AP Inter 2nd Year History Study Material Chapter 8 ఫ్రెంచి విప్లవం – 1789

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 8th Lesson ఫ్రెంచి విప్లవం – 1789 Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 8th Lesson ఫ్రెంచి విప్లవం – 1789

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఫ్రెంచి విప్లవమునకు ప్రధాన కారణాలు పేర్కొనుము.
జవాబు:
క్రీ.శ 1789లో జరిగిన ఫ్రెంచి విప్లవం ప్రపంచ చరిత్రలోని మహావిప్లవాలలో ఒకటిగా నిలిచింది. ఈ విప్లవం తరువాత ఐరోపాలో, ప్రపంచంలో పూర్వమున్నది ఏది పూర్వం వలె మిగుల లేదు. తరువాత తరాల మీద దాని ప్రభావం శాశ్వతంగా నిలిచింది. ఫ్రెంచి విప్లవం జరగడానికి అనేక కారణాలు తోడ్పడ్డాయి.

బూర్బన్ రాజవంశస్తుల నిరంకుశత్వం: ఫ్రెంచి విప్లవానికి బీజాలు 14వ లూయీ కాలంలోనే పడ్డాయి. 14వ లూయీ పూర్తి నిరంకుశుడు. ‘నేనే రాజ్యాన్ని’ అనేవాడు. ఎన్నో యుద్ధాలు చేసాడు. 15వ లూయీ కాలంలో కూడా నిరంకుశత్వం సాగింది. రాచరికం దైవదత్తమని ప్రజాసమ్మతితో పనిలేదని వీరి విశ్వాసం. రాజు తనకు నచ్చిన చట్టాలు చేయవచ్చును. తనకు తోచిన పన్నులు విధించవచ్చు. ప్రభుత్వాదాయాన్ని తనకు నచ్చినట్లుగా ఖర్చు చేసేవారు. రాజకుటుంబం ఎంతో విలాసవంతంగా బ్రతికేది. దేశ ప్రజలు దయనీయ స్థితిలో ఉండేవారు.

నాటి సాంఘిక పరిస్థితులు: నాటి ఫ్రెంచి సమాజం మూడు ప్రధాన వర్గాలుగా విభజింపబడింది. వీరు ప్రభువులు, మతాధిపతులు, సామాన్యప్రజలు. మొదటి రెండు వర్గాలు ప్రత్యేకమైన హక్కులు కలిగి ఉండేవారు. వీరికి ఎలాంటి పన్నులు చెల్లించవలసిన అవసరం లేదు. అన్నిరకాల పన్నులపై మినహాయింపు ఉండేది. మూడవ వర్గం వారు అధిక పన్నులు చెల్లిస్తూ తీవ్ర నిరాశ, నిస్పృహలలో ఉండేవారు. ఎలాంటి కరువు పరిస్థితులలోనయినా పన్నులు మాత్రం చెల్లించవలసిందే. అధిక పన్నుల భారం, బానిసత్వం, సకల కష్టాలు తీవ్రస్థాయికి చేరుకొని విప్లవానికి దోహదం చేసాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 8 ఫ్రెంచి విప్లవం - 1789

తత్త్వవేత్తలు బోధనలు: ఫ్రెంచి తత్త్వవేత్తలైన మాంటెస్క్యూ, ఓల్టేర్, రూసో బోధనలు విప్లవానికి ప్రజలను ప్రేరేపించాయి.

మాంటెస్క్యూ: మాంటెస్క్యూ విప్లవాన్ని బోధించలేదు, కానీ నిరంకుశత్వాన్ని విమర్శించాడు. అతని ప్రఖ్యాత గ్రంథం ‘స్పిరిట్ ఆఫ్ లాస్’ అనేక దేశముల పరిపాలనా విధానాలను పరిశీలించి రాయబడిన గ్రంథం. మాంటెస్క్యూ, ఇంగ్లాండ్ దేశములోని రాజకీయ అధికార వర్గం అన్నీ దేశముల కంటే ఉత్తమమైనదని భావించాడు.

ఓల్టేర్: ఐరోపా చరిత్ర తిరగరాసిన గొప్ప రాజకీయ తత్త్వవేత్త. ఇతడు మాంటెస్క్యూ సమకాలికుడు. ప్రభువులను మతాధిపతులను విమర్శించి చాలాసార్లు జైలుకు వెళ్ళాడు. రోమన్ కాథలిక్ మతాధిపతులు చేసే ఆకృత్యాలను తీవ్రంగా ఖండించేవాడు. ఇతని దృష్టిలో క్రైస్తవ మతం మానవుని ఆలోచనా స్వేచ్ఛకు అవరోధం కలిగిస్తుంది. అతడు తన శక్తివంతమైన వ్యంగ్య రచనలతో రాచరికాన్ని, చర్చిని లక్ష్యాలుగా చేసాడు.

రూసో: ఫ్రెంచి సమాజాన్ని సమూలంగా మార్చవలసిన అవసరం ఉందని తేల్చిచెప్పాడు. ఇతని ప్రఖ్యాత గ్రంథం ‘సోషల్ కాంట్రాక్ట్’ గ్రంథంలో ‘స్వేచ్ఛగా పుట్టిన మానవుడు అన్నిచోట్ల సంకెళ్ళతో బంధించి ఉన్నాడు’ అని పేర్కొన్నాడు. మానవుడు తన సామాజిక హక్కుల సాధనకై తిరుగుబాటు చేసేలా ఇతని రచనలు ప్రజలను చైతన్యవంతం చేసాయి. ఈ విధంగా మేధావి త్రయమైన మాంటెస్క్యూ, ఓల్టేర్, రూసోల రచనలు ఫ్రెంచి విప్లవానికి విత్తనాలుగా పని చేసాయి.

ఆర్థిక పరిస్థితులు: 14వ లూయీ పాలనాకాలంలో జరిగిన అనేక యుద్ధాలు, వైభవోపేతమైన దర్బార్ నిర్వహణ వ్యయం, 15వ లూయీ కాలం నాటికి అధికమైన ఋణాలు అమెరికా స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం అనేక రంగాలలో ప్రభుత్వ దుబారా వలన ఫ్రాన్స్ ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితికి చేరుకుంది. టుర్గాట్, నెక్కర్, కాలెగ్నెలను ఒకరి తర్వాత మరొకరని సంక్షోభంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి నియమించారు. కానీ ఫలితం లేకపోయింది. చివరకు 16వ లూయీ 175 సంవత్సరాల తర్వాత ఎస్టేట్ జనరల్స్ సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. తనకు కావలసిన ఆర్థిక వనరులను ఇది సమకూర్చగలదని భావించాడు. కానీ 16వ లూయీ ఆశించిన దానికి భిన్నంగా ఈ సమావేశం విప్లవానికి దారితీసింది.

అమెరికా విప్లవ ప్రభావం అమెరికా స్వాతంత్ర్యయుద్ధంలో బ్రిటీష్ వారిపై వ్యతిరేకతతో ఫ్రాన్స్ అమెరికా వారికి సహాయం చేసింది. ఎంతోమంది ఫ్రెంచివారు వాలంటీర్లుగా అమెరికా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. వారు అమెరికా నుంచి తిరిగి వచ్చాక, ఫ్రెంచి ప్రజలలో విప్లవ భావాలను రేకెత్తించి బూర్బన్ నిరంకుశత్వాన్ని కూలదోయాలని ప్రబోధించారు.

టెన్నిస్ కోర్ట్ శపథం: 1789 జూన్ 20న ఎస్టేట్ జనరల్ సమావేశం కొరకు సామాన్యులు రాజధానికి చేరుకున్నారు. కానీ అక్కడి సమావేశపు హాలు తలుపులు మూసిఉండడంతో వారు ప్రక్కనే ఉన్న టెన్నిస్కోర్ట సమావేశమైనారు. “మనమంతా ఎటువంటి పరిస్థితులలో విడిపోకుండా ఒకేదారిలో నడిచి, నూతన రాజ్యాంగము, నూతన పరిపాలనా వ్యవస్థ ఏర్పడేవరకు కలిసి పోరాడతాము”. అని శపథం చేసారు. దీనినే ‘టెన్నిస్కోర్ట్ శపథం’ అంటారు. నూతన రాజ్యాంగం రూపొందించే వరకు జాతీయ అసెంబ్లీని రద్దు చేయమని తాము మాత్రమే జాతీయ అసెంబ్లీ అని ప్రకటించుకున్నారు. మూడవ ఎస్టేట్స్ సభ్యులు రాజాజ్ఞలు ధిక్కరించడంతో విప్లవానికి శ్రీకారం చుట్టడం జరిగింది.

ప్రశ్న 2.
ఫ్రెంచి విప్లవంపై మేధావుల ప్రభావం ఎటువంటిది ?
జవాబు:
ఆధునిక యుగములో అనేక సంస్కరణలకు మూలకారణము సాహిత్యం. సాహిత్యం వలన కొత్త ఆలోచనలు ప్రారంభమై, ఆ ఆలోచనలు ఫ్రాన్స్ దేశమంతా వ్యాపించాయి. 18వ శతాబ్దంలో ఫ్రాన్స్లో విరబూసిన సాహిత్య, తత్త్వవేత్తల ప్రభావం వలనే ఫ్రెంచి విప్లవం ప్రారంభమైనదని చెప్పవచ్చు. మాంటెస్క్యూ, ఓల్టేర్, రూసో, డిడిరో వంటి గొప్ప మేధావులు వ్రాసిన గ్రంథాలు, వ్యాసాలు ఫ్రాన్స్ ప్రజల హృదయాలలో కొత్త ఆలోచనలు, రేకెత్తించడంలో సఫలీకృతమయ్యాయి.

మాంటెస్క్యూ (1685-1755): మాంటెస్క్యూ ప్రభువర్గ కుటుంబంలో జన్మించాడు. న్యాయశాస్త్రం చదువుకొని ‘బోర్డెక్స్’ పార్లమెంట్ లో న్యాయాధిపతిగా పని చేసేవారు. ఇరవై సంవత్సరాల నిరంతర కృషి చేసి ‘స్పిరిట్ ఆఫ్ లాస్’ అనే పుస్తకం రచించాడు. ఈ గ్రంథం అనేక దేశాల పరిపాలనా విధానాల పరిశీలన, రాజకీయ పరిస్థితుల విశ్లేషణకు సంబంధించినది. ఈ గ్రంథంలో వివిధ విషయాలపై చక్కని పరిశీలనతో కూడిన విశ్లేషణతో పాటు, వివిధ రాజకీయ వ్యవస్థలలో ఉన్న మంచి, చెడు లక్షణాలను వివరిస్తుంది. మాంటెస్క్యూ అనేక విషయాలపై వివరణాత్మక పరిశోధన జరిపాడు. ప్రతి రాజకీయ విశ్లేషణలో రెండు, మూడు మంచి సలహాలు, సూచనలు కూడా జోడించాడు.

మాంటెస్క్యూ ఇంగ్లాండ్ దేశములోని రాజకీయ అధికార వర్గం అన్ని దేశముల కంటే ఉన్నతమైనదని భావించాడు. కార్యనిర్వహణాశాఖ, న్యాయశాఖ వేరువేరుగా ఉండటం చాలా అవసరం అని భావించాడు. మాంటెస్క్యూ తన రచనలలో విప్లవాన్ని బోధించనప్పటికీ నిరంకుశత్వాన్ని విమర్శించాడు.

ఓల్టేర్ (1694–1778): ఐరోపా చరిత్రను తిరగరాసిన గొప్ప రాజకీయ తత్త్వవేత్త ఓల్టేర్. మేధావిగా చెప్పబడటానికి అన్ని అర్హతలున్న వ్యక్తి, ఇతను మాంటెస్క్యూ సమకాలికుడు. ఇతడు కవి, చరిత్రకారుడు, నాటకకర్త మరియు శాస్త్రవేత్త. తనదేశంలో సమానత్వం కొరకు పోరాటం జరగడానికి ఇతడు పగటిపూట మబ్బుల వలె, రాత్రిపూట వెలుగునిచ్చే నుంటవలె సహాయపడ్డాడు. ఇతడు ప్రభువుల వర్గాన్ని, మతాధిపతులను విమర్శించి చాలాసార్లు జైలుకు వెళ్ళాడు. ఇతనికి తన దేశంలో ప్రాణభయం ఉండటం వలన ఎక్కువ కాలం ఇతరదేశాలలో గడిపాడు. జైళ్ళలో ఖైదీలకు కల్పించే సదుపాయాలను, పెట్టే చిత్రహింసలను ఓల్టేర్ తీవ్రంగా ఖండించాడు. ఇతడు నాస్తికుడు కాదు. కాని రోమన్ క్యాథలిక్ మతాధిపతులు చేసే ఆకృత్యాలను తీవ్రంగా ఖండించేవాడు., వీరి వలన తను క్రైస్తవ మతానికి వ్యతిరేకం అని ప్రకటించాడు. ఇతని దృష్టిలో మానవుని ఆలోచనాశక్తికి, స్వేచ్ఛకు క్రైస్తవమతం అవరోధం కల్పించుతున్నది. ఇతను రాసిన వ్యాసాలలో రాజకీయ, మతాధికారులపై అనేక వ్యంగ్య విమర్శలు కలవు. ఓల్టర్ ప్రాజ్ఞ నిరంకుశ రాచరికాన్ని ఉత్తమమైన ప్రభుత్వంగా భావించినప్పటికీ ఫ్రాన్స్లో నిరంకుశ, సర్వాధికార, రాచరికపు చర్యలను తీవ్రంగా వ్యతిరేకించాడు. ఫ్రాన్స్ నిరంకుశ రాచరికంపై అతడు సాహితీ సాధనంతో పవిత్రయుద్ధాన్ని కొనసాగించాడు.

రూసో (1712–1778): మాంటెస్క్యూ, ఓల్టేర్, రూసోలు వ్యక్తి స్వేచ్ఛకొరకు సంస్కరణలు కావాలని ఆకాంక్షించాడు. కానీ రూసో విధానాలు, పద్ధతులు వేరుగా ఉంటాయి. రూసో మొత్తం సమాజాన్ని పునర్వ్యవస్థీకరించాలని భావించాడు. సమాజంలోని లోపాలను కొన్ని సవరణలతో కొనసాగించడం వలన వ్యక్తి స్వేచ్ఛకు కావలసిన స్వాతంత్ర్యం లభించదని విశ్వసించాడు.

18వ శతాబ్దం నాటి రూసో ప్రముఖ రాజకీయ రచన సోషల్ కాంట్రాక్ట్ (సామాజిక ఒడంబడిక) ప్రజలను చాలా ప్రభావితం చేసింది. ఈ గ్రంథం “మానవుడు జన్మతః స్వతంత్రుడే ఐనా ప్రతిచోటా శృంఖలాబద్దుడే” అనే తొలి వాక్యాలతో ప్రారంభమౌతుంది. ఇతని ఉద్దేశంలో మనిషి జన్మతః చాలా మంచివాడు, సంతోషంగా జీవించే వ్యక్తి. కానీ నాగరికత వలన ఇతడు అవినీతిపరుడుగా, విలువలు దిగజారిన వ్యక్తిగా మారాడు. అందుచేత మానవుడు తనకు నచ్చిన చట్టములు తయారు చేసుకోవాలి. “ప్రజలే సార్వభౌమాధికారం, ప్రజలందరికీ సమానత్వం ఈ సిద్ధాంతాలే ఫ్రాన్స్లోని సామాన్య ప్రజానీకాన్ని కదిలించివేసింది. అదే విధంగా ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేసింది. మానవులు తమ సామాజిక హక్కుల సాధనకై తిరుగుబాటు చేయాలనేది ఇతని రాజకీయ రచనల సారాంశం.

ఈ రచయితల బోధనలు, ఆనాటి నిరంకుశత్వ స్వభావాన్ని సమాజంలో గల లోపాలను తమ రచనా దృష్టితో – కేంద్రీకరించి, వాటికి వ్యతిరేకంగా ప్రజల ఉద్రేకాలను రెచ్చగొట్టడం ద్వారా పరోక్షంగా విప్లవానికి రంగం సిద్ధం చేసాయి. ఫ్రెంచి మేధావులు వేసిన విత్తనాలు ఫ్రాన్స్లో మంచి పంట పండించాయి. వారి రచనల వలన వచ్చిన మంచి ఫలితాలు విప్లవకాలంలోను, నెపోలియన్ పాలనాకాలంలోను స్పష్టంగా కనబడతాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 8 ఫ్రెంచి విప్లవం - 1789

ప్రశ్న 3.
మొదటి కాన్సల్స్ నెపోలియన్ నిర్వహించిన పాత్ర ఏమిటి ?
జవాబు:
ఫ్రాన్స్లో కొత్తగా తయారైన రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగి, దేశ పాలనా వ్యవస్థను నడపటానికి ఐదుగురు సభ్యులతో కూడిన డైరెక్టరేట్ ఏర్పాటు చేయబడింది. వారు సమర్థవంతంగా వ్యవహరించకపోవడంతో పరిపాలన అలకల్లోలంగా, అవినీతిమయంగా మారింది. ఆర్థిక వ్యవస్థ బలహీనపడి, పాలనావ్యవస్థ గాడితప్పి సంఘవిద్రోహ శక్తులు బలపడసాగారు.

దేశంలో అంతర్గతంగా అల్లకల్లోల స్థితి, డైరెక్టర్పాలన విఫల దశలో నెపోలియన్ విదేశీ దండయాత్రలు ముగించుకొని పారిస్ పట్టణంలో అడుగుపెట్టాడు. అవినీతి బాగా ముదిరిపోయి ప్రజలు విసిగిపోయి ఉన్న సమయం, నెపోలియన్ పరిస్థితిని తనకనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేయడానికి సిద్ధపడ్డాడు. ఫ్రాన్స్ దేశ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఫ్రాన్స్ భాషలో ఈ కుట్రను ‘కూపియట్” అంటారు. దీని అర్థం సైనికబలంతో విధ్వంసకర పద్ధతిలో ఆయుధ దాడితో ప్రభుత్వాన్ని నడిపే బాధ్యతను చేపట్టడం.

నవంబర్ 10, 1799లో సైనికకుట్ర జరిగింది. ఆ రోజున డైరెక్టరేట్లో శాసనసభ్యులు అయిన పెద్దల సభ. 500 మంది కౌన్సిల్ సభ్యుల సమావేశం పారిస్ పట్టణానికి దూరంగా ‘సెయింట్ క్లాడ్’ భవనంలో ఏర్పాటు చేయబడింది. ఆ సమావేశం జరుగుతుండగా నెపోలియన్ తన సైన్యంతో అక్కడకు చేరుకున్నాడు. నెపోలియన్ అతడి సోదరుడు లూసిన్ బోనపార్టీ సైన్యంతో సమావేశ మందిరంలో ప్రవేశించి శాసనసభ్యులను భయభ్రాంతులను చేసాడు. చాలా మంది సభ్యులు పారిపోయారు. సాయంత్రం ఈ కుట్రకు అనుకూలంగా ఉన్న కొద్దిమంది సభ్యులతోనే సమావేశం నిర్వహించి డైరెక్టరేట్ పరిపాలన రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. ప్రత్యామ్నాయంగా ముగ్గురు సభ్యులతో కూడిన ”కాన్సల్’ పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేసారు. ముగ్గురిలో ఒకరు నెపోలియన్ బోనపార్టీ. ఈ విధంగా నెపోలియన్ పాలనా అధికారాలను హస్తగతం చేసుకున్నాడు. నెపోలియన్ నిర్వహించిన ఈ సైనిక తిరుగుబాటుకు ప్రజల మద్ధతు లభించింది. ఈ ముగ్గురు కాన్సల్స్ ఆ సమావేశంలో అధికార బాధ్యతలు చేపట్టి స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాభాగస్వామ్యాలను పరిరక్షిస్తామని శపథం చేసారు.

మొదటి కాన్సల్స్ నెపోలియన్: ఫ్రాన్స్ దేశంలోని ఆంతరంగిక, విదేశీ పరిస్థితులు సక్రమంగా లేవని, ఈ స్థితిలో దేశాన్ని కాపాడగలవారు ఒక్క నెపోలియన్ మాత్రమే అని ప్రజల నమ్మకం. ఈ నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని నెపోలియన్ తన అధికారాన్ని బలపరుచుకున్నాడు. 1799లో తయారు చేయబడిన నూతన పాలనా వ్యవస్థను కాన్సల్ ప్రభుత్వం అంటారు. నాటి నుంచి నెపోలియన్ సర్వాధికారాలలో నియంతగా పాలించాడు. సైనిక అధిపతి అయిన నెపోలియన్ మొదటి కాన్సల్, మిగిలిన ఇద్దరు (అబెనైస్, డ్యూకోస్) ఇతర పరిపాలనా విభాగాలు పరిపాలించేవారు.

నెపోలియన్ దేశంలోని వివిధ పాలనా విభాగాలలో నూతనంగా ఉద్యోగులను నియమించాడు. నెపోలియన్ 1799 నుండి 1804 వరకు కాన్సల్గా పరిపాలన సాగించిన కాలం మరపురానిది. మొదటి కాన్సల్గా నెపోలియన్ విజయవంతం అయ్యాడు. ప్రజలు కోరుకున్న బలమైన ప్రభుత్వాన్ని ఇవ్వగలిగాడు. ఆ కాలంలో అనేక దీర్ఘకాలిక ఫలితాలనిచ్చే సంస్కరణలను రూపొందించడం జరిగింది. మొదటి చర్యగా దేశంలోని అరాచకాన్ని అణచివేసి, శాంతి భద్రతలు స్థాపించాడు. అవసరమైన చోట సైన్యాన్ని వినియోగించి శాంతిభద్రతలు నెలకొల్పాడు. ప్రభుత్వాధికారాన్ని పునరుద్దరించి, పన్నుల విధానాన్ని సంస్కరించి జాతీయాదాయాన్ని అభివృద్ధి చేసాడు. ఫ్రాన్స్ జాతీయ బ్యాంక్ ‘ది బ్యాంక్ ఆఫ్ ఫ్రాంస్’ స్థాపించి వ్యాపార వాణిజ్యాలను మెరుగుపరిచాడు.

నెపోలియన్ చేపట్టిన మరిన్ని చర్యలు: దేశప్రగతికి గణనీయమైన సేవలనందించిన వారిని గౌరవించడానికి ‘లిజియన్ ఆఫ్ ఆనర్’ ను ఏర్పాటు చేసాడు. విద్యా విషయాలపై ఆసక్తితో ఒక జాతీయ విద్యామండలిని ఏర్పాటు చేసాడు. ఫ్రెంచి విశ్వవిద్యాలయం స్థాపించాడు. అనేక వృత్తి విద్యాసంస్థలు ఏర్పాటు చేసాడు.

నెపోలియన్ సంస్కరణలలో పేరొందింది, శాశ్వత కీర్తిని తెచ్చి పెట్టింది ‘నెపోలియన్ కోడ్’ పౌరుల సమానత్వ సిద్ధాంతాలు ఈ చట్టంలో ప్రముఖ స్థానం వహించాయి. ‘పోప్’కు నెపోలియన్కు మధ్య 1801లో మత విషయాలపై జరిగిన ఒడంబడికను ‘కంకార్డెంట్’ అంటారు. దీనిని నెపోలియన్ రాజనీతిజ్ఞతకు నిదర్శనంగా భావిస్తారు.

నెపోలియన్ను ‘విప్లవం కన్నబిడ్డ’ అని అందరూ పొగిడారు. విప్లవం కోరుకున్న ఫలాలను సామాన్య ప్రజలకు అందించడంలో నెపోలియన్ సఫలీకృతుడైనాడు. చివరకు 1804లో నెపోలియన్ కాన్సల్ విధానాన్ని రద్దుచేసి తననుతాను ఫ్రాన్స్కు చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు.

AP Inter 2nd Year History Study Material Chapter 8 ఫ్రెంచి విప్లవం - 1789

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎస్టేట్ జనరల్.
జవాబు:
ఫ్రాన్స్ దేశంలో రాజుకు సహాయపడటానికి, సలహాలు ఇచ్చేందుకు ఎస్టేట్స్ జనరల్ అనే సంస్థ కలదు. మతాధిపతులు, ప్రభువులు మిగిలిన ఫ్రాన్స్ ప్రజానీకంతో ఎస్టేట్స్ జనరల్ ఏర్పడింది. ఆగమ్యగోచరంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి దివాళా తీసిన ఆర్థిక వ్యవస్థను కాపాడి బూర్బన్ రాజవంశస్థులను గట్టెక్కించడానికి | 16వ లూయీ క్రీ.శ. 1789లో 175 సంవత్సరాల తర్వాత ఎస్టేట్ జనరల్ సమావేశం పిలవబడింది. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి నెక్కర్ను ఆర్థిక సలహాదారునిగా నియమించడం జరిగింది.

1789 మే 5న ఎస్టేట్స్ జనరల్ సమావేశం జరిగింది. సుమారు 300 మంది ప్రభువుల వర్గం, 300 మంది మతాధిపతుల వర్గ ప్రతినిధులు, 600 మంది మూడవ వర్గ ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ఓటింగ్ పద్ధతి దగ్గర వివాదం ఏర్పడింది. మొదటి రెండు వర్గాలు ఎస్టేటు ఒక ఓటు ఉండాలని భావించగా, మూడవ ఎస్టేట్ సభ్యులు ఈ వాదనను తోసిపుచ్చి సభ్యునికొక ఓటు ఉండాలని వాదించారు. ఈ వివాదానికి పరిష్కారం దొరకనందున జూన్ 20, 1789న ఎస్టేట్స్ జనరల్ భవనాల దగ్గరలోని టెన్నిస్కోర్ట్లో మూడవ వర్గం వారు సమావేశమై ‘టెన్నిస్కోర్ట్ ప్రతిజ్ఞ చేసారు.’ దీనితో విప్లవానికి శ్రీకారం చుట్టినట్లయింది. 16వ లూయీ ఆశించిన దానికి భిన్నంగా ఎస్టేట్స్ | జనరల్ సమావేశం విప్లవానికి నాంది పలికింది.

ప్రశ్న 2.
రూసో (1712-1778).
జవాబు:
ఫ్రాన్స్ దేశాన్ని ప్రభావితం చేసిన మేధావి త్రయంలో రూసో ఒకరు. రూసో క్రీ.శ 1712లో జెనీవా నగరంలో జన్మించారు. మాంటెస్క్యూ, ఓల్టేర్లతో పోల్చిచూస్తే డీనా జాక్విస్ రూసో విధానాలు, పద్ధతులు వేరుగా ఉంటాయి. రూసో మొత్తం ఫ్రెంచి సమాజాన్ని సమూలంగా అవసరం ఉందని తేల్చి చెప్పాడు. సమాజంలోని లోపాలను కొన్ని సవరణలతో కొనసాగించడం వలన వ్యక్తి స్వేచ్ఛకై కావలసిన స్వాతంత్య్రం లభించజాలదని విశ్వసించాడు.

18వ శతాబ్దమందలి అతని ప్రముఖ రాజకీయ రచన “సామాజిక ఒడంబడిక” ప్రజలను చాలా ప్రభావితం చేసింది. ఈ రచన “మానవుడు జన్మతః స్వతంత్రుడే ఐన ప్రతిచోట శృంఖలాబద్ధుడే” అనే వాక్యంతో ఆరంభమౌతుంది. రూసో ఉద్దేశంలో మనిషి జన్మతః మంచివాడు. సంతోషంగా జీవించే వ్యక్తి కానీ, నాగరికత వలన ఇతడు అవినీతిపరుడుగా
విలువలు దిగజారిన వ్యక్తిగా మారాడు. అందుచేత మానవుడు తనకు నచ్చిన చట్టములు తయారు చేసుకోవాలి అని ప్రబోధించాడు. ప్రజలకే సార్వభౌమాధికారం, ప్రజలందరికీ సమానత్వం ఈ సిద్ధాంతాలే ఫ్రాన్స్లోని సామాన్య ప్రజానీక హృదయాలను తట్టి లేపాయి. అదేవిధంగా ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేసాయి.

ప్రశ్న 3.
బాస్టిలో కోట పతనం.
జవాబు:
పారిస్ పట్టణంలో సామాన్య ప్రజలు 16వ లూయీ జాతీయసభను అణచివేయడానికి చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకంగా దొమ్మీలు, దోపిడీలు, లూటీలు ప్రారంభించారు. బహుశా ప్రజల ఆందోళనకు దృష్టిలో పెట్టుకొని రాణి మేరి అంతు వానెత్ తన పుట్టిల్లు ఆస్ట్రియా నుండి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తెప్పించి తన నివాసమైన బాస్టిల్ కోటలో భద్రపరచింది. ఈ వార్తలు తెలుసుకున్న సామాన్యులు మరింత రెచ్చిపోయి ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు ధ్వంసం చేసారు. అక్కడితో ఆగకుండా 1789 జులై 14న బాస్టిలో కోటపై దాడి చేసారు.

AP Inter 2nd Year History Study Material Chapter 8 ఫ్రెంచి విప్లవం - 1789

కోటలో బంధించబడి ఉన్న రాజకీయ ఖైదీలను విడిపించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సామాన్యులు పారిస్ నగరంలో మునిసిపల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. 16వ లూయీ ఈ మార్పు అంగీకరించక తప్పలేదు. ఫ్రెంచి విప్లవం విజయవంతమైన తర్వాత ఆ దినాన్ని జాతీయ దినంగా ప్రకటించారు. ఎరుపు, తెలుపు, నీలి రంగులతో కూడిన నూతన త్రివర్ణపతాకాన్ని (కొకాడ్) ప్రవేశపెట్టారు. బూర్బన్ల తెల్లరంగు పతాకం తొలగించబడింది.

బాస్టిలో కోట పతనాన్ని నిరంకుశ రాచరిక అంతాన్ని సూచించేదిగా సమకాలీన రచయితలు దాన్ని గొప్ప సంఘటనగా ప్రశంసించారు.

ప్రశ్న 4.
ఫ్రెంచి విప్లవ ఫలితాలు.
జవాబు:
ఫ్రాన్స్ను విముక్తి చేసి స్వేచ్ఛా ప్రపంచంలోకి తీసుకురావటంలో ఎన్నో అడ్డంకులు ఏర్పడ్డాయి. నెపోలియన్ తనకు తాను చక్రవర్తిగా ప్రకటించుకోవడంతో విప్లవం విఫలం అయినట్లు భావించనక్కరలేదు. ఎందుకంటే విప్లవం కోరుకున్న అనేక ఫలములు సామాన్యుడికి అందించబడ్డాయి.

సమాజంలో ప్రభువులకు, మతాధిపతులకు గల ప్రాధాన్యం తొలగిపోయి, వ్యవస్థలో అనేక సంస్కరణలు ప్రారంభమైనాయి. చర్చి ప్రభుత్వానికి లోబడింది. క్రమంగా హేతువాద ప్రాముఖ్యం పెరిగింది. మూఢవిశ్వాసాలు, నమ్మకాలు క్రమంగా క్షీణించి, వాటి స్థానాన్ని హేతువాదం, శాస్త్రీయ దృక్పథం ఆక్రమించింది. విప్లవం కోరుకున్న స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వం ప్రజలకు అందించబడినవి. మానవ హక్కుల ప్రకటన ద్వారా ప్రపంచానికంతటకి ఫ్రాన్స్ మార్గదర్శి కాగలిగింది.

భూస్వామ్యవిధానం అంతం కావడం, బిరుదులు రద్దు కావడం, న్యాయస్థానాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, చట్టం ముందు అందరూ సమానులే అనే భావన ద్వారా దేశ ప్రజలలో సమానత్వం సాధించింది. బానిసత్వాన్ని రద్దు చేసారు. సామాన్యుని శక్తి ముందు రాజులు, ప్రభువులు, మతాధిపతులు అందరూ తలదించవలసిందే అని బుజువయింది. ఆసియా, ఆఫ్రికా ఖండంలోని అనేక దేశాలు ఫ్రెంచి విప్లవం వలన ప్రభావితం అయ్యాయి. ప్రజాస్వామ్య విధానాలు రాజ్యాంగ సవరణలు, ప్రజాప్రాతినిధ్యం మొదలైన అంశాలకు ఫ్రెంచి విప్లవంతోనే ప్రాధాన్యం పెరిగినట్లు పరిశీలకులు భావిస్తారు.

ప్రశ్న 5.
జాతీయసభ ప్రవేశపెట్టిన సంస్కరణలు.
జవాబు:
జాతీయసభ 1789 ఆగస్ట్ 4న దేశంలో భూస్వామ్యవ్యవస్థను రద్దు చేసారు. జాతీయ అసెంబ్లీ సభ్యులైన భూస్వాములు, జమీందార్లు ఒకరి తర్వాత మరొకరు తమ భూస్వామ్య అధికారాలు ప్రత్యేక హక్కులు వదులుకున్నారు. బానిసత్వం రద్దయింది. అలాగే మొదటి వర్గం మతాధిపతులు వసూలు చేస్తున్న ‘టైత్’ పన్నును రద్దు చేసారు.
1789, ఆగస్ట్ 26న నూతన జాతీయ అసెంబ్లీ మానవ హక్కుల ప్రకటన పత్రం విడుదల చేసింది. ఇందులో పౌరుల హక్కులు, వాటి అమలు గురించిన వివరాలు తెలియజేయబడ్డాయి. ఇది ఆధునిక యుగానికి ఒక వరంగా భావించబడింది. మానవ హక్కుల ప్రకటనలో గల పదిహేడు అంశాలలో మానవులందరూ సమానులేనని, ప్రజల చేతనే ప్రభుత్వ అధికారం నిర్ణయించబడుతుందని, శాసనాలు, చట్టాలు ప్రజల అభీష్టం మేరకు చేయబడతాయని ఈ ప్రకటన స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్రం, అసెంబ్లీలోని ప్రభుత్వంలో పాల్గొనడానికి అందరికీ సమాన అవకాశాలు కల్పించింది.

1791 నాటికి జాతీయ అసెంబ్లీ తయారు చేసిన మొదటి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. 745 మంది ఎన్నుకోబడిన సభ్యులతో, రెండు సంవత్సరాల పదవీ కాలంతో అసెంబ్లీ ఏర్పడింది. నామమాత్రపు అధికారాలతో చక్రవర్తి కొనసాగాడు. న్యాయవ్యవస్థను, స్థానిక పరిపాలనా వ్యవస్థను కూడా పునర్వ్యవస్థీకరించారు.

AP Inter 2nd Year History Study Material Chapter 8 ఫ్రెంచి విప్లవం - 1789

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
16వ లూయీ చక్రవర్తి.
జవాబు:
(1774 – 1793) ఫ్రాన్స్లో ఎంతోకాలం పేరుకుపోయిన సమస్యలన్నీ తన నెత్తిమీద వేసుకున్న దురదృష్టవంతుడు 16వ లూయీ చక్రవర్తి. అపరిష్కృత సమస్యలే ఫ్రెంచి విప్లవానికి కారణమయ్యాయి. ఫ్రాన్స్ను పాలించిన బూర్బన్ రాజవంశంలో చివరివాడు ఇతడే. 20 సంవత్సరాల వయసులోనే రాజయ్యాడు. ఇతడు మంచి భావాలు కలిగి ఉన్నవాడు, కానీ మనసుకు సరైన లక్ష్యం లేక పెద్దగా చదువుకోలేదు. నిర్ణయాలు తీసుకోవటంలో సంకోచం, మందకొండితనం, బద్దకం వంటి అవలక్షణాలు కలిగినవాడు. చెప్పుడు మాటలు విని నష్టపోయాడు. ఫ్రెంచి విప్లవం తర్వాత 16లూయీ రాజ్యాన్ని వదిలి పారిపోయే ప్రయత్నం చేసాడు. కానీ ‘వెర్నస్’ సరిహద్దులలో దొరికిపోయాడు. చివరకు కన్వెన్షన్ 1793లో ఇతనిని ఉరితీసింది.

ప్రశ్న 2.
మేరీ అంతు వానెత్.
జవాబు:
మేరీ అంతు వానెత్ (1755-1793) ఆస్ట్రియా రాణి మరియు థెరిస్సా కుమార్తె. ఫ్రెంచి యువరాజు 16వ లూయీని వివాహం చేసుకుంది. ఆమె అందమైనది, చురుకైనది. గట్టి నిర్ణయాలు తీసుకునే శక్తి, ధైర్యం మొదలైనవి ఆమె లక్షణములు. అయితే ఆమెకు విజ్ఞత, సామాన్య ప్రజల మనస్తత్వములు అర్థం చేసుకునే శక్తి లేదు. రాచ కుటుంబంలో జన్మించిన అంతు వానెత్కు తన కంటే తక్కువ ధనవంతుల పట్ల చులకన భావముండేది అంతు వానెల్కు చదువుట, వ్రాయుట కూడా తెలియదు. అహంకారం, గర్వం అతి ఆత్మవిశ్వాసం ఎక్కువ. చివరకు క్రీ.శ 1793లో విప్లవకారులు ట్రిబ్యునల్ విచారణలో దోషిగా తేల్చి ‘గిలిటిన్’ ద్వార మరణశిక్ష విధించారు.

ప్రశ్న 3.
టెన్సిస్ కోర్ట్ శపధం.
జవాబు:
1789 జూన్ 20న ఎస్టేట్స్ జనరల్ సమావేశం కొరకు సామాన్యులు రాజధాని చేరుకున్నారు. కానీ అక్కడ సమావేశం జరగవలసిన హాలు తలుపులు మూసిఉన్నాయి. ఎంతో ఉత్సాహంగా ఉన్న మూడవ వర్గం వారు ప్రక్కనే ఉన్న టెన్నిస్కోర్ట్ నందు సమావేశమయ్యారు. వారంతా ఏకకంఠంతో ఎట్టి పరిస్థితులలో విడిపోకుండా ఒకే దారిలో నడిచి, నూతన రాజ్యాంగము నూతన పాలనా వ్యవస్థ ఏర్పడే వరకు కలిసి పోరాడదాము” అని శపథం చేసారు. దీనినే ‘టెన్నిస్ కోర్ట్ శపథం’ అన్నారు.

AP Inter 2nd Year History Study Material Chapter 8 ఫ్రెంచి విప్లవం - 1789

ప్రశ్న 4.
ఓల్టేర్.
జవాబు:
ఐరోపా చరిత్రను తిరగరాసిన గొప్ప రాజకీయ తత్త్వవేత్త ఓల్టేర్ (1694-1778). ఇతడు కవి, చరిత్రకారుడు, నాటకకర్త మరియు శాస్త్రవేత్త. తన దేశంలో సమానత్వం కొరకు పోరాటం జరగడానికి ఇతడు పగటిపూట మబ్బులవలె, రాత్రి పూట వెలుగునిచ్చే మంటవలె సహాయపడ్డాడు. ప్రభువులను, మతాధిపతులను విమర్శించి ఎన్నోసార్లు జైలు పాలయ్యాడు. రోమన్ క్యాథలిక్ మతాధిపతులు చేసే ఆకృత్యాలను తీవ్రంగా ఖండించి వారి వలనే తాను క్రైస్తవమతానికి వ్యతిరేకం అని ప్రకటించాడు. ఇతని దృష్టిలో మానవుని ఆలోచనాశక్తికి, స్వేచ్ఛకు క్రైస్తవమతం అవరోధం కల్పిస్తున్నది. ఇతని వ్యాసాలలో రాజకీయ, మతాధిపతులపై అనేక వ్యంగ్య విమర్శలు కలవు.

ప్రశ్న 5.
మాంటెస్క్యూ,
జవాబు:
మాంటెస్క్యూ (1685-1755) ప్రభువర్గ కుటుంబంలో జన్మించాడు. న్యాయశాస్త్రం చదువుకొని బోరెక్స్ పార్లమెంట్లో న్యాయాధిపతిగా పనిచేసాడు. 20 సంవత్సరాల నిరంతర కృషి చేసి ‘స్పిరిట్ ఆఫ్ లాస్’ అనే పుస్తకం రచించాడు. ఈ గ్రంథం దేశాల పాలనా, రాజకీయ విధానాలపై నిశిత విశ్లేషణ. ఈ గ్రంథంలో రాజకీయ వ్యవస్థలోని మంచి, చెడులను వివరించాడు. మాంటెస్క్యూ ప్రకారం ఇంగ్లాండ్ దేశంలోని రాజకీయ అధికారం అన్ని దేశముల కంటే ఉన్నతమైనది. మాంటెస్క్యూ తన రచనలతో కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ వేరువేరుగా ఉండటం చాలా అవసరం అని పేర్కొన్నాడు.

ప్రశ్న 6.
గిలిటిన్.
జవాబు:
ఫ్రెంచి విప్లవంలో గిలిటిన్ భయోత్పాతానికి చిహ్నము. గిలిటిన్ అనేది ఒకరకమైన శిరచ్ఛేదనా యంత్రం. కొంతమంది వైద్యులు ప్రతిపాదించిన ఈ మరణదండన విధానం వలన తక్కువ సమయంలో ఎక్కువ మందికి మరణశిక్ష విధించే అవకాశం కలుగుతుంది. ఫ్రాన్స్లో ఆ రోజులలో ఇది ఒక గొప్ప వినోదంగా, వేలాది మంది చూడటానికి వీలుగా ఏర్పాటు చేయబడింది. ఫ్రాన్స్ రాజు 16వ లూయీ, రాణి మేరి అంతువానెత్లు కూడా గిలిటిన్ ద్వారా మరణదండనకు గురైనారు.

ప్రశ్న 7.
టైత్స్.
జవాబు:
ఫ్రెంచి విప్లవానికి ముందున్న ఫ్రాన్స్ సమాజంలో మొదటి వర్గానికి చెందిన మతాధిపతులకు క్రైస్తవుల నుండి ‘టైత్’ అనే పన్నును వసూలు చేసుకునే హక్కు ఉండేది. ప్రతి క్రైస్తవుడు తన ఆదాయంలో కొంత భాగం తప్పనిసరిగా మతాధిపతికి చెల్లించే పన్ను. ఈ పన్ను ద్వారా మతాధికారులకు అధిక మొత్తంలో ఆదాయం లభించేది. చాలా మంది మతాధిపతులు ఈ ధనంతో విలావంతంగా జీవించేవారు.

AP Inter 2nd Year History Study Material Chapter 8 ఫ్రెంచి విప్లవం - 1789

ప్రశ్న 8.
మూడవ వర్గం.
జవాబు:
ఫ్రెంచి సమాజంలో ప్రభువుల, మతాధిపతులు కాకుండా మిగిలిన వారందరూ మూడవ వర్గానికి చెందినవారే. మూడవ వర్గానికి చెందినవారిలో కొంతమంది భూస్వాములు, వృత్తిపనివారు మరియు వ్యవసాయదారులు ప్రధానమైనవారు. ఫ్రాన్స్లో ఎక్కువ మంది మూడవ వర్గానికి చెందినవారే. మూడవ వర్గంలో న్యాయవాదులు, వైద్యులు, సైనికులు, వడ్డీవ్యాపారులు, వస్తువుల తయారీదారులు కలరు. వీరిలో చాలామంది ధనవంతులు, సమాజంలోని అసమానతల పట్ల తీవ్ర వ్యతిరేక భావంతో ఉండేవారు. తమ వర్గానికి రాజకీయ అధికారంలో భాగస్వామ్యం ఉండాలని వీరు కోరుకున్నారు. మూడవ వర్గంలో అత్యంత దయనీయంగా రైతులు జీవించారు. వీరు తమ ఆదాయంలో ఐదింట నాలుగు వంతులు పన్నుల రూపంలో చెల్లించేవారు. మిగిలిన ఆదాయంలో అతను, అతని కుటుంబం జీవించవలసి వచ్చేది.

AP Inter 2nd Year History Study Material Chapter 7 ఆధునిక యుగారంభం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 7th Lesson ఆధునిక యుగారంభం Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 7th Lesson ఆధునిక యుగారంభం

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సాంస్కృతిక పునరుజ్జీవనం గురించి వివరించండి.
జవాబు:
రినైసాన్స్ అనగా పునరుద్ధరణ లేక పునర్జన్మ అని అర్థం. నూతనత్వం, విశాల దృక్పథం విశిష్ట లక్షణాలతో వచ్చిన సాంస్కృతిక పునరుజ్జీవ కాలంగా దీనిని చెప్పవచ్చు. సాంస్కృతిక పునరుజ్జీవ కాలాన్ని ఐరోపాలో గతించిన ప్రామాణిక కాలాన్ని పునఃసమీక్ష చేయడం లేదా పునరుద్ధరించడంగా పేర్కొన్నారు. ప్రాచీన, గ్రీకు, రోమన్ల సంస్కృతిని వెలుగులోకి తెచ్చి, ప్రాచుర్యం కల్పించిన ఉద్యమమే సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం. దీని ద్వారా వ్యక్తి అభిరుచులు, కళాభినైపుణ్యాలు వెలుగులోకి వచ్చాయి. 14, 15 శతాబ్దాలలో ఐరోపాలోని ఫ్లారెన్స్, వెనిస్, రోమ్ నగరాలు కళలకు, సారస్వతానికి కేంద్రాలుగా నిలిచాయి. ఫ్లారెన్స్ సాంస్కృతిక పునరుజ్జీవనానికి మొదటి కేంద్రం. సంపన్న వర్గాలు కళాకారులను, రచయితలను ప్రోత్సహించారు. ముద్రణా యంత్రాలలో ప్రజలకు విరివిగా గ్రంథాలు లభించాయి. ఐరోపాలోని సాంస్కృతిక పునరుజ్జీవనం అనేక రంగాలను ప్రభావితం చేసింది. కొత్తకొత్త భావాలు వ్యాపించాయి.

మానవతావాదం: ఇటలీలోని విశ్వ విద్యాలయాలలో నూతనంగా మానవతావాదం ప్రారంభమయింది. ఇటలీలో పాఠశాల స్థాయి నుండి విశ్వ విద్యాలయం వరకు మానవతావాదం బోధింపబడింది. వీటిలో విద్యతో పాటు సంగీతం, కళలు నేర్పేవారు. వ్యక్తిని శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారుచేయడమే మానవతావాదం యొక్క ముఖ్యోద్దేశం. వ్యక్తిలోని నైపుణ్యాన్ని చర్చలు, గోష్టుల ద్వారా ఆధునీకరించడం మానవతావాద ప్రధానోద్దేశం. విమర్శనాత్మక దృక్పథాన్ని, సృజనాత్మక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడంతో మానవతావాదం బలపడింది.

AP Inter 2nd Year History Study Material Chapter 7 ఆధునిక యుగారంభం

గ్రీకు సారస్వత అధ్యయనం: క్రీ.శ. 14 శతాబ్దంలో అనేకమంది పండితులు ప్లాటో, అరిస్టాటిల్ వంటి వారి రచనలను అనువాదం చేసారు. క్రీ.శ. 1453లో కాన్స్టాంట్్నపుల్ని టర్కీ ఆక్రమించినప్పుడు ఎందరో గ్రీకు పండితులు బైజాంటైన్ నుంచి, ఇటలీ పారిపోతూ తమతోపాటు గ్రీకు రచనలు తెచ్చుకొని ఫ్లారెన్స్ గ్రంథాలయాల్లో దాచుకున్నారు. ఇటలీ పండితులు ఎన్నో గ్రీకు గ్రంథాలు సేకరించారు. పాశ్చాత్యులు గ్రీకు సారస్వతాన్ని పరిశోధించారు, ఆస్వాదించారు. ప్లేటో ప్రవేశపెట్టిన ప్రేరేపిత పద్ధతి వైజ్ఞానిక శాస్త్ర ఆవిర్భావానికి, శాస్త్రీయ పద్ధతిలో సైన్సు అధ్యయనం చేయడానికి సహాయపడింది.

అచ్చుయంత్రం: క్రీ.శ. 1455లో జోహన్స్ గుటెన్ బర్గ్ అచ్చుయంత్రాన్ని కనిపెట్టి 150 బైబిల్ గ్రంథాలు ముద్రించాడు. క్రమంగా యూరప్ అంతా వ్యాపించి 200 మిలియన్లకు పైగా పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పుస్తకాల వలన ఎన్నడూ లేనంత ఆధునిక భావాలు, అభిప్రాయాలు, సమాచారం విస్తృతంగా వ్యాపించాయి. ప్రజలలో విద్య, వైద్య, న్యాయ, ఖగోళ, లోహం వంటి అనేక శాస్త్రాలపై అవగాహన పెరిగింది.

సాహిత్యం: పునరుజ్జీవ కాలంలో ఎందరో రచయితలు చైతన్యవంతమైన రచనలు చేశారు. ‘డివైన్ కామెడీ’ రచించిన డాన్టే సాంస్కృతిక పునరుజ్జీవవానికి ఆద్యుడు. పెట్రార్క్ ఎన్నో పురాతన నాణేలు, వ్రాతప్రతులను భద్రపరచడమే కాక ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం అని బోధించాడు.

కళలు: సాంస్కృతిక పునరుజ్జీవం వలన వాస్తు, శిల్పశాస్త్రాలు, చిత్రలేఖనం వంటి లలితకళలు వికసించి ప్రజలను అమితంగా ప్రభావితం చేసాయి. ఈ కళలను ధనవంతులు ప్రముఖంగా పోషించాయి. పోప్, చర్చి, వందలాది కళాకారులను ప్రోత్సహించారు. ప్రాచీన, గ్రీకు, రోమన్ కళల వైభవాన్ని పునరుద్ధరించారు. ఫ్లారెన్స్కు చెందిన ‘జిట్’ |400 అడుగుల పొడవైన గోపురానికి రూపకల్పన చేసాడు. మరో చిత్రకారుడు మైఖెలాంజిలో ‘ఫైటా’ అనే శిల్పం, లియొనార్డో డావెన్సీ చిత్రాలలో ‘మోనాలిసా’, ‘ది లాస్ట్ సప్పర్ ముఖ్యమైనవి. శిల్పాలలో డోనాటెల్లా యొక్క ‘గట్టమెంట’, మైఖలాంజిలో డేవిడ్ శిల్పాలు ప్రముఖమైనవి.

ఫ్లారెన్స్లోలో గొప్ప నిర్మాణ శైలి అభివృద్ధి చెందింది. పొడవైన గోపురాలు, పెద్ద డోములు, బలమైన గోడలతో చర్చిలు నిర్మించారు.

విజ్ఞాన శాస్త్రాభివృద్ధి: సాంస్కృతిక పునరుజ్జీవ కాలంలో వైజ్ఞానిక శాస్త్రాభివృద్ధి జరిగి, అందులో భాగంగా ప్రకృతి రహస్యాలను ఛేదించి తార్కిక దృష్టితో చూశారు. 17వ శతాబ్దం నాటికి విశ్వానికి, శాస్త్ర సంబంధించిన ఎన్నో కొత్త సూత్రాలు, సిద్ధాంతాలు కనుగొనబడ్డాయి. కోపర్నికస్ సౌరకేంద్ర సిద్ధాంతం చర్చిని, బైబిల్లోని బోధనలను విభేదించింది. తరువాతి కాలంలో కెప్లర్, గెలీలియోలు ఈ సిద్ధాంతాన్నే బలపరిచారు. శాస్త్రీయ దృక్పథం పెరగడంతో సైన్స్ అకాడమీలు ఏర్పడి ఎన్నో ఆవిష్కరణలకు కారణమయ్యాయి.
మత సంస్కరణోద్యమం: కేథలిక్ చర్చి దురాగతాలను వ్యతిరేకిస్తూ, జర్మనీలోని వేదాంత పండితుడు మార్టిన్ లూథర్ ఆధ్వర్యంలో ప్రొటెస్టంట్ మత ఉద్యమం ఏర్పడింది. ఇతను క్యాథలిక్ బోధనలను వ్యతిరేకిస్తూ, సామాన్యులకు విశ్వాసం ఒక్కటే దైవాన్ని చేరుస్తుందని, కర్మకాండలు అవసరం లేదని పేర్కొన్నాడు. యూరప్ లో ఎన్నో దేశాలలో ప్రొటెస్టెంట్ చర్చిలు ఏర్పడ్డాయి. ఫలితంగా క్యాథలిక్లు కూడా తమలోని లోపాలను సరిదిద్దుకుని నూతనోత్సాహంతో పునరంకితమయ్యారు.

ఉద్యమ ప్రభావం: పునరుజ్జీవ కాలంలో సృజనాత్మకత వెల్లివిరిసింది. ఐరోపాలో వచ్చిన సాంస్కృతిక మార్పులు కేవలం రోమ్, గ్రీకులనే కాక అనేక దేశాలను ప్రభావితం చేసాయి. వ్యక్తిలోని స్వేచ్ఛను, సృజనాత్మకతను వెలికితీసి, చర్చి ఆంక్షల నుండి వ్యక్తిని వేరుచేసింది మానవతావాదం. ఫలితంగా ప్రజల శాస్త్రీయ దృక్పథాన్ని ఏర్పరచుకోవడానికి దోహదపడింది. క్రైస్తవమతం కేథలిక్, ప్రొటెస్టెంట్లుగా విడిపోయారు. సారస్వత, వైజ్ఞానిక, శాస్త్ర సాంకేతిక రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాధించగలిగారు.

ప్రశ్న 2.
మత సంస్కరణ ఉద్యమం అనగానేమి ?
జవాబు:
ఇంగ్లాండులోని థామస్ మోర్, హాలెండ్ లోని ఎరాస్మస్ వంటి క్రైస్తవ మానవతావాదులు చర్చి దురాశతో కూడిన వ్యవస్థగా మారిందని, సాధారణ ప్రజల నుండి తమ ఇష్టం వచ్చినట్లు ధనాన్ని వసూలు చేస్తుందని విమర్శించారు. మత గురువులు ‘పాప పరిహార పత్రాలు’ అమ్మడం, ఈ పత్రాలను కొనేవారు తమ పాపభారం నుండి విముక్తులవుతారని చెప్పారు.

చర్చి సంస్కరణల ఆవశ్యకతను ఎరాస్మస్ తన రచనల ద్వారా తెలియజేసాడు. ఇతడు రాసిన ‘ది ప్రెయిస్ ఆఫ్ ఫాలీ’ అనే గ్రంథంలో మూఢ నమ్మకాలపై ఆధారపడిన చర్చి ఆచారాలను, మతాధికారులను అతడు విమర్శించాడు. ఎరాస్మస్ గ్రంథంలో రోమన్ క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా సంబంధించిన విమర్శనాస్త్రాలు పోప్కు హాని కలిగించాయి. మతాధికారుల అతీంద్రీయ శక్తులు, పాపపరిహార పత్రాలు అమ్మటంలోని మోసం, ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడం వంటి అంశాలను ఆయన తన గ్రంథంలో ప్రస్తావించారు. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ధర్మం, ఏది అధర్మం అనే వాటిని ప్రజలకు తెలియజెప్పటం ద్వారా చర్చిలో మార్పులు తేవచ్చని అతడు నమ్మాడు.

థామస్ మోర్ బైబిల్ను స్థానిక భాషలలోకి అనువదించడం వలన క్రైస్తవులు తమ మతం ఎలాంటి తప్పుడు ఆలోచనలను అనుమతించదని అర్థం చేసుకున్నారు. ఐరోపాలోని అన్ని ప్రాంతాల రైతులు చర్చి విధించిన పన్నులను తీవ్రంగా వ్యతిరేకించారు. మతాధికారులకు అధికారం కాన్స్టంటైన్ చక్రవర్తి జారీ చేసిన ‘డొనేషన్ ఆఫ్ కాన్ స్టాంటైన్ న్యాయ మరియు రాజకోశాగారం’ అనే రాజపత్రం నుండి వచ్చిందని చెప్పేవారు. మానవతావాదులు ఇది తరువాత కాలంలో కల్పించబడిన పత్రమని విమర్శించారు. అన్ని వర్గాల క్రైస్తవులు తమ సహనాన్ని కోల్పోయి మతాధికారుల మీద, చర్చి ఐహిక పారదర్శకత మీద తిరుగుబాటు చేసారు.

AP Inter 2nd Year History Study Material Chapter 7 ఆధునిక యుగారంభం

మార్టిన్ లూథర్: చర్చి దురాగతాలను వ్యతిరేకించే వారికి జర్మన్ వేదాంతశాస్త్ర అధ్యాపకుడైన మార్టిన్ లూథర్ (1483-1546) తిరుగుబాటుకు నాయకుడైనాడు. మార్టిన్ లూథర్ క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టాడు. దైవ సంబంధం కోసం మత గురువు అనుమతి అవసరం లేదని అతడు ప్రచారం చేసాడు. విశ్వాసం ఒక్కటే సరైన జీవన విధానమని, దేవునిపై పూర్తి విశ్వాసముంచాలని, అదే స్వర్గానికి దారి చూపిస్తుందని అతడు చెప్పాడు. విశ్వాసం ద్వారా స్వర్గం చేరుకోవచ్చని, మంచిపనులు చేసేవారికి స్వర్గం లభిస్తుందని చెప్పి కాథలిక్ బోధనలను వ్యతిరేకించాడు.

బైబిల్ గ్రంథంపై నమ్మకం ఉండాలన్నాడు. మత గురువులకు, చర్చి అధికారులకు అతీతమైన శక్తులు ఏమీ లేవన్నాడు. బైబిల్ను జర్మనీ భాషలోకి అనువదించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడు. ప్రతి పట్టణంలో ఒక పాఠశాల ఉండాలని, బాలబాలికలు బైబిల్ను చదవాలని చెప్పాడు. ఈ ఉద్యమాన్ని ‘ప్రొటెస్టెంట్ ఉద్యమం’ లేదా ‘మత సంస్కరణ ఉద్యమం’ అంటారు. ఫలితంగా జర్మనీ, స్విట్జర్లాండ్ లోని చర్చిలకు క్యాథలిక్ చర్చితో, పోప్ తో సంబంధాలు తెగిపోయాయి.

స్విట్జర్లాండ్లో ‘ఉల్రిచేజ్వింగ్లి’, జాన్ కాల్విన్లు మార్టిన్ లూథర్ భావాలు ప్రచారం చేసారు. వ్యాపారస్థుల మద్దతుతో సంస్కరణావాదులు పట్టణాలలో ప్రజాదరణ పొందగా గ్రామీణ ప్రాంతాలలో క్యాథలిక్ చర్చి ప్రభావం కొనసాగింది. అనాబాప్టిస్ట్ వంటి జర్మన్ సంస్కర్తలు మరింత తీవ్రవాద మార్గాన్ని అనుసరించారు. అన్ని విధాలుగా సామాజిక, అణచివేతను అంతమొందించాలనే పునర్నిర్మాణ భావాన్ని పెంపొందించాడు. దేవుడు అందరినీ సమంగా సృష్టించాడు. కాబట్టి ఎవ్వరూ పన్నులు చెల్లించనవసరం లేదని ప్రచారం చేసారు. భూస్వామ్య వ్యవస్థలో అణచివేతకు గురైన రైతాంగం ఈ భావాలను ఆదరించింది. క్రీ.శ. 1524లో జర్మనీలో కర్షక తిరుగుబాటు జరిగింది. రైతులు భూస్వామ్య విధానం రద్దు చేయాలని కోరాడు.

మార్టిన్ లూథర్ ఈ తిరుగుబాటును వ్యతిరేకించాడు. దీనిని అణచివేయవలసిందిగా పాలకవర్గాన్ని కోరాడు. అయితే తిరుగుబాటుదారులు ఫ్రాన్స్లోని ప్రొటెస్టెంట్స్క, ఇంతకు ముందు క్యాథలిక్ అధికారులచే ప్రాసిక్యూట్ చేయబడిన వారిని కలిసి ప్రజలకు ఇష్టంలేని అధికారులు అవసరం లేదని, తమకు ఇష్టం వచ్చిన వారిని అధికారులుగా నియమించుకున్నారు. ఫలితంగా ఫ్రాన్స్లో వలే ఇతర ఐరోపా దేశాలలో ప్రొటెస్టాంట్స్కు తమకు ఇష్టం వచ్చిన వారిని ఎన్నుకునే హక్కు క్యాథలిక్ చర్చి ఇచ్చింది. ఇంగ్లాండ్ అధికారులు పోప్తో సంబంధాలు తెగతెంపులు చేసుకున్నారు.

క్యాథలిక్ చర్చి ఈ సంఘటనల ప్రభావం నుండి తప్పించుకోలేకపోవడమే కాక అనేక అంతర్గత సమస్యలకు గురయింది. స్పెయిన్, ఇటలీలలో మత గురువులు పేద ప్రజలకు సహాయం చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. స్పెయిన్లో ప్రొటెస్టెంట్ మతాన్ని ఎదుర్కోవడానికి ఇగ్నేషియాస్లయోలో సొసైటీ ఆఫ్ జీసస్ ను స్థాపించాడు. అతని అనుచరులను జెసూట్స్ అంటారు. పేదలకు సేవ చేయడం, ఇతర సంస్కృతులలో క్రైస్తవాన్ని వ్యాపింపజేయడానికి తమ జీవితాలను అంకితం చేసారు. ప్రొటెస్టెంట్ విప్లవంలో క్యాథలిక్ చర్చి తనను తాను సరిచేసుకుంది.

ప్రశ్న 3.
మానవతావాదం యొక్క లక్షణాలు వివరించండి.
జవాబు:
ఇటలీ నగరంలో విశ్వ విద్యాలయాలు ఆవిర్భవించాయి. 11వ శతాబ్దం నుంచి పాడువ, బొలాగ్నో విశ్వ విద్యాలయాలు న్యాయశాస్త్ర అధ్యయన కేంద్రాలుగా ఉండేవి. వీటి ద్వారా నూతన విద్యా విధానం, మానవతావాదం ఇటలీ నగరంలో ఆదరించబడింది. ఇటలీలో పాఠశాల స్థాయి నుండి విశ్వ విద్యాలయ స్థాయి వరకు అన్ని విద్యా సంస్థలలో మానవతావాదం బోధించబడింది. వీటిలో విద్యతోపాటు సంగీతం, వ్యాయామం బోధించేవారు. ఈ కొత్త విద్యా విధానం వ్యక్తిలో సత్ప్రవర్తన, మంచి జీవితాన్ని తీర్చిదిద్దుకునే మార్గాన్ని నేర్పింది. వ్యక్తిని మానసికంగా, శారీరకంగా, దృఢంగా తయారు చేయడమే మానవతావాదం యొక్క ఉద్దేశ్యం.

15వ శతాబ్ది ప్రారంభంలో మానవతావాది అనే పదాన్ని వ్యాకరణం, అలంకారశాస్త్రం, పద్యభాగం, చరిత్ర, తత్త్వశాస్త్రం బోధించేవారికి వర్తింపచేసారు. లాటిన్ పదమైన మానవశాస్త్రం నుంచి మానవతావాదం అనే పదం అనేక శతాబ్దాల క్రితమే ఆవిర్భవించిందని రోమన్ న్యాయవాది, కథకుడు అయిన సిసిరో పేర్కొన్నాడు. సీజర్ సమకాలికుడైన ఇతడు మానవతావాదం అంటే సంస్కృతి అని పేర్కొన్నాడు. ఇందులోని అంశాలు మత సంబంధమైనవి కాదని సాంఘికంగా వ్యక్తి నైపుణ్యాన్ని చర్చలు, గోష్టుల ద్వారా ఆధునీకరించడం అని పేర్కొన్నాడు. ఈ మానవతావాద విద్య 16వ శతాబ్దం నాటికి ఉత్తర ఐరోపా అంతటా వ్యాపించి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో బహుళ ప్రచారం పొంది చర్చి పాఠశాలల్లో ప్రవేశించింది. ఇంగ్లండ్ లోని ప్రభుత్వ పాఠశాలలైన ఈటన్, హర్లలో ఈ విద్యను బోధించేవారు.

మానవతావాదులు విమర్శనాత్మక దృక్పథాన్ని, సృజనాత్మక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇటలీలోని పెట్రార్క్ సాంప్రదాయక రచనలు, వ్రాత ప్రతులను సేకరించడాన్ని అభిరుచిగా ఎంచుకున్నాడు. మరో మానవతావాది లారెంజోవిల్లా విమర్శనాత్మక దృక్పథాన్ని ఎంచుకున్నాడు. మాకియవెల్లి చారిత్రక అంశాలను చదివి, స్వానుభవంతో రూపకల్పన చేసేందుకు ప్రయత్నించాడు. ప్లాటో విషయాలను గమనించి, నిర్ణయం తీసుకునే విధానాన్ని అనుసరించి ఒక ముగింపుకు వచ్చేవాడు. ఈ మానవతావాదులు వివిధ రకాల మార్గాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. విశ్వ విద్యాలయాల్లో న్యాయశాస్త్రం, వైద్యం, తర్కశాస్త్రం, సాంఘికశాస్త్రం పాఠ్యాంశాలలో క్రమంగా ప్రవేశపెట్టబడ్డాయి. ఇటలీలోనే కాక ఐరోపా అంతటా మానవతావాదం వ్యాపించింది. మానవతావాద ఫలితంగా మానవ జీవితాలపై మతాధిపత్యం బలహీనపడింది. అయితే వీరు మతాన్ని వ్యతిరేకించలేదు.

AP Inter 2nd Year History Study Material Chapter 7 ఆధునిక యుగారంభం

మానవతావాదం క్రమంగా సాహిత్యం, సారస్వతం, సాంకేతిక విద్య, శిల్పకళ, చిత్రకళ, వాస్తుకళ ఇలా అన్ని రంగాలకు ప్రభావితం చేసింది.

సారస్వత రంగం: 14వ శతాబ్దంలో అనేకమంది పండితులు ప్లాటో, అరిస్టాటిల్ వంటివారి రచనలు అనువదించారు. 1453లో కాన్స్టాంట్్నపుల్ ఆక్రమణ సమయంలో గ్రీకు పండితులు బైజాంటైన్ నుంచి ఇటలీ పారిపోతూ, తమతో పాటు అనేక గ్రీకు గ్రంథాలను తీసుకొచ్చారు. ఇటలీ పండితుడు గ్లోవన్ని అరిష్ప 250 గ్రీకు వ్రాతప్రతులను, ఇతర గ్రంథాలను సేకరించాడు. మానవతావాదులు గ్రీకు సాహిత్యాన్ని ఆస్వాదించారు. ప్లాటో ప్రవేశపెట్టిన ప్రేరేపిత పద్ధతి వైజ్ఞానికశాస్త్ర ఆవిర్భావానికి శాస్త్రీయ పద్ధతిలో సైన్సు అధ్యయనం చేయడానికి సహాయపడింది. ఇది సైద్ధాంతిక దృక్పథానికి తోడ్పడింది.

సాంకేతిక పరిజ్ఞానం: అచ్చుయంత్రం కనిపెట్టబడిన తర్వాత ఇటలీ మానవతావాద సంస్కృతి, యూరప్ 15వ శతాబ్దాంతానికి వ్యాపించడానికి కారణం ముద్రిత పుస్తకాలు అందుబాటులోకి రావటం.

సాహిత్యం: లండన్లో ఆంగ్ల మానవతావాది జాన్ కోలేట్, సెయింట్ పాల్ మానవతావాద పాఠశాలలను ప్రారంభించారు. ఇంగ్లాండ్ చక్రవర్తి 8వ హెన్రీ దగ్గర ఛాన్స్లర్గా ఉన్న సర్ థామస్ మోర్ గొప్ప కవి, మానవతావాది. ఇతడు లాటిన్ భాషలో రచించిన యుటోపియాలో ఆదర్శరాజ్యం, సమాజం గురించి వివరించాడు. ఇంకా డాన్టే రచించిన డివైన్ కామెడీ మతపరమైన గ్రంథం. మిగేల్ డీసెర్వాంటెస్ రచించిన డాన్ క్విజోట్ మానవతావాద విలువలను ప్రబోధించేవి.

కళలు: మానవతావాద భావాలు కళలకు, వాస్తు శిల్పానికి కూడా విస్తరించాయి. చిత్రకళ, శిల్పకళ వంటి దృశ్య కళల ద్వారా ఇది యదార్థ రూపాన్ని కలిగి ఉంది. కళాకారులు ప్రకృతిని, ప్రజలను, ప్రదేశాలను యథాతధంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించేవారు. లియోనార్డో డావెన్సీ చిత్రించిన మోనాలిసా చిత్రం, ప్రఖ్యాత శిల్పి డొనాటెల్లో రూపొందించిన కంచు విగ్రహం, గట్టమెలాట, అశ్వికుని విగ్రహం ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. మైఖెలాంజిలో చెక్కిన ‘డేవిడ్’ శిల్పం కూడా ప్రధానమయినది.
మహిళా విద్య పట్ల కూడా క్రమంగా సమాజంలో మార్పు వచ్చింది. వ్యక్తి స్వేచ్ఛ, అతనిలోని సృజనాత్మకతను వెలికితీసి, చర్చి ఆంక్షల నుండి వ్యక్తిని వేరుచేసింది మానవతావాదం.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మైఖెలాంజిలో.
జవాబు:
పాశ్చాత్య ప్రపంచంలోని అత్యుత్తమ చిత్రకారులలో ఒకడైన మైఖెలాంజిలో క్రీ.శ. 1475లో ఇటలీలో జన్మించారు. ఒక శిల్పిగా, చిత్రకారుడిగా, కవిగా, ఆర్కిటెక్ట్ గా ఎన్నో అద్భుత కళాఖండాలను సృష్టించాడు. మైఖెలాంజిలో రోమ్లో పోప్ కోసం సిస్టన్ ఛాపెల్ మీద వేసిన ‘పైటా’ అనే శిల్పం మరియు ‘డేవిడ్’ అనే మరో శిల్పం ఇతనికి ఎంతో కీర్తి, ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. సిస్టెన్ ఛాపెల్ గోడల మీద ఇతను చిత్రించిన ‘లాస్ట్ జడ్జిమెంట్’ అద్భుతమైన చిత్రరాజము. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ ‘లారెంటియన్ లైబ్రరీ’ ని మేనరిస్ట్ విధానంలో నిర్మించాడు. సెయింట్ పీటర్స్ చర్చికి గుండ్రటి పై కప్పు (బాసిల్లా) లాంటి సృజనాత్మక నిర్మాణానికి డిజైన్ని రూపొందించాడు. అయితే ఈ నిర్మాణం మైఖెలాంజిలో మరణం తర్వాత పూర్తయింది. మైఖెలాంజిలో జీవించి ఉండగానే అతని మీద జీవిత చరిత్రలు రచించబడ్డాయి. తన సమకాలికులు ఎంతో ఖ్యాతిని సంపాదించుకుని ప్రపంచంలోని మేటి చిత్రకారులు, శిల్పులలో ఒకడిగా మిగిలిన మైఖెలాంజిలో క్రీ.శ. 1564లో 88 సంవత్సరాల వయసులో మరణించాడు.

ప్రశ్న 2.
మాకియవెల్లి.
జవాబు:
మాకియవెల్లి ఆధునిక కాలంలో రాజనీతిశాస్త్ర పితామహుడిగా పేరొందాడు. క్రీ.శ. 1469లో ఇటలీలో జన్మించారు. మానవతావాదంలో ప్రభావితుడయ్యాడు. మాకియవెల్లి తన గ్రంథం ‘ది ప్రిన్స్’ లో రాజకీయ వ్యవస్థ మీద, ఇటలీ రాజకీయ పరిణామాలపై విరుచుకుపడ్డాడు. మాకియవెల్లి ఫ్లారెన్స్లో దౌత్యాధికారిగా ప్రభువర్గం, వివిధ దేశాల సభలను సందర్శించి అధ్యయనం చేసాడు. ప్రాచీన రోమన్ చరిత్రను అతడు అధ్యయనం చేసాడు. అతడు ‘చర్చి’, ‘రాజ్యం’ రెండూ వేరని, రాజ్యం ఎప్పుడూ అద్భుత శక్తులపై ఆధారపడదని, దీనికొక ప్రత్యేక స్థానం ఉందని అభిప్రాయపడ్డాడు.

రాజ్యం ప్రజల నుండి అధికారం పొందింది కాబట్టి వారి అవసరాలను తీర్చడానికి రాజ్యం తప్పనిసరిగా కృషి చేయాలని అతడు పేర్కొన్నాడు. ఈ విధంగా మాకియవెల్లి రాజ్యం లౌకిక స్వభావాన్ని, సార్వభౌమాధికారాన్ని కలిగి ఉండాలని, ప్రజలను, సంస్థలను, ప్రభుత్వాన్ని క్రమపద్ధతిలో నడపాలని కోరాడు. మాకియవెల్లి క్రీ.శ. 1527లో తన 57వ ఏట
మరణించాడు.

AP Inter 2nd Year History Study Material Chapter 7 ఆధునిక యుగారంభం

ప్రశ్న 3.
ముద్రణాయంత్రం.
జవాబు:
అచ్చుయంత్రం (ముద్రణాయంత్రం) కనిపెట్టబడటం ఆధునిక మానవ చరిత్రలో ఒక ముఖ్య సంఘటన. ప్రప్రథమంగా కాగితాన్ని కనుగొని అచ్చులతో ముద్రించింది చైనీయులు. ఐరోపా వ్యాపారులు మంగోలు చక్రవర్తుల దగ్గర దౌత్యాధికారులుగా పనిచేసి ఈ జ్ఞానాన్ని పొందారు.

క్రీ.శ 1455లో జోహన్స్ గూటెన్బర్గ్ అనే జర్మనీ దేశానికి చెందిన స్వర్ణకారుడు. ఆధునీకరించిన అచ్చుయంత్రాన్ని తయారుచేసాడు. ప్రధమంగా 150 బైబిల్ ప్రతులను ముద్రించారు. నాటి నుండి యూరప్ చరిత్ర మారిందంటే అతిశయోక్తి కాదు. ఎన్నో రకాల శాస్త్రాలకు సంబంధించిన గ్రంథాలు ముద్రితమయ్యాయి. ఇటలీ మానవతావాదం. యూరప్ అంతటా 15వ శతాబ్దాంతానికి వ్యాపించడానికి ముద్రిత పుస్తకాలు అందుబాటులోకి రావడం ప్రధాన కారణం. క్రమంగా ముద్రణ జర్మనీ, నెదర్లాండ్స్, ఇటలీ, ఇంగ్లాండ్లకు వ్యాపించింది. క్రీ.శ. 1560 నాటికి 20 మిలియన్ పుస్తకాలు ముద్రింపబడ్డాయి. తరువాత శతాబ్దానికే 150 నుండి 200 మిలియన్ గ్రంథాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వైద్యం, న్యాయం, జ్యోతిష్యం, లోహ, భూగోళశాస్త్రం వంటి విభిన్న అంశాలపై అపారమైన సాహిత్యం వెలువడింది.

ప్రశ్న 4.
కోపర్నికస్
జవాబు:
పోలెండు చెందిన నికోలస్ కోపర్నికస్ క్రీ.శ. 1473లో జన్మించాడు. ఇతను గణితశాస్త్రంలో, అర్థశాస్త్రంలోను, ఖగోళశాస్త్రంలోను ప్రతిభావంతుడు. తన యొక్క అధ్యయనం, పరిశోధనలతో విశ్వాన్ని గురించిన అనేక రహస్యాలను ఛేదించాడు. నాటికి ప్రచారంలో ఉన్న ‘భూకేంద్ర సిద్ధాంతాన్ని’ తప్పని, ‘సౌరకేంద్ర సిద్ధాంతాన్ని’ ప్రవేశపెట్టాడు. తన పరిశోధనలతో భూమి, చంద్రుడు, నక్షత్రాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని నిరూపించాడు. కోపర్నికస్ సిద్ధాంతం విప్లవాత్మకమైందే కాక చర్చి బోధనలకు వ్యతిరేకమయింది. అర్థ శతాబ్దం తర్వాత కోపర్నికస్ సిద్ధాంతాన్ని జర్మన్ శాస్త్రవేత్త జాన్ కెప్లర్, ఇటాలియన్ శాస్త్రవేత్త గెలీలియో బలపరచారు. ఈ సిద్ధాంతం ఎందరిలోనో పాత నమ్మకాలను, మూఢ నమ్మకాలను తొలగించింది.

ప్రశ్న 5.
మోనాలిసా.
జవాబు:
ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడిగా గుర్తింపు పొందిన లియోనార్డో డావెన్సీ (1452 – 1519) గీసిన చిత్రాలలో మోనాలిసా, ది లాస్ట్ సప్పర్ ముఖ్యమైనవి. వీటిలో బాగా ప్రజాదరణ పొందింది మోనాలిసా, ఇటలీకి చెందిన లియోనార్డో డావెన్సీ క్రీ.శ. 1503-1506 మధ్య కాలంలో ఈ చిత్రాన్ని వేసిఉంటాడని పరిశోధకులు భావిస్తున్నారు. శతాబ్దాలు గడిచినా నేటికీ అందులోని చిరుమందహాసం, స్త్రీ సహజత్వం ఇట్టే చూపరులను ఆకర్షిస్తోంది. లియోనార్డో సమకాలికుల ప్రకారం ఈ చిత్రాన్ని చిత్రించడానికి చాలా కాలం తీసుకున్నాడని తెలుస్తుంది. ఈ చిత్రంపై ఎన్నో కట్టుకథలు ప్రచారంలోకి వచ్చాయి. క్రీ.శ. 1911లో ఈ చిత్రం చోరీకి గురైంది. చివరికి 1913 నాటికి ఈ చిత్రం ఫ్రాన్స్లోని లౌరే మ్యూజియంకి చేరింది. నేటికీ ఈ చిత్రం ఫ్రాన్స్లోని మ్యూజియంలో జనులకు కనువిందు చేస్తుంది.

ప్రశ్న 6.
ది లాస్ట్ సప్పర్.
జవాబు:
ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డావెన్సీ (1452 – 1519) సృష్టించిన మరొక అద్భుత చిత్రం ది లాస్ట్ సప్పర్. ఈ చిత్రాన్ని డావెన్సీ 1495-1498 మధ్య కాలంలో చిత్రించినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రం ఎక్కువమంది విమర్శకుల, పరిశోధకుల నిశిత పరీక్షలకు గురైన చిత్రరాజం. జాన్ సువార్త 13: 21 ప్రకారం ఏసు తన పన్నెండుమంది శిష్యులతో విందుకు కూర్చుని ఉన్న దృశ్యాన్ని అద్భుతంగా చిత్రించాడు. ఈ చిత్రం ఇటలీలోని మిలాన్ నగరంలో ఉంది. లాస్ట్ సప్పర్ చిత్రం ఏసు 12 మంది శిష్యులలో ఒకడు నమ్మకద్రోహం చేయబోతున్నాడు అని చెప్పినపుడు అక్కడున్న వారి హావభావాలను ఆ చిత్రంలో ప్రతిఫలించేటట్లు చేయగలిగాడు. లియోనార్డో ఈ చిత్రంలో ఎన్నో రహస్య సంకేతాలు నిక్షేపం చేసాడని కొందరి నమ్మకం.

AP Inter 2nd Year History Study Material Chapter 7 ఆధునిక యుగారంభం

ప్రశ్న 7.
మార్టిన్ లూథర్.
జవాబు:
రోమన్ క్యాథలిక్ చర్చి దురాగతాలను వ్యతిరేకించే వారికి వేదాంతశాస్త్ర అధ్యాపకుడైన జర్మన్ మత గురువు మార్టిన్ లూథర్ (1483 – 1546) తిరుగుబాటు నాయకుడయ్యాడు. మార్టిన్ లూథర్ క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా ప్రచార ఉద్యమం మొదలుపెట్టాడు.

దైవ సంబంధం కోసం మత గురువు అనుమతి అవసరం లేదని ప్రచారం చేసాడు. విశ్వాసం ఒక్కటే సరైన జీవన విధానమని, దేవునిపై పూర్తి విశ్వాసముంచాలని, అదే స్వర్గానికి దారి చూపిస్తుందని అతడు చెప్పాడు. క్యాథలిక్ బోధనలను వ్యతిరేకించాడు. బైబిల్ గ్రంథంపై నమ్మకం ఉండాలన్నాడు. చర్చి అధికారులకు అతీత శక్తులు ఉండవని బోధించాడు. మార్టిన్ లూథర్ 1524లో జర్మనీలో జరిగిన కర్షక తిరుగుబాటును వ్యతిరేకించాడు. మార్టిన్ లూథర్ బోధనల వలన ప్రొటెస్టెంట్ ఉద్యమం జరిగి, క్యాథలిక్ చర్చికి ప్రతిగా ప్రొటెస్టెంట్ చర్చి ఏర్పడింది. రోమ్లో జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ వంటి దేశాలకు మతపరమైన సంబంధాలు తెగిపోయాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 6 ఐరోపాలో భూస్వామ్య పద్ధతి

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 6th Lesson ఐరోపాలో భూస్వామ్య పద్ధతి Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 6th Lesson ఐరోపాలో భూస్వామ్య పద్ధతి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఐరోపా భూస్వామ్య లక్షణాలను వివరించుము.
జవాబు:
‘ఫ్యూడ్’ అనగా ‘ఒక చిన్న భూభాగం’ అని అర్థం. ఈ వ్యవస్థ ఇంగ్లాండ్, ఫ్రాన్స్, దక్షిణ ఇటలీలలో ఏర్పడింది. మధ్యయుగంలో తరచూ సంభవించే యుద్దాలలో ప్రజల ప్రాణాలను, సంపదను, భూములను కాపాడుకోవడానికి ఏర్పడిన వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ. ఇది ఒక రకమైన సామాజిక వ్యవస్థ ఆర్థికంగా చెప్పాలంటే ఫ్యూడలిజం అనగా భూమి, వ్యవసాయ ఉత్పత్తులు భూమికి సంబంధించిన భూస్వాములు మరియు రైతులు మధ్య ఉండే సంబంధాల వ్యవస్థగా చెప్పవచ్చు.

భూస్వామ్య వ్యవస్థ మూలాలు పవిత్ర రోమన్ చక్రవర్తి కాలం (8వ శతాబ్దం) నుండే ప్రారంభమైనప్పటికి క్రీ.శ. 11వ శతాబ్దం నుండి భూస్వామ్య వ్యవస్థ ఒక జీవన విధానంగా మారింది. దాదాపు ఐరోపాలోని అనేక ప్రాంతాలలో ఏర్పడింది. భూస్వామ్య వ్యవస్థ, రాచరిక వ్యవస్థ బలహీనపడి, రాజ్యపాలన వికేంద్రీకరణ జరిగి, రాజ్యవ్యవస్థకు మూలాధారమైన సైనికులను పోషించడానికి రాజు తనకు విశ్వాసపాత్రులైన కొందరు ప్రభువులకు కొంత ప్రాంతంపై అధికారమిచ్చి వారిని తనకు విశ్వాసపాత్రులుగా ఉంచేవారు. కాలక్రమంలో ఈ వ్యవస్థ వంశపారంపర్యమైంది. భూస్వామ్య వ్యవస్థ రైతుల, సామాన్యుల, శ్రామికుల యొక్క శ్రమను దోపిడీ చేసింది.

సామాజిక వ్యవస్థ: భూస్వామ్య వ్యవస్థలో మతాధికారులు (క్లెర్జీ) అత్యున్నత స్థానంలో ఉండేవారు. రాజులు వీరికిచ్చిన భూములపై స్వతంగా పన్నులు విధిస్తూ రాజుపై ఆధారపడకుండా స్వతంత్రంగా, శక్తివంతంగా ఉండేవారు. చర్చికి ‘పోప్’ ఉన్నతాధికారి, కాగా ఐరోపాలో ఎందరో క్రైస్తవులు, బిషప్లు ఎస్టేట్లు కలిగి ఉండేవారు. పైగా వీరు మొదటి శ్రేణి పౌరులుగా పరిగణింపబడేవారు. వీరికి ఎటువంటి పన్నుల బెడద ఉండేది కాదు.

AP Inter 2nd Year History Study Material Chapter 6 ఐరోపాలో భూస్వామ్య పద్ధతి

సమాజంలో రెండవ స్థానం ప్రభువర్గానిది. వీరికి భూములపై అధికారం ఉండటంచే వీరికి ఆ హోదా లభించింది. భూస్వాములు మెనోరియల్ ఎస్టేట్స్కు అధిపతులుగా ఉండేవారు. వీరి క్రింద ఉండే రైతులు, అర్థ బానిస రైతులు, కార్మికులను తమ అవసరాల కోసం పని చేయించుకునేవారు. వీరిపై పన్నుల బెడద అధికం. శ్రమ దోపిడి విపరీతంగా ఉండేది.

సమాజంలో మూడవ స్థానం రైతులు, సామాన్యులు ఉండేవారు. స్వేచ్ఛ కలిగిన రైతులు తమ ప్రభువుల వద్ద భూమిని, కౌలుకు తీసుకుని సాగు చేసేవారు. వీరిని వెసల్ (కౌలుదారుడు) అనేవారు. కౌలుకిచ్చే భూమిని ‘ఫీఫ్’ అనేవారు. ప్రభువుకు కౌలుదారుడు రక్షణ కల్పించినందుకు రకరకాల సేవలు చేయాలి. రాజు వీరి నుండి ‘టైలీ’ అనే పన్నును వసూలు చేస్తారు. సెర్చ్లోనే బానిసలకు ఏ విధమైన హక్కులుండవు వీరిని అర్థ బానిసలుగా పరిగణించబడేవారు.

ఆర్థిక పరిస్థితులు: క్రీ.శ.11వ శతాబ్దం నుండి ఐరోపాలో ఉష్ణోగ్రతలు ఎక్కువ అవడంతో మంచు తగ్గి, వ్యవసాయ కాలం పెరగడంతో ఐరోపాలో అడవులు తగ్గి, వ్యవసాయ భూమి పెరిగింది. మొదట వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం తక్కువ. మనుషులే పశువులుగా పనిచేసేవారు. ఇంత కష్టపడినా రైతులకు సరైన ప్రతిఫలం లభించేది కాదు. ఇది క్రమంగా సామాజిక ఉద్రిక్తతలకు దారితీసింది.

కాలక్రమంలో సాంకేతికంగా చాలా మార్పులు వచ్చాయి. భారీ యంత్రాలతో అధిక ఉత్పత్తులను సాధించగలిగారు. క్రమంగా భూస్వామ్య ఆర్థిక వ్యవస్థలో డబ్బు ముఖ్యపాత్ర పోషించింది. ప్రభువులు కూడా ధాన్యానికి, సేవలకు బదులు డబ్బు రూపంలో వసూలు చేయసాగారు. రైతులు కూడా తమ పంటలను పట్టణాలకు తీసుకెళ్ళి డబ్బుకు అమ్మటం ప్రారంభించినారు.

వ్యవసాయం విస్తరించడంతో జనాభా పెరిగి క్రమంగా నగరీకరణకు దారి తీసింది. పెరిగిన జనాభా వ్యవసాయ అధిక ఉత్పత్తి పోషించగలిగింది. రైతులు పట్టణాలకు వెళ్ళి కొనుగోలు, అమ్మకాలు చేయడంతో క్రమంగా నగరాలు విస్తరించుకుంటూ పోయి, వాటి నిర్వహణకు ప్రభుత్వ అధికారులు అవసరమయ్యారు. సేవకులు, సేవలకు బదులుగా ప్రభువులకు పన్ను డబ్బు రూపంలో చెల్లించారు. గ్రామాలలోని సేద్యపు బానిసలు పారిపోయి రహస్యంగా నగరాలలో తలదాచుకొనేవారు. ‘పట్టణ స్వేచ్ఛా వాయువునిస్తుంది’. అనే సామెత ఏర్పడింది. 15వ శతాబ్దానికి రాజులు బలపడినందున, ప్రజలలోని వ్యతిరేకత వలన కాని క్రమంగా భూస్వామ్య వ్యవస్థ అంతరించిపోయింది.

ఈ విధంగా భూస్వామ్య (ఫ్యూడల్) వ్యవస్థలో ‘మతం’ పూర్తి అధికారాన్ని చలాయిస్తూ రాజరిక వ్యవస్థను మార్చివేసింది. మతాధికారులు మతం పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేసారు. రాజులు బలహీనులగుటచే మధ్యవర్తులను నియమించి, వారు విలాసాలకు, భోగాలకు, అనవసర యుద్ధాలకు ఖర్చు పెట్టి, ఆ మొత్తాన్ని సామాన్యులు లేక రైతుల నుంచి అధిక పన్నుల రూపంలో దోపిడి చేసేవారు. సేద్యపు బానిసలు సెక్స్లుగా అర్థబానిసత్వంలో జీవించారు. భూస్వాములు చివరకు వీరి వ్యక్తిగత, కుటుంబ జీవితాలలో కూడా జోక్యం చేసుకుని వారి జీవితాలను ఛిద్రం చేసేవారు. అల్ప సంఖ్యాకులు అధికులను దోపిడీ చేస్తూ వారు సుఖంగా ఉంటూ, అధిక సంఖ్యాకులు కష్టాల్లో ఉండే వ్యవస్థే యూరప్ లో సుదీర్ఘకాలం రాజ్యమేలింది.

ప్రశ్న 2.
భూస్వామ్య విధాన నిర్మాణమును తెలియజేయుము.
జవాబు:
ఐరోపా ఖండంలో రాజ్యాల మధ్య తరచు యుద్ధాలు జరుగుతుండేవి. అందువలన ప్రజల ప్రాణాలను, సంపదను, భూమిని రక్షించుకోవడానికి ఏర్పడిన సామాజిక వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ. ‘ఫ్యూడ్’ అనగా ఒక చిన్న భూభాగము అని అర్థం. భూస్వామ్యానికి చెందిన మూలాలు పవిత్ర రోమన్ చక్రవర్తి కాలం నుండే ప్రారంభమై క్రీ.శ. 11వ శతాబ్దం నుండి ఐరోపాలో ఒక జీవన విధానంగా మారినది.

భూస్వామ్య వ్యవస్థ శ్రేణులు: ఫ్రాన్స్లో భూస్వామ్య వ్యవస్థ విభిన్న రకాలుగా విభజితమై ఉంది. వాటిలో మతాధికారులు (క్లెర్జి) మొదట శ్రేణి అధికార వర్గం కాగా, ప్రభువులు (నోబిలిటి) రెండవ శ్రేణి అధికార వర్గం కాగా, రైతులు, సామాన్య ప్రజలు మూడవ శ్రేణి (సామాన్యులు) వర్గంగా ఏర్పడింది.

AP Inter 2nd Year History Study Material Chapter 6 ఐరోపాలో భూస్వామ్య పద్ధతి

మొదటి శ్రేణులు (మతాధికారులు): ఫ్రాన్స్లోని కాథలిక్ చర్చికి తన చట్టాలను తానే తయారు చేసుకోవడం, స్వంత భూములు, రాజులచే ఇవ్వబడిన గ్రామాలపై పన్నులు విధించే అధికారం ఏర్పడింది. ఈ విధంగా రాజుపై ఆధారపడకుండా ఒక శక్తివంతమైన సంస్థగా చర్చి ఉండేది. పశ్చిమ ఐరోపా చర్చికి పెద్దగా ‘పోప్’ వ్యవహరించేవారు. ఐరోపాలోని క్రైస్తవులు, బిష నిబంధనల ప్రకారం నడుచుకునేవారు. వీరికి ఎస్టేట్లు, భూములు ఉండటమే కాక వీరు మొదటి శ్రేణికి చెందినవారుగా పరిగణించబడేవారు.

ప్రజలు ప్రతి ఆదివారం చర్చిలో పూజారి చేసే ప్రార్థనా కార్యక్రమాలు, బోధనలను వినటానికి వెళుతుండేవారు. అయితే ప్రతి ఒక్కరు పూజారి కాలేరు. అదే విధంగా సెర్ఫ్ లు, స్త్రీలు, పూజారులు కావడానికి అనర్హులు. పుజారి వివాహం చేసుకోరాదు. ప్రజలు తమ సంపాదనలో 10 శాతం పన్నుల రూపంలో చర్చికి విధిగా చెల్లించాలి. దీనిని ‘టైత్’ అంటారు. ధనవంతులు చర్చి అభివృద్ధికి ధనసహాయం చేసేవారు. చర్చి అనుబంధ వ్యవస్థ మోనాస్త్రిలు క్రమంగా విద్య, వైద్య, సేవా కేంద్రాలుగా మారాయి.

ప్రశ్న 3.
14వ శతాబ్దంలో జరిగిన మార్పులను తెలియజేయుము.
జవాబు:
క్రీ.శ. 13వ శతాబ్దం చివరి నాటికి ఉత్తర ఐరోపాలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి విపరీతమైన మంచు, చలి పెరగటం వలన పంట, ఉత్పత్తులలో బాగా మార్పులు వచ్చాయి. వ్యవసాయ నేలలు కూడా తగ్గిపోయాయి. దీనికి తోడు తుఫానులు మరియు సముద్ర అలలు ఉవ్వెత్తున చెలరేగడం వల్ల పంట పొలాలు దెబ్బతిని ప్రభుత్వానికి రావలసిన ఆదాయం బాగా తగ్గిపోయింది. నేలను బాగా లోతుగా సంవత్సరాల తరబడి దున్నటం వలన పంట పొలాల మార్పిడి జరిగి ఉత్పత్తి తగ్గిపోయింది. అడవిలో పశువులకు గడ్డి తగ్గిపోయింది. పట్టణాలలో జనాభా విపరీతంగా పెరగడం వలన సహజవనరులు తరిగిపోయి క్షామాలు ఏర్పడ్డాయి. క్రీ.శ 1315, 1317, 1320లలో ఐరోపాలో భయంకరమైన కరువులు ఏర్పడ్డాయి.

సామాజిక అలజడి: క్రీ.శ.1323లో ఐరోపాలోని ప్లాండర్స్లో, 1358లో ఫ్రాన్స్, 1381లో ఇంగ్లాండ్లో రైతులు తిరుగుబాట్లు చేసారు. ప్రభువులు ఈ తిరుగుబాట్లను అణచివేసినప్పటికీ అంతకు ముందు భూస్వామ్య పద్ధతిలో ప్రభువులు అధికారాలు పొందినట్లు పొందలేకపోయారు.

బ్లాక్ డెత్: యూరప్ ఖండాన్ని మొత్తం కుదిపేసిన ఘటన ‘బ్లాక్ డెత్’ సంఘటన. క్రీ. శ. 1346 – 53 వరకు ప్రాణాంతక ప్లేగు మహమ్మారి వ్యాధి యూరప్ అంతటా వ్యాపించింది. ఎటుచూసినా చావులతో ప్రజానీకం అల్లాడిపోయింది. యూరప్ ఖండంలో 75 నుండి 200 మిలియన్ల వరకు ప్రజలు ఈ వ్యాధులతో చనిపోయారని ఒక అంచనా. యూరప్ జనాభాలో 30 నుంచి 60 శాతం వరకు ఈ మహమ్మారి బారిన పడి మరణించారు.

ఇంగ్లాండ్ – ఫ్రాన్స్ల మధ్య వంద సంవత్సరాల యుద్ధం: యూరప్ లోని రెండు ప్రముఖ రాజ్యాలైన ఇంగ్లాండ్ – ఫ్రాన్స్ మధ్య 1338 నుంచి 1453 వరకు అనేక మారులు యుద్ధాలు జరిగాయి. రెండు రాజ్యాలతో ఎన్నో రాజ్యాలుగా సంబంధాలు ఏర్పరచుకుని యుద్ధాలు చేసాయి. మధ్యయుగాలలో జరిగిన యుద్ధాలలో ప్రముఖమైనవి. దాదాపుగా ఐదు తరాల రాజులు యుద్ధాలలో నిమగ్నులయ్యారు. రెండు దేశాలలోను తీవ్రమైన జాతీయ భావనలను రేకెత్తించింది. యుద్ధం ముగిసే సరికి ఫ్యూడల్ ప్రభువులు, సైనికులు ఎక్కువయ్యారు. ఇంగ్లాండ్ ప్రధానంగా ఒక ద్వీపంగా మిగిలింది.

సామాజిక మార్పులతో పాటు రాజకీయాలలో కూడా అదే స్థాయిలో మార్పులు వచ్చాయి. 15,16 శతాబ్దాలలో ఐరోపా రాజులు తమకున్న సైనిక, ఆర్థిక శక్తుల వల్ల బలపడినారు. చరిత్రకారులు వీరిని ‘కొత్తరాజులు’ అని వర్ణించారు. ఫ్రాన్స్లో 11వ లూయి, ఆస్ట్రియాలో మాక్సిమిలయన్, ఇంగ్లండ్లో 7వ హెన్రీ, స్పెయిన్లో ఇజబెల్లా మరియు ఫెర్డినాండ్ రాజులు బలమైన రాజులుగా తయారైనారు. భూస్వామ్య పద్ధతిలో రాజు సైన్యం కొరకు సేవకుడి మీద ఆధారపడి బలహీనంగా ఉన్నవాడు, ఆ పద్ధతి సన్నగిల్లటం తానే ప్రత్యక్షంగా ప్రజలపై పన్నులు వేసి సైన్యాన్ని నిర్వహిస్తూ ప్రభువులకు భూస్వాముల అవసరం లేకుండా పోయింది. ఆ స్థానంలో రాజులు తమ అధికారాలను పెంచుకున్నారు. రాజులే స్వయంగా కాల్బలాన్ని, నూతన తుపాకులు, మందు గుండు సామాగ్రిని తయారు చేసుకొని తను అధికారంలోనికి తెచ్చుకున్నారు.

క్రీ.శ.1461-1559 కాలంలో ఫ్రాన్స్, 1484 – 1556లో స్పెయిన్లో, క్రీ.శ 1485 – 1548 మధ్యకాలంలో ఇంగ్లాండ్లో నూతన రాజరిక వ్యవస్థలేర్పడినాయి. ఇంగ్లాండ్లో 1498, 1536, 1546, 1553లలో తిరుగుబాట్లు రాగా వాటిని అణచి వేశారు. ఫ్రాన్స్లో లూయీ రాజు, డ్యూక్లలో మరియు యువరాజులకు వ్యతిరేకంగా పోరాడటానికి చాలా కష్టపడవలసి వచ్చింది. చిన్న విస్తరణను వ్యతిరేకించారు. 16వ శతాబ్దంలో ఫ్రాన్స్లో భూస్వాములు, స్థానిక అసెంబ్లీల సభ్యులు, రాజులు అధికారం జరిగిన మత యుద్ధాలు ఒక రకంగా రాజు యొక్క అధికారాలకు మరియు ప్రాంతీయ అధికారులు స్వేచ్ఛకు మధ్య జరిగిన యుద్ధంగా అర్థం చేసుకోవచ్చు.

AP Inter 2nd Year History Study Material Chapter 6 ఐరోపాలో భూస్వామ్య పద్ధతి

ప్రభువర్గం చాలా తెలివిగా నూతనంగా అధికారం పొందిన రాజులతో పూర్తిగా ఘర్షణకు దిగకుండా వారిని సమర్ధిస్తూ, వారికి విధేయులుగా మారినారు. అందువల్లనే విపరీతమైన రాజుల అధికార స్వరూపాన్ని, ఆధునిక భూస్వామ్య వ్యవస్థగా భావించవచ్చు. భూస్వామ్య పద్ధతిలో భూస్వాములు ఏ విధంగానైతే సమాజంలో అధికారం చెలాయించారో వీరి పాలనలో పెద్ద పెద్ద ఉద్యోగాలు పొంది అటువంటి అధికారాలనే తిరిగి పొందినారు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మేనర్ పద్ధతి నిర్మాణం.
జవాబు:
ఐరోపాలోని భూస్వామ్య వ్యవస్థలో ప్రముఖమైనది మెనోరియల్ ఎస్టేట్. ప్రభువులు లేక భూస్వాములు తమ అధికారంలో కొన్ని గ్రామాలను ఉంచుకొనేవారు. అయితే అందరు భూస్వాముల ఆధీనంలో నిరిష్ట సంఖ్యలో గ్రామాలు ఉండేవి కావు. చిన్న మేనర్ ఎస్టేట్ అంటే పన్నెండు కుటుంబాలు ఉండే ప్రాంతం. ఈ మేనర్ ఎస్టేట్ లో ప్రభువు నివాస ప్రాంతాన్ని ‘మేనర్స్’ అంటారు. ఆ గ్రామాలలో ఉండే కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, గృహ నిర్మాణదారులు మొదలగువారు ఆయా కార్యక్రమాలు నిర్వహించాలి. స్త్రీలు నూలు వడకడం, బట్టలు నేయడం, పిల్లలు ద్రాక్షరసం (వైన్) తయారు చేయాలి. వ్యవసాయదారులు ప్రభువు కొరకు పంటలు పండించాలి. ఆ ఎస్టేట్లో కార్యక్రమాలన్నీ ప్రభువు కనుసన్నలలో జరగాలి. ఎస్టేట్ సైన్యం ఉండే భవనాన్ని ‘కాజెల్’ అనేవారు.

‘మేనర్’ లు స్వయం సమృద్ధిగా ఉండేవి కావు. అన్ని వస్తువులు మేనర్లో తయారవలేకపోవడం దీనికి ప్రధాన కారణం. ఉదా: ఉప్పు, పిండిమరరాళ్ళు, లోహపు పనిముట్లు మొదలైనవి బయట నుంచి తెచ్చుకోవాలి. ప్రభువులకు ఖరీదైన, విలావంతమైన గృహోపకరణాలు, సంగీత వాయిద్య పరికరాలు, ఆభరణాలు మొదలగు వాటిని ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకునేవారు.

ప్రశ్న 2.
ఫ్రాన్స్లో మతాధికారుల శ్రేణి రూపము.
జవాబు:
ఫ్రాన్స్లో మతాధికారులు మొదటి శ్రేణికి చెందినవారు. సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉంటూ, పాలకులను, ప్రజలను ప్రభావితం చేసే స్థాయిలో ఉండేవారు. మతాధికారులకు పన్నుల నుండి మినహాయింపు ఉండేది. ఫ్రాన్స్లోని కాథలిక్ చర్చికి తన చట్టాలను తానే తయారు చేసుకోవడం, స్వంత భూములు, రాజులచే ఇవ్వబడిన గ్రామాలపై పన్నులు విధించే అధికారం ఏర్పడింది. ఈ విధంగా రాజుపై ఆధారపడకుండా ఒక శక్తివంతమైన సంస్థగా చర్చి ఉండేది. పశ్చిమ ఐరోపా చర్చికి పెద్దగా ‘పోప్ ‘ వ్యవహరించేవారు. ఐరోపాలోని క్రైస్తవులు, బిషప్ నిబంధనల ప్రకారం నడుచుకొనేవారు. వీరికి ఎస్టేట్లు, భూములు ఉండేవి.

ప్రజలు ప్రతి ఆదివారం చర్చిలో పూజారి చేసే ప్రార్థనా కార్యక్రమాలు, బోధనలు వినడానికి వెళుతుండేవారు. అయితే ప్రతి ఒక్కరూ పూజారి కాలేరు. అదే విధంగా సెర్ఫ్లు, స్త్రీలు పూజారులుగా కావడానికి అనర్హులు. పూజారి వివాహం చేసుకోరాదు. ప్రజలు తమ సంపాదనలోని 10శాతం పన్నుల రూపంలో చర్చికి విధిగా చెల్లించాలి. దీనిని ‘టైత్’ అని పిలుస్తారు. ధనవంతులు చర్చి అభివృద్ధికి ధనసహాయం చేసేవారు. ఈ విధంగా మధ్యయుగంలో మతాధికారులు పూర్తి సౌఖ్యాలు అనుభవిస్తూ, రాచరికానికి పూర్తిగా మద్దతు పలికి, మతం పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందికి గురి చేసేవారు.

ప్రశ్న 3.
నాల్గవ శ్రేణి.
జవాబు:
వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందడంతో యూరప్ రోమన్ నాగరికత పతనంతో దెబ్బతిన్న పట్టణాలన్నీ తిరిగి వెలిసాయి. వ్యవసాయ రంగంలోని విపరీత ఉత్పత్తి అధిక జనాభా గల పట్టణాలకు ఆహారాన్ని అందించగలిగింది. రైతులు తమ మిగులు ధాన్యాన్ని పట్టణాలకు వెళ్ళి అమ్ముకొని తమకు కావలసిన దుస్తులు, వస్తువులు, పరికరాలు కొనుగోలు చేసేవారు. కొనుగోలు, అమ్మకాలకు అనువైన స్థలాలు సంతలుగా మారాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 6 ఐరోపాలో భూస్వామ్య పద్ధతి

సేవకులు సేవలకు బదులుగా తమకు దగ్గరగా ఉన్న పట్టణాలలో ప్రభువుకు పన్ను డబ్బు రూపంలో చెల్లించారు. గ్రామాలలో వ్యవసాయ కుటుంబాల నుండి వచ్చిన యువకులకు పట్టణాలలో వారు చేయగల పనులకు నగదు రూపంలో చెల్లింపులు లభించాయి. (పట్టణం స్వేచ్ఛా వాయువును ఇస్తుంది.) అనే సామెత ఏర్పడింది. చాలామంది సేద్యపు బానిసలు గ్రామాల నుండి పారిపోయి పట్టణాలలో రహస్యంగా తలదాచుకున్నారు. ఏ సెర్ఫ్ అయిన ఒక సంవత్సరము ఒక రోజు లోపల ప్రభువుచే కనిపెట్టబడకపోయిన ఆ సెర్ఫ్క స్వతంత్రమొచ్చినట్లు. ఆ విధంగా పొందిన స్వేచ్ఛతో ప్రజలు నైపుణ్యంతో సంబంధం లేని పనులు చేయడానికి అలవాటుపడ్డారు. వీరి సంఖ్య ఎక్కువయ్యే కొలది నైపుణ్యం కలిగిన బ్యాంకర్లు, లాయర్లు అవసరమయ్యారు. పెద్ద పట్టణాలంటే 30,000 మంది ప్రజలు ఉండటం. ఈ ప్రజలే నాల్గవ శ్రేణికి చెందినవారు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సేద్యపు బానిసత్వము.
జవాబు:
మధ్యయుగ యూరప్లో స్వేచ్ఛలేని రైతులను ‘సెర్ఫ్’లు అని పిలిచేవారు. ఈ రైతులకు స్వంత భూములుండవు. వీరు ప్రభువుల భూమిలో రైతు కూలీలుగా పనిచేయాలి. ఆ ప్రతిఫలమంతా ప్రభువుకే చెందుతుంది. వీరికి వేతనాలుండవు. ఎస్టేట్ బయటకు వెళ్ళే స్వేచ్ఛ లేదు. వీరికి సంబంధించిన ప్రతి విషయం ప్రభువుల పర్యవేక్షణలో జరగాలి.

ప్రశ్న 2.
పవిత్ర ఒడంబడిక.
జవాబు:
రైతులు, సామాన్యులు, భూస్వాములకు, మతాధికారులకు సేవకులు. వీరు యజమానికి విధేయుడిగా ఉండాలి. ప్రతిగా ప్రభువు సేవకుడికి రక్షణగా ఉంటాడు. ఇది ఇద్దరి మధ్య జరిగే ఒప్పందం. రైతుకు భూమిని కౌలుకు ఇచ్చే ఈ ఒప్పంద వేడుకలో ప్రభువు, తన సేవకుడికి ఒక రాతప్రతిని గాని, కొంత మట్టిముద్ద కానీ సంకేతంగా ఇస్తూ భూమిపై హక్కులు ఇస్తాడు. దీనికి ప్రతిఫలంగా సేవకుడు బైబిల్ మీద ప్రమాణం చేసి తాము ఎల్లప్పుడూ ప్రభువులకు విధేయులుగా ఉంటామని చర్చిలో ఒప్పందం చేసుకోవాలి.

ప్రశ్న 3.
పవిత్ర రోమన్ చక్రవర్తి.
జవాబు:
పవిత్ర రోమన్ సామ్రాజ్యాన్ని పాలించే ప్రభువు పవిత్ర రోమన్ చక్రవర్తి. ‘పోప్’ ఆశీస్సులతో పవిత్ర రోమన్ చక్రవర్తి నియమింపబడతాడు. పవిత్ర సామ్రాజ్యానికి చక్రవర్తిగా క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తూ, దాని సంరక్షణగా బాధ్యతను చక్రవర్తి స్వీకరించేవాడు. పవిత్ర రోమన్ సామ్రాజ్య వ్యవస్థ క్రీ. శ. 1453లో కాన్స్టాంటినోపుల్ పతనం వరకు కొనసాగింది. క్రీ. శ. 742లో మొదటి చార్లెస్ పవిత్ర రోమన్ చక్రవర్తి అయ్యాడు. వీరి పాలనా కాలంలోనే భూస్వామ్య వ్యవస్థ మూలాలు ఆరంభమయ్యాయి.

ప్రశ్న 4.
మఠం (మోనాస్త్రి).
జవాబు:
క్రైస్తవమతంలో వెలసిన ఒక ప్రత్యేక వ్యవస్థ ‘చర్చి అనుబంధ వ్యవస్థ’ ‘మోనాస్త్రి’. క్రీ. శ. 529లో ఇటలీ దేశస్థుడైన సెయింట్ బెనెడిక్ట్ బుర్గుండీలో స్థాపించాడు. ‘మోనాస్త్రి అనే పదం ‘మోనోస్’ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. మోనోస్ అనగా ఏకాంత జీవితం గడుపుట అని అర్థం. మతంపై ధృఢ విశ్వాసం ఉన్నవారు సన్యాసులుగా మారి దైవ కార్యంలో నిమగ్నులయ్యేవారు. కాలక్రమేణా ఈ మోనాస్త్రీలు పెద్ద భవనాలతో ఎస్టేట్లుగా మారి విద్య, వైద్య, సేవలు చేయడం ఆరంభించాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 6 ఐరోపాలో భూస్వామ్య పద్ధతి

ప్రశ్న 5.
ఇంగ్లాండ్.
జవాబు:
ఆంగ్లిస్ మరియు సాక్షన్ జాతులు మధ్య ఐరోపాలో క్రీ.శ. 6వ శతాబ్దంలో వచ్చి ప్రస్తుత ఇంగ్లండ్ ప్రదేశంలో స్థిరపడినారు. ‘ఇంగ్లాలాండ్’ అనే ప్రాచీన ఆంగ్ల పదమే ఇంగ్లండ్ గా మారింది. ఇంగ్లలాండ్ అనగా లాండ్ ఆఫ్ ఏంజెల్స్ (దేవదూతల ప్రదేశం) అని అర్థం. 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవంతో ఇంగ్లాండ్తో పాటుగా, ప్రపంచ చరిత్రే మారిపోయింది. ప్రపంచంలోని ఎన్నో దేశాలను ఆక్రమించుకుని దోచుకుని, ఆ దేశాలలో వలసలు ఏర్పాటు చేసుకున్నారు. మన దేశం కూడా వీరి చెర నుంచి 1947లో విముక్తి చెందింది.

ప్రశ్న 6.
భూస్వామ్యము (ఫ్యూడలిజమ్).
జవాబు:
‘ఫ్యూడ్’ అనగా ‘ఒక చిన్న భూభాగం’ అని అర్థం. ఈ వ్యవస్థ ఇంగ్లాండ్, ఫ్రాన్స్, దక్షిణ ఇటలీలలో ఏర్పడింది. మధ్యయుగంలో తరచూ సంభవించే యుద్ధాలలో ప్రజల ప్రాణాలను, సంపదను, భూములను కాపాడుకోవడానికి ఏర్పడిన వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ. ఇది ఒక రకమైన సామాజిక వ్యవస్థ, ఆర్థికంగా చెప్పాలంటే ఫ్యూడలిజం అనగా భూమి, వ్యవసాయ ఉత్పత్తులు, భూమికి సంబంధించిన భూస్వాములు మరియు రైతుల మధ్య ఉండే సంబంధాల వ్యవస్థగా చెప్పవచ్చు.

AP Inter 2nd Year History Study Material Chapter 5 సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 5th Lesson సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్ Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 5th Lesson సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మంగోలులను తెలుసుకొనుటకు గల ఆధారాలేవి?
జవాబు:
సంచారజాతుల, తెగల చరిత్రను, వారి జీవన విధానాన్ని తెలుసుకోవడానికి అనేక ఆధారాలు, వృత్తాంతాలు (క్రానికల్స్), యాత్రారచనలు (ట్రావెలోగ్స్), గ్రంథాలు, పత్రాలు, పోర్ట్రెయిట్స్ రూపంలో ఉన్నాయి. కొంతమంది మంగోలులను గూర్చీ యాత్రాకథనాలు రాయగా కొంతమంది మంగోలులు ఆస్థాన పండితులుగా స్థిరపడ్డారు. వారు బౌద్ధ, క్రైస్తవ, కన్ఫూషియస్, తుర్కీ, ముస్లిం మతాలకు చెందినవారు. వీరిలో కొంతమంది మంగోలులను స్తుతిస్తూ, నివాళులర్పిస్తూ రచనలు చేసారు.

మంగోలులపై విస్తృత పరిశోధనలు చేసి, రచనలు చేసినవారు రష్యా పరిశోధకులైన యాత్రికులు, సైనికులు, వ్యాపారులు, పురాతత్వవేత్తలు క్రీ.శ. 18, 19 శతాబ్దాలకు చెందినవారు. క్రీ.శ 20వ శతాబ్దపు తొలినాళ్ళలో రష్యాకు చెందిన బోరిస్ ఎకోప్లెని౫డి మిరోవ్, వాసిలి వ్లాడిమిరోవిచ్ బోరోల్డ్ మంగోలులు భాష, సమాజం, సంస్కృతులపై చక్కని రచనలు చేసారు.

మంగోలుల చరిత్రను తెలిపే ఆధారాలు చైనా, మంగోలు, పారశీక, అరబ్బీ, ఇటలీ, లాటిన్, ఫ్రెంచి, రష్యా వంటి అనేక భాషలలో విభిన్న సమాచారంతో లభిస్తున్నాయి. ఉదాహరణకు చంఘీస్ ఖాన్ను గురించి రాసిన మంగోలుల రహస్య చరిత్ర మంగోలు, చైనా భాషలలో ఉంది. మార్కోపోలో రాసిన మంగోలుల ఆస్థానానికి యాత్రలు (ట్రావెల్స్ టు ది మంగోల్ కోర్ట్) ఇటలీ, లాటిన్ భాషలలో భిన్నంగా ఉంది. అదే విధంగా ఇగోర్ డి రాచెవిట్జ్ రచన మంగోలుల రహస్య చరిత్ర, గెర్హార్డ్ డూ ఫర్ మంగోలు, తుర్కీ పదకోశంపై చేసిన రచనలు పారశీక భాషను కలిగి క్లిష్టంగా ఉన్నాయి. ఇంకా ఐబన్ బటూటా రచనలలో కూడా ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి.

రోమ్కు చెందిన పోప్లతో మంగోలు రాజులు సత్సంబంధాలు నెరపారు. పోట్లు ఎన్నో రాయబారాలు నడిపారు. పోప్ ఇన్నోసెంట్ (IV)కు గ్రేటాన్ గుయుగ్ రాసిన లేఖ వంటివి అనేక వివరాలను తెలియజేస్తున్నాయి. ఇ.ఎ. నాలిసబ్బుడ్జ రచించిన ‘ద మాక్స్ ఆఫ్ కుబ్లయే ఖాన్’ అతని పరిపాలనా కాలాన్ని గురించి మనకు తెలియజేస్తోంది. రషీద్ అల్దన్ రచించిన కంపెండియమ్ ఆఫ్ క్రానికల్స్, గ్రెగర్ ఆఫ్ అకాన్ హిస్టరీ ఆఫ్ ది నేషన్ ఆఫ్ ఆర్చర్స్, ద క్రానికల్స్ ఆఫ్ నొవ్ రోడ్, జువైనా-ద హిస్టరీ ఆప్ ద వరల్డ్ కాంకరర్స్ వంటి చారిత్రక విషయాలను తెలియజేస్తున్నాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 5 సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్

ప్రశ్న 2.
సంచార జాతి సామ్రాజ్య స్థాపనకు దారితీసిన భౌగోళిక పరిస్థితులను తెలపండి.
జవాబు:
క్రీ.శ. 13, 14 శతాబ్దాలలో మంగోలులు చంఘీస్ ఖాన్ నాయకత్వంలో అనేక ఐరోపా, ఆసియా ప్రాంతాలతో మధ్య ఆసియాలో బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. మంగోలు సంచార తెగలు నిబద్దతతో కూడిన సాంఘిక, ఆర్థిక జీవితాన్ని, వినమ్రతతో కూడిన గుణగణాలు కలిగి ఉండేవారని ఒక అభిప్రాయం. అయితే ఈ తెగల వారు చారిత్రకంగా వచ్చే పరిణామాలను, మార్పులను అంగీకరించరు. వీరి సాంప్రదాయాలకు అనుగుణంగా రాజకీయ, సాంఘిక, ఆర్థిక పద్ధతులను పాటిస్తూ తమ అధికారానికి మూలహేతువైన శక్తివంతమైన సైనికవ్యవస్థలకు ప్రాధాన్యత నిచ్చేవారు.

మంగోలులు భిన్న సమూహాలకు చెందినవారు. వారు భాషాపరంగా టాటార్లు, ఖిటాన్, మంచూ, తుర్కీ తెగలకు దగ్గరగా ఉంటారు. వారిలో కొందరు గ్రామీణ జీవితాన్ని గడపగా కొందరు వేటగాళ్ళుగా జీవించారు. గ్రామీణులు గుర్రాలు, గొర్రెలు, ఎద్దులు, మేకలు, ఒంటెలు వంటి జంతువులను పెంచేవారు. వారు మధ్య ఆసియాలోని స్టెప్పీలలో ముఖ్యంగా ఆధునిక మంగోలియా రాజ్యంలో సంచార జీవితం గడిపారు. ఈ ప్రాంతం అల్బాయ్ పర్వతాలతో, గోబిఎడారి, ఆనాన్, తెలంగా నదులు, అనేక ప్రవాహాలతో అందంగా, అద్భుతంగా ఉండేది. ఆటవికులు గ్రామీణులకు ఉత్తర ప్రాంతమైన సైబీరియా అటవీ ప్రాంతంలో ఉండేవారు. గ్రామీణుల కంటే వారు కొంత వినమ్రతతో జంతు చర్మాలు అమ్మి తన జీవితాన్ని గడిపేవారు. ఈ రెండు తరగతుల వారు నివశించే ప్రాంతంలో శీతోష్ణస్థితి పూర్తి భిన్నంగా ఉండేది.

ఈ రెండు సమూహాలు ప్రజలు ఆర్థికంగా స్థిరజీవితాన్ని నిలుపుకోలేక పోవడంతో ఆ ప్రాంతంలో పట్టణాభివృద్ధి జరగలేదు. మంగోలులు గుడారాలలో నివసిస్తూ వేసవి, శీతాకాలాల పచ్చికబయళ్ళలో పరస్పరం మారుతూ సంచరించేవారు. చంఘీస్ ఖాన్ నాయకత్వంలోని మంగోలు, తుర్కీ తెగల సమాఖ్య క్రీ.శ. 5వ శతాబ్దానికి చెందిన | అట్టెలా రాజ్యంతో సమానంగా ఉండేది. అయితే అట్టెలా కూటమి వలె కాక, చంఘీస్ ఖాన్ రాజకీయ వ్యవస్థ శక్తివంతమై ఎక్కువ కాలం కొనసాగే స్వభావం కలది. ఇది బలమైన సైనిక బలాలు కలిగిన చైనా, ఇరాన్, తూర్పు ఐరోపాలను ఎదుర్కొనే శక్తి కలది. మంగోలులు క్లిష్టమైన వ్యవసాయ, ఆర్థికవ్యవస్థలు, పట్టణ స్థిరత్వం, స్వల్ప సామాజిక వ్యవస్థలు కలిగిన పరిపాలన చేసారు. అది వారి సహజ సామాజిక జీవితానికి పూర్తిగా భిన్నమైంది.

సహజంగా పశువులను పెంచుతూ, వాటి గడ్డికోసం పచ్చిక మైదానాలలో సంచరిస్తూ స్థిరజీవితం లేని సంచార జాతులు వారి మనుగడకు ఆధారమయిన పశువులపైనే ఆధారపడేవారు. ఇటీవల కాలంలో ఆధునిక చారిత్రక పరిశోధకులు చంఘీస్ ఖాన్ కాలం నాటికి వాతావరణంలోని మార్పుల వలన గడ్డి సరిగా పెరగక మంగోలులు ఆందోళనకు గురయ్యారని భావించారు. ఇలాంటి పరిస్థితులలో మంగోలులు నాయకుడైన చంఘీన్ ఖాన్ మంగోలు జాతి ప్రజలను, ఇతర తెగలను కలిపి బలమైన సమాఖ్య రాజ్యాన్ని మధ్య ఆసియాలోని స్టెప్పీలనే పచ్చికబయళ్ళ ప్రాంతంలో నిర్మించాడు. ఇది అంతటితో ఆగక ఆసియా, ఐరోపా ఖండాలలోని అనేక దేశాలను ఆక్రమించి ఖండాంతర విశాలమైన సామ్రాజ్య స్థాపనకు దారితీసింది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రాజ్యాన్ని సంచారజాతి తెగలు స్థాపించడం, ఊహకందని, నమ్మలేని విషయంగా పరిశోధకులు భావించారు.

ప్రశ్న 3.
చంఘీస్ ఖాన్ జీవిత విశేషాలు, విజయాలను వివరించండి.
జవాబు:
చంఘీస్ ఖాన్ క్రీ.శ. 1162 ప్రాంతంలో ఆనాన్ నదికి సమీపంలోని నేటి మంగోలియాలోని ఉత్తర ప్రాంతంలో జన్మించాడు. అతనిని తెముజిన్ అని పిలిచేవారు. అతని తండ్రి ఎసుగి బోర్జిగిద్ తెగకు చెందిన కియాట్ సమూహానికి నాయకుడు. తెముజిన్ చిన్న వయసులో అతని తండ్రి చంపబడ్డాడు. అతని తల్లి ఓలన్ – ఇకే అటువంటి కష్టకాలంలో తెముజిన్తో పాటు అతని సోదరులను, సవతితల్లి బిడ్డలను పెంచి పెద్ద చేసింది. తరువాత దశాబ్ద కాలమంతా చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు. తెముజిన్ పట్టుబడి బానిసగా చేయబడ్డాడు. వివాహానంతరం అతని భార్య బోల్టే అపహరించబడగా తెముజిన్ యుద్ధం చేసి ఆమెను పొందాడు. ఈ స్థితిలో బోఘుర్చు, జముఖ అనే కుటుంబ సోదరుడిని స్నేహితులుగా చేసుకున్నాడు. తండ్రి వంక వారితో సంబంధాలు పునరుద్ధరించుకున్నాడు.

క్రీ.శ 1180 – 90 మధ్య కాలంలో తెముజిన్ అంగాన్తో మైత్రి నడుపుతూ తన బద్ధశత్రువులైన జముఖా వంటి వారిని ఓడించాడు. క్రీ.శ. 1203లో తండ్రిని పొట్టన పెట్టుకున్న టాటారులనే తెగ వారిని, కెరెయిట్స్న అంగన్ను ఓడించాడు. క్రీ.శ 1206లో నైమాన్ ప్రజలపై విజయం, శక్తివంతుడైన జముఖాను లొంగదీయడంతో తెముజిన్ శక్తిమంతుడైన నాయకుడిగా గుర్తింపు పొందాడు. ‘చంఘీఖాన్’ అంటే ‘సముద్రాధిపతి’ లేక ‘ప్రపంచరాజు’ అని మంగోలుల సభచే పిలువబడి తెముజిన్ మంగోలుల గొప్ప నాయకుడు అని ప్రకటింపబడ్డాడు.

చైనాను ఆక్రమించడానికి తన సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించి, క్రమశిక్షణ గల సైన్యంగా తీర్చిదిద్దాడు. మంగోలు సైన్యాన్ని మూడు భాగాలుగా చేసాడు. టిబెట్ తెగకు చెందిన హిృహ్సియా ప్రజలను 1209 నాటికి, 1215 నాటికి పెకింగ్ను ఓడించాడు. ఈ విజయాల తర్వాత క్రీ.శ. 1216లో చంఘీస్ ఖాన్ తిరిగి మంగోలియా చేరుకున్నాడు.

AP Inter 2nd Year History Study Material Chapter 5 సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్

క్రీ.శ 1218లో మంగోలులు ఖారాభిటాను ఓడించిన తర్వాత మంగోల్ సరిహద్దులు పశ్చిమోత్తర చైనా, అమూదరియా, ట్రాన్సాక్సియానా, ఖ్వారజం వరకు విస్తరించాయి. ఖ్వారజం పాలకుడు సుల్తాన్ మహమ్మద్ మంగోలు రాయబారులను వధించి చంఘీస్ ఖాన్ ఆగ్రహాన్ని చవిచూసాడు. క్రీ.శ 1219-21 మధ్య కాలంలోని దండయాత్రలలో బట్రార్, బుఖారా, సామరఖండ్, బాల్క్, హీరట్లు లొంగిపోయాయి. వ్యతిరేకించిన పట్టణాలు నేలమట్టమయ్యాయి. నిషాపూర్ వద్ద మంగోల్ రాజును చంపినందుకు ప్రతీకారంగా ఆ పట్టణ ఆక్రమణ సమయంలో యావత్తు పట్టణాన్ని దున్నిపారేసి పిల్లలు, కుక్కలు సైతం లేని స్మశాన వాటికగా ఆ ప్రాంతాన్ని మార్చివేసాడు.

చంఘీస్ ఖాన్ దండయాత్రల వలన అనేక నగరాల విధ్వంసం, లెక్కలేనంత మంది ప్రజల మరణం సంభవించాయి. క్రీ.శ. 1220లో నిషాపూర్లో 17 లక్షల మందిని, క్రీ.శ. 1222లో హీరట్ వద్ద 16 లక్షల మందిని, క్రీ.శ. 1258లో | బాగ్దాద్ వద్ద 8 లక్షల మందిని చంపారని మధ్యయుగ చరిత్రకారులు కొందరు లెక్కలు వేసారు. అయితే పారశీక వృత్తాంతాలు ఇల్కానిడ్ ఇరాన్ను గురించి రాస్తూ చంఘీస్ ఖాన్ వధించిన లేక చంపిన వారి వివరాలను అతిశయోక్తిగా పేర్కొన్నాయని కొందరు చరిత్రకారుల భావన.

మంగోల్ సైన్యాలు సుల్తాన్ మొహమ్మద్ కోసం వెళుతూ అజర్బైజాన్లోకి ప్రవేశించి, క్రిమియా వద్ద రష్యా సైన్యాలను ఓడించి కాస్పియన్ సముద్రాన్ని చుట్టుముట్టాయి. మరో విభాగం సుల్తాన్ కుమారుడు జలాలుద్దీన్ ను వెంటాడుతూ ఆఫ్ఘనిస్తాన్, సింధ్ ప్రాంతాల్లోకి చొచ్చుకువెళ్ళాయి. సింధూనది వద్ద చంఘీస్ ఖాన్ ఉత్తర భారతదేశం, అస్సాంల ద్వారా మంగోలియాకు వెళ్ళడం మంచిదని భావించాడు. కానీ ఆ ప్రాంత భయంకర ఉష్ణతాపం, దుశ్శకునాలను గురించి జ్యోతిష్కుడు చెప్పిన మాటలతో మనసు మార్చుకున్నాడు. అయితే అప్పటికే యుద్ధాలతోను, ఎక్కువ కాలం సైనిక స్థావరాలలో గడపటం వలన చంఘీస్ ఖాన్ ఆరోగ్యం మెరుగుపడక క్రీ.శ 1227లో మరణించాడు.

ఘనత: చంఘీస్ ఖాన్ సైనిక విజయాలు అపూర్వమైనవి. అతడు స్టెప్పీ ప్రాంతాల సైన్యాలను తన శక్తి సామర్థ్యాలతో, తెలివితేటలతో ఆధునీకరించటం వలన అవి శక్తివంతమైనాయి. అతడు మంగోలుల, తురుష్కుల గుర్రపుస్వారీ నైపుణ్యాలను మెరుగుపరచి, సైన్యంలో పరుగు తీవ్రతను పెంచాడు. భయంకరమైన చలి, తీవ్రమైన వేడిని సైతం లెక్కచేయకుండా శత్రువులను వెంటాడి, వధించి విజయాలు సాధించడం, ప్రాంతాలు జయించడం వంటి యుద్ధకాంక్షను మంగోలులో రగిలించాడు.

మంగోలులను ఐక్యపరచి, ఆదివాసీ, సంచార తెగల నిరంతర అంతర్యుద్ధాల నుండి వారికి విముక్తి ప్రసాదించి, చైనా దోపిడీ నుండి కాపాడి, వారిని అభివృద్ధి పథంలో నడిపిన ఒక నాయకుడిగా చంఘీస్ ఖాన్ నిలచిపోయాడు. నేటికీ మంగోలులకు చంఘీస్ ఖాన్ ప్రేరణ కలిగిస్తూ జాతీయనాయకుడిగా ఆ దేశ ప్రజలచే గౌరవింపబడుతున్నాడు. తన విజయాలతో ప్రపంచ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విజేతగా నిలిచిపోయాడు.

ప్రశ్న 4.
స్టెప్పీ సమాఖ్యల ప్రాధాన్యతను తెలపండి.
జవాబు:
మంగోలు – తుర్కీ ప్రజలకు చెందిన మధ్య ఆసియాలోని కొన్ని గొప్ప స్టెప్పీ సమాఖ్యలు ఏమనగా: క్రీ.పూ. 200 సంవత్సరాలకు చెందిన తురుష్కుల సియుంగు, క్రీ.శ. 400 సంవత్సరాలకు చెందిన మంగోలుల జువాన్, క్రీ.శ. 400 సంవత్సరాలకు చెందిన మంగోలుల ఎప్తలైట్ హూణులు, క్రీ.శ. 550 సంవత్సరాలకు చెందిన తురుష్కుల టుచు, క్రీ.శ. 740 సం॥లకు చెందిన తురుష్కుల ఇఝారులు, క్రీ.శ. 940 సంవత్సరాలకు చెందిన మంగోలుల ఖిటాన్లు. వారి ఆక్రమణలు ఒకే ప్రాంతానికి పరిమితం కాక సమంగా లేక వారి ఆంతరంగిక వ్యవస్థ క్లిష్టంగా ఉండేది. సంచార జనాభాపై వారి ప్రభావం ఉండేది. వీరి ప్రభావ తీవ్రత చైనా తదితర దేశాలలో వేరు వేరుగా ఉంది.

క్రీ.శ 13వ శతాబ్దపు తొలిదశకాలలో మంగోలుల నాయకుడైన చంఘీస్ ఖాన్ మంగోలు జాతి ప్రజలను ఇతర తెగల ప్రజలను కలిపి బలమైన సమాఖ్య రాజ్యాన్ని మధ్య ఆసియాలోని స్టెప్పీలనే పచ్చికబయళ్ళ ప్రాంతంలో నిర్మించాడు. ఇతడు తన అధికారాన్ని చైనా, ట్రాన్సాక్సియానా, ఆఫ్ఘనిస్తాన్, తూర్పు ఇరాన్, రష్యా స్టెప్పీలకు వ్యాపింపజేసాడు. తరువాత అతడు అనేక చైనా ప్రాంతాలను, ఐరోపాలోని అనేక ప్రాంతాలను జయించాడు. క్రీ.శ 1220లో ప్రముఖ బుఖారా పట్టణాన్ని వశపరచుకున్నాడు. అతని అనుచరులు మరింత ముందుకు సాగి బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఉదా: చంఘీస్ ఖాన్ ఒక మనువడు మాంగ్ కే (క్రీ.శ. 1251 60) ఫ్రెంచ్ రాజును బెదిరించి కొన్ని ప్రాంతాలు ఆక్రమించుకోగా, మరో మనువడు బాటు, మాస్కో వరకు రష్యా ప్రాంతాలు ఆక్రమించి పోలండ్, హంగరీ, వియన్నా రాజ్యాలను క్రీ.శ 1236-41 మధ్య దాడులలో వశపరచుకున్నాడు.

మంగోలులు భిన్న సమూహాలకు చెందినవారు. వారు భాషాపరంగా టాటార్లు, ఖిటాన్, మంచూ, తుర్కీ తెగలకు దగ్గరగా ఉంటారు. వారిలో కొందరు గ్రామీణ జీవితాన్ని గడపగా కొందరు వేటగాళ్ళుగా జీవించారు. గ్రామీణులు గుర్రాలు, ఎద్దులు, మేకలు, ఒంటెలు వంటి జంతువులను పెంచేవారు. వారు మధ్య ఆసియాలోని స్టెప్పీలలో ముఖ్యంగా ఆధునిక మంగోలియా రాజ్యంలో సంచార జీవితం గడిపారు. ఈ ప్రాంతం అల్బాయ్ పర్వతాలతో, గోబి ఎడారి, ఆనాన్, శిలంగా నదులు. అనేక ప్రవాహాలతో అందంగా, అద్భుతంగా ఉండేది. వేట లేక ఆటవికులు గ్రామీణులకు ఉత్తర ప్రాంతమైన సైబీరియా అటవీ ప్రాంతంలో ఉండేవారు. గ్రామీణుల కంటే వారు కొంత వినమ్రతతో జంతు చర్మాలు అమ్మి తన జీవితాన్ని గడిపారు. ఈ రెండు తరగతుల వారు నివసించే ప్రాంతంలో శీతోష్ణస్థితి పూర్తి భిన్నంగా ఉండేది.

ఈ రెండు సమూహాలు ప్రజలు ఆర్థికంగా స్థిరజీవితాన్ని నిలుపుకోలేకపోవడంతో ఆ ప్రాంతంలో పట్టణాభివృద్ధి జరగలేదు. మంగోలులు గుడారాలలో నివసిస్తూ వేసవి, శీతాకాలాల పచ్చికబయళ్ళలో పరస్పరం మారుతూ సంచరించేవారు. చంఘీస్ ఖాన్ నాయకత్వంలోని మంగోలు, తుర్కీ తెగల సమాఖ్య క్రీ.శ 5వ శతాబ్దానికి చెందిన ‘అట్టెలా’ రాజ్యంతో సమంగా ఉండేది. అయితే అట్టెలా కూటమి వలే కాక, చంఘీసన్ రాజకీయ వ్యవస్థ శక్తివంతమై ఎక్కువ కాలం కొనసాగే స్వభావం కలది. ఇది బలమైన సైనిక బలాలు కలిగిన చైనా, ఇరాన్, తూర్పు ఐరోపాలను ఎదుర్కొనే శక్తి కలిగి ఉండేది.

AP Inter 2nd Year History Study Material Chapter 5 సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్

చంఘీస్ ఖాన్ మరణాంతం మంగోలు సామ్రాజ్యంలోని సంచార, భిన్న వర్గాల మధ్యగల వైషమ్యాలు సరళమవుతూ వచ్చాయి. ఉదాహరణకు 1230లో మంగోలుల ఉత్తర చైనాకు చెందిన చిన్ రాజవంశంపై విజయవంతంగా దండయాత్ర చేయగా, మంగోలు నాయకత్వంలోని ఒక వర్గం రైతులను వధించి, వారి భూములను పచ్చికబయళ్ళుగా మార్చమని ఒత్తిడి చేసింది. తరువాత కాలంలో ఘజన్ ఖాన్ వంటివారు దీనిని వ్యతిరేకించారు. ఇది వారిలో ఉండే సంప్రదాయ రీతి అయిన గడ్డి భూముల పట్ల వారి ప్రాధాన్యతను తెలియజేస్తుంది. చంఘీస్ ఖాన్ తన తదనంతరం తన మొదటి కుమారుడు జోచికి రష్యా స్టెప్పీలను, రెండవ కుమారుడు చగతాయ్కి ట్రాన్సాక్సియానా స్టెప్పీలను, సామీరు పర్వత ఉత్తర భూములను, మూడవ కుమారుడు ఒగొడికి కారకోరమ్ పర్వత ప్రాంతాలని, చివరి కుమారుడు టోలుయ్కి తన పూర్వీకుల మంగోలియా ప్రాంతాలను ఇచ్చాడు.

మంగోలులు క్లిష్టమైన వ్యవసాయం, ఆర్థికవ్యవస్థలు, పట్టణ స్థిరత్వం, స్వల్పసామాజిక వ్యవస్థలు కలిగిన పరిపాలన చేసారు. అది వారి సహజ సామాజిక జీవితానికి పూర్తిగా భిన్నమైంది.

ఎటువంటి సంచారజాతి సామ్రాజ్యాన్ని పరిశీలించినా మంగోలుల వలె చెల్లా చెదురైన వివిధ జాతులు, తెగలు, సమూహాలు చైతన్యవంతులై, ఏకమై ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం ఊహకందనిది, నమ్మలేనిది.

ప్రశ్న 5.
మంగోలుల చరిత్రలో ఘజన్ ఖాన్ స్థానం ఎట్టిది?
జవాబు:
ఘజన్ 1271లో ఇల్-ఖానిడ్ పాలకుడైన ఆర్గున్, తల్లి ఖుత్లుక్ ఖాతున్లకు జన్మించాడు. ఘజన్ చిన్నతనంలో బాప్టిజం ఇచ్చి క్రైస్తవుడిగా పెంచబడ్డాడు. యవ్వనావస్థలో చైనా బౌద్ధ సన్యాసి వద్ద విద్యనభ్యసించాడు. అతని ద్వారా బౌద్ధాన్ని ఆకళింపు చేసుకున్నాడు. ఘజన్ ఖాన్ ను పాశ్చాత్యులు ‘కాసనస్’ అని పిలిచేవారు. ఇలా నిడ్ పాలకులు చంఘీస్ ఖాన్ చిన్న కుమారుడు ‘లొలుయి’ సంతతికి చెందినవారు. ఇతను ఇల్-ఖానిడ్ ఆనిడ్ వంశంలో 7వ పాలకుడు. ఈ ప్రాంతం నేటి ఆధునిక ఇరాన్ ప్రాంతం. 11 ఏళ్ళ వయసుకే వైస్రాయిగా ‘ఖొరాసాన్’ పాలకుడయ్యాడు.

క్రీ.శ 1291లో ఘజన్ తండ్రి ఆర్గున్ చనిపోయే సమయానికి ఘజన్ ఖాన్ ‘నవజ్’ అనే కులీనుడి తిరుగుబాటు, ఛాగాయ్ మంగోలులు, తుర్కీ మంగోలులను ఎదుర్కొనవలసి వచ్చింది. 1295 ప్రాంతాలలో ఘజన్ ఒత్తిడి మేరకు ‘నవ్రజ్’ లొంగిపోయి, ఘజన్ దళ నాయకుడిగా మారాడు. ‘నవ్రజ్’ సహాయంతో కుట్రలను ఛేదించాడు. ‘నవ్రజ్’ ప్రఖ్యాతి చెందిన ముస్లిం అమీర్. నమ్రాజ్ వంటి వారి మద్దతు ఉంటుందని క్రీ.శ 1295లో ఇస్లాంను స్వీకరించాడు. తన పేరును మహమూద్ ఘజన్ గా మార్చుకున్నాడు. ఘజన్ ఇస్లాంను స్వీకరించినప్పటికీ వ్యక్తిగత జీవితంలో ప్రాచీన మంగోల్ సంప్రదాయాలు పాటించేవాడు.

పరమత సహనం: ఘజన్ ఖాన్ ఇస్లాం మతాన్ని స్వీకరించినప్పటికి, పరమత సహనాన్ని ప్రదర్శించాడు. తన చిన్నతనంలో క్రైస్తవుడిగా పెంచబడ్డాడు. యవ్వనంలో బౌద్ధమత గురువు ప్రభావంతో బౌద్ధం వైపు ఆకర్షితుడయ్యాడు. 1295లో రాజకీయ అవసరాల నిమిత్తం ఇస్లాంను స్వీకరించాడు. తన రాజ్యంలోని క్రైస్తవులను జిజియా పన్ను నుంచి మినహాయించాడు. అయితే ఈ పరమత సహనం ‘నవ్రజ్’ వంటి నాయకులు సహించలేకపోయారు. ఎన్నో బౌద్ధరామాలను శాశ్వతంగా ధ్వంసం చేసారు. చివరకు టిబెట్ వెళ్ళదలుచుకున్న బౌద్ధులందరికీ అనుమతినిచ్చాడు. ‘నవ్రజ్’ అతని అనుచరుల ఆగడాలు మితిమీరి పోతుండుటచే ఘజన్ ఖాన్ అతనిని అణచివేసాడు.

తమ చిరకాల శత్రువులైన ఈజిప్ట్ మామ్లుక్ తో యుద్ధం చేయడానికి 1299లో క్రైస్తవులను ఆహ్వానించి వారితో కలిసి యుద్ధానికి వెళ్ళాడు. ఈ యుద్ధంలో మామ్లుక్లలు ఓడించబడ్డారు. తరువాత కాలంలో తుర్క్ మంగోల్ ఛాగ్తాయ్లాతో యుద్ధం చేసాడు. ఈ విధంగా ఎక్కువ కాలం యుద్ధరంగంలోనే గడిపాడు.

సంస్కరణలు: ఘజనాఖాన్ ఇలా నిడ్ సామ్రాజ్యంలో అనేక సంస్కరణలు చేపట్టాడు. తన ప్రాంతంలోని రైతుల సంక్షేమానికి కృషి చేసినట్లు తెలుస్తుంది. ఇతడు మంగోలు తురుష్క సంచార సైన్యాధికారులకు క్రింది సందేశాన్నిచ్చాడు. ఈ సందేశాన్ని అతని వజీర్ రషీదుద్దీన్ తయారుచేసాడని కొందరి అభిప్రాయం.

“నేను పారశీక కర్షకుల వైపు లేను. వారిని నిర్మూలించాలనే తలంపు ఉంటే ఆ పనిని నాకంటే శక్తివంతంగా చేసేవారు మరొకరు లేరు. అయితే మీరు తిండిగింజలను, ఆహారపదార్థాలను పొందాలనుకుంటే మీ పట్ల కఠినంగా వ్యవహరిస్తాను …… వినమ్రతగా ఉన్న కర్షకులను శత్రువులుగా ఉన్న కర్షకుల నుండి వేరుచేసి గౌరవించాలి” అని సందేశమిచ్చాడు.

AP Inter 2nd Year History Study Material Chapter 5 సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్

మిలటరీ సంస్కరణలు: సైన్యంలో ఎన్నో కొత్త దళాలను ఏర్పాటు చేసాడు. మంగోలు రాజ్యంలోని సామాన్యులు ఎందరో తమ పిల్లలను బానిసలుగా అమ్ముతుంటే, వారిని విడిపించి తన మంత్రులలో ఒకడైన బోలాడ్ నేతృత్వంలో వారందరినీ ఒక సైనిక యూనిట్గా ఏర్పరచాడు.

ఆర్థిక సంస్కరణలు: కాగితం కరెన్సీ ప్రవేశాన్ని వ్యతిరేకించిన ఘజన్ ఖాన్ తన రాజ్యం అంతా ఒకేరకమైన నాణేలు ప్రవేశపెట్టాడు. వాటిని గజనీ దినార్స్ అన్నారు. మార్కెట్ వ్యవస్థను క్రమబద్దీకరించాడు.

నిర్మాణాలు, ఘనత: ఘజన్ ఖాన్ ఉన్నత సాంస్కృత విలువలు కలిగినవాడు. ఇతడు అనేక భాషలు మాట్లాడగలడు, కళాపోషణారాధకుడు. చిత్రలేఖనం, రసాయనశాస్త్రం, వ్యవసాయం పట్ల ఎంతో మక్కువగా ఉండేవాడు. తన ప్రజల సంక్షేమం కోసం హాస్టల్స్, హాస్పటల్స్, విద్యాలయాలు, తపాల వ్యవస్థలు ఏర్పాటు చేసాడు. ‘రషీద్-అల్-దీన్’ అనే చరిత్రకారుడుని తన వంశ చరిత్ర రాయమని ఘజన్ కోరాడు. ఇతడు తన సామ్రాజ్యంలో మంగోలియన్ యాసాకోడ్ను అమలుచేసాడు.

ఒక యూరప్ చరిత్రకారుడి ప్రకారం 14వ శతాబ్దంలో ఎందరో యూరోపియన్లు తమ పిల్లలకు మంగోల్ పాలకుల పేర్లు పెట్టుకోవడం గొప్పగా భావించేవారు. ‘గజన్’ పేరును ఎక్కువమంది పెట్టుకునేవారు. ఇంతటి ఘనత వహించి ఘజన్ ఖాన్ క్రీ.శ 1304లో 33 సంవత్సరాల వయసులోనే మరణించాడు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సంచారజాతి సామ్రాజ్యాలు.
జవాబు:
సంచార అంటే ‘దేశ దిమ్మర’, ‘అనాగరిక జాతులు’ అని వ్యవహరించేవారు. మధ్య ఆసియాకు చెందిన మంగోలులు, అరేబియా ద్వీపకల్పంలోని బెడౌన్లు, గౌలులు, హూణులు ఇలాంటివారే. కొన్ని సంచారజాతులు కుటుంబవ్యవస్థను కలిగి ఉండగా, కొన్ని జాతులకు కుటుంబ జీవితం ఉండేది కాదు. వీరి రాజకీయ వ్యవస్థ వెనుకబడి ఉండేది. సామ్రాజ్యం అంటే మిశ్రమ సాంఘిక, ఆర్థిక భావాలతో కూడిన నిర్మాణం. క్రీ.శ 13, 14 శతాబ్దాలలో మంగోలులు చంఘీస్ ఖాన్ నాయకత్వంలో ఐరోపా, ఆసియా ప్రాంతాలతో మధ్య ఆసియాలో బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. మంగోలు సంచార తెగలు నిబద్ధతతో కూడిన సాంఘిక, ఆర్థిక జీవితాన్ని కలిగి ఉండేవారు. ఈ తెగల వారు చారిత్రకంగా వచ్చే పరిణామాలను అంగీకరించరు. వారి సాంప్రదాయాల కనుగుణంగా రాజకీయ, సాంఘిక, ఆర్థిక పద్ధతులు పాటిస్తూ, తమ అధికారానికి మూలహేతువైన, శక్తివంతమైన సైనిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చేవారు.

ప్రశ్న 2.
రష్యా పండితులు.
జవాబు:
మంగోలులపై విస్తృత రచనలు చేసినవారు రష్యా పరిశోధకులైన యాత్రికులు, సైనికులు, వ్యాపారులు, పురాతత్వవేత్తలు క్రీ.శ 18, 19 శతాబ్దాలకు చెందినవారు. 19వ శతాబ్దంలోని చరిత్రకారుడైన N.M కరంజినే టాటర్ల వలన రష్యా వెనుకబడిందని భావించాడు. మరోవైపు మరో చరిత్రకారుడు S.M సొలెవేవ్ మంగోలుల ఆక్రమణ ప్రభావం చాలా స్వల్పకాలికమైన, దీర్ఘకాలక ప్రభావం ఏమీలేదని పేర్కొన్నాడు. వివి. బోర్తోల్డ్, ప్రొఫెసర్ జార్జ్ వెర్నార్డ్స్క వంటివారు కూడా మంగోలుల రష్యా ఆక్రమణ వాటి ప్రభావాలని అంచనా వేసారు.

క్రీ.శ. 20వ శతాబ్దపు తొలినాళ్ళలో రష్యాకు చెందిన బోరిస్ ఎకోఫ్లెవిచ్ వ్లాడిమిర్టోవ్, మంగోలుల భాష, సమాజం, సంస్కృతులపై చక్కని రచనలు చేసారు.

AP Inter 2nd Year History Study Material Chapter 5 సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్

ప్రశ్న 3.
మంగోలుల దండయాత్రలు.
జవాబు:
క్రీ.శ 13వ శతాబ్దంలో మంగోలులు నాయకుడు చంఘీస్ ఖాన్ తన జాతి ప్రజలను, ఇతర తెగలను కలిపి గొప్ప సైన్యాన్ని నిర్మించాడు. ఇతడు తన అధికారాన్ని చైనా, ట్రాన్సాక్సియనా, ఆఫ్ఘనిస్తాన్, తూర్పు ఇరాన్, రష్యా స్టెప్పీలకు వ్యాపింపచేసాడు. క్రీ.శ 1220లో ప్రముఖ బుఖారా పట్టణాన్ని ఆక్రమించాడు. తరువాత కాలంలో చంఘీస్ ఖాన్ మనుమడు మాంగ్ కే ఫ్రెంచ్జును బెదిరించి కొన్ని ప్రాంతాలు ఆక్రమించుకున్నాడు. మరో మనుమడు బాటు, మాస్కో వరకు రష్యా ప్రాంతాలు ఆక్రమించారు. పోలండ్, హంగరీ, వియన్నా రాజ్యాలను వశపరచుకున్నారు.

మంగోలు దండయాత్రల మూలంగా ఎన్నో పట్టణాలు ధ్వంసం చేయబడ్డాయి. వ్యవసాయ భూములు నిరుపయోగమయ్యాయి. లక్షల మంది చంపబడ్డారు. వర్తక, వ్యాపార, హస్తకళలు మూగబోయాయి. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు, బానిసలయ్యారు. మంగోలుల దండయాత్రల ధాటికి చైనా, తూర్పు ఐరోపా, మధ్య ఆసియాలోని ఎన్నో దేశాలు భయోత్పాతాన్ని పొందాయి.

ప్రశ్న 4.
మంగోలు రాజవంశం.
జవాబు:
అనేక మంది స్త్రీలకు భర్త అయిన చంఘీస్ ఖాన్కు అనేక మంది పిల్లలు జన్మించారు. తన మొదటి భార్య బోర్టెకు జన్మించిన నలుగురు కుమారులు మంగోలు వంశవృక్షమయ్యారు. వారి జోచి, చగతాయ్, ఒగొడి, టోలుయిలు. మొదటి కుమారుడు జోచి, కుమారులు లేకపోయినా శక్తివంతంగా పాలించాడు. గుయుక్ మరణానంతరం ఒగొడి వంశస్థులకు మద్దతు ఇవ్వకుండా జోచి కుమారుడు బాటు టొలుయ వైపు మొగ్గు చూపి, మొంగ్కె, కుబ్లట్లకు తెర తెరిచాడు. దీని వలన మంగోలు వంశంలో అంతర్గత పోరు తప్పలేదు.

ప్రశ్న 5.
మంగోలులు చేసిన వినాశనం.
జవాబు:
చంఘీస్ ఖాన్ దండయాత్రల గురించి తయారైన నివేదికలన్నీ అనేక నగరాలను, పట్టణాలను ఆక్రమించి ధ్వంసం చేసినందున, అంతులేనంతమంది ప్రజలు మరణించారని అంగీకరిస్తున్నాయి. క్రీ.శ 1220లో నిషాపూర్ను పట్టుకున్నప్పుడు 17,47,000 మంది ప్రజలు ఊచకోతకు గురికాగా, క్రీ.శ 1222లో హీరట్ వద్ద 16 లక్షల మందిని, క్రీ.శ 1258లో బాగ్దాద్ వద్ద 8 లక్షల మంది చంపబడగా అదే నిష్పత్తిలో చిన్న చిన్న పట్టణాలు నష్టపోయాయి. నాసా వద్ద 70,000 మంది, బాయ్ ఖ్ జిల్లాలో 70,000 మంది, కుహిస్థాన్ ప్రాంతంలోని టున్ వద్ద 12 వేల మందిని ఉరితీసారు. ఇలా నిడ్లో 13 లక్షలమంది చనిపోయారని పారశీక జువైనీ పేర్కొన్నాడు. అయితే పారశీక వృత్తాంతాలు అతిశయోక్తులతో నిండాయని కొందరు చరిత్రకారులు అంచనా. వీరి దండయాత్రల వలన వ్యవసాయ భూములు నిరుపయోగమయి, వర్తక వ్యాపార హస్తకళలు మూగబోయాయి. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఇంకెంతో మంది బానిసలయ్యారు. ఇలా ఎన్నో నగరాలు శాశ్వత విధ్వంసానికి గురైనాయి.

ప్రశ్న 6.
యాసా.
జవాబు:
డేవిడ్ అయలాన్ ప్రకారం ‘యాసా’ అనే న్యాయస్మృతిని చంఘీస్ ఖాన్ క్రీ.శ. 1206వ సంవత్సరంలో జారీ చేసాడు. ఈ పదం ‘యాసఖ్’ అని రాయబడింది. దీని అర్థం ‘న్యాయం’, ‘ఆదేశం’, ‘ఆజ్ఞ’. మరికొన్ని వివరాలను బట్టి యాసఖ్ పరిపాలనా నిబంధనలైన వేటాడే పద్ధతి, సైన్యం, పోస్టల్ వ్యవస్థలను గురించి తెలిపే పద్ధతి. క్రీ.శ. 13 వ శతాబ్దపు మధ్య కాలానికి మంగోలులు దీనిని పోలిన ‘యాసా’ అనే పదాన్ని ‘సాధారణ న్యాయస్మృతి’ అనే అర్థంతో వాడారు.

మంగోలులు తమ ఉనికిని కాపాడుకొని, ప్రత్యేకతను చాటుకొనుటకు వారు యాసాను తమ నాయకుడిచ్చిన పవిత్ర స్మృతిగా ఉపయోగించారు. యాసా అనేది మంగోలు తెగల ఆచార, సంప్రదాయాల సంకలనం. మంగోలులు దీనిని చంఘీస్ ఖాన్ న్యాయస్మృతి అని ప్రజలపై రుద్దారు. ఇది మంగోలుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, తమ సంచారజాతి చిహ్నాన్ని గుర్తించి, ఈ న్యాయస్మృతిని ఓటమి పాలైన వారిపై రుద్దేటట్లు చేసింది.

AP Inter 2nd Year History Study Material Chapter 5 సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్

ప్రశ్న 7.
చైనా గొప్ప ప్రాకార నిర్మాణానికి కారణాలు.
జవాబు:
తన మొత్తం చరిత్రలో అనేక సంచార జాతుల దాడులు, రాజ్యాల ఆక్రమణల వలన చైనా ఎంతో నష్టపోయింది. అందువలన చైనా పాలకులు క్రీ.పూ. 8వ శతాబ్దం నుండీ తమ ప్రజల రక్షణార్థం అనేక కోటలు, ప్రాకారాలు నిర్మించుకున్నారు. తరువాత క్రీ.పూ 3వ శతాబ్దం నుండి ఈ కోటల నిర్మాణాలు అందరి రక్షణ నిర్మాణాలుగా కలిసిపోయి ఈనాడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చైనా గొప్ప ప్రాకారంగా పిలువబడుతోంది. ఉత్తర చైనాలోని వ్యవసాయ సమాజాలపై జరిగే సంచార జాతుల దాడుల వలన కలిగే భయం, కలత చెందటం వంటి వాటి నుండి ప్రజలకు రక్షణ కల్గించేదిగా ఈ నిర్మాణం చక్కని తార్కాణంగా కన్పిస్తుంది. ఈ ప్రాకారాన్ని చిన్ వంశానికి చెందిన షి హ్యాంగ్ అనే రాజు క్రీ.పూ. 221 నుండి 207 వరకు నిర్మించి పాలించాడు.

AP Inter 2nd Year History Study Material Chapter 4 భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 4th Lesson భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 4th Lesson భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మహ్మద్ ప్రవక్త జీవిత విశేషాలు గూర్చి సంక్షిప్తంగా తెలియజేయుము. ఆయన ఏమి బోధించెను ?
జవాబు:
అరేబియాలోని ఎడారి ప్రాంతంలో గల మక్కా నగరంలో క్రీ.శ. 570లో ఖురేషి జాతికి చెందిన హాష్మయిట్ కుటుంబంలో మహ్మద్ జన్మించాడు. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అనాథ అయిన మహమ్మదు అతని మేనమామ అబూతాలిబ్ పెంచాడు. మామతోపాటు వర్తక వ్యాపారాలలో పాల్గొని మంచి సామర్థ్యం సంపాదించాడు. దక్షిణ అరేబియా, సిరియా వంటి అనేక ప్రాంతాలలో వర్తక బిడారులతో, విస్తృతంగా పర్యటించాడు.

ఖదీజా అనే బాగా డబ్బున్న వితంతువు వద్ద ప్రతినిధిగా చేరి కొద్ది కాలంలోనే ఆమె అభిమానాన్ని, ప్రేమను చూరగొని ఆమెను వివాహమాడాడు. మహమ్మద్ నిరంతరం ఆలోచనా నిమగ్నుడై ఉండేవాడు. మక్కా సమీపంలో ధ్యానం చేసేవాడు. జీవిత సత్యాలకై అన్వేషించాడు. మహ్మద్కు తన 40వ ఏట నిజమార్గం లభించింది. మహ్మద్ తనకు కలిగిన సత్యానుభూతితో ప్రవక్తగా మారాడు. తాను దేవుని దూతనని (రసూల్) భావించాడు. మహ్మద్కు కలిగిన దైవానుభూతితో ‘అల్లా’ ఒక్కడే దేవుడని తాను అల్లా యొక్క ప్రవక్తను అని విశ్వసించాడు. అట్లాగే బోధించాడు. ఇటువంటి విశ్వాసులందరినీ ఒక జనసామాన్యంగా తయారు చేసాడు.

మక్కా ఒక వ్యాపారకేంద్రంగానే కాక పవిత్రమైన దేశంగా మారింది. మక్కాలోని ‘కబ్బా’ అనే ఒక దీర్ఘచతురస్రాకారం రాయి ముసల్మానులకు పవిత్ర స్థలమయింది. ఇస్లాం అనగా దేవుని వలన శాంతిని పొందుట.

AP Inter 2nd Year History Study Material Chapter 4 భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

ఇస్లాం మత లక్షణాలు: దైవం యొక్క ఏకత్వాన్ని, ఆధిక్యతను అంగీకరిస్తూ ఆయనకు సేవలు చేయడం ద్వారా శాంతిని సాధించవచ్చు. అల్లా అనే ఒకే ఒక దేవుడున్నాడని, ఆయన సర్వాధికుడని ఇస్లాం చెబుతుంది. ప్రపంచంలోని ముసల్మానులందరూ సమానులే. వారు సోదర సమానులు. ఏకేశ్వరోపాసన ఇస్లాంలో కనిపిస్తుంది. విగ్రహారాధన లేదు. ఇస్లాంలో పూజారులు లేరు. వారి ఆరాధనలో సులభమైన పద్ధతులు కలవు. ప్రతిరోజు ప్రార్థన, ప్రతి ముసల్మాను తన మతవిధిగా దేవుని పేరుతో పేదలకు దానధర్మాలు చేయుట, దొంగతనాలు చేయకుండుట వంటి నియమాలు అనుసరించాలి. మహ్మద్ చెప్పిన సర్వసమానత్వం కులీనులకు కంటగింపుగా మారింది. ఆ వర్గం మహ్మద్ను అనేక ఇబ్బందులకు గురి చేసింది. ప్రాణాపాయం నుండి తప్పించుకొనుటకు క్రీ.శ.622లో మహ్మద్ మక్కాను వదిలి మదీనాకు ప్రవాసం పోయాడు. ఈ ప్రవాసాన్ని ‘హిజరా’ పేరుతో ముసల్మానుల కేలండర్ ప్రథమ సంవత్సరంగా గుర్తించారు. క్రీ.శ. 632లో మహ్మద్ మరణించే నాటికి అరేబియా అంతా ఒక్కటై గొప్ప మత సమైక్యతను సాధించింది. మహమ్మదీయులు తమ మత ప్రచారం, వ్యాప్తి పట్ల తీవ్రమైన ఉత్సాహం, ఉద్రేకం కలిగి ఉండేవారు.

మహ్మద్ ప్రవక్త బోధనలు: ఈ నూతన మత సారాంశం వారి పవిత్ర గ్రంథమైన ఖురాన్తో కనుగొనవచ్చు. అరబిక్ భాషలో ఖురాన్ అనగా కంఠస్తం చేయడం. మహ్మద్ విగ్రహారాధనను ఖండించాడు. అల్లాను విశ్వసించే భక్తులు సహోదరులు వలె జీవించాలి. దేవుని దృష్టిలో అందరూ సమానులే. ‘లా ఇలాహ ఇల్ అల్లా మహమ్మద్ ఉర్
రసూల్ అల్లా (అల్లా తప్ప మరో దేవుడు లేడు) మహ్మద్ అతని ప్రవక్త, ఇది వారి ప్రార్థనాగీతం, దీని పునఃచరణనే కల్మా అంటారు. మహ్మద్ యొక్క స్వంత తెగ ఖురేషీకి చెందినవారు మక్కాలో నివసించి కాబాపై అధికారం చలాయించారు. ప్రతి ముసల్మాను రోజుకు ఐదుసార్లు ప్రార్థన చేయాలి. దీనినే నమాజ్ అంటారు. శుక్రవారం మధ్యాహ్నం తప్పనిసరిగా మసీదులో ప్రార్ధన చేయాలి.

ఇస్లాం మతానికి పవిత్రమైన రంజాన్ నెలలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి ఎటువంటి ఆహారం తీసుకోరాదు. ప్రతి ముసల్మాను తన మత విధిగా, దేవునికి కానుకగా పేదలకు దానం చేయాలి. ఈ పవిత్రమైన చర్యను ‘జకాత్’ అంటారు. ప్రతి మహమ్మదీయుడు తన జీవితకాలంలో ఒక పర్యాయమైన మక్కాలోని పవిత్ర స్థలాన్ని సందర్శించాలి. ఈ తీర్థయాత్రనే ‘హజీ’ అంటారు. ఇవి కాక మరికొన్ని నియమాలను, ఆచారాలను ముసల్మానులు ఆచరించాలి. అణకువ, దాతృత్వం, నిజాయితీ, మహిళల పట్ల, తల్లిదండ్రుల పట్ల గౌరవం, బానిసలపై కారుణ్యం, జంతువులపై దయ, మధ్యపానం, జూదంలకు దూరంగా ఉండటం వంటి సద్గుణాలకు ప్రాధాన్యత ఇవ్వబడింది.

ఇస్లాం మతం హేతువాదానికి ప్రాధాన్యత ఇచ్చింది. మంత్రతంత్రాలు, అర్థం కాని ఆధ్యాత్మిక సూత్రాలు ఇందులో లేవు. అందరూ సమానులే అన్న సిద్దాంతం ఇస్లాం ఉదారవాదానికి ప్రతీక. మహమ్మదీయులలో విశ్వమానవ సౌభ్రాతృత్వం, దేవునికి మనిషికి మధ్య గల ప్రీతిపాత్రమైన సంబంధం వంటి అనేక లక్షణాలు ఇస్లాం మతాన్ని ప్రపంచ మతాలలో ఒక గొప్ప మానవతామతంగా తీర్చిదిద్దాయి.

ప్రశ్న 2.
ఇస్లాం వారసత్వం గురించి వివరింపుము.
జవాబు:
రోమన్ సామ్రాజ్యం వలె విస్తరణలోను, వివిధ రకాలైన ప్రజలతో కూడుకొని అరబ్ లేదా ఇస్లాం సామ్రాజ్యం కూడా ప్రసిద్ధిగాంచింది. స్పెయిన్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణ ఆసియా ప్రాంతాలకు చెందిన ప్రజలు అరబ్ సామ్రాజ్యంలో అంతర్భాగం. ప్రాజ్ఞులైన ఎందరో ఈ రాజ్యాన్ని పాలించారు. వారిలో హరున్-అల్-రషీద్, ఆయన కుమారుడు మామున్లు మిక్కిలి ఖ్యాతి గాంచారు. హరున్-అల్-రషీద్ పాండిత్యం, కళలు, సాహిత్యం, విజ్ఞానం, వర్తక వ్యాపారులను ప్రోత్సహించాడు.

విద్య: అరబ్బుల ఇస్లాం సామ్రాజ్యంలో గర్వించదగిన బాగ్దాద్, కైరో, డమాస్కస్, కార్గోవా, సెవిలె, బార్సిలోనా వంటి చోట్ల గొప్ప విద్యాకేంద్రాలుండేవి. వీరు ప్రాచీన గ్రీకు మహాకావ్యాలు హైందవుల గణిత గ్రంథాలను తర్జుమా చేసారు. మహమ్మదీయులు ‘మదర్సాలు’ అనే విద్యాకేంద్రాలు స్థాపించారు. మదర్సాలు మసీదులకు అనుబంధ కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి. భారతీయులు ఖగోళ, గణిత శాస్త్రాలలో చేసిన కృషి అరబ్బులనెంతో ఆకర్షించింది. అరబ్బుల ద్వారా ఈ జ్ఞానం యూరపు అందింది. డా. ఇబిన్సినా (980-1037) యొక్క వైద్యగ్రంథాలు అరబ్ దేశాలలో విస్తృతంగా అధ్యయనం చేయబడింది. అవిసెన్నా రచించిన “అలనూన్, ఫిల్ టిబ్” అనే వైద్య గ్రంథంలో 760 రకాల మందులు గురించి పేర్కొన్నారు. ఈ వైద్య గ్రంథం యూరప్లో పాఠ్యగ్రంథంగా చేయబడింది.

అరబ్బులు సంఖ్యామానాన్ని భారతీయుల వద్ద నేర్చుకున్నారు. వారి ద్వారా యూరప్ కు చేరింది. గణితశాస్త్రంలో అరబ్బులు మరిన్ని పరిశోధనలు చేసారు. కళ్ళ జబ్బులు, అంటురోగాల వ్యాప్తికి మందులు కనిపెట్టారు. బస్రాకు చెందిన ‘అల్హసన్’ అనే శాస్త్రజ్ఞుడు దృష్టికి సంబంధించిన మూలగ్రంథాన్ని రచించాడు. ఇది తదుపరి లాటిన్లోకి అనువదించబడి ‘ఆప్లికేథెసారస్’గా ప్రసిద్ధిచెందింది.

ఉత్పత్తులు: అరబ్బులు పేపర్ తయరీ, బ్లాక్ ముద్రణ విధానాలు చైనా వారి నుండి గ్రహించారు. వీరి ద్వారా ఐరోపా వారు గ్రహించారు. అనేక రసాయన సమ్మేళనాలను కనుగొన్నారు. నత్రికామ్లం, సల్ఫ్యూరిక్ఆమ్లం, సిల్వర్ నైట్రేట్ మొదలైన రసాయనాలు తయారుచేసారు. ‘మస్లిన్’ వస్త్రం తయారీ రంగంలో ప్రసిద్ధిగాంచారు. పారసీక తివాచీలు, చర్మకారుల తయారీలు జగత్ప్రసిద్ధి చెందాయి. ఆయుధాలను అందంగా తీర్చిదిద్దడంలో వీరిది అందెవేసిన చేయి. బాకులు, కటారులు మణిఖచితమైన అందాన్ని సంతరించుకున్నాయి.

ప్రయాణాలు, విదేశీ వ్యాపారం: అరబ్బులు అలవాటుపడిన బాటసారులుగా గుర్తింపు పొందారు. వారు వస్తు, విశేషాలతో చైనా, భారతదేశాలకు బిడారులుగా వెళ్ళేవారు. భూ, సముద్ర మార్గాల ద్వారా సుదూర ప్రాంతాలకు దీర్ఘప్రయాణాలు చేసేవారు. అల్బేరూని, ఐఇబన్ బతూత, అల్ ఇద్రిసి వంటి ప్రయాణీకులు ఇట్టివారే. నావికాబలంలోను, సముద్రయానంలోను, నూతన ప్రదేశాల అన్వేషణలో అరబ్బులు అగ్రగణ్యులు. ఈ సముద్రప్రయాణాలు వర్తక, వ్యాపారాలకు ప్రోత్సాహాన్నిచ్చాయి. ఇండియా, చైనా, తీర ఆఫ్రికాతో విస్తృత వాణిజ్య సంబంధాలు పెరిగాయి. అరబ్బులు తమ ప్రత్యేక ఉత్పత్తులను విదేశీ విపణులలో అమ్మేవారు. రగ్గులు, తివాచీలు, పరిమళ వస్తువులు, మల్లుసెల్లాలు, గాజుగుడ్డలు, పండ్ల పానీయాలు మొదలైన వాటికి గిరాకీ. బాగ్దాద్ సిరిసంపదలతో తులతూగుతూ గొప్ప ఖ్యాతినార్జించింది.

AP Inter 2nd Year History Study Material Chapter 4 భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

కళలు, వాస్తు నిర్మాణాలు: అరబ్బులు గొప్ప భవన నిర్మాతలు. అరబ్బుల కళలు ఇరాన్, బైజాంటిన్ సామ్రాజ్యాలచే ప్రభావితం చెందాయి. నిర్మాణంలో వీరిది ప్రత్యేకశైలి. వీరి వాస్తుశిల్పికళా ప్రక్రియలు మసీదులలోనే కాక పుస్తక భాండాగారాలలో, వైద్యశాలల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. నాటి ప్రసిద్ధిగాంచిన నిర్మాణాలలో అల్ హమ్ర్బా (స్పెయిన్లోని గ్రనడా వద్ద), అల్కాజర్ (సెవిల్ వద్ద), గొప్పమసీదు (బాగ్దాద్)లో కలవు. డోమ్, ఆర్చి, మినారట్ల నిర్మాణ ప్రక్రియ వారి వాస్తు శైలికి నిదర్శనం. ఖురాన్ మానవులను, జంతువులను సూచించే బొమ్మలను నిషేధించినందున మహమ్మదీయ కళాకారులు రాజభవనాలు, మసీదు లోపల, వెలుపల గోడలపై చెక్కుడు పనితనాన్ని చూపారు. రాజభవనాల చుట్టూ అందమైన తోటలు, ఎగజిమ్మే నీటి ఊటలు నిర్మించుకున్నారు. సుందరంగా తీర్చిదిద్దినట్లుగా రాయడాన్ని వారు ఒక కళగా అభ్యసించారు. దీనిని కాలిగ్రఫి అన్నారు.

సాహిత్యం, చరిత్ర: అరబ్బుల సాహితీ సేవ వర్ణనాతీతం. అలబారి ‘అన్నాల్స్ ఆఫ్ ది అపోస్టల్స్ మరియు రాజులు’ అనే గ్రంథాన్ని రచించాడు. ఉమర్ ఖయ్యమ్ రాసిన రుబాయత్, ఫిరదౌసీ – షానామా, అరేబియన్ రాత్రులు అనే వేయిన్కొక్క కథలు నాటి సాహితీసంస్కృతికి అద్దం పడతాయి. అరేబియన్ రాత్రులు ప్రపంచంలోని అనేక భాషలలోకి అనువాదమైంది. ఇంకా లుల్డూరీ రచించిన అన్సాబ్ అల్ అష్రఫ్, తబారీ రచించిన తారిఖ్-అల్-రసూల్, వాల్ ములుక్ గొప్ప గ్రంథాలుగా ఖ్యాతిగాంచాయి. అల్బెరూనీ రచన ‘తహకీక్ మలీల్ – హింద్’ లో ఇస్లాంకు అతీతంగా ఇతర సంస్కృతి యొక్క విలువను ప్రస్తుతించే ప్రయత్నం చేయబడింది.

ఆర్థిక రీతి: వ్యవసాయ భూములు రాజ్యాధీనం. భూమి శిస్తు రాజ్యాదాయంలో అధిక భాగం. భూమిశిస్తు (ఖరజ్) పంటలో 1/2 నుండి 1/5 వరకు ఉండేది. మహమ్మదీయ రైతులు ఆధీనంలో గల భూమిపై 1/10వ వంతు పన్ను వసూలు చేసారు. అన్యమతస్థులపై పన్నుల భారం విపరీతంగా ఉండేవి. రకరకాల పంటలు పండించేవారు. యూరపు వాటి ఎగుమతులు కూడా జరిగేవి. మధ్యధరా, హిందూ మహాసముద్రాల మధ్య ఎన్నో వ్యాపార కేంద్రాలు అభివృద్ధి చెందాయి. చైనా, ఇండియా, యూరప్ల మధ్య జరిగే నౌకా మార్గ వ్యాపారం అరబ్బు, ఇరానియన్ వర్తకుల హస్తగతమై ఉండేది. ఆనాటి వాణిజ్యం ప్రధానంగా రెండు మార్గాల గుండా సాగేది.

1) ఎర్ర సముద్రం, పర్షియన్ అఖాతం మీదుగా, 2) ఇరానియన్ వర్తకుల ఆధ్వర్యంలో సిల్క్ రూట్ గుండా చైనాకు ప్రయాణం చేసేవారు. ఈ వ్యాపారంలో బంగారు, వెండి నాణేలు చలామణీలో కొనసాగాయి. సుడాన్ నుండి బంగారం, మధ్య ఆసియా నుండి వెండి లభించేవి. అరువు పత్రాలు సక్ (ఆధునిక కాలపు చెక్కు) వంటివి వర్తకులు, బ్యాంకర్లు ద్రవ్య మార్పిడికి వాడేవారు.

ఈ విధంగా మధ్యయుగ చరిత్రలో అరబ్బులు ప్రముఖ స్థానాన్ని ఆక్రమించారు. వీరి ద్వారా ఐరోపా వారు భారతీయుల పరిజ్ఞానాన్ని, గ్రీసువారి మహాకావ్యాలను గురించి తెలుసుకున్నారు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఖలీఫా
జవాబు:
క్రీ.శ 632లో మహమ్మద్ మరణాంతరం అరేబియాలోని ప్రముఖులు అబూబాకర్ అనే మహమ్మద్ ప్రవక్త స్నేహితుడిని అతని వారసునిగా గుర్తించారు. అతన్ని ఖలీఫా లేదా కాలిఫ్ అని పిలిచేవారు. ఖలీఫా అనే అరబిక్ పదానికి వారసుడు అనే అర్థం ఉంది. అబూబాకర్ తర్వాత ‘ఉమర్’ ఖలీఫా అయ్యాడు. ఖలీఫా అంటే యావత్ ముస్లిం ప్రపంచానికి రాజకీయ, మతపరంగా మహ్మద్ ప్రవక్తకు వారసుడుగా గుర్తింపబడిన వ్యక్తి. అతనికి మత, రాజకీయ అధికారాలు ఉండేవి. మొదటి నలుగురు ఖలీఫాల తర్వాత ఖలీఫా పదవి వంశపారంపర్యమైంది. ‘ఉమయ్యద్లు, ”అబ్బాసిడ్లు,’ ‘ఆట్టోమన్లు’ సుదీర్ఘకాలం ఖలీఫాలుగా ఉన్నారు. ఒక శతాబ్దకాలంలో ఖలీఫాలు ఇరాన్, సిరియా, ఈజిప్ట్, మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికా, స్పెయిన్ ప్రాంతాలలో అతి విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించారు. మతప్రచారం పట్ల వారికున్న ఉత్సాహం, భాగ్యవంతమైన ప్రదేశాలనాక్రమించుకోవాలనే కోరిక వారి అద్భుత విజయాలకు కారణమయింది. సుదీర్ఘకాలం కొనసాగిన ఖలీఫా వ్యవస్థను మొదట ప్రపంచ యుద్ధం తర్వాత ఆధునిక టర్కీ జాతిపిత అయిన ముస్తాఫా కమాల్పాషా 1923లో రద్దు చేసాడు.

ప్రశ్న 2.
క్రూసేడులు.
జవాబు:
క్రీ.శ. 638లో జెరూసలేంను అరబ్బులు ఆక్రమించారు. అయినప్పటకీ క్రైస్తవ యాత్రికులు ఏసుక్రీస్తు జీవితానికి సంబంధించిన పవిత్ర స్థలాలు చూడటానికి అనుమతించబడ్డారు. క్రీ.శ.11వ శతాబ్ది మధ్యకాలానికి పరిస్థితులు మారిపోయాయి. ఐరోపా క్రైస్తవులు, అరబ్బులు మధ్య పరంపరాగత ఘర్షణలు తలెత్తాయి.

సెలుక్ తురుష్కులు మధ్య ప్రాచ్యంలో మత దురహంకారంతో క్రైస్తవ యాత్రికులను బాదించసాగారు. వీరి దుర్మార్గాలను విని చలించిపోయిన ‘పోప్ రెండవ అర్బన్’ క్రైస్తవ రాజ్యాలన్నీ కలిసి తురుష్కులను ఎదుర్కోవాలని ప్రబోధించాడు. పవిత్రభూమిని (పాలస్తీనా) విముక్తి చేయాలని ఆదేశించాడు. ఇది కాస్తా రెండు శతాబ్దాల పాటు రెండు ఏకేశ్వరోపాసన మతాల మధ్య భీకర యుద్ధాలకు, ఎంతో రక్తపాతానికి దారి తీసింది.

AP Inter 2nd Year History Study Material Chapter 4 భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

విశేష క్రైస్తవ ప్రజానీకం పవిత్రయుద్ధానికి సిద్ధమయ్యారు. కులీనులు, వర్తకులు, సైన్యాధికారులు, నేరస్థులు, భూస్వాములు, జులాయిలు, సాహసికులు ఇలా ఎందరో యుద్ధంలో చేశారు. ఫ్రాన్స్, ఇటలీ సైన్యాలు 1099 నాటికి జెరూసలేంను ఆక్రమించుకోవడం జరిగింది. క్రీ.శ 1187 నాటికి సలాదిన్ చక్రవర్తి తిరిగి జెరూసలేంను ఆక్రమించుకున్నాడు. క్రైస్తవ, మహమ్మదీయుల మధ్య నాలుగు ప్రధాన యుద్ధాలు జరిగాయి. కానీ రెండు శతాబ్దాల పోరాటం తరువాత కూడా జెరూసలేం తురుష్కుల చేతిలో ఉండిపోయింది. అంతటా ఇస్లాం వ్యాపించింది. క్రైస్తవుల సంస్కృతి, యుద్ధ పద్ధతులకన్నా ముస్లింల నాగరికత బలమైనదని నిరూపితమయింది. క్రూసేడులలో పాల్గొనుట వలన ప్రభువులు, భూస్వాములు మరణించడంకాని, దరిద్రులవడం కాని జరిగి భూస్వామ్య వ్యవస్థ క్షీణించింది. ఐరోపాలో పోప్ ఆధిక్యత తగ్గింది. క్రూసేడులు మతం వల్ల ఉత్తేజితమై, వర్తక వ్యాపార అభివృద్ధితో పారిశ్రామిక ప్రగతితో, సాంస్కృతిక పునరుజ్జీవనంతో ముగిసాయి.

ప్రశ్న 3.
మధ్య ఇస్లాం ప్రాంతాలు ఆర్థిక రీతి.
జవాబు:
వ్యవసాయ భూములు రాజ్యాధీనం. భూమిశిస్తు రాజ్యాదాయంలో అధికభాగం. భూమిశిస్తు(ఖరజ్) పంటలో 1/2 నుండి 1/5 వరకు ఉండేది. మహమ్మదీయ రైతు ఆధీనంలో గల భూమిపై ఆదాయంలో 1/10వ వంతు వసూలు చేస్తే అన్యమతస్థులపై పన్నుభారం విపరీతంగా ఉండేది. పాలకులు కేటాయించిన భూములను ‘ఇక్తా’లు అనేవారు.
నైలునది లోయలో రాజ్యం ఆధీనంలో గల సాగునీటి వనరులు ఉండేవి. ప్రత్తి, నారింజ, అరటి వంటి అనేక రకాలు పండించబడేవి. యూరప్కు ఎగుమతులు కూడా జరిగేవి. నాడు కూఫా, బస్రా, కైరో, బాగ్దాద్, డమాస్కస్లు ప్రసిద్ధి చెందిన నగరాలు.

మధ్యదరా, హిందూ మహా సముద్రాల మద్య ఎన్నో వ్యాపార కేంద్రాలు అభివృద్ధి చెందాయి. చైనా, ఇండియా, యూరప్ మధ్య జరిగే నౌకా వ్యాపారం అరబ్బు, ఇరానియన్ వర్తకుల హస్తగతమై ఉండేది. ఆనాటి వాణిజ్యం రెండు ప్రధాన మార్గాల గుండా జరిగేది. 1) ఎర్ర సముద్రం పర్షియన్ అఖాతం మీదుగా 2) ఇరానియన్ వర్తకుల ఆధిపత్యంలోని సిల్క్ రూట్ గుండా సమర్ఖండ్ల మీదుగా చైనాకు ప్రయాణం చేసేవారు. ఈ వ్యాపార అల్లిక మార్గంలో ట్రాన్స్ ఆక్సియానా ఒక ప్రముఖ గొలుసు లేదా వలయం. నాటి వ్యాపారంలో బంగారు, వెండి నాణేలు చలామణిలో కొనసాగాయి. సుడాన్ నుండి బంగారం, మధ్య ఆసియాలోని జరఫన్య నుండి వెండి లభించేది. అరువు పత్రాలు, చెట్లు వాటి వర్తకులు, బ్యాంకర్లు ద్రవ్యమార్పిడికి ఉపయోగించారు.

ప్రశ్న 4.
ఇస్లాం మత కట్టడాలు.
జవాబు:
అరబ్బులు గొప్ప భవన నిర్మాతలు. అరబ్బుల కళలు ఇరాన్, బైజాంటియన్ సామ్రాజ్యాలచే ప్రభావితం చెందాయి. వారు ప్రత్యేకమైన నిర్మాణశైలి కలిగి ఉన్నారు. వారి వాస్తు శిల్పకళా ప్రక్రియలు మసీదులలోనే కాక పుస్తక భాండాగారాలలో, వైద్యశాలల్లో, విద్యాసంస్థలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పరిపాలకుల ఆదరణలో ఎన్నో గొప్ప భవనాలు రూపు దిద్దుకున్నాయి. నాటి ప్రసిద్ధ కట్టడాలలో ‘అల్హమ్రా భవనం (స్పెయిన్లోని గ్రనడా వద్ద), అల్కాజర్ (సెవిలె వద్ద) గొప్పమసీదు (బాగ్దాద్) కలవు. డోమ్, ఆర్చి, మినారట్ల ప్రక్రియ వారి వాస్తుశైలికి నిదర్శనం.

ఖురాన్ మానవులను, జంతువులను సూచించే బొమ్మలను నిషేధించినందున మహమ్మదీయ కళాకారులు రాజభవనాల, మసీదుల లోపలి, బయటి గోడలపై చెక్కుడు పనితనాన్ని చూపారు. మసీదు, రాజభవనాల చుట్టూ అందమైన తోటలు, ఎగజిమ్మే నీటి ఊటలు నిర్మించారు. వారి రాజభవనాలలో రోమన్, ససానియన్ కళావిశేషాల్ని మేళవించారు. వాటిలో మితిమీరిన అలంకరణ కన్పిస్తుంది. అబ్బాసిడ్లు సమర్రాలో నిర్మించిన సామ్రాజ్య నగరం తోటలతో, ప్రవహించే నీటి ఊటలతో బహుసుందరంగా ఉండేది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఇస్లాం కాలెండర్.
జవాబు:
ఇస్లాం కాలెండరే హిజరీ కాలెండర్ అంటారు. క్రీ.శ. 622లో హిజరా యుగం ప్రారంభమయింది. ఈ యుగంలో AH (Anno Hegirae(లాటిన్) In the year of the Hijra)తో గుర్తించబడుతోంది. మహమ్మద్ క్రీ.శ. 622లో మక్కా నుండి మదీనాకు ప్రవాసం పోవడాన్ని ‘హిజరా’ గా గుర్తించారు. ఇస్లాం కాలెండర్, చాంద్రమానాన్ని అనుసరించి ఉంటుంది. 12 నెలలు 354 రోజులు ఉంటాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 4 భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

ప్రశ్న 2.
ఫాతిమా.
జవాబు:
ఫాతిమా మహమ్మద్ ప్రవక్తకు, ఖదీజాకు జన్మించిన కుమార్తె. క్రీ.శ 604లో జన్మించింది. ఫాతిమాను ‘ఆలీ’ వివాహమాడాడు. మహ్మద్ ప్రవక్త (తండ్రి)తో ఎంతో సన్నిహితంగా ఉంటూ, తండ్రి కష్టకాలంలో తోడుగా ఉంది. భర్తను పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకొనేది. మహ్మద్ ప్రవక్తకు వారసులు ఫాతిమా ద్వారానే వ్యాపించారు. ఈ విధంగా యావత్ ముస్లిం ప్రపంచంలో ‘ఫాతిమా’ ఒక ఆదర్శమహిళగా గుర్తింపు పొందింది.

ప్రశ్న 3.
ఖురాన్.
జవాబు:
మహ్మద్ ప్రవక్త స్థాపించిన నూతన మత సారాంశం ‘ఖురాన్’ అనే మత గ్రంథంలో కనుగొనవచ్చు. అరబిక్ భాషలో ఖురాన్ అనగా కంఠస్తం చేయడం. ఇస్లాం మత సిద్ధాంతాలకు మూలాధారం ఖురాన్.

అరబిక్ భాషలోని ఖురాన్ 114 అధ్యాయాలు (సురలు)గా విభజింపబడింది. అరబ్బు సంప్రదాయాన్ని బట్టి మహ్మద్ ప్రవక్తకు భగవంతుడు తెలియజేసిన సందేశాల సంపుటియే ఖురాన్. ప్రస్తుతం లభిస్తున్న ఖురాన్లలో అత్యంత ప్రాచీనమైనది. 9వ శతాబ్దానికి చెందినది. ప్రపంచంలోని మేటి గ్రంథాలలో ఒకటిగా ఖురాన్ గుర్తింపు పొందింది.

ప్రశ్న 4.
వైద్య సూత్రాలు.
జవాబు:
వైద్య శాస్త్రంలో అరబ్బుల ప్రగతి గణనీయమైనది. అవిసెన్నా రచించిన ‘అలనూన్ఫెల్ టిబ్’ అన వైద్యగ్రంథంలో 760 రకాల మందుల గురించి పేర్కొన్నారు. లంకణం పరమౌషధమని, కొన్ని వ్యాధులు ఉపవాసం చేయుట ద్వారా తగ్గిపోతాయని ఈ గ్రంథం పేర్కొంది.

ప్రశ్న 5.
షహనామ.
జవాబు:
షానామ అనే దీర్ఘ చారిత్రక కావ్యాన్ని గొప్ప పారశీక కవి ఫిరదౌసి రచించాడు. దాదాపు 60,000 పద్యాలతో ఉన్న ఈ కావ్యంలో ప్రాచీన పర్షియాను పాలించిన రాజుల యొక్క చరిత్ర వివరించబడింది. క్రీ.శ. 977లో ప్రారంభించిన ఈ కావ్యం క్రీ.శ. 1010 సంవత్సరంలో పూర్తయింది. సాహిత్య చరిత్రలోని అత్యుత్తమ కావ్యాలలో ఒకటిగా ఫిరదౌసి
నిలిచింది.

AP Inter 2nd Year History Study Material Chapter 4 భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

ప్రశ్న 6.
మదర్సాలు.
జవాబు:
మదర్సా అనే అరబిక్ పదానికి విద్యాసంస్థ అని అర్థం. మహమ్మదీయులు మదర్సాలు అనే విద్యా కేంద్రాలుగా స్థాపించారు. మదర్సాలు మసీదులకు అనుబంధ కేంద్రాలుగా వృద్ధి పొందాయి. బాగ్దాద్ లో గల ‘ముస్తాన్ సిరియా’ మదర్సా 1233లో నెలకొల్పబడింది. అలెగ్జాండ్రియా, సిరియా, మెసపిటోమియాలోని మదర్సాలలో గ్రీకుతత్త్వ శాస్త్రం, గణితం, వైద్యశాస్త్రం బోధింపబడేది. అనువాదం అనేది మదర్సాలలోని ముఖ్య ప్రక్రియలు ఒకటి. అనేక భారతీయ ఖగోళ, గణిత, వైద్య గ్రంథాలు ఇలా అనువాదం చేయబడ్డాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 3 ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 3rd Lesson ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 3rd Lesson ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మానవాళికి రోమనులు అందజేసిన వారసత్వం గూర్చి చర్చింపుము.
జవాబు:
రోమ్ సామ్రాజ్య వైభవ కాలంలో వారు ఈజిప్ట్, బాబిలోనియా, గ్రీస్, పశ్చిమ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా భూభాగాలను పరిపాలించారు. ప్రాక్ దేశాల నాగరికత, సంస్కృతులకు రోమనులు వారసులయ్యారు. ఆ నాగరికతలను అనుసరించడమే కాక రోమన్లు కూడా ఎన్నో నూతన విషయాలను, భావాలను కల్పనలను ప్రపంచ సంస్కృతికి ప్రసాదించారు.
రోమన్లు మతము, తత్వశాస్త్రము, కళలు, భవననిర్మాణం, విజ్ఞానం, పాండిత్యం వంటి అనేక భావాలను గ్రీకుల నుండి గ్రహించారు. కేంద్ర, ప్రాదేశిక ప్రభుత్వపాలన, న్యాయసూత్రాలు, పన్నుల విధింపు సూత్రాలు, పౌరహక్కులు, వైద్య, ఆరోగ్య, మురుగు పారుదల విధానాలు, ప్రజోపయోగ పనులు, రహదారులు, నీటి ఊటలు, రంగస్థల వేదికలు, స్నానవాటికలు, వంతెనలు వంటి అనేక పనులు చేపట్టారు. రోమన్ ఇంజనీరింగ్ పరిజ్ఞానానికి వారి రహదారులు, నీటి సరఫరా పద్ధతులు నిదర్శనాలు.

న్యాయ సూత్రాలు : రోమన్ న్యాయశాసనాలు, పాలనా సిద్ధాంతాలు వారు ప్రపంచ నాగరికతకు చేసిన సేవలలో అత్యంత ప్రముఖమైనవి, శ్లాఘనీయమైనవి. వారి న్యాయశాసనాలు నేటి ప్రపంచంలోని దాదాపు అన్ని నాగరిక రాజ్యాలపై సంపూర్ణ ప్రభావాన్ని చూపాయి. 12 ఫలకాలపై రాసిన న్యాయసూత్రాలతో రోమన్ న్యాయశాస్త్రం ఆరంభమైనదని చెప్పవచ్చు. క్రీ.పూ. 150 నాటి ఈ 12 ఫలకాలు కంచుతో చేయబడి వ్యాపారకూడలి ప్రాంతాలలో ప్రదర్శించబడ్డాయి.

న్యాయాధీశులు ఇచ్చిన తీర్పులు రాయబడని చట్టాలై చిరస్థాయిని పొందాయి. ఘనమైన జస్టీనియన్ చక్రవర్తి ఈ న్యాయసూత్రాలను క్రోడీకరించుటతో వీటిని జస్టీనియన్ కోడ్ అన్నారు. రోమన్ న్యాయశాసనాలు సహజమైనవి. దయాగుణం కలవి. ప్రపంచంలోని అనేక రాజ్యాలు రోమన్ న్యాయసూత్రాలను ఆధారం చేసుకుని కొన్ని మార్పులతో, చేర్పులతో తమ న్యాయ సిద్ధాంతాలను రూపొందించుకున్నాయి. రోమన్ న్యాయశాసనం నిందితునికి తన వ్యాజ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఇస్తుంది. నేరనిరూపణ జరిగే వరకు నిందితుడిని శిక్షించకూడదు. మరొక గొప్ప అంశమేమిటంటే పౌరులు ఎంత గొప్పవారైనా, బీదవారైనా చట్టం ముందు అందరూ సమానులే.

AP Inter 2nd Year History Study Material Chapter 3 ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం

మతం : ప్రాచీన రోమనులు దేవతలను, ఆత్మలను ఆరాధించారు. జూపిటర్, జునో, మార్స్, నెప్ట్యూన్, వీనస్లు వీరి దైవాలు. రోమన్లు అతీత శక్తులను విశ్వసించారు. దేవతలనారాధించడం వ్యక్తిగత విషయంగా కాక సామూహిక విధిగా రోమనులు భావించారు. జూదాతత్వం, క్రైస్తవమత బోధనలు నాడు ప్రచారంలో ఉన్నాయి.

తత్వశాస్త్రం : గ్రీకు తత్వశాస్త్రంలోగల స్థాయిసిజమ్, ఎకి క్యూరియానిజమ్ రెండూ రోమన్లను ప్రభావితపరచాయి. రోమన్ చింతనాపరులు స్థాయిక్ తత్వాన్ని ప్రచారం చేసారు. స్థాయిన్ తత్వవేత్తలలో ‘పనేషియస్’, ‘సేనేకా’ మరియు చక్రవర్తి ‘మార్కస్ అరీలియస్’ ప్రముఖులు. మార్కస్ అరీలియస్ తన భావాలను ‘మెడిటేషన్స్’ అనే గ్రంథంలో తన భావాలను వ్యక్తం చేసాడు. తాను చక్రవర్తి అయి ఉండి కూడా భోగభాగ్యాలకు దూరంగా నిరాడంబరంగా బ్రతికాడు.

సాహిత్యం : రోమన్ లు జిజ్ఞాసాపరులు. అలంకార, వ్యాకరణ, తర్క, ఖగోళ, గణిత, వైద్యశాస్త్రాలలో అధ్యయనం జరిగేది. అగస్టస్ కాలంలో లాటిన్ సాహిత్యం మహోన్నత శిఖరాలనందుకుంది. ఈ లాటిన్ యూరప్లోని అనేక | భాషలకు మూలధారంగా నిలచింది.

శాస్త్రవిజ్ఞానం : వైద్య విషయాలను గూర్చి ‘గాలన్’ కొన్ని పరిశోధనలు చేయడమే కాక, ‘వైద్య విజ్ఞాన సర్వస్వాన్ని’ రచించాడు. రోమన్ సామ్రాజ్యంలో ‘గాలన్’ గొప్ప వైద్యుడు. మానవ శరీర అవయవాలు, రక్తప్రసరణపై 500 పైగా గ్రంథాలు రచించాడు. ప్లిని ‘నేచురల్ హిస్టరీ’ రచించాడు. ఇది ఒక శాస్త్ర విజ్ఞానాల సర్వస్వం. రోమన్లు కాలెండర్ను అభివృద్ధి చేసారు. ఎన్నో నెలల పేర్లు రోమన్ చక్రవర్తులవే. జూలియస్ సీజర్ పేరున జూలై, ఆగస్టస్ పేరున ఆగస్ట్ నెలలు పిలువబడ్డాయి. సెప్టెంబర్, అక్టోబర్ లు లాటిన్ భాషలో తొమ్మిది, పది అని అర్థం. జాలియస్ కేలండర్ను సొసిజెనెస్ అనే అలెగ్జాండ్రియాకు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు తయారు చేసాడు.

ఈ విధంగా రోమన్ వాఙ్మయం, న్యాయశాస్త్రం, పాలనావిధానం, కళలు కూడా వారి మేథాశక్తికి, సంస్కృతికి చిహ్నాలుగా మిగిలిపోయాయి. రోమన్ న్యాయశాస్త్రం అనేక నాగరిక దేశాలకు ఒక నమూనాగా నిలిచిపోయింది. విశాల సామ్రాజ్య నిర్మాణంలో, అసంఖ్యాక జన సమూహాల్ని ఒక బలీయమైన జాతిగా తీర్చిదిద్దడంలో రోమన్లు గొప్ప పాత్రను పోషించారు.

ప్రశ్న 2.
రోమన్ సాంఘిక, ఆర్థిక వ్యవస్థల ప్రాథమిక లక్షణాలు పేర్కొనుము.
జవాబు:
సాంఘిక వ్యవస్థ : రోమ్ సాంఘిక వ్యవస్థలో ప్రముఖ వర్గాలున్నాయి. వారిని పేట్రిసియన్స్, ప్లీబియన్స్ అని పిలిచేవారు. పేట్రిసియన్స్ రాజకీయ, సాంఘిక, ఆర్థిక హక్కులను కలిగి ఉండేవారు. రోమన్ రాజ్యవ్యవస్థలో సెనేట్ ముఖ్యమైన సభ. సెనేట్ అధికారాలన్నీ భూస్వాములు, ఐశ్వర్యవంతులైన పేట్రీసియన్లు చలాయించగా, ప్లీబియన్స్ పిలవబడే పనివాళ్ళు, చిన్నరైతులు, వృత్తికళాకారులు, చిన్న చిన్న వరక్తకులు, సైనికులు మొదలైన వారికి హక్కులు తక్కువ. కానీ వారు చెల్లించవలసిన పన్నులు ఎక్కువగా ఉండేవి. కాగా రోమన్ న్యాయశాసనాలు ప్లేబియన్లు, పేట్రిసియన్లకు సమానంగా వర్తింపజేయబడ్డాయి.

రోమన్ సాంఘిక జీవనంలో ఉమ్మడి కుటుంబాలకు బదులు ఏకీకృత చిన్న కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగింది. పెండ్లి అయిన అమ్మాయికి తను పుట్టి పెరిగిన కుటుంబంలో ఆస్తిహక్కు కలదు. వివాహిత స్త్రీకి చట్టబద్ధమైన స్వేచ్ఛ ఉంది. విడాకులు పొందడం అంత కష్టమేమీ కాదు. పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా జరిగేవి. భార్యను హింసించడం సామాన్య విషయంగా మారింది. సమాజంలో బిషప్పులు మతగురువులు. మతగురువులు సమాజంలో చాలా శక్తివంతమైన వారుగా ఉండేవారు. పిల్లలపై తల్లిదండ్రులకు చట్టబద్ధ అధికారాలుండేవి.

రోమన్ సమాజంలో బానిసత్వం ఒక పాతుకుపోయిన సాంఘిక దురాచారం. పై తరగతికి చెందిన రోమన్లు బానిసలను పైశాచికంగా చూసేవారు. వారి సాంఘిక వ్యవస్థలో మూడు వర్గాలు కలవు. సెనేటర్లు, మధ్య తరగతి మరియు దిగువ తరగతి గ్రామీణ శ్రామిక శక్తి దిగువ తరగతిగా ఏర్పడింది. నైట్స్ లేదా అశ్వదళాధిపతులు సాంప్రదాయకంగా శక్తిమంతులు. ధనిక వర్గానికి చెందినవారు. వారిలో చాలా మంది భూస్వాములు కలరు. సైనికులు, సైన్యాధికారులు, భూయజమానులలో చాలా మంది అక్షరాస్యులు. నాటి సమాజంలో సాంస్కృతిక వైవిధ్యం కన్పిస్తుంది. భిన్న మతాచారాలు, విభిన్న భాషలు, వివిధ రకాల వేషధారణ, అనేకరకాల ఆహారపుటలవాట్లు ఆ ప్రజలలో ఉండేవి. అరమిక్, కాప్టిక్, సెల్టిక్, లాటిన్ వంటి వివిధ భాషలు మాట్లాడేవారు. ప్రజలలో అధికులు లాటిన్ భాష మాట్లాడేవారు.

ఆర్థిక వ్యవస్థ : రోమన్ సామ్రాజ్యంలో ఆర్థికంగా మౌలికరంగానికి చెందిన హార్బర్లు, లోహఖనిజాలు, క్వారీలు, ఇటుకల, పరిశ్రమ, నూనె పరిశ్రమలు గణనీయమైనవి. గోధుమ, ద్రాక్ష సారాయి, ఆలివ్ననెల వ్యాపారం ముమ్మరంగా జరిగేది. ద్రవ పదార్థాలు ‘ఆప్ఫోరె’ అనే కంటైనర్లలో రవాణా చేయబడినవి. ఆసియా మైనర్ (టర్కీ), సిరియా, పాలస్తీనా వంటి ప్రదేశాల నుండి ద్రాక్షసారాయి, ఆలివ్ నూనెలు ఎగుమతి అయ్యేవి. కంపానియా నుండి ఉత్తమశ్రేణి సారాయి లభించేది. సిసిరీ, బైజాసియాని ప్రాంతాల నుండి గోధుమలు రోమ్ నగరానికి ఎగుమతి చేయబడేవి.

AP Inter 2nd Year History Study Material Chapter 3 ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం

రోమన్ సామ్రాజ్యంలో విశిష్టమైన సారవంతమైన ప్రాంతాలు ఎన్నో కలవు. ‘గలీలీ’ సాంద్ర వ్యవసాయానికి పేరుగాంచింది. అత్యాధునిక హైడ్రాలిక్ గని త్రవ్వకాల సాంకేతికతను చేపట్టి స్పానిష్ బంగారు, వెండి గనులు ప్రఖ్యాతి చెందాయి. రోమన్లు వాణిజ్య బ్యాంకింగ్ రంగంలో గణనీయమైన విజయాలు సాధించారు. వీరు విస్తృతంగా ద్రవ్య వినియోగం చేసేవారు. నాటి గ్రామీణ ఋణ గ్రస్తత కూడా విస్తృతమైనది. సామ్రాజ్యంలోని పెద్ద భూస్వాములు మార్కెట్లపై అదుపు సాధించడానికి పోటీపడేవారు. ‘డెమేరియస్’ అనే వెండి నాణెంను 41/2 గ్రాముల శుద్ధమైన వెండితో తయారు చేసారు. రోమన్లు బ్రహ్మాండమైన నిర్మాణాలు చేసారు. ఆనాటి ఇంజనీర్లు నిర్మించిన పెద్ద అక్విడెట్లు మూడు ఖండాలలో నీటి పారుదలను మెరుగుపరచాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1. 12 ఫలకాలపై రాసిన న్యాయసూత్రాలు.
జవాబు:
రోమన్ న్యాయశాసనాలు, పాలనా సిద్ధాంతాలు వారు ప్రపంచ నాగరికతకు చేసిన సేవలలో అత్యంత ప్రముఖమైనవి. శ్లాఘనీయమైనవి, వారి న్యాయశాసనాలు నేటి ప్రపంచంలోని దాదాపు అన్ని నాగరిక రాజ్యాలపై సంపూర్ణ ప్రభావాన్ని చూపాయి. 12 ఫలకాలపై వ్రాసిన న్యాయసూత్రాలతో రోమను న్యాయశాస్త్రం ఆరంభమైనదని చెప్పవచ్చు. క్రీ.పూ. 150 నాటి ఈ 12 ఫలకాలు కంచుతో చేయబడి వ్యాపారకూడలి ప్రాంతాలలో ప్రదర్శించబడ్డాయి.

ప్రశ్న 2.
రోమన్ సామ్రాజ్య చరిత్రకు లభించు చారిత్రక ఆధారాలు.
జవాబు:
ఖండాంతరాలలో ఖ్యాతినార్జించిన ప్రాచీన రోమన్ సామ్రాజ్య చరిత్రకు విస్తారంగా ఆధారాలు లభించాయి. లిఖిత ఆధారాలు : లివీ రచించిన ‘అన్నాల్స్’ (రోమ్ చరిత్ర); వర్జిల్ రచించిన ఏనియడ్; లుక్రేషియస్ ప్రకృతి రహస్యం; ఓవిడ్ హెరాస్, ప్లిని – నేచురల్ హిస్టరీ; టాసిటస్ – ఏనల్స్ + హిస్టరీ; చక్రవర్తి మార్కస్ అరలియస్ – మెడిటేషన్స్; జస్టీనియన్ చక్రవర్తి సంకలనం చేసిన న్యాయస్మృతి జస్టీనియన్ కోడ్, ఇవన్నీ ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ, న్యాయ, తాత్త్విక పరిస్థితులను మనకు తెలియజేస్తున్నాయి.

కట్టడాలు: రోమన్ ఇంజనీరింగ్ వైభవానికి చిహ్నాలుగా అనేక కట్టడాలు రోమ్, కార్తేజ్ ఆంటియోస్ అలెగ్జాండ్రియా, కాన్స్టాంట్్నపుల్ ఇంకా అనేక చోట్ల లభించాయి. ఎత్తైన స్తంభాలు, ఆర్చ్ లు గుమ్మటాలు, అక్విడక్ట్లు, కలోసియాలు, ప్రజాస్నాన వాటికలు ఎన్నో నాటి సాంకేతిక వైభవాన్ని చాటుతున్నాయి.

త్రవ్యకాలు: వెసూవియస్ అగ్నిపరత్వం దగ్గరలో ఉన్న పాంపేయీ నగరాన్ని క్రీ. శ. మొదటి శతాబ్దిలో హఠాత్తుగా బద్దలయిన పర్వతం లావా క్రింద నగరం పూడిపోయింది. దాదాపు 10 మీటర్లు మందం లావా క్రింద పూడుకపోయిన నగరాన్ని త్రవ్వకాలలో వెలికితీసారు. ఈ త్రవ్వకాలలో వీధులు, నివాసగృహాలు, ఫోరమ్, ఆంఫిధియేటర్, స్నానాగారాలు, దేవాలయాలు బయటపడ్డాయి.

శాసనాలు, నాణేలు : ఆగస్టస్ చక్రవర్తి వేయించిన శాసనం, ‘డెమిరియస్’ అనే 41/2 గ్రా వెండి నాణెం నాటి పరిస్థితులను తెలుపుతున్నాయి. ఇంకా అసంఖ్యాకంగా విగ్రహాలు, వర్గచిత్రాలు నాటి వైభవాన్ని చాటి చెబుతున్నాయి.

ప్రశ్న 3.
జూలియస్ సీజర్.
జవాబు:
విశ్వవిఖ్యాత విజేత జూలియస్ సీజర్. ఒక సంపన్న కుటుంబంలో క్రీ.పూ. 102 సంవత్సరంలో రోమ్లో జన్మించాడు. ఆంటోనియస్ వద్ద విద్యనభ్యసించాడు. అసాధారణ శౌర్యపరాక్రమాలు, విజ్ఞత ప్రదర్శించాడు. ఒక న్యాయాధికారిగా, మత పెద్దగా, స్పెయిన్కు గవర్నర్ గా బహుముఖ కార్యాలను నిర్వహించాడు. త్రిమూర్తులుగా పేరు గాంచిన సాంపే, సీజర్, కానన్లలో సీజర్ అగ్రగణ్యుడు. వాస్తవానికి సీజర్ ఒక నియంతగా పిలవబడినా గణతంత్ర సాంప్రదాయాలకు విలువనిచ్చాడు. ఈజిప్టు రాణి క్లియోపాత్రా అందానికి బానిసై ఆమె ద్వారా ఒక కుమానికి తండ్రి అయ్యాడు. క్రీ.పూ. 46లో రోమ్ నగరానికి తిరిగి వచ్చి నియంతగా ప్రకటించుకున్నాడు. ఈజిప్ట్ రోమన్ సామ్రాజ్యానికి మిత్రరాజ్యమయింది.

స్పెయిన్, ఈజిప్టులలో చెలరేగిన తిరుగుబాట్లను, అణచివేసిన తర్వాత రోమన్ సామ్రాజ్యంలో అనేక సంస్కరణలను ఆవిష్కరించాడు. వ్యవసాయాభివృద్ధి పన్నుల తగ్గింపు, అవినీతిమయమైన నిరంకుశ అధికారుల తొలగింపు, గాల్, సిసిలీ, ప్రజలకు పౌరహక్కులు ప్రసాదించుట, ప్రభుత్వ భూముల పంపిణీ, ప్రజా పనుల కొనసాగింపు, నాణేల వ్యవస్థను మెరుగుపరచుట, జూలియన్ కేలండర్ను పరిచయం చేయడం వంటి అనేక పనులు చేపట్టాడు. న్యాయస్మృతులు పరిచయం, గ్రంథాలయ నిర్మాణం వంటి పెక్కు పనులు ప్రారంభించాడు. కానీ పూర్తి చేయలేకపోయాడు. ‘బ్రూటస్’ వంటి శత్రువులు ఏకమై సీజర్ను క్రీ.పూ.44లో హత్య చేసారు.

AP Inter 2nd Year History Study Material Chapter 3 ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం

ప్రశ్న 4.
రోమన్ ల పట్టణీకరణ.
జవాబు:
రోమన్ సామ్రాజ్యంలోని పరిస్థితులు పట్టణీకరణను ప్రోత్సహించాయి. చక్రవర్తులు కూడా అనేక ప్రజోపయోగ పనులను చేపట్టి పేదవారికి ఉపాధి కల్పించారు. ఈ కాలంలో అనేక రహదారులు, భవనాలు, వంతెనలు, ప్రదర్శనశాలలు, నీటి ఊటలు నిర్మించబడ్డాయి. వీటి నిర్మాణం కోసం ఎంతోమంది శ్రామికులు అవసరమయ్యేవారు. అలా శ్రామికులుగా, బానిసలుగా వచ్చిన వారితో నగర విస్తీర్ణం పెరుగుతూపోయాయి.

కార్తేజ్, అలెగ్జాండ్రియా, ఆంటియోక్ వంటి ప్రసిద్ధ నగరాలు మధ్యథరా తీరప్రాంతంలో చూడగలం. రోమన్ సామ్రాజ్య సిరిసంపదలు ఇలా అనేక నగరాలలో చూడవచ్చు. విన్టోనిస్సా ప్రజాస్నాననాటిక నిర్మాణం రోమన్ నాగరికత ప్రత్యేక లక్షణం. పట్టణ ప్రజానీకం ఉన్నతశ్రేణి వినోదాన్ని అనుభవించింది. పెద్ద పెద్ద ప్రదర్శనలు తరచుగా ఏర్పాటు చేయబడేవి. విన్డోనిస్సా వద్ద నిర్మించబడిన ఏంపిధియేటర్ సైనిక విన్యాసాలకు, గొప్ప ప్రదర్శనలకు నిలయం. క్రీ.శ. 79లో నిర్మించబడిన పెద్ద ప్రదర్శనశాల కలోసియమ్లో 50,000 మంది వీక్షకులు కూర్చునే సౌకర్యం కలది. ఈ కలేసియామేలలో ‘గ్లాడియేటర్స్’ క్రూరమృగాలతో పోరాడేవారు. ‘సోంపెల్లి’, ‘ఆరంజ్’, ‘టారోమినిమమ్’ వంటి ప్రదర్శనశాలలు ఇట్టివే. ప్రజలను ప్రజా సమస్యల నుండి దూరంగా ఉంచడానికి రోమన్ ప్రభువులకు ఈ ప్రదర్శనశాలలో నిత్యం జరిగే ‘హింసాత్మక కార్యక్రమాలు కొంత వరకు తోడ్పడ్డాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పేపిరస్.
జవాబు:
పేపిరస్ అనేది పేపిరస్ చెట్టు నుండి తయారు చేయబడిన పల్చని కాగితంలాంటిది. దీనిని విషయాలను రచించడానికి ఉపయోగించేవారు. పేపిరస్ ను పత్రాలను ఒక కట్టగా చుట్టేవారు. పేపిరస్ ను వ్రాతకోసం తొలిసారిగా ఈజిప్టు ప్రజలు వాడారు. పేపిరస్ చౌకగా తయారై తొందరగా చినగకుండా ఎక్కువ కాలం మన్నుతుంది. రోమన్లు సాహిత్యంగాని, లేఖలుగాని మరి ఇతర డాక్యుమెంట్లు గాని పేపిరస్ను వాడేవారు.

ప్రశ్న 2.
రిపబ్లిక్.
జవాబు:
పేట్రీషియన్లు తమ ప్రభుత్వ వ్యవస్థను ‘ప్రజా ఆశయం’ లాటిన్ భాషలో ‘రిపబ్లికా’ అనేవాళ్ళు. దాని నుండి రిపబ్లిక్ అనే మాట పుట్టింది. రిపబ్లిక్ అంటే ఒక నిర్ణీత కాలానికి ఎన్నుకోబడిన వాళ్ళచేత పరిపాలింపబడే రాజ్యం. రోమ్లో పాలన ఎన్నిక మీద ఆధారపడింది. ప్రతి సంవత్సరమూ ప్రజా సభచేత ఇద్దరు పేట్రీషియన్లు కాన్సళ్ళుగా ఎన్నుకోబడేవారు. వీరు కోర్టు తీర్పులు చెప్పడం, సైన్యానికి నాయకత్వం వహించేవారు. ఏడాది ముగిసాక వీరిలో అత్యున్నతులు సెనేట్ సభ్యులు అయ్యేవారు. సెట్కు విశేష అధికారాలుండేవి. అన్ని విషయాలు సెనేట్ లో చర్చించి అమలుచేయబడేవి.

ప్రశ్న 3.
బానిసల ఉత్పత్తి.
జవాబు:
రోమ్ చేసిన యుద్ధాల్లో చిక్కిన లక్షల కొలది ఖైదీలు బానిసలుగా మార్చబడేవారు. సకాలంలో పన్నులు కట్టని ప్లేబియన్లను కూడా బానిసలుగా మార్చడం ఉండేది. రోమ్ ఆక్రమించుకున్న ప్రాంతాలలో వందల కొద్దీ బానిస మార్కెట్లు ఉండేవి. రోజుకు 10,000 మంది బానిసలు దాక విక్రయించబడేవారు. రోమన్ బానిస యజమానులు, బానిసలను మనుషులుగా గుర్తించలేదు.

బానిసల పట్ల దయాదాక్షిణ్యాలు లేక గొడ్డుచాకిరీ చేయించేవారు. బానిసలలో బలిష్టులను గ్లాడియేటర్లుగా తీర్చిదిద్దేవారు. బానిసలను కఠినాతి కఠినంగా హింసించేవారు. దారుణ చిత్రహింసలు పెట్టేవాళ్ళు. బానిసలను రోమ్ దోచుకున్నంతగా ప్రపంచంలో మరే దేశం దోచుకోలేదు. ఎక్కడా అంతమంది బానిసలు లేరు.

AP Inter 2nd Year History Study Material Chapter 3 ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం

ప్రశ్న 4.
కలోసియమ్.
జవాబు:
రోమన్ పాలకుల విధానాలతో, గత్యంతరం లేని సోమరితనంతో, దానధర్మాలతో పాడుచేయబడిన రోమన్ పేదప్రజలకు పనిచేయాలని ఉండేది కాదు. పని చేయడం బానిసల వంతుగా బానిసల యజమానులు కూడా భావించేవారు. వీరు చక్రవర్తి నుండి ఉచిత ఆహారాన్ని, వినోదాన్ని డిమాండ్ చేసేవారు.

రోమన్ బానిస యజమానులకు, పేదవారికి వినోదార్థం గ్లాడియేటర్ల, పోరాటాల కోసం క్రీ.శ. మొదటి శతాబ్ది ఉత్తరార్థంలో రోమ్లో ‘కొలీసియం’ అనే బ్రహ్మాండమైన ఆంఫిథియేటర్ నిర్మించబడింది. ఈ కొలీసియంలో 50,000 మంది వరకు ప్రేక్షకులు కూర్చొనవచ్చు. ఈ కలోసియంలో గ్లాడియేటర్లు క్రూరమృగాలతోను, తమలో తాము పోరాడేవారు.

ప్రశ్న 5.
అగస్టస్.
జవాబు:
అగస్టస్ పేరు మార్చుకున్న జూలియస్ సీజర్ వారసుడు ఆక్టివియన్ రిపబ్లికన్ను అంతం చేసాడు. రోమ్ చరిత్రలో అగస్టస్ కాలం స్వర్ణయుగంగా బాసిల్లింది. శాంతి సౌభాగ్యాలకు ప్రతీకగా నిలిచింది. క్లిష్టపరిస్థితులలో పేదవారికి ఆగస్టస్ ఉచితంగా ఆహార పదార్థాలిచ్చి సంతోషపరచాడు. అనేక ప్రజాపనులను చేపట్టి పేదవారికి ఉపాధి కల్పించాడు. ఈ కాలంలో అనేక రహదారులు, వంతెనలు, భవనాలు, ప్రదర్శనశాలలు, నీటి ఊటలు నిర్మించబడ్డాయి. కలోసియమ్ వీటన్నింటిలో ప్రసిద్ధమైన కట్టడం 50,000 మంది ఒకేసారి కూర్చోగల ప్రదర్శనశాల. అగస్ట్ కాలంలో రోమ్ వాణిజ్యకేంద్రంగా ఉండేది. భారత, చైనాలతో సహా అనేక దేశాలతో సంబంధం కలిగిఉండేది.

ప్రశ్న 6.
కాన్స్టాంటైన్ చక్రవర్తి.
జవాబు:
డియోక్లిటియన్ పాలన అనంతరం అధికారం కోసం కాన్స్టాంటిన్ అనే సేనానాయకుడు ఎన్నో కుట్రలు, అరాచకాలు చేసి అధికారంలోకి వచ్చాడు. సింహాసనాన్ని కాంక్షిస్తున్నాడనే అనుమానంతో కన్నకొడుకును కూడా వధించాడు. ప్రజలను బానిసలను అధిక పన్నులతో తీవ్రంగా వేధించాడు.

తన అధికారాన్ని బలపరచుకోవడానికి కన్స్టంటైన్ క్రైస్తవ చర్చిని వినియోగించుకున్నాడు. చర్చికి డబ్బులు, భూములు, విలువైన వస్తువులు ధారాళంగా ఇచ్చాడు. బాస్ఫరస్ జలసంధి తీరంలో బైజాంటియమ్ అనే గ్రీకు వలస ఉన్నచోట కాన్స్టంటెన్ ఒక నగరాన్ని నిర్మించాడు. దీనినే కాన్స్టాంట్్నపిల్ అన్నారు. కాన్స్టంటిస్ ఎన్ని క్రూరకర్మలు చేసినా క్రైస్తవులు అతడిని పవిత్ర పురుషుడిగా ప్రకటించారు.

AP Inter 2nd Year History Study Material Chapter 2 ప్రపంచ ప్రాచీన నాగరికత – మెసపిటోమియా – వ్రాత విధానం – నగర జీవనం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 2nd Lesson ప్రపంచ ప్రాచీన నాగరికత – మెసపిటోమియా – వ్రాత విధానం – నగర జీవనం Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 2nd Lesson ప్రపంచ ప్రాచీన నాగరికత – మెసపిటోమియా – వ్రాత విధానం – నగర జీవనం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న1.
మెసపిటోమియా నాగరికత ప్రధాన లక్షణాలు రాయండి.
జవాబు:
నాగరికత అనగా మానవ సమాజంలో వచ్చిన మేధాసంపత్తి, సాంస్కృతిక, నిత్యజీవన విధానంలో వచ్చిన అభివృద్ధి. అతి ప్రాచీన ప్రపంచ నాగరికతలలో మెసపిటోమియా నాగరికత మొదటిది. హరప్పా, ఈజిప్ట్, చైనా నాగరికతలు కూడా దాదాపుగా వీటి సమకాలీన నాగరికతలు. మెసపిటోమియా, ఈజిప్ట్ నాగరికతలు అక్కాచెల్లెళ్ళుగా ప్రసిద్ధికెక్కాయి. గ్రీకు భాషలోని ‘మెసోస్’, ‘పోటమస్’ అనే పదాల కలయికతో మెసపిటోమియా ఏర్పడింది. ఈ పదాలకు ‘రెండు నదుల మధ్య ప్రదేశం’ అని అర్థం. మెసపిటోమియా యూఫ్రిటిస్, టైగ్రిస్ అనే రెండు నదుల మధ్య ప్రదేశంలో ఉంది. ప్రస్తుతం ‘ఇరాక్’ అని పిలువబడుతున్న దేశమే మెసపిటోమియా నాగరికత కేంద్రం.

భౌగోళిక పరిస్థితులు: మెసపిటోమియాలో భిన్న భౌగోళిక పరిస్థితులుండేవి. పచ్చని మైదానాలు, ఎత్తు పల్లాలుగా ఉండే భూమి, జలపాతాలు, సెలయేర్లు, పూదోటలు, చక్కని వర్షపాతంతో, పంటలతో ఆహ్లాదకరంగా ఉండేది. వ్యవసాయం, పశుపోషణ ప్రజలకు ప్రధానాధారాలు. మెసపిటోమియా దక్షిణ దిక్కున ఎడారి ప్రాంతం ఉండేది. ఈ ప్రాంతానికి ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణులలో యూఫ్రిటిస్, టైగ్రిస్ నదులు జన్మించాయి. ఈ నదుల ప్రవాహం వలన సారవంతమైన మట్టితో ఆ పరిసర ప్రాంతాలు సారవంతమైన వ్యవసాయ మైదానాలుగా మారాయి.

రాజకీయ పరిస్థితులు: ‘గిల్గిమిష్’ అనే రాజు గురించి రెండు టేబ్లెట్స్ ద్వారా వివరించబడింది. గిల్గి మిష్ “ఉర్క్’ అనే నగర రాజ్య పాలకుడు. ఎంతోమంది ప్రజలకు సహాయపడిన నాయకుడు, గొప్ప స్నేహశీలి. తన ప్రియమిత్రుని మరణంతో విచారానికిలోనై, ప్రపంచంలో సుఖ, దు:ఖాలకు మరణానికి కారణాలు తెలుసుకోవాలని దేశ సంచారం చేసాడు. ఇతడు నగర నిర్మాణంలో ప్రసిద్ధిచెందాడు.

మెసపిటోమియా నగరాలు: 1930లో పురావస్తు శాఖ చేపట్టిన పరిశోధనలలో మెసపిటోమియాలోని అనేక ప్రాచీన నగరాలు బయల్పడ్డాయి.

‘ఉర్’ పట్టణం: ఈ పట్టణంలో వీధులు అతి సన్నగా ఉండేవి. కొన్ని ప్రాంతాలలో బండ్లు తిరగడానికి సాధ్యమయ్యేది. ఈ పట్టణ నిర్మాణానికి సరైన ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) లేదని తెలుస్తుంది.

బాబిలోనియా నగరం: ప్రపంచ నాగరికతలలో ప్రముఖ పట్టణం బాబిలోనియా. ఇది 850 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉండేది. ఈ పట్టణంలో గొప్ప రాజభవనాలు, దేవాలయాలు ఉండేవి. ఈ పట్టణాన్ని క్రీ.పూ 333లో అలెగ్జాండర్ ఆక్రమించినప్పటికీ గొప్ప నగరంగా పేరొందింది.

అబూసలాభిక్ పట్టణం: క్రీ.పూ. 2500 నాటి ఈ పట్టణం పది హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఈ పట్టణ తవ్వకాలలో చేప ఎముకలు, పంది ఎముకలు లభించాయి.

ఉరుక్ పట్టణం: క్రీ.పూ 3000 సంవత్సరానికి చెందిన ఈ నగరం దేవాలయాల నగరంగా పేరొందింది. ఇది దాదాపు 250 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది.

AP Inter 2nd Year History Study Material Chapter 2 ప్రపంచ ప్రాచీన నాగరికత - మెసపిటోమియా - వ్రాత విధానం - నగర జీవనం

ఆర్థిక పరిస్థితులు: మెసపీటోమియా నాగరికత ప్రపంచంలో వ్యవసాయ ప్రక్రియను ప్రారంభించిన నాగరికత. యూఫ్రటిస్, టైగ్రిస్ నదుల వలన వ్యవసాయం విస్తృతంగా సాగింది. గోధుమ, బార్లీ, వేరుశనగ పంటలు విస్తారంగా పండేవి. ప్రజలు గొర్రెలు, మేకలను విస్తృతంగా పోషించేవారు. ఖర్జూరం, తాటికాయలు వేసవిలో సమృద్ధిగా లభించేవి.

మెసపిటోమియా ప్రజలు టర్కీ, ఇరాన్ దేశాల వారితో ఎక్కువగా విదేశీ వ్యాపారాలు ఉండేవి. ఆహార పదార్థాలు, వస్త్రాలను టర్కీ, ఇరాన్లకు ఎగుమతి చేసి వారి నుండి కలప, రాగి, వెండి, బంగారం, సముద్రగవ్వలు, విలువైన రాతి ఆభరణాలు దిగుమతి చేసుకునేవారు. ఎగుమతి, దిగుమతులకు మెసపిటోమియాలోని సహజసిద్ధమైన నదీ మార్గాలు వారికెంతగానో ఉపయోగపడ్డాయి. నాడు ‘మేరీ పట్టణం’ ప్రముఖ నౌకా రవాణా పట్టణంగా వెలుగొందింది.

సాంఘిక పరిస్థితులు: మెసపిటోమియా నాగరికత నగర జీవనానికి ప్రసిద్ధిగాంచింది. అనేక నగరరాజ్యాలు ఏర్పడ్డాయి. వాటి చుట్టూ చిన్న చిన్న గ్రామాలు విస్తరించి ఉండేవి. ఉర్ అబూసలాభిక్, ఉరుక్ ఇటువంటి నగరాలే, బాబిలోనియా నాటికే ప్రసిద్ధి చెందిన మహానగరం.

నాటి సమాజంలో ధనవంతులు, సాధారణ ప్రజల మధ్య వ్యత్యాసం స్పష్టంగా ఉండేది. ధనవంతులు మరింత ధనవంతులు కాగా సామాన్యులు తమ జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి నిరంతరం కృషి చేసేవారు.

మెసపిటోమియా నాగరికత నాటి కుటుంబాలు చిన్నవిగా ఉండేవి. తండ్రి కుటుంబానికి పెద్ద. వివాహసమయంలో కానుకలు ఇచ్చి పుచ్చుకోవడం ఉండేవి. తండ్రి ఆస్తికి కుమారుడు మాత్రమే హక్కుదారులు. కుమారైలకు బహుమతులు ఇచ్చేవారు.

మెసపిటోమియా నాగరికతలో ప్రజలు స్థానిక దేవతలను పూజించడానికి నిర్మించుకున్న దేవాలయాలను జిగూరత్లను నిర్మించుకున్నారు. వీటిని స్వర్గానికి, భూమికి మధ్య వారధిగా భావించేవారు. ప్రజలకు మూఢనమ్మకాలు ఎక్కువని తెలుస్తుంది.

శాస్త్ర – సాంకేతిక అభివృద్ధి:
వ్రాత విధానం అభివృద్ధి: ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా అక్షరాలు రాసే విధానం, జరిగిన సంఘటనలు, లెక్కలు మొదలైన వాటిని రాయడం ప్రారంభించినవారు మెసపిటోమియా ప్రజలు. సుమారు ఐదువేల సంవత్సరాలకు మనుపు రాత విధానాన్ని ప్రారంభించారు. మొదట్లో ఎక్కువగా చిత్రాలు కనిపించేవి. కాలక్రమంలో పదాలు, అర్థాలకు తగిన చిహ్నాలు అభివృద్ధి చెందాయి. ఈ పద్ధతిని ‘క్యూనిఫారమ్’ అంటారు. వీటిని మట్టిబిళ్ళలు సున్నపుముద్ద బిళ్ళలపై రాయించుట, చిత్రించుట ప్రారంభించారు. వీటిని ‘టేబ్లెట్స్’ అంటారు. వీటి వలన అనేక వివరాలు చరిత్రకారులు గ్రహించగలిగారు.

మెసపిటోమియా ప్రజలు ప్రపంచానికి అందించిన గొప్పకానుకలలో గణితశాస్త్ర అభివృద్ధి, కాలనిర్ణయ శాస్త్రం ప్రధానమైనవి. సంఖ్యాశాస్త్రంలో 6 మరియు 10 గుణకాలకు ప్రాధాన్యం ఉండేది. గుణకాలు, విభజనలు, స్క్వేర్, స్క్వేర్రూటు వంటివి మట్టిబిళ్ళలలో లభించాయి. మెసపిటోమియా వాసులు సంవత్సరానికి 12 నెలలు, నెలకు 30 రోజులు, వారానికి 7 రోజులు, గంటకు 60 నిముషాలు అనే కాల నిర్ణయ విభజనను కనుగొన్నారు. ఈ విధానం ఐరోపా, మధ్య ఆసియా దేశాలకు వ్యాపించింది. ఈ విధంగా నగర జీవనానికి, శాస్త్రీయ అభివృద్ధికి మెసపిటోమియా నాగరికత నాంది పలికింది.

ప్రశ్న 2.
వ్రాత విధానంలో మెసపిటోమియా నాగరికత పాత్ర తెలుపుము.
జవాబు:
ప్రాచీన సమాజంలోని ప్రజలు వివిధ శబ్దాలను తమ భావాలను వ్యక్తపరుచుకోవడానికి ఉపయోగించారు. వ్రాత పద్ధతి అనగా ‘ప్రజలు మాట్లాడే పదాలకు కంటికి కనబడే చిహ్నాలు’. ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా అక్షరాలు రాసే విధానం, జరిగిన సంఘటనలు, లెక్కలు మొదలైన వాటిని రాయడం ప్రారంభించినవారు. మెసపిటోమియా ప్రజలు. సుమారు ఐదు వేల సంవత్సరాలకు మునుపు మెసపిటోమియా ప్రజలు తమ భావాలు, వివరాలు, లెక్కలు వంటి వివరాలను భద్రపరచుకోవడానికి వ్రాత విధానాన్ని ప్రారంభించారు. మొదట ఈ లిపిలో ఎక్కువగా చిత్రాలు కనిపించేవి. ఆ కాలం నాటి పంటలు, వాటిపై ప్రభుత్వం విధించే పన్నుల వివరాలు ఈ చిత్రాల ద్వారా వివరించబడ్డాయి. కాలక్రమంలో వ్రాత విధానం ప్రాధాన్యత పెరిగి కొన్ని పదాలు వాటి అర్థానికి తగిన చిహ్నాలు అభివృద్ధి చెందాయి. ఈ పద్దతిని ‘క్యూనిఫారమ్’ అంటారు.

వేల సంవత్సరాల క్రితం మెసపిటోమియా వాసులు ప్రతిరోజు జరిపే లావాదేవీలు, వ్యాపారం, నక్షత్ర పరిశోధనలు, సాహిత్యం మొదలైన వాటిని మట్టిబిళ్ళలపై వ్రాయించుట, చిత్రించుట ప్రారంభించారు. వీటిని టేబ్లెట్స్ అంటారు. క్రీ.పూ 3200 కాలంలో మొదటిసారి మట్టిబిళ్ళపై వ్రాత ప్రారంభమయింది. ఈ బిళ్ళలు మట్టితోను, రాళ్ళతోను తయారుచేయబడ్డాయి. వాటి మీద చిహ్నాలు, అంకెలు ఎక్కువగా కనపడేవి. దక్షిణ మెసపిటోమియా ప్రాంతంలోని ‘ఉరుక్’ నగరంలో ఇటువంటి ‘మట్టిబిళ్ళలు’ లభించాయి. సమాజం అభివృద్ధి చెందే కొద్దీ మానవ వ్యవహారాలను రాసి భద్రపరుచుకోవలసిన అవసరం పెరుగుట వలన వ్రాత విధానం ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. మెసపిటోమియా నాగరికత నగర జీవితానికి సంబంధించినందు వలన ప్రజల మధ్య అనేక రకాలైన వ్యవహారాలు, వృత్తులు, వస్తువిక్రయాలు జరిగి వాటిని వ్రాతపూర్వకంగా భద్రపరచుకోవలసిన అవసరం ఏర్పడింది.

మట్టిబిళ్ళలు – టేబ్లెట్స్: మెసపిటోమియా వాసులు సున్నపు ముద్దతో తయారుచేసిన బిళ్ళలను ఉపయోగించారు. అరచేతిలో సరిపడే సున్నపు ముద్దబిళ్ళ తడిగా ఉన్నప్పుడు దాని ఉపరితలాన్ని నునుపుగా తయారుచేసి దానిపై పదునుగా ఉండే సూదిలాంటి పరికరంతో వివరాలు చెక్కేవారు. తడిగా ఉన్నప్పుడు రాసిన ఈ పలకలను ఎండబెడితే అవి చెరగని ముద్రలతో బిళ్ళలుగా తయారయ్యేవి. అనేక వ్యవహారాలు వ్యాపార లావాదేవీలు ఇటువంటి బిళ్ళలపై చెక్కుట వలన వేల సంఖ్యలో బిళ్ళలు లభించాయి. వీటి ద్వారా చరిత్రకారులు అనేక విషయాలు తెలుసుకోగలిగారు.

క్యూనీఫారమ్: క్రీ.పూ. 2600 నాటికి మెసపిటోమియాలో రాత విధానం ‘క్యూనిఫారం’గా రూపొందింది. వారు వాడిన భాష సుమేరియన్ల అనేక రకాలైన పత్రాలు, నిఘంటువుల తయారీకి ఉపయోగపడింది. రాజపత్రాలు, భూముల, బదలాయింపు, స్థానిక సంప్రదాయాలు మొదలైనవి క్యూనిఫారమ్లో ఉపయోగించబడ్డాయి.

క్రీ.పూ. 2400 నాటికి సుమేరియా లిపికి బదులు అక్కాడియన్ లిపి వాడుకలోకి వచ్చింది. క్రీ.శ మొదటి శతాబ్ది వరకు మెసపిటోమియా ప్రజలు ఉపయోగించింది అక్కాడియన్ లిపి మాత్రమే. సుమారు రెండువేల సంవత్సరాలు ఈ అక్కాడియన్ లిపి వాడుకలో ఉంది.

AP Inter 2nd Year History Study Material Chapter 2 ప్రపంచ ప్రాచీన నాగరికత - మెసపిటోమియా - వ్రాత విధానం - నగర జీవనం

ప్రశ్న 3.
మెసపిటోమియా నగర జీవన విధానాన్ని గురించి రాయండి.
జవాబు:
మెసపిటోమియా నాగరికత నగరజీవితానికి ప్రసిద్ధిగాంచింది. అనేక నగరరాజ్యాలు ఏర్పడ్డాయి. వాటి చుట్టూ చిన్న చిన్న గ్రామాలు విస్తరించి ఉండేవి. పట్టణ ప్రజలు నగరరాజ్యాల పరిధిలో జీవించారు. సాధారణ నగరాలు 20వేల జనాభాతో ఉంటే అంతకంటే పెద్ద నగరాలలో జనాభా 50 వేల వరకు ఉండేది. బాబిలోనియా నాడు అతి పెద్ద నగరం. ఆ నగరంలో జనాభా లక్షమందికి పైన ఉండేవారు.

1930లో పురావస్తుశాఖ చేపట్టిన పరిశోధనలలో మెసపిటోమియాలోని అతి ప్రాచీన నగరాలు బయటపడ్డాయి. అందులో ‘ఉర్’ పట్టణం ఒకటి. ఈ పట్టణ నిర్మాణంలోని లక్షణాలను పరిశీలిస్తే వీధులు అతి సన్నగా ఉండుట వలన కొన్ని ప్రాంతాలకు మాత్రమే బండ్లు తిరగడానికి సాధ్యమయ్యేది. పట్టణ ప్రాంతంలో ఆహార ధాన్యాలు, కట్టెలు చేరవేయుటకు కంచరగాడిదలు ఉపయోగించేవారు. పట్టణ నిర్మాణానికి సరి అయిన ప్రణాళిక లేదు. మెసపిటోమియా నగర నిర్మాణంలో మూఢవిశ్వాసాలు ఎక్కువ. ‘ఉర్’ నగర శ్మశానవాటికలో రాజులు, సామాన్యుల సమాధులు లభించాయి.

ప్రపంచ నాగరికతలలో ప్రముఖ పట్టణం బాబిలోనియా. ఇది 850 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉండేది. దీని చుట్టూ మూడు రక్షణ గోడలు ఉండేవి. ఈ పట్టణంలో గొప్ప రాజభవనాలు, దేవాలయాలు ఉండేవి. ఈ పట్టణాన్ని క్రీ.పూ. 593లో ఆర్కిమేడియన్లు, క్రీ.పూ. 333లో అలెగ్జాండర్ ఆక్రమించాడు. నాటికే ఇది గొప్ప నగరంగా పేరుగాంచింది.

మెసపిటోమియా నాగరికతలో లభించిన మరొక ప్రముఖ పట్టణం ‘అబూసలాభిక్’ క్రీ.పూ. 2500 నాటి ఈ పట్టణం పది హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉండేది. ఈ పట్టణంలో చేపల ఎముకలు, పందుల ఎముకలు లభించాయి. కాబట్టి నాడు ఈ ప్రాంతంలో పందిని కూడా ఆహారంగా స్వీకరించినట్లు తెలుస్తుంది.

మెసపిటోమియా నాగరికతకు చెందిన మరో ప్రముఖ నగరం ఉరుక్. క్రీ.పూ. 3000 సంవత్సరాలకు చెందిన ఈ నగరం దేవాలయాల నగరంగా గుర్తింపు పొందింది. ఇది 250 హెక్టార్ల విస్తరించి ఉండేది. ఈ నగరం హరప్పా నాగరికతలోని మొహంజోదారో పట్టణం కంటే రెండు రెట్లు పెద్దది. క్రీ.పూ. 2800 ప్రాంతాలలో చుట్టు ప్రక్కల గ్రామాల నుండి వచ్చిన ప్రజలతో ఈ నగర విస్తీర్ణం 400 హెక్టార్లుకు పెరిగింది. ఈ నగరంలో అనేక దేవాలయాలు ఉండేవి. వీటి నిర్మాణానికి యుద్ధ ఖైదీలను, స్థానిక ప్రజలను ఉపయోగించేవారు. వీరికి రాజు ఉపాధి కల్పించేవాడు. దేవాలయ నిర్మాణానికి రోజుకు 4500 మంది కూలీలను ఐదు సంవత్సరాల వరకు పనిచేయించారు. నాటి శిల్పులు కూడా నైపుణ్యం కలిగి ఉండేవారు. కుమ్మరి చక్రం ద్వారా అనేక కుటీర పరిశ్రమలు వృద్ధి చెంది, కుండల తయారీ పెద్ద ఎత్తున చేపట్టబడింది.

రవాణా రంగం: పట్టణ నాగరికత అభివృద్ధిలో ప్రధాన అంశం రవాణా సౌకర్యం. అతి చౌకగా రవాణా చేయుటకు నదుల, సముద్ర రవాణా అతి ముఖ్యమైనవి. మెసపిటోమియా ప్రజలు నదుల ద్వారా పడవలలో ఆహార ధాన్యాలు రవాణా చేసుకునేవారు. ప్రాచీన మెసపిటోమియాలోని సహజసిద్ధ నదీమార్గాల ద్వారా వస్తురవాణా జరిగేది. |జమరిలియిన్ రాజు కాలంలో మేరీ పట్టణం ప్రముఖ నౌకా రవాణా కేంద్రం.

సమాజం: మెసపిటోమియా నాగరికత నాటి సమాజంలో ధనవంతులు, సాధారణ ప్రజల మధ్య వ్యత్యాసం స్పష్టంగా ఉండేది. ధనవంతులు మరింత ధనవంతులు కాగా, సామాన్యులు తమ జీవనాన్ని మెరుగుపరుచుకోవడానికి నిరంతరం కృషి చేసేవారు. ధనవంతులు, దేశంలోని అధికశాతం ధనాన్ని, బంగారం, ఆభరణాలు, కలపవస్తువులు, సంగీత పరికరాలు అనుభవించేవారు. ఉర్ నగరం రాజుల సమాధులలో విలువైన ఆభరణాలు లభించాయి.

కుటుంబ జీవనం: నాడు కుటుంబాలు చిన్నవిగా ఉండేవి. తండ్రి కుటుంబానికి పెద్ద. వివాహ సంబంధం విషయంలో వధువు, వరుని కుటుంబాల పెద్దలు ఒక ప్రకటన ద్వారా సమ్మతిని తెలిపేవారు. ఇరువర్గాలు బహుమతులు ఇచ్చి పుచ్చుకునేవారు. తండ్రి సంపాందించిన ఆస్తికి కుమారులు మాత్రమే హక్కుదారులు. కుమార్తెలకు కొంత మొత్తం బహుమతి రూపంలో లభించేది తప్ప, ఆస్తిలో హక్కు ఉండేది కాదు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మెసపిటోమియా భౌగోళిక పరిస్థితులు తెలుపుము.
జవాబు:
మెసపిటోమియా భౌగోళిక పరిస్థితులలో ఎంతో వైవిధ్యముండేది. పచ్చని మైదానాలతో, ఎత్తు పల్లాలుగా ఉండే భూమి, కొండల నుండి జాలువారే జలపాతాలు, సెలయేర్లు, అందమైన పూదోటలు, వర్షపాతం తద్వారా పండే పంటలు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే నీటి వనరులు వంటి అంశాలతో ఆహ్లాదకర వాతావరణం ఉండేది.
మెసపిటోమియాకు దక్షిణాన ఎడారి ప్రాంతం ఉండేది. ఈ ప్రాంతానికి ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణులలో యూఫ్రిటిస్, టైగ్రిస్ నదులు జన్మించాయి. ఆ నదులు ప్రవాహం వలన సారవంతమైన మట్టితో ఆ పరిసర ప్రాంతాలు సారవంతమైన వ్యవసాయ మైదానాలుగా మారాయి. క్రీ.పూ. 7000 6000 సంవత్సరాల మధ్య కాలంలో ఇక్కడ వ్యవసాయం ఆరంభమయిందని చరిత్రకారులు అంచనా. ఇక్కడి ప్రజలు వందలు, వేల సంఖ్యలో గొర్రెలను పెంచుతూ ఉత్తర మెసపిటోమియా పచ్చికబైళ్ళని ఉపయోగించుకుంటూ ప్రజలు జీవించారు.

ప్రశ్న 2.
బాబిలోనియా నగర ప్రాధాన్యత ఏమిటి ?
జవాబు:
ప్రపంచ నాగరికతలలో ప్రముఖ పట్టణం బాబిలోనియా. ఇది 850 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉండేది. దీని చుట్టూ మూడు రక్షణ గోడలు ఉండేవి. ఈ పట్టణంలో గొప్ప రాజభవనములు, దేవాలయములు ఉండేవి. ఆనాటి దేవాలయాన్ని ‘జిగూరత్’ అంటారు. ఈ జిగూరత్లు మెట్లు కలిగిన ఎత్తు నిర్మాణాలు. ఈ పట్టణాన్ని క్రీ.పూ. 593లో ఆర్కిమేడియన్లు ఆక్రమించారు. ఆ తరువాత కాలంలో క్రీ.పూ. 333లో అలెగ్జాండర్ ఆక్రమించారు. అప్పటికే బాబిలోనియా గొప్ప నగరంగా ప్రసిద్ధిగాంచింది.

ప్రశ్న 3.
మట్టిబిళ్ళలను టేబ్లేట్స్ అని ఎందుకంటారు ?
జవాబు:
వేల సంవత్సరాల క్రితం మొసపిటోమియా వాసులు ప్రతిరోజు జరిపే లావాదేవీలు, వ్యాపారం, నక్షత్ర పరిశోధనలు, సాహిత్యం మొదలైనవి మట్టిబిళ్ళలపై వ్రాయించుట, చిత్రించుట ప్రారంభించారు. అరచేతిలో సరిపోయే విధంగా ఈ |బిళ్ళలను మట్టితోను, రాతితోను, సున్నపు ముద్దలతోను తయారుచేసేవారు. అరచేతిలో సరిపడే సున్నపు ముద్ద బిళ్ళ తడిగా ఉన్నప్పుడు దాని ఉపరితలాన్ని నునుపుగా చేసి దానిపై పదునుగా ఉండే సూదిలాంటి పరికరంతో వివరాలు చెక్కేవారు. తడిగా ఉన్న వీటిని ఎండబెడితే అవి చెరగని బిళ్ళలుగా మారేవి. అనేక వ్యవహారాలు, వ్యాపార లావాదేవీలు ఈ బిళ్ళలపై చెక్కుట వలన వేలాదిగా టేబ్లెట్స్ లభిస్తున్నాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 2 ప్రపంచ ప్రాచీన నాగరికత - మెసపిటోమియా - వ్రాత విధానం - నగర జీవనం

ప్రశ్న 4. మెసపిటోమియా సామాజిక పరిస్థితులు రాయండి.
జవాబు:
మెసపిటోమియా నాగరికత నాటి సమాజంలో ధనవంతులు, సాధారణ ప్రజల మధ్య వ్యత్యాసం స్పష్టంగా ఉండేది. ధనవంతులు మరింత ధనవంతులు కాగా, సామాన్యులు తమ జీవనాన్ని మెరుగుపరుచుకోవడానికి నిరంతరం కృషి చేసేవారు. ధనవంతులు దేశంలోని అధికశాతం ధనాన్ని, బంగారం, ఆభరణాలు, కలపవస్తువులు, సంగీత | పరికరాలు అనుభవించేవారు. ‘ఉర్’ నగర రాజుల సమాధులలో విలువైన ఆభరణాలు లభించాయి.

మెసపిటోమియా నాగరికతలో కుటుంబాలు చిన్నవిగా ఉండేవి. తండ్రి కుటుంబానికి పెద్ద. వివాహ సమయంలో ఇరువర్గాలు బహుమతులు ఇచ్చి పుచ్చుకునేవారు. తండ్రి ఆస్తికి కుమారుడు మాత్రమే హక్కుదారులు, కుమార్తెలకు కొంత మొత్తం బహుమతి రూపంలో లభించేది తప్ప వారికి ఆస్తి హక్కు లేదు. నాటి ప్రజలు వ్యవసాయం, పశుపోషణ చేసేవారు. టర్కీ, ఇరాన్ వంటి దేశాలతో విదేశీ వ్యాపారం జరిగేది.

ప్రశ్న 5.
మెసపిటోమియా వ్రాత విధానం గురించి తెలుపుము.
జవాబు:
ప్రాచీన సమాజంలోని ప్రజలు వివిధ శబ్దాలను తమ భావాలను వ్యక్తపరుచుకోవడానికి ఉపయోగించారు. వ్రాత పద్ధతి అనగా ‘ప్రజలు మాట్లాడే పదాలకు కంటికి కనబడే చిహ్నాలు’. ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా అక్షరాలు రాసే విధానం, జరిగిన సంఘటనలు, లెక్కలు మొదలైనవి రాయడం ప్రారంభించినవారు మెసపిటోమియా ప్రజలు.
సుమారు ఐదువేల సంవత్సరాలకు మునుపు మెసపిటోమియా ప్రజలు తమ భావాలు, వివరాలు, లెక్కలు వంటి వివరాలను భద్రపరుచుకోవడానికి వ్రాత విధానాన్ని ప్రారంభించారు. మొదట ఈ లిపిలో ఎక్కువగా చిత్రాలు కనిపించాయి. ఆ కాలం నాటి పంటలు, వాటిపై ప్రభుత్వం విధించే పన్నుల వివరాలు ఈ చిత్రాల ద్వారా వివరించబడ్డాయి. కాలక్రమంలో వ్రాత విధానం ప్రాధాన్యత పెరిగి కొన్ని పదాలు, వాటి అర్థానికి తగిన చిహ్నాలు అభివృద్ధి చెందాయి. ఈ పద్ధతిని క్యూనిఫారమ్ అంటారు. క్రీ.పూ. 3200 కాలంలో మొదటిసారి మట్టిబిళ్ళపై వ్రాత ప్రారంభమైనట్లు చరిత్రకారులు నిర్ధారించారు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
క్యూనిఫారమ్.
జవాబు:
క్రీ.పూ. 3500 – 3200 సంవత్సరాల నాడే ప్రపంచ చరిత్రలో తొలిసారిగా అక్షరాలు రాసే విధానం ప్రారంభించినవారు మెసపిటోమియా ప్రజలు. వారు ప్రారంభించిన వ్రాత విధానంలో తొలినాళ్ళలో ఎక్కువగా చిత్రాలు కనిపించేవి. కాలక్రమంలో పదాలకు వాటి అర్థానికి తగిన చిహ్నాలు అభివృద్ధి చెందాయి. ఈ పద్ధతిని క్యూనిఫారం
అంటారు.

ప్రశ్న 2.
అక్కాడియన్ నాగరికత
జవాబు:
మెసపిటోమియా నాగరికత కాలక్రమంలో సమర్ ‘అక్కడ్’ ప్రాంతాలకు విస్తరించింది. తరువాత అక్కాడియన్ రాజ్యంగా రూపొందింది. అక్కాడియన్ రాజ్యం మెసపిటోమియాను చాలాకాలం పరిపాలించారు. ఈ నాగరికత సెమెటిక్ సుమేరియన్ భాషల వారిని ఒక పాలన క్రిందకు తెచ్చారు. క్రీ.పూ. 2400 నాటికి ఈ భాష అక్కాడియన్ భాషగా పిలవబడింది. ఈ కాలానికి ఈ నాగరికత ఉచ్ఛస్థితిలో ఉంది.

ప్రశ్న 3.
మేరీ భవనం.
జవాబు:
పురావస్తు త్రవ్వకాలలో లభించిన మరొక గొప్ప నిర్మాణం ‘మేరీ భవనం’. ఈ భవనం క్రీ.పూ. 1810-1760 మధ్య కాలంలో పరిపాలించిన జీమరిలియన్ నివాస భవనం. ఈ భవనం ఎంతో విలాసవంతమైనది, విశాలమైనది. ఇందులోని విశాలమైన హాలులో దేశ, విదేశీ అతిధులతో చర్చలు జరిగేవి. ఈ రాజభవనం అందమైన అలంకరణలతో సమారు రెండు నుండి నాలుగు హెక్టార్లలో విస్తరించి ఉండేది. ఇందులో 260 గదులుండేవని తెలుస్తోంది.

ప్రశ్న 4.
ఉరుక్ నగరం.
జవాబు:
మెసపిటోమియా నాగరికతకు చెందిన మరో ప్రముఖ నగరం. ‘ఉరుక్’. క్రీ.పూ. 3000 సంవత్సరానికి చెందిన ఈ నగరం దేవాలయాల నగరంగా గుర్తింపు పొందింది. ఇది 250 హెక్టార్లు విస్తరించి ఉండేది. ఈ నగరం హరప్పా నాగరికతలోని మొహంజోదారో పట్టణం కంటే రెండు రెట్లు పెద్దది. క్రీ.పూ 2800 మధ్య కాలంలో అనేక గ్రామాల నుండి ప్రజలు వచ్చి ఉరుక్ నగరాన్ని విస్తరించారు. దీనిలో నగర విస్తీర్ణం 400 హెక్టార్లకు పెరిగింది. ఈ నగరంలో అనేక దేవాలయాలు ఉండేవి. వీటి నిర్మాణానికి యుద్ధ ఖైదీలను, స్థానికులను వాడుకునేవారు.

ప్రశ్న 5.
గణితశాస్త్ర పరిస్థితులు.
జవాబు:
మెసపిటోమియా ప్రజలు గణితశాస్త్రంలో అనేక కొత్త విషయాలను కనుగొన్నారు. వారి సంఖ్యాశాస్త్రంలో మరియు 10 గుణకాలకు ప్రాధాన్యత ఉండేది. మొదటి క్రమంలో 10 సంఖ్య వరకు ప్రాధాన్యత ఉండేది. తరువాత 6తో కూడిన గుణకాలు ఉపయోగించి 60 నుండి 600 వరకు లెక్కించేవారు. బహుశా 60 అనే సంఖ్య అనేక సంఖ్యలతో విభజనకు అనుకూలంగా ఉండేది. క్రీ.పూ. 1800 సంవత్సరం నాటి మట్టిబిళ్ళలు మెసపిటోమియా గణితశాస్త్ర పరిశోధనకు నిదర్శనం. గుణకాలు, విభజనలు, స్క్వేర్, స్క్వేర్టు విధానాలు ఈ బిళ్ళలలో కనిపిస్తాయి.

ప్రశ్న 6.
యూఫ్రిటిస్, టైగ్రిస్ నదులు.
జవాబు:
మెసపిటోమియా యూఫ్రిటస్, టైగ్రిస్ నదుల మధ్య విలసిల్లిన నాగరికత. తూర్పు టర్కీలోని టారస్ పర్వతాలలో పుట్టి సిరియా మీదుగా ఇరాక్లో ప్రవేశిస్తాయి. తమ ఉపనదులతో కలిపి మెసపిటోమియా (నేటి ఇరాక్)లో సారవంతమైన మట్టిగల మైదాన ప్రాంతాలను ఏర్పరచాయి. దీనితో ఈ ప్రాంతం వ్యవసాయయోగ్య మైదానాలుగా మారాయి. ఈ విధంగా ప్రవహించి ఈ నదులు పర్షియన్ గల్ఫ్ లో కలుస్తాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 2 ప్రపంచ ప్రాచీన నాగరికత - మెసపిటోమియా - వ్రాత విధానం - నగర జీవనం

ప్రశ్న 7.
కాల నిర్ణయ విధానం.
జవాబు:
మెసపిటోమియా వాసులు సంవత్సరానికి 12 నెలలు, నెలకు 30 రోజులు, వారానికి 7 రోజులు, గంటకు 60 నిమిషాలు అనే కాల నిర్ణయ విభజన విధానాన్ని కనుగొన్నారు. ఈ కాల నిర్ణయ విధానం అలెగ్జాండర్ అనంతర కాలం నుండి ఎక్కువగా వాడుకలోకి వచ్చి రోమన్ సామ్రాజ్యానికి, అటు మహమ్మదీయ రాజ్యాలకు, మధ్య ఐరోపా దేశాలకు వ్యాపించింది.

AP Inter 2nd Year History Study Material Chapter 1 తొలికాలపు మానవ చరిత్ర

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 1st Lesson తొలికాలపు మానవ చరిత్ర Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 1st Lesson తొలికాలపు మానవ చరిత్ర

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1. హోమినాయిడ్స్కు హోమోనిడ్స్కు గల భేదాలు తెలపండి.
జవాబు:
2.4 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రైమేట్స్లో ఒక భాగమైన హోమినాయిడ్స్ ఉద్భవించినట్లు తెలుస్తుంది. హోమోనిడ్స్, హోమినాయిడ్స్ నుండి ఆవిర్భవించడం వలన కొన్ని సారూప్యాలు కనిపించినా, కొన్ని భేదాలు కూడా ఉన్నాయి.
హోమినాయిడ్స్

  1. చిన్న మెదడు.
  2. నాలుగు కాళ్ళపై నడిచే జీవి అయితే ముందరి కాళ్ళు సులువుగా ఉండేవి.
  3. చేతులు అంత సులువుగా ఉండేవి కావు.

హోమోనిడ్స్

  1. పెద్ద మెదడు
  2. నిలువుగా నిలబడి, రెండు కాళ్ళపై నడిచే వ్యక్తి.
  3. చేతులు ఉపయోగించి పనిచేస్తూ భిన్నంగా ఉండేవారు.

AP Inter 2nd Year History Study Material Chapter 1 తొలికాలపు మానవ చరిత్ర

ప్రశ్న 2.
ఆదిమ మానవుని ఆహారపు అలవాట్లు.
జవాబు:
ఆదిమానవుడు ఆహారాన్ని వివిధ రకాలుగా సంపాదించుకున్నాడు. ఉదా: ఆహార సేకరణ, ఆహారాన్ని పోగు చేసుకోవడం, వేట, చేపలు పట్టడం.

ఆహార సేకరణ: ఆహార సేకరణలో విత్తనాలు, బెర్రీలు, పండ్లు, నట్స్ ట్యూబర్స్ మొదలగునవి. మనకు ఎముక అవశేషాలు బాగా లభించినా, మొక్కల అవశేషాలు తక్కువగానే లభించాయి.

ఆహారాన్ని పోగుచేయడం: తొలినాటి హోమోనిడ్లు సహజంగా చనిపోయిన జంతువుల మాంసం లేక ఇతర జంతువులు, పక్షులు మొదలయినవి చంపి తినగా మిగిలిన మాంసం, ఎముకలు పోగుచేసుకున్నారు.

వేట: వేట అనే ప్రక్రియ దాదాపు ఐదు లక్షల సంవత్సరాల నాటిదని తెలుస్తుంది. ఒక పథకం ప్రకారం వేటాడి పెద్ద పెద్ద జంతువులను చంపడం యొక్క ఆధారాలు ఇంగ్లాండ్ లోని బాక్స్ గ్రేవ్, జర్మనీలోని షోనినిజెన్ ప్రాంతాలలో లభించాయి.
చేపలు పట్టుట: ఇది చాలా ముఖ్య ఆహారము. చేపలు, మనుషుల ఎముకలు వివిధ ప్రాంతాలలో లభించాయి.

ప్రశ్న 3.
ప్రాచీన మానవులు తయారుచేసిన పనిముట్లను తెలపండి.
జవాబు:
సుమారు 4 లక్షల సంవత్సరాల నుంచి లక్షా పాతికవేల సంవత్సరాల క్రితం వరకు ప్రాచీన మానవులు వాడిన వేలాది పనిముట్లు లభించాయి. ఉదాహరణకు కెన్యాలో వేలాది చేతి గొడ్డళ్ళు, ప్లేక్ పనిముట్లు లభించాయి. ఈ పనిముట్లను ఆహార సేకరణ, వినియోగం కొరకు ఉపయోగించేవారు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆస్ట్రలోపిథికస్.
జవాబు:
ఆస్ట్రలోపిథికస్ అనే పదము లాటిన్ మరియు గ్రీకు పదాలనుండి వచ్చింది. లాటిన్ పదం ‘ఆస్ట్రిల్’ అనగా దక్షిణ మరియు గ్రీకు పదమైన పిథకస్ అనగా ‘ఏప్’ అని ‘ఆస్ట్రలోపిథకస్’ అనగా ‘దక్షిణప్రాంత ఏప్’ అని అర్థం. ఆస్ట్రలోపిథికస్ రెండు కాళ్ళ మీద నడవటం వలన చేతులతో పిల్లలను కని, బరువులు మోయడానికి వీలుపడింది. కాళ్ళ శక్తి పొదుపు కావడంతో అది పరిగెత్తడానికి కాలక్రమేణా ఉపయోగపడింది.

ప్రశ్న 2.
హోమో సేపియన్స్.
జవాబు:
జర్మనీలోని హెడెల్బర్గీ పట్టణంలో హోమో అవశేషాలు దొరకటం వలన అతనిని హోమో హెడెల్ బర్గెన్సిస్ అని నియాండర్ లోయలో దొరికిన అవశేషాల వలన అతని హోమోసెపియన్ నియాండర్తలనినీస్ అని పిలిచారు. హోమో సేపియన్లకు పెద్ద మెదడు, చిన్న దవడ, చిన్న పళ్ళు ఉంటాయి. మెదడు పరిమాణం పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి,
తెలివితేటలు పెరిగాయి. హోమోసేపియన్ల తొలి ఆధారాలు ఆఫ్రికాలో లభించాయి.

ప్రశ్న 3.
ఆహార సేకరణ.
జవాబు:
ప్రాచీన మానవుడు తనకు లభించిన వాటిని ఆహారం కోసం సేకరించుకొనేవాడు. ఆహారసేకరణలో విత్తనాలు, బెర్రీలు, పండ్లు, నట్స్, ట్యూబర్స్ మొదలైనవి. పరిశోధనలో ఎముకల అవశేషాలు బాగా లభించాయి. మొక్కల అవశేషాలు తక్కువగా లభించాయి. ఇప్పటివరకు పురావస్తు శాస్త్రవేత్తలు మానవుని తొలినాటి కార్బొనైజ్ డ్ విత్తనాల ఆధారాలు తక్కువగానే కనుగొన్నారు.

AP Inter 2nd Year History Study Material Chapter 1 తొలికాలపు మానవ చరిత్ర

ప్రశ్న 4.
నియాండర్తల్ మనిషి.
జవాబు:
నియాండర్తల్ మానవుడు నేటి ఆధునిక మానవజాతియైన హోమో సేపియన్లకు సన్నిహితుడు. జర్మనీలోని నియాండర్ లోయలో ఇతనికి సంబంధించిన అవశేషాలు లభించడం వలన ‘నియాండర్తల్ మనిషి’ అని పిలిచారు. ఇతని శాస్త్రీయ నామం ‘హోమో నియాండర్తలనిస్’ విశాలమైన దవడ, వెడల్పాటి ముక్కు, హోమో సేపియన్లకున్నంత పెద్ద మెదడు ఉండేది.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 12th Lesson వలస పాలనలో భారతదేశం Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 12th Lesson వలస పాలనలో భారతదేశం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలో జరిగిన సామాజిక సంస్కరణోద్యమాలను వివరించండి.
జవాబు:
క్రీ.శ. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనతో వచ్చిన వ్యవస్థాగత మార్పు విద్యావంతులైన ఒక కొత్త సామాజిక వర్గ ఆవిర్భావానికి దారితీసింది. పాశ్చాత్య విద్య, సంస్కృతితో ప్రభావితులైన విద్యాధికులు సామాజిక ఉద్యమాలకు పూనుకున్నారు.

సామాజిక సంస్కరణోద్యమాలు: 19వ శతాబ్ద ప్రారంభం నాటికి సమాజంలో నెలకొన్న సామాజిక కట్టుబాట్లు స్త్రీలను, దళితులను హీనస్థితికి గురిచేశాయి. బాలికల భ్రూణ హత్య, సతి, నిర్బంధ వైధవ్యం, బాల్యవివాహాలు ఆనాటి సమాజంలో నెలకొన్న కొన్ని దురాచారాలు. అయితే భారతీయ విద్యావంతులు ఆంగ్ల విద్య ద్వారా పాశ్చాత్యుల్లోని ఉదార, ఆశావాద దృక్పథాన్ని చూసి వాటిపట్ల ఆకర్షితులయ్యారు. భారతీయ సమాజంలోని వివక్షాపూరిత దృక్పథం, వెనకబాటుతనం వారి సంస్కరణాభిలాషను దృఢతరం చేసింది.

19వ శతాబ్దంలో ప్రారంభమైన సంస్కరణల్లో రెండు ప్రధాన ధోరణులున్నాయి. అవి మత, సామాజిక సంస్కరణలు, రాజారాంమోహన్ రాయ్ మతానికి హేతువాద దృక్పథాన్ని జోడించాడు. ఇతని కృషివల్ల 1829 డిసెంబర్ 4న సతీ దురాచారం నిషేధించబడింది. అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ ‘సతి’ని చట్టరీత్యా నేరంగాను, శిక్షార్హంగాను ప్రకటించాడు. బ్రహ్మసమాజం, ప్రార్థనా సమాజం, రామకృష్ణ మిషన్, ఆర్య సమాజం, థియోసాఫికల్ సంఘం లాంటి మత సంస్కరణాభిలాష గల సంస్థలు తమ కార్యక్రమాలను నడిపించాయి. బ్రహ్మసమాజం బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా ఏకేశ్వరోపాసనను ప్రోత్సహించింది. దయానంద సరస్వతి నాయకత్వంలో ఆర్యసమాజం విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఉద్యమించి ‘వేదాలకు తరలండని’ ప్రబోధించారు. కరుడుగట్టిన సమాజ పునర్వ్యవస్థీకరణకు భారత తాత్విక సంస్థలు, థియోసాఫికల్ సొసైటీవంటివి పూనుకొన్నాయి. హేతుబద్ద పూజా విధానాన్ని రామకృష్ణ మిషన్ వారు ప్రవచించారు. జొరాస్ట్రియన్ల సంస్థ, రహనుమాయి మజ్దాయాన్ సభ, జొరాస్ట్రియన్ల ప్రాచీన పద్ధతుల పరిరక్షణను ప్రబోధించింది.

ఈ సంస్కర్తలు చేపట్టిన కార్యక్రమాలైన వితంతు పునర్వివాహం, కులాంతర వివాహాలు, స్త్రీ విద్య ఉదార పాశ్చాత్య లౌకిక ధోరణుల్ని సూచిస్తాయి. పర్దా నిషేధం, బాల్యవివాహం రద్దు, బహు భార్యత్వం, దళితుల పట్ల వివక్షను రూపమాపటం కోసం సంస్కర్తలు పూనుకొన్నారు. వివాహ వయోపరిమితి పెంపు, స్త్రీల ఆస్తి హక్కుల్ని వారు కాంక్షించారు. ఈ దురాచారాలను రూపుమాపడం కోసం చట్టాల ఏర్పాటుతోపాటు దేవాలయ ప్రవేశం, భోజన విషయాల్లో వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం డిప్రెస్డ్ క్లాస్ మిషన్, డెక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ, అలీఘర్ సంస్థ, అమృత్సర్లోని దివానల్సా, బొంబాయి సోషల్ సర్వీసీగ్, ఇండియన్ నేషనల్ సోషల్ సర్వీస్ లీగ్లు, సత్యశోధక్ సమాజ్, హరిజన సేవక్ సంఘ్ లాంటి సంస్థలు కృషి చేశాయి.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

మహారాష్ట్రలో జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలేలు స్త్రీల విద్యావాప్తి, ముఖ్యంగా దళిత బాలికల విద్యా వ్యాప్తికై కృషి చేశారు. వితంతు స్త్రీల సంతానానికి అనాథాశ్రమం కట్టించారు. క్రీ.శ. 1873లో సత్యశోధక్ సమాజాన్ని 1882లో దీనబంధు సార్వజనిక్ సభను స్థాపించి వీటి ద్వారా సంస్కరణలు చేపట్టారు. పండిత రమాబాయి సంప్రదాయ కుటుంబంలో జన్మించింది. సంస్కృతంలో ప్రావీణ్యం గడించి సమాజంలోని మూఢాచారాలను ఏవగించుకొంది. సంస్కృత ప్రావీణ్యానికి ‘పండిత’ అనే గౌరవ బిరుదు రమాబాయి పొందారు. అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి సామాజిక అన్యాయాల నుంచి హిందూ స్త్రీలను రక్షించడం కోసం కృషి చేశారు. పూణేలో మహిళా ఆర్యసమాజాన్ని, బొంబాయిలో శారదా సదన న్ను స్థాపించారు.

బెంగాల్లో హెన్రీలూయిస్ వివియన్ డొరేజియో హేతువాద దృక్పథంతో యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని నడిపాడు. విద్యాసంస్కరణలకోసం ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పూనుకొన్నారు. ఈయన కృషి వల్లే 1856లో హిందూ స్త్రీల పునర్వివాహానికి ఉన్న నిర్బంధాలన్నీ తొలగి చట్టం చేయడమైంది. ప్రముఖ సంస్కర్త సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లింల విద్యావ్యాప్తికి కృషి చేశారు. 1825లో మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని స్థాపించాడు. ఈ సంస్థే తరువాత అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంగా మారింది. ఆ తర్వాత కాలంలో వివేకానందుడుగా ప్రఖ్యాతి చెందిన నరేంద్రనాథ్ దత్తా రామకృష్ణ మిషన్ స్థాపించాడు. దీని ద్వారా యువతలో దేశభక్తిని రగిల్చి ప్రజోద్ధరణకు పనిచేసేలా వారిని ఉత్తేజపరిచాడు.

ప్రశ్న 2.
భారత జాతీయోద్యమంలో ‘వందేమాతరం’ ప్రాముఖ్యత తెల్పండి.
జవాబు:
భారతీయులలో పెరుగుతున్న జాతీయభావం బెంగాల్ విభజనతో బహిర్గతమై వందేమాతరం ఉద్యమంగా రూపుదాల్చింది. ఈ ఉద్యమం భవిష్యత్లో జరగబోయే ఉద్యమాలకు మార్గదర్శకమైంది.

కారణాలు: ఈ క్రింది కారణాలు వందేమాతర ఉద్యమానికి దోహదపడ్డాయి.
1) మితవాదుల వైఫల్యం: కాంగ్రెస్ స్థాపన జరిగినప్పటి నుంచి నాయకులు తమ కోర్కెల సాధన కోసం రాజ్యాంగ పద్ధతులను అవలంబించారు. వారు ఉద్యమించిన 20 సంవత్సరాల కాలంలో ప్రత్యేకంగా సాధించేందేమీ లేదు. దీనితో మితవాదుల యెడల ప్రజలలో అసంతృప్తి బయలుదేరింది.

2) అతివాద జాతీయభావం: అప్పటికే జాతీయోద్యమంలో తిలక్, లాలాలజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్ వంటి అతివాద జాతీయ నాయకులున్నారు. పోరాటం ద్వారానే తమ కోర్కెలు తీరుతాయని వారు భావించి తమకు స్వరాజ్యం కావాలని ప్రకటించారు.

3) ఆంగ్లేయుల విభజించు పాలించు విధానం: ప్రజల్లో పెరుగుతున్న జాతీయ భావాన్ని దెబ్బతీయటానికి బ్రిటీషు ప్రభుత్వం “విభజించి, పాలించు” అనే సాధనాన్ని వినియోగించింది. భారతీయులలోని ఐక్యతను దెబ్బతీసి, వారిని బలహీనపరచి, తద్వారా తాను లబ్ది పొందాలని భావించింది. ఈ లక్ష్య సాధనకు బెంగాల్ను విభజించింది.

4) బెంగాల్ విభజన: బెంగాల్ రాష్ట్రం జాతీయోద్యమానికి ఆయువుపట్టు. దానిని విభజించటం ద్వారా జాతీయోద్యమాన్ని దెబ్బతీయాలని, హిందూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించాలని కర్జన్ ప్రభువు తలపోశాడు. ఈ కారణంగా బెంగాల్ నుంచి 3 కోట్లకు పైగా జనాభా ఉన్న తూర్పు బెంగాల్, అస్సాంలను విడదీసి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాడు. బెంగాల్ రాష్ట్రం అతివిశాలమైందని, పాలనా సౌలభ్యం కోసం దాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చని ప్రకటించాడు. ప్రజల్లో పెరుగుతున్న జాతీయ భావాన్ని మొగ్గలోనే తుంచేయడానికి, కాంగ్రెసు, ప్రజలను విడదీయటానికి ఆంగ్లేయులు ఈ పన్నాగం పన్నారని భారతీయులు భావించారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా భారతీయులు ప్రారంభించిన ఉద్యమాన్ని వందేమాతరం ఉద్యమం అంటారు. దీనిని స్వదేశీ ఉద్యమం అని కూడా అంటారు.

వందేమాతరం ఉద్యమం: వందేమాతరం ఉద్యమం కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన మొట్టమొదటి ప్రజాఉద్యమం. బంకించంద్రుని ‘ఆనందమఠ్’ నవలలోని ‘వందేమాతరం’ గేయం ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చింది. అందువల్ల దీనిని వందేమాతర ఉద్యమం అన్నారు. ఉద్యమం బెంగాల్కు మాత్రమే పరిమితం కాక, దేశవ్యాప్తమైంది. మొదట్లో ఈ ఉద్యమం సురేంద్రనాథ్ బెనర్జీ వంటి మితవాదుల నేతృత్వంలో జరిగినా క్రమంగా అతివాద, తీవ్రవాద నాయకత్వానికి మరలింది.

బహిష్కరణోద్యమం: ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తు బహిష్కరణ, బ్రిటీషు యాజమాన్యంలో ఉన్న విద్యాలయాలను బహిష్కరించటం దేశవ్యాప్తంగా జరిగాయి. విదేశీ వస్త్రాలను ఉద్యమకారులు కుప్పలు కుప్పలుగా పోసి తగులబెట్టారు. ఉద్యమంలో హిందువులు, మహమ్మదీయులు ఐక్యతతో పాల్గొన్నారు.

స్వదేశీ ఉద్యమం: ఈ కాలంలో ఉద్యమకారులు స్వదేశీ ఉద్యమాన్ని కూడా నడిపారు. స్వదేశీ వస్తువులకు ఆదరణ లభించింది. స్వదేశీ భావన అన్ని రంగాలకు వ్యాపించింది. విద్య, సంస్కృతి, వ్యాపారం, పరిశ్రమలు తదితర రంగాలలో స్వదేశీ భావం ప్రజ్వరిల్లింది.

నిర్మాణాత్మక కార్యక్రమం: స్వదేశీ, బహిష్కరణోద్యమాలతో పాటు ప్రజలు నిర్మాణాత్మక కార్యక్రమాలు కూడా చేపట్టారు. స్వదేశీ పరిశ్రమలను, స్వదేశీ విద్యాలయాలను స్థాపించారు.

ప్రభుత్వ దమన నీతి: ఈ ఉద్యమాన్ని అణచటానికి ప్రభుత్వం దమననీతిని సాగించింది. విద్యార్థులను లాఠీలతో కొట్టించింది. అనేకమంది నాయకులను ఎటువంటి విచారణ లేకుండా జైలులో పెట్టించింది. వందేమాతరం నినాదాలు చేయటం, జెండాలను ధరించటం, ఊరేగింపులను జరపటాన్ని నిషేధించింది. పత్రికా స్వాతంత్ర్యాన్ని కాలరాసింది. కర్జన్ తరువాత వచ్చిన వైస్రాయ్ లార్డ్ మింటో దేశద్రోహ చట్టాన్ని, విస్ఫోటక పదార్థాల చట్టాన్ని, భారతీయ పత్రికా చట్టాన్ని మొదలైన వానిని చేసి ప్రజల హక్కులను అణగద్రొక్కాడు. తిలక్కు 6 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష విధించబడింది. అరవింద ఘోష్ అలీపూర్ బాంబు కేసులో ఇరికించబడ్డాడు. సురేంద్రనాథ్ బెనర్జీ, గాడిచర్ల హరి సర్వోత్తమరావులు నిర్బంధించబడ్డారు. పైగా బ్రిటిష్ ప్రభుత్వం మహమ్మదీయులను హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టింది.

విప్లవోద్యమం: ప్రభుత్వం అనుసరించిన దమననీతికి వ్యతిరేకంగా బ్రిటిష్ అధికారులను హత్యచేయడానికి కొందరు యువకులు రహస్య సంఘాలుగా ఏర్పడ్డారు. భూపేంద్రనాథ్ దత్, వి.డి. సావర్కర్, ఖుదీరామ్ బోస్ మొదలైనవారు వీరిలో ప్రముఖులు. ప్రభుత్వం ఖుదీరామ్ బోస్కు కింగ్స్ ఫోర్డ్ప హత్యాప్రయత్నం చేసినందుకు మరణశిక్ష విధించింది. ఈ ఉద్యమం బ్రిటిష్ అధికారులను భయభ్రాంతులను చేసింది. భారతీయులను తృప్తిపరచటానికి, మితవాదులను, అతివాదులను విడదీయడానికి, హిందూ, మహమ్మదీయుల మధ్య స్పర్ధలు సృష్టించటానికి బ్రిటిష్ ప్రభుత్వం 1909 భారతీయ కౌన్సిల్స్ చట్టాన్ని చేసింది. అయినా ఈ ఉద్యమం కొనసాగింది.

బెంగాల్ విభజన రద్దు: లార్డ్ మింటో స్థానంలో వైస్రాయ్ గా వచ్చిన లార్డ్ హార్డింజ్ ఉద్యమ తీవ్రతను అర్థం చేసుకొన్నాడు. బెంగాల్ విభజన రద్దుచేయాలని, అస్సాంను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలని బీహార్, ఛోటా నాగపూర్, ఒరిస్సాలను ఒక ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని, రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చాలని ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదనలను బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించగానే 1911లో బెంగాల్ విభజన రద్దయింది.

ఫలితాలు: బెంగాల్ విభజన కొన్ని ముఖ్య ఫలితాలనిచ్చింది.

  1. కేవలం నిరసనలు, ప్రదర్శనలు, తీర్మానాలు ఏవిధంగాను పనికిరావని, తీవ్రమైన చర్యలు అవసరమని కాంగ్రెస్ భావించింది. తీర్మానాలకు మద్దతుగా ప్రజాశక్తి తోడైతేగాని సమస్యలు పరిష్కారం కావని ప్రజలు భావించారు.
  2. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందేమాతరం ఉద్యమం రూపుదిద్దుకుంది.
  3. భారత జాతీయ కాంగ్రెస్ “స్వరాజ్యం” కావాలని కోరింది.
  4. విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ వస్తువుల ప్రోత్సాహం మంచి ఊపునందుకున్నాయి. దీనితో భారతీయ పరిశ్రమలు బాగా లబ్దిపొందాయి.
  5. ఈ ఉద్యమం సాంస్కృతిక కార్యకలాపాలను కూడా ప్రభావితం చేసింది. జాతీయ కవిత ఈ కాలంలో పెల్లుబుకింది. రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర ఛటర్జీ మొదలైన వారి రచనలను ప్రభావితం చేశాయి. జాతీయవిద్యకు ప్రోత్సాహం లభించింది.
  6. జాతీయోద్యమం తీవ్రతరమైంది. అతివాదులు శాంతియుత ప్రతిఘటనోద్యమాన్ని కూడా చేపట్టారు. ప్రజలు ప్రభుత్వంతో సహకరించడానికి నిరాకరించడం ఇందులోని ప్రధానాంశం.
  7. ఉగ్రవాదం చోటుచేసుకుంది. ఉగ్రవాదులు ఐరిష్ ఉగ్రవాదులు, రష్యన్ నిహిలిస్టుల విధానాలను అనుసరించి బ్రిటీషు ఉద్యోగులను చంపటానికి పూనుకొన్నారు.
  8. బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ కొనసాగిన తీవ్ర ఉద్యమం భారత జాతీయ కాంగ్రెస్ లో తీవ్ర భేదాభిప్రాయాలకు దారితీసింది. అతివాదులు, మితవాదులు అను రెండు వర్గాలుగా కాంగ్రెస్ చీలిపోయింది.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

ప్రశ్న 3.
సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వివరించండి.
జవాబు:
గాంధీ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ నిర్వహించిన ఉద్యమాల్లో మొదటిది సహాయ నిరాకరణోద్యమం. ఖిలాపత్ ఉద్యమ సందర్భంగా వ్యక్తమైన హిందూ, ముస్లిం సంఘీభావం గాంధీని సహాయ నిరాకరణోద్యమానికి పురికొల్పింది. 1920 సెప్టెంబరులో కలకత్తాలో లాలాలజపతిరాయ్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. తీర్మానం ఆమోదించడమైంది. 1920 డిసెంబర్ విజయరాఘవాచారి అధ్యక్షతన నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశంలో దాన్ని ధృవీకరించడమైంది. రెండు సమావేశాల్లోనూ బెంగాల్ నాయకుడు చిత్తరంజన్ దాస్ నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. దాస్ సూచనలను కూడా తీర్మానంలో చేర్చడం ద్వారా గాంధీ ఆయనను సమ్మతింపచేశాడు.

ఉద్యమ కార్యక్రమం: ఈ ఉద్యమానికి మూడు అంశాల కార్యక్రమం కలదు. అవి: బహిష్కరణ, నిర్మాణాత్మక కార్యక్రమాలు, శాసనోల్లంఘనం.
బహిష్కరణ:

  1. ప్రభుత్వం ఇచ్చిన బిరుదులు, పదవులను త్యజించడం.
  2. ప్రభుత్వం ఏర్పాటు చేసే సన్మానాలు, తదితర కార్యక్రమాలను బహిష్కరించడం.
  3. విద్యార్థులు ప్రభుత్వ విద్యాలయాలను బహిష్కరించడం.
  4. ప్రభుత్వోద్యోగాలకు రాజీనామా చేయడం.
  5. ప్రభుత్వ న్యాయస్థానాలను బహిష్కరించడం. 6) విదేశీ వస్త్రాలను, వస్తువులను బహిష్కరించడం.
  6. శాసనసభలకు జరిగే ఎన్నికలను బహిష్కరించడం.
  7. 1921లో ఇంగ్లాండ్ దేశపు యువరాజు పర్యటన బహిష్కరించడం మొదలైనవి బహిష్కరణోద్యమంలో ముఖ్యమైనవి.

నిర్మాణాత్మక కార్యక్రమాలు:

  1. తిలక్ స్మారక నిధికి విరాళాలు వసూలు చేయడం.
  2. రాట్నాలపై నూలు వడికి, ఖద్దరు వస్త్రాలు తయారుచేయడం.
  3. అస్పృశ్యతను నిర్మూలించడం.
  4. మద్యపాన నిషేధానికి అనుకూలంగా ఉద్యమం నడపడం.
  5. జాతీయ విద్యాలయాలు నెలకొల్పడం.
  6. హిందూ, ముస్లిం సమైక్యతను సాధించడం అనేవి నిర్మాణాత్మక కార్యక్రమాలు.

శాసనోల్లంఘనం: పన్నులు చెల్లించటం, నిరాకరించటం ద్వారా కాంగ్రెస్ శాసనోల్లంఘనాన్ని చేపట్టాలని నిర్ణయించింది.
ఉద్యమ గమనం 1920లో ప్రారంభించిన ఈ ఉద్యమంలో ప్రజలు తమ విభేదాలను మరిచి చురుకుగా పాల్గొన్నారు. బ్రిటిష్ విద్యాసంస్థలను బహిష్కరించి జాతీయ విద్యాసంస్థలను నెలకొల్పారు. నెహ్రూ, చిత్తరంజన్ దాస్, ప్రకాశం పంతులు మొదలైన నాయకులు న్యాయస్థానాలను బహిష్కరించి న్యాయవాద వృత్తిని త్యజించారు. సుభాష్ చంద్రబోస్ మొదలైనవారు తమ ప్రభుత్వ పదవులకు రాజీనామా చేశారు. ప్రజలు విదేశీ వస్తువులను బహిష్కరించి ఖద్దరు వాడకాన్ని ప్రోత్సహించారు. హిందువుల ఐక్యతను పెంపొందించటానికి అస్పృశ్యతా నివారణను చేపట్టారు.

ఈ ఉద్యమం ఆంధ్రాలో అద్భుత విజయాన్ని సాధించింది. చీరాల-పేరాల సత్యాగ్రహం, పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం, పల్నాడు పుల్లరి సత్యాగ్రహాలు జరిగాయి. పంజాబ్లో అకాలీలు మహంతులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించారు. భారతదేశ సందర్శనానికి వచ్చిన వేల్స్ యువరాజు బహిష్కరించబడ్డాడు. ఈ ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం దమనకాండను సాగించింది. అయినప్పటికి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇంతలోనే ఉత్తరప్రదేశ్లోని చౌరీచౌరా అనేచోట హింస చెలరేగి అది అనేకమంది పోలీసులు సజీవదహనానికి దారితీసింది. హింసను సహించలేని గాంధీజీ ప్రజలు ఇంకా అహింసా పద్ధతులకు అలవాటుపడలేదని భావించి ఉద్యమాన్ని నిలుపు చేశాడు.

ఫలితాలు: సహాయ నిరాకరణోద్యమం అనేక గొప్ప ఫలితాలనిచ్చింది.

  1. భారత ప్రజలలోను, కాంగ్రెస్ నాయకులలోను నిరాశ ఏర్పడింది. దీని ఫలితంగా కాంగ్రెస్లోలో చీలిక వచ్చింది.
  2. ఉద్యమ కాలంలో హిందూ-మహమ్మదీయుల ఐక్యత సాధించబడింది.
  3. ఈ ఉద్యమ ప్రభావం వల్ల జాతీయభావం దేశం నలుమూలలా విస్తరించింది.
  4. ప్రజలలో ప్రభుత్వమంటే భయంపోయి వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది.
  5. కాంగ్రెస్లో వామపక్ష ధోరణులు ప్రారంభమైనాయి.
  6. ప్రభుత్వం దమననీతిని ఎదుర్కొనేందుకు భారతీయ యువత విప్లవోద్యమానికి దిగింది.
  7. ఈ ఉద్యమ విరమణ అనంతరం కాంగ్రెస్-లీగ్ మిత్రత్వం రద్దయింది. ఫలితంగా హిందువులు, ముస్లింల మధ్య మత కల్లోలాలు చెలరేగాయి.

ప్రశ్న 4.
భారత స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ పాత్రను విశ్లేషించండి.
జవాబు:
భారత జాతీయోద్యమ చరిత్రలో గాంధీజీ నిర్వహించిన పాత్ర అద్వితీయమైనది. తన నాయకత్వ పటిమతో ఆయన భారత జాతీయ శక్తులను ఏకం చేసి, వాటిని ఒక త్రాటిపై నడిపించిన ఘనుడు. 1919 నుంచి 1947 వరకు గల కాలంలో స్వాతంత్ర్యోద్యమానికి తానే స్ఫూర్తిగా మారిన మహామనిషి, అందువలననే 1919 నుండి 1947 వరకు గల కాలాన్ని “గాంధీ యుగం” అని పిలుస్తారు.

తొలి జీవితం: గాంధీజీ పూర్తిపేరు మోహన్దాస్ కరంచంద్ గాంధీ. ఆయన 1869 అక్టోబరు 2వ తారీఖున సౌరాష్ట్రలోని పోర్బందరులో జన్మించాడు. తన 19వ ఏట ఉన్నత విద్యకై లండన్ వెళ్ళి న్యాయవాద పట్టా పుచ్చుకొని మాతృదేశానికి వచ్చి రాజకోట, బొంబాయిలో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. తరువాత రాజకీయాలలో ప్రవేశించాడు.
గాంధీజీ సిద్ధాంతాలు: స్వాతంత్య్ర సముపార్జనకై గాంధీజీ చేపట్టిన రెండు ఆయుధాలలో ఒకటి సత్యాగ్రహం, రెండు అహింస. ‘సత్యాగ్రహం అనగా సత్యమునకు కట్టుబడి ఉండటం అని అర్థం. సత్యాగ్రహము ఐదు విధాలు. అవి:

1) సహాయ నిరాకరణ: శాంతియుత సహాయ నిరాకరణ ద్వారా ఎటువంటి శక్తివంతమైన ప్రభుత్వాన్నైనా పడగొట్టవచ్చు. శాంతియుత ప్రతిఘటన ద్వారా హర్తాళ్ పాటించి, ప్రభుత్వం దమననీతిపై పోరాటం సాగించాలి. మన కోరికలు స్వచ్ఛమైనవిగాను, సమంజసమైనవిగాను ఉండాలి.

2) నిరాహారదీక్ష: ఇతర పద్ధతులు విఫలమైనప్పుడే దీనిని చేపట్టాలి.

3) హిజరత్: హింసాపూరిత వాతావరణంలో ఇమడలేని వ్యక్తులు తమంతట తాముగా ఇతరులకు దూరంగా ఉండాలి.

4) బహిష్కరణ: అన్నిరకాల చెడుకు వ్యతిరేకంగా చేపట్టే నిరాకరణ. ఒక వ్యక్తిని ఆ పనిని చేయకుండా నిరోధించటానికి చేపట్టే శాంతియుత పికెటింగ్. దీనిలో హింసకు తావులేదు.

5) శాసనోల్లంఘనం: ఈ చర్యను చేపట్టే ముందు చర్చలు, ప్రదర్శనలు జరిపి విఫలమైనప్పుడు మాత్రమే శాంతియుత ప్రతిఘటన చేపట్టాలి. ప్రతి చట్టాన్ని ఉల్లంఘించాలి.

అహింస: అహింసా పరమోధర్మః అన్నారు మనవారు. దానినే గాంధీజీ తన ఆయుధంగా స్వీకరించాడు. బౌద్ధ, జైనమతాలు, అశోక చక్రవర్తి ఈ విషయంలో గాంధీజీకి మార్గదర్శకులు. గాంధీజీకి ‘హింస’ అంటే పడదు. మాటల ” ద్వారాగాని, చేత ద్వారాగాని, ఆలోచనల ద్వారా గాని ఎవ్వరికీ హాని కలిగించకూడదన్నది ఆయన సిద్ధాంతం. దీనిలో మూడు రకాల వారున్నారు. మొదటిది అహింసను ఒక సిద్ధాంతంగా నమ్మి ఆచరించే ధైర్యవంతులు, రెండవది అహింసను ఒక విధానంగా చేపట్టేవారు, మూడవది భయస్తులు చేపట్టే అహింసా విధానం. దీనిని గాంధీజీ నిరసించాడు. అవమానాలపాలై, పిరికితనంతో విదేశీ పాలకులకు లొంగి ఉండటం కంటే భారతదేశం తన గౌరవాన్ని తిరిగి పొందటానికి అవసరమైతే ఆయుధాలు చేపట్టవచ్చునని కూడా ఆయన ఉద్బోధించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

దక్షిణాఫ్రికా వెళ్లటం: గాంధీజీ 1893లో ఒక కేసు విచారణ నిమిత్తం దక్షిణాఫ్రికా వెళ్లాడు. అచ్చట భారతీయుల దయనీయ పరిస్థితులు చూసి బాధాతప్తుడై వారి హక్కుల పరిరక్షణకై సత్యాగ్రహం, సహాయ నిరాకరణోద్యమ సాధనాలు ప్రవేశపెట్టి విజయాన్ని సాధించాడు.

భారత రాజకీయాలలో పాల్గొనుట: గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి 1915లో భారతదేశానికి తిరిగివచ్చి సబర్మతీ ఆశ్రమాన్ని స్థాపించాడు. బీహార్లోని చంపారన్ రైతులకు నాయకత్వం వహించి ఆంగ్లో-ఇండియన్ తోట యజమానుల బారినుండి వారిని రక్షించి ప్రఖ్యాతిగాంచాడు. అహ్మదాబాద్ మిల్లు యజమానులబారి నుండి కార్మికులను సంరక్షించి వారి ఉద్యమాన్ని విజయవంతం చేశాడు. గుజరాత్లో కరువు సంభవించినపుడు రైతులను ఋణబాధల నుండి, పన్ను చెల్లింపులనుండి విముక్తి గావించుటకు ‘కైరా’ సత్యాగ్రహాన్ని నిర్వహించి విజయాన్ని సాధించాడు. రౌలట్ శాసనము, జలియన్ వాలాబాగ్ మారణహోమం, గాంధీజీలో నూతన మార్పులు తెచ్చాయి. తిలక్ మరణానంతరం గాంధీజీ జాతీయోద్యమానికి నాయకత్వం వహించి జాతీయోద్యమాన్ని దిగ్విజయంగా నడిపాడు.

జాతీయోద్యమంలో గాంధీజీ నిర్వహించిన పాత్ర: గాంధీజీ జాతీయోద్యమ చరిత్రలో నిర్వహించిన పాత్ర చిరస్మరణీయం. జాతీయోద్యమ చరిత్రలో 1919 నుండి 1947 వరకు గల కాలాన్ని “గాంధీయుగం’ అంటారు.

ఎ) సహాయ నిరాకరణోద్యమం: గాంధీజీ 1920లో జాతీయ కాంగ్రెస్ నాగపూర్ సమావేశంలో శాంతియుత మార్గాల ద్వారా స్వాతంత్య్ర సముపార్జన కాంగ్రెస్ ధ్యేయమని ప్రకటించాడు. దీనిని సాధించటానికి 1920లో సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించాడు. ఈ ఉద్యమం దేశవ్యాప్తమై గాంధీజీ పేరు ప్రఖ్యాతులు పొందాడు. కానీ ఈ ఉద్యమం ‘చౌరీచౌరా’ సంఘటన ద్వారా విప్లవ ధోరణిలో ప్రయాణించుటచేత ప్రజలు శాంతియుత వైఖరికి సుముఖముగా లేరని ఉద్యమాన్ని నిలుపుదల చేసి పలు విమర్శలకు గురైనాడు. గాంధీజీ కారాగార శిక్షను అనుభవించాడు.

బి) శాసనోల్లంఘన ఉద్యమం: సంపూర్ణ స్వరాజ్య సాధనకు గాంధీజీ 1930లో “శాసనోల్లంఘనోద్యమము” ను ప్రారంభించాడు. నాటి ప్రభుత్వం ఉప్పుపై పన్నును విధించగా అది న్యాయసమ్మతం కాదని ఆ చట్టాన్ని ఉల్లంఘించి దండి గ్రామంలో ఉప్పు సత్యాగ్రహం జరిపి ఉప్పును తయారుచేశాడు. ఇదే జాతీయోద్యమ చరిత్రలో “దండి ఉప్పు సత్యాగ్రహం”గా పేరొందింది.

సి) రౌండేబుల్ సమావేశాలు: గాంధీజీ లండన్ లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కాలేదు. తదుపరి వైస్రాయ్ ఇర్విన్తో ఒడంబడిక చేసుకొని రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యాడు. జిన్నా వైఖరి వల్ల ఈ సమావేశం విఫలమైంది. మూడవ సమావేశానికి కాంగ్రెస్ హాజరు కాలేదు.

డి) పూనా ఒడంబడిక: బ్రిటిష్ ప్రధాని ‘మెక్ డోనాల్డ్’ భారతదేశంలో హరిజనులకు, క్రైస్తవులకు నియోజకవర్గ సౌకర్యాలను కల్పిస్తూ “కమ్యూనల్ అవార్డ్”ను ప్రకటించాడు. ఇది జాతీయ సమైక్యతకు హానియని గాంధీజీ బ్రిటిష్ పాలకుల వైఖరికి నిరసనగా ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. చివరకు నిమ్నజాతుల నాయకుడైన డా. అంబేద్కర్ కృషి వల్ల “పూనా ఒప్పందం” జరిగి గాంధీజీ ఆమరణ నిరాహారదీక్ష విరమించాడు.

ఇ) క్విట్ ఇండియా ఉద్యమం: 1942లో క్రిప్స్ రాయబారాన్ని తోసిపుచ్చి 1942 ఆగస్టు 8వ తారీఖున ఆంగ్లేయులు భారతదేశం నుండి వెళ్ళిపోవాలని “క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించాడు.

యఫ్) స్వాతంత్ర్య సముపార్జన: గాంధీజీ నడిపిన శాంతియుత ఉద్యమాలను అణచటంలో బ్రిటిష్ పాలకులు వైఫల్యం చెంది 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. ఈ విధంగా విదేశీయ పాలనలో దాస్యమును అనుభవించిన భారతదేశం గాంధీజీ నేతృత్వంలో స్వాతంత్ర్యము పొందింది.

ప్రశ్న 5.
క్రిప్స్ మిషన్ ప్రతిపాదనలను, దాని వైఫల్యానికి కారణాలు వివరించండి.
జవాబు:
1941 డిసెంబర్లో జపాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నది. బ్రిటిష్ సామ్రాజ్య భాగాలైన సింగపూర్, బర్మాలను జపాన్ ఆక్రమించినది. జపాన్ సేన పురోగతిని ప్రతిఘటించడానికి భారతీయుల సహకారం అవసరమని బ్రిటిష్ ప్రభుత్వం భావించినది. అందుకుగాను సర్ఫర్డ్ క్రిప్స్న 1942లో భారతదేశం పంపినది. ఆయన భారతీయ నాయకులతో సంప్రదింపులు జరిపారు. ఆయన చేసిన ప్రతిపాదనలను రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి: 1. దీర్ఘకాలిక ప్రతిపాదనలు లేదా యుద్ధానంతరం చేయతలపెట్టిన మార్పులు 2. తక్షణం చేయదగిన మార్పులు లేదా యుద్ధకాలానికి సంబంధించిన ప్రతిపాదనలు.
1. దీర్ఘకాలిక ప్రతిపాదనలు లేదా యుద్ధానంతరం చేయతలపెట్టిన మార్పులు:

  • యుద్ధానంతరము భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి ఇవ్వబడుతుందని బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిపాదించింది. భారతదేశానికి కామన్వెల్త్ నుండి వైదొలగే హక్కు కూడా ఉంటుంది.
  • యుద్ధం ముగిసిన తరువాత భారతదేశానికి ఒక నూతన రాజ్యాంగాన్ని రచించడానికిగాను రాజ్యాంగ పరిషత్ నెలకొల్పబడగలదు.
  • రాజ్యాంగ పరిషత్లో నైష్పత్తిక ప్రాతినిధ్య ప్రాతిపదికపై రాష్ట్ర శాసనసభల సభ్యులచే ఎన్నుకోబడిన సభ్యులు, స్వదేశీ సంస్థానాల జనాభా నిష్పత్తిని బట్టి సంస్థానాధిపతులు నియమించు సభ్యులుండగలరు.

i) కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించడానికి సిద్ధపడని రాష్ట్రాలు లేదా రాష్ట్రం వేరే యూనియన్ ఏర్పడడానికి హక్కులుండవలెను. స్వదేశీ సంస్థానాలకు కూడా అట్లే నూతన రాజ్యాంగానికి కట్టుబడి ఉండడానికి, లేకపోవటానికి స్వేచ్ఛ ఉండగలదు.

ii) బ్రిటిష్ ప్రభుత్వం పూర్తి అధికారాన్ని బదిలీ చేయటం వలన ఉత్పన్నమయ్యే విషయాలను చర్చించటానికి రాజ్యాంగ పరిషత్, బ్రిటిష్ ప్రభుత్వం మధ్య ఒక ఒడంబడిక కుదరవలెను.

2. తక్షణం చేయతగిన మార్పులు లేదా యుద్ధకాలానికి సంబంధించిన ప్రతిపాదనలు: తాత్కాలికంగా “రక్షణ” విషయాలపై బ్రిటిష్ ప్రభుత్వ నియంత్రణ ఉండగలదు. కాని భారతదేశ నైతిక, సైనిక, భౌతిక వనరులను సమీకరించే బాధ్యత భారత ప్రభుత్వానిదనీ, అందుకు భారత నాయకులు సలహా, సహకారములు అందించగలదని భావించబడినది.

క్రిప్స్ ప్రతిపాదనల మంచి, చెడ్డలు: క్రిప్స్ ప్రతిపాదనలు (1942) భారతదేశంలోని భిన్న రాజకీయ పక్షాలను సంతృప్తిపరచడానికి ఉద్దేశించినట్టివి. ఈ ప్రతిపాదనలు కాంగ్రెస్ డొమినియన్ ప్రతిపత్తి, రాజ్యాంగ పరిషత్, బ్రిటిష్ కామన్వెల్త్ నుండి విడిపోయే హక్కు మొదలైన ఆశలు చూపెట్టినవి. లీగ్ కోరికయైన పాకిస్తాన్ గుర్తింపు ఈ ప్రతిపాదనలో నిబిడీకృతమై ఉన్న స్వదేశ సంస్థానాధీపతులకు నూతన రాజ్యాంగమును ఆమోదించటానికి లేదా తిరస్కరించడానికి స్వేచ్ఛగలదని ఈ ప్రతిపాదనలో హామీగలదు. అల్పసంఖ్యాకుల భయాలు కూడా అనేక పరిరక్షణల ద్వారా నివృత్తి చేయబడినాయి. ఈ ప్రతిపాదన ఆగస్ట్ ప్రతిపాదనకన్నా మెరుగైనదని చెప్పవచ్చు.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

పూర్తి డొమినియన్ ప్రతిపత్తితో నూతన భారత యూనియన్ ఏర్పాటు చేయబడగలదనటం, కామన్వెల్త్ నుంచి విడిపోయే హక్కుండటం ప్రోత్సాహక విషయాలే కాని కాంగ్రెస్కు పూర్తి స్వాతంత్ర్య ప్రకటన మినహా మిగిలిన విషయాలేవీ సమ్మతం కావు. డొమినియన్ ప్రతిపత్తి ఎంతకాలములోపు ఇవ్వబడగలదో నిర్ధారణ చేయలేదు.

కాంగ్రెస్ కోరికను మన్నించడం కోసం యుద్ధం తరువాత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయగలదని ప్రతిపాదన కలదు. రాజ్యాంగ పరిషత్ నిర్మాణ సంబంధమైన పథకం సవ్యమైనది కాదు. ఉదా: స్వదేశ సంస్థానాల ప్రజలకు రాజ్యాంగ పరిషత్ ప్రతినిధుల ఎంపిక విషయాలలో ప్రమేయం ఉండదు. బ్రిటిష్ రాష్ట్రాల ప్రతినిధులు ఆయా రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికపై నిర్ణయించబడగలదు. పైగా స్వదేశ సంస్థానాధిపతుల ప్రతినిధులు రాజ్యాంగ పరిషత్లో ఉండటం అనేది భారత ప్రగతికి అవరోధమే.

నూతన రాజ్యాంగం ప్రకారం భారత యూనియన్ నుంచి బ్రిటిష్ రాష్ట్రాలకు, స్వదేశ సంస్థానాలకు విడిపోవటానికి హక్కు ఉండగలదనటం ఈ ప్రతిపాదనలో అతి ప్రమాదకరమైన భాగం. అంటే లీగ్ కోరికయైన పాకిస్తాన్ ఏర్పాటుకు బ్రిటిష్వారు సమ్మతించినట్లు అయినది. ఇది భారత యూనియన్ ఐక్యతకు గొడ్డలిపెట్టుకాగలదు.

వైస్రాయి కార్యనిర్వహణ మండలి సభ్యుల సంఖ్య మరికొందరు భారతీయ ప్రతినిధులతో విస్తృతపరచబడగలదని ఈ ప్రతిపాదనలో కలదు. కార్యనిర్వహణ మండలిగాని, దాని సభ్యులుగాని ఎలాంటి వాస్తవాధికారాన్ని చెలాయించలేరు. అధికారాలన్నీ వైస్రాయి చేతిలోనే కేంద్రీకరించబడగలవు. వివిధ రాజకీయ పక్షాల ప్రాతినిధ్యంతో జాతీయ ప్రభుత్వం ఏర్పాటు కావలెనని, దాని రాజ్యాంగబద్ధ అధిపతిగా మాత్రమే వైస్రాయి ఉండవలెననేది భారతీయల కోరిక. ఇట్టి – పరిస్థితులలో క్రిప్స్ ప్రతిపాదనలు భారతీయులకు ఆమోదయోగ్యం కాలేదు.

ప్రతిపాదనల తిరస్కృతి: విభిన్న కారణాలతో దాదాపు భారత రాజకీయ పార్టీలన్నీ ప్రతిపాదనలను తిరస్కరించినాయి. ఈ ప్రతిపాదనలలో భారతదేశ విభజనకు బ్రిటిష్వారు విషబీజాలు నాటారని కాంగ్రెస్ అభిప్రాయపడింది. రక్షణ సమస్య సంబంధంగా క్రిప్స్ కాంగ్రెస్ ఒక అంగీకారానికి రాలేకపోయింది. సంప్రదింపులు విఫలమైనాయి. అత్యవసర పరిస్థితిలో జాతీయ ప్రభుత్వం ఏర్పడవలెనని కాంగ్రెస్ చెప్పినది. రక్షణ విషయాలు కూడా జాతీయ ప్రభుత్వానికి అప్పగించవలెనని కాంగ్రెస్ కోరింది. కాని క్రిప్స్ ఈ కోర్కెలను తిరస్కరించినాడు. భారతీయులకు రక్షణ శాఖను బదిలీ చేయుటకు ఆయన ఇష్టపడలేదు. ‘ఇట్టి ఆపత్సమయములో కూడా బ్రిటిష్వారి మౌలిక వైఖరిలో మార్పులేదని భారతీయులు భావించారు. తత్ఫలితంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ క్రిప్స్ ప్రతిపాదనను ఆమోదించలేకపోయింది.

ప్రతిపాదనలలో ఇమిడియున్న పాకిస్తాన్ గుర్తింపును ముస్లింలీగ్ హర్షించినప్పటికీ దాని ఏర్పాటు గూర్చి స్పష్టీకరణ లేకపోయేసరికి విమర్శించింది. మిగిలిన రాజకీయ పక్షాలు కూడా క్రిప్స్ ప్రతిపాదనపట్ల తమ అసంతృప్తిని వెల్లడించినాయి. క్రిప్స్ ప్రతిపాదనల వైఫల్యమునకు కారణములు:

1) క్రిప్స్ రాయబారం విఫలమగుటకు ప్రధాన కారణం ప్రతిపాదనల అసమగ్రతయే. భారతీయుల దృష్టిలో ఈ ప్రతిపాదనలోని తాత్కాలిక, దీర్ఘకాలిక అంశాలు అసంతృప్తికరమైనవి. దీర్ఘకాలిక అంశమైన డొమినియన్ ప్రతిపత్తి, భారతీయుల ఆసక్తిని ఆకర్షించలేకపోయింది. తాత్కాలిక ప్రతిపాదనలు కూడా అస్పష్టము, అసంతృప్తికరములే. ప్రతిపాదనల ముసాయిదా ప్రకటన కూడా ప్రస్తుతము కన్నా భవిష్యత్తుపై నొక్కి చెప్పినది. అవి మొత్తంగా ఆమోదింపబడటమో, |తిరస్కరించటమో చేయవలెను. సవరణలకు అవకాశం లేదు. ఇన్ని లోపాలు గల ప్రతిపాదనలు సఫలమగుట |అనుమానాస్పదమే. కాంగ్రెస్, లీగ్, సిక్కులు, హిందూ మహాసభవారు ఈ ప్రతిపాదనలను తిరస్కరించారు.

2) క్రిప్స్ రాయబారం వైఫల్యానికి బ్రిటిష్ అధికారుల స్వార్థం కూడా దోహదపడింది. బ్రిటిష్ మంత్రివర్గం, భారత ప్రభుత్వం భారతీయులకు అధికారాన్ని అప్పగించుటకు ఇష్టపడలేదు. బ్రిటిష్ ప్రధాని చర్చిల్ క్రిప్స్క పూర్తి సహకారాన్ని ఇవ్వలేదు.

3) భారతదేశంలో అప్పుడు అనుకూల వాతారవణం కూడా లేదు. బ్రిటిష్ వారి వైఖరిపట్ల భారతీయులకు విశ్వాసం లేదు.

4) రక్షణశాఖ సమస్య విషయమై క్రిప్స్, కాంగ్రెస్ల మధ్య సంప్రదింపులు విఫలమైనాయి. యుద్ధం కొనసాగినంత కాలం రక్షణశాఖ బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండాలని క్రిప్స్ అభిప్రాయం. ఇందుకు జాతీయ కాంగ్రెస్ అంగీకరించలేదు. ఈ ప్రతిపాదనలను గాంధీజీ మొదటి నుండి వ్యతిరేకించెను. కనుకనే ఆయన ఈ ప్రతిపాదనలను “దివాలా తీయు బ్యాంకు మీద రాబోయే తేదీ వేసి ఇచ్చిన చెక్కు” అని అభివర్ణించెను. (“A post dated cheque on a withering Bank” -Gandhiji).

ప్రశ్న 6.
శాసనోల్లంఘన ఉద్యమానికి దారితీసిన కారణాలను, సంఘటనలను పేర్కొనండి.
జవాబు:
గాంధీజీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ 1930, మార్చి 12న చారిత్రాత్మకమైన శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ శాసనసభ్యులందరూ తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించాలని ఆదేశించింది. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుల ఆవేశాలను చల్లార్చేందుకు గాంధీజీ ప్రయత్నించాడు. ఈ సందర్భంలో గాంధీజీ చివరి ప్రయత్నం చేస్తూ రాజ ప్రతినిధి ఇర్విన్ను సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నించాలని హెచ్చరించాడు. రాజ ప్రతినిధి ఇర్విన్ ఆ హెచ్చరికను పెడచెవిన పెట్టడంతో గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించేందుకు నిర్ణయించాడు.

శాసనోల్లంఘన ఉద్యమం మూడు దశలుగా జరిగింది. అవి:
1) మొదటి దశ (1930 మార్చి 12 – 1932 జనవరి 3 వరకు) 2) రెండో దశ (1932 జనవరి 4 – 1933 జులై 11 వరకు) 3) మూడో దశ (1933 జులై 12 – 1934 మే వరకు)
మొదటి దశ: దీనినే ఉప్పు సత్యాగ్రహ దశగా వర్ణించవచ్చు. ఈ ఉద్యమంను గాంధీజీ 1930, మార్చి 12వ తేదీన సబర్మతీ ఆశ్రమం నుంచి 78 మంది అనుచరులతో ప్రారంభించాడు. అతడు 200 మైళ్ళ దూరంలో అరేబియా సముద్రతీరం వద్ద గల దండి గ్రామాన్ని కాలిబాటన చేరుకొని ఉప్పును తయారుచేసేందుకు ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించాడు. దీంతో దేశవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు సామూహిక ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా గాంధీజీ ప్రజలకు విజ్ఞప్తి చేసిన కార్యక్రమాలు:

  1. మద్యపాన దుకాణాలు, విదేశీ వస్త్ర విక్రయశాలల ఎదుట పికెటింగ్.
  2. రాట్నాల ద్వారా ఖద్దరు వడకటం.
  3. హిందూ – ముస్లింల మధ్య సంబంధాల పటిష్టత.
  4. అస్పృశ్యతా నివారణ.

ఉప్పు సత్యాగ్రహ పర్యవసానం:

  • బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని నిర్బంధంలోనికి తీసుకొని ఎర్రవాడ కారాగారంలో ఉంచింది. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు దేశమంతటా హర్తాళ్ పాటించారు.
  • అనేకమంది ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.
  • 1930-32 మధ్యకాలంలో లండన్లో బ్రిటిష్ ప్రభుత్వం మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పరచింది.
  • రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ పాల్గొని అల్పసంఖ్యాకుల ప్రాతినిధ్యం కంటే రాజ్యాంగ నిర్మాణమే ప్రధాన అంశమని వాదించాడు.
    కాని ఆయన వాదనలు ఆమోదయోగ్యం కాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి.

రెండో దశ:
1) ఈ దశలో గాంధీజీని, ఇతర నాయకులను 1932, జనవరి 14న నిర్బంధంలో ఉంచడం జరిగింది. కాని ప్రజలు పికెటింగ్ను చేపట్టడం జరిగింది.

2) బ్రిటిష్ ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలు ధిక్కరించి సమావేశాలు నిర్వహించడం, కరపత్రాల ముద్రణ వంటి చర్యలు అమలుచేయడం జరిగింది.

3) బ్రిటిష్ ప్రభుత్వం అన్ని రకాల ఊరేగింపులను నిషేధించింది.

4) ముస్లిం నాయకులు మినహా, జాతీయ నాయకులందరూ బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్ డొనాల్డ్ 1932, ఆగస్టు 10న ప్రకటించిన “కమ్యూనల్ అవార్డు”ను వ్యతిరేకించారు.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

5) కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ ఎర్రవాడ కారాగారంలో గాంధీజీ 1932, సెప్టెంబర్ 20న ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు.

6) బ్రిటిష్ ప్రభుత్వం, గాంధీజీ సంప్రదింపుల ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీ డిమాండ్లలో కొన్నింటికి
ఆమోదం తెలిపింది.

7) బ్రిటిష్ ప్రభుత్వం తమకు విధేయులైన నాయకులతో లండన్లో 1932, నవంబర్ 17 – డిసెంబర్ 24 మధ్య మూడో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో మహిళలకు ఓటుహక్కు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

మూడో దశ:

  1. 1933 జులైలో గాంధీజీ, మరికొంతమంది నాయకులు వ్యక్తిగత శాసనోల్లంఘన ఉద్యమానికి ఉపక్రమించారు. వారిని బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది.
  2. కారాగారంలో గాంధీజీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయనను బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసింది.
  3. 1934 మే నెలలో పాట్నాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించింది.

ప్రశ్న 7.
భారత జాతీయోద్యమంలో సుభాష్ చంద్రబోస్ పాత్రను అంచనా వేయండి.
జవాబు:
భారత జాతీయోద్యమ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని పొందిన దేశభక్తుడు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ఐ.సి.ఎస్ పరీక్ష పాసై సివిల్ సర్వెంట్గా తన జీవితాన్ని ప్రారంభించాడు. అయితే సహాయ నిరాకరణోద్యమ ప్రభావానికిలోనై తన సివిల్ సర్వీసు ఉద్యోగానికి రాజీనామా చేసి జాతీయోద్యమంలో పాల్గొన్నాడు.

కాంగ్రెస్లో పాత్ర: సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ రాజకీయాల్లో పాల్గొన్నాడు. 1938లో హరిపూర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడయ్యాడు. 1939లో త్రిపుర కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ అభ్యర్థియైన భోగరాజు పట్టాభి సీతారామయ్యను ఓడించి పార్టీ అధ్యక్షుడిగా గెలుపొందాడు. అయితే కాంగ్రెస్ అనుసరిస్తున్న శాంతియుత విధానాల యెడల బోస్కు విశ్వాసం లేదు. అందువల్ల గాంధీజీతో బోస్కు తీవ్రమైన భేదాభిప్రాయాలు కలిగాయి. అందువల్ల కాంగ్రెస్ నుంచి వైదొలగి ‘ఫార్వర్డ్ బ్లాక్’ అనే కొత్త పార్టీని స్థాపించాడు.

ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపన: బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి వెళ్లగొట్టాలంటే రెండవ ప్రపంచ యుద్ధం సరైన అవకాశమని బోస్ భావించాడు. అయితే యుద్ధకాలంలో బోస్ ను ప్రభుత్వం నిర్బంధించింది. బోస్ 1941లో నిర్భంధం నుంచి తప్పించుకొని మొదట రష్యాకు, తరువాత జర్మనీకి, జపాన్కు వెళ్ళాడు. యుద్ధసమయంలో ఆ దేశాల సహాయంతో ఇంగ్లీషువారితో పోరాడి, దేశానికి స్వాతంత్య్రం సాధించవచ్చని బోస్ తలచాడు. యుద్ధంలో జపాన్కు చిక్కిన భారతీయ యుద్ధఖైదీలందరినీ కూడగట్టుకొని 1943లో సింగపూర్లో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ లేక ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’ని స్థాపించాడు. ఐ.ఎన్.ఏ. స్థాపనలో బోస్కు రాస్ బిహారీ బోస్, మోహన్సింగ్లు సహకరించారు. ఐ.ఎన్.ఏలో చేరిన సేనలు బోస్ న్ను “నేతాజీ” అని గౌరవంగా పిలిచేవారు. “జైహింద్” అనే నినాదాన్ని చేపట్టి బోస్ తన అనుచరులందరితో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి “ఛలో ఢిల్లీ” అంటూ భారతదేశంలో ఇంఫాల్ సమీపంలోని మోయిరాంగ్ వరకు వచ్చాడు. ఆయనకు తోడుగా వీరవనిత కెప్టెన్ లక్ష్మి మహిళలతో ఏర్పడిన ఝాన్సీరాణి దళనేత అయింది. ఆయన నాయకత్వంలోని ఐ.ఎన్.ఏ. సైన్యాలు దేశ స్వాతంత్ర్యానికి ప్రాణాలొడ్డి పోరాడాయి. కానీ దురదృష్టవశాత్తు 1945 సెప్టెంబర్ లో జపాన్ ఓడిపోవటంతో బోస్ ప్రయత్నాలు విఫలమైనాయి. తన ప్రయత్నాలు కార్యరూపం ధరించకుండానే బోస్ 1945లో ఒక విమాన ప్రమాదంలో మరణించాడు.

ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యుల విచారణ: యుద్ధానంతరం ప్రభుత్వం ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ సేనలను ఇండియాపై దాడిచేయడానికి ప్రయత్నించినందున దేశద్రోహులుగా ప్రకటించి ఎర్రకోటలో విచారణ జరిపించింది. సైనిక నాయకులైన మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్ (ముస్లిం), కల్నల్ జి.ఎస్. ధిల్లాన్ (సిక్కు, మేజర్ ప్రేమ్ సెహగల్ (హిందూ) లపై విచారణ జరిపించింది. వారి తరఫున జవహర్లాల్ నెహ్రూ, తేజబహదూర్ సప్రూ, భూలాబాయ్ దేశాయ్లు వాదించారు. అయినప్పటికీ ప్రత్యేక న్యాయస్థానం వారికి శిక్షలు విధించింది. కానీ ఆ శిక్షలకు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవటంతో ప్రజాభిప్రాయాన్ని మన్నించి, ప్రభుత్వం వారిని విడుదల చేసింది. దీనితో ప్రజలకు, సైనికులకు ప్రభుత్వం పట్ల భయభక్తులు పోయాయి. హిందూ, సిక్కు, ముస్లింల సేనలను విచారించటం వలన కాంగ్రెస్, లీగ్లు సమైక్యంగా పోరాడాయి.

ఘనత: సుభాష్ చంద్రబోస్ విజయాన్ని సాధించలేకపోయినా, ఆయన ధైర్యసాహసాలు దేశంలో చాలామందికి స్ఫూర్తినిచ్చాయి. ఆయన అచంచల దేశభక్తి, క్రమశిక్షణ, కార్యదీక్ష తరతరాల భారతీయులకు ఆదర్శప్రాయం.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతీయులపై పాశ్చాత్య విద్య ప్రభావం గురించి రాయండి.
జవాబు:
పాశ్చాత్య విద్యావ్యాప్తి ద్వారా భారతీయుల్లో తార్కిక, లౌకిక, ప్రజాస్వామ్య భావాలు పునురుద్ధరింపబడ్డాయి. ఆంగ్ల | బోధన ప్రజల్లో ఏకత్వ భావన కలిగించి, రాజకీయ వికాసానికి తోడ్పడింది. ఆంగ్లవిద్య భారతదేశపు పూర్వ సంస్కృతి, సాహిత్యం, మతం, తాత్వికత, కళ అధ్యయనానికి, పునరుద్ధరణకు తోడ్పడింది. తవ్వకాల ద్వారా బయల్పడిన ప్రాచీన సంస్కృతీ వైభవాన్ని చూసి భారతీయులు గర్వించారు. ఆంగ్లవిద్య ద్వారా జరిగిన మరో ప్రయోజనం నూతనంగా బ్రిటిష్ ప్రభుత్వరంగాల్లో వచ్చిన ఉద్యోగావకాశాలు. దీంతో పాటు భారతీయ మేధావులు కూడా ఆంగ్లవిద్యను ప్రోత్సహించారు.

ఈస్ట్ ఇండియా కంపెనీ, క్రైస్తవ మిషనరీల ప్రోత్సాహం వల్ల పాశ్చాత్య విద్యనభ్యసించిన విద్యాధికుల సంఖ్య పెరిగింది. మొదటి నుంచి క్రైస్తవ మిషనరీలు విద్యను ప్రోత్సహించాయి. 1717 లో డానిష్ మిషనరీలు మద్రాసులో రెండు ఛారిటీ స్కూళ్ళను తెరిచారు. మద్రాసులోనే కాక అనేక ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి స్కూళ్ళను ప్రారంభించారు. కేరీ, మార్మోన్ లాంటి మిషనరీలు 1793వ సంవత్సరంలో వారి కార్యక్రమాలను విస్తృతం చేశారు. బొంబాయిలో విల్సన్ కాలేజి, మద్రాస్ లో మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. 1853 ఆగ్రాలో సెయింట్ జాన్ కాలేజీ మొదలైంది. మచిలీపట్నం, నాగపూర్లలో మిషనరీ కాలేజీలు స్థాపించబడ్డాయి.

ఆంగ్లవిద్య ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడమేకాక, అనేక గ్రంథాలను ప్రాంతీయ భాషల్లో రాయడానికి తోడ్పడింది. దీనివల్ల చదువురాని వారికి కూడా సమాజంలోని దురాచారాల పట్ల అవగాహన కలిగింది. బ్రిటిష్ పాలన దురాగతాలను తెలుసుకొన్న వీరు సంస్కరణావశ్యకతను గుర్తించారు. పాశ్చాత్య మేధావులైన మాకు ముల్లర్, విలియం జోన్స్ వేదాలను, ఉపనిషత్తులను, ఇతర గ్రంథాలను అనువదించారు. వారి పరిశోధనలు భారతదేశ గత చరిత్ర వైభవాన్ని వర్ణించాయి.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

ప్రశ్న 2.
హోం రూల్ ఉద్యమ పాత్రను విశ్లేషించండి.
జవాబు:
బ్రిటీషు సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉంటూనే భారతదేశానికి స్వపరిపాలనను సాధించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన ఉద్యమాన్ని హోంరూల్ ఉద్యమం అంటారు. మొదటి ప్రపంచయుద్ధ కాలంలో 1916లో హోం రూల్ ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా ప్రారంభమైంది. ఆ ఉద్యమానికి నాయకులు బాలగంగాధర్ తిలక్, అనిబిసెంట్లు.
బాలగంగాధర్ తిలక్: హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించటానికి తిలక్ 1916 ఏప్రియల్లో బొంబాయిలో ఒక హోం రూల్ లీగ్ను స్థాపించాడు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యభారత్ ప్రాంతాలలో తిలక్ తన ప్రచారాన్ని సాగించాడు. తన “మరాఠా”, “కేసరి” పత్రికల ద్వారా హోం రూల్ భావాన్ని ప్రచారం చేశాడు. తిలక్ హోం రూల్ ఉద్యమ ప్రచారం ప్రజలను చైతన్యవంతుల్ని చేసి, వారిలో స్వీయపాలనాభావాన్ని పటిష్టపరిచింది.

అనిబిసెంట్: హోం రూల్ ఉద్యమం కోసం అనిబిసెంట్ 1916 సెప్టెంబర్ నెలలో మద్రాసులో ఒక హోం రూల్ లీగ్ను స్థాపించింది. మద్రాసు పరిసర ప్రాంతాల్లో పర్యటించి ఉద్యమాన్ని అక్కడ ప్రచారం చేసింది. తన “న్యూ ఇండియా”, “కామన్వీల్” అనే పత్రికల ద్వారా అనిబిసెంట్ తన ప్రచారాన్ని సాగించింది.

హోం రూల్ ఉద్యమ వ్యాప్తి: తిలక్, అనిబిసెంట్ల కృషి వలన హోం రూల్ ఉద్యమం దేశవ్యాప్తమైంది. ఈ ఉద్యమం గురించి ప్రజలకు వివరించడానికి అనేక భాషల్లో అనేక కరపత్రాలను కూడా ప్రచురించారు. హోం రూల్ను సమర్థిస్తూ అనేక నగరాల్లో, గ్రామాల్లో కూడా సభలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమాలలో ఎక్కువగా యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. హోం రూల్ ఉద్యమ కాలంలో అనిబిసెంట్ జాతీయవిద్యకు చాలా ప్రాముఖ్యం ఇచ్చింది. విద్యార్థుల్లో జాతీయ భావాలు పెంపొందించడం జాతీయ విద్య లక్ష్యం. ఈ లక్ష్యంతోనే ఆమె మదనపల్లిలో ఒక కళాశాల నెలకొల్పింది. వారణాసిలో హిందూ విద్యాలయాన్ని నెలకొల్పడానికి కూడా ఆమె కృషి చేసింది.

ప్రభుత్వ చర్యలు: 1917 నాటికి అనిబిసెంట్ చేస్తున్న ఉద్యమ ప్రచారానికి బ్రిటిష్ ప్రభుత్వం ఆందోళన చెంది, ఆమెను నిర్బంధించింది. ఆమె నిర్బంధాన్ని నిరసిస్తూ అనేక ప్రాంతాలలో సభలు, ప్రదర్శనలు జరిగాయి. తిలక్ దేశ ఉత్తర ప్రాంతాల్లో పర్యటించడాన్ని కూడా ప్రభుత్వం నిషేధించింది. దీనిని కూడా ప్రజలు వ్యతిరేకించారు. ప్రజా ఆందోళనకు తలవగ్గి, అనిబిసెంట్ను మద్రాస్ ప్రభుత్వం 1917 సెప్టెంబరు నెలలో విడుదల చేసింది. ఆమె దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా కాంగ్రెస్ ప్రతినిధులు ఆమెను 1917లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. భారత |జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అలంకరించిన తొలి మహిళ అనిబిసెంట్.

ఉద్యమవ్యాప్తికి కారణాలు’: బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యమ నాయకులను నిర్బంధించి ఉద్యమ వ్యాప్తిని అరికట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఉద్యమం దేశవ్యాప్తమైంది. హోం రూల్ ఉద్యమ వ్యాప్తికి కొన్ని కారణాలున్నాయి.
1) 1907 సూరత్ సమావేశంలో చీలిపోయిన కాంగ్రెస్ 1916లో సమైక్యమై సంయుక్తంగా ఉద్యమించింది.

2) బెంగాల్ విభజన రద్దు కావటంతో వందేమాతరం ఉద్యమాన్ని నిర్వహించిన ఉద్యమకారులంతా తమ దృష్టిని హోం రూల్ ఉద్యమంవైపుకు మళ్లించి ఉద్యమానికి బలాన్ని చేకూర్చారు.

3) మొదటి ప్రపంచయుద్ధంలో బ్రిటన్ ముస్లిం రాజ్యాల యెడల అవలంబించిన వైఖరి భారతదేశంలో ముస్లింలకు కోపాన్ని కలిగించింది. అందువల్ల వారు కాంగ్రెస్ తో 1916లో లక్నో ఒడంబడికను కుదుర్చుకొని స్వీయపాలనోద్యమంలో పాల్గొన్నారు.

ఉద్యమ ముగింపు: హోం రూల్ ఉద్యమ ఫలితంగా ప్రజలలో నెలకొన్న రాజకీయ చైతన్యాన్ని, బ్రిటీషుపాలన యెడల వారిలో నెలకొన్న అసంతృప్తిని తొలగించటానికి 1917 ఆగస్టు 20వ తేదీన భారతరాజ్య వ్యవహారాల మంత్రి మాంటేగ్ ఒక ప్రకటన చేశాడు. ఈ ప్రకటన ప్రకారం క్రమక్రమంగా భారతీయులకు బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పరచబడుతుంది. ఈ ప్రకటన తరువాత బ్రిటీషు ప్రభుత్వం అనిబిసెంట్ను విడుదల చేయగా ఆమె హోం రూల్ ఉద్యమాన్ని నిలిపివేసింది. తిలక్ ఉద్యమాన్ని మరికొన్నాళ్లు కొనసాగించాడు.

ప్రశ్న 3.
జలియన్ వాలాబాగ్ మారణకాండ ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:
1919లో ఆంగ్ల ప్రభుత్వం భారతదేశంలో మాంటేగు – ఛేమ్స్ఫర్డ్ సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణలు భారతీయులకు ఎట్టి ప్రత్యేక హక్కులు ఇవ్వకపోగా ముస్లింలతో పాటు సిక్కులకు కూడా ప్రత్యేక స్థానాలు కేటాయించాయి. అందుకు భారతీయులలో అసంతృప్తి ప్రబలింది. ఇదే సమయంలో 1915 1918 కాలంలో చోటు చేసుకున్న ఉగ్రవాద కార్యకలాపాలను సమీక్షించడానికి ఆంగ్ల ప్రభుత్వముచే నియమించబడిన రౌలట్ కమిటీ కొన్ని చర్యలను సూచించింది. ఈ చర్యలన్నీ చట్టరూపం దాల్చాయి. దీనినే రౌలట్ చట్టం అంటారు. ఈ చట్టం వలన ప్రభుత్వానికి అసాధారణ అధికారాలు సంక్రమించాయి. ఈ చట్టప్రకారం రాజకీయ ఆందోళనకారులను వారంట్ లేకుండా నిర్బంధించవచ్చు. నిర్బంధించిన వారిని విచారించవలసిన పనిలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకమయిన ఏ చిన్న కాగితాన్ని కలిగివున్నా అది నేరంగా పరిగణింపబడుతుంది. ఇంగ్లాండ్లో పౌరుల హక్కులకు పునాది అయిన హెబియస్ కార్పస్ హక్కు భారతీయులకు లేకుండా పోయింది. ఈ బిల్లులను కాంగ్రెస్ వ్యతిరేకించింది. గాంధీజీ ఆ బిల్లును ఆమోదించవద్దని గవర్నర్ జనరల్ను కోరాడు. కానీ అది ఆమోదించబడింది. కనుక వాటి ఉపసంహరణకు గాంధీజీ ఉద్యమించాడు. 1919 ఏప్రియల్ 6న హర్తాళ్ పాటించవలసిందిగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చాడు. ఆ పిలుపునందుకొని దేశమంతటా హర్తాళ్ జరిగింది. హిందూ, ముస్లిం భేదం లేకుండా అందరూ ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్, పంజాబ్లలో హింసాకాండ జరిగింది. ముఖ్యంగా పంజాబ్లో ప్రజల నాయకులైన సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లూలను ప్రభుత్వం నిర్బంధించింది.

ఈ నిర్భంధానికి వ్యతిరేకంగా అమృత్సర్ ప్రజలు జలియన్ వాలాబాగ్ వద్ద సమావేశమైనారు. సమావేశం సాగుతుండగానే అమృత్సర్ మిలిటరీ కమాండర్ జనరల్ డయ్యర్ అక్కడకు వచ్చి ప్రజలపై ఎటువంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపించాడు. ఈ కాల్పుల్లో 379 మంది మరణించగా, 1200 మంది గాయపడ్డారు. ఈ సంఘటనే చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురంతంగా ప్రసిద్ధి చెందింది. జలియన్ వాలాబాగ్ సంఘటన భారత స్వాతంత్ర్య సమరంలో ఒక మైలురాయి. ఈ సంఘటన వలన భారత స్వాతంత్ర్యోద్యమం ఒక మహా సంగ్రామంగా మారింది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మితవాదులు ఎవరు ?
జవాబు:
జాతీయ కాంగ్రెస్లో తొలి ఇరవై సంవత్సరాల వరకు (1885-1905) ఉన్నత వర్గాలకు చెందిన మితవాదులు ప్రాబల్యం వహించారు. వీరిలో ముఖ్యులు సురేంద్రనాథ్ బెనర్జీ, మదన్మోహన్ మాలవ్యా, గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ ముఖ్యులు. బ్రిటిష్ పాలకులు భారతదేశం పట్ల న్యాయబద్ధంగా వ్యవహరిస్తారని వారు విశ్వసించారు. ప్రజల కోరికలను మహోజర్లు, సభలు, తీర్మానాల ద్వారా ప్రభుత్వానికి నివేదించడం ద్వారా జాతీయ ప్రగతి సాధించవచ్చునని భావించారు. రాజ్యాంగబద్ధ పోరాటాన్ని వారు చేయడం వల్ల వారిని మితవాదులన్నారు.

ప్రశ్న 2.
ఖేదా సత్యాగ్రహం గురించి రాయండి.
జవాబు:
అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మెలో గాంధీజీ పాలుపంచుకొన్నాడు. మిల్లు కార్మికుల వేతనాలను 35 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. చివరకు మిల్లు యజమానులు దిగివచ్చి గాంధీజీ డిమాండ్లకు అంగీకరించారు. అక్కడి నుంచి గాంధీ గుజరాత్లోని ఖేడా ప్రాంతానికి వెళ్ళారు. అక్కడి రైతాంగం దుర్భర పరిస్థితుల్లో ఉంది. పంటల దిగుబడి 25 శాతానికి పడిపోయింది. దాంతో భూమిశిస్తును రద్దు చేయాలంటూ రైతులు ఉద్యమం ప్రారంభించారు. ఆ ఉద్యమానికి గాంధీజీ మద్దతు ప్రకటించారు. రైతుల డిమాండ్కు ప్రభుత్వం తలొగ్గలేదు. వల్లభాయ్ పటేల్, తదితర ఇతర నేతలు గాంధీజీకి జత కలిశారు. చివరకు రైతుల డిమాండు ప్రభుత్వం అంగీకరించింది. సత్యాగ్రహంలో భారతదేశం అద్భుతాలు చేసింది.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

ప్రశ్న 3.
రౌలట్ సత్యాగ్రహన్ని వివరించండి.
జవాబు:
మొదటి ప్రపంచ యుద్ధానంతరం భారత ప్రజల ఏకాభిప్రాయాన్ని పెడచెవిన పెట్టిన బ్రిటిష్ ప్రభుత్వం రౌలట్ చట్టాన్ని 1919 మార్చిలో ఆమోదించింది. గాంధీజీ రాజకీయ జీవితంలో ఈ అణచివేత చట్టం కీలకమైన మార్పును తీసుకువచ్చింది. సత్యాగ్రహం ఆయుధంతో ఆ చట్టాన్ని వ్యతిరేకించాలని గాంధీజీ’ నిర్ణయించాడు. 1919 ఏప్రిల్లో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీ దేశవ్యాప్త ఉద్యమానికి ఇచ్చిన పిలుపుకు ప్రజలు గొప్పగా స్పందించారు.

ప్రశ్న 4.
సైమన్ కమీషన్ గురించి రాయండి.
జవాబు:
భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల గురించి సిఫారసు చేయాల్సిందిగా బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమీషన్ను నియమించింది. 1927 నవంబర్లో జాన్సైమన్ అధ్యక్షుడిగా ఒక స్థాయీ సంఘాన్ని నియమించింది. అధ్యక్షుడైన సైమన్ పేరు మీద ఆ సంఘానికి సైమన్ కమీషన్ అనే పేరు వచ్చింది. భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణలపై సిఫారసులు చేసేందుకు నియమించిన కమీషన్లో అందరూ ఆంగ్లేయులే ఉండటం, భారతీయులెవరికీ ఇందులో స్థానం కల్పించకపోవడం భారతీయులకు ఆగ్రహం తెప్పించింది. దాంతో ఆ కమీషన్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ సైమన్ కమీషన్ను ప్రజలు బహిష్కరించారు. ‘సైమన్ గో బ్యాక్’ నినాదం దేశమంతటా మార్మోగింది. అయినప్పటికీ సైమన్ కమీషన్ దేశంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యటించి నివేదిక రూపొందించింది.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 11th Lesson వలస పాలనలో భారతదేశం Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 11th Lesson వలస పాలనలో భారతదేశం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బ్రిటిష్, ఫ్రెంచ్ వారి మధ్య జరిగిన విభేదాలు లేదా కర్ణాటక యుద్ధాలు వివరించండి.
జవాబు:
ఆధునిక యుగంలో యూరోపియన్లు వ్యాపారార్థం భారతదేశానికి వచ్చారు. కాలక్రమంలో దక్కన్లో వ్యాపార ఆధిపత్యానికై ఇంగ్లీషు, ఫ్రెంచ్వారి మధ్య పోరాటం జరిగింది. ఈ పోరాటం మూడు యుద్ధాలుగా జరిగింది. వీటినే కర్ణాటక యుద్ధాలు అంటారు. ఈ యుద్ధాల వల్ల భారతదేశంలో ఫ్రెంచ్వారి శక్తి పూర్తిగా దిగజారిపోయింది. అప్పటి నుండి ఆంగ్లేయుల విజృంభణకు అడ్డం లేకుండా పోయింది.

మొదటి కర్ణాటక యుద్ధం (1744-1748): 1742వ సంవత్సరంలో డూప్లే ఫ్రెంచ్ గవర్నర్గా నియమించబడ్డాడు. ఇతనికి విపరీతమైన రాజ్యకాంక్ష. ఈ పరిస్థితులలో ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం ప్రష్యా-ఆస్ట్రియాల మధ్య వారసత్వ యుద్ధంగా మారింది. ఫ్రాన్స్ ప్రష్యా వైపు, బ్రిటన్ ఆస్ట్రియా ప్రక్కన చేరాయి. దీని ప్రభావం భారతదేశంపై కూడా పడింది. భారతదేశంలో ఆంగ్లేయులు, ఫ్రెంచ్ ముఖ్య స్థావరమైన పుదుచ్చేరిని ఆక్రమించటానికి సిద్ధంగా ఉన్నారు. ఇట్టి పరిస్థితులలో డూప్లే కర్ణాటక నవాబైన అన్వరుద్దీన్ సహాయం కోరాడు. దీనిపై ఆంగ్లేయులు యుద్ధ ప్రయత్నాలు విరమించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఫ్రెంచ్ సైన్యం లాబోర్డినాయి నాయకత్వంలో భారతదేశానికి వచ్చింది. ఆ ధైర్యముతో డూప్లే 1746వ సంవత్సరంలో ఫ్రెంచ్ సైన్యాలను ఆంగ్లేయుల పైకి పంపాడు. మద్రాసులోని ఆంగ్లేయుల సెయింట్ జార్జికోటను ఫ్రెంచ్వారు స్వాధీనపరచుకున్నారు. ఈలోగా ఆంగ్లేయులు అన్వరుద్దీన్ చేరారు. నవాబు ఫ్రెంచ్ వారిని హెచ్చరించి చివరకు వారితో యుద్ధాలు చేయాల్సివచ్చింది. 1746లో అన్వరుద్దీన్ సైన్యాలు ఫ్రెంచ్ వారి సైన్యాలు, శాంథోమ్ అనే ప్రదేశంలో యుద్ధానికి తలపడ్డాయి. శాంథోమ్ యుద్ధంలో ఫ్రెంచ్వారికి విజయం లభించింది. దీనితో కర్ణాటక రాజ్య బలహీనత బయల్పడింది. లాబోర్డినాయి తిరిగి వెనుకకు వెళ్ళటంతో సెయింట్ డేవిడ్ కోటను పట్టుకోదలచిన డూప్లే ఆశయాలు విఫలమైనాయి. ఈలోగా ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ఐలాషఫల్ సంధితో ముగిసింది. దీనితో భారతదేశంలో కూడా యుద్ధం ముగిసింది. సంధి షరతుల ప్రకారం మద్రాసును ఫ్రెంచ్వారు ఆంగ్లేయులకు తిరిగి ఇచ్చివేశారు.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

రెండవ కర్ణాటక యుద్ధం (1749-1754): 1748లో హైదరాబాద్ నిజాం ఉల్ ముల్క్ మరణించటంతో హైదరాబాదు సింహాసనము కోసం అతని రెండవ కుమారుడైన నాజర్ంగ్కు, మనుమడైన ముజఫరంగు మధ్య అంతర్యుద్ధం మొదలైంది. కర్ణాటక సింహాసనం కోసం మహారాష్ట్రుల నుండి విడుదలైన చందాసాహెబ్కు, అన్వరుద్దీన్ కు మధ్య యుద్ధం ప్రారంభమైంది. చందాసాహెబ్ మరియు ముజఫర్ఆంగ్లు ఫ్రెంచ్ గవర్నరైన డూప్లే సహాయంతో సింహాసనమును అధిష్టించటానికి ప్రయత్నించారు. స్వదేశ రాజులలో గల బలహీనతలను ఆసరాగా తీసుకొని వారి తగాదాలలో జోక్యం చేసుకొని విజయం సాధించాలని డూప్లే ఆశయము. చందాసాహెబు సహాయము చేస్తే కర్ణాటకలోను, ముజఫరంగ్కు తోడ్పడితే హైదరాబాద్లోను తన పలుకుబడి పెరగగలదని డూప్లే భావించాడు. ముజఫరంగ్ మరియు చందాసాహెబ్లు 1749 ఆగస్టు 3న ‘అంబూర్’ యుద్ధంలో అన్వరుద్దీన్ ను వధించారు. అన్వరుద్దీన్ మరణానంతరం అతని కుమారుడైన మహమ్మదాలీ తిరుచినాపల్లికి పారిపోయి ఆంగ్లేయుల సహాయాన్ని కోరాడు. ఫ్రెంచ్వారి సహాయానికిగాను చందాసాహెబ్ మచిలీపట్నం, రెండు గ్రామాలను కృతజ్ఞతగా వారికి ఇచ్చాడు. ఆంగ్లేయుల సహాయంతో నాజర్ జంగ్, ముజఫరంగ్ను ఓడించాడు. కానీ ఫ్రెంచ్వారి చేతిలో హత్యకు గురయ్యాడు. ఫ్రెంచ్వారు ముజఫరంగ్ను హైదరాబాదు నవాబుగా చేశారు. అక్కడ బుస్సీ అనే ఫ్రెంచి సైన్యాధిపతి రక్షణగా ఉన్నాడు. కొంతకాలానికి ముజఫరంగ్ శత్రువుల చేతుల్లో మరణించగా ఫ్రెంచ్వారు అతని కుమారుడైన సలాబతంగ్ను నవాబుగా చేసి దక్కన్లో ఫ్రెంచి అధికారాన్ని సుస్థిరపరచారు.

కర్ణాటకలో ఫ్రెంచివారు మరియు చందాసాహెబ్ తిరుచినాపల్లిని జయించి మహమ్మదాలీని మరియు ఆంగ్లేయులను ఓడించటానికి ప్రయత్నించారు. ఆంగ్లేయులు మహమ్మదాలీని రక్షించటానికి క్లైవ్ సహాయంతో ఒక పథకాన్ని తయారుచేశారు. చందాసాహెబ్ మరియు ఫ్రెంచ్వారు 1751వ సంవత్సరంలో తిరుచినాపల్లిని ముట్టడించునప్పుడు క్లెవ్ మద్రాసు నుంచి కొంత సైన్యంతో ఆర్కాటును ముట్టడించాడు. తన రాజధానిని రక్షించుకొనుటకై చందాసాహెబ్ కొంత సైన్యంతో తిరుచినాపల్లి నుండి ఆర్కాటుకు వెనక్కి మరలాడు. దీనితో తిరుచినాపల్లి వద్దగల చందాసాహెబ్, ఫ్రెంచి సైన్యం ఆంగ్లేయుల చేతిలో ఓడింపబడ్డారు. కర్ణాటకలో రాబర్ట్ క్లైవ్ చందాసాహెబ్ను ఓడించి 1752వ సంవత్సరంలో వధించాడు. మహమ్మదాలీని కర్ణాటక నవాబుగా చేసి కర్ణాటకపై ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని సంపాదించారు. దీనితో కర్ణాటకలో ఫ్రెంచ్వారు తమ ఆధిపత్యాన్ని కోల్పోయారు. ఇట్టి పరిస్థితులలో ఫ్రెంచ్వారు డూప్లేను తొలగించి గాడెహ్యూను గవర్నరుగా నియమించారు. ఇతడు ఆంగ్లేయులతో పాండిచ్చేరి సంధి కుదుర్చుకున్నాడు. రెండవ కర్ణాటక యుద్ధానంతరం దక్కన్లో ఫ్రెంచ్వారి ప్రాబల్యం, కర్ణాటకలో ఆంగ్లేయుల ప్రాబల్యం పెరిగింది.

మూడవ కర్ణాటక యుద్ధం (1756-1761): గాడెహ్యూ చేసుకున్న సంధి అమల్లోకి రాకమునుపే ప్రపంచాధిపత్యం కోసం ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైంది. దాని ప్రభావం వలన భారతదేశంలో ఫ్రెంచ్ ప్రభుత్వం, ఫ్రెంచ్ గవర్నర్గా కౌంట్ డీలాలీని నియమించింది. ఇతడు యుద్ధంలో ఆరితేరిన యోధుడైనా అహంభావం కలవాడు. ఇతడు సేనాధిపతులతో కలిసిమెలసి పనిచేయటం, వారి సలహాలను స్వీకరించటం ఇతనికి ఇష్టంలేదు. భారతదేశం చేరగానే కడలూర్లోని ఇంగ్లీషువారి సైనిక పెరేడ్ కోటను ఆక్రమించాడు. మద్రాసును ముట్టడించటానికి ప్రయత్నాలు చేశాడు, కానీ విఫలుడయ్యాడు. ఇట్టి పరిస్థితులలో సర్ ఐర్ కూట్ ఆంగ్ల సైన్యానికి నాయకత్వం వహించాడు.

ఆంగ్లేయులను ఎదుర్కోలేక కౌంట్ డీలాలీ హైదరాబాదు సంస్థానంలోని బుస్సీని రావలసిందిగా కోరాడు. తాను హైదరాబాదును వదిలిన వెంటనే అక్కడ ఫ్రెంచ్వారి ప్రాబల్యం అంతరించగలదని బుస్సీ తలచాడు. కానీ డీలాలీ బుస్సీ సలహాను లెక్కచేయక బుస్సీని హైదరాబాదు నుండి రమ్మని ఆజ్ఞాపించాడు. దీనితో ఆంగ్లేయులు నైజాం నవాబుతో సంధి చేసుకొని అతని సంస్థానంలో చేరారు. విజయనగర సంస్థానాధీశుడైన ఆనంద గజపతి బెంగాల్లో ఉన్న క్లైవ్ను దండెత్తి రావలసిందిగా ఆహ్వానించాడు. క్లైవ్, సర్ ఐర్ కూట్ను పంపించగా అతడు ‘1760లో వాండివాష్ లేక వందవాసి’ యుద్ధంలో ఫ్రెంచ్ సైన్యాన్ని ఓడించి, పుదుచ్చేరిని ఆక్రమించి, కౌంట్ డీలాలీని బంధించి ఇంగ్లండుకు పంపాడు. 1763లో పారిస్ సంధితో సప్తవర్ష సంగ్రామం ముగిసింది. దీనితో మూడవ కర్ణాటక యుద్ధం అంతమైంది.

ప్రశ్న 2.
రాబర్ట్ క్లైవ్ బెంగాల్న ఆక్రమించిన విధానం రాయండి.
జవాబు:
భారతదేశంలో ఆంగ్ల సామ్రాజ్యానికి పునాదులు వేసిన వారు రాబర్ట్ క్లైవ్. ఇతడు బ్రిటిష్ తూర్పు ఇండియా వర్తక సంఘంలో సామాన్య గుమాస్తాగా చేరి, తన స్వయం కృషితో, ధైర్య సాహసాలు ప్రదర్శించి, కర్ణాటక యుద్ధాలలో విజయం సాధించి భారతదేశంలో ఆంగ్లేయుల ప్రాబల్యానికి కారకుడయ్యాడు. ఆర్కాట్ ముట్టడి సమయంలో చందా సాహెబ్ను చంపి ఆంగ్లేయులకు విజయాన్ని సాధించాడు. ఈ విజయం వలన క్లైవ్ను “ఆర్కాటు వీరుడు” అని పిలిచారు. ఈ విజయం వలన క్లైవ్ను మద్రాసు కౌన్సిల్లో సభ్యుడిగా నియమించారు.

ప్లాసీ యుద్ధం (1757, జూన్ 25): బ్లాక్ హోల్ ట్రాజడీ లేక కలకత్తా చీకటిగది ఉదంతాన్ని విన్న మద్రాస్ కౌన్సిల్, ఫోర్ట్ విలియంను తిరిగి స్వాధీనం చేసుకొనే బాధ్యతను రాబర్ట్ క్లెన్క అడ్మిరల్ వాట్సనక్కు అప్పగించింది. వీరి నాయకత్వంలోని ఇంగ్లీషు సైన్యం 1757లో కలకత్తాను తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ పరిస్థితులలో బెంగాల్ నవాబు సిరాజుదౌలా, ఇంగ్లీషువారికి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఇంగ్లీషువారు తమ స్థావరాలన్నింటిని తిరిగి రాబట్టుకున్నారు. వారికి నష్టపరిహారం చెల్లించడానికి సిరాజ్ అంగీకరించాడు. కలకత్తాలో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవటానికి, వాటిని పటిష్టం చేసుకోవటానికి, నాణాలను ముద్రించుకోవటానికి ఇంగ్లీషువారికి అనుమతినిచ్చాడు. అయినా సిరాజ్ను ఫ్రెంచ్వారి పట్ల అనుకూలంగా ఉన్నాడని క్లైవ్ భావించి అతడిని సింహాసనం నుంచి తొలగించాలని నిశ్చయించుకున్నాడు. క్లైవ్కు సిరాజ్ సైన్యాధిపతి మీరాఫర్, అమీన్ చంద్ అనే వ్యాపారి సహకరించారు. ఈ నేపథ్యంలో ఆంగ్లేయులకు, సిరాజ్ సైన్యాలకు ప్లాసీ వద్ద యుద్ధం జరిగింది. మీరాఫర్ ద్రోహం వల్ల సిరాజ్ ఓడిపోయి యుద్ధభూమిలో మరణించాడు. బీహార్, బెంగాల్, ఒరిస్సాలకు మీరాఫర్ నవాబు అయ్యాడు. 24 పరగణాల జమిందారీ ఇంగ్లీషు కంపెనీవారికి లభించింది. క్లైవ్కు 2,34,000 పౌన్లు బహుమానంగా లభించాయి.

ఆధునిక భారతదేశ చరిత్రలో ప్లాసీ యుద్ధానికి ప్రత్యేక స్థానం ఉంది. బెంగాల్లో ఇంగ్లీషు కంపెనీవారు మొగల్ సుబేదార్ను ఓడించగలిగారు. స్థానిక ప్రభువుల బలహీనతలు, వారి అసమర్థత బహిర్గతమయ్యాయి. ప్లాసీ యుద్ధంతో ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు పడ్డాయి.

ప్లాసీ యుద్ధానంతరం ఆంగ్ల ప్రభుత్వం క్లైవు బెంగాల్ గవర్నర్ గా నియమించింది. గవర్నర్ తన పదవీ కాలం (1758-1760) లో క్లైవ్ డచ్ వారిని ఓడించి వారి నుంచి నష్టపరిహారం కూడా రాబట్టుకున్నాడు. ఈ విజయంతో ఇంగ్లీషువారిని ఎదిరించగల శక్తి భారతదేశంలో లేకుండా పోయింది. 1760లో క్లైవ్ స్వదేశానికి తిరిగివెళ్లాడు.

బక్సార్ యుద్ధం (1764, అక్టోబరు 17): ఇండియా నుంచి రాబర్ట్ క్లైవ్ నిష్క్రమించిన తరువాత బెంగాల్ గందరగోళంలో పడింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులు సొంత వ్యాపారాలలో మునిగి, కంపెనీ వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేశారు. వాన్ సిటార్ట్ ఇంగ్లీషు గవర్నర్ అయ్యాడు. అతడు మీర్జాఫర్ను తొలగించి, మీర్ ఖాసింను నవాబ్ నియమించాడు. మీరసిం ఇంగ్లీష్ వారికి బరద్వాన్, మిడ్నాపూర్, చిటగాంగ్ జిల్లాలను దత్తత చేశాడు. మీరసిం సమర్థుడే. బెంగాల్ ఆర్థిక వనరులను మెరుగుపరచటానికి అతడు చర్యలు తీసుకున్నాడు. ఇంగ్లీషు కంపెనీ ఉద్యోగుల సొంత వ్యాపారాలను అరికట్టడానికి కూడా అతడు ప్రయత్నించాడు. అందువల్ల, ఇంగ్లీష్ ్వరిలో ద్వేషం రగిలింది. దానితో మీరసిం అయోధ్యకు పారిపోయి అక్కడ అయోధ్య నవాబు, మొగల్ చక్రవర్తి షా ఆలంల సహాయం అర్థించాడు. మీర్ ఖాసిం, అయోధ్య నవాబు, షా ఆలంలను 1764 అక్టోబరులో మేజర్ మన్రో బక్సార్ యుద్ధంలో ఓడించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

బక్సార్ యుద్ధం, ప్లాసీ యుద్ధం కన్నా చరిత్రలో ఎక్కువ ప్రాముఖ్యం సంతరించుకుంది. ఈ యుద్ధంలో ఇంగ్లీషువారు ఒక బెంగాల్ నవాబుపైనే కాకుండా మొగల్ చక్రవర్తిపైన కూడా విజయం సాధించారు. షా ఆలం లొంగిపోయి ఇంగ్లీషు వారి రక్షణ కిందకు వచ్చాడు. ఇంగ్లీషువారు మరో విజయాన్ని కారాలో సంపాదించుకున్నారు. ఈ విజయం వల్ల అయోధ్య నవాబు కూడా ఇంగ్లీష్వారి నియంత్రణ కిందకు వచ్చాడు.

క్లైవ్ బెంగాల్ గవర్నరుగా పునరాగమనం: బక్సార్ యుద్ధానంతరం బెంగాల్లో దుష్టపాలన నెలకొన్నది. అందువలన కంపెనీ డైరెక్టర్లు క్లైవ్ను బెంగాల్ గవర్నర్ తిరిగి నియమించారు. 1765 మేలో క్లైవ్ ఇండియా చేరుకుని అయోధ్య నవాబుతోను, మొగల్ చక్రవర్తితోను అలహాబాద్ సంధులను కుదుర్చుకున్నాడు.

అలహాబాద్ సంధులు (1765): అలహాబాద్ సంధుల ప్రకారం

  1. ఇంగ్లీషు వారికి బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో భూమిశిస్తు వసూలు చేసుకొనే హక్కు లభించింది. దీన్ని దివానీ అంటారు. పరిపాలన బాధ్యత నవాబుకు అప్పగించడం జరిగింది. దీన్ని నిజామత్ అంటారు.
  2. ఉత్తర సర్కారులపై ఇంగ్లీషువారి అధికారాన్ని మొగల్ చక్రవర్తి గుర్తించాడు.
  3. ఆర్కాట్ నవాబు స్వతంత్రపాలకుడయ్యాడు.
  4. అయోధ్య నుంచి కారా, అలహాబాద్లను విడగొట్టి మొగల్ చక్రవర్తికి ఇచ్చారు.
  5. ఈస్టిండియా కంపెనీవారు మొగల్ చక్రవర్తికి 20 లక్షల రూపాయలు చెల్లించడానికి అంగీకరించారు.

ఘనత: భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనుడు రాబర్ట్ క్లైవ్ చిన్న గుమస్తాగా జీవితం ప్రారంభించి స్వయంకృషి వల్ల గవర్నర్ పదవికి ఎదిగాడు. ఈస్టిండియా కంపెనీ సామ్రాజ్య వ్యవస్థాపకుడిగా ఆధునిక భారతదేశ చరిత్రపుటలలో క్లెవ్ ప్రముఖ స్థానాన్ని పొందాడు.

ప్రశ్న 3.
ఆంగ్లో, మైసూర్ యుద్ధాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
రాబర్ట్ క్లైవ్ పాలనా కాలం ముగిసే నాటికి మైసూర్ రాజ్యం ఒక ముఖ్యమైన స్వతంత్ర రాజ్యంగా ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు మైసూర్ని జయించాలని నిశ్చయించారు. వీరి కోరిక ఫలితంగా ఇంగ్లీష్వారు నాలుగు యుద్ధాల్ని చేయాల్సి వచ్చింది. వీటినే మైసూర్ యుద్ధాలని అంటారు. హైదర్ అలీ, అతడి కుమారుడు టిప్పు సుల్తాన్ వీరోచితంగా ఇంగ్లీష్ గవర్నర్లను ఎదుర్కొన్నారు. మొదటి మైసూర్ యుద్ధంలో (1767-69) హైదర్ అలీ, అతని మిత్రపక్షమైన ఫ్రెంచ్ సైన్యాలు టిక్రోమలై వద్ద ఘోరమైన ఓటమిని చవిచూశాయి. కాని తిరిగి తన సైన్యాన్ని కూడకట్టుకొని హైదర్ అలీ ఇంగ్లీష్ వారిని ఎదుర్కొన్నాడు. మద్రాసు సంధితో యుద్ధం ముగిసింది. యుద్ధ సమయంలో ఆక్రమించిన ప్రాంతాలు తిరిగి ఎవరిది వారికి ఇవ్వబడ్డాయి.

మద్రాసు సంధి షరతుల్ని ఇంగ్లీష్ వారు ఉల్లంఘించడం వల్ల రెండవ మైసూర్ యుద్ధం (1780-84) జరిగింది. ఈ తరుణంలో కల్నల్ బేయిలి ఆధ్వర్యంలోని బ్రిటిష్ సైన్యం 80 వేల మంది సైనికులతో జూలై 1780 లో హైదర్ అలీపై మెరుపుదాడి చేసింది. కాని యుద్ధం ముగియకముందే హైదర్ అలీ క్యాన్సర్ జబ్బుతో మరణించాడు. టిప్పు సుల్తాన్ ఇంగ్లీషు వారితో మంగళూరు సంధి చేసుకొని యుద్ధాన్ని విరమించాడు.

1784 తరువాత కూడా మైసూర్, బ్రిటిష్ వారి మధ్య శత్రుత్వం కొనసాగింది. మంగళూరు సంధి వల్ల కేవలం తాత్కాలికమైన శాంతి మాత్రమే ఏర్పడింది. గవర్నర్ జనరల్ అయిన కారన్ వాలీస్ టిప్పు సుల్తాన్ను అధికారం నుంచి తొలగించడానికి పావులు కదిపాడు. దీంతో ఇరువురి మధ్య యుద్ధం అనివార్యమయ్యింది. వీరోచితమైన టిప్పు సుల్తాన్ పోరాట పటిమ, ఆయన సైన్యం ఇంగ్లీషు సైన్యాన్ని ఓడించడంలో విఫలమయ్యింది. శ్రీరంగపట్టణం సంధి ద్వారా ఈ యుద్ధం ముగిసింది. ఈ సంధి షరతుల ప్రకారం కృష్ణా, పెన్నా నదుల మధ్య ఉన్న భూభాగాన్ని బ్రిటిష్ వారి స్వాధీనం చేయడానికి టిప్పు సుల్తాన్ అంగీకరించాడు. మూడవ మైసూర్ యుద్ధంలో ఓడిపోవడం టిప్పు సుల్తాన్ క్షీణిస్తున్న అధికారానికి గుర్తుగా భావించవచ్చు. చివరగా జరిగిన నాలుగవ మైసూరు యుద్ధంలో (1799) లార్డ్ వెల్లస్లీ టిప్పు సుల్తాన్ను ఓడించి హతమార్చాడు. టిప్పు సుల్తాన్ మరణంతో మైసూరు రాజ్యం ఇంగ్లీషువారి వశమైంది.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

ప్రశ్న 4.
కారన్ వాలీస్ సంస్కరణల ముఖ్యాంశాలు వివరించండి.
జవాబు:
సివిల్ పరిపాలనా సంస్కరణలు: ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు చాలా లంచగొండులయ్యారని, వారిలో సామర్థ్యం పూర్తిగా లోపించిందని కారన్ వాలీస్ గ్రహించాడు. వారికి కంపెనీ వ్యవహారాలకన్నా సొంత వ్యాపారమే ముఖ్యమైంది. వారు తరచు బహుమానాలను తీసుకునేవారు. అందువలన కంపెనీ ఉద్యోగులు లంచాలనుగాని, బహుమతులనుగాని తీసుకోరాదని కారన్ వాలీస్ హెచ్చరించాడు. ప్రైవేటు వ్యాపారం చేసుకొంటున్న కంపెనీ ఉద్యోగులు దండనలకు పాత్రులవుతారని ప్రకటించాడు. ఉద్యోగుల జీతాలు పెంచమని కంపెనీ డైరెక్టర్లకు సలహా ఇచ్చాడు. ఆ సలహా మేరకు కంపెనీ ఉద్యోగుల జీతాలు పెరిగాయి. కలెక్టరుకు నెలకు 1500 రూపాయల జీతం ముట్టింది. భారతీయుల శక్తి సామర్థ్యాల మీద, గుణగణాల మీద కారన్ వాలీస్ కు చాలా చులకన భావం ఉంది. భారతదేశానికి చెందిన ప్రతి ఉద్యోగి అమిత లంచగొండి అని అతడి అభిప్రాయం. అందువలన పరిపాలనా వ్యవస్థలోను, సైనిక వ్యవస్థలోను భారతీయులకు చోటు లేకుండా పోయింది. అందువలననే పరిపాలనలో ఐరోపీకరణ ప్రవేశపెట్టాడు. ఇది కారన్ వాలీస్ జాతి వివక్షతకు దర్పణం పట్టింది. అయినప్పటికీ పౌర, మిలటరీ ఉద్యోగాలలో లంచగొండితనం రూపుమాపి, కారన్ వాలీస్ నీతివంతమైన పరిపాలన అందించాడు.

న్యాయ సంస్కరణలు: కారన్ వాలీస్ 1787, 1790, 1793లో అనేక న్యాయసంస్కరణలు ప్రవేశపెట్టాడు. న్యాయశాఖలో ఖర్చును పూర్తిగా తగ్గించాడు. న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరుచేశాడు. జిల్లా కలెక్టర్లకు న్యాయాధికారాలు తొలగించి వారికి భూమిశిస్తు వసూళ్లను మాత్రమే అప్పగించాడు. జిల్లా కోర్టులకు జిల్లా జడ్జిలను నియమించాడు. సివిల్, క్రిమినల్ కేసులను విచారించడానికిగాను కారన్ వాలీస్ పై స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. 50 రూపాయల లోపు ఆస్తి తగాదాలను మున్సిఫ్ కోర్టులు విచారించాయి. మున్సిఫ్ కోర్టులకు భారతీయులను న్యాయాధికారులుగా నియమించాడు. నాడు మొత్తం 23 జిల్లాలుండేవి. ప్రతి జిల్లాకు ఒక జిల్లా కోర్టును ఏర్పాటు చేశాడు. బెంగాల్, బీహార్, ఒరిస్సాలను నాలుగు డివిజనులుగా విభజించాడు. ప్రతి డివిజన్కు ఒక సర్క్యూట్ కోర్ట్ను ఏర్పరచాడు. క్రిమినల్ కేసులలో సదర్ నిజామత్ అదాలత్ అప్పీళ్లను స్వీకరించి విచారించింది. అదేవిధంగా సదర్ దివానీ అదాలత్ సివిల్ వ్యవహారాల విచారణను స్వీకరించింది. గవర్నర్ జనరల్-ఇన్-కౌన్సిల్ క్రిమినల్ కేసులలో తుది తీర్పును ఇచ్చేది. న్యాయశాఖకు సంబంధించిన అన్ని నియమాలను క్రోడీకరించారు. దీనికి ‘కారన్ వాలీస్ కోడ్’ అని పేరు వచ్చింది. సమన్యాయపాలన, స్వతంత్ర న్యాయశాఖలు ఈ కోడ్లో చోటుచేసుకున్నాయి. అంగవిచ్ఛేదంలాంటి క్రూరమైన శిక్షలు రద్దయ్యాయి.

పోలీస్ సంస్కరణలు: పోలీస్ సంస్కరణలలో భాగంగా కారన్ వాలీస్ పోలీస్ అధికారాలను జమిందారుల నుంచి తీసివేశాడు. ప్రతి జిల్లాను ఠాణాలుగా విభజించారు. ప్రతి ఠాణాకు దరోగా అనే పోలీస్ అధికారిని నియమించాడు. ప్రతి జిల్లాకు సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ అనే ఉద్యోగిని నియమించాడు. ఈ విధంగా ఆధునిక పోలీస్ వ్యవస్థకు కారన్ వాలీస్ పునాది వేశాడు.

జైలు సంస్కరణలు: కారన్ వాలీస్ జైలు సంస్కరణలను ప్రవేశపెట్టాడు. మేజిస్ట్రేట్లు తరచుగా జైళ్లను తనిఖీ చేయాలని, ఖైదీలకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చాడు. ఖైదీల ఆరోగ్య విషయంలో కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. సివిల్, క్రిమినల్ నేరస్థులకు వేరువేరు వార్డ్లను కేటాయించారు. మహిళా ఖైదీలకు ప్రత్యేక బ్లాక్ లను ఏర్పాటు చేశాడు.

శాశ్వత భూమిశిస్తు నిర్ణయ విధానం: కారన్ వాలీస్ సంస్కరణలన్నింటిలో అతి ప్రధానమైనది శాశ్వత భూమిశిస్తు నిర్ణయ పద్ధతి. ఈ పద్ధతిలో భూమిశిస్తును వసూలు చేయటానికి ప్రతి 10 సంవత్సరాలకొకసారి వేలంపాటలు వేస్తారు. ఈ వేలం పాటలో ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తామని ఒప్పుకున్న జమిందారులకు శిస్తువసూలు అధికారాన్ని అప్పగిస్తారు. ఈ మొత్తాన్ని జమిందారులు ప్రతి సంవత్సరం కాక 10 సంవత్సరాల కాలానికి నిర్ణయిస్తారు. ఈ పద్ధతిననుసరించి జమిందారులకు భూములపై యాజమాన్యపు హక్కు ఏర్పడింది. పన్నులు చెల్లించనివారి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, వాటిని వేలం వేసి, తన బకాయిలను రాబట్టుకుంది. జమిందారుల నుంచి 89 శాతాన్ని శిస్తుగా వసూలుచేసి, మిగిలిన 11 శాతాన్ని వారికే వదిలివేసింది. ఇది అధికమైన భూమిశిస్తే, కాని ఈ నిర్ణయం శాశ్వతమైంది కాబట్టి భూమి నుంచి ఫలసాయం పెరిగినా అది కంపెనీకి చెందదు.

లాభాలు: శాశ్వత భూమిశిస్తు నిర్ణయ పద్ధతి వలన ప్రభుత్వానికి కొన్ని లాభాలు చేకూరాయి.
అవి:

  1. ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో ముందుగా ఖచ్చితంగా తెలిసింది.
  2. ప్రతి సంవత్సరం భూమిశిస్తు నిర్ణయం, దాని వసూలు బాధ్యతలు ప్రభుత్వాధికారులకు తప్పిపోయాయి.
  3. భూమిశిస్తు రేటు రెండింతలయింది.
  4. జమిందారులు కష్టించి తమ ఉత్పత్తులను పెంచుకొని ఆదాయాన్ని పెంచుకోగలిగారు.
  5. పెరిగిన ఆదాయాల వల్ల భూస్వాములు పరిశ్రమలలో పెట్టుబడి పెట్టగలిగారు.
  6. దీనివల్ల పారిశ్రామికీకరణ జరిగి ప్రజల జీవన ప్రమాణం పెరిగింది.
  7. జమిందారులతో మిత్రత్వం లభించి కంపెనీ పాలనకు భద్రత ఏర్పడింది.

నష్టాలు: శాశ్వత భూమిశిస్తు నిర్ణయ పద్ధతి వలన కొన్ని నష్టాలు కూడా వున్నాయి. అవి:

  1. కొందరు జమిందారులు పెరిగిన శిస్తులు చెల్లించలేకపోవటంతో వారి భూములు వేలానికి వచ్చాయి. కంపెనీ ప్రభుత్వం కూడా కొంతవరకు నష్టపోయింది.
  2. ఈ నిర్ణయం వల్ల సమాజం జమిందారులు, కౌలుదారులు అనే రెండు వర్గాలుగా విడిపోయింది.
  3. జమిందారుల ఆదాయం పెరిగినందువల్ల వారు నగరాలకు వలసవెళ్లి విలాసవంతమైన జీవితాలు గడపసాగారు.
  4. రైతుల స్థితి దిగజారింది. వారు జమిందారుల దయాదాక్షిణ్యాలమీద ఆధారపడవలసి వచ్చింది. రైతులకు యాజమాన్యపు హక్కు లేకపోవటంతో వారి జీవితం మరింత దుర్భరమైంది.

ముగింపు: కారన్ వాలీస్ పరిపాలనావేత్తగా పేరుపొందాడు. బ్రిటిష్ ఇండియా పరిపాలనలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి అక్కడ చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు. అతడి పరిపాలనకు కారన్వాలీస్ విధానమని పేరొచ్చింది. న్యాయ, పోలీస్ శాఖలలో ఇంగ్లీషువారి విధానాలను ప్రవేశపెట్టాడు. అతడి న్యాయసంస్కరణలలో ఇంగ్లీషు న్యాయ విధానం ప్రతిబింబించింది.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

ప్రశ్న 5.
1857 తిరుగుబాటుకు గల ముఖ్య కారణాలు తెలపండి.
జవాబు:
ఆధునిక భారతదేశ చరిత్రలో 1857 తిరుగుబాటు ఒక ముఖ్య చారిత్రక ఘట్టం. ఈ తిరుగుబాటుకు దారితీసిన పరిస్థితులను రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత, సైనిక కారణాలను ఐదు రకాలుగా విభజించవచ్చు.

1) రాజకీయ కారణాలు: భారతదేశంలో తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేయటానికి ఆంగ్లేయులు అనేక పద్ధతులను అవలంబించారు. యుద్ధాలు చేయటం ద్వారా, సైన్యసహకారపద్ధతి ద్వారా, పరిపాలన సరిగాలేదనే నెపంతో సామ్రాజ్య విస్తరణ చేశారు. డల్హౌసీ మరో అడుగు ముందుకు వేసి రాజ్యసంక్రమణ సిద్ధాంతం ద్వారా అయోధ్య, సతారా, నాగ్పూర్, ఝాన్సీ మొదలైన సంస్థానాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. పీష్వా దత్తకుమారుడైన నానాసాహెబ్కు భరణాన్ని నిరాకరించాడు. కర్ణాటక, తంజావూర్, తిరువాన్కూర్ రాజుల బిరుదులను రద్దుచేశాడు. మొగల్ చక్రవర్తి నివాసాన్ని ఎర్రకోట నుంచి కుతుబ్మనార్కు దగ్గరగా మార్చాలని, బహదూర్షి తరువాత మొగల్ చక్రవర్తి బిరుదును రద్దుచేయాలని ప్రతిపాదించాడు. అందువలన స్వదేశీరాజులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన పడసాగారు. పైగా ఆంగ్లేయులు పాటించిన జాతి వివక్ష విధానం, వారు ప్రజల పట్ల చూపిన నిరాదరణ ప్రజల్లో అసంతృప్తి కలిగించింది. ఈ విధంగా అసంతృప్తికి లోనైనవారంతా 1857 తిరుగుబాటులో పాల్గొన్నారు.

2) ఆర్థిక కారణాలు: రాజ్యసంక్రమణ సిద్ధాంతం వల్ల అనేక రాజ్యాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమై ఆయా రాజ్యాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, గాయకులు, కవులు, విద్వాంసులు మొదలైన వారు నిరుద్యోగులై సిపాయిలుగా మారారు. వారు తమ కనీస జీవితావసరాలను కూడా గడుపుకోలేక తిరుగుబాటుకు సంసిద్ధులైనారు. కంపెనీ ప్రభుత్వం భారతదేశంలో వ్యవసాయాన్ని, పరిశ్రమలను ప్రోత్సహించలేదు. దేశంలో కుటీరపరిశ్రమలు క్షీణించాయి. కంపెనీ పాలనలో ప్రజలకు చేయటానికి పనిలేక, తినడానికి తిండిలేక అలమటించారు. ఆర్థిక పరిస్థితి క్షీణించి తిరుగుబాటు తప్ప వేరే మార్గం లేకపోయింది.

3) సాంఘిక కారణాలు: ఈస్టిండియా కంపెనీ లార్డ్ బెంటింక్ కాలం నుంచి లార్డ్ డల్హౌసీ కాలం వరకు అనేక సాంఘిక సంస్కరణలు ప్రవేశపెట్టింది. సతీసహగమన నిషేధ చట్టం, మతం మార్చుకొన్నప్పటికీ ఆస్తిలో హక్కు కలిగించే చట్టం, బాల్య వివాహాల నిషేధచట్టం, వితంతు పునర్వివాహ చట్టం వంటి సంస్కరణలు, తమ సనాతన ధర్మానికి విరుద్ధమని హిందువులు అభిప్రాయపడ్డారు. డల్హౌసీ కాలం నాటి ఆధునికీకరణ రైల్వే, తంతి తపాల ఏర్పాట్లు ప్రజల్లో సంచలనాన్ని సృష్టించాయి. ఈ మార్పులవల్ల తమ ఆచారబద్ధమైన ప్రాచీన సమాజం కూలిపోయిందని సనాతనులు ఆందోళనపడ్డారు. పాశ్చాత్యతరహా పరిపాలనా సంస్థలు, నూతన న్యాయస్థానాలు, ఇంగ్లీష్ విద్య, రైల్వే, టెలిగ్రాఫ్లు తమ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రవేశపెట్టారని వారు భావించారు. ప్రభుత్వం ఈ విధంగా చట్టాల ద్వారా తమ మతధర్మాలను నాశనం చేస్తున్నదనే అపోహ ప్రజలలో వ్యాపించింది.

4) మత కారణాలు: క్రైస్తవులైన ఆంగ్లేయులు తమ పరిపాలన స్థాపించిన తరువాత, హిందువులనందరిని, క్రైస్తవులుగా మార్చివేస్తారనే భయం, అనుమానం ప్రజల్లో ఏర్పడింది. కంపెనీ ప్రభుత్వ కాలంలో, క్రైస్తవ మిషనరీలు తమ మత ప్రచారాన్ని ఉధృతం చేశారు. వారు హిందూ, ముస్లిం మత సంప్రదాయాలను అవహేళన చేస్తూ తమ మత ప్రచారాన్ని కొనసాగించేవారు. 1813 ఛార్టర్ చట్టంలో మిషనరీలకు సౌకర్యాలు కల్పించడం, ఇంగ్లీష్ విద్యావ్యాప్తికి ప్రత్యేక నిధిని కల్పించడం, మతం మార్చుకొన్నప్పటికీ ఆస్తిలో హక్కు కల్పించడం వంటి చర్యలు మత మార్పిడిని ప్రోత్సహించటం కోసమేనని ప్రజలు అనుమానపడ్డారు. క్రైస్తవ మిషనరీలు, పాఠశాలలు, వైద్యశాలలు స్థాపించి అక్కడ కూడా మత సిద్ధాంతాలను బోధించారు. సతీసహగమనాన్ని రద్దుచేయడం, బాల్య వివాహాలను నిషేధించడం, వితంతు వివాహాలను అనుమతించడం, హిందూమత ఆచారాలలో ప్రభుత్వం జోక్యం కలిగించుకొని, మత మార్పిడులను ప్రోత్సహించి, భారతదేశాన్ని క్రైస్తవరాజ్యంగా మార్చడానికి బ్రిటిష్వారు ఈ మార్పులు చేస్తున్నారనే భావం ప్రజల్లో ఏర్పడింది. ఇందుకు కొందరు కంపెనీ అధికారులు అవలంబించిన మత పక్షపాత ధోరణి కూడా దోహదం చేసింది.

5) సైనిక కారణాలు: కంపెనీలో రెండు రకాలైన సైనికులున్నారు. భారతీయులు బ్రతుకుతెరువు కోసం కంపెనీలో సైనికోద్యోగులుగా చేరారు. వారిని సిపాయిలు అంటారు. ఆంగ్లేయులను సైనికులంటారు. వీరిరువురి మధ్య హోదాలలోను, జీతభత్యాలలోను ఎంతో వ్యత్యాసముంది. 1856లో బ్రిటిష్ ప్రభుత్వం జనరల్ సర్వీసెస్ “ఎన్లిల్టిమెంట్” చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం సిపాయిలు ఏ ప్రాంతానికైనా వెళ్లి యుద్ధం చేయాల్సి వుంది. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం సముద్ర ప్రయాణం నిషేధం. ఇదిగాక కులం, మతాన్ని సూచించే చిహ్నాలను తీసివేయాలనే ఉత్తర్వులు వీరిని మరింత కలవరపెట్టాయి. కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన అసంతృప్తికి లోనైన సిపాయిలు 1849, 1850, 1852లలో తమ నిరసనలను తిరుగుబాట్ల రూపంలో ప్రదర్శించారు. 1857 నాటికి ఈ అసంతృప్తి తీవ్రమైన స్థాయికి చేరుకుంది. మొదటి ఆఫ్ఘన్ యుద్ధంలో, సిక్కు యుద్ధాలలో ఆంగ్లేయులకు సంభవించిన ఓటమివల్ల వారు అజేయులు అనే భావం పోయింది. కలిసి పోరాడితే ఆంగ్లేయులను ఓడించటం కష్టమేమీకాదని వారు విశ్వసించారు. అంతేగాక సిపాయిలకు, ఆంగ్ల సైనికులకు మధ్య సంఖ్యాబలంలో చాలా తేడా వుంది. ఆంగ్లేయులకంటే, సిపాయిల సంఖ్య చాలా ఎక్కువగా వుంది. అందువల్ల 1857లో సిపాయిలు తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకున్నారు.

6) తక్షణ కారణం: కంపెనీ ప్రభుత్వం 1856లో కొత్త “ఎన్ఫీల్డ్” తుపాకులను ప్రవేశపెట్టింది. వాటిలో ఉపయోగించే తూటాలను సైనికులు నోటితో చివరి భాగం కొరికి తుపాకీలో అమర్చి పేల్చవలసివుండేవి. కానీ ఆ తూటాలకు ఆవు కొవ్వు, పంది కొవ్వు పూతపూసినట్లు ఒక వదంతి వ్యాపించింది. ఆవు హిందువులకు పవిత్రమైనది. పందిని ముస్లింలు అపవిత్రంగా భావిస్తారు. ఆంగ్లేయులు తమ మతాలను బుద్ధిపూర్వకంగా కించపరచడానికే ఈ విధంగా చేశారని సిపాయిలు విశ్వసించారు. అప్పటికే ప్రబలంగా వున్న అసంతృప్తికి ఈ వదంతి ఆజ్యం పోసినట్లయింది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆల్బుకర్క్
జవాబు:
భారతదేశంలో పోర్చుగీసు ప్రాబల్యానికి గట్టి పునాదులు నిర్మించినవాడు ఆల్ఫాస్సో డి. ఆల్బూకర్క్, ఇతడు అత్యంత సమర్థుడు. గవర్నర్గా కొన్ని ప్రాంతాలలో పోర్చుగీసు వాణిజ్య గుత్తాధిపత్య స్థాపన ద్వారా మరియు పోర్చుగీసువారు స్థానికుల్ని వివాహం చేసుకోవడం ద్వారా, స్థానిక ప్రాంతాలను వలసలుగా మార్చుకోవాలనే విధానం ద్వారా, ముఖ్య ఓడరేవుల్లో కోటలు నిర్మించుకోవడం ద్వారా పోర్చుగీసువారు ఒక శక్తిగా రూపొందటానికి బాటలు వేసెను.

  1. క్రీ.శ. 1510లో శ్రీకృష్ణదేవరాయల సహకారంతో బీజాపూర్ సుల్తాన్ను ఓడించి, గోవా రేవు పట్టణాన్ని స్వాధీనం చేసుకొనెను. తదుపరి ఈ గోవా పోర్చుగీసువారి ప్రధాన వర్తక స్థావరమైంది.
  2. క్రీ.శ. 1511లో దూర ప్రాచ్యంలో మలక్కా సైతం ఆల్బూకర్క్ ఆధీనంలోకి వచ్చింది.
  3. వాణిజ్య విస్తరణలో ఆల్బూకర్క్ అరబ్బులను దారుణ హింసలకు గురిచేసెను.
  4. ఆల్బూకర్క్ తరువాత 1517 లో డయ్యూ, డామన్లు పోర్చుగీస్ హస్తగతమయ్యెను.
  5. అటులనే క్రమముగా పశ్చిమతీరంలో బేసిన్, సాల్సెట్టి, బేల్, బొంబాయిలలోనూ, తూర్పుతీరంలో శాన్ థోమ్, హుగ్లీలలోనూ స్థావరాలు స్థాపితమయ్యాయి.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

ప్రశ్న 2.
రాబర్ట్ క్లైవ్
జవాబు:
భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనుడు రాబర్ట్ క్లైవ్. క్లైవ్ చిన్న గుమాస్తాగా జీవితం ప్రారంభించి స్వయంకృషి వల్ల గవర్నర్ పదవికి ఎదిగాడు. ఈస్టిండియా కంపెనీ సామ్రాజ్య వ్యవస్థాపకుడుగా ఆధునిక భారతదేశ చరిత్రపుటల్లో రాబర్ట్ క్లైవ్ ప్రముఖ స్థానాన్ని పొందాడు.

ప్రశ్న 3.
సిరాజ్-ఉద్-దౌలా
జవాబు:
బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దేలా 1756లో ఫోర్టు విలియంను ముట్టడించి 146 మంది ఆంగ్లేయులను ఒక చిన్న గదిలో బంధించాడని, మరునాటి ఉదయానికి విపరీతమైన వేడి, ఉక్కవలన 23 మంది తప్ప మిగిలిన వారంతా మరణించారని ఒక కథనం ఉంది. దీనినే బ్లాక్ హోల్ ట్రాజడీ లేక కలకత్తా చీకటి గది విషాదాంతం అంటారు.

ప్రశ్న 4.
బక్సర్ తిరుగుబాటు
జవాబు:
1764 అక్టోబర్ 17న మీర్ ఖాసిం, అయోధ్య నవాబు, మొగల్ చక్రవర్తి షా ఆలంల కూటమికి, ఆంగ్లేయులకు బక్సార్ వద్ద జరిగిన యుద్ధాన్ని బక్సార్ యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో ముగ్గురు పాలకుల కూటమి ఓడిపోయింది. ఈ యుద్ధం భారతదేశంలో ఆంగ్ల సామ్రాజ్య విస్తరణకు తోడ్పడింది.

ప్రశ్న 5.
ద్వంద ప్రభుత్వ విధానం
జవాబు:
1765 నాటి అలహాబాద్ సంధుల ప్రకారం ఇంగ్లీషువారికి, బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో భూమిశిస్తు వసూలు చేసుకునే హక్కు లభించింది. దీన్ని దివాని అంటారు. పరిపాలన బాధ్యత నవాబు అప్పగించడం జరిగింది. దీన్ని నిజామత్ అంటారు. ఈ విధంగా పరిపాలనాధికారాలు విభజించబడినందువల్ల దీనికి ద్వంద ప్రభుత్వం అనే పేరు వచ్చింది.

ప్రశ్న 6.
వారన్ హేస్టింగ్
జవాబు:
భారతదేశంలో క్లెవ్ స్థాపించిన ఆంగ్లాధికారాన్ని సుస్థిరపరచి దాని విస్తరణకు కూడా పునాదులను నిర్మించినవాడు వారన్ హేస్టింగ్ (1772-1785).

వారన్ హేస్టింగ్ ఎదుర్కొన్న సమస్యలు: వారన్ హేస్టింగ్ మొదట బెంగాల్ గవర్నర్ గా వచ్చాడు. కానీ 1773 నాటి రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ అయ్యాడు. వారన్ హేస్టింగ్ బెంగాల్ గవర్నర్ అయ్యేనాటికి అతడికి ఎన్నో సమస్యలు ఎదురైనాయి. రాబర్ట్ క్లైవ్ ప్రవేశపెట్టిన ద్వంద ప్రభుత్వం గందరగోళానికి దారితీసింది. కంపెనీ ఆర్థిక వనరులలో అతి ముఖ్యమైన భూమిశిస్తు జమిందారుల చేతుల్లోకి పోయింది. కంపెనీ ఉద్యోగులు విపరీతంగా ధనార్జన చేశారు. కానీ, కంపెనీ ఖజానా మాత్రం వట్టిపోయింది. న్యాయపాలనలో కూడా విపరీతమైన గందరగోళం చోటుచేసుకుంది.

స్వదేశీ విధానం – సంస్కరణలు: పరిపాలనలో చోటుచేసుకున్న అస్తవ్యస్త పరిస్థితులను తొలగించటానికి వారన్ హేస్టింగ్ అనేక సంస్కరణలను చేపట్టాడు. అవి:
ద్వంద ప్రభుత్వం రద్దు: క్లైవ్ ప్రవేశపెట్టిన ద్వంద ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైంది. అందువలన దానిని రద్దుచేసి, బెంగాల్ రాష్ట్ర పరిపాలనా బాధ్యతలన్నింటిని కంపెనీ నేతృత్వంలోకి తెచ్చాడు.

ప్రశ్న 7.
సైన్య సహకార విధానం
జవాబు:
సైన్య సహకార పద్ధతిని చాలా స్వదేశీ రాజ్యాలలో అమలుచేసినవాడు వెల్లస్లీ. దీనిననుసరించి స్వదేశీ రాజ్యం తమ విదేశాంగ సంబంధాలన్నింటిని ఇంగ్లీషు కంపెనీకి అప్పగించాలి. ఆ సంస్థానాన్ని విదేశీ శత్రువుల నుంచి ఇంగ్లీషువారు కాపాడతారు. అయితే స్వదేశీ సంస్థానాల ఆంతరంగిక విషయాలలో ఇంగ్లీషు కంపెనీ జోక్యం చేసుకోదు. ఈ పద్ధతి వలన ఇండియాలో ఇంగ్లీషువారి శక్తి గణనీయంగా పెరిగింది.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

ప్రశ్న 8.
విలియం బెంటింక్
జవాబు:
భారతీయుల మన్ననలను పొందిన గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ ఒకడు. తన పాలనా కాలంలో విలియం బెంటింక్ ఆర్థిక విధానంలో, విద్యా రంగంలో కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టాడు. నాడు సమాజంలో వున్న సాంఘిక దురాచారాలను రూపుమాపటానికి అనేక సాంఘిక సంస్కరణలను కూడా చేపట్టాడు. ఈ సాంఘిక సంస్కరణలలో బెంటింక్ పేరును చిరస్మరణీయం చేసిన సాంఘిక సంస్కరణలు హిందువులలో ప్రబలంగా వున్న సతీసహగమన దురాచారాన్ని మాన్పించడంలో బెంటింక్ చాలావరకు కృతకృత్యుడయ్యాడు. 1829లో రాజారామ్ మోహన్రాయ్ సహకారంతో ఒక శాసనము జారీ చేశాడు.

ప్రశ్న 9.
డల్హౌసీ
జవాబు:
డల్హౌసీ తన 8 సంవత్సరాల పాలనా కాలంలో (1848-1856) బ్రిటీషు సామ్రాజ్య విస్తరణయే తన ప్రధాన లక్ష్యంగా ఎంచుకొన్నాడు. వారన్ హేస్టింగ్ ప్రారంభించిన కంపెనీ సామ్రాజ్యాన్ని తన విజయాల ద్వారా విస్తరింపచేశాడు. కంపెనీ రాజ్య విస్తరణ కోసం డల్హౌసీ నాలుగు మార్గాలను అనుసరించాడు. అవి:

  1. యుద్ధాలు
  2. రాజ్య సంక్రమణ సిద్ధాంతం
  3. బిరుదులు, భరణాల రద్దు
  4. దుష్పరిపాలన నెపం.

ప్రశ్న 10.
రాజ్య సంక్రమణ సిద్ధాంతం
జవాబు:
రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనగా నిస్సంతులుగా మరణించిన స్వదేశీరాజుల సంస్థానాలు ఆంగ్లేయులకు సంక్రమిస్తాయి. ఈ విధానాన్ని అమలుచేసినవాడు డల్హౌసీ, ఈ సిద్దాంతాన్ననుసరించి బ్రిటీషు రాజ్యంలో విలీనమైన మొదటి స్వదేశీ సంస్థానం సతారా. ఈ సిద్ధాంతం 1857 నాటి సిపాయిల తిరుగుబాటుకు ఒక కారణమైంది.

ప్రశ్న 11.
రాణి లక్ష్మీబాయి
జవాబు:
1857 తిరుగుబాటులో పాల్గొన్న ప్రముఖులలో ఝాన్సీలక్ష్మీబాయి ఒకరు. ఈమె మహారాష్ట్రకు చెందిన తాంతియాతోపేతో కలిసి బ్రిటీషు వారిని గడగడలాడించింది. తన దత్తకుమారుని తన వారసునిగా గుర్తించటానికి ఆంగ్లేయులు నిరాకరించటంతో ఈమె తిరుగుబాటులో పాల్గొంది. 1858లో సర్ హ్యూరోస్ సేనాని ఝాన్సీని ఆక్రమించినపుడు లక్ష్మీబాయి కోట నుండి తన దత్త కుమారునితో బయటపడి తాంతియాతోపేతో కలిసి గ్వాలియర్ కోటను ఆక్రమించి, బ్రిటిష్ వారితో యుద్ధాన్ని కొనసాగించింది. 1857 జూన్ 17న యుద్ధంలో వీరమరణం పొందింది.

ప్రశ్న 12.
రైత్వారి విధానం
జవాబు:
ఈ విధానంలో శిస్తును రైతులు నేరుగా ప్రభుత్వమునకు అనగా ప్రభుత్వ ఖజానాకు గాని, ప్రభుత్వోద్యోగులకు చెల్లించెదరు. ఇట్లు శిస్తు వసూలునందు ప్రభుత్వమునకు, రైతులకు మధ్య ఎట్టి మధ్యవర్తులు అనగా దళారులు లేకుండుట వలన ఈ విధానమును రైత్వారీ విధానముగా ప్రసిద్ధికెక్కెను. ఇంకనూ రైతులకు పట్టాలిచ్చి వారి వద్ద నుండి కబూలియత్లు (శిస్తు చెల్లింపు ఒడంబడికలు) తీసుకొనెడి సంప్రదాయము కూడా కలదు.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

ప్రశ్న 13.
రెండవ బహదూర్షా
జవాబు:
భారతదేశాన్ని పాలించిన మొగల్ చక్రవర్తులలో రెండో బహదూర్ చివరివాడు. 1857 మే లో మీరట్లో తిరుగుబాటు చేసిన సిపాయిలు ఢిల్లీ చేరి, రెండో బహదూర్షాను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. 1857 సెప్టెంబరులో ఢిల్లీని వశపరచుకొన్న బ్రిటిష్వారు బహదూరాను బందీగాచేసి, విచారణ జరిపి, ఖైదీగా రంగూన్ పంపించారు. అతని కుమారులను, మనుమల్ని పరాభవించి, చంపేశారు. 1862లో బహదూర్గా రంగూన్ జైలులో మరణించాడు. దీనితో మొగల్ వంశం అంతరించింది.

ప్రశ్న 14.
టిప్పు సుల్తాన్
జవాబు:
మైసూరు పాలించిన హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్. ఇతడు తన తండ్రితోపాటు మొదటి రెండు మైసూర్ యుద్ధాలలో పాల్గొన్నాడు. రెండో మైసూర్ యుద్ధ కాలంలో హైదర్ అలీ మరణించిన వెంటనే టిప్పు సుల్తాన్ తండ్రి వారసత్వాన్ని స్వీకరించాడు. మూడో మైసూర్ యుద్ధంలో ఆంగ్లేయుల చేతిలో ఓడిపోయి శ్రీరంగపట్టణం సంధిని కుదుర్చుకొని తన రాజ్యంలో చాలా భాగం కోల్పోయాడు. 1799లో జరిగిన నాలుగో మైసూర్ యుద్ధంలో ఓడిపోయి మరణించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 10th Lesson క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 10th Lesson క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
దక్కన్ చరిత్ర అధ్యయనానికి ఉపకరిస్తున్న వివిధ ఆధారాలపై వ్యాసం రాయండి.
జవాబు:
దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర అధ్యయనానికి పురావస్తు, సాహిత్య (వాఙ్మయ) ఆధారాల నుంచి ఎంతో |విలువైన చారిత్రక సమాచారం లభిస్తుంది. పురావస్తు ఆధారాల్లో శాసనాలు ముఖ్యమైనవి. భారతదేశంలో శాసనాలను తొలిసారిగా వేయించిన ఘనత మౌర్య చక్రవర్తి అశోకుడికే దక్కుతుంది. మౌర్యులకు సమకాలీనులైన శాతవాహనులు వారి పరిపాలనా కాలంలో అనేక శాసనాలు వేయించారు. నాసిక్, కార్లే, అమరావతి, నాగార్జున కొండ, కొండాపూర్ మొదలైన చోట్ల వారి శాసనాలు ఉన్నాయి. క్రీ.శ. 1వ శాతాబ్దం నాటి దక్కన్ ప్రజల జీవనాన్ని ఇవి తెలియచేస్తున్నాయి. కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర చక్రవర్తులు వేయించిన శాసనాలు ఆ కాలం నాటి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు 1

ఈ యుగానికి చెందిన రాజకీయ, సామాజిక, ఆర్థిక, మతపరమైన మొదలైన విషయాలను అధ్యయనం చేయడానికి, నేక సాహిత్య రచనలు ఉపకరిస్తున్నాయి. వీటిలో తెలుగు, కన్నడ, సంస్కృతం భాషలోని రచనలతో పాటు విదేశీ రచనలు కూడా ఉన్నాయి.
AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు 2
AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు 3

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

ప్రశ్న 2.
గణపతిదేవుని ఘనతను అంచనా వేయండి.
జవాబు:
కాకతీయ వంశ పాలకుల్లో గణపతిదేవుడు అత్యంత శక్తిసామర్థ్యాలు గల పరాక్రమవంతుడు. మహాదేవుడి తరువాత సింహాసనం అధిష్టించాడు. రాజనీతిజ్ఞుడు, సైన్యాలను నడపడంలో దిట్ట. ఇతడి తల్లిదండ్రులు బయ్యాంబ, మహాదేవుడు. మైలాంబ, కుందమాంబ గణపతిదేవుడి సోదరీమణులు. గణపతిదేవుడి పరిపాలనా కాలానికి సంబంధించిన శాసనం కరీంనగర్ లోని మంథని వద్ద లభించింది. దీని ప్రకారం గణపతిదేవుడి పరిపాలన డిసెంబర్ 26, 1199 కంటే ముందే ప్రారంభమైంది. సుమారు అరవై మూడు సంవత్సరాలపాటు గణపతిదేవుడు కాకతీయ రాజ్యాన్ని పరిపాలించి, అనేక చారిత్రాత్మక విజయాలు సాధించాడు. గణపతిదేవుడి సైనిక విజయాల్లో అతని సేనాధిపతి రేచెర్ల రుద్రుడు కీలకపాత్ర పోషించాడు. మల్యాల సేనాధిపతులు కూడా గణపతిదేవునికి అండగా నిలిచారు. గణపతిదేవుని సైన్యాలు యాదవసేనలను ఓడించాయి. తీరాంధ్ర ప్రాంతంపై గణపతిదేవుని సైన్యాలు దండెత్తాయి. వెలనాడు పాలకుడైన పృథ్వీశ్వరుణ్ణి కాకతీయ సేనలు ఓడించాయి. ఈ విషయం గణపతిదేవుని బావమరిది నతవాడి రుద్రుడు వేయించిన క్రీ.శ. 1201 నాటి బెజవాడ శాసనంలో ఉంది. పరాజయం పాలైన వెలనాటి రాజు పృథ్వీశ్వరుడు తాత్కాలికంగా తన రాజధానిని చందవోలు నుంచి పిఠాపురానికి మార్చి, కృష్ణా ప్రాంతంపై తన అధికారాన్ని తిరిగి కొనసాగించాడు. గణపతిదేవుని సైన్యాలు ధరణికోటకు చెందిన కోటనాయకులతో యుద్ధానికి సిద్ధంకాగా కోట నాయకులు కాకతీయ చక్రవర్తి సార్వభౌమత్వాన్ని అంగీకరించారు. ఆ తరువాత మల్యాల చెందుని నేతృత్వంలో కాకతీయ చక్రవర్తి సైన్యాలు కృష్ణానదీ ముఖద్వారం వద్ద అధికారం చెలాయిస్తున్న అయ్యవంశ రాజుల కేంద్రమైన ‘దివి’పై దండెత్తాయి. కాకతీయ సైన్యాలను విరోచితంగా ఎదుర్కొన్న దివిసీమ పాలకులు ఓటమిని అంగీకరించారు. అయ్యవంశం రాజు పిన్నచోడుడు కాకతీయ సార్వభౌమాధికారాన్ని అంగీకరించాడు. రాజనీతిజ్ఞుడైన గణపతిదేవుడు దివిసీమను అయ్యవంశ రాజులనే పాలించమని కోరాడు. పినచోడుని కుమారుడైన ‘జాయపను’ గణపతిదేవుడు తన కొలువులో చేర్చుకున్నాడు. అతడిని ‘గజసాహనిగా’ నియమించాడు. గణపతిదేవుడు పినచోడుని కుమార్తెలైన నారాంబ, పేరాంబలను వివాహమాడి ఇరు రాజ్యాల మధ్య సంబంధాన్ని బలోపేతం చేశాడు.

గణపతిదేవుడి సేనలు క్రీ.శ. 1206కు ముందు మరోసారి వెలనాటి రాజైన పృథీశ్వరునిపై దండెత్తి అతణ్ణి యుద్ధంలో ఓడించి చంపాయి. యావత్ కళింగ ప్రాంతం కాకతీయుల వశమయ్యింది. కొన్ని కాకతీయ శాసనాల్లో గణపతిదేవుడికి ‘పృథీశ్వర శిరఃఖండుక క్రీడావినోద’ అనే బిరుదు ఉంది. దీన్ని బట్టి పృథ్వీశ్వరుడు కాకతీయ సేనల చేతిలో హతుడైయ్యాడని గ్రహించవచ్చు. క్రీ.శ. 1213 నాటి చేబ్రోలు శాసనం గణపతిదేవుడు జాయప సేనానిని వెలనాడు రాజ్య గవర్నర్ నియమించాడని పేర్కొంటుంది.

గణపతిదేవుడు నెల్లూర్ రాజ్యాన్ని ఏలిన మనుమసిద్ధి కుమారుడైన తిక్కభూపాలుడు, రాజ్య సింహాసనం కోసం చేసిన అంతర్యుద్ధంలో గణపతిదేవుని సహాయం కోరాడు. గణపతిదేవుడు తిక్కభూపాలుని శత్రువులు నల్లసిద్ధి, తమ్మసిద్దిలను ఓడించి నెల్లూరు సింహాసనంపై తిక్క భూపాలుణ్ని నిల్పాడు. పశ్చిమగోదావరి జిల్లాలో కొలను ప్రాంతాన్ని ఏలుతున్న ‘కొలను’ నాయకులను కూడా క్రీ.శ. 1231కి ముందే కాకతీయ సైన్యాలు ఓడించాయి. ‘ఇందులూరి సోముడు’ కొలను రాష్ట్ర గవర్నర్ గా నియమించాడు. గణపతి దేవుడి కాలంలో యాదవరాజులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాయి.

గణపతిదేవుడు తన సుదీర్ఘ పరిపాలనా కాలంలో (క్రీ.శ. 1199-1263) ఎప్పుడూ ఓటమిని చవిచూడలేదు. క్రీ.శ. 1263వ సంవత్సరంలో పాండ్య సేనలతో జరిగిన ‘ముత్తుకూరు’ యుద్ధంలో జటావర్మన్-సుందర పాండ్యుని సేనల చేతిలో అతడు పరాజయం పాలయ్యాడు. ఈ ఓటమి అనంతరం క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. తనకు మగసంతానం లేనందువల్ల కుమార్తె రుద్రమదేవిని తన వారసురాలిగా ప్రకటించాడు. క్రీ.శ. 1268 లో గణపతిదేవుడు మరణించాడు. రుద్రమదేవి తండ్రి కాలంలోనే రాజ్య నిర్వహణలో, సైన్యాలను నడపడంలో శిక్షణ పొందింది.

ప్రశ్న 3.
శ్రీకృష్ణదేవరాయల విజయాలను చర్చించండి.
జవాబు:
విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన చక్రవర్తులందరిలో (క్రీ.శ. 1509 1529) అగ్రగణ్యుడు శ్రీకృష్ణదేవరాయలు. ఇతని కాలంలో విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశమంతటికి విస్తరించింది. దక్షిణ భారతదేశంలో సారస్వతం, కళలు వికసించాయి.

తొలి జీవితం: శ్రీకృష్ణదేవరాయలు తుళువ వంశస్థుడు. ఇతని తల్లిదండ్రులు నరసానాయకుడు, నాగమాంబ. బాల్యం నుండి అప్పాజీ అనబడే తిమ్మరుసు నేతృత్వంలో సకలవిద్యలు నేర్చుకొని పాలకునికి కావలసిన లక్షణములన్నింటిని తనలో జీర్ణించుకున్నాడు. తన అన్నయైన వీరనరసింహుని మరణానంతరం శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ. 1509లో విజయనగర సింహాసనాన్ని అధిష్టించాడు. సాళువ తిమ్మరుసు ఇతని ప్రధానమంత్రి.

ఆకృతి, వ్యక్తిత్వం: క్రీ.శ. 1520లో శ్రీకృష్ణదేవరాయలను దర్శించిన పోర్చుగీసు వర్తకుడు డామింగో పేస్ రాయల ఆకృతిని వర్ణించాడు. “శ్రీకృష్ణదేవరాయలు పొడగరికాదు, పొట్టికాదు. మధ్యరకం, చక్కని మూర్తి, బొద్దుగా, ముఖంపై స్పోటకం, మచ్చలతో ఉంటాడు. ఉల్లాసవంతుడు, విదేశీయుల పట్ల దయతో, మర్యాదతో వ్యవహరిస్తాడు. హిందూస్థాన్లో అతనంటే హడల్” అని వర్ణించాడు. శ్రీకృష్ణదేవరాయలు రాజనీతిలో, యుద్ధాల్లో సమర్థుడు. సంస్కృతాంధ్ర భాషల్లో సాహితీ సృష్ట, సంస్కృతీ ప్రియుడు.

చక్రవర్తిగా రాయలు ఎదుర్కొన్న పరిస్థితులు: శ్రీకృష్ణదేవరాయలు సింహాసనమును అధిష్టించే నాటికి విజయనగర సామ్రాజ్యము అనేక సమస్యలతో ఉన్నది. ఎక్కడ చూసినా తిరుగుబాట్లు చెలరేగుతున్నాయి. ఒక ప్రక్క గజపతులు, మరొక ప్రక్క బహమనీ సుల్తానులు విజయనగర సామ్రాజ్యాన్ని కబళించటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో శ్రీకృష్ణదేవరాయలు గొప్ప రాజనీతిని ప్రదర్శించి పోర్చుగీసు వారితో సంధి చేసుకొన్నాడు.

పోర్చుగీసు వారితో సంధి: రాయలు క్రీ.శ. 1510లో పోర్చుగీసు వారితో ఒక ఒప్పందాన్ని చేసుకొన్నాడు. ఈ ఒప్పందం ప్రకారం రాయల సైన్యానికి మేలుజాతి గుర్రాలను సరఫరా చేయటానికి పోర్చుగీసువారు అంగీకరిస్తే, పోర్చుగీసువారు గోవాను ఆక్రమించుకోవటానికి శ్రీకృష్ణదేవరాయలు అడ్డుచెప్పలేదు. పైగా భట్కల్ ప్రాంతంలో పోర్చుగీసువారు కోటలు కట్టుకోవడానికి కూడా రాయలు అనుమతించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

దిగ్విజయాలు: పోర్చుగీసువారితో ఒప్పందం కుదుర్చుకొని, తన సైన్యాన్ని బలపరచుకొన్న తరువాత శ్రీకృష్ణదేవరాయలు తన దిగ్విజయ యాత్రను ప్రారంభించాడు.
1. బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ అదిల్షా, బీదర్ సుల్తాన్ మామూన్షాలు విజయనగరంపై జిహాద్ను ప్రకటించి కృష్ణదేవరాయలతో ఘర్షణకు దిగారు. రాయలు వారిని ఓడించి రాయచూర్, ముద్గల్ దుర్గాలను ఆక్రమించాడు. యూసఫ్ అదిల్షా మరణానంతరం అతని కుమారుడు ఇస్మాయిల్ అదిల్షా పిన్న వయస్కుడవటం చేత కమాలాఖాన్ అనే సర్దారు సర్వాధికారాలు పొంది బీజాపూర్ పాలకుడయ్యాడు. అలాగే బీదర్ అహమ్మద్ బరీద్ అనే సేనాని బీదర్ సుల్తానైన మహమ్మదాను బంధించి తానే సుల్తాన్ నని ప్రకటించుకున్నాడు. రాయలు వారిద్దరిని ఓడించి, పాలకులను వారివారి సింహాసనాలపై కూర్చుండబెట్టి ‘యవన రాజ్యస్థాపనాచార్య’ అనే బిరుదు పొందాడు.

2. తరువాత దక్షిణ దిగ్విజయ యాత్రను జరిపి పెనుగొండ, ఉమ్మత్తూర్, శివసముద్రాలను జయించి, ఆ ప్రాంతాలన్నింటిని కలిపి శ్రీరంగపట్నం అనే రాష్ట్రంగా ఏర్పరచాడు.

3. తూర్పు దిగ్విజయ యాత్రను ప్రారంభించి, ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి, రాజమహేంద్రవరంలను జయించి, కటకం వరకు నడిచి గజపతులను ఓడించాడు. అంతట ప్రతాపరుద్ర గజపతి తన కుమార్తెను రాయలకిచ్చి వివాహం చేశాడు. సింహాచలం, పొట్నూరుల దగ్గర విజయస్థంభాలను నాటి, కృష్ణానదికి ఉత్తరంగా ఉన్న భూములను గజపతికి ఇచ్చి రాజధానికి తిరిగివచ్చాడు.

4. రాయలు తూర్పు దిగ్విజయ యాత్రలో ఉండగా బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ అదిల్షాన్ ఠాయ రును తిరిగి ఆక్రమించగా క్రీ.శ 1520 లో రాయలు అతనిని ఓడించాడు. ఈ యుద్ధంలో పోర్చగీసు నాస్ “క్రిష్టవో ఫిగరేదో రామలకు చాలా సహాయం చేశాడు. క్రీ.శ.1523లో రాయలు మళ్ళీ దండలే చుపూర్. గుల్బర్గాలను ఆక్రమించి సాగర్ వరకు గల ప్రాంతాలను కొల్లగొట్టాడు. రాయలు క్రీ.శ. 1529లో ను రశించాడు. రాయలు మరణంచే వాటికి అతని సామ్రాజ్యం తూర్పున కటకం నుండి పడమరన సారేశెట్టి వరకు ఉత్తరాన గుల్బర్గా నుండి దక్షిణాన సింహళం వరకు వ్యాపించింది.

పరిపాలనా విధానం ; శ్రీకృష్ణదేవరాయలు ఆదర్శవంతమైన పాలనను ప్రజలకందించాడు. ఇతని కాలంలో విజయనగర వైభవం ఇనుమడించిందని “పేస్” పేర్కొన్నాడు. పోర్చుగీసు ఇంజనీర్ల సహాయంతో కాలువ చెరువులు త్రవ్వించి, పంటపొలాలకు నీటి పారుదల సౌకర్యాలను కల్పించాడు.

పరమత సహనం: శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవ భక్తుడైనను అన్ని మతాల వారిని సమానంగా ఆదరించాడు. వ్యాసతీర్థ, వల్లభాచార్య అప్పయ్యదీక్షిత, వేదాంతదేశిక అనే వేరువేరు మతములకు చెందిన పండితులను అదరించి సన్మానించాడు.

సారస్వత పోషణ: శ్రీకృష్ణదేవరాయల ఆస్థానమునకు భువనవిజయమని పేరు. భువనవిజయులలో, ‘అష్టదిగ్గజములనే’ ఎనిమిది మంది కవులుండేవారు. వారు అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, అయ్యలరాజు రామభద్రుడు, మాదయగారి మల్లన, పింగళి సూరన, తెనాలి రామకృష్ణుడు, భట్టుమూర్తి అని ప్రతీతి. ఈ అస్థానంలో జరుగుతుండేవి. సాహితీ గోష్టులు జరుగుతుండేవి భువనవిజయములో వసంతోత్సవం లాంటి వేడుకలు గొప్పగా సందర్భంలో సంగీత, సాహిత్యాలకు ఆదరణ లభించేది. శ్రీకృష్ణదేవరాయలకు ‘సాహితీ సమరాంగణ సార్వభౌముడనే బిరుదు ఉంది. ఇతడు స్వయంగా కవి. ఆముక్తమాల్యద, జాంబవతీ పరిణయం, మదాలస చరిత్ర అనే గ్రంథాల్ని రచించాడు. తెలుగు భాషకు ఎనలేని సేవ చేసి ఆంధ్రభోజుడు అని కీర్తించబడ్డాడు. “దేశ భాషలందు తెలుగు లెస్స”. అని రాయలే స్వయంగా పేర్కొన్నాడు.

కళాభివృద్ధి: శ్రీకృష్ణదేవరాయల కాలంలో కళలు కూడా అభివృద్ధి చెందాయి. శ్రీకృష్ణదేవరాయలు విజయనగరంలో కృష్ణాలయాన్ని, హజార రామాలయాన్ని నిర్మించాడు. తిరుపతి, కంచి, కాళహస్తి, సింహాచలం వంటి అలడులకు గోపురాలను, మండపాలను నిర్మించాడు. ఇతని కాలంలో విజయనగరం రోమ్ మహానగరమంత సుందరంగా ఉన్నట్లు ఇతని కాలంలో విజయనగరాన్ని సందర్శించిన “పేస్” అనే పోర్చుగీసు వర్తకుడు పేర్కొన్నాడు.

ఘనత: దక్షిణ భారతదేశాన్ని పాలించిన కడపటి హిందూ పాలకులలో శ్రీకృష్ణదేవరాయలు సుప్రసిద్ధుడు ఇతడు విజయనగర చరిత్రలోనే కాక భారతదేశ చరిత్రలోనే మహోన్నతమైన స్థానాన్ని అధిరోహించిన చక్రవర్తులలో ఒకడిగా విశిష్టమైన స్థావాన్ని సంపాదించుకున్నాడు.

ప్రశ్న 4.
విజయనగర కాలం నాటి సమాజం, ఆర్థిక వ్యవస్థ ముఖ్య లక్షణాలను వివరించండి.
జవాబు:
దక్షిణ భారతదేశ చరిత్రలో విజయనగర రాజుల పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగమని చెప్పవచ్చు. విజయనగర రాజులు రెండు శతాబ్దాలకు పైగా దక్షిణ భారతదేశంలో హిందూ సంస్కృతికి రక్షణ కల్పించారు. వీరితో పోరాడవలసి వచ్చినందునే బహమనీ సుల్తానులు ఉత్తర దేశం వైపు దృష్టి మళ్లించి విస్తరించలేకపోయారు.

పాలనా విధానం: వీరు మౌర్యులవలె కేంద్రీకృత రాజరికాన్నే అమలు చేశారు. విజయనగర పాలకులు సర్వజనామోదం పొందిన పాలనా విధానాన్ని పాటించారు. రాజులు ధర్మబద్ధులమని ప్రకటించుకున్నారు. అందువలన దేశంలో న్యాయం ప్రతిష్టించబడి ప్రజలు సుఖించారు. కట్టుదిట్టమైన పాలనా వ్యవస్థ ఉండటం వలన దేశంలో శాంత సౌభాగ్యాలు నెలకొన్నాయి. కే. కొలనలో చక్రవర్తే ముఖ్యుడు. అతని మాటే శాననం. కేంద్రంలో రాజుకు మంత్రిమండలి సభ్యులు సహకరించేవారు. సాళువ తిమ్మరుసు, విద్యారణ్య స్వామి మొదలగువారు ఉన్నత పదవులు చేపట్టినారు. నాడు మంత్రివర్గం సంఖ్య 6 లేదా 8 మంది.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

సాంఘిక పరిస్థితులు: విజయనగరం పాలనాకాలంలో సంఘంలో వర్ణవ్యవస్థ బలపడి వర్ణభేదాలు కొనసాగాయి. బ్రాహ్మణుల హక్కులను శూద్రులు ధిక్కరించటం మొదలుపెట్టారు. సంఘంలో బహుభార్యత్వం, బాల్య వివాహాలు, సతీసహగమనం, వరకట్నం, కన్యాశుల్కం అమలులో ఉన్నాయి. స్త్రీలకు సంఘంలో గౌరవప్రదమైన స్థానమున్నప్పటికి వితంతువులకు గౌరవం లేదు. మద్యపానం, ధూమపానం సమాజంలో ప్రవేశించాయి. తురుష్క, పాశ్చాత్య సంప్రదాయాల ప్రభావం వేషధారణలో కన్పించసాగింది. ప్రభుత్వం వేశ్యావృత్తిని గుర్తించింది. ప్రభుత్వానికి వేశ్యావృత్తిపై వచ్చే ఆదాయం చాలా ఎక్కువని అబ్దుల్ రజాక్ వ్రాశాడు.

ఆర్థిక పరిస్థితులు: అబ్దుల్ రజాక్, నికోలోకోంటి, డామింగోపేస్, న్యూనిజ్ వంటి విదేశీ యాత్రికుల రచనలు విజయనగర వైభవానికి అద్దంపడుతున్నాయి. వీరి రచనల ప్రకారం విజయనగర రాజ్యం ఐశ్వర్యవంతంగా ఉన్నందువల్లనే తరచూ బహమనీ రాజ్యం దండయాత్రలకు గురైంది. విజయనగరం చుట్టుకొలత 60 మైళ్ళని, దాని చుట్టూ ఏడు ప్రాకారాలుండేవని నికోలోకోంటి పేర్కొన్నాడు.

విజయనగరాధీశులు కాలువలను త్రవ్వించి, వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. దారులోహ పరిశ్రమలను స్థాపించి పరిశ్రమలను కూడా ప్రోత్సహించారు. రాయలసీమలోని రామళ్లకోట, వజ్రకరూర్లో వజ్రాలను త్రవ్వేవారు. వజ్రాలు, బంగారం, వెండి, ముత్యాలు వంటి విలువైన వస్తువులను నడిబజారులో రాసులుగా పోసి, ఈ నగరంలో విక్రయించేవారని నికోలోకోంటి పేర్కొన్నాడు. విజయనగరాధీశులు రాజధాని నగరం నుంచి పెనుగొండ, తిరుపతి, శ్రీరంగపట్టణం, కాంచీపురం, రామేశ్వరం, కొండవీడు మొదలగు ముఖ్య నగరాలకు బాటలు వేయించి, వాణిజ్యాన్ని ప్రోత్సహించారు. గుర్రాలు, ఎడ్లు, పల్లకీలు, బండ్లు నాటి ప్రయాణ సాధనాలు. దేశంలో అనేక చోట్ల సంతలు జరిగేవి. విదేశీ వాణిజ్యం అరబ్బులు, పోర్చుగీస్వేరి హస్తగతమైంది. ఎగుమతుల్లో ముఖ్యమైనవి నూలుబట్టలు, రత్నకంబళీలు, దంతపుసామాన్లు, సుగంధ ద్రవ్యాలు మొదలైనవి.

ప్రశ్న 5.
కుతుబ్షాహీలు సాధించిన విజయాలను వివరించండి.
జవాబు:
గోల్కొండ రాజధానిగా స్వతంత్ర కుతుబ్షాహీ వంశాధికారాన్ని క్రీ. శ. 1512లో సుల్తాన్-కులీ-కుతుబ్-ఉల్- ముల్క్ స్థాపించాడు. బహమనీ సుల్తాన్ మూడో మహమ్మద్ షా కాలంలో ఆ రాజ్య విచ్ఛిన్నం జరిగింది. అహమద్ నగర్, బీజాపూర్, బీదర్, బీరార్, గోల్కొండ అనే ఐదు స్వతంత్ర రాజ్యాలు బహమనీ రాజ్య శిథిలాలపై వెలిశాయి. గోల్కొండ కుతుబ్షాహీలు వారి అధికారులు స్థానిక తెలుగు ప్రజల మద్దతుతో, సుమారు 175 ఏళ్ళపాటు నేడు తెలుగు మాట్లాడే అత్యధిక ప్రాంతాలనూ, కన్నడ, మరాఠి మాట్లాడే కొన్ని ప్రాంతాలను పరిపాలించారు. సుప్రసిద్ధ చరిత్రకారులైన హరూన్-ఖాన్-షేర్వానీ, నేలటూరి వేంకటరమణయ్య మొదలైన వారు కుతుబ్షాహీలు అత్యంత ప్రజాసేవాతత్పరత కలిగిన పాలకులనీ, వారు ముస్లింలు అయినప్పటికీ హిందూ ప్రజలను, వారి ఆచారాలను, సంస్కృతిని గౌరవించారనీ, వీరిలో కొందరు తెలుగు భాషలో మంచి పాండిత్యం సంపాదించారనీ, వారు తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేశారనీ ప్రశంసించారు. కుతుబ్షాహీ సుల్తానుల్లో సుల్తాన్-కులీ-కుతుబ్షా (క్రీ.శ. 1512 – 1543), ఇబ్రహీం కుతుబ్షా (క్రీ.శ. 1550-1580), మహమ్మద్-కులీ-కుతుబ్షా (క్రీ.శ. 1580-1612) సుప్రసిద్ధులు.

ఆధారాలు: కుతుబ్షాహీ సుల్తానుల పరిపాలనా కాలానికి సంబంధించిన వివిధ అంశాల గురించి సమకాలీన ముస్లిం చరిత్రకారుల రచనలు, విదేశీ బాటసారుల రచనలు, కుతుబ్షాహీ సుల్తానులు జారీ చేసిన ఫర్మానాలు, సమకాలీన తెలుగు సాహిత్యం ఎంతో అమూల్యమైన సమాచారాన్ని తెలియచేస్తున్నాయి. ముస్లిం చరిత్రకారుల రచనల్లో
ఫెరిస్టా రాసిన గుల్షన్-ఇ-ఇబ్రహీమి, ఖదీరాఖాన్ రాసిన తారీఖ్-ఇ-కుతుబ్షాహీ, సయ్యద్ అలీ-టబాటబీ రచన, బుర్హన్-ఇ-మాసిర్, అజ్ఞాత చరిత్రకారుడు రాసిన తారీఖ్-ఇ-సుల్తాన్ మహమ్మద్ షాహీ పేర్కొనదగినవి. ఈ రచనల్లో సుల్తానుల కాలం నాటి రాజకీయ చరిత్ర, పరిపాలన వ్యవస్థ, సామాజిక, ఆర్థిక, సంస్కృత రచనల్లో, అద్దంకి గంగాధరుడు రాసిన ‘తపతీ సంవరణోపాఖ్యానం’, పొనగంటి తెలగనార్యుని రచన యయాతి చరిత్ర, మట్ల అనంతభూపాలుని రచన కుకుత్స విజయం, సారంగతమ్మయ్య రచన ‘వైజయంతీ విలాసం’, భద్రాద్రి శతకం, సింహాద్రి శతకం, భతృహరీ శతకం, కదిరీఫతీ రాసిన ‘హంసవింసతి’, అయ్యలరాజు నారాయణామాత్రుడు రాసిన సుకసప్తతి, వేమన పద్యాలు ఆనాటి ప్రజాజీవనాన్ని వర్ణిస్తున్నాయి. కుతుబ్షాహీల రాజధాని గోల్కొండ, కొత్త నగరం హైద్రాబాద్, దక్కన్లోని ఇతర నగరాలను, ప్రాంతాలను సందర్శించిన విదేశీ బాటసారులైన ఫ్రాన్స్ దేశస్థులైన టావెర్నియర్, బెర్నియర్, థీవ్నాట్, విలియం మాథోల్డ్ రష్యాకు చెందిన నిఖిటిన్ మొదలైన వారు ఈ యుగానికి చెందిన వివిధ విషయాలను తమ డైరీలలో, రచనల్లో పేర్కొన్నారు. ఇవి కుతుబ్షాహీల యుగచరిత్ర రచనకు ఎంతో అమూల్య సమాచారాన్ని అందచేస్తున్నాయి.

సుల్తాన్-కులీ-కుతుబ్-ఉల్-ముల్క్: స్వతంత్ర కుతుబ్షాహీ రాజ్య స్థాపకుడు సుల్తాన్-కులీ-కుతుబ్-ఉల్- ముల్క్. ఇతడు బహమనీల కొలువులో కొంతకాలం పనిచేశాడు. తెలంగాణా తరఢారుగా పనిచేశాడు. మూడో మహమ్మద్ షా పరిపాలన చివరి దశలో చెలరేగిన తిరుగుబాట్లతో ప్రేరేపితుడై క్రీ.శ. 1512లో స్వతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాడు. ఇతడు సమకాలీన విజయనగర, గజపతి రాజులతో అనేక యుద్ధాలు చేశాడు. ఇతడు గోల్కొండ దుర్గాన్ని బలోపేతం చేయించాడు. అనేక మసీదులు, రాజప్రసాదాలు, భవనాలు నిర్మించాడు. గోల్కొండకు సమీపంలో ‘మహమ్మద్ నగర్’ అనే కొత్త పట్టణాన్ని కట్టించాడు. అతణ్ణి అధికారులు, ప్రజలు అభిమానించారు. 99వ యేట కుమారుడి (జంషీద్) చేతిలో హత్యచేయబడ్డాడు. ఇతని కాలంలోనే గోల్కొండ రాజ్యం దక్కన్లోనే కాక సమకాలీన ప్రపంచంలో విశేష ఖ్యాతి గడించింది.

జంషీద్-కులీ-కుతుబ్షా (క్రీ.శ. 1543-1550): ఇతడు సుల్తాన్-కులీ మూడో కుమారుడు. స్వార్థపరుడు. కుట్రలకు పెద్ద వ్యూహకర్త. సొంత తండ్రినే అధికార దాహంతో హత్యచేసి సింహాసనం అధిష్టించి ఏడేళ్ళు పరిపాలన చేశాడు. ప్రజలు, అధికారులు ఇతని చర్యను ఏవగించుకున్నారు. మంచి పాండిత్యం కలవాడు. కవిత్వం రాసేవాడు. క్రీ.శ. 1550లో వ్యాధిగ్రస్తుడై మరణించాడు.

సుఖాన్-కులీ-కుతుబ్షా: జంషీద్ మరణానంతరం ఏడేళ్ళ పిన్నవయస్కుడైన అతని కుమారుణ్ణి అతని తల్లి, మంత్రులు గోల్కొండ సింహాసనంపై కూర్చోబెట్టి అధికారం చెలాయించారు. ఇతని పరిపాలన కేవలం ఏడు నెలలపాటు కొనసాగింది. రాజ్యంలో అంతరంగిక కలహాలు, సర్దారుల స్వార్థ రాజకీయాలు హద్దుమీరాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయనగర రాజ్యంలో అళియరామరాయల వద్ద శరణాగతునిగా ఉన్న ఇబ్రహీం-కులీ-కుతుబ్షా, రామరాయల మద్దతుతో గోల్కొండ రాజ్య సింహాసనాన్ని క్రీ.శ. 1550లో అధిష్టించాడు. ఈ విధంగా సుబాన్ కులీ పాలన అంతమైంది.

ఇబ్రహీం-కులీ-కుతుబ్షా (క్రీ.శ. 1550-1580): ఇతడు గోల్కొండ రాజ్య స్థాపకుడైన సుల్తాన్ కులీ చిన్న కుమారుడు. తన సోదరుడైన జంషీద్ పన్నిన కుట్ర నుంచి ప్రాణాలతో తప్పించుకొని క్రీ.శ.1543లో విజయగనర రాజ్యం పారిపోయి అళియ రామరాయల శరణు పొందాడు. అక్కడే ఏడేళ్ళపాటు గడిపాడు. రామరాయలు ఇతణ్ణి సొంత కొడుకులా ఆదరించాడు. తెలుగు భాషలో మంచి పాండిత్యం సంపాదించాడు. క్రీ.శ. 1550లో గోల్కొండ సుల్తానుగా సింహాసనం అధిష్టించిన ఇబ్రహీం-కులీ-కుతుబ్షా ప్రజా బలంతో 30 సంవత్సరాలపాటు సమర్థవంతంగా పరిపాలన చేశాడు. ఇతడు రాజ్య విస్తరణ కోసం సోదర షియా సుల్తానులతో, విజయనగర రాజులతో అనేక యుద్ధాలు చేశాడు. అళియ రామరాయల విభజించి పాలించు దౌత్యనీతికి ఇతడు నష్టపోయాడు. గత సహాయాన్ని విస్మరించి విజయనగర చక్రవర్తికి వ్యతిరేకంగా వైవాహిక సంబంధాల ద్వారా బీజాపూర్, అహమద్ నగర్ సుల్తానులను, బీరార్, బీదర్ సుల్తానులను ఐక్యం చేశాడు. చారిత్రాత్మక రాక్షసి తంగడి యుద్ధం (జనవరి 23, 1565)లో విజయగనరం సేనాధిపతియైన ఆళియ రామరాయలను మోసంతో దెబ్బతీశాడు. రాత్రిపూట సంప్రదింపుల సాకుతో వారి శిబిరంపై దాడిచేయించాడు. 80 ఏళ్ళ వయస్సులో రామరాయలు విరోచితంగా పోరాడి ఓడాడు. హుస్సేన్-నిజాం షా రామరాయల తలను ఖండించి యుద్దభూమిలో పగ తీర్చుకొన్నాడు. దీంతో విజయనగర సేనలు చిన్నాభిన్నమయ్యాయి. ఇతని పాలనలో గోల్కొండ రాజ్యం కీర్తి నలుదిశలా వ్యాపించింది. ఆర్థికంగా, సైనికంగా గోల్కొండ రాజ్యం బలోపేతమైంది. ఇతడు వ్యవసాయాభివృద్ధికై అనేక చెరువులు, కాలువలు నిర్మించాడు. వీటిలో పేర్కొనదగ్గవి హుస్సేన్ సాగర్ చెరువు, ఇబ్రహీంపట్నం చెరువు. రైతాంగం సుఖసంతోషాలతో ఉండేది. స్వదేశీ, విదేశీ వ్యాపారం అభివృద్ధి చెందింది. గోల్కొండ వస్త్రాలు, వజ్రాలు యూరోపియన్ రాజ్యాల్లో మంచి పేరు పొందాయి. సాహిత్యం, కళలు ఇతని పోషణలో వికసించాయి. ఇతడు క్రీ.శ. 1580లో మరణించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

మహమ్మద్ కులీ-కుతుబ్షా (క్రీ.శ. 1580-1612): ఇబ్రహీం-కులీ-కుతుబ్షా మరణానంతరం అతని సోదరుడైన (సుల్తాన్-కులీ-మూడో కుమారుడు) మహమ్మద్-కులీ-కుతుబ్షా పదిహేను ఏళ్ళ పిన్నవయస్సులో గోల్కొండ రాజ్య సింహాసనం అధిష్టించాడు. ఇతడు దక్కన్ ముస్లిం పాలకుల్లో అత్యంత ప్రతిభావంతుడిగా కీర్తిగడించాడు. గొప్ప పరిపాలనాదక్షుడు. సైన్యాలను నడపడంలో దిట్ట. సాహిత్యప్రియుడు, గొప్ప కట్టడాల నిర్మాత. హైద్రాబాద్ నగరం ఇతని నిర్మాణమే. చార్మినార్, జామామసీద్, చందన్ మహల్ కూడా ఇతడే నిర్మించాడు. ఇతడు ఇబ్రహీం మాదిరిగానే తెలుగు భాషను ఆదరించాడు. అరబిక్, పర్షియన్, ఉర్దు భాషలతో సమానంగా తెలుగుభాష పురోగతి చెందింది. స్థానిక ప్రజల సంప్రదాయాలను, ఆచారాలను, పద్ధతులను గౌరవించాడు. ప్రజా సంక్షేమాన్ని కోరి పరిపాలించాడు. క్రీ.శ. 1612లో 32 ఏళ్ళ సుదీర్ఘ పాలన తరువాత మరణించాడు. ఇతడి ఏకైక కుమార్తె హయత్-బక్ష్-బేగం. ఈమె భర్త సుల్తాన్ మహ్మద్ కుతుబ్షా గోల్కొండ చరిత్రలో మహమ్మద్ కులీ-కుతుబ్షా పరిపాలనా కాలం ఒక చారిత్రక ఘట్టం.

సుల్తాన్ మహమ్మద్-కులీ-కుతుబ్షా (క్రీ.శ.1612-1626): మహ్మమద్ కులీ-కుతుబ్షా మరణానంతరం అతని మేనల్లుడు, అల్లుడైన సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్షా గోల్కొండ సుల్తానుగా బాధ్యతలు చేపట్టాడు. ఇతడు గొప్ప పండితుడు. ఇతనికి మత సంప్రదాయాల పట్ల అభిమానం ఎక్కువ. అధిక సమయం పండితులతో చర్చల్లో గడిపేవాడు. క్రీ.శ. 1617లో హైద్రాబాద్ నగరంలో మక్కామసీదు నిర్మాణానికి ఇతడే పునాది వేశాడు. దీని నిర్మాణం డైబ్బైఏడేళ్ళ పాటు కొనసాగింది. క్రీ.శ 1687 లో గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించిన మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ మక్కామసీద్ నిర్మాణాన్ని 1694లో పూర్తిచేశాడు. ఇతడే సుల్తాన్ నగరాన్ని నిర్మించాడు.

అబ్దుల్లా-కుతుబ్షా (క్రీ.శ.1626 – 1672): ఇతడు సుల్తాన్ మహమ్మద్ కుమారుడు. పన్నెండు ఏళ్ళ పిన్న వయస్సులో గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతని తల్లి హయత్-బక్ష్-బేగం రాజ్య వ్యవహారాలు నిర్వహించింది. ఇతడు విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. ఇతని కాలంలో మొగల్ దాడులు గోల్కొండ రాజ్యంపై తీవ్రతరమయ్యాయి. పరాజయం పొందిన గోల్కొండ సుల్తాన్ మొగల్ చక్రవర్తికి కప్పం చెల్లించి అధికారం కొనసాగించాడు. ఇతడు క్రీ.శ.1672లో మరణించాడు.

అబుల్హాసన్ తానాషా (క్రీ.శ.1672–1687): కుతుబ్షాహీ సుల్తానుల్లో అబుల్హసన్ తానాషా చివరివాడు. ఇతడు అబ్దుల్లా కుతుబ్షా అల్లుడు. ఇతడి పదిహేను ఏళ్ళ పరిపాలనా కాలంలో కుతుబ్షాహీ రాజ్యంపై మొగల్ చక్రవర్తి సేనలు నిరంతర దాడులు చేశాయి. దీనివల్ల కుతుబ్షాహీ రాజ్య ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఇతడి పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించారు. ఇతడు పరమత సహనం ప్రదర్శించాడు. ఔరంగజేబ్ సామ్రాజ్య కాంక్షకు అబుల్హాసన్ రాజ్యం బలైంది. సుమారు ఎనిమిది నెలలపాటు ధైర్యసాహసాలతో మొగల్ సేనలను కుతుబ్షాహీ సేనలు ఎదుర్కొన్నాయి. పరాజితుడైన సుల్తాన్ను మొగల్ సేనలు బందీగా బీదర్, దౌలతాబాద్లలో పన్నెండు ఏళ్ళపాటు ఉంచారు. క్రీ.శ. 1690లో చివరి కుతుబ్షాహీ సుల్తాన్ బందీగా దౌలాతాబాద్లోనే మరణించాడు.

ప్రశ్న 6.
కుతుబ్షాహీల కాలం నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులను వర్ణించండి.
జవాబు:
గోల్కొండ సుల్తానుల కాలమునాటి ఆంధ్రదేశ పరిస్థితులను తెలుసుకొనుటకు ఆధారములేమనగా:

  1. అద్దంకి గంగాధర కవి రచించిన “తపతీ సంవరణోపాఖ్యానము”
  2. పొన్నగంటి తెలగనార్యుని “యయాతి చరిత్ర”
  3. మట్ల అనంత భూపాలుని “కకుత్స విజయము”
  4. మల్లారెడ్డి విరిచితమగు “పద్మపురాణము”, “షట్చక్రవర్తి చరిత్రము”
  5. వేమన పద్యములు
  6. “భద్రాద్రి శతకము”, సింహాద్రిశతకము” మున్నగు శతకములు
  7. టావెర్నియర్, థీవ్ నాట్ మున్నగు విదేశీ యాత్రికుల రచనలు
  8. ఫెరిష్టా, ఖాఫీఖాన్ మున్నగు ముస్లిం చరిత్రకారుల రచనలు.

గోల్కొండ సుల్తాన్లు వ్యవసాయమును విస్తృతపరచి, పరిశ్రమలను నెలకొల్పి, వాణిజ్యమును ప్రోత్సహించి 3 ఆర్థికాభ్యుదయమును సాధించిరి. వారి పరమత సహన విధానము, ప్రజాహిత కార్యములు, ఆంధ్ర సారస్వత పోషణ ఆంధ్రుల అభిమానమును వారు చూరగొన్నారు.

A. సాంఘిక పరిస్థితులు: నాటి సమాజములో హిందువులు, ముస్లిములు అను రెండు ప్రధాన వర్గములుండెను. హిందువులలో ప్రభుత్వోద్యోగులు, వర్తకులు, కర్షకులను మూడు తెగలు, ముస్లిములలో ప్రభుత్వోద్యోగులు, వర్తకులను రెండు తెగలు కలవు.

(ఎ) హిందువులు: పూర్వకాలమునందువలె ఈ యుగమున కూడా చాతుర్వర్ణ వ్యవస్థ కలదు. కాని మహమ్మదీయుల ప్రాబల్యమధికమగుట వలన వర్ణవ్యవస్థలోని క్లిష్టత మాత్రమే సడలసాగెను. నాటి సమాజమున ప్రధానమగు కులములు నాలుగే అయినను వృత్తి కారణముగా అనేక కులములు ఏర్పడినవి. కాపు, రెడ్డి, వెలమ, యాదవ, బలిజ, కమ్మరి, వడ్రంగి, కాసె, కంచెర, అగసాలె, సాలె, సాతాని, చాకలి, మంగలి, కలిక, గాండ్ల, బెస్త, బోయ, మేదర మున్నగు కులములు నాటి సమాజమున కలవు. కాపులలో పంట, మోటాటి, పాకనాటి మున్నగు బేధముండెను. వీరు వ్యవసాయములో నేర్పరులు. వీరితోపాటు స్త్రీలు కూడా పొలము పనులలో పాల్గొనెడివారు. అగసాలె వారు బొమ్మలకు రంగులు వేసెడివారు.

బ్రాహ్మణులు పంచాంగము చెప్పుట వలన, భిక్షాటన ద్వారా, గ్రహశాంతి జపములు చేయుట వలన, గ్రహసంక్రమణ సమయములందు దానములను గ్రహించుట వలన ధనార్జన చేసి జీవించెడివారు. కొందరు బ్రాహ్మణులు ప్రభుత్వోద్యోగములలో నియుక్తులగుచుండిరి. వారు నియోగులనబడిరి. వారు గ్రామకరణములుగా కూడా ఉండెడివారు. నాటి బ్రాహ్మణులు వ్యవసాయము చేయుటయందును నేర్పరులే. కొందరు బ్రాహ్మణులు గాదెల నిండుగ ధాన్యమును, ఆవుల మందలను, గొట్టెల మందలను కలిగియుండిరి.

(బి) మహమ్మదీయులు: ఈ కాలమునకు మహ్మదీయుల పాలన ఆంధ్రదేశమున స్థిరపడెను. సుల్తానులు పరమత సహనమును ప్రదర్శించినప్పటికీ స్థానిక అధికారులు ఆంధ్రదేశమున వీరవిహారము సల్పుచుండిరి. స్త్రీలను చెరపట్టి, గోవులను వధించుచుండిరి. వీరి ప్రభావము వలన వేదశాస్త్ర, పురాణ పఠనములు నశించెను. సయ్యదులు, మౌల్వీలు, ఫకీర్లు మున్నగువారి ప్రభావము పెరుగుటతో బ్రాహ్మణులకు, విద్యాంసులకు, హరిభక్తులకు సంఘమున స్థానము దిగజారినది. మహమ్మదీయుల భాష కూడ ప్రచారములోనికి వచ్చెను. ఉర్దూ పదములు విరివిగా తెలుగులో ప్రవేశించెను.

(సి) ఆహారము: వరి, జొన్న, మొక్కజొన్న, గోధుమ నాటి ప్రధాన ఆహార ధాన్యములు. నేయి, కూర ప్రజల భోజనములో ప్రధాన భాగములు. పొంగలి, పులిహోర, దద్దోజనము, పప్పు, ఆవడులు, వడగులు, పచ్చళ్ళు, దోసెలు, గారెలు, బూరెలు, చక్కిలములు మున్నగు అనేక రకములగు ఆహార పదార్ధములు వారికి తెలియును. కొఱ్ఱలు, రాగి, సజ్జ, జొన్న, మొక్కజొన్న సామాన్య ప్రజల ఆహార ధాన్యములు. వరి ధాన్యములో అనేక రకములు కలవు. ముస్లిములు ప్రధానంగా మాంసాహారులు.
తాంబూలమును సేవించుట నాటి ప్రజలకు (ధనికులకు) అమిత ప్రీతి. తాంబూలములో కర్పూరము, కొత్త సున్నము, లేత తమలపాకులు ప్రధాన భాగములు.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

(డి) దుస్తులు: వివిధ తరగతులవారు వివిధ రకముల దుస్తులను ధరించిరి. గోల్కొండ సుల్తానులు ఆదిలో పూర్వపు సాంప్రదాయము ప్రకారము తురుష్కుల శైలిలో దుస్తులు ధరించినను క్రమక్రమముగా స్థానిక పద్ధతులకు అలవాటుపడిరి. మహమ్మద్ కులీకుతుబ్షా తురష్కటోపి, ఉన్ని కోటులకు మారుగా, దక్కను ప్రాంతీయులు వాడు తలపాగాను, వదులుగానుండు చొక్కాను ధరించెను. లుంగీ, జుబ్బా (లాల్చి), పేటాలు ముస్లిం పురుషుల దుస్తులు. క్రమంగా వీటికి బదులుగా షేర్వానీ, ట్రౌజరు, తుర్కీట్రోపీ వాడుకలోనికి వచ్చెను. ముస్లిం స్త్రీలు చీరలు, జాకెట్లు లేదా పావడ పైట వేసుకొనెడివారు. పూర్వము గొంతు నుండి మోకాళ్ళ వరకు ఉండెడి “చౌలీలు” ధరించిరి. చేతులు గూడా పూర్తిగా కప్పబడి ఉండేవి. తరువాత ఈ చౌలీల స్థానములో పొట్టి రవికులు వచ్చినవి. “పర్ధా” ఘోషా అను ఆచారమును ముస్లిం స్త్రీలందరూ పాటించెడివారు.

హిందువులలో ధనవంతులు పగడం, పచ్చలు ధరించెడివారు. నల్ల అంచుగల పంచె, తలపాగ మున్నగునవి. వారి దుస్తులలోని భాగములు. చొక్కాలు చాలా తక్కువ, కాని అవి వాడుకలోనికి వచ్చి ఉండెను. సామాన్య జనులు ముతక దుప్పటి కప్పుకొనుచుండిరి. నాటి స్త్రీలు “సరిగ” రవికెలు ధరించేవారు. అంచులయందు అల్లిక పనిగలిగిన రవికెలను “సరిగ రవికె” అంటారు. స్త్రీలు నుదుట తిలకమును దిద్దుకొని కొప్పువేసుకొని పూలు తురిమిడివారు.

(ఇ) ఆభరణములు: మణి హారములు, పాపిట బొట్లు, జడబిళ్ళలు, కడియములు పగడాల పేరులు, గజ్జెలు, తాయెత్తులు, కుప్పెలు, సూర్య, చంద్రవంకలు, గండ్లపేరు, కంకణములు, కమ్మలు, ఉంగరములు నాటి స్త్రీల ఆభరణములు. నాటి స్త్రీలు బంగారు గాజులు కూడా ధరించినట్లు తెలియుచున్నది. ముస్లిం స్త్రీలు కాళ్ళకు కడియములు, చెవులకు బంగారు పోగులు, గొలుసులు, ముక్కుపుడకలు, విలువైన రాళ్ళు కూర్చిన బంగారు హారములు ధరించెడివారు. పురుషులకు చెవిపోగులుండట సర్వసాధారణము. చాలామంది దండ కడియమును కూడా ధరించిరి. మహమ్మద్ కులీకుతుబ్షా కూడా దండ కడియమును ధరించెడివారు. గొడుగులు, టోపీలు వాడుకలో ఉండెను.

(యఫ్) గృహములు, గృహోపకరణములు: గోల్కొండ సుల్తానులు, ప్రభువర్గముల వారు విశాల భవనములలో నివసించుచూ విలాస జీవితమును గడిపారు. మధ్యతరగతివారు కూడా సౌఖ్యప్రదమైన జీవితమును గడిపినట్లు తెలియుచున్నది. హైదరాబాద్ నగరంలో ఎనిమిది లక్షల జనులు నివసించినారు. ఆ కాలము నాటి ప్రజలు గృహ నిర్మాణ విషయమున మిక్కిలి శ్రద్ధ వహించిరి. పడకగది, వంటగది, దేవతార్చనగది, అటకలు, విశాలమగు చావడతో బావి, గాదెలతో పశువుల దొడ్డి మున్నగువానితో నాటి గృహములు కూడి ఉండెడివి. ధనవంతులు గాజుగిన్నెలలో దీపాలు వెలిగించుచుండిరి. సుల్తానులు, కులీనులు వెండి, బంగారు పాత్రలను వాడిరి. తివాచీలు, గాజు సామాగ్రిని కూడా ఎక్కువగా వాడుకలో ఉండెను. హైదరాబాదులోని విశాల భవనములను, వెండి, బంగారు పాత్రలను, తివాచీలను, గాజు సామాగ్రిని చూచి మొగలులు ఆశ్చర్యచకితులైనారు.

భోగపరాయణుల శయ్యా మందిరములు చక్కగా అలంకరింపబడేవి. పట్టే మంచములు, దోమతెరలు, ముత్యాల జాలీలు, తూగుటుయ్యాల, తాంబూలపు భరిణ, రుద్రవీణ, వట్టివేళ్ళ విసనకర్రలు, దీపపు స్థంభములు మున్నగువానిచే శయ్యామందిరములు అలంకరింపబడెను. విలాసప్రియులు పన్నీరు, గంధము మున్నగు సుగంధ ద్రవ్యములను వాడేవారు.

(జి) వినోదములు: పండుగలు, జాతరలు, రథోత్సవములు మున్నగునవి ఆనాటి ప్రజలకు సంతోషదాయకములు. ధనవంతులైన గ్రామ ముఖ్యులు ఉచితముగా వినోదములను ఏర్పాటు చేయుచుండిరి. గ్రామాధికారి ఏర్పాటు చేసిన దొమ్మరాటయే ఆ కాలపు సర్కస్. దొమ్మరివాళ్ల విద్యలు, వీధినాటకములు, తోలుబొమ్మలాటలు, విప్రవినోదములు, కోడిపందెములు మున్నగునవి ప్రజలకు వినోదము కలిగించెడివి. పులిజూదము, గుడిగుడిగుంచము, బొంగరములాట మున్నగునవి వారి వినోదక్రీడలు.

(హెచ్) విద్యా విధానము: ఆనాటి విద్యా విధానము ఓనమాలను దిద్దించుటతో ప్రారంభమగును. గుణింతములను, పద్యములను నేర్పెడివారు. విద్యనభ్యసించుటలో శ్రద్ధ చూపని విద్యార్థులకు గురువులు తొడ మెలిపెట్టుట, కోదండములు వేయించుట మున్నగు శిక్షలు విధించెడివారు. సాధారణముగా దేవాలయములు, మసీదులు, విద్యాకేంద్రములుగా ఉండేవి.

(ఐ) ఋణ పత్రములు: ఋణములు తీసుకొనుట, ఋణ పత్రములు వ్రాసి ఇచ్చుట మొదలగునవి ఆనాడు వాడుకలో ఉండెను. ఋణపత్రములను మ్రానిపట్టపై ఒకవిధమగు పసరుతో వ్రాసెడివారు.

(జె) శకునములు, విశ్వాసములు: నాటి ప్రజలకు శకునములపై విశ్వాసము కలదు. నంబి బ్రాహ్మణుడు, పాము, చెవులపిల్లి దుశ్శకునములనియు, గ్రద్ద మంచి శకునమనియు వారి విశ్వాసము. ఏదైనా కీడు కలిగినపుడు భూతములకు శాంతి చేసినచో, దోష నివారణమగునని వారి విశ్వాసము. ఎరుకసాని సోదియందునూ వారికి నమ్మకము
కలదు.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

(కె) చలివేంద్రములు: వేసవి కాలములో చలివేంద్రములు ఏర్పాటు చేయబడుచుండెను. నాటి చలివేంద్రములలో మంచినీటితో పాటు మజ్జిగ, గంజి కూడా బాటసారులకు దాహము తీర్చుకొనుటకు ఇచ్చేవారు.

B. ఆర్థిక పరిస్థితులు: గోల్కొండ సుల్తానులు వ్యవసాయము, వర్తక వ్యాపారములను వృద్ధిచేసిరి.
(ఎ) వ్యవసాయము, పంటలు: గోల్కొండ సారవంతమైన తీర భూములతోను, అటవీ సంపదతోను కూడియున్న రాజ్యము. ఔరంగజేబు పేర్కొనినట్లు గోల్కొండ రాజ్యములో “సాగులో లేని భూమి లేదు”. గోధుమ, వరి, జొన్న, రాగి, సజ్జ, పప్పు ధాన్యములు అపారముగా పండుచుండెను. వ్యాపార పంటలైన ప్రత్తి, పొగాకు (దీనిని పోర్చుగీసువారు ప్రవేశపెట్టిరి) ఆదాయముల ద్వారా విదేశీ మారక ద్రవ్యము లభించేది. మామిడి, అరటి, నిమ్మ, దానిమ్మ, నారింజ, అనాస, జామ మున్నగు పండ్లు విరివిగా పండింపబడెను.

(బి) పరిశ్రమలు: గోల్కొండ రాజ్యము వ్యవసాయమునకే కాక పరిశ్రమలకు కూడా ప్రసిద్దికెక్కెను. ఒక మొగలు చిత్రకారుడన్నట్లు హైదరాబాద్ లో ఉన్న కళాకారులు, వ్యాపారులు, శ్రామికుల వివరములు తెలుపవలెనన్న అవి ఒక గ్రంథమగును.
1) నేతపని అభివృద్ధి దశయందుండెను. వివిధ రకములు బట్టలు (సన్ననివి, ముతకవి) తయారుచేయబడుచుండెను. ఓరుగల్లు సన్నని నూలు బట్టలు తయారీకి; మచిలీపట్టణము కలంకారీ అద్దకపు పరిశ్రమకు వాసికెక్కెను. కలంకారీ అద్దక వస్త్రములకు విదేశములలో కూడా మంచి గిరాకీ ఉండెను.

2) నిర్మల్, ఇండోర్ (నిజామాబాద్) సమీపమున ఉన్న ఇందల్వాయీలవద్ద ఖడ్గములు, బాకులు, బల్లెములు తయారుచేయబడినట్లు థీవ్ నాట్ రచనలను బట్టి తెలియుచున్నది. అవి భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేయబడుచుండెను.

3) కొండపల్లి, నరసాపురము దారు పరిశ్రమకు ప్రసిద్ధికెక్కెను. నరసాపురము వద్ద నౌకలు నిర్మింపబడుచుండెను. భారతీయులేగాక పోర్చుగీసువారు కూడా ఇచట నౌకలను తయారుచేయించుకొనెడివారు. ‘గ్లోబ్’ అను పేరుగల ఇంగ్లీషు ఈస్టిండియా కంపెనీ నౌక కూడా ఇచటనే తయారుచేయబడినట్లు ఆ కంపెనీ ఉద్యోగియైన ష్కోరర్ (Schorer) తెలిపియున్నాడు.

4) ఖమ్మం మెట్టు సమీపంలో ఉన్న నల్గొండ వద్ద నీలిమందు తయారుచేయబడి ఎగుమతి అగుచుండెను.

5) మచిలీపట్టణంలో తుపాకీ మందు తూటాలు తయారుచేయబడుచుండెను. ఇచట లభించు తెరచాప దూలములు నాణ్యమైనవి. గోల్కొండ రాజ్యములో మొత్తం 23 గనులు కలవు. వానిలో సీసము, ఇనుము గనులు కూడా కలవు. గోల్కొండ ఉక్కు విదేశాలలో సైతం వాసికెక్కెను. ప్రపంచ ఖ్యాతినార్జించిన డమాన్కస్ కత్తులు గోల్కొండ ఉక్కుతో చేయబడినవే.

6) గోల్కొండ వజ్రపు గనులకు ప్రసిద్ధి. నాడు వజ్రములు సంచుల ద్వారా లెక్కింపబడుటను బట్టి అవి ఎంత సమృద్ధిగా లభించెడివో విశిదమగును. ఆంధ్రప్రాంతములోని కొండపల్లి, నరసాపురముల వద్ద, కర్ణాటక ప్రాంతములోని కంధికోట కొల్లూరుల వద్ద వజ్రముల త్రవ్వకము ముమ్మరముగా సాగుచుండెను. కర్ణాటక ప్రాంతములలోని వజ్రపు గనులలో ఇరవైవేలకు పైగా శ్రామికులు పనిచేయుచుండెడివారు.

(సి) వర్తక, వ్యాపారములు: విదేశీయుల రాకతో దేశీయ, విదేశీయ వాణిజ్యములు పతాకస్థాయికి చేరుకున్నవి. మచిలీపట్టణము విదేశీ వాణిజ్యమునకు కేంద్రముగా ఉండెను. ఈ విషయములో నేటి బొంబాయికి గల స్థానము నేటి మచిలీపట్టణమునకు కలదు. అరకాన్, పెగూ, టెనన్సరియమ్, మలయా ద్వీపకల్పము, సింహళము, మాల్దీవులు, తుర్కి స్థానము, అరేబియా, పర్షియా, ఐరోపాఖండ దేశములలో విదేశీ వాణిజ్యము జరుగుచుండెను. ముడి పదార్థములు, ఆహారపదార్థములు, నూలు బట్టలు మున్నగునవి ఎగుమతి అగుచుండెను. మిరియాలు, చందనపు చెక్క, శిల్కు, చక్కెర, కస్తూరి, లక్క, గాజుసామానులు దిగుమతి అగుచుండెను. 34% ఎగుమతి, దిగుమతి సుంకములు వసూలు చేయబడుచుండెను. దేశీయ వ్యాపారములో గోల్కొండ నగరము గొప్ప వ్యాపార కేంద్రముగా విలసిల్లెను. రత్నములకు, వజ్రములకు, కస్తూరి మొదలగు సుగంధ ద్రవ్యములకు గోల్కొండ వ్యాపార కేంద్రముగా ఉండెను.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రుద్రమదేవి విజయాలు
జవాబు:
ఆంధ్రదేశాన్ని పాలించిన మొట్టమొదటి స్త్రీ పాలకురాలు రుద్రమదేవి లేక రుద్రాంబ క్రీ.శ. (1262 – 1296) గణపతిదేవునికి కొడుకులు లేనందున తన వారసురాలిగా తన కుమార్తె రుద్రమదేవిని నియమించాడు. ఈమె కాలంలో ఈమె స్త్రీ అన్న చులకన భావంతో యాదవులు, చోళులు, పాండ్యులు, కాకతీయ రాజ్యంపై దండెత్తగా, రుద్రమదేవి వారి దాడులను తిప్పికొట్టింది. పురుష వేషం ధరించి రాజధర్మాన్ని సమకాలీన రాజుల కంటే గణనీయంగా నిర్వహించింది. ఉదార పరిపాలన ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొంది. ఈమెకు కుమారులు లేనందున తన కూతురు కొడుకైన రెండవ ప్రతాపరుద్రుడిని దత్తత తీసుకొని అతనికి రాజ్యాన్ని అప్పగించింది. రుద్రమదేవి కాలంలో వెనీస్ యాత్రికుడు మార్కోపోలో ఆంధ్రదేశాన్ని సందర్శించి ఈమె పాలనను కొనియాడాడు. రుద్రమదేవి ఆంధ్రదేశాన్ని సమర్ధవంతంగా పాలించిందని, ఆమె పరిపాలనా వ్యవస్థ ఆదర్శవంతంగా సాగిందని మార్కోపోలో పేర్కొన్నాడు.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

ప్రశ్న 2.
రుద్రమాంబ (రుద్రమదేవి)
జవాబు:
ఆంధ్రదేశాన్ని పాలించిన మొదటి మహిళా పాలకురాలు రుద్రమదేవి. ఈమె గణపతిదేవుని కుమార్తె. ఈమె భర్త చాళుక్య వీరభద్రుడు. ఈమెను సమర్థించి, పరిపాలనలో సహకరించి, విశ్వాస పాత్రుడుగా పనిచేసిన వారిలో రేచెర్ల ప్రసాదిత్యుడు ముఖ్యుడు. ఇతనికే కాకతీయ ‘రాజ్యస్థాపనాచార్య’ అనే బిరుదు ఉన్నది.

గణపతిదేవునికి కొడుకులు లేనందున తన వారసురాలిగా తన కుమార్తె అయిన రుద్రమదేవిని నియమించాడు. రుద్రమదేవి స్త్రీ అని, ఆమె సార్వభౌమాధికారాన్ని అంగీకరించడానికి నిరాకరించి, ధిక్కరించిన వారిని ఈమె అణచివేసింది. కాయస్థ నాయకుడు జన్మిగ దేవుడు, అతని తమ్ముడైన త్రిపురారి అంతరంగిక తిరుగుబాట్లను అణచివేయడంలో ఈమెకు అండగా నిలిచినారు. రుద్రమదేవి సైన్యాలు కడప, వేంగీ, తీరాంధ్రంపై తన ఆధిపత్యాన్ని నెలకొల్పింది. రుద్రమదేవి ‘రాయగజకేసరి’ అనే బిరుదును ధరించింది. యాదవ రాజులు ఈమె శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసి తెలుగుదేశంపై దండెత్తారు. రుద్రమదేవి సైన్యాలు చారిత్రాత్మక విజయాన్ని సాధించాయి.

ఈమె ప్రజాహితపాలన చేసింది. అనేక చెరువులు, కాలువలు నిర్మింపచేసింది. కాయస్థ అంబదేవుడు ఈమెకు నమ్మిన సేనాని. కాని రుద్రమదేవి పేరు ప్రతిష్టలు చూసి అసూయచెంది తిరుగుబాటు లేవదీశాడు. జన్మిగ దేవుడు, త్రిపురాంతకుడు ఈమెకు నమ్మిన అధికారులు. వీరి సోదరుడైన అంబదేవుడు కడప జిల్లా నందలూరు ప్రాంతానికి గవర్నర్గా పరిపాలించాడు. ఇతడు అధికార కాంక్షతో రుద్రమదేవికి వ్యతిరేకంగా ఒక కూటమిని తయారుచేసి గొప్ప తిరుగుబాటును లేవదీశాడు. ఇతని తిరుగుబాటును అణచడానికి వెళ్ళిన రుద్రమదేవి యుద్ధభూమిలో వీరస్వర్గం పొందినట్లు తెలియుచున్నది. రుద్రమదేవికి మగసంతానం లేనందువల్ల తన కుమార్తె కుమారుడైన రెండవ ప్రతాపరుద్రున్ని తన వారసునిగా ప్రకటించింది. ఈమె కాలంలో వెనీస్ యాత్రికుడు మార్కోపోలో ఆంధ్రదేశాన్ని సందర్శించి ఈమె పాలనను కొనియాడాడు.

ప్రశ్న 3.
రాక్షసి – తంగడి యుద్ధం
జవాబు:
రాక్షసి – తంగడి యుద్ధం క్రీ.శ. 1565లో విజయనగరానికి 10 మైళ్ళ దూరంలో ఉన్న రాక్షసి తంగడి అను గ్రామాల మధ్య విజయనగర సైన్యాలకు, బహమనీ సైన్యాలకు మధ్య జరిగింది. ఈ యుద్ధంలో విజయనగర సైన్యాలు ఓడి, సర్వనాశనమయ్యాయి. బహమనీ సైన్యాలు రామరాయలను అతిక్రూరంగా హతమార్చాయి. ఈ యుద్ధానంతరం ముస్లిం సైన్యాలు రక్షణ లేని విజయనగరంలో ప్రవేశించి, దోచుకొని, రాజప్రాసాదాలను, ఆలయాలను ధ్వంసం చేశాయి. ఈ యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం పతనమైంది.

ప్రశ్న 4.
విజయనగర రాజుల కాలం నాటి వాస్తు – శిల్పాలు
జవాబు:
శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా గొప్ప పండితుడు, సాహిత్యప్రియుడు, కళాపోషకుడు. ఎందరో కవులు, పండితులు అతని స్థానములో గౌరవాన్ని పొందారు. ఇతని రచన ఆముక్తమాల్యద పండితుల ప్రశంసలు అందుకొంది. సంస్కృత భాషలో ఉషాపరిణయం అనే గ్రంథాన్ని శ్రీకృష్ణదేవరాయలు రాశాడు. ఇతణ్ణి కవులు, పండితులు ‘ఆంధ్రభోజ’ అని కీర్తించారు. ఇతని ఆస్థానంలో ‘అష్టదిగ్గజాలనే’ ఎనిమిది మంది గొప్ప కవులు ఉండేవారని ప్రతీతి. వీరిలో అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన్న, పింగళి సూరన, తెనాలి రామకృష్ణుడు ముఖ్యులు. పెద్దన మనుచరిత్ర మహోన్నత ప్రబంధ కావ్యం. శ్రీకృష్ణదేవరాయలు వాస్తు-శిల్పకళలను పోషించాడు. ఎన్నో గొప్ప నిర్మాణాలు చేపట్టాడు. అనేక పాత దేవాలయాలకు మరమత్తులు చేయించాడు. శ్రీకృష్ణదేవరాయలు హంపీలోని విఠలాస్వామి గుడికి, హజరామస్వామి ఆలయానికి మరమత్తులు చేయించాడు. శ్రీకూర్మం, అహోబిలం, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం, సింహాచలం, అమరావతి మొదలైన చోట్ల అనేక ఆలయాలకు మరమత్తులు చేయించాడు. ఉదాహరంగా దానాలు చేశాడు, కానుకలు సమర్పించాడు. ఇతని కాలంలోనే హంపీలో భారీ గణేశ, హనుమాన్, ఉగ్రనరసింహ స్వామి రాతి విగ్రహాలను చెక్కించాడు. ఈ విధంగా శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలం విజయనగర చరిత్రలో మైలురాయిగా మిగిలింది.

ప్రశ్న 5.
మూడో మహ్మద్ షా
జవాబు:
పదిహేను సంవత్సరముల ప్రాయమున సింహాసనమునకు వచ్చిన మహమ్మద్ కులీ రాజ్యాంగ తంత్రములను దూరదృష్టితోను, నేర్పుతోను నడిపిన దక్షుడు. ఇతని కాలము నాటికి ఆంధ్రదేశమంతయు గోల్కొండ రాజ్యములో చేరియుండెను.

రాజ్యవాప్తి: మహమ్మద్కులీ కాలమున నంద్యాల, గండికోట, కడప, కర్నూలు ప్రాంతములలో అధికభాగము గోల్కొండ రాజ్యములో చేర్చబడెను. ఈశాన్య దిక్కున గంజాం జిల్లా వరకు ఇతని రాజ్యము విస్తరించేను.

విదేశీ సంబంధాలు: ఇతని కాలములో మొగలు చక్రవర్తి అక్బరు నుండి రాయబార సంఘమొకటి గోల్కొండకు రాగా అతడు అక్బరుకు కానుకలిచ్చి పంపెను. పారశీక రాయబారిగా కూడా ఇతని ఆస్థానమును సందర్శించెను.

వర్తక వ్యాపారములు: మహమ్మద్ కులీ వర్తక వ్యాపారములను, పరపతి సంస్థలను పోత్సహించెను. పర్షియా నుండి అనేక వ్యాపార కుటుంబములను రప్పించి హైదరాబాద్లోను, మచిలీపట్టణమునందును, వారికి నివాస సౌకర్యములను కల్పించెను. సుల్తాన్ అనుమతి పొందిన ఆంగ్లేయులు 1611లో మచిలీపట్టణములో వర్తక స్థావరమును నెలకొల్పుకొనిరి.

వాస్తు నిర్మాణము: మహమ్మద్ కులీ గొప్ప వాస్తు నిర్మాత. ఇతడు తన ప్రియురాలగు ఒక హిందూ నర్తకిపేర (బాగ్మతి) భాగ్యనగర్ను నిర్మించెను. తదుపరి ఆ నగరము సుల్తాను కుమారుని పేర (హైదర్) హైదరాబాద్ అని వ్యవహరింపబడెను. హైదరాబాదులో చార్మినార్ (1593), జామామసీదు (1593), చందన మహలు, చికిత్సాలయములు, విశ్రాంతి భవనములు మున్నగువానిని ఇతడు కట్టించెను. మూసీనదికి ఆనకట్ట కట్టించి హైద్రాబాదుకు మంచినీటి వసతి కల్పించెను. ఇతడు తన రాజధాని చుట్టును పండ్ల తోటలు నాటించెను. మహ్మమద్ కులీ పండితుడు, కవి, దానశీలి.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

ప్రశ్న 6.
ఫ్రాంకోయిస్ బెర్నియర్
జవాబు:
ఇతడు ఫ్రాన్స్ వాస్తవ్యుడు, వృత్తిరీత్యా వైద్యుడు, గొప్ప చరిత్రకారుడు, రాజనీతిజ్ఞుడు. క్రీ.శ. 1656-1668 మధ్యకాలంలో గోల్కొండ రాజ్యంలో పర్యటించాడు. మొగల్ చక్రవర్తి షాజహాన్ కుమారుడైన దారాషీకోకు ఆస్థాన వైద్యునిగా పనిచేశాడు. ఇతడు భారతదేశంలో పర్యటించిన కాలంలో మొగల్ సామ్రాజ్యంలో, దక్కన్లో ముమ్మరంగా పర్యటించి, తాను చూసిన, విన్న విషయాలను డైరీలో రాశాడు. 1670-71 సంవత్సరంలో ఇతని వివరణలు ‘ట్రావెల్స్ – ఇన్-మొగల్-ఎంపైర్’ అనే గ్రంథంగా ఫ్రాన్స్లో ముద్రించారు. బెర్నియర్ రచనలో ఆనాటి సామాజిక వ్యవస్థ, ఆచారాలు, వ్యవహారాలు, ఆర్థిక స్థితి, వృత్తులు, ఖార్ఖానాలు, చేతి వృత్తులు మొదలైన అంశాలు వర్ణించడమైంది. దక్కన్లో వ్యవసాయమే అధిక ప్రజల ముఖ్య వృత్తిగా పేర్కొన్నాడు. సమాజంలో శ్రీమంతులు, సర్దారులు, పేద ప్రజలు ఉన్నారని రాశాడు.

ప్రశ్న 7.
ఇబ్రహీం కుతుబ్షా
జవాబు:
జంషీద్ మరణానంతరము అతని కుమారుడు సుభాను గోల్కొండ సుల్తాన్ అయ్యెను. కాని విజయనగరములో తలదాచుకొన్న జంషీద్ సోదరుడగు ఇబ్రహీం గోల్కొండపై దాడి వెడలి సుభాను ఆరుమాసముల పాలన అంతమొందించి సింహాసనమధిష్టించెను. గోల్కొండ రాజ్య నిజమైన నిర్మాత ఇబ్రహీం కుతుబ్షా. కుతుబ్షా వంశీయులలో ప్రప్రథమంగా “షా” బిరుదును ధరించినది కూడా ఇతడే.. ఇతడు కడు సమర్థుడు. ఇబ్రహీం ముప్పై సంవత్సరములు రాజ్యమేలి పరిపాలనా వ్యవస్థను పటిష్టమొనర్చెను. దారిదోపిడీ దొంగలను అదుపులో ఉంచి వర్తకాన్ని, పరిశ్రమలను అభివద్ధి పరచెను. పరమత సహనాన్ని పాటించి హిందువుల అభిమానమునకు పాత్రుడయ్యెను. ఆంధ్రభాషా పోషకుడై ఆంధ్రులకు ప్రేమాస్పదుడయ్యెను.

ఇబ్రహీం ఆశయాలు: గోల్కొండ సుల్తానుగా ఇబ్రహీం ఆశయాలేమనగా (ఎ) దారిదోపిడీ దొంగలను పట్టుకొని ‘శిక్షించుట, (బి) పరిపాలనను వ్యవస్థాపితము చేయుట, (సి) రాజ్య విస్తరణ విధానమును విడనాడుట.

యుద్ధములు: ఇబ్రహీం ఆదిలో తనకు ఆశ్రయమిచ్చిన రామరాయలతో స్నేహసంబంధాలను కలిగివుండెను. తదుపరి ఇతని విధానంలో మార్పు వచ్చెను. గోల్కొండను విడిచి వెళ్ళిన జగదేకరావునకు రామరాయలు ఆశ్రయ మొసంగుట ఇబ్రహీంకు ఆగ్రహము కలిగించెను. అదికాక విజయనగర రాజ్య ప్రాబల్యమును దానివలన కలుగు ప్రమాదమును, అతడు గుర్తించెను. విజయగనర ప్రాబల్యమును, బీజాపూర్ రాజ్య విస్తరణను గాంచి ఆందోళన చెందిన ఇబ్రహీం, అహమ్మద్ నగర్ సుల్తాన్తో సంధి చేసుకొనెను. అందుకు ఆగ్రహించి రామరాయలు గోల్కొండపై దాడి జరిపి పానగల్లు, ఘనపురం దుర్గాలను ఆక్రమించెను. అంతట ఇబ్రహీం రామరాయలుపై పగ సాధించుటకు విజయనగరమును నాశనము చేయుటకు దక్కను సుల్తానులను సమైఖ్యపరచి 1565లో రాక్షసితంగడి యుద్ధంలో పాల్గొనెను.

ప్రశ్న 8.
కుతుబ్షాహీల పతనం
జవాబు:
గోల్కొండ సుల్తాన్ అబ్దుల్హాసన్ తానీషా బ్రాహ్మణ సోదరులైన అక్కన్న, మాదన్నలను సేనాని, ప్రధానమంత్రులుగా నియమించెను. సనాతన ముస్లిం భావాలు, హిందువుల యెడల ద్వేషము గల ఔరంగజేబుకు ఈ నియామకాలు రుచించలేదు.

1) ఔరంగజేబు ఉత్తర హిందూదేశ పరిస్థితులను చక్కబెట్టుకొని, తిరుగుబాటు చేసిన తన కుమారుడు అక్బరును తరుముకొనుచు దక్కన్ వచ్చెను. బీజాపూర్ జయించిన పిమ్మట ఔరంగజేబు గోల్కొండపై దాడికి వెడలెను.

2) 1665-66లో జయసింగ్ నాయకత్వమున, 1679లో దిలీరాఖాన్ నాయకత్వమున, 1685లో యువరాజు ఆజమ్ నాయకత్వమున మొగలులు బీజాపూర్పై దండయాత్రలు జరిపినపుడు, గోల్కొండ సుల్తాన్లు మొగలులకు వ్యతిరేకంగా, బీజాపూర్ సుల్తాన్లకు సాయపడిరి.

3) గోల్కొండ సుల్తాన్ మొగలుల విరోధియగు శివాజీతో స్నేహము చేసి అతనికి సహాయము చేయుట, కర్నాటక దండయాత్రలో శివాజీకి తోడ్పడుట ఔరంగజేబుకు ఆగ్రహము కలిగించెను.

4) 1656లో కుదిరిన ఒప్పందము ప్రకారము చెల్లించవలసిన యుద్ధవ్యయము, కప్పము గోల్కొండ సుల్తాన్ మొగలులకు చెల్లింపలేదు. అదియునుగాక, కర్ణాటకలో మీర్ జుమ్లా జాగీరు భూముల నుండి మొగలులకు రావలసిన ఆదాయమును సుల్తాన్ వసూలుచేసి అనుభవించెను.

5) గోల్కొండ రాజ్య ఐశ్వర్యము ఔరంగజేబును ఆకర్షించెను.

6) తానీషా పరమత సహనము ఔరంగజేబుకు గిట్టలేదు.

7) ఔరంగజేబు సున్నీశాఖకు చెందినవాడు. గోల్కొండ సుల్తాన్ షియాశాఖకు చెందినవాడగుటచే అతని పాలనను అంతమొందించుటకు ఔరంగజేబు సిద్ధపడెను.

8) సామ్రాజ్య కాంక్షపరుడైన ఔరంగజేబు గోల్కొండ రాజ్యమును వశపర్చుకొనుటకు నిశ్చయించెను.

9) వీనికితోడు బీజాపూర్ సుల్తానుపై ఔరంగజేబు జరిపించిన దాడిని అబ్దుల్ హసన్ “తుచ్ఛమైన పిరికిపంద చర్యగా” (a mean minded coward’s act) అభివర్ణించుట ఔరంగజేబు గోల్కొండపై తక్షణ దాడికి ప్రోత్సహించెను.

గోల్కొండ పతనము – అక్టోబర్ 3, 1687: ఈ కారణముల వలన ఔరంగజేబు మొదట తన కుమారుడైన షా ఆలంను (1685, జూలై) గోల్కొండపై దండెత్తుటకు పంపెను. కాని మాల్కేడ్ వద్ద గోల్కొండ సైన్యము మొగలులను అడ్డెను. షాఆలం ఎట్టి విజయములు సాధించలేదు. అంతట అక్టోబరు, 1685లో గోల్కొండ సర్వసేనానియగు మీర్ మహమ్మద్ ఇబ్రహీంకు లంచమిచ్చి అతని సాయముతో షా ఆలం హైదరాబాద్ను ఆక్రమించెను. సుల్తానైన తానీషా హైదరాబాదు వదలి గోల్కొండకు పారిపోయెను. తానీషా, షా ఆలంతో సంధి చేసుకొనెను. ఆ సంధి ప్రకారము:

  • అక్కన్న, మాదన్నలను కొలువు నుండి బహిష్కరించుటకు,
  • మాల్కేడ్, సేరంలను మొగలులకిచ్చుటకు,
  • యుద్ధ నష్టపరిహారము క్రింద ఒక కోటి 20 లక్షల రూపాయలు ఇచ్చుటకు,
  • సాలుకు రెండు లక్షల హనులు (Huns) కప్పము క్రింద చెల్లించుటకు తానీషా అంగీకరించెను.

కాని తానీషా అక్కన్న, మాదన్నలను బహిష్కరించుటలో జాప్యము చేయసాగెను. అంతట గోల్కొండ రాణుల ప్రోత్సాహముతో అక్కన్న, మాదన్నలు గోల్కొండ వీథులలో హతులైరి. తానీషా మొగలుల మిత్రుడయ్యెను. షా ఆలం గోల్కొండ కోటలో ఉండెను.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

ఔరంగజేబు దాడి: బీజాపూర్ ఆక్రమణ ముగియగానే, ఔరంగజేబు గోల్కొండను సైతము మొగలుల సామ్రాజ్యమున విలీనము చేయదలచి ఫిబ్రవరి 7, 1687లో గోల్కొండపై స్వయముగా దాడిచేసెను. గోల్కొండ కోటలో తానీషా, షా ఆలంల మధ్య రహస్య సమాలోచనలు గ్రహించి ఔరంగజేబు తన కుమారుడైన షా ఆలంను నిర్భందించెను. తదుపరి గోల్కొండను ముట్టడి చేయడం ప్రారంభించెను. ఈ ముట్టడి 8 నెలలు కొనసాగెను. మొగలు సైన్యమునకు నష్టం కలిగెను. కాని గోల్కొండ దుర్గము ఔరంగజేబు వశము కాలేదు. చివరకు ఔరంగజేబు మాయోపాయముచే అనగా అబ్దుల్లా ఫణియను నౌకరుకు లంచమిచ్చి అక్టోబరు 3, 1687 తెల్లవారుజామున 3 గంటలకు గోల్కొండ తూర్పు ద్వారమును తీయించి కోటలో ప్రవేశించెను. అయినను గోల్కొండ సైనికులు తుదిక్షణము వరకు వీరోచితముగా పోరాడిరి. ఈ పోరాటములో 70 గాయములతో ఏకాకిగా మొగలులతో పోరుసల్పిన అబ్దుల్ రజాక్ లౌరీ అను గోల్కొండ సేనాని ప్రభుభక్తి, వీరోచిత శక్తి గోల్కొండ చరిత్రలో చిరస్మరణీయము. పాతఃకాల విందారగించిన తానీషా బంధీగా దౌలతాబాద్కు పంపబడెను. దీనితో గోల్కొండ మొగలుల వశము అయినది. కుతుబ్షాహీల పాలన అంతరించింది.

ప్రశ్న 9.
నిజాం-ఉల్-ముల్క్
జవాబు:
నిజాం రాజ్యమునకు మూలపురుషుడు నిజాం ఉల్ ముల్క్, ఇతడు 1724 48ల మధ్య నిజాం రాజ్యాన్ని పాలించాడు. అతడి అసలుపేరు మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్. అతనికి చిన్ ఖిలిచ్ ఖాన్ అను మరొక పేరు కలదు. నిజాం ఉల్ ముల్క్ అనేది అతని బిరుదు మాత్రమే. ఇతడు ఆంధ్ర, నైజాం రాజ్యముల చరిత్రలోనేగాక భారతచరిత్రలో కూడా ప్రముఖవ్యక్తి. ఇతడు ‘అసఫ్ జాహి’ బిరుదుతో పాలించినందువల్ల అతని వంశమునకు ‘అసఫ్ జాహి’ పేరు వచ్చింది. ఇతడు మొదట మొగల్ సామ్రాజ్యమునకు దక్కన్ సుబేదారుగా పనిచేసెను. సయ్యద్ సోదరుల పతనంలో ప్రధాన పాత్ర వహించి మొగల్ సామ్రాజ్యమునకు ప్రధానిగా నియమింపబడ్డాడు. 1724లో స్వతంత్రుడై నిజాం రాజ్యమును స్థాపించారు. దానికి హైదరాబాద్ రాజధాని. 1858 వరకు మొగల్ సుబేదారులుగా నిజాంరాజులు పాలించినప్పటికీ వారు సర్వస్వతంత్రులు. నిజాం ఉల్ ముల్క్ స్థాపించిన రాజ్యము 1948లో సైనికచర్య జరిగి ఇండియన్ యూనియన్ హైదరాబాద్ కలిసే వరకు కొనసాగింది.

నిజాం-ఉల్-ముల్క్ పాలనలో జరిగిన ముఖ్య సంఘటనలు:
a) మునిషిన్ గాంప్ సంధి(1728): ఇతడు మహారాష్ట్రుల అధికార విస్తరణను అడ్డుకొనే యత్నములో భాగముగా వారిలో వారికి అంతఃకలహములు సృష్టించి స్వకార్యమును నెరవేర్చుకొనుటకు ప్రయత్నించెను. చివరకు పీష్వా బాజీరావు చేతిలో పాల్కేడ్ యుద్ధంలో ఓడిపోయి సంధికి అంగీకరించెను. ఆ సంధి (1728) ప్రకారము నిజాంచేత, సర్దేశ ముఖి కప్పములు చెల్లించుటకు అంగీకరించి, హామీగా కొన్ని దుర్గములను పీష్వా ఆధీనము చేసేను.

b) వార్నా సంధి: పీష్వాపై త్రియంబక్ రావును ఉసిగొల్పి త్రియంబక్ యుద్ధంలో విఫలమై వారా సంధిని చేసుకొనెను. 1731లో చేసుకున్న వార్నా సంధి ప్రకారం దక్షిణమున నిజాం – ఉల్ -ముల్క్ ఉత్తర హిందూ స్థానమున మహారాష్ట్రులు తమ ప్రాబల్యమును నెలకొల్పుకొనుటకు అంగీకారము కుదిరెను.

c) భోపాల్ యుద్దము (1738): మొగల్ చక్రవర్తికి, నిజాంకు ఉమ్మడి శతృవులైన మహారాష్ట్రులపై కత్తిగట్టిరి. అపుడు 1738 జనవరి నెలలో మహారాష్ట్రులకు నిజాం ఉల్ ముల్క్క భోపాల్ వద్ద జరిగిన యుద్ధంలో నిజాం పూర్తిగా ఓడిపోయెను. అపుడు చేసుకున్న సంధి ప్రకారము మాళ్వా రాష్ట్రమును, చంబల్, నర్మదా నదులు మధ్య దేశమును, యుద్ధ నష్టపరిహారముగా 50 లక్షల రూపాయలను మహారాష్ట్రులకు ఇప్పించుటకు నిజాం అంగీకరించెను.

d) నాదిర్షా దండయాత్ర: క్రీ.శ. 1738లో మొగల్ సామ్రాజ్యముపై నాదిర్షా దండయాత్ర జరిపెను. నాదిర్షా తనను ఎదిరించిన మహ్మద్, నిజాం ఉల్-ముల్క్ ఓడించి ఢిల్లీ చేరుకొనెను. ఆ సందర్భమున నాదిర్షా ఆగ్రహమునకు గురైన ఢిల్లీ పౌరులను నిజాం ఉల్ ముల్క్ కాపాడెను.

e) 1740 లో తన కుమారుడు నాజర్ జంగ్ చేసిన తిరుగుబాటును చాకచక్యంగా అణిచివేసి అతనిని క్షమించెను.

f) సర్కార్, కర్నూల్, ఆర్కాట్ పాలెగాండ్లను తన ఆధీనంలోకి తెచ్చుకొనెను.

మహారాష్ట్రుల దాడుల నుండి తన రాజ్యమును కాపాడుకొనుటకై తూర్పుతీరంలో వ్యాపార కేంద్రాలు నెలకొల్పుతున్న ఫ్రెంచివారితోను, ఆంగ్లేయులతోను వైరుధ్యము వహింపక స్నేహ హస్తమందించాడు. అతని మరణం నాటికి నిజాం రాజ్యం ఉత్తరమున తపతీ నది నుండి దక్షిణమున తిరుచునాపల్లి వరకు, పశ్చిమాన ఔరంగాబాద్ నుండి తూర్పున బంగాళాఖాతం వరకు విస్తరించింది.

ఘనత: ఇతడు గొప్ప రాజనీతిజ్ఞుడు. పరిపాలనాదక్షుడు. అసఫీ కళాపోషకుడు. అతని రాజధాని ఔరంగాబాద్ పదిలక్షల జనాభాతో వర్థిల్లుచుండెను. అది కవి పండితులకు నిలయమై ఉండెను. నిజాం ఉల్ ముల్క్ నిరాడంబరముగా జీవించెడివాడు. దర్బారుకు హాజరగు సమయంలో తప్ప ఎటువంటి ఆభరణములు ధరించేవాడుకాదు. అతడు గొప్ప వితరణ శీలి. గొప్పదాన ధర్మములు చేసేవాడు. మత గురువులను గౌరవంగా ఆదరించేవాడు. డా॥ యూసఫ్ హుస్సేన్ ఇలా వ్రాశాడు. “భారతదేశంలో 18వ శతాబ్ది ప్రథమార్థ భాగమున తన రాజకీయ లక్ష్యములను సఫలీకృతం చేసుకున్న రాజనీతిజ్ఞుడు ఇతడొక్కడే. ఇతడు జన్మతః రాజకీయ లక్షణాలు కలవాడు. గొప్ప యోధుడు. పరిపాలనా దక్షుడు”.

ప్రశ్న 10.
నిజాం-అలీ-ఖాన్ విజయాలు
జవాబు:
నిజాం-ఉల్-ముల్క్ వారసుల్లో నిజాం-ఆలీ ఖాన్ (క్రీ.శ. 1762-1803),నిజాం-సికందర్ (క్రీ.శ. 1803- 1829), నాసిరుద్దాలా (క్రీ.శ. 1829-1857), ఆఫ్ఘలుద్దాలా (క్రీ.శ. 1857-1869), ఆరవ నిజాం మీర్ మహబూబ్ ఆలీఖాన్ (క్రీ.శ. 1869-1911), 7వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ (క్రీ.శ. 1911-సెప్టెంబర్ 1948) ప్రముఖులు. వీరి సుదీర్ఘ పాలనలో తెలంగాణా ప్రాంతం దేశ, విదేశాల దృష్టిని ఆకర్షించింది. హైద్రాబాద్ నగరం ప్రపంచ ఖ్యాతి గడించింది. ఉత్తర, మధ్య, పశ్చిమ భారతదేశంలోని అత్యధిక భూభాగాలపై ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారం నెలకొల్పడమైంది. దక్కన్లో జరిగిన ఆంగ్లో-కర్ణాటక, ఆంగ్లో-మరాఠా యుద్దాల్లో హైద్రాబాద్ నిజాంలు కీలకపాత్ర పోషించారు. ఫ్రెంచి వారితో వీరి స్నేహం కొన్ని అద్భుత విజయాలు చేకూర్చింది. కాని క్రీ.శ. 1768లో నిజాం-ఆలీ- ఖాన్ లార్డ్ వెల్లస్లీ రూపొందించిన సైన్యసహకార ఒప్పందం అంగీకరించాడు. దీంతో నిజాం తన స్వతంత్ర అధికారాలను కొంతమేరకు కోల్పోయాడు. మరాఠాల దాడుల నుంచి, ఇతర శత్రువుల దాడుల నుంచి తన రాజ్యాన్ని, అధికారాన్ని కాపాడుకోవడానికి నిజాం ఈ ఒప్పందంలో చేరాడు. దీని ప్రకారం హైద్రాబాద్ నగరంలో బ్రిటిష్ సేనలు నిల్పారు. వాటికి అయ్యే ఖర్చులన్నీ చెల్లించడానికి నిజాం అంగీకరించాడు. నిజాం-ఆలీఖాన్ నగదు చెల్లించలేని పక్షంలో సారవంత భూములను ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ధారదత్తం చేయడానికి సిద్ధమయ్యాడు. ఇతని వారసులైన సికందర్ , నాసిరుద్దాలా, అఫ్టలుద్దాలా ఈ సంధి షరతులు అమలుచేశారు. దీంతో కోశాగారంపై అదనపు భారం పడింది. నిజాం· బ్రిటీష్ స్నేహం క్రీ.శ. 1948 వరకు కొనసాగింది. ఆసఫ్జాహీల ప్రధానమంత్రిగా క్రీ.శ. 1853 -1883 మధ్య కాలంలో బాధ్యతలు నిర్వహించిన మొదటి సాలార్జంగ్ ప్రజా సంక్షేమానికై అనేక మహోన్నత సంస్కరణలు ప్రవేశపెట్టాడు. అతడి భూమిశిస్తు, విద్యా, న్యాయ సంస్కరణలు ప్రజలకు మేలుచేశాయి.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

ప్రశ్న 11.
ఉస్మాన్ అలీ-ఖాన్ విజయాలు
జవాబు:
నిజాం ప్రభువులలో ఆఖరివాడు ఉస్మాన్ అలీఖాన్. ఇతని పాలనాకాలంలో రెండు ప్రపంచ యుద్ధములు, భారత స్వాతంత్ర్యము, హైద్రాబాద్ పై పోలీసు చర్య, సంస్థానం ఇండియన్ యూనియన్ లో విలీనం వంటి అనేక సంఘటనలు జరిగెను. ఇతని కాలమున నిజాం రాజ్యము సర్వతోముఖాభివృద్ధి చెందెను. ఇతడు అనేక పరిపాలన చర్యలు తీసుకొనెను.

  1. ప్రభుత్వ కార్యాలయములలో అనేకమంది సిబ్బందిని నియమించి ప్రభుత్వ కార్యక్రమములు త్వరితగతిన జరుగునట్లు చేసెను.
  2. రాష్ట్రాదాయము క్రమబద్దము చేసి అనేక ప్రణాళికలను తయారుచేసెను. ఉస్మాన్సాగర్ నిర్మాణం జరిపినది ఇతడే.
  3. వ్యవసాయాభివృద్ధికి హిమాయత్ సాగర్, నిజాంసాగర్లను నిర్మించెను.
  4. అనేక దేశీయ పరిశ్రమలు స్థాపించబడెను. వాటిలో అజాంజాహి మిక్స్, చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ మొదలగునవి.
  5. ఇతడు అనేక ప్రజాసంబంధ నిర్మాణములు, విద్యాలయములు, వైద్యాలయములు నెలకొల్పెను.
  6. సాలార్జంగ్ ప్రారంభించిన పారిశ్రామిక వస్తు ప్రదర్శన క్రమబద్ధంచేసి కొనసాగించెను.
  7. స్థానిక కేంద్రాలలో అనేక కార్యాలయములు నిర్మాణం జరిపెను.
  8. పురాతత్వ శాఖను రూపొందించెను.
  9. నిజాం స్టేట్ రైల్వేను స్థాపించెను.
  10. మొదటి ప్రపంచ కాలమందు బ్రిటిష్ వారికి అన్నిరకాల సహకారమందించి “మహాఘనత వహించిన” అను బిరుదు ధరించెను.

అస్తమయం: 1948 సెప్టెంబర్ రజాకార్ల అలజడులు నైజాం ప్రాంతంలో ఎక్కువైనాయి. ఫలితంగా భారత ప్రభుత్వం పోలీసు చర్య కలిపి సంస్థానమును ఆక్రమించెను. చివరకు 1950 జనవరి 26న హైదరాబాదు సంస్థానము ఇండియన్ యూనియన్లో కలిసిపోయెను.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కాకతీయుల శాసనాలు
జవాబు:

  1. మొదటిసారిగా క్రీ.శ. 956వ సం|| నాటి తూర్పు చాళుక్య రాజు దానార్ణవుని ‘మాగల్లు శాసనం’ కాకత్య గుండ్యన పేరు ప్రస్తావించింది. ఇతడే కాకతీయవంశ మూలపురుషుడు.
  2. హనుమకొండలోని వేయిస్తంభాల గుడి శాసనము రుద్రదేవుడు స్వతంత్ర్యాన్ని ప్రకటించుకొన్న విషయాన్ని అతని విజయాలను తెలివేస్తుంది.
  3. కాకతీయ ప్రభువులు, వారి బంధువులు, సేనాపతులు వేయించినారు.
  4. బయ్యారం శాసనము దీనిని గణపతిదేవుని సోదరి మైలాంబ వేయించింది.
  5. పాలంపేట శాసనం, ద్రాక్షారామం శాసనము, చందుపట్ల శాసనము మొదలగునవి.

ప్రశ్న 2.
మార్కోపోలో
జవాబు:
మార్కోపోలో వెనిస్ యాత్రికుడు. కాకతీయ రుద్రమదేవి కాలంలో ఇతడు ఆంధ్రదేశాన్ని సందర్శించాడు. రుద్రమదేవి ఆంధ్రదేశాన్ని సమర్థవంతంగా పాలించిందని, ఆమె పరిపాలనా వ్యవస్థ ఆదర్శవంతంగా సాగిందని మార్కోపోలో పేర్కొన్నాడు. కాకతీయ రాజ్యములో పారిశ్రామికాభివృద్ధి జరుగుతున్నదని, గోల్కొండ ప్రాంతంలో ప్రజల పరిశ్రమ అభివృద్ధిలో ఉన్నదని, ప్రజలు అప్లైశ్వర్యాలతో తులతూగుచుండేవారని కూడా పేర్కొన్నాడు.

ప్రశ్న 3.
నాయంకర వ్యవస్థ
జవాబు:
కాకతీయులు తమ రాజ్యంలోని భూములను సైనికాధికారులకు పంచిపెట్టారు. వారిని నాయంకరులు అంటారు. వారికిచ్చిన భూమిని నాయకస్థలం లేదా నాయకస్థలవృత్తి అనేవారు. నాయంకర భూములను తీసుకున్న సైనికాధికారులు కొంత సైన్యాన్ని పోషించి రాజుకు అవసర సందర్భాలలో సరఫరా చేయాలి. ఈ పద్ధతి ముస్లిమ్ల జాగీర్దార్ పద్ధతిని పోలి ఉంటుంది. ప్రతాపరుద్రుని కాలంలో 77 మంది నాయంకర్లు ఉండేవారని తెలుస్తున్నది.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

ప్రశ్న 4.
పాలంపేట
జవాబు:
రేచర్ల రుద్రుడు పాలంపేటలో ఒక గొప్ప దేవాలయమును నిర్మించెను. ఈ దేవాలయం రూపశిల్పి ‘రామప్ప’. అందుచే దీనికి ‘రామప్ప దేవాలయం’ అని పేరు వచ్చింది. ఈ దేవాలయాలు కాకతీయ శిల్పకళకు పరాకాష్టకు చేరుకున్నాయి. రామప్ప దేవాలయంలో నంది విశిష్టమైనది. రామప్ప గోపుర నిర్మాణంలో ఉపయోగించిన ఇటుకలు నీటిలో వేస్తే ఆకులవలె తేలడం ఒక అద్భుతం.

 

ప్రశ్న 5.
విజయనగర కాలంలో రాష్ట్రపాలన
జవాబు:
పరిపాలన సౌలభ్యం కోసం సువిశాల విజయనగర సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. రాష్ట్రాన్ని రాజ్యమని వ్యవహరించారు. తంజావూర్, మధుర, ఇక్కేరి, చంద్రగిరి, శ్రీశైలం, కొండవీడు మొదలైనవి ముఖ్య రాజ్యాలు. ఈ రాజ్యాధిపతులు ఇంచుమించు స్వతంత్రంగానే వ్యవహరించారు.

రాష్ట్రంలో సీమలు, స్థలాలు, సమితులు, గ్రామాలు పాలన విభాగాలు. సీమకు పారుపత్యగారు, స్థలం మీద గౌడ, కరణం అధికార్లు. గ్రామంలో రెడ్డి, కరణం, తలారి మొదలైన వారుండేవారు.

ప్రశ్న 6.
బహమనీ రాజ్యస్థాపన
జవాబు:
మహమ్మద్ బీన్ తుగ్లక్ మీద జరిగిన అనేకమైన తిరుగుబాట్లలో ఒకదాని పరిణామమే, బహమనీ రాజ్యస్థాపన. ఈ తిరుగుబాటును దక్కన్ ప్రాంతాల్లో శిస్తు వసూలు చేసే ఉద్యోగులు జరిపారు. వీరినే ‘సాదాఅమీర్లు’ అనేవారు. వీరు గుజరాత్, దౌలతాబాద్ ప్రాంతాల్లో జిల్లా ఉద్యోగులుగా ఉండే విదేశీ ప్రభు కుటుంబాలవారు. తుగ్లక్ కాలంలో పన్నులు సరిగా వసూలుకానందున, అమీర్లను అదుపులో ఉంచడం కోసం, షిక్టార్లకు ఆజ్ఞలను జారీచేశాడు. అమీర్లలో భయాందోళనలు పుట్టి, వారంతా ఏకమై సుల్తాన్పై తిరగబడ్డారు. వారికి సమర్థుడైన ‘హసన్ గంగూ’ అనే జాఫరాఖాన్ నాయకుడిగా దొరికాడు. గుల్బర్గాను రాజధానిగా చేసుకొని, క్రీ.శ. 1347లో హసన్ గంగూ బహమన్షాను అమీర్లందరూ సుల్తాన్ గా ఎన్నుకోగా, బహమనీ రాజ్యస్థాపన జరిగింది. ‘బహమన్’ చేత ఏర్పాటు చేయబడ్డ సామ్రాజ్యం కాబట్టి, బహమనీ సామ్రాజ్యమని దీనికి పేరు వచ్చిందని చరిత్రకారులు అభిప్రాయం. ఈ వంశంలో మొత్తం 18 మంది సుల్తాన్లు పరిపాలించారు.

ప్రశ్న 7.
మహ్మద్ గవాన్
జవాబు:
గవాన్ పారశీక ప్రభు కుటుంబంలో క్రీ.శ. 1404లో జన్మించాడు. మాతృదేశాన్ని విడిచి, వర్తకం చేసుకుంటూ, 1447లో బీదర్ చేరాడు. రెండో అల్లావుద్దీన్ కొలువులో ఉద్యోగంలో చేరాడు. తెలంగాణా తరల్దార్ తిరుగుబాటు చేయగా, అతనిని బాలకొండ యుద్ధంలో ఓడించి, సుల్తాన్ అభిమానాన్ని పొందాడు. గవాన్ రాజనీతి, యుద్ధనైపుణ్యం ప్రశంసలందుకొన్నాయి. అతని శక్తి సామర్థ్యాలను, సేవలను గుర్తించి మహమ్మదా అతణ్ణి ప్రధానమంత్రిగా నియమించాడు.

అధికారంలోకి వచ్చిన వెంటనే, గవాన్ విజయయాత్రలను జరిపి బహమనీ రాజ్యవిస్తరణకు పూనుకున్నాడు. మాళవ, గోవా, తెలంగాణ, రాజమహేంద్రవరం, కొండవీడు ప్రాంతాలను ఆక్రమించాడు. ఈ సందర్భంలోనే క్రీ.శ.1481లో గవాన్ తీరం వెంబడి కాంచీపురం వరకు దాడి చేశాడు. మార్గమధ్యంలో ఆలయాలను కొల్లగొట్టి అపార ధనరాసులతో తిరిగొచ్చాడు. ఈ విజయాలతో బహమనీ రాజ్యం తపతీ నది నుంచి తుంగభద్రనది వరకు, ఉభయ సముద్రాల మధ్య విస్తరించింది. రాజ్యవిస్తరణ కార్యక్రమంలో ఉన్నప్పుడే గవాన్ ప్రభుత్వాన్ని పటిష్టం చేసే సంకల్పంతో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టాడు.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

ప్రశ్న 8.
మీర్ మహబూబ్ అలీ కాలంలో విద్యాభివృద్ధి
జవాబు:
ఇతడు వైద్యాలయములు, విద్యాలయములు స్థాపించెను. సిటీ కళాశాల ఉస్మానియా వైద్యాలయము, యునాని వైద్యాలయములు స్థాపించెను. మ్యూజియము, జూబ్లీహాలు నిర్మింపబడెను. విద్యావ్యాప్తికి ఇతడు అనేక ప్రాంతాలలో పాఠశాలలు నిర్మించెను.

AP Inter 1st Year History Study Material Chapter 8 మొగలుల యుగం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 8th Lesson మొగలుల యుగం Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 8th Lesson మొగలుల యుగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మొగల్’ చరిత్ర రచనకు ఉపయోగపడే ఆధారాలను వివరించండి.
జవాబు:
మొగల్ అను పదము ఒక వంశనామము. ఇది ‘మంగోల్’ అను పదము నుండి వచ్చింది. మంగోల్ అనే పదం నుండి మొగల్ అనే పదము రూపొందుటకు కారణమేమనగా మొగలులు మన దేశాన్ని పాలించే రోజుల్లో ఐరోపావారు వ్యాపార నిమిత్తం వచ్చి మొగల్ దర్బార్ను సందర్శించిరి. వారి సహజ నామమైన మంగోల్ అనే పదం వారివారి భాషలలో వేరువేరు రూపాలుగా పేర్కొనబడెను.

మొగల్ చరిత్రను తెలుసుకొనుటకు గల ఆధారాలు: భారతదేశ చరిత్రలో మొగలు చరిత్రకు అమిత ప్రాధాన్యత కలదు. ఈ చరిత్రకున్న ఆధారాలు ఏ చరిత్రకు లేవు. ఇందుకు కారణములు ఏమనగా,

  1. మొగల్ చక్రవర్తులలో అనేకులు సాహితీవేత్తలగుట వలన
  2. చక్రవర్తులు కవులను, పండితులను పోషించుట
  3. చక్రవర్తుల ఫర్మానాలు, ప్రభుత్వ ఆజ్ఞాపనా పత్రాలు
  4. యాత్రికులుగా భారతన్ను సందర్శించిన పెక్కు విదేశీ రచనలు.

మొగల్ చరిత్రకు లభ్యమగు ఆధారములను మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి ఏమనగా,

  1. వాఙ్మయ ఆధారములు
  2. పురావస్తు ఆధారములు
  3. విదేశీ రచనలు

1. వాఙ్మయ ఆధారములు:
A) బాబరు హుమాయూన్ల కాలము:
తుజు – క్ – ఇ · బాబురి: మొగల్ యుగమున వ్రాయబడిన తొలి చారిత్రక గ్రంథము. బాబరు టర్కీ భాషలో రాసిన స్వీయచరిత్ర’, ‘తుజు-క్-ఇ-బాబురి’ ద్వారా బాబర్ కాలమునకు, హుమాయూన్ కాలమునకు తొలి జీవిత విశేషాలు తెలుస్తున్నవి.

తారీఖ్-ఇ-రషీది: దీనిని బాబరు బంధువగు ‘మీర్జా మహమ్మద్ హైదర్ దుఘాత్’ రాసెను. ఇందు బాబర్ దిగ్విజయములు, షేర్షా – హుమాయూన్ల సంఘర్షణ – కాశ్మీర్ చరిత్ర వర్ణించబడెను.

AP Inter 1st Year History Study Material Chapter 8 మొగలుల యుగం

హబీబ్-ఉన్-సియర్: దీనిని ‘ఖ్వాందాహర్ అమీర్’ వ్రాసెను. బాబరు గురించి హుమాయూన్ మొదటి మూడు సం॥ల పాలన గురించి వ్రాయబడెను.

తారీఖ్-ఇ-షాహి: దీనిని ‘అహ్మద్ యాద్గర్’ వ్రాసెను. ఇందు ఆఫ్ఘనులు, బాబరు, హుమాయూన్లతో పోరాడి, తిరిగి అధికారము పొందిన విధము తెలుస్తున్నది.

షైబానీ నామ: దీనిని ‘మహమ్మద్ పాలిప్’ రాసెను. ఇందు బాబర్కు, ఉజ్జెక్ పాలకుల మధ్యగల సంబంధాలు వర్ణింపబడినవి.

హుమాయూన్ నామ: దీనిని బాబరు కుమార్తెయగు “గుల్బదన్ బేగమ్” రాసెను. ఇందు బాబరు, హుమాయూన్లు తమ బంధుమిత్రులతో వ్యవహరించిన తీరు, వారి మనోభావములు వర్ణింపబడెను.

ఇంకను హుమాయూన్ గూర్చి తెలుసుకొనుటకు తారీఖ్-ఇ-హుమాయూన్, కానూన్-ఇ-హుమాయూన్ మొదలగు రచనలు తోడ్పడుచున్నవి. షేర్షాను గూర్చి తెలుసుకొనుటకు ‘అబ్బాష్వేణి’ రాసిన తారీఖ్-ఇ-షేర్షా ముఖ్యమైనది.

B) అక్బరు కాలము:
తారీఖ్-ఇ-అక్బరు షాహి: దీనిని అక్బరు రెవెన్యూశాఖ ఉద్యోగియైన హజీమహమ్మద్ ఆరిఫ్ కందాహరే వ్రాసెను. ఇందు అక్బరు వ్యక్తిత్వము, అతని పరిపాలనా విస్తరణ ఉంది.
అక్బరు నామ, ఐనీ- అక్బరీ: ఈ రెండు గ్రంథములను అక్బరు ఆస్థాన పండితుడు, అతని మిత్రుడగు ‘అబుల్ ఫజల్’ వ్రాసెను. మొగల్ చరిత్ర ఆధారములలో ఈ గ్రంథములు తలమానికవంటివి.

తబ్కాత్-ఇ-అక్బరీ: ఇది ఒక సామాన్య చారిత్రక గ్రంథము. దీనిని ‘మీర్ బక్షీ ఖ్వాజీ నిజాముద్దీన్” రాసెను. ఇందు మూడు సంపుటములు కలవు. ఇందు ఢిల్లీ సుల్తానత్ యుగము, బాబరు, హుమాయూన్, అక్బర్ పాలనా కాలము, ప్రాంతీయ రాజ్యాల చరిత్ర వివరించబడెను.

C) జహంగీర్ పాలనా కాలము:
తారీఖ్-ఇ-ఫెరిస్టా: దీనిని “మహమ్మద్ ఖాసిం ఫెరిస్టా” రాసెను. ఇందు జహంగీర్ సింహాసనం అధిష్టించు వరకు భారతదేశ ముస్లిం పాలనను గూర్చి మరియు దక్కను సుల్తానుల గురించి వర్ణించెను.

తుజుక్-ఇ-జహంగీర్: ఇది జహంగీర్ స్వీయచరిత్ర. జహంగీర్ వ్యక్తిత్వము, అతని పాలనా విశేషాలు తెలుసుకొనుటకు ఇది ఒక అమూల్యమైన గ్రంథము.
ముతమిధాఖాన్ రచించిన ‘ఇక్బాల్ నామా’
మహ్మదాలీ రాసిన ‘వాకిఆత్-జహంగరీ’
ఖ్వాజానియామతుల్లా రాసిన ‘తారీఖ్-ఇ-ఖాన్-జహనీ’
మొదలగు ఇతర రచనలు కూడా జహంగీరు కాలమునకు సంబంధించినవే.

D) షాజహాన్ కాలము:
షాజహాన్ ఆస్థానమును అలంకరించిన జగన్నాథ పండితుడు, జనార్థనభట్టు రచనలు, అబ్దుల్ హమీద్ లహరి రాసిన ‘బాదుషానామ’, మహమ్మద్ సలీ గ్రంథమగు ‘అమల్-ఇ-సాలీ’, ఇనాయత్ ఖాన్, మహమ్మద్ సాదిక్ల షాజహాన్నామా మొదలగునవి షాజహాన్ కాలమునకు సంబంధించిన రచనలు.

E) ఔరంగజేబు కాలము:
ఔరంగజేబు చరిత్ర రచనను నిషేదించిననూ అతని కాలమున పెక్కు చారిత్రక గ్రంథములు వెలువడుట అబ్బురము. అందు ముఖ్యమైనవి ‘ఆలంఘీర్ నామ’ దీనిని మీర్జా మహ్మద్ ఖాన్ రాసెను. ఇందు ఔరంగజేబు తొలి పది సంవత్సరాల పాలనా కాలము వర్ణించబడెను.

“మ అనిర్-ఇ-అలంఘ” దీనిని మహ్మద్ సాకే ముస్తయిద్’ వ్రాసెను. హకిరీ రాసిన ‘ఔరంగజేబు నామ’ అకిలాన్ వ్రాసిన ‘జఫర్-నామ-ఇ-ఆలంఘీర్’, ఔరంగజేబు రాసిన “ఫత్వా-ఇ-ఆలంఘీర్’ మొదలగు గ్రంథాలు ఔరంగజేబు కాలమునకు చెందినాయి.

2. పురావస్తు ఆధారములు:
A) శాసనములు: మొగల్ చక్రవర్తులు శాసనములను పెద్దగా వేయించలేదు. వేయించిన కొద్ది శాసనాలు వారి చరిత్రకు ప్రామాణికముగా ఉపయోగపడగలవు.

B) నాణెములు: మొగల్ చక్రవర్తులు ముద్రించిన నాణెములు చరిత్ర రచనకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. జహంగీర్, నూర్జహాన్ నాణెములు నాటి ఆర్థిక పరిస్థితులను తెలుసుకొనుటకు ఉపయోగపడుచున్నవి.

C) భవన నిర్మాణము: మొగల్ చక్రవర్తులు నిర్మించిన అసంఖ్యాక కట్టడములు వారి కళాపోషణకు నిదర్శనము. అట్టి వానిలో ముఖ్యమైనవి ఆగ్రా కోట, ఎర్ర కోట, ఫతేపూర్ సిక్రీ, తాజ్మహల్, మయూర సింహాసనము మొదలగునవి.

3. విదేశీ రచనలు: మొగల్ యుగమున పెక్కు విదేశీవాసులు భారతదేశమును సందర్శించి తమ అనుభవాలను, నాటి కాల పరిస్థితులను తమ రచనలలో వర్ణించిరి.

A) ఆంగ్లేయులు: రాల్ఫ్ ఫిష్, జాన్ మిల్టన్ హర్, విలియం హాకిన్స్, విలియం ఫించ్, ఎడ్వర్డ్ టెర్రీ, సర్ థామస్ రో రచనలు జహంగీరు కాలమునకు ఆంగ్ల వర్తక కేంద్రస్థాపనా చరిత్రకు అమూల్యమైన ఆధారములు.

B) ఫ్రెంచి, బార్నియర్, టావెర్నియర్, థీవెనాన్: ఈ సందర్భంగా ఔరంగజేబు కాలంలో వచ్చిన జెర్నియార్ అనే ఫ్రెంచ్ యాత్రికుడు ఫ్రెంచ్ భాషలో వ్రాసిన మొగల్ సామ్రాజ్యంలో యాత్రలు అనునది ముఖ్యమైనదిగా పేర్కొనవచ్చు. ఇట్లు స్వదేశీయ, విదేశీయ రచనల్లో పెక్కు చారిత్రకాంశములు మొగల్ చరిత్రకు ఆధారములుగా ప్రకాశించుచున్నవి.

ప్రశ్న 2.
మొగల్ పరిపాలనలోని ప్రధాన అంశాలను తెలపండి.
జవాబు:
మొగల్ పాలనా వ్యవస్థకు రూపకల్పన చేసినవాడు అక్బర్. అక్బర్కు ప్రభుత్వ విధానాల్లో షేర్షా కొంతవరకు మార్గదర్శి. షేర్షా విధానాలను మెరుగుపరచి, కొత్త విధానాలను ప్రవేశపెట్టి, సమర్థవంతమైన పాలకునిగా అక్బర్ చక్రవర్తి మొగల్ చరిత్రలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు.

కేంద్ర ప్రభుత్వం: మొగల్ పరిపాలనా యంత్రాంగానికి చక్రవర్తి సర్వాధికారి. అధికారాలన్నీ అతడి చేతిలో కేంద్రీకృతమై ఉంటాయి. మొగల్ చక్రవర్తి ప్రాజ్ఞ నిరంకుశ ప్రభువు. “నా కింది ఉద్యోగులు నిర్వహించాల్సిన బాధ్యతలను నేను నిర్వహించనవసరం లేదు. పాలకుడు కింది ఉద్యోగులు తప్పులను దిద్దుకుంటూపోతూ తాను చేసే తప్పులను నివారించుకుంటే సరిపోతుంది” అని అక్బర్ చెప్పుకున్నాడు. ప్రభుత్వంలో చక్రవర్తికి (పాదుషాకు) సలహాలిచ్చేందుకు నలుగురు మంత్రులున్నారు. వారు:

1) వకీల్ లేక వకీల్-ఇ-ముత్లాక్ లేక ప్రధానమంత్రి: ఇతడు చక్రవర్తికి ముఖ్య సలహాదారు. అన్ని శాఖలను పర్యవేక్షిస్తాడు.

2) దివాన్ లేక వజీర్ లేక ఆర్థికమంత్రి: ఇతడు సామ్రాజ్య ఆర్థిక వనరులను పర్యవేక్షించేవాడు. భూమిశిస్తు ఇతర పన్నుల వసూలు, సామ్రాజ్య ఖర్చులు ఇతని పర్యవేక్షణలో ఉండేవి.

3) మీరక్షీ: ఇతడు యుద్ధ మంత్రి. పెద్ద ఉద్యోగులకు జీతాలను కూడా బట్వాడా చేసేవాడు. మన్సబార్ల పేర్లు, వారి హోదాలు, వారి జీతాలు ఇతడు నమోదు చేసుకొనేవాడు. రాజప్రాసాద రక్షణ నిమిత్తం గస్తీ ఉద్యోగులను నియమించేవాడు. రాష్ట్రాలలో వార్తాహరులను, గూఢచారులను నియమించటం కూడా ఇతని విధి.

4) సదర్-ఉస్-సదర్: మత విషయాలలో చక్రవర్తికి సలహాలివ్వడం, చక్రవర్తి దానధర్మాలను పర్యవేక్షించటం, ముఖ్య న్యాయాధీశునిగా వ్యవహరించటం ఇతడి విధులు.

రాష్ట్ర ప్రభుత్వం: పరిపాలనా సౌలభ్యం కొరకు మొగల్ సామ్రాజ్యం సుబాలుగా విభజింపబడింది. అక్బర్ కాలంలో దాదాపు 15 సుబాలుండేవి. ఒక రకంగా వీటిని రాష్ట్రాలుగా పరిగణించవచ్చు. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ, కేంద్ర పాలనావ్యవస్థకు ప్రతిరూపం లేక ప్రతీక అని చెప్పవచ్చు. సుబాను పాలించే అధికారి సుబేదార్. సుబాలో శాంతి భద్రతలు కాపాడే బాధ్యతను సుబేదార్ నిర్వహిస్తాడు. దివాన్, భక్షి, సదర్, ఖాజీ అను అధికారులు కూడా రాష్ట్రపాలనా నిర్వహణలో బాధ్యత స్వీకరిస్తారు. వారి విధులు కేంద్ర ప్రభుత్వంలో అదే పేరుగల అధికారుల విధులను పోలి ఉంటాయి.

ప్రధాన నగరాలలో న్యాయ వ్యవహారాలను చూసేందుకు కొత్వాలు అనే ఉద్యోగి ఉండేవాడు. అతడు నగరాలలో శాంతి భద్రతలను కాపాడేవాడు. ప్రభుత్వ ఆజ్ఞలను అమలు పరిచేవాడు. విదేశీయుల కార్యకలాపాలను గమనించేవాడు. సర్కారు పాలన: “సుబాలు” సర్కారులుగా విభజింపబడ్డాయి. సర్కార్లను నేటి జిల్లాలతో పోల్చవచ్చు. సర్కార్లను పాలించడానికి ఈ క్రింది అధికార్లు ఉంటారు.

  • ఫౌజార్: ఇతడు సర్కారు అధిపతి, సైనికాధికారి, తిరుగుబాట్లను అణచివేసి రెవిన్యూ అధికారులకు సహాయం చేయడం ఇతని ముఖ్య విధులు.
  • అమల్ గుజార్: ఇతడు రెవిన్యూ శాఖాధిపతి. భూమిశిస్తు వసూలు చేయడం, ఋణాలను మంజూరు చేయడం ఇతని ముఖ్య విధులు.
  • ఖజానాదార్: ఇతడు కోశాధికారి. వసూలైన భూమిశిస్తును ఖజానాలో భద్రపరచి కేంద్రానికి జాగ్రత్తగా పంపడం ఇతని విధి.
  • బిలక్సీ: ఇతడు భూములకు, భూమిశిస్తులకు సంబంధించిన వివరాలను తయారుచేస్తాడు.

AP Inter 1st Year History Study Material Chapter 8 మొగలుల యుగం

పరగణా పాలన: సర్కార్లు పరగణాలుగా విభజింపబడ్డాయి. ఈ క్రింది అధికారులు పరగణాల యొక్క పరిపాలనను నిర్వహించేవారు.

  • షికార్: ఇతడు పరగణా యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారి. ఇతడు కూడా సైనికాధికారియే. పరగణా యొక్క శాంతిభద్రతలను పర్యవేక్షిస్తాడు.
  • అమీన్: ఇతడు రెవిన్యూ ఉద్యోగి. భూమిశిస్తు విషయాలను నిర్వహిస్తాడు.
  • కానుంగో: పట్వారీలపై అధికారి. ఇతడు భూములకు సంబంధించిన వివరాలను తయారుచేస్తాడు.
  • పోద్దార్: ఇతడు పరిగణా యొక్క కోశాధికారి.

గ్రామ పాలన: పరగణాలు గ్రామాలుగా విభజింపబడ్డాయి. గ్రామం పరిపాలనా వ్యవస్థలో తుది అంశము. ముఖద్దమ్, పట్వారీలు గ్రామాధికారులు. ముఖద్దమ్ శాంతిని పర్యవేక్షిస్తాడు. పట్వారీ భూమిశిస్తు వివరాలను తయారు చేస్తాడు. గ్రామాలలో పంచాయితీ విధానం అమలులో ఉండేది. పంచాయితీలు న్యాయనిర్వహణ బాధ్యతలను నిర్వహించేవి.

సైనికపాలన: మొగల్ చక్రవర్తులు సమర్థవంతమైన సైన్యమును పోషించిరి. వీరి సైనిక విధానమును ‘మన్సబారీ’ విధానమందురు. ‘మన్సబ్’ అంటే ‘హోదా’ లేదా ‘ఉద్యోగం’ అని అర్థం. ఒక విధముగా ఢిల్లీ సుల్తానుల జాగీర్దార్ విధానం వంటిది.

ఆర్థిక విధానం: మొగలుల ఆర్థిక విధానం సమర్థవంతమైనది. ఖరాజ్, ఖమ్స్, జకాత్, జిజియా అనే నాలుగు రకాల పన్నులు వసూలు చేసిరి.

భూమిశిస్తు విధానం: మొగలుల భూమిశిస్తు విధానానికి పూర్తి రూపాన్ని కల్గించినవారు అక్బర్ మరియు ఆయన రెవిన్యూ మంత్రి రాజాతోడరమల్. మొగలుల భూమిశిస్తు విధానంను ‘బందోబస్త్’ విధానమందురు.

న్యాయపాలన: చక్రవర్తితో కూడిన న్యాయమండలి మొగల్ రాజ్యంలో అత్యున్నత న్యాయస్థానం. అతి ముఖ్యమైన వివాదాలను ఈ న్యాయస్థానమే పరిష్కరించేది. చక్రవర్తియే ఉన్నత న్యాయాధీశుడు. ఉద్యోగులలో ప్రధాన ఖాజీ ఉన్నత న్యాయాధికారి. అతడు దిగువ న్యాయస్థానాల యొక్క న్యాయాధిపతులను నియమించేవాడు. ఆ న్యాయస్థానాల నుండి వచ్చే అప్పీళ్లను కూడా ప్రధాన ఖాజీ విచారించేవాడు. చీఫ్ సదర్ మత వివాదాలను పరిష్కరించేవాడు. రాష్ట్రాలలో (సుబాలలో) సదర్ క్రిమినల్ కేసులను, దివాన్ రెవిన్యూ వివాదాలను, ఖాజీ సివిల్ కేసులను పరిష్కరించేవారు. సర్కార్లలో ఫౌజ్దార్లు, ఖాజీలు, పరగణాలలో షికార్లు, అమీన్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించేవారు. గ్రామస్థాయిలో గ్రామ పంచాయితీలు నేర విచారణ చేసేవి.

ముగింపు: మొగలుల పాలనా విధానము ఉదారమైనది, సమర్థవంతమైనది. ప్రజాక్షేమాన్ని కాంక్షించేది. మహమ్మదీయుల పరిపాలనా వ్యవస్థ మొదటిసారిగా మొగలుల కాలంలోనే ఔన్నత్యాన్ని పొందింది.

ప్రశ్న 3.
మొగల్ సామ్రాజ్య పతనానికి గల కారణాలు చర్చించండి.
జవాబు:
రాజ్య విస్తీర్ణత, సైనిక పటిష్టత, ఆర్థికాభివృద్ధి, సాంస్కృతికాభివృద్ధి వల్ల ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసిన మొగల్ సామ్రాజ్యం క్రీ.శ. 18వ శతాబ్దం ప్రారంభంలో విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది.

మొగల్ బాబర్ చేత స్థాపించబడి అక్బర్, జహంగీర్, షాజహాన్ పాలనల్లో దేదీప్యమానంగా వెలుగొందిన మొగల్ సామ్రాజ్యం ఔరంగజేబు రెండవ దశలోనూ, ఔరంగజేబు తరువాత పతనమైంది. ప్రసిద్ధ చరిత్రకారుడు వి.ఎ. స్మిత్ అన్నట్లు సామ్రాజ్యం అకస్మాత్తుగా పతనం కావడం ఆశ్చర్యం కలిగించవచ్చు. అయితే చరిత్రపై సాధారణ అవగాహన కలిగిన చరిత్ర విద్యార్థిగా గమనించినట్లయితే మొగల్ సామ్రాజ్యం అంత కాలం ఎలా ఉండగలిగింది అనే సందేహం కలగక మానదు”. కొంత మంది చరిత్రకారులు మొగల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబుని పూర్తి బాధ్యుడుగా పేర్కొంటే మరికొందరు చరిత్రకారులు ఇతర కారణాలతోపాటు ఔరంగజేబు కొంతమేరకు బాధ్యుడని పేర్కొన్నారు.

ఔరంగజేబు తన పరిపాలన చివరి ఇరవై ఐదు సంవత్సరాలు దక్కన్లో తన అధికారాన్ని శాశ్వతంగా నెలకొల్పాలన్న అతడంతో నిరంతర దాడులు చేశాడు. దక్కన్లోనే మకాం పెట్టాడు. పరిపాలనా వ్యవస్థను నిర్లక్ష్యం చేశాడు. దీని వల్ల భారతదేశంలో మొగల్ అధికారం బలహీనమైంది.

ఔరంగజేబు తరువాత సింహాసనాన్ని అధిష్టించిన మొగల్ పాలకులు అసమర్థులు. ఔరంగజేబు కాలంలో మొదలైన గల్ రాజ్య పతనాన్ని అడ్డుకొనే శక్తి సామర్థ్యాలు వారికి లేవు. వారు మొగల్ అధికారుల చేతుల్లోనే కాకుండా, సావారి చేతుల్లో కూడా కీలుబొమ్మలుగా వ్యవహరించేవారు. వారు సామ్రాజ్యం కంటే కూడా విలాసాలపట్ల మక్కువ ఈ బరిచేవారు. అంతేకాకుండా భారతదేశంలోని అధిక ప్రజలు మొగలులను విదేశీయులుగా భావించడం వల్ల మొగల్ జ్లలకు వారి మద్దతు లభించలేదు. హిందూ మతంలోలాగా మొగలుల్లో వారసత్వ చట్టం లేకపోవడం వల్ల సింహాసనం కోసం వారసత్వ యుద్ధాలు జరిగాయి. అవి మొగల్ రాజ్య పతనానికి దోహదం చేశాయి.

సమైక్యతకు, సామర్థ్యానికి, ప్రతీకగా నిలిచిన మొగల్ కులీనవర్గం సుల్తాన్ల అసమర్థత కారణంగా వివిధ కూటములుగా విడిపోయాయి. స్వార్థపరులుగా తయారయ్యారు. పర్షియన్ షియాలు, సంప్రదాయ సున్నీలు, హిందూస్థానీ మొదలైన కూటములుగా విడిపోయి ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పోరాటం చేయసాగారు.

మొగల్ సామ్రాజ్య పతనానికి అక్బర్ ప్రవేశపెట్టిన మనసబారీ విధానం ఒక కారణమైంది. మనసబారీ విధానం అక్బర్ కాలంలో మంచి ఫలితాలను ఇచ్చింది. అయితే అందులోని ప్రాథమిక లోపాల వల్ల ఈ విధానం భూస్వామ్య వ్యవస్థను పోలి సాధారణ సైనికుడు చక్రవర్తి కంటే కూడా మనసబారులపట్ల గౌరవం ప్రదర్శించేవారు. ఫలికంగా బైరాం ఖాన్, మహబత్ ఖాన్ వంటి వారు తిరుగుబాట్లు జరిపారు. వీటన్నింటివల్ల సైనిక పటిష్టత కోల్పోయింది. నీటన్నింటికి తోడు ఐరోపావారిని ఎదుర్కొనేందుకు నౌకాదళం పట్ల శ్రద్ధవహించకపోవడం కూడా మొగల్ పతనానికి కారణమైంది.

షాజహాన్ పాలనాకాలంలో వర్షాలు లేకపోవడం వల్ల, కరువుల వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ఔరంగజేబు కాలంలో పరిస్థితి మరింత అధికమైంది. అసమర్థులైన కడపటి, మొగలుల కాలంలో ఆర్థిక స్థితి మరింత దిగజారింది. వీటికి తోడు అగ్నికి ఆజ్యంతోడైనట్లు నాదిర్ షా, అహ్మద్ షా అబ్దాలీ దండయాత్రలు ఆర్థిక స్థితిని కోలుకోలేకుండా చేశాయి. ఈ దండయాత్రలు మొగల్ సైనిక బలహీనతను ప్రపంచానికి చాటిచెప్పాయి. దీంతో మొగల్ సుబేదారులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోసాగారు. హైదరాబాద్ నిజాం, బెంగాల్ ఆలీవర్దీఖాన్, ఔద్ సాదతాఖాన్లు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొన్నారు. ఈ విధంగా మొగల్ పాలకుల అసమర్థత, సమకాలీన రాజకీయ సంఘటనలు మొగల్ రాజ్య పతనానికి కారణాలయ్యాయి.

ప్రశ్న 4.
శివాజీ పరిపాలనపై ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
పరిపాలన: శివాజీ కృషితో స్వతంత్ర మహారాష్ట్ర రాజ్యం ఏర్పడింది. శివాజీ గొప్ప వీరుడు. సైనిక నాయకుడే కాకుండా గొప్ప పాలకుడిగా కూడా పేరు పొందాడు.
శివాజీ పాలన సమానత్వం, న్యాయం, సహనంలపై ఆధారపడి కొనసాగింది. శివాజీ తన రాజ్యానికి ‘స్వరాజ్యం’ అని పెట్టాడు. తన రాజ్యం పరిసర ప్రాంతాల నుంచి చౌత్, సర్దేశముఖి వంటి పన్నులను వసూలు చేశాడు.

శివాజీ కేంద్రీకృత పాలనావ్యవస్థను ఏర్పాటు చేశాడు. చక్రవర్తి అయిన శివాజీ సర్వాధికారి. అధికారులను గమించే, తొలగించే అధికారం శివాజీకి ఉండేది. శివాజీ తనకు పరిపాలనలో సహకరించేందుకు ఎనిమిది మంది సభ్యులు గల అష్టప్రధానులు అనే మంత్రిమండలిని ఏర్పాటుచేశాడు. మంత్రులకు వివిధ శాఖలను కేటాయించాడు
అష్ట ప్రధానులు:

  • పీష్వా: ప్రధానమంత్రి – సాధారణ పాలనా వ్యవహారాలను చూసేవాడు.
  • అమాత్య: ఆర్థిక మంత్రి – ఆదాయ వ్యయాలు, బడ్జెట్ చూసేవాడు.
  • మంత్రి: ఆంతరంగిక వ్యవహారాల మంత్రి.
  • సచివ: సమాచారశాఖ మంత్రి.
  • సుమంత్: విదేశీ వ్యవహారాల మంత్రి.
  • పండితరావు దానధర్మాలు, ధర్మాదాయం.
  • సేవాపతి: సర్వసైన్యాధ్యక్షుడు.
  • న్యాయాధీశుడు: అత్యున్నత న్యాయాధికారి.

కేవలం సామర్థ్యాన్ని బట్టి మాత్రమే మంత్రిమండలిలో స్థానం లభించేది. వంశపారంపర్య హక్కు ఉండేది కాదు. మంత్రులు, పాలనా వ్యవహారాలతో పాటు అవసరమైనప్పుడు సైనిక విధులను కూడా నిర్వహించేవారు.

పరిపాలనా విభాగాలు: పరిపాలనా సౌలభ్యం కోసం శివాజీ తన స్వరాజ్యంను నాలుగు రాష్ట్రాలుగా విభజించి దాని పాలనకు వైశ్రాయ్ లేదా గవర్నర్ను నియమించాడు. రాష్ట్రాలను తిరిగి జిల్లాలుగా విభజించాడు. జిల్లాను తిరిగి గ్రామాలుగా విభజించాడు. గ్రామ పాలనకు పంచాయితి, పటేల్, కులకర్ణి అనే అధికారులు నిర్వహించేవారు.
వీటికి తోడు మొగల్ రాజ్యంలోని కొన్ని ప్రాంతాలు పరోక్షంగా శివాజీ ఆధీనంలో ఉండేవి. వారి నుంచి చౌత్ అనే పేరున పన్నులు వసూలు చేశాడు.

భూమిశిస్తు విధానం: శివాజీ జాగిర్దారీ విధానాన్ని రద్దుచేశాడు. మత సంస్థల భూములను శివాజీ స్వాధీనం చేసుకొని వాటికి నగదు చెల్లించాడు. భూమిని సర్వే చేయించి రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. పన్నులను ధన రూపంలోగాని, ధాన్యరూపంలోగాని చెల్లించే అవకాశాన్ని కల్పించాడు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు రుణాలను ఇచ్చి, వాటిని సులభ వాయిదాల్లో తిరిగి చెల్లించే ఏర్పాటు చేశాడు.

AP Inter 1st Year History Study Material Chapter 8 మొగలుల యుగం

భూమి శిస్తుతోపాటు వాణిజ్య పన్నులు, నాణాల నుంచి ఆదాయం, చౌత్, సర్దేశముఖి మొదలైన వాటి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభించేది. చౌత్ అనే 1/4 వ వంతు పన్ను యుద్ధాల నుంచి రక్షించినందున తన రాజ్య పరిసరాల్లోని వారి నుంచి వసూలు చేసేవాడు. 1/10 వ వంతు వసూలు చేసే సర్దేశముఖి రాజు పట్ల గౌరవంతో చెల్లించే పన్ను.
సైనిక పాలన: శివాజీ బలమంతా అతని సైన్యంపై ఆధారపడి ఉంది. శివాజీ ప్రతిభావంతమైన, అంకితభావం గల సైన్యాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు. ముస్లిం పాలకులను మహారాష్ట్రకు దూరంగా ఉంచి హిందూ ధర్మాన్ని రక్షించడం ప్రధాన లక్ష్యంగా గల శివాజీ అందుకు అనువైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు. శివాజీ సైన్యంలో 45 వేల అశ్విక దళం, 60 వేల కాల్బలం, లక్షమందితో పదాతి దళం ఉండేది. వీటికి తోడు ఏనుగులు, ఒంటెలు, ఫిరంగి దళం కూడా ఉండేది.

జాగీరులకు బదులు మొదటిసారిగా ధనరూపంలో వేతనాలను చెల్లించేవారు. శివాజీ కోటల రక్షణకు ప్రత్యేక చర్యలను తీసుకొన్నాడు. సమర్థులైన వారికి బిరుదులు ఇవ్వడం, ప్రతిభావంతులకు అదనపు సౌకర్యాలను కల్పించడం వంటివి శివాజీ చేశాడు. యుద్ధరంగానికి స్త్రీలను తీసుకువెళ్ళడాన్ని నిషేధించాడు. దీన్ని ఉల్లంఘించిన వారికి మరణ శిక్ష విధించేవాడు. యుద్ధంలో స్వాధీనం చేసుకొన్న సొమ్మంతా చక్రవర్తికి అప్పగించాల్సి ఉండేది.

న్యాయపాలన: న్యాయ వ్యవస్థలో శివాజీ సంప్రదాయ పద్ధతులను పాటించాడు. సమన్యాయాన్ని అనుసరించాడు. ధనవంతుడు, పేదవాడు అనే తేడాలు కానీ, మత తేడాలు కానీ చూపించేవాడు కాదు. గ్రామస్థాయిలో గ్రామ పంచాయితీలు ” న్యాయపాలన చేసేవి. కేంద్ర స్థాయిలో న్యాయపాలన కోసం ‘న్యాయాధీశ్’ నియమించబడ్డాడు. కేసులు విచారించడంలోనూ, తీర్పులను ఇవ్వడంలోనూ ప్రాచీన హిందూ చట్టాలను పరిగణనలోకి తీసుకొనేవారు.

దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్న మొగలులతో వీరోచితంగా పోరాడి శివాజీ విజయం సాధించాడు. గతంలో అనైక్యంగా చిన్నచిన్న భాగాలుగా ఉన్న హిందూమత శక్తులను ఉన్నతమైన ఆశయాలతో ఏకంచేశాడు.

వీటన్నింటికి తోడు శివాజీ గొప్ప రాజకీయవేత్త, చురుకైన నాయకుడు. జె.ఎన్. సర్కార్ అనే చరిత్రకారుడు అన్నట్లు “శివాజీ మహారాష్ట్రులకు వెలుగు మొగలుల పాలిట సింహస్వప్నం తన వారసులకు స్ఫూర్తిప్రదాతగా నిలిచాడు. శివాజీ గొప్పతనం అతని వ్యక్తిత్వంలోను ఆచరణలోనూ బయల్పడుతుంది”.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బాబర్ నామ
జవాబు:
మధ్యయుగ భారతదేశ చరిత్రలో గణనీయమైన వ్యక్తులలో బాబరు ఒకడు. భారతదేశమున మొగలు సామ్రాజ్యమును స్థాపించిన ఘనుడు బాబరు. క్రీ.శ. 1483లో బాబరు ఫర్గానాయందు జన్మించెను. ఇతని తండ్రియగు ఉమర్ షేక్ మీర్జా మధ్యఆసియాలోని ఫర్గానా అను చిన్న రాజ్యమునకు అధిపతి. క్రీ.శ. 1494లో తన తండ్రి మరణానంతరము బాబరు 11 సం॥ల ప్రాయమున ఫర్గానా ప్రభువు అయ్యెను. తన మాతృదేశమున నిలువనీడలేక తన దృష్టిని ఆఫ్ఘనిస్తాన్ వైపు మరల్చి 1504లో కాబూల్ ఆక్రమించెను. భారతదేశ రాజకీయ పరిస్థితులు అనుకూలముగా ఉండుటచే క్రీ.శ. 1526లో మొదటి పానిపట్టు యుద్దమున ఢిల్లీ సుల్తాన్గు ఇబ్రహీంలోడిని ఓడించి, వధించి ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించి భారతదేశమున మొగల్ సామ్రాజ్య స్థాపన చేసెను.

బాబరు పర్షియన్, టర్కీ భాషలలో గొప్ప పండితుడు. టర్కీ భాషలో బాబరు వ్రాసుకొన్న స్వీయచరిత్ర తుజ్-క్- ఇ – బాబురి (తన ఆత్మకథ). మొగల్ యుగమున వ్రాయబడిన తొలి చారిత్రక గ్రంథము. ఇందు బాబరు తురుష్క భాషలోనున్న ప్రావీణ్యము తెలియుచున్నది. తుజ్-క్-ఇ-బాబరి సమకాలీన పరిస్థితులకు దర్పణం పడుతుంది. బాబరు కాలమును, హుమాయున్ తొలి జీవిత విశేషములను తెలుసుకొనుటకు ఈ గ్రంథము అత్యంత దోహదపడుతుంది. అందువల్ల మధ్యయుగాలనాటి ఆత్మకథల్లో దీనికి గణనీయమైన ప్రాముఖ్యత ఉంది.

ప్రశ్న 2.
హుమాయూన్
జవాబు:
బాబర్ మరణానంతరం మొగల్ సింహాసనాన్ని అధిష్టించినవాడు హుమాయూన్. ఇతడు బాబర్ పెద్ద కుమారుడు. హుమాయూన్ అనగా అదృష్టవంతుడని అర్థం. కానీ దీనికి భిన్నంగా అతడి జీవితం గడిచింది.

తొలి జీవితం: హుమాయూన్ 1508, మార్చి 6న జన్మించాడు. బాబర్ కుమారులు నలుగురిలో హుమాయూన్ పెద్దవాడు. తన తండ్రి కోరిక మేరకు హుమాయూన్ మొగల్ రాజ్యాన్ని సోదరులకు పంచాడు. సంభాల్న ఆస్కారీకి, ఆల్వార్ను హిందాల్కు, కాబూల్, కాందహార్ల ను కమ్రాన్కు ఇచ్చాడు. ఈ పంపకమే హుమాయూన్ కష్టాలకు మూలమైంది. కమ్రాన్ కాబూల్, కాందహార్ల తో తృప్తిపడక పంజాబును ఆక్రమించుకున్నాడు. సామ్రాజ్యాన్ని తన సోదరుల మధ్య పంపకం చేసినందువల్ల హుమాయూన్ ఆర్థికంగా, సైనికంగా బలహీనపడ్డాడు.

హుమాయూన్ బలహీనతలు: హుమాయూను కొన్ని వ్యక్తిగత బలహీనతలున్నాయి. అతడికి రాజకీయ చతురత, కార్యదీక్ష, సమయస్ఫూర్తి లేవు. నల్లమందుకు బానిస కావటమే కాక మితిమీరిన భోగలాలసత్వానికి కూడా లోనయ్యాడు.

సమస్యలు: పానిపట్టు, గోగ్రా యుద్ధాలలో బాబర్ చేతిలో ఓడిపోయిన ఆఫ్ఘన్లు తమ సార్వభౌమత్వాన్ని పునః ప్రతిష్టించుకోవటానికి తీవ్రమైన ప్రయత్నాలు మొదలుపెట్టారు. జాన్పూర్లో మహమ్మద్లోడీ, బెంగాల్లో నస్రతా, బీహార్లో షేర్ ఖాన్ బలం పుంజుకుని భారతదేశం నుంచి మొగలులను పారద్రోలటానికి చర్యలు ప్రారంభించారు.

హుమాయూన్ యుద్ధాలు: హుమాయూన్ రాజ్యానికి రాక మునుపే తండ్రితో పాటు పానిపట్టు, కాణ్వా యుద్ధా పాల్గొని మంచి అనుభవం గడించాడు. రాజ్యానికి వచ్చిన తరువాత కూడా అతడనేక యుద్ధాలు చేశాడు.

కలింజర్ దండయాత్ర (1530): కలింజర్ పాలకుడు తన శత్రువులైన ఆఫ్ఘన్లకు సహాయం చేశాడనే కారణంతో, హుమాయూన్ 1530లో కలింజర్పై దండెత్తి, విజయం సాధించాడు. కానీ, దాన్ని స్వాధీనపరుచుకొనక, నష్టపరిహారం మాత్రమే వసూలు చేసుకొన్నాడు. ఇది రాజనీతిజ్ఞతలేని చేష్ట.

దౌరా యుద్ధం: కలింజర్పై హుమాయూన్ దండెత్తినపుడు బీహార్లోని ఆఫ్ఘన్లు మహమ్మద్ డీ నాయకత్వం క్రింద మొగల్ రాష్ట్రమైన జాన్పుర్పై దాడిచేసి, ఆక్రమించారు. కానీ, కొద్దికాలంలోనే హుమాయూన్ ఆఫ్ఘన్లను డౌ యుద్ధంలో ఓడించి, దాన్ని తిరిగి స్వాధీనపరచుకొన్నాడు. మహమ్మద్ డీ బీహార్ కు పారిపోయాడు.

చునార్ యుద్ధం: బీహార్లో షేర్ఖాన్, చునార్ కోటను స్థావరంగా చేసుకొని తన సైనిక చర్యలను ముమ్మరం చేశాడు. షేర్ ఖాన్ ను అణచాలనే ఉద్దేశంతో హుమాయూన్ చుసార్ కోటను ముట్టడించాడు. కానీ, చునారు ఆక్రమించుకొనే సమయంలో షేర్ఫాన్ రాజకీయ చతురత ప్రదర్శించి హుమాయూన్తో సంధి చేసుకొనెను. అనంతరం హుమాయూన్ ఆగ్రా వెళ్లి దాదాపు ఒక సంవత్సరం పైగా విందులు, వినోదాలతో కాలం వృధా చేసుకొనెను. దీనితో బీహార్ లో షేర్ ఖాన్, గుజరాత్లో బహదూర్గా శక్తిని పుంజుకొని హుమాయూన్పై దాడికి సిద్ధమయ్యారు.

షేర్ఖాన్తో పోరాటం: గుజరాత్పై హుమాయూన్ దాడి చేస్తున్న తరుణంలో, షేర్భన్ బీహార్లో తన బలాన్ని పెంచుకొని 1537 నాటికి బెంగాల్ను ఆక్రమించి, హుమాయూన్కు కప్పం కట్టడం మానేశాడు. షేర్ ఖాన్ విజృంభణ తన సామ్రాజ్యం మనుగడకు ప్రమాదకరమని భావించిన హుమాయూన్, షేర్ఖాన్పై యుద్ధానికి సిద్ధపడ్డాదు. షేర్ ఖాస్ బెంగాల్లో ఉన్నందువల్ల హుమాయూన్ సులభంగా బీహార్ను ఆక్రమించుకోగలిగేవాడు. అలాగాక, చూనార్ దుర్గ ముట్టడిలో హుమాయూన్ చాలాకాలం వృథా చేసుకొన్నాడు. అనంతరం బెంగాల్ రాజధాని గౌర్ పైకి నడిచి, గాన్ని తన అధీనంలోకి తెచ్చుకొన్నాడు. గౌర్ ఆక్రమణానంతరం హుమాయూన్ ఎనిమిది నెలలు విలాసాలలో మునిగి తేలాడు. ఈలోపు షేర్ ఖాన్ హుమాయూను నిత్యావసర వస్తువులేవీ చేరకుండా ఢిల్లీ, బెంగాల్ల మధ్య రాకపోకలకు అడ్డంకులు కలిగించాడు. ఈ అరాచక పరిస్థితుల్లో హిందాల్ తనను తాను మొగల్ చక్రవర్తిగా ప్రకటించుకొన్నాడు. ఈ పరిస్థితుల్లో హుమాయూన్ రాజధానికి తిరుగు ప్రయాణం కట్టాడు.

చౌసా యుద్ధం (1539): రాజధాని చేరడానికి ప్రయాణంలో ఉన్న మొగల్ సైన్యం పైన షేర్ఖాన్ గంగానది ఒడ్డున ఉన్న చౌసా వద్ద 1539లో మెరుపు దాడి చేసి విజయం సాధించాడు. ఎలాగో తప్పించుకొని హుమాయ రాజధానికి చేరుకున్నాడు. ఆ తరువాత షేర్ ఖాన్ బీహార్, బెంగాల్లను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకొని, వారికి స్వతంత్ర పాలకుడుగా ప్రకటించుకున్నాడు. ఈ విజయాలతో ఉత్తేజితుడైన షేర్ఖాన్ తన దృష్టిని ఢిల్లీ, ఆగ్రాం పై సారించాడు. ఇదే సమయంలో తన పేరును “షేర్ ” గా మార్చుకున్నాడు.
కనోజ్ యుద్ధం (1540): ఆగ్రావైపు వస్తున్న షేర్ ఖాన్ను ఎదుర్కోవడానికి, హుమాయూన్ రెండు లక్షల సైన్యంతో కనోజ్ చేరుకున్నాడు. 1540లో జరిగిన యుద్ధంలో హుమాయూన్కు పరాజయం సంభవించింది. షేర్షా ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించాడు.

పైన పేర్కొనబడిన వివిధ అంశాలు హుమాయూన్ విపులతకు కారణమయ్యెను.

ప్రశ్న 3.
అబుల్ ఫజల్
జవాబు:
మన దేశ చరిత్రలో మొగల్ చరిత్రకు లభ్యమగు ఆధారములు ఏ యుగమున లేవు. అట్టి ఆధారములలో ముఖ్యమైనవి ఐని-ఇ-అక్బరీ.

దీనిని అక్బరు ఆస్థాన పండితులైన అబుల్ ఫజల్ వ్రాసెను. మొగల్ యుగ చరిత్ర ఆధారములలో ఈ గ్రంథము తలమానికం వంటిది. ఇందు మూడు సంపుటములు కలవు. మొదటి సంపుటము నందు తైమూర్ నుండి హుమాయూన్ వరకుగల మొగల్ వంశ చరిత్రను రెండు, మూడు సంపుటములందు అక్బరు పరిపాలనా విశేషముల గూర్చి వ్రాసెను.

ఐనీ-ఇ-అక్బరీ: దీనిని కూడా అబుల్ ఫజల్ మూడు సంపుటములుగా వ్రాసెను. ఇందు అక్బరు రాజకీయ విధానములు, పరిపాలనా విషయములు, ప్రజల జీవన స్థితిగతులు, అలవాట్లు సవిస్తరముగా వర్ణింపబడినవి. కనుకనే లూనియా (Luniya) పండితుడు “మొగల్ చరిత్ర వ్రాసే ఏ చరిత్రకారుడైనా ఈ గ్రంథమును సంప్రదింపకుండా ఎట్టి రచన చేయలేదు” అని చెప్పెను.

AP Inter 1st Year History Study Material Chapter 8 మొగలుల యుగం

అక్బరు తన బంధువులకు, కుటుంబ సభ్యులకు వ్రాసిన లేఖల సంకలనం. దీనిని కూడా అబుల్ ఫజల్ సంతరించెను.

తబ్కాత్-ఇ-అక్బరీ: ఇది ఒక సామాన్య చారిత్రక గ్రంథము. దీనిని మీర్భక్షి ఖ్వాజీ నిజాముద్దీన్ మూడు సంపుటములుగా వ్రాసెను. ఇందు ఢిల్లీ సుల్తానత్ యుగము, బాబరు, హుమాయూన్, అక్బరుల పాలనాకాలము, ప్రాంతీయ రాజ్యాల చరిత్ర వివరింపబడెను. గుజరాత్ చరిత్రకు ఇది ఒక అమూల్యమైన ఆధారము.

ప్రశ్న 4.
నూర్జహాన్
జవాబు:
మొగల్ సామ్రాజ్య చరిత్రలో ప్రముఖ పాత్ర వహించిన స్త్రీ నూర్జహాన్. 1611లో జహంగీర్కు నూర్జహాన్తో వివాహం జరిగినప్పటి నుంచి జహంగీర్ జీవితం, మొగల్ వంశ చరిత్ర కొత్త మలుపు తిరిగాయి. నూర్జహాన్ అసలు పేరు మెహరున్నీసా. ఈమె తండ్రి ఘియాస్ బేగ్, తల్లి అస్మత్ బేగం. ఘియాస్ బేగ్ పర్షియా దేశం నుంచి ఉపాధి కోసం భారతదేశం వచ్చి, అక్బర్ ఆస్థానంలో స్థానం పొంది కాబూల్ సుబాకు దివాన్ అయ్యాడు. మెహరున్నీసా అందగత్తె. మెహరున్నీసాకు అక్బర్ కుమారుడైన సలీంకు ప్రేమ కథనం ఉంది. వారి ప్రేమను ఇష్టపడని అక్బర్ ఆమెను షేర్ ఆఫ్ఘన్కు ఇచ్చి వివాహం చేసి, ఆ దంపతులను బెంగాల్లోని బర్వాన్కు పంపించాడని కొందరి అభిప్రాయం. అక్బర్ మరణానంతరం సలీం, జహంగీర్గా సింహాసనమధిష్టించిన తరువాత షేర్ ఆఫ్ఘన్ను వధించి, మెహరున్నీసాను వివాహమాడాడని మరొక కథనం ఉంది. ఆ వివాహం నాటికి ఆమె వయస్సు 33 సంవత్సరాలు. ఆమెకు యుక్తవయస్సు వచ్చిన లాడ్లీ బేగం అనే కుమార్తె కూడా ఉంది. జహంగీర్ మెహరున్నీసాను వివాహం చేసుకొన్న తరువాత నూర్మహల్ (ఇంటికి వెలుగు) నూర్జహాన్ (ప్రపంచానికి వెలుగు) అనే బిరుదులిచ్చాడు. వివాహానంతరం ఆమెకు సర్వాధికారాలు అప్పగించి విలాసవంతమైన జీవితం గడిపాడు.

నూర్జహాన్ అధికార దాహం: నూర్జహాన్ తన అధికారాన్ని పటిష్టం చేసుకోవటానికి అనేక చర్యలు తీసుకొంది. నాణేల మీద జహంగీర్ తో పాటు తన పేరును కూడా ముద్రించుకుంది. తన బంధువులకు, ఆశ్రితులకు ఉన్నత పదవులనిచ్చి ముఠాకు నాయకురాలైంది. తన తల్లిని తన ప్రధాన సలహాదారుగా నియమించుకుంది. తన కుమార్తె లాడ్లీ బేగంను జహంగీర్ మరొక కుమారుడు ప్రియార్కు ఇచ్చి వివాహం చేసింది. ఖుర్రం (షాజహాన్ ) ను కేంద్ర రాజకీయాల నుంచి కాందహార్కు పంపించటానికి ప్రయత్నించింది. దీనితో తిరుగుబాటు చేసిన ఖుర్రంను మహబతాన్ సాయంతో అణచివేసింది. ఖుర్రంపై సాధించిన విజయంతో మహబతాఖాన్ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడించాయి. అదీగాక మహబతాన్, జహంగీర్ రెండో కుమారుడు పర్వేజ్ను సింహాసనం ఎక్కించాలనే లక్ష్యంతో ఉన్నాడు. దీనితో మహబతాఖాన్ మీద నూర్జహాన్ కక్ష సాధింపు చర్యలు ప్రారంభించింది. మహబతాఖాన్ ను దక్కన్ నుంచి బెంగాల్కు బదిలీ చేయించింది. దీనితో మహబతాఖాన్ తిరుగుబాటు చేసి, 1626లో జహంగీర్ను నూర్జహాన్ను బందీలుగా పట్టుకొని 3 నెలలకు పైగా పరిపాలన చేశాడు. దీనినే శతదిన పాలన అంటారు. కానీ నూర్జహాన్ మాయోపాయంతో ఖైదు నుంచి జహంగీర్ తోపాటు బయటపడింది. దీనితో ధైర్యం చెదిరిన మహబతాఖాన్ దక్కను పారిపోయి ఖుర్రంతో చేతులు కలిపాడు. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న జహంగీర్ 1627లో మరణించాడు. దీనితో సింహాసనం కోసం వారసత్వ యుద్ధం ప్రారంభమైంది.

చివరకు తన శత్రువులందర్నీ ఓడించి, 1628, జూలై 14న ఖుర్రం ఇదివరకే సంపాదించుకున్న “షాజహాన్” అనే బిరుదుతో సింహాసనం అధిష్టించాడు. నూర్జహాన్ తన ఆశలన్నీ అడియాసలయ్యాయని గ్రహించి రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమించింది. చివరి రోజుల్లో దైవచింనతలో గడిపి 1645లో లాహోర్ లో మరణించింది. ఏది ఏమైనప్పటికీ తన భర్త వ్యసనపరుడైనప్పుడు రాజ్యాన్ని ఇతరుల హస్తగతం కాకుండా నూర్జహాన్ కాపాడగలిగింది.

ప్రశ్న 5.
తాజ్మహల్
జవాబు:
షాజహాన్ గొప్ప భవన నిర్మాత. ఈ విషయంలో ఇతడి పాలనా కాలాన్ని రోమన్ చక్రవర్తి అగస్టస్ కాలంతో పోల్చడం జరిగింది. ఢిల్లీ, ఆగ్రా, కాబూల్ లో షాజహాన్ కాలానికి చెందిన కట్టడాలు సౌందర్యానికి, కళావైశిష్ట్యానికి నిదర్శనాలుగా నిలిచాయి. రాజధానిగా ఉండటానికి ఆగ్రాకు అర్హతలేదని భావించిన షాజహాన్, షాజహానాబాద్ అనే నూతన రాజధాని నగరాన్ని నిర్మింపచేశాడు. అదే ప్రస్తుత పాత ఢిల్లీ. షాజహాన్ నిర్మాణాల్లో ఆగ్రాలోని తాజ్మహల్, ఢిల్లీలోని ఎర్రకోట, అందులోని దివాన్ ఇ-ఆమ్, దివాన్-ఇ-ఖాన్, జామా మసీద్ ప్రధానమైనవి. షాజహాన్ నిర్మాణాలన్నింటిలో తలమానికమైంది, ఆగ్రాలో యమునా నది ఒడ్డున తన పట్టమహిషి ముంతాజ్ బేగం సంస్మరణార్థం నిర్మించిన తాజ్మహల్. దీనిని ప్రపంచ అద్భుత కట్టడాలలో ఒకటిగా భావిస్తారు. దీని నిర్మాణానికి ఇరవై రెండు సంవత్సరాలు పట్టింది. నాలుగున్నర మిలియన్ పౌన్లు ఖర్చయింది. ఉస్తాద్ అహ్మద్ దీని నిర్మాణంలో ప్రధాన భూమిక నిర్వహించిన వాస్తుశిల్పి. షాజహాన్ భవనాలన్నింటిలోను అలంకరణకు పేరుపొందింది.

ప్రశ్న 6.
పురంధర్ సంధి
జవాబు:
1665 సం॥లో మొగల్ సేనాని రాజా జైసింగ్క, మరాఠా నాయకుడు అయిన శివాజీకి మధ్య పురంధర్ వద్ద కుదిరిన సంధిని పురంధర్ సంధి అని అంటారు. ఈ సంధి ప్రకారం:

  1. శివాజీ తన స్వాధీనంలోని సాలీనా నాలుగు లక్షల రూపాయల ఆదాయాన్ని ఇచ్చే ఇరవై మూడు కోటలను మొగలులు స్వాధీనం చేసుకున్నారు.
  2. బీజపూర్తో మొగలులు చేసే యుద్ధాలలో సహాయం చేసేందుకు శివాజీ అంగీకరించాడు.
  3. తన కుమారుడు శంభూజీని ఐదువేల మంది అశ్వికులతో మొగల్ ఆస్థానానికి పంపేందుకు శివాజీ అంగీకరించాడు.
  4. 13 సంవత్సరాల కాలంలో నలభై లక్షల పన్నులను చెల్లించేందుకు శివాజీ అంగీకరించాడు.
  5. ఐదు లక్షల పన్నులను ఇచ్చే బీజపూర్ రాజ్యంలోని ప్రాంతాలపై శివాజీ అధికారాన్ని మొగలులు గుర్తించారు. ఈ సంధి వల్ల మొగలులు ప్రయోజనం పొందారు. వారి ప్రాభవం వృద్ధి చెందింది. దీనితో శివాజీ అవమానానికి గురి అయినాడు. పురంధర్ సంధి ప్రకారం రాజా జైసింగ్ ప్రోద్బలంతో ఆగ్రాలోని మొగల్ దర్బారును శివాజీ దర్శించాడు.

ప్రశ్న 7.
సాహూ
జవాబు:
శివాజీ మరణానంతరం అతని పెద్ద కుమారుడైన శంభూజీ 1680లో సింహాసనాన్ని అధిష్టించాడు. అతడు బలశాలే అయినా అసమర్థుడు కావడంవల్ల ఔరంగజేబు చేతిలో 1689లో మరణానికి గురయ్యాడు. అనంతరం అతని సవతి సోదరుడు రాజారాం సింహాసనాన్ని అధిష్టించాడు. రాజారాం సమర్థుడు కాకపోయినా రామచంద్ర పంథ్, శాంతాజీ ఘోర్పడే, దానాజీ జాదన్ వంటి సమర్థ అధికారుల సహకారంతో మొగలులను ధైర్యంతో ఎదుర్కొన్నాడు.

దురదృష్టవశాత్తు క్రీ.శ. 1700 సంవత్సరంలో రాజారామ్ మరణించడంతో అతడి భార్య తారాబాయి మహారాష్ట్రకు సారధ్యం వహించింది. ఔరంగజేబు మరణానంతరం సాహు బందిఖానా నుంచి విడుదల చేయడంతో తారాబాయి, సాహుల మధ్య వారసత్వ పోరాటం జరిగి సాహు విజయం సాధించాడు. ఫలితంగా మహారాష్ట్ర రాజ్యం కొల్హాపూర్, సతారాలుగా విడిపోయింది. సాహు 1713లో పీష్వాగా బాలాజీ విశ్వనాధ్ను నియమించాడు. పీష్వా పదవి వంశపారంపర్యమైంది. క్రమంగా పీష్వాలు మహారాష్ట్రకు నిజమైన పాలకులుగా మారారు.

పీష్వాల రాజ్యానికి పునాదులు వేసిన బాలాజీ విశ్వనాధ్న మహారాష్ట్ర సామ్రాజ్య రెండవ స్థాపకుడిగా పిలుస్తారు. బాలాజీ విశ్వనాధ్ తరువాత అతడి కుమారుడు మొదటి బాజీరావు 1720లో సింహాసనాన్ని అధిష్టించాడు. బలమైన సైన్యంతో మొదటి బాజీరావు కృష్ణా, గోదావరి మధ్య ప్రాంతాన్ని మహారాష్ట్రులు కిందకి తెచ్చాడు. హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఇతని ఆశయం. ‘మరాఠా కూటమి’ని ఏర్పాటుచేసిన బాజీరావు గుజరాత్, మాళ్వ, బుందేల్ఖండ్లను ఆక్రమించి ఢిల్లీపై దృష్టి కేంద్రీకరించాడు. అయితే లక్ష్యాన్ని సాధించక ముందే 42 సంవత్సరాల వయస్సులో 1740 సంవత్సరంలో మొదటి బాజీరావు మరణించాడు.

ప్రశ్న 8.
బాలాజీ విశ్వనాధ్
జవాబు:
శివాజీ మరణానంతరం మహారాష్ట్ర సామ్రాజ్యం అంతర్యుద్ధం వలన పతనావస్థకు చేరుకుంది. ఆ కల్లోల పరిస్థితులలో శివాజీ వదిలివెళ్ళిన బాధ్యతలను, ఆయన ఆశయాలను నెరవేర్చటమేగాక, పతనావస్థలో ఉన్న మహారాష్ట్ర రాజ్యాన్ని, సంస్కృతిని కాపాడిన ఘనత పీష్వాలకు దక్కింది. ఈ పీష్వాల వంశమూలపురుషుడు బాలాజీ విశ్వనాధ్ (1713-1720). మహారాష్ట్ర రాజ్యాన్ని, సంస్కృతిని మొదటగా కాపాడిన ఘనుడు బాలాజీ విశ్వనాధ్. ఛత్రపతి సాహుచే పీష్వాగా నియమించబడిన విశ్వనాధ్ సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి, భారతీయ చరిత్రలో మహారాష్ట్రులకు విశిష్ట స్థానాన్ని సంపాదించాడు. మహారాష్ట్రుల నౌకాదళాధిపతియైన కన్హోజీతో ఒక సంధి కుదుర్చుకొని పోర్చుగీసు వారిని, ఆంగ్లేయులను ఓడించాడు. సయ్యద్ సోదరులతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని ఒకప్పుడు శివాజీకి చెందిన భూభాగాలన్నింటిని తిరిగి మొగలాయిల నుండి సంపాదించాడు. మహారాష్ట్రుల కూటమిని ఏర్పరచి మహారాష్ట్రులలో ఐక్యత సాధించాడు. ఇతని విధానాల వలన దేశంలో మహారాష్ట్రుల ప్రాబల్యం పెరిగింది. తన ఆశయాలు పూర్తిగా నెరవేరకమునుపే బాలాజీ విశ్వనాధ్ మరణించాడు.

ప్రశ్న 9.
మూడవ పానిపట్టు యుద్ధం
జవాబు:
అహమ్మదా అబ్దాలీ, మహారాష్ట్రుల సామ్రాజ్యకాంక్ష మూడో పానిపట్టు యుద్ధానికి దారితీసింది. 1757లో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన అహమ్మద్ అబ్దాలీ పంజాబ్ను ఆక్రమించుకొని, తన కుమారుడైన తైమూరాను రాష్ట్రపాలకుడిగా నియమించాడు. పీష్వా బాలాజీ బాజీరావు సోదరుడు రఘునాథరావు. మహారాష్ట్ర ప్రభువు మలహరరావ్ హోల్కర్ లు కలిసి పంజాబ్పై దాడిచేసి, అక్కడి నుండి తైమూర్గాను తరిమివేశారు. దీనితో అహమ్మదా అబ్దాలీ, మహారాష్ట్రుల మధ్య యుద్ధం అనివార్యమైంది. 1761 నవంబరులో చారిత్రాత్మకమైన పానిపట్టు మైదానంలో మహారాష్ట్ర, ఆఫ్ఘన్ సైన్యాలు తలపడ్డాయి. ఈ యుద్ధంలో ఆఫ్ఘన్లు తిరుగులేని విజయం సాధించారు. సదాశివరావ్, విశ్వాసరావ్ అంతటి మహారాష్ట్ర వీరులు సైతం నేలకొరిగారు. వేలకొలది మహారాష్ట్ర సైనికులు యుద్ధభూమిలో మరణించారు. 40,000 మంది సైన్యం యుద్ధఖైదీలుగా పట్టుబడ్డారు. ఈ యుద్ధం వల్ల నష్టపోని మహారాష్ట్ర కుటుంబం లేదని జె. ఎన్. సర్కార్ వ్రాశాడు. ఈ పరాజయ వార్త విన్న కొద్దికాలానికే పీష్వా బాలాజీ బాజీరావు కృంగిపోయి మరణించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 8 మొగలుల యుగం

సదాశివరావు అహంభావపూరిత స్వభావం, మహారాష్ట్ర నాయకులలో ఐకమత్యం లేకపోవటం, రొహిల్లాలు, అయోధ్య నవాబు వంటి స్వదేశీయులు అబ్దాలీకి సహాయపడటం, అటువంటి సహాయం మహారాష్ట్రులకు లేకపోవటం, సేనానిగా అబ్దాలీ ప్రదర్శించిన నైపుణ్యం, అబ్దాలీ విజయానికి, మహారాష్ట్రుల పతనానికి దోహదం చేశాయి.
మూడో పానిపట్టు యుద్ధం మహారాష్ట్రులకు ఘోరమైన సైనిక పరాజయం. దీనితో మహారాష్ట్రులు అజేయులన్న భావన పటాపంచలైంది. పీష్వా అధికారం క్షీణించి మహారాష్ట్ర సమాఖ్య విచ్ఛిన్నమైనది. ఈ యుద్ధం వలన విజృంభిస్తున్న మహారాష్ట్ర సామ్రాజ్యం అతలాకుతలమైపోయింది. హిందుపదేపదేహి అనే మహారాష్ట్రుల నినాదం గాలిలో కలిసిపోయింది. మొగల్ సామ్రాజ్యం ఇంకా నిర్వీర్యమైపోయింది. మహారాష్ట్రుల వైఫల్యం, మొగలుల బలహీనత ఆంగ్లేయులకు సహకరించాయి. వారిని ఎదిరించి నిలువగలిగిన శక్తి భారతదేశంలో ఎక్కడా లేకుండా పోయింది.

ప్రశ్న 10.
చౌత్, సర్దేశముఖి
జవాబు:
భూమిశిస్తు విధానంలో శివాజీ తనకు ముందు రాజా తోడర్ మల్, మాలిక్ అంబర్లు అనుసరించిన విధానాన్నే చాలా వరకు అనుసరించాడు. భూమిని సర్వే చేయించి, పండిన పంటలో 40 శాతాన్ని శిస్తుగా నిర్ణయించాడు. జమిందారీ విధానాన్ని రద్దుచేసి రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. శిస్తును రైతులు ధనరూపంలోగాని, ధాన్యరూపంలోగాని చెల్లించవచ్చు. అవసర కాలంలో రైతులకు వాయిదాల పద్ధతిపై అప్పులు ఇచ్చాడు. విత్తనాలు, పశువుల పెంపకం కూడా చేశాడు. కానీ, వాటి విలువలను వాయిదాల పద్ధతి మీద ప్రభుత్వ అధికారులు తిరిగి రాబట్టుకునేవారు. స్వరాజ్ వెలుపల తాను నేరుగా పాలించని ప్రజల నుంచి చౌత్, సర్దేశముఖ్ అనే రెండు పన్నులను వసూలు చేశాడు. చౌత్ అంటే స్వరాజ్యం వెలుపల ఉన్న భూములు ఆదాయంపై 1/4 వంతు, సర్దేశముఖి అంటే ఆదాయంపై 1/10వ వంతు శిస్తుగా వసూలు చేశాడు. ఈ విధంగా వసూలైన ధనాన్ని మరాఠా రాజ్య నిర్మాణానికి వినియోగించాడు.