారాన్నైనా చేసుకొనే స్వాతంత్య్రం.

20వ ప్రకరణ వ్యక్తులు నేరాలకు పాల్పడిన సందర్భాలలో శిక్ష విధించే విషయంలో రక్షణలను పేర్కొంది. ఈ ప్రకరణ అమలులో ఉన్న చట్టాన్ని అతిక్రమించనిదే ఏ వ్యక్తిని దోషిగా పరిగణించకూడదని పేర్కొంటుంది.

21వ అధికరణం ఏ ఒక్క వ్యక్తిని చట్టం పేర్కొన్న పద్ధతి ప్రకారం తప్ప మరో విధంగా అతని జీవనానికి, వ్యక్తి స్వాతంత్ర్యానికి భంగం కల్గించరాదని స్పష్టం చేసింది. ఈ ప్రకరణలను అత్యవసర పరిస్థితుల కాలంలో కూడా రద్దుచేయరు.

22వ ప్రకరణ ప్రకారం ఏ ఒక్క వ్యక్తిని కారణం లేకుండా నిర్భంధంలోకి తీసుకోకూడదు. నిర్భంధంలోకి తీసుకున్న వ్యక్తికి అందుకు కారణాలు తెలపటంతోపాటు న్యాయ సహాయం పొందటానికి వీలు కల్పించాలి. ఉదా: నిర్భంధంలోకి తీసుకున్న వ్యక్తిని 24 గం||లలోగా సమీప న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలి.

3) పీడనను నిరోధించే హక్కు (23 మరియు 24 ప్రకరణలు): 23వ ప్రకరణ ప్రకారం రాజ్యంగాని, సంపన్న వర్గాలు కాని వ్యక్తులను దోపిడీకి గురిచేయకూడదు. మనషుల క్రయ విక్రయాలు జరపటం, ప్రతిఫలం చెల్లించకుండా బలవంతంగా వెట్టిచాకిరీ చేయించుకోవటం నిషేధం.

24వ ప్రకరణ ప్రకారం 14 సంవత్సరాలలోపు పిల్లలను కర్మాగారాలు, గనులు వంటి ప్రమాదకరమైన, ఆరోగ్యానికి హాని కల్గించే పనులలో నియమించకూడదు. బాల కార్మికత్వం చేయించుకొనుట చట్టవిరుద్ధం.

4) మత స్వాతంత్ర్యపు హక్కు (25 నుండి 28 ప్రకరణలు): 25వ ప్రకరణ ప్రకారం ప్రతి వ్యక్తి ప్రజా భద్రత, నైతికతకు లోబడి తన అంతరాత్మకు అనుగుణమైన మతాన్ని అవలంబించటానికి, ప్రచారం చేసుకొనటానికి హక్కుంది. 26వ ప్రకరణ ప్రతి వ్యక్తికి ఈ క్రింది హక్కులను ప్రసాదించింది.

  1. మతపరమైన ధార్మిక సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి
  2. స్వీయ మత వ్యవహారాలను నిర్వహించుకోవడానికి
  3. స్థిర, చరాస్థులపై యాజమాన్య హక్కు పొందడానికి, వాటిని కొనుగోలు చేయడానికి
  4. చట్టప్రకారం ఆస్తిపాస్తులను నిర్వహించుకోవడానికి

27వ ప్రకరణ మతం ఆధారంగా రాజ్యం ఏ వ్యక్తిపై, ఏ విధమైన పన్ను విధించడానికి, వసూలు చేయడానికి వీలులేదని పేర్కొంది. ఏదో ఒక మత ప్రయోజనాలకై రాజ్యం వ్యక్తుల నుంచి పన్నుల రూపంలో ఎలాంటి మొత్తాలను వసూలు చేయకూడదని నిర్దేశించింది.

28వ ప్రకరణ రాజ్యం నుంచి సంపూర్ణంగానో, పాక్షికంగానో ఆర్థిక సహాయాన్ని పొందే విద్యాసంస్థలలో మతపరమైన బోధనలు విషేధించడమైంది.

5) సాంస్కృతిక మరియు విద్యా హక్కు (29 మరియు 30 ప్రకరణలు): భారతపౌరులకు సాంస్కృతిక, విద్యాపరమైన అవకాశాలను రాజ్యాంగము ఈ హక్కుల ద్వారా ప్రసాదించింది. 29వ ప్రకరణ ప్రకారం ప్రతి పౌరుడూ స్వంతభాష, సంస్కృతులను పరిరక్షించుకోవచ్చు. ఈ విషయంలో మత, భాష, ప్రాంతీయ అంశాలేవీ ఆటంకంగా ఉండవు. అల్పసంఖ్యాకులు వారి భాష, సంస్కృతులను పరిరక్షించుకోవచ్చని ఈ హక్కు పేర్కొంది.

30వ ప్రకరణం ప్రకారం ప్రభుత్వం నుంచి సంపూర్ణంగా గానీ, పాక్షికంగాగానీ ఆర్థిక సహాయం పొందే విద్యార్థులలో కులం, నుతం, ప్రాంతం, వర్ణం, భాష లేదా లింగపరమైన అంశాల ప్రాతిపదికపై పౌరులకు ప్రవేశాన్ని నిరాకరించకూడదు.

6) రాజ్యాంగ పరిహారపు హక్కు (32వ ప్రకరణ): ఈ హక్కు ప్రాథమిక హక్కులన్నింటిలోకి అత్యంత ప్రధానమైంది. ఈ హక్కును ప్రాథమిక హక్కులకు రక్షణ వలయంగాను, కంచెగాను, భద్రతా కవచంగాను పరిగణించటమైంది. 32వ ప్రకరణ ప్రకారం భారత పౌరల ప్రాథమిక హక్కుల పునరుద్ధరణకు, రక్షణకు సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టులు హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియరీ, కోవారంటో మొ॥ రిట్లను జారీచేసే అధికారాన్ని కల్గి ఉన్నాయి.

ప్రశ్న 2.
భారత రాజ్యాంగంలో పొందుపరచిన వివిధ రకాల ఆదేశక సూత్రాలను వివరింపుము. [Mar. ’17]
జవాబు:
భారత రాజ్యాంగంలోని 4వ భాగం ఆదేశక సూత్రాలకు సంబంధించినది. రాజ్యాంగంలోని 36వ అధికరణం నుండి 51వ అధికరణం వరకు అదేశక సూత్రాలకు సంబంధించినవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలే ఈ సూత్రాలు. ఇవి ప్రభుత్వానికి ప్రజలపట్ల గల బాధ్యతలను వివరిస్తాయి. ప్రభుత్వం తన విధానాలను రూపొందించుకునేటప్పుడు వీటికి అనుగుణంగా రూపొందించుకోవాలి. వీటిని ఐరిష్ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది.

ఆదేశక సూత్రాల వర్గీకరణ: మన రాజ్యాంగంలో అదేశక సూత్రాలను ప్రత్యేకంగా వర్గీకరణ లేనప్పటికి ప్రభుత్వ పాలనా శాస్త్రవేత్తలు పతనాసౌలభ్యం కొరకు ఆదేశ సూత్రాలను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి: 1. సామ్యవాద సూత్రాలు, 2. ఉదారవాద సూత్రాలు, 3. గాంధేయ సూత్రాలు. వీటిని గురించి క్రింది విధంగా వివరించవచ్చును.

1. సామ్యవాద సూత్రాలు: ఈ సూత్రాలు సామ్యవాద, శ్రేయోరాజ్య సిద్ధాంత స్థాపన లక్ష్యంగా సామాజిక ఆర్థిక న్యాయాన్ని అందించే ఉద్దేశ్యంతో అదేశక సూత్రాల జాబితాలో చేర్చారు. రాజ్యాంగంలోని 38, 39, 41, 42, 43, 46, 47 ప్రకరణలు ఆదేశక సూత్రాలలోని సామ్యవాద ఆదర్శాల గురించి వివరించాయి.
1. 38వ ప్రకరణ ప్రకారం రాజ్యం ప్రజలందరికీ న్యాయంతో కూడిన సామాజిక వ్యవస్థను సాధించి పెంపొందించడానికి కృషి చేయాలి. రాజ్యంలో ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక న్యాయాలు దక్కేటట్లుగా చూడాలి.

2. 39వ ప్రకరణ ప్రకారం రాజ్యం క్రింద పేర్కొన్న చర్యలను అమలులో ఉంచడానికి కృషి చేయాలి.

  1. తగినంత జీవనోపాధి అవకాశాలను కల్పించడం.
  2. సమిష్టి సంక్షేమానికి దోహదపడే భౌతిక వనరులను సంపదను పంపిణీ చేయడం.
  3. స్త్రీ, పురుషులందరికీ సమాన వేతనాన్ని అందించడం.
  4. బాలకార్మికుల రక్షణ.
  5. జాతీయ సంపదను వికేంద్రీకరించడం.
  6. కార్మికుల ఆరోగ్యం, శక్తి దుర్వినియోగం కాకుండా చూడడం.
  7. బాలబాలికలను, యువకులను దోపిడీకి గురికాకుండా రక్షణ.

3. 41వ ప్రకరణ ప్రకారం నిరుద్యోగం, వృద్ధాప్యం, అస్వస్థత, అంగవైకల్యం వంటి ప్రమాదాల బారిన పడిన వారికి పనిహక్కు, విద్య, ప్రభుత్వ సహాయం అందే విధంగా చూడాలి.

4. 42వ ప్రకరణ ప్రకారం కార్మికులకు న్యాయబద్ధమైన మానవతా పరిస్థితులతో కూడిన పనిని కల్పించడం, స్త్రీలకు ప్రసూతి వైద్య సదుపాయాలను రాజ్యం కల్పించాలి.

5. 43వ ప్రకరణ ప్రకారం రాజ్యం వ్యవసాయ, పారిశ్రామిక కార్మికులందరికీ తగిన పనిని కల్పించడం. మంచి ప్రమాణంతో కూడిన జీవనాన్ని గడపడానికి అవసరమైన పరిస్థితులను, విరామాన్ని, సాంఘిక, సాంస్కృతిక అవకాశాలను కల్పించడానికి కృషిచేయాలి.

6. 47వ ప్రకరణ ప్రకారం ప్రజల పోషకాహార స్థాయిని, జీవన ప్రమాణాన్ని పెంపొందించడానికి, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కృషి చేయాలి.

2. ఉదారవాద సూత్రాలు: ప్రాథమిక విద్య, ఉమ్మడి పౌరస్మృతి, స్వతంత్ర న్యాయశాఖ, అంతర్జాతీయ శాంతి వంటి ఆశయాల సాధన కోసం ఉదారవాద సూత్రాలను చేర్చారు. వాటిని రాజ్యాంగంలోని 44, 45, 50, 51 ప్రకరణలలో పేర్కొనడమైంది.
1. 44వ ప్రకరణ ప్రకారం దేశంలో నివసించే పౌరులందరికీ వర్తించే విధంగా ఉమ్మడి పౌరస్మృతి (Common civil code) ని రాజ్యం రూపొందించాలి.

2. 45వ ప్రకరణ ప్రకారం 14సంవత్సరాలోపు పిల్లలందరికీ ఉచిత, నిర్భంద విద్యను అందించడానికి రాజ్యం ప్రయత్నించాలి. ఈ చర్యకు బదులుగా బాలబాలికలు 6సంవత్సరాల వయస్సు పూర్తయ్యే వరకు వారికి శిశుసంరక్షణ, విద్యలను సమకూర్చడానికి రాజ్యం చర్యలు తీసుకోవాలని రాజ్యాంగం (86వ రాజ్యాంగ సవరణ) చట్టం 2002 సూచించింది.

3. 48వ ప్రకరణ ప్రకారం వ్యవసాయం, పశుపోషణలను ఆధునిక, శాస్త్రీయ పద్ధతులలో నిర్వహించడానికి రాజ్యం చర్యలు తీసుకోవాలి.

4. 49వ ప్రకరణ ప్రకారం జాతీయ ప్రాధాన్యం ఉన్న కళాత్మకమైన లేదా చారిత్రక చిహ్నాలు, ప్రదేశాలు, వస్తువులను రాజ్యం సంరక్షించాలి.

5. 48ఎ ప్రకరణ అనుసరించి పర్యావరణాన్ని పరిరక్షించడానికి, అడవులు, వన్యప్రాణులను కాపాడటానికి రాజ్యం కృషిచేయాలి.

6. 50వ ప్రకరణ ప్రకారం ప్రజా సేవల విషయంలో కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరుచేయడానికి రాజ్యం చర్యలు తీసుకోవాలి.

7. 51వ ప్రకరణ ప్రకారం రాజ్యం (ఎ) అంతర్జాతీయ శాంతిని, న్యాయాన్ని, భద్రతను పెంపొందించడం, (బి) దేశాల మధ్య న్యాయపరమైన, గౌరవప్రదమైన, దౌత్య సంబంధాలను నిర్వహించడం, సి) చారిత్రక కట్టడాలను, సంస్కృతిని పరిరక్ష కల్పించటం, ఇ) అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రోత్సహించడం వంటి చర్యల అమలుకోసం కృషిచేయాలి.

3. గాంధేయ వాద సూత్రాలు: భారతదేశంలో ఆదర్శపాలనను అందించడానికి గాంధేయ సూత్రాలు దోహదపడతాయి. గాంధీజీ ప్రవచించిన ఆదర్శాలను ఆదేశక సూత్రాలలోని 40, 43, 46, 47, 48ఎ, 49 ప్రకరణలలో ప్రస్తావించడం జరిగింది. వాటిని ఈ క్రింది వివరింపబడినవి.

  1. 40వ ప్రకరణ ప్రకారం రాజ్యం పంచాయితీరాజ్ సంస్థలను నిర్వహించి, అవి స్వయంపాలన సంస్థలుగా ఏర్పడటానికి తగిన అధికారాలు ఇవ్వాలి.
  2. 43వ ప్రకరణ ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో వ్యక్తిగత లేదా సహకార ప్రాతిపదికపై కుటీర పరిశ్రమల స్థాపనకు రాజ్యం తోడ్పడాలి.
  3. 46వ ప్రకరణ ప్రకారం షెడ్యూల్డు కులాల, తరగతుల, బలహీన వర్గాల ప్రజల విద్యా, సామాజిక ప్రగతికి రాజ్యం ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
  4. 47వ ప్రకరణ ప్రకారం ఆరోగ్యానికి హాని కల్గించే మత్తుపానీయాలు, మాదక ద్రవ్యాల నిషేధానికి చర్యలు తీసుకోవాలి.

అదనపు సూత్రాలు: భారత రాజ్యాంగానికి 42 రాజ్యాంగ సవరణ చట్టం, 1976, 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 ద్వారా ఈ క్రింది వాటిని ఆదేశ సూత్రాల జాబితాలో అదనపు సూత్రాలుగా చేర్చాయి. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 390, 430, 48ఎ ప్రకరణలను, 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 38వ ప్రకరణ క్లాజ్ 2ను ఆదేశ సూత్రాల జాబితాలో పేర్కొనడం జరిగింది. ఈ సవరణల వల్ల ఆదేశక సూత్రాల సంఖ్య ఘననీయంగా పెరిగింది. వీటిలో క్రింది అంశాలు ఉన్నాయి.

  1. పిల్లల ఆరోగ్యం, ప్రగతి పరిరక్షణకు తగిన అవకాశాలు కల్పించడం.
  2. పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడం.
  3. కర్మాగార నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించడం.
  4. పర్యావరణం, అడవులు, వన్యమృగాల పరిరక్షణకు కృషి చేయటం.

ప్రశ్న 3.
భారత రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక విధులను వర్ణించుము. [Mar. ’16]
జవాబు:
భారత రాజ్యాంగ లక్షణాలలో ప్రాథమిక విధులు అత్యంత విశిష్టమైనవి. అవి పూర్వపు సోవియట్ రష్యా రాజ్యాంగం చేత ప్రేరితమైనవి. భారత రాజ్యాంగం రూపకల్పన కాలం నందు వీటిని రాజ్యాంగం నందు చేర్చలేదు. అయితే శ్రీమన్నారాయణ అగర్వాల్ రచించిన గాంధియన్ కాన్స్టిట్యూషన్ ఫర్ ఫ్రీ ఇండియా (1946) అనే గ్రంథంలో వీటిని
గురించి పేర్కొన్నారు. భారత స్వాతంత్య్రానంతరము భారతదేశంలో రాజకీయపరంగాను, రాజ్యాంగపరంగాను అనేక మార్పులు చోటు చేసుకున్నవి. 1975 – 1977 సంవత్సరాల మధ్య కాలమందు రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చవలెననే భావన కేంద్ర ప్రభుత్వమునకు వచ్చినది.

ఐక్యరాజ్యసమితి విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన (Universal Declaration of Human Rights), 1948 సోవియట్ యూనియన్ తరహాలోని ప్రాథమిక విధులను, పరిగణలోనికి తీసుకొని భారత రాజ్యాంగంలో చేర్చాలని భావించి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకొని సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీని 1976లో నియమించింది. ప్రపంచంలోని వివిధ రాజ్యాంగాలలో పొందుపర్చిన ప్రాథమిక విధులను పరిశీలించిన పిదప ఈ కమిటీ ఎనిమిది ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరచుటకు సూచనలను చేసింది. అందుకు అనుగుణంగా అప్పటి అధికార పార్టీ పార్లమెంట్లో 42వ రాజ్యాంగ సవరణ బిల్లు 1976ను ప్రవేశపెట్టింది. పార్లమెంట్ ఆ రాజ్యాంగంలో 10 ప్రాథమిక విధులు చేర్చడం జరిగింది. వాటిని రాజ్యాంగం iv ఎ భాగంలో 51ఎ అనే ప్రకరణంలో ప్రస్తావించడమైనది. తరువాత 2002లో రాజ్యాంగం 86వ సవరణ చట్టం ద్వారా మరొక అంశం ప్రాథమిక విధుల జాబితాలో చేర్చడమైంది. దాంతో అప్పటి నుంచి భారత పౌరులకు మొత్తం 11 ప్రాథమిక విధులను సూచించడమైంది. వాటిని క్రింది విధంగా పేర్కొనవచ్చు.

భారత రాజ్యాంగంలోని 51-ఎ ప్రకరణ ప్రకారం ప్రతి ఒక్క భారత పౌరుడు తప్పనిసరిగా ఈ క్రింది విధులను నిర్వర్తించవలసి ఉన్నది.

  1. భారత రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ ఆదర్శాల పట్ల, సంస్థల పట్ల, జాతీయ పతాకం, జాతీయ గీతం పట్ల విధేయతను చూపటం.
  2. స్వాతంత్ర్యం సాధనకై జరిగిన జాతీయోద్యమ ఉదాత్త ఆశయాలను గౌరవించి అనుసరించడం.
  3. భారతదేశ సార్వభౌమత్వం, సమైక్యత, సమగ్రతలను సమర్థించి సంరక్షించుకోవడం.
  4. దేశాన్ని రక్షించుకోవడం, అవసరమయినపుడు జాతీయ సేవలో పాల్గొనడం.
  5. మత, భాషా, ప్రాంతీయ, వర్గ సంబంధమైన వైవిధ్యాలను అధిగమించి భారత ప్రజలందరిలో సమైక్యతను, ఉమ్మడి సౌభ్రాతృత్వ భావాలను పెంపొందించుకోవడం, మహిళల గౌరవానికి విరుద్ధమైన పద్ధతులను పరిత్యజించడం.
  6. సుసంపన్నమైన వారసత్వాన్ని, వైవిధ్యంతో కూడుకున్న సంస్కృతిని సంరక్షించుకోవడం.
  7. అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో కూడిన సహజ వాతావరణాన్ని సంరక్షించుకొని పెంపొందించు కోవడం, ప్రాణికోటి పట్ల కారుణ్యాన్ని చూపించడం.
  8. శాస్త్రీయ వైఖరి, మానవతావాదం, సమతా సంస్కరణ దృక్పథాన్ని కలిగి ఉండటం.
  9. ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, హింసను విడనాడటం.
  10. జాతి ఉన్నత స్థాయిల్లోకి ఎదగడానికి వ్యక్తి పరంగానూ, సామూహికంగానూ సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం.
  11. ఆరు నుంచి పద్నాలుగు ఏళ్ళ వయస్సు ఉన్న బాలబాలికలకు వారి తల్లిదండ్రులు, సంరక్షకులు తగిన విద్యా సదుపాయాలు కల్పించడం.

పైన పేర్కొన్న వాటిలో మొదటి పది ప్రాథమిక విధులు 1977 జనవరి మూడో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. పదకొండో ప్రాథమిక విధి 2002 డిసెంబర్ పన్నెండో తేది నుంచి అమల్లోకి వచ్చింది.

ప్రశ్న 4.
ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాల మధ్య గల వ్యత్యాసాలను వివరింపుము.
జవాబు:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలే ఈ సూత్రాలు. ప్రభుత్వం తన విధానాలను రూపొందించుకొనేటప్పుడు వీటికి అనుగుణంగా రూపొందించుకోవాలి. శాసన సభ్యులకు, పాలకులకు ఈ సూత్రాలు ఒక ప్రవర్తనా నియమావళి. భారతదేశంలో సాంఘిక, ఆర్థిక ప్రజాస్వామ్య స్థాపనకు ఇవి మూలము. ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా దేశంలో “సంక్షేమ రాజ్యాన్ని” స్థాపించుటే వీటి ఉద్దేశ్యము.

భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆదేశక సూత్రాలు ఉన్నాయి. అవి రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, ఆదర్శాలను ప్రతిబింబిస్తాయి. ఇవి ప్రభుత్వానికి ప్రజల పట్ల గల బాధ్యతలను వివరిస్తాయి. భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగానూ, వర్గరహిత రాజ్యంగానూ ఏర్పరచటమే ఈ నియమాల లక్ష్యం.

ఈ ఆదేశక సూత్రాలను న్యాయస్థానాల ద్వారా రక్షించుకోవటానికి వీలులేదు. ప్రభుత్వం విధానాలు రూపొందించుకొనేటప్పుడు వీటికి అనుగుణంగా రూపొందించుకోవాలి.
భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులు 12వ అధికరణం నుండి 35వ అధికరణం వరకు ప్రస్తావించబడ్డాయి. ప్రాథమిక హక్కులు ప్రజల స్వేచ్ఛకు, సర్వతోముఖ వికాసానికి అవసరం. ఇవి ప్రజాస్వామ్యాన్ని సార్థకం చేస్తాయి. వీటిని కోర్టు ద్వారా రక్షించుకోవచ్చు.

ప్రాథమిక హక్కులకు, ఆదేశక సూత్రాలకు మధ్యగల తేడాలు:

ప్రాథమిక హక్కులు

  1. రాజ్యాంగం 3వ భాగంలో పొందుపరచబడ్డాయి.
  2. వ్యక్తికి స్వేచ్ఛనిచ్చి, సమగ్రాభివృద్ధికి, వికాసానికి తోడ్పడతాయి. ఇవి ప్రజాస్వామ్యాన్ని సార్థకం చేస్తాయి.
  3. ప్రాథమిక హక్కులకు ఆజ్ఞాపించే స్వభావం ఉంది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానాల ద్వారా రక్షించుకోవచ్చు.
  4. ప్రాథమిక హక్కులు పౌరుడు అనుభవించడానికి ఉద్దేశించబడినవి.
  5. ప్రాథమిక హక్కులు వ్యక్తికి ఇవ్వబడ్డాయి. ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఇవి అరికడతాయి.
  6. ప్రాథమిక హక్కుల సంఖ్య, పరిధి తగ్గుచున్నది.
  7. ఇవి రాజకీయ ప్రజాస్వామ్య స్థాపనకు ఉద్దేశింపబడ్డాయి.
  8. వీటిని అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు.
  9. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే శాసనాన్ని ‘చెల్లనేరదని’ కోర్టులు కొట్టివేస్తాయి.
  10. ప్రాథమిక హక్కులు ప్రభుత్వాన్ని కొన్ని పనులు చేయవద్దని శాసిస్తాయి.

ఆదేశక సూత్రాలు

  1. రాజ్యాంగం 4వ భాగంలో పొందుపరచబడ్డాయి.
  2. ఇవి సమాజ సంక్షేమానికి తోడ్పడతాయి. ఇవి ప్రజల ప్రయోజనాలకు, వారి నైతిక, భౌతిక, ఆర్థిక, సాంఘిక ప్రగతికి మూలము.
  3. ఆదేశక సూత్రాలకు ఆజ్ఞాపించే స్వభావం లేదు. వీటి అమలు రాష్ట్రాల ఆర్థిక వనరులపై ఆధారపడినాయి. వీటికి న్యాయస్థానాల రక్షణ లేదు.
  4. ఆదేశక సూత్రాలు రాజ్యాంగం ప్రభుత్వాలకు నిర్దేశించిన బాధ్యతలు.
  5. ఇవి సమాజ సంక్షేమానికై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పాటించవలసిన నియమాలు.
  6. ఆదేశక సూత్రాల సంఖ్య, పరిధి విస్తృతమగుచున్నది.
  7. ఇవి సాంఘిక, ఆర్థిక ప్రజాస్వామ్య స్థాపనకు ఉద్దేశింపబడ్డాయి.
  8. వీటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించారు.
  9. ఆదేశక సూత్రాలకు భంగం కల్గించే శాసనం ‘చెల్లనేరదని’ కోర్టులు కొట్టివేయలేవు.
  10. ఆదేశక సూత్రాలు ప్రభుత్వం చేయవలసిన పనుల గురించి ఆదేశిస్తాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు మధ్య మారుతున్న సంబంధాలను వివరింపుము.
జవాబు:
ప్రాథమిక హక్కులు, అదేశక సూత్రాల మధ్య చట్టబద్ధమైనవి మరియు చట్టబద్ధము కానివి అనే వర్గీకరణ ఉన్నప్పటికీ, ఆదేశక సూత్రాలు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకొన్నవి. ఎన్నో సంవత్సరముల నుండి ఈ రెండింటి మధ్య అనేక మార్పులు చోటుచేసుకొన్నాయి. అవి
1. వ్యక్తి ప్రయోజనాలను కాంక్షిస్తున్న ప్రాథమిక హక్కులకూ, సమాజ శ్రేయస్సు కాంక్షిస్తున్న ఆదేశక సూత్రాల మధ్య అమలు విషయంలో ప్రతిష్టంబన ఏర్పడినపుడు ఏమి జరుగుతుందనే విషయంలో దేశంలో ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఈ వివాదాంశం రాజకీయాంశంగా రూపుదిద్దుకుంది.

2. ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాల అమలుకు సంబంధించి అనేక వివాదాంశాలలో సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో ఆదేశక సూత్రాలే ప్రాథమిక హక్కులకు లొంగి ఉండాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చినది.

3. బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు లాంటి చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానాల తీర్పుల ఫలితంగానే 1971లో 25వ రాజ్యాంగసవరణ చట్టంను పార్లమెంట్ రూపొందించింది. ఈ సవరణ చట్టంను అనుసరించి ఆదేశక సూత్రాలు అమలును ఉద్దేశించి చేసిన ఏ చట్టాలైనను ప్రాథమిక హక్కులలోని 14వ ప్రకరణ, 19వ ప్రకరణ మరియు 31వ ప్రకరణలు అతిక్రమించుతున్నవనీ, ఆ చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానాలు ప్రకటించరాదని సవరణ చట్టంలో పేర్కొనబడినది.

4. 1976లో పార్లమెంట్ 42వ రాజ్యాంగ సవరణ చట్టంను రూపొందించింది. ఆదేశక సూత్రాలలో కొన్ని గాని లేదా అన్ని సూత్రాలు గాని అమలుపరచుటకు పార్లమెంట్ రూపొందించే చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నవని న్యాయస్థానాలు భావించరాదని ఈ రాజ్యాంగ సవరణ చట్టం నందు పేర్కొనబడినది.

5. కేశవానంద భారతి Vs కేరళ ప్రభుత్వం కేసు విషయంలో భారత రాజ్యాంగ మౌలిక అంశాలను సవరణ చేయు అధికారం పార్లమెంట్కు లేదని సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించినది. సుప్రీంకోర్టు తీర్పు అర్థాన్ని అనుసరించి ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో మౌలిక లక్షణంగా భావించబడుచున్నవి.

ప్రశ్న 2.
పౌరునికి గల ఏవైనా మూడు ప్రాథమిక హక్కులను వివరింపుము.
జవాబు:
భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 12వ అధికరణం నుండి 35వ అధికరణం వరకు గల అంశాలు ప్రాథమిక హక్కులను వివరిస్తాయి. ప్రాథమిక హక్కులు ప్రజల స్వేచ్ఛకు, సర్వతోముఖ వికాసానికి అవసరం. ఇవి ప్రజాస్వామ్యాన్ని సార్థకం చేస్తాయి. ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులున్నాయి. వీటిని కోర్టు ద్వారా రక్షించుకోవచ్చు.

వీటిని గురించి విపులంగా చర్చిద్దాం.
1) సమానత్వపు హక్కు (14 నుండి 18 వరకు గల ప్రకరణలు): ప్రాథమిక హక్కులలో సమానత్వపు హక్కు భారత పౌరులందరికి ‘చట్ట సమానత్వాన్ని కల్పించింది. రాజ్యాంగంలోని 14వ ప్రకరణ భారతదేశంలో నివసించే వ్యక్తులందరికి చట్టం ముందు సమానత్వాన్ని, చట్టం ద్వారా సమానమైన రక్షణ, సదుపాయాలను కల్పించింది.

పౌరుల మధ్య మతం, తెగ, కులం, లింగ, జన్మస్థల సంబంధమైన వివక్షతలను రాజ్యం పాటించరాదని 15వ ప్రకరణ స్పష్టం చేసింది. అలాగే బహిరంగ ప్రదేశాలు సందర్శించే విషయంలో పౌరుల మధ్య ఎలాంటి వివక్షత చూపించకూడదని పేర్కొంది.

16వ ప్రకరణ ప్రకారం రాజ్యాంగా సంబంధించిన ఏ ఉద్యోగం లేదా నియామకానికైనా పౌరులందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరమైన విషయాలలో మతం, తెగ, కులం, లింగం, పుట్టుక వంటి అంశాలేవి ప్రధానమైనవి కావని ఆ ప్రకరణ పేర్కొంది.

17వ ప్రకరణ అస్పృశ్యత లేదా అంటరానితనం పాటించడాన్ని నేరంగా పేర్కొంది. ఈ విషయంలో 1955లో పార్లమెంటు అస్పృశ్యత నివారణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని 1976 నుంచి పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా వ్యవహరించడమైంది.

18వ ప్రకరణ ప్రకారం పౌరులకు సైనిక లేదా విద్యా విషయం బిరుదులు మినహా ఇతర బిరుదులను రాజ్యం ప్రసాదించకూడదు. భారత రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశాలు ప్రకటించే బిరుదులను పౌరులు స్వీకరించరాదు.

2) స్వేచ్ఛా హక్కు (19 నుండి 22 వరకు గల ప్రకరణలు): 19వ రాజ్యాంగ ప్రకరణ భారత పౌరులకు 7 రకాల స్వాతంత్య్రాలను ప్రసాదించింది. అవి

  1. వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వాతంత్ర్యం.
  2. శాంతియుతంగా సమావేశమయ్యే స్వాతంత్ర్యం.
  3. సంఘాలు, యూనియన్లు ఏర్పాటు చేసుకొనే స్వాతంత్య్రం.
  4. దేశమంతటా స్వేచ్ఛగా సంచరించే స్వాతంత్ర్యం.
  5. దేశంలో ఎక్కడైనా నివసించడానికి, స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి స్వాతంత్ర్యం.
  6. ఆస్తిని సంపాదించుకొనుటకు, ఆర్జించుటకు, దానధర్మాలు, విక్రయాలు చేసుకొనే స్వాతంత్ర్యం.
  7. ఏ వృత్తినైనా, వ్యాపారాన్నైనా చేసుకొనే స్వాతంత్య్రం.

20వ ప్రకరణ వ్యక్తులు నేరాలకు పాల్పడిన సందర్భాలలో శిక్ష విధించే విషయంలో రక్షణలను పేర్కొంది. ఈ ప్రకరణ అమలులో ఉన్న చట్టాన్ని అతిక్రమించనిదే ఏ వ్యక్తిని దోషిగా పరిగణించకూడదని పేర్కొంటుంది.

21వ అధికరణం ఏ ఒక్క వ్యక్తిని చట్టం పేర్కొన్న పద్ధతి ప్రకారం తప్ప మరో విధంగా అతని జీవనానికి, వ్యక్తి స్వాతంత్ర్యానికి భంగం కల్గించరాదని స్పష్టం చేసింది. ఈ ప్రకరణలను అత్యవసర పరిస్థితుల కాలంలో కూడా రద్దు చేయరు.

22వ ప్రకరణ ప్రకారం ఏ ఒక్క వ్యక్తిని కారణం లేకుండా నిర్భంధంలోకి తీసుకోకూడదు. నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తికి అందుకు కారణాలు తెలపటంతోపాటు న్యాయ సహాయం పొందటానికి వీలు కల్పించాలి. ఉదా: నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తిని 24 గం॥లలోగా సమీప న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలి.

3) పీడనను నిరోధించే హక్కు (23 మరియు 24 ప్రకరణలు):
23వ ప్రకరణ ప్రకారం రాజ్యంగాని, సంపన్న వర్గాలు కాని వ్యక్తులను దోపిడీకి గురిచేయకూడదు. మనుషుల క్రయ విక్రయాలు జరపటం, ప్రతిఫలం చెల్లించకుండా బలవంతంగా వెట్టిచాకిరీ పనులు చేయించుకోవటం నిషేధం. 24వ ప్రకరణ ప్రకారం 14 సంవత్సరాలలోపు పిల్లలను కర్మాగారాలు, గనులు వంటి ప్రమాదకరమైన, ఆరోగ్యానికి హాని కల్గించే పనులలో నియమించకూడదు. బాల కార్మికత్వం చేయించుకొనుట చట్టవిరుద్ధం.

ప్రశ్న 3.
పౌరులకు గల ఆరు స్వాతంత్య్రాలను పేర్కొనుము. [Mar. ’17]
జవాబు:
ప్రాథమిక హక్కులలో సమానత్వపు హక్కు భారత పౌరులందరికి ‘చట్ట సమానత్వాన్ని కల్పించింది. రాజ్యాంగంలోని 14వ ప్రకరణ భారతదేశంలో నివసించే వ్యక్తులందరికి చట్టం ముందు సమానత్వాన్ని, చట్టం ద్వారా సమానమైన రక్షణ, సదుపాయాలను కల్పించింది.

  • వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వాతంత్య్రం.
  • శాంతియుతంగా సమావేశమయ్యే స్వాతంత్య్రం.
  • సంఘాలు, యూనియన్లు ఏర్పాటు చేసుకొనే స్వాతంత్య్రం.
  • దేశమంతటా స్వేచ్ఛగా సంచరించే స్వాతంత్ర్యం.
  • దేశంలో ఎక్కడైనా నివసించడానికి, స్థిరనివాసం ఏర్పాటుచేసుకోవడానికి స్వాతంత్ర్యం.
  • ఆస్తిని సంపాదించుకొనుటకు, ఆర్జించుటకు, దానధర్మాలు, విక్రయాలు చేసుకొనే స్వాతంత్ర్యం.
  • ఏ వృత్తినైనా, వ్యాపారాన్నైనా చేసుకొనే స్వాతంత్య్రం.

అయితే ప్రకరణ 19(1) (f) సబ్ క్లాజులో చెప్పబడిన ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 ద్వారా తొలగించబడినది. ఇప్పుడు ఆరు ప్రాథమిక స్వాతంత్ర్యాలు మాత్రమే కలవు.

ప్రశ్న 4.
రాజ్యాంగ పరిహారపు హక్కును గూర్చి క్లుప్తంగా వ్రాయుము.
జవాబు:
రాజ్యాంగ పరిహార హక్కు ప్రాథమిక హక్కులన్నింటిలో అత్యంత ప్రధానమైంది. ఈ హక్కును ప్రాథమిక హక్కులకు రక్షణ వలయంగానూ, కంచెగానూ, భద్రతాకవచంగాను పరిగణించడమైంది. పౌరుల ప్రాథమిక హక్కులను ప్రభుత్వంతో సహా ఎవరైనా లేదా ఏ సంస్థ అయినా హరించడానికి లేదా కుదించడానికి ప్రయత్నిస్తే, బాధిత పౌరులు తగిన ఉపశమనాన్ని పొందడానికి ఈ హక్కు వీలు కల్పిస్తుంది. ప్రాథమిక హక్కుల విషయంలో తోటి పౌరులు, ప్రైవేట్ లేదా ప్రభుత్వ సంస్థల నుంచి పౌరులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే, వారు సముచిత న్యాయస్థానం ద్వారా రక్షణ పొందవచ్చు. ఈ సందర్భంలో రాజ్యాంగం 32 మరియు 226వ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టులు దురాక్రమణ దారుల చర్యలను క్రమబద్ధం చేయడానికి లేదా అడ్డుకోవడానికి బాధితుల ప్రాథమిక హక్కుల పునరుద్ధరణ కోసం హెబియస్ కార్పస్, ప్రొహిబిషన్, సెర్షియరీ, కోవారెంటో, మాండమస్ వంటి రెట్లును మంజూరు చేస్తాయి. డాక్టరు బి.ఆర్ అంబేద్కర్ ఈ హక్కును రాజ్యాంగానికి హృదయం, ఆత్మవంటిదని వర్ణించాడు.

ప్రశ్న 5.
ప్రాథమిక హక్కులకు ఆదేశక సూత్రాల మధ్య గల ఐదు వ్యత్యాసాలను వివరింపుము. [Mar. ’16]
జవాబు:
ప్రాథమిక హక్కులు

  1. రాజ్యాంగం 3వ భాగంలో పొందుపరచబడ్డాయి.
  2. వ్యక్తికి స్వేచ్ఛనిచ్చి, సమగ్రాభివృద్ధికి, వికాసానికి తోడ్పడతాయి. ఇవి ప్రజాస్వామ్యాన్ని సార్థకం చేస్తాయి.
  3. ప్రాథమిక హక్కులకు ఆజ్ఞాపించే స్వభావం ఉంది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానాల ద్వారా రక్షించుకోవచ్చు.
  4. ప్రాథమిక హక్కులు పౌరుడు అనుభవించడానికి ఉద్దేశించబడినవి.
  5. ప్రాథమిక హక్కులు వ్యక్తికి ఇవ్వబడ్డాయి. ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఇవి అరికడతాయి.

ఆదేశక సూత్రాలు

  1. రాజ్యాంగం 4వ భాగంలో పొందుపరచబడ్డాయి.
  2. ఇవి సమాజ సంక్షేమానికి తోడ్పడతాయి. ఇవి ప్రజల ప్రయోజనాలకు, వారి నైతిక, భౌతిక, ఆర్థిక, సాంఘిక ప్రగతికి మూలము. ఆదేశక సూత్రాలకు ఆజ్ఞాపించే స్వభావం లేదు.
  3. వీటి అమలు రాష్ట్రాల ఆర్థిక వనరులపై ఆధారపడినాయి. వీటికి న్యాయస్థానాల రక్షణ లేదు.
  4. ఆదేశక సూత్రాలు రాజ్యాంగం ప్రభుత్వాలకు నిర్దేశించిన బాధ్యతలు.
  5. ఇవి సమాజ సంక్షేమానికై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పాటించవలసిన నియమాలు.

ప్రశ్న 6.
ఆదేశక సూత్రాల లక్షణాలను వివరింపుము.
జవాబు:

  1. ఆదేశక సూత్రాలు అనేవి భారతదేశంలో వివిధ ప్రభుత్వాలకు ఇచ్చిన ఆజ్ఞలు.
  2. ఇవి సంవర్ధక స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే వివిధ స్థాయిలలో ఉన్న ప్రభుత్వాల అధికార, విధుల పరిధిని విస్తృత పరుస్తాయి.
  3. వీటిని వివిధ ప్రభుత్వాలు ఆర్థిక వనరుల లభ్యత మేరకే అమలుపరుస్తాయి.
  4. ఇవి ప్రజల సమ్మతిని కలిగి ఉంటాయి. సమసమాజ స్థాపనే వీటి లక్ష్యం.
  5. వివిధ స్థాయిలలో గల ప్రభుత్వాలలో అధికార బాధ్యతలు చేపట్టే ఏ పార్టీ అయినా స్వీయ రాజకీయ సిద్దాంతాలతో నిమిత్తం లేకుండా వీటిని అమలుచేయాల్సి ఉంటుంది.
  6. ఈ సూత్రాలను అమలు చేయకపోవడాన్ని ఎటువంటి చట్టధిక్కారమైన చర్యగా పరిగణించరు.
  7. వీటికి శిక్షాత్మక స్వభావం లేదు. వీటిని వెంటనే అమలుచేయాల్సిందిగా ఎవరూ నిర్బంధించరు. వీటి అమలులో ప్రభుత్వాలకు విచక్షణాత్మక అధికారాలు ఉంటాయి.
  8. భారతదేశంలో రాజకీయ ప్రజాస్వామ్యం, ఆర్థిక సమానత్వాలను సాధించి సామాజిక సుహృద్భావాన్ని పెంపొందించటమే వీటి ఆశయం.
  9. వ్యక్తి ప్రగతి కంటే సామాజిక సంక్షేమాన్ని పెంపొందించడమే వీటి అసలు లక్ష్యం.

ప్రశ్న 7.
ఆదేశక సూత్రాల అమలును పరిశీలింపుము.
జవాబు:
వాస్తవంగా దేశపాలనలో ఆదేశక సూత్రాల అమలు చాలా ముఖ్యమైనది. 1950 నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదేశక సూత్రాల అమలులో కాలానుగుణంగా అనేక చర్యలను తీసుకుంటున్నది. ఇవి క్రింద వివరించబడినవి.

  1. జమీందార్, జాగీర్దారి, ఇనాందారి వ్యవస్థలు రద్దు.
  2. భూసంస్కరణ చట్టాల రూపకల్పన.
  3. రాజభరణాల రద్దు.
  4. 14 వాణిజ్యబ్యాంకుల జాతీయకరణ.
  5. ఖాదీ, గ్రామీణ పరిశ్రమ బోర్డుల నిర్మాణం.
  6. గ్రామ పంచాయితీ వ్యవస్థలను ఏర్పాటు చేయడం.
  7. ప్రజా ప్రాతినిధ్య సంస్థల మరియు విద్యాసంస్థల్లో, షెడ్యూల్డు కులాల, తెగల వారికి కొన్ని స్థానాలను కేటాయించడం.
  8. జాతీయ ప్రాధాన్యం ఉన్న కళాత్మకమైన లేదా చారిత్రక స్మారక చిహ్నాలు, ప్రదేశాలు, వస్తువుల పరిరక్షణ చట్టం 1951 రూపకల్పన.
  9. భారత శిక్షాస్మృతి రూపకల్పన.
  10. గోవులు, దూడలు, ఇతర పాడిపశువులు, లాగుడు బండ్లకు కట్టే పశువుల వధను కొన్ని రాష్ట్రాలలో నిషేధం.

ప్రశ్న 8.
ఆదేశక సూత్రాల ప్రాముఖ్యతను వివరింపుము.
జవాబు:
ఆదేశ సూత్రాలు భారతరాజ్యాంగ లక్షణాలలో ముఖ్యమైనవిగా పరిగణించబడినవి. ఈ సూత్రాల అమలు బాధ్యతను విష్యత్తులో అధికారంలోకి వచ్చు ప్రభుత్వాలకు రాజ్యాంగ నిర్మాతలు అప్పగించారు. ఆదేశక సూత్రాలు, ప్రాథమిక హక్కులు రాజ్యాంగానికి అంతరాత్మగా గ్రావెల్లి ఆస్టిన్ అభివర్ణించాడు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఈ సూత్రాలను రాజ్యాంగ )న్నూత లక్షణాలుగా పేర్కొన్నాడు. రాజ్యాంగంలోని ఈ విభాగం ప్రాథమిక హక్కుల భాగానికి సన్నిహితంగా, అనుబంధంగా ఉంటాయి. అందువలననే రాజ్యాంగంలోని మూడవ భాగం మరియు నాల్గవ భాగం పరస్పర సంబంధం కలిగి ఉన్నవి.

ఆదేశక సూత్రాలను అధికారంలో ఉన్న ఏ పార్టీ అయిన ఈ సూత్రాలను అమలు చేయవచ్చు. ఆ సూత్రాలు ప్రభుత్వంలోని శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహణ శాఖకు మార్గదర్శకాలుగా దోహదపడతాయి. ప్రజలు వారి హక్కులను అనుభవించడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఆదేశక సూత్రాలు కల్పిస్తాయి. ప్రభుత్వ వివిధ సంస్కరణలకు అవి సూచికలుగా ఉపయోగపడతాయి. రాబోయే ప్రభుత్వ విధానాల స్థిరత్వానికి, కొనసాగింపుకూ అవి హామీ ఇస్తాయి.

ఐవర్ జెన్నింగ్స్, ఆచార్య శ్రీనివాసన్, జి.యన్. జోషి, ఆచార్య కె.టి.షా, కె.సి.వేర్, టి.టి కృష్ణమాచారి, నసీరుద్దీన్ ఆహ్మద్ వంటి ప్రముఖ రాజ్యాంగవేత్తలు ఆదేశక సూత్రాలను శుష్క వాగ్దానాలుగాను, అందంగాను అమర్చిన వస్తువులు గాను, పవిత్ర సంకల్పాలుగాను, అలంకార ప్రాయ సూత్రాలుగా పరిగణించారు. ఆదేశ సూత్రాలకు ఒక ఉమ్మడి సిద్ధాంతమంటూ ఏదీ లేదని ఐవర్ జెన్నింగ్స్ భావించారు. ఆదేశక సూత్రాలనేవి బ్యాంకుల సౌకర్యార్థం డబ్బు చెల్లించడానికి ఇచ్చే చెక్కులుగా ఆచార్య కె.టి.షా వర్ణించాడు.

ఆదేశక సూత్రాలను మరుసటిరోజే మరచిపోయే నూతన సంవత్సర శుభాకాంక్షలుగా నసీరుద్దీన్ అహ్మద్ విమర్శించాడు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రాథమిక హక్కులు.
జవాబు:
ప్రథమంగా భారత రాజ్యాంగం భారత పౌరులకు ఏడు ప్రాథమిక హక్కులను ప్రసాదించింది. ఈ హక్కులను రాజ్యాంగంలో మూడవ భాగంలో 12 నుంచి 35 వరకు గల ప్రకరణలలో పొందపరచడం జరిగింది. ప్రాథమిక ” హక్కులు అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించబడినాయి. ప్రాథమిక హక్కులు

  1. సమానత్వపు హక్కు
  2. స్వేచ్ఛా హక్కు
  3. పీడనను నిరోధించే హక్కు
  4. మత స్వాతంత్ర్య హక్కు
  5. విద్యా, సాంస్కృతిక హక్కు
  6. ఆస్తి హక్కు
  7. రాజ్యాంగ పరిహార హక్కు, 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా, నుండి తొలగించటం జరిగింది.

ప్రశ్న 2.
ఆదేశక సూత్రాల విశ్లేషణ.
జవాబు:
భారతరాజ్యాంగంలో నాల్గవ భాగంలో 36 నుండి 51వ ప్రకరణలు ఆదేశక సూత్రాలను గురించి వివరిస్తున్నాయి.
ఇవి మూడు రకాలు.

  1. సామ్యవాద సూత్రాలు
  2. ఉదారవాద సూత్రాలు
  3. గాంధేయవాద సూత్రాలు

ప్రశ్న 3.
హెబియస్ కార్పస్. [Mar. ’16]
జవాబు:
ఒక వ్యక్తిని నిర్బంధించిన వ్యక్తిపై గాని, అధికారిపై గాని ఈ రిట్జజారీ చేయబడుతుంది. ఈ ఆజ్ఞ ప్రకారం నిర్భంధంలో వున్న వ్యక్తిని కోర్టులో హాజరుపరచవలె. హాజరుపరచిన తరువాత విచారణ జరుగుతుంది. ఇది సాధారణంగా వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన రిట్.

ప్రశ్న 4.
మాండమస్.
జవాబు:
ఈ ఆజ్ఞను న్యాయస్థానాలు ఒక అధికారిపై లేదా ఒక సంస్థపై జారీ చేస్తాయి. దాని ప్రకారం ఆ అధికారి లేదా సంస్థ తాను నెరవేర్చవలసిన విధులు పాటించవలసి ఉంటుంది.

ప్రశ్న 5.
సాంస్కృతిక విద్యా హక్కులు.
జవాబు:
భారత పౌరులకు సాంస్కృతిక, విద్యాపరమైన అవకాశాలను రాజ్యాంగం ఈ హక్కుల ద్వారా ప్రసాదించింది. | 29వ ప్రకరణ ప్రకారం ప్రతి పౌరుడు స్వంత భాష, సంస్కృతులను పరిరక్షించుకొనవచ్చు. 30వ ప్రకరణ ప్రకారం ప్రభుత్వం నుండి సంపూర్ణంగా కాని, పాక్షికంగా కాని ఆర్థిక సహాయం పొందే విద్యా సంస్థలలో కులం, మతం, ప్రాంతం, వర్ణం, భాష, లింగపరమైన అంశాల ప్రాతిపదికగా విద్యార్థులకు ప్రవేశాన్ని నిరాకరించకూడదు.

ప్రశ్న 6.
గాంధేయ వాద సూత్రాలు.
జవాబు:
మహాత్మాగాంధీ ప్రవచించిన ఆదర్శాలను ఆదేశక సూత్రాలలో 40, 43, 46, 47, 48ఎ, 49 ప్రకరణలలో ప్రస్తావించటం జరిగింది. భారతదేశంలో ఆదర్శపాలనను నెలకొల్పటానికి ఈ సూత్రాలు తోడ్పడతాయి. పంచాయితీరాజ్ సంస్థలను నెలకొల్పటం, గ్రామీణ ప్రాంతాలలో కుటీర పరిశ్రమలను ప్రోత్సహించటం, మత్తుపానీయాలు, మాదక ద్రవ్యాలను నిషేధించటం, షెడ్యూల్డు కులాలు, తరగతులు, బలహీన వర్గాల ప్రజల విద్యా, సామాజిక ప్రగతికి రాజ్యం ప్రత్యేక శ్రద్ధ వహించటం మొదలైన వాటిని గాంధేయవాద సూత్రాలకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 7.
ప్రాథమిక విధుల ప్రాముఖ్యత. [Mar. ’17]
జవాబు:
రాజ్యాంగంలో మొదట ‘విధులు’ చేర్చబడలేదు. కాని 1976లో చేయబడిన 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం 10 ప్రాథమిక విధులు చేర్చబడ్డాయి. స్వరణ్ సింగ్ అధ్యక్షతన ఏర్పడిన ఒక సంఘం ఈ విధులను సూచించింది. అయితే వీటిని న్యాయస్థానాల ద్వారా అమలు చేయడానికి అవకాశం లేదు. ఇవి ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు తెస్తాయని, విజ్ఞానదాయకమైన మానసిక అభ్యున్నతికి తోడ్పడతాయని భావింపబడింది. రాజ్యాంగంలోని నాలుగో భాగం ‘ఏ’ లోని 51(ఎ) అధికరణం వీనిని తెలుపుతుంది.

రాజ్యం ప్రజల వద్ద నుంచి ఆశించే సామాజిక చైతన్యం, ప్రవర్తనా నియమావళే ప్రాథమిక విధులు.

ప్రాముఖ్యత:

  1. ప్రాథమిక విధులు భారత పౌరులలో సామాజిక స్పృహను పెంపొందించి, బాధ్యతాయుత ప్రవర్తనను అలవరుస్తాయి.
  2. ఈ విధులు 1948లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఆమెదించిన విశ్వమానవ హక్కుల ప్రకటన తీర్మానానికి అనుగుణంగా ఉన్నాయి.
  3. ప్రాథమిక విధులు రాజ్యాంగ ఆశయాలను, రాజ్యాంగ చట్టాన్ని, ప్రభుత్వ వ్యవస్థలను గౌరవిస్తాయి.
  4. ప్రాథమిక విధులు ప్రజల మధ్య సౌభ్రాతృత్వం, సహకారాన్ని పెంపొందిస్తాయి.
  5. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించుట.

ప్రశ్న 8.
ఏవైనా మూడు ఉదార సూత్రాలు.
జవాబు:
ఆదేశక సూత్రాలలోని ఉదారవాద సూత్రాలు:

  1. 44వ అధికరణం ప్రకారం దేశంలో నివసించే పౌరలందరికీ వర్తించే విధంగా ఉమ్మడి పౌరస్మృతిని రాజ్యం
    రూపొందించాలి.
  2. 45వ అధికరణం ప్రకారం 14 ఏళ్ళలోపు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించడానికి రాజ్యం ప్రయత్నించాలి.
  3. 50వ అధికరణం ప్రకారం పబ్లిక్ సర్వీసుల విషయంలో కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరుచేయడానికి రాజ్యం చర్యలు తీసుకోవాలి.
  4. 51వ అధికరణం ప్రకారం రాజ్యం (అ) అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించుకోవడం
    (ఆ) దేశాల మధ్య న్యాయపరమైన, గౌరవప్రదమైన దౌత్య సంబంధాలను నిర్వహించుకోవడం.

ప్రశ్న 9.
కోవారెంటో.
జవాబు:
సక్రమమైన అధికారం లేకుండా ప్రజా సంస్థలో అధికారం నడిపించే వ్యక్తులను అధికారాన్ని నిర్వహించకుండా ఈ ఆజ్ఞ నిరోధిస్తుంది.

ప్రశ్న 10.
మత స్వాతంత్ర్యపు హక్కు.
జవాబు:
మత స్వాతంత్ర్య హక్కు భారత రాజకీయ వ్యవస్థ లౌకిక స్వభావానికి ప్రతీక. 25వ అధికరణం ప్రకారం ప్రతి వ్యక్తికీ ప్రజాభద్రత, నైతికత, ఆరోగ్యాలకు లోబడి తన అంతరాత్మకు అనుగుణమైన మతాన్ని అవలంభించడానికి, ప్రచారం చేసుకోవడానికి హక్కు ఉంది. మత ప్రభావానికి సంబంధించిన ఏ కార్యక్రమాలనైనా క్రమబద్ధం చేసే చట్టాన్ని రాజ్యం రూపొందించవచ్చు.

26వ అధికరణం ప్రకారం ఏ మతానికి చెందినవారైనా

  1. మతపరమైన ధార్మిక సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి
  2. స్వీయ మత వ్యవహారాలను నిర్వహించుకోవడానికి
  3. స్థిర, చరాస్తులపై యాజమాన్య హక్కు పొందడానికి, వాటిని కొనుగోలు చేయడానికి చట్ట ప్రకారం ఆస్తిపాస్తులను నిర్వహించుకోవచ్చు.

27వ అధికరణం మతం ఆధారంగా రాజ్యం ఏ వ్యక్తిపై, ఏ విధమైన పన్ను విధించడానికి, వసూలు చేయడానికి వీలులేదని పేర్కొంది. 28వ అధికరణం ప్రకారం రాజ్యం నుంచి సంపూర్ణంగానో, పాక్షికంగానో ఆర్థిక సహాయాన్ని పొందే విద్యా సంస్థలలో మతపరమైన బోధనలు నిషేధించడం జరిగింది.

ప్రశ్న 11.
పీడనను నిరోధించే హక్కు,
జవాబు:
భారతదేశంలో నివసించే అసంఖ్యాక ప్రజల ఆత్మగౌరవాన్ని, హుందాతనాన్ని గుర్తించి, పరిరక్షించి, పెంపొందించటానికి ఈ హక్కును ప్రసాదించటమైంది. రాజ్యం కాని, సంపన్న వర్గాలు కాని వ్యక్తులను దోపిడీకి గురిచేయకుండా నివారించటానికి ఈ హక్కు తోడ్పడుతుంది. మన రాజ్యాంగంలో 23 మరియు 24 ప్రకరణలు ఈ హక్కును వివరిస్తున్నాయి. 23వ ప్రకరణ ప్రకారం మనుషుల క్రయ విక్రయాలు, బలవంతంగా వెట్టిచాకిరీ చేయించుకోవటం నేరం. 24వ ప్రకరణ ప్రకారం 14 సంవత్సరాలలోపు పిల్లలను గనులు, కర్మాగారాలు మొదలైన ప్రమాదకర పనులలో నియమించదారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 1 భారత రాజ్యాంగం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 1st Lesson భారత రాజ్యాంగం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 1st Lesson భారత రాజ్యాంగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజ్యాంగం అంటే ఏమిటి ? భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యాన్ని వివరించండి.
జవాబు:
పరిచయం : ఆధునిక కాలంలో ప్రతి రాజ్యానికి ఒక రాజ్యాంగముంటుంది. రాజ్యాంగంలో రాజ్యానికి సంబంధించిన అన్ని వ్యవస్థల అధికారాలు, విధులు మొదలైన విషయాలను స్పష్టంగా, నిర్ధిష్టంగా, క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది. రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు క్రమబద్ధంగా జరగడానికి రాజ్యాంగం చాలా ముఖ్యం.

అర్థం : Constitution అనే ఇంగ్లీషు పదం “Constitutio” అనే లాటిన్పదం నుండి ఉద్భవించింది. లాటిన్ భాషలో కాన్స్టిట్యూషియో అంటే “స్థాపించు” అని అర్థం.
నిర్వచనాలు :

  1. అరిస్టాటిల్ : “రాజ్యంలో అత్యున్నతమైన పదవులతో సహా అన్నింటిని క్రమబద్ధంగా ఏర్పాటు చేసేదే రాజ్యాంగం”.
  2. లార్డ్ బ్రైస్ : “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం”.
  3. స్టీఫెన్ లీకాక్ : “రాజ్యాంగం అంటే ప్రభుత్వరూపం”.

సాధారణంగా రాజ్యాంగాన్ని రాజ్యంలోని ప్రముఖ వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, విషయ నిపుణులు మొదలైనవారు రూపొందిస్తారు. 385 మందితో కూడిన రాజ్యాంగ పరిషత్ రెండు సంవత్సరాల 11 నెలల 17 రోజుల పాటు నిర్విరామంగా కృషి చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 1 భారత రాజ్యాంగం

భారత రాజ్యాంగ నిర్మాణ చారిత్రక నేపథ్యం: భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాల రాజ్యాంగాలన్నింటి కంటే మిక్కిలి శ్రేష్టమైంది. దీనిని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆధ్వర్యంలోని రాజ్యాంగ ముసాయిదా కమిటీ రూపొందించగా, డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన గల భారత రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. అంతకుపూర్వం భారతీయులకు ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం అవసరమని జాతీయోద్యమ నాయకులు పలుమార్లు డిమాండ్ చేశారు. 1922లో ఏర్పడిన స్వరాజ్యపార్టీ నాయకులు భారతీయులకు శాసనమండళ్ళలో ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా రాజ్యాంగపరమైన ఏర్పాట్లు జరగవలసి ఉంటుందని పేర్కొన్నారు. తరువాత 1924 ఫిబ్రవరిలో కేంద్ర శాసన మండలి సమావేశంలో మోతీలాల్ నెహ్రూ ఒక తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ భారత రాజ్యాంగాన్ని వెంటనే రూపొందించుకోవడానికి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు. ఆ తీర్మానాన్ని కేంద్ర శాసనసభ్యులు అత్యధిక

మెజారిటీతో ఆమోదించారు. 1928 మేలో మొతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటుచేసి, భారత ప్రజలకు తగిన రాజ్యాంగాన్ని ఏర్పరచడానికి కొన్ని నియమ నిబంధనలను రూపొందించవలసిందిగా కోరడం జరిగింది. తరువాత మోతీలాల్ నెహ్రూ కమిటీ తన నివేదికను 1928 ఆగస్టులో రూపొందించింది. ఆ కమిటీ సూచనలలో అధికభాగం స్వతంత్ర భారత రాజ్యాంగంలో పొందుపరచడమైంది.

1936-1937 కాలంలో భారతదేశంలో ప్రాంతీయ శాసనమండళ్ళకు జరిగిన ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ తన ఎజెండాలో రాజ్యాంగ పరిషత్తు నిర్మాణాన్ని ప్రధాన అంశంగా పేర్కొంది. ఆ తరువాత 1937 ఫిబ్రవరిలో వార్ధాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో భారతీయ శాసనసభ్యులు ప్రాంతీయ ప్రభుత్వాలలో చేరడానికి ఆమోదం తెలిపారు. నూతన ప్రాంతీయ మండళ్ళ సమావేశంలో రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు డిమాండు ప్రస్తావించవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.

1940 ఏప్రిల్లో వార్దాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూల మధ్య రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి ఆసక్తికరమైన చర్చలు జరిగాయి.

1940లో వైస్రాయ్ లిన్లిత్ ఆగస్టు ప్రతిపాదన (August offer) ద్వారా భారతీయులు రెండో ప్రపంచ ‘యుద్ధంలో బ్రిటన్కు సహకరించాలనీ, భారత రాజ్యాంగాన్ని రూపొందించుకొనే బాధ్యత ప్రధానంగా భారతీయులకే ఉంటుందనీ మొట్టమొదటి సారిగా ప్రకటించాడు. భారత జాతీయ స్రవంతిలో పాల్గొనే వారికి ప్రాతినిధ్యం వహించే సంస్థయే నూతన రాజ్యాంగ రూపకల్పనలో పాలుపంచుకోవలసి ఉంటుందని పై ప్రతిపాదన పేర్కొంది. 1942లో బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ యుద్ధకాలపు మంత్రిమండలిలో లేబర్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న స్టాఫర్డ్ క్రిప్స్న భారతదేశంలో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభాన్ని పరిష్కరించడానికి సమాయత్తం గావించాడు. నెహ్రూకు సన్నిహితుడైన క్రిప్స్ తన ప్రతిపాదనలలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు ప్రక్రియ గురించి పేర్కొన్నాడు.

భారత రాజ్యాంగ పరిషత్తుకు 1946 జూలై – ఆగస్టులలో ఎన్నికలు జరిగాయి.

భారత రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం గవర్నర్ జనరల్ లార్డ్ వేవెల్ ఆదేశాలమేరకు 1946 డిసెంబర్ 9న జరిగింది. నెహ్రూ సూచనమేరకు అందరికంటే ఎక్కువ వయస్సు, అనుభవం ఉన్న సచ్చిదానంద సిన్హా రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించాడు. మొట్టమొదటి సమావేశంలో 207 మంది సభ్యులు పాల్గొన్నారు. 1946 డిసెంబర్ 11న రాజేంద్రప్రసాద్ను రాజ్యాంగ పరిషత్తు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడమైంది. 1946 డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగపరిషత్తు సమావేశంలో చారిత్రాత్మకమైన రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం భారతదేశాన్ని సర్వసత్తాక, స్వతంత్ర్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా వర్ణించారు. రాజేంద్రప్రసాద్ తన తొలి అధ్యక్షోపన్యాసంలో భారతదేశం కామన్వెల్త్ రాజ్యంగా కొనసాగుతుందనీ, కుల, మత, వర్గాలతో సంబంధం లేని దిశగా భారతదేశం పయనిస్తుందనే ఆకాంక్షను వెల్లడించారు.

భారతదేశం 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. అంతకుపూర్వం భారత రాజ్యాంగ పరిషత్తు నాలుగు పర్యాయాలు సమావేశమైంది. మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9-13 మధ్య, రెండో సమావేశం 1947 జనవరి 20-22 మధ్య, మూడో సమావేశం 1947 ఏప్రిల్ 28, మే 2 మధ్య, నాలుగో సమావేశం 1947 జూలైలో జరిగాయి. మొదటి సమావేశంలో రాజ్యాంగ లక్ష్యాల తీర్మానంపై చర్చ జరిగింది. రెండో సమావేశంలో రాజ్యాంగ రూపకల్పనకు దోహదపడే అల్పసంఖ్యాకుల కమిటీ, ప్రాథమిక హక్కుల కమిటీ, సభావ్యవహారాల కమిటీ వంటి అనేక కమిటీలు ఏర్పడ్డాయి. మూడో సమావేశంలో కేంద్రప్రభుత్వ అధికారాల కమిటీ వంటి వివిధ సభా సంఘాల నివేదికలపై చర్చ జరిగింది. నాలుగో సమావేశంలో భావిభారత రాజ్యాంగనమూనా, కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగం వంటి విషయాలపై కూలంకషంగా చర్చించడం జరిగింది. 1947 జూన్ 3న మౌంట్ బాటన్ చేసిన దేశ విభజన ప్రకటనతో రాజ్యాంగ పరిషత్తు స్వరూపమే మారిపోయింది. దేశ విభజన తరువాత భారత రాజ్యాంగ పరిషత్తు నుంచి ముస్లిం లీగ్ వేరయిపోవడంతో దాని సభ్యత్వ సంఖ్య తగ్గిపోయింది. అలాగే దేశ విభజన దరిమిలా రాజ్యాంగ పరిషత్తు ఒకవైపు రాజ్యాంగ నిర్మాణసంస్థగానూ, వేరొకవైపు జాతీయస్థాయిలో అత్యున్నత శాసన నిర్మాణ సంస్థగా వ్యవహరించింది.

రాజ్యాంగ పరిషత్తుకు కార్యదర్శిగా హెచ్. వి. ఆర్. అయ్యంగార్, రాజ్యాంగ పరిషత్తుకు ముఖ్య సలహాదారుగా డాక్టర్ బెనగళ్ నర్సింగరావు వ్యవహరించారు.

రాజ్యాంగ ముసాయిదా కమిటీ (Drafting Committee)
భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీని భారత రాజ్యాంగ పరిషత్తు 1947 ఆగస్టు 29న ఏర్పరచింది. ఆ కమిటీలో చైర్మన్, ఆరుగురు సభ్యులు (మొత్తం ఏడుగురు) ఉన్నారు. డాక్టర్.బి.ఆర్. అంబేద్కర్ ఆ కమిటీ చైర్మన్ వ్యవహరించారు.

ముసాయిదా కమిటీ అనేక దఫాలు సమావేశమై రాజ్యాంగ ముసాయిదాను రూపొందించి 1947 నవంబర్ 5న రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించింది. రాజ్యాంగ ముసాయిదా ప్రతి 1948 ఫిబ్రవరి 21న ముద్రితమైంది. రాజ్యాంగ ముసాయిదాలోని అంశాలను రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు, ప్రజలు, పత్రికలలో చర్చలు జరిగి అభిప్రాయాల వ్యక్తీకరణకోసం ముసాయిదా ప్రతులను పంచడమైంది.

మొత్తం మీద రాజ్యాంగ ముసాయిదా పై 7635 సవరణలు పరిశీలనకు వచ్చాయి. వాటిలో 2473 సవరణలను రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. రాజ్యాంగ ముసాయిదా ప్రతిపై తృతీయ పఠనం 1949 నవంబర్ 14-26ల మధ్య జరిగింది. చివరిగా రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగ ముసాయిదాను నవంబర్ 26న ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించడానికి రాజ్యాంగ పరిషత్తుకు 2 ‘సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. భారత రాజ్యాంగ పరిషత్తు చివర సమావేశం 1950 జనవరి 24న జరిగింది. ఆ సమావేశంలో సభ్యులు డాక్టర్ రాజేంద్రప్రసాద్ ను భారతదేశ తొలి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది.

భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. నాటి నుండి ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకొంటున్నాము.

AP Inter 2nd Year Civics Study Material Chapter 1 భారత రాజ్యాంగం

ప్రశ్న 2.
భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలను వివరించండి. [Mar. ’17, ’16]
జవాబు:
భారత రాజ్యాంగం జనవరి 26, 1950వ సంవత్సరంలో అమలులోకి వచ్చింది. సుమారు రెండు శతాబ్దాల పరాయి పాలన తరువాత 1946లో ఏర్పడిన రాజ్యాంగ నిర్మాణ సభ రాజ్యాంగాన్ని రూపొందించింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో క్రొత్త రాజ్యాంగ నిర్మాణం చేయబడింది. మేధావులు, పరిపాలనావేత్తలు, న్యాయశాస్త్ర నిపుణులు, రాజనీతివేత్తలు కలసి ప్రపంచంలోని ముఖ్య రాజ్యాంగాలు, 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా క్రొత్త రాజ్యాంగ రచన చేశారు.

లక్షణాలు :
1. సుదీర్ఘమైన రాత పూర్వక ప్రతి : భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగము ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలోకి అతిపెద్ద రాజ్యాంగము. ఇందులో ప్రస్తుతం 444 అధికరణాలు, 12 ప్రకరణాలు ఉన్నాయి. రాజ్యాంగంలో 22 భాగాలున్నాయి. ఇప్పటి వరకు 100 సార్లు పైగా రాజ్యాంగం సవరించబడింది. ఇవన్నీ రాజ్యాంగంలో భాగమయ్యాయి. అన్ని వివరాలు పొందుపరచడం వలన రాజ్యాంగం పెద్దదిగా తయారైంది. ఐవర్ జెన్నింగ్స్ అనే రచయిత “భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిదీర్ఘము, వివరణాత్మక రాజ్యాంగం” అని వర్ణించారు. కొన్ని అలిఖిత నియమాలు కూడా ఉన్నాయి. ఉదా : రాష్ట్రపతి పదవికి ఒక వ్యక్తి రెండు పర్యాయాలకు మించి పోటీ చేయరాదు. లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుని మాత్రమే ప్రధానిగా నియమించడం మొదలగునవి.

2. దృఢ, సరళ రాజ్యాంగాల సమ్మేళనం భారత రాజ్యాంగ నిర్మాతలు సమయం, సందర్భాలను బట్టి దృఢ, సరళ లక్షణాలు గల రాజ్యాంగాన్ని భారత ప్రజలకు అందించారు. భారత రాజ్యాంగం 368వ ప్రకరణ రాజ్యాంగ సవరణ విధానాన్ని సూచిస్తుంది.

  1. నూతన రాష్ట్రాల ఏర్పాటు (ఉదా : తెలంగాణ) భారత పౌరసత్వం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు వంటి అంశాల సవరణకు సరళమైన పద్ధతి పేర్కొన్నది.
  2. రాష్ట్రపతి ఎన్నిక కేంద్రప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలు, కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలలోని అంశాలు మొదలగు వాటిని సవరించేందుకు పార్లమెంటు ఉభయసభలలో 2/3వ వంతు సభ్యుల ఆమోదంతోబాటు సగానికిపైగా రాష్ట్ర శాసనసభల ఆమోదం అవసరం. ఈ సందర్భంలో మన రాజ్యాంగం పాక్షిక, సరళ, పాక్షిక దృఢమైన పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది.
  3. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు వంటి కొన్ని అంశాలను సవరించేందుకు పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీ సభ్యుల ఆమోదం అవరమవుతుంది.

3. అర్ధ సమాఖ్య రాజ్యం : భారత రాజ్యాంగంలో కొన్ని సమాఖ్య లక్షణాలు, కొన్ని ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి. ఉదా : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుండటం, వాటి మధ్య అధికారాల విభజన, సుప్రీంకోర్టు, లిఖిత రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం వంటి సమాఖ్య లక్షణాలు ఉన్నాయి. అట్లాగే ఒకే రాజ్యాంగం, ఒకే ఎన్నికల సంఘం, ఒకే పౌరసత్వం, ఏకీకృత న్యాయవ్యవస్థ, రాష్ట్రాల కంటే కేంద్రానికే ఎక్కువ అధికారాలు వంటి ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి. భారతదేశంలో విచ్ఛిన్నకర ధోరణులను అరికట్టేందుకు రాజ్యాంగ నిర్మాతలు దృఢమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. పండితుడు కె.సి.వేర్ భారతదేశాన్ని అర్ధ సమాఖ్యగా వర్ణించడమైనది.

4. గణతంత్ర ప్రభుత్వం : పూర్వపు, వలస సౌర్వభౌమత్వ రాజ్యం ఇంగ్లండ్ వలె కాకుండా భారత రాజ్యాంగ నిర్మాతలు భారత గణతంత్ర ప్రభుత్వాన్ని సూచించారు. అటువంటి సంవిధానంలో అన్ని ప్రభుత్వ పదవులు అర్హతగల పౌరులకు అందుబాటులో ఉంటాయి. వంశపారంపర్య సూత్రానికి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే రాచరికం అనేది అప్రజాస్వామికమైంది.

5. పార్లమెంటరీ ప్రభుత్వం : భారత రాజ్యాంగం పార్లమెంటరీ ప్రభుత్వ పద్ధతిని కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో ప్రవేశపెట్టింది. రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ తరహాలో ఎన్నికైన దేశాధ్యక్షుడు ఉన్న పద్ధతిని సూచించారు. బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థలో మిగిలిన లక్షణాలైన రెండు రకాల కార్య వర్గాధిపతులు, ప్రధానమంత్రి నాయకత్వం, సమిష్టి బాధ్యత, పార్లమెంటుకు కార్యవర్గంపై నియంత్రణ, రాజ్యాధినేతకు నామమాత్ర కార్యనిర్వాహక వర్గ హోదా వంటి అంశాలను భారత రాజకీయ వ్యవస్థలో ఆమోదించడం జరిగింది. రాష్ట్రాలలో కూడా పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్నే సూచించడం జరిగింది.

6. ప్రాథమిక హక్కులు – ప్రాథమిక బాధ్యతలు : భారత రాజ్యాంగం మూడో భాగంలో 12 నుంచి 25 వరకు గల ప్రకరణలు పౌరులందరికీ ప్రధానమైన మానవ హక్కులను అందించాయి. అటువంటి హక్కులు న్యాయబద్ధమైనవిగా ఉంటూ మౌలికస్వాతంత్ర్యాలను పౌరులను ప్రసాదిస్తాయి. అధికార దుర్వినియోగాన్ని నివారిస్తాయి. ఇక రాజ్యాంగం (42వ సవరణ) చట్టం రాజ్యాంగం నాలుగో భాగంలో 51 A నిబంధనలో ప్రాథమిక విధులను చేర్చింది. ప్రాథమిక విధులన్నీ న్యాయబద్ధమైనప్పటకీ పౌరులు కొన్ని బాధ్యతలకు నిర్వర్తించాల్సిన ఆవశ్యకతను అవి పేర్కొంటాయి.

7. ఏక పౌరసత్వం : భారత రాజ్యాంగం సమాఖ్య పద్ధతి ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని కలిగి ఉన్నప్పటికీ పౌరులందరికీ ఒకే పౌరుసత్వాన్ని ప్రసాదించింది. అమెరికాలాంటి దేశాలలో పౌరులు కేంద్రం, రాష్ట్రాలలో రెండింటిలో పౌరసత్వాన్ని కలిగి ఉంటారు. కానీ భారతదేశంలో పౌరులు ఏ రాష్ట్రంలో జన్మించినప్పటికీ దేశవ్యాప్తంగా ఒకేరకమైన హక్కులను అనుభవిస్తారు. జమ్మూకాశ్మీర్, గిరిజన ప్రాంతాలలో నివసించే వారిని మినహాయిస్తే మిగతా ప్రజల మధ్య ఎటువంటి విచక్షణ పాటించబడదు.

8. వయోజన ఓటుహక్కు: పార్లమెంటు, రాష్ట్ర శాసన సభలకు జరిగే ఎన్నికలలో ప్రతినిధులను ఎన్నుకొనేందుకు భారత రాజ్యాంగం 18 ఏండ్లు నిండిన పౌరులందరికీ ఓటుహక్కును ప్రసాదించింది. దాని ప్రకారం వయోజన పౌరులందరికీ కులం, తెగ, మతం, లింగం, అక్షరాస్యతలతో సంబంధం లేకుండా ఓటుహక్కు ఇచ్చింది. అటువంటి ఏర్పాటు భారత ప్రజాస్వామ్యానికి విశేషమైన ప్రాముఖ్యతనిచ్చి సామాన్యప్రజల ఆత్మగౌరవం, ప్రతిష్టలను పెంపొందిస్తుంది. సమానత్వ సూత్రాన్ని సమర్థించి, మైనారిటీల ప్రయోజనాలను కాపాడుకొనేందుకు, సమాజంలోని బలహీనవర్గాలలో నూతన ఉత్తేజాలకు వీలు కల్పిస్తుంది.

9. లౌకిక రాజ్యం : భారత రాజ్యాంగం లౌకిక రాజ్యానికి ప్రతీకగా ఉంటుంది. మన రాజ్యాంగం భారతదేశంలో ఏ ఒక్కమతాన్ని అధికార మతంగా గుర్తించదు. మతప్రాతిపదికపై కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేసింది. అయితే తాత్కాలిక ప్రాతిపదికపై షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి శాసననిర్మాణంలో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకై రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 1 భారత రాజ్యాంగం

10. స్వతంత్ర న్యాయశాఖ : సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు స్వతంత్ర న్యాయశాఖ అనేది అత్యంత ఆవశ్యకమైంది. శాసన నిర్మాణ, కార్యనిర్వహక శాఖల అధికారాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అది అవసరమవుతుంది. భారత సుప్రీంకోర్టు క్రమేణా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైందిగా ఆవిర్భవించింది. స్వతంత్ర హోదా ఉండుటచేత, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు దేశంలో శాసన నిర్మాణ, కార్యనిర్వాహక సంస్థల చర్యలను విధానాలలోని ఔచిత్యాన్ని నిర్ణయించగలుగుతారు.

11. ఆదేశక నియమాలు: భారత రాజ్యాంగం నాలుగో భాగంలో 36 నుంచి 51 వరకు గల ప్రకరణలు ఆదేశక నియమాలను ప్రస్తావించాయి. భారత రాజ్యాంగ నిర్మాతలు వాటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఆ నియమాలు సమాఖ్య రాజ్య భావనను ప్రతిబింబిస్తాయి. అవి ప్రభుత్వాలకు ఇవ్వబడిన ఆజ్ఞలు. సమానమైన పనికి సమాన వేతనం, ఉపాధి అవకాశాల కల్పన, సంపద న్యాయమైన రీతిలో పంపిణీ, వృద్ధాప్య పించన్లు, అస్వస్థత నుంచి కాపాడడం, శ్రామికులకు విశ్రాంతి, వన్యప్రాణుల సంరక్షణ, మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులను కాపాడడం వంటివి ఆదేశక నియమాలకు కొన్ని ఉదాహరణలు. ఆదేశక సూత్రాలకు న్యాయ స్వభావం లేకపోయినప్పటికీ వాటిని ఏ బాధ్యతాయుత ప్రభుత్వము విస్మరించరాదు.

12. ద్విసభా విధానం : భారత రాజ్యాంగం జాతీయ స్థాయిలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టింది. దానికి అనుగుణంగా భారత పార్లమెంటులో లోక్సభ (దిగువ సభ), రాజ్యసభ (ఎగువ సభ) అనే రెండు సభలు ఉంటాయి. లోక్సభ దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించగా, రాజ్యసభ రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణకు ఉద్దేశించింది. భారత రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్, అమెరికాలు అనుసరిస్తున్న ద్విసభావిధానాన్ని మన దేశానికి సూచించడమైంది.

13. పంచాయితీరాజ్, మునిసిపాలిటి చట్టాలు : ఇతర సమాఖ్య రాజ్యాంగాల వలె, భారత రాజ్యాంగం ప్రారంభంలో కేంద్రం, రాష్ట్రాలతో కూడిన రెండు ప్రభుత్వాలతో కూడిన రాజకీయ సంవిధానాన్ని ఏర్పరచింది. తరువాత రాజ్యాంగం (73వ, 74వ సవరణలు) చట్టాల ద్వారా పంచాయితీలు, మునిసిపాలిటీలకు రాజ్యాంగపరమైన గుర్తింపుకు ఏర్పాట్లు గావించింది. అటువంటి ఏర్పాట్లు ప్రపంచంలోని ఏ ఇతర రాజ్యాంగాలలోను లేకపోవడం ఒకే విశేషంగా ఈ సందర్భంలో పేర్కొనవచ్చు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజ్యాంగం ముఖ్యాంశాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
ప్రజలు, ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని సూచించే కొన్ని నిర్దిష్ట నియమాల సముదాయాన్ని రాజ్యాంగం అని అంటారు. రాజ్యం, ప్రభుత్వాల అధికారాలు, విధులకు రాజ్యాంగం ముఖ్య ప్రాతిపదికగా ఉంటుంది. అదేవిధంగా పౌరుల హక్కులు, బాధ్యతలకు సంబంధించిన ప్రధాన ప్రామాణికతకు నిదర్శనం రాజ్యాంగమే. అందుకనే “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్ధిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం” అని లార్డ్ బ్రైస్ పేర్కొన్నాడు.

రాజ్యాంగం – ముఖ్యాంశాలు :
1) సంఘంలో సభ్యులు, సముదాయాల మధ్య సమన్వయాన్ని చేకూర్చేందుకై అవసరమైన ప్రాథమిక నియమాలను రాజ్యాంగం సూచిస్తుంది. సంఘంలో శక్తి (power) పంపిణీ (distribution) గురించి అది ప్రత్యేకంగా పేర్కొంటుంది. చట్టాలను ఎవరు రూపొందిస్తారు ? అనే అంశాన్ని నిర్ణయిస్తుంది. ఉదాహరణకు భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు చట్టాలను రూపొందిస్తారు. అందుకు భిన్నంగా ప్రజా గణతంత్ర చైనా దేశంలో కమ్యూనిస్టుపార్టీ సర్వాధికారాలు చెలాయిస్తూ, చట్టాలను రూపొందిస్తుంది. సౌదీ అరేబియా వంటి రాజరికం అమల్లో ఉన్న రాజ్యంలో చట్ట స్వభావాన్ని రాజు నిర్ణయిస్తాడు. మొత్తంమీద భారతదేశంలో పార్లమెంటు లేదా రాష్ట్ర శాసన సభలు చట్టాల రూపకల్పనకు రాజ్యాంగం వీలు కల్పించింది.

2) రాజ్యాంగం ప్రభుత్వ నిర్మితిని నిర్దేశిస్తుంది. ఆధునిక ప్రభుత్వాలు i) శాసన నిర్మాణ శాఖ ii) కార్యనిర్వాహక శాఖ iii) న్యాయశాఖ అనే మూడు అంశాలతో కూడి ఉంటాయి. రాజ్యాంగం నిర్దేశించిన పరిమితులకు లోబడి శాసన నిర్మాణశాఖ చట్టాలను రూపొందించగా, దేశాధ్యక్షుడు లేదా రాష్ట్ర గవర్నర్, ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రితో కూడిన మంత్రివర్గాలు పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు సమకూర్చిన మార్గదర్శకాలకు లోబడి, విధాన నిర్ణయాలను
తీసుకొంటారు.

3) రాజ్యాంగం పాలితులు, ప్రభుత్వానికి మధ్య సంబంధాన్ని పేర్కొంటుంది. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక బాధ్యతలు అనేవి పౌరుల హక్కులు. ప్రభుత్వ కర్తవ్యాల గురించి సంపూర్ణంగా ప్రస్తావించాయి. భారత రాజ్యాంగం మూడో భాగం, నాల్గో భాగం (ఎ) లు రాజ్యం, పౌరుల మధ్య పరస్పర సంబంధాన్ని సూచిస్తాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 1 భారత రాజ్యాంగం

4) ప్రతి సంఘానికి (society) కొన్ని నిర్దిష్టమైన ఆకాంక్షలు, ఆశయాలు ఉంటాయి. రాజ్యం అనేది ప్రజల కనీస అవసరాలను సంతృప్తిపరచేందుకై, ప్రజలందరికి మంచి జీవనాన్ని అందించేందుకై ఆవిర్భవించింది. ప్రజల శ్రేయస్సుకై రాజ్యం (ప్రభుత్వం ద్వారా) కృషిచేయాల్సి ఉంటుందని రాజ్యాంగం పేర్కొంటుంది.

5) వర్తమాన, భావితరాలలో సంభవించే అస్థిర పరిస్థితులను నివారించేందుకు సర్వోన్నత ప్రతి అయిన రాజ్యాంగం దోహదపడుతుంది. ఎటువంటి మార్పులనైనా ఆమోదించేందుకు, అలాగే ఏవిధమైన ఒడిదుడుకులను తట్టుకొనే విధంగా రాజ్యాంగం రూపొందుతుంది. రాజ్యాంగం అనేది సజీవ ప్రతిగా ఉంటుంది. అది భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో రాజ్యానికి సంబంధించిన విషయాలను జతపరుస్తుంది.

ప్రశ్న 2.
భారత రాజ్యాంగం నిర్మాణం గురించి తెలపండి.
జవాబు:
ఒకవైపు భారత్, పాకిస్తాన్ల మధ్య అధికారాల మార్పిడికి సంబంధించిన కసరత్తు జరుగుతుండగా వేరొకవైపు భారతదేశానికి ప్రత్యేక రాజ్యాంగాన్ని రూపొందించేందుకై రాజ్యాంగపరిషత్తు అనే సంస్థను ఏర్పాటు చేయడమైంది. 1946లో రాజ్యాంగ పరిషత్తు నిర్మాణం విషయంలో ముగ్గురు మంత్రుల బృందం, ప్రధాన రాజకీయ పార్టీల మధ్య అవగాహన కుదిరింది. రాజ్యాంగ పరిషత్తుకు పరోక్ష ఎన్నికలు నిర్వహించాలనీ, సభ్యులను రాష్ట్ర శాసనసభలలోని ఎన్నికైన సభ్యులు ఎన్నుకోవాలని సూచించడమైంది. రాజ్యాంగ పరిషత్తు మొత్తం సభ్యత్వ సంఖ్య 385కాగా అందులో 292 స్థానాలు బ్రిటీష్ ఇండియా పాలిత రాష్ట్రాలకు, 93 స్థానాలు స్వదేశీ సంస్థానాలకు కేటాయించడమైంది. 1946 డిసెంబరు 9వ తేదీన రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం జరిగింది. ఆ సమావేశాన్ని అఖిల భారత ముస్లిం లీగ్ సభ్యులు బహిష్కరించడమైంది. మొత్తం మీద భారత రాజ్యాంగాన్ని ఖరారు చేసేందుకై భారత రాజ్యాంగ పరిషత్తుకు రెండు సంవత్సరాల 11 నెలల 17 రోజులు సమయం పట్టింది. రాజ్యాంగ పరిషత్తు సభ్యులు కేవలం పార్టీ ప్రాతిపదికపై ఎన్నుకోబడి, భారతీయ ప్రజానీకానికి చెందిన దాదాపు ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం వహించారని చెప్పవచ్చు. రాజ్యాంగ పరిషత్తులో స్ఫూర్తిదాయకంగా వ్యవహరించిన వారిలో జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ రాజేంద్రప్రసాద్, సర్దార్ వల్లబాయ్ పటేల్ వంటి ప్రముఖుల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న ముగ్గురు నాయకులు రాజ్యాంగ ప్రధాన సూత్రాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. అయితే భారత రాజ్యాంగానికి జవసత్త్వాలను అందించినవాడిగా భారత రాజ్యాంగ ముసాయిదా సంఘం అధ్యక్షుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ను పేర్కొనవచ్చు. భారత రాజ్యాంగ ముసాయిదా రచనలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్కు సహాయ సహకారాలను అందించిన ప్రముఖ న్యాయవేత్తలలో అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాలస్వామి అయ్యంగార్, ఎమ్.మునీ, టి.టి కృష్ణమాచారి వంటి వారు ఉన్నారు. ఇక రాజ్యాంగానికి పునాదుల ఏర్పాటుకు సంబంధించిన నివేదికలను అందించిన కమిటీలలో కేంద్ర ప్రభుత్వ అధికారాల కమిటీ, కేంద్రప్రభుత్వ నిర్మాణపు కమిటీ, ప్రాథమిక హక్కులు, మైనారిటీ హక్కుల కమిటీ వంటివి ఉన్నాయి. అంతిమంగా భారతరాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26వ తేదీన ఆమోదించింది. భారత రాజ్యాంగం అధీకృత ప్రతిపై రాజ్యాంగ పరిషత్తు సభ్యులు సంతకం చేసిన తరువాత అది 1950 జనవరి 26వ తేదీనాడు అమల్లోకి వచ్చింది.

ప్రశ్న 3.
భారత రాజ్యాంగం ఆధారాలను వర్ణించండి. [Mar. ’17, ’16]
జవాబు:
భారత రాజ్యాంగం అనేక అనుభవాల ఆధారంగా రూపొందించి, ప్రపంచంలోని అనేక రాజ్యాంగాలలోని ఉత్తమ లక్షణాలను భారత రాజ్యాంగంలో పొందుపరచడమైంది. అలాగే భారతదేశంలోని రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను, రాజకీయ వారసత్వాన్ని దృష్టిలో ఉంచుకొని భారత రాజ్యాంగాన్ని రచించడమైంది.
మొత్తం మీద భారత రాజ్యాంగ రచన సమయంలో క్రింది ఆధారాలను రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించారు.
1. భారత రాజ్యాంగంలోని అనేక అంశాలు బ్రిటిష్ రాజ్యాంగానికి ప్రాతిపదికగా ఉన్న ‘వెస్ట్ మినిస్టర్ తరహా పద్దతి నుండి గ్రహించడం జరిగింది. పార్లమెంటరీ సంప్రదాయాలు, సమన్యాయపాలన, కేబినెట్ ప్రభుత్వం, శాసన నిర్మాణ – కార్యనిర్వాహక శాఖల మధ్య సంబంధం, ఏక పౌరసత్వం, నామమాత్ర కార్యనిర్వాహక అధిపతి వంటివి అందుకు ఉదాహరణలు.

2. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్ష, సమాఖ్య విధానం, రాష్ట్రపతి ఎన్నిక, రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మాన ప్రతిపాదన వంటి అంశాలు అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది.

3. రాజ్య విధాన ఆదేశక సూత్రాలను రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు.

4. జర్మనీ వైమర్ రాజ్యాంగం నుంచి భారత రాష్ట్రపతికి సంబంధించిన అత్యవసర అధికారాలను రాజ్యాంగ నిర్మాతలు గ్రహించారు.

5. ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి ఉమ్మడి జాబితా, వర్తకం, వాణిజ్యం, అంతర్రాష్ట్ర రవాణా, పార్లమెంటు, శాసనసభల సభ్యుల ప్రత్యేక హక్కులు వంటి విషయాలను భారత రాజ్యాంగంలో చేర్చడమైంది.

6. భారత రాజ్యాంగంలోని కేంద్ర, రాష్ట్ర సంబంధాల శీర్షికను కెనడా రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది.

7. దక్షిణాఫ్రికా నుంచి రాజ్యాంగ సవరణకు సంబంధించిన అధికరణాలను భారత రాజ్యాంగంలో పొందుపరచడమైంది.

8. గణతంత్ర రాజ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలకు సంబంధించిన అంశాలు ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది.

9. భారత రాజ్యాంగంలోని అత్యధిక అంశాలు భారత ప్రభుత్వ చట్టం, 1935 నుంచి గ్రహించడమైంది. పైన పేర్కొన్న రాజ్యాంగాల నుంచి అనేక అంశాలను గ్రహించడం వల్ల భారత రాజ్యాంగం అధిక పరిమాణంతో కూడిన సుదీర్ఘమైన రాజ్యాంగంగా గుర్తింపు పొందింది.
దానితో భారత్ రాజ్యాంగాన్ని కొందరు ఐరావతంతో పోల్చారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 1 భారత రాజ్యాంగం

ప్రశ్న 4.
భారత రాజ్యాంగంలోని ఏవైనా మూడు ముఖ్య లక్షణాలను వివరించండి.
జవాబు:
1) గణతంత్ర ప్రభుత్వం : పూర్వపు, వలస సౌర్వభౌమత్వ రాజ్యం ఇంగ్లండ్ వలె కాకుండా భారత రాజ్యాంగ నిర్మాతలు భారత గణతంత్ర ప్రభుత్వాన్ని సూచించారు. అటువంటి సంవిధానంలో అన్ని ప్రభుత్వ పదవులు అర్హతగల పౌరులకు అందుబాటులో ఉంటాయి. వంశపారంపర్య సూత్రానికి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే రాచరికం అనేది అప్రజాస్వామికమైంది.

2) లౌకిక రాజ్యం : భారత రాజ్యాంగం లౌకిక రాజ్యానికి ప్రతీకగా ఉంటుంది. మన రాజ్యాంగం భారతదేశంలో ఏ ఒక్కమతాన్ని అధికార మతంగా గుర్తించదు. మతప్రాతిపదికపై కల్పించిన రిజర్వేషన్లను రద్దుచేసింది. అయితే తాత్కాలిక ప్రాతిపదికపై షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి శాసననిర్మాణంలో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకై రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించింది.

3) స్వతంత్ర న్యాయశాఖ : సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు స్వతంత్ర న్యాయ శాఖ అనేది అత్యంత ఆవశ్యకమైంది. శాసన నిర్మాణ, కార్యనిర్వహక శాఖల అధికారాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అది అవసరమవుతుంది. భారత సుప్రీంకోర్టు క్రమేణా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైందిగా ఆవిర్భవించింది. స్వతంత్ర హోదా ఉండుటచేత, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు దేశంలో శాసన నిర్మాణ, కార్యనిర్వాహక సంస్థల చర్యలను విధానాలలోని ఔచిత్యాన్ని నిర్ణయించగలుగుతారు.

ప్రశ్న 5.
“భారత రాజ్యాంగం ఆత్మయే ప్రవేశిక” వ్యాఖ్యానించండి.
జవాబు:
భారత రాజ్యాంగ లక్షణాలలో ప్రవేశిక అత్యంత ముఖ్యమైంది. అది భారత రాజ్యాంగ మూలతత్త్వాన్ని సూచిస్తుంది. రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు, ఆకాంక్షలు, లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. జవహర్లాల్నెహ్రూ ప్రవేశికను ఒక నిశ్చయాత్మక తీర్మానం ప్రమాణం, హామీగా వర్ణించారు. ప్రవేశిక ‘భారతీయులమైన మేము, మా కోసం రాజ్యాంగాన్ని ‘సమర్పించుకుంటున్నాం’ అనే భావాన్ని వ్యక్తీకరించింది. భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. భారతీయులకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయాలను ప్రసాదిస్తున్నట్లు వెల్లడించింది. భారతదేశంలో సర్వసత్తాధికారం అంతిమంగా భారత ప్రజలకే చెందుతుందనీ స్పష్టీకరించింది. ప్రవేశికను సుప్రీంకోర్టు న్యాయమూర్తి మధోల్కర్ రాజ్యాంగ ప్రధాన లక్షణాల సారం’ అని వర్ణిస్తే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లా రాజ్యాంగపు ఆత్మగా ప్రస్తుతించారు.

1976లో భారత రాజ్యాంగపు 42వ సవరణ చట్టం తరువాత ప్రవేశిక క్రింది విధంగా ఉంది.

“భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి; పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్ర్యాన్ని, అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికీ, వారందరిలో వ్యక్తి గౌరవాన్నీ, జాతీయ సమైక్యతను, సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికీ; ఈ 1949 నవంబర్ 26వ తేదీన మా రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించి, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం”.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
లిఖిత పూర్వక రాజ్యాంగం.
జవాబు:
పెద్ద లిఖిత రాజ్యాంగం: భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగము ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలోకి అతిపెద్ద రాజ్యాంగము. ఇందులో ప్రస్తుతం 444 అధికరణాలు, 12 ప్రకరణాలు ఉన్నాయి. రాజ్యాంగంలో 22 భాగాలున్నాయి. ఇప్పటి వరకు 100 సార్లు పైగా రాజ్యాంగం సవరించబడింది. ఇవన్నీ రాజ్యాంగంలో భాగమయ్యాయి. అన్ని వివరాలు పొందుపరచడం వలన రాజ్యాంగం పెద్దదిగా తయారైంది. ఐవర్ జెన్నింగ్స్ అనే రచయిత “భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిదీర్ఘము, వివరణాత్మక రాజ్యాంగం” అని వర్ణించాడు. కొన్ని అలిఖిత నియమాలు కూడా ఉన్నాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 1 భారత రాజ్యాంగం

ప్రశ్న 2.
దృఢ రాజ్యాంగం.
జవాబు:
రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను అత్యంత కఠినమైన రీతిలో సవరించడానికి వీలుంటే, మరికొన్ని అంశాలను సరళమైన రీతిలో మార్పు చేయవచ్చు. ఇంకొన్ని అంశాలను సగం కఠినమైన, సగం సరళమైన రీతిలో మార్పు చేయవచ్చు. భారత రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టుల అధికారాలు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు వంటి అంశాలను సవరించడానికి రాజ్యాంగ నిర్మాతలు పరుషమైన పద్ధతిని సూచించారు. రాష్ట్రాల పేర్లు, సరిహద్దులు, విస్తీర్ణం, విలీనం లేదా విభజన, రాష్ట్ర శాసనమండళ్ళ ఏర్పాటు లేదా రద్దువంటి అంశాలను సులభమైన రీతిలో సవరించడానికి వీలుకల్పించారు. ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు వంటి అంశాలను మార్పు చేయడానికి | పాక్షిక కఠిన, పాక్షిక సరళ పద్ధతికి అవకాశం ఇచ్చారు.

ప్రశ్న 3.
పార్లమెంటరీ ప్రభుత్వం.
జవాబు:
భారత రాజ్యాంగం పార్లమెంటరీ ప్రభుత్వ పద్ధతిని కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో ప్రవేశపెట్టింది. రాజ్యాంగ నిర్మాతలు | ఐర్లాండ్ తరహాలో ఎన్నికైన దేశాధ్యక్షుడు ఉన్న పద్ధతిని సూచించారు. బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థలో మిగిలిన లక్షణాలైన రెండు రకాల కార్య వర్గాధిపతులు, ప్రధానమంత్రి నాయకత్వం, సమిష్టి బాధ్యత, పార్లమెంటుకు కార్యవర్గంపై నియంత్రణ, రాజ్యాధినేతకు నామమాత్ర కార్యనిర్వాహక వర్గ హోదా వంటి అంశాలను భారత రాజకీయ వ్యవస్థలో ఆమోదించడం జరిగింది. రాష్ట్రాలలో కూడా పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్నే సూచించడం జరిగింది.

ప్రశ్న 4.
ప్రాథమిక హక్కులు.
జవాబు:
రాజ్యాంగంలోని 3వ భాగంలో 12వ అధికరణం నుండి 35వ అధికరణం వరకు ప్రాథమిక హక్కులను ప్రస్తావించారు. ఈ ప్రాథమిక హక్కులను 7 రకాలుగా విభజించవచ్చును. ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులే ఉన్నాయి. ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. ఇవి ప్రజలకు స్వేచ్ఛనిస్తాయి. వీటికి భంగం కలిగితే పౌరులు న్యాయస్థానాల ద్వారా రక్షించుకోవచ్చు. స్వేచ్ఛ హక్కు, సమానత్వపు ” హక్కు, మత స్వాతంత్య్రపు హక్కు మొదలగునవి ప్రాథమిక హక్కులు. అత్యవసర పరిస్థితిలో రాష్ట్రపతి వీటిని తాత్కాలికంగా రద్దు చేయవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాథమిక హక్కులు చాలా అవసరము. ప్రాథమిక హక్కులు న్యాయసమ్మతమైనవి. ఇవి నిరపేక్షమైనవి కావు.

ప్రశ్న 5.
లౌకిక రాజ్యం.
జవాబు:
భారత రాజ్యాంగం లౌకిక రాజ్యానికి ప్రతీకగా ఉంటుంది. మన రాజ్యాంగం భారతదేశంలో ఏ ఒక్క మతాన్ని |అధికార మతంగా గుర్తించదు. మతప్రాతిపదికపై కల్పించిన రిజర్వేషన్లను రద్దుచేసింది. అయితే తాత్కాలిక ప్రాతిపదికపై షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి శాసన నిర్మాణంలో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకై రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించింది.

ప్రశ్న 6.
వయోజన ఓటుహక్కు.
జవాబు:
పార్లమెంటు, రాష్ట్రశాసన సభలకు ఎన్నికలలో ప్రతినిధులను ఎన్నుకొనేందుకు భారత రాజ్యాంగం 18 ఏండ్లు నిండిన పౌరులందరికీ ఓటుహక్కును ప్రసాదించింది. దాని ప్రకారం వయోజన పౌరులందరికీ కులం, తెగ, మతం, లింగం, అక్షరాస్యతలతో సంబంధం లేకుండా ఓటుహక్కు ఇచ్చింది. అటువంటి ఏర్పాటు భారత ప్రజాస్వామ్యానికి విశేషమైన ప్రాముఖ్యతనిచ్చి సామాన్య ప్రజల ఆత్మగౌరవం, ప్రతిష్టలను పెంపొందిస్తుంది. సమానత్వ సూత్రాన్ని సమర్థించి, మైనారిటీల ప్రయోజనాలను కాపాడుకొనేందుకు, సమాజంలోని బలహీనవర్గాలలో నూతన ఉత్తేజాలకు వీలు కల్పిస్తుంది.

ప్రశ్న 7.
ద్విసభా విధానం.
జవాబు:
భారత రాజ్యాంగం జాతీయ స్థాయిలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టింది. దానిని అనుగుణంగా భారత పార్లమెంటులో లోక్సభ (దిగువ సభ), రాజ్యసభ (ఎగువ సభ), అనే రెండు సభలు ఉంటాయి. లోక్సభ దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించగా, రాజ్యసభ రాష్ట్రాల ప్రయోజనాలు పరిరక్షణకు ఉద్దేశించింది. భారత రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్, అమెరికాలు అనుసరిస్తున్న ద్విసభావిధానాన్ని మన దేశానికి సూచించడమైంది.

ప్రశ్న 8.
ఆదేశిక నియమాలు.
జవాబు:
భారత రాజ్యాంగం నాలుగో భాగంలో 36 నుంచి 51 వరకు గల ప్రకరణలు ఆదేశిక నియమాలు ప్రస్తావించాయి. భారత రాజ్యాంగ నిర్మాతలు వాటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఆ నియమాలు సమాఖ్య రాజ్య భావనను ప్రతిబింబిస్తాయి. అవి ప్రభుత్వాలకు ఇవ్వబడిన ఆజ్ఞలు. సమానమైన పనికి సమాన వేతనం, ఉపాధి అవకాశాల కల్పన, సంపద న్యాయమైన రీతిలో పంపిణీ, వృద్ధాప్య పించన్లు, అస్వస్థత నుంచి కాపాడటం, శ్రామికులకు విశ్రాంతి, వన్య ప్రాణుల సంరక్షణ, మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులను కాపాడడం వంటివి ఆదేశిక నియయాలకు కొన్ని ఉదాహరణలు. ఆదేశిక సూత్రాలను న్యాయ స్వభావం లేకపోయినప్పటికీ వాటిని ఏ బాధ్యతాయుత ప్రభుత్వము విస్మరించరాదు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 1 భారత రాజ్యాంగం

ప్రశ్న 9.
న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తి.
జవాబు:
సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు స్వతంత్ర న్యాయశాఖ అనేది అత్యంత ఆవశ్యకమైంది. శాసన నిర్మాణ, కార్యనిర్వాహక శాఖల అధికారాలు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అది అవసరమవుతుంది. భారత సుప్రీంకోర్టు క్రమేణా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైందిగా ఆవిర్భివించింది. స్వతంత్ర హోదా ఉండుట చేత, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు దేశంలో శాసన నిర్మాణ, కార్యనిర్వాహక సంస్థల చర్యలను విధానాలలోని జౌచిత్యాన్ని నిర్ణయించగలుగుతారు.

ప్రశ్న 10.
ప్రవేశిక. [Mar. ’17, ’16]
జవాబు:
రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు, ఆకాంక్షలు, లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. జవహర్లాల్నెహ్రూ ప్రవేశికను ఒక నిశ్చయాత్మక తీర్మానం ప్రమాణం, హామీగా వర్ణించారు. ప్రవేశిక భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. భారతీయులకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయాలను ప్రసాదిస్తున్నట్లు వెల్లడించింది. భారతదేశంలోని సర్వసత్తాధికారం అంతిమంగా భారత ప్రజలకే చెందుతుందని స్పష్టీకరించింది. ప్రవేశికను సుప్రీంకోర్టు న్యాయమూర్తి మధోల్కర్ రాజ్యాంగ ప్రధాన లక్షణాల సారం అని వర్ణిస్తే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లా రాజ్యాంగపు ఆత్మగా ప్రస్తుతించారు.

AP Inter 2nd Year History Study Material Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 13th Lesson సమాకాలీన ప్రపంచ చరిత్ర Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 13th Lesson సమాకాలీన ప్రపంచ చరిత్ర

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఐక్యరాజ్య సమితి ముఖ్య అంగాలను, దాని విధులను గూర్చి రాయండి.
జవాబు:
1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించింది. ఐ.రా.స లక్ష్యాలైన భద్రత, న్యాయం, సంక్షేమం, మానవ హక్కులు అనే లక్ష్యాలను సాధించడానికి అనేక విభాగాలున్నాయి.

ఐక్యరాజ్య సమితి ముఖ్య అంగాలు:
సాధారణ సభ (జనరల్ అసెంబ్లీ): ఐ.రా.సలోని ప్రతి సభ్య దేశము సాధారణ సభలో సభ్యులే. సాధారణ సభ ప్రతి సంవత్సరానికొకసారి సమావేశమౌతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో సాధారణ సభ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయి.

సాధారణ సభ ఐ.రా.స. పనితీరుని వివరిస్తుంది, సమీక్షిస్తుంది, పర్యవేక్షిస్తుంది. అంతర్జాతీయ శాంతి భద్రతలు నెలకొల్పుటకు చర్చలు, సూచనలు చేస్తుంది. ఐ.రా.స. లోని వివిధ సంస్థలలో నియామకాలు చేపడుతుంది. ఐ.రా.స విత్త వ్యవహారాలను నియంత్రిస్తుంది.

భద్రతామండలి: ఇది ఐ.రా.స కార్యనిర్వాహక అంగం. దీనిలో 5 శాశ్వత సభ్యదేశాలు మరియు 10 తాత్కాలిక దేశాలు ఉంటాయి. అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మరియు చైనాలు సభ్యదేశాలు. మిగిలిన 10 తాత్కాలిక సభ్యదేశాలు రెండు సంవత్సరాల కాలపరిమితి కొరకు సాధారణ సభ రొటేషన్ పద్ధతిలో ఎన్నుకుంటుంది.

AP Inter 2nd Year History Study Material Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

సాధారణ విషయాలలో భద్రతామండలి సభ్యదేశాలు 15 ఓట్లలో 9 ఓట్లు వస్తే మెజారిటీగా పరిగణించబడతాయి. కానీ ముఖ్యమైన అంశాలలో చర్చ జరిగేటపుడు తొమ్మిది ఓట్లలో ఐదు శాశ్వత సభ్యదేశాల ఓట్లు ఖచ్చితంగా తీర్మానానికి అనుకూలంగా ఉండాలి. శాశ్వత సభ్యదేశాలకు వీటో హక్కు ఉంటుంది. భద్రతామండలి అవసరమైనప్పుడల్లా సమావేశమవుతుంది. భద్రతామండలి సభ్యదేశాల ప్రతినిధులు న్యూయార్క్ లో ఉంటారు.

ఆర్థిక మరియు సాంఘిక మండలి: ఈ మండలిలో 54 మంది విభిన్న దేశాలకు చెందిన సభ్యులు ఉంటారు. వీరు సాధారణ సభచే ఎంపిక చేయబడతారు. వీరి కాలపరిమితి 3 సంవత్సరాలు. ప్రతి మూడు సంవత్సరాలకు మూడవ వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. కొత్త సభ్యులు వారి స్థానాలలో ఎన్నిక అవుతారు. ఆర్థిక మరియు సాంఘిక మండలి సంవత్సరానికి రెండు సమావేశాలు నిర్వహిస్తుంది. ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక సమస్యలను పరిష్కరించడమే దీని ముఖ్య విధి.

ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, మానవ హక్కులకు హామీ ఇవ్వడం, నిరుద్యోగాన్ని నిర్మూలించడం. వివిధ దేశాల సాంఘిక, ఆర్థిక అభివృద్ధి కొరకు ఈ మండలి కృషి చేస్తుంది. ఈ మండలి యునెస్కో, I.M.F, W.H.O. I.C.O, వంటి ఇతర సంస్థల సహకారంతో పనిచేస్తోంది.

ధర్మకర్తృత్వ మండలి: ఇది వలస దేశాల ప్రతినిధులతో, సాధారణ సభచే ఎన్నుకొనబడిన ప్రతినిధులతో కూడి ఉంటుంది. ఈ మండలి ముఖ్య విధి తనకు అప్పగించబడిన ప్రాంతాల అభీష్టాలను నెరవేర్చడం మరియు ఐ.రా.స. ధర్మకర్తృత్వంలో ఉన్న దేశాల పాలనలో జనరల్ అసెంబ్లీకి సహాయపడటం దీని ముఖ్య విధి.

అంతర్జాతీయ న్యాయస్థానం ఐ.రా.స యొక్క న్యాయమూర్తుల పదవీకాలం 9 సంవత్సరాలు. దేశాల మధ్య వచ్చే న్యాయ వివాదాలను పరిష్కరించడం దీని ముఖ్య విధి. భద్రతామండలి, జనరల్ అసెంబ్లీలకు అవసరమైనపుడు న్యాయ సలహాలను ఇస్తుంది.

సచివాలయం (సెక్రటేరియట్): ఐ.రా.స. రోజువారీ కార్యక్రమాలను సమితి సచివాలయం నిర్వహిస్తుంది. సచివాలయం ముఖ్య పాలనాధికారి సెక్రటరీ జనరల్ పదవీకాలం ఐదు సంవత్సరాలు. భద్రతామండలి ప్రతిపాదనతో సెక్రటరీ జనరల్ నియమింపబడతాడు. వివిధ దేశాలకు చెందిన అనేకమంది అధికారులు సెక్రటరీ జనరల్ పర్యవేక్షణలో పనిచేస్తారు. సచివాలయం ఐ.రా.స.కు చెందిన అన్ని రంగాలు రికార్డులను భద్రపరుస్తుంది. ఐ.రా.స. వివిధ రంగాల వార్షిక నివేదికలను జనరల్ అసెంబ్లీకి సమర్పిస్తాడు.

ప్రశ్న 2.
ఐక్యరాజ్య సమితి సాధించిన విజయాలను తెలపండి.
జవాబు:
ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించిన తొలినాళ్ళలో అనేక సమస్యలను పరిష్కరించడానికి కృషి చేసింది. కానీ అనేక సందర్భాలలో రష్యా వీటో హక్కును ఉపయోగించడం వలన కొన్ని సమస్యల పరిష్కారంలో ఆటంకాలు ఎదురయ్యాయి. అయినా ఐ.రా.స. స్థాపించబడిన కొద్ది కాలంలోనే అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేసింది. 1946లో రష్యా, ఇరాన్ ల మధ్య సమస్యను పరిష్కరించింది. ఫ్రాన్స్కు వ్యతిరేకంగా సిరియా, లెబనాన్ల వివాదం, డచ్-ఇండోనేషియా సమస్య, పాలస్తీనా సమస్య, కొరియా వివాదం, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి చొరవ చూపింది.

రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఇండోనేషియా ప్రజలు హాలెండ్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తమ దేశాన్ని స్వతంత్రంగా, రిపబ్లిక్ దేశంగా ప్రకటించుకున్నారు. హాలెండ్, ఇండోనేషియా స్వాతంత్య్రాన్ని తిరస్కరించడంతో ఇరు దేశాల మధ్య సాయుధ పోరాటం మొదలయ్యింది. భద్రతామండలి జోక్యం చేసుకుని ఇరు దేశాలను యుద్ధ విరమణకు అంగీకరింపజేసింది. ఇండోనేషియాకు స్వాతంత్య్రం ఇప్పించడంలో సాయపడింది.

పాలస్తీనా విషయంలో అరబ్లకు, బ్రిటన్కు మధ్య విభేదాలు రూపుమాపడానికి ఐ.రా.స. 1948 ఏప్రిల్లో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదికను అనుసరించి పాలస్తీనా నుండి సాయుధ బలగాలను తొలగించి దాని అంతర్గత విషయంలో జోక్యం చేసుకోవద్దని బ్రిటన్ ను ఐ.రా.స. ఆదేశించింది.

ఇజ్రాయేల్ మీద అరబ్లు దాడి చేసినపుడు ఐ.రా.స. జోక్యం చేసుకొని ఆయుధ పోరాటాన్ని నివారించి వాటి మధ్య యుద్ధ విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది. పాలస్తీనా కాందిశీకుల కొరకు సహాయ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారిని ఆదుకున్నది.

AP Inter 2nd Year History Study Material Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

రెండవ ప్రపంచ యుద్ధానంతరం కొరియా స్వాతంత్ర్యాన్ని పొందింది. కానీ, అది రెండుగా విభజింపబడింది. ఉత్తర కొరియా అప్పటి యు.ఎస్.ఎస్.ఆర్ ‘ నియంత్రణలోకి, దక్షిణ కొరియా అమెరికా, బ్రిటన్, చైనాల ఉమ్మడి నియంత్రణలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా, దక్షిణ కొరియాపై దాడిచేసింది. ఈ అంశంలో ఐ.రా.స. నిర్మాణాత్మక పాత్ర పోషించింది. జనరల్ మెక్ ఆర్థర్ నాయకత్వంలో దళాలను పంపి ఉత్తర కొరియా ఆగడాలను నియంత్రించింది. 1953లో ఇరుదేశాల మధ్య సంధి కుదిర్చి శాంతిని నెలకొల్పి యుద్ధాన్ని నివారించింది. 1966లో సూయజ్ కెనాల్ విషయంలో నెలకొన్న సంక్షోభాన్ని ఐ.రా.స. సమర్థవంతంగా పరిష్కరించింది.

ప్రశ్న 3.
ప్రచ్ఛన్న యుద్ధమనగానేమి ? అందులో భాగంగా ఏర్పడ్డ ఒడంబడికలు మరియు ప్రణాళికలను గురించి రాయండి.
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో రష్యా మరియు అమెరికాలు దగ్గరయ్యాయి. కానీ యుద్ధం అంతమైన తరువాత వారి సంబంధాలు కొంతమేర దెబ్బతిన్నాయి. వారి మధ్య శత్రుభావం ఏర్పడింది. ఈ వైరం యావత్ ప్రపంచాన్ని మూడవ ప్రపంచయుద్ధ అంచుల వరకు తీసుకొనిపోయింది. ఈ రెండు వ్యతిరేకశక్తుల మధ్య ఆయుధాలతో నిజమైన | పోరాటం జరగలేదు.

ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాల మధ్య ఉన్న సిద్దాంతపరమైన విభేదాలే ఈ ప్రచ్ఛన్న యుద్ధానికి కారణం. అమెరికా నాయకత్వంలోని పెట్టుబడిదారీ పాశ్చాత్యశక్తి, కమ్యూనిజంపై దాడి చేస్తుందేమోనని రష్యా భావించింది. అందువల్ల రష్యా తూర్పు యూరప్లో ఒక సోవియట్ కూటమిని ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించింది. యూరప్లో కమ్యూనిజం వ్యాప్తి, సోవియట్ యూనియన్ కూటమి అనేది పాశ్చాత్యదేశాలు, ప్రపంచంలో కమ్యూనిజం వ్యాప్తిని వ్యతిరేకించడానికి దారితీసాయి. ఈ దేశాలు మరో సైనికశక్తి కూటమిగా ఏర్పడ్డాయి. ఈ విధంగా ప్రపంచం రెండు విరుద్ధ శక్తి కూటములుగా విడిపోయింది. వీటిలో ఒకటి అమెరికా నాయకత్వంలోని పాశ్చాత్య శక్తి కూటమి కాగా మరొకటి యు.ఎస్.ఎస్.ఆర్. నాయకత్వంలోని ప్రాచ్యశక్తి కూటమి అయింది.

యు.ఎస్.ఎ. మరియు రష్యా దేశాల మధ్య మొదటగా విభేదాలు రావడానికి కారణం పోలెండ్, యుగోస్లేవియాల నాజీ వ్యతిరేక ప్రతిఘటన, సైనిక వ్యూహానికి యుద్ధానంతర పునర్నిర్మాణానికి సంబంధించిన సమన్వయం వంటి అంశాలలో ఇరుదేశాల మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి.

రెండవ ప్రపంచ యుద్ధానికి ముందునుండే యూరప్ దేశాలైన పోలెండ్, బల్గేరియా, రుమేనియా, హంగరీ, యుగోస్లేవియా దేశాలలో రష్యా కమ్యూనిస్ట్ పాలన విధించింది. ఆ తరువాత సోవియట్ యూనియన్ తన దృష్టిని పశ్చిమ యూరప్ వైపునకు మళ్ళించింది. రాయితీలు పొందడానికి ఇది టర్కీ మీద, ఇరాక్ మీద ఒత్తిడి చేసింది. గ్రీసు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ విప్లవం తీసుకురావడానికి పథకం వేసింది. ఇటలీలో తన ప్రభావాన్ని విస్తరించింది. సోవియట్ రష్యాలో చేపట్టిన ఈ చర్యలను పాశ్చాత్య దేశాలు గొప్ప ఆందోళనతో గమనించాయి.

కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే బాధ్యతను అమెరికా చేపట్టింది. యూరప్ ఖండంలో కమ్యూనిస్ట్ ప్రభావం పెరగడాన్ని అరికట్టడానికి ట్రూమన్ సిద్ధాంతాన్ని, మార్షల్ ప్రణాళికను ప్రతిపాదించింది. ఈ చర్యలు, ప్రతిచర్యలే ప్రచ్ఛన్న యుద్ధానికి నాంది పలికాయి.

ట్రూమన్ సిద్ధాంతము: గ్రీస్, టర్కీలకు సైనిక ఆర్థిక సహాయం అందించడానికి సంబంధించిన ప్రతిపాదనే ట్రూమన్ సిద్ధాంతం. సాయుధ తిరుగుబాట్లు లేదా విదేశీ ఒత్తిడి ద్వారా స్థానికులను అణచడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించే ప్రజలకు సహాయం అందించే అమెరికా విధానాన్ని ట్యూమన్ సిద్ధాంతం అన్నారు. ఈ సిద్ధాంతం ఈ రెండు దేశాలలో విజయవంతమైంది.

మార్షల్ ప్రణాళిక: యూరప్లో కమ్యూనిజం పెరుగుదలను నివారించడానికి అమెరికా ఒక యూరప్ ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అమెరికా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ‘మార్షల్ ప్రణాళిక’ గా పేర్కొనడం జరిగింది. అమెరికా రాజ్య కార్యదర్శి అయిన మార్షల్ పేరునే దీనికి పెట్టడం జరిగింది.

ట్రూమన్ సిద్ధాంతానికి పొడిగింపే మార్షల్ ప్రణాళిక. ఈ ప్రణాళిక సర్వ సాధారణంగా యూరప్్కంతా వర్తిస్తుంది. ఇది ఒక ప్రత్యేక రాజ్యానికి పరిమితమైనది కాదు. ఇది నాలుగు సంవత్సరాల పాటు కొనసాగింది కాబట్టి విస్తృతమైన కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించింది. రెండవ ప్రపంచ యుద్ధం వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి దీన్ని ఉద్దేశించడమైనది. కమ్యూనిజంకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనే అమెరికా దృఢ నిశ్చయాన్ని కూడా ఇది స్పష్టం చేసింది. ఈ ప్రణాళిక ప్రకారం యూరప్ లోని అనేక దేశాలు రెండవ ప్రపంచ యుద్ధానికి ముందున్న పటిష్ట స్థితికి చేరాయి. ఈ నేపథ్యంలో అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగి అనేక ఒప్పందాలు,
సంధులకు దారితీసాయి.

బ్రస్సెల్స్ సంధి: రష్యా ఆధిపత్యాన్ని నివారించడానికి బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, లగ్జంబర్గ్ మొదలైన దేశాలు 1948 మార్చిలో బ్రస్సెల్స్ సంధి మీద సంతకాలు చేసాయి. ఈ సంధి పరస్పర సైనిక, ఆర్థిక, రాజకీయ సహకారాన్ని సమకూర్చింది.

నాటో: 1949 ఏప్రియల్ 4న సోవియట్ కూటమికి వ్యతిరేకంగా అమెరికా, కెనడా, బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, ఇటలీ, ఇంగ్లాడ్, లగ్జంబర్గ్, నెదర్లాండ్, నార్వే, పోర్చుగల్, గ్రీస్, టర్కీ దేశాలతో కలిసి నాటో ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది సోవియట్ కూటమికి వ్యతిరేకంగా ఏర్పాటయిన రక్షణాత్మక వ్యవస్థ. నాటో సభ్యులు విదేశీ దురాక్రమణకు వ్యతిరేకంగా వ్యష్టిగాకాని, సమిష్టిగా కాని పోరాడటానికి సంయుక్తంగా ప్రతిఘటించడానికి అంగీకరించారు. నాటో ఒప్పందం తర్వాత పశ్చిమ యూరప్ లో యుద్ధం జరగలేదు.

మాల్తోవ్ ప్రణాళిక: దీనిని రష్యా విదేశాంగ మంత్రి మాల్తోవ్ ప్రతిపాదించాడు. ఈ ప్రణాళికలో కమ్యూనిస్టు దేశాలన్నింటికి సభ్యత్వం ఉండేది. దీనిలో రష్యా, బల్గేరియా, పోలెండ్, రుమేనియా, తూర్పు యూరప్, మంగోలియా సభ్యులుగా ఉన్నారు. మార్షల్ ప్రణాళికకు ప్రతిచర్యగా రష్యా ప్రారంభించింది.

AP Inter 2nd Year History Study Material Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

వార్సా సంధి: అమెరికా ఏర్పాటు చేసిన నాటోకు వ్యతిరేకంగా 1955 మేలో రష్యా కమ్యూనిస్టు దేశంతో ఈ ఒప్పందాన్ని ప్రతిపాదించింది. అల్బేనియా, రష్యా, బల్గేరియా, హంగేరీ, తూర్పు జర్మనీ, జెకోస్లోవేకియా, రుమేనియా, పోలెండ్ దేశాలు ఆ ఒప్పందంపై సంతకం చేసారు. సంధి ప్రకారం ఏ సభ్యదేశమయినా విదేశీ ముట్టడికి గురైతే ఇతర సభ్యదేశాలన్ని ఆ ముట్టడిదారుడిని సమిష్టిగా ప్రతిఘటించాలి.

ఈ రెండు కూటముల విభజన 1991 డిసెంబర్ లో సోవియట్ సమాఖ్య పతనానంతరం గొప్ప మార్పులకు లోనయింది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అలీనోద్యమ ఆవిర్భావం గురించి వ్రాయండి.
జవాబు:
అమెరికా, రష్యాలు రెండు కూటములుగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న రోజులలో అలీనోద్యమం 1961లో ప్రారంభమయింది. కొత్తగా స్వాతంత్రాన్ని పొందిన ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాలలోని కొన్ని వారు కలిసి ఈ అలీనోద్యమాన్ని ప్రారంభించారు.

అలీనోద్యమం 1955 బాండుంగ్ సదస్సులో అంకురార్పణ జరిగింది. 23 ఆసియా దేశాల, 6 ఆఫ్రికా దేశాల ప్రతినిధులు ఇండోనేషియాలో సదస్సులో పాల్గొన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు సుకార్నో, భారతదేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ,ఈజిప్ట్కు చెందిన నాజర్ అలీనోద్యమంలో కీలక పాత్ర వహించారు. చైనా ప్రధాని చౌ-ఎన్-లై కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. అలీనోద్యమ ముఖ్య ఉద్దేశాలను పంచశీల అంటారు. అవి:

  1. సభ్యదేశాల సార్వభౌమాధికారాన్ని, వారి సహజ సరిహద్దులను గౌరవించుట.
  2. సభ్యదేశాలు పరస్పరం యుద్ధానికి దిగరాదు..
  3. ఒకరి ఆంతరంగిక విషయాలలో మరొకరు జోక్యం చేసుకోరాదు.
  4. పరస్పర లాభాల కోసం సహకారాన్ని పెంచుకోవాలి.
  5. శాంతియుతంగా సభ్యదేశాలతో మెలగుట.

అలీనోద్యమాన్ని బలపరచిన దేశాలు ప్రచ్ఛన్న యుద్ధంలో భాగమైన అమెరికా కూటమిలోగాని, సోవియట్ కూటమిలోగాని చేరడానికి ఇష్టపడలేదు. ఆ విధంగా అలీనోద్యమం కొత్తగా స్వాతంత్రాన్ని పొందిన దేశాలు వారి స్వాతంత్రాన్ని కాపాడుకొంటూ అంతర్జాతీయ సమస్యలందు తటస్థంగా ఉండటానికి ఉద్దేశించబడింది.

ప్రశ్న 2.
నమీబియా ఎదుర్కొన్న సమస్యను గురించి SWAPO ఏవిధంగా పరిష్కరించిందో తెలపండి.
జవాబు:
దక్షిణ పశ్చిమ ఆఫ్రికా ప్రజల సమాఖ్య (SWAPO) ప్రస్తుతం నమీబియాగా ఏర్పడింది. ఈ ప్రాంతం జర్మనీ దేశానికి వలసగా మారింది. అక్కడి ఆఫ్రికా ప్రజలు జర్మనీ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించారు. జర్మనీ వారు కౄరంగా 80 వేల మంది నమీబియన్లను చంపివేశారు.

మొదట ప్రపంచ యుద్ధంలో జర్మనీ దక్షిణాఫ్రికా చేతిలో ఓడటంతో నానాజాతి సమితి నమీబియాను పశ్చిమ |ఆఫ్రికా పాలనతో ఉండేట్లు ఏర్పాటు చేసింది. కానీ దక్షిణాఫ్రికా వారు నమీబియాను ఆక్రమించుకున్నారు. 1968లో దక్షిణ పశ్చిమ ఆఫ్రికాకు నమీబియా అని నామకరణం చేసారు. భద్రతా మండలి వారు దక్షిణాఫ్రికాను నమీబియాపై ఆధిపత్యాన్ని వదలమని వత్తిడి చేసారు.

దక్షిణాఫ్రికా పాలనకు వ్యతిరేకంగా స్థానిక నమీబియాన్లను ఐక్యం చేయడానికి SWAPO (సౌత్ వెస్ట్ ఆఫ్రికా పీపుల్స్ ఆర్గనైజేషన్) ఏర్పడింది. వీరి ముఖ్య ఆశయం సంపూర్ణ స్వాతంత్రం. SWAPO గెరిల్లా యుద్ధం ముమ్మరంగా సాగించింది. 74 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత నమీబియా స్వాతంత్రాన్ని సాధించారు. SWAPO నాయకుడైన సామ్ నుజోమ్ స్వతంత్ర నమీబియాకు తొలి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు.

AP Inter 2nd Year History Study Material Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

ప్రశ్న 3.
ఐరోపా ఆర్థికమండలి వెనుక లక్ష్యాలను తెలుపండి.
జవాబు:
రెండు ప్రపంచ యుద్ధాల అనంతరం ప్రతి ఐరోపా దేశం వారు రెండు పెద్ద అగ్రరాజ్యాలతో పోలిస్తే చాలా చిన్న దేశాలుగా ఉన్నామని, బలహీనంగా ఉన్నామని భావించారు. అందువలన ఐరోపా దేశాల వారు పరస్పర స్నేహాన్ని, సహకారాన్ని పెంపొందించుకోవాలని అందరూ కలిసి సమిష్టి రాజకీయ, ఆర్థిక, సైనిక కృషి చేయాలని నిర్ణయించారు.

1947లో 16 ఐరోపా దేశాలవారు కలిసి అమెరికా వారి మార్షల్ పథకం ద్వారా లభించే సహాయాన్ని పంచుకోవడానికి ఒక సమాఖ్యగా ఏర్పడ్డారు. 1949లో నాటో ఏర్పడింది. 1951లో ఆరు పశ్చిమ ఐరోపా దేశాలు బొగ్గు, ఉక్కు ఖనిజాలకు సంబంధించి సంయుక్త వాణిజ్యాన్ని నిర్వహించుకోవడానికి సమాఖ్యగా ఏర్పడ్డారు.

ఐరోపా ఆర్థిక సమాఖ్య ‘రోమ్ ఒప్పందం’ ద్వారా 1957లో ఏర్పడింది. యూరప్ లోని అనేక దేశాల వారు దీనిలో సభ్యులు. వీరు వెనుకబడిన దేశాల వారి వస్తువులను దిగుమతి చేసుకునేది మరియు వాణిజ్యాన్ని ఐరోపా ఆర్థిక సమాఖ్య వారే నిర్వహించేవారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం బ్రెసెల్స్ లో ఉంది. సభ్య దేశాల మధ్య ఏర్పడే ఆర్థికపరమైన వివాదాలను పరిష్కరిస్తూ, స్నేహపూరిత వాతావరణం నెలకొల్పటానికి కృషి చేస్తుంది. చివరగా ఈ యూనియన్ ‘యూరో’ అనే ఒక సంయుక్త ద్రవ్య చలామణి ఏర్పాటు చేసింది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
OPEC సంస్థలో సభ్యులు ఎవరు ?
జవాబు:
చమురు ఉత్పత్తిచేసే దేశాల వారు 1962లో బాగ్దాద్ నగరంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో చమురు ఉత్పత్తి చేసే దేశాల వారు ఒక సమాఖ్యగా ఏర్పడ్డారు. దీనిని OPEC (ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్) అంటారు. ఈ సమావేశానికి ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులా దేశాల వారు హాజరయ్యారు. కాలక్రమేణా ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని అనేక చమురు ఉత్పత్తి దేశాల వారు ఇందులో చేరారు. OPEC ప్రధాన కార్యాలయం ఆస్ట్రియాలోని వియన్నాలో నెలకొల్పారు.

ప్రశ్న 2.
సార్క్ సంస్థ సభ్యదేశాలు ఏవి ?
జవాబు:
దక్షిణాసియాలో ఆర్థికాభివృద్ధి, సామాజిక ప్రగతి, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించుట, స్వావలంబన లక్ష్యంలో సార్క్న ఏర్పాటు చేయడం జరిగింది. SAARC (సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోపరేషన్)ను దక్షిణాసియా ప్రాంత దేశాలు 1985లో ఢాకా నగరంలో జరిపిన శిఖరాగ్ర సమావేశంలో స్థాపించారు. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు ఇందులో సభ్యదేశాలు.

AP Inter 2nd Year History Study Material Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

ప్రశ్న 3.
అట్లాంటిక్ చార్టర్.
జవాబు:
ఆగస్ట్ 1944న అమెరికా అధ్యక్షుడు F.D. రూజ్వెల్ట్, బ్రిటన్ ప్రధానమంత్రి అట్లాంటిక్ సముద్రం మీద సమావేశమై ఒక తీర్మానాన్ని రూపొందించారు. దానిని అట్లాంటిక్ చార్టర్ అంటారు.

దాని లక్ష్యాలు: అంతర్జాతీయ శాంతి భద్రతలు పెంచడం, దేశాల మధ్య స్నేహాన్ని పెంచడం, ప్రజల ప్రాథమిక హక్కులను గుర్తించడం. చార్టర్ సుత్రాల ప్రకారం సభ్యదేశాల మధ్య సమానత్వాన్ని అంగీకరించాలి. తమలోని విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఏదైనా దేశం ఐక్యరాజ్య సమితి తీర్మానాలను ఉల్లంఘిస్తే ఐక్యరాజ్య సమితి తీసుకునే చర్యలకు అండగా ఉండాలి.

AP Inter 2nd Year History Study Material Chapter 12 ఆధునికతకు మార్గాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 12th Lesson ఆధునికతకు మార్గాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 12th Lesson ఆధునికతకు మార్గాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చైనాలో జరిగిన నల్లమందు యుద్ధాలకు గల కారణాలు, యుద్ధ ఫలితాలు ఏవి ?
జవాబు:
బ్రిటన్ ఉత్పత్తులకు చైనాలో గిరాకీ లేదు. కానీ చైనా పింగాణి, తేయాకు, పట్టు వస్త్రాలకు యూరప్ లో డిమాండ్ ఉండేది. అందువల్ల బ్రిటీష్వారు వారి వ్యాపార వస్తువులలో నల్లమందును కూడా చేర్చారు. భారతదేశంలో పండించే నల్లమందును రహస్యంగా బ్రిటీష్వారు ఇంగ్లాండ్కు ఎగుమతి చేసి విపరీతమైన లాభాలు పొందారు. చైనాలో నల్లమందు నిషిద్ధం. ఫలితంగా రెండు దేశాల మధ్య మొదటి నల్లమందు యుద్ధం క్రీ.శ. 1839 నవంబర్ లో ప్రారంభమై మూడు సంవత్సరాలు జరిగింది. ఈ యుద్ధంలో చైనా ఓడిపోయింది. 1842లో నాన్ కింగ్ ఒప్పందం యూరోపియన్ల వ్యాపారానికి చైనా ద్వారాలు తెరుచుకున్నట్లయింది.

నౌకలలో దొంగ రవాణా జరుగుతోందన్న ఆరోపణలపై 12 మంది బ్రిటీష్ వారిని చైనా నిర్బంధించింది. ‘అగస్టీ చాప్ కులీన్’ అనే మత ప్రచారకుడిని తిరుగుబాటుదారుడనే అనుమానంతో చైనా ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ఈ రెండు సంఘటనలు రెండవ నల్లమందు’ యుద్ధానికి దారితీసాయి. పెకింగ్ సంధితో ఆ యుద్ధం ముగిసింది. యుద్ధ

ఫలితాలు: ఈ రెండు నల్లమందు యుద్ధాల ఫలితంగా చైనీయులు పాశ్చాత్య దృక్పథానికి దగ్గరయ్యారు.

  • పాశ్చాత్యులను అనుకరించడం ద్వారా బలమైన శక్తిగా ఎదగవచ్చని చైనీయులు భావించారు.
  • చైనాలోని సంస్కర్తల కృషి మూలంగా చైనీయులు యూరోపియన్ల భాషలు, ఇంజనీరింగ్ విద్య, సైనిక పద్ధతులను నేర్చుకున్నారు.
  • చైనాలో పారిశ్రామికీకరణ, బొగ్గు గనుల త్రవ్వకం ప్రారంభమైనాయి.
  • చైనాలో ‘కాంగ్యువై “శతదిన సంస్కరణలు” ప్రారంభించాడు. పాఠశాలలో పాశ్చాత్య విద్యా విధానం, పోటీ పరీక్షల విధానం ప్రవేశపెట్టారు.
  • పెకింగ్ విశ్వ విద్యాలయం స్థాపన, విదేశీ గ్రంథాల అనువాదం మొదలైన వాటి ఫలితంగా 1911లో చైనాలో విప్లవం వచ్చింది.

AP Inter 2nd Year History Study Material Chapter 12 ఆధునికతకు మార్గాలు

ప్రశ్న 2.
సన్ట్సేన్ భావాలు ఏవి ? అతడు ఆ భావాలను చైనాలో అమలుపరచిన తీరును వివరింపుము.
జవాబు:
చైనాలో 1911వ సంవత్సరంలో వచ్చిన ప్రజాతంత్ర విప్లవానికి నాయకుడు ‘సన్మెట్సేన్’. ఇతడు క్రీ.శ. |1866వ సంవత్సరంలో కాంటన్ గ్రామంలో ఒక కర్షక కుటుంబంలో జన్మించాడు. చైనా తత్త్వవేత్త కన్ఫూషియస్ సిద్ధాంతాలకు ప్రభావితుడై చైనాలో జాతీయభావం, ప్రజాస్వామ్య భావజాలం, ఆధునిక దృక్పథాన్ని పెంపొందించి రిపబ్లిక్ స్థాపన ఆశయంతో చైనాలో ‘సన్ట్సేన్’ ‘తుంగ్మెంగ్ హూయి’ అనే విప్లవ సంస్థను స్థాపించాడు. పార్లమెంటరీ ప్రభుత్వ స్థాపనే తన ధ్యేయం అని ప్రకటించాడు. విద్యార్థులు, యువకులు దీనిలో సభ్యులయ్యారు. చైనా ప్రజలను ఇసుక రేణువులతో పోల్చుతూ వాటిని అనుసంధానం చేయడానికి దృఢతరం చేసే జాతీయభావం అనే సిమెంట్ అవసరం అన్నాడు. ప్రజలకు జీవనోపాధి కల్పించే బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించాలన్నాడు. పెట్టుబడిని క్రమబద్దీకరించి, భూమిని సమానంగా పంచాలని ప్రబోధించాడు.

సనీయెట్సేన్ తను స్థాపించిన ‘తుంగ్మెంగ్ హూయి’ ని రద్దుచేసి జాతీయ లక్ష్యాలతో కొమిన్టింగ్ అనే జాతీయ రాజకీయ పార్టీని స్థాపించాడు. కొమిన్టింగ్ అంటే జాతీయ పక్షం అని అర్థం. క్రమంగా కొమిన్హాంగ్ పార్టీ బలపడింది. మేధావి వర్గం అభివృద్ధి చెందింది, పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. పట్టణాలు, నగరాలు విస్తరించాయి. ఆధునిక విజ్ఞానం, ప్రజా ప్రభుత్వం, జాతీయవాదం మొదలైన వాటి ద్వారా చైనాను అభివృద్ధి పథంలో నడిపించాలని కొమిన్టంగ్ ఆకాంక్ష. కొమిన్లాంగ్ పట్టణీకరణ, పారిశ్రామికాభివృద్ధి కేంద్రంగా షాంగై నగరాన్ని వృద్ధి చేశారు. నౌకా నిర్మాణం అభివృద్ధి చెందింది. ఆధునిక పరిశ్రమలు ఏర్పాటు చేయబడ్డాయి. వీటి ద్వారా ఉద్యోగ, వర్తక, వ్యాపార, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. స్త్రీలు కూడా భాగస్వాములయ్యారు. ఉత్తర, దక్షిణ చైనాల ఏకీకరణకు కృషి చేసాడు. ‘సన్యాట్సన్’ చైనా జాతిపితగా ప్రసిద్ధికెక్కాడు.

ప్రశ్న 3.
మేజి పునః ప్రతిష్టకు దారితీసిన సంఘటనలను తెలపండి.
జవాబు:
టోకుగవా పాలన పట్ల సమాజంలోని అన్ని వర్గాలలో అసంతృప్తి ప్రారంభమైంది. 1866లో దైమ్యోలు కూడా తిరుగుబాటు చేసారు. 1868లో చక్రవర్తి, సైన్యాలు, దైమ్యోలు కలిసి టోకుగవా సైన్యాలను ఓడించాయి. ఆఖరి షోగున్ ‘హితోతిసుబాషి’ లొంగిపోయాడు. టోకుగవా షోగునెట్ అంతమైంది. చక్రవర్తి మత్సుహిటో సర్వాధికారాలతో ‘మెడో’ లో సింహాసనం అధిష్టించాడు.

టోకుగవా షోగునెట్ పతనమై, చక్రవర్తి తిరిగి అధికారంలోకి రావడంతో జపాన్లో మొయిజీ ప్రభుత్వ స్థాపన జరిగింది. ‘మెయిజీ’ అనగా ‘విజ్ఞతతో వ్యవహరించడం’ అని అర్థం. క్రీ.శ. 1868లో అధికారం చేపట్టిన ‘మత్సుహిటో’ రాజ్యాంగబద్ధ రాజరికాన్ని రూపొందించి, భూస్వామ్య వ్యవస్థను రద్దుచేసి, సాంప్రదాయ వ్యవస్థలకు స్వస్తిచెప్పి జపాన్ను పాశ్చాత్యీకరిస్తూ మొయిజీ పాలన సాగించాడు. మారుతున్న పరిస్థితులకనుగుణంగా ప్రభుత్వం, ప్రజలు ఇచ్చిపుచ్చుకునే తోడ్పాటు ఫలితంగా జపాన్ స్వల్పకాల వ్యవధిలో అద్భుత ప్రగతిని సాధించింది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కన్ఫూషియస్
జవాబు:
ప్రపంచంలోని అత్యుత్తమ దార్శనికులలో కన్ఫూషియస్ ఒకడు. ఇతడు క్రీ.పూ. 551లో జన్మించాడు. క్రీ.పూ. 479లో మరణించాడు. కన్ఫూషియస్ అనే పేరు కుంగ్ – ఫూట్జ్ అనే యూరోపియన్ పద రూపం. కుంగ్ అనగా గురువు అని అర్థం. ఇతని శిష్యులు ఇతనిని “కుంగ్-దీ-పూ” అని పిలిచేవారు. 22 సంవత్సరాల వయసులో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి చరిత్రను, కవిత్వాన్ని, మర్యాదలను గురించిన అంశాలను బోధించాడు. ఇతడు “పంబ్లింగ్” అనే ఐదు గ్రంథాలను వ్రాశాడు. అవి.

  1. లీ – ఛీ: ప్రాచీన శాస్త్ర విధులను తెలియజేస్తుంది.
  2. ఈ-జింగ్: ఆత్మతత్త్వ విద్యలకు చెందినది.
  3. జింగ్: మానవుని నైతిక విలువలను వివరిస్తుంది.
  4. చూన్ చ్యూ: ఇది ‘లూ’ రాష్ట్ర చరిత్రను వివరిస్తుంది.
  5. ఘాజింగ్: చైనా ప్రాచీన చరిత్రను తెలియజేస్తుంది.

ప్రశ్న 2.
మావోజెడాంగ్
జవాబు:
ఆధునిక చైనా నిర్మాత మావోసెటుంగ్ (మావోజెడాంగ్) 1893 డిసెంబర్ 26న హూనాన్ రాష్ట్రంలోని ఒక సంపన్న కర్షక కుటుంబంలో జన్మించాడు. విద్యాభ్యాసం అనంతరం 1918లో పెకింగ్ గ్రంథాలయ ఉద్యోగిగా కొంతకాలం పనిచేసాడు. అక్కడ మార్కిస్ట్ సిద్ధాంతాలను బాగా ఆకళింపు చేసుకున్నాడు. మావో 1911 విప్లవం వలన ప్రభావితుడయ్యాడు. పెకింగ్ యూనివర్సిటీలో ఉన్న కాలంలో మావో మార్కిస్టు లెనినిస్ట్ భావాలకు ఆకర్షితుడయ్యాడు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా స్థాపించడంలో కీలకపాత్ర వహించాడు. రష్యాలో ఏర్పడిన కర్షక సోవియట్ల స్ఫూర్తితో కియాంగీని రాష్ట్రాన్ని ఎంపిక చేసుకొని చైనా సోవియట్లను ఏర్పరచాడు. భూమి మొత్తం కమ్యూనిస్ట్ల వశమైంది. తరువాత కాలంలో 1949 అక్టోబర్ లో జరిగిన కమ్యూనిస్ట్ విప్లవం విజయవంతమై మావోజెడాంగ్ అధ్యక్షుడిగా, చౌఎన్ ప్రధానిగా చైనాలో ప్రజా రిపబ్లిక్ ఏర్పడింది.

AP Inter 2nd Year History Study Material Chapter 12 ఆధునికతకు మార్గాలు

ప్రశ్న 3.
టోకుగవా షోగునెట్
జవాబు:
1603లో టోకుగవా వంశీయులు షోగున న్ను చేజిక్కించుకుని 1868 వరకు పాలించాయి. ఈ కాలాన్ని ‘టోకుగవా ‘షోగునెట్’ అంటారు. 265 సంవత్సరాల వీరి పాలనలో భూస్వామ్య వ్యవస్థను, దైమ్యోలను అదుపులో ఉంచింది. సైనిక శక్తి మీద ఆధారపడి టోకుగవా అధికారాన్ని చెలాయించింది. పరిపాలన కోసం ఉద్యోగస్వామ్యాన్ని ఏర్పరిచింది. టోకుగవా పాలనలో శాంతి, సుస్థిరత ఉన్నా క్రమంగా సమాజంలోని అన్ని వర్గాలలో అసంతృప్తి ఏర్పడింది. టోకుగవా రాజధాని ‘యెడో’ కాగా చక్రవర్తి ‘క్యోటో’ లో నివసించాడు. ఇంగ్లండ్, రష్యాలతో కుదుర్చుకున్న ఒప్పందంతో టోకుగవా అప్రదిష్టపాలైంది. 1866లో దైమ్యోలు తిరుగుబాటు చేసారు. 1868లో చక్రవర్తి సైన్యాలు, దైమ్యోలు కలిసి టోకుగవా సైన్యాలను ఓడించాయి. ఆఖరి షోగున్ ‘హితోతి సుబాషి’ లొంగిపోయాడు. టోకుగవా షోగునెట్ అంతమైంది.

AP Inter 2nd Year History Study Material Chapter 11 చెదిరిన స్థానిక ప్రజలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 11th Lesson చెదిరిన స్థానిక ప్రజలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 11th Lesson చెదిరిన స్థానిక ప్రజలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఐరోపా సామ్రాజ్యవాదం గూర్చి వ్రాయుము.
జవాబు:
17వ శతాబ్దం వరకు స్పెయిన్, పోర్చుగల్ దేశాల వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలు అంతగా విస్తరించలేదు. కాని బ్రిటన్, ఫ్రాన్స్, హాలెండ్ దేశాలు తమ వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలను విస్తరిస్తూ ఉత్తర అమెరికా, ఆఫ్రికా, ఆసియా ప్రాంతాలలో వలసలు ఏర్పాటును ప్రారంభించాయి. ఐర్లాండ్, బ్రిటన్ వలస ప్రాంతం. ఐర్లాండ్లోని భూ యజమానులందరూ బ్రిటన్ నుండి వచ్చి స్థిరపడినవారు. 18వ శతాబ్దంలో దక్షిణ ఆసియా, ఆఫ్రికాలలోని వర్తకులు, స్థానికులు, ప్రజలలో జోక్యం చేసుకొని వలసలలో వచ్చిన సమస్యలను పరిష్కరిస్తుండేవారు.

బ్రిటిష్ వర్తక సంఘం ఈస్టిండియా కంపెనీ స్థానికులను వంచించి, నమ్మకద్రోహం చేసో, ఓడించో, వారి పాలకులను ప్రలోభపెట్టి వారి ప్రాంతాలను ఆక్రమించడం ప్రారంభించారు. వారి నుండి పన్నులు వసూలు చేసి స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. తర్వాత బ్రిటిషు వారు తమ వర్తక వాణిజ్యాభివృద్ధి కొరకు రైలు, రోడ్డు రవాణా మార్గాలను, సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. ఆఫ్రికా రాజ్యాలను జయించి వాటిని తమ వ్యాపార కేంద్రాలుగా, వలస ప్రాంతాలుగా మార్చివేసారు. 19వ శతాబ్దంలో వలస ప్రాంతాల ప్రజల ముఖ్య వ్యవహారిక భాష ఆంగ్లం.

AP Inter 2nd Year History Study Material Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

ప్రశ్న 2.
17వ శతాబ్దంలో అమెరికాలో స్థిరపడ్డ ఐరోపావాసులు గురించి వివరించుము.
జవాబు:
మతపరమైన అంశాలపై స్థానిక ప్రొటెస్టెంట్ క్రైస్తవులకు, ఐరోపా క్యాథలిక్ లకు మధ్య కొన్ని వైవిధ్యాలు ఉండేవి. అలాంటి భావాలు గల ఐరోపావాసులలో చాలామంది అమెరికాకు వలస వచ్చి నూతన జీవితాన్ని ప్రారంభించారు. వారు అడవులను నరికి వ్యవసాయ భూములను ఏర్పాటు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు థామస్ జఫర్సన్ అభిప్రాయం ప్రకారం “ఐరోపా ప్రజలచే ఏర్పాటు చేయబడిన చిన్న భూ కమతాలలో స్థానిక ప్రజల అవసరాలకు మాత్రమే పంటలు పండించారు కానీ లాభం కోసం కాదు. స్థానికులు భూమిని సొంతం చేసుకోకపోవడమే వారు అనాగరికులుగా మారడానికి కారణం” అని పేర్కొన్నాడు.

తరువాత 18వ శతాబ్దంలో అమెరికా, కెనడాలు తమ సుస్థిరత్వాన్ని నిలబెట్టుకొని క్రమంగా ఒక శతాబ్దం కాలానికి అనేక భూములను ఆక్రమించుకున్నాయి. అమెరికా, ఫ్రాన్స్ల నుండి విశాలమైన భూభాగాన్ని కొనుగోలు చేసి ‘దానికి ‘లూసియానా’ అని పేరు పెట్టింది. రష్యా నుండి ‘అలాస్కా’, దక్షిణ మెక్సికో నుండి కొన్ని ప్రాంతాలను పొందింది. దీనితో అమెరికా భౌగోళిక పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది. ఇంగ్లండ్, ఫ్రాన్స్ల నుండి వచ్చిన వలస ప్రజలు అమెరికాలో స్థిరపడాలని కోరుకున్నారు. అదే విధంగా జర్మనీ, స్వీడన్, ఇటలీల నుండి వచ్చిన ప్రజలు కూడా భూములను స్వాధీనం చేసుకొని వాటిని వ్యవసాయ క్షేత్రాలుగా మార్చివేసారు. పోలెండ్ ప్రజలు ‘స్టెప్పీలు’ అనేవారి నుండి గడ్డిభూములు, ఇతర వ్యవసాయ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసారు. వాటిలో వ్యవసాయం చేయనారంభించారు.

అమెరికా దక్షిణ ప్రాంతం వేడి వాతావరణంతో కూడుకొని ఉంటుంది. దక్షిణ అమెరికాలోను, ఉత్తర అమెరికాలోను తమ వలసలలోని వ్యవసాయ భూములలో కూలీలుగా ఆఫ్రికా నుంచి నల్లజాతివారిని బానిసలుగా తెచ్చుకొనేవారు. వీరు చాలా దయనీయ స్థితిలో ఉండేవారు. ఉత్తర అమెరికాలోని కొందరు ఉదారవాదులు ఈ బానిస వ్యవస్థను ఖండించారు. 1864-65 మధ్య బానిస వ్యవస్థ అనుకూల, ప్రతికూలవాదుల మధ్య అంతర్యుద్ధం జరిగింది. తరువాత బానిస వ్యవస్థ రద్దు చేయబడింది. 20వ శతాబ్దానికి ముందు నల్ల జాతీయులు తెల్ల జాతీయులతో పాటు సమానంగా అమెరికాలో పౌరహక్కులు పొందారు.

స్థానికత కోల్పోయిన స్థానికులు అమెరికాలో స్థిరపడిన ఐరోపావాసులు స్థానికులైన అమెరికన్లను వారి ప్రదేశాల నుండి బలవంతంగా ఖాళీ చేయించాలనుకున్నారు. వారి మధ్య అనేకసార్లు సంప్రదింపులు జరిగాయి. ఐరోపావాసులు చాలా తక్కువ ధర చెల్లించి స్థానికుల నుండి భూమిని పొందారు. భూమి, పొందే విషయంలో జరిగే ఒప్పంద పత్రాలలోని మోసాన్ని స్థానికులు గ్రహించలేకపోయారు. అందువలన స్థానిక ప్రజలు వారి హక్కులను కోల్పోయి, చివరకు పరదేశీయులుగా మిగిలిపోయారు.

జార్జియా రాష్ట్రంలోని ‘చెరోకీ’ అనే గిరిజన తెగవారికి ప్రభుత్వం నుండి ఎలాంటి హక్కులు లేవు. 1832లో అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్మార్షల్ చెరోకీ ప్రజలకు సర్వ హక్కులను కల్పించాడు. అదే విధంగా అమెరికా అధ్యక్షుడైన ఆండ్రూజాన్సన్ గిరిజన తెగల ఆర్థిక, రాజకీయ అవకాశాల కొరకు పోరాడాడు. అమెరికా నుండి వారిని బయటకు పంపే ఎలాంటి చట్టాలకు అనుమతివ్వలేదు. స్థానికులు పశ్చిమ ప్రాంతానికి నెట్టివేయబడ్డారు. అక్కడ వారికివ్వబడిన భూములలో సీసం, బంగారం, ఇతర ఖనిజ సంపద అపారంగా లభించింది. ఎంతో మారణకాండతో, మోసంతో, ఆయుధబలంతో అమెరికాలోని స్థానికులను ఐరోపావాసులు వారిని మైనారిటీలుగా మార్చివేసారు.

ప్రశ్న 3.
అమెరికాలో 19వ శతాబ్దంలో జరిగిన పారిశ్రామికాభివృద్ధిని గురించి రాయుము.
జవాబు:
1840 ప్రాంతంలో కాలిఫోర్నియాలో బంగారపు నిధులను కనుగొనడం జరిగింది. ఈ విషయం తెలిసిన ఐరోపా వ్యాపారులు అమెరికాకు వలస వచ్చారు. దీని వలన బంగారపు గనులలో వేలాదిమందికి ఉపాధి లభించింది. రెండు ఖండాల మధ్య 1870 ప్రాంతంలో రైలు మార్గాల నిర్మాణం జరిగింది. “ఆండ్రూకర్నేగి” అనే వలస కూలి కొద్ది కాలంలోనే ధనవంతుడిగా మారిపోయాడు.

AP Inter 2nd Year History Study Material Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవ ప్రారంభదశలో అనేకమంది రైతులు, పెద్ద భూస్వాములకు తమ భూములు ఇచ్చి ఫ్యాక్టరీలలో, పరిశ్రమలలో ఉపాధి పొందారు. అదే విధంగా ఉత్తర అమెరికాలో కూడా పారిశ్రామిక, రవాణా రంగాలలో గొప్ప మార్పులు వచ్చాయి. అమెరికా, కెనడాలలో పట్టణాలు, నగరాలు పెరిగాయి. ఈ పరిణామాలన్నీ త్వరితగతిన ఆర్థికాభివృద్ధి సాధించడానికి దోహదపడ్డాయి. వ్యవసాయ భూమి విస్తరించబడి వ్యవసాయాభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధి ద్వారా హవాయ్, ఫిలిప్పీన్స్ మొదలైనచోట్ల వలసలు స్థాపించి క్రమంగా అమెరికా ఒక బలమైన దేశంగా ఆవిర్భవించింది.

AP Inter 2nd Year History Study Material Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 10th Lesson జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్ Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 10th Lesson జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కౌంట్్కవూర్ జీవితం, ఇటలీ ఏకీకరణలో అతని పాత్ర ఎట్టిది ?
జవాబు:
ఇటలీ ఏకీకరణ కోసం పోరాడిన ముఖ్య నాయకుడు కౌంట్-కామిలో-డి-కవూర్’. ఇతడు 1810 సంవత్సరంలో పీడ్మాంట్లో భూస్వామ్య కుటుంబంలో జన్మించాడు. యుక్తవయస్సులో సార్టీనియా సైన్యంలో ఇంజనీర్గా పనిచేసాడు. ఇతడు ప్రజాస్వామ్య, పార్లమెంటరీ విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. పీడ్మాంట్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1850లో ఇతనిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 1852లో సార్జీనియా ప్రధానమంత్రి అయ్యాడు. ఆంగ్ల రచయితల ప్రభావం వల్ల కవూర్ వివిధ రంగాలలో ఆరితేరాడు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలకు వెళ్ళి సమగ్రమైన, విశాలమైన భావాలను అవగాహన చేసుకున్నాడు. పీడ్మాంట్ నాయకత్వంలో ఇటలీ ఏకీకరణ సాధ్యమవుతుందని బలంగా నమ్మి రాజ్యాంగబద్ద రాజరికం స్థాపించాలని ఆశించాడు.

క్రిమియా యుద్ధం – ఫ్రాన్స్లో సంధి: కవూర్ ఇటలీ ఏకీకరణ కోసం ఇంగ్లాండ్, ఫ్రాన్స్లతో సంధి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంగ్లాండు పెద్ద సైన్యం లేకపోయినా యుద్ధాలలో మునిగి ఉంది. కాని ఫ్రాన్స్కు మంచి సైన్యం ఉంది. 3వ నెపోలియన్ ఆశాపరుడు, సాహసికుడు. కవూర్ 3వ నెపోలియన్కు దగ్గరయ్యాడు. అప్పుడు క్రిమియా యుద్ధం కవూర్కు మంచి అవకాశం కలిగించింది. ఫ్రాన్స్, ఇంగ్లాండ్లతో పొత్తు కుదుర్చుకుని రష్యాతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. రెండు సంవత్సరాల తర్వాత క్రిమియా యుద్ధంలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్లకు ఇటలీ చేసిన సేవలకు గుర్తుగా మూడవ నెపోలియన్ కవూర్ను ప్లాంబియర్స్కు ఆహ్వానించి ఆస్ట్రియాతో యుద్ధానికి కుట్ర పన్ని ఇటలీ నుంచి తరిమివేయడానికి అంగీకరించాడు.

ఫ్రాన్స్లో సంధి, ఆస్ట్రియాతో యుద్ధం: ఆస్ట్రియాను ఇటలీ నుండి పారద్రోలుటకు కవూర్కు ఫ్రెంచి సహాయం అవసరం. దీనికోసం 1858 జూలైలో ఫ్రెంచి రాజు 3వ నెపోలియన్, కవూర్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఆస్ట్రియాను లంబార్డీ, వెనీషియాల నుంచి పారద్రోలటానికి ఫ్రాన్స్ అంగీకరించింది. దీని ద్వారా సార్డీనియాతో అవి విలీనమౌతాయి. అందుకు ప్రతిఫలంగా పీడ్మాంట్ ఆధీనంలోని నైస్, సెవాయ్లను ఫ్రాన్స్ పొందుతుంది. ఆ తర్వాత 1859 ఏప్రిల్లో ఆస్ట్రియా సార్టీనియా సైన్యాన్ని తగ్గించమని హెచ్చరిక చేసింది. సార్డీనియా తిరస్కరించగా పార్టీనియా, ఆస్ట్రియా, ఫ్రాన్స్ల మధ్య యుద్ధం మొదలైంది.

AP Inter 2nd Year History Study Material Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

యుద్ధం 1859 ఏప్రిల్ నుండి జూలై వరకు జరిగింది. మిత్రరాజ్యాలు మాజెంటా, సల్ఫరినోలలో విజయాన్ని సాధించాయి. అయితే యుద్ధం మధ్యలో ఫ్రెంచి రాజు హఠాత్తుగా యుద్ధం నుంచి విరమించుకొని ఆస్ట్రియాతో జూలై 11, 1859లో విల్లా ఫ్రాంకా సంధి చేసుకున్నాడు. ఆ సమయంలో లంబార్డ్ పీడ్మాంట్ ఆధీనంలోను, వెనీషియా ఆస్ట్రియా ఆధీనంలోను ఉన్నాయి.

ఈ సంఘటనతో కవూర్ అసంతృప్తి చెంది తన పదవికి రాజీనామా చేసాడు. అయితే రాజు రాజీనామాను అంగీకరించలేదు. తరువాత జరిగిన పరిణామాల వల్ల మొడీనా, ఫార్మా, టస్కనీ, పోప్ రాష్ట్రాల రాజులు కవూర్ ప్రోద్భలంతో సార్టీనియా, పీడ్మాంట్లతో కలిసిపోవుటకు ముందుకొచ్చారు. విక్టర్ ఇమ్మాన్యుయేల్, కవూర్లు ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ఈ రాజ్యాలను సార్డీనియా, పీడ్మాంట్లలో 1860 మార్చి నెలలో ఏకం చేసారు. విక్టర్ ఇమ్మాన్యుయేల్ను ఇటలీ రాజుగా చేసి 2 ఏప్రియల్ 1860లో మొదటి పార్లమెంట్ సమావేశాన్ని ట్యురిన్లో ఏర్పాటు చేశారు. కవూర్ ప్రోద్భలం వల్ల చివరకు మూడవ నెపోలియన్ మనసు మార్చుకొని సెవాయ్, నైస్లను తీసుకొని ఇటలీ రిపబ్లికన్ను గుర్తించాడు.

ప్రశ్న 2.
జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర ఎటువంటిది ?
జవాబు:
బిస్మార్క్ 1815 సంవత్సరంలో బ్రాండెన్ బర్గ్ లోని ప్రభువుల కుటుంబంలో జన్మించాడు. ఇతడు గోటింజెన్, బెర్లిన్ విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసించి సివిల్ సర్వీస్లోకి వచ్చాడు. అయితే క్రమశిక్షణా రహిత్యం వల్ల బర్తరఫ్ అయ్యాడు. 1849 99 విప్లవ కాలంలో ఉదారవాదుల నుండి ప్రష్యా రాష్ట్రాన్ని కాపాడాడు. 1851లో బిస్మార్క్ రాజకీయ తత్వవేత్తగా చేరాడు. 1851 నాటికి బిస్మార్క్ రాజీలేని పోరాట యోధుడుగా, నాయకత్వ ప్రతిభ కలిగిన వాడుగా గణుతికెక్కాడు. విలియం బిస్మార్క్ పట్ల విశ్వాసంతో అతని మనస్తత్వాన్ని ఫ్రాంక్ఫర్డ్ జర్మనీ డైట్ లో ప్రష్యా ప్రతినిధిగా నియమించాడు. 1862లో రాజు విలియం బిస్మార్క్న ప్రధానమంత్రిగా నియమించాడు. అదే రోజు బిస్మార్క్ చేసిన నిర్ణయాలను పార్లమెంట్ తిరస్కరించగా, బిస్మార్క్ ఖచ్చితంగా తన నిర్ణయాలను పార్లమెంట్ ఆమోదం ఉన్నా లేకున్నా అమలు చేస్తానని చెప్పాడు. బిస్మార్క్ ధైర్యం వల్ల మొదటి విలియం జర్మనీ ఏకీకరణకు పార్లమెంట్తో పోరాడటానికి సిద్ధమయ్యాడు.

రక్తపాత విధానం: బిస్మార్క్ ముఖ్య ధ్యేయం జర్మనీ ఏకీకరణ ప్రష్యా ఆధీనంలో జరగాలని భావించడం. యుద్ధాల వల్ల జర్మనీ ఏకీకరణ సాధ్యము కాదని అతని అభిప్రాయం. “సమస్యలు, ఉపన్యాసాల వల్ల కాని, చర్చలు, సమావేశాలు, పార్లమెంట్ తీర్మానాల వల్లగాని పరిష్కరింపబడజాలవు. కఠిన దండనీతే దీనికి పరిష్కారం” అని పేర్కొన్నాడు. దీనినే ‘రక్తపాత విధానం’ అంటారు. బిస్మార్క్ జర్మనీ ఏకీకరణకు ఈ ‘రక్తపాత విధానం’నే అనుసరించాడు. తరువాత జర్మనీ ఏకీకరణ కోసం ప్రష్యా డెన్మార్క్ ను, ఆస్ట్రియాతోను, ఫ్రాన్స్ ను మూడు యుద్ధాలు చేసింది.

డెన్మార్క్తో యుద్ధం 1864: ఆస్ట్రియాతో యుద్ధం కోసం ఎదురు చూస్తున్న బిస్మార్క్కు ఫ్లెష్వగ్, హాల్టిస్టీన్ సమస్య అవకాశం కలిగించింది. ఈ రెండు సంస్థానాలు డెన్మార్క్ రాజు ఆధీనంలో ఉండేవి. ఇవి రెండు డెన్మార్క్ రాజు ఆధీనంలో ఉన్న వాటిని కలుపుకునే హక్కు అతనికి లేదు. 1863లో 9వ క్రిష్టియన్ సింహాసనం అధిష్టించి డేనిష్ ప్రజలు కోరిక మేరకు రెండు సంస్థానాలను విలీనం చేయడంలో ఆ సంస్థానాల్లో ఉన్న జర్మన్లు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించి తిరుగుబాటు చేసారు.

ఆస్ట్రియాతో సంధి: బిస్మార్క్ ఫ్లెష్వగ్, హాల్టిన్ సమస్య పరిష్కరించుటకు ఆస్ట్రియాతో సంధి కుదుర్చుకున్నాడు. 1864లో ప్రష్యా, ఆస్ట్రియా దేశాలు డెన్మార్క్ మీద యుద్ధం ప్రకటించి డెన్మార్క్న ఓడించాయి. డెన్మార్క్ రాజు ఆ ప్రాంతాలను ఆస్ట్రియా, ప్రష్యాలకు అప్పగించాడు.

ఆస్ట్రియాతో యుద్ధం: తరువాత కాలంలో బిస్మార్క్ ఆస్ట్రియాపై యుద్ధం చేయడానికి పన్నాగం పన్నాడు. తన దౌత్యనీతితో యూరప్ దేశాలు ఆస్ట్రియాకు అండగా నిలబడకుండా చేసాడు. రష్యా, ఫ్రాన్స్, సార్డీనియాలతో, ఇతర దేశాలతో ప్రత్యేక సంధులను చేసుకున్నాడు. చివరకు 1866 లో ప్రష్యా, ఆస్ట్రియాల మధ్య యుద్ధం జరిగింది. దీనిని AP ఏడు వారాల యుద్ధం అన్నారు. యుద్ధంలో ఓడిన ఆస్ట్రియా ‘ప్రేగ్సంధి’కి ఒప్పుకుంది. దీని ప్రకారం ప్రష్యాకు ‘హాల్టిన్’ ను ఇచ్చింది. ఉత్తర జర్మన్ రాష్ట్రాలు ప్రష్యా ఆధీనంలోకి వచ్చాయి.

దక్షిణ జర్మన్ రాజ్యాలు ఉత్తర జర్మన్ సమాఖ్యలో చేరుట: దక్షిణ జర్మన్ రాష్ట్రాలైన బవేరియా, వర్టంబర్గ్, బెడెన్, హెస్పె ఉత్తర జర్మన్ సమాఖ్యకు వెలుపల ఉన్నాయి. బిస్మార్క్ వీటి ఐక్యత కొరకు జర్మన్లలో ఫ్రెంచివారి పట్ల విముఖత కలిగేటట్లు చేసాడు. ఫ్రాన్స్లో చివరకు 1870లో ప్రష్యాకు యుద్ధం జరిగింది. బిస్మార్క్ తన కుటిలనీతితో ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగేలా చూసాడు. ఈ యుద్ధంలో ఫ్రాన్స్ ప్రష్యాకు లొంగిపోయింది.

ఫ్రాంకో-ప్రష్యా యుద్ధం తర్వాత జర్మనీ ఏకీకరణకు దక్షిణ జర్మన్ రాజ్యాలు ప్రష్యాలో విలీనానికి అంగీకరించాయి. జనవరి 18, 1871న మొదటి విలియం జర్మనీ చక్రవర్తిగా ‘వర్సే’ రాజప్రసాదంలో పట్టాభిషేకం జరుపుకున్నాడు. బెర్లిన్ జర్మనీ రాజధానిగా ప్రకటించబడింది.

తన యొక్క దండనీతి రక్తపాత విధానంతోపాటు సామ, దాన, దండ, భేదోప్రాయాలతో జర్మన్ ఏకీకరణ చేసి ‘ఐరన్ మ్యాన్’ అని కీర్తినిపొందాడు.

ప్రశ్న 3.
1866 ఆస్ట్రియా – ప్రష్యాల యుద్ధ వివరాలు తెలపండి.
జవాబు:
సమాఖ్య రాజ్యాల సేవలు ఆస్ట్రియాతో కలసి ప్రష్యామీద దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం తమకు యుద్ధం అనివార్యమైందని ప్రష్యా యుద్ధంలోకి దిగింది. కానీ యుద్ధానికి సిద్ధంగా లేని ఆస్ట్రియా ‘గాస్టిన్ ఒప్పందాన్ని’ 1865 ఆగస్ట్లో చేసుకుంది. దీని ప్రకారం ప్లేష్వగ్ ప్రష్యా ఆధీనంలోను, హాల్టిన్ ఆస్ట్రియా ఆధీనంలో ఉంటాయి. మరోవైపు ఆస్ట్రియాపై యుద్ధం ప్రకటించడానికి బిస్మార్క్ పన్నాగం పన్నాడు.

సంస్థానాల పంపకాన్ని నిరసించిన ఆస్ట్రియా ప్రాంక్ఫర్టోని జర్మనీ సమాఖ్య పార్లమెంట్కు ఫిర్యాదు చేసింది. ఆస్ట్రియా గాస్టిన్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని బిస్మార్క్ ఆరోపించాడు. బిస్మార్క్ భవిష్యత్తులో జరిగే ఆస్ట్రియా ప్రష్యా యుద్ధంలో ఐరోపా రాజ్యాలు ఆస్ట్రియావైపు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. తన దౌత్యనీతితో ఐరోపా రాజ్యాలు జోక్యం చేసుకోకుండా ఆస్ట్రియాను ఏకాకిని చేసాడు. రష్యా ఫ్రాన్స్, సార్డీనియా ఇతర దేశాలతో ప్రత్యేక సంధులను చేసుకున్నాడు. చివరకు ప్రష్యా, ఆస్ట్రియాల మధ్య జూన్ 1866లో యుద్ధం మొదలైంది.

AP Inter 2nd Year History Study Material Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

ప్రష్యా – ఆస్ట్రియాల మధ్య యుద్ధం ఏడువారాలు జరిగింది. అందువలన దీనిని ఏడువారాల యుద్ధమని కూడా అంటారు. సైనిక పాటవానికి పేరుగాంచిన ప్రష్యా సైన్యం ఆస్ట్రియాను సెడోవా వద్ద ఓడించింది. ఆస్ట్రియా సంధికై వేడుకొంది. ఫలితంగా ఇరువురికి మధ్య ప్రేగ్ సంధి జరిగింది.

ప్రేగ్ సంధి షరతులు: దీని ప్రకారం

  1. ఆస్ట్రియా, ప్రష్యాకు హాల్షన్ను, ఇటలీకి వెనీషియాను ఇచ్చింది.
  2. యుద్ధ నష్టపరిహారం చెల్లించటానికి ఒప్పుకున్నది.
  3. జర్మన్ రాష్ట్రాలతో ఉత్తర జర్మన్ సమాఖ్య ప్రష్యా నాయకత్వంలో ఏర్పడి ఫ్లెష్వగ్, హాల్టిన్, హోనోవర్, హెస్సే – కాస్సెల్, నాసా, ఫ్రాంక్ఫర్ట్లు ప్రష్యా ఆధీనంలో వచ్చాయి.
  4. జర్మన్ రాష్ట్రాలపై ప్రష్యా ఆధిపత్యాన్ని బిస్మార్క్ తొలగించాడు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఇటలీ ఏకీకరణకు గారిబాల్డి చేసిన సేవ ఎటువంటిది ?
జవాబు:
మాజినీ, కవుర్ వలె ఇటలీ ఏకీకరణకు పోరాడిన మరో నాయకుడు గారిబాల్డి. ఇతడు 1807లో ‘నైస్’లో జన్మించాడు. యంగ్ ఇటలీలో చేరాడు. 1834లో సెనాయ్ మాజనీ పన్నిన కుట్రలో పాల్గొని, విఫలమై మరణ శిక్షకు గురయ్యాడు తప్పించుకుని దక్షిణ అమెరికాకు పారిపోయి 14 సంవత్సరాలు ప్రవాస జీవితం గడిపాడు. తరువాతి కాలంలో గారిబాల్డి ‘రెడ్ షర్ట్స్’ అనే స్వచ్ఛంద సైనిక దళాన్ని నిర్మించి సిసిలీ ప్రజలకు అండగా నిలిచాడు.

గారిబాల్డి ప్రజాస్వామిక వాది. అంతకుమించిన గొప్ప దేశభక్తిపరుడు. జాతీయ సమైక్యత కోసం తన స్వప్రయోజనాన్ని ప్రక్కన పెట్టి సిసిలీ రాజ్యాన్ని విక్టర్ ఇమ్మాన్యుయేల్కు అప్పగించాడు. ప్రజాభిప్రాయంలో గారిబాల్డి రెండవ ఫ్రాన్సిస్లు నేపుల్స్, సిసిలీలను సార్డీనియాలో విలీనం చేసాడు.

ప్రశ్న 2.
మొదట నెపోలియన్ జర్మనీ ఏకీకరణకు చేసిన సేవ ఎటువంటిది ?
జవాబు:
మొదటి నెపోలియన్ జర్మనీలో జాతీయతా భావం, ప్రజాస్వామ్యాలకు బీజం వేసాడు. జర్మనీలో పవిత్ర రోమన్ సామ్రాజ్యాన్ని రద్దుచేసాడు. క్రీ.శ. 1806లో ప్రష్యా, ఆస్ట్రియాలు లేకుండా జర్మనీ రాష్ట్రాలతో రైన్ కూటమిని లేక సమాఖ్యతను ఏర్పాటు చేసాడు. జర్మనీ ప్రజల్లో స్వేచ్ఛ, జాతీయతా భావం, దేశభక్తి, సౌభ్రాతృత్వాలను రగుల్కొలిపాడు. మరోవైపు ఆస్ట్రియా, మెటర్నిక్ తో తమ పెత్తనంతో జర్మనీ పరిపాలకులకు చక్రవర్తి వంటి బిరుదులు ఇవ్వలేదు. జర్మన్లకు ఒక జాతీయ పతాకం ఇవ్వలేదు. కనీసం వారిని జర్మనీ ప్రజలుగా గుర్తించలేదు. ఇంగ్లాండ్, లగ్జంబర్గ్, డెన్మార్క్, ఆస్ట్రియా, సార్జనీ, జర్మనీ రాష్ట్రాలపై పెత్తనం వహించేవి.

ప్రశ్న 3.
జోల్వెరిన్ ప్రాముఖ్యత తెలపండి.
జవాబు:
1819లో 12 జర్మన్ రాష్ట్రాలతో ప్రష్యా ఏర్పరిచిన వర్తక సుంకాల సంస్థ జోల్వెరిన్. అంతకు మునుపు ప్రష్యాలో ఆర్థికవ్యవస్థ సక్రమంగా లేక వ్యాపారస్థులను మరియు వినియోగదారులను అణచివేసేవారు. సుంకాల పద్ధతి, అధిక ధరలతో వారి దోపిడీ చేసేవారు. ప్రష్యా 28 మే, 1818 సంవత్సరంలో వ్యాపారస్థులకు మరియు వినియోగదారులకు అనుకూలంగా ఒకే విధమైన సుంకాల చట్టాలను తయారుచేసింది. ఈ చట్టం ప్రకారం ప్రష్యాలో దిగుమతి సుంకాలను తొలగించారు. తయారైన వస్తువులపై 10% మించి సుంకం విధించరాదు. దీని ఫలితంగా ప్రష్యా సరళ వాణిజ్య కేంద్రమైంది. ఈ సంస్థ చెకోపోస్ట్లు, ఆంతరంగిక సుంకాలను ఎత్తివేసి సరళవ్యాపార విధానాన్ని ఏర్పాటు చేసింది. దీని వలన జర్మన్ రాష్ట్రాల మధ్య వ్యాపార సంబంధాలు పటిష్టమయ్యాయి. 1834 నాటికి అన్ని జర్మన్ రాష్ట్రాలు ఇందులో సభ్యులయ్యారు. దీని ద్వారా జర్మన్లలో జాతీయతా భావం పెరిగి, రాజకీయ ఏకత్వానికి దారి ఏర్పడింది.

ప్రశ్న 4.
1870 – 71 ఫ్రాన్స్ – ప్రష్యా యుద్ధాన్ని గురించి వివరించండి.
జవాబు:
మూడవ నెపోలియన్ ప్రష్యారాజుతో ప్రష్యా వంశం వారెవ్వరూ కూడా స్పెయిన్ సింహాసనాన్ని అధిష్టించడానికి వీలులేదు అనే షరతు విధించాడు. ఈ సమస్యపై చర్చించడానికి ప్రష్యారాజు, ఫ్రాన్స్ రాయబారుల మధ్య ‘ఎమ్స్’ అనే చోట చర్చలు జరిగాయి. ప్రష్యారాజు మొదటి విలియం చర్చల సారాంశాన్ని ‘ఎమ్స్ టెలిగ్రామ్’ ద్వారా బిస్మార్క్క పంపాడు. బిస్మార్క్ దీనిని ఇరుదేశాలలో ఆగ్రహం కలిగేటట్లు చేసాడు. ఫలితంగా ప్రష్యారాజు తమ రాయబారిని అవమానవపరచాడని ఫ్రెంచి ప్రజలు భావించారు. దీనితో ఫ్రాన్స్ ప్రష్యాపై యుద్ధం ప్రకటించింది.

AP Inter 2nd Year History Study Material Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

ఈ ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం 1870 నుండి 1871 వరకు జరిగింది. 1870లో జరిగిన సెడాన్ యుద్ధంలో ఫ్రాన్స్ ఘోరపరాజయం పొందింది. మూడవ నెపోలియన్ ప్రష్యాకు లొంగిపోయాడు. యుద్ధఖైదీగా పట్టుబడ్డాడు. తరువాత ఫ్రెంచి రిపబ్లిక్ యుద్ధాన్ని కొనసాగించింది. జర్మన్ సేవలు 1871లో పారిస్ను ముట్టడించాయి. చివరికి 1871లో పారిస్ ప్రష్యాకు లొంగిపోయింది. ఫ్రాంక్ఫర్ట్ సంధికి అంగీకరించింది. దీని ప్రకారం ఫ్రెంచి వారి ఆల్సెన్, లో రైన్లను వదులుకున్నారు. యుద్ధనష్టపరిహారం కింది ఐదువేల మిలియన్ ఫ్రాంకులు చెల్లించింది. ఈ యుద్ధం తర్వాత జర్మన్ రాజు వర్సైల్స్ రాజ ప్రాసాదంలో చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకున్నాడు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
యంగ్ ఇటలీ,
జవాబు:
జోసఫ్ మాజినీ 1831లో ‘యంగ్ ఇటలీ’ అనే సంస్థను స్థాపించాడు. దీనిలోని సభ్యులు చదువుకున్నవారై, నీతితో, వైజ్ఞానికంగా ఇటలీ ప్రజలను ప్రోత్సాహపరుస్తూ, ఆదర్శమైన జీవితం గడుపుతూ ఉండాలి. ప్రాణత్యాగానికైనా సంసిద్ధులను చేయడమే దీని ముఖ్య ఉద్దేశము. 40 సంవత్సరాలలోపు ఉన్నవారు దీనిలో సభ్యులు. యుద్ధం చేసి ఇటలీ నుంచి ఆస్ట్రియాను తొలగించడం, ఇటలీ స్వయం సమృద్ధిగా ఎదగడం, రిపబ్లిక్ గా ఏర్పడటం ఈ సంస్థ ప్రధాన
ఆశయాలు.

ప్రశ్న 2.
క్రిమియా యుద్ధం.
జవాబు:
కవూర్ ఇటలీ ఏకీకరణకు ఇంగ్లాండ్, ఫ్రాన్స్లతో సంధి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంగ్లాండుకు పెద్ద సైన్యం లేక యుద్ధాలలో మునిగి ఉంది. ఫ్రాన్స్కు మంచిసైన్యం ఉంది. కవూర్ మూడవ నెపోలియన్కు దగ్గరయ్యాడు. క్రిమియా యుద్ధం కవూర్కు మంచి అవకాశం కలిగించింది. ఫ్రాన్స్, ఇంగ్లాండ్లతో పొత్తు కుదుర్చుకుని రష్యాతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. రెండు సంవత్సరాల తర్వాత క్రిమియా యుద్ధంలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్లకు ఇటలీ చేసిన సేవలకు గుర్తుగా మూడవ నెపోలియన్ కపూర్ను ఆహ్వానించి అతనికి సహాయం చేయడానికి అంగీకరించాడు. ఈ విధంగా క్రిమియా యుద్ధాన్ని కవూర్ ఇటలీ ఏకీకరణకు అనుకూలంగా మలచుకున్నాడు.

ప్రశ్న 3.
కారలా బాడ్ ఉత్తర్వులు, 1819.
జవాబు:
మెటర్నిక్ ప్రష్యా రాజైన మూడవ విలియం సహాయంతో జర్మనీలో జాతీయతా భావాన్ని, విప్లవ భావాలను అణచివేయడానికి కారల్స్బాడ్ ఆజ్ఞలు 1819లో జారీచేసాడు. వీటి ప్రకారం

  1. ఉపాధ్యాయుల, విద్యార్థుల కార్యక్రమాలను గమనించడానికి యూనివర్సిటీ ప్రతినిధులు నియమించబడ్డారు.
  2. ఉపాధ్యాయులు మతవిస్తరణ, ప్రభుత్వ విరుద్ధ కార్యకలాపాలు చేయరాదు.
  3. ఏ ఉపాధ్యాయుడైన మెటర్నిక్ ఆదేశాలు పాటించని ఎడల అతనిని ఉద్యోగం నుండి తీసివేస్తారు. తిరిగి ఏ విశ్వవిద్యాలయంలో చేర్చుకోరు.
  4. విద్యార్థులను ఒక యూనివర్సిటీ నుంచి తొలగిస్తే తర్వాత ఏ యూనివర్సిటీ తీసుకోదు.
  5. పత్రికలపై ఆంక్షలు విధించారు. బుర్సెన్ షాఫ్ట్ అనే సంఘాన్ని రద్దుచేసారు.
  6. కారలా ్బడ్ ఆజ్ఞలను ప్రష్యాలో కఠినంగా అమలుచేసి ఉద్యమాన్ని జర్మనీలో అణచివేసారు.

AP Inter 2nd Year History Study Material Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

ప్రశ్న 4.
ఆయుధము – రక్తపాత విధానము
జవాబు:
బిస్మార్క్ ముఖ్యధ్యేయము జర్మనీ ఏకీకరణ ప్రష్యా ఆధీనంలో జరగాలని భావించడం. యుద్ధాల వలన జర్మనీ ఏకీకరణ సాధ్యంకాదని అతని అభిప్రాయం. సమస్యలు, ఉపన్యాసాలవల్లకాని, చర్చలు, సమావేశాలు, పార్లమెంట్ తీర్మానాలతో పరిష్కరించబడదు” కఠిన దండనీతే Policy of Blood and Iron దీనికి పరిష్కారం అని పేర్కొన్నాడు. దీనినే ‘రక్తపాత విధానం’ అంటారు. బిస్మార్క్ జర్మనీ ఏకీకరణకు ఈ రక్తపాత విధానాన్ని అనుసరించాడు. ఆ తరువాత జర్మనీ ఏకీకరణ కోసం ప్రష్యా, డెన్మార్క్, ఆస్ట్రియా, ఫ్రాన్స్లో మూడు యుద్ధాలు చేసింది.

AP Inter 2nd Year History Study Material Chapter 9 పారిశ్రామిక విప్లవం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 9th Lesson పారిశ్రామిక విప్లవం Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 9th Lesson పారిశ్రామిక విప్లవం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బ్రిటన్ దేశములో మొదటిగా పారిశ్రామిక విప్లవం జరగడానికి దోహదపడిన అంశాలను వివరించండి.
జవాబు:
పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్లోను, ఇతర పాశ్చాత్య ప్రపంచంలోనూ సంభవించడానికి కారణం అక్కడ శాస్త్ర విజ్ఞానం సమాజంతో జతకట్టి ఉండటమే. తత్త్వవేత్త, చేతివృత్తి నిపుణుడు సన్నిహితంగా సహజీవనం చేసిన పాశ్చాత్య సమాజాలలో అభివృద్ధి అనూహ్యంగా జరిగింది.

మానవ జాతికి ఆవశ్యకమైన కొన్ని వస్తువుల ఉత్పత్తి విధానంలో 18, 19 శతాబ్దాలలో ఇంగ్లాండ్లో పూర్తి మార్పు వచ్చింది. మానవ శ్రమ ద్వారా వస్తువుల ఉత్పత్తి విధానాన్ని మొదట యంత్రాల ద్వారా, తర్వాత భారీ యంత్రాల ద్వారా ఉత్పత్తి చేసే విధానాలు వచ్చాయి. ఈ మార్పులు అనేక ఇతర రంగాలలో మార్పులకు కారణభూతమయ్యాయి. ఉత్పత్తి పద్ధతుల్లో మార్పునకు స్థావరం కావటంతో, ఆ మార్పు ఫలితాలను అనుభవించటంలోను, ఐరోపా దేశాలలో ఇంగ్లాండ్ మార్గదర్శకమైంది. ‘ప్రపంచ కర్మాగారం’గా పరిగణించబడింది. లాభదాయకమైన యంత్రాగారాల స్థాపనకు దారితీసిన అనుకూల పరిస్థితులు, అవసరమైన రంగం ఇంగ్లాండ్లో సిద్ధంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.

పాలనా పరిస్థితులు: ఆధునిక పరిశ్రమలను ఏర్పాటు చేసిన మొదటి దేశం బ్రిటన్. 17వ శతాబ్ది నుండి ఇంగ్లాండ్ ఒకే రాచరిక ఏలుబడిలో రాజకీయంగా స్థిరత్వం పొందింది. దేశమంతా ఒకే పాలనా చట్టం, ఒకే ద్రవ్యం చలామణిలోకి వచ్చాయి. బ్రిటన్ మినహా ఇతర ఐరోపా దేశాలలో స్థానిక అధికారుల ప్రాబల్యం ఉండటం వలన, వారు తమ ప్రాంతాల గుండా ప్రయాణించే వస్తువులపై పన్నులు వసూలు చేస్తూ ఉండటం వలన వస్తువుల ధరలు పెరిగినవి. కానీ ఇంగ్లాండ్లో ఇటువంటి పరిస్థితులు లేకపోవడం వల్ల వస్తువుల ధరలు చౌకగా అందుబాటులో ఉండేవి.

AP Inter 2nd Year History Study Material Chapter 9 పారిశ్రామిక విప్లవం

అనుకూల పరిస్థితులు: 17వ శతాబ్దం చివరి నాటికి వస్తు మారకంగా ద్రవ్యం విరివిగా వాడుకలోకి వచ్చింది. వస్త్ర పరిశ్రమకు కావలసిన పత్తి పరిశ్రమకు అనుకూలమైన తేమతో కూడిన వాతావరణం ఇంగ్లాండ్లో ఉండేది. ఇంగ్లాండ్కు నీరు, ముడిసరుకుల కొరత లేదు. బొగ్గు, ఇనుము పుష్కలంగా లభించేవి. ఫ్రాన్స్, జర్మనీ వంటి ఏ ఇతర యూరోపియన్ దేశంలో కూడా ఇంగ్లాండ్లో ఉన్నట్లు బొగ్గుగనులు, ముఖ్యమైన ఓడరేవులు సమీపంలో లేవు. ఇది జల రవాణాకు చాలా అనుకూలం. “ఇనుము, బొగ్గు, వస్త్రాల ఆధారంగా ప్రపంచం అంతా అనుకరించిన ఒక కొత్త నాగరికతను ఇంగ్లాండ్ రూపొందించింది” అని ఫిషర్ కొనియాడాడు.

పెట్టుబడి వ్యవస్థ: మూలధనం ఇంగ్లాండ్లో పెద్ద మొత్తంలో పోగుపడి ఉంది. ఈ సంపదకు అనేక కారణాలున్నాయి. 17వ శతాబ్దం ప్రారంభం నుండి బ్రిటన్ విదేశాలతో సమర్థవంతమైన వాణిజ్య విధానాలను అనుసరించి అత్యధికంగా లాభాలను గడించింది. మూలధనం ఉన్నా సరైన విధానంలో పెట్టుబడి పెట్టకపోతే ఉపయోగం ఉండదు. ‘ఇంగ్లాండ్ బ్యాంక్’ స్థాపన, ‘లండన్ ద్రవ్య మార్కెట్’, ‘జాయింట్ స్టాక్ బ్యాంక్’, ‘జాయింట్ స్టాక్ కార్పొరేషన్’ ఏర్పాటుతో ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం తేలికయింది. మెథడిజం, పూరిటానిజం వంటి మత శాఖల ప్రభావం వలన ప్రజలు వ్యసనాలు మానుకుని నిరాడంబరంగా జీవిస్తూ ఉండటం వలన కూడా ధనం పొదుపు చేయబడి పెట్టుబడిగా మారింది. ఋణాలివ్వటంలోను బ్యాంకులు అవలంబించిన పటిష్టమైన విధానం నిధుల వినియోగ యంత్రాంగాన్ని ప్రభావితం చేసిందని ఫిషర్ పేర్కొన్నాడు.

సామాజిక పరిస్థితులు: పురాతన లాభసాటికాని, వ్యవసాయ పద్ధతులకు బదులుగా నూతన వ్యవసాయ పద్ధతులైన పంటల ఆవర్తన పద్ధతి, వ్యవసాయంలో యంత్రాల వాడకం పెరగటంతో ఆహార సరఫరా పెరిగింది. ఫలితంగా జనాభా కూడా పెరిగింది. 18వ శతాబ్దం నాటికి అనేక రాజకీయ, మత కారణాల వలన ఐరోపా దేశాల నుండి ఇంగ్లాండ్కు జనాభా వలసలు పెరిగాయి. కంచెలు వేసే ఉద్యమం వల్ల భూములు కోల్పోయిన చిన్న రైతులు, బానిస వ్యవస్థ నిషేధం వల్ల రోడ్డున పడ్డ పనివారు నూతనంగా ఏర్పాటైన పరిశ్రమలలో శ్రామికులుగా చేరారు. ఇది కూడా కొత్తగా ఏర్పడిన భారీ పరిశ్రమలకు అనుకూలమయింది.

రవాణా సౌకర్యాలు: 18వ శతాబ్దం నాటికి ఇంగ్లాండ్ సముద్ర వర్తకంలో ఆధిక్యత నెలకొల్పింది. ఇంగ్లాండ్లో ఎన్నో రేవులున్నాయి. ఆధునిక రోడ్లు, కాలువల నిర్మాణంతో దేశంలో కూడా రవాణా మెరుగుపడింది.

శాస్త్రీయ ఆవిష్కరణలు: ఇంగ్లాండ్, స్కాట్లాండ్ ప్రజలు అనేక నూతన యంత్రాలను ఆవిష్కరించటంలోను, వాటిని ఉపయోగించి వస్తూత్పత్తి చేపట్టడంలోనూ ముందున్నారు.
ఈ కారణాలన్నింటి వలన ఇంగ్లాండ్లో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం ఐరోపా ఖండమంతా వ్యాపించింది.

ప్రశ్న 2.
వస్త్ర పరిశ్రమలో పారిశ్రామిక కాలంలో జరిగిన నూతన యంత్రాల ఆవిష్కరణలను వివరించండి.
జవాబు:
పారిశ్రామిక విప్లవానికి ఆధారం ఆవిరి శక్తిని యంత్రాలకు, ఆ పైన మొదటగా వస్తూత్పత్తికి తర్వాత రవాణాకు ఉపయోగించడమేనని థాంప్సన్ అన్నాడు.

ఆవిరి యంత్రం: ఆవిరి శక్తి అందుబాటులోకి రావడం వల్లనే గణనీయమైన పారిశ్రామికీకరణ సాధ్యపడింది. ఆవిరి అధిక ఉష్ణోగ్రతల వద్ద అధిక పీడనాన్ని కలిగి ఉండి యంత్రాలు పనిచేయడానికి శక్తి వనరుగా ఉపయోగపడటంతో యంత్రాలు బహుళ వాడుకలోనికి వచ్చాయి

18వ శతాబ్ది ప్రారంభంలో ‘న్యూకామెన్’ అనే మెకానిక్ ఇంగ్లాండ్లోని గనుల నుంచి నీరు తోడటానికి ఆవిరి యంత్రాన్ని కనుగొన్నాడు. దానిలో కొన్ని లోపాలున్నాయి. తరువాత కాలంలో జేమ్స్ వాట్ ఒక ప్రత్యేక కండెన్సర్ తయారు చేయడం ద్వారా ఆవిరి యంత్రంలోని లోపాలను తొలగించాడు. వాట్ తయారుచేసిన ఆవిరి యంత్రం, ఆవిరి యుగాన్ని ఆరంభించింది. గ్రేట్ బ్రిటన్లోని పరిశ్రమలను విప్లవాత్మకంగా మార్చివేసింది. అంతకు ముందు కేవలం గనులకు మాత్రమే పరిమితమై ఉన్న ఆవిరి యంత్రం బండ్లను, యంత్రాలను ముందుకు కదిలించే సామర్థ్యం గల ఇంజన్ మారింది. గనుల నుండి నీరు తోడటానికి, క్రేన్ల ద్వారా బరువులెత్తడానికి, యంత్రాల రవాణాకు, రైలు రవాణాకు, ఆవిరి నౌకలు నడపడానికి ఈ ఆవిరి యంత్రం ఉపయోగపడింది. జలచక్రం కదలికను అనుసరించి రోటరీ మిషన్ ను కనిపెట్టడంతో 1781లో ఆవిరి యంత్రం ప్రతి కర్మాగారాలలో ప్రవేశించింది.

ప్రత్తి – వస్త్ర పరిశ్రమ: 1780 నుండి వస్త్ర పరిశ్రమ బ్రిటిష్ పారిశ్రామికీకరణకు చిహ్నంగా మారింది. వస్త్రోత్పత్తిలో రెండు ప్రధాన ప్రక్రియలున్నాయి. ఒకటి ముడిసరుకు, పత్తి, ఉన్ని, పట్టు నుంచి దారం తీయటం, రెండు దారాలను వస్త్రంగా నేయడం. ఈ ప్రక్రియలో అనేక కొత్త విషయాలు కనుగొన్నారు. ఫలితంగా ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ దారాలను తీయడం సాధ్యమైంది.

1) జానకే 17వ శతాబ్దంలో ఫ్లయింగ్ షటిల్ను కనిపెట్టాడు. నేతపనివాడు చేతితో దారాన్ని ముందుకు, వెనుకకు పంపే బదులు తీగలను లాగడం ద్వారా యంత్రాన్ని పనిచేయించవచ్చు. దీనివలన ఇద్దరికి బదులు ఒక పనివాడు పెద్ద మొత్తంలో వస్త్రాన్ని నేయడం సాధ్యపడింది.

2) 1765లో జేమ్స్ హర్ గ్రీవ్స్ ‘స్పిన్నింగ్ జెన్నీ’ ని అభివృద్ధిపరిచాడు. ఇది పదకొండు కుదుళ్ళను ఒకేసారి తిప్పగల సామర్థ్యం కలిగి ఉంది. దీనితో తయారుచేసిన దారం పురి తక్కువ ఉండి, వస్త్రం నేయడానికి దృఢంగా ఉండేది కాదు.

3) రిచర్డ్ ఆర్క్ రైట్ 1769లో కొత్త సూత్రాన్ని ఆధారం చేసుకొని ‘వాటర్ ఫ్రేమ్’ ను రూపొందించాడు. దీనితో చేసిన దారం దృఢంగా, ముతకగా ఉండి నేయడానికి అనుకూలంగా ఉండేది.

4) 1779లో శామ్యూల్ క్రాంప్టన్ మ్యూల్ తన పేరున ‘మ్యూల్ యంత్రాన్ని’ నిర్మించాడు. ఇది స్పిన్నింగ్ జెన్నీ, వాటర్ ఫ్రేమ్లలోని మేలైన లక్షణాలను కలిపి సన్నగా, దృఢంగా ఉండే దారాన్ని తీయగలిగింది. ఫలితంగా పలుచని ‘మస్లిన్’ వస్త్రాలు తయారు చేయగలిగారు.

5) ఎడ్వర్డ్ కార్టైరైట్ 1787లో ‘పవర్లూమ్’ కనుగొనడంతో సులభంగా పనిచేయడానికి, దారం తెగినా ఇబ్బంది లేకుండా, ఎటువంటి వస్త్రాన్నయినా నేయడానికి అవకాశం ఏర్పడింది.

బొగ్గు మరియు ఇనుము ఉక్కు కర్మాగారాలు: ఆవిరి యంత్రం, ఇతర యంత్రాల వాడకం, ఇనుము, బొగ్గుల అవసరాన్ని సృష్టించింది. యంత్రాల తయారీకి ఇనుము, ఆవిరి యంత్రాన్ని నడపడానికి కావలసిన ఆవిరి కోసం బొగ్గు అవసరమైనాయి. 18వ శతాబ్దం నుండి ప్రధాన ఇంధన వనరుగా బొగ్గు గుర్తించబడింది.

18వ శతాబ్దానికి ముందు ముడి ఇనుమును కరిగించి ఇనుప వస్తువులు తయారు చేయడానికి వంట చెరుకును ఉపయోగించేవారు. తరువాత రాతిబొగ్గును ఉపయోగించారు. 18వ శతాబ్దం ప్రథమార్థంలో బొగ్గును కోక్గా మార్చే ప్రయత్నంలో ముడి ఇనుమును కరిగించి శుద్ధి చేయడంలోను, బలమైన గాలి పేలుళ్ళ ద్వారా ‘డర్బీలు’ సఫలమయ్యారు. డార్బ ‘కోక్ బ్లాస్ట్’ ఇనుము ఉత్పత్తిని పెంచింది. ఈ ఆవిష్కరణతో మునుపటి కంటే పెద్ద నాణ్యమైన పోతలు పోయడం సాధ్యపడింది.

AP Inter 2nd Year History Study Material Chapter 9 పారిశ్రామిక విప్లవం

జేమ్స్ వాట్, స్టీమ్ హేమర్, హంట్స్మన్ యొక్క ‘స్టీల్ ప్రాసెస్’, జాన్ స్మిటస్ యొక్క గాలింపు, హెన్రీకార్ట్, పీటర్, ఓనియమ్ల రివర్బరేటరీ ఫర్నేస్, రోలింగ్ మిల్లులు నికొల్సన్ యొక్క మాట్లా బ్లాస్ట్ మొదలైనవి 19వ శతాబ్దపు తొలి దశలో ఇనుము ఉత్పత్తి బహుళంగా వేగంగా సాగడానికి తోడ్పడిన ఆవిష్కరణలు. 1815లో ‘హంఫ్రీ డేవిస్’ కనుగొన్న ‘సేఫ్టీలాంప్’ గనుల నుండి బొగ్గు ఉత్పత్తి అధికమవడానికి దోహదమైంది.

రవాణా సౌకర్యాలు: పారిశ్రామికీకరణ, నూతన యంత్రాలతో రవాణా రంగంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. ప్రయాణ సాధనాలకు ఆవిరి యంత్రాన్ని ఉపయోగించడంతో ఇంగ్లాండ్లో రవాణా సమస్య పరిష్కారానికి దోహదమయింది. స్టీఫెన్సన్ మొదటి రైల్వే ఆవిరి ఇంజన్ ‘రాకెట్’ను 1814లో తయారు చేశాడు. 1825లో స్టాక్టన్, డార్లింగ్టన్ పట్టణాల మధ్య రైలు నడిచింది. వీటి మధ్య ఉన్న 9 మైళ్ళ దూరాన్ని 5 మైళ్ళ వేగంతో సుమారు రెండు గంటలలో అధిగమించారు. 20 సంవత్సరాల కాలంలోనే గంటకు 30 నుండి 50 మైళ్ళ వేగం సాధారణ విషయంగా మారిపోయింది.

విస్తృతంగా తవ్విన జలమార్గాలలో ఆవిరి పడవలు తిరగడం మరొక ముఖ్య పరిణామం. ఆవిరి ఓడల నిర్మాణంలో రాబర్ట్ పుల్టన్, నికొలస్ రూజ్వెల్ట్లు ముఖ్యపాత్ర పోషించారు. ఈ స్టీమర్ల ద్వారా అధిక మోతాదుల్లో సరుకులు, పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు తక్కువ ఖర్చుతో వేగంగా ప్రయాణించడం సాధ్యపడింది.

ప్రశ్న 3.
పారిశ్రామిక విప్లవం వలన కలిగిన లాభనష్టాలను వివరించండి.
జవాబు:
పారిశ్రామిక విప్లవం ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ, తాత్త్విక రంగాలలో ఊహించని ఫలితాలను, మార్పులను తీసుకువచ్చింది.

ఆర్థిక రంగం: యంత్రాగార వ్యవస్థ, పారిశ్రామిక పెట్టుబడిదారీ వ్యవస్థలు ఒక దానితో ఒకటి ముడిపడ్డాయి. కొత్త యంత్రాలు భారీవి, ఖరీదైనవి. అందువలన ధనవంతులు వాటి యజమానులైనారు. ఈ భారీ యంత్రాలను ప్రత్యేక భవనాలు, కర్మాగారాలలో స్థాపించి నడపటం ప్రారంభించారు. భారీ పరిశ్రమలకు పెద్ద పెద్ద పెట్టుబడులు కావాల్సి వచ్చాయి. అది కొత్తరకమైన పెట్టుబడిదారీ వ్యవస్థకు దారితీసింది. యాంత్రిక శక్తి వలన ఎంతోమంది చేతివృత్తుల వారు కార్మికులుగా మారారు. ఇంగ్లాండ్లో వస్తూత్పత్తి అధికమై ‘ప్రపంచ కర్మాగారం’ గా మారింది. పెద్ద పారిశ్రామిక వ్యవస్థలు రైలు మార్గాల వంటి జాయింట్ స్టాక్ కంపెనీలు కార్పొరేషన్లుగా తలెత్తాయి. ఇవి వేతనంపై ఉద్యోగస్తులను పనిచేయించుకోవడం ప్రారంభించాయి.

సంపద పెంపు: యాంత్రిక శక్తి ఉపయోగంతో పెట్టుబడి అనూహ్యంగా పెరిగింది. 1870 తరువాత కొత్త పరిశ్రమలు తలెత్తటం, పాత పరిశ్రమల అధిక విస్తరణలు భారీ పెట్టుబడులకు అవకాశాన్ని కల్పించాయి. ఎంతోమంది పారిశ్రామిక పెట్టుబడిదారులు, వ్యక్తిగత సామర్థ్యంతో పైకొచ్చినవారు ప్రపంచ పారిశ్రామిక నాయకులుగా ప్రసిద్ధికెక్కారు.
ప్రజా సౌకర్యాలు: 1870 నుంచి విద్యుచ్ఛక్తి ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇది క్రమంగా పరిశ్రమలకు, గృహాలకు వ్యాపించింది. ఐస్ తయారీ, నిల్వ ఉంచడానికి రిఫ్రిజిరేటర్ తయారీ, ‘సింగర్’ కనిపెట్టిన కుట్టుమిషన్, రెమింగ్టన్ ఆవిష్కరించిన టైప్ రైటర్, శీఘ్ర చలనానికి ఆవిష్కరింపబడిన సైకిల్ వంటివి ప్రజా జీవితంలో ఎన్నో సౌఖ్యాలను, విలాసాలను సృష్టించింది.

పారిశ్రామిక విప్లవం మానవ జీవితాన్ని అనేక విధాలుగా మార్చివేసింది. ఎంతో సాంకేతిక అభివృద్ధితో పాటు ఎన్నో సామాజిక, ఆర్థిక సమస్యలను సృష్టించింది.
సామ్రాజ్యవాదం: పారిశ్రామిక విప్లవం వలన వస్తువుల అధికోత్పత్తి జరిగి వాటి ధరలు తగ్గిపోయాయి. తమ అధికోత్పత్తులు అమ్ముకోవడం కోసం అంతర్జాతీయ మార్కెట్ల కొరకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలు వలస వాదానికి, క్రమేణా సామ్రాజ్యవాదానికి దారితీసి వలసల కొరకు యుద్ధాలు జరిగాయి. వీటి కోసం ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి. ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని ఎన్నో దేశాలను వీరు ఆక్రమించి ఆయా దేశాలను దోపిడీ చేసారు.

నగరీకరణ: పారిశ్రామిక విప్లవం ఫలితంగా భారీ పరిశ్రమలు స్థాపించబడ్డాయి. ఈ పరిశ్రమల చుట్టూ పెద్ద పట్టణాలు అభివృద్ధి చెందాయి. 1750 నాటికి యాభైవేలు, అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న పట్టణాలు 29కి పెరిగాయి. పట్టణాలలో రెండు సాంఘిక వర్గాలు ఏర్పడ్డాయి. మధ్య తరగతి ప్రజలు ఒక వర్గంగా, పనిచేసే శ్రామికులు ఒక వర్గంగా ఏర్పడ్డారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గృహాలు, త్రాగునీరు. ప్రజారోగ్య వసతులు పెరగలేదు. కొత్తగా నగరానికి వచ్చినవారు అప్పటికే కిక్కిరిసిన మురికివాడల్లో నివసించారు. సగర కాలుష్యం నుండి తప్పించుకోవడానికి ధనికులు నగరపు శివార్లకు చేరారు. నగరాలలో టైఫాయిడ్, కలరా. కాలుష్యంతో వేలాదిమంది ప్రజలు మరణించారు.
సామాజిక పరిణామాలు: పారిశ్రామిక విప్లనం వలన అనేక సామాజిక పరిణామాలు సంభవించాయి. ఆర్థిక వ్యవస్థలో నూతన మార్పులు ప్రజలకు కష్టాలను, అసంతృప్తిని మిగిల్చాయి. పట్టణ పేదలు, పారిశ్రామిక కార్మికులలో అకస్మాత్తుగా తలెత్తిన పరిణామాలు 1848 విప్లవానికి, ఇంగ్లాండ్లో చార్టిస్ట్ ఉద్యమానికి దారితీసాయి. శాఖోపశాఖలుగా విస్తరించిన పారిశ్రామిక విప్లవ ప్రభావాన్ని తట్టుకొనే పరిజ్ఞానం లేని చిన్న వ్యాపారులు, మధ్య తరగతి పెట్టుబడిదారులు అసంతృప్తికి గురయ్యారు. గమ్యం తోచని శ్రామికులు యంత్రాలు తమ జీవితాన్ని నాశనం చేస్తున్నాయని భావించి వాటిని ధ్వంసం చేసారు. పెట్టుబడిదారులు కార్మికుల శ్రమను దోచుకొని ఆదాయాలను విపరీతంగా పెంచుకున్నారు. ఆ ధనాన్ని తిరిగి పరిశ్రమలలో పెట్టుబడి పెట్టారు. వారి ధనదాహం కార్మికులను తిరగబడేటట్లు చేసింది.

స్త్రీలు – బాలకార్మికులు: పారిశ్రామిక విప్లవం స్త్రీలు – పిల్లలు పనిచేసే విధానంలో మార్పు తెచ్చింది. లాంకై షైర్, యార్కైర్ నూలు మిల్లు కర్మాగారాలలో స్త్రీలు, పిల్లలు ఎక్కువగా పనిచేసేవారు. పెద్ద పెద్ద యంత్రాల మధ్య ఎందరో బాల కార్మికులు గాయాల పాలవడం లేదా సురణించడం జరిగేది. స్త్రీలు కూడా దుర్భర పరిస్థితులలో పనిచేసేవారు.

కార్మిక చట్టాలు: ఫలితంగా కార్మికులలో పెరిగిన నిరసనలు తొలగించడానికి కార్మిక చట్టాలు తయారయ్యాయి.

బాల కార్మిక వ్యవస్థను నిషేధించారు. కానీ ఆ చట్టాలు సక్రమంగా అమలవ్వలేదు.

సామ్యవాద ప్రభావం: ఐరోపాలో నాటి పరిస్థితుల నుంచి సాన్యువాద భావం ఊపందుకుంది. కార్ల్ మార్క్స్ తన మిత్రుడు ఏంగిల్స్తో కలిసి కమ్యూనిస్ట్ మానిఫెస్టో గ్రంథాన్ని రచించాడు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని పిలుపునిచ్చాడు. ఇతను ‘దాస్ కాపిటల్’ అనే గ్రంథం రచించాడు.

AP Inter 2nd Year History Study Material Chapter 9 పారిశ్రామిక విప్లవం

మానవ చరిత్రలో ఏ విప్లవం కూడా పారిశ్రామిక విప్లవం ప్రభావితం చేసినట్లుగా మానవ జీవితాన్ని ప్రభావితం చేయలేదు. ఈ విప్లవ ఫలితంగా ఇంగ్లండ్ తదితర ఐరోపా దేశాలు ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాలలో ప్రజలను దోపిడీకి గురిచేసి చెప్పలేని కడగండ్లకు గురిచేసాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
టి. హర్ గ్రీవ్స్.
జవాబు:
హవ్స్ 1720లో ఇంగ్లాండ్ నందు జన్మించాడు. ఇతడు చేనేత కార్మికుడుగా ఉండేవాడు. నిరక్షరాస్యుడు. | 1765లో హర్ గ్రీవ్స్ స్పిన్నింగ్ జెన్నీని అభివృద్ధి చేసాడు. ఇది పదకొండు కుదుళ్ళను ఒక్కసారే తిప్పగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆ విధంగా 8 లేక 10 మంది పనిని చేయగలిగింది. దీని సహాయంతో తీసిన దారం పురి తక్కువగా ఉండి దారం తెగిపోయి వస్త్రం నేయడానికి దృఢంగా ఉండేది కాదు.

ప్రశ్న 2.
ఆవిరి యంత్రం.
జవాబు:
1698లో థామస్ సావొరి గనుల నుండి తోడటానికి ‘ద మైనర్ ఫ్రెండ్స్’ అనే నమూనా ఆవిరి యంత్రాన్ని రూపొందించాడు. ఈ ఇంజన్ నిదానంగా పనిచేసేది. 1712లో న్యూకామెన్ మరొక ఆవిరి యంత్రాన్ని తయారు చేసాడు. ఈ ఇంజన్ కండెన్సింగ్ సిలిండర్ను నిరంతరం చల్లబరుస్తూ ఉండటం వలన శక్తిని కోల్పోతూ సరిగా పనిచేసేది కాదు. 1769లో జేమ్స్వట్ తన యంత్రాన్ని రూపొందించే వరకు ఆవిరి యంత్రం గనులకే పరిమితమయింది.

జేమ్స్వాట్ ఆవిరి యంత్రాన్ని వాయువులను, నీరు వంటి ద్రవాలను వేగంగా ముందుకు తీయడంతో పాటు, బండ్లను, యంత్రాలను కదిలించే సామర్థ్యం గల ఇంజన్ గా మార్పు చేసాడు. మథ్యూ బౌల్డన్ అనే సంపన్న వ్యాపారవేత్త సహాయంతో బర్మింగ్రమ్ నందు జేమ్స్వట్ సోహా అనే కార్ఖానా స్థాపించాడు. గనుల నుండి నీరు తోడడానికి, క్రేన్లను ఉపయోగించి బరువులు ఎత్తడానికి, యంత్రాల రవాణాకు, రోడు, రైలు, జల రవాణాకు ఆవిరి యంత్రం (స్టీమ్ ఇంజన్) ఉపయోగపడింది.

ప్రశ్న 3.
లూధిజమ్.
జవాబు:
‘జనరల్ లూడ్’ అనే జనాకర్షక నాయకుడు మరొక నూతన నిరసన ఉద్యమాన్ని చేపట్టాడు. దీనినే లుద్దిజం అంటారు. లుద్దిజం కేవలం యంత్రాలపై దాడిచేసే తిరోగమన విధానాన్ని అనుసరించలేదు. కనీస వేతనాలు, స్త్రీలు, పిల్లలపై పనిభారం తగ్గించడం, యంత్రాల రాకతో పని కోల్పోయిన వారికి ఉపాధి కల్పించడం, తమ కోర్కెలను చట్టబద్ధంగా తెలియజేయడానికి కార్మిక సంఘాలుగా ఏర్పడే హక్కును ప్రబోధించింది. పారిశ్రామిక విప్లవం సంభవించిన తొలినాళ్ళలో కార్మికుల జీవితాలు దుర్భరమయ్యాయి. వారికి నిరసన తెలియజేయడానికి కాని, ఓటు హక్కు గాని లేవు. లుద్దిజం ఈ లోపాలను తొలగించడానికి కృషి చేసింది.

ప్రశ్న 4.
బాల కార్మికులు.
జవాబు:
పారిశ్రామిక విప్లవ కాలంలో ఏర్పడిన అనేక పరిశ్రమలలో ఎంతోమంది బాల కార్మికులుగా పనిచేసేవారు. లాంకైర్, యార్కైర్ నూలు మిల్లు కర్మాగారాలలో ఎందరో బాల కార్మికులు పనిచేసేవారు. నూలువడికి జెన్నీ వంటి యంత్రాలను బాల కార్మికులు చిన్న శరీరాలతో, చేతి వేళ్ళతో వేగంగా పనిచేయడానికి అనువుగా తయారు చేసారు. బాల కార్మికుల శరీరాలు ఇరుకైన యంత్రాల మధ్య అటూ ఇటూ తిరుగుతూ పని చేయడానికి అనుకూలంగా ఉంటుంది. సుదీర్ఘ పనిగంటలు, ఆదివారాలు యంత్రాలను శుభ్రం చేయడం వంటి పనుల వల్ల వారికి కొద్ది సమయమైనా స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి, వ్యాయామానికి కాని అవకాశం ఉండేది కాదు. వారి జుట్టు యంత్రాలలో ఇరుక్కుపోవడం, చేతులు యంత్రాలలో పడి నలిగిపోవడం, అధిక శ్రమవల్ల అలసటకు గురై నిద్రలోకి జారుకొని యంత్రాలలో పడి చనిపోవడం వంటి ప్రమాదాలకు గురయ్యేవారు. చిన్న వయసులో బాలురతో పని చేయించడం భవిష్యత్తులో కర్మాగారాలలో వారు చేసే పనులకు శిక్షణగా భావించేవారు. బాల కార్మికుల పరిస్థితులు మెరుగుపరచడానికి ఎన్నో చట్టాలు చేసినా, ఆ చట్టాలు సరిగా అమలు కాలేదు.

AP Inter 2nd Year History Study Material Chapter 9 పారిశ్రామిక విప్లవం

ప్రశ్న 5.
జాన్ మెక్ మ్.
జవాబు:
పురాతన కాలం నుండి ఇంగ్లీషు రోడ్లు, వస్తువులు, మానవుల రవాణాకు అనుకూలంగా ఉండేవి కావు. రవాణా చాలా వ్యయప్రయాసలతో కూడి నిదానంగా జరిగేది. ఈ సమస్య పరిష్కారానికి జాన్మెక్మ్ అనే స్కాట్లండు చెందిన ఇంజనీర్ కంకరరోడ్డు నిర్మించే పద్ధతి కనుగొన్నాడు. రహదారి ఉపరితలం మీద చిన్న చిన్న రాళ్ళను పరచి, చదును చేసి, బంకమట్టితో అతికాడు. ఈ విధానం ‘మెకాడమైజేషన్’ అనే పేరు పొందింది. తరువాత కాలంలో వీరెందరో కాంక్రీట్, తారు ఉపయోగించి మరిన్ని మంచి ఫలితాలు సాధించారు. మెకాడమ్ కనిపెట్టిన ఈ విధానంతో రవాణా రంగం సులభంగా, వేగంగా జరిగింది.

ప్రశ్న 6.
రైల్వేల ప్రయోజనాలు.
జవాబు:
మొదటి రైల్వే ఆవిరి ఇంజన్ ‘రాకెట్’ ను స్టీఫెన్ సన్ 1814లో తయారు చేసాడు. సంవత్సరం పొడవునా రవాణా చేయడానికి అనుకూలమైన సాధనంగా రైల్వేలు ఆవిర్భవించాయి. ఇవి ప్రయాణీకులను, సరుకులను వేగంగా తక్కువ ఖర్చుతో రవాణా చేయసాగాయి. 1760 నాటికి కలప పట్టాలకు బదులు, ఇనుప పట్టాలు కనిపెట్టడంతో ఆవిరి యంత్రంతో పెట్టెలు లాగడం వలన ఇది సాధ్యపడింది.

రైలు మార్గాలలో పారిశ్రామికీకరణ రెండవ దశకు చేరుకుంది. రైల్వేలు అత్యంత సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయ రవాణా మార్గాలుగా ఆవిర్భవించాయి. బ్రిటన్లో 1850 నాటికి అత్యధిక భాగం రైల్వేలైన్లు అందుబాటులోకి వచ్చాయి. దీనికొరకు పెద్ద మొత్తంలో బొగ్గు, ఇనుము ఉపయోగించబడ్డాయి. ఇందువల్ల ప్రజా పనులు, నిర్మాణ రంగానికి ప్రోత్సాహం చేకూరి అనేకమంది కార్మికులకు ఉపాధి లభించింది.