AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 3 నీతి పరిమళాలు Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Telugu Solutions 3rd Lesson నీతి పరిమళాలు
8th Class Telugu 3rd Lesson నీతి పరిమళాలు Textbook Questions and Answers
చదవండి – ఆలోచించండి – చెప్పండి
1. మీకు తెలిసిన నీతి వాక్యా లు తెలపండి.
 2. నీతులు ఏ ఏ రూపాల్లో ఉంటాయి?
 3. వందకుపైగా పద్యాలుండే ప్రక్రియను ఏమంటారు?
 4. మకుటం అంటే ఏమిటి?
 5. మకుటం ఏ రకంగా ఉండవచ్చు?
 6. మీకు తెలిసిన నీతిశతకాల పేర్లు చెప్పండి.
 7. మీకు తెలిసిన శతక కవుల పేర్లు చెప్పండి.
 8. శతకాలలో కేవలం నీతిని బోధించేలే ఉంటాయా? వివరించండి.
 9. ఇంతవరకు మీరు కంఠస్థం చేసిన పద్యాల్లో ఏయే శతకాల పద్యాలున్నాయి?
ప్రశ్నలు జవాబులు
ప్రశ్న 1.
 మీకు తెలిసిన నీతివాక్యాలు తెల్పండి.
 జవాబు:
 1) ఖలునకు నిలువెల్ల విషము ఉంటుంది.
 2) విద్యలేనివాడు వింతపశువు.
 3) కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగదు.
 4) సదౌష్టియె పాపములను చెఱచును.
 5) పడతులు మర్యాదలేటిగి బ్రతుకవలెను.
 6) చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.
 7) ఆలస్యంగా తింటే అమృతం కూడా విషం అవుతుంది.
 8) ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.
ప్రశ్న 2.
 నీతులు ఏ ఏ రూపాల్లో ఉంటాయి?
 జవాబు:
 నీతులను భర్తృహరి పది రకాలుగా విభజించారు –
 1) మూర్ఖ పద్ధతి
 2) విద్వత్పద్ధతి
 3) మానశౌర్య పద్ధతి
 4) అర్థ పద్ధతి
 5) దుర్జన పద్ధతి
 6) సుజన పద్ధతి
 7) పరోపకార పద్ధతి
 8) ధైర్య పద్ధతి
 9) దైవ పద్ధతి
 10) కర్మ పద్ధతి.

ప్రశ్న 3.
 వందకు పైగా పద్యాలుండే ప్రక్రియను ఏమంటారు?
 జవాబు:
 వందకు పైగా పద్యాలుండే ప్రక్రియను శతకం అంటారు.
ప్రశ్న 4.
 మకుటం అంటే ఏమిటి?
 జవాబు:
 మకుటం అనగా పద్యం చివర ఉండేది. ఇది పదంగా కాని, అర్ధపాదంగా కాని, పాదంగా కాని, పాద ద్వయంగా కాని ఉండవచ్చు.
ప్రశ్న 5.
 మకుటం ఏ రకంగా ఉండవచ్చు?
 జవాబు:
 మకుటం పద్యరూపంలోగాని, గద్యరూపంలోగాని ఏ రకంగానైనా ఉండవచ్చు.
ప్రశ్న 6.
 మీకు తెలిసిన నీతిశతకాల పేర్లు చెప్పండి.
 జవాబు:
 తెలుగులో పెక్కు నీతిశతకాలు ఉన్నాయి. తెలుగులో మొదటి నీతి శతకం బద్దెన రచించిన సుమతి శతకం. మారద వెంకయ్య రచించిన భాస్కర శతకం చక్కని నీతి శతకం. అట్లే వేమన రచించిన ‘వేమన శతకం’ చక్కని నీతి పద్యాల సంకలనం. ఏనుగు లక్ష్మణకవి రచించిన సుభాషిత రత్నావళిలో చక్కని నీతిపద్యాలున్నాయి. ఇంకా ఫక్కి అప్పల నరసయ్య రచించిన కుమారీ శతకం, కుమార శతకం, జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి తెలుగుబాల పద్యాలు, నార్లవారి పద్యాలు, నాళం కృష్ణారావుగారి పద్యాలు మొదలైన అనేక నీతి శతకాలు తెలుగులో వచ్చాయి.
ప్రశ్న 7.
 మీకు తెలిసిన శతక కవుల పేర్లు చెప్పండి.
 జవాబు:
| 1) బద్దెన | సుమతి శతకం | 
| 2) ఫక్కి అప్పల నరసయ్య | కుమారీ శతకం, కుమార శతకం | 
| 3) వేమన | వేమన శతకం | 
| 4) ఏనుగు లక్ష్మణకవి | సుభాషిత రత్నావళి | 
| 5) గువ్వల చెన్నడు/పట్టాభిరామకవి | గువ్వల చెన్న శతకం | 
| 6) మారద వెంకయ్య | భాస్కర శతకం | 
| 7) కంచర్ల గోపన్న | దాశరథీ శతకం | 

ప్రశ్న 8.
 శతకాలలో కేవలం నీతిని బోధించేవే ఉంటాయా? వివరించండి.
 జవాబు:
 శతకాలలో కేవలం నీతిని బోధించేవే కాకుండా భక్తిని బోధించేవి, వైరాగ్యాన్ని బోధించేవి, ధర్మాలను బోధించేవి, శృంగారాన్ని తెలిపేవి కూడా ఉంటాయి. తత్త్వ శతకాలు, అధిక్షేప శతకాలు, వ్యాజోక్తి శతకాలు మొదలైనవి కూడా ఉంటాయి.
ప్రశ్న 9.
 ఇంతవరకు మీరు కంఠస్థం చేసిన పద్యాల్లో ఏయే శతకాల పద్యాలున్నాయి?
 జవాబు:
- గువ్వల చెన్న శతకం
- కుమార శతకం
- తెలుగు పూలు శతకం
- వేమన శతకం
- సుమతి శతకం
- నరసింహ శతకం
- కృష్ణ శతకం
- దాశరథీ శతకం
- కాళహస్తీశ్వర శతకం
- సుభాషిత రత్నావళి.
ఇవి చేయండి
I. వినడం – మాట్లాడడం
ప్రశ్న 1.
 పాఠంలోని పద్యాలను అర్థవంతంగా, రాగయుక్తంగా చదవండి.
 జవాబు:
 విద్యార్థి కృత్యము.
ప్రశ్న 2.
 పద్యాల్లోని నీతిని సొంతమాటల్లో చెప్పండి.
 జవాబు:
 1. గుణవంతుడు లోకానికి మేలు చేకూర్చే కార్యము ఎంత భారమైనా చేయడానికి సిద్ధపడతాడు.
 2. ఉప్పులేని వంటలూ, రసజ్ఞత లేని చదువు వ్యర్థం.
 3. సంస్కారవంతమైన మాటయే మనిషికి నిజమైన అలంకారం.
 4. మానవుణ్ణి ఇంద్రియ చాపల్యం నుండి భగవంతుడే కాపాడాలి.
 5. ఓర్పు కలవారు అన్ని పనుల్లోనూ సమర్థులు అవుతారు.
 6. మానవులు రాజును ఆశ్రయించడం వ్యర్థం.
 7. ఎదుటి వాడి బలాన్ని గుర్తించకుండా పోరాటం చేసేవాడు అవివేకి.
 8. జీర్ణం కాని చదువు, తిండి చెరుపు చేస్తాయి.

ప్రశ్న 3.
 ‘చదువు జీర్ణం’ కావటాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారో చెప్పండి.
 జవాబు:
 చదువు జీర్ణం అవడం అంటే చదివిన దాన్ని గ్రహించి ఆచరణలో పెట్టగలగడం. చదివిన విషయాన్ని ఆధారంగా చేసికొని దాని తరువాత విషయాలను నేర్చుకోగలగడం, చదివిన విషయం జ్ఞప్తిలో ఉంచుకోవడం – అని అర్థం చేసుకున్నాను.
II చదవడం, అవగాహన చేసుకోవడం
1. పాఠంలోని పదాల ఆధారంగా కింద తెలిపిన వాటిని వేటితో పోల్చారో రాయండి.
 అ) రసజ్ఞత ఆ) అవివేకం ఇ) వాక్కు
 జవాబు:
 అ) రసజ్ఞత : కూరలో వేసే ‘ఉప్పు’ తో పోల్చారు.
 ఆ) అవివేకం : ఎదుటివాడి బలం తెలియకుండా యుద్ధానికి దిగడం ‘అవివేకం’ అని చెప్పారు.
 ఇ) వాక్కు : సంస్కారవంతమైన మాటను అలంకారంతో పోల్చారు.
2. కింద ఇచ్చిన భావానికి తగిన పద్యపాదం గుర్తించి రాయండి.
 అ) గొప్పవారు లోకానికి మేలు జరిగే పనులను ఎంత కష్టమైనా చేస్తారు.
 జవాబు:
 ఘనగుణశాలి లోకహితకార్యము మిక్కిలి భారమైన మేలనుకొని పూను
ఆ) పొట్టేలు కొండతో ఢీకొంటే, దాని తల పగులుతుంది.
 జవాబు:
 కొండతోఁ దగరు ఢీకొని యెంత తాఁకినఁ దల ప్రక్కలగుఁగాక దాని కేమి
ఇ) తిన్నతిండి జీర్ణమైతే బలం కలుగుతుంది.
 జవాబు:
 తిండి జీర్ణమైన నిండు బలము
ఈ) రసజ్ఞత లేకపోతే గొప్పవాళ్ళు మెచ్చుకోరు.
 జవాబు:
 రసజ్ఞత యించుక చాలకున్న నా చదువు నిరర్థకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరు.

3. సభారంజన శతకం’లో క్షమ అనే పదాన్ని ప్రతి పాదంలోనూ వాడటం కనిపిస్తున్నది కదా ! క్షమను ఏ ఏ అర్థాలలో ఉపయోగించారో చెప్పండి.
 జవాబు:
 మొదటి పాదంలో క్షమను “ఓరిమి” అనే అర్థంలోను,
 రెండవ పాదంలో క్షమను “భూమి” అనే అర్థంలోను,
 మూడవ పాదంలో క్షమను “సహనం” అనే అర్థంలోను
 నాలుగవ పాదంలో క్షమను “సమర్థత” అనే అర్థంలోను వాడారు.
4. పాఠంలోని పద్యాలు ఆధారంగా తప్పు-ఒప్పులు గుర్తించండి.
 అ) రత్నహారాలు మనిషికి నిజమైన అలంకారం. (తప్పు)
 ఆ) ఉప్పులేని కూరైనా రుచిగా ఉంటుంది. (తప్పు)
 ఇ) సూర్యుని పైకి దుమ్ము ఎత్తి పోస్తే అది పోసినవాడి మీదే పడుతుంది. (ఒప్పు)
 ఈ) తిండి జీర్ణం కాకపోతే మనకు ఆరోగ్యం. (తప్పు)
5. పాఠం ఆధారంగా జవాబులు రాయండి.
అ) గొప్పవారి వల్ల ప్రజలకు కలిగే మేలు ఏమిటి?
 జవాబు:
 గొప్పవారు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసేటందుకే ప్రయత్నం చేస్తారు. ఎదుటివారి నుండి ఎటువంటి లాభాలను ఆశించరు. లోకానికి మేలు కలిగించే పని ఎంతటి భారమైనప్పటికీ చేయడానికి పూనుకుంటారు.
ఆ) రాజులను ఎందుకు ఆశ్రయించకూడదని కవి భావించాడు?
 జవాబు:
 రాజులను ఆశ్రయించవలసిన పనిలేదని ధూర్జటి కవి, తన శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఇలా చెప్పాడు
 1) తినడానికి తిండి కావాలని అడిగితే ఎవరైనా భిక్షం పెడతారు.
 2) నివసించడానికి కావలసివస్తే గుహలు ఉన్నాయి.
 3) వస్త్రాలు కావాలంటే వీధుల్లో దొరుకుతాయి.
 4) త్రాగడానికి నదుల్లో తియ్యని నీరు ఉంది.
కాబట్టి రాజులను కూటికీ, ఇంటికీ, బట్టకూ ఆశ్రయించనక్కరలేదని కవి చెప్పాడు.
ఇ) “ఎలాంటి చదువు వ్యర్థమని” మీరు తెలుసుకున్నారు?
 జవాబు:
 ఎంత చదువు చదివినా దానిలోని అంతరార్థాన్ని, రసజ్ఞతను గ్రహించలేని చదువు వ్యర్థమని తెలుసుకున్నాను.
ఈ) ఏవేవి అవివేకమైన పనులని ఈ పాఠం ద్వారా తెలుసుకున్నారు? వీటివల్ల కలిగే ఫలితాలు ఏమిటి?
 జవాబు:
 సూర్యుని మీద దుమ్మెత్తి పోయడం, పొట్టేలు కొండతో ఢీకొనడం, మిడతలు మంటపైకి ఎగిసిపడడం, వలలో చిక్కుకున్న చేప పొరలాడడం, అలాగే ఎదుటివాడి బలం తెలియకుండా వాడితో యుద్ధానికి దిగడం – అనే పనులు అవివేకమైన పనులని నేను తెలిసికొన్నాను.
వీటి వల్ల కలిగే ఫలితాలు :
 సూర్యుడి మీద దుమ్మెత్తి పోస్తే, పోసినవాడి నెత్తిమీదే పడుతుంది. పొట్టేలు కొండతో ఢీకొంటే పొట్టేలు తల బద్దలౌతుంది. మిడతలు మంటపైకి దూకితో అవే మాడిపోతాయి. వలలో చిక్కిన చేప పొరలాడితే అది మరింతగా బందీ అవుతుంది. ఎదుటివాడి బలం తెలియకుండా పోరాటానికి దిగితే దిగినవాడే ఓడిపోతాడు.
ఉ) నిజమైన అలంకారం ఏది?
 జవాబు:
 బంగారు హారాలు ధరించడం, సిగలో పువ్వులు అలంకరించుకోవడం, సుగంధ ద్రవ్యాలు వాడటం, పన్నీటి ‘స్నానం, మొదలైనవి మానవుడికి అలంకారాలు కావు. సంస్కారవంతమైన మాటయే, పురుషుడికి నిజమైన అలంకారం.

ఊ) ఏ ఏ బలహీనతల వల్ల ఏవేవి ఎలా నశిస్తాయి?
 జవాబు:
 మానవుడు ఎన్నో బలహీనతలకు లోను అవుతున్నాడు. ఏనుగు తన దురదను పోగొట్టుకొనడానికి, చేప నోటి రుచిని ఆశించి, పాము రాగానికి వశపడి, జింక అందానికి బానిస అయి, తుమ్మెదలు పూల వాసనలకు మైమరచి బందీలవుతున్నాయి. ఇలా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క బలహీనత వల్ల నశించిపోతున్నాయి.
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
అ) గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో మీరు ఊహించి రాయండి.
 జవాబు:
 ‘పరోపకారార్థం ఇదం శరీరం’ అనగా ఇతరులకు మేలు చేయడం కోసమే ఈ శరీరం అని అర్థం. గొప్పవాళ్ళు అంటే, స్వార్థం విడిచి ఇతరులకు మేలు చేసేవారు. గొప్పవాళ్ళు కీర్తిని కోరుకుంటారు. స్వలాభాన్ని ఆశించరు. అటువంటి గొప్పవారు లోకానికి మేలు కలిగించే పని, అది ఎంత భారమైనా చేయడానికి పూనుకుంటారు. ఆదిశేషుడు తాను గాలిని మాత్రమే పీలుస్తాడు. కానీ తన వేయిపడగల మీద పెద్ద భూభారాన్ని ఏ మాత్రం కదలకుండా మోస్తాడు. స్వార్థ రాహిత్యం , కీర్తికాంక్ష కారణంగా, గొప్పవాళ్ళు లోకహిత కార్యాలు చేస్తారు.
ఆ) వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు?
 జవాబు:
 సంస్కారవంతమైన వాక్కే, మనిషికి నిజమైన అలంకారం. బంగారు హారాలు ధరించడం, సిగలో పూలు పెట్టుకోవడం, సుగంధ ద్రవ్యాలు ఉపయోగించడం, పన్నీటితో స్నానం చెయ్యడం మొదలైన పనులు, మానవుడికి అలంకారాలు కావు. ఒక్క పవిత్రమైన వాక్కే, మానవుని అలంకరిస్తుంది. వాక్కు అనే అలంకారమే నిజమైన మంచి అలంకారము. మిగిలిన కేయూరములు వంటి భూషణాలు అన్నీ నశించేవే.
ఇ) సమర్థులు అంటే ఎవరు ? సామర్థ్యం ఎలా వస్తుంది?
 జవాబు:
 ఎవరైతే ఓర్పుతో, సహనంతో అన్ని పనులను తమంత తాము నిర్వర్తించగలుగుతారో వారిని “సమర్థులు” అంటారు. ఎవరు ప్రయత్నం చేసి ఓరిమిని కాపాడుకుంటారో, వారే భూమిని కాపాడగలరు. అంటే క్షమాగుణం గల ప్రభువులే, రాజ్యమును రక్షింపగలరు. ఎవరిలో సహనగుణం నిశ్చలంగా ఉంటుందో వారే అన్ని పనుల్లోనూ సమర్థులై ఉంటారు. క్షమాగుణం గలవారే సమర్థులు. క్షమాగుణం వల్లనే సామర్థ్యం వస్తుంది.
ఈ) చదువును మంచికూరతో కవి ఎందుకు పోల్చాడు?
 జవాబు:
 చాలామంది చదువుకుంటారు. ఎంతో పాండిత్యాన్ని సంపాదిస్తారు. ఎంత చదువు చదివినా వారిలో కొంచెం రసజ్ఞత లేకపోతే ఆ చదువు వ్యర్థం. చదువును మంచికూరతో కవి పోల్చాడు. కూరలో తక్కిన దినుసులు అన్నీ వేసి చక్కగా నలభీమపాకం చేసినా, అందులో కొంచెం ఉప్పు వేయకపోతే ఆ కూర రుచిగా ఉండదు. అందుకే రసజ్ఞత లేని చదువుకు దృష్టాంతంగా ఉప్పులేని కూరను, కవి చెప్పాడు.

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
అ) మంచితనమంటే ఏమిటి? కొంతమందిలో మీరు గమనించిన మంచితనాన్ని గూర్చి రాయండి.
 జవాబు:
 ఎదుటివారిని నొప్పించకుండా, బాధ పెట్టకుండా, ఇతరులకు తన చేతనైన సహాయం చేస్తూ, సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా జీవించటాన్నే ‘మంచితనం’ అంటారు.
భారతంలో “సక్తుప్రస్థుడి” కథ ఉంది. కురుక్షేత్రంలో ‘సక్తుప్రస్థుడు’ అనే గృహస్థుడు ఉండేవాడు. ఆయనకు భార్య, కొడుకు, కోడలు ఉండేవారు. వారు ఆ పరిసరాల్లోని చేలల్లో తిరిగి, అక్కడ రాలిన ధాన్యం గింజలను ఏరి తెచ్చుకొని, వాటిని దంచి పిండి చేసికొని, దాన్ని వండుకొని సమంగా పంచుకొని తినేవారు.
ఒక రోజు వాళ్ళు తినడానికి సిద్ధంగా ఉండగా, ఒక ముసలివాడు ఆకలి అంటూ వచ్చాడు. వారు తమకు ఉన్నదంతా ఆ ముసలివాడికి తృప్తిగా పెట్టారు. ఆ వృద్దుడు సంతోషించాడు. సక్తుప్రస్తుడి కుటుంబం ఆకలితో ఉన్నా అతిథి ఆకలి తీర్చడమే ముఖ్యమని వారు భావించారు. అదే మంచితనం అని నా అభిప్రాయం.
ప్రస్తుత సమాజంలో నేను చాలా మందిలో ఈ మంచితనాన్ని గమనించాను. కొందరు తమ మంచితనంతో ఎదుటివారికి ధనరూపంలో సాయం చేస్తారు, వస్తురూపంలో సాయం చేస్తారు. కొందరు అనాథలైన పిల్లలను చేరదీసి వారి కోసం ఒక ట్రస్టును ఏర్పాటుచేసి దానికి ఆర్థిక సాయం చేస్తున్నారు. కొందరు వృద్ధులకు, పెద్దవారికి ఆశ్రమాలను ఏర్పాటు చేసి వారిని చేరదీస్తున్నారు. ఇంకా అనేక మంది తమ మంచితనంతో పలు ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శప్రాయమైన జీవనం సాగిస్తున్నారు.
ఆ) ‘సమర్థులకు క్షమ అవసరం’ వివరించండి.
 జవాబు:
 సమర్థులకు ‘ఓర్పు’ చాలా అవసరం. దీనికి భారత కథలో ధర్మరాజు చక్కని ఉదాహరణ. ధర్మరాజు గొప్ప పరాక్రమం గలవాడు. ఆయనకు కోపం వస్తే సప్త సముద్రాలూ ఏకం అవుతాయని కృష్ణుడు చెప్పాడు. ధర్మరాజుకు భీమార్జునుల వంటి తమ్ముళ్ళు ఉన్నారు. దుర్యోధనుడు ధర్మరాజుకు ఎన్నో ఆపదలు కల్గించాడు. ద్రౌపదిని అవమానించాడు. పాండవులను లక్క ఇంటిలో పెట్టి దహనం చేయాలని చూశాడు. వారిని అడవులకు పంపాడు. ఘోషయాత్ర పేరుతో వారిని అవమానించాలని చూశాడు. పాండవుల అజ్ఞాతవాసాన్ని భంగం చేయాలని విరాటుడి గోవులను పట్టించాడు. ఇన్ని చేసినా ధర్మరాజు క్షమాగుణంతో సహించాడు. కృష్ణుణ్ణి రాయబారిగా పంపాడు. విధిలేక యుద్ధం చేశాడు. జయించాడు. ఏకచ్ఛత్రాధిపతిగా రాజ్యం పాలించాడు.
దీనంతటికీ ధర్మరాజు క్షమాగుణమే కారణం.
IV. పదజాలం
1. కింది వాక్యాల్లో సమానమైన అర్థాన్నిచ్చే పదాలున్నాయి. వాటిని గుర్తించి, వాటి కింద గీతలు గీయండి.
అ) హృదయం మంచిదైతే అతడు మంచి మనిషి. అతని డెందములో అందరి పట్ల అభిమానమే ఉంటుంది. ఎదలో కల్మషం లేకుండా మాట్లాడితే అందరి చిత్రాలు సంతోషిస్తాయి.
 జవాబు:
 హృదయం మంచిదైతే అతడు మంచి మనిషి. అతని డెందములో అందరి పట్ల అభిమానమే ఉంటుంది. ఎదలో కల్మషం లేకుండా మాట్లాడిన అతని మాటలకి అందరి చిత్తాలు సంతోషిస్తాయి.
 హృదయం, డెందము, ఎద, చిత్తము
ఆ) మిడుతలు చిచ్చుపైకి ఎగిసిపడ్డాయి. అడవిలో వహ్ని రగులుకొన్నది. అగ్నిలో చేయిపెడితే కాలుతుంది.
 జవాబు:
 మిడుతలు చిచ్చు పైకి ఎగిసిపడ్డాయి. అడవిలో వహ్ని రగులుకొన్నది. అగ్నిలో చేయిపెడితే కాలుతుంది.
 చిచ్చు, వహ్ని, అగ్ని

2. కింది పదాలకు వ్యతిరేకార్థకం రాసి, ఈ రెండు పదాలతోనూ సొంతవాక్యాలు రాయండి.
 ఉదా :
 కీర్తి – అపకీర్తి
 మంచిపనులు చేస్తే కీర్తి వస్తుంది. చెడ్డపనులు చేస్తే అపకీర్తి వస్తుంది.
అ) అహితం – హితం
 అహితం చేకూర్చే మాటలు వినకూడదు. హితం చేకూర్చే మాటలే వినాలి.
ఆ) బాగుపడు – చెడిపోవు
 కొందరు బాగా చదువుకొని బాగుపడతారు. మరికొందరు పెద్దల మాటలు వినకుండా చెడిపోతున్నారు.
ఇ) నిస్సారం – సారం
 నా సారం గల మాటలు, నీకు నిస్సారంగా తోచాయి.
ఈ) ఫలం – నిష్ఫలం
 మంచివానికి నీతి చెపితే ఫలం ఉంటుంది. కాని మూర్ఖునికి ఎన్ని నీతులు ఉపదేశించినా అది నిష్ఫలం అవుతుంది.
3. కింది పదాలు చదవండి. ఏవైనా రెండేసి పదాలను ఉపయోగిస్తూ సొంతవాక్యాలు రాయండి.
 అ) చదువు
 ఆ) చెడిపోవు
 ఇ) హారాలు
 ఈ) ధనం
 ఉ) దుష్టుడు
 ఊ) బలం
 ఎ) మార్గం
 ఏ) చంచల స్వభావం
 ఉదా :
 చదువు జీవితానికి మార్గం చూపుతుంది.
 జవాబు:
- చదువు మనకు మార్గం చూపుతుంది.
- ధనం చంచల స్వభావం కలది.
- దుష్టుడు చెడిపోవుట తథ్యము.
- మనిషికి చదువు ధనంతో సమానం.
- దుష్టుడు మంచి మార్గంలో సంచరించడు.
- హారాలు, ధనం ఎప్పటికైనా పోయేవే.
- దుష్టుడు చంచల స్వభావం కలవాడు.
- ధనం, బలం ఉన్నవాడికి గర్వం వస్తుంది.
V. సృజనాత్మకత
* పాఠశాలలో పిల్లలకు ‘పద్యాలతోరణం’ అనే పోటీ పెట్టారు. ఈ పోటీలో పిల్లలందరూ పాల్గొనాలని తెలియజేయడానికి ప్రకటన రాయండి. ప్రకటనలో నిర్వహించే తేదీ, స్థలం, సమయం మొదలగు వివరాలు ఉండాలి.
 జవాబు:
| ప్రకటన విజయవాడ నగరంలోని ఉన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినీ విద్యార్థులందరకూ ఒక శుభవార్త. దివి. xxxxxవ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సత్యనారాయణపురం, మహాత్మాగాంధీ మునిసిపల్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో ‘పద్యాలతోరణం’ పోటీ నిర్వహిస్తున్నాము. ఈ పోటీలో నగరంలోని విద్యార్థినీ విద్యార్థులందరూ పాల్గొనవచ్చు. తెలుగు పద్యాలు మాత్రమే చదవాలి. విజేతలకు ‘ఆంధ్ర మహాభారతం’ పూర్తి సెట్ బహుమతిగా ఇవ్వబడుతుంది. పాల్గొనే బాలబాలికలు తాము ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్నట్లు తమ ప్రధానోపాధ్యాయుల నుండి ధృవీకరణ పత్రం దాఖలు చేయాలి. పోటీలో పాల్గొనేందుకు రుసుము లేదు. పోటీ నియమాలు గంట ముందు తెలుపుతారు. ఇట్లు, x x x x x, | 
VI. ప్రశంస
* పాఠంలోని పద్యాలలో మీ మనసుకు హత్తుకున్న పద్యాలను గురించి, మీ మిత్రులతో చర్చించండి. మీరు చర్చించిన విషయాలు పది వాక్యాల్లో రాయండి.
 జవాబు:
 నేను, నా మిత్రులతో నేను చదివిన పద్యాలలో నుంచి కొన్నింటిని గూర్చి చర్చించాను. నాకు ‘చదువది ఎంత గలిగిన ….’ అనే పద్యంలోని విషయాలు, నీతి బాగా నచ్చాయని చెప్పాను. అలాగే ‘క్షమను కడఁక …..’ అనే పద్య సారము కూడా నాకు బాగా నచ్చిందని చెప్పాను. నా మిత్రుడు సాయి తనకు ‘ఊరూరం జనులెల్ల ….’ అనే పద్యం, దాని భావం బాగా నచ్చిందని చెప్పాడు. ఇంకొక మిత్రుడు ‘వనకరి చిక్కె ….’ అను పద్యసారం, ‘చదువు జీర్ణమైన …’ అను పద్యసారం బాగా నచ్చాయని చెప్పాడు. మేము ముగ్గురము ఈ పద్యాలలోని సారాన్ని, నీతిని ఎప్పటికీ మరువకుండా పాటించాలని నిర్ణయించుకున్నాము.
నాకు నచ్చిన పద్యములో చదువుకున్న విషయంలో ‘చదువది యెంతగల్గిన’ పద్యం ఎందుకు నచ్చిందంటే కవి చదువుకు వున్న ప్రాధాన్యతను చక్కగా చెప్పారు.
నా స్నేహితుడు సాయి తనకు ఊరూరం జనులెల్ల పద్యంలో కవి చెప్పిన నీతివాక్యాలు బాగా నచ్చాయని, ఎవరికి ఏ అవసరం వచ్చినా తీర్చడానికి భగవంతుడు ఉన్నాడని చెప్పిన మాటలు బాగా నచ్చాయని చెప్పాడు.
ఇలా ఒక్కొక్కరం ఒక్కొక్క పద్యాన్ని గురించి వివరంగా ‘చర్చించుకున్నాము.

(లేదా)
* చక్కని నీతులు చెప్పిన శతకకవుల గొప్పతనాన్ని వర్ణిస్తూ ఒక వ్యాసం రాయండి.
 జవాబు:
 ‘శతకం’ అంటే నూరు పద్యాల చిన్న గ్రంథం. శతక పద్యాలకు సామాన్యంగా చివర మకుటం ఉంటుంది. శతకాలలో సుమతీ శతకం, వేమన శతకం, భాస్కర శతకం, దాశరథీ శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం, కృష్ణ శతకం మొదలయిన శతకాలున్నాయి.
శతకకవులు నీతిని, భక్తిని, వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ గొప్ప శతకాలు రాశారు. వేమన శతకం, సుమతీ శతకాలలోని పద్యాలు రాని, తెలుగువాడుండడు. వేమన చెప్పిన “గంగిగోవుపాలు”, ‘ఉప్పు కప్పురంబు’, “తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు”, “నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు” వంటి పద్యాలు, గొప్ప జ్ఞానాన్ని బోధిస్తాయి. ఇక సుమతీ శతకకారుడు బద్దెన చెప్పిన ‘కనకపు సింహాసనమున’, “తన కోపమె తన శత్రువు”, “ఎప్పుడు సంపద కలిగిన”, “వినదగు నెవ్వరు సెప్పిన” మొదలైన కంద పద్యాలు, జీవితం అంతా గుర్తుంచుకోదగినవి. కృష్ణ శతకం, దాశరథీ శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం భక్తిని ప్రబోధించి వైరాగ్యాన్ని కల్గిస్తాయి. శేషప్పకవి రచించిన నరసింహ శతకం కూడా భక్తినీ, నీతిని బోధిస్తుంది. కుమార కుమారీ శతకాలు బాలబాలికలకు చక్కని నీతులనూ, ధర్మాలనూ, కర్తవ్యాన్ని బోధిస్తాయి. ఏనుగు లక్ష్మణకవి భర్తృహరి సుభాషితాలను అనువదించి, మూడు గొప్ప శతకాలను తెలుగువారికి అందించాడు.
మన తెలుగు శతకకర్తలు మన తెలుగువారికీ తెలుగుభాషకూ మహోన్నతమైన సేవచేసి ధన్యులయ్యారు.
ప్రాజెక్టు పని
* శతకపద్యాలలో చెప్పిన నీతులకు సరిపోయే కథలను సేకరించి, వాటికి నీతిపద్యాలను జోడించి ఆల్బమ్ తయారుచేయండి.
 జవాబు:
 ఉదా :
 (నీతిపద్యాలు – కథలు)
 1. సీ. దుష్టు సూర్యుని దెస దుమ్మెత్తి జల్లినఁ
 దనపైనె పడుఁగాక దానికేమి
 కొండతోఁ దగరు ఢీకొని యెంత తాఁకినఁ
 దల ప్రక్కలగుఁగాక దాని కేమి
 మిడతలు చిచ్చుపై వడి నెంతయెగసినఁ
 దామె పొక్కెడుఁ గాక దానికేమి
 వలఁ బడ్డ మీ నెంత వడి దాఁక బొరలిన
 దనుఁజుట్టు కొనుఁగాక దానికేమి
తే.గీ. యెదిరి సత్త్వంబు తన సత్త్వమెఱుఁగలేక
 పోరువాఁడెందున వివేకబుద్ధి యండ్రు
 కలిత లక్ష్మీశ, సర్వజగన్నివేశ
 విమల రవికోటిసంకాశ వేంకటేశ ! (వేంకటేశ శతకం)
2. బలవంతులకు గుణపాఠం
అనగనగా ఒక అడవి ఉన్నది. ఆ అడవిలో చాలా చీమలు నివసిస్తూ ఉండేవి. వాటిల్లో కొన్ని చీమలు కలిసి పెద్ద పుట్టను నిర్మించుకున్నాయి. అందులోనే జీవించసాగాయి. కొన్నాళ్ళకు ఆ పుట్టలో పెద్దపాము ప్రవేశించింది. దానితో చీమలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. చీమలు కష్టపడి ఆహారాన్ని సంపాదించుకుని ఆ పుట్టలో దాచి పెట్టుకున్నాయి. అదంతా ఆ పామువలన పాడైపోతున్నది. తనకు బలం ఉన్నది గదా ! అని పాము గర్వంతో ప్రవర్తిస్తున్నది.
చీమలు ఆలోచించాయి. “తాము కలిసికట్టుగా దాడిచేస్తే పాము ఏమీ చేయలేదు” అని అనుకున్నాయి. ఎక్కడెక్కడో ఉన్న తమతోటి చీమలకు తమ బాధను తెలుపుకున్నాయి. దానితో అవి అన్నీ కలసి వచ్చాయి. పెద్ద దండు తయారయ్యింది. అదను చూసి అన్నీ కలిసి పాము మీద దాడి చేశాయి. చీమల గుంపులో పాము కూరుకుపోయింది. ఏమీ చేయలేని నిస్సహాయురాలయ్యింది పాము. ఊపిరాడక కొంత సేపటికి ప్రాణాలు కోల్పోయింది. చీమలకు పాము పీడ విరగడయ్యింది.
నీతి : బలహీనులు అందరూ కలిస్తే బలవంతుల గర్వం అణగక తప్పదు.
VII. భాషను గురించి తెలుసుకుందాం!
1) కింది పదాలను విడదీసి, సంధి పేర్లు రాయండి.
 అ) చాలకున్న = చాలక + ఉన్న – (అ + ఉ) – (ఉత్వసంధి)
 ఆ) అదేమిటి = అది + ఏమిటి – (ఇ + ఏ) – (ఇత్వసంధి)
 ఇ) వెళ్ళాలని = వెళ్ళాలి + అని – (ఇ + అ) – (ఇత్వసంధి)
 ఈ) ఒకింత = ఒక + ఇంత -(అ + ఇ) – (అత్వసంధి)

2) కింది పదాలు చదవండి. పదంలోని చివరి అక్షరం కింద గీత గీయండి.
 పూచెను, వచ్చెను, తినెను, చూచెన్, ఉండెన్
పై పదాలను గమనిస్తే, పదాల చివర ‘ను’, ‘న్’లు కనిపిస్తాయి. అంటే పదాల చివర నకారం ఉన్నది.
ఈ ‘న’ కారాన్ని ద్రుతం అంటారు. ఈ చివరన ‘న’ కారం గల పదాలను ద్రుతప్రకృతికాలు అంటారు. పూచేను, వచ్చెను, చూచెన్ మొదలైనవి ద్రుతప్రకృతికాలే.
మరికొన్ని ద్రుతప్రకృతికాలను రాయండి.
 కాచెను, వ్రాసెను, తినెను, త్రాగెన్, చదివెన్ మొదలగునవి.
3) కింది వాటిని గమనించండి.
 ఉదా :
 అ) పూచెన్ + కలువలు = పూచెన్ + గలువలు
 ఆ) దెసన్ + చూచి = దెసన్ + జూచి
 ఇ) చేసెన్ + టక్కు = చేసెన్ + డక్కు
అభ్యాసం :
 పైన తెల్పిన ఉదాహరణల్లాగా కింది వాటిని వివరించండి.
 1) చేసెను + తల్లీ : చేసెను + దల్లీ
 2) దెసను + చూసి = దెసను + జూసి
గమనిక :
 మొదటి ఉదాహరణలో ద్రుత ప్రకృతికానికి ‘క’ పరమైతే, దానికి ఆదేశం (దాని స్థానంలో) ‘గ’ వచ్చింది.
రెండవ ఉదాహరణలో ద్రుత ప్రకృతికానికి ‘చూ’ పరమైతే దానికి ఆదేశంగా ‘జూ’ వచ్చింది. అలాగే ‘ట’ కు ‘డ’, ‘క’ కు ‘గ’, ‘చ’ కు ‘జ’ ఆదేశంగా వచ్చా యి.
 అంటే
 ‘క’ కు – గ ; ‘చ’ కు + జ ; ‘ట’ కు – డ;
గమనిక :
 1) ‘క, చ, ట, త, ప’ లకు ‘పరుషాలు’ అని పేరు.
 2) ‘గ, జ, డ, ద, బ, లకు ‘సరళాలు ‘ అని పేరు.
 పై ఉదాహరణలలోని భావాన్ని బట్టి సూత్రీకరిస్తే, ద్రుత ప్రకృతిక సంధి లేక సరళాదేశ సంధి సూత్రం ఇలా ఉండాలి.
1. సూత్రం :
 ద్రుత ప్రకృతికాలకు పరుషాలు పరమైతే సరళాలు ఆదేశంగా వస్తాయి.
 గమనిక :
 కింది ఉదాహరణలు చూడండి.
పూచెఁగలువలు – ద్రుతం అరసున్న (C) గా మారింది.
 ఉదా :
 పూచెను + కలువలు
 1) పూచెంగలువలు – ద్రుతం పూర్ణబిందువుగా (0) గా మారింది.
 2) పూచెన్గలువలు – ద్రుతం సంశ్లేషగా మారింది అంటే ద్రుతం మీది హల్లుతో కలిసింది.
 3) పూచెనుగలువలు – ద్రుతం ఏ మార్పూ చెందకుండా ఉంది.
పై ఉదాహరణల ఆధారంగా, ద్రుత ప్రకృతిక సంధి జరిగిన తీరును సూత్రీకరిస్తే ఇలా ఉంటుంది.
2. సూత్రం :
 ఆదేశ సరళానికి ముందున్న ద్రుతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి. అనగా ఒక్కోసారి బిందువు వస్తుంది. ఒక్కోసారి సంశ్లేష వస్తుంది.
ఛందస్సు :
1) ఒకే అక్షర గణాలు :
 ఒకే అక్షరం గణంగా ఏర్పడితే అది ఏకాక్షర గణం. ఈ గణంలో ఒక గురువు లేదా ఒక లఘువు ఒక్కొక్కటే గణంగా ఉంటాయి.
2) రెండు అక్షరాల గణాలు :
 రెండేసి అక్షరాలు కలిసి గణాలుగా ఏర్పడతాయి. వీటిలోనూ గురువు, లఘువులుంటాయి. ఇవి నాలుగు రకాలు
 అ) ఒక గురువు ఒక లఘువు కలిసి గణంగా ఏర్పడితే ఆ గణాన్ని ‘గలం’ లేదా ‘హ’ గణం అని అంటారు.
ఆ) ఒక లఘువు, ఒక గురువు కలిసి గణంగా ఏర్పడితే, అది ‘లగం’ లేదా ‘వ’ గణం అని అంటారు.
ఇ) రెండూ గురువులే గల గణాన్ని – ‘గగము’ అంటారు.
ఈ) రెండూ లఘువులే గల గణాన్ని – ‘లలము’ అంటారు.
అభ్యాసం :
 రెండక్షరాల గణాలు నాలుగు రకాలు ఉన్నాయి కదా ! ఒక్కొక్క దానికి 4 పదాల చొప్పున రాయండి.
3) మూడు అక్షరాల గణాలు :
 మూడేసి అక్షరాలు గల గణాలు ఎనిమిది. పట్టికలో చూడండి, మరికొన్ని పదాలు రాయండి.
వ్యాకరణంపై అదనపు సమాచారం
పర్యాయపదాలు
కరి : ఏనుగు, హస్తి, గజము, ఇభము
 భూరి : బంగారం, హేమం, సువర్ణం
 మిత్రుడు : స్నేహితుడు, సఖుడు, చెలికాడు
 పుష్పము : పూవు, సుమము, కుసుమము
 ధనము : సంపద, ఐశ్వర్యము, డబ్బు
 కొండ : అద్రి, పర్వతం, నగము
 భాస్కరుడు : రవి, సూర్యుడు, ప్రభాకరుడు
 మర్త్యుడు : మానవుడు, నరుడు
 వాణి : వాక్కు మాట
 జలము : నీరు, వారి, ఉదకము
 లక్ష్మి : శ్రీ, రమ, కమలాలయ
వ్యుత్పత్యర్థాలు
కేశము – శిరస్సున ఉండేది. (వెంట్రుక)
 ధరణి – సమస్తాన్ని ధరించునది (భూమి)
 భాస్కరుడు – కాంతిని కలుగజేయువాడు (సూర్యుడు)
 కరి – తొండము గలది (ఏనుగు)
 దాశరథి – దశరథుని కుమారుడు (శ్రీరాముడు)
 మిత్రుడు – సర్వప్రాణులందు సమభావన కలవాడు (సూర్యుడు)
 మర్త్యుడు – మరమున (భూ లోకమున) పుట్టినవాడు (నరుడు)

నానార్థాలు
ఎద = హృదయం, భయం
 ఫలము = పండు, ప్రయోజనం
 గుణము = స్వభావము, అల్లెత్రాడు
 అమృతం = పాలు, నీరు, సుధ
 మిత్రుడు = సూర్యుడు, స్నేహితుడు
 సుధ = అమృతం, పాలు, నీరు
 చీరము = వస్త్రము, గోచి, రేఖ
 రాజు = ప్రభువు, చంద్రుడు
 శ్రీ = సంపద, లక్ష్మి, సాలెపురుగు
 సత్త్వము = బలము, సామర్థ్యము, శక్యము
 ఇనుడు = సూర్యుడు, ప్రభువు, పోషకుడు
 కోటి = సమూహం, వందలక్షలు, అగ్రభాగం
 చవి = రుచి, సౌఖ్యము, దీవి
సంధులు
సవర్ణదీర్ఘ సంధి
 సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు అవే (సవర్ణ) అచ్చులు పరమైనప్పుడు వానికి దీర్ఘములు ఏకదేశమగును.
 భూరిమయాంగద = భూరిమయ + అంగద – సవర్ణదీర్ఘ సంధి
 లక్ష్మీశ = లక్ష్మి + ఈశ – సవర్ణదీర్ఘ సంధి
 జలాభిషేకం = జల + అభిషేకం – సవర్ణదీర్ఘ సంధి
 శీతామృత = శీత + అమృత – సవర్ణదీర్ఘ సంధి
 కాళహస్తిశ్వర = కాళహస్తి + ఈశ్వర – సవర్ణదీర్ఘ సంధి
 చీరానీకం = చీర + నీకం – సవర్ణదీర్ఘ సంధి
గుణసంధి
 సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమగునపుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఆదేశమగును.
 వేంకటేశ = వేంకట + ఈశ – గుణసంధి
 వీధులందు = వీధులు + అందు -గుణసంధి

ఉత్వసంధి
 సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి.
 సంయుతులెవ్వరు = సంయుతులు + ఎవ్వరు – ఉత్వసంధి
 భారమైన = భారము + ఐన – ఉత్వసంధి
 జనులెల్ల = జనులు + ఎల్ల – ఉత్వసంధి
సరళాదేశ సంధి
 సూత్రం :1) ద్రుతప్రకృతికము మీది పరుషములకు, సరళములగు.
 2) ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందుసంశ్లేషలు విభాషనగు.
 తనఁజుట్టు = తనన్ + చుట్టు – సరళాదేశ సంధి
 కీర్తిఁగోరు = కీర్తిన్ + గోరు – సరళాదేశ సంధి
ఆమ్రేడిత సంధి
 సూత్రం : అచ్చునకు ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి అవుతుంది.
 ఊరూర = ఊరు + ఊరు – ఆమ్రేడిత సంధి
అత్వసంధి
 సూత్రం : అత్తునకు సంధి బహుళంబుగానగు.
 చాలకున్న = చాలక + ఉన్న – అత్వసంధి
సమాసాలు
| సమాస పదం | విగ్రహవాక్యం | సమాసం పేరు | 
| ఘనగుణము | ఘనమైన గుణము | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం | 
| పవిత్రవాణి | పవిత్రమైన వాణి | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం | 
| సుభూషణము | మంచిదైన భూషణము | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం | 
| సర్వ కార్యములు | సమస్తములైన కార్యములు | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం | 
| మంచికూర | మంచిదైన కూర | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం | 
| మృదు పుష్పము | మృదువైన పుష్పము | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం | 
| లోకహితం | లోకము కొరకు హితం | చతుర్థి తత్పురుష సమాసం | 
| గుణసంయుతుడు | గుణములతో సంయుతుడు | తృతీయా తత్పురుష సమాసం | 
| జలాభిషేకము | జలముతో అభిషేకము | తృతీయా తత్పురుష సమాసం | 
| లక్ష్మిశ | లక్ష్మికి ఈశుడు | షష్ఠీ తత్పురుష సమాసం | 
| సహస్ర ముఖములు | సహస్ర సంఖ్యగల ముఖములు | ద్విగు సమాసం | 
| వాగ్భూషణము | వాక్కు అనెడి భూషణము | రూపక సమాసం | 
| కేశపాశము | కేశముల యొక్క పాశము | షష్ఠీ తత్పురుష సమాసం | 
| నలపాకము | నలుని యొక్క పాకము | షష్ఠీ తత్పురుష సమాసం | 
ప్రకృతి – వికృతులు
పుష్పం – పూవు
 కార్యం – కర్జం
 శ్రీ – సిరి
 లక్ష్మి – లచ్చి
 రాజు – రాట్టు
 కార్యం – కర్జము
 గుణము – గొనము
 చరిత్ర – చరిత
 గౌరవం – గారవం
 ముఖం – మొగము
 వీధి – వీది
 కీర్తి – కీరితి
శతక కవుల పరిచయం
| కవుల పేర్లు | కాలం | శతకం | 
| మారద వెంకయ్య | 17వ శతాబ్ది | భాస్కర శతకం | 
| మూలం – భర్తృహరి | 7వ శతాబ్ది | సుభాషిత త్రిశతి | 
| అనువాదం-ఏనుగు లక్ష్మణకవి | 18వ శతాబ్ది | సుభాషిత రత్నావళి | 
| కంచర్ల గోపన్న (రామదాసు) | 17వ శతాబ్ది | దాశరథీ శతకం | 
| మూలం – నీలకంఠ దీక్షితులు | 17వ శతాబ్ది | సభారంజన శతకం | 
| అనువాదం -ఏలూరిపాటి అనంతరామయ్య | 20వ శతాబ్ది | |
| ధూర్జటి | 16వ శతాబ్ది | శ్రీకాళహస్తీశ్వర శతకం | 
| తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు | 16వ శతాబ్ది | వేంకటేశ శతకం | 
| కొండూరు వీర రాఘవాచార్యులు | 20వ శతాబ్ది | మిత్ర సాహఠి | 
పద్యాలు – ప్రతి పదార్థాలు – భావాలు
1వ పద్యము (కంఠస్థ పద్యం)
*చ. తనకు ఫలంబు లేదని యెదం దలపోయఁడు కీర్తిఁ గోరు నా
 ఘనగుణశాలి లోకహితకార్యము మిక్కిలి భారమైన మే
 లనుకొని పూను శేషుఁడు సహస్రముఖంబుల గాలి గ్రోలి తా
 ననిశము మోవఁడే మణి మహాభరమైన ధరిత్రి భాస్కరా !
 (భాస్కర శతకం)
 ప్రతిపదార్థాలు:
 భాస్క రా = సూర్య భగవానుడా !
 కీర్తిన్ = యశమును
 కోరు = అపేక్షించునట్టి
 ఆ ఘనగుణశాలి = ఆ గొప్ప గుణములచే ఒప్పువాడు
 తనకున్ = తనకు
 ఫలంబు = లాభము
 లేదు + అని = లేదని
 ఎదన్ = మనస్సులో
 తలపోయడు = ఆలోచింపడు
 లోకహిత కార్యము; లోక = లోకమునకు
 హిత = మేలయిన
 కార్యము = పని
 మిక్కిలి భారము + ఐనన్ = చాలా కష్టమైనా
 మేలు = మంచిది అని
 అనుకొని = భావించి
 పూనున్ = ప్రయత్నిస్తాడు
 శేషుడు = ఆదిశేషుడు
 సహస్రముఖంబులన్ = (తన) వేయినోళ్ళతోనూ
 గాలి = గాలిని
 క్రోలి = పీల్చి (మేసి)
 తాన్ = తాను
 మహాభరము = మిక్కిలి బరువు
 ఐన = అయిన
 ధరిత్రిన్ = భూమిని
 అనిశమున్ = ఎల్ల కాలమును
 మోవడే (మోవడు + ఏ) : మోయడం లేదా ! (మోస్తున్నాడు)
భావం :
 భాస్కరా ! ఎంత చదువు చదివినా, అందులోని అంతరార్థాన్ని, మనోజ్ఞతను గ్రహించే శక్తి లేనప్పుడు ఆ చదువు వ్యర్ధము. దాన్ని గుణవంతులు ఎవరూ మెచ్చుకోరు. ఎన్ని పదార్థాలు వేసి నలపాకంగా వంట చేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా !
నీతి : గుణవంతుడు ఎపుడూ లోకానికి మేలు జరిగే పనులు చేస్తాడు.

2వ పద్యము – (కంఠస్థ పద్యం)
*చ. చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
 చదువు నిరర్థకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం
 బదనుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
 పొదవెడు నుప్పులేక రుచి పుట్టఁగ నేర్చునటయ్య భాస్కరా!
 (భాస్కర శతకం)
 ప్రతిపదార్థాలు:
 భాస్కరా = ఓ సూర్య భగవానుడా !
 చదువు = చదువు
 అది = అది
 ఎంత కల్గినన్ = ఎంత ఉన్నప్పటికీ
 రసజ్ఞత = అందులోని సారాన్నీ, మనోజ్ఞతనూ గ్రహించే నేర్పు
 ఇంచుక = కొంచెము
 చాలకున్నన్ (చాలక + ఉన్నన్) : లేకపోతే
 ఆ చదువు = ఆ పాండిత్యము
 నిరర్ధకంబు = పనికిమాలినది అవుతుంది
 ఎచ్చటన్ = ఎక్కడైనా
 గుణసంయుతులు = మంచి గుణములు గలవారు
 ఎవ్వరు = ఎవరూ
 మెచ్చరు = ఆ చదువును మెచ్చుకోరు
 (ఎట్లన) = (అదెలా గంటే)
 మంచికూరన్ = మంచి కూరను
 నలపాకము = నల చక్రవర్తి చేసే పాకము వంటి పాకమును
 చేసినన్ = చేసినప్పటికీ
 అందున్ = ఆ కూరలో
 ఇంపు + ఒదవెడు = చక్కని రుచిని పుట్టించే
 ఉప్పు లేక = ఉప్పు లేకపోతే
 రుచి = (ఆ కూరకు) రుచి
 పుట్టగన్ + నేర్చును + అటయ్య = కలుగుతుందా ? (కలుగదు)
భావం :
 భాస్కరా ! కీర్తిని కోరే గుణవంతుడు తనకు ఎలాంటి లాభాలు కావాలని ఆశించడు. లోకానికి మేలు జరిగే పని ఎంత భారమైనా ఆ పనిని చేయడానికి పూనుకుంటాడు. సర్పరాజయిన ఆదిశేషుడు తన వేయి పడగల మీద ఈ పెద్ద భూభారాన్ని ఎప్పుడూ మోస్తున్నాడు కదా !

3వ పద్యము (కంఠస్థ పద్యం)
*ఉ. భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్
 భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధజలాభిషేకముల్
 భూషలు గావు పూరుషుని భూషితుఁ జేయుఁ బవిత్రవాణి, వా
 గ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశియించు నన్నియున్
 (సుభాషిత రత్నావళి)
 ప్రతిపదార్థాలు:
 మర్త్యులకున్ = మానవులకు
 భూరిమయాంగద తారహారముల్ ; భూరిమయ = బంగారు వికారమైన
 అంగద = కేయూరములునూ
 తారహారముల్ = ముత్యాల హారాలునూ
 భూషలు + కావు = అలంకారములు కావు
 భూషిత కేశపాశ ………. జలాభిషేకముల్; భూషిత = అలంకరింపబడిన
 కేశపాశ = వెంట్రుకల సమూహమునూ
 మృదుపుష్ప = మంచి పుష్పములునూ
 సుగంధ, జల + అభిషేకముల్ సుగంధ జల = మంచి వాసనగల నీటితో (పన్నీటితో)
 అభిషేకముల్ = స్నానములునూ
 భూషలు + గావు = అలంకారములు కావు
 పూరుషునిన్ = మనుష్యుని
 పవిత్రవాణి = పవిత్రమైన వాక్కు
 భూషితున్ + చేయున్ = అలంకరిస్తుంది
 వాగ్భూషణమే ; వాక్ + భూషణము + ఏ= వాక్కు అనెడి అలంకారమే
 సుభూషణము = మంచి అలంకారము
 భూషణముల్ = మిగిలిన అలంకారములు
 అన్నియున్ = అన్నీ
 నశియించున్ = నశిస్తాయి.
భావం :
 బంగారు ఆభరణాలు ధరించడం, కొప్పులో పువ్వులు పెట్టుకోవటం, సుగంధ ద్రవ్యాలను వాడటం, పన్నీరుతో స్నానాలు చేయటం మొదలైనవి మానవులకు నిజమైన అలంకారాలు కావు. సంస్కారవంతమైన మాటయే నిజమైన అలంకారం. మిగిలిన అలంకారాలు అన్నీ నశించిపోయేవే.
4వ పద్యము (కంఠస్థ పద్యం)
*చ. వనకరి చిక్కె మైనసకు, వాచవికిం జెడిపోయె మీను, తా
 వినికికిఁజిక్కెఁజిల్వ గనువేదురుఁ జెందెను లేళ్ళు, తావినో
 మనికి నశించెఁ దేటి, తరమా యిరుమూటిని గెల్వ వైదుసా
 ధనముల నీవె గావఁదగు దాశరథీ కరుణాపయోనిధీ ! (దాశరథీ శతకం)
 ప్రతిపదార్థాలు :
 దాశరథీ = దశరథుని పుత్రుడవైన రామా!
 కరుణాపయోనిధీ ! = కరుణకు సముద్రము వంటివాడా!
 వనకరి = అడవి ఏనుగు
 మైనసకున్ = శరీరపు దురదకు (దేహము నందలి చాపల్యమునకు)
 చిక్కెన్ = చిక్కుపడింది
 మీను = చేప
 వాచవికిన్ = నోటివాపిరితనమునకు ; (నోటి రుచికి) గాలమునందు గుచ్చిన ఎఱ్ఱ రుచికి
 బిల్వ = పాము
 తాన్ = తాను
 వినికికిన్ = వినడానికి (పాములవాడు ఊదే స్వరాన్ని వినడానికి)
 చిక్కెన్ = చిక్కుపడుతుంది
 లేళ్ళు = లేళ్ళు
 కనువేదురున్ = కంటి పిచ్చిని
 చెందున్ = పొందుతాయి (చక్షురింద్రియానికి లోనయి చిక్కువడుతాయి)
 తేటి = తుమ్మెద
 తావిలో = వాసనలో
 మనికిన్ = ఉండడం చేత
 నశించెన్ = నశించింది
 ఇరుమూటిని = ఐదింటినీ (ఐదు ఇంద్రియాలనూ)
 గెల్వన్ = జయించడానికి
 తరమా = శక్యమా
 ఐదు సాధనములన్ = పంచవిధములైన ఉపాయాల చేత
 నీవె = నీవే
 కావదగున్ = రక్షించాలి
భావం :
 తన దురదను పోగొట్టుకోవడానికి ఏనుగు, నోటి రుచిని ఆశించి చేప, రాగానికి లొంగి పాము, అందానికి బానిసయై జింక, పూల వాసనలకు మైమరచి తుమ్మెదలు బందీలవుతున్నాయి. ఇలా ఒక్కొక్క ప్రాణీ ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్లనే నశిస్తున్నాయి. ఈ పంచేంద్రియ చాపల్యం గల నేను ఎలా బయటపడగలను? ఓ రామా ! కరుణా సాగరా ! నీవే నన్ను కాపాడాలి.

5వ పద్యము – (కంఠస్థ పద్యం)
*ఆ.వె. క్షమను కడఁక నెవరు గాపాడుకొందులో
 క్షమను చిరము వారు కావ గలరు
 కదలకుండ నెవరికడ క్షమయుండునో
 సర్వకార్యములకు క్షములు వారు
 (సభారంజన శతకం)
 ప్రతిపదార్థాలు :
 ఎవరు = ఎవరు
 కడకన్ = ప్రయత్నంతో
 క్షమను = ఓర్పును (ఓరిమిని)
 కాపాడుకుందురో = కాపాడుకుంటారో
 వారు = వారు
 క్షమను = భూమిని
 చిరము = చాలాకాలము
 కావగలరు = రక్షింపగలరు
 కదలకుండ = నిశ్చలంగా
 దుమ్ము = ధూళిని (దుమ్మును)
 ఎత్తి = పైకి ఎత్తి
 చల్లినన్ = చల్లితే
 తనపైనే = తన మీదనే
 పడుగాక = పడుతుంది కాని
 దానికేమి = దానికిన్ + ఏమి = సూర్యునికి ఏమవుతుంది?
 కొండతోన్ = కొండతో (పర్వతంతో)
 తగరు = పొట్టేలు
 ఢీకొని = ఎదుర్కొని
 ఎంత తాకినన్ = ఎంతగా పోరాడినా
 తల = పొట్టేలు తల
 ప్రక్కలు + అగున్ + కాక = ముక్కలు ఔతుంది కాని
 దానికిన్ + ఏమి = ఆ కొండకు ఏమవుతుంది? (ఏమీకాదు)
 మిడతలు = ‘మిడతలు’ అనే ఎగిరే పురుగులు
 చిచ్చుపై = నిప్పుపై
 వడిన్ = వేగంగా
 ఎంత + ఎగసినన్ = ఎంతగా ఎగిరినా (వ్యాపించినా)
 తామె (తాము + ఎ) = తామే (మిడతవే మాడిపోతాయి)
 పొక్కెడున్ + కాక = పరితపిస్తాయి కాని
 దానికిన్ + ఏమి = ఆ నిప్పుకు ఏమి బాధ ఉంటుంది?
 వలన్ + పడ్డ = వలలో చిక్కుపడిన
 మీను = చేప
 ఎంత వడిదాక = ఎంత సేపటి వరకు
 పొరలిన = అటునిటూ దొర్లినా
 చుట్టుకొనున్ + కాక = చుట్టుకుపోతుంది కాని
 దానికేమి (దానికిన్ + ఏమి) : ఆవలకు ఏమౌతుంది? (ఏమీకాదు)
 ఎదిరిసత్త్వంబు = ఎదుటి వాడి బలము
 తన సత్త్వము = తన బలము
 ఎఱుగలేక = తెలిసికోలేక
 పోరువాడు = యుద్ధానికి దిగేవాడు
 అవివేకబుద్ధి = వివేకములేని బుద్ధిగలవాడని
 = అంటారు
భావం :
 ఓ వేంకటేశ్వరా ! నీవు లక్ష్మీ సమేతుడవు. లోకమంతటా నిండియున్నవాడవు. కోటి సూర్యుల తేజస్సు కలవాడవు. లోకంలో ఎవరైనా దుర్మార్గుడై సూర్యుని మీద దుమ్మెత్తి పోస్తే అది వాడి మీదే పడుతుంది. కొండతో పొట్టేలు ఢీకొంటే దాని తలే బద్దలౌతుంది. మిడతల గుంపు మంటలపైకి ఎగిసిపడితే అవే మాడిపోతాయి. వలలో చిక్కుకున్న చేప ఎంత పొరలాడినా మరింతగా బందీ అవుతుంది. ఇలా ఎదుటివాడి బలం తెలియకుండా యుద్ధానికి దిగితే వాడిని అవివేకి అంటారు.

8వ పద్యము
ఆ.వె. చదువు జీర్ణమైన స్వాంతంబు పండును
 తిండి జీర్ణమైన నిండు బలము
 చెఱుపు గూర్చు రెండు జీర్ణముల్ గాకున్న
 విశ్వహితచరిత్ర వినర మిత్ర -(మిత్ర సాహఠి)
 ప్రతిపదార్థాలు :
 మిత్ర = లోకక్షేమాన్ని కోరే మిత్రమా ! (స్నేహితుడా !)
 విను = ఒక మాట విను
 చదువు = చదువు
 జీర్ణమైన (జీర్ణము + ఐన) = జీర్ణించుకుంటే (ఆకళింపు చేసుకుంటే)
 స్వాంతంబు = మనస్సు
 పండును = పరిపక్వము అవుతుంది
 తిండి = తిన్న తిండి
 జీర్ణమైన (జీర్ణము + ఐన)= జీర్ణించుకుంటే = తనను
 బలము, నిండున్ = బలం, అతిశయిస్తుంది
 జీర్ణముల్ + కాకున్నన్ = జీర్ణములు కాకపోతే (ఒంట బట్టకపోతే)
 రెండు = చదివిన చదువు, తిన్న తిండి అనే రెండూ కూడా
 చెఱుపు = కీడు
 కూర్చున్ = కలిగిస్తాయి
భావం :
 లోకక్షేమాన్ని కోరే మిత్రమా ! ఒక మాట విను. చదివిన చదువును జీర్ణించుకుంటే మనస్సు పరిపక్వమవుతుంది. తిన్న తిండి జీర్ణమైతే బలం కలుగుతుంది. ఆ రెండూ జీర్ణం కాకపోతే చెరుపు చేస్తాయి.
