AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 గులాబి అత్తరు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 3 గులాబి అత్తరు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions ఉపవాచకం 3rd Lesson గులాబి అత్తరు

8th Class Telugu ఉపవాచకం 3rd Lesson గులాబి అత్తరు Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

కింది పరిచిత గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. “ఇంకేమంటే మనవి చేసుకున్నాను గదా,
గోల్కొండ తరవాత పెద్దాపురమే చూడతగ్గదని విన్నానని ? ముందు తమరిది చిత్తగించకోరుతున్నాను.” ఇలా అని, భాను, మూత తెరిచి ఒక చిన్న పెట్టి దివాంజీ ముందు వుంచాడు. లోపల, ఎర్రని ముఖముల్ గుడ్డ అతికించిన చక్కని పెట్టి అది. అందులో ఒక చిన్న సీసా. చక్కని నగిషీ పనితో
యెంతో ముచ్చటగా వుందది. సీసాలో సగానికి పైగా అత్తరు వుంది. అది చూసి అక్కడివారందరూ గుటకలు మింగారు.
ప్రశ్నలు :
1. గోలకొండ తరువాత చూడదగినది ఏది?
జవాబు:
గోలకొండ తరువాత చూడదగినది పెద్దాపురం.

2. అత్తరు సీసా ఎలా ఉంది?
జవాబు:
అత్తరు సీసా చక్కని నగిషీ పనితో ఎంతో ముచ్చటగా ఉంది.

3. సీసాలో ఎంత అత్తరు ఉంది?
జవాబు:
సీసాలో సగానికి పైగా అత్తరు ఉంది.

4. అత్తరు సీసా చూసి అక్కడివారు ఏమి చేశారు?
జవాబు:
అత్తరు సీసా చూసి అక్కడివారు గుటకలు మింగారు.

2. “పెద్దాపురం ప్రభువులకు నజరు పెట్టుకుందామని తయారుచేశానది. గోల్కొండ నవాబుగారికి వట్టివేళ్ళ అత్తరు మిక్కిలి ప్రియం అని తెలిసి అదెంత శ్రద్ధగా తయారుచేశానో, పెద్దాపురం మహారాజులుంగారికి గులాబీ అత్తరు మిక్కిలి ప్రీతిపాత్రం అని తెలిసి అదీ అంతే శ్రద్ధగానూ తయారుచేశాను. ఆ సీసాలో ఉన్నది ఒక్కటే తులం – దీని నిమిత్తం కాశ్మీరం జాతి పువ్వులు వాడాను. ఢిల్లీ పరిసరాల్లో పారశీక జాతులే ఎక్కువ. కాశ్మీరజాతి చాలా అరుదుగా దొరుకుతుంది. అందుచేత, ఆ కాస్త అత్తరూ తయారు కావడానికి దాదాపుగా రెండేళ్ళు పట్టింది మహాప్రభూ” అని వివరించి చెప్పాడతను.

ఇది విని అక్కడివారు; దాని విశిష్టతా, విలువ ఊహించుకుని చాలా ఆనందించారు; కాని “ఆశ్చర్యమా?”
ప్రశ్నలు :
1. ఎవరికి నజరు పెట్టుకుందామని తయారు చేశాడు?
జవాబు:
పెద్దాపురం ప్రభువులకు నజరు పెట్టుకుందామని తయారు చేశాడు.

2. పెద్దాపురం మహారాజుకి ప్రీతిపాత్రం అయినది ఏది?
జవాబు:
పెద్దాపురం ప్రభువులకు గులాబీ అత్తరు ప్రీతి పాత్రమైనది.

3. గులాబీ అత్తరులో ఏ జాతి పువ్వులు వాడారు?
జవాబు:
గులాబీ అత్తరులో కాశ్మీరుజాతి పువ్వులు వాడారు.

4. ఢిల్లీ పరిసరాల్లో ఏ జాతులు ఎక్కువ?
జవాబు:
ఢిల్లీ పరిసరాల్లో పారశీక జాతులెక్కువ.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 గులాబి అత్తరు

3. ప్రతిఘటనలు అతిక్రమించగలిగితేనే జీవితానికి విజయం చేకూరుతుంది. కాని, ఒక్కొక్క జీవితానికి హృదయం పునాది అయితే, మరొక్క జీవితానికి మేధస్సు ప్రధానం అయి ఉంటుంది.

ఎక్కడ మేధస్సు ప్రధానమో అక్కడ అనుభూతి తక్కువయిపోతుంది. అక్కడ సానుభూతి కూడా ఉండదు. ఏ జీవితానికి పునాది హృదయమో అది కళాబంధురం అవుతుంది. అక్కడే కళలకు పరిణతి ఉంటుంది. అక్కడే కళలకు వినియోగం కూడా అక్కడే తన్మూలంగా కలిగే ఆనందానుభవమూ ఉంటుంది. అలాంటి ఆనందం తాననుభవించాలన్నా, ఇతర్లకు కలిగించాలన్నా ఆ కళాశీలి, తప్పనిసరిగా మహామేధావి అయివుండాలి.

కళావేత్తలోనే – కళాసాధనలోనే తన జీవితం పరిపక్వం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే? ఎవరి సంకల్పం విశుద్ధమో, ఎవరి హృదయం కళామయమో, ఎవరి దీక్ష అనన్య సామాన్యమో, ఎవరి ప్రాప్యం లోక కళ్యాణమో ఆ కళాశీలుల నిర్మాణాలే ద్వంద్వ భూయిష్టమైన భౌతికజగత్తులో ధ్రువతారలయి మెరుస్తూ ఉంటాయి.

నిజంగా షుకురల్లీ ఖాను అలాంటి కళాశీలి. అతని అత్తరు అలాంటి ధ్రువతార.
ప్రశ్నలు :
1. ఎక్కడ మేధస్సు ప్రధానమో అక్కడ ఏది తక్కువౌతుంది?
జవాబు:
ఎక్కడ మేధస్సు ప్రధానమో అక్కడ అనుభూతి తక్కువయిపోతుంది.

2. వేటిలోనే ఒక జీవితాన్ని పరిపక్వం చేసుకుంటూ ఉండాలి?
జవాబు:
కళావేత్తలోనే, కళారాధనలోనే తన జీవితం పరిపక్వం చేసుకుంటూ ఉండాలి.

3. నిజమైన కళాశీలి ఎవరు?
జవాబు:
నిజమైన కళాశీలి షుకురలీఖాన్.

4. కళాశీలి తప్పనిసరిగా ఏమై ఉండాలి?
జవాబు:
కళాశీలి తప్పనిసరిగా మహామేధావి అయి ఉండాలి.

4. తన అత్తర్లకు విలువ కేవలం డబ్బే అయితే అందుకోసం అతనింత దూరం రానక్కర్లేదు. ఉన్నవూరే కదలనక్కర్లేదు. అసలు, ఢిల్లీ నగరమే ఒక మహాదేశం అంత. అక్కడే ఎందరో ప్రభువులూ, సంపన్నులు ఉన్నారు. వారిలో ఎందరో రసికులున్నారు. అతని అత్తర్లు కళ్ళకద్దుకునేవారు వందల వేలమంది ఉన్నారు.

అయితే, పెద్దాపురం ప్రభువు, శ్రీశ్రీశ్రీ శ్రీవత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహారాజు రసికత ఢిల్లీలో గుబాళించింది. ఢిల్లీ పాదుషా రసికతకే వంకలు దిద్దింది. అంచేత ఖాను ఆగలేకపోయాడు. దీక్ష పట్టాడు. తపస్సులో కూచున్నాడు. అపూర్వ సాధన చేశాడు. తహతహలాడిపోయాడు. రెక్కలు కట్టుకువచ్చి మరీ వాలాడు.

కాని, షష్టి గడియలూ పువ్వులతోనే కాలంగడిపే అతనికి, ఇక్కడ ప్రభుదర్శనం గగనపుష్పం అయిపోయింది. అపూర్వమైన జాతిరత్నం గులకరాళ్లతో కూడుకుపోయి వుండినట్టనిపించిదతనికి వచ్చి వచ్చి ముళ్ళకంచె ల్లోనూ, మురికి గుంటల్లోనూ పడిపోయినట్టు బాధపడ్డాడతను.
ప్రశ్నలు:
1. ఢిల్లీ నగరంలో ఎవరెవరు ఉన్నారు?
జవాబు:
ఢిల్లీ నగరంలో ఎందరో ప్రభువులు, సంపన్నులు ఉన్నారు.

2. అత్తర్లు కళ్ళకద్దుకునేవారు ఎంతమంది ఉన్నారు?
జవాబు:
అత్తర్లు కళ్ళకద్దుకునేవారు వందల వేల మంది ఉన్నారు.

3. పెద్దాపురం మహారాజు ఎవరు?
జవాబు:
పెద్దాపురం ప్రభువు శ్రీశ్రీ శ్రీ శ్రీవత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి

4. పేరాలోని రెండు జాతీయాలు ఏవి?
జవాబు:
తహతహలాడిపోవు, గగనపుష్పం.

5. తెల్లవారడం తడవుగా వెళ్ళి రాణేదారు పాదాల మీద వాలిపోయాడు ఖాను. ఇంతవరకూ అంత గొప్ప అత్తర్లు పెద్దాపురం కోటకు రాలేదన్న సంగతి రాణేదారుకి తెలుసు. ఖానుకి మంచి సన్మానం జరగడం దివాంజీకి సుతరామూ ఇష్టం లేదు. ఇది తెలుసు ఇతనికి. బుర్ర ఎగిరిపోడానికి కయినా ఒప్పుకుంటాడు గానీ భాను సరయిన ధర చెప్పడు ఇదీ తెలుసు అతనికి. అయితే మాత్రం మహారాజు చూశాడంటే భాను అత్తర్లు విడిచిపెట్టడు. ఈ విషయాన్ని ఆ సమయంలో దివాంజీ దగ్గర వుండిన వారందరూ గుర్తించేశారు.
ప్రశ్నలు:
1. ఖాను ఎవరి పాదాల మీద వాలిపోయాడు?
జవాబు:
భాను ఠాణేదారు పాదాలమీద వాలిపోయాడు. ఉంది.

2. భానుకి సన్మానం జరగడం ఎవరికి ఇష్టం లేదు?
జవాబు:
భానుకి సన్మానం జరగడం దివాంజీకి సుతరామూ ఇష్టం లేదు.

3. అత్తరు చూశాడంటే విడిచిపెట్టనిది ఎవరు?
జవాబు:
అత్తరును చూశాడంటే విడిచిపెట్టనిది మహారాజు.

4. ఈ పేరా ఆధారంగా దివాంజీ ఎలాంటి స్వభావం గలవాడు?
జవాబు:
ఈ పేరా ఆధారంగా దివాంజీ అసూయాపరునిగా తెలుస్తుంది.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 గులాబి అత్తరు

6. సీసా భళ్ళుమంది. సీసా పెంకులు ఘళ్ళున చెదిరిపడ్డాయి. రాజసఖుల హృదయాలు రువ్వుమన్నాయి. ఆ ప్రదేశం అంతా అత్తరు సౌరభంతో గుమ్మంది. అందరూ ఆ పరిమళానికి మత్తెక్కుతున్నట్టయ్యారు.

ఒక క్షణానికి తెలివివచ్చి అందరూ కళ్ళెత్తి చూసేటప్పటికి, హఠాత్తుగానూ అప్రయత్నంగానూ వెనక్కి తిరిగి చూసి ఖాను కొయ్యయిపోయాడు.

అదేమిటో అని అందరూ వెనక్కి తిరిగి చూడగా, పంచకళ్యాణి మీద శ్రీ శ్రీ శ్రీ శ్రీవత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహాద్భుతమైన గులాబి అత్తరు సౌరభాన్ని ఆఘ్రాణిస్తూ. ఎక్కడివీ సమనోహర సుగంధ పరిమళాలు అని అరకంట చూస్తూ నిలిచి ఉన్నాడు.

మోర పైకెత్తుకుని, పంచకళ్యాణి గుర్రం సైతం అద్భుతాన్ని ఆస్వాదిస్తూ ఉండుండి సప్రయత్నంగా ఊపిరి తీసుకుంటోంది.
ప్రశ్నలు :
1. రాజ సభ్యుల హృదయాలు ఏమైనాయి?
జవాబు:
రాజసఖుల హృదయాలు ఠువ్వుమన్నాయి.

2. మహారాజు దేని మీద వెళ్తున్నాడు?
జవాబు:
మహారాజు పంచకళ్యాణి మీద వెళ్తున్నాడు.

3. కొయ్యబారిపోయింది ఎవరు?
జవాబు:
కొయ్యబారిపోయింది ఖాను.

4. ఏ పరిమళానికి అందరు మత్తెక్కిపోయారు?
జవాబు:
గులాబీ అత్తరు పరిమళానికి అందరు మత్తెక్కి పోయారు.

II వ్యక్తీకరణ – సృజనాత్మకత

కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
“గులాబీ అత్తరు” కథను సంక్షిప్తంగా రాయండి.
జవాబు:
శ్రీశ్రీ శ్రీ శ్రీవత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహారాజు పెద్దాపురాన్ని పరిపాలించే ప్రభువు. ఆ రాజు యొక్క రసికత ఢిల్లీ వరకు వ్యాపించింది. ఆ వార్త విని ఢిల్లీ నగరవాసి అయిన షుకురల్లీఖాన్ ఎలాగైనా ఆ పెద్దాపురం ప్రభువును కలిసి తన అత్తరు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకున్నాడు.

షుకురలీఖాను ఎంతో సుమధుర సువాసనలు గుభాళించే అత్తరులను తయారు చేయడంలో పెట్టింది పేరు. ఈ భాను చేసే అత్తరుకు ఢిల్లీ ప్రభువులందరూ ముగ్ధులయ్యేవారు. ఖాను అత్తరు తయారీలో బాగా ఆరితేరినవాడు. అయితే పెద్దాపురం ప్రభువుకు తన అత్తరు గుభాళింపు చూపించి మంచి పేరు సంపాదించాలనుకున్నాడు. అందుకు గాను ఆ రాజ్యంలో కొలువులో పనిచేస్తున్న ఠాణేదారు సహాయంతో రాజ భవనానికి వచ్చాడు. రాజ కొలువులో జవానులు, పెద్ద మనుషులు, దివాంజీ ఉండడం గమనించి తన అత్తరు సీసా బిరడా తీసి, వెంటనే బిగించాడు. ఆ సుమధుర సువాసనకు అక్కడి వారందరికీ ఒక్కసారిగా మత్తెక్కినట్లయింది. అందరూ తమ ముక్కులకు పని చెప్పారు. అందరూ ఆ వాసనకు ముగ్ధులయ్యారు.

కాని దివాంజీ మాత్రం ఆ పరిమళాన్ని అసహ్యించుకున్నాడు. ఇది చూచి ఖాను నిరాశపడ్డాడు. ఎట్టకేలకు దివాంజీని కలిసి తాను అత్తరు వ్యాపారినని, తన వద్ద సువాసనతో కూడిన గులాబీ అత్తరు ఉందని చూపించాడు. కాని దివాంజీ ఆసక్తిని చూపలేదు. దాంతో నిరాశగా తిరిగి వెళ్ళాడు. మరుసటిరోజు ఖాను మళ్ళీ దివాంజీని కలిసే ప్రయత్నం చేశాడు. కానీ నిరాసే ఎదురైంది. తాను రెండు సంవత్సరాలు కష్టపడి తయారు చేసిన గులాబీ అత్తరు సీసాను కోపంగా కోట గోడవద్ద విసిరికొట్టాడు. అది పగిలిపోయింది. దాని వాసన అంతటా వ్యాపించింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న రాజు గారు అక్కడి పరిమళానికి ముగ్ధుడయ్యాడు.

ఖాను ఆశ నెరవేరింది. దివాంజీ ఎన్ని యుక్తులు పన్నినా, అనుమతి ఇవ్వకపోయినా తన గులాబి అత్తరు ప్రభువుల దృష్టిలో పడింది. తన సంకల్పసిద్ధి నెరవేరింది. తన ప్రయత్నానికి దేవుడే ప్రతిఫలాన్ని ఇచ్చాడని ఎంతో సంతోషించాడు. ప్రయత్నం ఉంటే ఫలితం దానంతట అదే వస్తుంది.

ప్రశ్న 2.
షుకురభీ ఖాన్ స్వభావం ఎలాంటిది?
జవాబు:
‘గులాబీ అత్తరు’ అనే పాఠ్యభాగంలో ఎన్నో పాత్రలు ఉన్నాయి. వాటిలో షుకురలీఖాన్ పాత్ర ప్రముఖమైంది. ఖాను ఒక అత్తరు వ్యాపారి. అతడు తయారుచేసే అత్తరుకు అందరు ముగ్గులవుతారు. ఢిల్లీ నవాబుతో ఎన్నో సత్కారాలు పొందాడు. ప్రశంస, కీర్తి కోసం నిరంతరం శ్రమపడే స్వభావం భానుది. ఖాను చేసిన అత్తరు పరిమళాన్ని ఆస్వాదించినవారు ఒక్కక్షణం మత్తెక్కినట్లు అవుతారు.

దక్షిణ దేశంలో పెద్దాపురం ప్రభువు కీర్తి దశదిశల వ్యాపించింది. అది తెలుసుకొని ఖాను రెండు సంవత్సరాలపాటు శ్రమించి తయారు చేసిన గులాబీ అత్తరును తీసుకొని పెద్దాపురం సమీపించాడు. రాజును సమీపించి అత్తరు ఇచ్చి కీర్తి ప్రతిష్ఠలను పొందాలని భావించాడు. రాజదర్శనం చాలా కష్టం అయింది. ఆ కొలువు కూటంలో ఉన్న దివాంజీని కలిసాడు. రాజదర్శనం కలిగించమని కోరాడు. కొన్నిరకాల అత్తరులను చూపించాడు. దివాంజీ ఆసక్తిని చూపలేదు. ఫలితం దక్కలేదు. కోపంతో ఖాను ఆ అత్తరు సీసాను ప్రాకారం పై కొట్టాడు. తన శ్రమ వృథా అయిందని భావించాడు.

గులాబి అత్తరు సీసా పగిలి ఆ పరిమళం, సౌరభం ఆ ప్రాంతం అంతా వ్యాపించిన సమయంలో రాజావారు అక్కడికే రావడం, ఆ సౌరభానికి ముగ్ధుడవ్వడం చూసి ఎంతో సంబరపడిపోయాడు. తన ప్రయత్నం ఫలించినందుకు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకున్న కృతజ్ఞతాశీలి. మాటల్లో నేర్పరి. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగల ధీరత్వం గల వ్యాపారి. లాభంతో పాటు, కీర్తిని ఆశించే కీర్తితత్పరుడు. అతని అత్తరు ధ్రువతార వంటిది.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 గులాబి అత్తరు

ప్రశ్న 3.
పెద్దాపురం ప్రభువు ఎవరు? ఆయన గురించి రాయండి.
జవాబు:
దక్షిణ భారత దేశంలో పెద్దాపురం ప్రభువు శ్రీ శ్రీ శ్రీ శ్రీవత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి ప్రసిద్ధుడు. ఈయన గొప్ప రసికరాజు. ఈయన కీర్తి దశదిశల విస్తరించింది. ఢిల్లీ వరకు విస్తరించింది. ప్రజలను ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా రాజ్యాన్ని పాలించాడు. ఉదార స్వభావం కలవాడు. పరిపాలనలో తన కార్యనిర్వహణా చతురతను ప్రదర్శించేవాడు. ఎంతటి సమస్యనైనా తన మేధా సంపత్తితో చక్కగా పరిష్కరించేవాడు. తన రాజ్యంలో అందరికి న్యాయం జరగాలని ఆకాంక్షించాడు. దివాంజీకి గొప్ప పదవిని ఇచ్చి గౌరవించాడు. అయితే దివాంజీ నమ్మకద్రోహం చేసేవాడు. దివాంజీ తన ముందు నటిస్తున్నాడనే విషయం తెలియక ఆయనకు గౌరవం ఇచ్చేవాడు.

పెద్దాపురం రాజావారు ఎంత సరసులో ఆయన పరివారం అంత విరసులు. పెద్దాపురంలోని ప్రజలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండేవారు. పంచకళ్యాణి గుర్రంపై నగర సంచారం చేస్తూ ఉండేవారు. ఖాను తన కోసం కష్టపడి రెండు సంవత్సరాల సమయం వెచ్చించి తయారుచేసిన గులాబి అత్తరును కోపంతో విసిరివేయగా అది పగిలి ఆ సువాసన అంతటా వ్యాపించగా, ఆ పరిమళాన్ని నిలబడి ఆశ్వాదించిన సువాసన ప్రియుడు. మహాద్భుతమైన గులాబి అత్తరు సౌరభాన్ని ఆఘ్రాణిస్తూ, ఆ సుమధుర, సుమనోహర సుగంధ పరిమళాలకు ఎంతో ముగ్ధుడయ్యాడు. దక్షిణ దేశానికంతటికీ జాతిరత్నం శ్రీవత్సవాయి ప్రభువు.