AP 7th Class Social Important Questions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం

These AP 7th Class Social Important Questions 9th Lesson భారత రాజ్యాంగం – పరిచయం will help students prepare well for the exams.

AP Board 7th Class Social 9th Lesson Important Questions and Answers భారత రాజ్యాంగం – పరిచయం

ప్రశ్న 1.
భారత ప్రభుత్వ చట్టం – 1935లోని ముఖ్యాంశాలేవి?
జవాబు:

  1. రాజ్యాంగం లేదు. బ్రిటిష్ పార్లమెంటు చేసిన చట్టాల ప్రకారం వారు భారతదేశాన్ని పాలించారు. వాటిలో, భారత ప్రభుత్వ చట్టం – 1935 చాలా ముఖ్యమైన చట్టం.
  2. ఈ చట్టం ద్వారా ప్రావిన్సులు (రాష్ట్రాలు) మరియు స్వదేశీ సంస్థానాలతో కూడిన అఖిల భారత సమాఖ్య ఏర్పడింది.
  3. కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాలను మూడు జాబితాలుగా విభజించింది.
  4. కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే విధంగా రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించింది.

ప్రశ్న 2.
బ్రిటిషు పాలనలో భారత రాజ్యాంగానికి సంబంధించి ఏవిధమైన చర్యలు చేపట్టినారు?
జవాబు:
బ్రిటిష్ పాలనలో భారత రాజ్యాంగానికి సంబంధించి చేపట్టిన చర్యలు:

  1. 1928వ సంవత్సరంలో, భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడానికి భారత జాతీయ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఒక కమిటీని ఏర్పాటు చేశాయి.
  2. మోతీలాల్ నెహ్రూ (జవహర్‌లాల్ నెహ్రూ తండ్రి) ఈ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు.
  3. ఈ కమిటీ తన నివేదికను 1929వ సంవత్సరంలో సమర్పించింది. దీనిని నెహ్రూ నివేదిక అని పిలుస్తారు.
  4. ఇది మొదటి రాజ్యాంగ పత్రంగా పరిగణించబడుతుంది. కానీ బ్రిటిష్ వారు అంగీకరించకపోవడం వలన ఇది అమలులోకి రాలేదు.
  5. 1931వ సంవత్సరంలో, కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం స్వతంత్ర భారతదేశం యొక్క రాజ్యాంగం ఎలా ఉండాలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
  6. నెహ్రూ నివేదిక మరియు కరాచీ తీర్మానం రెండూ సార్వత్రిక వయోజన ఓటు హక్కు స్వేచ్ఛ మరియు సమానత్వ హక్కుకు కట్టుబడి ఉన్నాయి.

ప్రశ్న 3.
రాజ్యాంగ సభ అనగానేమి? రాజ్యాంగ సభ నిర్మాణం గురించి వివరించండి.
జవాబు:
రాజ్యాంగ సభ :

  1. రాజ్యాంగాన్ని రూపొందించడానికి, ఎన్నుకోబడిన ప్రతినిధుల చేత ఏర్పడిన సభనే రాజ్యాంగ సభ అంటారు.
  2. చారిత్రకంగా, 1934లో భారత జాతీయ కాంగ్రెస్ ఒక రాజ్యాంగ సభ కోసం డిమాండ్ చేసింది. 1946 కేబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం, రాజ్యాంగ సభకు జులై 1946లో ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ సభ సభ్యులను అసెంబ్లీల సభ్యులు పరోక్షంగా ఎన్నుకున్నారు.
  3. క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ప్రతి బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుండి మరియు ప్రతి స్వదేశీ సంస్థానాల నుండి సీట్లు కేటాయించింది.
  4. దీని ప్రకారం, బ్రిటిష్ పాలనలో ఉన్న రాష్ట్రాలు లేదా ప్రాంతాల నుండి 292 మంది సభ్యులను ఎన్నుకున్నారు.
  5. మరియు స్వదేశీ సంస్థానాలు అన్ని కలిసి 93 మంది సభ్యులను ఎంపిక చేసాయి.
  6. ఢిల్లీ, అజ్మీర్-మేవాడ్, కూర్గ్ మరియు బ్రిటిష్ బెలూచిస్తాన్ నుండి నలుగురు సభ్యులను ఎన్నుకున్నారు.
  7. దీంతో భారత రాజ్యాంగ సభ. మొత్తం సభ్యుల సంఖ్య 389కి చేరుకున్నది.
  8. ఈ 389 మంది సభ్యులలో 26 మంది షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు, 9 మంది మహిళా సభ్యులు.
  9. 1947 ఆగస్టులో దేశ విభజనతో, రాజ్యాంగ సభను, భారత రాజ్యాంగ సభ మరియు పాకిస్తాన్ రాజ్యాంగ సభగా విభజించారు.
  10. భారత రాజ్యాంగ సభలో 299 మంది సభ్యులు ఉన్నారు. దీనికి డా|| బాబు రాజేంద్ర ప్రసాద్ ను అధ్యక్షునిగా ఎన్నుకొన్నారు.

AP 7th Class Social Important Questions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం

ప్రశ్న 4.
భారత రాజ్యాంగ పీఠిక యొక్క ముఖ్య ఆదర్శాలు మరియు వాటి నిర్వచనాలు తెల్పండి.
జవాబు:
భారత రాజ్యాంగ పీఠిక యొక్క ముఖ్య ఆదర్శాలు:

సర్వసతాక
బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం.

సామ్యవాదం
సమాజంలో సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ అసమానతలు తగ్గించడం ద్వారా సామాజిక న్యాయం అందించబడుతుంది.

లౌకిక వాదం
తమకు ఇష్టమైన మతాన్ని అనుసరించడానికి మరియు ప్రచారం చేసుకోవడానికి పౌరులకు హక్కు ఉంది. రాజ్యానికి అధికారిక మతం లేదు. అన్ని మతాలు సమానమే.

ప్రజాస్వామ్యం
ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులచే ప్రభుత్వం నడుపబడుతుంది.

గణతంత్ర వ్యవస్థ
రాజ్యాధినేత ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతారు.

న్యాయం :
భారత రాజ్యాంగం పౌరులందరికీ సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయాన్ని హామీ ఇచ్చింది. కులం, మతం మరియు లింగం ఆధారంగా పౌరుల పట్ల వివక్ష చూపరాదు. ప్రభుత్వం అందరి సంక్షేమం కోసం కృషి చేయాలి.

స్వేచ్చ :
అందరికి స్వేచ్చ అని అర్థం. రాజ్యాంగ ప్రవేశిక పౌరులకు ఒకరి స్వంత నమ్మకం మరియు విశ్వాసం ప్రకారం ఆలోచించడం, వ్యక్తీకరించడం మరియు ఆరాధించడం కోసం స్వేచ్ఛను అందిస్తుంది.

సమానత్వం :
చట్టం ముందు అందరూ సమానమే. పౌరులందరూ అభివృద్ధికి సమాన అవకాశాలు పొందుతారు. భారత రాజ్యాంగం యొక్క ఉపోద్ఘాతం పౌరులందరికీ సమాన హెూదా సాధించడానికి అవకాశాలను కల్పిస్తుంది.

సౌభ్రాతృత్వం :
అనగా సోదర భావం. ఇది ప్రజలందరి మధ్య ఐక్యత, సమగ్రత మరియు విధేయతను ప్రోత్సహిస్తుంది.

ఐక్యత మరియు సమగ్రత :
దేశం యొక్క ఐక్యత మరియు సమగ్రత అనేది మనం దేశం యొక్క అభివృద్ధి మరియు పురోగతి ఐక్యంగా ఉండాలని పేర్కొనడం పీఠికలోని మరొక వాగ్దానం. భారతదేశం సమాఖ్య స్వభావం కలిగి ఉన్నప్పటికీ, ఇది ఏకీకృత న్యాయవ్యవస్థ, ఏక పౌరసత్వం, ఒకే రాజ్యాంగం మరియు ప్రాథమిక హక్కులు మరియు అఖిల భారత సేవల వ్యవస్థను కలిగి ఉంది.

ప్రశ్న 5.
ప్రాథమిక హక్కుల గురించి వివరణాత్మకంగా తెల్పండి.
జవాబు:
ప్రాథమిక హక్కులు :

  1. హక్కులు అనేవి వ్యక్తుల సహేతుకమైన వాదనలు. ప్రాథమిక హక్కులనేవి ఒక దేశం తన పౌరులను రక్షించడానికి రాజ్యాంగం ప్రకారం గుర్తించబడినవి.
  2. ప్రజాస్వామ్య విజయం మరియు పౌరుల సమగ్ర అభివృద్ధి కొరకు ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడ్డాయి.
  3. వీటిని భారత సుప్రీం కోర్టు మరియు హైకోర్టులు నేరుగా పరిరక్షిస్తాయి.
  4. ప్రస్తుతం భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో, ఆర్టికల్ 14 నుండి 32 వరకు ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అవి చిత్రంలో చూపించబడ్డాయి.
    AP 7th Class Social Important Questions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం 1
    i) పీడనాన్ని నిరోధించే హక్కు
    ii) స్వేచ్ఛా హక్కు
    iii) సమానత్వపు హక్కు
    iv) మత స్వాతంత్ర్యపు హక్కు
    v) విద్యా సాంస్కృతిక హక్కు
    vi) రాజ్యాంగ పరిహారపు హక్కు

భారత రాజ్యాంగం ఆవిర్భావ సమయంలో, మనకు ఏడు థమిక హక్కులు ఉండేవి. కాని, 1978వ సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కు తొలగించబడింది.

AP 7th Class Social Important Questions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం

ప్రశ్న 6.
సమాచార హక్కు విద్యా హక్కు చట్టాల గురించి వివరించండి.
జవాబు:
సమాచార హక్కు చట్టం :

  1. సమాచార హక్కు చట్టం ప్రకారం, ప్రతి పౌరునికి ప్రభుత్వం నుండి ఏదైనా సమాచారం తీసుకోవడానికి అధికారం కల్పిస్తుంది.
  2. ఇది పరిపాలనలో పారదర్శకతను నిర్ధారిస్తుంది.
  3. సమాచార హక్కు చట్టాన్ని (ఆర్టీఐ) భారత పార్లమెంట్ 2005లో ఆమోదించింది.
  4. ఈ చట్టం అక్టోబర్ 12, 2005 నుండి అమలులోకి వచ్చింది.

విద్యా హక్కు:

  1. మన పార్లమెంటు స్వేచ్ఛా హక్కులో భాగంగా విద్యను, ప్రాథమిక హక్కుగా గుర్తించింది.
  2. 2002 లో 86 వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు ఆమోదంతో రాజ్యాంగంలో విద్యను ప్రాథమిక హక్కుగా చెప్పే 21ఎ ప్రకరణ ద్వారా చేర్చారు.
  3. “6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలందరికి చట్టం ద్వారా ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలి” అని ఈ చట్టం పేర్కొంటుంది.
  4. బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని 2009 లో భారత పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టం ఏప్రిల్ 1, 2010న అమల్లోకి వచ్చింది.

ప్రశ్న 7.
విలువలు అనగానేమి? మన జీవితంలో వాటి ప్రాధాన్యత ఏమి?
జవాబు:

  1. విలువలు వ్యక్తుల ప్రవర్తనను నిర్ణయించే అంతర్గత ప్రమాణాలు. ఇవి మన చర్యలను ప్రేరేపిస్తాయి.
  2. మన జీవితంలో ఇవి ముఖ్యమైనవి, పవిత్రమైనవి. విలువలను వ్యక్తిలో ఉండే నైతికత అనేవి కుటుంబం, సమ వయస్కులు, సామాజిక నేపథ్యం మొదలైన కారకాలతో ప్రభావితమౌతాయి.
  3. ఒక వ్యక్తిగాని, సమాజం గాని అభివృద్ధిని సాధించాలంటే విలువలు. అనేవి అత్యంత ఆవశ్యకమైనవి. ముఖ్యంగా ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి ఇవి మరింత అవసరం. నీతి, నిజాయితీ, నిబద్ధత, పారదర్శకత, జవాబుదారీతనం, చిత్తశుద్ది మొదలగు విలువలను పౌరులు కలిగి ఉన్నప్పుడు సమాజం అన్ని విధాలుగా ప్రగతి పథంలో పయనిస్తుంది.

ప్రశ్న 8.
రాజ్యాంగం అనగానేమి? భారత రాజ్యాంగం ఏ రూపంలో ఉంటుంది?
జవాబు:

  1. దేశం యొక్క స్వభావం, ప్రభుత్వ రూపం, పౌరుల హక్కులు మరియు విధులను తెలియచేసే నియమనిబంధనలతో కూడిన ప్రాథమిక చట్టమే రాజ్యాంగం.
  2. ఇది లిఖిత లేదా అలిఖితరూపంలో ఉంటుంది. మన భారత రాజ్యాంగం లిఖిత రూపంలో ఉంది. కాని బ్రిటిష్ రాజ్యాంగం అలిఖితరూపంలో ఉంటుంది.

ప్రశ్న 9.
రాజ్యాంగ ముసాయిదా రూపకల్పనలో అంబేద్కర్ పాత్రను గురించి వ్రాయుము.
జవాబు:

  1. 1947, ఆగస్టు 29న రాజ్యాంగ రచనా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చైర్మన్ డా|| బి.ఆర్. అంబేద్కర్.
  2. అంబేద్కర్ తనతోపాటు ఉన్న మిగతా సభ్యుల సహకారంతో ఇతర దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా చదివి మనకు అవసరమైన అంశాలను మన రాజ్యాంగంలో చేర్చడం జరిగింది.
  3. అంటరానితనాన్ని నిర్మూలించేందుకు మరియు అణగారిన వర్గాలను అభివృద్ధిపరచడానికి అంబేద్కర్ కృష చేశారు.
  4. అన్ని వర్గాల వారితో చర్చలు జరిపిన తరువాత భారతదేశానికి అవసరమైన ఒక విశాలమైన రాజ్యాంగాన్ని రూపొందించారు.

ప్రశ్న 10.
పాఠశాల మొత్తానికి ఒక రాజ్యాంగం ఏర్పాటు చెయ్యాల్సి వుంటే ఎవరెవరు అందులో భాగస్వాములు కావాలి?
జవాబు:
పాఠశాల మొత్తానికి ఒక రాజ్యాంగం ఏర్పాటు చెయ్యాల్సి ఉంటే

  1. అన్ని తరగతుల బాలబాలికల ప్రతినిధులు
  2. ప్రధానోపాధ్యాయులు
  3. ఉపాధ్యాయులు మరియు బోధనేతర సిబ్బంది
  4. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు మొదలగువారు భాగస్వాములు కావాలి.

AP 7th Class Social Important Questions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం

ప్రశ్న 11.
ప్రస్తుత సమాజంపై ప్రాథమిక హక్కుల ప్రభావాలు ఏమిటి?
జవాబు:

  1. ప్రాథమిక హక్కులనేవి వ్యక్తి స్వేచ్ఛకు పట్టుకొమ్మలుగాను, భారత ప్రజాస్వామ్యానికి జవసత్వాలు అందించే పునాదులుగాను చెప్పవచ్చు.
  2. మన జాతీయోద్యమ నాయకుల త్యాగాల ఫలితంగానే ప్రాథమిక హక్కులు పౌరులకు లభించాయి.
  3. ప్రస్తుత సమాజంపై ప్రాథమిక హక్కుల ప్రభావం ఎంతైనా ఉంది. విద్యా హక్కు, సమాచార హక్కు స్వేచ్ఛా హక్కులు మొదలైన హక్కులు పౌరుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతున్నాయి.
  4. సమాజంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక సమానత్వానికి ఈ హక్కులు ఎంతో – తోడ్పడుతున్నాయి.
  5. జాతి సమగ్రతకు, సమైక్యతకు, సౌభ్రాతృత్వంనకు ఈ హక్కులు ఎంతో ఉపయోగపడుతున్నాయి.

ప్రశ్న 12.
ప్రపంచ పటంలో ఈ క్రింది దేశాలను గుర్తించండి.
ఎ) భారతదేశం బి) అమెరికా సి) రష్యా డి) బ్రిటన్
జవాబు:
AP 7th Class Social Important Questions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం 2

ప్రశ్న 13.
ఒకవేళ సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా రాజ్యాంగ సభ సభ్యులను ఎన్నుకుంటే, దాని ప్రభావం రాజ్యాంగంపై ఎలా ఉండేది?
జవాబు:

  1. రాజ్యాంగ సభకు రాష్ట్రాలకు, రాజ సంస్థానాలకూ జనాభా ప్రాతిపదిక మీద ప్రాతినిధ్యం కల్పించారు. అదే విధంగా అనేక రంగాలలో నిష్ణాతులైన వారు రాజ్యాంగ సభకు ఎన్నికైనారు. అల్పసంఖ్యాక వర్గాల నుండి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల నుండి కూడా సభ్యులు రాజ్యాంగ సభకు ఎన్నికైనారు. చైతన్యవంతులైనటువంటి నాయకులు రాజ్యాంగ సభకు ఎన్నికవడం మూలంగా, దేశంలోని ఏ వర్గ ప్రజలకు అన్యాయం జరగకుండా దేశ ప్రజలందరిని పరిగణనలోకి తీసుకొని ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ రాజ్యాంగాన్ని రూపొందించారు.
  2. రాజ్యాంగ సభకు, వయోజన ఓటు హక్కు ద్వారా సభ్యులను ఎన్నుకున్నట్లయితే నిష్ణాతులైన, చైతన్యవంతులైన వారు ఎన్నిక కాకపోవచ్చు. తద్వారా అందరి ప్రయోజనాలకు అనుగుణమైన రాజ్యాంగం తయారై ఉండేది కాదు.
  3. వయోజన ఓటు హక్కు ద్వారా అన్ని వర్గాల నుండి, అన్ని ప్రాంతాల నుండి మరియు వయోజనులందరు ఎన్నికలో పాల్గొనే అవకాశం వచ్చేది.

ప్రశ్న 14.
రాజ్యాంగ సభకు సభ్యులుగా స్వదేశీ సంస్థానాలు సభ్యులను నియమించుటకు ఎందుకు అనుమతించారని మీరు అనుకుంటున్నారు?
జవాబు:
రాజ్యాంగ సభకు సభ్యులుగా స్వదేశీ సంస్థానాలు సభ్యులను నియమించుటకు ఎందుకు అనుమతించారంటే, భవిష్యత్తులో స్వదేశీ సంస్థానాలకు కూడా స్వతంత్రం ఇవ్వబడితే అవి భారతదేశంలో భాగమవుతాయని భావించడం మరియు అవి స్వతంత్రంగా ఉన్నను రాజ్యాంగం అవసరం కాబట్టి మరియు అవి కూడా బ్రిటిషు వారి పాలనలోనే ఉన్నాయి కాబట్టి.

ప్రశ్న 15.
ప్రాథమిక హక్కుల పట్టిక అధ్యయనం ఆధారంగా, ప్రాథమిక హక్కులు మీ అభివృద్ధికి ఎలా సహాయపడతాయి? వివరించండి.
జవాబు:
ప్రాథమిక హక్కులు మా అభివృద్ధికి ఎలా సహాయపడతాయంటే :

  1. సమాజంలోని నా తోటి వారందరితో నేను సమానమనే భావన కల్గిస్తున్నాయి.
  2. నా యొక్క భావాన్ని, ఆలోచనల్ని స్వేచ్ఛగా ప్రకటించగల్గుతున్నాను.
  3. నా తోటి వారితో సమావేశం అవుతున్నా, సంఘంగా ఏర్పడుతున్నాము.
  4. భారతదేశంలో నాకు నచ్చిన ప్రాంతానికి వెళుతున్నాను. అవసరమయితే అక్కడ ఉండాలనుకుంటే ఉండగల్గుతున్నాను.
  5. ప్రజలు గౌరవప్రదమైన జీవితాలు గడపటానికి ఈ హక్కులు ఉపయోగపడుతున్నాయి.
  6. నాకు నచ్చిన వృత్తిని నేను స్వీకరించగల్గుతున్నాను.
  7. పర్యావరణ హిత వాతావరణంలో జీవించగల్గుతున్నాను.
  8. వెట్టి చాకిరి నుండి, బాలకార్మిక వ్యవస్థ బారిన పడకుండా ఉండగలిగాను.
  9. నా ప్రాథమిక విద్య అంతా ఉచితంగా అందించబడింది.
  10. నాకు నచ్చిన మతంను స్వీకరించా, ప్రచారం చేసుకోగల్గుతున్నా.
  11. ప్రభుత్వ పాలనలోని అవినీతిని ప్రశ్నించగలుగుతున్నాను.
  12. ప్రభుత్వ నిర్మాణంలో ఓటు హక్కు వినియోగించుకుని భాగస్వామినవుతున్నాను.

ప్రశ్న 16.
స్వేచ్ఛా హక్కు ప్రాథమిక హక్కుగా లేకపోతే మన పరిస్థితి ఏవిధంగా ఉంటుంది?
జవాబు:

  1. స్వేచ్ఛా హక్కు ప్రాథమిక హక్కుగా లేకపోతే మన పరిస్థితి పంజరంలోని చిలక లాగా చాలా అధ్వాన్నంగా ఉంటుంది.
  2. అసలు జీవించే హక్కును కల్పించిన హక్కు స్వేచ్ఛా హక్కు
  3. స్వేచ్ఛా హక్కు లేకపోతే ప్రజలు నిర్బంధంలో, పాలకుల నియంతృత్వంలో ఉండాల్సి వస్తుంది.
  4. భావాన్ని వెళ్ళబుచ్చలేము, నచ్చిన వృత్తిని చేపట్టలేం, సంఘంలా ఏర్పడలేం, నచ్చిన ప్రదేశంను సందర్శించలేం, నివసించలేం.

AP 7th Class Social Important Questions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం

ప్రశ్న 17.
విధులు ఏవిధంగా ముఖ్యమైనవి?
జవాబు:

  1. దేశం ప్రజల వద్ద నుంచి ఆశించే సామాజిక చైతన్యం, ప్రవర్తనా నియమావళీ ప్రాథమిక విధులు.
  2. ప్రాథమిక విధులు భారత పౌరులలో సామాజిక స్పృహను పెంపొందించి బాధ్యతాయుత ప్రవర్తనను అలవరుస్తాయి.
  3. రాజ్యాంగ ఆశయాలు, రాజ్యాంగ చట్టం, ప్రభుత్వ వ్యవస్థలను పౌరులు గౌరవిస్తారు.
  4. భిన్నత్వంలో ఏకత్వ సాధనకు ప్రాథమిక విధులు పాటుపడతాయి.
  5. శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండేలా, మూఢ విశ్వాసాలు పారద్రోలటానికి.
  6. పర్యావరణ పరిరక్షణ వంటి ఆశయాల సాఫల్యానికి ఈ విధులు ఉద్దేశించాయి.

ప్రశ్న 18.
బాధ్యతాయుతమైన పౌరుని లక్షణాలలో ఏయే లక్షణాలు మీలో ఉన్నాయి?
జవాబు:

  1. చట్టాలను మరియు అధికారాన్ని గౌరవించడం.
  2. దేశభక్తి కల్గి ఉండటం.
  3. నిజాయితీ కల్గి ఉండటం.
  4. జవాబుదారీతనం.
  5. బాధితులు మరియు పీడితుల పట్ల దయ కలిగి ఉండటం.
  6. ఇతరుల పట్ల మర్యాద కల్గి ఉండటం.
  7. క్రమశిక్షణతో మెలగటం.
  8. న్యాయంగా ఉండటం వంటి లక్షణాలు నేను కల్గి ఉన్నాను.

ప్రశ్న 19.
భారత రాజ్యాంగం గురించి మరిత సమాచారం కొరకు అంతర్జాలాన్ని సందర్శించండి లేదా మీ ఉపాధ్యాయుని సహాయం తీసుకోండి (ప్రస్తుతం, భారత రాజ్యాంగంలో ఎన్ని నిబంధనలు, షెడ్యూల్స్ మరియు భాగాలు ఉన్నాయో తెలుసుకోండి).
జవాబు:
ప్రస్తుతం భారత రాజ్యాంగంలో
నిబంధనలు : 465
షెడ్యూల్సు : 12
భాగాలు : 25 కలవు.

ప్రశ్న 20.
అంతర్జాలం లేదా లైబ్రరీని సందర్శించడం ద్వారా మన రాజ్యాంగంలో వివిధ దేశాల నుండి స్వీకరించబడిన అంశాలపై పట్టికను తయారు చేయండి. ప్రపంచ పటంలో ఆ దేశాలను గుర్తించండి.
జవాబు:
1. బ్రిటిష్ రాజ్యాంగం :
పార్లమెంటు క్యాబినెట్ తరహా పాలనా పద్దతి. ద్విసభా పద్దతి. సమన్యాయ పాలన, శాసన నిర్మాణ ప్రక్రియ, శాసన సభ్యుల స్వాధికారాలు, స్పీకరు, డిప్యూటీ స్పీకరు, కంప్రోలర్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్, మొదలగు పదవులు మరియు రిట్లు జారీ చేసే విధానం.

2. అమెరికా రాజ్యాంగం :
ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్ష, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయశాఖ, ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్‌గా వ్యవహరించడం, రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు. రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రాలు ఆమోదం తెలపడం.

3. కెనడా రాజ్యాంగం :
బలమైన కేంద్ర ప్రభుత్వం, గవర్నర్లు నియమించే పద్ధతి. అవశిష్ట అధికారాలను కేంద్రానికి ఇవ్వడం, ప్రకరణ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీం కోర్టు సలహాను కోరడం.

4. ఐర్లాండు రాజ్యాంగం :
ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతిని ఎన్నుకునే నైష్పత్తిక ప్రాతినిధ్యం, ఒక ఓటు బదిలీ పద్ధతి, రాజ్యసభకు విశిష్ట సభ్యుల నియామకం.

5. వైమార్ రిపబ్లిక్ (జర్మనీ):
జాతీయ అత్యవసర పరిస్థితి, ప్రాథమిక హక్కులు రద్దు చేసే అధికారం, మొదలగునవి. (వైమార్ అనునది జర్మనీ దేశ రాజ్యాంగ పరిషత్తు సమావేశమైన నగరము.)

6. ఆస్ట్రేలియా :
ఉమ్మడి జాబితా, పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశము (బిల్లు ఆమోదంలో వివాదం ఏర్పడితే) వాణిజ్య, వ్యాపార లావాదేవీలు, అంతర్రాష్ట్ర వ్యాపారము.

7. దక్షిణ ఆఫ్రికా :
రాజ్యాంగ సవరణ విధానం, రాజ్యసభ సభ్యుల ఎన్నిక పద్దతి, మొదలగు అంశాలు.

8. ఫ్రాన్సు :
గణతంత్ర విధానం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, తాత్కాలిక సభాధ్యక్షుల నియామకం.

9. రష్యా :
ప్రాథమిక విధులు, సామ్యవాద సూత్రాలు.

మీకు తెలుసా?

7th Class Social Textbook Page No. 59

భారతదేశం యొక్క ఐక్యతను కాపాడటం మరియు దానికి స్వాతంత్ర్యం ప్రసాదించే లక్ష్యంతో బ్రిటీష్ ప్రభుత్వం నుండి భారత నాయకత్వానికి అధికారాలను బదిలీ చేయడం గురించి చర్చించడానికి ఉద్దేశించిన క్యాబినెట్ మిషన్ 1946లో భారతదేశానికి వచ్చింది. అదే విధంగా రాజ్యాంగ అసెంబ్లీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఈ క్యాబినెట్ మిషన్లో లార్డ్ పెథిక్ లారెన్స్, సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ మరియు A.V. అలెగ్జాండ్ ఇందులో సభ్యులు.

7th Class Social Textbook Page No. 65

1. రాజ్యాంగ దినోత్సవం :
భారత రాజ్యాంగాన్ని 1949, నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. దానికి గుర్తుగా భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవం సంవిధాన్ దివసను ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకుంటున్నాము. రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 2 సంవత్సరాల, 11 నెలల 18 రోజులు పట్టింది.

2.
AP 7th Class Social Important Questions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం 3
13.12.1946 న, రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో ప్రసంగిస్తున్న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ. ఆ రోజు అతడు “లక్ష్యాల తీర్మానం” ను ప్రతిపాదించాడు. ఇదే భారత రాజ్యాంగ పీఠికకు మూలాధారం.

3. ఎ. ప్రకరణ (అధికరణ) అనేది రాజ్యాంగంలోని ఒక నిర్దిష్ట అంశంపై నిర్దిష్ట నియమం లేదా సూత్రాన్ని సూచిస్తుంది.
బి. భాగం అనేది ఒక భావనకు సంబంధించిన ప్రకరణల సముదాయమును సూచిస్తుంది.
సి. షెడ్యూలు అనేది ప్రకరణలలో పేర్కొనబడని అదనపు సమాచారం లేదా వివరాలను సూచిస్తుంది.
డి. ‘సామ్యవాదం’, ‘లౌకిక’ పదాలు 1976 లో 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చబడ్డాయి.

7th Class Social Textbook Page No. 73

బాలల హక్కుల పరిరక్షణ సదస్సులో ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానాలపై మన దేశం కూడా సంతకం చేసింది. ఆ విధంగా మన దేశం కూడా బాలల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంది. ప్రధానమైన బాలల హక్కులు క్రింద ఇవ్వబడ్డాయి.

  1. జీవించే హక్కు
  2. రక్షణ పొందే హక్కు
  3. అభివృద్ధి హక్కు
  4. భాగస్వామ్య హక్కు