AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 9th Lesson ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం Textbook Questions and Answers.

AP Inter 1st Year Economics Study Material 9th Lesson ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వస్తు మార్పిడి విధానాన్ని, అందులోని సమస్యలను వివరించండి.
జవాబు:
ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం వాడుకలోకి రాకముందు “వస్తు మార్పిడి విధానం” అమలులో ఉండేది. అప్పుడు జనాభా పరిమితంగా ఉండి, వ్యక్తుల కోరికలు సాధారణ స్థాయిలో ఉండేవి. ఈ విధానంలో వ్యక్తులు వస్తువులకు బదులుగా వస్తువులను వినిమయంగా పొందటాన్ని వస్తు మార్పిడి విధానం అంటారు. ఇలాంటి మార్పిడికి ప్రధాన కారణం మానవుల ‘అవసరాలు’. ఆర్థిక కార్యకలాపాలు పరిమితంగా ఉండి, వ్యక్తుల కోరికలు సాధారణంగా ఉన్నంత వరకు ఈ విధానం కొనసాగుతుంది. జనాభా పెరిగి, కోరికలలో మార్పులు సంభవించి, వర్తక వాణిజ్య వ్యవహారాలు పెరగడంతో ఈ విధానం అనేక ఇబ్బందులను ఎదుర్కొనవలసి వచ్చింది.

వస్తు మార్పిడి విధానంలోని సమస్యలు:
1) కోర్కెల సమన్వయము లోపించుట: వస్తు మార్పిడి విధానం సాఫీగా జరగాలంటే ఇరుపక్షాల వారి కోరికలలో సమన్వయం కుదరాలి. ఉదా: వరి పండించే వ్యక్తి వస్త్రం పట్ల అవసరం, వస్త్రం నేసే వ్యక్తికి వరి అవసరం ఏక కాలంలో కలగాలి. అలాగైతేనే వినిమయం లేదా మార్పిడికి అవకాశం ఏర్పడుతుంది. ఇరువురి కోరికలలో సమన్వయం కుదరకపోతే మార్పిడి అసాధ్యమవుతుంది.

2) సంపద నిల్వ చేయడంలో ఇబ్బంది: మార్పిడికి ఉపయోగించే అన్ని వస్తువులను ‘నిల్వ’ ఉంచే అవకాశం ఉండదు. కారణం కొన్ని రకాల వస్తువులను ‘నిల్వ’ ఉంచడం వల్ల అవి పాడైపోయే అవకాశం ఉంది. కాలం గడిచే కొద్ది ఇలాంటి వస్తువుల విలువ క్షీణించడం, కొన్నిసార్లు నశించడం జరగవచ్చు. ఉదా: పశువులు, కూరగాయలు, ఆహార ధాన్యాలు మొదలైనవి.

3) వస్తువుల అవిభాజ్యత: కొన్ని వస్తువులను విభజించడం వల్ల వాటి విలువ క్షీణించవచ్చు లేదా పూర్తిగా నశించవచ్చు. ఉదా: పశువులు, పనిముట్లు, యంత్రాలు. ఇలాంటి వాటి విషయంలో విభజించటానికి వీలుండదు. అందువల్ల మార్పిడి సాధ్యం కాదు.

4) విలువను నిర్ణయించే కొలమానం లేకపోవుట: వస్తు మార్పిడి విధానంలో వస్తువుల విలువలను ఇతర వస్తువుల విలువలో చెప్పవలసి వస్తుంది. అంటే వస్తువుల విలువలను ఖచ్చితంగా కొలిచే కొలమానం/సాధనం లేకపోవడం వల్ల ఈ విధానాన్ని అమలుచేయడం ఎంతో కష్టమౌతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

5) వాయిదా చెల్లింపులలో ఇబ్బంది ఆర్థిక వ్యవస్థలో రుణాలు ఇవ్వడం, పుచ్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే వస్తు వినిమయంలో ఈ రకమైన చెల్లింపులు కష్టసాధ్యం.

6) సేవల మార్పిడి: సేవల మార్పిడికి అవకాశం లేదు. విలువలను కొలిచే సాధనం లేకపోవడం వల్ల “సేవల” విలువలను వస్తు రూపంలో చెప్పడానికి వీలుండదు. ఉదా: డాక్టర్లు, టీచర్లు, లాయర్ల సేవలు.

ప్రశ్న 2.
ద్రవ్యం విధులను వివరించండి.
జవాబు:
ద్రవ్యం నిర్వహించే విధులు చాలా ఉన్నాయి. వీటికి ప్రాథమిక విధులు, ద్వితీయ శ్రేణి విధులు, అనుషంగిక విధులు అని పలు రకాలుగా వర్గీకరిస్తారు.

ప్రాథమిక విధులు:
1) వినిమయ మాధ్యమం: ద్రవ్యం వినిమయ మాధ్యమంగా వ్యవహరిస్తుంది. ఏ వస్తువైనా ముందుగా ద్రవ్యంతో మార్పిడి చేసుకొని, ఆ తరువాత ఆ ద్రవ్యంలో మరి ఏ ఇతర వస్తువునైనా కొనుగోలు చేయవచ్చు. ఆ విధంగా ద్రవ్యం అనే వినిమయ మాధ్యమం ద్వారా ప్రజలు వస్తు సేవలను వినిమయం చేసుకోవచ్చు.

2) విలువల కొలమానం: వస్తు సేవల విలువ కొలమానంగా ద్రవ్యం వ్యవహరిస్తుంది. వ్యాపార వ్యవహారాలను సులువైనవిగా, సులభతరమైనవిగా మార్చింది. ప్రతి వస్తువు విలువను ద్రవ్య యూనిట్లో వ్యక్తపరచడం జరుగుతుంది. దీనిని ధర అంటారు. ద్రవ్యం యూనిట్ విలువ స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే అది సంతృప్తికరమైన కొలమానంగా పనిచేస్తుంది.

ద్వితీయ శ్రేణి విధులు:
1) విలువ నిధి: వస్తు సేవల విలువను ద్రవ్య రూపంలో నిల్వ చేయవచ్చు. కీన్స్ అభిప్రాయంలో, ద్రవ్యం నిర్వహించే విధులలో ఈ విధి అతి ముఖ్యమైనది. ద్రవ్యం వల్ల మాత్రమే, ప్రస్తుత ఆదాయంతో భవిష్యత్తులో వినియోగం సాధ్యపడుతుంది. అందువల్ల ద్రవ్యం భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల మధ్య వారధిగా పనిచేస్తుంది.

2) వాయిదాల చెల్లింపుల ప్రామాణికం: ద్రవ్యం వాయిదా చెల్లింపుల ప్రమాణాలుగా వ్యవహరిస్తుంది. ఈ విధిని నిర్వర్తించడం వల్ల వ్యక్తులు వస్తువులను కొనుగోలు చేయడం, బ్యాంకులు, ఇతర ద్రవ్య సంస్థల నుంచి ఋణాలు పొందడం, షేర్లు, బాండ్లు అమ్మకాలు, కొనుగోలు మొ||నవి సులభతరమయ్యాయి.

3) విలువల బదిలీ: ఏ సమయంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా ద్రవ్యాన్ని ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి బదిలీ చేయడం సాధ్యం అవుతుంది. ద్రవ్యం వల్ల విలువను బదిలీ చేయడం తేలికవుతుంది.

అనుషంగిక విధులు:
1) జాతీయాదాయ మదింపు, పంపిణీ: ఒక సం॥ కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల విలువలను అంచనా వేయవచ్చు. వివిధ ఉత్పత్తి కారకాలను ద్రవ్య రూపంలో చెల్లింపులు చేయడం జాతీయాదాయమును వాటి మధ్య పంపిణీ చేయవచ్చు.

2) ఉపాంత ప్రయోజనాలు/ఉత్పాదకతలు సమానీకరణ: వినియోగదారులు తాము కొనుగోలు చేసే వివిధ వస్తువుల నుంచి పొందే ఉపాంత ప్రయోజనాలను ద్రవ్యం ఆధారంగా సమానం చేయడం ద్వారా ప్రయోజనాలను గరిష్ఠం చేసుకోగలుగుతాడు. అదే విధంగా ఉత్పత్తిదారు వివిధ ఉత్పత్తి కారకాల ఉపాంత ఉత్పాదకతలను ద్రవ్యం సహాయంతో సమానం చేయడం ద్వారా లాభాలను గరిష్ఠం చేసుకోగలుగుతాడు.

3) పరపతి వ్యవస్థకు మూలం: అన్ని ఆర్థిక లావాదేవీలకు ద్రవ్యం ప్రాతిపదిక. ద్రవ్య రిజర్వు లేనిదే పరపతి సృష్టి జరగదు. పరపతి కార్యకలాపాలన్నింటికి ద్రవ్యం పూచీకత్తుగా వ్యవహరిస్తుంది.

4) ద్రవ్యత్వం: ద్రవ్యానికి అత్యధిక ద్రవ్యత్వం ఉంటుంది. ద్రవ్యత్వపరంగా ఆస్తులన్నింటిలోకి ఉత్తమమైనది. ద్రవ్యం నూరుశాతం ద్రవ్యత్వం కలిగి ఉంటుంది.

ప్రశ్న 3.
వివిధ రకాల ద్రవ్యాలను గురించి తెలపండి.
జవాబు:
ద్రవ్యానికి అనుబంధంగా కొన్ని భావనలను నిర్వచించారు. అవి కరెన్సీ, ద్రవ్యత్వం, సమీపద్రవ్యం (Near-Money)

కరెన్సీ: కేంద్ర ప్రభుత్వం, కేంద్రబ్యాంకులచే ముద్రించబడి ఆర్థిక వ్యవస్థలో చలామణిలోకి వచ్చిన నాణేలు, ‘పేపరు నోట్లను ‘కరెన్సీ’ అంటారు. ద్రవ్యంలో కరెన్సీ ఒక భాగం మాత్రమే. కరెన్సీతోపాటు డిమాండ్, టైమ్ డిపాజిట్లు మొదలైనవి కూడా ద్రవ్యం కిందకు వస్తాయి.

ద్రవ్యత్వం: ద్రవ్యానికి ద్రవత్వం ఉంటుంది. ద్రవత్వం అంటే వెంటనే ‘కొనుగోలు చేసే శక్తి’ (ready purchasing power) ఒక వస్తువును విలువ తగ్గకుండా సులభంగా తక్కువ కాలవ్యవధిలో ద్రవ్యంగా మార్చగల గుణాన్ని ‘ద్రవత్వం’ అంటారు. అందువల్లనే ద్రవ్యాన్ని ‘పరిపూర్ణ ద్రవత్వం’ గల ఆస్తి అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

సమీప ద్రవ్యం: వివిధ రకాలైన ఆస్తుల ద్రవ్యత్వం వివిధ రకాలుగా ఉంటుంది. టైమ్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీస్ పొదుపు పత్రాలు, కంపెనీ స్టాక్స్, షేర్లు, ట్రెజరీ బిల్లులు, మొదలైనవి ద్రవ్యానికి చాలా దగ్గర ప్రత్యామ్నాయాలు. అంటే వీటి ద్రవ్యత్వం, ద్రవ్యం ద్రవత్వానికి చాలా దగ్గరలో ఉంటుంది. ఇలా ద్రవత్వంలో ద్రవ్యానికి దగ్గరలో ఉన్న వాటిని ‘సమీపద్రవ్యం’ అంటారు.

ద్రవ్యం రకాలు:
1) పూర్తి ప్రమాణం నాణేలు: ఈ నాణేల ముఖవిలువ, వాటిలోని (లోహపు విలువ) ‘అంతర్గత విలువ’ సమానంగా ఉంటుంది. ఉదా: మన దేశంలో ఒకప్పుడు పూర్తి ప్రమాణంగల వెండి నాణేలు చలామణిలో ఉండేవి.

2) తక్కువ ప్రమాణం నాణేలు: ఈ నాణేల ముఖవిలువ వీటి అంతర్గత విలువ కంటే తక్కువగా ఉంటుంది. 3) చిల్లర ద్రవ్యం: చిన్న చిన్న లావాదేవీలకు ఉపయోగించేందుకు వీలుగా ప్రమాణ ద్రవ్య యూనిట్ను విభజించి, చిల్లర ద్రవ్యాన్ని ప్రభుత్వం జారీ చేస్తుంది. ఉదా: ఉపయోగంలో వీలుగా ఉండేందుకు 25 పైసలు, 50 పైసల నాణేలు జారీ చేయడం జరిగింది.

4) కాగితపు ద్రవ్యం: వివిధ విలువలను సూచిస్తూ కేంద్ర ప్రభుత్వంగాని, కేంద్రబ్యాంకుగానీ జారీచేసే కరెన్సీ నోట్లు ‘కాగితపు ద్రవ్యం’ అని చెప్పవచ్చు. ఉదా: 1,000, 500, 100, 50, 20, 10 నోట్లు.

5) పరపతి ద్రవ్యం: వాణిజ్య బ్యాంకులలోని డిమాండ్ డిపాజిట్లు మొదలైన వాటిని చెక్కులు, డ్రాఫ్ట్ ద్వారా లావాదేవీలు జరపవచ్చు. ఆధునిక సమాజంలో ఇంచుమించు అన్ని వ్యవహారాలు వీటితో పరిష్కరించటం సాధ్యం. వీటినే ‘పరపతి ద్రవ్యం’గా చెప్పవచ్చు.

ప్రశ్న 4.
వాణిజ్య బ్యాంకుల విధులను వివరించండి.
జవాబు:
వాణిజ్య బ్యాంకులు దేశ బాంకింగ్ రంగంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి. వాణిజ్య బ్యాంకులు ప్రజల నుంచి, సంస్థల నుంచి డిపాజిట్లను స్వీకరించి, ఆ సొమ్మును వ్యాపారస్థులకు, ఉత్పత్తిదారులకు ఋణాలను ఇస్తూ, అటు ఋణ గ్రహీతలకు, ఋణదాతలకు మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరిస్తుంది.

సేయర్స్ అభిప్రాయంలో “బాంకులు వ్యక్తుల నుంచి డిపాజిట్లను స్వీకరించి, అవసరమైన వాళ్ళకు ఋణాలు మంజూరు చేసే సంస్థలు”.
క్రౌథర్ అభిప్రాయంలో “ఇతరుల ఋణాలు తీసుకొని, తన వద్దగల ద్రవ్యాన్ని ఇతరులకు ఇవ్వడం ద్వారా ద్రవ్యాన్ని సృష్టించడమే బ్యాంకుల వ్యాపారం”.
వాణిజ్య బ్యాంకుల విధులు: ఇవి దేశ ఆర్థికాభివృద్ధిలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. వాణిజ్య బ్యాంకుల విధులు ముఖ్యంగా

  1. ప్రాథమిక విధులు.
  2. అనుషంగిక విధులు.
  3. సాధారణోపయోగ సేవలు.

1) ప్రాథమిక విధులు:

ఎ) డిపాజిట్లను స్వీకరించడం: ప్రజల వద్ద నుంచి పొదుపులను డిపాజిట్లగా స్వీకరించడం బ్యాంకుల ప్రాథమిక విధి. ప్రధానంగా వాణిజ్య బ్యాంకులు స్వీకరించే డిపాజిట్లు రెండు రకాలు, అవి: డిమాండ్ డిపాజిట్లు, కాలపరిమితి డిపాజిట్లు.

  • డిమాండ్ డిపాజిట్ల కింద సేవింగ్స్ డిపాజిట్లను, కరెంట్ డిపాజిట్లను సేకరిస్తుంది.
  • కాలపరిమితి డిపాజిట్ల కింద ఫిక్స్డ్

బి) రుణాలను మంజూరు చేయడం:
i) లాభాలను ఆర్జించటం వాణిజ్య బాంకుల ముఖ్యోద్దేశం. బాంకులు వ్యాపారస్తుల ద్రవ్య అవసరాల కోసం ఇచ్చే రుణాలను ‘నగదు పరపతి’ అంటారు. రుణాన్ని తీసుకొన్న ఖాతాదారు, ఆ ద్రవ్యాన్ని ‘చెక్కు’ ద్వారా తీసుకుంటాడు. ఈ ఋణాలపై బాంకులు వడ్డీ వసూలు చేస్తాయి.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ii) నమ్మకమైన ఖాతాదారులకు బాంకులు “ఓవర్ డ్రాఫ్ట్” పద్ధతి ద్వారా రుణాలిస్తాయి. ఖాతాదారుని కరెంట్ ఖాతాలో నిలువ ఉన్న మొత్తం కంటే, అధిక మొత్తాన్ని వాడుకొనే వసతిని ‘ఓవర్ డ్రాఫ్ట్’ అంటారు. వాడుకున్న సొమ్ముపై ఖాతాదారుని నుంచి వడ్డీని వసూలు చేస్తాయి.

iii) కేంద్ర బాంకు ఉత్తర్వుల మేరకు, స్టాక్ ఎక్స్ఛేంజ్ బ్రోకర్లకు వాణిజ్య బాంకులు అతి స్వల్పకాలిక రుణాలు ఇస్తుంది. వీటిని ‘కాల్మనీ లేదా కాల్ లోన్స్’ అంటారు. వీటి కాల పరిమితి 15 రోజులకు మించదు.

iv) ఖాతాదారుల వద్ద ఉన్న బిల్లులపై కాలపరిమితికి ముందుగానే వడ్డీ మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని చెల్లించే అవకాశం కల్పిస్తుంది. ఈ పద్ధతిని “బిల్లుల డిస్కౌంటింగ్” అంటారు.

సి) పరపతిని సృష్టించడం: బాంకులు స్వీకరించే డిపాజిట్లే అవి ఇచ్చే రుణాలకు ఆధారం. పరపతి సృష్టి అంటే బాంకు డిపాజిట్ల కంటే ఎన్నో రెట్లు రుణాలు పెంచడం. పరపతి ఇచ్చేటప్పుడు డిపాజిట్లు సృష్టించబడతాయి.

డి) క్రెడిట్ కార్డులు: ఆధునిక బాంకులు ఖాతాదారులకు ‘క్రెడిట్ కార్డులు’ ద్వారా కూడా మంజూరు చేయడం రుణాలను మంజూరు చేస్తున్నాయి. క్రెడిట్ కార్డు ఉన్న ఖాతాదారు వస్తు సేవలను కార్డపై కొనుగోలు చేసి, బాంకుకు అసలుతోపాటు వడ్డీ చెల్లించడం జరుగుతుంది.

2) అనుషంగిక విధులు: బాంకులు నిర్వహించే ప్రాథమిక విధుల ఫలితంగా ‘ప్రాతినిథ్య విధులు’ ఏర్పడతాయి.

  1. బాంకులు ఖాతాదారులు ప్రతినిధులుగా వారి తరపున బీమా ప్రీమియమ్లు, కరెంట్ బిల్లులు మొదలైన వాటిని ఖాతాదారుల ఆదేశానుసారం నిర్ణీత సమయాల్లో చెల్లించుట.
  2. బాంకులు ఖాతాదారులు ‘ఏజెంట్ ‘ కంపెనీల షేర్లను, రుణ పత్రాలను కొనిపెడతాయి.
  3. ఖాతాదారుల తరపున డ్రాఫ్టు ద్వారా, చెక్ల ద్వారా, తంతి తపాలా ద్వారా సొమ్ము బదిలీ చేస్తుంది.

3) సాధారణోపయోగ సేవలు:

  1. విదేశీ వ్యాపార క్రమంలో అత్యవసరమైన ‘పరపతి పత్రాలను’ జారీ చేస్తాయి.
  2. విదేశీ వర్తకం చేసేవారికి ‘విదేశీ ద్రవ్యం’లో విత్త సహాయం చేస్తుంది.
  3. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించటానికి ‘విద్యా రుణ’ సౌకర్యాన్ని కల్పిస్తుంది.
  4. బాంకింగ్ సేవలలో మరో విప్లవాత్మక సౌకర్యం ATM పద్ధతి ఖాతాదారులు తమకు సొమ్ము కావలసినపుడు బాంకుకు వెళ్ళకుండా, తమకు దగ్గరలో ఉన్న ATM నుంచి నగదు తీసుకొనే సౌకర్యం కల్పించింది.

ప్రశ్న 5.
కేంద్ర బ్యాంకు విధులను వివరించండి.
జవాబు:
దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థకు కేంద్ర బ్యాంకు శిఖరం. అది బ్యాంకింగ్ వ్యవస్థలోని బ్యాంకుల ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది, నియంత్రిస్తుంది, క్రమబద్దీకరిస్తుంది.

కేంద్ర బ్యాంకు విధులు:
1) కరెన్సీ నోట్ల జారీ: ఒక దేశంలో కరెన్సీ నోట్ల జారీలో కేంద్ర బ్యాంకు గుత్తాధిపత్యం కలిగి ఉంటుంది. దీనివల్ల నోట్ల జారీలో ఏకత్వం ఏర్పడుతుంది. కరెన్సీపై విశ్వసనీయత కలుగుతుంది. ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా ద్రవ్య సప్లయ్ నియంత్రించడానికి వీలుంటుంది.

2) ప్రభుత్వ బ్యాంకరు: కేంద్ర బ్యాంకు ప్రభుత్వ బ్యాంకరుగా, ఏజెంట్గా, సలహాదారుగా వ్యవహరిస్తుంది. ఇది ప్రభుత్వ ద్రవ్య నిధులకు సంబంధించిన లెక్కలు తయారుచేస్తుంది. ప్రభుత్వం తరుపున ద్రవ్యం స్వీకరిస్తూ, ప్రభుత్వం తరుపున ఋణాలు ఇస్తూ ప్రభుత్వ ఋణాన్ని స్వీకరిస్తుంది. ప్రభుత్వానికి ఋణాలను ఇస్తూ, అన్ని ఆర్థిక వ్యవహారాలలో ప్రభుత్వానికి సలహాలను అందిస్తుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

3) బ్యాంకుల బ్యాంకరు కేంద్ర బ్యాంకు ప్రభుత్వానికే కాకుండా బ్యాంకులకు కూడా బ్యాంకరుగా పనిచేస్తుంది. ప్రతి బ్యాంకు చట్ట ప్రకారం తను స్వీకరించిన డిపాజిట్లు మొత్తంలో కొంత శాతం నగదు నిల్వలుగా ఉంచాలి. ఆ నిల్వల నిష్పత్తిని కేంద్ర బ్యాంకు నిర్ణయిస్తుంది. వినిమయబిల్లుల రీడిస్కౌంట్ ద్వారా షెడ్యూల్డు బ్యాంకులకు విత్త సహాయం అందజేస్తుంది. ఇది వాణిజ్య బ్యాంకుల మధ్య ఏర్పడిన లావాదేవీలను పరిష్కరించడానికి క్లియరింగ్ హౌస్ పనిచేస్తుంది.

4) అంతిమ ఋణదాత: మార్కెట్లోని అన్నిరకాల పరపతి సౌకర్యాలు ఉపయోగించుకున్న తరువాత ఇంకా ద్రవ్యత్వ ఇబ్బందులున్నప్పుడు బ్యాంకులకు, డిస్కౌంట్ గృహాలకు, ఇతర పరపతి సంస్థలకు కేంద్ర బ్యాంకు అనేక రకాలుగా విత్త సహాయం అందిస్తూ అంతిమ ఋణదాతలుగా పనిచేస్తుంది.

5) పరపతి నియంత్రణ: ఆర్థిక వ్యవస్థలోని పరపతి పరిమాణాన్ని తగిన ద్రవ్య విధానం ద్వారా కేంద్ర బ్యాంకు నియంత్రిస్తుంది. ద్రవ్యోల్బణం సమయంలో పరపతి తగ్గిస్తుంది. ఆర్థిక వ్యవస్థ తిరోగమన పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో పరపతి సప్లయ్ పెంచుతుంది.

6) పర్యవేక్షణ: దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను పర్యవేక్షిస్తుంది. నూతన బ్యాంకుల ఏర్పాటు, బ్యాంకుల విస్తరణకు కేంద్ర బ్యాంకు అనుమతి అవసరం.

7) విదేశీమారక ద్రవ్య నిల్వల పరిరక్షణ: కేంద్ర బ్యాంకు విదేశీ మారక విలువలను పరిరక్షిస్తుంది. విదేశీ మారక నిల్వలను నిర్వహిస్తూ వాటి వినియోగాన్ని నియంత్రణ చేస్తుంది. విదేశీ ద్రవ్యాన్ని అమ్మడం, కొనడం ద్వారా మారక రేటు స్థిరత్వానికి కృషిచేస్తుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలను పరిరక్షిస్తూ, విదేశీ మారక వ్యవహారాలను క్రమబద్ధం చేస్తుంది.

8) ద్రవ్య విధానాన్ని రూపొందించి అమలు జరుపుతుంది: కేంద్ర బ్యాంకు ఆర్థిక స్థిరీకరణకు కృషి చేస్తుంది. జాతీయ, అంతర్జాతీయ విత్తసంస్థల ఆర్థికపరమైన సంబంధాలను ఏర్పరచుకుంటూ ఆర్థికాభివృద్ధికి దోహదపడే వివిధ చర్యలను తీసుకుంటుంది.

కేంద్ర బ్యాంకు ఆశయాలు:

  1. కరెన్సీ నోట్ల జారీని క్రమబద్ధం చేస్తుంది.
  2. దేశంలో ద్రవ్య స్థిరత్వాన్ని సాధించటం.
  3. పరపతి వ్యవస్థను నియంత్రించటం.
  4. వాణిజ్య బ్యాంకులకు మార్గదర్శకత్వం వహించుట.
  5. దేశ వ్యాప్తంగా ఒకే పరపతి విధానాన్ని రూపొందించి, అమలుచేయుట.

దేశంలో ద్రవ్య సుస్థిరతను సాధించుట కేంద్ర బ్యాంకు ప్రధాన ధ్యేయం. దేశంలో ఆర్థికాభివృద్ధిని పెంపొందించే విధానాలను కేంద్ర బ్యాంకు చేపడుతుంది.

ప్రశ్న 6.
భారతీయ రిజర్వు బ్యాంకు పాత్రను వివరించండి.
జవాబు:
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మన దేశానికి కేంద్ర బ్యాంకు. దేశంలోని ద్రవ్య, కోశ విధానాలను రూపొందించడం లోను, అమలు పరచడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. ఇది దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధికి నాయకత్వం వహిస్తూ దేశ అవసరాలకు తగినట్లుగా బ్యాంకింగ్ కార్యకలాపాలను క్రమబద్దీకరిస్తుంది.

రాయల్ కమీషన్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ సూచన మేరకు 1935 ఏప్రిల్లో 5 కోట్ల వాటా మూలధనంతో రిజర్వు బ్యాంకు నెలకొల్పబడినది. మొదట ఇది ప్రైవేటు వాటాదారు యాజమాన్యం క్రింద ఏర్పడింది. దీనిని 1949లో భారత ప్రభుత్వం జాతీయం చేసింది. 1934 భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం ప్రకారం అన్ని ముఖ్యమైన కేంద్ర బ్యాంకు విధులను ఇది నిర్వహిస్తుంది.

దీని ప్రధాన కార్యాలయం ముంబాయిలో ఉంది. ఢిల్లీ, కోలకత్తా, చెన్నై, ముంబాయి మొదలైన నగరాలలో ప్రాంతీయ కార్యాలయాలు పనిచేస్తాయి. 20 మంది డైరెక్టర్లతో కూడిన కేంద్ర డైరెక్టర్ల బోర్డు నియంత్రణ క్రింద ఇది పనిచేస్తుంది. ఇందులో ఒక గవర్నరు, నలుగురికి మించకుండా డిప్యూటీ గవర్నర్లు, రిజర్వు బ్యాంకు నాలుగు స్థానిక డైరెక్టర్ల బోర్డుల నుంచి ఒక్కొక్కరు కేంద్ర ప్రభుత్వంచే నియమించబడే పదిమంది డైరెక్టర్లు, ఒక ప్రభుత్వ అధికారి, మొత్తం 20 మంది ఉంటారు. వీరందరినీ కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

భారతీయ రిజర్వు బ్యాంకు విధులు:
1) కరెన్సీ నోట్ల జారీ: మనదేశంలోని కరెన్సీ నోట్ల జారీపై గుత్తాధిపత్య అధికారం రిజర్వు బ్యాంకు కలిగి ఉంది. రిజర్వు బ్యాంకు 1,000, 500, 100, 50, 20, 10, 5, 2 రూపాయల కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. ఈ నోట్లపై భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ సంతకం ముద్రించబడతాయి. 2006 ఆగష్టు నాటికి దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ విలువ 23,936 కోట్లు.

2) ప్రభుత్వ బ్యాంకరు రిజర్వు బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికీ, రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకరుగా, ప్రతినిధిగా, ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వ బ్యాంకరుగా వివిధ ప్రభుత్వ విభాగాల అకౌంట్లను నిర్వహిస్తుంది. ప్రభుత్వం తరుపున ద్రవ్యాన్ని స్వీకరిస్తుంది, చెల్లింపులు చేస్తుంది. ప్రభుత్వాలకు తాత్కాలిక ఋణాలు అందిస్తుంది. అన్ని ఆర్థిక వ్యవహారాలలో ప్రభుత్వాలకు సలహాదారుగా కూడా పనిచేస్తుంది.

3) బ్యాంకుల బ్యాంకరు: దేశంలోని బ్యాంకులకు రిజర్వు బ్యాంకు బ్యాంకరుగా పనిచేస్తుంది. కొన్ని రకాల బిల్లులను రీడిస్కౌంట్ చేసుకునే సదుపాయం వాణిజ్య బ్యాంకులకు కలుగజేస్తుంది. వివిధ బ్యాంకుల మధ్య బ్యాంకింగ్ లావాదేవీలను పరిష్కరించడానికి క్లియరింగ్ హౌస్ గా పనిచేస్తుంది. అలాగే బ్యాంకుల కార్యకలాపాలు తీర్చిదిద్ది వాటికి నాయకత్వం వహిస్తుంది.

4) అంతిమ ఋణదాత: మార్కెట్లోని అన్నిరకాల పరపతి సౌకర్యాలు ఉపయోగించుకున్న తర్వాత ఇంకా ద్రవ్యత్వ ఇబ్బందులున్నప్పుడు రిజర్వు బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు, డిస్కౌంటు గృహాలకు, ఇతర పరపతి సంస్థలకు కొన్ని షరతులకు లోబడి వాటి వినిమయ బిల్లులను రీడిస్కౌంట్ చేయడం ద్వారా పరపతి అందిస్తూ అంతిమ ఋణదాతగా పనిచేస్తుంది.

5) క్లియరింగ్ హౌస్ల నిర్వహణ: వ్యాపార అవసరాల నిమిత్తం బ్యాంకు ఖాతాదార్లు చెక్కుల ద్వారా చెల్లింపులు చేస్తుంటాయి. వేరువేరు ఖాతాదార్లు వేరువేరు బ్యాంకులలో తమ ఖాతాలు కలిగి ఉండటం వల్ల వివిధ బ్యాంకుల మీద ఈ చెక్కులు జారీ అవుతూ ఉంటాయి. వివిధ బ్యాంకుల మధ్య ఖాతాదార్ల చెక్కులకు సంబంధించిన సొమ్ము వారి వారి ఖాతాలలో జమచేయడానికి రిజర్వు బ్యాంకు తమవద్ద ఉన్న వివిధ బ్యాంకుల ఖాతాలను సర్దుబాటు చేస్తూ వసూళ్ళ చెల్లింపులు సులభతరం చేయడానికి వివిధ నగరాలలో క్లియరింగ్ హౌస్లు నిర్వహిస్తుంది.

6) విదేశీ మారక ద్రవ్యం పరిరక్షణ: రిజర్వు బ్యాంకు విదేశీ మారక ద్రవ్యంను పరిరక్షిస్తుంది. విదేశీ మారక ద్రవ్యం మారకం రేటులను స్థిరంగా ఉంచవలసిన బాధ్యత రిజర్వు బ్యాంకుది. విదేశీ మారక నిల్వలను నిర్వహిస్తూ వాటి వినియోగాన్ని నియంత్రణ చేస్తుంది.

7) పరపతి నియంత్రణ: ఆర్థిక వ్యవస్థలోని పరపతి పరిమాణాన్ని తగిన ద్రవ్య విధానం ద్వారా కేంద్ర బ్యాంకు నియత్రిస్తుంది. ద్రవ్యోల్బణం సమయంలో పరపతి తగ్గిస్తుంది. ఆర్థిక వ్యవస్థ తిరోగమన పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో పరపతి సప్లయ్ పంచుతుంది.

రిజర్వు బ్యాంకు ఆశయాలు:

  • కరెన్సీ నోట్ల జారీని క్రమబద్ధం చేయటం.
  • దేశంలో ద్రవ్య స్థిరత్వాన్ని సాధించటం.
  • వాణిజ్య బ్యాంకులకు మార్గదర్శకత్వం వహించటం.
  • దేశంలో పరపతి వ్యవస్థను నియంత్రించటం
  • దేశవ్యాప్తంగా ఒకే పరపతి విధానాన్ని రూపొందించి అమలు చేయడం.

ప్రశ్న 7.
ద్రవ్యోల్బణాన్ని నిర్వచించి, కారణాలను వివరించండి.
జవాబు:
సాధారణ ధరల స్థాయిలో స్థిరమైన, గ్రహించదగిన పెరుగుదల పరిస్థితిని ద్రవ్యోల్బణం అంటారు. ఇది అనేక విధాలుగా ప్రజల ఆర్థిక జీవితాన్ని, సంక్షేమాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఉత్పత్తి విలువ, పంపిణీ విలువ ప్రభావితం కలిగి ఉంటుంది.

ద్రవ్యోల్బణానికి కారణాలు: ద్రవ్యోల్బణం అధిక డిమాండు వల్లగాని, అల్ప సప్లయ్ వల్లగాని, ఉత్పత్తి వ్యయం పెరుగుదల వల్లగాని ఏర్పడుతుంది. ఈ పరిస్థితులకు దారితీసే పలు అంశాలు.
a) వస్తువుల సమిష్ఠి డిమాండ్ పెరుగుదల:

  1. అధిక జనాభా పెరుగుదల రేటు.
  2. ఆర్థికాభివృద్ధి వల్ల తలసరి ఆదాయాలు పెరగడం.
  3. ఉద్యోగిత కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం అధికంగా ఖర్చుచేయడం.
  4. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లయ్ పెరగడం.
  5. ప్రత్యక్ష పన్నురేట్లు తగ్గించటం.
  6. లోటు బడ్జెట్ విధానాన్ని అనుసరించడం.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

b) అల్ప సప్లయ్ కారణాలు:

  1. వ్యవసాయ రంగంలో ఋతుపవనాలు విఫలం కావడం, వరదలు, పంటలకు తెగులు రావడం, కల్తీ విత్తనాల వాడకం మొదలైనవి.
  2. సంస్థాగత పరపతి తగినంత లభించనందువల్ల పెట్టుబడి కొరత ఏర్పడటం.
  3. ఉత్పాదకాలు, ముడిపదార్థాల సప్లయి లేకపోవడం లేదా కొరతగా ఉండటం.
  4. విద్యుత్ కొరత, కార్మికుల అశాంతి మొదలైన కారణాల వల్ల స్థాపిత శక్తి పూర్తిగా వినియోగించుకోలేకపోవటం.
  5. కొన్ని పరిశ్రమల దీర్ఘ ఫలనకాలం.
  6. దేశంలో వినియోగానికి సప్లయ్ తగ్గించి ఎగుమతులు చేయడం.

c) ఉత్పత్తి వ్యయం పెరుగుదలకు కారణాలు:

  1. ఉత్పత్తి కారకాల ధరలు పెరగడం.
  2. పన్నుల రేట్లు పెరగడం.
  3. ఆధునిక పద్ధతులు ఉపయోగించకుండా పాత పద్ధతులలో ఉత్పత్తి చేయడం.
  4. అధిక ధరలకు యంత్రాలను, పనిముట్లను దిగుమతి చేయడం.

ప్రశ్న 8.
ద్రవ్యోల్బణ కారణాలను పేర్కొని, దాని ప్రభావాన్ని తెలపండి.
జవాబు:
సాధారణ పరిభాషలో ద్రవ్యోల్బణమనగా ధరల పెరుగుదల. కేవలం ఒక్కసారి ధరలు పెరిగినంత మాత్రాన దానిని ద్రవ్యోల్బణం అని అనకూడదు. నిర్విరామంగా ధరలు పెరుగుతుంటే దానినే ద్రవ్యోల్బణం అంటారు. భారతదేశంలో ద్రవ్యోల్బణ సమస్య ఉంది.

ద్రవ్యోల్బణ నిర్వచనం: వివిధ ఆర్థిక శాస్త్రవేత్తలు ద్రవ్యోల్బణం గూర్చి వివిధ నిర్వచనాలు ఇచ్చారు.

  1. హాట్రే అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, “కరెన్సీ నోట్లను అధికంగా జారీ చేయటాన్నే ద్రవ్యోల్బణమందురు”.
  2. డాల్టన్ అభిప్రాయం ప్రకారం, “ద్రవ్యోల్బణమనగా అధిక ద్రవ్యం తక్కువ వస్తువులను వెంటాడటం”.
  3. కిమ్మరర్ అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, “వ్యాపార అవసరాలకు మించి కరెన్సీ ఉండటాన్నే ద్రవ్యోల్బణ మందురు”.
  4. క్రౌథర్ అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, “ద్రవ్య విలువ పడిపోవడం అనగా ధరలు పెరగటాన్ని ద్రవ్యోల్బణమని చెప్పవచ్చు”.

వస్తువుల సప్లై, డిమాండ్లలో అసమతౌల్యం ఏర్పడటం వలన ధరల స్థాయిలో నిర్విరామంగా పెరుగుదల ఏర్పడును. అటువంటి ధరల పెరుగుదలనే ద్రవ్యోల్బణంగా చెప్పవచ్చు. ప్రతి ధర పెరుగుదలను ద్రవ్యోల్బణంగా చెప్పకూడదు. ధరల పెరుగుదల గణనీయమైందిగా, నిర్విరామంగా కొనసాగినపుడే ద్రవ్యోల్బణం ఏర్పడిందని చెప్పాలి. ద్రవ్యోల్బణ ప్రభావం లేదా ఫలితాలు: ధరల పెరుగుదల ముఖ్యంగా ఉత్పత్తి, పంపిణీలపై ఎటువంటి ప్రభావం కలిగించునో పరిశీలిద్దాం.

ఉత్పత్తిపై ప్రభావం: ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు ధరలు పెరుగుటచే ఉత్పత్తిదారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధరలు పెరుగుట వల్ల లాభాలు పెరుగుతాయి. దీనివల్ల పెట్టుబడి పెరిగి ఉత్పత్తి పెరుగును. దీనివల్ల ఉద్యోగిత, ఆదాయాలు పెరిగి ఉత్పత్తి మరింతగా పెరుగుతుంది. ఇది సంపూర్ణ ఉద్యోగితకు దారితీస్తుంది. ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగితను చేరుకున్న తరువాత ధరలు పెరుగుదల ఉత్పత్తిని పెంచదు. ధరలు పెరుగుదల ఒక మోతాదు ఉన్నా ఇది ఉత్పత్తి పెరుగుదలకు దారితీస్తుంది.

ధరల పెరుగుదల విపరీతంగా ఉన్నా, అనగా అతి ద్రవ్యోల్బణం ఉన్నా వ్యాపార రంగంలో అస్థిర పరిస్థితులు ఏర్పడి ఉత్పత్తి మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అతి ద్రవ్యోల్బణం వల్ల ఆర్థిక స్థిరత్వం దెబ్బతిని ఆర్థిక వ్యవస్థలో సమస్యలేర్పడతాయి. దీనివల్ల రాజకీయ, ఆర్థిక అస్థిరత్వం ఏర్పడి ఉత్పత్తి, ఉద్యోగితా స్థాయిలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆర్థిక వ్యవస్థలో వస్తువుల కొరత, నల్ల బజారు కార్యకలాపాలు ఏర్పడి సామాన్య ప్రజలకు వస్తువులు అందుబాటులో ఉండక వారి జీవన ప్రమాణ స్థాయిని దెబ్బతీయును.

పంపిణీపై ప్రభావం: సమాజంలోని ప్రజలను మూడు విధాలుగా విభజించవచ్చు. అవి:

  1. నిశ్చిత ఆదాయం పొందేవారు.
  2. వ్యాపారస్తులు
  3. ఋణాలు ఇచ్చేవారు, పుచ్చుకొనేవారు, ద్రవ్యోల్బణ ప్రభావం ఈ వర్గాలవారిపై ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవచ్చు.

a) నిశ్చిత ఆదాయం పొందేవారు, శ్రామిక వర్గంవారు: ద్రవ్యోల్బణం ఏర్పడినపుడు ధరలు పెరుగుతాయేమో గాని నిశ్చితమైన ఆదాయం పొందేవారి ఆదాయం పెరగదు. కనుక ఈ వర్గం వారు ద్రవ్యోల్బణం ఏర్పడినపుడు నష్టపోతారు. ద్రవ్యోల్బణ సమయంలో వస్తు సేవలు, వస్తు సేవల ధరలు పెరిగినంతగా వారి వేతనాలు పెరగకపోవడం వల్ల శ్రామిక వర్గం వారు నష్టపోతారు. శ్రామిక సంఘాలు బలమైనవిగా ఉన్నా ధరలు పెరుగుదలకు అనుగుణంగా వేతనాలను పొందవచ్చు. అట్లా కాని పక్షంలో శ్రామిక వర్గం నష్టపోతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

b) వ్యాపారస్తులు: ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు ధరలు పెరుగుతాయి, కనుక వ్యాపారస్తుల లాభాలు పెరుగుతాయి. వ్యాపారానికి అయ్యే వ్యయం మాత్రం ఒప్పందం ప్రకారం నిలకడగా ఉంటుంది. అందువల్ల ధరలు పెరిగితే వ్యాపారస్తులు లాభాన్ని పొందుతారు.

ఋణాలు ఇచ్చేవారు పుచ్చుకొనేవారు: ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు ఋణాలు ఇచ్చేవారు అనగా ఋణదాతలు నష్టపోతారు. ఈ సమయంలో ఋణాలు తీసుకొనేవారు లాభాన్ని పొందుతారు.

ద్రవ్యోల్బణం వల్ల ఉద్యోగితా స్థాయి పెరుగుతుంది. ధరలు పెరుగుదల వల్ల ఉత్పత్తి పెరిగి, ఉద్యోగితా స్థాయి పెరుగుతుంది. ద్రవ్యోల్బణం వల్ల ధరలు పెరిగి, ఎగుమతులు తగ్గి విదేశీ వ్యాపారంలో లోటు ఏర్పడుతుంది. ద్రవ్యోల్బణ పరిస్థితులు ధనవంతులను ధనవంతులుగా, పేదవారిని నిరు పేదలుగాను తయారుచేసి అసమానతలను పెంచుతుంది. అందువల్ల ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలి.

ప్రశ్న 9.
ద్రవ్యోల్బణ నివారణ చర్యలు తెలపండి.
జవాబు:
దీర్ఘకాలంలో సాధారణ ధరల స్థాయిలో నిరంతరమైన పెరుగుదలను ద్రవ్యోల్బణం అని అంటారు. పరిమిత ద్రవ్యోల్బణం ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది. అతి ద్రవ్యోల్బణం ఆర్థికాభివృద్ధిని నిరోధిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతుంది. అవి:

1) ద్రవ్యపరమైన చర్యలు: ద్రవ్యపరమైన చర్యలు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లయ్న క్రమబద్ధం చేస్తాయి. బ్యాంకులు పరపతిని క్రమబద్ధం చేయటం ద్వారా ద్రవ్య సప్లయిని నియంత్రణ చేయటం జరుగుతుంది. కేంద్ర బ్యాంకు పరిమాణాత్మక, గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాల ద్వారా ద్రవ్యం సప్లయ్న నియంత్రణ చేయవచ్చు.

2) కోశ విధానాలు: ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వం మిగులు బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి పన్ను రేట్లను పెంచటం, కొత్తగా పన్నులను విధించడం మొదలగువాటిని కోశపరమైన చర్యలు అంటారు.

3) ద్రవ్యేతర అంశాలు:
a) ఉత్పత్తిని పెంచటం: వస్తుత్పత్తిని పెంచటం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అరికట్టవచ్చు. ఉత్పత్తిని పెంచటానికి ఈ క్రింది చర్యలు చేపట్టాలి.

  1. ఉత్పాదక వనరులను సక్రమంగా కేటాయించడం.
  2. దేశీయంగా ఉన్న వస్తూ కొరతను దిగుమతుల ద్వారా ద్రవ్యోల్బణాన్ని అరికట్టవచ్చు.

b) వేతనాలు: వేతనాల పెరుగుదలకు, వస్తు ధరల పెరుగుదలకు దగ్గర సంబంధం ఉంది. సక్రమమైన వేతన విధానాలను అమలు చేయాలి.

c) రేషనింగ్: ద్రవ్యోల్బణాన్ని నివారించే ప్రత్యక్ష చర్య వస్తువు ధరలను అమలు చేయటం, అదుపులో ఉంచటం. చట్టబద్ధంగా ప్రతి వస్తువుకు గరిష్ఠ ధరను నియంత్రించి ఆ ధర కంటే ఎక్కువ ధరకు అమ్మకుండా చర్యలు తీసుకోవాలి.

d) బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టుట: అక్రమ వస్తు నిల్వలను అదుపు చేయుట ద్వారా వస్తువుల ధరలను అదుపు చేయవచ్చు. ప్రభుత్వ నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా నిల్వచేసే వ్యాపారస్తులను కఠినంగా శిక్షించాలి.

ప్రశ్న 10.
“ద్రవ్యోల్బణ విరామం” అనే భావనను పటం సహాయంతో వివరించండి.
జవాబు:
జె.యం. కీన్స్ “ద్రవ్యోల్బణ విరామం” అనే భావనను ప్రవేశపెట్టారు. కీన్స్ అభిప్రాయంలో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లయ్ పెరుగుదల, నిరుపయోగ వనరులున్నంత కాలం ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారితీయదు. కారణం ఇలాంటి పరిస్థితులలో ఉత్పత్తి పెరుగుతుందే తప్ప ధరలు పెరగవని కీన్స్ వాదన. ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగితా స్థాయిని చేరుకున్న తరువాత ద్రవ్య సప్లై పెరిగితే దాని ప్రభావం పూర్తిగా ధరలపై ఉంటుంది. దీనినే కీన్స్ నిజ ద్రవ్యోల్బణంగా ఉంటుంది. దీనిని ప్రక్క రేఖా పటం ద్వారా తెలియజేయవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం 1

పై రేఖా పటంలో C + I + G ఆర్థిక వ్యవస్థలోని మొత్తం వ్యయం, పెట్టుబడి, ప్రభుత్వ వ్యయం తెలుపు తుంది. O.S సమిష్టి సప్లయిని తెలియజేయును. P బిందువు వద్ద ‘N’ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగితా స్థాయిని చేరుకుంటుంది. ‘P’ బిందువు వరకు ద్రవ్యోల్బణం ఏర్పడదు. ‘P’ బిందువు తరువాత ప్రభుత్వ వ్యయం పెరగడం వల్ల ధరలు పెరుగుతాయి. పై రేఖా పటంలో ధరల పెరుగుదల P నుంచి P’ వరకు సూచించడమైంది. రేఖా పటంలోని P నుంచి P’ వరకు మధ్యగల తేడా ‘ద్రవ్యోల్బణ విరామం” తెలియజేయును.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వస్తు మార్పిడి విధానం
జవాబు:
ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం వాడుకలోకి రాకముందు “వస్తు మార్పిడి విధానం” అమలులో ఉండేది. అప్పుడు జనాభా పరిమితంగా ఉండి, వ్యక్తుల కోరికలు సాధారణ స్థాయిలో ఉండేవి. ఈ విధానంలో వ్యక్తులు వస్తువులకు బదులుగా వస్తువులను వినిమయంగా పొందటాన్ని వస్తు మార్పిడి విధానం అంటారు. ఇలాంటి మార్పిడికి ప్రధాన కారణం మానవుల ‘అవసరాలు’. ఆర్థిక కార్యకలాపాలు పరిమితంగా ఉండి, వ్యక్తుల కోరికలు సాధారణంగా ఉన్నంత వరకు ఈ విధానం కొనసాగుతుంది. జనాభా పెరిగి, కోరికలలో మార్పులు సంభవించి, వర్తక వాణిజ్య వ్యవహారాలు పెరగడంతో ఈ విధానం అనేక ఇబ్బందులను ఎదుర్కొనవలసి వచ్చింది.

వస్తు మార్పిడి విధానంలోని సమస్యలు:
1) కోర్కెల సమన్వయము లోపించుట: వస్తు మార్పిడి విధానం సాఫీగా జరగాలంటే ఇరుపక్షాల వారి కోరికలలో సమన్వయం కుదరాలి. ఉదా: వరి పండించే వ్యక్తి వస్త్రం పట్ల అవసరం, వస్త్రం నేసే వ్యక్తికి వరి అవసరం ఏక కాలంలో కలగాలి. అలాగైతేనే వినిమయం లేదా మార్పిడికి అవకాశం ఏర్పడుతుంది. ఇరువురి కోరికలలో సమన్వయం కుదరకపోతే మార్పిడి అసాధ్యమవుతుంది.

2) సంపద నిల్వ చేయడంలో ఇబ్బంది: మార్పిడికి ఉపయోగించే అన్ని వస్తువులను ‘నిల్వ’ ఉంచే అవకాశం ఉండదు. కారణం కొన్ని రకాల వస్తువులను ‘నిల్వ’ ఉంచడం వల్ల అవి పాడైపోయే అవకాశం ఉంది. కాలం గడిచే కొద్ది ఇలాంటి వస్తువుల విలువ క్షీణించడం, కొన్నిసార్లు నశించడం జరగవచ్చు. ఉదా: పశువులు, కూరగాయలు, ఆహార ధాన్యాలు మొదలైనవి.

3) వస్తువుల అవిభాజ్యత: కొన్ని వస్తువులను విభజించడం వల్ల వాటి విలువ క్షీణించవచ్చు లేదా పూర్తిగా నశించవచ్చు. ఉదా: పశువులు, పనిముట్లు, యంత్రాలు. ఇలాంటి వాటి విషయంలో విభజించటానికి వీలుండదు. అందువల్ల మార్పిడి సాధ్యం కాదు.

4) విలువను నిర్ణయించే కొలమానం లేకపోవుట: వస్తు మార్పిడి విధానంలో వస్తువుల విలువలను ఇతర వస్తువుల విలువలో చెప్పవలసి వస్తుంది. అంటే వస్తువుల విలువలను ఖచ్చితంగా కొలిచే కొలమానం / సాధనం లేకపోవడం వల్ల ఈ విధానాన్ని అమలుచేయడం ఎంతో కష్టమౌతుంది.

ప్రశ్న 2.
ద్రవ్య నిర్వచనాలు.
జవాబు:
ద్రవ్యమునకు పూర్వం వస్తు మార్పిడి విధానం అమలులో ఉండేది. వ్యక్తి తాను ఉత్పత్తి చేసిన వస్తువులను ఇతర వస్తువులతో మార్పిడి చేసుకొను విధానాన్నే వస్తు మార్పిడి విధానమంటారు. ఈ విధానంలో కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల దీనికి బదులు ద్రవ్యాన్ని ప్రవేశపెట్టడమైంది.

నిర్వచనాలు: వివిధ ఆర్థిక శాస్త్రవేత్తలు ద్రవ్యానికి సంబంధించి వివిధ నిర్వచనాలను ఇచ్చారు.

క్రౌధర్ అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, “వినిమయ సాధనంగా అందరూ అంగీకరించేది, విలువల కొలమానంగా ఉపయోగించబడేదే ద్రవ్యం”.

రాబర్ట్సన్ ప్రకారం, “వస్తు క్రయ విక్రయ చెల్లింపులలో, ఇతర వ్యవహారాల పరిష్కారాలలో అధికంగా జనామోదం పొందింది”. ద్రవ్యంగా చెప్పవచ్చును.
సెలిగ్మన్ ‘ఏ వస్తువుకు అయితే సర్వజనాంగీకారం ఉంటుందో దానినే ద్రవ్యం’గా నిర్వచించాడు.

కొంతమంది అభిప్రాయం ప్రకారం చట్టం దేనిని ద్రవ్యమంటుందో అదే ద్రవ్యం అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 3.
ద్రవ్యం
రకాలు.
జవాబు:
క్రౌధర్ అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం “వినిమయ సాధనంగా అందరూ అంగీకరించేది, విలువ కొలమానంగా ఉపయోగపడేదే ద్రవ్యం”.
ద్రవ్య రకాలు:
1) వస్తురూప ద్రవ్యం/ ప్రాతినిద్య ద్రవ్యం: ద్రవ్యం ప్రవేశపెట్టిన తొలిదశలో కొన్ని వస్తువులు ద్రవ్యంగా పరిగణించబడేవి. జంతువులు, బంగారు, వెండి మొదలగు వాటిని ద్రవ్యంగా ఉపయోగించారు. ఈ విధమైన ద్రవ్యాన్ని వస్తు రూప ద్రవ్యం లేదా పుల్ బాడీడ్ ద్రవ్యం అంటారు.
నాణేలు, కరెన్సీ నోట్లు ఈ రకానికి చెందుతాయి. ఇది ద్రవ్యానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. కాబట్టి వీటిని ప్రాతినిధ్య ద్రవ్యం అంటారు. వీటి ముఖ విలువ కంటే అంతర్గత విలువ తక్కువగా ఉంటుంది.

2) చట్టబద్ధ ద్రవ్యం, ఐచ్ఛిక ద్రవ్యం: చట్టబద్ధ ద్రవ్యం అనగా ప్రభుత్వంచే చట్టరీత్యా గుర్తింపు పొందిన ద్రవ్యాన్ని చట్టబద్ధ ద్రవ్యం అని అంటారు. ఈ ద్రవ్యానికి చట్టబద్ధత ఉన్నందువల్ల ప్రతి ఒక్కరూ వస్తుసేవల కొనుగోలుకు, అమ్మకానికి దీనిని వినిమయ మాధ్యమంగా తప్పనిసరిగా అంగీకరించాలి.

ద్రవ్యానికి ప్రత్యామ్నాయంగా వాడే ఏ పరపతి సాధనాన్ని అయినా ఐచ్ఛిక ద్రవ్యంగా పరిగణించవచ్చు. ఉదా: బిల్లులు, ప్రామిసరి నోట్లు, బాండ్లు, ట్రెజరీ బిల్లులు మొదలగు ద్రవ్యాన్ని అంగీకరించమని ఏ ఒక్కరిని బలవంతం చేయడానికి వీలుకాదు.

3) లోహ ద్రవ్యం, కాగితపు ద్రవ్యం: అన్ని రకాల నాణేలు లోహ ద్రవ్యం క్రిందికి వస్తాయి. నాణేల తయారీకి వెండి, నికెల్, స్టీల్ మొదలగు లోహాలను ఉపయోగిస్తారు.
కాగితంపై ముద్రించిన ద్రవ్యాన్ని కాగితపు ద్రవ్యం అని అంటారు. అన్ని కరెన్సీ నోట్లు కాగితం ద్రవ్యం క్రిందకు వస్తాయి.

4) ప్రామాణిక ద్రవ్యం, టోకెన్ ద్రవ్యం: ప్రామాణిక ద్రవ్యం ముఖ విలువ, అంతర్గత విలువ ఒకటిగానే ఉంటాయి. ప్రభుత్వం కరెన్సీని ముద్రించడానికి ఏదైనా ఒక లోహాన్ని ప్రమాణంగా తీసుకుంటుంది.

ద్రవ్యం అంతర్గత విలువ కంటే ముఖ విలువ ఎక్కువగా ఉంటే దీనిని టోకెన్ ద్రవ్యం అంటారు. ఇది పరివర్తనాత్మకం కాదు. దీనిని ప్రజలు అన్ని రకాల వ్యవహారాలలో వినిమయ మాధ్యమంగా మాత్రమే అంగీకరిస్తారు.

ప్రశ్న 4.
ద్రవ్యం ప్రాథమిక విధులు.
జవాబు:
ద్రవ్యం ప్రాథమిక విధులు:
1) వినిమయ మాధ్యమం: ద్రవ్యం వినిమయ మాధ్యమంగా వ్యవహరిస్తుంది. ఏ వస్తువైనా ముందుగా ద్రవ్యంతో మార్పిడి చేసుకొని, ఆ తరువాత ఆ ద్రవ్యంలో మరి ఏ ఇతర వస్తువునైనా కొనుగోలు చేయవచ్చు. ఆ విధంగా ద్రవ్యం |అనే వినిమయ మాధ్యమం ద్వారా ప్రజలు వస్తు సేవలను వినిమయం చేసుకోవచ్చు.

2) విలువల కొలమానం: వస్తు సేవల విలువ కొలమానంగా ద్రవ్యం వ్యవహరిస్తుంది. వ్యాపార వ్యవహారాలను సులువైనవిగా, సులభతరమైనవిగా మార్చింది. ప్రతి వస్తువు విలువను ద్రవ్య యూనిట్లో వ్యక్తపరచడం జరుగుతుంది. దీనిని ధర అంటారు. ద్రవ్యం యూనిట్ విలువ స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే అది సంతృప్తికరమైన కొలమానంగా పనిచేస్తుంది.

ప్రశ్న 5.
వాణిజ్య బ్యాంకు డిపాజిట్ల రకాలు.
జవాబు:
సంస్థాగత పరపతిని సమకూర్చే విషయంలో వాణిజ్య బ్యాంకుల ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. దేశ ఆర్థిక కార్యకలాపాలలో వాణిజ్య బ్యాంకుల పాత్ర గణనీయమైంది. వాణిజ్య బ్యాంకులు ప్రజల వద్ద నుండి పొదుపు మొత్తాలను సమీకరించి వాటిని ఉత్పాదక కార్యకలాపాల కోసం పెట్టుబడిగా ఉపయోగించవచ్చు. పొదుపు, పెట్టుబడులను సమన్వయ పరచడానికి వాణిజ్య బ్యాంకులు తోడ్పడతాయి. వాణిజ్య బ్యాంకులు ద్రవ్యాన్ని సృష్టిస్తాయి. ఈ బ్యాంకులు ముఖ్యంగా ప్రజల దగ్గర నుండి డిపాజిట్లను సేకరించి ఋణాలు మంజూరు చేస్తాయి. డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ కంటే ఋణాల మీద వసూలు చేసే వడ్డీ ఎక్కువగా ఉంటుంది. వాణిజ్య బ్యాంకులు కొన్ని ప్రయోజనాలకు మాత్రమే పరపతిని సమకూర్చడం ద్వారా ఆర్థిక కార్యకలాపాల స్వభావ, స్వరూపాలను నిర్ణయించగలవు.

వాణిజ్య బ్యాంకుల విధులు: వాణిజ్య బ్యాంకులు నిర్వహించే విధులను ముఖ్యంగా రెండు విధాలుగా విభజించవచ్చు. అవి: ప్రాథమిక విధులు, అనుషంగిక విధులు.

1) ప్రాథమిక విధులు: వాణిజ్య బ్యాంకుల యొక్క ప్రాథమిక విధులు ప్రజల దగ్గర నుండి డిపాజిట్లను సేకరించడం, ఖాతాదారులకు ఋణాలను మంజూరు చేయుట.
డిపాజిట్లను స్వీకరించుట: వాణిజ్య బ్యాంకులు ప్రజల నుండి డిపాజిట్లను స్వీకరిస్తాయి. ఖాతాదారులు బ్యాంకులో సొమ్మును డిపాజిట్ చేసినపుడు ఆ మొత్తం వారి ఖాతాలో జమ అవుతుంది. ఇటువంటి డిపాజిట్లను ప్రాథమిక డిపాజిట్లు లేదా సాధారణ డిపాజిట్టు అని అంటారు. వాణిజ్య బ్యాంకులు స్వీకరించే డిపాజిట్లు అనేక రకాలుగా
ఉంటాయి.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

a) కరెంట్ డిపాజిట్లు: కరెంట్ డిపాజిట్లలోని సొమ్మును ఖాతాదారుడు అడిగిన వెంటనే బ్యాంకు చెల్లిస్తుంది. ఖాతాదారుడు తన సొమ్మును తీసుకునేటప్పుడు ముందుగా బ్యాంకుకు తెలియపరచవలసిన అవసరం లేదు. కాని ఈ డిపాజిట్లకు బ్యాంకు వడ్డీ చెల్లించదు. సాధారణంగా వ్యాపారస్తులు తమ వ్యాపార వ్యవహారాల చెల్లింపు కోసం కరెంటు డిపాజిట్లను చేయుదురు.

b) ఫిక్స్డ్ డిపాజిట్లు: ఈ డిపాజిట్లు ఒక నిర్ణీత కాలానికి సంబంధించినవై ఉంటాయి. ఈ డిపాజిట్లు నిర్ణయించిన కాల వ్యవధి లోపల చెల్లించబడవు. వీటినే గడువు డిపాజిట్లు లేదా కాల పరిమితి డిపాజిట్లు అని కూడా అందురు. వీటిపై బ్యాంకులు ఎక్కువ వడ్డీని చెల్లిస్తాయి.

c) సేవింగ్ డిపాజిట్లు: ప్రజలు తమ వద్దనున్న చిన్నచిన్న పొదుపు మొత్తాలను బ్యాంకులలో సేవింగ్ డిపాజిట్లుగా దాచుకుంటారు. ఈ డిపాజిట్లను అవసరమయినప్పుడు తీసుకోవచ్చు. కానీ వీటిపై కొన్ని షరతులు ఉంటాయి. కొంత గరిష్ట మొత్తానికి మించి తీసుకోకూడదు. వీటిపై బ్యాంకులు స్వల్ప వడ్డీని చెల్లిస్తాయి.

d) రికరింగ్ డిపాజిట్లు: కాల పరిమితి డిపాజిట్లలో ఒక రకం రికరింగ్ డిపాజిట్లు ఒకేసారి పెద్ద మొత్తంలో పొదుపు చేయలేని వారికి ఈ డిపాజిట్లు సౌకర్యంగా ఉంటాయి. ప్రతి నెల 10 గాని అంతకన్నా కొన్ని రెట్లు అదనంగాగాని ఒక సంవత్సరం లేదా కొన్ని సంవత్సరాల వ్యవధికి ఈ ఖాతాలో జమ చేయవచ్చు. పై డిపాజిట్లేగాక రికరింగ్ డిపాజిట్లు, సీజనల్ డిపాజిట్లు, చిల్డ్రన్ బెనిఫిట్ డిపాజిట్లు మొదలైనవి కూడా ఉంటాయి. 2) అనుషంగిక విధులు: బాంకులు నిర్వహించే ప్రాథమిక విధుల ఫలితంగా ‘ప్రాతినిథ్య విధులు’ ఏర్పడతాయి.

  1. బాంకులు ఖాతాదారుల ప్రతినిధులుగా వారి తరపున బీమా ప్రీమియమ్లు, కరెంట్ బిల్లులు మొదలైన వాటిని ఖాతాదారుల ఆదేశానుసారం నిర్ణీత సమయాల్లో చెల్లించుట.
  2. బాంకులు ఖాతాదారులు ‘ఏజెంట్గా ‘ కంపెనీల షేర్లను, రుణ పత్రాలను కొనిపెడతాయి.
  3. ఖాతాదారుల తరపున డ్రాఫ్టు ద్వారా, చెక్ ల ద్వారా, తంతి తపాలా ద్వారా సొమ్ము బదిలీ చేస్తుంది.

ప్రశ్న 6.
వాణిజ్య బ్యాంకు – కేంద్ర బ్యాంకు.
జవాబు:
వాణిజ్య బ్యాంకు: ఇతరులకు ఇవ్వడానికి ద్రవ్యం కలిగిన వారి నుంచి లేదా తమ ఆదాయాల నుంచి పొదుపు చేసే వారి నుంచి బ్యాంకు ద్రవ్యం వసూలు చేసి దానిని అవసరమైన వారికి ఋణంగా ఇస్తుంది.

కేంద్ర బ్యాంకు: దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థకు కేంద్ర బ్యాంకు శిఖరం. ఇది బ్యాంకింగ్ వ్యవస్థలో బ్యాంకుల ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ, నియంత్రిస్తూ, క్రమబద్ధీకరిస్తుంది.

వాణిజ్య బ్యాంకు

  1. వాణిజ్య బ్యాంకుల ప్రాథమిక విధి డిపాజిట్ల సేకరణ, ఋణాల మంజూరు.
  2. వాణిజ్య బ్యాంకులు ఖాతాదారులకు ఏజెంట్, సలహా దారుగా వ్యవహరిస్తాయి.
  3. ప్రజల నుంచి స్వీకరించిన డిపాజిట్ల నుంచి పరపతిని సృష్టిస్తాయి.
  4. వాణిజ్య బ్యాంకులు కొనుగోలుదారుడు అమ్మకం దారునికి ఇచ్చిన వినిమయ బిల్లులు డిస్కౌంట్ చేసుకుంటాయి.
  5. ఇది విదేశీ మారక ద్రవ్యం విలువను, వాటి వినిమయాన్ని నిమిత్తం విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూరుస్తాయి.

కేంద్ర బ్యాంకు

  1. కేంద్ర బ్యాంకు ప్రాథమిక విధి కరెన్సీ నోట్ల జారీ.
  2. కేంద్ర బ్యాంకులు ప్రభుత్వానికి, వాణిజ్య బ్యాంకులకు ఏజెంటుగా, సలహాదారుగా వ్యవహరిస్తాయి.
  3. ఆర్థిక వ్యవస్థలోని పరపతిని ద్రవ్య విధానాల ద్వారా నియంత్రిస్తుంది.
  4. వాణిజ్య బ్యాంకుల డిస్కౌంట్ హౌస్ల, ఇతర పరపతి సంస్థల వినిమయ బిల్లులను రీడిస్కౌంట్ చేసుకుంటాయి.
  5. ఎగుమతిదారులకు, దిగుమతిదారులకు వ్యాపార నియంత్రణ చేస్తుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 7.
కేంద్ర బ్యాంకు ఏ విధంగా “అంతిమ ఋణదాత” ?
జవాబు:
కేంద్ర బ్యాంకు విధులలో వాణిజ్య బ్యాంకులకు అంతిమ ఋణదాతగా వ్యవహరించడం ఒకటి. అత్యవసర సమయాలలో వాణిజ్య బ్యాంకులకు సహాయం చేయుటకు కేంద్ర బ్యాంకు సిద్ధంగా ఉంటుంది. కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకే కాకుండా డిస్కౌంట్ గృహాలకు, ఇతర పరపతి సంస్థలకు కొన్ని షరతులకు లోబడి వినిమయ బిల్లులను రీడిస్కౌంట్ చేయటం ద్వారా అంతిమ రుణదాతగా పనిచేస్తుంది. కొన్ని ఆస్తులను నగదుగా మార్చుకొని నగదు రిజర్వులను పెంచుకొనే అవకాశం వాణిజ్య బ్యాంకులకు, ఇతర బ్యాంకులకు, ఇతర ద్రవ్య సంస్థలకు అవకాశం ఏర్పడుతుంది. అంతిమ ఋణదాత అంటే అతిక్లిష్ట పరిస్థితులలో వాణిజ్య బ్యాంకులను, ఇతర ద్రవ్య సంస్థలను ఆదుకోవటము.

అత్యవసర పరిస్థితులలో వాణిజ్య బ్యాంకులను కేంద్ర బ్యాంకు ఆదుకుంటుంది. ఋణాలను మంజూరు చేయడానికి కేంద్ర బ్యాంకు వెనకాడదు. అదే సమయంలో పరపతి నియంత్రణ సాధనాల ద్వారా పరపతి ద్రవ్యాన్ని నియంత్రిస్తుంది. అత్యవసర సమయంలో కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకుల సెక్యూరిటీలను హామీగా ఉంచుకొనే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కలుగజేస్తుంది. అందువలన కేంద్ర బ్యాంకును అంతిమ ఋణదాత అని పేర్కొందురు.

ప్రశ్న 8.
కేంద్ర బ్యాంకు లక్ష్యాలు. [Mar. ’17, ’16, ’15]
జవాబు:
దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థకు కేంద్ర బ్యాంకు అత్యున్నతమైనది. బ్యాంకింగ్ వ్యవస్థలో బ్యాంకుల ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది, నియంత్రిస్తుంది, క్రమబద్ధీకరిస్తుంది.
కేంద్ర బ్యాంకు లక్ష్యాలు:
1) కరెన్సీ నోట్ల జారీ: ఒక దేశంలో కరెన్సీ నోట్ల జారీలో కేంద్ర బ్యాంకు గుత్తాధిపత్యం కలిగి ఉంటుంది. దీనివల్ల నోట్ల జారీలో ఏకత్వం ఏర్పడుతుంది. కరెన్సీపై విశ్వసనీయత కలుగుతుంది. ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా ద్రవ్య సప్లయ్ నియంత్రించడానికి వీలుంటుంది.

2) ప్రభుత్వ బ్యాంకరు: కేంద్ర బ్యాంకు ప్రభుత్వ బ్యాంకరుగా, ఏజెంట్గా, సలహాదారుగా వ్యవహరిస్తుంది. ఇది ప్రభుత్వ ద్రవ్య నిధులకు సంబంధించిన లెక్కలు తయారుచేస్తుంది. ప్రభుత్వం తరుపున ద్రవ్యం స్వీకరిస్తూ, ప్రభుత్వం తరుపున ఋణాలు ఇస్తూ ప్రభుత్వ ఋణాన్ని స్వీకరిస్తుంది. ప్రభుత్వానికి ఋణాలను ఇస్తూ, అన్ని ఆర్థిక వ్యవహారాలలో ప్రభుత్వానికి సలహాలను అందిస్తుంది.

3) బ్యాంకుల బ్యాంకరు: కేంద్ర బ్యాంకు ప్రభుత్వానికే కాకుండా బ్యాంకులకు కూడా బ్యాంకరుగా పనిచేస్తుంది. ప్రతి బ్యాంకు చట్ట ప్రకారం తను స్వీకరించిన డిపాజిట్లు మొత్తంలో కొంత శాతం నగదు నిల్వలుగా ఉంచాలి. ఆ నిల్వల నిష్పత్తిని కేంద్ర బ్యాంకు నిర్ణయిస్తుంది. వినిమయబిల్లుల రీడిస్కౌంట్ ద్వారా షెడ్యూల్డు బ్యాంకులకు విత్త సహాయం అందజేస్తుంది. ఇది వాణిజ్య బ్యాంకుల మధ్య ఏర్పడిన లావాదేవీలను పరిష్కరించడానికి క్లియరింగ్ హౌస్ పనిచేస్తుంది.

4) అంతిమ ఋణదాత: మార్కెట్లోని అన్నిరకాల పరపతి సౌకర్యాలు ఉపయోగించుకున్న తరువాత ఇంకా ద్రవ్యత్వ ఇబ్బందులున్నప్పుడు బ్యాంకులకు, డిస్కౌంట్ గృహాలకు, ఇతర పరపతి సంస్థలకు కేంద్ర బ్యాంకు అనేక రకాలుగా విత్త సహాయం అందిస్తూ అంతిమ ఋణదాతలుగా పనిచేస్తుంది.

5) పరపతి నియంత్రణ: ఆర్థిక వ్యవస్థలోని పరపతి పరిమాణాన్ని తగిన ద్రవ్య విధానం ద్వారా కేంద్ర బ్యాంకు నియంత్రిస్తుంది. ద్రవ్యోల్బణం సమయంలో పరపతి తగ్గిస్తుంది. ఆర్థిక వ్యవస్థ తిరోగమన పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో పరపతి సప్లయ్ పెంచుతుంది.

6) పర్యవేక్షణ: దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను పర్యవేక్షిస్తుంది. నూతన బ్యాంకుల ఏర్పాటు, బ్యాంకుల విస్తరణకు కేంద్ర బ్యాంకు అనుమతి అవసరం.
దేశంలో ద్రవ్య సుస్థిరతను సాధించుట కేంద్ర బ్యాంకు ప్రధాన ధ్యేయం. దేశంలో ఆర్థికాభివృద్ధిని పెంపొందించే విధానాలను కేంద్ర బ్యాంకు చేపడుతుంది.

ప్రశ్న 9.
కేంద్ర బ్యాంకు / రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా. [Mar. ’16]
జవాబు:
భారతదేశపు కేంద్ర బ్యాంకు భారతీయ రిజర్వు బ్యాంకు. ఇది 1935 సం॥ ఏప్రిల్లో 5 కోట్ల వాటా మూలధనంతో నెలకొల్పబడినది. మొదట భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రైవేటు వాటాదారుల యాజమాన్యం క్రింద ఏర్పడినది. 1949 లో భారత ప్రభుత్వం దీనిని జాతీయం చేసింది. 1934 భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం ప్రకారం అన్ని ముఖ్యమైన కేంద్ర బ్యాంక్ విధులను నిర్వర్తిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం ముంబాయిలో ఉంది. భారతీయ రిజర్వు బ్యాంకు కార్యనిర్వహణ అధికారి గవర్నర్. గవర్నర్కు సహాయంగా నలుగురు డిప్యూటీ గవర్నర్లు పనిచేస్తారు.

ఆర్థికాభివృద్ధికి కావలసిన ద్రవ్య వనరులను సమకూర్చుట. మరొకవైపు నుండి అభివృద్ధి వ్యయం వలన ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడుటకుండా చూడటం, ఆర్థికాభివృద్ధికవసరమైన ద్రవ్య సంస్థలను నెలకొల్పటం, దీర్ఘకాలిక ఋణాలు అందేలా చూడటం చాలా అవసరం ఇవన్ని కేంద్ర బ్యాంకు యొక్క బాధ్యతలుగా చెప్పవచ్చును. ద్రవ్య వ్యవస్థకు, అభివృద్ధికి కావలసిన ద్రవ్య వనరులను సప్లైని పెంచటం ద్వారా సమకూర్చాలి. మరొకవైపు ద్రవ్య సప్లై పెరగటం వలన ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడకుండా చూడటం దీని ప్రధాన విధి.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

భారతీయ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యాలు:
భారతీయ రిజర్వు బ్యాంకు విధులు:
1) కరెన్సీ నోట్ల జారీ: మనదేశంలోని కరెన్సీ నోట్ల జారీపై గుత్తాధిపత్య అధికారం రిజర్వు బ్యాంకు కలిగి ఉంది. రిజర్వు బ్యాంకు 1,000, 500, 100, 50, 20, 10, 5, 2 రూపాయల కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. ఈ నోట్లపై భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ సంతకం ముద్రించబడతాయి. 2006 ఆగష్టు నాటికి దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ విలువ 23,936 కోట్లు.

2) ప్రభుత్వ బ్యాంకరు: రిజర్వు బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికీ, రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకరుగా, ప్రతినిధిగా, ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వ బ్యాంకరుగా వివిధ ప్రభుత్వ విభాగాల అకౌంట్లను నిర్వహిస్తుంది. ప్రభుత్వం తరుపున ద్రవ్యాన్ని స్వీకరిస్తుంది, చెల్లింపులు చేస్తుంది. ప్రభుత్వాలకు తాత్కాలిక ఋణాలు అందిస్తుంది. అన్ని ఆర్థిక వ్యవహారాలలో ప్రభుత్వాలకు సలహాదారుగా కూడా పనిచేస్తుంది.

3) బ్యాంకుల బ్యాంకరు దేశంలోని బ్యాంకులకు రిజర్వు బ్యాంకు బ్యాంకరుగా పనిచేస్తుంది. కొన్ని రకాల బిల్లులను రీడిస్కౌంట్ చేసుకునే సదుపాయం వాణిజ్య బ్యాంకులకు కలుగజేస్తుంది. వివిధ బ్యాంకుల మధ్య బ్యాంకింగ్ లావాదేవీలను పరిష్కరించడానికి క్లియరింగ్ హౌస్ గా పనిచేస్తుంది. అలాగే బ్యాంకుల కార్యకలాపాలు తీర్చిదిద్ది వాటికి నాయకత్వం వహిస్తుంది.

4) అంతిమ ఋణదాత: మార్కెట్లోని అన్నిరకాల పరపతి సౌకర్యాలు ఉపయోగించుకున్న తర్వాత ఇంకా ద్రవ్యత్వ ఇబ్బందులున్నప్పుడు రిజర్వు బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు, డిస్కౌంటు గృహాలకు, ఇతర పరపతి సంస్థలకు కొన్ని షరతులకు లోబడి వాటి వినిమయ బిల్లులను రీడిస్కౌంట్ చేయడం ద్వారా పరపతి అందిస్తూ అంతిమ ఋణదాతగా పనిచేస్తుంది.

5) క్లియరింగ్ హౌస్ల నిర్వహణ: వ్యాపార అవసరాల నిమిత్తం బ్యాంకు ఖాతాదార్లు చెక్కుల ద్వారా చెల్లింపులు చేస్తుంటాయి. వేరువేరు ఖాతాదార్లు వేరువేరు బ్యాంకులలో తమ ఖాతాలు కలిగి ఉండటంవల్ల వివిధ బ్యాంకుల మీద ఈ చెక్కులు జారీ అవుతూ ఉంటాయి. వివిధ బ్యాంకుల మధ్య ఖాతాదార్ల చెక్కులకు సంబంధించిన సొమ్ము వారి వారి ఖాతాలలో జమచేయడానికి రిజర్వు బ్యాంకు తమవద్ద ఉన్న వివిధ బ్యాంకుల ఖాతాలను సర్దుబాటు చేస్తూ వసూళ్ళ చెల్లింపులు సులభతరం చేయడానికి వివిధ నగరాలలో క్లియరింగ్ హౌస్లు నిర్వహిస్తుంది.

ప్రశ్న 10.
ద్రవ్యోల్బణ నిర్వచనాలు.
జవాబు:
సాధారణ పరిభాషలో ద్రవ్యోల్బణమనగా ధరల పెరుగుదల కేవలం ఒకేసారి ధరలు పెరిగినంత మాత్రాన దానిని ద్రవ్యోల్బణం అనకూడదు. నిర్విరామంగా ధరలు పెరుగుతున్నా దీనినే ద్రవ్యోల్బణం అంటారు. భారతదేశంలో ద్రవ్యోల్బణ సమస్య ఉంది.

ద్రవ్యోల్బణ నిర్వచనాలు: వివిధ ఆర్థిక శాస్త్రవేత్తలు ద్రవ్యోల్బణం గూర్చి నిర్వచనాలను ఇచ్చారు.

  1. హాట్రే అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం “కరెన్సీ నోట్లను అధికంగా జారీ చేయటాన్నే ద్రవ్యోల్బణమందురు”.
  2. డాల్టన్ అభిప్రాయం ప్రకారం, “ద్రవ్యోల్బణమనగా అధిక ద్రవ్యం తక్కువ వస్తువులను వెంటాడటం”.
  3. కిమ్మరర్ అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, “వ్యాపార అవసరాలకు మించి కరెన్సీ ఉంటే దాన్ని ద్రవ్యోల్బణం అందురు”.
  4. ఏసి. పిగూ ప్రకారం “వాస్తవిక ఆదాయం కన్నా ద్రవ్య ఆదాయం ఎక్కువగా ఉండటాన్నే ద్రవ్యోల్బణమందురు”.
  5. కేదర్ అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, ‘ద్రవ్య విలువ పడిపోవడం అనగా ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణమని చెప్పవచ్చు”. వస్తువుల సప్లై, డిమాండ్లలో అసమతౌల్యం ఏర్పడడం వల్ల ధరల స్థాయి నిర్విరామంగా పెరుగుదల ఏర్పడినా అటువంటి ధరల పెరుగుదలనే ద్రవ్యోల్బణంగా చెప్పవచ్చు. ప్రతి ధర పెరుగుదలను ద్రవ్యోల్బణంగా చెప్పకూడదు. ధరల పెరుగుదల గణనీయమైందిగా నిర్విరామంగా కొనసాగినపుడే ద్రవ్యోల్బణం ఏర్పడిందని చెప్పాలి”.

ప్రశ్న 11.
డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం.
జవాబు:
వస్తువు సప్లయికి, డిమాండ్కు మధ్య ఏర్పడే అసమతౌల్యం వల్ల వస్తువుల ధరలు నిర్విరామంగా పెరుగుతూ ఉన్న యెడల దానిని ద్రవ్యోల్బణమనవచ్చు. ధరల పెరుగుదల నిర్విరామంగా, గణనీయమైనదిగా ఉన్నప్పుడు మాత్రమే ద్రవ్యోల్బణం ఏర్పడిందని చెప్పాలి. ద్రవ్యోల్బణ భావాన్ని వివిధ రకాలుగా పరిశీలించవచ్చు.

డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం: సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై కన్నా ఎక్కువగా ఉన్నందువల్ల ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని అంటారు. ద్రవ్యరాశి పెరుగుదల, పొదుపుకన్నా పెట్టుబడి అధికంగా ఉండటం వల్ల సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై కన్నా అధికంగా ఉండవచ్చు. ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగితా స్థాయికి చేరుకున్న తరువాత సమిష్టి డిమాండ్ పెరిగినట్లయినా ఉత్పత్తి పెరగక కేవలం ధరలు మాత్రమే పెరుగుతాయి. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి సమిష్ఠి డిమాండ్ను తగ్గించాలి.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 12.
సప్లయ్/వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం.
జవాబు:
వస్తువుల సప్లయికి, డిమాండుకు మధ్య ఏర్పడే అసమతౌల్యం వల్ల వస్తువుల ధరలు నిర్విరామంగా పెరుగుతూ ఉన్న యెడల దానిని ద్రవ్యోల్బణమనవచ్చు. ధరల పెరుగుదల నిర్విరామంగా, గణనీయమైనదిగా ఉన్నప్పుడు మాత్రమే ద్రవ్యోల్బణం ఏర్పడిందని చెప్పాలి. ద్రవ్యోల్బణ భావాన్ని వివిధ రకాలుగా పరిశీలించవచ్చు.

వ్యయ ప్రభావిత ద్రవ్యోల్బణం: ఉత్పత్తి వ్యయం పెరుగుదల వల్ల ధరల స్థాయి పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడినా దానిని వ్యయ ప్రేరిత లేదా వ్యయ ప్రభావిత ద్రవ్యోల్బణం అని అంటారు. కార్మిక సంఘాలు బలోపేతమై వేతనాలను పెంచుకొన్నప్పుడు లేదా ఇతర ఉత్పత్తి వ్యయాలు పెరిగినప్పుడు ఈ వ్యయ ప్రభావిత ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుట ద్వారా వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని నివారించవచ్చు.

ప్రశ్న 13.
ద్రవ్యోల్బణంలో రకాలు. [Mar. ’17, ’15]
జవాబు:
వస్తువుల సప్లైకి, డిమాండుకు మధ్య ఏర్పడే అసమతౌల్యం వల్ల వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్న యెడల దానిని ద్రవ్యోల్బణమనవచ్చు. ధరల పెరుగుదల నిర్విరామంగా, గణనీయమైనదిగా ఉన్నపుడు మాత్రమే ద్రవ్యోల్బణం ఏర్పడిందని చెప్పాలి. ద్రవ్యోల్బణ భావాన్ని వివిధ రకాలుగా పరిశీలించవచ్చు.

డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం: సమిష్టి డిమాండ్, సమిష్ఠి సప్లై కన్నా ఎక్కువగా ఉన్నందువల్ల ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని అంటారు.

ద్రవ్యరాశి పెరుగుదల, పొదుపు కన్నా పెట్టుబడి అధికంగా ఉండటం వల్ల సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై కన్నా అధికంగా ఉండవచ్చు. ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగితా స్థాయికి చేరుకున్న తరువాత సమిష్టి డిమాండ్ పెరిగినట్లయినా ఉత్పత్తి పెరగక కేవలం ధరలు మాత్రమే పెరుగుతాయి. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి సమిష్టి డిమాండ్ను తగ్గించాలి.

వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం: ఉత్పత్తి వ్యయం పెరుగుదల వల్ల ధరల స్థాయి పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడినా దానిని వ్యయప్రేరిత ద్రవ్యోల్బణం అని అంటారు. కార్మిక సంఘాలు బలోపేతమైన వేతనాలను పెంచుకొన్నప్పుడు లేదా ఇతర ఉత్పత్తి వ్యయాలు పెరిగినప్పుడు ఈ వ్యయ ప్రభావిత ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.

వాస్తవిక ద్రవ్యోల్బణం: వస్తువుల ధరలు పెరిగి శ్రామికుల జీవన ప్రమాణ స్థాయి తగ్గినపుడు వాస్తవిక ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. వస్తువుల ధరల పెరుగుదల రేటులో శ్రామికుల వేతనాలు పెరగకపోయిన వాస్తవిక వేతనాలు తగ్గిపోతాయి. దీనివల్ల ఎక్కువ ప్రమాణంలో వస్తురాశిని కొనుగోలు చేయరాదు.

పాకుతున్న ద్రవ్యోల్బణం: ఈ ద్రవ్యోల్బణం స్వల్ప మోతాదులో ఉంటుంది. ఇందు ధరలు పెరుగుదల స్వల్పంగా ఉండును. ఈ రకమైన ద్రవ్యోల్బణంలో ధరల స్థాయిలో పెరుగుదల సంవత్సరానికి 3 శాతం లోపే ఉంటుంది. కొంతమంది ఆర్థికవేత్తల ప్రకారం ఈ రకమైన ద్రవ్యోల్బణం ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది.

నడుస్తున్న ద్రవ్యోల్బణం: ధరల స్థాయిలో పెరుగుదల కొంచెం ఎక్కువగా ఉండి ఇది మోతాదులో ఉంటే దీనిని నడుస్తున్న ద్రవ్యోల్బణమని అంటారు. ధరల పెరుగుదల రేటు సంవత్సరానికి 3 నుంచి 4 శాతం వరకు ఈ రకమైన ద్రవ్యోల్బణంలో జరుగును.

పరుగెడుతున్న ద్రవ్యోల్బణం: ఈ రకం ద్రవ్యోల్బణంలో ధరల పెరుగుదల విపరీతంగా ఉంటుంది. సుమారుగా ఇందు ధరల పెరుగుదల 10 శాతం వరకు ఉండవచ్చు. ఈ ద్రవ్యోల్బణం వల్ల ఆర్థిక వ్యవస్థలో అనేక చెడు ఫలితాలు ఏర్పడతాయి.

ఉధృతమైన లేదా అతి ద్రవ్యోల్బణం: ధరల పెరుగుదల విపరీతంగా, అతివేగంగా, నిరాటంకంగా జరుగుతున్న దానిని అతి ద్రవ్యోల్బణం అని అంటారు. దీనినే ఉదృతమైన ద్రవ్యోల్బణం అని కూడా అంటారు.

అణచిన ద్రవ్యోల్బణం: ద్రవ్యోల్బణాన్ని రేషనింగ్, ప్రభుత్వ కంట్రోళ్ళు, ఇతర నియంత్రణ సాధనాల ద్వారా అదుపు చేయబడిన ధరలు తగ్గి ద్రవ్యోల్బణం అదుపు చేయబడుతుంది. దీనినే అణచిన ద్రవ్యోల్బణం అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 14.
ఉత్పత్తి, పంపిణీపై ద్రవ్యోల్బణ ప్రభావం.
జవాబు:
ద్రవ్యోల్బణ ప్రభావం అన్ని వర్గాల ప్రజల మీద ఒకే విధంగా ఉండదు. ద్రవ్యోల్బణం కొన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని వర్గాల ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
1) స్థిర ఆదాయ వర్గాల వారి మీద: స్థిర ఆదాయ వర్గాలకు చెందిన వారి ఆదాయం, ధరల పెరుగుదలతోపాటు పెరగదు. కాబట్టి ద్రవ్యోల్బణం వల్ల వారు ఇబ్బందిపాలవుతారు. ఫించనుదార్లు, బ్యాంకులలో కాలపరిమితి డిపాజిట్ల ద్వారా వచ్చే ఆదాయం మీద ఆధారపడి జీవించేవారు.

2) శ్రామిక వర్గం: అసంఘటిత రంగాలలో పనిచేస్తూ వేతనధార జీవనం సాగించే శ్రామికులు సాధారణంగా తక్కువ ఆదాయం కలిగి ఉంటారు. సాధారణంగా ధరలు పెరిగినందువల్ల వీరి వేతనాలలో పెరుగుదల ఉండదు.

3) ఋణదాతలు, ఋణగ్రహీతలు: ద్రవ్యోల్బణం వల్ల ద్రవ్యం విలువ క్షీణిస్తుంది. కాబట్టి ఋణం ఇచ్చినప్పటికంటే, తిరిగి చెల్లించినప్పటికి ద్రవ్యోల్బణం వల్ల ద్రవ్యం విలువ తగ్గుతుంది. కాబట్టి ఋణదాతలు నష్టపోతారు, ఋణగ్రహీతలు లాభపడతారు.

4) వినియోగదారులు ఉద్యమదారులు: ద్రవ్యోల్బణం వల్ల వినియోగదారులు నష్టపోతారు. కాని ఉద్యమదారులకు లాభాలు పెరుగుతాయి.
ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థలో ఆదాయ అసమానతలను పెంచుతుంది.

ప్రశ్న 15.
ద్రవ్యోల్బణ నివారణ చర్యలు. [Mar. ’16]
జవాబు:
దీర్ఘకాలంలో సాధారణ ధరల స్థాయిలో నిరంతరమైన పెరుగుదలను ద్రవ్యోల్బణం అని అంటారు. పరిమిత ద్రవ్యోల్బణం ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది. అతి ద్రవ్యోల్బణం ఆర్థికాభివృద్ధిని నిరోధిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతుంది. అవి:
1) ద్రవ్యపరమైన చర్యలు: ద్రవ్యపరమైన చర్యలు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లయ్న క్రమబద్ధం చేస్తాయి. బ్యాంకులు పరపతిని క్రమబద్ధం చేయటం ద్వారా ద్రవ్య సప్లయిని నియంత్రణ చేయటం జరుగుతుంది. కేంద్ర బ్యాంకు పరిమాణాత్మక, గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాల ద్వారా ద్రవ్యం సప్లయ్న నియంత్రణ చేయవచ్చు.

2) కోశ విధానాలు: ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వం మిగులు బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి పన్ను రేట్లను పెంచటం, కొత్తగా పన్నులను విధించడం మొదలగువాటిని కోశపరమైన చర్యలు అంటారు.

3) ద్రవ్యేతర అంశాలు:
a) ఉత్పత్తిని పెంచటం: వస్తుత్పత్తిని పెంచటం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అరికట్టవచ్చు. ఉత్పత్తిని పెంచటానికి ఈ క్రింది చర్యలు చేపట్టాలి.

  1. ఉత్పాదక వనరులను సక్రమంగా కేటాయించడం.
  2. దేశీయంగా ఉన్న వస్తూ కొరతను దిగుమతుల ద్వారా ద్రవ్యోల్బణాన్ని అరికట్టవచ్చు.

b) వేతనాలు: వేతనాల పెరుగుదలకు, వస్తు ధరల పెరుగుదలకు దగ్గర సంబంధం ఉంది. సక్రమమైన వేతన విధానాలను అమలు చేయాలి.

c) రేషనింగ్: ద్రవ్యోల్బణాన్ని నివారించే ప్రత్యక్ష చర్య వస్తువు ధరలను అమలు చేయటం, అదుపులో ఉంచటం. చట్టబద్ధంగా ప్రతి వస్తువుకు గరిష్ఠ ధరను నియంత్రించి ఆ ధర కంటే ఎక్కువ ధరకు అమ్మకుండా చర్యలు తీసుకోవాలి.

d) బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టుట: అక్రమ వస్తు నిల్వలను అదుపు చేయుట ద్వారా వస్తువుల ధరలను అదుపు చేయవచ్చు. ప్రభుత్వ నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా నిల్వచేసే వ్యాపారస్తులను కఠినంగా శిక్షించాలి.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కోరికల సమన్వయం.
జవాబు:
వస్తుమార్పిడి పద్ధతిలో అమ్మకందారుడు ఏ వస్తువునయితే మార్పిడి కింద ఇవ్వడానికి అంగీకరిస్తాడో ఆ వస్తువునే కొనుగోలుదారుడు అంగీకరించవలసి వచ్చేది. కొనుగోలుదారుడు, అమ్మకపుదారుల కోరికలు ఒకే విధంగా కలవవలసిన అవసరం ఉంటుంది. దీనినే కోరికల సమన్వయం అంటారు.

ప్రశ్న 2.
వాయిదాల చెల్లింపు.
జవాబు:
ఆధునిక ఆర్థిక వ్యవస్థలో వ్యవహారాలన్ని వాయిదా చెల్లింపుల పద్ధతిలోనే జరుగుతాయి. ద్రవ్యం ఈ విధిని నిర్వర్తించడం వల్ల వ్యక్తులు, వస్తువులను కొనుగోలు చేయడం, బాంకులు ఇతర ద్రవ్య సంస్థల నుంచి రుణాలు పొందడం, బాండ్లు, షేర్లు కొనుగోలు, అమ్మకాలు మొదలైనవి సులభతరమయ్యాయి.

ప్రశ్న 3.
విలువల నిధి.
జవాబు:
ద్రవ్యం ఉన్న వ్యక్తి దానిని ఏ సమయంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా, ఎవరినైనా బదిలీ చేయవచ్చు. ద్రవ్యం వల్ల విలువను బదిలీ చేయడం తేలికవుతుంది.

ప్రశ్న 4.
ద్రవ్యత్వం. [Mar. ’17, ’16, ’15]
జవాబు:
అత్యధిక ద్రవ్యత్వం ఉన్న ఆస్తి ద్రవ్యం ద్రవ్యత్వపరంగా ఆస్తులన్నింటిలోకి ఉత్తమమైంది. ద్రవ్యం నూరు శాతం ద్రవ్యత్వం కలిగి ఉంటుంది.

ప్రశ్న 5.
సమీప ద్రవ్యం. [Mar. ’17, ’15]
జవాబు:
ద్రవ్యంగా అంగీకరించక వేగంగా ద్రవ్యంలోకి మార్చుకోవడానికి వీలైన ఎక్కువ ద్రవ్యత్వం కలిగిన ఆస్తులను సమీప ద్రవ్యం అంటారు. ఎటువంటి కాలయాపన లేకుండా వెనువెంటనే వినిమయ మాధ్యమంలోకి మార్చకోగలిగే, ద్రవ్య నిర్వచనంలోకి చేరని ఇతర విత్త సంబంధమైన ఆస్తులన్నింటిని సమీప ద్రవ్యం అంటారు.

ప్రశ్న 6.
కరెన్సీ. [Mar. ’17, ’15]
జవాబు:
ఆర్థిక వ్యవస్థలో చలామణీలో ఉన్న నాణేలు, కాగితపు నోట్లు. కాగితపు కరెన్సీని కేంద్ర బ్యాంకు జారీ చేస్తుంది. ఒక రూపాయి నోట్లను తప్ప మిగతా కరెన్సీ నోట్లను మనదేశంలో రిజర్వు బ్యాంకు జారీ చేస్తుంది. రూపాయి నోట్లను భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ముద్రిస్తుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 7.
M11, M2, M3, & M4
జవాబు:
M1 = ప్రజల వద్దనున్న కరెన్సీ + వాణిజ్య బ్యాంకుల వద్దనున్న డిపాజిట్లు + RBI వద్దనున్న డిపాజిట్లు.
M2 = M1 + వాణిజ్య, సహకార బ్యాంకుల వద్దనున్న టైమ్ డిపాజట్లు.
M3 = M1 + Post office లోని పొదుపు ఖాతాల లోని డిపాజిట్లు.
M4 = M1 + Post office savings బ్యాంకులో ఉన్న మొత్తం డిపాజిట్లు.

ప్రశ్న 8.
పరపతి ద్రవ్యం.
జవాబు:
దీనినే బాంకుమని అని కూడా అంటారు. ప్రాథమిక డిపాజిట్ల నుంచి వాణిజ్య బ్యాంకులు సృష్టించే బాంకు డిపాజిట్లను పరపతి ద్రవ్యం అంటారు. దీనిని చెక్కు ద్వారా ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేయవచ్చు.

ప్రశ్న 9.
ఓవర్ డ్రాఫ్ట్. [Mar. ’17, ’16]
జవాబు:
ఖాతాదారుని ఖాతాలో మొత్తం కంటే ఎక్కువగా తీసుకొనే సౌకర్యం. వాణిజ్య బ్యాంకులు తమ ఖాతాదార్లు సౌలభ్యార్థం కల్పించిన వసతి. ఈ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కరెంట్ ఖాతా మీద మాత్రమే ఉంటుంది. దీని మీద కొంత వడ్డీని కూడా వసూలు చేస్తుంది.

ప్రశ్న10.
పరపతి సృష్టి.
జవాబు:
పరపతి సృష్టి అంటే బ్యాంకు డిపాజిట్ల కంటే ఎన్నో రెట్లు రుణాలు పెంచడం. అనగా వాణిజ్య బ్యాంకు ఖాతాదారుడు రుణం మంజూరు చేసినప్పుడు నగదు చెల్లించకుండా వారి ఖాతాలో ఒక డిపాజిట్ గా రుణ మొత్తాన్ని జమ చేస్తాం. ఆ విధంగా సెకండరీ డిపాజిట్లు సృష్టించబడతాయి. దీనిని పరపతి సృష్టి అంటారు.

ప్రశ్న 11.
ద్రవ్యోల్బణం.
జవాబు:
దీర్ఘకాలంలో సాధారణ ధరల స్థాయిలో నిరంతరమైన పెరుగుదలను ద్రవ్యోల్బణంగా పేర్కొనవచ్చు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యరాశి అతి ఎక్కువగాను, వస్తు సేవలు అతి తక్కువగాను ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.

ప్రశ్న 12.
నిజ ద్రవ్యోల్బణం.
జవాబు:
ధరల పెరుగుదల రేటు సంవత్సరానికి దాదాపు 16% ఉంటుంది. దీనినే కీన్స్ నిజ ద్రవ్యోల్బణం అంటారు.

ప్రశ్న 13.
అతి తీవ్ర ద్రవ్యోల్బణం. [Mar 16th]
జవాబు:
ధరల పెరుగుదల విపరీతంగా, అతివేగంగా నిరాటంకంగా పెరుగుతుంటే దానిని అతి తీవ్ర ద్రవ్యోల్బణం అంటారు. ఈ రకమైన ద్రవ్యోల్బణంలో ధరల పెరుగుదలకు అవధులు ఉండవు. ద్రవ్యోల్బణం రేటు 100% చేరవచ్చు, దానిని దాటవచ్చు. ఇది ద్రవ్యోల్బణం యొక్క విపరీతమైన రూపం.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 14.
కేంద్ర బ్యాంకు.
జవాబు:
ప్రతి దేశపు బ్యాంకింగ్ వ్యవస్థలో అత్యున్నత స్థానంగా ఉండే బ్యాంకు కేంద్ర బ్యాంకు. భారతదేశంలో ఉన్న కేంద్ర బ్యాంకును ‘రిజర్వు బాంక్ ఆఫ్ ఇండియా’ అంటారు. ఇది 1935 ఏప్రిల్ 1వ తేదీన ఏర్పడింది. ఇది 5 కోట్ల ” రూపాయల మూలధనంతో స్థాపించబడింది.

ప్రశ్న 15.
ద్రవ్యోల్బణం – ద్రవ్యం విలువ.
జవాబు:
దీర్ఘకాలంలో సాధారణ ధరల స్థాయిలో నిరంతరమైన పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్యం విలువ సాధారణ ధరల స్థాయికి విలోమంగా మారుతుంది. ధరలలోని మార్పులు ద్రవ్యం విలువలోని మార్పులను సూచిస్తాయి. ధరలు ఎంత అధికమైతే ద్రవ్యం విలువ అంత తక్కువగా ఉంటుంది.

ప్రశ్న 16.
సమిష్టి సప్లయి ధర.
జవాబు:
మొత్తం వస్తు సేవలను ఉత్పత్తి చేయటానికి పెట్టబోయే ధర.

ప్రశ్న 17.
సమిష్టి డిమాండ్ ధర.
జవాబు:
మొత్తం వస్తువులను అమ్మగా రాబోయే రాబడి ధర.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 18.
ప్రాథమిక డిపాజిట్.
జవాబు:
వాణిజ్య బ్యాంకులు వ్యక్తుల నుండి స్వీకరించిన డిపాజిట్లు. ఇవి పరపతి వల్ల ఏర్పడినవి కావు. పరపతి సృష్టికి మార్గం ఏర్పాటు చేసేవి.

AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 8th Lesson స్థూల ఆర్థిక సిద్ధాంతం Textbook Questions and Answers.

AP Inter 1st Year Economics Study Material 8th Lesson స్థూల ఆర్థిక సిద్ధాంతం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సాంప్రదాయ ఉద్యోగితా సిద్దాంతం ప్రధానాంశాలు వివరించండి.
జవాబు:
ఆడమ్స్మిత్, రికార్డో, జె.బి.సే, జె.యస్. మిల్ మొదలగు వారిని సాంప్రదాయ ఆర్థికవేత్తలంటారు. వీరు ప్రతిపాదించిన ఉత్పత్తి, ఉద్యోగితా సిద్ధాంతాన్నే సాంప్రదాయ సిద్ధాంతం అని అంటారు. ఈ సిద్ధాంతం ప్రధానంగా జె.బి. సే మార్కెట్ సూత్రంపై ఆధారపడింది. జె.బి. సే అభిప్రాయంలో “సప్లై తనకు తానే డిమాండ్ సృష్టించుకుంటుంది”. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ కొరతగాని లేదా నిరుద్యోగితగాని ఏర్పడవు.

పరిపూర్ణ పోటీ పరిస్థితులలో దీర్ఘ కాలంలో ఒక పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగితా స్థాయి వద్ద స్థిర సమతౌల్యంలో ఉంటుందని సాంప్రదాయ ఆర్థికవేత్తలు భావించారు. సంపూర్ణ ఉద్యోగిత ఒక సాధారణ లక్షణం అని, ‘నిరుద్యోగిత ఒక అసాధారణ పరిస్థితి అని భావించారు. ప్రభుత్వ జోక్యం లేకపోతే మార్కెట్ శక్తుల స్వేచ్ఛా ప్రవర్తన ద్వారా ఆర్థిక వ్యవస్థలో స్వయం చాలకంగా సర్దుబాటు జరుగుతుంది. ఈ అభిప్రాయాలను స్థూలంగా సాంప్రదాయ ఉత్పత్తి, ఉద్యోగితా సిద్ధాంతం అంటారు.

సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం ఈ క్రింది అంశాల మీద ఆధారపడి ఉంటుంది.

  1. సే మార్కెట్ సూత్రం – ధరల సరళత్వం
  2. పొదుపు, పెట్టుబడుల సమానత్వం
  3. వేతనాల సరళత్వం

1. సే మార్కెట్ సూత్రం – ధరల సరళత్వం: ‘సే’ విశ్లేషణ ప్రకారం, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో “సప్లై తన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది” అంటే మార్కెట్లో ఎంత ఉత్పత్తి చేస్తే అంతకు డిమాండ్ ఏర్పడుతుంది. అందువల్ల అధికోత్పత్తి సమస్య ఉండదని ‘సే’ అభిప్రాయం. స్వల్పకాలంలో ఉత్పత్తిదార్లు డిమాండ్కు సంబంధించిన అంచనాలలో వచ్చే తప్పిదాల వల్ల అధికోత్పత్తి, అల్పోత్పత్తి సమస్యలు రావచ్చు. కాని దీర్ఘకాలంలో ఈ పొరపాట్లను ధరలో సరళత్వం ద్వారా సర్దుబాటు చేయడం వల్ల సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లైల మధ్య సమతౌల్యం సాధించవచ్చు.

AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం

2. పొదుపు, పెట్టుబడుల సమానత్వం దీర్ఘకాలంలో ‘సే’ ప్రకారం సమిష్టి పొదుపు, పెట్టుబడి సమానంగా ఉంటాయి. ఈ సమానత్వం ఉన్నంత వరకు ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత ఉండదు. ‘సే’ అభిప్రాయంలో పొదుపు, పెట్టుబడుల మధ్య అసమతౌల్యం ఏర్పడినట్లయితే వడ్డీరేటులో మార్పు చేయడం ద్వారా వాటి మధ్య శి శ్రీ సమానత్వం చేకూరి సమతౌల్య స్థితిలో సంపూర్ణ ఉద్యోగిత ‘ఆ సాధించవచ్చు. దీనిని ఈ క్రింది రేఖా పటం ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం 1
ప్రక్క రేఖాపటంలో ‘X’ అక్షం మీద పొదుపు, పెట్టుబడి, “Y” అక్షంపై వడ్డీ రేటు సూచించబడింది. ‘E’ బిందువు వద్ద పొదుపు, పెట్టుబడులు సమానం. పొదుపు ఎక్కువగా ఉంటే వడ్డీరేటు తగ్గుతుంది. పొదుపు తక్కువగా ఉండే వడ్డీరేటు పెరుగుతుంది.

3. వేతనాల సరళత్వం: పిగూ అభిప్రాయం ప్రకారం శ్రామిక సప్లై, డిమాండ్ నిజవేతనాలపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగ సమస్య ఏర్పడినప్పుడు ద్రవ్య వేతనాలను తగ్గించడం ద్వారా సంపూర్ణ ఉద్యోగితను సాధించవచ్చని పిగూ వివరించారు. పిగూ సూచించిన విధానాన్నే “వేతన కోత విధానం” అంటారు.

సాంప్రదాయక ఆర్థికవేత్తల ప్రకారం సంపూర్ణోద్యోగిత అనేది, ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలంలో తప్పనిసరిగా చేరుకొనే వాస్తవిక పరిస్థితి. స్వల్పకాలంలో నిరుద్యోగ సమస్య తలెత్తితే, అది కూడా తాత్కాలికమైంది. ఇలాంటి సంపూర్ణ ఉద్యోగిత ఆర్థిక వ్యవస్థలో ఐచ్ఛిక, సంఘృష్ట నిరుద్యోగిత ఉండే అవకాశం ఉంది.

ప్రమేయాలు: సాంప్రదాయ సిద్ధాంతం ఈ క్రింది ప్రమేయాలపై ఆధారపడి ఉంది.

  1. సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది.
  2. ఆర్థిక కార్యకలాపాలలో ప్రభుత్వ జోక్యం ఉండదు.
  3. ఆర్థిక వ్యవస్థలో పరిపూర్ణ పోటీ మార్కెట్ కలిగి ఉంటుంది.
  4. శ్రామికులు ఒకే రకమయిన సామర్థ్యం కలిగి ఉండాలి.
  5. వేతనాలు, ధరలు స్థిరంగా ఉండక మారుతూ ఉంటాయి.
  6. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం తటస్థంగా ఉంటుంది.
  7. ఆర్థిక వ్యవస్థలో పొదుపు, పెట్టుబడి వడ్డీరేటుపై ఆధారపడి ఉంటాయి.

ప్రశ్న 2.
కీన్స్ ఉద్యోగితా సిద్ధాంతాన్ని వివరించండి. [Mar. ’17, ’16, ’15]
జవాబు:
కీన్స్ ఉద్యోగితా సిద్ధాంతానికి డిమాండ్ ఒక ముఖ్య భావన. సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లయ్ సమానంగా ఉండే స్థితిలో సార్థక డిమాండ్ నిర్ణయమౌతుంది. వివిధ ఉద్యోగితా స్థాయిలలో సమిష్టి డిమాండ్ వివిధ రకాలుగా ఉంటుంది. ఏ ఉద్యోగితా స్థాయిలో సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లైతో సమానమౌతుందో అది ఆర్థిక వ్యవస్థ సమతౌల్యాన్ని సూచిస్తుంది. కాని అది స్వల్పకాలిక సమతౌల్యం. అది సార్థక డిమాండ్ని సూచిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్కు అనుగుణంగా మారుతుంది.

సమిష్టి సప్లై ధర: సమిష్టి సప్లై ధరను వివిధ ఉత్పత్తి రాశులను అమ్మటం వల్ల వ్యవస్థాపకుడు పొంది తీరవలసిన కనిష్ట ఆదాయంగా కీన్స్ వర్ణించాడు. సమిష్టి సప్లై పట్టిక వ్యవస్థాపకులు వివిధ ఉత్పత్తి రాశుల వద్ద పొందిన ఆదాయాన్ని కాకుండా పొంది తీరవలసిన వ్యయ, ఆదాయపు అంచనాలను మాత్రమే తెలియజేయును.

సమిష్టి డిమాండ్ ధర: సమిష్టి డిమాండ్ వివిధ ఉత్పత్తి స్థాయిల వద్ద వ్యయసంస్థలు వ్యయ సేవలపై ఖర్చు పెట్టడానికి సిద్ధపడే మొత్తాలను చూపుతుంది. వివిధ ఉత్పత్తి రాశులపై వ్యయ సంస్థలు ఖర్చు పెట్టే మొత్తాలను చూపే పట్టిక సమిష్టి డిమాండ్ పట్టిక. అనగా నిర్ధిష్ట పరిమాణంలో వస్తువును ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మడం ద్వారా | భవిష్యత్తులో పొందగలిగే రాబడిని సమిష్టి డిమాండ్ ‘ ధర అంటారు.

సార్థక డిమాండ్: సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై రేఖలు ఒకదానినొకటి ఖండించుకున్న బిందువు సార్థక డిమాండ్ను సూచిస్తుంది. ఈ బిందువు వద్ద సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి సప్లై ధరకు సమానమవటం వల్ల డిమాండ్ సార్థక డిమాండ్ అవుతుంది. ఆ స్థాయిలో జాతీయాదాయపు ఉద్యోగితాస్థాయిలు సమతౌల్య స్థితికి చేరుకుంటాయి. ఈ సార్థక డిమాండ్ వ్యవస్థలో ఉద్యోగితా స్థాయిని నిర్ణయిస్తుందని కీన్స్ పేర్కొన్నాడు.

సార్థక డిమాండు ఈ క్రింది పట్టిక ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం 2

పై పట్టికలో 14 లక్షల మందిని నియమించి ఉత్పత్తి చేస్తున్న స్థాయి వద్ద సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి సప్లై ధర, కౌ 700 కోట్లు వద్ద రెండు సమానమై సమతౌల్యం ఏర్పడింది. అంతకంటే తక్కువ ఉద్యోగితా స్థాయి వద్ద సమిష్టి సప్లై ధర కంటే సమిష్టి డిమాండ్ ధర అధికం. అదే విధంగా అధిక ఉద్యోగితాస్థాయి వద్ద సమిష్టి డిమాండ్ ధర కంటే సమిష్టి సప్లై ధర అధికంగా ఉంటుంది. దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.

AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం
AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం 3

పై రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద AS మరియు AD రేఖలు సమానమై సార్థక డిమాండ్ను తెలియజేయును. ఈ బిందువు వద్ద 14 లక్షల సమతౌల్య ఉద్యోగితా పరిమాణం తెలుపుచున్నది. అందువల్ల 14 లక్షల మంది శ్రామికుల నియామకం వద్ద ఆర్థిక వ్యవస్థ సమతౌల్య స్థితిని చేరుకుంది. ఆర్థిక వ్యవస్థలో 16 లక్షల మందిని నియమించినట్లయితే సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్ కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించవచ్చు. ఈ స్థితిని కీన్స్ “అల్ప ఉద్యోగితా సమతౌల్య స్థితి” గా పేర్కొనెను.

ప్రశ్న 3.
నిరుద్యోగితను తగ్గించడానికి ప్రభుత్వ వ్యయం ఏవిధంగా దోహదపడుతుందని కీన్స్ పేర్కొన్నారో వివరించండి.
జవాబు:
ప్రభుత్వ విత్తంలోని ముఖ్యమైన భాగాలలో ప్రభుత్వ వ్యయం ఒకటి. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలు నిరంతరం పెరుగుతూ ఉండటంతో అన్ని దేశాలలోను ప్రభుత్వ వ్యయం పెరిగింది. ప్రభుత్వ వ్యయ పరిమాణం ఆయా ప్రభుత్వాల రాజకీయ ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఈ క్రింది అంశాలపై ఖర్చు చేస్తుంది.
1. దేశ రక్షణ: అంతర్గత, బహిర్గత ఒడిదుడుకుల నుండి దేశాన్ని రక్షించుకోవడానికి జాతీయాదాయంలో కొంత భాగాన్ని దేశ రక్షణకై ఖర్చు చేయవలసి ఉంటుంది.

2. ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ: ప్రజా శ్రేయస్సు పెంపొందే విషయంలో ప్రభుత్వ రంగంలో కొన్ని వస్తూత్పత్తి సంస్థలను ప్రారంభించి నిర్వహించాల్సి వస్తోంది. ప్రభుత్వం విస్తరించిన కొద్దీ వ్యయం పెరుగుతుంది.

3. ప్రజాస్వామ్య సంస్థలు: పార్లమెంటు, అసెంబ్లీ మొదలైన ప్రజాస్వామ్య సంస్థల పట్ల ప్రభుత్వానికి నిర్వహణ వ్యయం పెరుగుతుంది. భూములు, భవనాలు కొనుగోలు చేస్తుంది.

4. పాలనా వ్యయం: ప్రభుత్వ కార్యకలాపాలు పెరుగుతున్నప్పుడు వాటిని నిర్వహించవలసిన సిబ్బందిని పెంచాల్సి ఉంటుంది.

5. వృద్ధాప్యపు భృతి, నిరుద్యోగ భృతి వృద్ధాప్యపు భృతి, నిరుద్యోగ భృతి మొదలైన బదిలీ చెల్లింపులను సాంఘిక భద్రతల కల్పన దృష్ట్యా చెల్లించవలసి ఉంటుంది.

6. వడ్డీ చెల్లింపులు: ప్రభుత్వ స్వదేశీ, విదేశీ ఋణాలపై వడ్డీలు చెల్లించాలి.

7. ప్రజోపయోగ కార్యక్రమాలు: ప్రజోపయోగ కార్యకలాపాల కోసం ఆధునిక ప్రభుత్వాలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయి. త్రాగు నీరు, రవాణా మొదలైన వాటిపై ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.

8. అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి: ఆర్థికాభివృద్ధిని సాధించటానికి అవసరమైన అవస్థాపనా సౌకర్యాలను ప్రభుత్వం అభివృద్ధి పరచవలసి ఉంటుంది.

ప్రశ్న 4.
కీన్స్ ఉద్యోగితా సిద్ధాంతం, సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం కంటే ఏవిధంగా మెరుగైందో వివరించండి.
జవాబు:
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం జె.బి. సే మార్కెట్ సూత్రంపై ఆధారపడింది. జె.బి. సే అనే ఆర్థికవేత్త ప్రకారం “సప్లై దానికి తగిన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది.” ఉత్పత్తి విలువకు సరిపడ ఆదాయం ఏర్పడును. కనుక ఉత్పత్తి అంతటికి డిమాండ్ ఏర్పడుతుంది.

సాంప్రదాయ సిద్ధాంతం ప్రకారం సప్లై పెరిగినంత మేరకు డిమాండ్ కూడా పెరుగుతుంది. అందువల్ల మార్కెట్ విస్తరణకు పరిమితి ఉండదు. కనుక సార్వత్రిక నిరుద్యోగిత ఉండదు. వేతనాల రేటులో మార్పులు సప్లై డిమాండ్లను సమానం చేస్తుంది. సాంప్రదాయ సిద్ధాంతం ప్రకారం వేతనాలు తగ్గింపు వల్ల ఉద్యోగితా స్థాయి పెరుగుతుంది. కీన్స్ అనే ఆర్థికవేత్త సాంప్రదాయ సిద్ధాంతాన్ని ఈ క్రింది విధంగా విమర్శించాడు.

1. సంపూర్ణ ఉద్యోగిత సాధారణ లక్షణము కాదు: ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత ఉండుననే ప్రమేయాన్ని సాంప్రదాయ ఆర్థికవేత్తలు తీసుకున్నారు. కానీ వాస్తవానికి ఏ ఆర్థిక వ్యవస్థలోను సంపూర్ణ ఉద్యోగిత ఉండదు.

2. వేతనాల తగ్గుదల ఉండదు: వేతనాలను తగ్గించడం ద్వారా ఉద్యోగితను పెంచవచ్చన్న పిగూ వాదనను కీన్స్ తీవ్రంగా విమర్శించాడు. కాని వాస్తవానికి కార్మిక సంఘాలు వేతనాల తగ్గుదలను ప్రతిఘటిస్తాయి. కీన్స్ అభిప్రాయంలో వేతనాల స్థాయి తగ్గిస్తే, ఉద్యోగిత పెరగడానికి బదులు ఉత్పత్తి, ఉద్యోగిత తగ్గుతాయి.

3. పొదుపు – పెట్టుబడులు సమానంగా ఉండవు: కీన్స్ అభిప్రాయంలో పొదుపు, పరిమాణం ఆదాయంపై ఆధారపడుతుందేకాని, వడ్డీరేట్లలోని మార్పులకు ప్రభావితం కాదు. అందువల్ల వడ్డీరేటులో మార్పుల ద్వారా పొదుపు, పెట్టుబడుల మధ్య సమానత్వాన్ని సాధించలేం.

AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం

4. ద్రవ్య భ్రాంతి: శ్రామికుల సప్లై సాంప్రదాయ ఆర్థికవేత్తలు భావించినట్లు వాస్తవిక వేతనంపై కాకుండా, ద్రవ్య వేతనంపై ఆధారపడి ఉంటుంది. ఈ కారణం వల్ల శ్రామికులు ద్రవ్య భ్రాంతికి లోనవుతారు.

5. స్వల్పకాలానికి అన్వయించబడదు: దీర్ఘకాలంలో సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్పిన ప్రకారం సప్లై, డిమాండ్లో సమానం కావచ్చు. కాని స్వల్పకాలంలో సప్లై, డిమాండ్లు సమానం కావు. అందువల్ల సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం స్వల్పకాలానికి అన్వయించబడదు. కీన్స్ తన సమగ్ర సిద్దాంతంలో దీర్ఘకాలంలో “మనం అందరం చనిపోతాం” అని పేర్కొన్నారు.

6. ద్రవ్యం కేవలం వ్యాపార వ్యవహారాల నిమిత్తం మాత్రమే ఉపయోగపడదని, నిలువ నిధిగా కూడా తన విధిని నిర్వర్తిస్తుందని కీన్స్ తన “ద్రవ్యత్వాభిరుచి” సిద్ధాంతం ద్వారా వివరించారు.

ప్రశ్న 5.
‘అల్ప ఉద్యోగితా సమతౌల్య’ భావనను పటం సహాయంతో వివరించండి.
జవాబు:
కీన్స్ సాంప్రదాయ ఉత్పత్తి, ఉద్యోగితా సిద్ధాంతాన్ని విమర్శించాడు. కీన్స్ ప్రకారం సాంప్రదాయ ఆర్థికవేత్తలు సంపూర్ణ ఉద్యోగిత ఆర్థిక వ్యవస్థ యొక్క సాధారణ లక్షణం కాదు. ఇతని అభిప్రాయం ప్రకారం సప్లై దానికి తగిన డిమాండ్ను సృష్టించుకొనదు. సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం వాస్తవానికి దూరంగా ఉంది. మొట్ట మొదటిసారిగా కీన్స్ శాస్త్రీయ పద్ధతిలో ఆదాయ, ఉద్యోగితా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీనిని కీన్స్ ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతం అని అంటారు. కీన్స్ తన సిద్ధాంతాన్ని “General Theory of Employment, Interest and Money” అను గ్రంథంలో వివరించాడు.

కీన్స్ ప్రకారం ఉద్యోగితా స్థాయి ఉత్పత్తి పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ఇతని ప్రకారం ఉద్యోగితా స్థాయికి, ఉత్పత్తికి, ఆదాయ స్థాయికి సార్థక డిమాండ్కు దగ్గర ప్రత్యక్ష సంబంధము ఉంటుంది. కనుక ఒక వ్యవస్థలో ఉండే ఉద్యోగితా స్థాయి సార్థక డిమాండ్పై ఆధారపడి ఉంటుంది. సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్ల సమానతనే “సార్థక డిమాండ్” అని అంటారు.
AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం 4

సమిష్టి సప్లై ధర: నిర్ణీత స్థాయిలో శ్రామికులను నియమించి, నిర్దిష్ట పరిమాణంలో వస్తువును ఉత్పత్తి చేయాలంటే ఉద్యమదారులు కనీసం పొందాలని ఆశించే రాబడిని ‘సమిష్టి సప్లై ధర’ అంటారు.

సమిష్టి డిమాండ్ ధర: ఒక నిర్ణీత సంఖ్యలో శ్రామికులను నియమించి, నిర్దిష్టమైన పరిమాణంలో వస్తువును ఉత్పత్తి చేసి, మార్కెట్లో అమ్మడం ద్వారా భవిష్యత్తులో పొందగలిగే రాబడిని “సమిష్టి డిమాండ్ ధర” అంటారు. సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్లు సమానమయిన దగ్గర ఉద్యోగితా స్థాయి నిర్ణయించబడుతుంది. ఈ రెండూ సమానమయిన దగ్గరే సమతౌల్య ఉద్యోగితా స్థాయిని సాధించవచ్చు.

దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.

పై రేఖాపటంలో ‘X’ అక్షం మీద ఉద్యోగితా స్థాయిని, ‘Y’ అక్షంపై సమిష్టి డిమాండ్ /సప్లైని తీసుకున్నాము. ‘E’ బిందువువద్ద AS = AD అయినది. అందువల్ల ON ఉద్యోగితాస్థాయి వద్ద ఆర్థిక వ్యవస్థ సమతౌల్య స్థితికి చేరుకుంది. ON1 వద్ద ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత ఉన్నట్లు కీన్స్ గుర్తించాడు. ఈ స్థితిని కీన్స్ “అల్ప ఉద్యోగితా సమతౌల్య స్థితి” అని పేర్కొన్నాడు.

ప్రశ్న 6.
వివిధ రుణ విమోచన పద్ధతులను వివరించండి.
జవాబు:
ప్రభుత్వం చేసిన రుణాన్ని తిరిగి చెల్లించటాన్ని రుణవిమోచన/విముక్తి అంటారు.

పద్ధతులు:
1. మిగులు బడ్జెట్: ప్రభుత్వాలు ఆదాయ వనరులు ప్రభుత్వ వ్యయం కంటే ఎక్కువ ఉండేటట్లు చేసుకోగలిగితే, పెరిగిన ఆదాయ వనరుల/మిగులు నుంచి రుణాలను తిరిగి చెల్లించడం.

AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం

2. రుణ పరివర్తనం: పాత రుణాన్ని చెల్లించటానికి మరలా కొత్త రుణం చేయటం – కానీ ఈ పద్ధతి ద్వారా రుణవిమోచన జరగదు.

3. రుణ విమోచన నిధి: ప్రభుత్వం అనుసరించే వివిధ పద్ధతులలో ఇది మంచి పద్ధతి అని చెప్పబడింది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం తన రెవిన్యూ బడ్జెట్ నుంచీ కొంత మొత్తాన్ని ఈ నిధికి బదిలీ చేస్తుంది. ఈ నిధిలో జమచేసిన మొత్తంపై వచ్చే వడ్డీని కూడా రుణాలు తిరిగి చెల్లించడానికి ఉపయోగించడం జరుగుతుంది.

4. రుణ నిరాకరణ: వడ్డీనికాని, అసలు కాని లేదా రెండూ కలిపి చెల్లించడానికి నిరాకరించడం. ఏ ప్రభుత్వం కూడా ఈ పద్ధతిని అనుసరించదు. ప్రభుత్వ పరపతి దెబ్బతినే ప్రమాదం ఉండటం వల్ల, సాధారణంగా ఈ పద్ధతిని అనుసరించదు.

5. మూలధనంపై పన్ను: ఈ పద్ధతిలో ప్రజల వద్ద ఉన్న మూలధనంపై ఒకసారి పన్ను విధిస్తారు. అందువల్ల ఇది ఉత్తమమైనదిగా డాల్టన్ భావించాడు.

6. మిగులు వ్యాపార చెల్లింపుల శేషం: మిగులు వ్యాపార చెల్లింపుల శేషం ఏర్పడగలిగితే వాటిలో కొంతవరకు విదేశీ రుణాల నుంచి విముక్తి కలగడానికి అవకాశం ఉంటుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సప్లై తన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది. వివరించండి. [Mar. ’17, ’15]
జవాబు:
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం ‘సే’ మార్కెట్ సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. మార్కెట్ సూత్రాన్ని జె.బి. సే ప్రతిపాదించాడు. అతని అభిప్రాయం ప్రకారం, “సప్లై తన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది.”

S = D లేదా సప్లై ఎప్పుడు డిమాండ్కు సమానంగా ఉంటుందని ఈ సూత్రాన్ని సాధారణంగా వివరిస్తారు. ఆర్థికవ్యవస్థలో ఎప్పుడు అదనపు ఉత్పత్తి ఏర్పడినా, ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలు భాటకం, వేతనం, వడ్డీ లాభం ప్రకారం రూపంలో ఆదాయాలను ఆర్జిస్తాయి. ఆ విధంగా పెరిగిన ఆదాయం మొత్తం అదుపులో ఉంచడానికి అదనపు ఉత్పత్తి కారకాల విలువకు సమానంగా ఉంటుంది. ఆ ఆదాయం అదనపు ఉత్పత్తి అమ్మకానికి అవసరమైన అదనపు డిమాండ్ను సృష్టిస్తుంది. మొత్తం ఆదాయం వస్తువుల కొనుగోలు మీద వ్యయం చేయబడుతుందని భావించడమైంది. అలాంటి వ్యయం కొంతవరకు వినియోగ వస్తువుల మీద కొంతవరకు మూలధన వస్తువుల మీద వ్యయం చేయబడుతుంది.

ముఖ్యాంశాలు: ‘సే’ మార్కెట్ సూత్రంలోని ముఖ్యాంశాలను క్రింది విధంగా చెప్పవచ్చు.

  1. సాధారణ అత్యుత్పత్తి, సాధారణ నిరుద్యోగం ఉండవు.
  2. ప్రభుత్వ జోక్యం అవసరం లేదు.
  3. ఆదాయం మొత్తం ఖర్చు చేయబడుతుంది. ఒకవేళ కొంత పొదుపు చేసినప్పటికీ ఆ పొదుపు మూలధన వస్తువులపై వ్యయం చేయటం జరుగుతుంది. అంటే పొదుపు, పెట్టుబడి సమానం.
  4. ఆర్థిక వ్యవస్థలో ఉపయోగంలో లేని వనరులు ఉన్నంతవరకు ఉత్పత్తి, ఉద్యోగితలను పెంచటం సాధ్యం అవుతుంది.
  5. వస్తువులు, వస్తువులతో వినిమయం చేయటం జరుగుతుంది. ఆ విధమైన వస్తు వినిమయానికి ద్రవ్యం ఉపయోగపడుతుంది.
  6. శ్రామిక మార్కెట్లో సరళ వేతన రేటువల్ల సమతౌల్యం ఏర్పడుతుంది.
  7. సరళ వడ్డీరేటు ద్వారా పొదుపు, పెట్టుబడి సమతౌల్యం చేరుకుంటాయి.

ప్రశ్న 2.
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంత ప్రమేయాలను పేర్కొనండి.
జవాబు:
సాంప్రదాయ అర్థశాస్త్రం అనే పదాన్ని మొదట కార్ల్ మార్క్స్ ఉపయోగించారు. ఆడమ్స్మిత్, డేవిడ్ రికార్డో, రాబర్ట్ మాల్టస్, జె. ఎస్. మిల్ మొదలైనవారి సిద్ధాంతాలను సాంప్రదాయ అర్థశాస్త్రంగా పేర్కొన్నారు. ప్రమేయాలు:

  1. స్వేచ్ఛాపూరిత పెట్టుబడి ద్వారా ఆర్థిక కార్యకలాపాలలో మార్కెట్ శక్తులకు పూర్తి స్వేచ్ఛ.
  2. పరిపూర్ణ పోటీ పరిస్థితులు
  3. ఆర్థిక కార్యకలాపాలలో ప్రభుత్వ జోక్యం ఉండదు
  4. దీర్ఘకాలిక విశ్లేషణ
  5. సంపూర్ణ ఉద్యోగిత
  6. పొదుపులన్నీ నేరుగా పెట్టుబడిగా మారడం S = I, వడ్డీరేటు ద్వారా
  7. వడ్డీ సరళత్వం
  8. వేతనాల సరళత్వం
  9. అపరిమిత మార్కెట్ల పరిధి
  10. ద్రవ్యం వినిమయ మాధ్యమం అనే విధిని మాత్రమే నిర్వర్తిస్తుంది. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో ద్రవ్యం తటస్థంగా వ్యవహరిస్తుంది.
  11. స్వయంచాలక సర్దుబాటు: ఆర్థిక వ్యవస్థలో ఉండే స్వయంచాలక సర్దుబాటు మూలంగా మొత్తం సప్లై, మొత్తం డిమాండ్ సమానమౌతాయి.
  12. శ్రామిక సప్లయి, డిమాండ్ నిజవేతనాలపై ఆధారపడి ఉంటుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం

ప్రశ్న 3.
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతంపై కీన్స్ విమర్శలు వివరించండి.
జవాబు:
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం జె.బి.సి మార్కెట్ సూత్రంపై ఆధారపడింది. జె.బి.సి అనే ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం ‘సప్లై దానికి తగిన డిమాండ్ను తానే సృష్టించుకొంటుంది.’ ఉత్పత్తి విలువకు సరిపడ ఆదాయం ఏర్పడును. కనుక ఉత్పత్తి అంతటికీ డిమాండ్ ఏర్పడుతుంది. అందువల్ల అత్యుత్పత్తి ఏర్పడక సప్లై అంతటికీ డిమాండ్ ఏర్పడుతుంది.

సాంప్రదాయ సిద్ధాంతం ప్రకారం సప్లై పెరిగినంతమేరకు డిమాండ్ కూడా పెరుగుతుంది. అందువల్ల మార్కెట్ విస్తరణకు పరిమితి ఉండదు. ఈ సిద్ధాంతం ప్రకారం సార్వత్రిక అత్యుత్పత్తి ఉండదు. కనుక సార్వత్రిక నిరుద్యోగిత కూడా ఉండదు. వేతనాల రేటులో మార్పులు సప్లై, డిమాండ్లను సమానం చేస్తుంది. సాంప్రదాయ సిద్ధాంతం ప్రకారం వేతనాల తగ్గింపు వల్ల ఉద్యోగితాస్థాయి పెరుగుతుంది.

విమర్శలు: కీన్స్ అను ఆర్థిక శాస్త్రవేత్త సాంప్రదాయ సిద్ధాంతాన్ని ఈ క్రింది విధంగా విమర్శించాడు.
1. సప్లై దానికి తగిన డిమాండ్ను సృష్టించదు: సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం ప్రకారము పొదుపు, పెట్టుబడి సమానంగా ఉండుట వలన సప్లయ్ దానికి తగిన డిమాండ్ను సృష్టించును, కాని వాస్తవానికి పొదుపు, పెట్టుబడులు సమానంగా ఉండవు. అందువలన సప్లై దానికి తగిన డిమాండ్ను సృష్టించదు.

2. వేతనాల తగ్గుదల ఉండదు: సాంప్రదాయ ఉత్పత్తి ఉద్యోగితా సిద్ధాంతం ప్రకారం సప్లై కన్నా డిమాండ్ తక్కువైనపుడు వేతనాలు, ధరలు తగ్గును. కానీ వాస్తవానికి కార్మిక సంఘాలు వేతనాలు తగ్గుదలను ప్రతిఘటిస్తాయి.

3. పరిపూర్ణ పోటీ ప్రమేయం వాస్తవం కాదు: సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతంలో పరిపూర్ణ పోటీ మార్కెట్ ఉండుననే ప్రమేయం తీసుకొనడమైనది. కాని వాస్తవానికి పరిపూర్ణ పోటీ ఎక్కడా ఉండదు.

4. స్వల్ప కాలానికి అన్వయించబడదు దీర్ఘకాలంలో సాంప్రదాయక ఆర్థికవేత్తలు చెప్పిన ప్రకారము సప్లై, డిమాండ్లు సమానము కావచ్చు. కాని స్వల్పకాలంలో సప్లై, డిమాండ్లు సమానము కావు. అందువలన సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతము స్వల్పకాలానికి అన్వయించబడదు.

5. ఉత్పత్తి, వినియోగం సమానంగా ఉండవు: సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం ప్రకారం ఉత్పత్తి, ఆదాయం, వినియోగం సమానంగా ఉంటాయి. కాని ధనవంతుల విషయంలో వినియోగం కంటే ఆదాయం ఎక్కువగా ఉండును. పేదవారి విషయంలో ఆదాయం తక్కువగా ఉండును. అందువలన ఉత్పత్తి, వినియోగము సమానంగా ఉండవు.

ప్రశ్న 4.
పిగూ వేతన కోతవిధానం
జవాబు:
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం ప్రకారం ద్రవ్య వేతనాలను తగ్గించటం ద్వారా ఉద్యోగ అవకాశాలను పెంచి నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చు. దీనినే ‘వేతన కోత విధానం’ W అని అంటారు. ఈ విషయాన్ని ఎ.సి.పిగూ అనే ఆర్థికవేత్త తెలిపాడు. ఇతని అభిప్రాయం ప్రకారం వేతనాలు ఎక్కువగా ఉన్నందువల్ల w. నిరుద్యోగిత ఏర్పడునని వేతనాలు తగ్గించడం ద్వారా సంపూర్ణ ఉద్యోగితా స్థాయిని సాధించవచ్చు. సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం వేతనాలను తగ్గించడం వల్ల ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది, దీనివల్ల ధరలు తగ్గుతాయి. ధరలు తగ్గడం వల్ల డిమాండ్ పెరిగి, వస్తూత్పత్తి పెరుగుతుంది. కనుక ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వేతనాల కోత వలన ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయో ఈ క్రింది రేఖాపటం ద్వారా చూపవచ్చు.

ప్రక్క రేఖాపటంలో X-అక్షంపై శ్రామికుల సంఖ్యను, Y-అక్షంపై వేతనాల రేటును గుర్తించడమైంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం 5

OW ఉన్నప్పుడు OM పరిమాణంలో శ్రామికుల డిమాండ్ ఉంది. కనుక OM పరిమాణంలో శ్రామికులను నియమించడమైనది. వేతనాల రేటు OW నుండి OW1 కు తగ్గినప్పుడు శ్రామికుల డిమాండ్ OM నుండి OM కు పెరిగింది. కనుక వేతనాలను తగ్గించటం వల్ల ఉద్యోగితా స్థాయి OM నుండి OM1 పెరిగింది. అందువల్ల సాంప్రదాయ ఆర్థిక శాస్త్రవేత్తల ప్రకారం వేతనాల కోతవల్ల ఉద్యోగితా స్థాయి పెరుగుతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం

ప్రశ్న 5.
సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్ భావనలను వివరించండి.
జవాబు:
ఆర్థిక వ్యవస్థలో మొత్తం వస్తురాశికి ఉండే డిమాండ్ను సమిష్టి డిమాండ్ తెలియజేస్తుంది. వివిధ ఉత్పత్తులు రాశుల వద్ద సమాజంలో ప్రజలు ఎంత మొత్తంలో వ్యయం చేయటానికి సిద్ధపడతారో దానిని సమిష్టి డిమాండ్ పట్టిక తెలియజేస్తుంది. వస్తు సేవలపై సమాజం ఖర్చు చేసిన ఆదాయం ఉత్పాదక సంస్థలకు ఆదాయం అవుతుంది. నిర్ణీత సంఖ్యలో శ్రామికులను నియమించి నిర్ణీత స్థాయిలో ఉత్పత్తి కొనసాగించి మార్కెట్లో విక్రయించగా వాస్తవంగా తమకు ఆదాయం వస్తుందని ఉద్యమదారులు ఆశించే ఆదాయాన్ని సమిష్టి డిమాండ్ ధర అంటారు. వివిధ ఉద్యోగితా స్థాయిలకు ఆ స్థాయిల వద్ద ఉత్పాదక సంస్థలు వాస్తవంగా పొందగలమని ఆశించే ఆదాయ ప్రవాహానికి మధ్య ఉండే సంబంధాన్ని సమిష్టి డిమాండ్ ధర పట్టిక తెలియజేస్తుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం 6

పై పట్టికననుసరించి సమిష్టి డిమాండ్కు, ఉద్యోగితా స్థాయికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుందని తెలుసుకోవచ్చును. ఉద్యోగితా స్థాయి పెరిగినప్పటికి సమిష్టి డిమాండ్ కూడా పెరుగుతుంది.

ఆర్థిక వ్యవస్థలోని మొత్తం వస్తురాశి సప్లైని తెలియజేస్తుంది. సమిష్టి సప్లై పట్టిక వివిధ రకాల ధరల వద్ద ఎంత వస్తురాశి ఉత్పత్తి అవుతుందో తెలియజేస్తుంది. ఉత్పత్తి పెరిగిన కొద్దీ ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తి వ్యయానికి సమానమైన ధరను ఉత్పాదక సంస్థలు పొంది తీరవలెను. వివిధ ఉత్పత్తి రాశులకు ఉత్పాదక సంస్థలు పొంది తీరవలసిన కనీస ఆదాయాన్ని సమిష్టి సప్లై ధర అంటారు. వివిధ ఉద్యోగితా స్థాయిలకు ఆ ఉద్యోగితా స్థాయిల వద్ద ఉద్యమదారులు పొందాలని ఆశించే కనీస ఆదాయాలకు ఉన్న సంబంధాన్ని సమిష్టి సప్లై ధర పట్టిక తెలియజేస్తుంది. సమిష్టి సప్లై పట్టికని ఈ క్రింద పరిశీలింపవచ్చును.
AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం 7

పై పట్టికననుసరించి సమిష్టి సప్లై ధరకు, ఉద్యోగితా స్థాయికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని తెలుస్తుంది. ఉద్యోగితా స్థాయి సమిష్టి సప్లై కూడా పెరుగుతుంది.

ప్రశ్న 6.
సార్థక డిమాండ్ భావనను వివరించండి.
జవాబు:
కీన్స్ ఉద్యోగితా సిద్ధాంతానికి డిమాండ్ భావన ఆయువు పట్టు. సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై సమానంగా ఉండే స్థితిలో సార్థక డిమాండ్ నిర్ణయమౌతుంది. వివిధ ఉద్యోగితా స్థాయిలలో సమిష్టి డిమాండ్ వివిధ రకాలుగా ఉంటుంది. ఏ ఉద్యోగితా స్థాయిలో సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లైతో సమానమౌతుందో అది ఆర్థిక వ్యవస్థ సమతౌల్యాన్ని సూచిస్తుంది. కానీ అది స్వల్పకాల సమతౌల్యం. అది సార్థక డిమాండ్ని సూచిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో సమిష్టి సప్లై సమిష్టి డిమాండ్కు అనుగుణంగా మారుతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం

సార్థక డిమాండ్: సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై రేఖలు ఒకదానికొకటి ఖండించుకున్న బిందువు సార్థక డిమాండ్ను సూచిస్తుంది. ఈ బిందువు వద్ద సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి సప్లై ధరకు సమానమవటం వల్ల ఆ డిమాండ్ సార్థక డిమాండ్ అవుతుంది.

సమతౌల్య స్థాయి వద్ద ఉత్పత్తైన వస్తురాశిని కొనడానికైన మొత్తం వ్యయం సార్థకమైన డిమాండ్ అవుతుంది. సార్థకమైన డిమాండ్ ఉత్పతైన వస్తురాశి విలువకు సమానం. వస్తురాశి విలువ జాతీయాదాయానికి సమానం. ఆదాయం మొత్తం వ్యయానికి సమానమౌతుంది. దీనిని ఈ క్రింది విధంగా చెప్పవచ్చు.

సార్థకమైన డిమాండ్ = జాతీయ ఆదాయం = వినియోగ వ్యయం + పెట్టుబడి వ్యయం

ఈ విధంగా సార్థకమైన డిమాండ్ వినియోగ వ్యయం, పెట్టుబడికి సమానం. ఆదాయము మొత్తం వ్యయానికి సమానం.

Y = C + I

విదేశీ వ్యాపారం ఉన్న ఆర్ధిక వ్యవస్థలో నికర ఎగుమతులు (X-M) కు సమిష్టి డిమాండ్లో చేరి ఉంటుంది.
Y = C + I + G + (X – M)
Y = జాతీయోత్పత్తి
I = పెట్టుబడి
C = వినియోగ వ్యయం
G = ప్రభుత్వ వ్యయం
X = ఎగుమతి విలువ
M = దిగుమతి విలువ

సార్థక డిమాండు ఈ క్రింది పట్టిక పటముల సహాయంతో వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం 8

పై పటములో X అక్షంపై ఉద్యోగిత, Y అక్షంపై సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి సప్లై ధర చూపాం. AS సమిష్టి సప్లై రేఖ, AD సమిష్టి డిమాండ్ రేఖ. ఇది ‘E’ బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి. కనుక ‘E’ బిందువు సార్థక డిమాండున్ను తెలియజేయును.

ప్రశ్న 7.
వివిధ ప్రభుత్వ రాబడి మార్గాలు. [Mar. ’17, ’16, ’15]
జవాబు:
ఆధునిక ప్రభుత్వాలు అనేక విధులను నిర్వహించడమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రభుత్వ వ్యయం క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని సేకరిస్తుంది. పన్నులు, ఫీజులు, ప్రత్యేక విధింపులు, గ్రాంట్లు, వాణిజ్య ఆదాయాలు, రుణ సేకరణ, కరెన్సీనోట్ల ముద్రణ మొదలైన మార్గాల ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. వాటిలో పన్నులు ప్రధానమైనవి.

1. పన్నులు: వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వానికి నిర్బంధంగా చెల్లించేవి ‘పన్నులు’ ఇవి రెండు రకాలు.

  1. ప్రత్యక్ష పన్నులు: ఉదా: వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేటు పన్ను.
  2. పరోక్ష పన్నులు: వస్తువు, సేవలపై విధించే పన్నులు, ఎక్సైజ్ డ్యూటీ.

2. పన్నేతర రాబడులు: ప్రభుత్వానికి పన్నులు కాకుండా ఇతర మార్గాల ద్వారా లభించే ఆదాయాలను ‘పన్నేతర రాబడులు’ అంటారు.
ఎ. పాలనా రాబడులు: కొన్ని సేవలను అందించడం ద్వారా ఇలాంటి రాబడి ప్రభుత్వానికి లభిస్తుంది. ఉదా: లైసెన్స్ ఫీజు, ట్యూషన్ ఫీజు, జరిమానాలు, పెనాల్టీలు.
బి. వాణిజ్య రాబడులు: ప్రభుత్వ సంస్థల్లో ఉత్పత్తి అయిన వస్తు సేవలను విక్రయించగా వచ్చిన ఆదాయాలను ‘వాణిజ్య రాబడులు’ అంటారు.
ఉదా: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బి.ఎస్.ఎన్.ఎల్, రైల్వేలు, స్టేట్ రోడ్డు రవాణా, ఇండియన్ ఎయిర్లైన్స్.
సి. రుణాలు: స్వదేశీ, విదేశీ రుణాలు, అంతర్గత, బహిర్గత రుణాలు.
డి. గ్రాంట్లు: ఒక ప్రభుత్వం మరొక ప్రభుత్వానికి చేసే ద్రవ్య సహాయాన్నే ‘గ్రాంట్లు’ అంటారు.
ఉదా: కేంద్రం రాష్ట్రానికి, రాష్ట్రాలు స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చే గ్రాంట్లు. ఇవి రెండు రకాలు.

  1. సాధారణ గ్రాంట్లు: ఎలాంటి ప్రత్యేక అంశాలకు కాకుండా సాధారణ ఆర్థిక వనరుల కొరత ఏర్పడినప్పుడు ఇచ్చే గ్రాంట్లు.
  2. ప్రత్యేక గ్రాంట్లు: ఒక ప్రతేక పనికి నిర్దేశించి ఇచ్చే గ్రాంట్లు.
    ఉదా: విద్య, ఆరోగ్యం, ప్రజాసంక్షేమ కార్యక్రమాల కోసం ఇచ్చే గ్రాంటు.

AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం

ప్రశ్న 8.
ప్రభుత్వ వ్యయ వర్గీకరణ [Mar. ’16]
జవాబు:
ప్రభుత్వ విత్తంలోని ముఖ్యమైన భాగాలలో ప్రభుత్వ వ్యయం ఒకటి. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలు నిరంతరం పెరుగుతూ ఉండటంతో అన్ని దేశాలలోను ప్రభుత్వ వ్యయం పెరిగింది. ప్రభుత్వ వ్యయంలో రెండు ముఖ్య భాగాలుంటాయి. 1. రెవిన్యూ వ్యయం, 2. మూలధన వ్యయం. రెవిన్యూ వ్యయం వల్ల నూతన ఆస్తుల సృష్టి జరగదు. మూలధన వ్యయం వల్ల నూతన ఆస్తుల సృష్టి జరుగుతుంది. ప్రభుత్వం సాధారణంగా ఈ క్రింది అంశాలపై ఖర్చు చేస్తుంది.

  1. దేశరక్షణ
  2. అంతర్గత భద్రత
  3. ఆర్థిక సేవలు
  4. జీతాలు
  5. సాంఘిక సేవలు
  6. పింఛన్లు
  7. గ్రాంట్స్
  8. సబ్సిడీలు
  9. బీమా చెల్లింపులు
  10. రుణాలు
  11. అనుకోని ప్రమాదాలు మొదలగు వాటి కోసం.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
స్థూల అర్థశాస్త్రం
జవాబు:
స్థూల అర్థశాస్త్రం ఆర్థిక వ్యవస్థ మొత్తం గూర్చి అధ్యయనం చేస్తుంది.
ఉదా: సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై మొదలగునవి. దీనిని అభివృద్ధిపరిచినది J.M. కీన్స్.

ప్రశ్న 2.
సంప్రదాయ ఆర్థికశాస్త్రం
జవాబు:
18వ శతాబ్దము నుంచి 20వ శతాబ్దపు తొలిదశ వరకు అనుసరించిన ఆర్థిక సూత్రాల కూర్పును సాంప్రదాయ అర్థశాస్త్రం అంటారు. వ్యక్తి స్వేచ్ఛ, ప్రైవేటు ఆస్తి హక్కు, ప్రైవేటు వ్యాపార స్వేచ్ఛ అనేవి సాంప్రదాయ అర్థశాస్త్రం అనుసరించే అతి ప్రధానమైన సూత్రాలు.

ప్రశ్న 3.
Laissez Faire / స్వేచ్ఛా వ్యాపార విధానం. [Mar 15]
జవాబు:
సాంప్రదాయ ఆర్థిక శాస్త్రవేత్తలు స్వేచ్ఛా వ్యాపార ఆర్థిక విధానాన్ని సమర్ధించారు. స్వేచ్ఛా వ్యాపార ఆర్థిక విధానంలో ప్రభుత్వ జోక్యం అంతగా ఉండదు. వినియోగదారులకు, ఉత్పత్తిదారులకు స్వేచ్ఛ ఉంటుంది. నాణ్యమైన ఉత్పత్తి జరగటానికి, సగటు వ్యయం తగ్గటానికి, వస్తు ధరలు తగ్గటానికి అవకాశం ఉంటుంది. ఉత్పత్తిదారులు ఏ వస్తువైన ఉత్పత్తి చేయటానికి, వినియోగదారులు, తమకిష్టమైన వస్తువుల కొనుగోలు చేయటానికి అవకాశం ఉంటుంది.

ప్రశ్న 4.
‘సే’ మార్కెట్ సూత్రం [Mar. ’16]
జవాబు:
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం ప్రధానంగా జె.బి. సే మార్కెట్ సూత్రంపై ఆధారపడింది. జె.బి.సే. అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం సప్లై తనకు తగిన డిమాండ్ను తానే సృష్టించుకొంటుంది. ఈ సిద్ధాంతం ప్రకారం ఉత్పత్తికి సమానంగా ప్రజలకు ఆదాయం వస్తుంది. దీనికి సమానంగా ప్రజలకు కొనుగోలు శక్తి ఏర్పడుతుంది. దీని వలన వస్తువులకు సరిపడా డిమాండ్ ఏర్పడుతుంది. ఈ విధంగా ఎవరి ప్రమేయం లేకుండా సప్లయ్ మేరకు డిమాండ్ దానంతట అదే ఏర్పడుతుంది. దీనినే ‘సే’ మార్కెట్ సూత్రం అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం

ప్రశ్న 5.
సంపూర్ణ ఉద్యోగిత [Mar. ’17, ’15]
జవాబు:
ఇవ్వబడిన వేతనం దగ్గర పనిచేసే శక్తి, ఆసక్తి ఉన్న శ్రామికులందరికి ఉపాధి అవకాశాలు కల్పించగలిగే స్థితిని సంపూర్ణ ఉద్యోగిత అని అంటారు. సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతంలో సంపూర్ణ ఉద్యోగితా భావం ప్రాముఖ్యాన్ని వహించింది. సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత సమతౌల్యం ఏర్పడుతుంది. కీన్స్ అభిప్రాయం ప్రకారం సమిష్టి డిమాండ్ను పెంచుట ద్వారా సంపూర్ణ ఉద్యోగితా సమతౌల్యం ఏర్పడును.

ప్రశ్న 6.
సమిష్టి డిమాండ్ ఫలం
జవాబు:
సమిష్టి డిమాండ్ రాగల ఊహించే ఆదాయాన్ని తెలుపుతుంది. వినియోగ వస్తువులు, పెట్టుబడి వస్తువులపై చేసిన మొత్తం వ్యయం సమిష్టి డిమాండ్. ఉత్పత్తి విలువ ప్రజల ఆదాయానికి సమానం. ఉత్పత్తి పెరిగితే ఆదాయం కూడా పెరుగుతుంది. కనుక వస్తువుల డిమాండ్ కూడా పెరుగుతుంది. వివిధ ఉద్యోగితా స్థాయిల వద్ద చేసిన ఉత్పత్తిని అమ్మినందువల్ల ఉత్పత్తిదారులు రాగలదని ఊహించే ఆదాయాన్ని సమిష్టి డిమాండ్ అని అంటారు. ఆర్థిక వ్యవస్థలో వివిధ ఉద్యోగితా స్థాయిల వద్ద ఏర్పడే సమిష్టి డిమాండ్ ధరను చూపించే పట్టికను సమిష్టి డిమాండ్ ఫలం అంటారు.

ప్రశ్న 7.
సమిష్టి సప్లై ఫలం
జవాబు:
ఒక వస్తువు సప్లైకి కాకుండా అన్ని వస్తువుల మొత్తం సప్లైకి ఎంత ఉందో తెలియజేయునది సమిష్టి సప్లై. |ఉద్యమదారుడు కనీసం పొందాలని ఆశించే ఆదాయాన్ని సమిష్టి సప్లై ధర అంటారు. వివిధ ఉద్యోగితా స్థాయిలో ఆఉద్యోగితా స్థాయిల వద్ద ఉద్యమదారులు పొందాలని ఆశించే కనీస ఆదాయాల మధ్య ఉన్న సంబంధాన్ని సమిష్టి సప్లై ధర పట్టిక తెలియజేయును.

ప్రశ్న 8.
సార్థక డిమాండ్ [Mar. ’16]
జవాబు:
కీన్స్ ఉద్యోగితా సిద్ధాంతానికి సార్థక డిమాండ్ భావన ముఖ్యమైనది. సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి సప్లై ధర సమానంగా ఉండే స్థితిని సార్థక డిమాండ్ అంటారు. అనగా సమిష్టి డిమాండ్ రేఖ, సమిష్టి సప్లై ధర రేఖ ఖండించుకున్న బిందువు వద్ద సార్థక డిమాండ్ నిర్ణయమవుతుంది.

ప్రశ్న 9.
ప్రభుత్వ రాబడి
జవాబు:
ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని సేకరిస్తుంది. పన్నులు ఫీజులు, ప్రత్యేక విధింపులు, గ్రాంట్లు మొదలగునవి అన్నింటిని ప్రభుత్వ రాబడి ఉంటారు.

ప్రశ్న 10.
బడ్జెట్
జవాబు:
ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ రాబడి అంచనాలు, ప్రభుత్వ వ్యయ అంచనాలకు చూపించే వార్షిక నివేదికను బడ్జెట్ అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం

ప్రశ్న 11.
ప్రభుత్వ ఋణం
జవాబు:
ప్రభుత్వం వ్యయానికి సేకరించిన ఆదాయ వనరులు చాలనప్పుడు రుణాలు చేస్తుంది. ఈ రుణాలు రెండు రకాలు. 1. అంతర్గత ఋణాలు, 2. బహిర్గత ఋణాలు.

ప్రశ్న 12.
కోశపరమైన లోటు
జవాబు:
కోశపరమైన లోటు = ద్రవ్యలోటు + మార్కెట్ రుణాలు, ఇతర అప్పులు.

అదనపు ప్రశ్నలు

ప్రశ్న 13.
వేతన కోత విధానం [Mar. ’17]
జవాబు:
దీనిని A.C. పిగూ ప్రతిపాదించారు. నిరుద్యోగితను తగ్గించడానికి వేతనంలో కోత విధించిన నిరుపయోగ శ్రామికులకు ఉపాధి కల్పించుట.

ప్రశ్న 14.
ఓట్ ఆన్ అకౌంట్
జవాబు:
పూర్తి బడ్జెట్ను ప్రతిపాదించలేని పరిస్థితులలో తాత్కాలికంగా కొన్ని నెలల కోసం ప్రతిపాదించినది బడ్జెట్.

ప్రశ్న 15.
సంతులిత బడ్జెట్
జవాబు:
మొత్తం రాబడులు, వ్యయాలు సమానంగా ఉండటాన్ని సంతులిత బడ్జెట్ అంటారు.

ప్రశ్న 16.
మిగులు బడ్జెట్
జవాబు:
మొత్తం రాబడులు మొత్తం వ్యయం కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దానిని మిగులు బడ్జెట్గా పేర్కొంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం

ప్రశ్న 17.
లోటు బడ్జెట్
జవాబు:
మొత్తం వ్యయాలు, మొత్తం రాబడుల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దానిని లోటు బడ్జెట్ అంటారు.

ప్రశ్న 18.
ఋణ విమోచన
జవాబు:
ప్రభుత్వం చేసిన రుణాన్ని తిరిగి చెల్లించటాన్ని రుణ విమోచన అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 6th Lesson పంపిణీ సిద్ధాంతం Textbook Questions and Answers.

AP Inter 1st Year Economics Study Material 6th Lesson పంపిణీ సిద్ధాంతం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భాటకాన్ని నిర్వచించి, రికార్డో భాటక సిద్ధాంతాన్ని వివరించండి.
జవాబు:
ఉత్పత్తి కారకంగా భూమి వస్తూత్పత్తి ప్రక్రియలో అందించే సేవలకు లభించే ప్రతిఫలం భాటకము. డేవిడ్ రికార్డో భాటకాన్ని ఈ విధంగా నిర్వచించారు. “భూమికి ఉన్న సహజమైన, నశింపు కాని ఉత్పాదక శక్తులను ఉపయోగించుకొన్నందుకు పొందే ఫలసాయంలో భూస్వామికి చెల్లించే భాగమే భాటకము”.

రికార్డో భాటక సిద్ధాంతము: డేవిడ్ రికార్డో భాటకాన్ని వైవిధ్యం వల్ల ఏర్పడే మిగులుగా భావించాడు. భూసారాలలోని వైవిధ్యం వల్ల భాటకం జనిస్తుంది. ఈ భాటకం ఏ విధంగా ఉత్పన్నమవుతుందో రికార్డో ఈ విధంగా వివరించాడు. ఒక ఆర్థిక వ్యవస్థలోని భూములను వాటి సారాన్నిబట్టి 3 రకాలైన భూములున్నాయి అనుకుంటే భాటకం లేదా వైవిధ్యం మిగులు ఏ విధంగా ఏర్పడుతుందో ఈ విధంగా వివరించాడు.

ఒక కొత్త దేశానికి కొంతమంది వలస వెళ్లారనుకుందాం. వాళ్లు అతిసారవంతమైన భూములను సాగు చేస్తారనుకుంటే ముందుగా ‘A’ గ్రేడ్ భూములను సాగుచేస్తారు. ఈ భూమిపై 20 క్వింటాళ్ళు పండించటానికి ఉత్పత్తి వ్యయం 300 అనుకుందాం. అంటే యూనిట్ వ్యయం కౌ 15. ప్రతి వ్యవసాయదారుడు కనీసం ఉత్పత్తి వ్యయాన్ని రాబట్టుకోవటానికి యూనిట్ ధరను కూడా 15గా నిర్ణయించాల్సి ఉంటుంది. అప్పుడు ‘A’ గ్రేడ్ భూములపై మిగులు ఉండదు. కాని ఇంకా కొంతమంది ఆ దేశానికి వలస వస్తే లేదా ఆ దేశ జనాభా పెరిగి ధాన్యానికి డిమాండ్ పెరుగుతుంది. ‘A’ గ్రేడ్ భూములన్నీ సాగు చేశారనుకుంటే ‘B’ గ్రేడ్ కౌ 300 ఖర్చు చేస్తే 15 క్వింటాళ్ళ ధాన్యాన్ని మాత్రమే పండించగలుగుతారు. ‘B’ గ్రేడ్ భూమిపై చేసిన వ్యయాన్ని రాబట్టటానికి ధాన్యం యూనిట్ ధరను Rs. 20గా నిర్ణయించాల్సి ఉంటుంది. ఇప్పుడు ‘B’ గ్రేడ్ భూమిపై మిగులుండదు. కాని ‘A’ గ్రేడ్ భూమిపై భౌతిక రూపంలో భాటకం 5 క్వింటాళ్ళు. విలువ రూపంలో కౌ 100 ఇంకా జనాభా పెరిగితే ఆహారధాన్యాలకు డిమాండ్ పెరిగి ‘C’ గ్రేడ్ భూములను కూడా సాగుచేయవలసి ఉంటుంది. ‘C’ గ్రేడ్ భూములు, ‘B’ గ్రేడ్ భూముల కంటే ఇంకా తక్కువ సారవంతమైనవి కనుక Rs. 300 ‘C’ గ్రేడ్ భూములపై వ్యయం చేస్తే 10 క్వింటాళ్ళు మాత్రమే పండించటం జరుగుతుంది. వ్యయాన్ని రాబట్టుకోవటానికి యూనిట్ ధాన్యం ధరను గౌ 30గా నిర్ణయించాలి. అప్పుడు ‘C’ గ్రేడ్ భూమిపై మిగులు ఉండదు. ‘B’ గ్రేడ్ భూమిపై భౌతికంగా 5 క్వింటాళ్ళు మిగులుంటుంది. దాని విలువ Rs. 150. ‘A’ గ్రేడ్ భూమిపై భాటకం పెరుగుతుంది. ‘A’ గ్రేడ్ భూమిపై భౌతికంగా భాటకం 10 క్వింటాళ్ళు దాని విలువ Rs. 300. దీనిని ఈ క్రింది పట్టిక ద్వారా పరిశీలించవచ్చును.
AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం 1

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

పై పట్టికలో భాటకం లేని భూమిని ఉపాంత భూమి అంటారు. భాటకం భూసారంలోని వైవిధ్యం వల్ల ఏర్పడుతుంది. అన్ని ‘A’ గ్రేడ్ భూములైతే భాటకం ఉండదు. ‘B’ గ్రేడ్ భూములను సాగుచేస్తే ‘A’ గ్రేడ్ భూమిపై భాటకం ఏర్పడుతుంది. ‘C’ గ్రేడ్ భూములను సాగుచేస్తే ‘B’ గ్రేడ్ భూములపై భాటకం ఏర్పడుతుంది. అందువల్ల వ్యవసాయ ఉత్పత్తిలో క్షీణప్రతిఫలాలు ఏర్పడతాయి.
AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం 2

పై రేఖాపటంలో షేడెడ్ ఏరియా వివిధ గ్రేడు భూములలో భాటకం లేదా మిగులును తెలియజేస్తుంది. ‘C’ గ్రేడ్ భూమి ఉపాంత భూమి. కాబట్టి ఈ భూమిలో భాటకం లేదు.

ప్రశ్న 2.
ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతాన్ని వివరించండి.
జవాబు:
ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలు ఏ విధంగా నిర్ణయించబడతాయో ఉపాంత ఉత్పాదకతా సిద్ధాంతం తెలియజేయును.

ఒక ఉత్పత్తి కారకం అదనపు యూనిట్ ఉత్పత్తిలో పాల్గొన్నప్పుడు మొత్తం ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆ కారకం యొక్క ఉపాంత ఉత్పాదకత అంటారు. దీనిని అనుసరించి ఉత్పత్తిదారుడు కారకానికి ఇచ్చే ప్రతిఫలాన్ని నిర్ణయిస్తాడు. డేవిడ్ రికార్డో ఈ సిద్ధాంతాన్ని భూమికి మాత్రమే అన్వయించాడు. జె.బి. క్లార్క్ ఈ సిద్ధాంతానికి ఒక రూపాన్ని కల్పించి దానిని అభివృద్ధిపరిచారు. ఉపాంత ఉత్పాదకతను వస్తురూపంలో గాని, ద్రవ్యరూపంలో గాని లెక్కించవచ్చు.

ఒక కారకం యొక్క ఉపాంత ఉత్పాదకతను ఈ క్రింది విధంగా వివరించవచ్చు. ఉదా: నలుగురు టైలర్లు రోజుకు పది చొక్కాలు కుట్టగలరని అనుకుందాం. అదే ఐదుగురు టైలర్లు 13 చొక్కాలు కుట్టగలరు. 5వ టైలర్ ఉపాంత భౌతిక ఉత్పత్తి మూడు చొక్కాలు. ఒక్క చొక్కా కుట్టినందుకు వేతనం Rs. 100/- అనుకుంటే 5వ శ్రామికునికి 3. చొక్కాలు కుట్టినందుకు Rs. 300/- వేతనం ఇవ్వవలసి వస్తుంది. ఈ Rs. 300/-ను ఉపాంత ఉత్పత్తి రాబడి అంటారు.

ఉపాంత భౌతిక ఉత్పత్తి సిద్ధాంతం సంపూర్ణ పోటీ మార్కెట్ ప్రమేయంపై ఆధారపడటం వల్ల ఒక ఉత్పత్తి కారకం సగటు వ్యయం దాని ఉపాంత వ్యయంకు సమానంగా ఉంటుంది. ఉత్పత్తి మొదటి దశలో శ్రామికుల సంఖ్య పెంచుతూపోతే తరహాననుసరించి పెరుగుతున్న ప్రతిఫలాల వల్ల అదనపు ఉత్పత్తి రాబడి పెరుగుతుంది. తరువాత ఇంకా శ్రామికులను పెంచితే క్షీణ ప్రతిఫలాలు వస్తాయి. అందువల్ల ఉపాంత ఉత్పత్తి రాబడి, సగటు ఉత్పత్తి రాబడి ఒక స్థాయి వరకు పెరిగి క్షీణిస్తాయి.

దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం 3

పై రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద ఉపాంత కారక వ్యయం (MFC), ఉపాంత కారక రాబడి (MFC) సమానంగా ఉండి సంస్థ సమతౌల్యంలో ఉంటుంది. AFC, ARP ఇక్కడ సమానంగా ఉండటం వల్ల సాధారణ లాభాలు పొందుతుంది. శ్రామికులను OL1, యూనిట్లకు తగ్గిస్తే ‘E1‘ బిందువు వద్ద MFC, MRP సమానమైనాయి. ఈ బిందువు వద్ద ARP కంటే AFC తక్కువగా ఉండటం వల్ల లాభాలు వస్తాయి. అందువల్ల శ్రామికులను OL పెంచవచ్చు. కాని శ్రామికులను OL2 కు పెంచితే ‘E2‘ బిందువు వద్ద MFC, MRP సమానమైనాయి. ARP కంటే AFC ఎక్కువగా ఉండటం వల్ల సంస్థకు నష్టాలు వస్తాయి. అందువల్ల శ్రామికులను OL యూనిట్లకు తగ్గింటం జరిగింది. ఇక్కడ శ్రామికుల ఉపాంత ఉత్పత్తికి సమానంగా వేతనం ఉంటుంది.

ప్రమేయాలు :

  1. ఉత్పత్తి కారకాల మార్కెట్ పరిపూర్ణ పోటీ ఉంటుంది.
  2. ఉత్పత్తి కారకాలు అన్ని సజాతీయాలు.
  3. ఉత్పత్తి కారకాలకు పూర్తి గమనశీలత ఉంటుంది.
  4. సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది.
  5. ఒక ఉత్పత్తి కారకం ఉపాంత ఉత్పత్తిని కొలవవచ్చు.

ప్రశ్న 3.
వాస్తవిక వేతనం అంటే ఏమిటి ? వాస్తవిక నేతనాన్ని నిర్ణయించు అంశాలను పేర్కొనుము.
జవాబు:
శ్రామికులు వివిధ రంగాలలో వస్తూత్పత్తి ప్రక్రియలో తన సేవలను అందించారు. అందుకు ప్రతిఫల ఉత్పత్తిదారులిచ్చే ప్రతిఫలం లేదా ధరను వేతనం అంటారు. శ్రామికులకు ప్రతిఫలం లేదా ధరను ద్రవ్య రూపం చెల్లిస్తారు. ద్రవ్య రూపంలో ఇచ్చిన వేతనం కొనుగోలు శక్తిని వాస్తవిక వేతనం అంటారు. ఇది ద్రవ్యం కొనుగోలు ఆధారపడుతుంది. ఈ కొనుగోలు శక్తి సాధారణ ధర సూచికపై ఆధారపడి ఉంటుంది. ధరల స్థాయి మారుతున్నప్పుడు ద్రవ్యవేతనంలో మార్పులు లేకపోయినా వాస్తవిక వేతనంలో మార్పు వస్తుంది. వాస్తవిక వేతనమే శ్రామికుని ఓ ప్రమాణస్థాయిని నిర్ణయిస్తుంది. ప్రజలు వినియోగిస్తున్న వస్తువులు, వాటి పరిమాణాలు, నాణ్యతను అనుసరించి బాట జీవన ప్రమాణాలు నిర్ణయించబడతాయి.

వాస్తవిక వేతనాన్ని నిర్ణయించే అంశాలు:
1) ద్రవ్యం కొనుగోలు శక్తి: సాధారణంగా ద్రవ్యానికుండే కొనుగోలు శక్తిపై వాస్తవిక వేతనాలు ఆధారపడి ఉంటాయి. ద్రవ్యానికి కొనుగోలు శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు శ్రామికులు తమ వేతనంలో ఎక్కువ సౌకర్యాలను సమకూర్చుకోగలరు. ద్రవ్యం కొనుగోలు శక్తి తగ్గినప్పుడు శ్రామికుల వాస్తవిక వేతనం తగ్గుతుంది.

2) వేతనమిచ్చే విధానము: శ్రామికులకు ఇచ్చే ద్రవ్య వేతనంతోపాటు యాజమాన్యం కొన్ని సదుపాయాలను కూడా కల్పిస్తుంది. ఉదా: ఉచిత వసతి సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు మొదలైనవాటివల్ల వారి వాస్తవిక వేతనాలు అధికమవుతాయి.

3) ఉద్యోగ స్వభావము: చేసే పని స్వభావం మీద కూడా వాస్తవిక వేతనాలు ఆధారపడతాయి. కొన్ని వృత్తులలో పని దుర్భరంగా ఉంటుంది. కొన్ని వృత్తులు ఆపదతో కూడినవిగా ఉంటాయి. అటువంటి వృత్తులలో ద్రవ్యవేతనాలు ఎక్కువగా ఉన్నా వాస్తవిక వేతనాలు తక్కువ. ఆహ్లాదకరమైన వృత్తులలో ద్రవ్యవేతనాలు తక్కువైనా వాస్తవిక వేతనాలు ఎక్కువని ఉద్యోగ స్వభావాన్నిబట్టి చెప్పవచ్చును. ఉదా: గనులలో పనిచేసేవారి వృత్తి దుర్భరంగా ఉంటుంది. కనుక ద్రవ్య వేతనాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాస్తవిక వేతనం తక్కువగా ఉంటుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

4) పనిచేసే పరిస్థితులు: అనారోగ్యకరమైన పరిసరాలలో పనిచేసే శ్రామికుల వేతనం ఎక్కువగా ఉన్నా వారి వాస్తవిక వేతనం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ గంటలు పనిచేసేవారి ద్రవ్యవేతనం ఎక్కువగా ఉన్నా వారి వాస్తవిక వేతనం రేటు తక్కువగా ఉంటుంది.

5) ఆకస్మిక లాభాలు: యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు, పోటీ సంస్థలు మూతపడుట మొదలైన కారణాల వల్ల ధరలు పెరిగి లభించే ఆకస్మిక లాభాలు నికరలాభంలో అంతర్భాగంగా ఉంటాయి.

ప్రశ్న 4.
స్థూల లాభం, నికరలాభంలో ఉన్న అంశాలను వ్రాయండి.
జవాబు:
మొత్తం రాబడి నుండి మొత్తం వ్యయం తీసివేయగా మిగిలినదానిని స్థూలలాభం అని అంటారు. స్థూలలాభంలో ఉన్న అంశాలు:
1) ఉద్యమదారుని సొంత మూలధనం మీద వడ్డీ: వ్యవస్థాపకుడు ఉత్పత్తి ప్రక్రియలో సొంత మూలధనం ఉపయోగిస్తే దానిమీద చెల్లించే వడ్డీని లెక్కలోకి తీసుకోవాలి.

2) సొంత భూమి మీద భాటకం: ఉత్పత్తి ప్రక్రియలో తన సొంత భూమిని ఉపయోగిస్తే దానికి భాటకం లెక్కగట్టాలి. దానిని లాభంగా అన్వయించకూడదు.

3) నిర్వహణ వేతనాలు: వ్యవస్థాపకుడే వ్యాపారాన్ని నిర్వహించి, అజమాయిషీ చేస్తే అతని సేవలకు వేతనం ఇవ్వాలి. అది స్థూలలాభంలో తీసివేయాలి.

4) బీమా ఖర్చులు: యంత్రాల తరుగుదల, బీమా వ్యయాలు మొదలైనవాటిని స్థూలలాభాల నుండి తీసివేయాలి.

5) నికరలాభం: వ్యవస్థాపనకు ఉత్పత్తికరమైన సేవలకు మాత్రమే వచ్చే ప్రతిఫలం నికరలాభం.

6) భవిష్యదవకాశాలు: భవిష్యత్తులో పదోన్నతి జరిగి ఎక్కువ సంపాదించుకునే అవకాశమున్న వృత్తులలో ద్రవ్యవేతనం తక్కువగా ఉన్నప్పటికీ, వాస్తవిక వేతనం ఎక్కువగా ఉంటుంది.

7) వృత్తి స్థిరత్వం: ప్రతి శ్రామికుడు ద్రవ్యవేతనం తక్కువగా ఉన్నప్పటికీ శాశ్వతమైన ఉద్యోగం కోరుకుంటాడు. కాని తాత్కాలికమైన ఉద్యోగంలో ద్రవ్యవేతనం ఎక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో నిరుద్యోగిగా ఉండిపోవలసి వస్తుంది. కనుక వాస్తవిక వేతనం తక్కువగా ఉంటుంది.

8) అదనపు రాబడి: అదనపు రాబడి ఆర్జించటానికి అవకాశమున్న వృత్తులలో ద్రవ్యవేతనం తక్కువగా ఉన్నప్పటికీ వారి వాస్తవిక వేతనం ఎక్కువగా ఉంటుంది. ఉదా: అధ్యాపకులు, టైపిస్టులు మొదలైనవారు అదనపు రాబడిని ఆర్జించగలరు.

నికరలాభంలో ఉన్న అంశాలు: స్థూలలాభంలో అంతర్భాగంగా ఉన్న వ్యవస్థాపక సేవలకు వచ్చే ప్రతిఫలాన్ని మాత్రమే నికర లాభం అంటారు.
ఎ) నష్టభయాన్ని భరించడం: వ్యాపారంలో బీమా చేయలేని నష్టభయాలను, అనిశ్చితాలను భరించినందుకు వచ్చే ప్రతిఫలం నికర లాభంలో అంతర్భాగంగా ఉంటుంది.

బి) ఉత్పత్తి కారకాల సమన్వయం: ఉత్పత్తి కారకాలను ఒకచోట చేర్చి అభిలషణీయ అనుపాతంలో కూర్చి, సమన్వయపరిచినందుకు వచ్చే ప్రతిఫలాలు నికరలాభంలో ఇమిడి ఉంటాయి.

సి) మార్కెటింగ్ సేవలు: ఉత్పత్తి కారకాలను కొనుగోలుచేసి తయారైన వస్తువులను విక్రయించటంలో వ్యవస్థాపకుని మార్కెటింగ్ సమర్థతకు ప్రతిఫలం నికరలాభంలో అంతర్భాగం.

డి) నవకల్పనలు ప్రవేశపెట్టడం: నూతన ఉత్పత్తి పద్ధతులు ప్రవేశపెట్టడం, నూతన మార్కెట్లు కనుక్కోవడం, నూతన వస్తువులను తయారుచేయడంలాంటి నవకల్పనలు ప్రవేశపెట్టినందుకు చెల్లించే పారితోషికం నికరలాభంలో అంతర్భాగం.

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

ప్రశ్న 5.
వేతనం అంటే ఏమిటి ? వేతన సిద్ధాంతాలను వివరించండి.
జవాబు:
వేతనం – సిద్ధాంతాలు – భావనలు: శ్రామికులు ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొని ప్రతిఫలాన్ని ఆశించి చేసే పనిని శ్రమ అంటారు. ఈ శ్రమ శారీరకమైనదైనా లేదా మానసికమైనదైనా కావచ్చు. అంటే శ్రామికులు ఉత్పత్తికి అందించిన సేవలకు చెల్లించే ధరను వేతనం అంటారు.

ఆర్థికవేత్తలు అనేక వేతనసిద్ధాంతాలను రూపొందించారు.
1) జీవనాధార వేతన సిద్ధాంతం: ఈ సిద్ధాంతాన్ని ఫ్రాన్స్ దేశానికి చెందిన ప్రకృతి ధర్మవాదులు రూపొందించారు. అయితే డేవిడ్ కార్డో ఈ సిద్ధాంతానికి ఒక స్పష్టమైన రూపాన్నిచ్చారు. ఈ సిద్ధాంతం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవించడానికి కొన్ని కనీస అవసరాలుంటాయి. కాబట్టి శ్రామికుని శ్రమని చెల్లించే వేతనం అతని కనీస అవసరాలు తీర్చుకోగలిగిన జీవన వ్యయానికి సరిపోయేటట్లు ఉండాలి. అయితే శ్రామికుని శ్రమకు ప్రతిఫలంగా చెల్లించే వేతనం అతనికి, అతని కుటుంబ పోషణకు సరిపడేటట్లుగా ఉండాలి. దీనినే జీవనాధార వేతన సిద్ధాంతం అంటారు.

2) వేతన నిధి సిద్ధాంతం: J.S. మిల్ తన గ్రంథమైన “The Principles of Political Economy” లో వేతన నిధి సిద్ధాంతాన్ని వివరించారు. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి ఉద్యమదారుడు శ్రామికులకు వేతనాలు చెల్లించడానికి తన చర మూలధనంలో కొంత భాగాన్ని కేటాయిస్తాడు. ఉద్యమదారులందరూ ఈ విధంగా కేటాయించిన నిధిని వేతన
నిధి అంటారు.

3) వేతన పరిశిష్ట యోగ్యతా సిద్ధాంతం: వాకర్ అనే అమెరికా అర్థశాస్త్రవేత్త ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఉత్పత్తి ప్రక్రియలో భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన అనే ఉత్పత్తి కారకాలనుపయోగించి చేసిన ఉత్పత్తిని అమ్మగా వచ్చిన రాబడిని భూమికి భాటకం, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపకునికి లాభం చెల్లించిన తరువాత మిగిలిన భాగాన్ని శ్రమకు వేతనంగా చెల్లించవలసి ఉంటుంది.

4) టాసిగ్ వేతన సిద్ధాంతం: టాసిక్ వేతన సిద్ధాంతం అభివృద్ధిపరచబడిన ఉపాంత ఉత్పాదకత వేతన సిద్ధాంతం, ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమైన తరువాత అంతిమ వస్తువులు రావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి శ్రామికులకు ముందుగానే వేతనాలు చెల్లించాలి.

5) ఆధునిక వేతనాల సిద్ధాంతం: ఆధునిక వేతనాల సిద్ధాంతాన్ని ఆల్ఫ్రెడ్ మార్షల్, J.R. హిక్స్లు ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం శ్రామికుల వేతనరేటు శ్రామిక మార్కెట్లో శ్రామికులకున్న డిమాండ్, సప్లయ్ల సమానత్వం వల్ల నిర్ణయించబడుతుంది. కాబట్టి శ్రామికుల డిమాండ్, సప్లయ్లు ఏ వేతనరేటు వద్ద సమానంగా ఉంటాయో అక్కడ సమతౌల్యం ఏర్పడి వేతనం నిర్ణయించబడుతుంది.

ప్రశ్న 6.
వివిధ లాభ సిద్ధాంతాలను తెల్పండి.
జవాబు:
వ్యవస్థాపకుడు చేసే ఉత్పత్తి నిర్వహణ కృషికి ఇచ్చే ప్రతిఫలమే లాభం.
లాభ సిద్ధాంతాలు:
1) చలన లాభ సిద్ధాంతం: J.R. క్లార్క్ ఈ సిద్ధాంతాన్ని రూపొందించారు. ఈ సిద్ధాంతం ప్రకారం వస్తూత్పత్తి వ్యయం కంటే ధర ఎక్కువగా ఉంటే లాభం వస్తుంది. నిశ్చల ఆర్థిక వ్యవస్థలో పోటీ పరిస్థితుల వల్ల ఉత్పత్తి కారకం తన ఉత్పాదక శక్తికి సమానంగా వేతనం పొందుతుంది. అందువల్ల ఉద్యమదారులు లాభాలు పొందలేరు. కాని వేతనాలు
పొందుతారు.

2) నవకల్పన సిద్ధాంతం: ఈ సిద్ధాంతాన్ని షుంపీటర్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఉద్యమదారుని నవకల్పనా నైపుణ్యాలకు పారితోషికంగా లాభం చెల్లించబడుతుంది. ఉద్యమదారుడు ఉత్పత్తి కార్యక్రమంలో ప్రవేశపెట్టే నవకల్పన వల్ల ఉత్పత్తి వ్యయం ధరకంటే తక్కువగా ఉండి లాభం వస్తుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

3) హాలే నష్టభయ లాభ సిద్ధాంతం: హాలే ఈ సిద్ధాంతాన్ని రూపొందించారు. ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యమదారుడు తప్ప మిగిలిన ఏ ఉత్పత్తి కారకం నష్టభయాన్ని భరించడు. అందువల్ల ఇతర ఉత్పత్తి కారకాలకు పంచగా మిగిలిన ఆదాయం ఉద్యమదారునికి చెందుతుంది.

4) అనిశ్చితత్వ లాభ సిద్ధాంతం: నైట్ ఈ సిద్ధాంతాన్ని రూపొందించారు. ఇది మెరుగుపరచబడిన నష్టభయ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొన్నందుకు ఉద్యమదారునికి చెల్లించే ప్రతిఫలమే లాభం.

5) వాకర్ సిద్ధాంతం: వాకర్ తన సిద్దాంతంలో ఉద్యమదారుని, పెట్టుబడిదారుని వేరుచేసి చూపాడు. వాకర్ ప్రకారం ఉద్యమదారుల సామర్థ్యానికి చెల్లించే ప్రతిఫలం లాభం. వాకర్ లాభ సిద్ధాంతం రికార్డో భాటక సిద్ధాంతాన్ని పోలి ఉంది.

ప్రశ్న 7.
వడ్డీ అంటే ఏమిటి ? వడ్డీ సిద్ధాంతాలను వివరించండి.
జవాబు:
అర్థశాస్త్రంలో మూలధనానికి చెల్లించే ధరని వడ్డీ అంటారు. రుణగ్రహీత మూలధన సేవలను ఉపయోగించు కున్నందుకు రుణదాతకు చెల్లించే ధరే వడ్డీ.
ఈ వడ్డీ భావనలు రెండు రకాలు 1. స్థూల వడ్డీ 2. నికర వడ్డీ

1) నిరీక్షణ వడ్డీ సిద్ధాంతం లేదా పరిత్యాగ వడ్డీ సిద్దాంతం ఈ సిద్దాంతాన్ని నాసా సీనియర్ ప్రతిపాదించారు. వ్యక్తులు తమ వినియోగాన్ని పరిత్యజించి, ఆదాయాన్ని పొదుపు చేసి మూలధన నిధులను సమకూర్చుతారు. ఈ విధంగా వ్యక్తులకు తమ ప్రస్తుత వినియోగాన్ని పొదుపు కోసం వాయిదా వేసిన త్యాగానికి ప్రతిఫలంగా కొంత పారితోషికం ఇవ్వాలి. ఈ పారితోషికం లేకపోతే వ్యక్తులు తమ ఆదాయాన్ని పొదుపుచేయరు. అందువల్ల నాసా సీనియర్ వడ్డీని త్యాగానికి ఇచ్చే ప్రతిఫలంగా భావించారు.

2) బోమ్బావర్క్ సిద్ధాంతం: ఆస్ట్రియన్ ఆర్థికవేత్త బోమ్బవర్క్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీన్ని మానసిక వడ్డీ సిద్ధాంతం అని కూడా అంటారు. ప్రజలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపుచేస్తే భవిష్యత్ వినియోగం కోసం వర్తమాన వినియోగం వాయిదా వేయాల్సి ఉంటుంది. ప్రజలు భవిష్యత్ వినియోగం కంటే వర్తమాన వినియోగంలో ఎక్కువ సంతృప్తి లభిస్తుంది అని భావిస్తారు. అంటే భవిష్యత్ సంతృప్తి వర్తమానంతో పోల్చితే డిస్కౌంట్ చేయబడుతుంది. అందువల్ల వర్తమాన వినియోగాన్ని వాయిదా వేసి పొదుపు చేసిన మొత్తాన్ని అప్పుగా ఇచ్చేటట్లు ప్రోత్సహించడానికి వడ్డీ చెల్లించాలి.

3) కాలాభిరుచి వడ్డీ సిద్ధాంతం: అమెరికన్ ఆర్థికవేత్త ఇర్వింగ్ ఫిషర్ కాలాభిరుచి వడ్డీ సిద్ధాంతాన్ని రూపొందించారు. ఈయన వడ్డీని నిర్ణయించడంలో కాలాభిరుచిని పరిగణనలోకి తీసుకున్నాడు. దీనిని బట్టి భవిష్యత్లో ఆదాయం నిశ్చితంగా ఉంటుందని భావిస్తే, వర్తమాన కాలాభిరుచి తక్కువగా ఉండి వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్లో ఆదాయం అనిశ్చితంగా ఉంటుందని భావిస్తే వర్తమాన కాలాభిరుచి ఎక్కువగా ఉండి వడ్డీరేటు తక్కువగా ఉంటుంది.

4) కీన్స్ ద్రవ్యత్వాభిరుచి వడ్డీ సిద్ధాంతం: కీన్స్ తన గ్రంథమైన The General Theory of Employment, Interest and Money ద్రవ్యత్వాభిరుచి వడ్డీ సిద్ధాంతాన్ని వివరించారు. ద్రవ్యాన్ని ద్రవ్యరూపంలో తమ వద్ద ఉంచుకోవాలనే ప్రజల కోర్కెను “ద్రవ్యత్వాభిరుచి” అంటారు. ద్రవ్యానికి మాత్రమే అన్నిటికంటే ద్రవ్యత్వం ఎక్కువగా
ఉంటుంది.

ద్రవ్య డిమాండ్: ద్రవ్యత్వాభిరుచినే ద్రవ్యానికి గల డిమాండ్ అంటారు. ద్రవ్యానికి డిమాండ్ కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది.

  1. వ్యాపార వ్యవహారాల కోసం
  2. ముందు జాగ్రత్త కోసం
  3. అంచనా వ్యాపారం కోసం
  4. రుణాత్మక నిధుల సిద్ధాంతం

ఈ సిద్ధాంతాన్ని నట్విక్సెల్ అనే ఆర్థికవేత్త ముందుగా ప్రతిపాదించారు. దీనినే నవ్య సాంప్రదాయ సిద్ధాంతం అని కూడా అంటారు. ఈ సిద్ధాంతం ప్రకారం రుణాత్మక నిధుల డిమాండ్, సప్లయ్లు సమతౌల్యం వడ్డీ రేటును నిర్ణయిస్తాయి.

5) ఉపాంత ఉత్పాదకత సిద్ధాంతం ఈ సిద్ధాంతం ప్రకారం వడ్డీరేటు మూలధన ఉపాంత ఉత్పాదకతకు తక్కువ సమానంగా ఉండాలి. మూలధనానికి డిమాండ్ పెరిగే కొద్దీ దాని ఉపాంత ఉత్పాదకత క్షీణిస్తుంది. కాబట్టి తక్కువ వడ్డీరేటు చెల్లించబడుతుంది. కాబట్టి మూలధనానికున్న డిమాండ్, వడ్డీరేటు విలోమ సంబంధం కలిగి ఉంటాయి.

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పంపిణీ భావనలను వివరించండి.
జవాబు:
అర్థశాస్త్రంలో పంపిణీ భావనను రెండు అర్థాలలో ఉపయోగించడం జరుగుతుంది. అంటే జాతీయాదాయ పంపిణీని రెండు విధాలుగా పరిశీలించవచ్చు.

  1. విధులననుసరించి పంపిణీ.
  2. వైయక్తిక పంపిణీ

1) విధులననుసరించి పంపిణీ: ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనలు సేవలందించినందుకు గాను, అవి ప్రతిఫలాలుగా భాటకం, వేతనం, వడ్డీ, లాభాల రూపంలో పొందుతాయి. ఒక ఉత్పత్తి కారకం ఏవిధంగా ఎంత మొత్తంలో ప్రతిఫలం పొందుతుందో విధులననుసరించి పంపిణీ తెలియజేస్తుంది. కొంతమంది. ఒకటికంటే ఎక్కువ ఉత్పత్తి కారకాలకు యజమానులుగా ప్రతిఫలాలను పొందవచ్చు. ఒక ఉత్పత్తి కారకం ఏవిధంగా ఎంత మొత్తంలో ప్రతిఫలం పొందుతుందో విధులననుసరించి పంపిణీ తెలుపుతుంది. విధులననుసరించి జరిగే పంపిణీని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

a) సూక్ష్మ పంపిణీ: సూక్ష్మ పంపిణీ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నందుకు ఒక ఉత్పత్తి కారకం ధర ఏవిధంగా ఎంత నిర్ణయించబడుతుందో వివరిస్తుంది.
ఉదా: శ్రామికుల వేతన రేటు నిర్ణయం.

b) స్థూల పంపిణీ: జాతీయాదాయంలో వివిధ ఉత్పత్తి కారకాల వాటా ఎంత ఉందో పంపిణీ స్థూల వివరిస్తుంది.
ఉదా: మొత్తం జాతీయాదాయంలో వేతనాల వాటా ఎంత ఉంది అనే విషయాన్ని స్థూల పంపిణీ తెలియజేస్తుంది.

2) వైయక్తిక పంపిణీ: దేశంలోని వ్యక్తుల మధ్య జాతీయాదాయాన్ని పంపిణీ చేయడాన్ని వైయక్తిక పంపిణీ అంటారు. ఇక్కడ వ్యక్తులు ఎంత ఆదాయం పొందుతున్నారు అనే విషయాన్ని పరిశీలిస్తారు. అంతేగాని ఏవిధంగా లేదా ఎన్ని విధాలుగా పొందారు అనే విషయ పరిశీలన ప్రధానం కాదు. వైయక్తిక పంపిణీ పరిశీలన ద్వారా ఆదాయ అసమానతలను అందుకు గల కారణాలను తెలుసుకోవచ్చు.

ప్రశ్న 2.
ఉత్పత్తి కారకాల ధరను నిర్ణయించే అంశాలను పేర్కొనండి. [Mar 16]
జవాబు:
ఉత్పత్తి కారకాల ధరలను వాటి డిమాండ్, సప్లయ్ లు కలసి నిర్ణయిస్తాయి. ఉత్పత్తి కారకాల డిమాండ్ను నిర్ణయించే అంశాలు:

  1. ఉత్పత్తి కారకాల డిమాండ్ ఉత్పన్న డిమాండ్ లేదా పరోక్ష డిమాండ్ అంటే ఉత్పత్తి కారకం డిమాండ్ అది ఉత్పత్తి చేసే వస్తువు డిమాండ్పై ఆధారపడి ఉంటుంది.
  2. ఒక ఉత్పత్తి కారకం డిమాండ్ దాని ధరపై ఆధారపడి ఉంటుంది.
  3. ఒక ఉత్పత్తి కారకం డిమాండ్ ఉత్పత్తి తనకు సహకరించే ఇతర ఉత్పత్తి కారకాల ధరలపై ఆధారపడి ఉంటుంది.
  4. సాంకేతిక విజ్ఞానం ఉత్పత్తి కారకాల డిమాండ్ను నిర్ణయిస్తుంది.
    ఉదా: కంప్యూటరీకరణ వల్ల శ్రామికుల డిమాండ్ గణనీయంగా తగ్గింది.
  5. తరహాననుసరించి ప్రతిఫలాలు ఉత్పత్తి కారకం డిమాండ్ను నిర్ణయిస్తాయి. ఉత్పత్తిలో పెరుగుతున్న ప్రతిఫలాలు వస్తుంటే ఉత్పత్తి కారకాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
  6. ఉత్పత్తి కారకాల సప్లయ్ని నిర్ణయించే అంశాలు.
    ఉదా: శ్రామికుల సప్లయ్

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

ప్రశ్న 3.
కొరత భాటకం అనే భావనను వివరించండి.
జవాబు:
కొరత భాటకం: కొరత భాటకం అనే భావనను మార్షల్ భూమి, సప్లయ్, డిమాండ్ ప్రాతిపదికగా వివరించాడు. భూమి, సప్లయ్ స్థిరంగా ఉంటుంది. కాని డిమాండ్ పెరుగుతుంది. అటువంటప్పుడు భూమి కొరత వల్ల దానికి మామూలు ధర కంటే ఎక్కువ ధరను ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా కొరత వల్ల భూమికి వచ్చే అధిక లేక అదనపు ధరను కొరత భాటకం అంటారు. భూమి, సప్లయ్ అవ్యాకోచంగా ఉండటం వల్ల ఈ కొరత భాటకం ఏర్పడుతుంది. ఇది డిమాండ్ పెరుగుతూ ఉంటే భాటకం పెరుగుతూ ఉంటుంది.

పై రేఖాపటంలో SL రేఖ భూమి అవ్యాకోచ సప్లయ్న సూచించును. DD రేఖ డిమాండ్ రేఖను, SL రేఖ E బిందువు వద్ద ఖండించుకున్నప్పుడు ధర ‘OR’ గా ఉంది. డిమాండ్ పెరగడం వల్ల నూతన డిమాండ్ రేఖ D D సప్లయ్ రేఖ SL ను E బిందువు వద్ద ఖండిస్తుంది. ఇక్కడ భూమి యొక్క ధర OR, గా ఉంది. ఈ విధంగా డిమాండ్ పెరిగే కొద్ది భూమి ధర OR నుంచి OR, కు, OR, నుంచి OR కు పెరిగింది.

ప్రశ్న 4.
కృత్రిమ భాటకం అనే భావనను వివరించండి.
జవాబు:
కృత్రిమ భాటకం అనే భావనను మార్షల్ ప్రవేశపెట్టాడు. స్వల్ప కాలంలో మానవ నిర్మితాలైన యంత్ర సామాగ్రి, భవనాలకు సప్లయ్ అవ్యాకోచంగా ఉంటుంది. వీటికి డిమాండ్ పెరిగితే ధర సగటు వ్యయం కంటే ఎక్కువగా ఉంటుంది. ఆ అదనపు ధర లేదా వాటి నుండి వచ్చిన అదనపు రాబడినే కృత్రిమ భాటకమని మార్షల్ పేర్కొన్నాడు. స్వల్ప కాలంలో కొన్ని వస్తువులకు డిమాండ్ పెరిగినప్పటికి సప్లయ్ పెంచడానికి అవకాశం ఉండదు. కనుక ఆ వస్తువులకు కృత్రిమ భాటకం ఏర్పడుతుంది. సగటు చర వ్యయం కంటే అధికంగా వచ్చే ధర లేదా అదనపు రాబడినే కృత్రిమ భాటకం అంటారు. దీర్ఘకాల వ్యవధిలో వీటి డిమాండు అనుగుణంగా సప్లయ్న మార్చడానికి వీలుంటుంది. కనుక దీర్ఘ కాలంలో ఈ భాటకం ఉండదు.
AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం 4

పై రేఖాపటంలో ‘X’ అక్షంపై డిమాండ్, సప్లయ్లాను, OY అక్షంపై భాటకాన్ని తీసుకున్నాం. SPS స్వల్పకాలిక సప్లయ్ అవ్యాకోచరేఖ. LPS దీర్ఘకాలిక సప్లయ్ వ్యాకోచరేఖ. స్వల్పకాలంలో RR, మిగులు లేదా భాటకం లభ్యమవుతుంది. కాని దీర్ఘకాలంలో భాటకం అదృశ్యమవుతుంది.

స్థూలవడ్డీ, నికర వడ్డీ ఖాతలను వివిరిస్తూ, స్థూల వడ్డీలోని అంతర్భాగాలను పేర్కొనుము. అర్థశాస్త్రంలో మూలధనానికి చెల్లించే ధరే వడ్డీ అని పిలుస్తారు.
వడ్డీ భావనలు రెండు రకాలు:

  1. స్థూలవడ్డీ
  2. నికరవడ్డీ

1) స్థూలవడ్డీ: రుణం తీసుకొన్న వ్యక్తి తాను తీసుకొన్న మొత్తంతో పాటు ఎంత అదనంగా రుణదాతకు స్తున్నాడో ఆ మొత్తాన్ని స్థూలవడ్డీ అంటారు. స్థూలవడ్డీలో అనేక అంశాలు కలిసి ఉంటాయి.

2) నికరవడ్డీ: నికరవడ్డీ అంటే కేవలం మూలధన సేవలకు మాత్రమే ఇచ్చే ప్రతిఫలం. ఆర్థిక పరిభాషలో వడ్డీ వాస్తవికమైంది. ఉదా: ప్రభుత్వ బాండ్లు, ప్రభుత్వ రుణాల మీద చెల్లించే వడ్డీ.

స్థూలవడ్డీలోని అంతర్భాగాలు:
1) నష్టభయానికి చెల్లించే మూల్యం: రుణదాత రుణమివ్వటంలో రెండు రకాలైన నష్టభయాలను ఎదుర్కోవాలి. వ్యక్తిగత నష్టభయం, వ్యాపారరీత్యా నష్టభయం రుణం తీసుకొన్న వ్యక్తి సకాలంలో తిరిగి చెల్లించకపోవచ్చు. ఈ భయాలను తొలగించుకోవడానికి కొంత అదనంగా వడ్డీ రూపంలో వసూలు చేస్తాడు.

2) అసౌకర్యానికి చెల్లింపు: అప్పు ఇచ్చే వ్యక్తి ఆ డబ్బును తాత్కాలికంగా వదులుకోవడం వల్ల కొంత అసౌకర్యానికి అవుతాడు. రుణదాత తాను ఇచ్చిన రుణాన్ని సకాలంలో పొందలేకపోవచ్చు. ఇచ్చిన రుణం తిరిగి పొందేలోపు అవసరాలను వాయిదా వేసుకోవాలి. రుణమిచ్చిన కారణంగా ద్రవ్యం తన చేతిలో లేనందువల్ల ధరలు తగ్గి ద్రవ్యం గోలు శక్తి పెరగడం లాంటి అవకాశాలు వస్తే వదులుకోవాలి. రుణదాత ఈ అసౌకర్యాలను భరించినందుకు …గ్రస్తుని నుంచి కొంత అదనంగా వడ్డీ రూపంలో తీసుకుంటాడు.

3) నిర్వహణావ్యయం: రుణదాత తన విధులు నిర్వహించడానికి కొంత ఖర్చు చేయాలి. రుణగ్రస్తుల ఖాతాలు చాలి. అందుకుగాను సిబ్బంది జీతాలను, అకౌంటు పుస్తకాల ఖర్చులను భరించాలి. అప్పు ఇచ్చేందుకు వీలుగా ఒకప్సు పొందాలి. కొన్నిసార్లు రుణాలను వసూలు చేసుకునేందుకుగాను సిబ్బందిని నియమించుకోవాల్సి రావడంతోపాటు సుస్థానాలకు కూడా వెళ్ళాల్సివస్తుంది. ఈ నిర్వహణా ఖర్చులను భరించినందుకుగాను అదనంగా కొంత మొత్తాన్ని రూపంలో తీసుకుంటాడు.
స్థూలవడ్డీ = నికరవడ్డీ + (నష్టభయానికి మూల్యం + అసౌకర్యానికి చెల్లింపు + నిర్వహణావ్యయం)

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఒప్పంద భాటకం [Mar. ’16, ’15]
జవాబు:
ఒప్పంద భాటకం అంటే నిర్ణీతకాలానికి భూమి సేవలకు, గృహాలకు ముందుగా నిర్ణయించిన ఒప్పందం ప్రకారం చే ప్రతిఫలం.

ప్రశ్న 2.
ఆర్థిక భాటకం
జవాబు:
ఆర్థిక భాటకం కేవలం భూమికే పరిమితం కాకుండా మిగతా మూడు ఉత్పత్తి కారకాలైన శ్రమ, మూలధనం, వ్యవస్థాపనకు వర్తిస్తుంది. ఇది మూడు రకాలు

  1. కొరత భాటకం
  2. కృత్రిమ భాటకం
  3. బదిలీ సంపాదన

ప్రశ్న 3.
కొరత భాటకం [Mar. ’17]
జవాబు:
కొరత భాటం అనే భావనను అభివృద్ధి చేసింది మార్షల్. కొరత భాటకం అంటే అవ్యాకోచ సప్లయ్ ఉన్న భూమికి చెల్లించే ధర.

ప్రశ్న 4.
కృత్రిమ భాటకం
జవాబు:
కృత్రిమ భాటకం అను భావనను ప్రవేశపెట్టింది మార్షల్. కృత్రిమ భాటకం అంటే మానవ నిర్మిత యంత్రాలు, యంత్ర పరికరాలు అతి స్వల్ప కాలంలో ఆర్జించే మిగులు ధర.

ప్రశ్న 5.
బదిలీ సంపాదన
జవాబు:
ఒక ఉత్పత్తి కారకం తన అత్యుత్తమ ప్రత్యామ్నాయ ఉపయోగంలో ఆర్జించే మిగులు.

ప్రశ్న 6.
ద్రవ్య వేతనం
జవాబు:
ద్రవ్య వేతనం అంటే శ్రామికుని శ్రమకు నగదు రూపంలో చెల్లించే ధర లేదా ప్రతిఫలం.

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

ప్రశ్న 7.
వాస్తవిక వేతనం [Mar, ’16]
జవాబు:
వాస్తవిక వేతనాన్ని అభివృద్ధి పరిచినది ఆడమస్మిత్. వాస్తవిక వేతనం అంటే శ్రామికుడి శ్రమకు ప్రతిఫలంగా పొందిన ద్రవ్యవేతనం కొనుగోలుశక్తి.

ప్రశ్న 8.
కాలాన్ని బట్టి వేతనం
జవాబు:
కాలాన్ని బట్టి వేతనం అంటే శ్రామికుల ఉత్పాదకతతో సంబంధం లేకుండా నిర్ణీత కాలానికి ఒక వృత్తిలో | పనిచేసే వారందరికి ఒకే వేతనం చెల్లించడం.

ప్రశ్న 9.
పనిని బట్టి వేతనం
జవాబు:
శ్రామికుల ఉత్పాదకత, నైపుణ్యం బట్టి చెల్లించే వేతనంను పనిని బట్టి వేతనం అంటారు.

ప్రశ్న 10.
స్థూల వడ్డీ
జవాబు:
రుణం తీసుకున్న వ్యక్తి తాను తీసుకొన్న మొత్తంతో పాటు అదనంగా ఋణదాతకు ఎంత చెల్లిస్తున్నాడో, మొత్తాన్ని స్థూల వడ్డీ అంటారు.

ప్రశ్న 11.
నికర వడ్డీ
జవాబు:
మూలధన సేవలకు మాత్రమే ఇచ్చే ప్రతిఫలం.
ఉదా: ప్రభుత్వ బాండ్లు, ప్రభుత్వ ఋణాలపై వడ్డీ.

ప్రశ్న 12.
స్థూల లాభం [Mar. ’15]
జవాబు:
రాబడి నుండి ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు, తరుగుదల తీసివేయగా మిగిలినది స్థూల లాభం.
స్థూల లాభం = నికర లాభం + అప్రకటిత భాటకం + అప్రకటిత వేతనం+ అప్రకటిత వడ్డీ + తరుగుదల + భీమా చెల్లింపులు.

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

ప్రశ్న 13.
నికర లాభం [Mar. ’17]
జవాబు:
వ్యవస్థాపకుని సేవలకు మాత్రమే వచ్చే ప్రతిఫలం నికర లాభం.
నికర లాభం = స్థూల లాభం – అప్రకటిత భాటకం + అప్రకటిత వేతనం + అప్రకటిత వడ్డీ + తరుగుదల + భీమా చెల్లింపులు.

AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 5th Lesson విలువ సిద్ధాంతం Textbook Questions and Answers.

AP Inter 1st Year Economics Study Material 5th Lesson విలువ సిద్ధాంతం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మార్కెట్ వర్గీకరణను తెలపండి. [Mar. ’17, ’16, ’15]
జవాబు:
వాడుక భాషలో మార్కెట్ అంటే వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్ళు జరిపే ఒక ప్రత్యేక స్థలం. మూడు అంశాల |ఆధారంగా మార్కెట్ వర్గీకరణ జరుగుతుంది.

  1. కాలానుసారం మార్కెట్లు లేదా కాలవ్యవధి మార్కెట్లు
  2. స్థలానుసారం మార్కెట్లు
  3. పోటీ ఆధార మార్కెట్లు

దీనిని ఈ క్రింది పట్టిక ద్వారా చూపించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం 1

I. కాలానుసారం మార్కెట్లు: కాలవ్యవధి ఆధారంగా మార్కెట్లు మూడు రకాలుగా విభజించవచ్చు.
1. అతిస్వల్పకాలం: ఉత్పత్తిదారుడు అతిస్వల్పకాలంలో ఉత్పత్తిలో ఎలాంటి మార్పుచేయలేడు. సప్లయ్ మార్పులు తేవడానికి ఉత్పాదకాలను మార్చవలసి ఉంటుంది. ఉత్పాదకాలను అతిస్వల్పకాలంలో మార్చడం సాధ్యం కాదు. అందువల్ల సప్లయ్ స్థిరంగా ఉంటుంది.
ఉదా: నశ్వర వస్తువులయిన పూలు, పాలు మొదలగునవి.

AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం

2. స్వల్పకాలం: స్వల్ప కాలంలో సప్లయ్న కొంతమేరకు మార్చవచ్చు. కొన్ని ఉత్పాదకాలను మార్చడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. చర ఉత్పాదకాలను మార్చడం వల్ల ఇది సాధ్యం.

3. దీర్ఘకాలం: మార్కెట్లో వస్తువులుండే డిమాండ్ను బట్టి ఉత్పత్తిదారుడు దీర్ఘకాలంలో అన్ని ఉత్పాదకాల్లో మార్పులు చేస్తాడు. దీర్ఘకాలంలో సప్లయ్లో కావలసిన మార్పులు చేయవచ్చు.

II. స్థలానుసారం మార్కెట్లు: స్థలాన్ని బట్టి స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లుగా వర్గీకరించబడ్డాయి.
1. స్థానిక మార్కెట్: ఒక వస్తువు అమ్మకాలు అది ఉత్పత్తి అయిన ప్రాంతంలోనే జరిగితే దానిని స్థానిక మార్కెట్ అంటారు. ఉదా: కూరగాయలు, పండ్లు మొదలగునవి.

2. జాతీయ మార్కెట్లు: ఒక వస్తువుకు దేశంలోని వివిధ ప్రాంతాలలో డిమాండ్ సప్లయి ఉన్నట్లయితే వస్తువుకు జాతీయ మార్కెట్ ఉన్నట్లుగా చెప్పవచ్చు.
ఉదా: గోధుమ, పంచదార, పత్తి మొదలగునవి.

3. అంతర్జాతీయ మార్కెట్లు: ఒక వస్తువును దేశాల్లో అమ్మకాలు, కొనుగోళ్ళు జరిపినట్లయితే ఆ వస్తువుకు అంతర్జాతీయ మార్కెట్ ఉంటుంది.
ఉదా: బంగారం, వెండి, పెట్రోలు మొదలగునవి.

III. పోటీని బట్టి మార్కెట్లు: పోటీని బట్టి మార్కెట్లు రెండు రకాలు 1. సంపూర్ణ పోటీ మార్కెట్, 2. అసంపూర్ణ పోటీ మార్కెట్.
1. సంపూర్ణ పోటీ మార్కెట్ అధిక సంఖ్యలో కొనుగోలుదార్లు, అమ్మకందార్లు ఉండేదే సంపూర్ణ పోటీ మార్కెట్. కృత్రిమ అడ్డంకులు లేకుండా అందరు సజాతీయ వస్తువునే కొనడం, అమ్మడం జరుగుతుంది.

2. అసంపూర్ణ పోటీ మార్కెట్ కొనుగోలుదార్ల మధ్యకాని, అమ్మకందార్ల మధ్యకాని సంపూర్ణ పోటీ లేనటువంటి దానిని అసంపూర్ణ పోటీ మార్కెట్ అంటారు. అందువల్ల వస్తువుకు వేరువేరు ధరలు ఉంటాయి. ఈ అసంపూర్ణ పోటీ మార్కెట్లు నాలుగు రకాలు.

  1. ఏకస్వామ్యం
  2. ద్విస్వామ్యం
  3. పరిమితస్వామ్యం
  4. ఏకస్వామ్య పోటీ మార్కెట్

ప్రశ్న 2.
సంపూర్ణ పోటీని వివరించండి.
జవాబు:
అత్యధిక సంఖ్యలో ఉత్పత్తిదార్లు, వినియోగదార్లుండే మార్కెట్ను సంపూర్ణ పోటీ మార్కెట్ అంటారు. మార్కెట్ | అంతట ఒకే ధర ఉంటుంది.
1. అధిక సంఖ్యలో కొనుగోలుదార్లు, అమ్మకందార్లు ఈ మార్కెట్లో అధిక సంఖ్యలో కొనుగోలుదార్లు, అమ్మకందార్లు ఉంటారు. ఏ ఒక్క అమ్మకందారుడు కాని, కొనుగోలుదారుడు కాని మార్కెట్ ధరను ప్రభావితం చేయలేడు. ఒక వస్తువు ధర దానికుండే డిమాండ్, సప్లయ్లు నిర్ణయిస్తాయి. ఈ ధరను కొనుగోలుదారుడు, అమ్మకందారుడు అంగీకరించాలి. సంస్థ మార్కెట్ ధరను అనుసరించాలి.

2. సజాతీయ వస్తువులు: ఈ మార్కెట్లో వస్తువులన్నీ సజాతీయంగా ఉంటాయి. ఈ వస్తువులకుండే జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం సంపూర్ణం. అందువల్ల మార్కెట్ అంతటా ఒకే ధర ఉంటుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం

3. ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి స్వేచ్ఛ: ఈ మార్కెట్లో నూతన పరిశ్రమలు ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి స్వేచ్ఛ ఉంటుంది. సంస్థ గరిష్ట లాభాలు పొందుతున్నప్పుడు నూతన సంస్థలు ప్రవేశించుటకు, నష్టాలు వచ్చేటప్పుడు నిష్క్రమించుటకు స్వేచ్ఛ కలదు.

4. సంస్థ, పరిశ్రమ వేరువేరు: ఈ మార్కెట్లో సంస్థ, పరిశ్రమ వేరువేరుగా ఉంటాయి. సంస్థ అంటే వస్తువులను ఉత్పత్తి చేసే యూనిట్. పరిశ్రమ అనగా సంస్థల సముదాయం.

5. రవాణా ఖర్చులు ఉండవు: రవాణా ఖర్చు ఉండనందువల్ల మార్కెట్ అంతటా వస్తువుకు ఒకే ధర ఉంటుంది.

6. ఉత్పత్తి కారకాలకు, వస్తువులకు సంపూర్ణ గమనశీలత: ఈ మార్కెట్లో ఉత్పత్తి కారకాలు ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు వెళ్ళవచ్చు. అదే విధంగా వస్తు మార్కెట్లో పూర్తి గమనశీలత ఉంటుంది.

7. మార్కెట్ సంపూర్ణ పరిజ్ఞానం: ఈ మార్కెట్లో మార్కెట్ను గురించి సంపూర్ణ పరిజ్ఞానం కొనుగోలుదార్లకు, అమ్మకందార్లకు ఉంటుంది. ప్రతి కొనుగోలుదారుకు, అమ్మకందారుకు ధర తెలుస్తుంది.

ధర నిర్ణయం: మార్కెట్లో సప్లయ్, డిమాండ్ ను బట్టి వస్తువు ధరను నిర్ణయిస్తారు. మార్కెట్లోనికి అమ్మకానికి వచ్చే వస్తువులకు, కొనుగోలుదార్లు డిమాండ్ చేసే వస్తువులకు మధ్య సమతౌల్యాన్ని తెస్తుంది. సప్లయ్, డిమాండ్ సమానంగా ఉన్నచోట మార్కెట్ సమతౌల్యధరను నిర్ణయిస్తుంది. మార్కెట్ నిర్ణయించిన ధరను ఉత్పత్తిదారులు అనుసరిస్తారు.
AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం 2

పై పట్టికలో ధరలో మార్పులు జరిగినప్పుడు వస్తువు సప్లయ్, డిమాండ్లో కూడా మార్పులు జరిగాయి. వస్తువు ధర పెరిగినప్పుడు డిమాండ్ పరిమాణం తగ్గింది. అంటే ధరకు, డిమాండ్కు విలోమ సంబంధం ఉంది. అయితే ధర పెరిగితే సప్లయ్ పరిమాణం పెరిగింది. అనగా సపయ్కి, ధరకు ప్రత్యక్ష సంబంధం ఉంది. 3/- వద్ద సప్లయ్ డిమాండ్ సమానం అయినాయి. దీనిని సమతౌల్య ధర అంటారు. దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా తెలియజేయవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం 3

పై రేఖాపటంలో DD డిమాండ్ రేఖ, SS సప్లయేఖలు. ఈ రెండు ‘e’ బిందువు ఖండించుకున్నప్పుడు ధర OP గా, సప్లయ్, డిమాండ్ 0Q గా ఉన్నాయి. అందువల్ల OP సమతౌల్యపు ధర.

ప్రశ్న 3.
ఏకస్వామ్య పోటీలో ధర నిర్ణయాన్ని వివరించండి.
జవాబు:
ఈ. హెచ్. బాంబర్లిన్, జోన్ రాబిన్సన్ ఈ రకమైన మార్కెట్ విశ్లేషణను ప్రతిపాదించారు. ఈ మార్కెట్లో ఒక వస్తువుకు అనేకమంది అమ్మకందార్లు ఉంటారు. కాని కొన్ని అంశాలలో వస్తువుల మధ్య స్వల్పమైన తేడాలుంటాయి. ఏకస్వామ్యం, పరిపూర్ణ పోటీ లక్షణాలు ఈ మార్కెట్లో కలిసి ఉంటాయి. అందువల్ల దీనిని ఏకస్వామ్య పోటీ అంటారు.

లక్షణాలు:
1. తక్కువ సంఖ్యలో సంస్థలు: సంపూర్ణ పోటీలోని సంస్థల కంటే ఏకస్వామ్య పోటీలో సంస్థల సంఖ్య తక్కువ. సంస్థకు కొంత మేరకు ఏకస్వామ్య అధికారం ఉంటుంది.

2. వస్తు వైవిధ్యం: ఈ సంస్థ ఉత్పత్తి చేసిన వస్తువు ఇతర సంస్థల వస్తువులతో పోల్చినప్పుడు కొన్ని తేడాలుంటాయి. కొన్నిసార్లు ఈ తేడాలు అతిస్వల్పమైనవి అయినప్పటికి వినియోగదారులు వాటి మధ్య తేడా ఉన్నట్లుగా భావిస్తారు. ఈ తేడా రంగు, బ్రాండ్ నేమ్, ట్రేడ్మార్క్ వల్ల ఏర్పడవచ్చు. ఈ కారణం వల్ల ప్రతి వస్తువు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంటుంది.

3. ప్రవేశం, నిష్క్రమణ: ప్రతి సంస్థ తన వస్తు ఉత్పత్తిలో ఏకస్వామ్య అధికారాన్ని కలిగి ఉంటుంది. లాభాలు వచ్చినప్పుడు సంస్థలోకి ప్రవేశించుటకు, నష్టాలు వచ్చినప్పుడు సంస్థ నుండి నిష్క్రమించుటకు స్వేచ్ఛ కలదు.

AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం

4. అమ్మకం వ్యయాలు: ఏకస్వామ్య పోటీ మార్కెట్లో వస్తు భిన్నత్వం ఉంటుంది. అందువల్ల ధర ప్రాతిపదికగానే పోటీ ఉండదు. ప్రతి సంస్థ తమ వస్తువుల అమ్మకాలను ప్రకటనల ద్వారా, సేల్స్మెన్ నియామకం వంటి చర్యల ద్వారా పెంచుకొనడానికి ప్రయత్నిస్తుంది. వీటికి అయ్యే ఖర్చులను అమ్మకం వ్యయాలు అంటారు.

5. సంస్థ పరిశ్రమ: ఏకస్వామ్య పోటీలో సంస్థ వేరు, పరిశ్రమ వేరు. పరిశ్రమ అనగా కొన్ని సంస్థల సముదాయం.

6. అధిక డిమాండ్ వ్యాకోచత్వం: ఏకస్వామ్య పోటీలోని సంస్థకుండే డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి కిందకు వాలుతుంది. ఈ డిమాండ్ రేఖ అధిక వ్యాకోచత్వాన్ని కలిగి ఉంటుంది.

ధర నిర్ణయం: ఏకస్వామ్య పోటీలో ధర నిర్ణయం స్వల్పకాలంలోను, దీర్ఘకాలంలోను జరుగుతుంది. ఈ మార్కెట్లో స్వల్పకాలంలో సంస్థకు లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. కాని దీర్ఘకాలంలో సామాన్య లాభాలు మాత్రమే వస్తాయి. స్వల్పకాలంలో ఏకస్వామ్య పోటీలో ధర నిర్ణయం ఏకస్వామ్యంలో మాదిరిగా జరుగును. ‘ఏకస్వామ్యదారుడు వస్తు సప్లయ్ పై పూర్తి నియంత్రణ కలిగి ఉంటాడు. అంతేకాకుండా గరిష్ట లాభం వచ్చే విధంగా ధరను నిర్ణయించగలడు. దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం 4

పై రేఖాపటంలో ‘X’ అక్షంపై వస్తురాశిని, Y అక్షంపై ధరను చూపాము. AR సగటు రాబడి రేఖ, MR ఉపాంత రాబడిరేఖ. AC సగటు వ్యయరేఖ, MC ఉపాంత వ్యయరేఖ. MR రేఖ MC ని ‘E’ బిందువువద్ద ఖండించడం వల్ల, MC = MR అవుతుంది. కనుక OM ఉత్పత్తి వద్ద సంస్థ సమతౌల్యంలో ఉంది. E నుండి గీయబడిన లంబరేఖ ‘X’ అక్షంపైన వస్తురాశిని, AR రేఖపై వస్తువు ధరను తెలియజేయును. AR, ACల మధ్య తేడా సంస్థ లాభనష్టాలను సూచించును. AC కంటే AR ఎక్కువగా ఉంటే అసాధారణ లాభాలు వచ్చును. పై రేఖాపటంలో OM వస్తురాశిని ఉత్పత్తి చేయడానికి అయ్యే వ్యయం OSRM వచ్చే ఆదాయం OPQM.
మొత్తం లాభం = మొత్తం రాబడి – మొత్తం వ్యయం
= OPQM – OSRM
= PQRS

PQRS పై రేఖాపటంలో సంస్థ ఆర్జించే లాభాలు.

ప్రశ్న 4.
ఏకస్వామ్య మార్కెట్ను నిర్వచించి, ఏకస్వామ్యంలో ఉత్పత్తిదారుడు ధరను ఏ విధంగా నిర్ణయిస్తాడు ?
జవాబు:
అసంపూర్ణ పోటీ మార్కెట్లో ఏకస్వామ్యం ఒకటి. దీనినే గుత్తాధిపత్యం అంటారు. ఒక వస్తువుకు ఒకే అమ్మకందారుడుండి, ఆ వస్తువుకు సన్నిహిత ప్రత్యామ్నాయాలు లేని మార్కెట్ను ఏకస్వామ్య మార్కెట్ అంటారు. కనుక ఏకస్వామ్యదారుడు వస్తువు సప్లెని, వస్తువు ధరను నియంత్రించగలడు. కాని రెండింటినీ ఒకే సమయంలో నియంత్రించలేడు. ఉత్పత్తిని నియంత్రిస్తే మార్కెట్ ధరను స్వీకరిస్తాడు. మార్కెట్ ధరను నిర్ణయిస్తే ఉత్పత్తిని మార్కెట్కు వదిలివేస్తాడు.

లక్షణాలు:

  1. మార్కెట్లో ఒక సంస్థ మాత్రమే వస్తూత్పత్తిని చేస్తుంది.
  2. ఈ మార్కెట్లో వస్తువులకు సమీప ప్రత్యామ్నాయాలుండవు.
  3. ఈ మార్కెట్లో సంస్థ, పరిశ్రమ ఒక్కటే.
  4. మార్కెట్లోనికి నూతన సంస్థలు ప్రవేశించడానికి వీలులేని నిబంధనలుంటాయి.
  5. ఏకస్వామ్యదారుడే వస్తుధరను, వస్తు సప్లయ్న నియంత్రిస్తాడు.

AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం

ధర నిర్ణయం: గరిష్ట లాభాలను ఆర్జించటం ఏకస్వామ్య సంస్థ ధ్యేయం. ఏకస్వామ్యంలో ఉత్పత్తిదారుడు వస్తూత్పత్తిని తగ్గిస్తూ ధరను పెంచగలడు. వస్తూత్పత్తిని పెంచుతూ ధరను తగ్గించగలడు. ఈ విధమైన ధర నిర్ణయం వల్ల ఏకస్వామ్యదారుడు గరిష్ట లాభాలను ఆర్జిస్తాడు. ఏకస్వామ్యంలో కూడా ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమైన పరిస్థితిలో ఏకస్వామ్య సంస్థ సమతౌల్యంలో ఉంటుంది. ఏకస్వామ్యంలో ధర నిర్ణయాలు క్రింది రేఖాపటం ద్వారా తెలుసుకోవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం 5

పై రేఖాపటంలో ‘X’ అక్షంపై ఉత్పత్తి పరిమాణంను, Y అక్షంపై వ్యయం రాబడిని చూపాము. AR సగటు రాబడి రేఖ, MR ఉపాంత రాబడిరేఖ, AC సగటు వ్యయరేఖ, MC ఉపాంత వ్యయరేఖ. MR రేఖ MC ని ‘E’ బిందువు వద్ద ఖండించడం వల్ల, MC = MR అవుతుంది. కనుక OM ఉత్పత్తి వద్ద సంస్థ సమతౌల్యంలో ఉంది. E నుండి గీయబడిన రేఖ ‘X’ అక్షంపైన ఉత్పత్తి పరిమాణంను, AR రేఖపై వస్తువు ధరను తెలియజేయును. AR, ACల మధ్య తేడా సంస్థ లాభనష్టాలను సూచించును. AC కంటే AR ఎక్కువగా ఉంటే అసాధారణ లాభాలు వచ్చును. పై రేఖాపటంలో OM వస్తురాశిని ఉత్పత్తి చేయడానికి అయ్యే వ్యయం OCBM వచ్చే ఆదాయం OPAM.
మొత్తం లాభం = మొత్తం రాబడి – మొత్తం వ్యయం
= OCBM – OPAM
= CPAB
CPAB పై రేఖాపటంలో సంస్థ ఆర్జించే లాభాలు.

ప్రశ్న 5.
సంపూర్ణ పోటీలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక సమతుల్య స్థితిని పటం సహాయంతో వివరించండి.
జవాబు:
సంస్థ సమతౌల్యం: సంపూర్ణ పోటీలో వస్తువు ధరను మార్కెట్ను నిర్ణయిస్తుంది. ఉత్పత్తిదారుడు ఈ ధరను స్వీకరించి తన ఉత్పత్తిని నిర్ణయించుకుంటాడు. ఒక సంస్థ అధిక లాభాలను పొందాలనుకుంటుంది. కాబట్టి ఎక్కువ లాభాలనిచ్చే ఉత్పత్తిని ఎంపిక చేస్తుంది. అధిక లాభాలనిచ్చే ఉత్పత్తిని చేసినప్పుడు సంస్థ సమతౌల్య స్థితిలో ఉంటుంది. సమతౌల్య ఉత్పత్తి చేసే సంస్థ తన ఉత్పత్తిని మార్చుకోవడానికి ఇష్టపడడు. ఈ స్థితి నుంచి ఉత్పత్తిని పెంచుకోవడానికి, తగ్గించడానికి ఇష్టపడదు. సంస్థ సమతౌల్య స్థితిని రెండు కాలాల్లో వివరిస్తారు.

అవి

  1. స్వల్పకాలం,
  2. దీర్ఘకాలం

స్వల్పకాల సమతౌల్యం: స్వల్పకాలంలో సంస్థ స్థిర ఉత్పత్తి కారకాలు అంటే యంత్రాలు, భవనాలు మొదలగునవి మార్చలేదు. చరకారకాలు మాత్రమే మార్చి ఉత్పత్తిని పెంచుకుంటుంది. స్వల్పకాలంలో ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమైనప్పుడు స్వల్పకాలిక సమతౌల్య ఉత్పత్తి జరుగుతుంది. స్వల్పకాలంలో సంస్థ గరిష్ట లాభాన్ని లేదా సాధారణ లాభాన్ని లేదా నష్టాన్ని పొందుతుంది. దీనిని ఈ క్రింది రేఖా పటాల ద్వారా తెలియజేయవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం 6

A రేఖాపటంలో ‘OX’ అక్షంమీద ఉత్పత్తి పరిమాణంను, ‘OY’ అక్షం మీద ధరను చూపినాము.

B రేఖాపటంలో OX అక్షంపై ఉత్పత్తి పరిమాణాన్ని, OY పై వ్యయం, రాబడిని కొలుస్తాం. A రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద డిమాండ్, సప్లయ్ సమానమయినాయి. అందువల్ల పరిశ్రమలో OP సమతౌల్యపు ధర నిర్ణయించబడుతుంది. ఇదే ధరను సంస్థ అంగీకరిస్తుంది. దీనిని సమతౌల్య ధర నిర్ణయించబడుతుంది. ఇదే ధరను సంస్థ అంగీకరిస్తుంది. దీనిని సంస్థలో క్షితిజ రేఖ ద్వారా చూపించడం జరిగింది. దీనినే ‘ధర రేఖ’ అంటారు.

సంస్థలో ఉపాంత వ్యయం = ఉపాంత రాబడి అయినప్పుడు ఉండే ఉత్పత్తి వల్ల లాభాలు గరిష్టంగా ఉంటాయి. రేఖాపటంలో 0Q ఉత్పత్తి దగ్గర లాభాలు గరిష్టంగా ఉంటాయి. సమతౌల్య బిందువు ‘E’ దగ్గర ధర P; సగటు వ్యయం; QB సగటు లాభం BA.

మొత్తం లాభం PABC కి సమానం. అనగా OQ వస్తుపరిమాణంను ఉత్పత్తి చేయటానికి అయిన వ్యయం OCBQ; రాబడి OPAQ.

AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం

దీర్ఘకాలిక సమతౌల్యం: దీర్ఘకాలంలో సంస్థ ఉత్పాదకాలన్నింటికి మార్చడం ద్వారా ఉత్పత్తిలో మార్పులు చేస్తుంది. సంస్థ దీర్ఘకాలంలో కూడా ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమైనచోట సమతౌల్యం ఉత్పత్తి చేస్తుంది. దీర్ఘకాలంలో ఒక ముఖ్యమైన అంశం సంస్థల ప్రవేశం, నిష్క్రమణ ఈ కాలంలో జరుగుతుంది. ఈ కారణం వల్ల ప్రతి సంస్థ దీర్ఘకాలంలో సాధారణ లాభాలు మాత్రమే పొందుతుంది. దీర్ఘకాలిక సమతౌల్యాన్ని ఈ క్రింది రేఖా పటం ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం 7

పై రేఖాపటంలో ‘OX’ అక్షంపై వస్తుపరిమాణాన్ని, ‘OY’ అక్షంపై ధర వ్యయం, రాబడులను కొలుస్తాము. పై రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద AR = MR = LMC = LACగా ఉంది. అప్పుడు ధర OPగా పరిమాణం Q గా ఉండును.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సంపూర్ణ పోటీ లక్షణాలు ఏమిటి ?
జవాబు:
అత్యధిక సంఖ్యలో ఉత్పత్తిదార్లు, వినియోదార్లుండే మార్కెట్ను సంపూర్ణ పోటీ మార్కెట్ అంటారు. మార్కెట్ అంతటా ఒకే ధర ఉంటుంది.

సంపూర్ణ పోటీ లక్షణాలు:
1. అధిక సంఖ్యలో కొనుగోలుదార్లు, అమ్మకందార్లు: ఈ మార్కెట్లో అధిక సంఖ్యలో కొనుగోలుదార్లు, అమ్మకందార్లు ఉంటారు. ఏ ఒక్క అమ్మకందారుడు కాని, కొనుగోలుదారుడు కాని మార్కెట్ ధరను ప్రభావితం చేయలేడు. ఒక వస్తువు ధర దానికుండే డిమాండ్, సప్లయ్లు నిర్ణయిస్తాయి. ఈ ధరను కొనుగోలుదారుడు, అమ్మకందారుడు అంగీకరించాలి. సంస్థ మార్కెట్ ధరను అనుసరించాలి.

2. సజాతీయ వస్తువులు: ఈ మార్కెట్లో వస్తువులన్నీ సజాతీయంగా ఉంటాయి. ఈ వస్తువులకుండే జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం సంపూర్ణం. అందువల్ల మార్కెట్ అంతటా ఒకే ధర ఉంటుంది.

3. ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి స్వేచ్ఛ ఈ మార్కెట్లో నూతన పరిశ్రమలు ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి స్వేచ్ఛ ఉంటుంది. సంస్థ గరిష్ట లాభాలు పొందుతున్నప్పుడు నూతన సంస్థలు ప్రవేశించుటకు, నష్టాలు వచ్చేటప్పుడు నిష్క్రమించుటకు స్వేచ్చ కలదు.

4. సంస్థ, పరిశ్రమ వేరు వేరు: ఈ మార్కెట్లో సంస్థ, పరిశ్రమ వేరువేరుగా ఉంటాయి. సంస్థ అంటే వస్తువులను ఉత్పత్తి చేసే యూనిట్. పరిశ్రమ అనగా సంస్థల సముదాయం.

5. రవాణా ఖర్చులు ఉండవు: రవాణా ఖర్చు ఉండనందువల్ల మార్కెట్ అంతటా వస్తువుకు ఒకే ధర ఉంటుంది.

6. ఉత్పత్తి కారకాలకు, వస్తువులకు సంపూర్ణ గమనశీలత ఈ మార్కెట్లో ఉత్పత్తి కారకాలు ఒక సంస్థనుంచి మరొక సంస్థకు వెళ్ళవచ్చు. అదే విధంగా వస్తు మార్కెట్లో పూర్తి గమనశీలత ఉంటుంది.

7. మార్కెట్ సంపూర్ణ పరిజ్ఞానం ఈ మార్కెట్లో మార్కెట్ను గురించి సంపూర్ణ పరిజ్ఞానం కొనుగోలుదార్లకు, అమ్మకందార్లకు ఉంటుంది. ప్రతి కొనుగోలుదారుకు, అమ్మకందారుకు ధర తెలుస్తుంది.

ప్రశ్న 2.
ధర విచక్షణ అంటే ఏమిటి ? ధర విచక్షణలోని వివిధ రకాలను తెలపండి ?
జవాబు:
ఒకే రకమైన వస్తువులను వివిధ ధరలకు, వివిధ వినియోగదారులకు విక్రయించడమే ధర విచక్షణ. ఏకస్వామ్య దారుడు మాత్రమే విచక్షణ చేయగలుగుతాడు.

“సాంకేతికంగా ఒకే రకమైన వస్తువులను వాటి ఉపాంత వ్యయాలకు అనుపాతం కాని ధరలకు అమ్మడాన్ని ధర విచక్షణ” అని స్పిగ్లర్ నిర్వచించాడు. జోన్ రాబిన్సన్ అభిప్రాయంలో “ఒకే నియంత్రణ క్రింద తయారైన ఒకే రకం వస్తువులను వివిధ కొనుగోలుదార్లకు వివిధ ధరలకు అమ్మే చర్యే ధర విచక్షణ. ఏ.సి. పిగూ ధర విచక్షణను 1వ డిగ్రీ, 2వ డిగ్రీ, 3వ డిగ్రీ అని వర్గీకరించాడు. ఈ ధర విచక్షణ మూడు రకాలుగా ఉంటుంది. అవి.

AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం

1. వ్యక్తిగత విచక్షణ: వినియోగదారుల వినిమయ సామర్థ్యాన్ని బట్టి ధరలను విధిస్తే దానిని వ్యక్తిగత విచక్షణఅని అంటారు.
ఉదా: ఒక పుస్తకాన్ని ఒక వ్యక్తికి 20/-కు అమ్మితే, అదే పుస్తకాన్ని మరో వ్యక్తికి కౌ 15/- కు అమ్ముతాడు.

2. ఉపయోగాన్ని బట్టి విచక్షణ: వస్తువు ఉపయోగాన్ని బట్టి ఒకే వస్తువుకు వేరువేరు ధరలను విధిస్తారు. ఈ రకమైన విచక్షణ ఎక్కువగా ప్రభుత్వ రంగ సంస్థలో చూడవచ్చు.

ఉదా: విద్యుచ్ఛక్తి పరిశ్రమలకు, ఒక రకమైన రేటును, గృహవసరాలకు తక్కువ ఛార్జీలను విధిస్తుంది. 3. మార్కెట్ల మధ్య విచక్షణ: మార్కెట్ల మధ్య దూరం ఎక్కువగా ఉండి, వస్తువు డిమాండ్లో తేడాలు ఉన్నప్పుడు మార్కెట్ల మధ్య విచక్షణ పాటించడం జరుగుతుంది.
ఉదా: వస్తువుల ధరలను స్వదేశీ మార్కెట్లో ఎక్కువగాను, విదేశీ మార్కెట్లో తక్కువగా విధించడం జరుగుతుంది.

ప్రశ్న 3.
పరిమిత స్వామ్యాన్ని నిర్వచించండి.
జవాబు:
Oligopoly అనే పదం గ్రీకు పదాలయిన ‘Oligos’, ‘Pollein’ అనే పదాల నుండి గ్రహించడమైంది. ‘Oligos’ అంటే కొద్దిమంది అని, Pollein అంటే అమ్మడం అని అర్థం. పరిమిత స్వామ్యంలో కొద్దిమంది అమ్మకందార్లు ఉండి వారు సజాతీయమైన వస్తూత్పత్తినిగాని లేదా వైవిధ్యం ఉన్న వస్తూత్పత్తిని గాని చేస్తూ ఉంటారు. ఈ కొద్దిమంది అమ్మకందారుల మధ్య పోటీ ఉంటుంది. పరిశ్రమలోని ఇతర సంస్థలపై ప్రతి సంస్థ ప్రత్యక్షంగా చెప్పుకోదగ్గ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

లక్షణాలు:

  1. వస్తువును అమ్మే సంస్థలు చాలా కొద్ది సంఖ్యలో ఉంటాయి.
  2. దీనిలో డిమాండ్ రేఖ అనిశ్చితత్వంగా ఉంటుంది.
  3. ధరల దృఢత్వం ఉంటుంది.
  4. ప్రకటనలపై అధిక వ్యయాన్ని చేస్తారు.
  5. సంస్థల మధ్య పరస్పర ఆధార సంబంధం ఉంటుంది.

ప్రశ్న 4.
సంపూర్ణ పోటీని, ఏకస్వామ్యాన్ని పోల్చండి.
జవాబు:
సంపూర్ణ పోటీలో అనేకమంది అమ్మకందారులు, కొనుగోలుదారులు ఉండి సజాతీయమైన వస్తువుల ఉత్పత్తి జరుగుతుంది. మార్కెట్లో నిర్ణయమైన ధరను సంస్థ అంగీకరిస్తుంది. కాని సంస్థకు ధర నిర్ణయంలో ప్రాధాన్యత ఉండదు. సంస్థ గరిష్ట లాభాలనైతే గరిష్ట స్థాయికి పెంచటానికి, నష్టాలనైతే కనిష్ట స్థాయికి తగ్గించటానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమయ్యేట్లు సంస్థ ప్రయత్నిస్తుంది. ఏకస్వామ్యంలో ఒక వస్తువుకు ఒకే ఉత్పత్తిదారుడుంటాడు. మార్కెట్లో తన వస్తువుకు ఎటువంటి సన్నిహిత ప్రత్యామ్నాయాలు లభించవు. సంస్థ వస్తువు ధరను, వస్తురాశిని నిర్ణయించగలదు. కాని ఒకే సమయంలో రెండు నిర్ణయాలను చేయలేదు. సంస్థ సమతౌల్యంలో ఉండటానికి ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానం అవ్వాలి.

AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం

ప్రశ్న 4.
సంపూర్ణ పోటీని, ఏకస్వామ్యాన్ని పోల్చండి.
జవాబు:
సంపూర్ణ పోటీ, ఏకస్వామ్యాల మధ్య పోలిక:

సంపూర్ణ పోటీ

  1. అత్యధిక సంఖ్యలో అమ్మకందార్లు ఉంటారు.
  2. సంస్థలకు ప్రవేశానికి, నిష్క్రమించటానికి స్వేచ్ఛ ఉంటుంది.
  3. ఇక్కడ వస్తువులన్నీ సజాతీయాలు.
  4. ఈ మార్కెట్లో సంస్థ, పరిశ్రమకు తేడా ఉంది.
  5. మార్కెట్ వస్తువు ధరను నిర్ణయిస్తుంది. ఉత్పత్తి దారుడు ధరను స్వీకరిస్తాడు.
  6. మార్కెట్లో ఒకే ధర ఉంటుంది.
  7. సగటు, ఉపాంత రాబడులు సమానం. ఇవి ‘X’ అక్షంకు సమాంతరంగా ఉంటాయి.

ఏకస్వామ్యం

  1. ఒకే ఒక్క ఉత్పత్తిదారుడు ఉంటాడు.
  2. నూతన సంస్థల ప్రవేశాలకు స్వేచ్ఛ ఉండదు.
  3. ఇక్కడ సజాతీయత ఉండదు. ఉత్పత్తికి సమీప ప్రత్యామ్నాయాలు ఉండవు.
  4. ఈ మార్కెట్లో సంస్థ, పరిశ్రమ రెండు ఒక్కటే.
  5. ఉత్పత్తిదారుడే ధరను నిర్ణయిస్తాడు.
  6. మార్కెట్లో ధర విచక్షణ చేస్తాడు.
  7. సగటు రాబడి, ఉపాంత రాబడి కంటే ఎక్కువగా ఉంటుంది.

ఈ రెండు రేఖలు ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మార్కెట్
జవాబు:
సాధారణంగా మార్కెట్ అంటే వస్తువుల క్రయ, విక్రయాలు జరిగే ప్రదేశం అని భావిస్తాం. కాని అర్థశాస్త్రంలో మార్కెట్ అంటే అమ్మకందార్లు, కొనుగోలుదార్లు కలిసి ధరలు నిర్ణయించుకోవటానికి ఉపయోగపడే యంత్రాంగం.

ప్రశ్న 2.
స్థానిక మార్కెట్
జవాబు:
ఒక వస్తువు సప్లై, డిమాండ్ కేవలం ఒక ప్రదేశానికి లేదా ఒక ప్రాంతానికి పరిమితమై ఉండే దానిని స్థానిక మార్కెట్ అంటారు. ఏ ప్రాంతంలో అవి లభిస్తాయో వాటి డిమాండ్, సప్లయ్లు అవి లభించే ప్రాంతానికే పరిమితమై ఉంటాయి.
ఉదా: పాలు, పూలు మొదలగునవి.

ప్రశ్న 3.
జాతీయ మార్కెట్
జవాబు:
వస్తువుకు దేశ వ్యాప్తంగా సప్లై, డిమాండ్ ఉంటే దానికి జాతీయ మార్కెట్ ఉందంటారు. స్థానిక మార్కెట్లో లభించే వస్తువులకు కూడా జాతీయ మార్కెట్ ఉండవచ్చు.
ఉదా: గోధుమలు, పత్తి మొదలగునవి.

AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం

ప్రశ్న 4.
ఏకస్వామ్యం [Mar. ’16]
జవాబు:
అసంపూర్ణ పోటీలో ఏకస్వామ్యం ఒకటి. దీనినే గుత్తాధిపత్యం అంటారు. మార్కెట్లో ఒకే ఒక అమ్మకందారుడుండి, సమీప ప్రత్యామ్నాయ వస్తువులు లభ్యంకాని మార్కెట్ని ఏకస్వామ్యం అంటారు. ఈ మార్కెట్లో ధర విచక్షణకు అవకాశం ఉంటుంది.

ప్రశ్న 5.
ఏకస్వామ్య పోటీ
జవాబు:
ఈ మార్కెట్లో వస్తు వైవిధ్యం ఉంటుంది. అనగా అనేక సంస్థలు కొంత భేదంతో ఒకే రకమైన వస్తువులను ఉత్పత్తి చేస్తాయి. అవన్నీ సన్నిహిత ప్రత్యామ్నాయాలు.
ఉదా: బూస్ట్, బోర్నవిటా మొదలగునవి.

ప్రశ్న 6.
పరిమిత స్వామ్యం
జవాబు:
ఈ మార్కెట్లో ఉత్పత్తిదారులు పరిమితంగా ఉంటారు. సంస్థలు స్వతంత్రంగా లేదా ఉమ్మడి అంగీకారంతో సంస్థలు వస్తువుల ధరలను నిర్ణయిస్తాయి.

ప్రశ్న 7.
ద్విదాధిపత్యం
జవాబు:
ఈ మార్కెట్లో ఉత్పత్తిదారులు ఇద్దరుంటారు. వీరి మధ్య పోటీ అధికంగా ఉంటుంది. ఒక సంస్థ తన మార్కెట్ విధాన రూపకల్పనలో తనకు పోటీగా ఉన్న సంస్థ ప్రవర్తనను కూడా పరిగణనలోనికి తీసుకోవలసి ఉంది.

ప్రశ్న 8.
సమతౌల్యపు ధర [Mar. ’15]
జవాబు:
ఒక సంస్థ తన తరహాని లేదా పరిమాణాన్ని ఏవిధంగాను మార్చటానికి ఇష్టపడని పరిస్థితిని సమతౌల్యస్థితి అంటారు. ఏ ధర వద్ద సప్లయ్, డిమాండ్ సమానంగా ఉంటాయో దానిని సమతౌల్యపు ధర అని అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం

ప్రశ్న 9.
ధర విచక్షణ [Mar ’17, 16, ’15]
జవాబు:
ఒకే రకమైన వస్తువులను వివిధ ధరలకు, వివిధ వినియోగదారులకు విక్రయించడాన్ని ధర విచక్షణ అంటారు. ఏకస్వామ్యదారుడు ధర విచక్షణ చేయగలుగుతాడు. ఆ వస్తువు మార్కెట్ని వివిధ మార్కెట్లుగా విభజించి, ఆ మార్కెట్లో తన వస్తువుకున్న డిమాండ్ వ్యాకోచత్వాలను పరిశీలించి ధర విచక్షణ చేస్తాడు.

ప్రశ్న 10.
అమ్మకపు వ్యయాలు [Mar 17]
జవాబు:
సంస్థలు ఉత్పత్తి చేసిన వస్తువుల అమ్మకాలను మార్కెట్లో పెంచుకోవడానికి చేసే ఖర్చులను అమ్మకపు వ్యయాలు అని అంటారు. పత్రికలు, టెలివిజన్, ప్రదర్శనలు మొదలగునవి వాటి కోసం సంస్థ అధిక మొత్తంలో అమ్మకాల అభివృద్ధికి ఖర్చు చేస్తుంది.

అదనపు ప్రశ్నలు

ప్రశ్న 11.
సంస్థ యొక్క సమతౌల్యం
జవాబు:
ఒక సంస్థ ఉత్పత్తి పరిమాణాన్ని పెంచుటకుగాని, తగ్గించుటకుగాని ఇష్టపడని స్థితిని సమతౌల్య స్థితి అంటారు. ఒక సంస్థలో ఉపాంత వ్యయం, ఉపాంత రాబడులు సమానమైతే సంస్థ సమతౌల్యంలో ఉంటుంది.

ప్రశ్న 12.
వస్తు వైవిధ్యం
జవాబు:
ఒక సంస్థ ఉత్పత్తి చేసిన వస్తువును ఇతర సంస్థలకు చేసిన వస్తువులతో పోల్చితే స్వల్ప తేడాలు ఉంటాయి. జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్యం అధికంగా ఉంటుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం

ప్రశ్న 13.
కార్టెల్స్
జవాబు:
సంస్థలు తమ మధ్య పోటీని తగ్గించుకోవడానికి, సంస్థలన్నీ కలిసి ఒక అంగీకారంతో ఉత్పత్తిని, ధరను నిర్ణయించుకోనే వ్యవస్థ.

AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి సిద్ధాంతం Textbook Questions and Answers.

AP Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి సిద్ధాంతం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చరానుపాతాల సూత్రాన్ని వివరించండి. [Mar. ’17, ’16, ’15]
జవాబు:
చరానుపాత సూత్రం స్వల్పకాలానికి చెందినది. ఈ సూత్రాన్ని రికార్డో, మాల్టస్, మార్షల్ వంటి సంప్రదాయ ఆర్థికవేత్తలు విశేష ప్రాముఖ్యమిచ్చారు. సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఈ సూత్రాన్ని వ్యవసాయ రంగానికే పరిమితం చేశారు. స్పిగర్ అనే ఆర్థికవేత్త ఒక ఉత్పాదకాన్ని సమాన పరిమాణంలో పెంచుతూ మిగతా కారకాలను స్థిరంగా ఉంచితే ఒక స్థాయి తరువాత ఉపాంత ఉత్పాదకత క్షీణిస్తుంది.

ఈ సిద్ధాంతం కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి, ఒక ఉత్పత్తి సాధనం పరిమాణంలో మార్పులు చేస్తూ ఉన్నప్పుడు ఏ అనుపాతంలో మారుతుందో తెలియజేయును.

చరానుపాత సూత్రం ప్రకారం మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తులు ప్రారంభంలో పెరిగి తరువాత అవి వివిధ ఉత్పత్తి స్థాయిల వద్ద గరిష్ట స్థాయికి చేరతాయి. మొదటగా ఉపాంత ఉత్పత్తి తరువాత సగటు ఉత్పత్తి, ఆ తరువాత మొత్తం ఉత్పత్తి క్షీణిస్తాయి.

ప్రమేయాలు:

  1. ఈ సూత్రం స్వల్పకాలానికి వర్తిస్తుంది.
  2. సాంకేతిక విజ్ఞానంలో మార్పు ఉండదు.
  3. ఉత్పత్తి కారకాల సమ్మేళనం మార్చడం సాధ్యమవుతుంది.
  4. శ్రమ మాత్రమే చరఉత్పత్తి కారకం మిగతా ఉత్పత్తి కారకాలన్నీ స్థిరం.
  5. ఉత్పత్తిని భౌతిక యూనిట్ల రూపంలో కొలవవచ్చు.
  6. శ్రమ సజాతీయంగా ఉంటుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం

క్షీణ ప్రతిఫల` సూత్రాన్ని ఈ క్రింది ఉదాహరణ ద్వారా వివరించవచ్చు. భూమిని స్థిరంగా ఉంచి మరొక సాధనం (శ్రమ)ను పెంచుకుంటూ పోతే, ఉత్పత్తిలో వచ్చే మార్పును మూడు దశలుగా వర్గీకరించవచ్చు. ఈ మూడు దశలలో మొత్తం ఉత్పత్తి, ఉపాంత, సగటు ఉత్పత్తుల మార్పులను పరిశీలించవచ్చు. దీనిని ఈ క్రింది పట్టిక ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 1

పై పట్టికలో మొత్తం ఉత్పత్తి ప్రారంభంలో పెరుగుతున్న రేటులో, తరువాత తగ్గుతున్న రేటులో పెరుగుతుంది. 7వ శ్రామికుని ఉపయోగించినప్పుడు మొత్తం ఉత్పత్తి గరిష్టమై తరువాత క్షీణిస్తుంది. సగటు ఉత్పత్తి 3వ శ్రామికుడు వరకు పెరిగి 4వ శ్రామికుని దగ్గర గరిష్ట స్థాయికి చేరి తరువాత క్షీణిస్తుంది. 7వ శ్రామికుని దగ్గర మొత్తం ఉత్పత్తి గరిష్టమైనప్పుడు ఉపాంత ఉత్పత్తి శూన్యమైంది. 8వ శ్రామికుని వద్ద మొత్తం ఉత్పత్తి క్షీణించగా ఉపాంత ఉత్పత్తి ఋణాత్మకమైంది. దీనిని ఈ ప్రక్క రేఖా పటం ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 2

రేఖాపటంలో TP రేఖ A బిందువు వరకు వేగంగా పెరుగుతూ C బిందువు వద్ద గరిష్టమై తరువాత క్షీణిస్తుంది. “E” బిందువు వద్ద AP, MP రేఖలు ఖండించుకోవడం జరిగింది. మొత్తం ఉత్పత్తి C వద్ద గరిష్టంకాగా AP క్షీణించగా, MP శూన్యమైనది. TP క్షీణించగా, MP ఋణాత్మకమైంది. చరానుపాత సూత్రంలోని ఉత్పత్తి దశలను మూడు దశలుగా విభజించవచ్చు.

  1. పెరుగుతున్న ప్రతిఫలాలు
  2. క్షీణ ప్రతిఫలాలు
  3. రుణాత్మక ప్రతిఫలాలు

ప్రమేయాలు :

  1. పెరుగుతున్న ప్రతిఫలాలు: ఈ దశలో మొత్తం ఉత్పత్తి ఉపాంత ఉత్పత్తి కంటే అధికంగాను, ఉపాంత ఉత్పత్తి సగటు కంటే ఎక్కువగాను ఉండును.
  2. క్షీణ ప్రతిఫలాలు: ఈ దశలో మొత్తం ఉత్పత్తి తగ్గుతున్న రేటులో పెరుగుతుంది. సగటు, ఉపాంత ఉత్పత్తులు క్షీణిస్తాయి.
  3. రుణాత్మక ప్రతిఫలాలు: ఈ దశలో మొత్తం, సగటు ఉత్పత్తులు క్షీణించగా ఉపాంత ఉత్పత్తి ఋణాత్మకం అవుతుంది.

ప్రశ్న 2.
తరహాననుసరించిన ప్రతిఫలాల సూత్రాన్ని వివరించండి.
జవాబు:
దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి సాధనాలను ఒక అనుపాతంలో మార్చినప్పుడు ఉత్పత్తి ఏ అనుపాతంలో మార్పు చెందుతుందో తెలియజేసే దానిని తరహాననుసరించి ప్రతిఫలాలు అంటారు. మొత్తం ఉత్పత్తి కారకాలను మారిస్తే ఉత్పత్తిలో మూడు దశలు కనిపిస్తాయి.

  1. తరహాననుసరించి పెరుగుతున్న ప్రతిఫలాలు
  2. తరహాననుసరించి స్థిర ప్రతిఫలాలు
  3. తరహాననుసరించి క్షీణ ప్రతిఫలాలు

ప్రమేయాలు:

  1. ఉత్పత్తి కారకాలన్నీ చరం.
  2. సాంకేతిక పరిజ్ఞానం స్థిరం.
  3. ఉత్పత్తిని భౌతికరూపంలో కొలవవచ్చు.
  4. సంపూర్ణ పోటీ ఉంటుంది.
  5. శ్రామికులకు లభించే పనిముట్లు, సాధనాలు ఇవ్వబడ్డాయి.

AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం

పై ప్రమేయాలకు లోబడి అన్ని ఉత్పత్తి కారకాలను ఒకే నిష్పత్తిలో పెంచినప్పుడు ఉత్పత్తి తరహా విస్తరిస్తుంది. దీనిని ఈ క్రింది పట్టిక ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 3

పట్టికలో 1, 2వ శ్రామికులను వాడినప్పుడు మొత్తం ప్రతిఫలాలు రెండు రెట్లకంటే ఎక్కువగా ఉన్నాయి. ఇది పెరుగుతున్న ప్రతిఫలాలను తెలుపును. అంటే ఉత్పత్తిలో పెరుగుదల కన్నా ఉత్పాదకతలో పెరుగుదల ఎక్కువ. 3, 4 శ్రామికులను వినియోగిస్తే ఉపాంత ఉత్పత్తి 11 యూనిట్లుగా ఉంది. దీనిని స్థిర ప్రతిఫలాల దశ అంటారు. అంటే ఉత్పత్తిలో పెరుగుదల, ఉత్పాదకత పెరుగుదల రెండు సమానం. ఇక 5, 6 శ్రామికులను వాడినప్పుడు మొత్తం ప్రతిఫలాలు తగ్గగా ఉపాంత ప్రతిఫలాలు క్షీణించాయి. దీనిని క్షీణ ప్రతిఫలాల దశ అంటారు. అనగా ఉత్పత్తిలో పెరుగుదల రేటు ఉత్పాదకత పెరుగుదల రేటు కన్నా తక్కువ.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 4

పై రేఖాపటంలో AD రేఖ తరహాననుసరించిన ప్రతిఫలాలు A నుండి B వరకు పెరుగుతున్న ప్రతిఫలాలు, B నుంచి C కి స్థిర ప్రతిఫలాలు, C నుంచి D కి క్షీణ ప్రతిఫలాలు ఉన్నాయి.

ఉత్పత్తిదారుడు వివిధ ప్రతిఫలాలు పొందడానికి కారణాలు

  1. శ్రమ విభజన, ప్రత్యేకీకరణ వల్ల పెరుగుతున్న ప్రతిఫలాలు ఏర్పడతాయి.
  2. సంస్థ విస్తరించడం వల్ల ఉత్పత్తి కారకాల అసమర్థత, అజమాయిషీ లోపం వల్ల క్షీణ ప్రతిఫలాలు ఏర్పడతాయి.

ప్రశ్న 3.
అంతర్గత ఆదాలు – బహిర్గత ఆదాలకు ఉన్న తేడాలను వ్రాయండి.
జవాబు:
పరిశ్రమ విస్తరణ వల్ల పరిశ్రమలో ఉత్పత్తి పరిమాణం పెరిగి ఈ ఆదాలు సంస్థలకు లభిస్తాయి. పరిశ్రమలో ఉత్పత్తి తరహా పెరిగినప్పుడు ఏర్పడే ఆదాలను బహిర్గత ఆదాలంటారు.

1. సాంకేతిక ఆదాలు: మూలధన పరికరాలు ఇవ్వబడినవిగా భావిస్తే స్వల్పకాలంలో సాంకేతిక ఆదాలను పొందవచ్చు. సంస్థ ఎక్కువ సామర్థ్యం కలిగిన మంచి, పెద్ద యంత్రాలను, అధునాతన ఉత్పత్తి పద్ధతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల ఉత్పత్తి బాగా పెరుగుతుంది.

2. మార్కెటింగ్ ఆదాలు: పెద్ద సంస్థలు అధిక మొత్తంలో ముడిపదార్థాలు కొనడం వల్ల తమకు అనుకూల షరతుల ప్రకారం నాణ్యతగల ముడిసరుకులను సమయానికి పొందడం, తక్కువ రవాణా ఖర్చులు లాంటి ప్రయోజనాలు ఏర్పడతాయి.

3. నిర్వహణ ఆదాలు: పెద్ద సంస్థలు ప్రత్యేక నైపుణ్యం కలిగిన వ్యక్తులను నియమించుకుంటున్నందువల్ల విధి సంబంధిత ప్రత్యేకీకరణ పెరిగి సంస్థలో ఉత్పాదక సామర్థ్యం పెరిగి, ఉత్పత్తి పెరిగి సగటు యాజమాన్యపు వ్యయం తగ్గుతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం

4. విత్తపరమైన ఆదాలు: పెద్ద సంస్థకు ఉన్న మంచి పేరు, అధిక ఆస్తులవల్ల రుణాలను, సులభంగా తక్కువ వడ్డీ రేటుకు సకాలంలో పొందుతుంది. సంస్థ మూలధనాన్ని మార్కెట్లో షేర్లు, డిబెంచర్లు అమ్మడం వల్ల కూడా సేకరిస్తుంది.

5. నష్టాన్ని భరించే ఆదాలు: పెద్ద సంస్థలు చిన్న సంస్థల కంటే సులభంగా నష్టాన్ని విస్తరించుకోగలవు. ఒకరకం వస్తూత్పత్తిలో వచ్చిన నష్టాన్ని ఇతర రకాల వస్తూత్పత్తిలో వచ్చే లాభాలతో భర్తీ చేసుకోవచ్చు. మార్కెట్లను విస్తరించుకోవడం వల్ల ఒక మార్కెట్లో ఉన్న తక్కువ డిమాండ్ను ఇతర మార్కెట్లో ఉన్న అధిక డిమాండ్ తో భర్తీ చేసుకోవచ్చు.

6. పరిశోధన ఆదాలు: చిన్న సంస్థ కంటే పెద్ద సంస్థకు అధిక వనరులుంటాయి. అందువల్ల స్వంతంగా పరిశోధన ప్రయోగశాలను కలిగి శిక్షణ పొందిన పరిశోధకులను నియమించుకుంటుంది. వారు కనుగొనే కొత్త విషయాలు సంస్థ ఆస్తి. సంస్థ వీటిని ఉపయోగించుకొని వ్యయాన్ని తగ్గించుకొని ఉత్పత్తిని పెంచుకుంటుంది.

7. సంక్షేమ ఆదాలు: సంస్థలు శ్రామికులకు సంక్షేమ సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. పెద్ద సంస్థలు పనిచేయడానికి మంచి పరిస్థితులను, సంస్థ లోపల, బయట కల్పిస్తాయి. సంక్షేమ సౌకర్యాలకయ్యే వ్యయం ఎక్కువగా ఉన్నా దానివల్ల శ్రామికుల సామర్థ్యం పెరిగి, మొత్తం ఉత్పత్తి పెరగడానికి, ఉత్పత్తి వ్యయం తగ్గడానికి అవకాశం ఉంది.

బహిర్గత ఆదాలు: పరిశ్రమను ఒక ప్రాంతంలో స్థాపించినప్పుడు నవకల్పనలను ప్రవేశపెట్టడం వల్ల, ప్రత్యేకీకరణను ప్రవేశపెట్టడం వల్ల ఏర్పడే ఆదాలే బహిర్గత ఆదాలు. వీటిని పరిశ్రమలోని సంస్థలన్నీ అనుభవిస్తాయి.

1) కేంద్రీకరణ ఆదాలు: ఒక పరిశ్రమ ఒక ప్రాంతంలో కేంద్రీకరణ జరిగితే కొన్ని సౌకర్యాలు ఏర్పడతాయి. వీటిని సంస్థలన్నీ అనుభవిస్తాయి. నైపుణ్యం కలిగిన శ్రామికులు లభించటం, రవాణా, సమాచార సౌకర్యాలు ఏర్పరచడం, మెరుగుపరచటం, బ్యాంకులు, విత్త సంస్థలు, బీమా సంస్థలు తమ శాఖలను ఏర్పాటు చేసి సకాలంలో ఋణాలను తక్కువ వడ్డీ రేటుకు అందించడం, బీమా సౌకర్యాన్ని ఏర్పరచడం, సంస్థలకు విద్యుచ్ఛక్తిని సరిపడే పరిమాణంలో తక్కువ రేట్లకు సరఫరా చేయడం, ఇతర అవస్థాపనా సౌకర్యాలు ఏర్పరచడం, అనుషంగిక పరిశ్రమలు ఏర్పడి, కేంద్రీకృతమై పరిశ్రమకు కావలసిన వస్తువులను సరఫరా చేస్తాయి.

2) సమాచార ఆదాలు: ఒక సంస్థ కంటే పరిశ్రమలో ఎక్కువ వనరులు ఉన్నందువల్ల పరిశోధనా ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తుంది. పరిశ్రమకు చెందిన సమాచార కేంద్రం తమ ప్రచురణ ద్వారా ముడి సరుకుల లభ్యత, ఆధునిక యంత్రాలు, ఎగుమతి అవకాశాలు మొదలైన ఇతర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సంస్థలకు అందిస్తుంది.

3) ప్రత్యేకీకరణ ఆదాలు: పరిశ్రమ పరిమాణం పెరిగితే సంస్థలు వివిధ ప్రక్రియలలో ప్రత్యేకీకరణను సాధిస్తాయి. ఫలితంగా పరిశ్రమ మొత్తానికి లాభం చేకూరుతుంది. ఉత్పత్తి పెరిగి, ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి.

4) సంక్షేమ ఆదాలు: సంస్థ కంటే పరిశ్రమే శ్రామికులకు, సంక్షేమ సౌకర్యాలు కల్పించడంలో ముందు ఉంటుంది. ఫలితంగా శ్రామికుల సామర్థ్యం పెరిగి, పరిశ్రమలో ఉత్పత్తి పరిమాణాన్ని, నాణ్యతను పెంచవచ్చు. వీటివల్ల సంస్థ ఉత్పాదక సామర్థ్యం పెరిగి సగటు ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది.

ప్రశ్న 4.
సంస్థలోని స్వల్పకాలిక వ్యయాలను గురించి వ్రాయండి.
జవాబు:
ఒక ఉత్పత్తిదారుడు ఉత్పత్తికి సంబంధించిన నిర్ణయాలు రెండు కాలాల ఆధారంగా చేస్తాడు.

అవి 1. స్వల్పకాలం 2. దీర్ఘకాలం. స్వల్పకాలంలో కొన్ని ఉత్పత్తి కారకాలు అనగా శ్రామికులు,ముడిపదార్థాలను మార్చవచ్చు. అందువల్ల ఉత్పత్తిదారునికి స్వల్పకాలంలో స్థిర వ్యయాలు, చర వ్యయాలు ఉంటాయి.

1. స్థిర వ్యయాలు: ఉత్పత్తిదారుడు భవనాలు, యంత్రాలు, శాశ్వత కార్మికుల జీతాలు, బీమా మొదలైన వాటిపై చేసే వ్యయాలను స్థిర వ్యయాలు అంటారు. వస్తూత్పత్తిని పెంచినా, తగ్గించినా ఈ వ్యయాలు మారవు. వీటిని అనుబంధ వ్యయాలని, వ్యవస్థాపరమైన వ్యయాలని అంటారు.

2. చర వ్యయాలు: శ్రామికులు, ముడి పదార్థాలు మొదలైన వాటిపై చేసే వ్యయాలను చర వ్యయాలు అంటారు. ఈ వ్యయాలు ఉత్పత్తితో పాటు మారతాయి. దీనిలో ముడి పదార్థాలకు చెల్లించే ధర, శ్రామికుల వేతనాలు, రవాణా మొదలైన చెల్లింపులు ఉంటాయి. వీటిని ప్రత్యక్ష వ్యయాలని లేదా ప్రధాన వ్యయాలని అంటారు.
మొత్తం వ్యయం: స్వల్పకాలంలో స్థిర మరియు చర వ్యయాలను కలుపగా మొత్తం వ్యయం వస్తుంది.
మొత్తం వ్యయం = స్థిర వ్యయం + చర వ్యయం
TC = FC + VC
వాటిని ఈ క్రింది పట్టిక ద్వారా చూపవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 5

AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం

పై పట్టికలో ఉత్పత్తిని క్రమంగా పెంచుతూ పోయినపుడు స్థిర వ్యయాలు మారకుండా ఉన్నాయి. చర వ్యయాలు ఉత్పత్తితో పాటు మారుతున్నాయి. స్థిర, చర వ్యయాలను కలుపగా మొత్తం వ్యయం వస్తుంది. దీనిని క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 6

పై రేఖాపటంలో ‘X’ అక్షంపై ఉత్పత్తి యూనిట్లని, ‘Y’ అక్షంపై వ్యయాన్ని తీసుకోవడం జరిగింది. వివిధ వ్యయ రేఖల ఆకారం ఉత్పత్తికి, వివిధ వ్యయాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేయును. స్థిర వ్యయరేఖ (TFC) ‘X’అక్షానికి సమాంతరంగా ఉంది. స్వల్పకాలంలో ఉత్పత్తి పెరగటం వల్ల స్థిర వ్యయంలో ఎలాంటి మార్పు ఉండదు. చర వ్యయరేఖ మూలబిందువు దగ్గర మొదలవుతుంది. దీనికి కారణం ఉత్పత్తి శూన్యమయితే చర వ్యయం కూడా శూన్యమౌతుంది. ఉత్పత్తి పెరిగేకొద్ది చర వ్యయం కూడా పెరుగుతుంది.

సగటు వ్యయం: మొత్తం వ్యయాన్ని మొత్తం ఉత్పత్తితో భాగిస్తే వచ్చేది సగటు వ్యయం.
AC = TC/Q

ఉపాంత వ్యయం: ఉత్పత్తి ప్రక్రియలో అదనంగా ఒక యూనిట్ని పెంచినప్పుడు ఆ అదనపు యూనిట్ వల్ల మొత్తం వ్యయంలో వచ్చే మార్పు.
MC = ΔTC/ΔQ

ఈ క్రింది రేఖాపటం ద్వారా MC మరియు AC సంబంధాన్ని తెలియజేయవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 7

పై రేఖాపటంలో ‘X’ అక్షంపైన ఉత్పత్తిని, Y అక్షంపైన వ్యయాన్ని చూపినాము. SAC స్వల్పకాలిక వ్యయరేఖ, యూనిట్లు SMC స్వల్పకాలిక ఉపాంత వ్యయరేఖ. ఉత్పత్తి పెరుగుతుంటే మొదట సగటు వ్యయం తగ్గుతుంది. సగటు వ్యయం తగ్గుతున్నంత వరకు ఉపాంత వ్యయం, సగటు వ్యయంకన్నా తక్కువగా ఉంటుంది. ఉత్పత్తిని కొనసాగిస్తే సగటు వ్యయం కనిష్ట స్థాయికి వస్తుంది. ఉపాంత వ్యయం, సగటు వ్యయంతో సమానమౌతుంది. SAC మరియు SMC ఖండించుకున్న ‘A’ బిందువు వద్ద ఉత్పత్తి వ్యయం కనిష్టంగా ఉంటుంది.

అదనపు ప్రశ్నలు

ప్రశ్న 1.
సప్లయ్ సూత్రాన్ని వివరించండి.
జవాబు:
ఒక నిర్ణీత ధర వద్ద, నిర్ణీతకాలంలో మార్కెట్లో విక్రయదారుడు అమ్మడానికి ఇష్టపడే వస్తురాశిని సప్లయ్ అంటారు. సప్లయ్ సూత్రం వస్తు ధరకు, వస్తు సప్లయ్కి గల సంబంధాన్ని తెలియజేయును. ఇతర అంశాలు అన్ని స్థిరంగా ఉన్నప్పుడు వస్తుధర పెరిగితే సప్లయ్ పెరుగుతుంది. ధర తగ్గితే సప్లయ్ తగ్గుతుంది. ధరకి సప్లయి ్క అనులోమ సంబంధం ఉంటుంది. ఈ సప్లయ్ సూత్రాన్ని సప్లయ్ పట్టిక, సప్లయ్ రేఖ ద్వారా వివరించవచ్చు.

AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం

సప్లయ్ పట్టిక: ఒక నిర్ణీత సమయంలో వివిధ ధరలకు ఉత్పత్తిదార్లు ఎంతెంత వస్తు సరఫరా చేస్తారో సప్లయ్ పట్టిక తెలియజేయును.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 8

ధర పెరుగుతుంటే వస్తు సప్లయ్ పెరుగుతుంది.
ధర తగ్గితే వస్తు సప్లయ్ తగ్గుతుంది. దీనిని ప్రక్క రేఖా పటం ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 9

రేఖాపటంలో ‘X’ అక్షం మీద వస్తు సప్లయ్ పరిమాణాన్ని, ‘Y’ అక్షంపై వస్తు ధరను కొలుస్తాము. సప్లయ్ రేఖ ఎడమ నుంచి కుడికి పైకి వాలుతుంది. ప్రారంభంలో ధర 7 4 ఉంటే సప్లయ్ పరిమాణం 2000గా ఉంటుంది. ఇది SS సప్లయ్ రేఖపై ‘B’ బిందువు దగ్గర ఉంది. ధర గౌ 5 పెరిగితే సప్లయ్ పరిమాణం 3000 గా ఉంది. సప్లయేఖపై ‘B’ బిందువు నుండి C బిందువుకు కదలిక ఏర్పడింది. దీనినే సప్లయ్ విస్తరణ అంటారు. ఒకవేళ ధర ఔ 3 తగ్గితే సప్లయ్ పరిమాణం 1000గా ఉంది. సప్లయ్ రేఖపై ‘B’ బిందువు నుంచి ‘A’ బిందువుకు కదలిక ఏర్పడింది. దానిని సంకోచం అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం

ప్రశ్న 2.
సగటు, ఉపాంత వ్యయరేఖల మధ్య ఉన్న సంబంధాన్ని వివరించండి.
జవాబు:
వస్తువు ఉత్పత్తి కై ప్రక్రియలో చేసే వ్యయాన్ని ఉత్పత్తి వ్యయం అంటారు. ఉత్పత్తి మొత్తం మీద జరిగే వ్యయం మొత్తం వ్యయము. ఉత్పత్తి పెరిగితే మొత్తం వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తి తగ్గితే మొత్తం వ్యయం తగ్గుతుంది.

సగటు వ్యయము: మొత్తం వ్యయాన్ని మొత్తం వస్తురాశితో భాగిస్తే సగటు వ్యయం వస్తుంది. ఇది వస్తువు ఒక యూనిట్కి అయ్యే వ్యయాన్ని తెలియజేస్తుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 10

ఉపాంత వ్యయము: మొత్తం వ్యయము (TC) నుండి ఉపాంత వ్యయం (MC) లభిస్తుంది. మొత్తం వ్యయంలో తేడాను, వస్తు పరిమాణంలో వచ్చే తేడాతో భాగిస్తే ఉపాంత వ్యయం వస్తుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 11

ఈ క్రింది రేఖాపటం ద్వారా సగటు, ఉపాంత వ్యయాల సంబంధాన్ని పరిశీలించవచ్చు. రేఖాపటములో X – అక్షముపై ఉత్పత్తి యూనిట్లని, Y – అక్షముపై వ్యయాన్ని చూపాము. AC సగటు వ్యయరేఖ, MC ఉపాంత వ్యయరేఖ.

SAC స్వల్పకాలిక వ్యయరేఖ, SMC స్వల్పకాలిక ఉపాంత రేఖ. ఉత్పత్తి పెరుగుతుంటే మొదట సగటు వ్యయం తగ్గుతుంది. సగటు వ్యయం తగ్గుతున్నంత వరకు ఉపాంత వ్యయం, సగటు వ్యయంకన్నా తక్కువగా ఉంటుంది. ఉత్పత్తిని కొనసాగిస్తే సగటు వ్యయం కనిష్ట స్థాయికి వస్తుంది. ఉపాంత వ్యయం, సగటు వ్యయంతో సమానమౌతుంది. SAC మరియు SMC ఖండించుకున్న ‘A’ బిందువు వద్ద ఉత్పత్తి వ్యయం కనిష్టంగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 12

  1. సగటు వ్యయం తగ్గుతూ ఉంటే ఉపాంత వ్యయం, సగటు వ్యయం కంటే ఎక్కువ తగ్గుతుంది. అందువల్ల సగటు వ్యయరేఖకు క్రిందివైపు ఉపాంత వ్యయరేఖ ఉంది.
  2. సగటు వ్యయం కనిష్టంగా ఉన్నప్పుడు ఉపాంత వ్యయం సగటు వ్యయానికి సమానమైంది. కనుక సగటు వ్యయరేఖ కనిష్ట బిందువు వద్ద ఉపాంత వ్యయరేఖ క్రింద నుండి ‘N’ బిందువు వద్ద ఖండించింది.
  3. సగటు వ్యయం పెరుగుతూ ఉంటే ఉపాంత వ్యయం, సగటు వ్యయం కంటే ఎక్కువగా పెరుగుతోంది. అందువల్ల ఉపాంత వ్యయరేఖ సగటు వ్యయరేఖకు పైన ఉంది. ఈ విషయాలను పట్టిక, పటములో పరిశీలించవచ్చును. చరానుపాత సూత్రాల ప్రభావం, తరహాననుసరించి ప్రతిఫలాల ప్రభావము వలననే వ్యయరేఖలు ‘U’ ఆకారంలో ఉన్నాయి.

ప్రశ్న 3.
సప్లయ్ని నిర్ణయించే అంశాలు ఏవి ?
జవాబు:
1. వస్తుధర: ఉత్పత్తిదారుడు వస్తుసప్లయ్న నిర్ణయించడంలో ఆ వస్తువు ధరే ప్రధాన పాత్రను పోషిస్తుంది. వస్తుధర వల్ల సంస్థ లాభం నిర్ణయమవుతుంది. వస్తుధర పెరిగితే వస్తువుల పరిమాణాన్ని ఎక్కువగా సప్లయ్ చేస్తాడు. వస్తుధర తగ్గితే వస్తు సప్లయ్ తగ్గుతుంది.

2. ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు: ప్రత్యామ్నాయ వస్తుధరలు ఎక్కువగా ఉంటే వాటిని ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తిదారుడు ప్రయత్నం చేయవచ్చు. అందువల్ల ఉత్పత్తిదారుడు తాను ఉత్పత్తి చేస్తున్న దాని సప్లయ్ పెంచవచ్చు. అలాగే పూరక వస్తువుల ధరలు వాటికి ఉండే డిమాండ్ ఆధారంగా కూడా ఉత్పత్తిదారుడు తాను చేసే వస్తు సప్లయ్న నిర్ణయించుకుంటాడు.

AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం

3. ఉత్పత్తి కారకాల ధరలు: ఉత్పత్తి కారకాల ధరలు ఎక్కువగా ఉంటే ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. అదే కారకాల ధరలు తక్కువగా ఉంటే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది.

4. సాంకేతిక స్థాయి: సాంకేతిక పరిజ్ఞానం ఉత్పత్తి పద్ధతుల్లో మార్పులు వస్తే వస్తు సప్లయ్ మార్పులుంటాయి.

5. సంస్థ లక్ష్యం: సంస్థ లక్ష్యం ఆధారంగా కూడా వస్తు సప్లయ్ మారుతుంది.

6. ప్రభుత్వ విధానాలు: ప్రభుత్వం అధిక పన్నులను వస్తువులపై విధిస్తే వస్తు సప్లయ్ తక్కువగా ఉంటుంది. తక్కువగా పన్నులు విధిస్తే వస్తు సప్లయ్ ఎక్కువగా ఉంటుంది. వస్తూత్పత్తి రాయితీలను ఇస్తే వస్తువుల సప్లయ్ ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న 4.
స్వల్ప కాలంలో స్థిర, చర వ్యయాలను వివరించండి.
జవాబు:
స్వల్ప కాలంలో ఉత్పత్తి వ్యయాన్ని రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి స్థిర వ్యయాలు మరియు చర వ్యయాలు.

1. స్థిర వ్యయాలు: ఉత్పత్తిలో వచ్చే మార్పుల వల్ల మారని వ్యయాలను స్థిర వ్యయాలు అంటారు. స్వల్పకాలంలో సంస్థ పెంచినా, తగ్గించినా, ఉత్పత్తి జరగకపోయినా ఈ వ్యయాలలో మార్పు ఉండదు.
ఉదా: శాశ్వత ఉద్యోగుల జీతాలు, బీమా, వడ్డీ మొదలగునవి. ఇవి స్థిరమైనవి. కనుక వీటి మీద చేసే వ్యయాలను స్థిర వ్యయాలు అంటారు.

2. చర వ్యయాలు: ఉత్పత్తితో పాటు మారే వ్యయాలను చర వ్యయాలు అంటారు. ఉత్పత్తిని పెంచితే వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తిని తగ్గిస్తే చర వ్యయం తగ్గుతుంది.
ఉదా: ముడి పదార్థాల కొనుగోలు, ఇంధనం, విద్యుచ్ఛక్తి మొదలగునవి వాటి మీద చేసే వ్యయం చర వ్యయంగా చెప్పవచ్చు.

ప్రశ్న 5.
ఒక సంస్థ యొక్క మొత్తం సగటు, ఉపాంత రాబడులను నిర్వచించండి.
జవాబు:
రాబడి అనేది ఉత్పత్తిదారునికి ఉత్పత్తిని నిర్ణయించటంలోను, లాభనష్టాలను తెలపటంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. రాబడులలో మొత్తం, సగటు, ఉపాంత రాబడులుంటాయి.

మొత్తం రాబడి: మొత్తం ఉత్పత్తిని మార్కెట్లో ఒక ధర వద్ద విక్రయించగా వచ్చేది ఉత్పత్తిదారునికి రాబడి అవుతుంది. మొత్తం రాబడి మార్కెట్లో వస్తువు ధర మీద, విక్రయించిన వస్తురాశిమీద ఆధారపడి ఉంటుంది.

మొత్తం రాబడి = P x Q
సగటు రాబడి: మొత్తం రాబడిని విక్రయించిన వస్తురాశితో భాగిస్తే సగటు రాబడి వస్తుంది.

సగటు రాబడి = మొత్తం రాబడి / విక్రయించిన వస్తురాశి
ఉపాంత రాబడి: ఒక వస్తువును అదనంగా విక్రయిస్తే వచ్చే రాబడి ఉపాంత రాబడి.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 13

ప్రశ్న 6.
సంపూర్ణపోటీలో, రాబడి రేఖల యొక్క స్వభావాన్ని వివరించండి.
(లేదా)
పరిపూర్ణ పోటీ మార్కెట్లో రాబడి రేఖల స్వభావాన్ని వివరించండి.
జవాబు:
పరిపూర్ణ పోటీ మార్కెట్లో అనేకమంది అమ్మకందార్లు, కొనుగోలుదార్లు ఉంటారు. ఈ మార్కెట్లో వస్తువులు సజాతీయాలు. రవాణా ఛార్జీలు, అమ్మకపు వ్యయాలు ఉండవు. కాబట్టి మార్కెట్ అంతటా ఒకే ధర ఉంటుంది. ఈ మార్కెట్లో రాబడుల యొక్క స్వభావాన్ని ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 14

AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం

పై పట్టికలో ఉత్పత్తి పరిమాణం ఎంత ఉన్నా ఒకే ధరకు గౌ 10 అమ్మటం జరిగింది. ఉత్పత్తి ధరతో గుణించగా మొత్తం రాబడి వస్తుంది. మొత్తం రాబడి ఒకే మొత్తంలో పెరుగుతూ ఉంది. పట్టికలో సగటు, ఉపాంత రాబడి ఒకే సంఖ్యను కలిగి ఉన్నాయి. ఈ మార్కెట్లో వస్తువు ధర, సగటు, ఉపాంత రాబడులు ఒకటిగానే ఉన్నాయి. దీనిని ఈ క్రింది రేఖాపటాల ద్వారా చెప్పవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 15

పటంలో (A), (B) లో X- అక్షంపైన వస్తు పరిమాణాన్ని, Y-అక్షంపైన ధరను, రాబడులను కొలుస్తున్నాం. పటం (A) లో DD-డిమాండ్ రేఖ, SS-సప్లయ్ రేఖ రెండు E దగ్గర ఖండించుకున్నప్పుడు పరిశ్రమలో సమలతౌల్యం ఏర్పడి OP ధర నిర్ణయించడింది. ఈ OP ధరకే సంస్థ వస్తువులను అమ్ముతుంది. అందుకే పటం (B) లో OP ధర ఉన్నప్పుడు AR రేఖ MR రేఖ కలిసిపోయి X అక్షానికి సమాంతరంగా రేఖ ఉంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఉత్పత్తి ఫలం
జవాబు:
ఉత్పాదకాలకు, ఉత్పత్తికి మధ్య ఉండే భౌతిక సంబంధాన్ని తెలుపుతుంది. ఉత్పత్తి కారకాలు రేటుకు, ఉత్పత్తి రేటుకు మధ్య ఉండే సంబంధాన్ని ఉత్పత్తి ఫలంగా స్పిగ్లర్ వర్ణించాడు. దీనిని ఈ క్రింది సమీకరణం ద్వారా తెలియజేయవచ్చు.
Q = f (N, I, C. O, T)
ఇక్కడ Q = ఉత్పత్తి; N, L, C, O, T వరుసగా భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక ప్రగతి

ప్రశ్న 2.
సప్లయ్ సూత్రం [Mar. ’16, ’15]
జవాబు:
ఇది వస్తువు ధరకు, వస్తు సప్లయ్కి గల సంబంధాన్ని తెలియజేయును. ఇతర అంశాలు మారకుండా ఉంటే వస్తుధర పెరిగితే వస్తు సప్లయ్ పెరుగును. ధర తగ్గితే వస్తు సప్లయ్ తగ్గుతుందని సప్లయ్ సూత్రం తెలియజేయును. అనగా సప్లయ్కి, ధరకు మధ్య అనులోమ సంబంధం ఉంటుంది.

ప్రశ్న 3.
ఉత్పత్తి కారకాలు
జవాబు:
ఉత్పత్తికి దోహదపడే కారకాలను ఉత్పత్తి కారకాలు అంటారు. అవి

  1. భూమి
  2. శ్రమ
  3. మూలధనం
  4. వ్యవస్థాపన.

AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం

ప్రశ్న 4.
సగటు వ్యయం
జవాబు:
మొత్తం వ్యయాన్ని వస్తురాశితో భాగిస్తే సగటు వ్యయం వస్తుంది.
సగటు వ్యయం = మొత్తం వ్యయం / వస్తురాశి

ప్రశ్న 5.
ఉపాంత వ్యయం [Mar. ’17]
జవాబు:
ఒక వస్తువు అదనపు యూనిట్ను తయారు చేయడానికి అదనంగా అయిన వ్యయాన్ని ఉపాంత వ్యయం అంటారు.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 16

ప్రశ్న 6.
ఉత్పత్తి
జవాబు:
ఉత్పత్తి కారకాలను, ఉత్పాదకాలను వినియోగించి వస్తువులుగా మార్చే ప్రక్రియను ఉత్పత్తి అంటారు. ఈ ప్రక్రియలో వనరులను ఉపయోగించి వినియోగ వస్తువులను లేదా మూలధన వస్తువులను తయారు చేస్తారు.

ప్రశ్న 7.
స్వల్ప కాలం
జవాబు:
సంస్థ, భూమి, మూలధనాన్ని, వ్యవస్థాపనను మార్పు చేయలేనటువంటి కాలాన్ని స్వల్ప కాలం అంటారు. శ్రమను మాత్రమే మార్చుటకు వీలుంది.

ప్రశ్న 8.
దీర్ఘకాలం
జవాబు:
సంస్థ నాలుగు ఉత్పత్తి కారకాలను మార్పుచేయగల కాలం.

AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం

ప్రశ్న 9.
సగటు ఉత్పత్తి
జవాబు:
మొత్తం ఉత్పత్తిని శ్రామికుల సంఖ్యతో భాగిస్తే వచ్చే విలువను సగటు ఉత్పత్తి అంటారు.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 17

ప్రశ్న 10.
ఉపాంత ఉత్పత్తి
జవాబు:
ఉత్పత్తి ప్రక్రియలో అదనపు శ్రామికుని నియమించడం వల్ల మొత్తం ఉత్పత్తిలో ఏర్పడిన మార్పు.

ప్రశ్న 11.
స్థిర కారకాలు
జవాబు: స్వల్ప కాలంలో భూమి, మూలధనం, ఉద్యమిత్వం, స్థిర కారకాలు. వీటిని మార్చటానికి వీలు ఉండదు.

ప్రశ్న 12.
చర కారకాలు
జవాబు:
మార్చటానికి వీలు ఉన్న కారకాలు స్వల్పకాలంలో శ్రమ, చరకాలం, దీర్ఘకాలంలో అన్ని కారకాలు చర కారకాలే.

AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం

ప్రశ్న 13.
ఉత్పత్తి తరహా
జవాబు:
దీర్ఘకాలంలో ఉత్పత్తి కారకాల సమ్మేళనాన్ని మార్చడం ద్వారా ఉత్పత్తిలో వచ్చే మార్పులను ఉత్పత్తి తరహా అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 7th Lesson డిమాండ్ సిద్ధాంతాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Economics Study Material 7th Lesson డిమాండ్ సిద్ధాంతాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాతీయాదాయాన్ని నిర్వచించి, వివిధ జాతీయాదాయ భావనలను వివరించండి.
జవాబు:
ఒక సంవత్సర కాలంలో ఆర్థిక కార్యకలాపాల వలన దేశంలో ఉత్పత్తయ్యే వస్తుసేవల ద్రవ్యరూపం జాతీయాదాయంగా భావించవచ్చు. ఆధునిక అర్థశాస్త్రంలో ‘జాతీయాదాయం’ అనే అంశానికి చాలా ప్రాధాన్యత ఉంది.

జాతీయాదాయ భావనలు:
1) స్థూల జాతీయోత్పత్తి: ఒక సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల ద్రవ్యరూపాన్ని స్థూల జాతీయోత్పత్తి అంటారు. దీనికి విదేశీ వ్యాపారం వలన లభించే ఆదాయం కలపాలి. స్థూల జాతీయోత్పత్తిని అంచనా వేయడంలో (i) ప్రతి అంతిమ వస్తువు లేదా సేవల విలువలను ద్రవ్యరూపంలో చెప్పాలి. (ii) ఏ వస్తువు ‘విలువను రెండుసార్లు లెక్కపెట్టకుండా జాగ్రత్తపడాలి. (iii) ముడిపదార్థాలను పూర్తిగా తయారు కాని వస్తువుల విలువను జాతీయోత్పత్తిలో కలపాలి. వీటిని ఇన్వంటరీస్ అంటారు. వీటిలో తరుగుదల ఉంటే ఆ సంవత్సరపు జాతీయోత్పత్తి నుండి తీసివేయాలి.

AP Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయం

స్థూల జాతీయోత్పత్తిని ఈ క్రింది విధముగా చెప్పవచ్చు.

GNP లేదా GNI = C + I + G + (X – M)

2) స్థూల దేశీయోత్పత్తి: ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల ద్రవ్యరూపం మొత్తాన్ని స్థూల దేశీయోత్పత్తి అంటారు. స్థూల జాతీయోత్పత్తిలో వినియోగము, స్థూల దేశీయ పెట్టుబడి, ప్రభుత్వ వ్యయము, నికర విదేశీ ఆదాయం కలిసి ఉంటాయి. స్థూల దేశీయోత్పత్తిలో వినియోగం, స్థూల దేశీయ పెట్టుబడి, |ప్రభుత్వ వ్యయం మాత్రమే ఉంటాయి.

స్థూల దేశీయోత్పత్తి లేదా GDP = C + I + G

3) నికర జాతీయోత్పత్తి – నికర దేశీయోత్పత్తి: వస్తూత్పత్తిలో ఉత్పత్తి సంస్థలు, యంత్రాలు, భవనాలు, యంత్ర పరికరాలను ఇతర సామాగ్రి వినియోగిస్తాయి. వీటిని అవిచ్ఛిన్నంగా ఉపయోగించడం వలన అవి తరుగుదలకు లోనవుతాయి. దీనినే మూలధనం తరుగుదల అంటారు. ఈ తరుగుదలను స్థూల జాతీయోత్పత్తి లేదా స్థూల దేశీయోత్పత్తి నుండి తీసివేస్తే వచ్చేదే నికర జాతీయోత్పత్తి లేదా నికర దేశీయోత్పత్తి. నికర జాతీయోత్పత్తినే మార్కెట్ ధరలలో జాతీయాదాయం అని కూడా అంటారు. నికర జాతీయాదాయాన్ని అర్థశాస్త్ర పరిభాషలో ‘జాతీయాదాయం’ అంటారు.
నికర జాతీయోత్పత్తి = స్థూల జాతీయోత్పత్తి – మూలధనం పెరుగుదల
NNP = GNP – Depreciation
నికర దేశీయోత్పత్తి = స్థూలదేశీయోత్పత్తి – మూలధనం తరుగుదల
NDP = GDP – Depreciation
నికర జాతీయాదాయాన్ని మదింపు చేయటంలో ఈ క్రింది అంశాలను దృష్టిలో ఉంచుకొనవలెను.

a) అంతర్జాతీయ వ్యాపారం వలన సంభవించే లాభనష్టాలను పరిగణనలోకి తీసుకోవాలి.
b) ప్రభుత్వ సంస్థలో ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవలను స్థూల, నికర జాతీయోత్పత్తులలోను, స్థూల, నికర దేశీయోత్పత్తులలోను భాగంగా పరిగణించాలి. సిబ్బందికి ప్రభుత్వం చేసే వ్యయం కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

4) వ్యష్టి ఆదాయం: ఒక సంవత్సర కాలంలో దేశంలోని వివిధ వ్యక్తులకు, సంస్థలకు లభించే ఆదాయం మొత్తము వ్యష్టి ఆదాయము. వ్యష్టి ఆదాయం, నికర జాతీయోత్పత్తి సమానం కాదు. సంస్థలు తమ లాభంలో కొంత భాగాన్ని ఆదాయ పన్నుగా ప్రభుత్వానికి చెల్లిస్తాయి. కొంత భాగాన్ని పంపిణీ కాని లాభాల రూపంలో “రిజర్వ్ ఫండ్”గా ఉంచుతారు. మిగిలిన భాగాన్ని డివిడెండ్గా వాటాదార్లకు పంపిణీ చేస్తారు. డివిడెండ్లు మాత్రమే వ్యక్తిగత ఆదాయంలో చేరతాయి. కనుక సాంఘిక భద్రతా విరాళాలు, కార్పొరేట్ పన్నులు, పంపిణీ కాని లాభాలు నికర జాతీయోత్పత్తి నుండి మినహాయించాలి. కొంతమంది వ్యక్తులు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకపోయినప్పటికి ఆదాయం లభిస్తుంది. వీటిని జాతీయాదాయంలో చేర్చరాదు. వృద్ధాప్యపు పింఛనులు నిరుద్యోగ భృతి, వడ్డీలు మొదలైనవాటిని బదిలీ చెల్లింపులంటారు. ఇవి వ్యక్తిగత ఆదాయంలో చేరతాయి. ఈ బదిలీ చెల్లింపులను జాతీయాదాయంలో చేర్చరాదు.
వ్యష్టి ఆదాయం = జాతీయాదాయం – పంపిణీ కాని సంస్థల లాభాలు + బదిలీ చెల్లింపులు – సాంఘిక భద్రతా విరాళాలు కార్పొరేట్ పన్నులు

5) వ్యయార్హ ఆదాయం: వ్యక్తుల వినియోగానికి అందుబాటులో ఉండే ఆదాయాన్ని వ్యయార్హ ఆదాయం అంటారు. వ్యక్తులకు వివిధ రూపాలలో లభించే ఆదాయాలన్నింటిని ఖర్చు చేయడానికి వీలుండదు. ప్రభుత్వానికి వ్యక్తులు ప్రత్యక్ష పన్నులను చెల్లించవలసి ఉంటుంది. కనుక వ్యష్టి ఆదాయం నుండి ప్రత్యక్ష పన్నులను తీసివేస్తే వ్యయార్హ ఆదాయం వస్తుంది. వ్యయార్హ ఆదాయంలో కొంత భాగాన్ని మిగుల్చుకుంటే దానిని పొదుపు అంటారు. దీనిని ఈ క్రింది విధంగా చూపవచ్చును.
వ్యయార్హ ఆదాయం = వ్యష్టి ఆదాయం వ్యష్టి పన్నులు వ్యయార్హ ఆదాయం = వినియోగము + పొదుపు

AP Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయం

6) ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం: వస్తూత్పత్తి ప్రక్రియలో వినియోగించిన ఉత్పత్తి సాధనాలకు ప్రతిఫలాలను చెల్లిస్తారు. వాటి మొత్తాన్ని ఉత్పత్తి వ్యయం అంటారు. దీనినే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం అని అంటారు. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయోత్పత్తికి, నికర జాతీయోత్పత్తికి తేడా ఉంది. నికర జాతీయోత్పత్తి మొత్తం ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ కాదు. నికర జాతీయోత్పత్తి నుండి పన్నులను తీసివేస్తే మిగిలేదే ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ అయ్యేది. ప్రభుత్వం కొన్ని వస్తువుల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఉత్పత్తి సంస్థలకు సబ్సిడీలు ఇస్తుంది. అప్పుడు వస్తువుల ధరలు సబ్సిడీల మేరకు తగ్గుతాయి. కనుక సబ్సిడీలను నికర జాతీయోత్పత్తికి కలపాలి. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయము = నికర జాతీయోత్పత్తి + సబ్సిడీలు – పరోక్ష పన్నులు –
National Income at Factor Cost Net National Income + Subsidies – Indirect Taxes

7) తలసరి ఆదాయం: జాతీయాదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది.
తలసరి ఆదాయం = జాతీయాదాయం / దేశ జనాభా
ఒక దేశ ప్రజల సగటు జీవన ప్రమాణాన్ని తలసరి ఆదాయం నిర్ణయిస్తుంది.

ప్రశ్న 2.
జాతీయాదాయాన్ని గణించే వివిధ పద్ధతులను వివరించండి. [Mar. ’17, ’16, ’15]
జవాబు:
ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు, సేవల మొత్తం విలువను జాతీయాదాయం అంటారు.
జాతీయాదాయాన్ని గణించడానికి మూడు పద్ధతులు అమలులో ఉన్నాయి. అవి:

  1. ఉత్పత్తి పద్ధతి లేదా ఉత్పాదిత పద్ధతి
  2. వ్యయాల పద్ధతి
  3. ఆదాయాల పద్ధతి

కైరన్ క్రాస్ అభిప్రాయం ప్రకారం “జాతీయాదాయాన్ని మూడు పద్ధతులలో ఏ పద్ధతి ద్వారానైనా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఆదాయాలను కలపడం వల్ల, ప్రతి ఒక్క ఉత్పత్తిని కలపటం వల్ల, ప్రజలు కొనుగోలు చేసే అన్ని వస్తువుల | విలువలను వారి పొదుపులను కలపటం ద్వారా జాతీయాదాయాన్ని గణన చేయవచ్చు”.

1) ఉత్పత్తి మదింపు పద్ధతి: దీనిని ఇన్వెంటరీ పద్ధతి లేదా వస్తుసేవా పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో స్థూల జాతీయోత్పత్తి గణించడానికి ఒక సంవత్సర కాలంలో వివిధ రంగాలలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల పరిమాణాన్ని వాటి మార్కెట్ ధరలతో గుణించి వాటి విలువను నిర్ణయిస్తారు.
మార్కెట్ ధరలలో నికర దేశీయోత్పత్తి = (P1Q1 + P2Q2 + …….PnQ2)
P = ధర
Q = పరిమాణం
1, 2, ……., n = వివిధ రంగాలు ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవలు

జాతీయాదాయం: ఈ పద్ధతిలో కేవలం అంతిమ వస్తువుల విలువలను మాత్రమే లెక్కించాలి. ముడిసరుకులు, | మాధ్యమిక వస్తువులు మొదలైనవాటి విలువలను లెక్కించకూడదు.

దీనిలో మదింపు చేసిన విలువలను వివిధ రంగాలైన వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాలకు ఆపాదిస్తారు. అందువల్ల దీన్ని మదింపు చేసిన విలువ లేదా వాల్యుయాడెడ్ పద్ధతి అని కూడా అంటారు.

2) వ్యయాల మదింపు పద్ధతి: ఈ పద్ధతిలో ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వం వస్తు సేవలపై చేసిన ఖర్చు మొత్తాలను, నికర ఎగుమతులు, విదేశీ నికర ఆదాయం కూడితే జాతీయాదాయం తెలుస్తుంది.
NI = EH + EF + EG + Net exports + Net income from abroad
ఇచ్చట,
EH = గృహరంగం చేసిన ఖర్చు
EF = సంస్థల వ్యయం
EG = ప్రభుత్వం వస్తు సేవలపై చేసిన ఖర్చు మొత్తం

జాతీయాదాయం = ప్రైవేటు అంతిమ వినియోగ వ్యయం + ప్రభుత్వం అంతిమ వినియోగ వ్యయం + నికర దేశీయ మూలధన సంచయనం + నికర వినిమయం + నికర విదేశీ ఆదాయం

AP Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయం

కేవలం అంతిమ వస్తుసేవలపై వ్యయాన్ని మాత్రమే గణనలో చేర్చే విధంగా జాగ్రత్త వహించాలి.

3) ఆదాయ మదింపు పద్ధతి: ఈ పద్ధతిలో దేశంలో వివిధ ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలంగా లభించే భాటకం, వేతనం, వడ్డీ, లాభం, సంస్థలకు వచ్చిన ఆదాయాన్ని కలిపితే జాతీయాదాయం తెలుస్తుంది. ఈ పద్ధతిలో స్వయం ఉపాధి వల్ల ఆర్జించే ఆదాయాలను కలపాలి. బదిలీ చెల్లింపులను కలపకూడదు. ఇదియే ఉత్పత్తి కారకాల ఖరీదు | దృష్ట్యా జాతీయాదాయం,
జాతీయాదాయం = భాటకం + వేతనం + వడ్డీ + లాభం + నికర విదేశీ ఆదాయం

ఉద్యోగిత ఆదాయం:
– స్వయం ఉద్యోగిత ఆదాయం
+ కంపెనీల స్థూల వ్యాపార లాభాలు
+ జాతీయం చేయబడిన పరిశ్రమల స్థూల వ్యాపారం మిగుళ్ళు
+ సాధారణ ప్రభుత్వ సంస్థల స్థూల వ్యాపారం మిగుళ్ళు
+ భాటకం
+ వ్యాపారంలో ఉపయోగించని మూలధన వినియోగానికి ఆపాదించిన ఛార్జీ
= మొత్తం గృహరంగ ఆదాయం
– స్టాక్ ఆప్రిసియేషన్
+ శేషించిన పొరపాటు
= ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి

ఈ పద్ధతిలో జాతీయాదాయం గణించడానికి వివిధ ఆధారాల నుంచి వేల సంస్థలో దత్తాంశ సేకరణ అవసరం. ఆచరణలో ఆదాయానికి సంబంధించిన అన్ని వివరాలు ఖచ్చితంగా తెలియకపోవచ్చు.

ప్రశ్న 3.
జాతీయాదాయ భాగాలను వివరించండి.
జవాబు:
జాతీయాదాయం అనగా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయ్యే వస్తు సేవల నికర విలువను |జాతీయాదాయం అంటారు.
జాతీయాదాయం –భాగాలు: జాతీయాదాయంలో 5 ప్రధాన భాగాలున్నాయి. అవి:
ఎ) వినియోగం – C
బి) స్థూల దేశీయ పెట్టుబడి – I
సి) ప్రభుత్వ వ్యయం – G
డి) నికర విదేశీ పెట్టుబడి – (X-M)
ఇ) నికర విదేశీ ఆదాయం

ఎ) వినియోగం (C): మానవుని కోరికలను ప్రత్యక్షంగా సంతృప్తిపరచే వస్తుసేవలపై గృహరంగం చేసే మొత్తం ఖర్చును వినియోగం అంటారు. వినియోగ వస్తువులలో నశ్వర, అనశ్వర వస్తువులు ఉంటాయి. ఉదా: ఆహారధాన్యాలు, వస్త్రాలు, వైద్యసేవలు మొ||నవి. ఇది వ్యక్తుల ఆదాయ స్థాయిపై ఆధారపడి ఉంటుంది.

బి) పెట్టుబడి (I): ప్రస్తుత వినియోగానికి వీలుకాని వస్తువులను, సేవలను ఉత్పత్తి చేయడానికి ఉత్పాదక లేదా మూలధన వస్తువులపై సంస్థలు చేసే ఖర్చును పెట్టుబడి అంటారు. దీనిలో భవిష్యత్లో వినియోగ వస్తువుల ఉత్పత్తికి తోడ్పడే మూలధన వస్తువులపై చేసే ఖర్చు కలిసి ఉంటుంది.

సి) ప్రభుత్వ వ్యయం (G): ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం వస్తుసేవలను ఉత్పత్తి చేస్తుంది. అవస్థాపనా సౌకర్యాలకు, విద్యా, వైద్య సౌకర్యాలు, నీటిపారుదల మొ॥వాటికి ప్రభుత్వం చేసే ఖర్చును ప్రభుత్వ వ్యయం అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయం

డి) నికర విదేశీ పెట్టుబడి (X – M) (ఎగుమతులు దిగుమతులు): అంతర్జాతీయ వ్యాపారం ద్వారా ఒక దేశం ఆర్జించిన ఆదాయం నికర విదేశీ పెట్టుబడి. ప్రతి దేశం తాను ఉత్పత్తి చేసిన వస్తువులలో కొంత పరిమాణం ఎగుమతి చేస్తుంది. చౌకగా ఉన్న వస్తువులను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల ఒక దేశ జాతీయాదాయం గణనలో ఎగుమతుల విలువ, దిగుమతుల విలువల మధ్య వ్యత్యాసాన్ని పరిగణించాల్సి ఉంటుంది. విదేశీ వ్యాపారం వల్ల ఏర్పడిన మిగులును స్థూల జాతీయోత్పత్తికి కలుపుతారు. లోటు ఉంటే జాతీయాదాయంలో కొంత భాగాన్ని ఖర్చు పెడతారు.

ఇ) నికర విదేశీ ఆదాయం: ఒక దేశ ప్రజలు విదేశాలలో సంపాదించి స్వదేశానికి ఆదాయాలను పంపిస్తుంటారు. అదేవిధంగా ఒక దేశంలోని విదేశీయులు తమ దేశీయ ఆదాయాలను పంపిస్తారు. రాబడులు, చెల్లింపుల వ్యత్యాసాన్ని నికర విదేశీ ఆదాయం అంటారు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాతీయాదాయాన్ని నిర్ణయించే అంశాలు ఏవి ? [Mar. ’17, ’15]
జవాబు:
ఒక దేశ జాతీయాదాయ పరిమాణం అనేక అంశాలలో ప్రభావితమై నిర్ణయింపబడుతుంది. జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయించే అంశాలలో ముఖ్యమైనవి.
ఎ) సహజ వనరులు: సహజ వనరులు, భౌగోళిక అంశాలు, సారవంతమైన నేలలు మొ||నవి అధికంగా, అనుకూలంగాను లభ్యమై దేశాలలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి జాతీయాదాయంను పెంచుకోవచ్చు.

బి) ఉత్పత్తి కారకాల నాణ్యత, లభ్యత: ఒక దేశంలో అధిక శక్తి సామర్థ్యం గల శ్రామికుల లభ్యత, చొరవ, సామర్థ్యం గల సమర్థవంతమైన వ్యవస్థాపకులు, మూలధనం పెరుగుదల రేటు జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయిస్తాయి.

సి) సాంకేతిక విజ్ఞాన ప్రగతి: ఒక దేశ సాంకేతిక ప్రగతి ఉత్పత్తి, జాతీయాదాయమును నిర్ణయిస్తుంది. ప్రకృతి వనరులను పూర్తిగా వినియోగించుకొనుటకు ఆధునిక సాంకేతిక పద్ధతులు ఉపకరిస్తాయి.

డి) రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం: ఆర్థికాభివృద్ధికి, జాతీయాదాయ వృద్ధిరేటు పెంపుకు రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం దోహదం చేస్తాయి. ప్రభుత్వ విధానాలు, ఎగుమతి, దిగుమతి విధానాలు, పరిశోధనలపై పెట్టుబడులు మొదలైన అంశాలు కూడా జాతీయాదాయాన్ని నిర్ణయిస్తాయి.

ప్రశ్న 2.
ఉత్పత్తికారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం అంటే ఏమిటి ? [Mar. ’16]
జవాబు:
ఒక ఆర్థిక వ్యవస్థలో నిర్ణీత సమయంలో ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన పొందే ద్రవ్యరూప ప్రతిఫలాలైన భాటకం, వేతనం, వడ్డీ, లాభం కలిపితే వచ్చే మొత్తాన్ని ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయోత్పత్తి లేదా జాతీయాదాయం అంటారు. దీనినే వస్తూత్పత్తిలో సేవలు లేదా వనరులు సప్లై చేసిన వ్యక్తులు పొందే ఆదాయాలుగా పేర్కొనవచ్చు. దీనిలో ఉద్యోగులు పొందే వేతనాలు, ప్రైవేటు వ్యక్తులకు చెల్లించిన వడ్డీ, భూస్వాములు పొందిన నికర భాటకం అన్ని రకాల వ్యాపార లాభాలు ఇమిడి ఉంటాయి.

AP Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయం

నికర జాతీయోత్పత్తి మొత్తం ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ కాదు. ఎందుకంటే సంస్థలు ప్రభుత్వానికి పరోక్ష పన్నులు. ఉదా: ఎక్సైజ్ సుంకం, అమ్మకం పన్ను చెల్లిస్తారు. కాని ఉత్పత్తికారకాలకు కాదు. అదేమాదిరిగా ప్రభుత్వం కొన్ని రకాల వస్తుసేవలకు సబ్సిడీ చెల్లిస్తుంది. అంటే వస్తు ఉత్పత్తి కారకాలకు కాదు. అందువల్ల వాస్తవ ఉత్పత్తి
వ్యయాల కంటే తక్కువ ధరకే మార్కెట్లో వస్తువులు విక్రయింపబడతాయి. అందువల్ల సబ్సిడీల విలువను నికర జాతీయాదాయానికి కలపాలి. ఈ రోజులలో ప్రభుత్వ రంగం విస్తరించుటయే కాకుండా అనేక పరిశ్రమలను, సంస్థలను నిర్వహిస్తున్నందువల్ల అది పొందుతున్న లాభాలు ఉత్పత్తి కారకాలకు పంపిణీ కావు. అందువల్ల ప్రభుత్వ సంస్థల లాభాలను నికర జాతీయాదాయం నుంచి తీసివేయాలి.

ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి లేదా జాతీయాదాయం = మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి – పరోక్ష పన్నులు + సబ్సిడీలు – ప్రభుత్వ సంస్థల లాభాలు

ప్రశ్న 3.
ఏవేని మూడు జాతీయాదాయ నిర్వచనాలను తెలపండి.
జవాబు:
ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తుసేవల మొత్తం నికర విలువను జాతీయాదాయంగా భావించవచ్చు. జాతీయాదాయం ఆ దేశంలోని ప్రజల జీవన స్థితిగతులకు, ప్రజల సంక్షేమానికి మధ్య ఉండే సంబంధాన్ని వివరిస్తుంది.

  1. పిగూ నిర్వచనం: ఆచార్య పీగూ నిర్వచనం ప్రకారం ద్రవ్యంలో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ యొక్క నిరపేక్ష ఆదాయాన్ని విదేశాల నుంచి లభించే నికర ఆదాయాన్ని జాతీయోత్పత్తి అనవచ్చు.
  2. ఫిషర్ నిర్వచనం: తుది వినియోగదారులు భౌతిక లేదా మానవ పరిసరాల నుంచి పొందే సేవల సముదాయమే జాతీయాదాయం.
  3. మార్షల్ నిర్వచనం: ఒక దేశంలోని శ్రమ, మూలధనం, సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే భౌతిక, అభౌతిక వస్తుసేవలతో కూడుకున్న నికర వస్తుసేవల మొత్తమే ఆ దేశ వాస్తవిక నికర వార్షిక ఆదాయం”.

ప్రశ్న 4.
జనాభా, తలసరి ఆదాయం మధ్యగల సంబంధం ఏమిటి ?
జవాబు:
జాతీయాదాయానికి, జనాభాకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండూ కలిసి తలసరి ఆదాయాన్ని నిర్ణయిస్తాయి. ఒకవేళ జాతీయాదాయం వృద్ధిరేటు 6%, జనాభా వృద్ధిరేటు 3%గా ఉన్నప్పుడు తలసరి ఆదాయం వృద్ధిరేటు 3% గా ఉంటుంది. దీన్ని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు.
QPC = P-QP
ఇక్కడ QPC = తలసరి ఆదాయం వృద్ధిరేటు
Q = జాతీయాదాయ వృద్ధిరేటు
QP = జనాభా వృద్ధిరేటు

తలసరి ఆదాయ వృద్ధిరేటు = జాతీయాదాయ వృద్ధిరేటు – జనాభా వృద్ధిరేటు

తలసరి ఆదాయంలో పెరుగుదల జీవన ప్రమాణంలో పెరుగుదలను సూచిస్తుంది. జాతీయాదాయ వృద్ధిరేటు, పెరుగుదల కంటే జనాభా వృద్ధిరేటు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే తలసరి ఆదాయంలో పెరుగుదల సాధ్యమవుతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయం

ప్రశ్న 5.
భారతదేశంలో జాతీయాదాయ మదింపులతో సమస్యలు ఏవి ?
జవాబు:
1) ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలకు సంబంధించిన ఆదాయం లేదా ఉత్పత్తి లేదా వ్యయ రూపకంగా లభ్యమయ్యే గణాంక వివరాలు సమగ్రంగాను, విశ్వసనీయంగాను ఉండవు. ఇందుకు కారణాలు ప్రత్యేకించి శిక్షితులైన గణాంక సిబ్బంది కొరత, ప్రజల నిరక్షరాస్యత వల్ల అకౌంట్స్ను సరిగా నిర్వహించలేకపోవటం.

2) భారతదేశంలో ద్రవ్యేతర రంగం అధికంగా ఉంది. ద్రవ్య చెల్లింపులు లేని వస్తు సేవలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జాతీయాదాయ లెక్కలలో చేర్చబడనందున ఉత్పత్తి అయిన వస్తువులలో చాలాభాగం జాతీయాదాయ లెక్కల్లోకి రాకపోవచ్చు.
ఉదా: తల్లి తన కుటుంబానికి చేసే సేవలు.

3) వృత్తి ప్రత్యేకీకరణ తక్కువగా ఉంది. ఒక వ్యక్తికి ఆదాయం అనేక వృత్తుల నుండి లభిస్తుంది. అందుచేత ఆదాయ సమాచార వివరాలు సేకరించడం కష్టంగా మారుతుంది.

4) మార్కెట్ ధరలలో మార్పుల వల్ల జాతీయాదాయ మదింపులో సమస్యలు ఏర్పడతాయి.

5) జాతీయాదాయ లెక్కలలో చేర్చబడిన ప్రభుత్వ సేవల విలువ ఖచ్చితంగా లెక్కకట్టుట సాధ్యం కాదు.

ప్రశ్న 6.
జాతీయాదాయ అంచనాల ప్రాముఖ్యత తెలియజేయండి.
జవాబు:
జాతీయాదాయ అంచనాల ప్రాముఖ్యత: అనేక కారణాల వల్ల జాతీయాదాయ అంచనాల ప్రాముఖ్యత పెరుగుతుంది.

  1. ఆర్థిక ప్రణాళికల రచనకు జాతీయాదాయ అంచనాలు లేదా గణాంకాలు చాలా ముఖ్యమైనవి.
  2. దేశ ఆర్థిక విధానాలు రూపొందించడానికి ఇవి ఉపయోగపడతాయి.
  3. ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల పనితీరును అంచనా వేయడానికి ఇవి వీలు కల్పిస్తాయి.
  4. దేశ బడ్జెట్ తయారీ: బడ్జెట్ కేటాయింపులలో ఇవి అత్యంత ఉపయోగకరమైనవి.
  5. దేశంలో జీవన ప్రమాణస్థాయి వివరాలు తెలియజేస్తాయి.
  6. మనకు ఇతర దేశాల ఆర్థికవృద్ధిని పోల్చడంలో దోహదం చేస్తాయి.
  7. స్థూల ఆర్థిక విధానాల రూపకల్పనలో ప్రభుత్వాలకు సహాయం చేస్తాయి. 8) భారతదేశంలోని జాతీయాదాయ అకౌంట్స్ను వివరిస్తాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
స్థూల జాతీయోత్పత్తి (GNP)
జవాబు:
ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేసిన వస్తుసేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి అంటారు. మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి
(GNP) = C + I + G + (X – M).

ప్రశ్న 2.
తలసరి ఆదాయం [Mar. ’17, ’16, ’15]
జవాబు:
జాతీయాదాయాన్ని దేశంలో ఉన్న జనాభాతో భాగిస్తే వచ్చేది “తలసరి ఆదాయం”.
తలసరి ఆదాయం = జాతీయాదాయం / దేశ జనాభా
తలసరి ఆదాయం దేశ ప్రజల జీవన ప్రమాణాన్ని సూచిస్తుంది. ఆర్థికాభివృద్ధికి తలసరి ఆదాయమే ప్రధాన సూచిక.

AP Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయం

ప్రశ్న 3.
తరుగుదల
జవాబు:
యంత్రాలు నిరంతరం ఉపయోగించినప్పుడు అవి అరిగిపోయే అవకాశం ఉంది. వాటికయ్యే మరమ్మత్తు ఖర్చును తరుగుదల అంటారు.

ప్రశ్న 4.
వ్యయార్హ ఆదాయం
జవాబు:
వ్యక్తులకు, సంస్థలకు వచ్చే ఆదాయాన్ని వ్యష్టి ఆదాయం అంటారు. అయితే వ్యక్తులకు, ఈ మొత్తాన్ని ఖర్చు చేసే అవకాశం ఉండదు. ఇందులోనుంచి ప్రత్యక్ష పన్ను, ఆస్తి పన్ను, ఆదాయ పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఆదాయం నుంచి ఈ మొత్తాన్ని తీసివేస్తే మిగిలేదే వ్యయార్హ ఆదాయం.
వ్యయార్హ ఆదాయం = వినియోగం + పొదుపు

ప్రశ్న 5.
చక్రీయ ఆదాయ ప్రవాహం
జవాబు:
ఒక ఆర్థిక వ్యవస్థలో సంస్థల నుంచి గృహ రంగానికి, గృహ రంగం నుంచి సంస్థలకు నిరంతరం ఆదాయం ప్రవహించడాన్ని చక్రీయ ఆదాయ ప్రవాహం అంటారు.

ప్రశ్న 6.
బదిలీ చెల్లింపులు
జవాబు:
కొందరు వ్యక్తులు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకపోయినా ఆదాయంలో కొంత భాగాన్ని చెల్లించవలసి ఉంటుంది. అవి పెన్షన్లు, నిరుద్యోగభృతి, ప్రభుత్వ బాండ్లపై వడ్డీ మొదలగునవి. వీటిని బదిలీ చెల్లింపులు అంటారు.

ప్రశ్న 7.
జాతీయాదాయం
జవాబు:
ఒక దేశంలో నిర్ణీతకాలంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తుసేవల నికర మార్కెట్ విలువను జాతీయాదాయం అంటారు. జాతీయాదాయం వ్యాపార కుటుంబ రంగాల మధ్య జరిగే చక్రరూప ఆదాయ ప్రవాహాన్ని వివరిస్తుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయం

ప్రశ్న 8.
నికర జాతీయోత్పత్తి
జవాబు:
వస్తుసేవల ఉత్పత్తిలో వినియోగించబడే యంత్రాలు, యంత్ర పరికరాలు కొంతకాలం తరువాత కొంత తరుగుదలకు, అరుగుదలకు గురికావచ్చు. అందువల్ల స్థూలజాతీయోత్పత్తి నుంచి తరుగుదలను తీసివేయగా నికర జాతీయోత్పత్తి వస్తుంది. నికర జాతీయోత్పత్తి = స్థూల జాతీయోత్పత్తి – తరుగుదల.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ సిద్ధాంతాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ సిద్ధాంతాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
డిమాండ్ సూత్రాన్ని వివరించి, దాని మినహాయింపులను వ్రాయండి.
జవాబు:
అర్ధశాస్త్రంలో డిమాండ్ భావనకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఒక వస్తువును కొనాలనే కోరికతోపాటు కొనే శక్తి, కొనాలన్న ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. కనుక డిమాండ్ను ఈ క్రింది విధముగా నిర్వచించవచ్చు. “ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అని బెన్హామ్ పేర్కొన్నాడు.

ఒక వస్తువుకున్న డిమాండ్ ముఖ్యంగా ఈ క్రింది అంశాలపై ఆధారపడి ఉండును.

  1. వినియోగదారుల అభిరుచులు, అలవాట్లు
  2. వస్తువుల ధరలు
  3. వినియోగదారుల ఆదాయాలు
  4. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలు మొదలైనవి.

డిమాండ్ సూత్రము: డిమాండ్ సూత్రం వస్తువు ధరకు, డిమాండ్కుగల సంబంధాన్ని తెలియజేస్తుంది. “ఇతర అంశాలు స్థిరంగా ఉంటే, వస్తువు ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది” అని మార్షల్ డిమాండ్ సూత్రాన్ని నిర్వచించెను. డిమాండ్ సూత్రాన్ని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చును.

Dn = f

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

డిమాండ్ పట్టిక
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 1

వినియోగదారుడు లేదా వినియోగదారులు ఒక వస్తువును వివిధ ధరల వద్ద ఏ పరిమాణంలో కొనుగోలు చేస్తారో తెలియజేస్తుంది డిమాండ్ పట్టిక.

పట్టికననుసరించి వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందని, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుందని తెలుస్తుంది. దీనిని ఆధారంగా చేసుకొని డిమాండ్ రేఖను గీయవచ్చును.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 2

పై రేఖాపటంలో ‘X’ అక్షముపై వస్తువు డిమాండ్ పరిమాణం, ‘Y’ అక్షముపై వస్తువు ధరను చూపినాము. ‘DD’ డిమాండ్ రేఖ. డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రింది వైపుకు వాలి ఉంది. ఇది ఋణాత్మకమైన వాలు. వస్తువు ధరకు, డిమాండ్కు మధ్య విలోమ సంబంధమున్నదని ఋణాత్మకమైన వాలు తెలియజేస్తుంది.

మినహాయింపులు: డిమాండ్ సూత్రానికి కొన్ని మినహాయింపులున్నాయి. అవి:
1. గిఫెన్ వైపరీత్యం: పేద కార్మికులు రొట్టె ధర పెరిగితే మాంసముపై వెచ్చించే డబ్బును కూడా రొట్టెపై ఖర్చు చేస్తారు. అనగా రొట్టె ధర పెరిగినా డిమాండ్ తగ్గదు. ఇది పేదవాళ్ళ ఆహారం కావటమే ఇందుకు కారణము. ఈ సత్యాన్ని సర్ రాబర్ట్ గిఫెన్ అనే ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆర్థికవేత్త 19వ శతాబ్దం మధ్య భాగంలో పరిశీలించాడు. కనుక దీనిని గిఫెన్ వైపరీత్యం అంటారు. పేదవారు ముఖ్యంగా నిత్యావసర వస్తువులలో తక్కువ ధర గల వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ ప్రత్యేకమైన వస్తువులనే గిఫెన్ వస్తువులంటారు. ఉదా: రాగులు, జొన్నలు మొదలైనవి.

2. గౌరవ సూచిక వస్తువులు: గౌరవ సూచిక వస్తువుల ధర పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. వీటిని కొనుగోలు చేయటం వలన సమాజంలో గౌరవము, ప్రతిష్ఠ పెరుగుతాయని భావిస్తారు. వీటి ధర తగ్గితే గౌరవం, ప్రతిష్ఠ తగ్గుతాయని భావిస్తారు. ఉదా: విలువ గల వజ్రాలు, ఆభరణాలు మొదలైనవి. ఇది డిమాండ్ సూత్రానికి వ్యతిరేకము. ఈ విషయాన్ని వెబ్లెన్ అనే అమెరికా ఆర్థికవేత్త తెలియజేసెను. అందువల్ల ఇటువంటి వస్తువులను వెబ్లెన్ వస్తువులంటారు.

3. అంచనా వ్యాపారం: ఒక వస్తువు ధర మరింత పెరగడానికి వ్యాపారస్తులు, కొనుగోలుదారులు ఆ వస్తువును ఎక్కువగా డిమాండ్ చేస్తారు. అదేవిధంగా ధర తగ్గినప్పుడు ఇంకా తగ్గుతుందని భావిస్తే కొనుగోలు తగ్గిస్తారు. దీనినే సట్టా వ్యాపారం అని కూడా అంటారు. ఉదా: షేర్లు, బాండ్లు.

4. భ్రాంతి: కొంతమంది వినియోగదారులు కొన్నిసార్లు ఎక్కువ ధర కలిగి ఉన్న వస్తువులు ఎక్కువ నాణ్యతతో కూడి ఉంటాయన్న భ్రాంతిలో ఉంటారు. అందువల్ల ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇటువంటి వాటి విషయంలో డిమాండ్ సూత్రం వర్తించదు.

ప్రశ్న 2.
డిమాండ్ ఫలం అంటే ఏమిటి ? డిమాండ్ను నిర్ణయించే అంశాలను వివరించండి.
జవాబు:
“ఒక నిర్ణీతమైన కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అంటారు.

ఒక వస్తువు డిమాండ్ దాని ధరపైనే కాకుండా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వస్తువు డిమాండ్ను ప్రభావితము చేసే అంశాలు; ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలు, వినియోగదారుల ఆదాయం, వినియోగదారుల అభిరుచులు, అలవాట్లు మొదలైనవి. కనుక ఒక వస్తువు డిమాండ్ పరిమాణానికి, దీనిని నిర్ణయించే కారకాలకు మధ్యగల సంబంధాన్ని తెలియజేసేదే డిమాండ్ ఫలము. దీనిని ఈ క్రింది సమీకరణం ద్వారా చూపవచ్చు.
Dn = f (Pn, P1, P2, …. Pn-1, y, T)
Dn = n వస్తువుల డిమాండ్ పరిమాణం
Pn = n వస్తువు ధర
Pn, P1, P2, …. Pn-1 = ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు
y = వినియోగదారుని ఆదాయం
T = వినియోగదారుని అభిరుచులు, అలవాట్లు మొదలైనవి.
f = ప్రమేయ సంబంధము

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

డిమాండ్ను నిర్ణయించే కారకాలు లేదా అంశాలు:

  1. ఆదాయంలో మార్పు: ప్రజల ఆదాయాల మార్పును బట్టి వస్తువుల డిమాండ్లో మార్పు ఏర్పడుతుంది. ప్రజల ఆదాయం పెరిగితే వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. ఆదాయాలు తగ్గితే వస్తువుల డిమాండ్ తగ్గుతుంది.
  2. అభిరుచులు, అలవాట్లలో మార్పులు: ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చే మార్పుల వలన వస్తువు డిమాండ్లో మార్పు వస్తుంది.
  3. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో మార్పులు: ప్రజల అభిరుచులలో అలవాట్లలో మార్పులవల్ల వస్తువు డిమాండ్ లో మార్పులు వస్తాయి.
  4. జనాభాలో మార్పు: జనాభా పెరుగుదల, తగ్గుదలను అనుసరించి కూడా వస్తువుల డిమాండ్లో మార్పులు వస్తాయి.
  5. వాతావరణంలో మార్పులు: వాతావరణంలో మార్పులు కూడా డిమాండ్లో మార్పులను తీసుకొని వస్తాయి. ఉదా: వేసవికాలంలో చల్లని పానీయాలకు డిమాండ్ పెరుగుతుంది.
  6. సాంకేతికాభివృద్ధి: సాంకేతికాభివృద్ధి వలన వస్తూత్పత్తి వ్యయం తగ్గి, వస్తు ధరలు తగ్గుతాయి. అందువల్ల పూర్వం కొనుగోలు చేయడానికి ఉపయోగించిన ద్రవ్య పరిమాణంలో వస్తువులను ఎక్కువగా డిమాండ్ చేయటానికి అవకాశం ఉంటుంది.
  7. ఆర్థిక స్థితిగతులు: వాణిజ్య విజృంభణ కాలంలో అన్ని వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. కానీ, ఆర్థిక మాంద్య పరిస్థితులలో అన్ని వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది.
  8. ప్రభుత్వ విధానము: ప్రభుత్వ పన్నుల విధానం, రాయితీ విధానము మొదలైనవి వస్తువు ధర తగ్గితే డిమాండ్ ప్రభావితం చేయును.
  9. వస్తువు ధర: ఒక వస్తువు ధరకు, డిమాండ్కు విలోమ సంబంధం ఉన్నది. కనుక వస్తువు ధర తగ్గితే, డిమాండ్ పెరుగుతుంది. వస్తువు ధర పెరుగుటచే డిమాండ్ తగ్గుతుంది.

ప్రశ్న 3.
డిమాండ్ అంటే ఏమిటి ? వివిధ రకాల డిమాండ్లను తెలియజేయండి.
జవాబు:
అర్ధశాస్త్రంలో డిమాండ్ భావనకు చాలా ప్రాధాన్యత ఉంది. ఒక వస్తువును కొనాలనే కోరిక దానితోపాటు కొనే శక్తి ఈ రెండూ జతకూడినప్పుడే ఆ వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. అందువల్ల “ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు ఉన్న డిమాండ్” అంటారు.
డిమాండ్ను నిర్ణయించే కారకాలను బట్టి డిమాండ్ను మూడు రకములుగా విభజించవచ్చు.

  1. ధర డిమాండ్
  2. ఆదాయ డిమాండ్
  3. జాత్యంతర డిమాండ్.

1. ధర డిమాండ్: ఒక వస్తువు ధరకు, దాని డిమాండ్ పరిమాణానికి గల సంబంధాన్ని తెలియజేయునది ధర డిమాండ్. డిమాండ్ను ప్రభావితంచేసే ఇతర అంశాలలో మార్పులేదనే ప్రమేయంపై ఆధారపడి ధర డిమాండ్ నిర్వచించబడుతుంది. దీనిని ఈ విధంగా చూపవచ్చు.
D1 = f(Px)
డిమాండ్ పట్టిక: ఒక వస్తువును వివిధ ధరల వద్ద కొనుగోలు చేసే వస్తువు పరిమాణాలను తెలియజేయును. ఈ డిమాండ్ పట్టిక రెండు రకాలు.

  1. వైయుక్తిక డిమాండ్ పట్టిక
  2. మార్కెట్ డిమాండ్ పట్టిక

డిమాండ్ పట్టిక:
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 3AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 4
పై రేఖాపటంలో ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. కనుక DD రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంది. దీనిని ఋణాత్మక వాలు అంటారు. ఇది వస్తువు ధరకు, డిమాండ్కు మధ్య ఉన్న విలోమ సంబంధాన్ని తెలియజేయును.

2. ఆదాయ డిమాండ్: వినియోగదారుని ఆదాయానికి, వస్తువు డిమాండ్కు మధ్యనున్న సంబంధాన్ని ఆదాయ డిమాండ్ అంటారు. వివిధ ఆదాయాల వద్ద వస్తువు డిమాండ్ పరిమాణం ఏ విధంగా ఉందో ఆదాయ డిమాండ్ తెలియజేస్తుంది.
Dx = f(y)

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

ఇతర అంశాలు మారకుండా స్థిరంగా ఉన్నప్పుడు ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ధరకు, ఆదాయంకు ధనాత్మక సంబంధం ఉంది. ఆదాయ డిమాండ్ను అనుసరించి వస్తువులలో మేలురకం లేదా నాసిరకం వస్తువులుగా గుర్తించవచ్చు.

మేలురకం వస్తువులు / సాధారణ వస్తువులు:
ఆదాయం పెరిగితే మేలురకం వస్తువులు లేదా సాధారణ వస్తువుల డిమాండ్ పెరుగుతుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 5

పై రేఖాపటంలో ‘OX’ అక్షంపై డిమాండ్ పరిమాణంను, ‘OY’ అక్షంపై ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY’ ఉన్నప్పుడు ‘OQ’ వస్తు పరిమాణం డిమాండ్ చేయబడింది. ఆదాయం ‘OY’ నుంచి ‘OY1‘ కు పెరిగినప్పుడు మేలురకం వస్తువుల డిమాండ్ ‘OQ’ నుంచి ‘OQ1‘ కు పెరిగింది. ‘YD’ రేఖ ధనాత్మక వాలు కలిగి ఉంటుంది.

నాసిరకం వస్తువులు: మేలురకం వస్తువులకు భిన్నంగా వినియోగదార్ల ఆదాయం పెరిగితే నాసిరకం వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 6

పై రేఖాపటంలో ‘OX’ అక్షం మీద డిమాండ్ పరిమాణాన్ని, ‘OY’ అక్షం మీద ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY1‘ నుంచి ‘OY’ కు పెరిగినప్పుడు డిమాండ్ పరిమాణం ‘OQ’ నుంచి ‘OQ1‘ కు తగ్గును. ‘YD’ రేఖ ఎడమ నుండి కుడికి వాలి ఉంది.

3. జాత్యంతర డిమాండ్: ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలకు, ఒక వస్తువు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని జాత్యంతర డిమాండ్ అంటారు. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన మార్పుల వల్ల ఒక వస్తువు డిమాండ్లో వచ్చే మార్పులను జాత్యంతర డిమాండ్ తెలియజేయును.
జాత్యంతర డిమాండ్ను ఈ విధంగా వ్రాయవచ్చు.
Dx = f(Py).

ప్రత్యామ్నాయ వస్తువులు: ఒక కోర్కెను తీర్చగల వివిధ వస్తువులను ప్రత్యామ్నాయ వస్తువులు అంటారు.

ఉదా: కాఫీ, టీ. ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ధనాత్మక సంబంధాన్ని తెలియజేయును. దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా చూపవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 7
పై రేఖాపటంలో కాఫీ ధర ‘OY’ నుంచి ‘OY2‘ కు పెరిగినప్పుడు టీ, డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ2‘ కు పెరిగింది. ‘CD’ రేఖ ధనాత్మక వాలును కలిగి ఉంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

పూరక వస్తువులు: ఒకే కోరికను తీర్చగల సమిష్టి వస్తువులు.
ఉదా: కారు, పెట్రోలు, వీటి విషయంలో డిమాండ్ విలోమ సంబంధాన్ని తెలియజేయును.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 8

పై రేఖాపటంలో డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ2‘ కు పెరిగింది. ధర ‘OP’ నుండి ‘OP’ కు తగ్గినప్పుడు ‘CD’ రేఖ ఋణాత్మక వాలు కలిగి ఉంది.

ప్రశ్న 5.
డిమాండ్ వ్యాకోచత్వ భావనను నిర్వచించి, ధర, ఆదాయ, జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వాలను వివరించండి.
జవాబు:
ఆర్థికశాస్త్రంలో “డిమాండ్ వ్యాకోచత్వం” అనే భావనకు అధిక ప్రాధాన్యత ఉంది. ధరలో వచ్చిన మార్పుకు అనుగుణంగా డిమాండ్ ఎంత మేరకు మార్పు వస్తుందో డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలుపుతుంది.

శ్రీమతి జోన్ రాబిన్సన్ అభిప్రాయంలో “ధరలో వచ్చిన అనుపాతపు మార్పు స్పందనకు బదులుగా డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాత మార్పు ప్రతిస్పందన ఏ మేరకు ఉంటుందో తెలియజేసే భావన డిమాండ్ వ్యాకోచత్వం”. డిమాండ్లో వచ్చిన అనుపాతపు మార్పు డిమాండ్ వ్యాకోచత్వం.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 9

ఈ వ్యాకోచత్వ భావన మూడు రకాలు.

  1. ధర డిమాండ్ వ్యాకోచత్వం
  2. ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం
  3. జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం

1. ధర డిమాండ్ వ్యాకోచత్వం: ఈ భావనను మార్షల్ అభివృద్ధిపరిచారు. ధర డిమాండ్ వ్యాకోచత్వం అనగా ధరలో వచ్చే అనుపాతపు మార్పు వల్ల డిమాండ్లో వచ్చే అనుపాతపు మార్పు ఎంత ఉంటుందో తెలియజేస్తుంది. వస్తువు ధరకు, డిమాండ్కు విలోమ సంబంధం ఉంటుంది. అందువల్ల ధర డిమాండ్ వ్యాకోచత్వం రుణాత్మకంగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 10

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

2. ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం : ఆదాయంలో వచ్చే మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో ఏ మేరకు స్పందన వస్తుందో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం తెలుపుతుంది. వినియోగదారుని ఆదాయం కొంత శాతం మార్పు చెందినప్పుడు, వస్తువు డిమాండ్ పరిమాణం ఎంత శాతం మార్పు చెందుతుందో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం తెలియజేయును. ఈ ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం మేలు రకం వస్తువుల విషయంలో ధనాత్మకంగా, నాసిరకం వస్తువుల విషయంలో రుణాత్మకంగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 11

3. జాత్యంతర వ్యాకోచ డిమాండ్: ఒక వస్తువుకున్న డిమాండ్ దాని ధరపైనే కాకుండా, దానికున్న ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరపైన కూడా ఆధారపడి ఉంటుంది. ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరల్లో వచ్చే అనుపాతపు మార్పు లేదా శాతం మార్పు ఆ వస్తు డిమాండ్లో ఎంత అనుపాత మార్పు కల్గిస్తుందో జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం తెలియజేయును. ప్రత్యామ్నాయ వస్తువులైన టీ, కాఫీల విషయంలో ధనాత్మక సంబంధాన్ని, పూరక వస్తువుల విషయాలలో రుణాత్మక సంబంధాన్ని కలిగి ఉంటాయి.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 12

ప్రశ్న 6.
ధర డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఏమిటి ? ధర డిమాండ్ వ్యాకోచత్వంలోని రకాలను వివరించండి. Mar, ’15
జవాబు:
ధర డిమాండ్ వ్యాకోచత్వం అనే భావనను ఆల్ఫ్రెడ్ మార్షల్ అభివృద్ధిపరిచారు. ధర డిమాండ్ వ్యాకోచత్వం అనగా ధరలో వచ్చే అనుపాతపు మార్పువల్ల డిమాండ్లో వచ్చే అనుపాత మార్పు ఎంత ఉంటుందో తెలియజేస్తుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 13

వ్యాకోచత్వ విలువ ఆధారంగా ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని ఐదు రకాలుగా చెప్పవచ్చు.

  1. పూర్తి వ్యాకోచ డిమాండ్ (Ep = o)
  2. పూర్తి అవ్యాకోచ డిమాండ్ (Ep = 0)
  3. ఏకత్వ వ్యాకోచ డిమాండ్ (Ep = 1)
  4. సాపేక్ష వ్యాకోచ డిమాండ్ (Ep = >1)
  5. సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ (Ep = <1)

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

1. పూర్తి వ్యాకోచ డిమాండ్: ధరలో స్వల్ప మార్పు వచ్చినా లేదా రాకపోయినా డిమాండ్లో ఊహించలేనంతగా మార్పు కలిగితే దానిని పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటారు. దీని వ్యాకోచ విలువ అనంతంగా ఉంటుంది. ఇక్కడ ‘ డిమాండ్ రేఖ ‘X’ అక్షంకు సమాంతరంగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 13

పై రేఖాపటంలో డిమాండ్ రేఖ ‘X’ అక్షానికి సమాంతరంగా ఉంటుంది.
Ed = ∞

2. పూర్తి అవ్యాకోచ డిమాండ్: ధర పెరిగినా లేదా తగ్గినా డిమాండ్లో ఎలాంటి మార్పు రాకుంటే దానిని పూర్తి అవ్యాకోచ డిమాండ్ అంటారు. దీని విషయంలో వ్యాకోచత్వ విలువ ‘0’ గా ఉంటుంది. డిమాండ్ రేఖ ‘y’ అక్షానికి సమాంతరంగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 15

‘DD’ రేఖ ‘Y’ అక్షానికి సమాంతరంగా ఉంది. పూర్తి అవ్యాకోచ డిమాండ్ ఉన్నప్పుడు వ్యాకోచత్వం విలువ ‘0’ కు సమానం.
∴ Ed = 0

3. ఏకత్వ వ్యాకోచ డిమాండ్: వస్తువు ధరలో వచ్చే అనుపాతపు మార్పుకు, డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పుకు సమానమైతే దానిని ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వం విలువ ‘1’ కి సమానంగా ఉంటుంది. ఈ డిమాండ్ రేఖ “లంబ అతిపరావలయంగా” ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 16
పై రేఖాపటంలో OQ1 = PP1 కి సమానం. అందువల్ల Ed = 1.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

4. సాపేక్ష వ్యాకోచ డిమాండ్: వస్తువు ధరలో వచ్చే అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పు ఎక్కువగా ఉంటే దానిని సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ వ్యాకోచత్వం విలువ ‘1’ కంటే ఎక్కువగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 17
పై రేఖాపటంలో ‘DD’ రేఖ సాపేక్ష వ్యాకోచ డిమాండ్ను సూచించును. OQ1 > PP1 గా ఉంది. ఇక్కడ వ్యాకోచత్వ విలువ 1 కంటే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ΔP కంటే ΔQ ఎక్కువగా ఉంటుంది.

5. సాపేక్ష అవ్యాకోచ డిమాండ్: వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో వచ్చిన అనుపాత మార్పు తక్కువగా ఉంటుంది. దానిని సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ వ్యాకోచ విలువ ‘1’ కంటే తక్కువగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 18

‘DD’ రేఖ సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ను సూచిస్తుంది. ఇక్కడ వ్యాకోచత్వ విలువ ‘1’ కంటే తక్కువగా ఉంటుంది.

ప్రశ్న 7.
ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలిచే మూడు పద్ధతులను వివరించండి.
జవాబు:
డిమాండ్ సూత్రం కేవలం ధర మార్పు వల్ల డిమాండ్ దిశను తెలియజేస్తుందిగాని, డిమాండ్లో వచ్చే పరిమాణాత్మకమైన మార్పును తెలియజేయదు. ఈ మార్పును తెలియజేయటానికి “మార్షల్ డిమాండ్ వ్యాకోచత్వ భావనను అర్ధశాస్త్రంలో ప్రవేశపెట్టెను. వస్తువు ధరలో వచ్చిన మార్పు వలన డిమాండ్లో వచ్చే పరిమాణాత్మకమైన లేదా సంఖ్యాత్మకమైన మార్పును తెలియజేయునది డిమాండ్ వ్యాకోచత్వ భావన.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

ధరలో వచ్చిన అనుపాతం మార్పుకు, డిమాండ్లో వచ్చిన అనుపాతం మార్పుకు మధ్యగల సంబంధాన్ని ధర డిమాండ్ వ్యాకోచత్వం అని అంటారు. వ్యాకోచత్వాన్ని ఈ క్రింది విధంగా కొలవటం జరుగుతుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 19

డిమాండ్ వ్యాకోచత్వము కొలిచే పద్ధతులు:
1. మొత్తం ఖర్చు పద్ధతి: వ్యాకోచత్వాన్ని కొలవటానికి మార్షల్ మొత్తం ఖర్చు పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఒక వస్తువు ధరలో మార్పు వల్ల మొత్తము ఖర్చు ఏ విధంగా మారుతుందో తెలుసుకోవటం వల్ల వ్యాకోచత్వాన్ని కొలవడం జరిగింది. వస్తువు పరిమాణాన్ని ధరతో గుణిస్తే మొత్తం ఖర్చు వస్తుంది. వస్తువు ధరకు, మొత్తం ఖర్చుకు విలోమ సంబంధం ఉంటే డిమాండ్ వ్యాకోచత్వం 1 కంటే ఎక్కువ, (వ్యాకోచ డిమాండ్); అనులోమ సంబంధం ఉంటే 1 కంటే తక్కువ (అవ్యాకోచ డిమాండ్) ధర మారినప్పటికీ మొత్తం ఖర్చులో మార్పు లేకపోయినట్లయితే 1 కి సమానం (ఏకత్వ వ్యాకోచ డిమాండ్). ఈ విషయాన్ని ఈ క్రింది ఊహాజనితమైన డిమాండ్ పట్టిక ద్వారా గ్రహించవచ్చును.

డిమాండ్ పట్టిక:
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 20

2. బిందు వ్యాకోచ పద్ధతి: మార్షల్ రేఖాగణిత పద్ధతిలో డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలిచే పద్ధతిని తెలియచేసాడు. బిందు వ్యాకోచ పద్ధతిలో సరళంగా ఉన్న డిమాండ్ రేఖ రెండు చివరలు X మరియు Y అక్షాలను తాకునట్లుగా పొడిగించి, ఆ రేఖపై ఒక బిందువు వద్ద డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవటం బిందు వ్యాకోచపద్ధతిలో వ్యాకోచత్వాన్ని కొలవటమంటారు. పటములో AB సరళరేఖగా ఉంది. డిమాండ్ రేఖ X, Y అక్షాలను తాకుతుంది. AB డిమాండ్ రేఖపై గల ‘P’ అనే బిందువు వద్ద వ్యాకోచత్వాన్ని ఈ క్రింద ఇవ్వబడిన సూత్రం ద్వారా గణన చేయవచ్చును.
AB డిమాండ్ రేఖపై ‘P’ బిందువు వద్ద వ్యాకోచము.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 21

ఈ పద్దతిలో డిమాండ్ రేఖ పొడవును బట్టి ఆ రేఖపై ఉన్న వివిధ బిందువుల వద్ద డిమాండ్ వ్యాకోచత్వాన్ని గణన చేయవచ్చును.

డిమాండ్ రేఖ సరళరేఖ అయినప్పుడు డిమాండ్ వ్యాకోచత్వం: సరళరేఖగా ఉన్న డిమాండ్ రేఖపై ఏ బిందువు వద్దనైనా బిందు వ్యాకోచ పద్దతిని ఉపయోగించి వ్యాకోచత్వాన్ని కొలవవచ్చు.
ఉదా: AE డిమాండ్ రేఖ పొడవు 4 Cm పొడవని ఊహిద్దాం.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

క్రింది రేఖాపటంలో డిమాండ్ వ్యాకోచత్వం ఈ క్రింది విధంగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 22

డిమాండ్ రేఖ వక్ర రేఖ అయితే: డిమాండ్ రేఖ వక్రరేఖ అయితే పై సూత్రాన్ని ఉపయోగించి ఏ బిందువు వద్దనైనా స్పర్శరేఖ సహాయంతో వ్యాకోచత్వాన్ని కొలవవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 23
పై రేఖాపటంలో DD డిమాండ్ రేఖ. AB రేఖ DD రేఖను ‘C’ బిందువు వద్ద తాకింది.
‘C’ బిందువు వద్ద వ్యాకోచం = CB/CA = 1

3. ఆర్క్ పద్ధతి: డిమాండ్ రేఖపై రెండు బిందువుల మధ్య దూరాన్ని ఆర్క్ అంటారు. డిమాండ్ రేఖపై ఏదో ఒక బిందువు వద్ద కాకుండా రెండు బిందువుల మధ్య భాగంలో ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవడానికి ‘ఆర్క్’ పద్ధతిని ఉపయోగిస్తారు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 24

ఉదా: ఒక వస్తువు ధర 4/- ఉన్నప్పుడు 300 యూనిట్లు కొనుగోలు చేయబడ్డాయి. అదే ధర 3/- తగ్గినప్పుడు 400 యూనిట్లు కొనుగోలు చేయబడ్డాయి. అప్పుడు వ్యాకోచాన్ని ఈ విధంగా కొలవవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 25AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 26

దీనిని ఈ క్రింది పటం ద్వారా చూపవచ్చు.

ప్రశ్న 8.
ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే అంశాలు ఏవి?
జవాబు:
ఒక వస్తువు ధరలో మార్పు కలిగినప్పుడు ఏ మేరకు డిమాండ్లో ప్రతిస్పందన వస్తుందో తెలియచేసేదే డిమాండ్ వ్యాకోచత్వము. ధర మార్పు శాతానికి, డిమాండ్లో వచ్చే మార్పు శాతానికి మధ్యగల నిష్పత్తినే వ్యాకోచత్వంగా నిర్వచించవచ్చును. డిమాండ్ వ్యాకోచత్వము అన్ని వస్తువులకు ఒకే విధంగా ఉండదు. ధర డిమాండ్ వ్యాకోచత్వ స్వభావాన్ని లేదా స్థాయిని ఈ క్రింది అంశాలు నిర్ణయిస్తాయి.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే కారకాలు:
1. వస్తువు స్వభావము: వస్తువులలో కొన్ని అవసరాలు, మరికొన్ని సౌకర్యాలు, ఇంకొన్ని విలాసాలు ఉంటాయి. నిత్యావసర వస్తువులకు ధర పెరిగినా, డిమాండ్ తగ్గదు. కనుక వాటికి అవ్యాకోచ డిమాండ్ ఉంటుంది. ఇవి లేకపోతే మానవ మనుగడ కష్టం. సౌకర్యాలు, విలాసాలకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఇవి లేకపోయినా ప్రజలు బ్రతకగలరు. కనుక వీటి ధర మార్పు కంటే డిమాండ్లో వచ్చే మార్పు అధికంగా ఉంటుంది.

2. ప్రత్యామ్నాయ వస్తువులు: ప్రత్యామ్నాయ వస్తువులు అధిక సంఖ్యలో ఉన్న వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ప్రత్యామ్నాయ వస్తువులు లేనప్పుడు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

3. కొనుగోలు వాయిదా వేయటానికి అవకాశం: కొనుగోలును వాయిదా వేయటానికి అవకాశం ఉన్న వస్తువుల విషయంలో ధర డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. కొనుగోలును వాయిదా వేయటానికి వీలులేని వస్తువులకు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

4. బహుళ ప్రయోజనాలున్న వస్తువులు: బొగ్గు, విద్యుచ్ఛక్తి మొదలగు బహుళ ప్రయోజనాలు గల వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఒకే ప్రయోజనం లేక ఉపయోగం గల వస్తువులకు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

5. కాలము: స్వల్ప కాలంలో డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. దీర్ఘ కాలంలో వ్యాకోచత్వం ఎక్కువగా ఉంటుంది.

6. పూరక వస్తువులు: పూరక వస్తువుల విషయంలో డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

7. ధరస్థాయి: ధర స్థాయి ఎక్కువగా ఉంటే వ్యాకోచమైన డిమాండ్ ఉంటుంది. ధర స్థాయి తక్కువగా ఉంటే అవ్యాకోచమైన డిమాండ్ ఉంటుంది.

8. వినియోగదారుని బడ్జెట్లో వస్తువుకు గల ప్రాధాన్యం: వినియోగదారుని ఆదాయంలో ఒక వస్తువుపై చేసే ఖర్చు శాతం తక్కువగా ఉంటే డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఆదాయంలో హెచ్చు శాతం ఖర్చు చేసే వస్తువుల విషయంలో డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది.

9. వస్తువు మన్నికపై ఆధారపడును: మన్నికగల, నిల్వ చేయటానికి వీలైన అనశ్వర వస్తువులపై చేసే డిమాండ్ అవ్యాకోచంగాను, నశ్వర వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగాను ఉంటుంది.

10. పేదవారి వస్తువులు: పేదవారు వినియోగించే వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఈ వస్తువుల ధరలు తగ్గినపుడు వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న 9.
ధర డిమాండ్ ‘వ్యాకోచత్వం ప్రాముఖ్యాన్ని వివరించండి.
జవాబు:
1. ఉత్పత్తిదార్లకు: ఉత్పత్తిదార్లు వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని అనుసరించి ఉత్పత్తి చేస్తారు. ఏ వస్తువులకైతే డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుందో ఆ వస్తువులను ఉత్పత్తి చేస్తారు. ఎందుకంటే అటువంటి వస్తువుల ధరను పెంచి లాభం పొందగలుగుతారు.

2. సమిష్టి వస్తువుల ధర నిర్ణయం: జంటగా కొన్ని వస్తువులు ఉత్పత్తి చేయబడతాయి. ఉదా: పంచదార, మొలాసిన్, ఈ వస్తువుల విషయంలో ఒక్కొక్క వస్తువు ఉత్పత్తి వ్యయాన్ని విడదీసి చెప్పడానికి వీలుండదు. అందువల్ల ఈ వస్తువుల ధర నిర్ణయంలో డిమాండ్ వ్యాకోచంగా ఉన్న వాటికి తక్కువ ధరను, అవ్యాకోచంగా ఉన్న వాటికి ఎక్కువ ధర నిర్ణయించడం జరుగుతుంది.

3. ఏకస్వామ్యదార్లు: ఏకస్వామ్యదార్లు వస్తువుకున్న డిమాండ్ వ్యాకోచత్వం ఆధారంగా ధర నిర్ణయిస్తారు. అవ్యాకోచత్వం ఉన్న వస్తువులకు ఎక్కువ ధరను, వ్యాకోచత్వం ఎక్కువ ఉన్న వస్తువులకు తక్కువ ధరను నిర్ణయిస్తారు.

4. ప్రభుత్వం: కొన్ని వస్తువులు ప్రజాసంక్షేమాన్ని పెంపొందిస్తాయి. అందువల్ల ఈ వస్తువులకు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. ఉదా: మందులు, రైలు ప్రయాణం మొదలైనవి.

5. ఆర్థిక మంత్రికి పన్నులు విధించేటప్పుడు ఆర్థిక మంత్రికి వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వం ఉపయోగపడుతుంది. అంతేకాక ఆర్థిక మంత్రికి కోశ విధాన రూపకల్పనలో డిమాండ్ వ్యాకోచత్వ భావన తోడ్పడుతుంది.

6. అంతర్జాతీయ వ్యాపారం అంతర్జాతీయ వ్యాపారంలో వివిధ దేశాల మధ్య వస్తువుల మారకపు రేటును నిర్ధారించేటప్పుడు వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఉదా: ఏ దేశమైనా మూల్యహీనీకరణ ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే ఎగుమతి చేసే వస్తువులకు దిగుమతి చేసుకొంటున్న వస్తువులకు ధర డిమాండ్ వ్యాకోచత్వం ‘1’ కంటే ఎక్కువగా ఉండాలి.

7. పేదరికం: సంపద మాటున దాగిఉన్న పేదరికంను అర్థం చేసుకోవడానికి డిమాండ్ వ్యాకోచత్వ భావన ఉపయోగపడుతుంది.

8. వేతనాలు: శ్రామికులకున్న డిమాండ్ వ్యాకోచత్వం వారి వేతనాలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల యాజమాన్యం వేతనాలను నిర్ణయించేటప్పుడు శ్రామికులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
డిమాండ్ సూత్రాన్ని లేదా ధర-డిమాండ్ భావనను వివరించండి.
జవాబు:
అర్థశాస్త్రంలో డిమాండ్ భావనకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఒక వస్తువును కొనాలనే కోరికతోపాటు కొనేశక్తి, కొనాలన్న ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. కనుక డిమాండ్ను ఈ క్రింది విధముగా నిర్వచించవచ్చు. “ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధరవద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తువు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అని బెన్హమ్ పేర్కొన్నాడు.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

ధర డిమాండ్-డిమాండ్ సూత్రము: డిమాండ్ సూత్రం వస్తువు ధరకు, డిమాండ్కు గల సంబంధాన్ని తెలియజేస్తుంది. “ఇతర అంశాలు స్థిరముగా ఉంటే, వస్తువు ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది.” అని మార్షల్ డిమాండ్ సూత్రాన్ని నిర్వచించెను. డిమాండ్ సూత్రాన్ని ఈ విధంగా పేర్కొనవచ్చును.
Dn = f[Pn]

డిమాండ్ పట్టిక:
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 27AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 28

వినియోగదారుడు లేదా వినియోగదారులు ఒక వస్తువును వివిధ ధరల వద్ద ఏ పరిమాణంలో కొనుగోలు చేస్తారో తెలియజేస్తుంది డిమాండ్ పట్టిక. పట్టిక నుంచి వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందని ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుందని తెలుస్తుంది. దీనిని ఆధారంగా చేసుకొని డిమాండ్ రేఖను గీయవచ్చును.

డిమాండ్ రేఖ: పటములో X – అక్షముపై వస్తువు డిమాండ్ పరిమాణం, Y – అక్షముపై వస్తువు ధరను చూపినాము. DD డిమాండ్ రేఖ. డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందివైపుకు వాలి ఉంది. ఇది ఋణాత్మకమైన వాలు. వస్తువు ధరకు, డిమాండ్కు మధ్య విలోమ సంబంధమున్నదని ఋణాత్మకమైన వాలు తెలియజేస్తుంది.

ప్రశ్న 2.
డిమాండ్ సూత్రం మినహాయింపులను వివరించండి.
జవాబు:
డిమాండ్ సూత్రం ప్రకారం వస్తు ధరకు, డిమాండ్కు విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాని కొన్ని పరిస్థితులలో ధర, డిమాండ్ అనులోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి. అంటే ధర పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ధర తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ఈ పరిస్థితి డిమాండ్ సూత్రానికి మినహాయింపు.

ధర ‘OP’ ఉన్నప్పుడు ‘OQ’ వస్తు పరిమాణం డిమాండ్ చేయబడింది. ధర ‘OP’ నుంచి OP1 కు పెరగగా డిమాండ్ OQ నుంచి OQ1 కు పెరిగింది. ఈ పరిస్థితి డిమాండ్ సూత్రానికి విరుద్ధం.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 29

మినహాయింపులు:
1. గిఫెన్ వైపరీత్యం: పేద కార్మికులు రొట్టె ధర పెరిగితే మాంసముపై వెచ్చించే డబ్బును కూడా రొట్టెపై ఖర్చు చేస్తారు. అనగా రొట్టె ధర పెరిగినా డిమాండ్ తగ్గదు. ఇది పేదవాళ్ళ ఆహారం కావటమే ఇందుకు కారణము. ఈ సత్యాన్ని సర్ రాబర్ట్ గిఫెన్ అనే ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆర్థికవేత్త 19వ శతాబ్దం మధ్య భాగంలో పరిశీలించాడు. కనుక దీనిని గిఫెన్ వైపరీత్యం అంటారు. పేదవారు ముఖ్యంగా నిత్యావసర వస్తువులలో తక్కువ ధర గల వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ ప్రత్యేకమైన వస్తువులనే గిఫెన్ వస్తువులంటారు. ఉదా: రాగులు, జొన్నలు మొదలైనవి.

2. గౌరవ సూచిక వస్తువులు: గౌరవ సూచిక వస్తువుల ధర పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. వీటిని కొనుగోలు చేయటం వలన సమాజంలో గౌరవము, ప్రతిష్ఠ పెరుగుతాయని భావిస్తారు. వీటి ధర తగ్గితే గౌరవం, ప్రతిష్ఠ తగ్గుతాయని భావిస్తారు. ఉదా: విలువ గల వజ్రాలు, ఆభరణాలు మొదలైనవి. ఇది డిమాండ్ సూత్రానికి వ్యతిరేకము. ఈ విషయాన్ని వెబెన్ అనే అమెరికా ఆర్థికవేత్త తెలియజేసెను. అందువల్ల ఇటువంటి వస్తువులను వెబ్లెన్ వస్తువులంటారు.

3. అంచనా వ్యాపారం: ఒక వస్తువు ధర మరింత పెరగడానికి వ్యాపారస్తులు, కొనుగోలుదారులు ఆ వస్తువును ఎక్కువగా డిమాండ్ చేస్తారు. అదే విధంగా ధర తగ్గినప్పుడు ఇంకా తగ్గుతుందని భావిస్తే కొనుగోలు తగ్గిస్తారు. దీనినే సట్టా వ్యాపారం అని కూడా అంటారు. ఉదా: షేర్లు, బాండ్లు మొదలైనవి.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

4. భ్రాంతి: కొంతమంది వినియోగదారులు కొన్నిసార్లు ఎక్కువ ధర కలిగి ఉన్న వస్తువులు ఎక్కువ నాణ్యతతో కూడి ఉంటాయన్న భ్రాంతిలో ఉంటారు. అందువల్ల ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇటువంటి వాటి విషయంలో డిమాండ్ సూత్రం వర్తించదు.

ప్రశ్న 3.
డిమాండ్ రేఖ ఎందుకని రుణాత్మక వాలు కలిగి ఉంటుంది. లేదా ఎందుకని ఎడమ నుంచి కుడికి కిందికి వాలుతుంది ?
జవాబు:
ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తువు పరిమాణాన్ని డిమాండ్ అంటారు. “ఇతర పరిస్థితులు మారకుండా స్థిరంగా ఉన్నప్పుడు ఒక నిర్ణీత కాలంలో ఒక వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది.” అని డిమాండ్ సూత్రం తెలియజేస్తుంది. దీనిని బట్టి వస్తువు థరకు, డిమాండ్కు విలోమ సంబంధం ఉందని తెలుస్తుంది. కనుక డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందివైపుకు వాలి ఉంటుంది. దీనికి అనేక కారణాలున్నాయి. అవి:

1. క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం: క్షీణోపాంత ప్రయోజనాన్ని ఆధారంగా చేసుకొని డిమాండ్ సూత్రం చెప్పబడినది. వస్తువు పరిమాణం ఎక్కువైతే ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది. ఉపాంత ప్రయోజనం తక్కువగా ఉంటే వినియోగదారుడు ఆ వస్తువుకు ధర చెల్లించాలనుకున్నాడు. అందువల్ల ధర తక్కువగా ఉంటే ఎక్కువగానూ, ధర ఎక్కువగా ఉంటే తక్కువగాను వస్తు పరిమాణాన్ని బట్టి డిమాండ్ చేస్తాడు.

2. ఆదాయ ప్రభావము: ఒక వస్తువు ధర పెరిగితే వినియోగదారుని వాస్తవిక ఆదాయం ధర పెరిగిన మేరకు తగ్గుతుంది. అందువల్ల వాస్తవిక ఆదాయం తగ్గినమేరకు ఆ వస్తువును తక్కువ పరిమాణంలో డిమాండ్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఒక వస్తువు ధర తగ్గితే ధర తగ్గిన మేరకు వాస్తవిక ఆదాయం పెరిగినట్లే అవుతుంది. కనుక ఆ మేరకు డిమాండ్ పెరుగుతుంది. దీనినే డిమాండ్పై ఆదాయ ప్రభావం అంటారు. ఉదా: ఒక వస్తువుకు వినియోగదారుడు 5 రూపాయలు కేటాయిస్తే వస్తువు ధర ఒక రూపాయిగా ఉంటే 5 యూనిట్లు కొనుగోలు చేస్తాడు. వస్తువు ధర అర్థ రూపాయికి తగ్గితే 10 యూనిట్లను కొనుగోలు చేస్తారు.

3. ప్రత్యామ్నాయాల ప్రభావం రెండు వస్తువులు ప్రత్యామ్నాయ వస్తువులు అయితే ఒక వస్తువు ధర తగ్గి మరొక వస్తువు ధర స్థిరంగా ఉంటే ధర తగ్గిన వస్తువుకు ధర స్థిరంగా ఉన్న వస్తువుకు బదులుగా ప్రత్యామ్నాయం చేస్తారు. ఉదా: పెప్సి, థమ్సప్ శీతల పానీయాలు. పెప్సి ధర పెరిగితే వినియోగదార్లు దానికి ప్రత్యామ్నాయంగా థమ్సప్ కొనుగోలు చేస్తారు.

4. పాత, నూతన కొనుగోలుదార్లు: ఒక వస్తువు ధర తగ్గగానే ముందు నుంచి ఆ వస్తువును కొనుగోలు చేస్తున్న పాత వినియోగదారుల వాస్తవిక ఆదాయం పెరిగి ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా ఒక వస్తువు ధర తగ్గినప్పుడు ఆకర్షితులైన కొత్త వినియోగదార్లు ఆ వస్తువును ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అందువల్ల ధర తగ్గినప్పుడు వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది.

5. వస్తువుకున్న బహుళ ఉపయోగాలు: కొన్ని వస్తువులకు బహుళ ఉపయోగాలుంటాయి. మరికొన్ని వస్తువులు ఒక ప్రత్యేకమైన ఉపయోగానికి మాత్రమే వినియోగించబడతాయి. అనేక ఉపయోగాలున్న వస్తువులకు ధర తగ్గితే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఉదా: పాలు, బొగ్గు, విద్యుచ్ఛక్తి మొదలైనవి.

ప్రశ్న 4.
ఆదాయ డిమాండ్ భావనను వివరించండి.
జవాబు:
వినియోగదారుని ఆదాయానికి, వస్తువు డిమాండ్కు మధ్యనున్న సంబంధాన్ని ఆదాయ డిమాండ్ అంటారు. వివిధ ఆదాయాల వద్ద వస్తువు డిమాండ్ పరిమాణం ఏవిధంగా ఉందో ఆదాయ డిమాండ్ తెలియజేస్తుంది.
D1 = f(y)

ఇతర అంశాలు మారకుండా స్థిరంగా ఉంటే ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ధరకు, ఆదాయంకు ధనాత్మక సంబంధం ఉంది. ఆదాయ డిమాండ్ను అనుసరించి వస్తువులలో మేలురకం లేదా నాసిరకం వస్తువులుగా గుర్తించవచ్చు.

మేలురకం వస్తువులు / సాధారణ వస్తువులు: ఆదాయం పెరిగితే మేలురకం వస్తువులు లేదా సాధారణ వస్తువుల డిమాండ్ పెరుగుతుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 30

ప్రక్క రేఖాపటంలో ‘OX’ అక్షంపై డిమాండ్ పరిమాణంను, ‘OY అక్షంపై ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY’ ఉన్నప్పుడు ‘OQ’ వస్తు పరిమాణం డిమాండ్ చేయబడింది. ఆదాయం ‘OY’ నుంచి ‘OY1‘ కు పెరిగినప్పుడు మేలురకం వస్తువుల డిమాండ్ ‘OQ’ నుంచి ‘OQ1‘ కు పెరిగింది. ‘YD’ రేఖ ధనాత్మక వాలు కలిగి ఉంటుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

నాసిరకం వస్తువులు: మేలురకం వస్తువులకు భిన్నంగా వినియోగదార్ల ఆదాయం పెరిగితే నాసిరకం వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. ప్రక్క రేఖాపటంలో ‘OX’ అక్షం మీద డిమాండ్ పరిమాణాన్ని, ‘OY’ అక్షం మీద ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY’ నుంచి ‘OY1‘ కు పెరిగినప్పుడు డిమాండ్ ‘OQ’ నుంచి ‘OQ1‘ కు తగ్గును. ‘YD’ రేఖ ఎడమ నుండి కుడికి వాలి ఉంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 31

ప్రశ్న 5.
జాత్యంతర డిమాండ్ భావనను వివరించండి.
జవాబు:
ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలకు, ఒక వస్తువు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని జాత్యంతర డిమాండ్ అంటారు. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన మార్పుల వల్ల ఒక వస్తువు డిమాండ్లో వచ్చే మార్పులను జాత్యంతర డిమాండ్ తెలియజేయును.

జాత్యంతర డిమాండ్ను ఈ విధంగా వ్రాయవచ్చు.
Dx = f(Py).

ప్రత్యామ్నాయ వస్తువులు: ఒక కోర్కెను తీర్చగల వివిధ వస్తువులను ప్రత్యామ్నాయ వస్తువులు అంటారు. ఉదా: కాఫీ, టీ. ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ధనాత్మక సంబంధాన్ని తెలియజేయును. దీనిని రేఖాపటం ద్వారా చూపవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 32

పై రేఖాపటంలో కాఫీ ధర ‘OY’ నుంచి ‘OY2‘ కు పెరిగినప్పుడు టీ డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ2‘ కు పెరిగింది. ‘CD’ రేఖ ధనాత్మక వాలును కలిగి ఉంది.

పూరక వస్తువులు: ఒకే కోరికను తీర్చగల సమిష్టి వస్తువులు. ఉదా: కారు, పెట్రోలు, వీటి విషయంలో డిమాండ్ విలోమ సంబంధాన్ని తెలియజేయును.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 33

పై రేఖాపటంలో డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ2‘ కు పెరిగింది. ధర ‘OP’ నుండి ‘OP2‘ కు తగ్గినప్పుడు ‘CD’ రేఖ ఋణాత్మక వాలు కలిగి ఉంది.

ప్రశ్న 6.
డిమాండ్ నిర్ణయించే అంశాలను వివరించండి. [Mar. ’17, ’16]
జవాబు:
“ఒక నిర్ణీతమైన కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

డిమాండ్ను నిర్ణయించే కారకాలు లేదా అంశాలు:
1. ఆధాయంలో మార్పు: ప్రజల ఆదాయాల మార్పును బట్టి పస్తువుల డిమాండ్లో మార్పు ఏర్పడుతుంది. ప్రజల ఆదాయం పెరిగితే వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. ఆదాయాలు తగ్గితే వస్తువుల డిమాండ్ తగ్గుతుంది.

2. అభిరుచులు, అలవాట్లలో మార్పులు: ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చే మార్పుల వలన వస్తువు డిమాండ్ లో మార్పు వస్తుంది.

3. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో మార్పులు: ప్రజల అభిరుచులలో అలవాట్లలో మార్పుల వల్ల వస్తువు డిమాండ్లో మార్పులు వస్తాయి.

4. జనాభాలో మార్పు: జనాభా పెరుగుదల, తగ్గుదలను అనుసరించి కూడా వస్తువుల డిమాండ్లో మార్పులు వస్తాయి.

5. వాతావరణంలో మార్పులు: వాతావరణంలో మార్పులు కూడా డిమాండ్లో మార్పులను తీసుకొని వస్తాయి. ఉదా: వేసవికాలంలో చల్లని పానీయాలకు డిమాండ్ పెరుగుతుంది.

6. సాంకేతికాభివృద్ధి: సాంకేతికాభివృద్ధి వలన వస్తూత్పత్తి వ్యయం తగ్గి, వస్తు ధరలు తగ్గుతాయి. అందువల్ల పూర్వం కొనుగోలు చేయడానికి ఉపయోగించిన ద్రవ్య పరిమాణంలో వస్తువులను ఎక్కువగా డిమాండ్ చేయటానికి అవకాశం ఉంటుంది.

7. ఆర్థిక స్థితిగతులు: వాణిజ్య విజృంభణ కాలంలో అన్ని వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. కానీ, ఆర్థిక మాంద్య పరిస్థితులలో అన్ని వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది.

8. ప్రభుత్వ విధానము: ప్రభుత్వ పన్నుల విధానం, రాయితీ విధానము మొదలైనవి వస్తువు ధర తగ్గితే డిమాండ్ ప్రభావితం చేయును.

9. వస్తువు ధర: ఒక వస్తువు ధరకు, డిమాండ్కు విలోమ సంబంధం ఉన్నది. కనుక వస్తువు ధర తగ్గితే, డిమాండ్ పెరుగుతుంది. వస్తువు ధర పెరుగుటచే డిమాండ్ తగ్గుతుంది.

ప్రశ్న 7.
డిమాండ్ వ్యాకోచత్వం అర్థాన్ని తెలిపి, నిర్వచించండి.
జవాబు:
అర్థశాస్త్రంలో డిమాండ్ వ్యాకోచత్వం అనే భావనకు విశేష ప్రాధాన్యత ఉంది. ధరలో వచ్చిన మార్పు స్పందనకు ప్రతిస్పందనగా డిమాండ్లో ఎంత మేరకు మార్పు వస్తుందో డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలుపుతుంది. ఒక వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పు ఎంత ఉంటుందో డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలియజేయును. అంటే ధరలో వచ్చే శాతం మార్పుకు, డిమాండ్లో వచ్చే శాతం మార్పుకు మధ్య ఉన్న సంఖ్యాత్మక సంబంధాన్ని డిమాండ్ వ్యాకోచత్వం తెలుపుతుంది. డిమాండ్ వ్యాకోచత్వం అనే భావనను కీరనీట్, మిల్ రూపొందించినప్పటికీ, మార్షల్ అభివృద్ధిపరిచారు.

మార్షల్ అభిప్రాయంలో “ధర తగ్గినప్పుడు డిమాండ్ ఎక్కువ పెరిగిందా లేదా తక్కువ పెరిగిందా, ధర పెరిగినప్పుడు డిమాండ్ తక్కువ తగ్గిందా లేదా ఎక్కువ తగ్గిందా అనే దాని ఆధారంగా మార్కెట్ డిమాండ్ వ్యాకోచత్వం ఎక్కువగాని, తక్కువగాని ఉంటుంది.”

శ్రీమతి జోన్ రాబిన్సన్ అభిప్రాయంలో “ధరలో వచ్చే అనుపాత మార్పు స్పందనకు బదులుగా డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పుకు ప్రతిస్పందన ఏ మేరకు ఉంటుందో తెలియజేసే భావన డిమాండ్ వ్యాకోచత్వం”.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 34

ప్రశ్న 8.
మొత్తం ఖర్చు పద్దతి ద్వారా ధర డిమాండ్ వ్యాకోచత్వాలను ఎలా కొలుస్తారు ?
జవాబు:
ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలిచే పద్ధతులలో మొత్తం ఖర్చు పద్ధతి ఒకటి. ఈ పద్ధతిలో వస్తువు ధర మార్పు వల్ల ఆ వస్తువుపై వినియోగదారుని మొత్తం ఖర్చులో వచ్చిన మార్పులను పరిశీలించడం ద్వారా డిమాండ్ వ్యాకోచత్వం కొలవబడుతుంది. వస్తువు ధరకు, మొత్తం ఖర్చుకు విలోమ సంబంధం ఉంటే డిమాండ్ వ్యాకోచత్వం ఒకటికన్నా ఎక్కువగా ఉంటే దానిని వ్యాకోచిత డిమాండ్ అంటారు. వస్తువు ధరకు, మొత్తం ఖర్చుకు అనులోమ సంబంధం ఉంటే డిమాండ్ వ్యాకోచత్వం ఒకటి కన్నా తక్కువగా ఉంటే దానిని అవ్యాకోచిత డిమాండ్ అంటారు. వస్తువు ధర మారినప్పటికీ మొత్తం ఖర్చులో మార్పు లేకపోతే డిమాండ్ వ్యాకోచత్వం ఒకటికి సమానముగా ఉంటే దానిని ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అంటారు. ఈ విషయాన్ని ఈ క్రింది ఊహాజనిత డిమాండ్ పట్టిక ద్వారా గ్రహించవచ్చును.

డిమాండ్ పట్టిక:
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 35

పట్టికలోని విషయాన్ని క్రింది రేఖాపటం ద్వారా పరిశీలించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 36

పటములో Y – అక్షముపై వస్తువు ధరను, X – అక్షముపై మొత్తం ఖర్చును చూపటం జరిగింది. OP1 (60) ధర పెరిగినప్పుడు మొత్తం ఖర్చు తగ్గింది. కనుక డిమాండ్ వ్యాకోచితంగా ఉన్నది. అనగా Ep > 1. ధర OP (50) నుండి OP2 (40) కు తగ్గినపుడు మొత్తం ఖర్చులో మార్పు రాలేదు. కనుక ఏకత్వ వ్యాకోచ డిమాండ్ను సూచిస్తుంది. అనగా Ep = 1. ధర OP2(40) నుండి OP3 (30) కి తగ్గినపుడు మొత్తం ఖర్చు కూడా తగ్గింది. కనుక అవ్యాకోచ డిమాండ్ను సూచిస్తుంది. అనగా Ep < 1. డిమాండ్ రేఖ ABCD లో A నుండి B వరకు వ్యాకోచిత డిమాండ్, B నుండి C వరకు ఏకత్వ వ్యాకోచ డిమాండ్, C నుండి D వరకు అవ్యాకోచ డిమాండ్.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
డిమాండ్
జవాబు:
ఒక వస్తువును కొనాలనే కోరికతో పాటు కొనేశక్తి, ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. బెన్హామ్ అభిప్రాయంలో ఒక నిర్ణీతకాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని డిమాండ్గా పేర్కొనెను.

ప్రశ్న 2.
డిమాండ్ పట్టిక [Mar. ’17]
జవాబు:
వస్తువు ధరకు, వస్తువు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే పట్టికను డిమాండ్ పట్టిక అంటారు. ఈ డిమాండ్ పట్టిక రెండు రకాలు. 1) వైయుక్తిక డిమాండ్ పట్టిక, 2) మార్కెట్ డిమాండ్ పట్టిక.

ప్రశ్న 3.
వైయుక్తిక డిమాండ్ పట్టిక.
జవాబు:
ఒక వినియోగదారుడు ఒక వస్తువును వివిధ ధరల వద్ద ఎంతెంత పరిమాణంలో కొనుగోలు చేస్తాడో తెలియజేయునది వైయుక్తిక డిమాండ్. దానిని పట్టిక రూపంలో తెలియజేస్తే అది వైయుక్తిక డిమాండ్ పట్టిక.

ప్రశ్న 4.
మార్కెట్ డిమాండ్ పట్టిక
జవాబు:
మార్కెట్లో అనేక మంది వినియోగదారులు ఉంటారు. వారందరి డిమాండ్ పట్టికలను కలిపితే మార్కెట్ డిమాండ్ పట్టిక వస్తుంది. మార్కెట్ డిమాండ్ వివిధ వినియోగదార్లు వస్తువులను వివిధ ధరల వద్ద ఒక వస్తువును ఎంతెంత పరిమాణంలో కొనుగోలు చేస్తారో తెలియజేస్తుంది.

ప్రశ్న 5.
డిమాండ్ ఫలం [Mar. ’15]
జవాబు:
ఒక వస్తువు డిమాండ్ పరిమాణానికి, దానిని నిర్ణయించే కారకాలకు మధ్యగల సంబంధాన్ని డిమాండ్ ఫలం తెలియజేయును. డిమాండ్ ఫలాన్ని సమీకరణం ద్వారా తెలియజేయవచ్చు. Dx = f(Px, Py, Y, T).

ప్రశ్న 6.
గిఫెన్ వైపరీత్యం లేదా గిఫెన్ వస్తువులు [Mar. ’16]
జవాబు:
ధర పెరిగినప్పటికి డిమాండ్ తగ్గకపోగా, పెరగటం లేదా అదే విధంగా డిమాండ్ను కలిగి ఉండే వస్తువులను గిఫెన్ వస్తువులంటారు. నాసిరకపు వస్తువులను గిఫెన్ వస్తువులంటారు. వాటి ధర పెరిగితే ఇతర వస్తువులపై ఖర్చు తగ్గించి ఈ వస్తువులను కొనుగోలు చేస్తారు. దీనిని సర్ రాబర్ట్ గిఫెన్ అనే ఆర్థికవేత్త పరిశీలించడం వల్ల దీనిని “గిఫెన్ వైపరీత్యం” అంటారు.

ప్రశ్న 7.
అంచనా వ్యాపారం
జవాబు:
ఒక వస్తువు ధర పెరిగినప్పుడు, ఆ వస్తువు ధర భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని వ్యాపారస్తులు, కొనుగోలుదార్లు భావించినప్పుడు ఆ వస్తువును ఎక్కువగా డిమాండ్ చేస్తారు. అదే విధంగా ధర తగ్గినప్పుడు ఇంకా తగ్గుతుందని భావిస్తే కొనుగోలు తగ్గిస్తారు. దీనినే అంచనా వ్యాపారం అంటారు. ఉదా: స్టాక్ మార్కెట్లో షేర్లు.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

ప్రశ్న 8.
వెబ్లెన్ వస్తువులు లేదా గౌరవ సూచిక వస్తువులు
జవాబు:
దీనిని గూర్చి చెప్పిన ఆర్థికవేత్త వెబ్లెన్. గౌరవ సూచిక వస్తువులయిన వజ్రాలు, బంగారు నగలు మొదలైనవి. కలిగి ఉండటం సమాజంలో ప్రతిష్టగా భావిస్తారు ధనికులు. వీటి ధర తగ్గితే వారి గౌరవం, ప్రతిష్ట తగ్గుతాయని కొనుగోలు తగ్గిస్తారు. కనుక ఈ వస్తువుల విషయంలో ధర తగ్గితే డిమాండ్ కూడా తగ్గును.

ప్రశ్న 9.
ధర డిమాండ్
జవాబు:
ఒక వస్తువు ధరకు, దాని డిమాండ్ పరిమాణానికి గల సంబంధాన్ని ధర డిమాండ్ అంటారు. దీనిని ఈ విధంగా తెలియజేయవచ్చు. Dn = f(Pn).

ప్రశ్న 10.
ఆదాయ డిమాండ్ [Mar. ’17]
జవాబు:
ఆదాయానికి, కొనుగోలు చేసే వస్తు పరిమాణానికి ఉన్న సంబంధాన్ని ఆదాయ డిమాండ్ పరిశీలిస్తుంది. సాధారణంగా ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ఆదాయ డిమాండ్ను బట్టి వస్తువులను మేలురకం అని, నాసిరకమని విభజించవచ్చు. ఆదాయ డిమాండ్ Dn = f(y)

ప్రశ్న 11.
జాత్యంతర డిమాండ్ [Mar. ’15]
జవాబు:
ప్రత్యామ్నాయ, పూరక వస్తువు ధరలకు, ఒక వస్తువు డిమాండ్కు ఉన్న సంబంధాన్ని జాత్యంతర డిమాండ్ అంటారు. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన మార్పుల వల్ల ఒక వస్తువు డిమాండ్లో వచ్చే మార్పులను జాత్యంతర డిమాండ్ తెలియజేయును. Dx = f(Py).

ప్రశ్న 12.
ప్రత్యామ్నాయాలు
జవాబు:
సన్నిహిత సంబంధం ఉన్న వివిధ వస్తువులను ప్రత్యామ్నాయ వస్తువులంటారు. ఉదా: కాఫీ, టీ. ఈ వస్తువుల విషయంలో ప్రత్యామ్నాయ వస్తువు ధరలో మార్పు వస్తే, మరో వస్తువు డిమాండ్లో మార్పు వస్తుంది. కనుక ఈ వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది.

ప్రశ్న 13.
పూరకాలు
జవాబు:
సంయుక్త వస్తువులను పూరక వస్తువులంటారు. ఉదా: కారు, పెట్రోలు. వీటిలో ఒకటి లేకపోయినా మరొకటి ఉపయోగపడదు. పూరక సంబంధం ఉన్న వస్తువు ధర పెరిగితే, ఇతర వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. ధర తగ్గితే ఇతర వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. పూరక సంబంధం ఉన్న వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ క్రిందికి వాలి
ఉంటుంది.

ప్రశ్న 14.
నాసిరకం వస్తువులు
జవాబు:
ఆదాయం పెరిగేకొలది కొన్ని రకాల వస్తువులకు డిమాండ్ తగ్గును. ఆదాయం తగ్గితే డిమాండ్ పెరుగును. ఇటువంటి వస్తువులను నాసిరకం వస్తువులంటారు. ఈ వస్తువుల విషయంలో ఆదాయానికి, వస్తువు డిమాండ్కు విలోమ సంబంధం ఉంటుంది. ఉదా: సజ్జలు, రాగులు.

ప్రశ్న 15.
డిమాండ్ వ్యాకోచత్వం
జవాబు:
ఒక వస్తువు ధరలోని మార్పులు, ఆ వస్తువు కొనుగోలు పరిమాణంలో మార్పు ఏ విధంగా ఉంటుందో తెలియజేసే దానిని డిమాండ్ వ్యాకోచత్వం అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

ప్రశ్న 16.
ధర డిమాండ్ వ్యాకోచత్వం
జవాబు:
ఒక వస్తువు ధరలోని శాతం మార్పుకు, వస్తు డిమాండ్లో కలిగే శాతం మార్పుకు మధ్య ఉన్న నిష్పత్తిని “ధర డిమాండ్ వ్యాకోచత్వం” అంటారు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 37

ప్రశ్న 17.
ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం
జవాబు:
వినియోగదారుని ఆదాయంలో వచ్చిన మార్పు శాతంకు, అతని డిమాండ్లో వచ్చిన శాతం మార్పును “ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం” అంటారు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 38

ప్రశ్న 18.
జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం
జవాబు:
ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన శాతం మార్పుకు, డిమాండ్లో కలిగే శాతం మార్పును “జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం” అంటారు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 39

ప్రశ్న 19.
పూర్తి వ్యాకోచ డిమాండ్
జవాబు:
ధరలో ఏ మార్పు వచ్చినా లేకున్నా డిమాండ్లో అనంతంగా మార్పు వస్తే దానిని పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ రేఖ ‘X’ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. దీని సంఖ్యాత్మక విలువ Ep = ∞

ప్రశ్న 20.
పూర్తి అవ్యాకోచ డిమాండ్ [Mar. ’16]
జవాబు:
ధరలో ఎంత మార్పు వచ్చినా డిమాండ్లో ఏ మాత్రము మార్పు ఉండదు. దీనినే పూర్తి అవ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ రేఖ Y- అక్షానికి సమాంతరంగా ఉంటుంది. దీని సంఖ్యాత్మక విలువ Ep = 0

ప్రశ్న 21.
ఏకత్వ వ్యాకోచ డిమాండ్
జవాబు:
ఒక వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు డిమాండ్ లో వచ్చిన అనుపాతపు మార్పుకు సమానమైతే దానిని ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అంటారు. దీని విలువ ఒకటికి సమానము.
Ep = 1
ఇక్కడ డిమాండ్ రేఖ లంబ అతిపరావలయ ఆకారంలో ఉంటుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

ప్రశ్న 22.
సాపేక్ష వ్యాకోచ డిమాండ్
జవాబు:
ఒక వస్తువు ధరలో వచ్చే అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పు ఎక్కువగా ఉంటే దానిని సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ వ్యాకోచత్వం విలువ ‘1’ కంటే ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న 23.
సాపేక్ష అవ్యాకోచ డిమాండ్
జవాబు:
వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో వచ్చిన అనుపాతపు మార్పు తక్కువగా ఉన్నట్లయితే దీనిని సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వం విలువ ‘1’ కంటే తక్కువగా ఉంటుంది.

ప్రశ్న 24.
ఆర్క్ పద్ధతిని ఎప్పుడు ఉపయోగిస్తారు ?
జవాబు:
డిమాండ్ రేఖపై రెండు బిందువుల మధ్య దూరాన్ని ఆర్క్ అంటారు. డిమాండ్ రేఖపై ఏదో ఒక బిందువు వద్ద కాకుండా రెండు బిందువుల మధ్య భాగంలో ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవడానికి ‘ఆర్క్’ పద్ధతిని ఉపయోగిస్తారు.

ప్రశ్న 25.
డిమాండ్ వ్యాకోచత్వం ఉపయోగాలు
జవాబు:
అర్థశాస్త్రంలో డిమాండ్ వ్యాకోచత్వానికి అధిక ప్రాధాన్యత ఉంది.

  1. వ్యాపారస్తులు దీని ఆధారంగా ధర నిర్ణయం చేయడం జరుగుతుంది.
  2. కోశ విధానాన్ని రూపొందించడానికి, ఉత్పత్తి వ్యయాన్ని తెలుసుకోడానికి ఇది ఉపయోగపడుతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 2nd Lesson వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Economics Study Material 2nd Lesson వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని వివరించి, పరిమితులను పరిశీలించండి. [Mar. ’17, ’16, ’15]
జవాబు:
క్రమ క్షీణోపాంత ప్రయోజన సూత్రం మానవుని దైనందిన అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి కోరికను ఒక కాల వ్యవధిలో పూర్తిగా సంతృప్తిపరచవచ్చుననే ప్రాతిపదికపై ఈ సూత్రం ఆధారపడి ఉంది. ఈ సూత్రాన్ని ప్రథమంగా 1854వ సంవత్సరంలో హెచ్. హెచ్. గాసెన్ ప్రతిపాదించాడు. దీనిని గాసెన్ ప్రథమ సూత్రంగా జీవన్స్ పేర్కొన్నాడు. మార్షల్ దీనిని అభివృద్ధిపరిచాడు.

“ఒక వ్యక్తి తనవద్దనున్న వస్తు రాశిని పెంచుతూ పోతే అదనంగా చేర్చిన యూనిట్ల నుండి లభించే అదనపు ప్రయోజనం క్రమంగా క్షీణిస్తుంది” అని క్షీణోపాంత ప్రయోజనాన్ని మార్షల్ నిర్వచించెను.

ఈ సూత్రాన్ని కొన్ని ప్రమేయాలపై ఆధారపడి రూపొందించడం జరిగింది.
ప్రమేయాలు:

  1. సిద్ధాంతం కార్డినల్ ప్రయోజన విశ్లేషణపై ఆధారపడింది. అంటే ప్రయోజనాన్ని కొలవవచ్చును, పోల్చవచ్చును.
  2. వస్తువు యూనిట్లు తగుమాత్రంగా ఉండి, మరీ చిన్న యూనిట్లుగాను, మరీ పెద్ద యూనిట్లుగాను ఉండరాదు.
  3. వినియోగించే వస్తువు వివిధ యూనిట్లు సజాతీయంగా ఉండాలి. అనగా పరిమాణం, నాణ్యత, రుచి మొదలైన విషయాలలో ఏ వ్యత్యాసం ఉండరాదు.
  4. ఒక యూనిట్ వినియోగానికి, మరొక యూనిట్ వినియోగానికి మధ్య కాలవ్యవధి ఉండకూడదు.
  5. వినియోగదారుల అభిరుచులు, అలవాట్లలో మార్పు ఉండరాదు.
  6. వినియోగదారుల ఆదాయాలు మారకూడదు.

క్షీణోపాంత ప్రయోజన సూత్ర వివరణ: ఈ సూత్రం వస్తురాశి పరిమాణానికి తృప్తి లేదా ప్రయోజనానికి మధ్యగల సంబంధాన్ని వివరిస్తుంది. ఈ సూత్రం ప్రకారం ఒక వినియోగదారుడు తన వద్ద ఉన్న వస్తురాశిని పెంచుతూ పోతుంటే అదనపు యూనిట్వల్ల లభించే అదనపు లేదా ఉపాంత ప్రయోజనం క్షీణిస్తుంది. ఈ సూత్రాన్ని ఈ క్రింది పట్టిక ద్వారా చూపించటం జరిగింది.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 1

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

పట్టిక ప్రకారం ప్రతి అదనపు ఆపిల్ వల్ల లభించే ఉపాంత ప్రయోజనం క్షీణిస్తుంది. అంటే మొత్తం ప్రయోజనం తగ్గుతున్న రేటులో పెరగటం గమనించవచ్చు. 6వ ఆపిల్ వల్ల మొత్తం ప్రయోజనం 82 యుటిల్స్, ఉపాంత ప్రయోజనం 2 యుటిల్స్, 7వ ఆపిల్ వినియోగం వల్ల మొత్తం ప్రయోజనంలో మార్పు లేదు. అంటే మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉంది. ఉపాంత ప్రయోజనం శూన్యం 7, 8 ఆపిల్ పండ్ల నుండి మొత్తం ప్రయోజనం క్షీణించి, ఉపాంత ప్రయోజనం ఋణాత్మకమైనది. మొత్తం ప్రయోజనానికి, ఉపాంత ప్రయోజనానికి మధ్య సంబంధం ఈ క్రింది విధంగా ఉంటుంది.

  1. మొత్తం ప్రయోజనం తగ్గుతున్న రేటులో పెరిగినప్పుడు ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది.
  2. మొత్తం ప్రయోజనం గరిష్టమైనపుడు ఉపాంత ప్రయోజనం శూన్యమవుతుంది.
  3. మొత్తం ప్రయోజనం తగ్గితే ఉపాంత ప్రయోజనం ఋణాత్మకమవుతుంది. దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
    AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 2

పట్టికను రేఖాపటంలో T.U.C. మొత్తం ప్రయోజన రేఖ M.U.C. ఉపాంత ప్రయోజన రేఖ. X – అక్షముపై ఆపిల్ పండ్ల సంఖ్యను, Y – అక్షముపై మొత్తం ప్రయోజనం, ఉపాంత ప్రయోజనం చూపించాము. వినియోగదారునికి ‘O’ యూనిట్ వద్ద మొత్తం ప్రయోజనం ‘0’ ఆపిల్స్ వినియోగం పెంచుతూ పోయిన కొద్దీ మొత్తం ప్రయోజనం తగ్గుతున్న రేటులో పెరిగింది. T.U.C. ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోంది. M.U.C. క్రిందికి వాలుతున్నది. T.U.C. 7వ పండు వద్ద గరిష్టంగా ఉంది. M.U.C. X – అక్షాన్ని తాకి శూన్యమైంది. వినియోగదారుడు 7వ, 8వ పండ్లను వినియోగించటం వల్ల మొత్తం ప్రయోజనం క్షీణించింది. ఉపాంత ప్రయోజనం ఋణాత్మకమైంది.

క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం, మినహాయింపులు: కొన్ని పరిస్థితులలో అదనపు యూనిట్ల నుంచి వచ్చే ప్రయోజనం క్రమంగా క్షీణించకపోవచ్చు. వీటినే ఈ సూత్రానికి మినహాయింపులుగా చెప్పటం జరుగుతుంది. అవి:

  1. అపూర్వ వస్తువుల విషయంలో ఈ సూత్రం వర్తించదు. ఉదా: నాణేలు, కళాత్మక వస్తువులు, తపాలా బిళ్ళలు.
  2. సామాజిక వస్తువుల వినియోగంలో ఈ సూత్రం వర్తించదు. ఉదా: ఒక పట్టణంలో టెలిఫోన్ల సంఖ్య పెరిగితే, టెలిఫోను ఉపయోగించటం వల్ల కలిగే ప్రయోజనం కూడా పెరుగుతుంది.
  3. మత్తు పదార్థాల విషయంలో ఈ సూత్రం వర్తించదు.
  4. ద్రవ్యం విషయంలో ఈ సూత్రం వర్తించదని కొందరి అభిప్రాయం.

క్షీణోపాంత ప్రయోజన సిద్దాంతం – ప్రాముఖ్యం:

  1. డిమాండ్ సూత్రానికి ఈ సూత్రం మూలాధారం.
  2. విలువ సిద్ధాంతానికి కూడా ఈ సూత్రం మూలాధారం. ఉదా: నీళ్ళకు ప్రాముఖ్యం ఎక్కువగా ఉంటుంది. నీటికి వినిమయ విలువ లేదు. వజ్రాలకు ఉపయోగితా విలువ ఏమీలేదు. కాని వాటి వినిమయ విలువ ఎక్కువగా ఉంటుంది. వీటికి సమాధానం ఈ సూత్రంలో లభ్యమవుతుంది.
  3. ఆర్థికమంత్రి పన్నుల విధానాన్ని నిర్ణయించటంలో ఈ సూత్రం చాలా ఉపయోగకారిగా ఉంటుంది. పురోగామి పన్నుల విధానానికి ఈ సూత్రం ఆధారం.
  4. వినియోగదారుని మిగులు భావన ఈ సూత్రంపైననే ఆధారపడి ఉంది.
  5. సంపద పంపిణీకి క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఆధారమని చెప్పవచ్చు.
  6. వినియోగదారు, తన పరిమితమైన ఆదాయం ద్వారా ఏ విధంగా ప్రయోజనాన్ని గరిష్టం చేసుకోవచ్చునో తెలుపుతుంది.

ప్రశ్న 2.
సమోపాంత ప్రయోజన సూత్రం ప్రాముఖ్యాన్ని వివరించండి.
జవాబు:
సమోపాంత ప్రయోజనానికి చాలా ఆచరణీయమైన ప్రాధాన్యత ఉంది. ఆర్థిక జీవనంలో ఈ సూత్రం అనేక విధాలుగా ఉపకరిస్తుంది.
1) వినియోగం: ప్రతి వ్యక్తి తనకున్న పరిమిత ఆదాయాన్ని వివిధ వస్తువులపై ఖర్చు చేయటం ద్వారా గరిష్ట ప్రయోజనాన్ని పొందటానికి ప్రయత్నిస్తాడు. వినియోగదారుడు తక్కువ ప్రయోజనం లభించే వస్తువుకు బదులు అధిక ప్రయోజనం లభించే వస్తువును ప్రతిస్థాపన చేసుకుంటూ తన పరిమిత ఆదాయాన్ని ఖర్చు చేస్తాడు. కనుక ఈ సూత్రం వినియోగదారుని గరిష్ట సంతృప్తి విశ్లేషణకు తోడ్పడుతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

2) ఉత్పత్తి: ఉత్పత్తిదారుడు అనేక ఉత్పత్తి కారకాలను ఉత్పత్తి ప్రక్రియలో వినియోగించడం ద్వారా లాభం, గరిష్ట ప్రయోజనాన్ని పొందటానికి ప్రయత్నిస్తాడు. వివిధ ఉత్పత్తి కారకాల నుండి గరిష్ట లాభాలను పొందటానికి ఏ విధంగా ఉత్పత్తి కారకాలను ప్రతిస్థాపన చేస్తాడో ఈ సూత్రం విశ్లేషణ చేస్తుంది.

3) వినిమయం: ఒక వస్తువుకు బదులుగా మరో వస్తువు ద్రవ్యము ద్వారా వినిమయం చేయడంలో ఈ సూత్రం ఉపయోగపడుతుంది. వినిమయానికి ప్రాతిపదిక ప్రతిస్థాపన సిద్ధాంతము.

4) పంపిణీ: వివిధ ఉత్పత్తుల ఉత్పత్తి కారకాలకు వాటి ప్రతిఫలాలను పంపిణీ చేయటాన్ని వివరించే ‘ఉపాంత ఉత్పాదకతా సిద్ధాంతానికి’ ఈ సూత్రం ప్రాతిపదిక.

5) ప్రభుత్వ విత్తము: ప్రభుత్వం వివిధ కార్యక్రమాలపై ఖర్చు చేసేటప్పుడు సమాజపు ప్రయోజనం గరిష్టంగా ఉండాలని భావిస్తుంది. అందువల్ల అధిక ప్రయోజనం కోసం వృధా వ్యయాలను తగ్గించి ప్రభుత్వం వ్యయం చేస్తుంది.

ఇంతేకాకుండా ఆదాయ పునఃపంపిణీకి ఒక వ్యక్తి తన పొదుపు లేదా పెట్టుబడి వివిధ రకాల ఆస్తుల మధ్య విభజించటానికి ఒక వ్యక్తి తన కాలాన్ని పని, విశ్రాంతి మధ్య కేటాయించడానికి మొదలైన అంశాల విశ్లేషణకు ఈ సూత్రం తోడ్పడుతుంది. పన్నుల విధానానికి ఈ సూత్రం సహాయపడుతుంది.

6) ఆదాయ పునఃపంపిణీ, వ్యయ విధానం: సంపన్నులపై ఎక్కువ స్థాయిలో పన్నులు విధించి, పేదవారికి ఎక్కువ ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రభుత్వం వ్యయ విధానాన్ని అనుసరిస్తోంది. సంపన్నుల ఖర్చు విధానానికి, పేదవారికి ఖర్చు విధానానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గురించి ఆదాయ పునఃపంపిణీ జరిగే విధానాన్ని, అందువలన కలిగే ఆదాయాన్ని వ్యయం చేసే పద్ధతిని ఈ సూత్రం ఆధారంగా ప్రభుత్వం తన విధానాన్ని నిర్ణయించుకొని సమాజ శ్రేయస్సును పెంపొందిస్తుంది.

7) ధరలపై ప్రభావం: ఈ సూత్రం వస్తువు ధరలపై ప్రభావం చూపుతుంది. వస్తువు కొరతగా ఉంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి బదులుగా కొరతలేని వస్తువును ప్రతిస్థాపన చేయటం ద్వారా ఉపాంత ప్రయోగం- తగ్గకుండా ప్రయత్నించటం జరుగుతుంది. అందువల్ల కొరత వస్తువు ధర తగ్గుతుంది.

సమోపాంత ప్రయోజన సూత్ర ప్రాముఖ్యం:

  1. ఉద్యమదారు వివిధ ఉత్పత్తి సాధనాలకు నియమించేటప్పుడు, అన్ని ఉత్పత్తి సాధనాల నుంచి వచ్చే ఉపా ఉత్పాదకత సమానంగా ఉన్నప్పుడు మొత్తం ఉత్పత్తిని గరిష్టం చేసుకుంటాడు. అంటే కనిష్ట వ సముదాయాన్ని నిర్ణయించుకోవడానికి ఈ సూత్రం ఉపకరిస్తుంది.
  2. పంపిణీ విషయంలో కూడా ఈ సూత్రం ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఒక రకమైన వస్తువును ని వ్యక్తుల మధ్య పంపిణీ చేసినప్పుడు, అందరికీ కలిగే ఉపాంత ప్రయోజనంగా ఉంటే, పం సక్రమంగా జరిగిందని చెప్పవచ్చు.
  3. ఆదాయాన్ని వినియోగం, పొదుపు మధ్యన కేటాయించడంలో కూడా ఈత్రం ఉపకరిస్తుంది.
  4. వ్యక్తులు తమ పొదుపును లేదా సంపదను వివిధ రకాల ఆస్తుల రూపంలో ఎంతెంత ఉంచుకో నిర్ణయించుకోవడానికి ఈ సూత్రం ఉపయోగకరంగా ఉంటుంది.
  5. కుటుంబాలు తమ పరిమిత ఆదాయాన్ని వివిధ రకాల వస్తువులపై కేటాయించడం ద్వారా, తమ సంక్షేమాన్ని ఎలా గరిష్టం చేసుకుంటారో ఈ సూత్రం ద్వారా తెలుసుకోవచ్చు.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

ప్రశ్న 3.
సమోపాంత ప్రయోజన సూత్రం సహాయంతో వినియోగదారుని సమతౌల్యాన్ని వివరించండి.
జవాబు:
వినియోగదారుని సమతౌల్యాన్ని వివరించే సూత్రమే సమోపాంత ప్రయోజన మాత్రము. వినియోగదార గరిష్ట సంతృప్తిని పొందడానికి తన దగ్గర ఉన్న పరిమిత ఆదాయాన్ని వివిధ వస్తువులపై ఏ విధంగా ఉపయోగిస్తాని సూత్రం వివరిస్తుంది. సమోపాంత ప్రయోజన సూత్రం ప్రకారం ఒక వినియోగదారుడు తన దగ్గరున్న ద్రవ్యాన్ని . వస్తువులపై వాటి ఉపాంత ప్రయోజనాలు సమానమయ్యే వరకు ఒకదానికి బదులుగా మరొకటి ప్రతిస్థాపన చేస్తా ఈ ప్రతిస్థాపన గరిష్ట సంతృప్తిని సాధించేవరకు సాగుతుంది. ఉపాంత ప్రయోజనాలు సమానమైనప్పుడు ప్రయోజనం గరిష్టంగా ఉంటుంది. మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉన్నప్పుడు వినియోగదారుడు సమతౌల్య ఉంటాడు.

ఈ సూత్రాన్ని ప్రప్రధమంగా 1854వ సంవత్సరంలో హెచ్. హెచ్. గాసెన్ ప్రతిపాదించాడు. దీనిని గా ద్వితీయ సూత్రంగా జీవన్స్ పేర్నొన్నాడు. దీనిని మార్షల్ అభివృద్ధిపరిచాడు.

“ఒక వ్యక్తి దగ్గర ఉన్న ఒక వస్తువుకు అనేక ఉపయోగాలున్నప్పుడు అతడు ప్రతి ఉపయోగం నుండి ఉపాంత ప్రయోజనం సమానంగా ఉండేటట్లు ఆ వస్తువును వినియోగించడం జరుగుతుంది” అని మార్షల్ ఈ సూ నిర్వచించెను.

సూత్రం వివరణ:
ఉదా: ఒక వ్యక్తి వద్ద ఉన్న వస్తువు పరిమిత ద్రవ్యం ఐదు రూపాయలు అనుకుందాం. ఆ పరిమిత ప్ర X – y అనే వస్తువులపై ఖర్చు చేయటం ద్వారా ఏ విధంగా సమతౌల్యంలో ఉన్నాడో ఈ క్రింది పట్టిక పరిశీలించవచ్చును.
x − y ధరలు ఒక యూనిట్ వస్తువు ఒక రూపాయిగా భావించాలి. ప్రతి రూపాయికి లభించే ఉపాంత ప్రయోజనాలను పట్టికలో పరిశీలించవచ్చును.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 3

బ్రాకెట్లలో చూపిన అంకెలు వినియోగదారుడు 5 రూపాయలను ఏ విధంగా ఖర్చు చేశాడో తెలియజేయును. పట్టికననుసరించి x, y వస్తువుల ఉపాంత ప్రయోజన వస్తు వినియోగం పెరుగుతున్న కొద్దీ క్షీణిస్తుంది. ఒకటో రూపాయి వల్ల వచ్చే ఉపాంత ప్రయోజనం y వస్తువు కంటే x వస్తువు వల్ల ఎక్కువగా ఉంది. అందువల్ల మొదటి రూపాయితో X వస్తువును కొనుగోలు చేస్తాడు. అదే విధంగా 2వ రూపాయిని x మీద వినియోగిస్తే ఉపాంత ప్రయోజనం 20 యుటిల్స్. అదే 2వ రూపాయిని y మీద వినియోగిస్తే ఉపాంత ప్రయోజనం 21 యుటిల్స్. కనుక 2వ రూపాయిని y వస్తువుపై ఖర్చు చేస్తాడు. 3వ రూపాయిని y వస్తువు మీద ఖర్చు చేస్తే, 15 యుటిల్స్ ఉపాంత ప్రయోజనము. అదే 3వ రూపాయిని X వస్తువుపై ఖర్చు చేస్తే ఉపాంత ప్రయోజనం 20 యుటిల్స్ కనుక 3వ రూపాయితో X వస్తువు 2వ యూనిట్ను కొనుగోలు చేస్తాడు. 4వ రూపాయితో y ని కొనుగోలు చేసినా ఉపాంత ప్రయోజనం 15 యుటిల్స్. 5వ | రూపాయిని X వస్తువు 3వ యూనిట్పై ఖర్చు చేస్తే ఉపాంత ప్రయోజనం 15 యుటిల్స్. 5 రూపాయలను X వస్తువుపై ఖర్చు చేస్తే 75 యుటిల్స్ ప్రయోజనం వస్తుంది. 5 రూపాయలను y వస్తువుపై ఖర్చు చేస్తే మొత్తం ప్రయోజనం 52 యుటిల్స్. కాని పైన పేర్కొన్న విధంగా ఖర్చు చేస్తే మొత్తం ప్రయోజనం 96 యుటిల్స్ [25 + 21 + 20 + 15 + 15 = 96]. వినియోగదారుడు ఈ విధంగా 3 యూనిట్ల xని, 2 యూనిట్ల yని కొనుగోలు చేసినప్పుడు మాత్రమే వినియోగదారునికి గరిష్ట సంతృప్తి వస్తుంది. అప్పుడే తాను ఖర్చు చేసిన చివరి రూపాయివల్ల రెండు వస్తువులకు ఒకే ప్రయోజనం ద్వారా తెలియజేయవచ్చు. వస్తుంది. మరే రకంగా ఖర్చు చేసినా ప్రయోజనం గరిష్టంగా ఉండదు. దీనిని పటము ద్వారా తెలియజేయవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 4

పై రేఖాపటములో X – అక్షముపై ద్రవ్య పరిమాణము, Y – అక్షముపై ఒక రూపాయి వల్ల వచ్చే X, Y ల ఉపాంత ప్రయోజనం సూచించటం జరిగింది. XY రేఖ X వస్తువు ప్రయోజన రేఖ (MUC], YY రేఖ Y వస్తువు ఉపాంత ప్రయోజన రేఖ [MUC]. X వస్తువుపై 3వ రూపాయి 15 యుటిల్స్ ప్రయోజనం ఇస్తుంది. Y వస్తువుపై 2వ రూపాయి 15 యుటిల్స్ ప్రయోజనం ఇస్తుంది.

వినియోగదారుడు సమతౌల్య స్థితిని నిర్ణయించుటకు ఈ క్రింది నిబంధనను సంతృప్తిపరచవలెను.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 5

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

ప్రశ్న 4.
ఉదాసీనత వక్రరేఖల పద్ధతి ద్వారా వినియోగదారుని సమతౌల్యాన్ని వివరించండి.
జవాబు:
ఒక వినియోగదారుని అభిరుచులు, అలవాట్లు రెండు వస్తువుల ధరలు నిలకడగా ఉండి పరిమిత ఆదాయ వనరులతో వీలైనంతగా రెండు వస్తువులను గరిష్టంగా కొనుగోలు చేయగలిగినట్లయితే వినియోగదారుడు సమతౌల్యస్థితికి చేరుకున్నాడని చెప్పవచ్చు.

ఈ క్రింది ప్రమేయాలను ఆధారంగా చేసుకొని ఉదాసీనత వక్రరేఖల సహాయంతో వినియోగదారుని సమతౌల్య స్థితిని వివరించవచ్చు.

  1. వినియోగదారుడు హేతుబద్ధంగా వ్యవహరిస్తాడు.
  2. వినియోగదారుని ద్రవ్య ఆదాయంలో ఎలాంటి మార్పులు ఉండవు.
  3. వినియోగదారుడు కొనుగోలు చేయాలనుకునే వస్తువుల ధరలు మారవు.
  4. వినియోగదారుని అభిరుచులు ఉదాసీనత వక్రరేఖలు తెలుపుతాయి.

వినియోగదారుని సమతౌల్యం: వినియోగదారు పొందగోరే వస్తు సముదాయాలు, పొందగలిగిన వస్తు సముదాయాలు సమానంగా ఉన్నప్పుడు సమతౌల్యంలో ఉంటాడు. అంటే ఉదాసీనతా వక్రరేఖ, బడ్జెట్ రేఖకు స్పర్శ రేఖగా ఉన్నప్పుడు వినియోగదారు గరిష్ట సంతృప్తిని పొందుతూ సమతౌల్యంలో ఉంటాడు. ఇలాంటి పరిస్థితులలో ఉదాసీనత వక్రరేఖ వాలు, బడ్జెట్ఖ వాలు సమానంగా ఉంటాయి. వినియోగదారుని సమతౌల్యానికి ముఖ్యమైన నిబంధన MRSxy = Px/Py

వినియోగదారు సమతౌల్యాన్ని ఈ క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 6

పై రేఖాపటంలో AB బడ్జెట్ ఖ. IC0, IC1, IC2, వివిధ ఉదాసీనత వక్రరేఖలు. IC0, రేఖ AB బడ్జెట్ రేఖను C, ఎదువుల వద్ద ఖండిస్తుంది. అందువల్ల వినియోగదారు C వద్ద లేదా D వద్ద సమతౌల్యంలో ఉండడు. AB బడ్జెట్ IC0 రేఖను ఖండిస్తుంది. అంటే ఇంకా వినియోగదారుడు అధిక సంతృప్తి స్థాయిని పొందటానికి వీలు ఉంటుంది. పొందువు వద్ద IC1, రేఖ, AB బడ్జెట్ రేఖకు స్పర్శరేఖగా ఉంది. అందువల్ల ‘E’ బిందువు వద్ద IC, రేఖవాలు, రేఖ వాలు సమానం. ఈ పరిస్థితిలో MRSxy = Px/Py. అందువల్ల వినియోగదారుడు ‘E’ బిందువు వద్ద OQ -వస్తువును, OP పరిమాణంలో ‘Y’ వస్తువును కొనుగోలు చేస్తూ IC1, పై గరిష్ట సంతృప్తిని పొందుతూ సమతౌల్యంలో డు. IC1, అతని ఆదాయం కన్నా ఎక్కువ రేఖ. అందువల్ల వినియోగదారుడు IC2 రేఖ పైననే ‘E’ బిందువు వద్ద శౌల్యంలో ఉంటాడు.

ధర లేదా బడ్జెట్ రేఖను నిర్వచించండి. బడ్జెట్ రేఖలోని కదలికలను వివరించండి. వినియోగదారుని కొనుగోలు ముఖ్యంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి:

  1. వినియోగదారుని ద్రవ్య ఆదాయం
  2. కొనుగోలు చేయాలనుకుంటున్న రెండు వస్తువుల ధరలు.

ఒక వినియోగదారుడు కొనుగోలు చేసే రెండు వస్తువుల ధరలు, ఆదాయాలు స్థిరంగా ఉండి, ఏ సముదాయాలలో ఎ వస్తువులను కొనుగోలు చేయగలుగుతాడో తెలియజేసే రేఖని బడ్జెట్ రేఖ లేదా ధర రేఖ అంటారు. దీనిని ఈ ఉదాహరణ ద్వారా వివరించవచ్చు. వినియోగదారుని ఆదాయం గౌ 5/-, X, Y వస్తువుల ధరలు వరుసగా కే 10.50 పై. కుందాం. దీంతో వినియోగదారుడు కొనుగోలు చేయగలిగిన రెండు వస్తువుల వివిధ సముదాయాలు ఈ క్రింది గా ఉంటాయి.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 7

వినియోగదారుడు మొత్తం ఆదాయాన్ని ‘X’ పైనే ఖర్చు చేస్తే 5X వస్తువులను మాత్రమే కొనుగోలు చేయగలుగుతాడు, స్తువులను కొనుగోలు చేయలేడు. Y వస్తువు మీద పూర్తిగా ఖర్చు చేస్తే 10 ‘Y’ లను, ‘0’ ‘X’ లను పొందగలుగుతాడు. విధంగా రెండు వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నప్పుడు తాను స్థిరమైన ఆదాయంతో కొనుగోలు చేయగలిగిన రెండు వుల వివిధ సముదాయాలకు సంబంధించిన బిందువులను కలిపినట్లయితే బడ్జెట్ రేఖ వస్తుంది. ఈ రేఖ వాలు వస్తువుల ధరల నిష్పత్తిని తెలుపుతుంది. దీనిని క్రింది రేఖాపటం ద్వారా చూపించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 8

పై రేఖాపటంలో ‘X’ వస్తువు X అక్షంపై, ‘Y’ వస్తువు Y – అక్షంపై చూపించటం జరిగింది. PL అనేది బడ్జెట్ రేఖ. ఈ రేఖ వాలు XY వస్తువుల సాపేక్ష ధరల నిష్పత్తిని తెలియజేయును. ఏ ఆదాయ పరిమితికి లోబడి వినియోగదారుడు XY లను కొనుగోలు చేస్తున్నాడో బడ్జెట్ ఖ తెలియజేయును.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

1) రెండు వస్తువుల ధరలు స్థిరంగా ఉండి, వినియోగదారుని ఆదాయం మార్పు చెందితే బడ్జెట్ రేఖ స్థితిలో మార్పు వస్తుంది. ఆదాయం పెరిగితే బడ్జెట్ రేఖ పైకి కదులుతుంది. అదే విధంగా ఆదాయం తగ్గితే, బడ్జెట్ రేఖ క్రిందికి కదులుతుంది. దీనిని క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 9

పై రేఖాపటంలో A1B1 బడ్జెట్ఖ అనుకుందాం. రెండు వస్తువుల ధరలు స్థిరంగా ఉండి ఆదాయం పెరిగితే బడ్జెట్ రేఖ A2B2 పైకి కదులుతుంది. ఆదాయం తగ్గితే బడ్జెట్ రేఖ A0B0 కిందికి కదులుతుంది.

2) ఆదాయం స్థిరంగా ఉండి X వస్తువు లేదా Y వస్తువు ధరలోగాని మార్పు వస్తే బడ్జెట్లేఖ వాలులో మార్పు వస్తుంది. దీనిని ఈ రేఖాపటాల ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 10
A రేఖాపటంలో వినియోగదారుని ఆదాయం, Y వస్తువు ధర స్థిరంగా ఉండి X వస్తువు ధరలో మార్పు వస్తే బడ్జెట్ రేఖలో వచ్చే మార్పులను చూపించటం జరిగింది. X వస్తువు ధర తగ్గితే బడ్జెట్ రేఖ AB గాను, X వస్తువు ధర పెరిగితే బడ్జెట్ రేఖ AB0 గాను ఉంటుంది.

B రేఖాపటంలో వినియోగదారుని ఆదాయం, X వస్తువు ధర స్థిరంగా ఉండి, Y వస్తువు ధరలో మార్పు వస్తే బడ్జెట్ రేఖలో వచ్చే మార్పులను చూపటం జరిగింది. Y వస్తువు ధర తగ్గితే బడ్జెట్ రేఖ LP1 గాను, Y వస్తువు ధర పెరిగితే బడ్జెట్ రేఖ LP2 గాను ఉంటుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కార్డినల్, ఆర్డినల్ ప్రయోజనాలను విభేదించండి.
జవాబు:
కార్డినల్ ప్రయోజన విశ్లేషణ: 18వ శతాబ్దంలో జీవాన్స్, వాల్రాస్ మొదలగువారు ప్రయోజన విశ్లేషణను అభివృద్ధిపరిచారు. ఆ తరువాత మార్షల్, క్లార్క్ మొదలగువారు దీనిని అభివృద్ధిపరిచారు. వినియోగదారుని ప్రవర్తనను అధ్యయనం చేయటానికి కార్డినల్ ప్రయోజన విశ్లేషణను రూపొందించారు. వీరు ప్రయోజనాన్ని కొలవటానికి యుటిల్స్ అనే ఊహాత్మక కొలమానాన్ని ఉపయోగించారు. వీటి ద్వారా వివిధ వస్తువుల నుండి పొందగలిగే ప్రయోజనాన్ని కొలవవచ్చు, పోల్చవచ్చును అని నవ్య సంప్రదాయ ఆర్థికవేత్తలు భావించారు. 1, 2, 3 ……అనేవి కార్డినల్ సంఖ్యలు. ఈ విధమైన విశ్లేషణ కేవలం ఒక మానసిక భావన మాత్రమే.

ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ: జె.ఆర్. హిక్స్, అలెన్ అనే ఆర్థికవేత్తలు వినియోగదారుని ప్రవర్తనను అధ్యయనం చేయుటలో ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణను రూపొందించారు. ఈ విశ్లేషణ ద్వారా ప్రయోజనాన్ని సంఖ్యా రూపంలో చెప్పటం సాధ్యం కాదు. వివిధ సముదాయాల నుంచి పొందే వివిధ సంతృప్తి స్థాయిలతో పోల్చి చెప్పడం జరుగుతుంది. అనగా ఒక వస్తు సముదాయం, మరొక వస్తు సముదాయం కంటే ఎంత ఎక్కువ లేదా ఎంత తక్కువ సంతృప్తి ఇస్తుందో చెప్పటానికి వీలు ఉన్నదనే అంశంపై ఉదాసీనత వక్రరేఖలు ప్రతిపాదించటం జరిగింది. 1వ, 2వ, 3వ ఆర్డినల్ సంఖ్యలు. వీరి ఉద్దేశ్యంలో ప్రయోజనం అనేది ఒక మానసిక భావన. దానిని కొలవలేము. కేవలం దేన్ని ఎంత కావాలో, ఎంత ఇష్టపడుతున్నారో మాత్రమే చెప్పగలం. దీనిని ఆర్డినల్ ప్రయోజనం అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

ప్రశ్న 2.
ఉదాసీనత వక్రరేఖల లక్షణాలు. [Mar. ’17, ’16, ’15]
జవాబు:
వినియోగదారుడు కొనుగోలు చేసే రెండు వస్తువుల వివిధ సమ్మేళనాలను తెలియజేసే బిందువులను కలుపగా ఏర్పడే రేఖను “ఉదాసీనత వక్రరేఖ” అని అంటారు.
లక్షణాలు / ధర్మాలు:

  1. ఉదాసీనత వక్రరేఖలు ఋణాత్మక వాలు కలిగి ఉంటాయి. అనగా ఎడమ నుండి కుడికి దిగువకు వాలుతాయి.
  2. ఉదాసీనత వక్రరేఖలు X- అక్షమునుగాని, Y – అక్షమునుగాని తాకవు.
  3. ఉదాసీనత వక్రరేఖలు పరస్పరం ఖండించుకొనవు.
  4. ఇవి మూలబిందువుకు కుంభాకారంలో ఉంటాయి. దీనికి కారణం ప్రతిస్థాపనోపాంత రేటు క్షీణించటం.
  5. ఎక్కువ స్థాయిలో ఉన్న ఉదాసీనత రేఖ ఎక్కువ సంతృప్తి, తక్కువ స్థాయిలో ఉన్న రేఖ తక్కువ సంతృప్తి స్థాయిని సూచిస్తాయి.
  6. పూర్తి ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో సరళరేఖలుగానూ, పూరక వస్తువుల విషయంలో ‘L’ ఆకారంలో ఉదాసీనత వక్రరేఖలు ఉంటాయి.

ప్రశ్న 3.
ఉపాంత ప్రత్యామ్నాయ రేటు
జవాబు:
ఉదాసీనతా వక్రరేఖ విశ్లేషణలో ప్రతిస్థాపనోపాంత రేటు అత్యంత ముఖ్యమైనది. అన్ని సముదాయాలు ఒకే స్థాయిలో సంతృప్తిని ఇవ్వడం వల్ల వినియోగదారుడు ఒక వస్తువు స్థానంలో మరొక వస్తువును ఏ రేటులో ప్రతిస్థాపన చేస్తున్నాడో దానిని ప్రతిస్థాపనోపాంత రేటు అంటారు.

ఉదా: వినియోగదారుడు X, Y వస్తువులను వినియోగిస్తాడు అనుకుందాం. ఈ రెండు వస్తువులు ఒకదానికి బదులు, మరో దానికి ప్రత్యామ్నాయం చేయటానికి వీలు ఉంటుంది. దీనిని ఈ క్రింది పట్టిక ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 11

పై పట్టికలో వినియోగదారునికి అందుబాటులో ఉన్న వివిధ సముదాయాలలో A నుండి F వరకు పరిశీలించగా సముదాయం Aలో వినియోగదారునికి X తక్కువగా పొందే అవకాశం ఉంది. X పరిమాణం తక్కువగా ఉండటం వల్ల వినియోగదారుడు X కోసం Y ని వదులుకోవటానికి సిద్ధంగా ఉంటాడు. ఈ విధంగా అదనంగా 1 యూనిట్ X పరిమాణం పొందటానికి 5 యూనిట్ల Y ని వదులుకోవాలి. దీనినే ఉపాంత ప్రత్యామ్నాయ రేటు అంటారు.

ప్రశ్న 4.
ఉదాసీనత పటం
జవాబు:
వివిధ సంతృప్తి స్థాయిలను తెలిపే ఉదాసీనత వక్రరేఖల సముదాయాన్ని ఉదాసీనత పటం అందురు. ‘X’ వస్తువు, ‘Y’ వస్తువు వివిధ సముదాయాలను తెలియజేసే ఉదాసీనత రేఖల సముదాయమే ఉదాసీనత పటం. ఇందులో ఒక్కొక్క IC ఒక్కొక్క రకమైన సముదాయాన్ని తెలియజేయును.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 12

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

పై రేఖాపటంలో ‘X’ అక్షంపై X వస్తువును, Y అక్షంపై Y వస్తువును చూపటం జరిగింది. IC,, IC2, IC3 అనేవి మూడు వేరువేరు ఉదాసీనత వక్రరేఖలు. ఈ రేఖలు వివిధ ఆదాయ స్థాయిల వద్ద పొందగలిగే సంతృప్తి స్థాయిలను తెలియజేస్తాయి. ఉదాసీనత వక్రరేఖలు కుడివైపుకు జరిగే కొద్ది సంతృప్తి స్థాయిలలో పెరుగుదల సూచిస్తుంది. IC, రేఖ, అన్ని రేఖల కంటే తక్కువ స్థాయి సంతృప్తిని తెలియజేయును.

ప్రశ్న 5.
ధర రేఖ
జవాబు:
వినియోగదారుని కొనుగోలు ముఖ్యంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి:

  1. వినియోగదారుని ద్రవ్య ఆదాయం.
  2. కొనుగోలు చేయాలనుకుంటున్న రెండు వస్తువుల ధరలు.

ఒక వినియోగదారుడు కొనుగోలు చేసే రెండు వస్తువుల ధరలు, ఆదాయాలు స్థిరంగా ఉండి, ఏ సముదాయాలలో రెండు వస్తువులను కొనుగోలు చేయగలుగుతాడో తెలియజేసే రేఖని బడ్జెట్ రేఖ లేదా ధర రేఖ అంటారు. దీనిని ఈ క్రింది ఉదాహరణ ద్వారా వివరించవచ్చు. వినియోగదారుని ఆదాయం 5/-, X, Y వస్తువుల ధరలు వరుసగా * 10.50 పై. అనుకుందాం. దీంతో వినియోగదారుడు కొనుగోలు చేయగలిగిన రెండు వస్తువుల వివిధ సముదాయాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 13

వినియోగదారుడు మొత్తం ఆదాయాన్ని ‘X’ పైనే ఖర్చు చేస్తే 5X వస్తువులను మాత్రమే కొనుగోలు చేయగలుగుతాడు, Y వస్తువులను కొనుగోలు చేయలేడు. Y వస్తువు మీద పూర్తిగా ఖర్చు చేస్తే 10 Y లను, ‘0’ ‘X’ లను పొందగలుగుతాడు. ఈ విధంగా రెండు వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నప్పుడు తాను స్థిరమైన ఆదాయంతో కొనుగోలు చేయగలిగిన రెండు వస్తువుల వివిధ సముదాయాలకు సంబంధించిన బిందువులను కలిపినట్లయితే బడ్జెట్ రేఖ వస్తుంది. ఈ రేఖ వాలు రెండు వస్తువుల ధరల నిష్పత్తిని తెలుపుతుంది. దీనిని క్రింది రేఖాపటం ద్వారా చూపించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 14

పై రేఖాపటంలో ‘X’ వస్తువు X – అక్షంపై, ‘Y’ వస్తువు Y – అక్షంపై చూపించటం జరిగింది. PL అనేది బడ్జెట్ రేఖ. ఈ రేఖ వాలు XY వస్తువుల సాపేక్ష ధరల నిష్పత్తిని తెలియజేయును. ఏ ఆదాయ పరిమితికి లోబడి వినియోగదారుడు XY లను కొనుగోలు చేస్తున్నాడో బడ్జెట్ రేఖ తెలియజేయును. వినియోగదారునికి ఈ క్రింది అవకాశాలు ఉన్నాయి.

  1. వినియోగదారుడు తన వద్దనున్న 5/- ను ‘X’ వస్తువుపై ఖర్చు చేసినట్లయితే ‘5’ X వస్తువులను మాత్రమే కొనుగోలు చేయగలడు. కాని Y వస్తువును కొనలేడు.
  2. వినియోగదారుడు తన వద్ద ఉన్న 5/- లను ‘Y’ వస్తువుపై ఖర్చు చేసినట్లయితే 10 ‘Y’ వస్తువును మాత్రమే కొనుగోలు చేయగలడు. కాని ‘X’ వస్తువును కొనలేడు.
  3. వాస్తవంగా వినియోగదారుడు రెండు వస్తువులను కోరుకుంటాడు కావున రేఖాపటంలో OPL అనేది అతనికి ఉండే అవకాశం తెలియజేయును.
  4. ‘PL’ బడ్జెట్ రేఖను దాటి వినియోగదారుడు ఒక్క వస్తువును కూడా కొనుగోలు చేయలేడు.

ప్రశ్న 6.
ఉదాసీనత వక్రరేఖల ప్రమేయాలు తెల్పండి.
జవాబు:

  1. వినియోగదారుడు హేతుబద్ధంగా వ్యవహరిస్తాడు. తన పరిమిత ఆదాయంతో గరిష్ట సంతృప్తి పొందటానికి ప్రయత్నిస్తాడు.
  2. ప్రతి వినియోగదారునికి అభిరుచి తరహా ఉంటుంది.
  3. ఉపాంత ప్రతిస్థాపన రేటు క్షీణించును.
  4. ఇది ఆర్డినల్ ప్రయోజన భావన మీద ఆధారపడి ఉంది.
  5. వినియోగదారుడు మార్కెట్ ధరతో సంబంధం లేకుండా తన అభిరుచి తరహా రూపొందించుకుంటాడు. అంటే ఒకదానికంటే మరియొకటి మెరుగైన ఎంపిక.
  6. వినియోగదారుని అభిరుచులు, ప్రవర్తన స్థిరంగా ఉంటాయి.
  7. వినియోగదారుడు వివిధ వస్తు సముదాయాల మధ్య ఉదాసీనంగా ఉంటాడు.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

ప్రశ్న 7.
ఉదాసీన వక్రరేఖల విశ్లేషణ ఆవశ్యకతను వివరించండి.
జవాబు:

  1. ఇది బహుళ వస్తువుల విశ్లేషణ.
  2. ఇది ఆదాయ ప్రభావం, ధర ప్రభావం, ప్రత్యామ్నాయ ప్రభావాలని విశ్లేషించును.
  3. ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ అస్థిర వాస్తవికతను కలిగి ఉండును.
  4. ద్రవ్య ఉపాంత ప్రయోజనం స్థిరం అనే ప్రమేయం లేకపోవడం వల్ల ధరలో మార్పులను పరిగణిస్తుంది.

ప్రశ్న 8.
సమోపాంత ప్రయోజన సూత్ర పరిమితులను తెల్పండి.
జవాబు:

  1. ఈ సూత్రం మన్నిక కల్గిన వస్తువుల విషయంలో వర్తించదు.
  2. విభజించుటకు వీలుకాని వస్తువుల విషయంలో ఈ సిద్ధాంతం వర్తించదు.
  3. వినియోగదారుడు ఇష్టపడే వస్తువులను మార్కెట్లో లభ్యం కాని పరిస్థితిలో ఈ సూత్రం పనిచేయదు.
  4. వ్యక్తులు సంప్రదాయాలను నెరవేర్చటానికి వ్యయం చేస్తూ ఉంటారు.
    ఉదా: వివాహం, కర్మకాండ మొదలగునవి. అటువంటి వాటి విషయాలలో ఈ సూత్రం వర్తించదు.
  5. వినియోగదారుని ఆదాయం, వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నప్పుడే ఈ సూత్రం వర్తిస్తుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కార్డినల్ ప్రయోజనం [Mar. ’17, ’15]
జవాబు:
ఆల్ఫ్రెడ్ మార్షల్ కార్డినల్ సంఖ్యా పద్ధతి ద్వారా ప్రయోజన విశ్లేషణ చేసాడు. వివిధ వస్తువుల నుంచి పొందే ప్రయోజనాలను యుటిల్స్ అనే ఊహాత్మక యూనిట్స్ ద్వారా కొలవడానికి వీలుంది అని నవ్య సంప్రదాయ ఆర్థిక వేత్తలు భావించారు. 1, 2, 3 వంటి సంఖ్యలు కార్డినల్ సంఖ్యలు.

ప్రశ్న 2.
ఉపాంత ప్రయోజనం
జవాబు:
ఒక వినియోగదారుడు అదనంగా ఒక వస్తువు యూనిట్ని వినియోగించినప్పుడు మొత్తం ప్రయోజనంలో వచ్చే మార్పును ఉపాంత ప్రయోజనం అంటారు. దీనిని ఈ క్రింది విధంగా కొలవవచ్చు.
MU = ΔTU/ΔQ
ΔTU = మొత్తం ప్రయోజనంలో మార్పు
ΔQ = వస్తు పరిమాణంలో మార్పు.

ప్రశ్న 3.
వినియోగదారుని సమతౌల్యం
జవాబు:
సమతౌల్యం అనగా ఒక నిశ్చల స్థితి. వినియోగదారుడు తన వద్దనున్న పరిమిత ద్రవ్యంతో ఎక్కువ తృప్తిని పొందటానికి ప్రయత్నిస్తాడు. ఉపయోగించే వస్తువు ఉపాంత ప్రయోజనాలు సమానమైనప్పుడు మొత్తం ప్రయోజనం గరిష్టమవుతుంది. మొత్తం ప్రయోజనం గరిష్టమైనప్పుడు వినియోగదారుడు సమతౌల్యంలో ఉంటాడు.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

ప్రశ్న 4.
బడ్జెట్ రేఖ [Mar 16]
జవాబు:
ఒక వినియోగదారుడు కొనుగోలుచేసే రెండు వస్తువుల ధరలు, ఆదాయాలు స్థిరంగా ఉండి ఏ సముదాయాలలో రెండు వస్తువులను కొనుగోలు చేయగలుగుతాడో తెలియజేసే దానిని బడ్జెట్ రేఖ లేదా ధర రేఖ అని అంటారు.

ప్రశ్న 5.
సమోపాంత ప్రయోజనం
జవాబు:
వినియోగదారుడు తన దగ్గర ఉన్న పరిమిత ద్రవ్యాన్ని వివిధ వస్తువుల మీద ఖర్చు చేసినప్పుడు ప్రతి చివరి రూపాయి నుంచి అతను పొందే ఉపాంత ప్రయోజనం సమానం అయ్యేటట్లు చూసుకోవాలి. అప్పుడు వినియోగదారుడు గరిష్ట సంతృప్తి పొందుతాడు. దీనినే సమోపాంత ప్రయోజన సూత్రం అంటారు.

ప్రశ్న 6.
ఉదాసీనత వక్రరేఖ
జవాబు:
వినియోగదారుడు కొనుగోలుచేసే రెండు వస్తువుల వివిధ సమ్మేళనాలను తెలియజేసే బిందువులను కలుపగా ఏర్పడే రేఖను “ఉదాసీనత వక్రరేఖ” అని అంటారు. దీనిని ఆర్డినల్ భావనపై ప్రతిపాదించటమైనది.

ప్రశ్న 7.
ప్రతిస్థాపనోపాంత రేటు
జవాబు:
అన్ని సముదాయాలు ఒకే స్థాయిలో సంతృప్తిని ఇవ్వటం వల్ల వినియోగదారుడు ఒక వస్తువు స్థానంలో మరొక వస్తువును ఏ రేటులో ప్రతిస్థాపన చేస్తున్నాడో దానిని ప్రతిస్థాపనోపాంత రేటు అంటారు. ఈ ప్రతిస్థాపనోపాంత రేటు ఉదాసీనత రేఖ స్వభావాన్ని, వాలును నిర్ణయించును.

అదనపు ప్రశ్నలు

ప్రశ్న 8.
ఉదాసీనత వక్రరేఖ పటం
జవాబు:
వినియోగదారుని అభిరుచి తరహాను తెలియజేసే అనేక ఉదాసీనతా వక్రరేఖల సముదాయం.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 15

ప్రశ్న 9.
ఉదాసీనత పట్టిక
జవాబు:
వినియోగదారుడు ఉదాసీనంగా ఉండే వివిధ వస్తు సముదాయాలను తెలియజేయునది.

ప్రశ్న 10.
ఆర్డినల్ ప్రయోజనం
జవాబు:
హిక్స్, అలెస్ అనేవారు వినియోగదారుని ప్రవర్తనను అధ్యయనం చేయుటలో ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణను సమర్థించారు. ఈ విశ్లేషణ ద్వారా ప్రయోజనాన్ని సంఖ్యారూపంలో ఖచ్చితంగా చెప్పటం సాధ్యం కాదు. అయితే వివిధ సముదాయాల నుంచి పొందే వివిధ సంతృప్తి స్థాయిలతో పోల్చి చెప్పటం జరుగుతుంది. 1, 2, 3 అనేవి ఆర్డినల్ సంఖ్యలు.

ప్రశ్న 11.
ప్రయోజనం
జవాబు:
ఒక వస్తువుకు ఉండే మానవుని కోరికను తీర్చగలిగే శక్తి. ఇది నాలుగు రకాలు.

  1. ఆకార ప్రయోజనం
  2. స్థల ప్రయోజనం
  3. కాల ప్రయోజనం
  4. సేవా ప్రయోజనం

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

ప్రశ్న 12.
మొత్తం ప్రయోజనం
జవాబు:
ఒక వినియోగదారుడు ఒక వస్తువును వినియోగం చేసేటప్పుడు లభించే మొత్తం తృప్తిని మొత్తం ప్రయోజనం అంటారు. ఉదా: ఒక యూనిట్ వినియోగం చేసే 20 యుటిల్స్ ప్రయోజనం వచ్చింది, రెండు యూనిట్లు ఉపయోగిస్తే, 35 యుటిల్స్ వస్తే వచ్చే మొత్తం ప్రయోజనం 55 యుటిల్స్ (1 + 2 Utils).
∴ TUx = f(Qx)

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 1st Lesson పరిచయం Textbook Questions and Answers.

AP Inter 1st Year Economics Study Material 1st Lesson పరిచయం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సంపద నిర్వచనం గురించి చర్చించండి.
జవాబు:
అర్థశాస్త్రానికి సంపద నిర్వచనాన్ని ఆడమస్మిత్ అనే ఆర్థికవేత్త తెలియజేసారు. ఆడమ్స్మత్ను అర్థశాస్త్ర ” పితామహుడుగా చెప్పవచ్చు. ఇతని ఉద్దేశ్యంలో అర్థశాస్త్రం సంపదను గురించి వివరించే శాస్త్రం. ఆడమస్మిత్ తన ప్రఖ్యాతి పొందిన “రాజ్యాల సంపద” అనే గ్రంథంలో అర్థశాస్త్రాన్ని “రాజ్యాల సంపద స్వభావం, కారణాల పరిశీలన” అని నిర్వచించాడు. ఆడమస్మిత్ ఉద్దేశ్యంలో మానవుని ప్రధాన కార్యకలాపము సంపదను ఆర్జించడం. అతని అనుచరులయిన జె.బి. సే, జె. యస్, సాజ్ మొదలగువారు సంపద నిర్వచనాన్ని సమర్థించారు.

సంపద నిర్వచనములోని ప్రధానాంశాలు:
ఆడమస్మిత్ సంపద నిర్వచనంలోని ప్రధానాంశాలు క్రింది విధంగా పేర్కొన్నారు.

  1. మానవుని ఆర్థిక కార్యకలాపాల ముఖ్యోద్దేశం సంపదను ఆర్జించడం.
  2. సంపద అంటే ఉత్పత్తి చేయబడిన వస్తువులు.
  3. మానవుని స్వార్థపరమైన ఆలోచన సంపదను ఎక్కువగా ఆర్జించడం.

విమర్శ: అర్థశాస్త్రం సంపదను గురించి వివరించే శాస్త్రమనే సంకుచిత భావన వల్ల ఈ నిర్వచనం విమర్శలకు గురి అయింది.
1) కార్లెల్, రస్కిన్ అర్థశాస్త్రం నిర్వరహన్ని విమర్శించాడు. వారి ఉద్దేశ్యంలో ఈ నిర్వచనం సామాన్య మానవుని కార్యకలాపాలను గురించి అధ్యయనం చేయాలిగాని, ఆర్థిక మానవుని గురించికాదు అని విమర్శించారు. దానివల్ల వారు దీనిని “దయనీయమైన” శాస్త్రంగా వర్ణించారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

2) ఆడమస్మిత్ తన నిర్వచనంలో సంపదకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చినాడు. కాని సంపద అనేది కేవలం మానవుని కోరికను తీర్చే ఒక సాధనం మాత్రమేనని మార్షల్ విమర్శించాడు.

3) కేవలం భౌతిక వస్తువులను మాత్రమే ఆడమ్స్మిత్ సంపదగా పరిగణించారు. అభౌతిక కార్యకలాపాలైన ఉపాధ్యాయుల, వైద్యుల సేవలను పరిగణనలోనికి తీసుకోలేదు. అందువల్ల అర్థశాస్త్ర పరిధి పరిమితమై పోతుంది.

4) సంపద నిర్వచనం కేవలం ఉత్పత్తి వైపు మాత్రమే దృష్టిని కేంద్రీకరిస్తోంది. పంపిణీని నిర్లక్ష్యం చేస్తుంది.

5) స్వార్థాన్ని పెంచును: సంపద నిర్వచనంలో సంపదకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మానవుడు స్వార్థపరుడు, కనుక స్వప్రయోజనం కోసం పనిచేస్తాడు. స్మిత్ దృష్టిలో స్వప్రయోజనానికి, సామాజిక ప్రయోజనానికి తేడా లేదు. ఈ నిర్వచనం వల్ల ఆర్థిక వ్యక్తి ఏర్పడతాడు. ఈ ఆర్థిక వ్యక్తి పూర్తిగా స్వార్థపూరితమైనవాడు.

6) ధన దేవత ఉద్భోద (Gosfel of Mammon): ఈ నిర్వచనం సంపద సృష్టికి ప్రాధాన్యతనిస్తుంది. అందువల్ల దీనిని థామస్, కార్లెల్ “ధన దేవత”గా పేర్కొన్నారు.

7) లోపభూయిష్టమైనది: వాల్రాస్ కూడా సంపద నిర్వచనాన్ని పరిశీలించి అది లోపభూయిష్టమైనదని, అశాస్త్రీయమైనదని, అసంపూర్ణమైనదని పేర్కొనెను.

8) సంకుచితమైనది ఆడమస్మిత్ తన నిర్వచనంలో సంపదకు ప్రాధాన్యత ఇచ్చాడు. కాని సంపద మానవుని కోర్కెలను సంతృప్తిపరచటానికి ఒక సాధనంగా ఉండాలి. అనగా వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వాలి కాని, సంపదకు కాదు. ఈ విషయంలో సంపద నిర్వచనం అర్థశాస్త్రాన్ని సంకుచిత దృష్టిలో వివరించింది.

ఇన్ని లోపాలున్న కారణంగానే ఎక్కువమంది ఆర్థికవేత్తలు ఈ నిర్వచనాన్ని తిరస్కరించారు.

ప్రశ్న 2.
సంక్షేమం నిర్వచనం గురించి వివరించండి.
జవాబు:
మార్షల్ అర్థశాస్త్రాన్ని “మానవుడు అతని శ్రేయస్సు గురించి చర్చించే శాస్త్రంగా” నిర్వచించారు. ఆయన నిర్వచనంలో మానవుడికి ప్రథమ స్థానాన్ని, సంపదకు ద్వితీయ స్థానాన్ని ఇచ్చారు. మార్షల్ ఉద్దేశ్యం ప్రకారం “దైనందిన కార్యకలాపాల్లో మానవ ప్రవర్తన గురించి అధ్యయనం చేసేది రాజకీయ అర్థశాస్త్రం. శ్రేయస్సును సాధించడం కోసం వ్యక్తి, సమాజం

ప్రవర్తనను గురించి అధ్యయనం చేస్తుంది. ఈ విధంగా ఒకవైపు సంపదను గురించి అధ్యయనం చేస్తూ, మరొకవైపు అధిక ప్రాధాన్యమైన మానవుని గురించి అధ్యయనం చేస్తుంది.” మార్షల్ అనుచరులైన ఏ.సి. పిగూ, ఎడ్విన్ కానస్ వంటి వారు మార్షల్ నిర్వచనాన్ని సమర్థించారు.

ముఖ్య లక్షణాలు:

  1. సంక్షేమాన్ని పెంపొందింపజేసే మానవ కార్యకలాపాలను గురించి మాత్రమే మార్షల్ నిర్వచనం పరిగణిస్తోంది.
  2. మానవునికి, మానవ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తూ సంపద అనేది మానవ సంక్షేమాన్ని పెంపొందింపజేసే సాధనంగా పేర్కొన్నాడు.
  3. ఇది కేవలం మానవుని ఆర్థిక విషయాలనే అధ్యయనం చేస్తుంది. రాజకీయ, సామాజిక, మత సంబంధమైన విషయాలతో దీనికి సంబంధం లేదు.
  4. మానవ సంక్షేమాన్ని పెంపొందింపజేయడానికి అవసరమైన భౌతిక సంపదను సముపార్జించడంలో వ్యక్తి, సమాజం ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది.

విమర్శ: మార్షల్ నిర్వచనం కూడా అనేక విమర్శలకు గురైంది. ముఖ్యంగా రాబిన్స్, మార్షల్ యొక్క “శ్రేయస్సు” అనే భావనను విమర్శించాడు.

  1. అర్థశాస్త్రం సామాజిక శాస్త్రంగాని, మానవశాస్త్రం కాదు. అర్థశాస్త్ర మౌలిక సూత్రాలు మానవులందరికి వర్తిస్తాయి. అందువల్ల అర్థశాస్త్రాన్ని మానవ శాస్త్రంగానే తప్ప సామాజిక శాస్త్రంగా పరిగణించరాదు.
  2. మార్షల్ వస్తువులను భౌతిక మరియు అభౌతికమైనవిగా విభజించడం జరిగింది. కాని, తన నిర్వచనంలో అభౌతిక వస్తువులకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు.
  3. శ్రేయస్సును కొలవవచ్చు అనేది తీవ్రమైన అభ్యంతరంగా రాబిన్స్ విమర్శించారు. శ్రేయస్సు అనేది వ్యక్తిని బట్టి, కాలాన్ని బట్టి మారుతుంది.
  4. మానవ శ్రేయస్సును పెంపొందించే కార్యకలాపాలను మాత్రమే మార్షల్ పరిగణించాడు. అయితే మద్యం, విషంలాంటివి కూడా శ్రేయస్సును కలుగజేస్తాయి. మార్షల్ వీటిని విస్మరించాడు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

ప్రశ్న 3.
సంక్షేమ నిర్వచనం కంటే రాబిన్స్ నిర్వచనం ఏ విధంగా మెరుగైనది ?
జవాబు:
శ్రేయస్సు నిర్వచనం: ఆడమస్మిత్ నిర్వచనంలోని లోపాలను మార్షల్ సరిదిద్దడానికి ప్రయత్నించాడు. మానవుడికి సంపదను ఆర్జించటమే అంతిమ ధ్యేయం కాదని, ఒక లక్ష్యాన్ని సాధించడానికి సంపద ఒక సాధనం మాత్రమేనని అన్నాడు. ఆ ఉద్దేశ్యంతో మార్షల్ మానవునికి ప్రథమ స్థానం, సంపదకు ద్వితీయ స్థానం ఇచ్చాడు. మార్షల్ ప్రకారం అర్థశాస్త్రం అనగా ఒకవైపు సంపద గురించిన చర్చ అని అంతకంటే ముఖ్యంగా మరొకవైపు మానవుని గురించిన పరిశీలనలో ఒక భాగం. అర్థశాస్త్రాన్ని మానవుని శ్రేయస్సుపై దృష్టిని కేంద్రీకరించే శాస్త్రంగా నిర్వచించెను. మార్షల్ పాటు పిగూ, ఎడ్విన్ కానన్, బెవరిడ్జి మొదలైనవారు కూడా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అర్థశాస్త్రాన్ని నిర్వచించారు.

శ్రేయస్సు నిర్వచనంలోని లోపాలు:

  1. అర్థశాస్త్రం సాధారణ మానవుని దైనందిన కార్యకలాపాలను పరిశీలిస్తుంది.
  2. సంఘటిత సమాజంలోని మానవుని ఆర్థిక కార్యకలాపాలను మాత్రమే అర్థశాస్త్రం పరిశీలిస్తుంది.
  3. శ్రేయస్సుకు ప్రథమ స్థానం, సంపదకు ద్వితీయ స్థానం ఇవ్వటం జరిగింది. సంపద మానవ శ్రేయస్సుకు సాధనం మాత్రమే.
  4. భౌతిక వస్తువుల ఆర్జన వినియోగాలను మాత్రమే అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఆర్థికేతర కార్యకలాపాలను అర్థశాస్త్రం అధ్యయనం చేయదు.

కొరత నిర్వచనం: మార్షల్ నిర్వచనాన్ని విమర్శించి రాబిన్స్ అర్థశాస్త్రానికి విశ్లేషణాత్మక నిర్వచనాన్ని ఇచ్చారు. ‘యాన్ ఎస్సే ఆన్ ది నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్ సైన్స్’ అనే గ్రంథంలో రాబిన్స్ తన నిర్వచనాన్ని తెలియజేసెను. మానవుని అపరిమితమైన కోరికలను ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న పరిమిత సాధనాలకు ఉండే సంబంధం పట్ల మానవ ప్రవర్తన అధ్యయనమే అర్థశాస్త్రం” అని నిర్వచించెను. ఈ నిర్వచనంలో మానవ జీవితానికి సంబంధించిన కొన్ని నిత్య సత్యాలు ఉన్నాయి.

1) అపరిమిత కోరికలు: మానవుని కోరికలు అపరిమితం. ఒక కోరిక తీరగానే మరొక కోరిక ఉద్భవిస్తుంది. వాటిని తీర్చుకోవడానికి మానవుడు నిరంతరం కృషి జరపటం వల్ల ఆర్ధిక కార్యకలాపాలు కొనసాగుతాయి.

2) వనరులు పరిమితం: మానవుని కోర్కెలు సంతృప్తిపరిచే సాధనాలు లేదా వనరులు పరిమితమైనవి. సాధనాలు పరిమితంగా ఉండటం వల్ల కొరత మరియు ఆర్థిక సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి.

3) ప్రత్యామ్నాయ ప్రయోజనాలు: వనరులు పరిమితంగా ఉండటమే కాకుండా వాటికి ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నాయి. అనగా ఒక సాధనానికి అనేక ఉపయోగాలు ఉంటాయి.

4) ఎంపిక: సాధనాల కొరత, అపరిమితమైన కోరికల వల్ల ఎంపిక అంశం అతి ముఖ్యమైనదిగా ఉంటుంది. సాధనాల కేటాయింపులోను, కోరికల ప్రాధాన్యతను అనుసరించి సంతృప్తిపరిచే విషయంలోను ఎంపిక సమస్య ఉత్పన్నమవుతుంది.

రాబిన్స్ నిర్వచనం మార్షల్ నిర్వచనం కంటే శాస్త్రీయమైనది:
1) కార్యకలాపాలను విభజించలేదు మార్షల్ అర్థశాస్త్రంలో భౌతిక అంశాలను గూర్చి మాత్రమే వివరించాడు. కాని రాబిన్స్ భౌతిక, అభౌతిక అంశాలను రెండింటిని గూర్చి అర్థశాస్త్రంలో చర్చించాడు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

2) శ్రేయస్సును విమర్శించుట మార్షల్ శ్రేయస్సు అనే పదానికి, అర్థశాస్త్రానికి ముడిపెట్టాడు. కాని రాబిన్స్ ప్రకారం, అర్థశాస్త్రానికి శ్రేయస్సుతో ఏ మాత్రం సంబంధం లేదు. కారణం అర్థశాస్త్రంలో శ్రేయస్సుకు దోహదపడని వస్తువులు ఉదాహరణకి మత్తు పానీయాలు, సిగరెట్లు, విషం మొదలగు వాటిని గూర్చి కూడా చర్చిస్తాం.

3) లక్ష్యాల మధ్య తటస్థంగా ఉండుట: రాబిన్స్ ప్రకారం అర్థశాస్త్రం లక్ష్యాల మధ్య తటస్థంగా ఉంటుంది. ఏది మంచి, ఏది చెడు అనే నిర్ణయాలను చేయదు. అందువల్ల ఇది వాస్తవిక శాస్త్రం.

4) శాస్త్రీయమైనది: రాబిన్స్ నిర్వచనం వల్ల ఆర్థిక సమస్య ఏ విధంగా ఏర్పడుతుందో తెలుసుకోవడానికి వీలైనది. రాబిన్స్ అర్థశాస్త్రాన్ని శాస్త్రీయ స్థాయికి చేర్చి, ఎంపిక శాస్త్రంగా మలిచాడు.

5) పరిధిని విస్తృతపరిచింది: ఈ నిర్వచనం అన్ని రకాల ఆర్థిక వ్యవస్థలకు వర్తిస్తుంది. “వనరుల కొరత” అనేది ఒక సార్వత్రిక సమస్య. కనుక ఈ నిర్వచనం వల్ల అర్థశాస్త్ర పరిధి కూడా విస్తరించింది.
రాబిన్స్ నిర్వచనం మార్షల్ నిర్వచనం కంటే మెరుగైనప్పటికి కొన్ని విమర్శలకు గురైనది.

విమర్శ:
1) ఈ నిర్వచనం కొరతగా ఉన్న వనరులను ఉపయోగించి గరిష్ట స్థాయిలో కోరికలను ఏ విధంగా సంతృప్తి పరుచుకోవాలో అనే విషయం మీద దృష్టి సారించలేదు. విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఈ నిర్వచనంలో శ్రేయస్సు అనే భావన అంతర్గతంగా ఇమిడి ఉంది.

2) రాబిన్స్ నిర్వచనానికి మరొక విమర్శ, ఇది మారుతున్న సమాజానికి వర్తించదు. కాలం మారుతున్న కొద్ది అనేక మార్పులు వస్తాయి. కాబట్టి వనరుల కొరత అనే సమస్యను అధిగమించవచ్చు.

3) ఆధునిక అర్థశాస్త్రంలో చాలా ముఖ్యమైన జాతీయ ఆదాయం, ఉద్యోగిత వంటి స్థూల ఆర్థిక విశ్లేషణను రాబిన్స్ నిర్వచనం విస్మరించింది.

4) ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి వంటి ఆధునిక అర్థశాస్త్రానికి సంబంధించిన ముఖ్యాంశాలను కొరత నిర్వచనంలో చర్చించలేదు.

5) శ్రీమతి జాన్ రాబిన్సన్ ఈ నిర్వచనాన్ని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థలో ఉపయోగించని వనరులు ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్య సమస్య వనరుల కొరత మాత్రమే కాదని, ఉన్న వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలనేదే ముఖ్యమని ఆమె అభిప్రాయము.

ప్రశ్న 4.
ఆచార్య సామ్యూల్సన్ వృద్ధి నిర్వచనాన్ని తెలియజేయండి.
జవాబు:
రాబిన్స్, నిర్వచనంలో నిశ్చల దృక్పధం ఉన్నదని, కాలానుగుణంగా కోరికలు, లక్ష్యాలు, వనరులు, ఎంపికలు మారుతూ ఉంటాయని సామ్యూల్సన్ అభిప్రాయం. అందువల్ల రాబిన్స్ నిర్వచనంలో ఇమిడి ఉన్న నిశ్చలత్వాన్ని తొలగించి చలనత్వాన్ని కల్పిస్తూ సామ్యూల్సన్ కొత్త నిర్వచనం ఇచ్చాడు.

నిర్వచనం: “ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న పరిమితమైన ఉత్పాదక వనరులను ప్రజలు, సమాజం ద్రవ్యంతోగాని, ద్రవ్యం లేకుండాగాని ఎంపిక చేసుకొని ఉపయోగించుకోవడం ద్వారా వస్తూత్పత్తి చేపట్టి దానిని సమాజంలోని వివిధ వర్గాల ప్రజల మధ్య వర్తమాన లేదా భవిష్యత్కాలంలో ఏ విధంగా పంపిణీ చేసుకోవడం జరుగుతుందనే విషయ పరిశీలనే అర్థశాస్త్రము.”

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

నిర్వచనంలోని ముఖ్యాంశాలు:
1) వనరుల కొరత: రాబిన్స్ నిర్వచనంలో వలెనే సామ్యూల్సన్ కూడా వనరుల కొరత, అపరిమితమైన కోరికలు, ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న వనరులు అనే వాటినే బలపరచాడు.

2) ఆర్థిక వృద్ధి: సామ్యూల్సన్ తన నిర్వచనంలో ఆర్థికవృద్ధికి ప్రాధాన్యతయిచ్చాడు. కాలానుగుణంగా వివిధ వస్తువులను ఉత్పత్తి చేయడం, వస్తువులను వర్తమాన, భవిష్యత్కాలంలో పంపిణీ చేయడం అనే పదాలు కాల ప్రాముఖ్యాన్ని తెలుపుతాయి. ఆర్థిక వృద్ధి ప్రాముఖ్యాన్ని తెలియజేసే ప్రస్తుత వినియోగము, భవిష్యత్ వినియోగము కూడా ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి.

3) చలన స్వభావం: సామ్యూల్సన్ నిర్వచనం చలనత్వం కలిగి ఉండటమే కాక విస్తృత పరిధి కలిగి ఉంది. ఎంపిక సమస్య ద్రవ్య ఆర్థిక వ్యవస్థలోనే కాకుండా వస్తుమార్పిడి సమస్యలో కూడా ఉంది.

4) ఎంపిక సమస్య: ఎంపిక సమస్య సామ్యూల్సన్ చలన దృష్టిలో పరిగణిస్తాడు. ఎంపిక వర్తమానానికే కాకుండా భవిష్యత్కాలానికి కూడా సంబంధించినది. మానవుని కోరికలు స్థిరంగా ఉండవు. అవి కాలంతోపాటు పెరుగుతూ, మారుతూ ఉంటాయి. ఈ మార్పులకు అనుగుణంగా వనరులను పెంచాలి, మార్పులను తీసుకొని రావాలి. కనుక అర్థశాస్త్రానికి చలనత్వ స్వభావం ఉంటుంది.

కనుక ఈ నిర్వచనం అధిక ప్రజాదరణ పొందింది. మిగిలిన నిర్వచనాల కంటే ఈ నిర్వచనం సమగ్రమైనది. 5. ‘సూక్ష్మ’, ‘స్థూల’ అర్థశాస్త్రాల మధ్య తేడాలను తెలియజేయండి.
జవాబు: ఆర్థిక సమస్యల విశ్లేషణకు ఆధునిక ఆర్థికవేత్తలు రెండు మార్గాలను అవలంబించారు. అవి:

  1. సూక్ష్మ అర్థశాస్త్రం
  2. స్థూల అర్థశాస్త్రం

రాగ్నార్ష్ మొదటిసారిగా 1933లో సూక్ష్మ, స్థూల అనే పదాలను అర్థశాస్త్రములో ప్రవేశపెట్టారు.
1. సూక్ష్మ అర్థశాస్త్రం: సూక్ష్మ అర్థశాస్త్రం అనేది ‘Micros’ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. ‘Micro’ అంటే చిన్న అని అర్థం. సూక్ష్మ అర్థశాస్త్రం ఒక వైయుక్తిక ఆర్థిక యూనిట్ను పరిగణనలోనికి తీసుకొని దాని ప్రవర్తనను సమగ్రంగా అధ్యయనం చేస్తుంది. సూక్ష్మ అర్థశాస్త్రము ఆర్థిక వ్యవస్థలోని చిన్న చిన్న భాగాలను గూర్చి అధ్యయనం చేస్తుంది. వైయుక్తిక యూనిట్లను గూర్చి వివరంగా పరిశీలిస్తుంది. ఇవి జాతీయ ఆర్థిక వ్యవస్థలో చిన్న చిన్న భాగాలు లేదా వైయుక్తిక యూనిట్లు మాత్రమే. ఒక వినియోగదారుడు తన ప్రయోజనాన్ని ఏ విధంగా గరిష్టం చేసుకుంటాడో, ఒక సంస్థ గరిష్ట లాభాలను ఏ విధంగా పొందుతుందో సూక్ష్మ అర్థశాస్త్రము మనకు తెలుపుతుంది. వస్తువుల ఉత్పత్తి కారకాల ధరలు ఏ విధంగా నిర్ణయించబడతాయో సూక్ష్మ అర్థశాస్త్రము పరిశీలిస్తుంది. అందువలననే దీనిని ధరల సిద్ధాంతము అని కూడా పిలుస్తారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

2. స్థూల అర్థశాస్త్రం: స్థూల అర్థశాస్త్రం అనేది ‘Macros’ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. ‘Macros’ అంటే పెద్ద అని అర్థం. స్థూల అర్థశాస్త్రం మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేస్తుంది. జాతీయాదాయం, మొత్తం వినియోగం, మొత్తం పొదుపు, మొత్తం ఉద్యోగిత మొదలైన సమిష్టి అంశాలను స్థూల అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది..

J.M. కీన్స్ స్థూల అర్థశాస్త్రానికి ఎక్కువ ప్రాచుర్యాన్ని కల్పించారు. ఆర్థికమాంద్యం కాలంలో ఆయన రాసిన | పుస్తకం ఉద్యోగిత, వడ్డీ, ద్రవ్య సాధారణ సిద్ధాంతం ప్రచురణ తరువాత స్థూల ఆర్థిక సిద్ధాంతానికి ఎక్కువ ప్రాచుర్యం లభించింది.

స్థూల అర్థశాస్త్రాన్ని “ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం” అని కూడా అంటారు. ఎందుకంటే ముఖ్యంగా ఆదాయం, ఉత్పత్తి, ఉద్యోగితా సిద్ధాంతాలను పరిగణనలోకి తీసుకొని వివరిస్తుంది.

సూక్ష్మ, స్థూల అర్థశాస్త్రాల మధ్య తేడాలు:
సూక్ష్మ అర్థశాస్త్రం

  1. సూక్ష్మ అర్థశాస్త్రం అనేది Micros అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. Micro అనగా చిన్న అని అర్థం.
  2. ఆర్థిక వ్యవస్థలో వ్యక్తిగత భాగాలను గురించి అధ్యయనం చేస్తుంది.
  3. దీనిని ధరల సిద్ధాంతం అని కూడా అంటారు.
  4. వస్తు, కారకాల మార్కెట్ ధర నిర్ణయం గురించి వివరిస్తుంది.
  5. డిమాండ్, సప్లయ్పై ఆధారపడి ధరల యంత్రాంగం ఉంటుంది.

స్థూల అర్థశాస్త్రం

  1. స్థూల అర్థశాస్త్రం అనేది Macros అనే గ్రీకు పదం నుంచి జనించింది. Macro అనగా పెద్ద అని అర్థం.
  2. ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని అధ్యయనం చేస్తుంది.
  3. ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా అంటారు.
  4. జాతీయాదాయం, సమిష్టి ఉద్యోగిత, సమిష్టి పొదుపు, పెట్టుబడి సాధారణ ధరలస్థాయి, ఆర్థికాభివృద్ధి మొదలైన అంశాలను చర్చిస్తుంది.
  5. సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లయ్ ప్రాతిపదికగా ఉంటుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఉచిత వస్తువులు, ఆర్థిక వస్తువుల మధ్య తేడాలు.
జవాబు:
మానవుని కోర్కెలను సంతృప్తిపరచగలిగే ఏ పదార్థాన్నైనా అర్థశాస్త్రంలో “వస్తువు” అంటారు. వస్తువులు ప్రాథమికంగా రెండు రకములు. అవి: 1) ఉచిత వస్తువులు 2) ఆర్థిక వస్తువులు
1. ఉచిత వస్తువులు: డిమాండ్ కంటే సప్లై శాశ్వతంగా ఎక్కువగా ఉండి, ధరలేని వస్తువులను ఉచిత వస్తువులంటారు. ఇవి మానవ నిర్మితాలు కాదు, ప్రకృతి ప్రసాదించినవి. వీటికి ఉపయోగిత విలువ మాత్రమే ఉంటుంది. ఉదా: గాలి, నీరు.

2. ఆర్థిక వస్తువులు: డిమాండ్ కంటే సప్లై తక్కువగా అనగా కొరతగా ఉండి ధర కలిగిన వస్తువులను ఆర్థిక వస్తువులు అంటారు. ఇవి మానవ నిర్మితాలు. వీటికి ఉత్పత్తి వ్యయం ఉంటుంది. వీటికి ఉపయోగిత విలువ, వినిమయ విలువలు ఉంటాయి.
ఉదా: ఆహారము, వస్త్రాలు, యంత్రాలు మొదలైనవి. ఇవి ఉచితంగా అనుభవించడానికి వీలుండదు.

1. ఉచిత వస్తువులు, ఆర్థిక వస్తువుల మధ్య తేడాలు.
ఉచిత వస్తువులు

  1. ఇవి ప్రకృతి బహుకరించినవి.
  2. వీటి సప్లై సమృద్ధిగా ఉంటుంది.
  3. వీటికి ధర ఉండదు.
  4. వీటికి ఉత్పత్తి వ్యయం ఉండదు.
  5. ఉపయోగిత విలువ ఉంటుంది.
  6. ఇవి జాతీయాదాయంలో చేర్చబడవు.

ఆర్థిక వస్తువులు

  1. ఇవి మానవుడిచే తయారుచేయబడినవి..
  2. డిమాండ్ కంటే సప్లై ఎప్పుడు తక్కువగా ఉంటుంది.
  3. వీటికి ధర ఉంటుంది.
  4. వీటికి ఉత్పత్తి వ్యయం ఉంటుంది.
  5. ఉపయోగిత విలువ, వినిమయ విలువ రెండూ ఉంటాయి.
  6. ఇవి జాతీయాదాయంలో చేర్చబడతాయి.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

ప్రశ్న 2.
కోరికల లక్షణాలు. [Mar. ’17, ‚ ’16, ’15]
జవాబు:
మానవుని కోరికలు, ఆర్థిక కార్యకలాపాలు పురోగతికి దోహదం చేస్తాయి. కోరికలు లేనిదే వినియోగం ఉండదు. ఉత్పత్తి ఉండదు, పంపిణి ఉండదు, వినిమయం ఉండదు..
కోరికలు లక్షణాలు:
1. కోరికలు అనంతాలు: మానవుల కోరికలకు ఒక పరిమితి అంటూ ఉండదు. ఒక కోరిక తీరగానే మరొక కోరిక పుట్టుకొస్తుంది. ఇవి వ్యక్తులనుబట్టి, కాలాన్నిబట్టి, నివసించే ప్రదేశాన్నిబట్టి మారుతూ ఉంటాయి.

2. ఒక కోరికను పూర్తిగా తృప్తిపరచగలగటం: మానవుడు తన కోరికలన్నింటిని పూర్తిగా సంతృప్తిపరచడం సాధ్యం కానప్పటికీ, ఒక కోరికను పూర్తిగా తృప్తి పరచటం సాధ్యమవుతుంది.
ఉదా: ఆకలిగా ఉన్న వ్యక్తి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆకలిని పూర్తిగా తీర్చుకోవచ్చు. అదే విధంగా ఒక కారును కొనుగోలు చేయడం ద్వారా, కారు కావాలనే కోరికను సంతృప్తిపరచవచ్చు.

3. కోరికలు పరస్పరం పోటీపడడం: కోరికలు అపరిమితంగా ఉంటాయి. కాని వాటిని తీర్చుకొనే సాధనాలు మాత్రం పరిమితంగా ఉంటాయి. అందువల్ల కోరికలను సంతృప్తిపరచుకునే ప్రాధాన్యత క్రియవలె అది పరస్పరం పోటీపడతాయి.

4. కోరికలు – పూరకాలు: ఒక కోరికను సంతృప్తిపరచుకోవడానికి అనేక వస్తువులు అవసరమవుతాయి. ఉదా: ఏదైనా మనం రాయాలి అనుకున్నప్పుడు పెన్ను, కాగితం, ఇంకు ఉన్నప్పుడే ఆ కోరిక తీరుతుంది.

5. ప్రత్యామ్నాయాలైన కోరికలు: ఒక కోరికను అనేక రకాలుగా తృప్తిపరచుకోవచ్చు.
ఉదా: ఆకలిగా ఉన్నప్పుడు భోజనం లేదా బ్రెడ్ లేదా పాలు, పండ్లు తీసుకోవడం ద్వారా ఈ కోరికను తృప్తిపరచుకోవచ్చు.

6. పునరావృత్తం: అనేక కోరికలు, ఒక సమయంలో వాటిని తృప్తిపరచినప్పుడు మళ్ళీ, మళ్ళీ పుట్టుకొస్తాయి. సాధారణంగా ఇవి కనీస అవసరాలైనా ఆహారం, నిద్ర మొదలైన కోరికల విషయంలో గమనించవచ్చు.

7. కోరికలు అలవాటుగా మారడం: ఒక కోరికను క్రమం తప్పకుండా సంతృప్తిపరచినప్పుడు అది అలవాటుగా మారుతుంది. ఈ అలవాటును మార్చుకోవడం తొందరగా సాధ్యం కాదు.

8. కోరికల ప్రాముఖ్యంలో తేడా: అన్ని కోరికల తీవ్రత ఒకే విధంగా ఉండదు. కొన్ని కోరికలను వాటి ప్రాముఖ్యతను బట్టి వెంటనే తీర్చుకోవాలని ఉంటుంది. మరికొన్నింటిని వాయిదా వేయడానికి అవకాశం ఉంటుంది.

ప్రశ్న 3.
ప్రయోజన రకాలు [Mar. ’15]
జవాబు:
మానవుల కోరికలను సంతృప్తిపరచగలిగే వస్తుసేవల శక్తిని ప్రయోజనం అంటారు. అర్థశాస్త్రంలో ప్రయోజనం అనే భావనకు చాలా ప్రాధాన్యత ఉంది.
ప్రయోజనం – రకాలు:
1. రూప ప్రయోజనం: ఒక వస్తువు ఆకారం, రంగు, పరిమాణం మొదలైనవి మార్చడం ద్వారా ఆ వస్తువుకు మానవుని కోరికను తీర్చగలిగే శక్తి పెరిగినట్లయితే దానిని రూప ప్రయోజనం అంటారు.

2. స్థల ప్రయోజనం: స్థలాన్ని మార్చడం ద్వారా కొన్ని వస్తువులకు అదనపు ప్రయోజనం చేకూరుతుంది. వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి మార్చడం వల్ల ఆ వస్తువుకు స్థల ప్రయోజనం చేకూరుతుంది. ఉదా: సముద్రతీరంలో ఇసుకకు ప్రయోజనం ఉండదు. దీనిని బయటకు తీసి మార్కెట్లకు రవాణా చేయడం వల్ల స్థల ప్రయోజనం చేకూరుతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

3. కాల ప్రయోజనం: కాలాన్ని బట్టి కూడా వస్తువులకు ప్రయోజనం చేకూరుతుంది.
ఉదా: పంట చేతికి వచ్చిన కాలంలో ఆహార ధాన్యాలు ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంటాయి. వ్యాపారస్తులు వీటిని నిలువచేసి, కొంతకాలం తరువాత ఈ వస్తువులను మార్కెట్లలో అమ్ముతారు. ఈ విధంగా వస్తువులను నిలవ చేయడం ద్వారా వ్యాపారస్తులు పొందే అదనపు ప్రయోజనాన్నే కాల ప్రయోజనంగా చెప్పవచ్చు.

4. సేవల ప్రయోజనం: సేవకు కూడా మానవుని కోరికలను తీర్చగలిగే శక్తి ఉంటుంది.
ఉదా: టీచర్లు, లాయర్లు, డాక్టర్లు సేవలు మొదలైన సేవలు కూడా మానవులు కోరికలను ప్రత్యక్షంగా తీర్చగలుగుతారు. అందువల్ల వీటిని సేవ ప్రయోజనాలుగా చెప్పవచ్చు.

ప్రశ్న 4.
జేకబ్ వైనర్ నిర్వచనం [Mar. ’17, ’16]
జవాబు:
అవసరాల ప్రాముఖ్యాన్ని లేదా ఆర్థిక కార్యకలాపాల ప్రాముఖ్యాన్ని ఆధారంగా చేసుకొని వ్యక్తులుగాని, సంస్థలుగాని, ప్రభుత్వన్యాయంగాని, ఆర్థిక వ్యవస్థగాని కొరతగా ఉండి ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న వనరులను పొదుపు లేదా ఆదా చేయటం ద్వారా అపరిమితమైన కోర్కెలను సంతృప్తిపరచటానికి ఎట్లా ఉపయోగించాలి అనేదే ఆర్థిక సమస్య. ఆర్థికవేత్తలు లేవనెత్తిన ప్రశ్నలను, వివిధ అంశాలను విశ్లేషణ చేయటం ద్వారా అర్థశాస్త్రాన్ని మెరుగైన విధంగా అధ్యయనం చేయటానికి వీలుంటుందని వీరి అభిప్రాయం. ఈ అభిప్రాయాలను సమర్థిస్తూ జేకబ్ వైనర్ ఈ నిర్వచనాన్ని ఇచ్చారు. జేకబ్ వైనర్ ఉద్దేశ్యం ప్రకారం “ఆర్థికవేత్తలు ప్రతిపాదించేది అర్థశాస్త్రం”.
లక్షణాలు ఏవైనా వివిధ ఆర్థిక వ్యవస్థల్లో ఆర్థికవేత్తలు కొన్ని మౌలికమైన సమస్యలను గురించి ఆందోళన కలిగి ఉంటారు.

  1. ఏ రకమైన వస్తువులను ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి ?
  2. వస్తువులను ఏ విధంగా ఉత్పత్తి చేయాలి ?
  3. వస్తుసేవలను ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి ?
  4. ఉత్పాదక వనరులను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలి ?
  5. అందుబాటులో ఉన్న వనరులన్ని ఉపయోగించబడుతున్నాయా ?
  6. ఒక కాలవ్యవధిలో ఆర్థిక వ్యవస్థ వృద్ధిచెందుతుందా లేదా స్థిరంగా ఉందా ?

ప్రశ్న 5.
వివిధ ఆర్థిక విచారణలను గురించి వివరించండి.
జవాబు:
ఆర్థిక సూత్రాలు, సిద్ధాంతాలు రూపొందించడంలో ఒక నిర్థిష్టమైన పద్ధతి అవలంబించబడుతుంది. పీటర్సన్ అభిప్రాయంలో “ఆర్థిక సూత్రాలను నిర్మించడంలో పరిశీలించడంలో ఉపయోగించే పద్ధతులు, మౌలికాల ప్రక్రియను పద్ధతి (Method) అని అంటారు. ఆర్థిక సంబంధమైన విచారణ చేయడానికి ఆర్థికవేత్తలు సాధారణంగా రెండు రకాలైన పద్ధతులను అవలంబిస్తారు.

  1. నిగమన పద్ధతి
  2. ఆగమన పద్ధతి

1. నిగమన పద్ధతి: సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగించారు. దీనిని ‘పరికల్పన’ | (Hypothetical) లేదా అనిర్థిష్టక (Abstract) పద్ధతి అని కూడా అంటారు. ఇది వాస్తవాలపై కాకుండా ఒక మానసిక అభ్యాసం, తర్కం మీద ఆధారపడి ఉంటుంది. ఒక తరం నుంచి మరొక తరానికి కొన్ని నిర్థిష్టమైన ప్రమాణాలు అంగీకరించబడ్డ సూత్రాలు లేదా వాస్తవాల నుంచి తర్కం ద్వారా ఆర్థిక సిద్ధాంతాలను రూపొందించడం జరుగుతుంది. ఇందులో సాధారణ విషయాల నుంచి ఒక నిర్ధిష్ట విషయాన్ని రాబట్టడం జరుగుతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

ఉదా: హేతుబద్ధంగా ఆలోచిస్తే ఒక వ్యక్తి సాధారణంగా తక్కువ ధర గల వస్తువుని కొంటాడు. ఎక్కువ ధరగల వస్తువును విక్రయిస్తాడు. అయితే మార్కెట్ను గురించి సరైన పరిజ్ఞానం కలిగి ఉండాలి. నిగమన పద్ధతిలో నిర్ణయాలు చేసేటప్పుడు నాలుగు దశలు ఉంటాయి.

  1. ఒక సమస్యను ఎన్నుకోవడం
  2. ప్రమేయాలను రూపొందించడం
  3. ఒక పరికల్పనను రూపొందించడం (Hypothesis)
  4. పరికల్పన ప్రతిపాదనను పరిశీలించడం

క్షీణోపాంత ప్రయోజన సూత్రం నిగమన పద్ధతికి ఒక ఉదాహరణ.

2. ఆగమన పద్ధతి: దీనిని చారిత్రక లేదా గుణాత్మక లేదా అనుభవిక, వాస్తవ, నిర్థిష్ట పద్ధతి అని పిలుస్తారు. జర్మనీ ఆర్థికవేత్తలు దీనిని అభివృద్ధి పరిచారు. ఇది ఒక నిర్దిష్ట లేదా ప్రత్యేక అంశం నుంచి విశ్వజనీనతకు పయనిస్తుంది. ” ఇందులో వాస్తవాల వివరాల సేకరణ చేసి సమకూర్చి నేల నిర్ణయాలు చేయబడతాయి. ఉదా: మార్థస్ సిద్ధాంతం.
ఈ పద్ధతిలో నాలుగు దశలు ఉంటాయి.

  1. సమస్యను ఎన్నుకోవడం
  2. దత్తాంశాన్ని సేకరించడం
  3. పరిశీలించడం
  4. సాధారణీకరించటం

విషయాలను ఉన్నవి ఉన్నట్టుగానే వివరించడం వల్ల ఈ పద్ధతి దిగా భావించబడుతుంది.

ప్రశ్న 6.
స్థూల అర్థశాస్త్రానికి అర్థాన్ని తెలిపి, దాని పరిధి, ప్రాధాన్యతను వివరించండి ?
జవాబు:
అర్థశాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రమని రెండు విధాలుగా రాగ్నా 1933 సం॥లో విభజించారు. అప్పటి నుండి ఈ విభజన ప్రచారంలోకి వచ్చింది.

స్థూల అర్థశాస్త్రం వైయుక్తిక యూనిట్లను కాకుండా మొత్తం లేదా సమిష్టి యూనిట్లను మొత్తంగా పరిశీలిస్తుంది. యూనిట్ల మొత్తాన్ని స్పష్టంగా నిర్వచించి వాటి మధ్య ఉండే పరస్పర సంబంధాలను పరిశీలించడం ఈ విశ్లేషణ ముఖ్యోద్దేశము. గార్డెనర్ ఆక్లే ప్రకారం స్థూల అర్థశాస్త్రం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మొత్తం ఉత్పత్తి వనరుల నియామకం, జాతీయాదాయ పరిమాణం, సాధారణ ధరల స్థాయి మొదలైన వాటిని పరిశీలిస్తుంది. స్థూల అర్థశాస్త్రాన్ని ” ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతము” అని కూడా ఆన్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు.

స్థూల అర్థశాస్త్ర పరిధి:
AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం 1

స్థూల అర్థశాస్త్రం – ప్రాధాన్యత:

  1. ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నుల పరిశీలనకు తోడ్పడుతుంది. ఆర్థిక సమస్యలకు మూలకారణాలను కనుగొని, వాటి పరిష్కారానికి మార్గాలను సూచిస్తుంది.
  2. జాతీయోత్పత్తి స్థాయి, దాని కూర్పులను గురించి తెలుపుతుంది. తలసరి ఆదాయాలు, జీవన ప్రమాణాలు మొదలైన వాటిని విశ్లేషిస్తుంది.
  3. ఆర్థికవ్యవస్థ వృద్ధి, స్థిరత్వాల చర్చలకు తోడ్పడుతుంది. వ్యాపార చక్రాల విశ్లేషణకు సహకరిస్తుంది.
  4. పేదరికం, నిరుద్యోగితలకు కారణాలను కనుగొని వాటి పరిష్కారానికి తోడ్పడే ఆర్థికాభివృద్ధి విధానాల రూపకల్పనలో సహాయపడుతుంది.
  5. ఆర్థిక వ్యవస్థలో పొదుపు, పెట్టుబడుల ప్రాధాన్యాన్ని వివరిస్తుంది.
  6. ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం కారణాలను స్పష్ట పరచటానికి సహాయపడుతుంది. అంతర్జాతీయ, జాతీయ సమస్యల పరిష్కారానికి ఈ శాస్త్రం తోడ్పడుతుంది.
  7. ఆర్థిక విధానాల కల్పనకు, ఆచరణకు ఉపయోగపడుతుంది.

ప్రశ్న 7.
సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఏమిటి ? దాని పరిధి, ప్రాధాన్యాన్ని వివరించండి.
జవాబు:
అర్థశాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రమని, స్థూల అర్థశాస్త్రమని 1933 సం॥లో రాగ్నార్ ఫ్రిష్ ప్రతిపాదించెను. సూక్ష్మ అర్థశాస్త్రం అనేది ‘Micros’ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. ‘Micro’ అంటే చిన్న అని అర్థం. సూక్ష్మ అర్థశాస్త్రం ఒక వైయుక్తిక ఆర్థిక యూనిట్ను పరిగణనలోనికి తీసుకొని దాని ప్రవర్తనను సమగ్రంగా అధ్యయనం చేస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థలోని చిన్నచిన్న భాగాలను గూర్చి అధ్యయనం చేస్తుంది. వైయుక్తిక యూనిట్లను గూర్చి వివరంగా పరిశీలిస్తుంది. ఒక వినియోగదారుడు తన ప్రయోజనాన్ని ఏ విధంగా గరిష్టం చేసుకుంటాడో ? ఒక సంస్థ గరిష్ట లాభాలు ఏ విధంగా పొందుతుందో ? సూక్ష్మ అర్థశాస్త్రం తెలుపుతుంది. వస్తువుల ఉత్పత్తి కారకాల ధరలు ఏ విధంగా నిర్ణయించబడతాయో సూక్ష్మ అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. అందువలనే దీనిని ధరల సిద్ధాంతం అని కూడా పిలుస్తారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

పరిధి: వైయుక్తిక యూనిట్ల పరిశీలనయే సూక్ష్మ అర్థశాస్త్రం. “సంపూర్ణ ఉద్యోగిత” అనే ప్రమేయముపై సూక్ష్మ అర్థశాస్త్ర విశ్లేషణ జరుగుతుంది. ఇది వినియోగదారులను ఉత్పత్తిదారులను విడివిడిగా వారి ప్రవర్తనను విశ్లేషించును. సూక్ష్మ అర్థశాస్త్రం ముఖ్యంగా ఏమిటి ? ఎలా ? ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి ? అనే అంశాలను అధ్యయనం చేస్తుంది. వస్తువుల మార్కెట్లలో ధర నిర్ణయం, కారకాల మార్కెట్లో ధర నిర్ణయం అధ్యయనం చేస్తుంది. ఈ క్రింది చార్టు సూక్ష్మ అర్థశాస్త్ర పరిధిని వివరిస్తుంది.

సూక్ష్మ అర్థశాస్త్ర పరిధి:
AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం 2

ప్రాధాన్యత:

  1. స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో అపరిమిత సంఖ్యలో ఉన్న వినియోగదారులు, ఉత్పత్తిదారులు మధ్య వనరులు అభిలషణీయంగా ఏ విధంగా కేటాయింపులు జరుగుతాయో సూక్ష్మ అర్థశాస్త్రం వివరిస్తుంది.
  2. ఇది వ్యక్తుల, సంస్థల సమతౌల్యాన్ని వివరిస్తుంది.
  3. ప్రభుత్వ ఆర్థిక విధానాల రూపకల్పనలో ఉపకరిస్తుంది. ఉదాహరణకు ఏకస్వామ్యాల నియంత్రణ, పరిశ్రమల సబ్సిడీ మొదలైనవి.
  4. ఆర్థిక మంత్రికి పన్ను భారంను ఏ విధంగా వినియోగదారులకు, ఉత్పత్తిదారులకు అమ్మకందారులకు పంపిణీ చేయాలో వివరిస్తుంది.
  5. ఉత్పత్తి వ్యయాలు, డిమాండ్ను అంచనా వేయడం వంటి వ్యాపార సంబంధ విషయాలను అధ్యయనం చేస్తుంది.
  6. పరిమిత సాధనాల నుండి గరిష్ట ప్రయోజనం పొందడానికి సహకరిస్తుంది.
  7. ఇది స్థూల అర్థశాస్త్రానికి ప్రతిపాదిక.

ప్రశ్న 8.
చక్రీయ ఆదాయ ప్రవాహాన్ని పటం సహాయంతో వివరించండి.
జవాబు:
ఆదాయానికి మూలం సంపద. ఆదాయం ఒక ప్రవాహం వంటిది. ఈ ప్రవాహం ఆది, అంతములేని చక్రంలాగా ఉంటుంది. చక్రం ఏ విధంగా భ్రమణం చెందుతుందో అదే విధంగా ఆదాయం కూడా భ్రమణం చెందుతుంది. చక్రీయ ఆదాయ ప్రవాహ (Circular flow of Income) స్వరూపాన్ని క్రింది పటం సహాయంతో అవగాహన చేసుకోవచ్చు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం 3
ద్రవ్యరూపంలో ఆదాయం (వేతనాలు, భాటకం, వడ్డీ, లాభాలు)

పైన చూపిన పటం ప్రకారం ఉత్పత్తి కారకాల మార్కెట్కు, వస్తుసేవల మార్కెట్కు మధ్య సన్నిహిత సంబంధమున్నట్లుగా అర్థమవుతుంది. కుటుంబాలు ఉత్పత్తి కారకాలను, మార్కెట్లో విక్రయిస్తాయి. వ్యాపార సంస్థలు ఉత్పత్తి కారకాలను కొనుగోలు చేస్తాయి. అందువల్ల ఉత్పత్తి కారకాలను ప్రతిఫలాలను వ్యాపార సంస్థలు ద్రవ్యరూపంలో చెల్లిస్తాయి. అనగా ఆదాయం వ్యాపార సంస్థల నుండి కుటుంబాలకు ప్రవహిస్తుంది. వ్యాపార సంస్థలు వినియోగ వస్తువులను ఉత్పత్తి చేస్తాయి. ఈ వస్తువులను కుటుంబాలు కొనుగోలు చేస్తాయి. ఈ కారణంగా కుటుంబాలు వ్యాపార సంస్థలకు ద్రవ్యరూపంలో చెల్లింపులు చేస్తాయి. అంటే ఆదాయం ఒకసారి వ్యాపార సంస్థల నుండి కుటుంబాలకు, మరొకసారి కుటుంబాల నుండి వ్యాపార సంస్థలకు ప్రవహిస్తుంది. దీనినే చక్రీయ ఆదాయ ప్రవాహం అంటారు.

ప్రశ్న 9.
వినియోగ, ఉత్పాదక వస్తువుల మధ్య ఉన్న తేడాను వివరించండి.
జవాబు:
మానవ కోరికలను సంతృప్తిపరచగలిగే ఏ పదార్థాన్నైనా అర్థశాస్త్రంలో “వస్తువు” అంటారు.
వస్తువులను రెండు రకాలుగా విభజిస్తారు. 1) ఉచిత వస్తువులు, 2) ఆర్థిక వస్తువులు.

ఆర్థిక వస్తువులను తిరిగి వినియోగ వస్తువులు, ఉత్పాదక వస్తువులని విభజిస్తారు.
1. వినియోగ వస్తువులు: మానవ కోరికలను ప్రత్యక్షంగా సంతృప్తిపరచే వస్తువులను వినియోగ వస్తువులంటారు. వీటినే ప్రథమశ్రేణి వస్తువులని కూడా అంటారు. వీటికి ప్రత్యక్ష డిమాండ్ ఉంటుంది. ఉదా: ఆహారం, వస్త్రాలు, నివసించే ఇల్లు మొదలైనవి. వినియోగ వస్తువులను రెండు రకములుగా విభజించవచ్చును. అవి,

  1. ఒకసారి ఉపయోగంతో నశించేవి
  2. కొంత కాలంపాటు ఉపయోగంలో ఉండేవి.

i) ఒకసారి ఉపయోగంతో నశించేవి: మనం తినే ఆహారం, త్రాగునీరు లేదా పానీయాలు ఒకసారి ఉపయోగంతోనే వాటి నుండి పొందే ప్రయోజనం నశిస్తుంది. సేవలన్నీ ఒకసారి ఉపయోగంతో ప్రయోజనాన్ని కోల్పోతాయి. ఉదా: విత్తనాలు, ముడిపదార్థాలు, బొగ్గు, విద్యుత్ మొదలగునవి.

ii) కొంత కాలంపాటు ఉపయోగంలో ఉండేవి: ఒకసారితోనే ప్రయోజనాన్ని పోగొట్టుకోకుండా కొంత కాలంపాటు ఉపయోగంలో ఉండి, వాటిని వినియోగించే వారికి ప్రయోజనాన్ని కలుగజేస్తాయి. ఈ వస్తువులు కొంత కాలంపాటు మన్నికను కలిగి ఉండి వినియోగదారులకు ప్రయోజనాన్ని ఇస్తాయి. వీటిని మన్నికగల వినియోగ వస్తువులంటారు. ఉదా: బల్ల, కుర్చీ, పుస్తకము, టీ.వి. మొదలైనవి.

2. ఉత్పాదక వస్తువులు: వీటినే మూలధన వస్తువులు అని కూడా అంటారు. అనగా ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి సాధనాలు. ఏ వస్తువులైతే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని, ఇతర వస్తువుల ఉత్పత్తికి తోడ్పడతాయో, అటువంటి వస్తువులను ఉత్పాదక లేదా మూలధన వస్తువులంటారు. ఇవి పరోక్షంగా మానవుని కోరికలను సంతృప్తిపరుస్తాయి. వీటినే ద్వితీయ శ్రేణి వస్తువులంటారు. వీటికి ఉత్పన్న లేదా పరోక్ష డిమాండ్ ఉంటుంది. ఇవి రెండు రకములు.

  1. ఒకసారి ఉపయోగంతో నశించేవి
  2. కొంత కాలంపాటు ఉపయోగంలో ఉండేవి

i) ఒకసారి ఉపయోగంతో నశించేవి: ఒకసారి వినియోగించగానే వాటి ప్రయోజనం నశిస్తుంది.
ఉదా: విత్తనాలు, ముడి పదార్థాలు, బొగ్గు, విద్యుత్ మొదలగునవి.

ii) కొంత కాలంపాటు ఉపయోగంలో ఉండేవి: కొన్ని వస్తువులు కొంత కాలం పాటు వినియోగంలో ఉంటాయి. అనగా కొంతకాలంపాటు ప్రయోజనాన్ని ఇవ్వగలుగుతాయి. వీటిని మన్నిక గల ఉత్పాదక వస్తువులు అంటారు. ఉదా: యంత్రాలు, ట్రాక్టర్, కర్మాగార భవనాలు మొదలగునవి.

వినియోగ వస్తువులకు, ఉత్పాదక వస్తువులకు మధ్యగల భేదములు:
వినియోగ వస్తువులు

  1. ఇవి ప్రత్యక్షంగా మానవ కోరికలను సంతృప్తిపరచును.
  2. వీటికి ప్రత్యక్ష డిమాండ్ ఉంటుంది.
  3. ఇవి ప్రథమశ్రేణి వస్తువులు.
  4. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనవు.
  5. వస్తువులను కలిగిన యజమానులకు ఆదాయాన్నివ్వవు.

ఉత్పాదక వస్తువులు

  1. ఇవి పరోక్షంగా మానవ కోరికలను సంతృప్తిపరచును.
  2. వీటికి పరోక్ష లేదా ఉత్పన్న డిమాండ్ ఉంటుంది.
  3. ఇవి ద్వితీయ శ్రేణి వస్తువులు.
  4. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటాయి.
  5. వస్తువులను కలిగిన యజమానులకు ఆదాయాన్ని చేకూర్చి పెడతాయి.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆర్థిక వస్తువులు [Mar. ’15]
జవాబు:
డిమాండ్ కంటే సప్లై తక్కువగా అనగా కొరతగా ఉండి ధర కలిగిన వస్తువులను ఆర్థిక వస్తువులంటారు. ఉదా: ఆహారం, వస్త్రాలు, యంత్రాలు మొదలైనవి. అవకాశం ఉంటే వీటిని వ్యక్తులు ఎక్కువగా కావాలనుకుంటారు. వీటికి ఉపయోగిత విలువ, వినిమయ విలువ ఉంటాయి. ఇది మానవ నిర్మితాలు. కనుక వీటికి ఉత్పత్తి వ్యయం ఉంటుంది.

ప్రశ్న 2.
ఉత్పాదక వస్తువులు
జవాబు:
ఉత్పాదక వస్తువులనే మూలధన వస్తువులు అని కూడా అంటారు. ఇవి ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి సాధనాలు. ఏ వస్తువులైతే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఇతర వస్తువుల ఉత్పత్తికి తోడ్పడతాయో అటువంటి వస్తువులను ఉత్పాదక వస్తువులు లేదా మూలధన వస్తువులు అంటారు. ఇవి పరోక్షంగా మానవుని కోరికలను సంతృప్తిపరచును. వీటిని ద్వితీయ శ్రేణి వస్తువులంటారు.

వీటికి పరోక్ష లేదా ఉత్పన్న డిమాండ్ ఉంటుంది. ఇవి ఒకసారి ఉపయోగంలో నశించేవి, కొంతకాలంపాటు వినియోగంలో ఉండేవి అని రెండు రకములు. ఉదా: యంత్ర పరికరాలు, కర్మాగార భవనాలు మొదలైనవి.

ప్రశ్న 3.
మధ్యంతర వస్తువులు [Mar. ’17]
జవాబు:
పూర్తిగా తయారు కాకుండా ఇంకా తయారీలో ఉన్న వస్తువుల ముడిసరుకులను, అంతిమ వినియోగ వస్తువులకు మధ్యలో వివిధ దశలలో ఉన్న వస్తువులను మధ్యంతర వస్తువులు అంటారు. అంతిమ వినియోగానికి కాకుండా ఇతర వస్తువుల ఉత్పత్తి ప్రక్రియలో ఏదో ఒక దశలో, ఎక్కడో ఒకచోట ఉపయోగించే వస్తువులు మాధ్యమిక వస్తువులు. ఉదా: సిమెంటు, ఇటుకలు, స్టీలు మొదలైనవి నిర్మాణ రంగంలో మధ్యంతర వస్తువులు.

ప్రశ్న 4.
సంపద [Mar. ’16]
జవాబు:
సాధారణ పరిభాషలో సంపద అనగా కేవలం ప్రజల వద్దనున్న ద్రవ్యం. కాని అర్థశాస్త్రంలో సంపద అనగా ద్రవ్యము మాత్రమే కాకుండా ప్రయోజనం, కొరత బదిలీ చేయటానికి అవకాశం ఉండటము అనే లక్షణాలుగల ఏ వస్తువులైనా సంపదగా పరిగణిస్తారు. ఉదా: భూములు, భవనాలు మొదలైనవి.

ప్రశ్న 5.
ఆదాయం
జవాబు:
ఆదాయానికి మూలం సంపద. ఆదాయం ఒక ప్రవాహం వంటిది. ఆదాయం ఒకసారి వ్యాపార సంస్థల నుండి ఉత్పత్తి కారకాల ప్రతిఫలాల రూపంలో కుటుంబాలకు, మరొకసారి కుటుంబాల నుండి వస్తు సేవలపై వ్యయ రూపంలో వ్యాపార సంస్థలకు ప్రవహిస్తుంది. దీనిని చక్రరూప ఆదాయ ప్రవాహం అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

ప్రశ్న 6.
ప్రయోజనం [Mar. ’16]
జవాబు:
వస్తుసేవలకుండే మానవ కోరికలను సంతృప్తిపరచగలిగే శక్తిని అర్థశాస్త్రంలో ప్రయోజనం అంటారు. వస్తువు అన్ని యూనిట్ల నుండి పొందే ప్రయోజనం మొత్తాన్ని మొత్తం ప్రయోజనమని, వస్తువు అదనపు యూనిట్ వలన మొత్తం ప్రయోజనానికి కలుపబడే లేదా తీసివేయబడే ప్రయోజనమును ఉపాంత ప్రయోజనమని అంటారు. ఈ భావన అర్థశాస్త్రంలో చాలా ప్రధానమైనది.

ప్రశ్న 7.
వినిమయ విలువ
జవాబు:
ఒక వస్తువును వినిమయం చేసినప్పుడు దాని బదులుగా పొందగలిగే ఇతర వస్తువులను లేదా సాధారణ ద్రవ్యాన్ని వినిమయ విలువ అని అంటారు. ఉచిత వస్తువులకు మారకం విలువ ఉండదు లేదా తక్కువగా ఉంటుంది. కొన్ని రకాల వస్తువులకు మారకం విలువ అధికంగా ఉంటుంది.

ప్రశ్న 8.
ధర
జవాబు:
ఒక వస్తువు విలువను ద్రవ్య రూపంలో చెప్పినట్లయితే దానిని ధర అంటారు.
ఉదా: ‘X’ వస్తువు 10/- వినిమయం చెందుతుంది.

ప్రశ్న 9.
ఎంపిక సమస్య
జవాబు:
సాధనాల కొరత వల్ల మానవుడు అపరిమితమైన కోరికలలో వేటిని సంతృప్తిపరుచుకోవాలి, సాధనాలను ఎట్లా కేటాయించుకోవాలి అని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. ఎంపిక సమస్యను అతి ముఖ్యమైన అర్థశాస్త్ర సమస్యగా రాబిన్స్ వివరించాడు.

ప్రశ్న 10.
ఆర్థిక కార్యకలాపాలు
జవాబు:
ఆదాయ ఆర్జన, వ్యయానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలు.

ప్రశ్న 11.
సూక్ష్మ అర్థశాస్త్రం
జవాబు:
సూక్ష్మ అర్థశాస్త్రం అనేది మైక్రోస్ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. సూక్ష్మ అర్థశాస్త్రం ఒక వైయుక్తిక ఆర్థిక యూనిట్ను పరిగణనలోకి తీసుకొని దాని ప్రవర్తనను సమగ్రంగా అధ్యయనం చేస్తుంది. ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం గురించి వివరిస్తుంది, కాబట్టి దీనిని ధరల సిద్ధాంతం అంటారు.

ప్రశ్న 12.
స్థూల అర్థశాస్త్రం
జవాబు:
స్థూల అర్థశాస్త్రం అనేది మాక్రోస్ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. ఆర్థిక వ్యవస్థ మొత్తానికి సంబంధించిన అంశాలను అంటే మొత్తం ఉద్యోగిత, మొత్తం ఆదాయం మొదలగు వాటిని గూర్చి అధ్యయనం చేస్తుంది. అందుచే స్థూల అర్థశాస్త్రాన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా అంటారు.

ప్రశ్న 13.
నిశ్చల ఆర్థిక విశ్లేషణ
జవాబు:
ఒకే సమయంలో లేదా ఒకే కాలానికి సంబంధించిన విలువలను తెలియజేసే రెండు చలాంకాల మధ్య ఉన్న ప్రమేయ సంబంధాన్ని నిర్ధారించడానికి చేసే విశ్లేషణ. ఉదా: సంపూర్ణ పోటీలోని సమతౌల్య ధర నిర్ణయం.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

ప్రశ్న 14.
చలన ఆర్థిక విశ్లేషణ
జవాబు:
ఆర్థిక చలనత్వం వేరువేరు సమయాలకు చెందిన విలువలను తెలియజేసే సంబంధిత చలాంకాల మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది.

ప్రశ్న 15.
నిగమన పద్ధతి
జవాబు:
తార్కిక విశ్లేషణ ద్వారా సార్వజనీనమైన ఫలితాలను వ్యక్తిగత అంశాలకు వర్తింపచేయడం.
ఉదా: క్షీణోపాంత ప్రయోజన సూత్రం.

ప్రశ్న 16.
ఆగమన పద్ధతి
జవాబు:
తార్కిక విశ్లేషణ చేయడం ద్వారా ప్రత్యేక అంశాల పరిశీలన వల్ల వచ్చిన ఫలితాలు మొత్తం అంశాలకు వర్తింప చేయడం. ఉదా: క్షీణ ప్రతిఫల సూత్రం.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 12th Lesson వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు Textbook Questions and Answers.

AP Inter 1st Year Commerce Study Material 12th Lesson వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
e – వ్యాపారాన్ని నిర్వచించి, దాని పరిధిని వివరించండి.
జవాబు:
e – వ్యాపారము అనే పదాన్ని మొదటిసారిగా 1997లో IBM ఉపయోగించినది. దీని ప్రకారము e- వ్యాపారము అంటే “ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ముఖ్యమైన వ్యాపార దశలను బదలాయింపు చేయడము”.

అన్ని వ్యాపార కార్యకలాపాలను, వ్యాపార పరిధిని బలపరచడానికి Information and Communication Technology (ICT) సహకారాన్ని ఇంటర్ నెట్ల ద్వారా తీసుకోవటమును e- వ్యాపారముగా నిర్వచించవచ్చును. e – వ్యాపారము ICT వినియోగదారులతో సంబంధాలు పెంపొందించుకోవడానికి కార్యకలాపాలను చేస్తుంది. e వ్యాపార పద్ధతులు వ్యాపార సంస్థల అంతర్గత, బహిర్గత వ్యవస్థల మధ్య సత్సంబంధాలను అత్యంత సమర్థవంతంగా, సరళముగా e – వ్యాపార పరిధి : e వ్యాపారాన్ని క్రింది విధముగా విభజించవచ్చు.

  • వ్యాపార సంస్థలో మాత్రమే.
  • ఒక వ్యాపార సంస్థ మరొక వ్యాపార సంస్థ మధ్య వ్యవహారాలు
  • వ్యాపార సంస్థ – వినియోగదారుని మధ్య వ్యవహారాలు
  • వినియోగదారుడు – వినియోగదారుని మధ్య వ్యవహారాలు
  • వినియోగదారుడు – వ్యాపార సంస్థ మధ్య వ్యవహారాలు

e – వాణిజ్యము పరిధి ఆన్లైన్ వ్యవహారములకు మాత్రమే పరిమితము అవుతుంది. ఆన్లైన్ ద్వారా ” వ్యవహారములు వస్తువు లేదా సర్వీసుకు సంబంధించినవై ఉంటాయి. దాదాపుగా ప్రతి వస్తువు జిమ్ పరికరాల నుంచి కంప్యూటర్ ల్యాప్టాప్ వరకు, వస్త్రాలను మొదలుకొని ఆభరణాల వరకు e – వాణిజ్య రంగంలో ఆన్లైన్ ద్వారానే కొనుగోలు చేయడం జరుగుతుంది. కేవలం వస్తువులను మాత్రమే కాకుండా సేవలను కూడా ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఉదా : న్యాయవాదులు, డాక్టర్లు తమ సేవలను ఆన్లైన్ ద్వారా అందిస్తున్నారు. రైలు, బస్సు, విమాన టిక్కెట్ల కొనుగోలు, పన్ను చెల్లింపులు ఆన్లైన్ ద్వారా చేయవచ్చు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

e – వ్యాపార పరిధి దిగువ అంశాలకు వర్తింపచేయడం జరుగుతుంది.
1) e – వాణిజ్యము : ఇంటర్నెట్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహించడాన్ని e – వాణిజ్యము అంటారు. ఎలక్ట్రానిక్ వాణిజ్యాన్ని e – వాణిజ్యము అని వ్యవహరిస్తారు. ఆన్లైన్ ద్వారా వస్తువుల కొనుగోలు, అమ్మకం చేసే ప్రక్రియ దీనికి మంచి ఉదాహరణ. అంతేకాకుండా e – వాణిజ్యములో అనేక కార్యకలాపాలు కలిసి ఉంటాయి. ఏదైనా కార్యకలాపాన్ని ఎలక్ట్రానిక్ పరికరము ద్వారా నిర్వహించడాన్ని e – వాణిజ్యము అనవచ్చు.

2) e – వేలం : ఇంటర్ నెట్ సహాయముతో ప్రజలు వేలములో పాల్గొనవచ్చు. e-వేలములో పాల్గొనదలచినవారు సంబంధిత వెబ్సైట్ను సందర్శించి వేలం కోసం ప్రదర్శించిన వస్తువులను క్లిక్ చేస్తూ కొనుగోలు చేయవచ్చు. అదే విధముగా వెబ్ పేజీలలో తమ వస్తువులను ఉంచి వేలం ద్వారా వస్తువులను అమ్మకము చేయవచ్చు..

3) e – బ్యాంకింగ్ : ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ మంచి విజయవంతమైన ఆన్లైన్ వ్యాపారము. బ్యాంకింగ్ వెబ్ సైట్ను ఉపయోగిస్తూ బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్స్ నిర్వహించుకోవడానికి, చెల్లింపుల ఆజ్ఞ ఇవ్వడానికి e – బ్యాంకింగ్ సహాయము చేస్తుంది. ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఖాతాదారులు బ్యాంకును సందర్శించనవసరము లేకుండా అవసరమైన నగదును ATM ద్వారా పొందవచ్చు. ఖాతా నిల్వలు తెలుసుకోవచ్చు. బిల్లులను చెల్లించవచ్చును. నగదును బదిలీ చేయవచ్చును.

4) e – మార్కెటింగ్ : ఎలక్ట్రానిక్ మార్కెటింగ్లో ఎలాంటి భౌగోళిక అడ్డంకులు లేకుండా వస్తువుల కొనుగోలుకు, అమ్మకాలకు ప్రపంచవ్యాప్తముగా మార్కెటింగ్ ఏర్పాటు చేస్తుంది. ఎలాంటి సమయ భావన లేకుండా ఖాతాదారుల డిమాండ్ను కంపెనీలు స్పందించేందుకు ‘ఇంటర్నెట్ సహాయం చేస్తుంది. దీనికి వినియోగదారులు ఉండే ప్రాంతముతో
సంబంధము లేదు.

5) e – వర్తకము : e – వర్తకాన్ని ఆన్లైన్ వర్తకమని, e – బ్రోకింగ్ అని కూడా వ్యవహరిస్తారు. ఇది స్టాక్ ఎక్స్ఛేంజ్లలో సెక్యూరిటీలను అమ్మడానికి, కొనడానికి ఉపయోగపడుతుంది.

ప్రశ్న 2.
e – వ్యాపారం యొక్క ప్రయోజనాలను వివరించండి.
జవాబు:
e – వ్యాపారము వలన వినియోగదారులకు, వ్యాపార సంస్థలకు, సమాజానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు :

  1. e – వ్యాపారము వలన వినియోగదారులు ఏ ప్రాంతం నుంచి అయినా, ఏ సమయంలోనైనా వ్యాపార వ్యవహారాలు నిర్వహించవచ్చు.
  2. e – వ్యాపారము వినియోగదారులకు వస్తు సేవలకు సంబంధించి, అనేక ప్రత్యామ్నాయాలు, అవకాశాలను కల్పిస్తాయి.
  3. e – వ్యాపారము ద్వారా వినియోగదారుడు అనేక ప్రాంతాలలోని మార్కెట్లలో వస్తు, సేవలను పోల్చి చూసుకోవడానికి వీలవుతుంది.
  4. e – వ్యాపారము వస్తు సేవలు త్వరగా డెలివరీ కావడానికి దోహదము చేస్తుంది.
  5. వినియోగదారుడు వస్తు సేవలకు సంబంధించి సరైన సమాచారాన్ని పూర్తి స్థాయిలో, క్షణాలలో పొందవచ్చును.
  6. వినియోగదారుడు సరైన వేలములో పాల్గొనేందుకు e -వ్యాపారము సహాయపడుతుంది.
  7. e- వ్యాపారము వినియోగదారుల మధ్య సహకారాన్ని ఏర్పరచి, ఒకరికొకరు వ్యాపార ఉపాయాలు, అనుభవాలు పంచుకునేట్లు చేస్తుంది.
  8. e – వ్యాపారము వ్యాపారం మధ్య పోటీతత్వాన్ని ఏర్పరచి, వినియోగదారులకు సరైన డిస్కౌంట్లు లభించేందుకు సహకరిస్తుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

వ్యాపార సంస్థకు ప్రయోజనాలు :

  1. e – వ్యాపారము వలన సంస్థలు తమ ప్రస్తుత మార్కెట్ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు విస్తరింపచేసుకోవచ్చు. ఇది సంస్థ యొక్క అమ్మకాలను పెంచుతుంది.
  2. e – వ్యాపారము వలన వస్తువులను లేదా సేవలను సృష్టించడము, ప్రాసెస్ చేయడం, పంపిణీ చేయడం, స్టోరింగ్ చేయడం, ‘సమాచారాన్ని సేకరించడానికి, ఇన్వెంటరీ, ఓవర్హెడ్ ఖర్చులు తగ్గుతాయి.
  3. పెట్టుబడికి, వస్తు సేవల అమ్మకము వలన వచ్చే ఆదాయానికి మధ్య ఉన్న సమయం తగ్గుతుంది.
  4. బిజినెస్ ప్రాసెస్, రీ-ఇంజనీరింగ్లకు సహకరిస్తుంది.
  5. టెలీ కమ్యూనికేషన్ ఖర్చు తక్కువగా ఉండటం వలన ఇంటర్నెట్ విలువ ఆధారిత నెట్వర్క్ కంటే వ్యయము తక్కువగా ఉంటుంది.

సమాజానికి ప్రయోజనాలు :

  1. ఇంటినుంచే పనిచేసుకోవడానికి అవకాశము ఉండటం వలన షాపింగ్ కోసము ప్రయాణాలు తగ్గుతాయి. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. దీనివలన వాయు కాలుష్యం తగ్గుతుంది. అంతేకాకుండా సమయము కూడా ఆదా అవుతుంది.
  2. వ్యాపారస్తులు తమ వస్తువులను ఇంటర్ నెట్ ద్వారా తక్కువ ధరలకు అమ్మడం వలన పేదవారికి ప్రయోజనం లభిస్తుంది.
  3. ప్రపంచ దేశాలలో, గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలకు, మార్కెట్ లో లభించని’ వస్తు సేవలను e- వ్యాపారము ద్వారా పొందవచ్చు.
  4. వస్తు సేవలు తక్కువ వ్యయానికి లభించడమే కాకుండా, వాటి మన్నిక, నాణ్యత కూడా పెరుగుతుంది.

ప్రశ్న 3.
21వ శతాబ్దంలో వ్యాపార సంస్థలకు ఉన్న అవకాశాలను తెలపండి.
జవాబు:
21వ శతాబ్దంలో వ్యాపార సంస్థలకు గల అవకాశాలు :
1) సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ : LPG రూపములో ప్రవేశపెట్టబడిన ఆర్థిక సంస్కరణలు, భారతదేశములోని వ్యాపార సంస్థలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించినది. ఈ పరిస్థితులు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించడానికి, పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి, అంతర్జాతీయ వర్తకములో పెరుగుదలకు, ఉత్పత్తి, ఉద్యోగ అవకాశాల పెరుగుదలకు, ఆంక్షలు లేని మూలధన ప్రవాహానికి దారితీసింది.

2) భారీ తరహా, విస్తరణ అవకాశాలు : 21వ శతాబ్దపు వ్యాపార సంస్థలు భారీతరహా, ఎక్కువ’ విస్తరణకు అవకాశాలు గల సంస్థల లక్షణాలు కలిగి ఉన్నవి. భారీ తరహా సంస్థ, ఉత్పత్తిలో పెరుగుదల వలన కంపెనీ ఖర్చులు తగ్గి, లాభాలు పెరుగుతాయి.

3) తలసరి ఆదాయంలో పెరుగుదల : తలసరి ఆదాయము పెరుగుదలలో మనదేశము ప్రపంచవ్యాప్తముగా నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించినది. తలసరి ఆదాయము దేశములోని ప్రజల జీవన ప్రమాణస్థాయిని తెలుపుతుంది. పెరుగుతున్న తలసరి ఆదాయము వలన దేశములో వ్యాపార అవకాశాలు పెరగడానికి అవకాశము ఉన్నది.

4) మార్కెట్ ఆర్థిక వ్యవస్థలు : భారతదేశము 125 కోట్ల జనాభాతో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏర్పడి ప్రపంచవ్యాప్తముగా పారిశ్రామిక, వర్తక సేవారంగాలను ఆకర్షిస్తున్నది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు భారతదేశ మార్కెట్ ఆదాపూర్వక మార్కెట్గా రూపొందినది. దాని ఫలితముగా దేశములోని వ్యాపార సంస్థలకు అనేక వ్యాపార అవకాశాలు లభిస్తున్నవి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

5) e – వాణిజ్యము – ప్రపంచ మార్కెట్ కు గేట్వే : ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు e- వాణిజ్యం ప్రయోజనాలను గుర్తిస్తున్నాయి. నగదు ప్రవాహములో పెరుగుదల, ఖాతాదారులు నిలుపుదల, సేవా సంతృప్తి e – వాణిజ్యం ద్వారా లభించిన ప్రయోజనాలు.

6) సాంకేతిక పురోభివృద్ధి: 21వ శతాబ్దములో వ్యాపార సంస్థలు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నవి. దీనివలన వ్యాపార సంస్థలు సమాజానికి అవసరమైన వస్తు సేవలను తక్కువ వ్యయానికి అందిస్తున్నవి.

7) విత్త సేవల విస్తరణ : 21వ శతాబ్దములో విత్త సేవారంగము చాలా వేగముగా పెరుగుతున్నది. బ్యాంకింగ్, భీమా, రుణ, ఈక్విటీ, ఫైనాన్సింగ్, సూక్ష్మ విత్త రంగాలు ప్రజలలో పొదుపు అలవాట్ల పెరుగుదల, భవిష్యత్ అవసరాలకు సరళమైన ఋణాలు పొందడానికి అవకాశాలు కల్పిస్తున్నవి. ఈ ఆర్థిక రంగములో కంపెనీలకు వ్యాపార విస్తరణ | అవకాశాలకు దారితీసాయి.

8) వ్యాపార ప్రక్రియ ఆటోమేషన్ : వ్యాపార ప్రక్రియ ఆటోమేషన్ అనేది వ్యయాల నియంత్రణకు ఉపయోగించే వ్యూహము. ఇది వ్యాపార ప్రక్రియలను స్వయం చలితం చేయడమే కాక అధిక సామర్థ్యాన్ని పొందడం, వ్యాపార అవసరాలకు మార్పులను ఆపాదించుకోవడం, మానవ తప్పిదాలను తగ్గించడం ద్వారా పని ప్రవాహాన్ని మెరుగుపరచడం చేస్తుంది. ‘

9) పెరుగుతున్న కలయికలు, సముపార్జనలు, విదేశీ కొలాబరేషన్లు : కలయికలు, సముపార్జనలు, నవకల్పనల అభివృద్ధి, లాభదాయకత, మార్కెట్ వాటా, కంపెనీ వాటా విలువలలో పెరుగుదలకు ఆధునిక వ్యాపార సంస్థలకు అనుకూలించే వ్యూహము. ఇదే తరహాను అనుసరించే ప్రతిఫలాలలో పెరుగుదలకు, అధిక సమర్థతకు, వ్యయాల నియంత్రణకు దోహదం చేస్తుంది.

10) అంతర్జాతీయ వ్యవస్థాపన : 21వ శతాబ్దములో అనేక సంస్థలు, వ్యాపార ప్రపంచీకరణను, తయారీ, సేవల, మూలధన వనరుల, ప్రతిభ సంపాదనకి రక్షణ వ్యూహంగా పరిగణిస్తున్నది. వినియోగదారుల అవసరాలకు సరిపడేందుకు కొత్త ఉత్పత్తులు, సేవలు సృష్టించడానికి ఒకటి కంటే ఎక్కువ దేశాలలో వ్యాపార అవకాశాలు కనుగొంటున్నాయి.

ప్రశ్న 4.
21వ శతాబ్దంలో వ్యాపార సంస్థలు ఎదుర్కొనే సవాళ్ళను తెలపండి.
జవాబు:
21వ శతాబ్దంలో వ్యాపార సంస్థలు ఈ క్రింది సవాళ్ళను ఎదుర్కోవాలి.
1) సాంకేతిక పరిజ్ఞానము సవాళ్ళు: సాంకేతిక పరిజ్ఞానములో వేగముగా వస్తున్న మార్పులు చిన్న వ్యాపార సంస్థలకు ఖర్చు, సమయము ఒక ముప్పుగా ఏర్పడినది. ఈ సంస్థలు సాంకేతిక పరిజ్ఞానములో వచ్చిన మార్పులకు అనుగుణముగా ప్లాంటు, యంత్రాలు, పరికరాలు, ఉత్పత్తి విధానాలను ఆధునీకరించుకుంటున్నాయి. లేకపోతే సంస్థలు తమ ఉనికిని కోల్పోయి, మార్కెట్ నుంచి తొలగిపోతాయి.

2) పెరుగుతున్న వినియోగదారుల అవగాహన : ఉత్పత్తులు, సేవల పట్ల వినియోగదారుల అవగాహన పెరుగుతున్నది. వినియోగదారులను ఆకర్షించేందుకు, మార్కెట్ వాటా కోల్పోకుండా నివారించేందుకు వినియోగదారుల డిమాండ్లకు స్పందించవలసిన అవసరమున్నది.

3) ప్రపంచీకరణ సవాళ్ళు : ప్రపంచీకరణ వ్యాపార వాతావరణములో మిశ్రమ సంస్కృతులు, భాషలు మొదలైన వ్యూహాత్మక సవాళ్ళకు దారితీసింది. ఫలితముగా ప్రపంచ పోటీ, వస్తు సేవల ధరలు పెరిగినవి.

4) సహజ వనరుల క్షీణత : చాలా రకములైన ఉత్పత్తి సంస్థలు సహజ వనరులు ముఖ్యంగా ముడి పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. ఖనిజాలు, అడవులు, ఇంధనాలు, సారవంతమైన నేలలు మొదలైన సహజ వనరులు క్షీణించి పోవడం వలన రాబోయే కాలములో వ్యాపార సంస్థలపై దీని ప్రభావము ఉంటుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

5) ఆర్థిక మాంద్యము : ప్రపంచవ్యాప్తముగా అంతర్జాతీయ, ఆర్థిక, రాజకీయ వ్యవస్థ మార్పు చెందుతోంది. అమెరికా, ఐరోపాలో ప్రారంభమైన ఆర్థిక మాంద్యము ఇతర దేశాలలో పనితీరుపై ప్రభావాన్ని చూపుతోంది.

6) షర్యావరణ సవాళ్ళు : వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్ళలో పర్యావరణ క్షీణత అతి పెద్ద సవాలు. ఆర్థిక, సాంఘిక, సామాజిక, రాజకీయ, సాంకేతిక పరిజ్ఞానానికి చెందిన పరిసరాలు వేగముగా మారుతున్నాయి.

7) సమాచార సవాళ్ళు : నిర్వహణ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేసే ప్రక్రియలో భాగంగా ఇంటర్నెట్ ఉపయోగము, వైర్లెస్ సమాచారము, సాంకేతిక పరిజ్ఞానముతో కూడిన e – వాణిజ్యం వ్యాపార సంస్థలకు పెద్ద సవాళ్ళు. అత్యధిక ద్రవ్యోల్బణ రేటు, అధిక వడ్డీరేట్లు, తక్కువ ఆర్ధిక పెరుగుదల, నిత్యావసర వస్తువుల పెరుగుదల వ్యాపార సంస్థలను ప్రభావితం చేస్తున్నవి.

8) అవినీతి, అధికారుల అడ్డంకులు: ఈ రోజులలో అవినీతి అనేది వ్యాపార సంస్థలకు పెద్ద అడ్డంకి. దేశములో అవినీతి బాగా పాతుకొనిపోయి, రోజువారీ జీవితములో అనేక అంశాలను ప్రభావితం చేస్తున్నది.

9) పారదర్శకత, పరిపాలన : కార్పొరేటు పరిపాలన వ్యక్తుల, సంస్థల ఆసక్తులను కాపాడటానికి ఉపయోగ పడుతుంది. కార్పొరేటు సంస్థలు తీసుకునే నిర్ణయాలు, అవి పొందుపరుచుకున్న ఆసక్తులు ప్రభావాన్ని చూపుతాయి. కంపెనీల పరిపాలన, పారదర్శకత, ప్రభుత్వ నిఘా ఉంటుంది..

10) కార్పొరేటు సామాజిక బాధ్యత : CSR ఆచరణ, అమలులో అనేక సవాళ్ళను ఎదుర్కొంటోంది. CSR మన దేశములో ప్రారంభ దశలో ఉన్నది. CSR పై అవగాహన లేకపోవడం, శిక్షణ పొందిన ఉద్యోగుల తక్కువ సంఖ్య, విధాన అంశాలు, కవరేజి మొదలైన అంశాలు CSR కు అడ్డంకులు.

11) విదేశీ ద్రవ్యం మార్పిడి సమస్య: వ్యాపార సంస్థల నిర్వహణ సమస్యల విదేశీ మారకపు రేట్లలో అస్థిరత. ఇది మార్పిడిరేట్లు, ఎగుమతులు, దిగుమతులు, రాజకీయ అంశాల కారణముగా ఏర్పడినది.

12) మానవ వనరుల సవాళ్ళు : సరైన సిబ్బందిని నియమించడం, శిక్షణ ఇవ్వడం, వారిని నిలిపి ఉంచడం, HR విభాగపు నిధులు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానము కారణముగా IT నైపుణ్యము, సమస్య పరిష్కార నైపుణ్యం, రీజనింగ్ నైపుణ్యం గల అర్హులైన సిబ్బందిని నియమించడానికి సంస్థలు సమస్యలను ఎదుర్కొంటున్నవి.

13) భద్రత సమస్యలు : e – కామర్స్, వర్చువల్ ఆఫీసు వ్యాప్తిలో ముప్పులు ఎదురవుతాయి. ఈ ముప్పులు సమాచార భద్రత, ఇంటర్నెట్ భద్రత, భౌతిక భద్రత, కంపెనీ wireless access నెట్వర్క్, చట్టాలలో గోప్యత మొదలైన రూపాలలో జరుగుతుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
e – వ్యాపారం యొక్క పరిధిని వివరించండి.
జవాబు:
e – వ్యాపార పరిధి : e – వ్యాపారాన్ని క్రింది విధముగా విభజించవచ్చును.

  • ఒక వ్యాపార సంస్థలో మాత్రమే.
  • ఒక వ్యాపార సంస్థ మరొక వ్యాపార సంస్థ మధ్య వ్యవహారాలు.
  • ఒక వ్యాపార సంస్థ – వినియోగదారుని మధ్య వ్యవహారాలు
  • వినియోగదారుడు వినియోగదారుని మధ్య వ్యవహారాలు
  • వినియోగదారుడు – వ్యాపార సంస్థ మధ్య వ్యవహారాలు.

e – వ్యాపార పరిధి దిగువ అంశాలకు వర్తింపచేయడం జరుగుతుంది.
1) e – వాణిజ్యము : ఇంటర్నెట్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహించడాన్ని e – వాణిజ్యము అంటారు. e వాణిజ్యానికి మంచి ఉదాహరణ ఆన్లైన్ ద్వారా వస్తువుల కొనుగోలు, అమ్మకము చేసే ప్రక్రియ.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

2) e – వేలం : e – వేలములో సంబంధిత వెబ్సైటును సందర్శించి వేలంలో ప్రదర్శించిన వస్తువులను క్లిక్ చేస్తూ కొనుగోలు చేయవచ్చు. అదే విధముగా వెబ్ పేజీలో తమ వస్తువులను ఉంచి వేలం ద్వారా అమ్మకాలు చేయవచ్చు.

3) e – బ్యాంకింగ్ : ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ వెబ్సైట్ను ఉపయోగించి బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్స్ నిర్వహించుకోవచ్చు. చెల్లింపులను చేయవచ్చు. అవసరమైన నగదును ATM ద్వారా పొందవచ్చు. ఖాతా నిల్వను – తెలుసుకోవచ్చు. నగదును బదిలీ చేయవచ్చు.

4) e – మార్కెటింగ్ : ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ ఎలాంటి భౌగోళిక అడ్డంకులు లేకుండా వస్తువుల కొనుగోలుకు, అమ్మకాలకు ప్రపంచవ్యాప్తముగా మార్కెటింగ్ను ఏర్పాటు చేస్తుంది. ఖాతాదారుల డిమాండ్కు కంపెనీలు స్పందించేందుకు ఇంటర్నెట్ సహాయం చేస్తుంది.

5) e – వర్తకము : e – వర్తకాన్ని ఆన్లైన్ వర్తకము లేదా e – బ్రోకింగ్ అంటారు. ఇది స్టాక్ ఎక్స్ఛేంజ్లలో సెక్యూరిటీలను కొనడానికి, అమ్మడానికి ఉపయోగపడుతుంది.

ప్రశ్న 2.
e – వ్యాపారం వల్ల సంస్థలకు కలిగే ప్రయోజనాలు ఏవి ?
జవాబు:
e – వ్యాపారం వల్ల వ్యాపార సంస్థలకు కలిగే ప్రయోజనాలు :

  1. e – వ్యాపారము వలన సంస్థలు తమ ప్రస్తుత మార్కెట్ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు విస్తరింపచేసుకోవచ్చు. ఇది సంస్థ యొక్క అమ్మకాలను పెంచుతుంది.
  2. e– వ్యాపారము వలన వస్తువులను లేదా సేవలను సృష్టించడము, ప్రాసెసింగ్ చేయడం, పంపిణీ చేయడం, స్టోరింగ్ చేయడం, సమాచారాన్ని సేకరించడానికి అయ్యే వ్యయం తగ్గుతుంది.
  3. ఇన్వెంటరీ నిల్వ చేయడానికి, ఓవర్హెడ్ ఖర్చులు తగ్గుతాయి.
  4. పెట్టుబడికి, వస్తు సేవల అమ్మకం వలన వచ్చే ఆదాయానికి మధ్య ఉన్న సమయం తగ్గుతుంది.
  5. బిజినెస్ ప్రాసెస్, రీ- ఇంజనీరింగ్లకు సహకరిస్తుంది.
  6. టెలీ కమ్యూనికేషన్ ఖర్చు తక్కువగా ఉండటం వలన ఇంటర్నెట్ విలువ ఆధారిత నెట్వర్క్ వ్యయము కంటే తక్కువగా ఉంటుంది.

ప్రశ్న 3.
e – వ్యాపారం వల్ల వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు ఏవి ?
జవాబు:
e – వ్యాపారం వల్ల వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు :

  1. e – వ్యాపారము వలన వినియోగదారులు ఏ ప్రాంతం నుంచి అయినా, ఏ సమయంలోనైనా వ్యాపార వ్యవహారాలు నిర్వహించవచ్చు.
  2. e – వ్యాపారము వినియోగదారులకు వస్తు సేవలకు సంబంధించి, అనేక ప్రత్యామ్నాయాలు, అవకాశాలు కల్పిస్తాయి.
  3. e – వ్యాపారము ద్వారా వినియోగదారుడు అనేక ప్రాంతాలలోని మార్కెట్లలో వస్తు సేవలను పోల్చి చూసుకోవడానికి వీలవుతుంది.
  4. e- వ్యాపారము వస్తు సేవలు త్వరగా డెలివరీ కావడానికి దోహదము చేస్తుంది.
  5. వినియోగదారుడు వస్తు సేవలకు సంబంధించి సరైన సమాచారాన్ని పూర్తి స్థాయిలో క్షణాలలో పొందవచ్చును.
  6. వినియోగదారుడు సరైన వేలములో పాల్గొనేందుకు e – వ్యాపారము సహాయపడుతుంది.
  7. e– వ్యాపారము వినియోగదారుల మధ్య సహకారాన్ని ఏర్పరచి, ఒకరికొకరు వ్యాపార ఉపాయాలు, అనుభవాలు పంచుకునేటట్లు చేస్తుంది.
  8. e- వ్యాపారము వ్యాపారం మధ్య పోటీ తత్వాన్ని ఏర్పరచి, వినియోగదారులకు సరైన డిస్కౌంట్లు లభించేందుకు సహకరిస్తుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

ప్రశ్న 4.
e – వ్యాపార వ్యవహారాలలో కలిగే నష్ట భయాలను తెలపండి.
జవాబు:
e – వ్యాపార వ్యవహారాలలో కలిగే నష్ట భయాలు :

  1. ఇంటర్నెట్ వాడకములో సమాచారము అనధికారికముగా మార్చివేయబడడం. అనే నష్టభయమున్నది.
  2. రహస్యముగా ఉంచవలసిన వ్యక్తిగత సమాచారము మరియు క్రెడిట్ కార్డు వివరాలు, పాస్వర్డ్ లాంటి బ్యాంకింగ్ సమాచారానికి సంబంధించిన నష్టభయాలు.
  3. e – వాణిజ్యం ద్వారా జరిగే వ్యవహారాలకు భౌతిక ఆధారాలు లేని కారణముగా చట్టబద్ధతకు సంబంధించిన నష్టభయాలు ఎక్కువ.
  4. ఎలక్ట్రానిక్ సమాచారం అందించడములో వైఫల్యం, మొత్తము వ్యాపారము ముగింపుకు దారితీసే నష్టభయాలు.
  5. నిర్వాహక వర్గం, e – వాణిజ్య వ్యవహారాలు తన అదుపులో ఉంచుకొని, సరి చూసుకొని మరియు తగిన సమాచార పద్ధతులు ఎంచుకోవడంలోని నష్ట భయాలు.
  6. వైరస్లు, హ్యాగింగ్ంటి సాంకేతికపరమైన నష్ట భయాలు.

ప్రశ్న 5.
e – వ్యాపార వ్యవహారాల వల్ల సమాజానికి కలిగే ప్రయోజనాలను తెలపండి.
జవాబు:
e – వ్యాపారము వల్ల సమాజానికి కలిగే ప్రయోజనాలు :

  1. ఇంటినుంచే పనిచేసుకోవడానికి అవకాశము ఉండటం వలన షాపింగ్ కోసము ప్రయాణాలు తగ్గుతాయి. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. దీనివలన వాయు కాలుష్యం తగ్గుతుంది. అంతేకాకుండా సమయము కూడా ఆదా అవుతుంది.
  2. వ్యాపారస్తులు తమ వస్తువులను ఇంటర్ నెట్ ద్వారా తక్కువ ధరలకు అమ్మడం వలన పేదవారికి ప్రయోజనం లభిస్తుంది.
  3. ప్రపంచ దేశాలలో, గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలకు, మార్కెట్ లో లభించని వస్తు సేవలను e – వ్యాపారము ద్వారా పొందవచ్చు.
  4. వస్తు సేవలు తక్కువ వ్యయానికి లభించడమే కాకుండా, వాటి మన్నిక, నాణ్యత కూడా పెరుగుతుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
e – వ్యాపారం
జవాబు:
వ్యాపారము e- వ్యాపారం అనే పదాన్ని మొదటిసారిగా 1997లో IBM ఉపయోగించినది. దీని ప్రకారము e- అంటే ‘ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ముఖ్యమైన వ్యాపార దశలను బదలాయింపు చేయడం’. అన్ని వ్యాపార కార్యకలాపాలను, వ్యాపార పరిధిని బలపరచడానికి Information and Communication Technology సహకారాన్ని ఇంటర్నెట్ల ద్వారా తీసుకోవడం – వ్యాపారముగా నిర్వచించవచ్చు.

 

ప్రశ్న 2.
e – బ్యాంకింగ్ [T.S. Mar 15]
జవాబు:
ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ మంచి విజయవంతమైన ఆన్లైన్ వ్యాపారము. బ్యాంకింగ్ వెబ్సైట్ను ఉపయోగిస్తూ బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్స్ నిర్వహించుకోవడానికి, చెల్లింపులు, ఆజ్ఞ ఇవ్వడానికి e-బ్యాంకింగ్ సహాయము చేస్తుంది. ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఖాతాదారులు బ్యాంకును సందర్శించనవసరము లేకుండా అవసరమైన నగదును | ATM ద్వారా పొందవచ్చును. ఖాతా నిల్వలు తెలుసుకోవచ్చు. బిల్లులను చెల్లించవచ్చు. నగదును బదిలీ చేయవచ్చు.

ప్రశ్న 3.
e – మార్కెటింగ్ [A.P. Mar. ’15]
జవాబు:
ఎలక్ట్రానిక్ మార్కెటింగ్లో ఎలాంటి భౌగోళిక అడ్డంకులు లేకుండా వస్తువుల కొనుగోలుకు, అమ్మకాలకు ప్రపంచ వ్యాప్తముగా మార్కెటింగ్ ఏర్పాటు చేస్తుంది. ఎలాంటి సమయ భావన లేకుండా ఖాతాదారుల డిమాండ్కు కంపెనీ స్పందించేందుకు ఇంటర్నెట్ సహాయము చేస్తుంది. దీనికి వినియోగదారుడు ఉండే ప్రాంతముతో సంబంధం లేదు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

ప్రశ్న 4.
e – వాణిజ్యం
జవాబు:
ఇంటర్నెట్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహించడాన్ని e-వాణిజ్యము అంటారు. ఎలక్ట్రానిక్ వాణిజ్యమును e – వాణిజ్యం · అని వ్యవహరిస్తారు. ఆన్లైన్ ద్వారా వస్తువుల కొనుగోలు, అమ్మకం చేసే ప్రక్రియ దీనికి మంచి ఉదాహరణ. అంతేకాకుండా e-వాణిజ్యములో అనేక కార్యకలాపాలు కలిసి ఉంటాయి. ఏదైనా కార్యకలాపాన్ని ఎలక్ట్రానిక్ పరికరము ద్వారా నిర్వహించడాన్ని e- వాణిజ్యం అనవచ్చు.

ప్రశ్న 5.
e – వర్తకం
జవాబు:
e-వర్తకాన్ని ఆన్లైన్ వర్తకమని, e- బ్రోకింగ్ అని కూడా వ్యవహరిస్తారు. ఇది స్టాక్ ఎక్స్ఛేంజ్లలో సెక్యూరిటీలను అమ్మడానికి, కొనడానికి సహాయపడుతుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 11 బహుళ జాతి సంస్థలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 11th Lesson బహుళ జాతి సంస్థలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Commerce Study Material 11th Lesson బహుళ జాతి సంస్థలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బహుళజాతి సంస్థలను నిర్వచించి, వాటి లక్షణాలను వివరించండి.
జవాబు:
ఒక దేశములో నిర్వహణ కార్యాలయము ఉండి, ఇతర దేశాలలో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించినట్లయితే ఆ సంస్థలను బహుళజాతీయ సంస్థలు అంటారు. ఈ బహుళజాతి సంస్థలను మల్టీనేషనల్ సంస్థలని, గ్లోబల్ సంస్థలని లేదా అంతర్జాతీయ సంస్థలని వేరు వేరు పేర్లతో పిలవబడతాయి. పెప్సీ, హుండాయి, నైక్, రీబాక్, ఎల్.జి, సామ్సంగ్ బహుళ జాతి సంస్థలకు ఉదాహరణలు.

నిర్వచనాలు: ఏదైనా సంస్థ తన ఉత్పత్తి కార్యకలాపాలను తన మాతృదేశముతోపాటు ఇతర దేశాలకు విస్తరింపజేస్తే అలాంటి సంస్థను బహుళజాతి సంస్థ అంటారు.

అంతర్జాతీయ శ్రామిక నివేదిక ప్రకారము ‘ఒక దేశములో నిర్వహణ కార్యాలయము ఉండి, అనేక ఇతర దేశాలతో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే సంస్థనే బహుళజాతి సంస్థ’ అంటారు. విదేశమారక నియంత్రణ చట్టము 1973 ప్రకారము, 1) రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో తమ అనుబంధ సంస్థగాని, శాఖగాని ఉన్న సంస్థ. 2) రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో తమ వ్యాపార కార్యకలాపములను కొనసాగించే. సంస్థను బహుళజాతి సంస్థ అంటారు.

బహుళజాతి సంస్థల లక్షణాలు:
1. అధిక పరిమాణము: బహుళజాతి సంస్థల ఆస్తులు, అమ్మకాలు అధిక పరిమాణము కలిగి ఉంటాయి. ఈ సంస్థల అమ్మకాల టర్నోవర్ అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల స్థూల జాతీయ ఉత్పత్తి కంటే ఎక్కువగా ఉంటుంది. ఉదా: IBM నిజ ఆస్తులు 8 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ.

2. ప్రపంచ వ్యాప్తముగా కార్యకలాపాలు: ప్రపంచములో వివిధ దేశాలలో బహుళజాతీయ సంస్థలు తమ ఉత్పత్తి, మార్కెటింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. వీటికి ఎన్నో దేశాలలో బ్రాంచీలు, అనుబంధ సంస్థలు, కర్మాగారాలు, కార్యాలయాలు ఉంటాయి. ఉదా: కోకోకోలా, ఆపిల్ సంస్థలు, మన దేశానికి చెందిన ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రెడ్డి లాబ్స్ వంటివి ప్రపంచ వ్యాప్తముగా విస్తరించినవి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 11 బహుళ జాతి సంస్థలు

3. కేంద్రీకృత నియంత్రణ: వివిధ దేశాలలో ఉన్న బహుళ జాతిసంస్థల బ్రాంచీలు లేదా అనుబంధ సంస్థలు ప్రధాన కార్యాలయము యొక్క పర్యవేక్షణ, మార్గదర్శకత్వము, నియంత్రణలో పనిచేస్తాయి.

4. నిర్వహణలో నైపుణ్యము: బహుళజాతి సంస్థలు సమర్థవంతమైన మేనేజర్లను, అనుభవము ఉన్నవారి సేవలను ఉపయోగించుకుంటాయి. కాబట్టి ఈ సంస్థలు వృత్తిపరమైన ‘నిర్వహణ ద్వారా తమ కార్యకలాపములను మార్కెట్లో విజయవంతముగా నిర్వహిస్తారు.

5. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానము: బహుళజాతి సంస్థలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానము అందుబాటులో ఉండటము వలన వినియోగదారులకు నాణ్యమైన వస్తుసేవలను అందించటం జరుగుతుంది.

6. ప్రముఖమైన స్థానము, హోదా: బహుళజాతి సంస్థల పరిమాణము, ఆస్తులు, అమ్మకాలు, చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సంస్థలు వ్యాపారము కొనసాగిస్తున్న దేశాలలో మార్కేట్ను నియంత్రించడమే కాక ప్రముఖమైన స్థానాన్ని, హోదాను కలిగి ఉంటాయి.

7. అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశము: బహుళజాతీయ సంస్థలకు ఉన్న మూలధనము, సాంకేతిక పరిజ్ఞానము, నైపుణ్యాల బదిలీ ద్వారా సులభముగా అంతర్జాతీయ మార్కెట్లోనికి చొచ్చుకొనిపోతాయి.

ప్రశ్న 2.
బహుళజాతి సంస్థలను నిర్వచించి, వాటి ప్రయోజనాలను వివరించండి.
జవాబు:
ఏదైనా సంస్థ తన ఉత్పత్తి కార్యకలాపాల వలన తన మాతృదేశముతో పాటు ఇతర దేశాలకు విస్తరింపజేస్తే అలాంటి సంస్థను బహుళజాతి సంస్థ అంటారు. ILO నివేదిక ప్రకారము ‘ఒక దేశములో నిర్వహణ కార్యాలయము ఉండి, అనేక ఇతర దేశాలతో కార్యకలాపాలను నిర్వహించే సంస్థనే బహుళజాతి సంస్థ’ అంటారు.
బహుళజాతి సంస్థల ప్రయోజనాలు: బహుళజాతి సంస్థల వలన అతిథి దేశాలకు ఈ క్రింది ప్రయోజనాలు కలుగుతాయి.

  1. అభివృద్ధి చెందుతున్న దేశాలలో మూలధన కొరతను తగ్గించడానికి బహుళజాతి సంస్థలు ఆయాదేశాలలో పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన మూలధనాన్ని సమకూరుస్తాయి.
  2. అతిథి దేశాలలో బహుళజాతి సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఆకర్షణీయమైన వేతనాలు చెల్లిస్తారు. ఆదాయము పెంపుదల జరుగుతుంది.
  3. ఈ సంస్థల వలన అతిథి దేశాలు, విదేశాల నుంచి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుతాయి.
  4. వృత్తిపరమైన నిర్వహణను చేపట్టడంవలన అతిథి దేశాలు నిర్వహణా సామర్థ్యాన్ని పెంపొందించుకోగలవు.
  5. ఎగుమతులను పెంచి దిగుమతులను తగ్గించడం ద్వారా ఆ దేశము చెల్లింపు నిల్వ స్థాయి మెరుగవుతుంది. విదేశీమారక నిల్వలలో ఆదాలను పొందడం బహుళజాతి సంస్థల ద్వారానే సాధ్యమవుతుంది.
  6. బహుళ సంస్థలు ఆయా దేశాలలో నెలకొని ఉన్న ఏకస్వామ్యాన్ని అడ్డుకోవడంవలన ఆయా దేశాలలో పనిచేసే సాంప్రదాయాలను, పని వాతావరణము సృష్టించడమే కాకుండా, వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడానికి కూడా వీలవుతుంది.
  7. బహుళజాతి సంస్థల కార్యకలాపాలవలన అతిథి దేశాలలో వ్యాపారస్తులు, పంపిణీదారులు, వర్తక మధ్యవర్తులు తమ వ్యాపార కార్యకలాపాలను ‘ విస్తృతపరుచుకుంటాయి.
  8. బహుళజాతి సంస్థలవలన, స్వదేశీ సంస్థలు పరిశోధన, అభివృద్ధి ప్రయోజనాలను పొందుతాయి.
  9. బహుళజాతి సంస్థలు ఆయాదేశాలలో నాణ్యమైన వస్తుసేవలను అందించడం ద్వారా వినియోగదారులకు కొనుగోలుశక్తి పెరిగి జీవన ప్రమాణస్థాయి మెరుగవుతుంది.
  10. బహుళజాతి సంస్థల వలన అతిథి దేశాలు పారిశ్రామిక ఆర్థిక పురోభివృద్ధిని సాధిస్తాయి.

స్వదేశాలకు కలిగే ప్రయోజనాలు: బహుళజాతి సంస్థలవలన స్వదేశాలకు ఈ క్రింది ప్రయోజనాలు కలుగుతాయి.

  1. బహుళజాతి సంస్థలు స్వదేశములో తయారైన వస్తువులు ప్రపంచమంతటా మార్కెటింగ్ చేసి అమ్మడానికి అవకాశాలు కల్పిస్తాయి.
  2. ఈ సంస్థలు స్వదేశములోని ప్రజలకు ఉద్యోగ అవకాశాలను స్వదేశములోను, ఇతర దేశాలలో కల్పిస్తాయి.
  3. బహుళజాతి సంస్థలు ముడి సరుకు, శ్రమ, భూమి మొదలైన వనరులు పొంది, స్వదేశములో వస్తువులను తక్కువ ధరకు లభించేటట్లు చేస్తాయి.
  4. స్వదేశ కంపెనీలు ఎగుమతులను చేపట్టడానికి అవసరమైన చేయూతను బహుళజాతి సంస్థల ద్వారా పొందగలుగుతున్నాయి. దీని వలన దీర్ఘకాలములో అనుకూల చెల్లింపుల శేషాన్ని సాధించవచ్చు.
  5. ఈ సంస్థలు స్వదేశములో పారిశ్రామికాభివృద్ధిని సాధించి ఉత్పత్తులను ప్రోత్సహిస్తాయి.
  6. అతిథి దేశాల నుంచి డివిడెండు, లైసెన్స్ ఫీజు, రాయల్టీలు మొదలైనవి పొందుతాయి. కాబట్టి స్వదేశ ఆరాయము పెంచుకోవడానికి వీలు అవుతుంది.
  7. ఈ సంస్థల వలన స్వదేశములో విదేశీ సంస్కృతుల వలన వచ్చే ఆదాలు చేకూరుతాయి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 11 బహుళ జాతి సంస్థలు

ప్రశ్న 3.
బహుళజాతి సంస్థలను నిర్వచించి, వాటి పరిమితులు/నష్టాలను వివరించండి.
జవాబు:
ఏదైనా సంస్థ తన ఉత్పత్తి కార్యకలాపాల వలన తన మాతృదేశముతోపాటు ఇతర దేశాలకు విస్తరింపజేస్తే అలాంటి సంస్థను బహుళజాతి సంస్థ అంటారు. ILO నివేదిక ప్రకారము “ఒక దేశములో నిర్వహణ కార్యాలయం ఉండి అనేక ఇతర దేశాలతో కార్యకలాపాలను నిర్వహించే సంస్థను బహుళ జాతీయ సంస్థ” అంటారు.
బహుళజాతి సంస్థల వలన పరిమితులు / అతిథి దేశాలకు బహుళజాతి సంస్థల వలన పరిమితులు:

  1. బహుళజాతి సంస్థలు అతిథి దేశాలలోని పెద్ద పెద్ద వ్యాపార సంస్థలతో కలసి, ఏకస్వామ్యాన్ని సృష్టించి, ఆర్థికశక్తుల కేంద్రీకరణకు దోహదపడతాయి.
  2. బహుళజాతి సంస్థలు, తమ దేశములో పాతబడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అతిథి దేశాలకు బదిలీచేయడానికి ప్రయత్నము చేస్తాయి.
  3. బహుళజాతి సంస్థలు ఆయా దేశాల రాజకీయ వ్యవహారాలలో జోక్యం చేసుకొని, అంతర్గత సమస్యలను సృష్టించడంవలన దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించవచ్చును.
  4. లాభాలను సంపాదించే క్రమములో, బహుళజాతి సంస్థలు అతిథి దేశములోని సహజ వనరులను విచక్షణా రహితముగా వినియోగించడమువలన ఆ దేశాలలో సహజవనరులు తగ్గి క్షీణిస్తాయి.
  5. లాభాలు, డివిడెండ్లు, రాయల్టీ చెల్లింపు రూపములో, పెద్ద మొత్తములో ద్రవ్యము విదేశాలకు ప్రవహిస్తుంది. దీనివలన ఆ దేశ విదేశ మారకములో విపరీత మార్పులు చోటుచేసుకుంటాయి.
  6. అతిథి దేశాల ఉద్దేశాలను, ప్రాముఖ్యతను బహుళజాతి సంస్థలు పట్టించుకోవు. తమకు లాభదాయకమైన యూనిట్లలో పెట్టుబడిపెడతాయి.
  7. అతిథి దేశాలతో అనుసంధానాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు బహుళజాతి సంస్థలు అనేక ఆంక్షలు విధిస్తుంది.
  8. బహుళజాతి సంస్థలు ప్రజల యొక్క అలవాట్లను, కోర్కెలను, ఫ్యాషన్లను మార్చి, విదేశీ సంస్కృతిని వ్యాపింపజేస్తాయి.

స్వదేశానికి బహుళజాతి సంస్థల వలన నష్టాలు:

  1. బహుళజాతి సంస్థలు స్వదేశము నుంచి వివిధ అతిథి దేశాలకు మూలధన మార్పిడి చేయడమువలన స్వదేశములో ప్రతికూల చెల్లింపుల శేషము జరగవచ్చు.
  2. బహుళజాతి సంస్థలు పక్షపాత ధోరణి అవలంబించడం వలన స్వదేశములోని ప్రజలకు ఉద్యోగ అవకాశాలను సృష్టించలేవు.
  3. విదేశాలలో పెట్టుబడి లాభదాయకముగా ఉండటంవలన, బహుళజాతి సంస్థలు స్వదేశములో పారిశ్రామికాభివృద్ధిని నిర్లక్ష్యము చేస్తాయి.

ప్రశ్న 4.
ప్రపంచీకరణ అంటే ఏమిటి ? దాని ఆవశ్యకతను వివరించండి.
జవాబు:
ప్రపంచము స్వయం పోషక జాతీయ ఆర్థిక వ్యవస్థల నుంచి క్రమముగా పరస్పరం ఆధారపడిన సమీకృత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దిశగా కదులుతున్నది. దీనినే ప్రపంచీకరణగా వ్యవహరించడం జరుగుతుంది. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాల పరిధిని విదేశాలకు కూడా విస్తరించే విధానమే ప్రపంచీకరణ. ఉత్పత్తి కారకాలకు ప్రపంచవ్యాప్తముగా సంపూర్ణమైన గమనశీలతను ఏర్పరచడమే ప్రపంచీకరణ. ఒకదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థికవ్యవస్థలలో అనుసంధానము చేసి ప్రపంచాన్ని ఏకైక అంతర్జాతీయ మార్కెట్గా రూపొందించడమే ప్రపంచీకరణ లక్ష్యము. దీనివలన ప్రపంచ దేశాల మధ్య దూరము తగ్గి ప్రపంచమంతా ఒక గ్రామముగా మారే అవకాశము ఉన్నది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 11 బహుళ జాతి సంస్థలు

అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక శాస్త్రవేత్తలు ప్రపంచీకరణను ఈ విధముగా నిర్వచించినారు. “స్వేచ్ఛా వాణిజ్య విధానము, పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానము, శ్రామికుల గమనశీలత”. ప్రపంచీకరణలో నాలుగు లక్షణాలు ఉన్నవి. అవి:

  1. ఆటంకాలు లేని వర్తక ప్రవాహాలు: దేశ సరిహద్దులు దాటి వస్తువుల ప్రవాహాలు స్వేచ్ఛగా జరగడానికి అనుమతులు తేలికగా లభించేటట్లుగా వర్తక అవరోధాలను తగ్గించుట.
  2. మూలధన ప్రవాహాలు: వివిధ దేశాల మధ్య మూలధనము స్వేచ్ఛగా ప్రవేశించడానికి వీలుగా వాతావరణాన్ని సృష్టించడం.
  3. సాంకేతిక విజ్ఞానాల ప్రవాహము: సాంకేతిక విద్య, విజ్ఞానము ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతానికి, ఒక దేశము నుంచి మరొక దేశానికి స్వేచ్ఛగా ప్రవేశించడానికి అనువైన వాతావరణము.
  4. ఆటంకములేని శ్రామికుల గమనము: ప్రపంచములోని వివిధ దేశాలమధ్య శ్రామికుల స్వేచ్ఛాగమనాన్ని ప్రోత్సహించే విధముగా వాతావరణమును సృష్టించడము.

ప్రపంచీకరణలో రెండు రూపాలున్నవి. 1) మార్కెట్ను ప్రపంచీకరించడం, 2) ఉత్పత్తిని ప్రపంచీకరించడం.

మార్కెట్ను ప్రపంచీకరించడం అంటే జాతీయ మార్కెట్లను ఒక ప్రపంచ మార్కెట్ కలిపివేయడం ద్వారా వ్యాపార ఆటంకాలు తగ్గి, అంతర్జాతీయ విక్రయాలు సులభతరము అవుతాయి. వినియోగదారుల అభిరుచులు, ఇష్టాలు ఒక ప్రపంచక్రమానుసారము ఐక్యం అవుతుంది. సంస్థలు సారూప్యత గల ప్రధాన వస్తువులను ప్రపంచవ్యాప్తముగా అందిస్తూ ప్రపంచమార్కెట్కు దోహదపడతాయి.

ఉత్పత్తిని ప్రపంచీకరించడం అంటే వస్తుసేవల ఉత్పత్తి కేంద్రాలను ఉత్పత్తికారకములైన శ్రమ, భూమి, మూలధనమును ప్రపంచములోని వివిధ ప్రాంతాలకు వ్యాపింపచేయడం. కంపెనీలు వ్యయమును తగ్గించుట ద్వారా, నాణ్యతను పెంచడంద్వారా వస్తు సేవలను అందించడములో వాటి పనితీరును మెరుగుపరుచుకుంటాయి.
ప్రపంచీకరణకు రెండు కారకాలు ఉంటాయి. 1) తక్కువ వర్తక ఆటంకాలు. 2) సాంకేతికపరమైన మార్పులు. సాంకేతిక మార్పులు టెలీకమ్యూనికేషన్స్ మరియు మైక్రోప్రాసెసర్స్, ప్రపంచవ్యాప్త వెబ్, రవాణాలో పురోగతులు సంభవించినవి. రవాణా వ్యయాలను తగ్గించి, సంస్థలు తమకు ఆర్థికముగా భౌగోళికముగా, అనుకూలముగా ఉన్న ప్రాంతాలకు వ్యాప్తిచెందేలా చేశాయి. సమాచారాన్ని సేకరించడానికి, విశ్లేషించడానికి, అందించడానికి అయ్యే వ్యయాలను తగ్గించడం ద్వారా ప్రపంచవ్యాప్తమైన ఉత్పత్తి సంవిధానాన్ని సంస్థలు సమర్థవంతముగా నిర్వహించేలా చేశాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బహుళజాతి సంస్థల అర్థాన్ని వివరించండి.
జవాబు:
Multinational అనే పదము రెండు పదముల కలయిక. అవి Multi మరియు National. Multi అంటే అనేకము, బహుళ అని అర్థము. National అంటే జాతి, దేశము అని అర్ధము. కాబట్టి బహుళజాతి సంస్థలు అంటే వివిధ దేశాలలో నడపబడుతున్న లేదా నిర్వహించబడుతున్న సంస్థ అని అర్ధము. ఆ కంపెనీకి ఒక దేశము కంటే ఎక్కువ దేశాలలో ఫ్యాక్టరీలు, బ్రాంచీలు లేదా ఆఫీసులు ఉంటాయి. యునైటెడ్ నేషన్స్ కమీషన్ ప్రకారము బహుళజాతి సంస్థ అంటే నమోదుచేసిన దేశములో కాకుండా అదనముగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో నిర్వహింపబడుతున్న సంస్థ అని అర్ధము.

బహుళజాతి సంస్థ అంటే కంపెనీల పరంపర లేదా కంపెనీల శ్రేణి అని అర్థము. ఈ కంపెనీలన్నీ ఏకకాలములో వివిధ దేశాలలో నిర్వహింపబడతాయి. అందువలన ఈ కంపెనీలన్నీ వివిధ దేశాల అధికార పరిధులలో పనిచేస్తాయి. కంప్యూటీకరణ మరియు కమ్యూనికేషన్లో అభ్యుదయ ఆధారముగా ఏర్పడిన రెండవ పారిశ్రామిక విప్లవము ఫలితమే బహుళజాతి సంస్థ.

AP Inter 1st Year Commerce Study Material Chapter 11 బహుళ జాతి సంస్థలు

ప్రశ్న 2.
బహుళజాతి సంస్థల లక్షణాలను పేర్కొనండి.
జవాబు:
బహుళజాతి సంస్థల లక్షణాలు:
1. అధిక పరిమాణము: బహుళజాతి సంస్థల ఆస్తులు, అమ్మకాలు, అధిక పరిమాణములో ఉంటాయి. ఈ సంస్థల అమ్మకాల టర్నోవర్ అభివృద్ధి చెందుతున్న దేశాల స్థూల జాతీయ ఉత్పత్తికంటే ఎక్కువ. ఉదా: IBM నిజ ఆస్తులు 8 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ.

2. ప్రపంచవ్యాప్తముగా కార్యకలాపాలు ప్రపంచములో వివిధ దేశాలలో బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తి, మార్కెటింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. వీటికి ఎన్నో దేశాలలో బ్రాంచీలు, అనుబంధ సంస్థలు, కర్మాగారాలు, కార్యాలయాలు ఉంటాయి. ఉదా: కోకోకోలా, ఆపిల్ సంస్థలు, ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రెడ్డి లాబ్స్ వంటివి ప్రపంచవ్యాప్తముగా విస్తరించినవి.

3. కేంద్రీకృత నియంత్రణ: వివిధ దేశాలలో ఉన్న బహుళజాతి సంస్థల బ్రాంచీలు లేదా అనుబంధ సంస్థలు ప్రధాన కార్యాలయం యొక్క పర్యవేక్షణ, మార్గదర్శకత్వం, నియంత్రణలో పనిచేస్తాయి.

4. నిర్వహణలో నైపుణ్యము: బహుళజాతి సంస్థలు సమర్థవంతమైన మేనేజర్లు, అనుభవము కలవారి సేవలను ఉపయోగించుకుంటాయి. కాబట్టి ఈ సంస్థలు వృత్తిపరమైన నిర్వహణ ద్వారా తమ కార్యకలాపాలను మార్కెట్లో విజయవంతముగా నిర్వహిస్తాయి.

5. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానము: బహుళజాతి సంస్థలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానము అందుబాటులో ఉంటుంది కాబట్టి వినియోగదారులకు నాణ్యమైన వస్తుసేవలను అందించడం జరుగుతుంది. 6. ప్రముఖమైన స్థానము, హోదా: బహుళజాతి సంస్థల పరిమాణము, ఆస్తులు, అమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వ్యాపారము కొనసాగిస్తున్న దేశాలలో మార్కెట్ను నియంత్రించడమే కాకుండా ప్రముఖమైన స్థానాన్ని, హోదాను కలిగి ఉంటాయి.

ప్రశ్న 3.
బహుళజాతి సంస్థల వల్ల అతిథి దేశానికి కలిగే ఏవైనా నాలుగు ప్రయోజనాలను వివరించండి.
జవాబు:
బహుళజాతి సంస్థల వలన అతిథి దేశానికి ప్రయోజనాలు:

  1. మూలధనము సమకూర్చడము: అభివృద్ధి చెందుతున్న దేశాలలో మూలధనము కొరతను తగ్గించడానికి బహుళజాతి సంస్థలు ఆయాదేశాల పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన మూలధనాన్ని సమకూరుస్తాయి.
  2. సాంకేతిక పరిజ్ఞానము బదిలీ: బహుళజాతి సంస్థల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు సులభముగా బదిలీ చేసుకొనగలుగుతాయి.
  3. ఉద్యోగాల లభ్యత: అతిథి దేశాలలో బహుళజాతి సంస్థలు ఉద్యోగ అవకాశాలను కల్పించి, ఆకర్షణీయమైన వేతనాలను అందిస్తాయి.
  4. విదేశమారకము: ఎగుమతులను పెంచి, దిగుమతులను తగ్గించడం ద్వారా ఆ దేశము యొక్క చెల్లింపు నిల్వల స్థాయి మెరుగవుతుంది. విదేశమారకము నిల్వలలో ఆదాలను పొందడం బహుళజాతి సంస్థల ద్వారా సాధ్యమవుతుందీ.

ప్రశ్న 4.
బహుళజాతి సంస్థల వల్ల స్వదేశానికి కలిగే ఏవైనా నాలుగు ప్రయోజనాలను వివరించండి. [T.S. Mar. ’15]
జవాబు:

  1. బహుళజాతి సంస్థలు స్వదేశములో తయారైన వస్తువులు ప్రపంచమంతటా మార్కెటింగ్ చేసి అమ్మడానికి అవకాశాలను కల్పిస్తాయి.
  2. ఈ సంస్థలు స్వదేశములోని ప్రజలకు ఉద్యోగ అవకాశాలను స్వదేశములోనూ, ఇతర దేశాలలో కల్పిస్తాయి.
  3. బహుళజాతి సంస్థలు ముడిసరుకు, శ్రమ, భూమి మొదలైన వనరులను పొంది, స్వదేశములో వస్తువులను తక్కువ ధరకు లభించేటట్లు చేస్తాయి.
  4. స్వదేశ కంపెనీలు ఎగుమతులను చేపట్టడానికి అవసరమైన చేయూతను బహుళజాతి సంస్థల ద్వారా పొందగలుగుతున్నాయి. దీని వలన దీర్ఘకాలములో అనుకూల చెల్లింపుల శేషాన్ని సాధించవచ్చును.

AP Inter 1st Year Commerce Study Material Chapter 11 బహుళ జాతి సంస్థలు

ప్రశ్న 5.
బహుళజాతి సంస్థల వల్ల అతిథి దేశానికి ఉన్న నష్టాలను వివరించండి. [A.P. Mar. ’15]
జవాబు:
బహుళజాతి సంస్థల వల్ల అతిథి దేశానికి కలిగే నష్టాలు:

  1. బహుళజాతి సంస్థలు అతిథి దేశాలలో పెద్దపెద్ద వ్యాపార సంస్థలతో కలిసి, ఏకస్వామ్యాన్ని సృష్టించి, ఆర్థిక శక్తుల కేంద్రీకరణకు దోహదపడుతుంది.
  2. బహుళజాతి సంస్థలు తమ దేశములో పాతబడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అతిథి దేశాలకు బదిలీచేయడానికి ప్రయత్నిస్తాయి.
  3. బహుళజాతి సంస్థలు ఆయాదేశాల రాజకీయ వ్యవహారాలలో జోక్యము చేసుకొని, అంతర్గత సమస్యలను సృష్టించడంవలన దేశ సార్వభౌమాధికారానికి భంగము కలిగించవచ్చు.
  4. లాభాలను సంపాదించే క్రమములో బహుళజాతి సంస్థలు అతిథి దేశములో సహజవనరులను విచక్షణా- రహితముగా వినియోగించడంవలన ఆ దేశాలలో సహజవనరులు తగ్గి క్షీణిస్తాయి.

ప్రశ్న 6.
బహుళజాతి సంస్థల వల్ల స్వదేశానికి ఉన్న నష్టాలను వివరించండి.
జవాబు:
బహుళజాతి సంస్థల వల్ల స్వదేశానికి కలిగే నష్టాలు:

  1. బహళజాతి సంస్థలు స్వదేశము నుంచి అతిథి దేశాలకు మూలధన మార్పిడి చేయడంవలన స్వదేశములో ప్రతికూల చెల్లింపుల శేషము ఏర్పడవచ్చు.
  2. బహుళజాతి సంస్థలు పక్షపాత ధోరణి అవలంబించడంవలన స్వదేశములోని ప్రజలకు ఉద్యోగ అవకాశాలు సృష్టించలేవు.
  3. విదేశాలలో పెట్టుబడి లాభదాయకముగా ఉండటమువలన బహుళజాతి సంస్థలు స్వదేశములో పారిశ్రామికాభివృద్ధిని నిర్లక్ష్యము చేస్తాయి.
  4. బహుళజాతి సంస్థలు స్వదేశములో విదేశీ సంస్కృతిని వ్యాపింపజేస్తాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రపంచీకరణను నిర్వచించండి.
జవాబు:
ఒక దేశ ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాల పరిధిని విదేశాలకు విస్తరింపజేయడమే ప్రపంచీకరణ. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక శాస్త్రవేత్తలు ప్రపంచీకరణను ఈ విధముగా నిర్వచించినారు “స్వేచ్ఛా వాణిజ్య విధానము, పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానము, శ్రామికుల గమనశీలత. ఈ నిర్వచనము ప్రకారము ప్రపంచీకరణలో నాలుగు లక్షణాలు ఉన్నవి. 1) ఆటంకాలు లేని వర్తక ప్రవాహము, 2) మూలధన ప్రవాహాలు, 3) సాంకేతిక విజ్ఞానాల ప్రవాహము, 4) ఆటంకములేని శ్రామికుల గమనశీలత.

ప్రశ్న 2.
ఎఫ్.డి.ఐ. ని నిర్వచించండి.
జవాబు:
ఒక దేశములోని (అతిథి దేశము) ఉత్పత్తులను మరొక దేశానికి (స్వదేశానికి) సంబంధించిన సంస్థ నియంత్రించడాన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (F.D.I.) అంటారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అనేది బహుళజాతి సంస్థల నిర్వచనాత్మక లక్షణము. స్వదేశము బయట ఉన్న వ్యాపార సంస్థ కార్యకలాపాలలో, ఏదైనా సంస్థ పెట్టుబడి పెడితే దానిని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి జరిగినట్లుగా భావిస్తారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 11 బహుళ జాతి సంస్థలు

ప్రశ్న 3.
బహుళజాతీయ సంస్థను నిర్వచించండి.
జవాబు:
అంతర్జాతీయ శ్రామిక నివేదిక ప్రకారము ‘ఒక దేశములో నిర్వహణ కార్యాలయము ఉండి, అనేక ఇతర దేశాలతో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే సంస్థను బహుళజాతీయ సంస్థ’ అంటారు. విదేశ మారక నియంత్రణ చట్టం 1973 ప్రకారము

  1. రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో తమ అనుబంధ సంస్థనుగాని, శాఖ గాని ఉన్న సంస్థ.
  2. రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో తమ కార్యకలాపాలను కొనసాగించే సంస్థను బహుళజాతి అంటారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 10 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 10th Lesson సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Commerce Study Material 10th Lesson సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
MSME లను నిర్వచించి, వాటి ఆవశ్యకతను వివరించండి.
జవాబు:
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల అభివృద్ధి (MSMED) చట్టము, 2006 పొందుపరచబడిన దాని ప్రకారము MSME లను రెండు రకాలుగా వర్గీకరించవచ్చును.

  1. ఉత్పత్తి సంస్థలు
  2. సేవా సంస్థలు

1. ఉత్పత్తి సంస్థలు: వస్తూత్పత్తిలో లేదా వస్తుతయారీలో నిమగ్నమైన సంస్థలను ఉత్పత్తి సంస్థలు అంటారు. యంత్రపరికరాలను ఉపయోగించి ముడి సరుకును పూర్తిగా తయారైన వస్తువులుగా మార్చి, వాటికి విలువను సృష్టించే సంస్థలను ఉత్పత్తి సంస్థలుగా చెప్పవచ్చును.

MSMEల దృష్టిలో ఉత్పత్తి సంస్థలు వాటి యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి ఆధారముగా నిర్వచింపబడినవి.

  1. సూక్ష్మ సంస్థ (Micro enterprise): యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 25 లక్షల రూపాయలకు మించని సంస్థను సూక్ష్మ సంస్థ అంటారు.
  2. చిన్నతరహా సంస్థ (Small enterprise): యంత్రపరికరాలలో పెట్టుబడి 25 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 5 కోట్ల రూపాయలకు మించని సంస్థను చిన్నతరహా సంస్థ అంటారు.
  3. మధ్యతరహా సంస్థ (Medium enterprise): యంత్రపరికరాలలో పెట్టుబడి 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 10 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని మధ్యతరహా సంస్థ అంటారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 10 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు

2. సేవా సంస్థలు: సేవలను అందించడములో నిమగ్నమైన సంస్థలను సేవా సంస్థలు అంటారు. వాటిని ఈ క్రింది విధముగా నిర్వచించవచ్చును.

  1. సూక్ష్మ సంస్థ: పరికరాలలో పెట్టుబడి 10 లక్షల రూపాయలకు మించకపోతే దానిని సూక్ష్మ సంస్థ అంటారు.
  2. చిన్నతరహా సంస్థ: పరికరాలలో పెట్టుబడి 10 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 2 కోట్ల రూపాయలు మించకపోతే దానిని చిన్నతరహా సంస్థ అంటారు.
  3. మధ్యతరహా సంస్థ: పరికరాలలో పెట్టుబడి 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 5 కోట్లకు మించకపోతే దానిని మధ్యతరహా సంస్థ అంటారు.

MSMEల ఆవశ్యకత: MSME లు మన స్థూల జాతీయ ఉత్పత్తిలో సుమారు 8% వాటాను, పారిశ్రామిక ఉత్పత్తిలో 45% వాటాను, ఎగుమతులలో 40% వాటాలను కలిగి ఉన్నవి. MSME రంగము ఉద్యోగ కల్పనలో వ్యవసాయము తరువాత స్థానాన్ని ఆక్రమించినది.

  1. భారతదేశములోని 90% MSMEలు చట్టం ప్రకారము నమోదు అవసరము లేని సంస్థలే. (వీటిలో 80% వరకు సొంతవ్యాపార సంస్థలే)
  2. భారతదేశములోని 40% ఎగుమతులు MSME ల ద్వారా జరుగుతున్నవి.
  3. భారతదేశములో దాదాపుగా 40% వరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు MSMEల ద్వారా కల్పించబడుతున్నవి.
  4. భవిష్యత్ వ్యాపారవేత్తలకు MSME లు వారి పెట్టుబడిస్థాయి ఆధారముగా, వివిధ రంగాలలో పెట్టుబడి అవకాశాలను కల్పిస్తున్నవి.
  5. MSME లు భారతదేశములో వెంచర్ మూలధనము వ్యాపారము కోసము, విదేశీ కంపెనీలకు మంచి మార్కెట్ను కల్పిస్తున్నవి.

ప్రశ్న 2.
MSME లు పొందే వివిధ ప్రోత్సాహకాలను వివరించండి.
జవాబు:
MSME చట్టములో పొందుపరిచిన ధ్యేయాలకు అనుగుణముగా MSME ల చట్టము ఈ క్రింద పేర్కొనబడిన సదుపాయాలను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు కల్పిస్తుంది.
1. వస్తు, సేవల మొత్తాన్ని సకాలములో చెల్లించడానికి కొనుగోలుదారు బాధ్యత: MSME చట్టములోని సెక్షన్, 15 ప్రకారము ఈ సంస్థలు తమ వస్తుసేవల అమ్మకాలకు సంబంధించి, తమకు రావలసిన వసూళ్ళు సకాలములో రావడానికి తోడ్పడుతుంది. కొనుగోలుదారుడు తాను కొన్న వస్తు, సేవల విలువకు సరైన మొత్తాన్ని అమ్మకపుదారుకు నిర్ణీత సమయములో చెల్లించవలసిన బాధ్యతను తెలియజేస్తుంది.

ఎ) వ్రాతపూర్వక ఒప్పందము ఉన్నప్పుడు: వ్రాతపూర్వక ఒప్పందములో సూచించిన తేదీకిగాని, అంతకు ముందు తేదీకిగాని చెల్లింపు జరగాలి. ఎలాంటి పరిస్థితులలోను ఒప్పందములో తెలిపిన తేదీకంటే 45 రోజులు మించకుండా ఉండాలి.

బి) ఒప్పందము లేనప్పుడు: అమ్మకపుదారుకు, కొనుగోలుదారుకు మధ్య ఎలాంటి ఒప్పందము లేకపోతే, నిర్ణయించిన తేదీలోపు అంటే వ్యవహారము జరిగిన 15 రోజులలోపు చెల్లించాలి.

కొనుగోలుదారుడు, అమ్మకపుదారుడు, ఒప్పందము తేది పదాలను చట్టములో దిగువ విధముగా నిర్వచింపబడినవి. అమ్మకపుదారు నుంచి ప్రతిఫలము నిమిత్తము, ఎవరైతే వస్తువులను కొనుగోలు చేస్తారో లేదా సేవలను పొందుతారో వారిని కొనుగోలుదారు అంటారు.

అమ్మకపుదారు అంటే సూక్ష్మ లేదా చిన్నతరహా సంస్థ.
ఒప్పందము తేదీ అంటే వస్తువులు బదిలీ జరిగిన తేదీ లేదా సేవలను అందించిన రోజు.

2. ఆలస్య కాలానికి కొనుగోలుదారు ద్వారా వడ్డీ చెల్లింపు: ఏదైనా కారణాల వలన కొనుగోలుదారు తాను చెల్లించవలసిన మొత్తాన్ని సకాలములో చెల్లించకపోతే, అతడు ఆ మొత్తానికి వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. ఈ వడ్డీ సాధారణ బ్యాంకు వడ్డీకి మూడు రెట్లుగా చెల్లించాలి. నెలవారీ మొత్తముగా బాకీ ఉన్న మొత్తముపై వడ్డీని చెల్లించాలి.

3. తగాదాల నివేదన: వస్తుసేవల కోసం చెల్లించవలసిన మొత్తానికి, వడ్డీకి సంబంధించి ఏమైనా తగాదాలు ఉంటే వాటిని సూక్ష్మ, చిన్న సంస్థల మార్గదర్శిక మండలికి సూచించవచ్చు. ఈ మండలి తగిన విచారణచేసి, న్యాయం చేకూరుస్తుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 10 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు

MSME లకు అవసరమైన ప్రోత్సాహక చర్యలు: MSME రంగం ప్రోత్సాహకానికి, అభివృద్ధికి, ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, రిజర్వు బ్యాంకు దిగువ సూచించిన చర్యలను చేపట్టినవి.

  1. ఉద్యోగులలో, నిర్వాహకులలో, వ్యవస్థాపకులలో నైపుణ్యాల వృద్ధికి చర్యలు, సాంకేతిక అభివృద్ధికి ఏర్పాట్లు, మార్కెటింగ్ సౌకర్యాలు లేదా అవస్థాపనా సౌకర్యాలు, సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల సముదాయాల అభివృద్ధికి కావలసిన కార్యక్రమాలు చేపడతాయి.
  2. ఈ సంస్థలకు కాలానుగుణముగా, అవసరమైన ఋణసదుపాయాలను అందించడం, సంస్థలు ఖాయిలాపడటానికి అవకాశాలు తగ్గించడం తద్వారా పోటీతత్వాన్ని పెంపొందించడం లాంటి చర్యలు చేపడతాయి.
  3. ప్రభుత్వము, దాని అనుబంధ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు MSMEల ఉత్పత్తులను, సేవలను వాటి ప్రాధాన్యము ఆధారముగా సేకరిస్తాయి.
  4. ఈ సంస్థల ప్రోత్సాహకానికి, అభివృద్ధికి కావలసిన ప్రత్యేక నిధులను ఏర్పరచడం లేదా ప్రభుత్వ నిధులను సమకూర్చడం వంటి చర్యలు చేపడతాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
MSME ల చట్టం, 2006 ప్రకారము ఉత్పత్తి సంస్థలను నిర్వచించండి.
జవాబు:
ఉత్పత్తి సంస్థలు: వస్తూత్పత్తిలో లేదా వస్తుతయారీలో నిమగ్నమైన సంస్థలను ఉత్పత్తి సంస్థలు అంటారు. యంత్రపరికరాలను ఉపయోగించి ముడి సరుకును పూర్తిగా తయారైన సరుకుగా మార్చి, వాటి విలువను సృష్టించే సంస్థలను ఉత్పత్తి సంస్థలు అని చెప్పవచ్చును.

MSME ల దృష్టిలో ఉత్పత్తి సంస్థలు వాటి యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి ఆధారముగా నిర్వచించబడినది.

  1. సూక్ష్మ సంస్థ: యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 25 లక్షల రూపాయలకు మించని సంస్థలను సూక్ష్మ సంస్థలు అంటారు.
  2. చిన్నతరహా సంస్థ: యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 25 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, కోట్ల రూపాయలకు మించని సంస్థను చిన్నతరహా సంస్థ అంటారు.
  3. మధ్యతరహా సంస్థ: యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 10 కోట్ల రూపాయలకు మించకపోతే, దానిని మధ్యతరహా సంస్థ అంటారు.

ప్రశ్న 2.
MSME ల చట్టం, 2006 ప్రకారము సేవా సంస్థలను నిర్వచించండి. [TS. Mar 15]
జవాబు:
సేవలను అందించడములో నిమగ్నమైన సంస్థలను సేవా సంస్థలు అంటారు. వాటిని ఈ క్రింది విధముగా నిర్వచించవచ్చును.

  1. సూక్ష్మ సంస్థ: పరికరాలలో పెట్టుబడి 10 లక్షల రూపాయలకు మించకపోతే దానిని సూక్ష్మ సంస్థ అంటారు.
  2. చిన్నతరహా సంస్థ: పరికరాలలో పెట్టుబడి 10 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 2 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని చిన్నతరహా సంస్థ అంటారు.
  3. మధ్యతరహా సంస్థ: పరికరాలలో పెట్టుబడి 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 5 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని మధ్యతరహా సంస్థ అంటారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 10 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు

ప్రశ్న 3.
MSMEల నమోదు ప్రక్రియను వివరించండి.
జవాబు:
MSME ల నమోదుకు కావలసిన అంశములు:

  1. ఏ వ్యక్తి అయినా ఇష్టానుసారము సూక్ష్మ లేదా చిన్నతరహా సంస్థను స్థాపించవచ్చు.
  2. ఇష్టానుసారము సేవలను అందించడానికి లేదా సేవలు చేయడం కోసం మధ్యతరహా సంస్థను స్థాపించవచ్చు.
  3. వస్తు ఉత్పత్తి కోసము లేదా తయారీ కోసం మధ్యతరహా సంస్థను స్థాపించడానికి పారిశ్రామిక (అభివృద్ధి, నియంత్రణ) చట్టం, 1951లోని మొదటి షెడ్యూల్లో పేర్కొన్న విధముగా అనుసరించాలి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల నియమావళి పత్రాన్ని రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వము నిర్దేశించిన లేదా సూచించిన అధికారి వద్ద నమోదు కోసం దాఖలు చేయాలి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సూక్ష్మ సంస్థలను నిర్వచించండి.
జవాబు:
ఉత్పత్తి సంస్థలు అయితే యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 25 లక్షల రూపాయలకు మించకపోతే దానిని సూక్ష్మ సంస్థ అంటారు.
సేవా సంస్థలు అయితే పరికరాలలో పెట్టిన పెట్టుబడి 10 లక్షల రూపాయలకు మించకపోతే దానిని సూక్ష్మ సంస్థ అంటారు.

ప్రశ్న 2.
చిన్నతరహా సంస్థలను నిర్వచించండి. [A.P. Mar. ’15]
జవాబు:
ఉత్పత్తి సంస్థలు అయితే యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 25 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 5 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని చిన్నతరహా సంస్థ అంటారు.

సేవాసంస్థలయితే పరికరాలలో పెట్టిన పెట్టుబడి 10 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 2 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని చిన్నతరహా సంస్థ అంటారు.

ప్రశ్న 3.
మధ్యతరహా సంస్థలను నిర్వచించండి.
జవాబు:
ఉత్పత్తి సంస్థలయితే యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 10 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని మధ్యతరహా సంస్థ అంటారు.

సేవా సంస్థలయితే పరికరాలలో పెట్టిన పెట్టుబడి 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 5 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని మధ్యతరహా సంస్థ అంటారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 10 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు

ప్రశ్న 4.
ఉత్పత్తి సంస్థలను నిర్వచించండి.
జవాబు:
వస్తూత్పత్తిలో లేదా వస్తుతయారీలో నిమగ్నమైన సంస్థలను ఉత్పత్తి సంస్థలు అంటారు. యంత్రపరికరాలను ఉపయోగించి ముడిసరుకును పూర్తిగా తయారైన వస్తువులుగా మార్చి, వాటికి విలువలను సృష్టించే సంస్థలను ఉత్పత్తి సంస్థలుగా చెప్పవచ్చును.

ప్రశ్న 5.
సేవా సంస్థలను నిర్వచించండి.
జవాబు:
సేవలను అందించడములో నిమగ్నమైన సంస్థలను సేవా సంస్థలు అంటారు.