AP Inter 2nd Year Commerce Study Material Chapter 5 వినియోగదారుల రక్షణ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Commerce Study Material 5th Lesson వినియోగదారుల రక్షణ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Commerce Study Material 5th Lesson వినియోగదారుల రక్షణ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం వినియోగదారుని హక్కులను వివరించండి.
జవాబు:
వ్యాపారులు తమ యొక్క సామాజిక బాధ్యతలను గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉన్నప్పటికి అనేక చోట్ల వినియోగదారుడు దోపిడికి గురి అవుతున్నాడు. ఆ కారణముచేత భారత ప్రభుత్వము వినియోగదారుల చట్ట పరిధిలో దిగువ తెలపబడిన వినియోగదారుల హక్కులను పొందుపరచడమైనది.
1) భద్రత హక్కు: తన ప్రాణమునకు గాని, ఆస్తులకు గాని ప్రమాదకరమైన వస్తువులు లేదా సేవల వినియోగము నుండి భద్రత వినియోగదారుని హక్కుగా పరిగణించడమైనది. దీని వలన భద్రమైన జీవనము సాగించుటకు వీలు కల్పించబడినది.

2) సమాచార హక్కు : వస్తువులు మరియు సేవలకు సంబంధించిన నాణ్యత, పరిమాణము, స్వచ్ఛతల గురించి పూర్తి సమాచారము పొందు హక్కు కల్పించబడినది. కాబట్టి ఉత్పత్తిదారుడు వస్తువుకు సంబంధించిన పూర్తి సమాచారమును వినియోగదారునకు అందించవలెను.

3) ఎంపిక హక్కు : తన ఇష్టానికి సరితూగే విధముగా వస్తువుల కొనుగోలు, సేవలను పొందే హక్కు వినియోగదారునకు ఇవ్వబడినది. పంపిణీదారులు వారి ఇష్ట ప్రకారము వినియోగదారులకు వస్తువులు అమ్మరాదు. వినియోగదారులను బలవంతము చేయరాదు. తన ఇష్టానుసారం వస్తువులను ఎంపిక చేసుకునే హక్కు, స్వేచ్ఛ వినియోగదారునకు ఉన్నది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 5 వినియోగదారుల రక్షణ

4) వినియోగదారునకు అవగాహన కల్పించు హక్కు : ఒక వస్తువును గురించి సరైన అవగాహన, నైపుణ్యం కలిగించుకునే హక్కు వినియోగదారునకు కల్పించబడినది. అక్షరాస్యులైన వినియోగదారులు వారి హక్కులు మరియు ఎలాంటి చర్యలు తీసుకునే జ్ఞానము కలిగి ఉంటారు.

5) సమస్యల పరిష్కార హక్కు తనకు జరిగిన దోపిడీ మరియు మోసానికి పరిష్కారము పొందుటకు, వ్యాపారస్తుల దోపిడీ నుంచి నష్టపరిహారము పొందే హక్కు కల్పించబడినది. ఈ హక్కు ద్వారా దోపిడీ, మోసము నుంచి న్యాయము కలుగజేయబడుతుంది.

6) వినిపించే, విన్నవించుకునే హక్కు : వినియోగదారుడు తనకు జరిగిన అన్యాయము గురించి విన్పించుటకు, వ్రాతపూర్వకముగా విన్నవించుకొనుటకు వినియోగదారునకు హక్కు ఉన్నది. తాను కొనుగోలు చేసిన వస్తువులు లోపభూయిష్టముగా ఉన్నా, తనకు అందించిన సేవలలో వ్యత్యాసము ఉన్ననూ వినియోగదారుని మాటలు వినవలెను.

ప్రశ్న 2.
వినియోగదారుని బాధ్యతలు ఏవి ?
జవాబు:
వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుటకు ప్రభుత్వముగాని, స్వచ్ఛంద సంస్థలు గాని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటకీ వినియోగదారుడు తనకు తానుగా వ్యాపారస్తుల దోపిడీ నుంచి రక్షించుకొనుటకు ముందుకురావలెను. అందువలన దిగువ తెలిపిన బాధ్యతలను స్వీకరించవలెను.

1) వస్తువుల నాణ్యత అవగాహన : ఉత్పత్తిదారుల నీతి బాహ్యమైన చర్యల నుండి, కల్తీలను నిరోధించుటకు గాను తాను కొనదలచిన వస్తువుల నాణ్యతపై వినియోగదారుడు కొంత అవగాహన కలిగి ఉండుట అతని బాధ్యత. ఆ వస్తువులపై ఉన్న నాణ్యత ప్రమాణాలను ధృవీకరించిన (I.S.I) ఐ.యస్.ఐ, ఆగ్మార్క్, FPO, పూల్మార్క్, ఎకోమార్క్, హాల్మార్క్ కలిగిఉన్నవా గమనించాలి.

2) తప్పుదారి పట్టించే ప్రకటనల గురించి జాగ్రత్త : వస్తువుల నాణ్యత గురించి అతిశయోక్తిగా ఇవ్వబడే ప్రకటనలపై ఆధారపడకూడదు. ఇతర వినియోగదారులు ఎవరైతే వీటిని వినియోగిస్తున్నారో వారి నుంచి సమాచారము పొందవలెను.

3) ఎంపిక చేసుకునే ముందు వివిధ రకములైన వస్తువులను పరీక్షించే బాధ్యత : వస్తువులను పరీక్షించిన తర్వాత తాము వస్తువులను కొనటానికి ముందు నాణ్యత గురించి, విలువ, మన్నిక, కొన్న తర్వాత అమ్మకపుదారు అందించే సేవలు గురించి తెలుసుకోవాలి.

4) వినియోగదారుడు అమ్మకపుదారునితో జరిగిన వ్యవహారమునకు ఋజువు సంపాదించుట : వీరిద్దరి మధ్య జరిగిన లావాదేవీల గురించి సరైన వ్రాతపూర్వక ధృవీకరణను స్వీకరించి దానిని జాగ్రత్తగా భద్రపరచాలి. ఒకవేళ ఆ వస్తువుపై ఫిర్యాదు చేయవలసినపుడు అది ఉపయోగపడుతుంది. సాధారణముగా వాడే వస్తువులకు వ్యాపారస్తుడు వారంటీ లేక గ్యారంటీ పత్రమును కొనుగోలు చేసిన వస్తువుతో జత చేస్తారు. వాటిపై వ్యాపారస్తుని సంతకము చేసినాడో లేదో గమనించవలెను. వాటిపై వ్యాపార సంస్థ సీలు, తేదీ ఉన్నట్లు చూడవలెను. వాటి కాలపరిమితి ఉన్నంతవరకు భద్రపరచవలెను.

5) వినియోగదారుడు తన హక్కుల గురించి తెలుసుకొనవలెను : వస్తువుల కొనుగోలులోగాని, సేవలు ఉపయోగములోగాని పైన తెలిపిన హక్కులను గురించి సరియైన అవగాహన కలిగి, అవసరమైనపుడు వాటిని ఉపయోగించవలెను. తాము కొనుగోలు చేసిన వస్తువులలో ఎలాంటి లోపాలు లేకుండా వాటికి సంబంధించిన సమాచారము మొత్తం గ్రహించి నాణ్యతను కూడా గమనించి కొనుగోలు చేయవలెను.

6) వాస్తవమైన లోపానికి ఫిర్యాదు చేయుట : ఒక వినియోగదారునిగా మీరు కొన్న వస్తువుపై అసంతృప్తి ఉన్నట్లయితే దానిని పరిష్కరించవలసినదిగా కోరవచ్చును. ఈ విషయములో మీరు మొదట వ్యాపారస్తునికి కావలసిన పరిష్కారము గురించి విన్నవించవలెను. వ్యాపారస్తుడు ఆ ఫిర్యాదుకు స్పందించని యడల మీరు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించవచ్చును. వాస్తవముగా మీరు కోరుతున్న పరిహారము, జరిగిన నష్టము సమర్థనీయముగా ఉండవలెను. అవాస్తవ ఫిర్యాదులు చేయకూడదు. బలమైన కారణము ఉండవలెను, లేనియెడల ఫోరం మీకు అపరాధ సుంకమును విధించవచ్చును.

7) వస్తుసేవలను సరిగా వినియోగించుకోవడం : వినియోగదారులు వస్తువుల వినియోగము జాగ్రత్తగా చేయవలెను. గ్యారంటీ కాలపరిమితి ఉన్న కారణముగా వేరొక వస్తువు బదులుగా వస్తుంది అనే భావనతో నిర్లక్ష్య ధోరణితో వినియోగించకూడదు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 5 వినియోగదారుల రక్షణ

ప్రశ్న 3.
వినియోగదారుల రక్షణ చట్టం 1986 క్రింద వినియోగదారుని సమస్యల పరిష్కారానికి యంత్రాంగమును వివరించండి.
జవాబు:
వినియోగదారుల రక్షణ చట్టము, 1986 వినియోగదారుల తగాదాల పరిష్కారానికి వివిధ స్థాయిలలో తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినవి. ఈ యంత్రాంగాన్ని జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి మరియు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగినది.
1) జిల్లా ఫోరం : రాష్ట్ర ప్రభుత్వము ప్రతి జిల్లాలోను జిల్లా ఫోరంను నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసినది. ఈ ఫోరంలో ఒక ప్రెసిడెంటును రాష్ట్ర ప్రభుత్వము నామినేట్ చేస్తుంది. జిల్లా కోర్టులో అతడు అర్హతగల జడ్జి అయి ఉండవలెను. మరో ఇద్దరు సభ్యులు కూడా ఉంటారు. అందులో ఒక స్త్రీ సభ్యురాలు కూడా ఉంటుంది. ఈ సభ్యులకు ఆర్థిక, న్యాయ, వాణిజ్య, పరిశ్రమలకు సంబంధించిన సమస్యలపై కనీసం 10 సంవత్సరాల అనుభవము ఉండవలెను. ఈ సభ్యుల వయస్సు 35 సంవత్సరాలు తక్కువ కాకూడదు మరియు గుర్తింపు పొందిన యూనివర్సిటీ పట్టభద్రులై ఉండాలి. ఫోరంలోని ప్రతి సభ్యుని కాలపరిమితి 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు (ఏది ముందైతే అది).

కలెక్టర్ ఫోరం ఛైర్మన్గా ఉంటాడు. 20 లక్షల రూపాయలకు మించని వస్తువుల ధర మరియు కోరిన పరిహారము ఉన్నట్లయితే జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చును. ఒకవేళ జిల్లాఫోరంలో ఫిర్యాదుదారు సంతృప్తి పొందకపోతే, ఆదేశాలను జారీచేసిన 30 రోజులలోపు రాష్ట్ర కమీషన్కు అప్పీలు చేసుకోవచ్చును.

2) రాష్ట్ర కమీషన్ : రాష్ట్ర కమీషన్ వినియోగదారుల తగాదాలను రాష్ట్ర స్థాయిలో పరిష్కరిస్తుంది. రాష్ట్ర కమీషన్లో ఒక హైకోర్టులో అర్హత గలిగిన జడ్జి మరియు ఇద్దరుకు తక్కువ కాకుండా మరియు నిర్ణయించిన సభ్యులకు మించకుండా ఉంటారు. అందులో ఒక స్త్రీ సభ్యురాలై ఉంటుంది. రాష్ట్ర కమీషన్ 20 లక్షల రూపాయలకు మించని వస్తువుల ధర మరియు కోరిన పరిహారము ఉన్న ఫిర్యాదులను స్వీకరిస్తుంది. రాష్ట్ర పరిధిలోని వినియోగదారుని తగాదా విషయములో అవసరమైన రికార్డులు తెప్పించి సరైన ఆదేశాలను జారీ చేయవచ్చును. జిల్లా ఫోరంలో పెండింగ్లో ఉన్న ఏ ఫిర్యాదునైనా ఒక ఫోరం నుంచి మరొక ఫోరంనకు బదిలీ చేయవచ్చు. దీనికి సర్క్యుట్ బెంచీలు ఉన్నవి. ఒకవేళ బాధిత వ్యక్తి ఈ |కమీషన్ ఆదేశాలతో తృప్తి చెందకపోతే ఆ ఆదేశాలు వెలువడిన 30 రోజులలోపు జాతీయ కమీషన్కు అప్పీలు చేసుకొనవచ్చును.

3) జాతీయ కమీషన్ : 1988 వ సంవత్సరములో కేంద్ర ప్రభుత్వము జాతీయ కమీషన్ ను ఏర్పాటు చేసినది. ఇది జాతీయస్థాయిలో పని చేస్తుంది. వినియోగదారుల సమస్యలను పరిష్కరించుటకు ప్రభుత్వముచే ఏర్పాటు చేయబడిన అత్యున్నత స్థానము. దీని కార్యాలయము కొత్త ఢిల్లీలో ఉన్నది. జాతీయ కమీషన్లో ఒక ప్రెసిడెంటు మరియు నలుగురు సభ్యులు, అవసరమయితే అంతకుమించి ఉంటారు. ఆ సభ్యులలో ఒకరు స్త్రీ సభ్యురాలు ఉంటారు. ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు జడ్జీగాని, విశ్రాంతి జడ్జిగాని అయి ఉండాలి. సభ్యులందరూ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో పట్టభద్రులై ఉండాలి. ప్రెసిడెంటు, మిగిలిన సభ్యులను కేంద్ర ప్రభుత్వము నియమిస్తుంది. ఒక కోటి రూపాయలకు మించిన విలువ గల వస్తువులు మరియు కోరిన పరిహారము ఉన్నట్లయితే జాతీయ కమీషన్కు ఫిర్యాదు చేయవచ్చును. జాతీయ కమీషన్ ఇచ్చిన తీర్పుతో బాధితుడు సంతృప్తి పొందకపోతే ఉత్తర్వులు జారీ చేసిన 30 రోజులలోపు సుప్రీంకోర్టుకు అప్పీలు చేయవచ్చు.

ప్రశ్న 4.
వినియోగదారుల రక్షణ చట్టము 1986 క్రింద ఏ వ్యక్తులు ఫిర్యాదు నమోదు చేయవచ్చు? ఎటువంటి ఫిర్యాదు నమోదు చేయవచ్చు ? ఫిర్యాదు ఎక్కడ ? ఎలా ? నమోదు చేయాలో చెప్పండి ?
జవాబు:
వినియోగదారుడు తనకు కలిగిన నష్టానికి సంబంధించి సరైన ఫోరంలో ఫిర్యాదు చేయవలెను. వినియోగదారుల రక్షణ చట్టము 1986 ప్రకారం దిగువ తెలిపిన వ్యక్తులు ఫిర్యాదు చేయవచ్చు.

  1. వినియోగదారుడు.
  2. వినియోగదారుల స్వచ్ఛంద సంఘము. ఇందులో సభ్యత్వము లేకపోయినా ఆ వ్యక్తి తరపున వీరు ఫిర్యాదు చేయవచ్చును.
  3. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వము.
  4. ఒకే రకమైన ఫిర్యాదులు చేయదలిచిన వ్యక్తులు కలిసి ఫిర్యాదు చేయవచ్చును.
  5. వినియోగదారునకు మరణం సంభవించిన అతని తరపున అతని వారసుడు.

ఒకరు లేదా అంతకు మించిన వారితరపున ఒక వినియోగదారుడు ఫిర్యాదు చేయవచ్చును.

  1. చేయకూడని వ్యాపారము, నిషేధించిన వ్యాపారమును చేయు వ్యాపారస్తులు, సరిగా సేవలను అందించని సేవా కేంద్రాలపై ఫిర్యాదు చేయవచ్చు.
  2. కొనుగోలు చేసిన వస్తువులు, కొనుగోలుకై చేసుకున్న ఒప్పందానికి సంబంధించిన వస్తువులలో లోపాలు ఉన్నప్పుడు.
  3. అందించవలసిన సేవలలో లేక అందించుటకు జరిగిన ఒప్పందము ప్రకారము సేవలలో లోటు ఏర్పడినపుడు.
  4. నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధర కలిగినపుడు :
    ఎ) అప్పటికి అమలులో ఉన్న చట్టబద్ధమైన విలువకు ఎక్కువగా ఉన్నట్లయితే;
    బి) ఆ వస్తువులో పేర్కొన్న ధర కంటే;
    సి) ధరల పట్టికలో పేర్కొన్న ధర కంటే;
    డి) అమ్మకపుదారుడు మరియు కొనుగోలుదారు చేసుకున్న ఒప్పందము ప్రకారము;
    ఇ) భద్రతలేని, ప్రాణహాని కలిగించే వస్తువులు లేదా సేవలకు సంబంధించి హాని జరిగితే;

AP Inter 2nd Year Commerce Study Material Chapter 5 వినియోగదారుల రక్షణ

కొనుగోలు చేసిన వస్తువులు/సేవలు మరియు కోరిన పరిహారము 20 లక్షల రూపాయలలోపు ఉన్నట్లయితే జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేయాలి. 20 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయలు దాటకపోతే ఫిర్యాదులు రాష్ట్ర ఫోరంలో చేయాలి. ఒక కోటి రూపాయలు మించినచో జాతీయ కమీషన్కు ఫిర్యాదు చేయవలెను.

ఫిర్యాదును వ్యక్తిగతముగా గాని, అధీకృత ఏజెంటు ద్వారా గాని లేదా పోస్టు ద్వారా చేయవచ్చు. సరైన సాక్ష్యాధారాలతో చేయనున్న ఆరోపణను ఆధారముగా చూపి ఒక పేపరుపై ఫిర్యాదు చేయవలెను. ఇందులో కోరిన పరిహారము కూడా స్పష్టముగా తెలపవలెను. ఈ పరిస్థితులు తలయెత్తిన సమయము, స్థలము తెలుపుతూ ఫిర్యాదు దారుని మరియు ఎవరిపై చేయదలచినారో ఆ వ్యక్తి చిరునామా ఇతర వివరాలు తెలపవలెను.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వినియోగదారుని అర్థం తెలపండి.
జవాబు:
వినియోగదారుని రక్షణ చట్టం 1986 ప్రకారము వస్తువులకు సంబంధించి వినియోగదారుడు అంటే వస్తువు కొనుగోలుదారు. ప్రతిఫలాన్ని చెల్లించడం ద్వారా లేదా చెల్లిస్తానని తెల్పడం ద్వారా వస్తువులను కొనుగోలు చేస్తానని ” హామీ ఇచ్చినవారు, పూర్తిగా లేదా పాక్షికముగా ప్రతిఫలాన్ని చెల్లించి వస్తువులు కొన్నవారు, వస్తువులను కొనుగోలుదారు అంగీకారముతో ఉపయోగించేవారు. సేవల విషయములో, ప్రతిఫలానికి సేవలను పొందేవారు లేదా అద్దెకు పొందేవారు, సేవలను కొనుగోలుదారు అంగీకారముతో ఉపయోగించేవారు.

ప్రశ్న 2.
వినియోగదారిత్వం అంటే ఏమిటి ?
జవాబు:
వినియోగదారిత్వము వ్యాపారము మీద వినియోగదారుని ఒత్తిడిని వ్యవస్థీకరించుట ద్వారా మార్కెట్లో అతని హక్కులను పరిరక్షించడము. వినియోగదారిత్వము అనగా వినియోగదారుల రక్షణ చట్టము 1986లో తెలపబడిన వినియోగదారుల హక్కులను రక్షించి చెల్లించే వస్తుసేవలకు సరైన ప్రమాణాలు ఉండేటట్లు చూడడము. ఫిలిఫ్ కొట్లర్ వినియోగదారిత్వము ఒక సామాజిక ఉద్యమము. దీనిలో అమ్మకపుదారులకు సంబంధించి కొనుగోలుదారుల హక్కులను తెలియజేయుట.

పై నిర్వచనాలను బట్టి వినియోగదారిత్వము అనగా ఇది పెరుగుతున్న సామాజిక శక్తి. ఇది వినియోగదారుల హక్కులను గురించి అవగాహన కల్గిస్తుంది. ఈ హక్కుల రక్షణకై

  1. వినియోగదారులకు బోధించి, వారి హక్కులకై పోరాడేటట్లు సంచయమును కలుగజేస్తుంది.
  2. వినియోగదారుల న్యాయమైన హక్కులను హామీ ఇచ్చే విధముగా ప్రభుత్వముపై ఒత్తిడిని తేవడం.
  3. వ్యాపారము నిజాయితీగాను, బాధ్యతగా చేసేటట్లు చూడటం.
  4. వ్యాపారములో అనుచిత చర్యలు, అన్యాయాలు జరగకుండా నివారించడం.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 5 వినియోగదారుల రక్షణ

ప్రశ్న 3.
వినియోగదారుని రక్షణ అంటే ఏమిటి ?
జవాబు:
వినియోగదారుల ఆసక్తిని, హక్కులను పరిరక్షించడాన్ని వినియోగదారుని రక్షణ అంటారు. వ్యాపార సంస్థల అనుచిత చర్యలను అరికట్టడానికి, వినియోగదారుల ఇబ్బందులను నివారించడం ద్వారా వినియోగదారులను రక్షించడాన్ని వినియోగదారుని రక్షణగా చెప్పవచ్చును. దిగువ తెల్పబడినవి సాధారణముగా వ్యాపారములో కన్పించే అనుచిత చర్యలు.

  1. కల్తీ వస్తువులను అమ్మడం, అమ్మే వస్తువులలో నాసిరకం వస్తువులను కలపడం.
  2. అసలు వస్తువులకన్నా తక్కువ విలువ గల వస్తువులను అమ్మడం.
  3. తక్కువ ప్రమాణము గల వస్తువులను అమ్మడం.
  4. నకిలీ వస్తువుల అమ్మకము.
  5. తూనికలు, కొలతలలో లోపం.
  6. అక్రమ నిల్వ, నల్లబజారు. ఈ చర్యల వలన కొరత, ధరలలో పెరుగుదల ఏర్పడతాయి.
  7. గరిష్ట రిటైల్ ధర కన్నా ఎక్కువ మొత్తాన్ని వసూలు చేయడం.
  8. లోపభూయిష్టమైన వస్తువుల సరఫరా.
  9. తప్పుదోవ పట్టించే ప్రకటనలు.
  10. చౌకబారు సేవలను సప్లయి చేయుట.

ప్రశ్న 4.
మహాత్మా గాంధీ మాటలలో వినియోగదారుడు అనగా ?
జవాబు:
జాతిపిత మహాత్మాగాంధీ ఒక గొప్ప నాయకుడే కాదు గొప్ప దార్శినికుడు కూడా. ఆర్థికపరమైన రక్షణ చర్యల ద్వారా వినియోగదారులను మోసాల నుండి కాపాడాలని ఉద్భోదించారు. ప్రస్తుతం దేశములో అసంఖ్యాక వాణిజ్య కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలలో ఆయన వినియోగదారుని విషయములో పేర్కొన్న దిగువ సూత్రాలు పొందు పరచిన బోర్డులు దర్శనమిస్తాయి.

“మన వద్దకు వచ్చే అందరి వ్యక్తులలో వినియోగదారుడు అందరి కంటే ముఖ్యమైనవాడు. అతడు మనపై ఆధారపడి జీవించటం కాదు. మనమే అతనిపై ఆధారపడుతున్నాము. అతడు మన కార్యకలాపాలకు ఆటంకము కాదు. మనము చేసే పనులన్నీ అతని కోసమే. మన వ్యాపారమునకు సంబంధించి అతడు బయట వ్యక్తికాదు. అతడే మన వ్యాపారములో ముఖ్యభాగస్వామి. అతనికి సేవలను అందించడం ద్వారా మనం అతనికి ఏదో మేలు చేస్తున్నట్లుగా భావించరాదు. సేవలను అందించే అవకాశం మనకు కల్పించడం ద్వారా అతనే మనకు ఎంతో మేలు చేస్తున్నాడు”.

ప్రశ్న 5.
జిల్లా ఫోరం.
జవాబు:
రాష్ట్ర ప్రభుత్వముచే ప్రతి జిల్లాలో ఈ ఫోరం ఏర్పాటుచేయబడును. జిల్లా ఫోరంనకు ఒక ఛైర్మన్ మరియు ఇద్దరు సభ్యులు ఉంటారు. అందులో ఒక స్త్రీ సభ్యురాలై ఉంటుంది. జిల్లా జడ్జీ స్థాయి ఉన్న వ్యక్తి ఈ ఫోరానికి అధికారి. 20 లక్షల రూపాయలకు మించని వస్తువుల ధర మరియు కోరిన పరిహారము ఉన్నట్లయితే జిల్లాఫోరంలో ఫిర్యాదు చేయవచ్చును. ఒకవేళ జిల్లా ఫోరంలో వినియోగదారుడు సంతృప్తి పొందకపోతే ఆదేశాలు వెలువడిన 30 రోజులలో రాష్ట్ర కమీషన్కు అప్పీలు చేసుకొనవచ్చును.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 5 వినియోగదారుల రక్షణ

ప్రశ్న 6.
రాష్ట్ర కమీషన్.
జవాబు:
రాష్ట్ర కమీషన్ ను రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాలలో ఏర్పాటు చేసినవి. రాష్ట్ర కమీషన్ లో ఒక ప్రెసిడెంటు, ఇద్దరు సభ్యులు తక్కువ కాకుండా, నిర్దేశించబడిన సభ్యుల సంఖ్య మించకుండా ఉంటారు. ఇందులో ఒక స్త్రీ సభ్యురాలై ఉంటుంది. హైకోర్టు స్థాయి గల జడ్జీ పర్యవేక్షణలో ఉంటాడు. 20 లక్షల రూపాయలకు మించి 1 కోటి రూపాయలకు తక్కువగా ఉన్న వస్తువుల విలువ మరియు కోరిన పరిహారము ఈ పరిమితిలో ఉన్నట్లయితే వ్రాతపూర్వకముగా ఇందులో ఫిర్యాదు చేయవచ్చు. ఒకవేళ బాధిత వ్యక్తి ఈ కమీషన్ ఆదేశాలకు తృప్తి చెందనట్లయితే ఈ ఆదేశాలు వెలువడిన 30 రోజులలోపు జాతీయ కమీషన్కు అప్పీలు చేసుకోవచ్చును.

ప్రశ్న 7.
జాతీయ కమీషన్.
జవాబు:
1988లో కేంద్ర ప్రభుత్వము జాతీయ కమీషన్ ను ఏర్పాటు చేసినది. వినియోగదారుల సమస్యలను పరిష్కరించుటకు ప్రభుత్వముచే ఏర్పాటు చేయబడిన అత్యున్నత స్థానము. దీనిని ఢిల్లీలో ఏర్పాటు చేసారు. ఇందులో ఒక ప్రెసిడెంటు మరియు నలుగురు సభ్యులు, (అవసరమయితే అంతకుమించి) వారిలో ఒక స్త్రీ సభ్యురాలై ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జీగాని, విశ్రాంత జడ్జీగాని దీనికి సారథ్యము వహిస్తారు. ఒక కోటి రూపాయలకు మించిన విలువ గల వస్తువులు మరియు కోరిన పరిహారము ఉన్నట్లయితే జాతీయ కమీషన్ ఎదుట ఫిర్యాదు చేయవచ్చును. జాతీయ కమీషన్ వెలువరించిన తీర్పుతో సంతృప్తి పొందని పక్షములో ఈ ఉత్తర్వులు వెలువడిన 30 రోజులలోపు బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చును.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 4 విత్త మార్కెట్లు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Commerce Study Material 4th Lesson విత్త మార్కెట్లు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Commerce Study Material 4th Lesson విత్త మార్కెట్లు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విత్తమార్కెట్ అంటే ఏమిటి ? దాని విధులు మరియు వర్గీకరణను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
విత్త మార్కెట్ అనే పదానికి విస్తృతమైన అర్థము ఉన్నది. ద్రవ్యత్వ ఆస్తులైన వాటాలు, బాండ్లు, కరెన్సీ నోట్లు మరియు డెరివేటివ్స్ వర్తకము కొరకు కొనుగోలు మరియు అమ్మకపుదారులు పాల్గొనే ఏ మార్కెట్ స్థలమైనా అది విత్తమార్కెట్ అవుతుంది. పెద్ద సంఖ్యలో విత్త సాధనాలను కలిగి ఉండే వివిధ విత్తమార్కెట్లు పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంటాయి. 20వ శతాబ్దము చివరి వరకు ఈ మార్కెట్లలో కొన్ని ప్రయివేటు పెట్టుబడిదారులకు ఎల్లప్పుడూ ప్రవేశము కల్పించగా, మిగిలినవి దేశీయముగా ఉన్న పెద్ద అంతర్జాతీయ బ్యాంకులు మరియు విత్త నిపుణుల కొరకు ప్రత్యేకించబడినవి.

విత్తమార్కెట్ విధులు’: దిగువ తెలిపిన నాలుగు ముఖ్య విధులను నిర్వర్తించుట ద్వారా పరిమిత వనరులను పంపిణీ చేయుటలో విత్త మార్కెట్లు ముఖ్యమైన పాత్రను వహిస్తున్నవి.
1) పొదుపును సమీకరించి ముఖ్య ఉత్పాదక రంగాలకు మళ్ళించడము: విత్త మార్కెట్ పొదుపు చేసేవారి నుంచి పెట్టుబడిదారులకు పొదుపు మొత్తాలను చేర్చడాన్ని సులభతరము చేస్తుంది. వివిధ పెట్టుబడులలో తమకు ఇష్టమైన వాటిలో అవకాశము కల్పించుట ద్వారా మిగులు నిధులు ముఖ్య ఉత్పాదక అవసరాలకు సరఫరా చేస్తుంది.

2) ధర నిర్ణయాన్ని సులభతరం చేయడం మార్కెట్ డిమాండ్ మరియు సప్లై శక్తులు, వస్తువు లేదా సేవల ధరలను నిర్ణయించడములో సహాయపడతాయి. విత్తమార్కెట్లో కుటుంబాలు నిధుల సరఫరాకు, వ్యాపార సంస్థలు డిమాండుకు ప్రాతినిధ్యము వహిస్తాయి. వాటి మధ్య ఉండే సంబంధము సంబంధిత మార్కెట్లో ఆర్థిక సంబంధమైన ఆస్తుల ధరలను నిర్ణయించడములో తోడ్పడుతుంది.

3) ఆర్థికపరమైన ఆస్తులకు ద్రవ్యత్వము కలుగజేయుట: ఆర్థిక పరమైన ఆస్తుల కొనుగోలు మరియు అమ్మకాలను విత్తమార్కెట్లు సులభతరము చేస్తాయి. ఈ విధముగా చేయడం వలన ఆస్తులకు ద్రవ్యత్వాన్ని కలుగజేసి అవసరమైనపుడు సులభముగా నగదులోనికి మార్చబడతాయి. విత్తమార్కెట్ యంత్రాంగము ద్వారా ఆస్తుల యజమానులు వారి ఆస్తులను || తక్షణము అమ్మగలుగుతారు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 4 విత్త మార్కెట్లు

4) కార్యకలాపాల వ్యయాన్ని తగ్గించడము మార్కెట్ లో వర్తకమయ్యే సెక్యూరిటీలను గురించి విలువైన సమాచారాన్ని విత్తమార్కెట్లు అందజేస్తాయి. ఇది విత్త ఆస్తుల కొనుగోలుదారులు మరియు అమ్మకపుదారుల కాలాన్ని, శ్రమను, ధనాన్ని ఆదా చేస్తుంది. అందువలన విత్తమార్కెట్ కొనుగోలుదారులు మరియు అమ్మకపుదారులు వారి వ్యక్తిగత అవసరాలను నెరవేర్చుకొనుటకు కలుసుకునే సాధారణ వేదికగా ఉంటుంది.

విత్తమార్కెట్ల వర్గీకరణ: విత్త మార్కెట్ల వర్గీకరణ అవి నిర్వహించే లావాదేవీల కాలపరిమితిని బట్టి ఉంటుంది. ఒక సంవత్సరంలోపు పరిమితిగల కార్యకలాపాలను ద్రవ్య మార్కెట్లోను, దీర్ఘకాల పరిమితిగల కార్యకలాపాలు మూలధన మార్కెట్లో నిర్వహించబడతాయి.

ద్రవ్యమార్కెట్: ఒక సంవత్సరము కాలపరిమితి గల స్వల్పకాలిక నిధులు / ద్రవ్య ఆస్తులతో వ్యవహారాలను జరిపే మార్కెట్ను డ్రవ్య మార్కెట్ అంటారు. ఈ ఆస్తులు ద్రవ్యానికి సమీప ప్రత్యామ్నాయాలుగా ఉంటాయి. తాత్కాలిక ‘ద్రవ్య అవసరాలకు, బాధ్యతలకు స్వల్పకాలిక నిధులను ఈ మార్కెట్ సమకూరుస్తుంది. మిగుల నిధుల నుండి రాబడులను ఆర్జించడానికి తాత్కాలిక బదలాయింపు చేస్తుంది. ఈ మార్కెట్లో రిజర్వుబ్యాంకు, వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగ్ ఇతర సంస్థలు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, భారీ కార్పొరేటు సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్ ముఖ్యపాత్రను వహిస్తాయి.

మూలధన మార్కెట్: మూలధన మార్కెట్ దీర్ఘకాలిక ఋణాలు సమకూర్చే సంస్థలు, సదుపాయాలను కలుగజేస్తుంది. ఇది ఋణ ఈక్విటీ దీర్ఘకాలిక నిధులు సమకూర్చి పెట్టుబడిగా పెడుతుంది. సమాజములోని పొదుపు మొత్తాలు వివిధ మార్గాల ద్వారా సేకరించి, పారిశ్రామిక, వాణిజ్య సంస్థలలో పెట్టుబడి పెట్టుటకు అందుబాటులో ఉంటాయి. మూలధన మార్కెట్లో అభివృద్ధి బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, స్టాక్ ఎక్సేంజ్లు ఉంటాయి.

మూలధన మార్కెట్ను ప్రాథమిక మార్కెట్ మరియు ద్వితీయ మార్కెట్ అను రెండు ముఖ్య విభాగాలుగా విభజించవచ్చును. మొదటి సారి నూతనముగా చేసిన జారీలను ప్రాథమిక మార్కెట్ అని, తదుపరి జరిగే ఏదైనా ద్వితీయ మార్కెట్ లో జరుగుతుంది.

ప్రశ్న 2.
మూలధన మార్కెట్ అంటే ఏమిటి ? దాని ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:
మూలధన మార్కెట్ అనే పదము దీర్ఘకాలిక ఋణాలు సమకూర్చే సంస్థలు మరియు సదుపాయాలను తెలుపుతుంది. దీనిలో ఋణ మరియు ఈక్విటీ దీర్ఘకాలిక నిధులు సమకూర్చబడి పెట్టుబడిగా పెట్టడం జరుగుతుంది. దీనిలో సమాజములోని పొదుపు మొత్తాలను వివిధ మార్గాల ద్వారా సేకరించి, పారిశ్రామిక, వాణిజ్య సంస్థలలో పెట్టుబడి పెట్టుటకు అందుబాటులో ఉంటాయి. మూలధన మార్కెట్లో అభివృద్ధి బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు మరియు స్టాక్ ఎక్సేంజ్లు ఉంటాయి. బాగా పనిచేసే మూలధన మార్కెట్ ఉండటము వలన ఆర్థికాభివృద్ధి ప్రక్రియ సులభతరం అవుతుంది. వాస్తవంగా ఆర్థికాభివృద్ధికి విత్త విధానము అభివృద్ధి చెందడం తప్పనిసరి అవుతుంది. ద్రవ్య సహాయక సంస్థలు అవసరమైన మేరకు అభివృద్ధి చెందడంతో పాటు మార్కెట్ కార్యకలాపాలు సులభముగా, నిష్పక్షపాతముగా మరియు పారదర్శకముగా ఉండటం ఎంతో అవసరము.

మూలధన మార్కెట్ ప్రాముఖ్యత:
1) పొదుపు చేసేవారిని, పెట్టుబడిదారులను అనుసంధానము చేయుట: దేశములో నిద్రాణముగా ఉన్న పొదుపు మొత్తాలను సమీకరించి ఉత్పాదక, పెట్టుబడి సంస్థలకు సరఫరా చేయడములో మూలధన మార్కెట్ ప్రముఖ పాత్రను వహిస్తుంది. అధిక ఆదాయము ఉన్నవారి నుంచి పొదుపును సమీకరించి, లోటు మరియు ఉత్పాదక రంగాలకు విత్త వనరులను బదిలీ చేస్తుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 4 విత్త మార్కెట్లు

2) పొదుపును ప్రోత్సహించడము: అభివృద్ధి చెందని దేశాలలో మూలధన మార్కెట్ లేకపోవడం వలన చాలా స్వల్ప పొదుపు మొత్తాలు మాత్రమే కలిగి, వాటిని అనుత్పాదక రంగాలలోను మరియు స్పష్టమైన వినియోగములోనూ వెచ్చిస్తున్నారు. మూలధన మార్కెట్ అభివృద్ధి చెందితే విత్త సంస్థలు ప్రజలను ప్రోత్సహించుటకు వివిధ రకాల సాధనాలను అందుబాటులోకి తెస్తాయి.

3) పెట్టుబడికి ప్రోత్సాహము: వాటాలు, బాండ్లు, సెక్యూరిటీలు మొదలైన పత్రాల లభ్యత వలన ప్రభుత్వానికి ఋణాల మంజూరుకు లేదా పరిశ్రమలలో పెట్టుబడికి ప్రోత్సాహం లభిస్తుంది. అందువలన వ్యాపారస్తులకు, ప్రభుత్వానికి ఋణాలు మంజూరు చేయడం ద్వారా మూలధన మార్కెట్ పెట్టుబడిని ప్రోత్సహిస్తుంది.

4) ధరలలో స్థిరత్వము: మూలధన మార్కెట్ వాటాలు, సెక్యూరిటీల ధరలను స్థిరీకరించి ధరల హెచ్చు, తగ్గులను నివారిస్తుంది. స్థిరీకరణ ప్రక్రియలో పరపతి కోరేవారికి తక్కువ వడ్డీ పెట్టుబడి సరఫరా సాధ్యపడుతుంది. స్పెక్యులేషన్ మరియు అనుత్పాదక రంగాలలో పెట్టుబడిని తగ్గించవచ్చును.

5) ఆర్థికాభివృద్ధిని పెంపొందించడము: ఏ దేశములోనైనా వివిధ రకాల పరిశ్రమలకు వనరులను సక్రమముగా పంపిణీ చేయుట ద్వారా సంతులిత ప్రాంతీయ అభివృద్ధిని సాధించవచ్చును. మూలధన మార్కెట్ దేశ సాధారణ స్థితిగతులను ప్రతిబింబించడమే కాక ఆర్థికాభివృద్ధి ప్రక్రియను, సులభతరము మరియు వేగవంతము చేస్తుంది.

ప్రశ్న 3.
ద్రవ్య మార్కెట్ మరియు మూలధన మార్కెట్ల మధ్య భేదాలు వ్రాయండి.
జవాబు:
మూలధన మార్కెట్

  1. పార్టిసిపెంట్సు: మూలధన మార్కెట్లో అభివృద్ధి బ్యాంకులు మరియు పెట్టుబడి సంస్థలు ప్రధాన పాత్రను పోషిస్తాయి.
  2. సాధనాలు: ఈక్విటీ వాటాలు, ఆధిక్యపు వాటాలు, డిబెంచర్లు, బాండ్లు మొదలైనవి ప్రధాన వ్యాపార సాధనాలుగా ఉంటాయి.
  3. పెట్టుబడి వ్యయము: మూలధన మార్కెట్లో పెట్టుబడి పెద్ద మొత్తములో అవసరము ఉండదు. దీనిలో సెక్యూరిటీల యూనిట్ల విలువ సాధారణముగా తక్కువగా ఉంటుంది.
  4. కాలపరిమితి: ఇది ఒక సంవత్సరము కంటే ఎక్కువ దీర్ఘకాల పరిమితిగల నిధులకు చెందిన మార్కెట్.
  5. ద్రవ్యత: మూలధన మార్కెట్ లోని సెక్యూరిటీలను ద్రవ్యత గల పెట్టుబడులుగా భావిస్తారు. కారణం వీటిని స్టాక్ ఎక్సేంజ్లలో అమ్మవచ్చును.
  6. భద్రత: రాబడి మరియు పెట్టుబడి తిరిగి పొందే విషయములో మూలధన మార్కెట్ సాధనాలు నష్టభయంతో కూడుకున్నవి.
  7. ఆశించే రాబడి: మూలధన మార్కెట్లో పెట్టుబడి వలన సాధారణముగా పెట్టుబడిదారులకు ద్రవ్యమార్కెట్లో కంటే ఎక్కువగా రాబడి వచ్చే అవకాశము ఉన్నది.
  8. నియంత్రణ: మూలధన మార్కెట్లోని సంస్థలను సెబి నియంత్రిస్తుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 4 విత్త మార్కెట్లు

ద్రవ్య మార్కెట్
కేంద్ర బ్యాంకు మరియు వాణిజ్య బ్యాంకులు ప్రధాన భాగస్వాములుగా ఉంటాయి.
స్వల్పకాల పరిమితి ఋణ సాధనాలైన ట్రెజరీ బిల్లులు, వర్తకపు బిల్లులు, వాణిజ్య పత్రాలు, డిపాజిట్ సర్టిఫికేట్లు ముఖ్య సాధనాలుగా ఉంటాయి. ద్రవ్య మార్కెట్లో సాధనాలు అధిక వ్యయముతో కూడినవి కావడముతో కార్యకలాపాలు పెద్ద మొత్తములో జరుగుతాయి.

ఇది ఒక సంవత్సరం కాలము మించని స్వల్ప కాల పరిమితి గల నిధుల మార్కెట్.

ద్రవ్య మార్కెట్లోని సాధనాలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండటం వలన అత్యధిక ద్రవ్యత్వాన్ని పొందుతున్నది.

ద్రవ్య మార్కెట్ సాధారణముగా కనీస నష్టభయం మాత్రమే కలిగి చాలా బాధ్యతతో కూడినది. స్వల్పకాల పెట్టుబడి మరియు జారీ చేసే వారి ఆర్థిక పటిష్టత వలన భద్రత అధికముగా ఉంటుంది.

మూలధన మార్కెట్తో పోల్చి చూసినపుడు ద్రవ్య మార్కెట్లో పెట్టిన పెట్టుబడికి రాబడి తక్కువగా ఉంటుంది.
భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్యమార్కెట్లను నియంత్రిస్తుంది.

ప్రశ్న 4.
స్టాక్ ఎక్సేంజ్్న నిర్వచించి, దాని విధులను చూపండి.
జవాబు:
సెక్యూరిటీల కాంట్రాక్టు క్రమబద్ధచట్టము 1956 స్టాక్ ఎక్సేంజ్ని క్రింది విధముగా నిర్వచించినది. “సెక్యూరిటీలలో వ్యవహారాలు, వాటి కొనుగోలు, అమ్మకాల వ్యాపారములో సహాయము చేయుట, క్రమబద్ధము చేయుట, నియంత్రణ చేయుట మొదలైన ఆశయాలతో ఏర్పడిన నమోదు అయిన లేదా నమోదు కాని వ్యక్తుల సంఘము లేదా వ్యవస్థ”.

స్టాక్ ఎక్సేంజ్ విధులు:
1) మార్కెట్ను సిద్ధముగా ఉంచుట: అన్ని రకములైన సెక్యూరిటీలను అన్నివేళలా కొనడానికి, అమ్మడానికి సంసిద్ధంగా ఉన్న మార్కెట్ స్టాక్ ఎక్సేంజ్. అందువలన పారిశ్రామిక, వ్యాపార సంస్థలు మూలధనాన్ని సేకరిస్తాయి.

2) సెక్యూరిటీలకు ద్రవ్యతను కలుగజేయుట: స్టాక్ ఎక్సేంజ్ వలన పారిశ్రామిక సంస్థల సెక్యూరిటీలను కొనడానికి, అమ్మడానికి సిద్ధముగా ఉంటుంది. పెట్టుబడిదారులు తేలికగా సెక్యూరిటీలను అమ్ముకొని, సొమ్ము వాపసు తీసుకోవచ్చు. స్టాక్ ఎక్సేంజ్ల వలన సెక్యూరిటీలకు ద్రవ్యత మరియు మార్కెట్ లభిస్తాయి.

3) కొత్త సెక్యూరిటీల పంపిణీ: కొనసాగుతున్న కంపెనీలకు మూలధనము అవసరము అవుతుంది. ఈ అవసరాన్ని స్టాక్ ఎక్సేంజ్ల ద్వారా తీసుకోవచ్చు. కంపెనీ సెక్యూరిటీలకు విస్తృతమైన ప్రచారము చేసి, పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయి.

4) మూలధన కల్పనకు అవకాశము: ప్రజలలో పొదుపును, పెట్టుబడి, నష్టము భరించే శక్తిని స్టాక్ ఎక్సేంజ్లు ప్రోత్సహిస్తాయి. దీని వలన ఎక్కువ మూలధన కల్పనకు, దేశ సౌభాగ్యానికి అవకాశము ఏర్పడి దేశ ఆర్థికాభివృద్ధి జరుగును.

5) సెక్యూరిటీల విలువను లెక్కగట్టుట: స్టాక్ ఎక్సేంజ్లలో నిత్యం జరిగే వ్యవహారములు అధికారికముగా నమోదు అవుతాయి. దీనివలన ఏ కంపెనీ పరిస్థితి ఏ విధముగా ఉందనే విషయము పెట్టుబడిదారులకు తెలుస్తుంది. కంపెనీల సెక్యూరిటీల విలువను హేతుబద్ధముగా నిర్ణయించడం జరుగుతుంది.

6) పెట్టుబడిదారుల ఆసక్తులను పరిరక్షించుట: వ్యవహారాలన్నీ స్టాక్ ఎక్సేంజ్లో ముందుగా నిర్ణయించబడిన నిబంధనల ప్రకారము జరుగుతాయి. ఈ నిబంధనలు సెక్యూరిటీల కాంట్రాక్టు రెగ్యులేషన్ చట్టము 1956కు లోబడి ఉంటాయి. అందువలన పెట్టుబడిదారులకు న్యాయము, భద్రత చేకూరుతాయి.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 4 విత్త మార్కెట్లు

7) స్పేక్యులేషన్కు అవకాశము: సెక్యూరిటీల ధరలలో మార్పులను హేతుబద్ధముగా ముందుగానే ఊహించి సెక్యూరిటీలను కొనుగోలు, అమ్మకాలు జరపడాన్ని స్పెక్యులేషన్ వ్యాపారం అంటారు. స్టాక్ ఎక్సేంజ్లు స్పెక్యులేషన్కు అవకాశాన్ని కల్పిస్తాయి. సెక్యూరిటీల డిమాండ్, సప్లల మధ్య పొంతన ఏర్పడి, దేశమంతటా ఇంచుమించు ఒకే ధర
అమలులో ఉంటుంది.

8) ఉత్పాదక కార్యక్రమాలకు ద్రవ్యమును ఉపయోగించుట: క్రమబద్ధమైన స్టాక్ మార్కెట్లు ఉండటం వలన దేశములో జరిగే పొదుపు, బంగారములోను, భూముల రూపములో కాకుండా పారిశ్రామిక రంగములో పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. ‘పారిశ్రామికాభివృద్ధి, ఆర్థిక ప్రగతిని సాధించవచ్చు.

ప్రశ్న 5.
SEBI అనగానేమి ? దాని లక్ష్యాలు మరియు విధులను వివరించండి.
జవాబు:
సెక్యూరిటీస్ మరియు ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) క్రమబద్ధమైన మరియు ఆరోగ్యకరమైన సెక్యూరిటీల అభివృద్ధి మరియు పెట్టుబడిదారులకు రక్షణగా పరిపాలన సమితిగా 1988 ఏప్రిల్లో భారత ప్రభుత్వముచే స్థాపించబడినది. ఇది భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలన, నియంత్రణలో పనిచేస్తుంది. SEBI |కి జనవరి 1992లో ఒక ఆర్డినెన్సు ద్వారా చట్టబద్ధత కల్పించబడి, తర్వాత ఆర్డినెన్సు స్థానములో పార్లమెంటు సెక్యూరిటీస్ నుండి ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా చట్టము, 1992లో చేయబడినది.

సెబి లక్ష్యాలు: సెబి ప్రధాన లక్ష్యము పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటం, అభివృద్ధిని ప్రోత్సహించడం మరియు సెక్యూరిటీల మార్కెట్ను నియంత్రించడం.

  1. సరైన మార్గములో విధులు నిర్వర్తించేలా స్టాక్ ఎక్సేంజ్లను మరియు సెక్యూరిటీల పరిశ్రమను నియంత్రించడం.
  2. పెట్టుబడిదారులు ముఖ్యముగా వ్యక్తిగత పెట్టుబడిదారుల హక్కులు మరియు ఆసక్తులను పరిరక్షించడం, వారికి మార్గదర్శకం మరియు అవగాహన కల్పించడము.
  3. ట్రేడింగ్ అక్రమాలను నిరోధించడం మరియు సెక్యూరిటీల పరిశ్రమల స్వయం నియంత్రణ మరియు దాని చట్టబద్ధ నియంత్రణల మధ్య సమన్వయం సాధించడం.
  4. బ్రోకర్లు, మర్చంట్ బ్యాంకర్లు మొదలైన మధ్యవర్తులలో పోటీతత్వము మరియు వృత్తినైపుణ్యం కలుగజేయుటకు ప్రవర్తనా నియమావళిని అభివృద్ధి చేయడం మరియు సక్రమ విధానాలను రూపొందించడము.

సెబి విధులు: సెబి సెక్యూరిటీల మార్కెట్ నియంత్రణ మరియు అభివృద్ధి, రక్షణ విధులను కూడా నిర్వహిస్తుంది.
I) నియంత్రణ విధులు:

  1. బ్రోకర్లు, ఉపబ్రోకర్లు మరియు మార్కెట్లో గల ఇతర వ్యక్తుల నమోదు.
  2. ఉమ్మడి పెట్టుబడి పథకాలు మరియు మ్యూచువల్ ఫండ్స్ నమోదు.
  3. స్టాక్ ఎక్సేంజ్లు, మరే ఇతర సెక్యూరిటీల మార్కెట్లోని స్టాక్ బ్రోకర్లు, పోర్ట్ ఫోలియో ఎక్సేంజ్లు, చందా పూచీదారులు మరియు మర్చంట్ బ్యాంకర్లను నియంత్రిస్తుంది.
  4. కంపెనీల టేస్ఓవర్ బిడ్లను నియంత్రించుట.
  5. స్టాక్ ఎక్సేంజ్లు మరియు మధ్యవర్తులను పర్యవేక్షణ చేయడం, విచారించడం మరియు ఆడిట్ చేయడం ద్వారా సమాచారాన్ని సేకరించడం.
  6. చట్టము యొక్క ప్రయోజనాలు కాపాడటానికి ఫీజు లేక ఇతర ఛార్జీలను విధించడం.
  7. భారత ప్రభుత్వము సెక్యూరిటీల కాంట్రాక్టు (క్రమబద్ధ) చట్టం, 1956 క్రింద అప్పగించిన అధికారాన్ని
    వినియోగించడం.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 4 విత్త మార్కెట్లు

II) అభివృద్ధి విధులు

  1. సెక్యూరిటీల మార్కెట్ మధ్యవర్తులకు శిక్షణ ఇవ్వడం.
  2. పరిశోధనలను నిర్వహించి మార్కెట్లో పాల్గోనే వారికి ఉపయోగపడే సమాచారాన్ని ప్రచురించడం.
  3. సరళమైన విధానాన్ని అనుసరించుట ద్వారా మూలధన మార్కెట్ అభివృద్ధికి చర్యలు చేపట్టడం.

III) రక్షిత విధులు:

  1. తప్పుడు ప్రకటనలు, అవకతవకలు మొదలైన మోసపూరిత మరియు అన్యాయమైన వ్యాపార విధానాలను నిషేధించడము.
  2. ఇన్సైడ్ ట్రేడింగ్ను నియంత్రించడం మరియు అటువంటి విధానాలపై భారీ జరిమానాలు విధించడం.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ద్రవ్య మార్కెట్ యొక్క భాగాలను వివరించండి.
జవాబు:
ద్రవ్య మార్కెట్లో దిగువ భాగాలు ఉంటాయి.
1) పిలుపు ద్రవ్య మార్కెట్: ఇది భారతదేశ ద్రవ్య మార్కెట్కు ఒక ముఖ్యమైన ఉప మార్కెట్. దీనిని పిలుపుకు ద్రవ్యము మరియు చిన్న నోటీసుకు ద్రవ్యము మరియు బ్యాంకుల మధ్య ఋణ మార్కెట్ అని కూడా పిలుస్తారు. ఈ మార్కెట్లో ద్రవ్యాన్ని అతిస్వల్ప కాలము కోసం డిమాండు చేస్తారు. ఇందులో లావాదేవీల వ్యవధి కొన్ని గంటల నుండి 15 రోజుల వరకు ఉంటుంది. ఇది ముంబై, ఢిల్లీ, కలకత్తా మొదలైన పారిశ్రామిక మరియు వాణిజ్య ప్రాంతాలలో బాగా ప్రాచుర్యం పొందినది. ప్రాథమికముగా ఈ లావాదేవీలు, స్టాక్ బ్రోకర్లు మరియు డీలర్ల ఆర్థిక అవసరాలను తీర్చడానికి సహాయపడతాయి. అందుబాటులో ఉన్న ద్రవ్యముపై విధించే రేటును పిలుపు రేటు అంటారు. ఈ రేటును ద్రవ్యానికి ఉన్న డిమాండు మరియు పిలుపు రేటు అంటారు. ఈ రేటును ద్రవ్యానికి ఉన్న డిమాండు మరియు సప్ల ఆధారముగా మార్కెట్ శక్తులచే నిర్ణయింపబడుతుంది.

2) అంగీకార మార్కెట్: ఇది స్వల్పకాలిక సాధనాలు కలిగిన మార్కెట్. ప్రధానముగా ఎగుమతిదారులు తాము ఎగుమతి చేసిన వస్తువులకు త్వరగా చెల్లింపు పొందడానికి ఉపయోగించే పరపతి సాధనము.

3) బిల్ మార్కెట్: బిల్ మార్కెట్ అనగా స్వల్పకాలిక బిల్లులు అని అర్థము. ఇది స్వల్ప తేదీగల పత్రాలు, బిల్లులు మొదలైనవి కొనుగోలు మరియు అమ్మకాల కోసం ఉద్దేశించబడినది. ఇది వాణిజ్య బిల్ మార్కెట్ మరియు ట్రెజరీ బిల్ మార్కెట్ను కలిగి ఉంటుంది. ట్రెజరీ బిల్లులను మార్కెట్ చేయడం ద్వారా ప్రభుత్వానికి సహాయపడుతుంది. అలాగే ఇతర రంగాలకు కూడా సహాయపడుతుంది.

4) అనుషంగిక ఋణ మార్కెట్: ఇది ద్రవ్యమార్కెట్లో ఒక ముఖ్యమైన భాగము. ఓవర్ డ్రాఫ్టులు, నగదు క్రెడిట్లపై ఋణాల రూపములో తీసుకుంటుంది. ప్రభుత్వ సెక్యూరిటీలు, బంగారం, వెండి, కార్పొరేషన్ల స్టాక్లు కనీస నగదు నిల్వలను నగదు రిజర్వు నిష్పత్తి అంటారు. పిలుపు ద్రవ్య ఋణాలపై చెల్లించే వడ్డీ రేటును పిలుపు రేటు అంటారు. ఈ రేటు రోజు రోజుకు, కొన్నిసార్లు గంట గంటకు మారుతూ ఉంటుంది.

5) డిపాజిట్ సర్టిఫికేట్లు: సెక్యూరిటీ ఆధారము లేని స్వల్పకాల సాధనాలైన డిపాజిట్ సర్టిఫికేట్లను వాణిజ్య బ్యాంకులు మరియు అభివృద్ధి చెందిన ద్రవ్యసహాయ సంస్థలు జారీ చేస్తాయి. బ్యాంకు డిపాజిట్ల వృద్ధి తక్కువగా ఉండి, పరపతి అవసరాలు ఎక్కువగా ఉండి ద్రవ్యత్వము లోపించిన సందర్భాలలో వ్యక్తులకు, కార్పొరేషన్లకు మరియు కంపెనీలకు ఈ సర్టిఫికేట్లు జారీ చేయబడతాయి. స్వల్ప కాలానికి పెద్ద మొత్తాలలో డబ్బు సమీకరించడానికి సహాయపడతాయి. దీనిలో నష్టభయము ఎక్కువగా ఉండటం వలన డిపాజిట్ సర్టిఫికేట్లపై రాబడి ట్రెజరీ బిల్లుల కంటే ఎక్కువగా ఉంటుంది.

6) వాణిజ్యబిల్లు: వ్యాపారము చేసే వివిధ సంస్థలు నిర్వహణ మూలధన అవసరాలకు జారీచేసే బిల్లులను వాణిజ్య బిల్లులు అంటారు. ఇది సంస్థల అరువు అమ్మకాల ద్రవ్య సహాయానికి ఉపయోగపడే స్వల్పకాలిక, బదిలీ యోగ్యతగల, స్వయం ద్రవ్యత్వముగల సాధనము. ఈ బిల్లును అరువుకు అమ్మినవారు వ్రాయగా, అరువుకు కొన్నవారు సమ్మతిని తెలుపుతారు. అప్పుడు అది బిల్ మార్కెట్ సాధనమై వర్తకపు బిల్లుగా పిలవబడుతుంది. గడువు కాలంలోగా అమ్మకపుదారుడు డబ్బు అవసరమయితే ఈ బిల్లును బ్యాంకు వద్ద డిస్కౌంటు చేసుకోవచ్చు. వర్తకపు బిల్లులను వాణిజ్య బ్యాంకు అంగీకరిస్తే ఆ బిల్లును వాణిజ్య బిల్లు అంటారు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 4 విత్త మార్కెట్లు

7) అనుషంగిక ఋణాలు: ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్ల ఆధారముగా వాణిజ్య బ్యాంకులు అందజేసే ఋణాలను అనుషంగిక ఋణాలు అంటారు.

ప్రశ్న 2.
ద్రవ్య మార్కెట్ సాధనాలను వివరించండి.
జవాబు:
1) ట్రెజరీబిల్: సాధారణముగా కేంద్ర ప్రభుత్వము సంవత్సరము లోపు కాలపరిమితిగల స్వల్పకాలిక ఋణం పొందడానికి ట్రెజరీబిల్ ఒక సాధనముగా ఉపయోగపడుతుంది. స్వల్పకాలిక అవసరాలకు నిధులు పొందడానికి భారత ప్రభుత్వము తరపున భారతీయ రిజర్వుబ్యాంకు ‘జీరో కూపన్ బాండ్ల’ పేరుతో వీటిని జారీ చేస్తుంది. వీటి కొనుగోలు ధర ముద్రిత విలువ కంటే తక్కువగా ఉంటుంది. తిరిగి చెల్లించేటపుడు పూర్తి ముఖ విలువను ప్రభుత్వం చెల్లిస్తుంది.

2) వాణిజ్య పత్రము: నిర్ణీత కాలపరిమితికి జారీచేసి, తిరిగి విమోచనము చేయు సెక్యూరిటీ లేని ప్రామిసరీ నోటు, అన్యాక్రాంత మరియు బదిలీ యోగ్యత గల పత్రాన్ని వాణిజ్య పత్రము అంటారు. భారీ మరియు పరపతి గల కంపెనీలు మార్కెట్ రేటు కంటే తక్కువ వడ్డీకి స్వల్పకాలిక నిధులు పెంచుకునేందుకు వీటిని జారీ చేస్తాయి. సాధారణముగా ఈ వాణిజ్య పత్రాల కాలవ్యవధి 15 రోజుల నుండి ఒక సంవత్సరము వరకు ఉంటుంది. దీనిని డిస్కాంటుకు జారీ చేసి అసలు ధరకు విమోచనం చేయడం జరుగుతుంది. కాలానుగుణ మరియు నిర్వహణ మూలధన అవసరాలకు స్వల్పకాలిక నిధులు సమకూర్చడం దీని ముఖ్యఉద్దేశము. బ్రిడ్జ్ ఫైనాన్స్ అవసరాల నిమిత్తము ఈ సాధనాన్ని కంపెనీలు ఉపయోగిస్తాయి.

3) పిలుపు ద్రవ్యము: ఇది స్వల్పకాలిక నిధుల మార్కెట్. కోరిన తక్షణము కాల పరిమితి ఒక రోజు నుంచి 15 రోజు లోపు తిరిగి చెల్లించే పద్ధతిపై తక్కువ నగదు నిల్వలు ఉన్న బ్యాంకులు ఎక్కువ నగదు నిల్వలున్న బ్యాంకుల నుంచి ఋణాలు తీసుకుంటాయి.

ప్రశ్న 3.
మూలధన మార్కెట్ యొక్క సాధనాలను వివరించండి.
జవాబు:
మూలధన మార్కెట్ సాధనాలు:
1) రక్షిత ప్రీమియం నోట్లు: ప్రీమియంతో విమోచన చేయదగిన మరియు వేరుచేయగల వారెంటుతో 4 నుండి 7 సంవత్సరాల కాల వ్యవధిలో జారీ చేసిన డిబెంచర్లను రక్షిత ప్రీమియం నోట్లు అంటారు. వీటికి జత చేసిన వారంట్ల ఆధారముగా కలిగిన వారికి పూర్తిగా చెల్లించిన ఈక్విటీ వాటాలను పొందే హక్కు ఉంటుంది.

2) అధిక డిస్కౌంటు బాండ్లు: కాలవ్యవధి తరువాత సమాన విలువకు విమోచనము చేసే ఉద్దేశ్యముతో డిస్కౌంటుకు విక్రయించే బాండ్లను డిస్కౌంటు బాండ్లు అంటారు. జారీదారు దీర్ఘకాలిక నిధుల అవసరాలకు అనుగుణముగా వీటిని రూపొందిస్తారు. పెట్టుబడిదారులు వెంటనే రాబడి కోసం ఎదురు చూడకుండా 25-30 సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత అమ్మడానికి కొనుగోలు చేస్తారు.

3) వేరుచేయగలిగిన వారెంట్లతో ఈక్విటీ వాటాలు: కంపెనీ జారీ చేసిన వారెంట్లలో పేర్కొన్న కాలము నిర్ణయించిన ధరవద్ద నిర్దేశించిన వాటాల సంఖ్యను వాటాదారుడు కొనుగోలు చేస్తాడు. ఈ వారంట్లు స్టాక్ ఎక్సేంజ్లో విడిగా నమోదై, విడిగా ట్రేడ్ అవుతాయి.

4) వడ్డీతో పూర్తిగా మారే డిబెంచర్లు: ఇవి నిర్దిష్టకాలము తర్వాత పూర్తిగా ఈక్విటీ వాటాలుగా మార్చబడతాయి. మార్పిడి అనేది ఒకటి లేదా అనేక దశలలో జరగవచ్చు. సాధనము ఒక పూర్తి ఋణ సాధనము అయినపుడు పెట్టుబడిదారులకు వడ్డీ చెల్లించబడుతుంది. అయితే మార్పిడి తర్వాత వడ్డీ చెల్లింపు కూడా మారుతుంది.

5) స్వెట్ ఈక్విటీ వాటాలు: ఉద్యోగులు లేదా డైరెక్టర్లు చేసిన పనికి గుర్తింపుగా సంస్థ వారికి జారీచేసే ఈక్విటీ వాటాలను స్వెట్ ఈక్విటీ వాటాలు అంటారు. సాధారణముగా కంపెనీ వాటాలను కొనుగోలు చేయడం ఉద్యోగులకు ఐచ్ఛికము, కాబట్టి స్వెట్ వాటాల వలన వారు జీతముతో పాటు యాజమాన్య లాభాలలో కూడా భాగం పంచుకుంటారు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 4 విత్త మార్కెట్లు

6) విపత్తు బాండ్లు: వీటినే ఉపద్రవ లేదా కాట్ బాండ్లు అంటారు. విపత్తు బాండు సాధారణముగా బీమా సౌకర్యం కలిగిన అధిక దిగుబడినిచ్చే ఋణ సాధనము మరియు విపత్తు సమయంలో డబ్బును సేకరించడానికి వీటిని జారీ చేస్తారు. జారీదారు (బీమా లేదా పునఃభీమా కంపెనీ) ముందుగా నిర్వచించబడిన విపత్తుల వలన ఏర్పడిన నష్టాలతో సతమవుతున్న ప్రత్యేక పరిస్థితులలో వడ్డీని చెల్లించి, తిరిగి చెల్లించవలసిన అసలును వాయిదా వేయడం లేదా పూర్తిగా వదిలి వేయడం జరుగుతుంది.

7) విదేశీ కరెన్సీ మారకపు బాండ్లు మారకపు బాండును డెట్ మరియు ఈక్విటీ సాధనాల సమ్మేళనముగా చెప్పవచ్చు. ఇది రెగ్యులర్ కూపను మరియు అసలు చెల్లింపుతో పాటు బాండు యొక్క ఈక్విటీ లక్షణం కారణముగా కంపెనీ స్టాక్ లో వచ్చే ధరల పెరుగుదల ప్రయోజనము కూడా పొందగలడు.

8) డెరివేటివ్స్: డెరివేటివ్ అనేది ఒక విత్త సాధనము. సాధారణముగా ఆస్తులైన కమాడిటీ, బాండ్, ఈక్విటీ, కరెన్సీ, ఇండెక్స్ మొదలైన వాటి లక్షణాలు మరియు విలువల మీద డెరివేటివ్ లక్షణాలు మరియు విలువలు ఆధారపడి ఉంటాయి.

ప్రశ్న 4.
ప్రాథమిక మరియు ద్వితీయ మార్కెట్ల మధ్యగల తేడాలు ఏవి ?
జవాబు:
ప్రాథమిక మార్కెట్

  1. నూతనముగా ప్రారంభమైన కంపెనీ లేదా కొనసాగుతున్న కంపెనీ కొత్తగా సెక్యూరిటీలను పెట్టుబడిదారులకు అమ్మడం జరుగుతుంది.
  2. కంపెనీ పెట్టుబడిదారుకు నేరుగా లేదా మధ్య వర్తుల ద్వారా సెక్యూరిటీలను అమ్మడం జరుగుతుంది.
  3. నిధుల ప్రవాహము పొదుపు చేసే వారి నుండి పెట్టుబడిదారులకు బదిలీ ద్వారా ప్రాథమిక మార్కెట్ ప్రత్యక్షముగా మూలధన నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది.
  4. ప్రాథమిక మార్కెట్ సెక్యూరిటీల కొనుగోలు మాత్రమే జరుగుతుంది. అమ్మకాలు సాధ్యము కాదు.
  5. కంపెనీ నిర్వాహకులచే సెక్యూరిటీల ధరలు నిర్ణయించబడతాయి.
  6. స్థిరమైన భౌగోళిక ప్రదేశము ఉండదు.

ద్వితీయ మార్కెట్

  1. ఇక్కడ అప్పటికీ జారీ చేసిన వాటాలలో ట్రేడింగ్ జరుగుతుంది.
  2. అప్పటికీ ఉన్న వాటాల యజమాన్యపు హక్కు పెట్టుబడిదారుల మధ్య బదిలీ అవుతుంది.
  3. వాటాలను నగదులోనికి మార్చుకునే వీలుండడం వలన ద్వితీయ మార్కెట్ పరోక్షముగా మూలధన నిర్మాణమును ప్రోత్సహిస్తుంది.
  4. స్టాక్ ఎక్సేంజ్లో సెక్యూరిటీల కొనుగోలు మరియు అమ్మకాలు జరుగుతాయి.
  5. సెక్యూరిటీల ధరలు వాటి డిమాండు మరియు సప్లయి ఆధారముగా నిర్ణయించబడతాయి. 6) నిశ్చయమైన ప్రదేశములో ద్వితీయ మార్కెట్ వ్యవహారాలు జరగుతాయి.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 4 విత్త మార్కెట్లు

ప్రశ్న 5.
BSE మరియు NSE గురించి మీకు ఏమి తెలుసు ?
జవాబు:
బాంబే స్టాక్ ఎక్సేంజ్ (BSE): భారతదేశములో మొట్టమొదటి స్టాక్ ఎక్సేంజ్ నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ బొంబాయి నగరములో 1875వ సంవత్సరములో స్థాపించబడినది. కాలానుక్రమముగా ఈ సంస్థ బాంబే స్టాక్ ఎక్సేంజ్ గా రూపాంతరము చెందినది. ఇది ఆసియాలో మొదటి స్టాక్ ఎక్సేంజ్ మరియు భారతదేశములోనే లీడింగ్ ఎక్సేంజ్ గ్రూపులలో ఒకటి. గడచిన 140 సంవత్సరాల నుంచి మూలధన సమీకరణ చేస్తూ భారతీయ కార్పొరేటు రంగ అభివృద్ధికి సహకరిస్తుంది. ఇది సెక్యూరిటీల కాంట్రాక్టు (రెగ్యులేషన్) చట్టం 1956 కింద కేంద్ర ప్రభుత్వంచే 1956లో గుర్తించబడిన మొదటి స్టాక్ ఎక్సేంజ్. ఇది ఆసియాలో 4వ అతి పెద్ద స్టాక్ ఎక్సేంజ్ మరియు ప్రపంచములో 9వ అతి పెద్ద స్టాక్ ఎక్సేంజ్ కీర్తించబడినది. 5000లకు పైగా కంపెనీల నమోదు కలిగిన స్టాక్ ఎక్సేంజ్ ప్రపంచములో మొదటి స్థానం పొందినది.

జాతీయ స్టాక్ ఎక్సేంజ్ (NSE): భారత స్టాక్ మార్కెట్లో అతి ముఖ్యమైన అభివృద్ధి జాతీయ స్టాక్ ఎక్సేంజ్ స్థాపనగా చెప్పవచ్చు. దీనిని నవంబరు 27, 1992న అధునాతన సాంకేతిక పరిజ్ఞానముతో స్థాపించబడి, ఏప్రిల్ 1993లో స్టాక్ ఎక్సేంజ్ గుర్తింపబడినది. 1994వ సంవత్సరములో తన కార్యకలాపాలను డెట్ రంగములో ప్రారంభించినది. తదుపరి నవంబరు 1994లో ఈక్విటీల కొరకు మూలధన రంగములోకి జూన్ 2000 సంవత్సరములో డెరివేటివ్స్ రంగములోనికి తన కార్యకలాపాలను విస్తరించినది. ఇది జాతీయ స్థాయిలో అధునాతన స్క్రీన్ ఆధారిత వర్తక విధానాన్ని నెలకొల్పినది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ స్టాక్ మార్కెట్ కార్యకలాపాలను పెట్టుబడిదారుల ముందరకు తీసుకొనిరాగలిగినది. భౌగోళిక ప్రాంతాలతో సంబంధము లేకుండా పాదర్శకతతో అందరికి సమానముగా అందుబాటులో ఉండే విధముగా జాతీయ స్క్రీన్ ఆటోమేటిక్ వర్తక విధానాన్ని జాతీయ స్టాక్ ఎక్సేంజ్ ఏర్పాటు చేసినది.

ప్రశ్న 6.
డిపాజిటరీ మరియు డిమెటీరియలైజేషన్ గురించి క్లుప్తంగా వ్రాయండి.
జవాబు:
డిపాజిటరీ: బ్యాంకు ఖాతాదారుల సొమ్మును సురక్షితముగా ఉంచినట్లే డిపాజిటరీ కూడా పెట్టుబడిదారుల తరపున సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ రూపములో ఉంచుతుంది. డిపాజిటరీ వద్ద ఖాతాను ప్రారంభించి వాటాలన్నీ | డిపాజిట్ చేయబడతాయి. ఖాతాదారుని తరపున అతని సూచనలకు అనుగుణముగా వాటాలను కొనడం, అమ్మడం జరుగుతుంది. ఇది సాంకేతిక పరిజ్ఞానంతో నడపబడే ఎలక్ట్రానిక్ స్టోరేజ్ పద్ధతి. దీనిలో వాటా పత్రాలు, బదిలీలు మొదలైన వాటికి సంబంధించి ఎటువంటి పేపర్ వర్క్ ఉండదు. పెట్టుబడిదారుల వ్యవహారాలన్నీ ఎక్కువ వేగము, సామర్థ్యముతో పరిష్కరించబడతాయి మరియు సెక్యూరిటీలన్నీ బుక్ ఎంట్రీ రూపములో నమోదు చేయబడతాయి.

డిమెటీరియలైజేషన్: వ్యవహారాలన్నీ కంప్యూటరీకరించుట వలన సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాలు ఎలక్ట్రానిక్ బుక్ ఎంట్రీ పద్ధతిలో పరిష్కారమవుతాయి. సెక్యూరిటీలు భౌతిక రూపములో ఉండి, పెట్టుబడిదారుకు ఎలక్ట్రానిక్ ఎంట్రీ లేదా నంబరు ఇవ్వడం వలన తన అకౌంటులో ఎలక్ట్రానిక్ నిల్వ కలిగి ఉండటం. ఎలక్ట్రానిక్ రూపములో సెక్యూరిటీలు కలిగి ఉండే విధానాన్ని డిమెటీరియలైజేషన్ అంటారు. దీని కొరకు పెట్టుబడిదారుడు సంస్థతో డిమాట్ అకౌంటు ప్రారంభించడాన్ని డిపాజిటరీ అంటారు. వాస్తవానికి ఇపుడు (IPOS) డిమెటీరియలైజేషన్ పద్ధతిలో జారీ చేయబడి 99 శాతం కంటే ఎక్కువ టర్నోవర్ డిమాట్ రూపములో పరిష్కరించడుతుంది. ట్రేడింగ్ 500 వాటాలకు మించితే పరిష్కార విధానము డిమాట్లో జరగాలని సెబీ తప్పనిసరి చేసింది. డిమాట్ రూపములో వాటాలు కలిగి ఉండటము బ్యాంకు ఖాతా వలె చాలా సౌకర్యవంతముగా ఉంటుంది. భౌతిక రూపములో ఉన్న వాటాలు ఎలక్ట్రానిక్ రూపములో లేదా ఎలక్ట్రానిక్ రూపములోఉన్న వాటాలను తిరిగి భౌతిక రూపములోనికి మార్చుకోవచ్చు. నగదువలె డిమెటీరియలైజేషన్ వాటాలను ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు బదిలీ చేస్తుంది. మరియు వాటాలకు సంబంధించిన అన్ని లావాదేవీలు ఒకే ఖాతా ద్వారా పరిష్కరించుకోవచ్చు. డిమాట్ అకౌంట్లో ఉన్న సెక్యూరిటీలను తాకట్టుపెట్టి ఋణాలు పొందవచ్చును. వాటా, సర్టిఫికేట్లు పాడైపోవుట, దొంగిలించబడటం లేదా ఫోర్జరీ అనే భయం ఉండదు. పెట్టుబడిదారుని ఖాతాలో సరైన సంఖ్యలో వాటాలను నమోదు చేయవలసిన బాధ్యత బ్రోకర్.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 4 విత్త మార్కెట్లు

ప్రశ్న 7.
సూచీ అంటే ఏమిటి ? మన దేశములోని రెండు ప్రధాన సూచీలను వివరించండి.
జవాబు:
స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అనేది మార్కెట్ ప్రవర్తనకు భారమితి వంటిది. మార్కెట్ ప్రతినిధి అయిన స్టాక్ సమూహం ద్వారా మొత్తం మార్కెట్ సెంటిమెంట్ను కొలుస్తుంది. ఇది మార్కెట్ దిశను ప్రతిబింబించడముతో పాటు స్టాక్ ధరలలో రోజు రోజుకు వచ్చే హెచ్చుతగ్గులను సూచిస్తుంది. ఆదర్శవంతమైన సూచీ సెక్యూరిటీల ధరలలో మార్పులకు ప్రాతినిథ్యం వహిస్తూ సాధారణ వాటాల ధరలలో వచ్చే మార్పులను ప్రతిబింబించే విధముగా ఉండాలి. మార్కెట్ సూచీ పెరిగితే మార్కెట్లో అనుకూల పరిస్థితులు ఉండటాన్ని, మార్కెట్ సూచీ తగ్గితే మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉండటాన్ని తెలుపుతుంది. భారతీయ మార్కెట్లో BSE -సెన్సెక్స్ మరియు NSE- నిఫ్టీ ముఖ్యమైన సూచీలు.

సెన్సెక్స్ (SENSEX): సెన్సెక్సున్న సెన్సిటివ్ ఇండెక్స్ అంటారు. సెన్సెక్స్ అనేది BSE యొక్క బెంచ్ మార్క్ ఇండెక్స్. BSE- సెన్సెక్స్ను BSE – 30 అని కూడా అంటారు. BSE భారతీయ సెకండరీ మార్కెట్ ప్రముఖ ఎక్సేంజ్ గా ఉండటం వలన, సెన్సెక్స్ భారతీయ స్టాక్ మార్కెట్కు ముఖ్య సూచికగా ఉన్నది. మార్కెట్ స్థితిగతులను తెలియజేయునపుడు దీనిని తరుచుగా ఉపయోగిస్తారు. 1986లో ప్రారంభించిన సెన్సెక్స్ మార్కెట్లో అత్యంత చురుకుగా | లావాదేవీలు జరిపే 30 స్టాక్స్లో రూపొందించబడినది. అవి ఆర్థిక వ్యవస్థలోని 13 రంగాలకు ప్రాతినిథ్యం వహిస్తూ వాటికి సంబంధించిన పరిశ్రమలలో అగ్రగాములుగా ఉన్నాయి. ఈ సూచీ ప్రాతిపదిక సంవత్సరం 1978 కాగా, ఆధార సంవత్సరం విలువ 100తో ప్రారంభమైనది

నిఫ్టీ (NIFTY): జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీని నిఫ్టీ అంటారు. NSE లో నమోదైన వివిధ రంగాల స్టాక్ల పనితీరు ఆధారముగా దీనిని లెక్కిస్తారు. నిఫ్టీ నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీని తెలుపుతుంది. 24 రంగాలకు చెందిన 50 ప్రముఖ కంపెనీల స్టాక్ సమూహాన్ని నిఫ్టీ కలిగిఉంటుంది. NSE అవలంభించే అనేక అంశాలపై ఆధారపడి నిఫ్టీలో ఉండే స్టాక్స్ వాటి కంపెనీల పనితీరునుబట్టి కాలానుగుణముగా మారుతూ ఉంటాయి.. 1995 – 96 సంవత్సరము ప్రాతిపదిక సంవత్సరముగా పరిగణిస్తూ 1000 ఆధార విలువతో సూచీ నిర్మించబడినది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విత్త మార్కెట్.
జవాబు:
విత్త మార్కెట్ అనే పదానికి విస్తృతమైన అర్థము కలదు. ద్రవ్యత్వ ఆస్తులైన వాటాలు, బాండ్లు, కరెన్సీ నోట్లు మరియు డెరివేటివ్స్ వర్తకము కొరకు కొనుగోలుదారులు మరియు అమ్మకపుదారులు పాల్గొనే ఏ మార్కెట్ స్థలమైన అది విత్త మార్కెట్ అంటారు.

ప్రశ్న 2.
విత్త మార్కెట్ వర్గీకరణ.
జవాబు:
విత్త మార్కెట్ల వర్గీకరణ వాటిలో నిర్వహింపబడే లావాదేవీల కాలపరిమితిని బట్టి ఉంటుంది. ఒక సంవత్సరములోపు కాలపరిమితిగల కార్యకలాపాలు ద్రవ్య మార్కెట్లోను, దీర్ఘకాల పరిమితి కార్యకలాపాలు మూలధన మార్కెట్లో నిర్వహించబడతాయి. మూలధన మార్కెట్ను ప్రాథమిక మార్కెట్ అని, ద్వితీయ మార్కెట్ అని వర్గీకరించవచ్చును.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 4 విత్త మార్కెట్లు

ప్రశ్న 3.
ద్రవ్య మార్కెట్.
జవాబు:
ఒక సంవత్సరములోపు కాలపరిమితి గల స్వల్పకాలిక నిధులు ద్రవ్యత్వ ఆస్తులతో వ్యవహారాలు జరిపే మార్కెట్ను ద్రవ్య మార్కెట్ అంటారు. ఈ ఆస్తులు ద్రవ్యానికి సమీప ప్రత్యామ్నాయాలుగా ఉంటాయి. తాత్కాలిక ద్రవ్య అవసరాలకు, బాధ్యతలకు స్వల్పకాలిక నిధులను ఈ మార్కెట్ సమకూరుస్తుంది.

ప్రశ్న 4.
మూలధన మార్కెట్.
జవాబు:
మూలధన మార్కెట్ అనే పదము దీర్ఘకాలిక ఋణాలు సమకూర్చే సంస్థలు మరియు సదుపాయాలు తెలుపుతుంది. దీనిలో డెట్ మరియు ఈక్విటీ దీర్ఘకాలిక నిధులు సమకూర్చబడి పెట్టుబడిగా పెట్టడం జరుగుతుంది. దీనిలో ప్రజల నుంచి వివిధ మార్గాలలో సేకరించి, పారిశ్రామిక, వాణిజ్య సంస్థలలో పెట్టుబడి పెట్టుటకు అందుబాటులో ఉంటాయి.

ప్రశ్న 5.
ప్రాథమిక మార్కెట్..
జవాబు:
ప్రాథమిక మార్కెట్ను నూతన జారీల మార్కెట్ అని కూడా అంటారు. మొదటిసారి జారీ చేసే సెక్యూరిటీలతో పనిచేస్తుంది. పెట్టుబడి నిధులు పొదుపుచేసే వారి నుంచి వ్యవస్థాపకులకు బదిలీ చేయడానికి సహకరించడం ప్రాథమిక మార్కెట్ యొక్క ప్రధాన విధి. ఈక్విటీ వాటాలు, ఆధిక్యపు వాటాలు, డిబెంచర్లు, ఋణాలు మరియు డిపాజిట్ల రూపములో ప్రాథమిక మార్కెట్లో కంపెనీలు పెట్టుబడులను సమకూర్చుకుంటాయి.

ప్రశ్న 6.
ద్వితీయ మార్కెట్.
జవాబు:
ద్వితీయ మార్కెట్ను స్టాక్ మార్కెట్ లేదా స్టాక్ ఎక్సేంజ్ అని కూడా అంటారు. లోగడ జారీ అయిన సెక్యూరిటీ ల కొనుగోలు మరియు అమ్మకాలకు ఈ మార్కెట్ వీలు కల్పిస్తుంది. ఇది ప్రస్తుత సెక్యూరిటీలకు ద్రవ్యత్వాన్ని మరియు మార్కెట్ అవకాశాన్ని కల్పిస్తుంది. పెట్టుబడుల ఉపసంహరణ మరియు తిరిగి పెట్టుబడి ద్వారా ఉత్పాదక పెట్టుబడులకు నిధులు మళ్ళిస్తూ ఆర్థికాభివృద్ధికి ఈ మార్కెట్ తోడ్పడుతుంది.

ప్రశ్న 7.
ట్రెజరీ బిల్.
జవాబు:
సాధారణముగా కేంద్ర ప్రభుత్వము సంవత్సరంలోపు కాలపరిమితిగల స్వల్పకాలిక ఋణం పొందడానికి ట్రెజరీ | బిల్ ఒక సాధనముగా ఉపయోగపడుతుంది. స్వల్పకాలిక అవసరాలకు నిధులు పోందడానికి భారత ప్రభుత్వం తరపున భారత రిజర్వు బ్యాంకు ‘జీరో కూపన్ బాండ్ల’ పేరుతో వీటిని జారీ చేస్తుంది.

ప్రశ్న 8.
వాణిజ్య పత్రాలు.
జవాబు:
నిర్ణీత కాలపరిమితికి జారీచేసి, తిరిగి విమోచనము చేయు సెక్యూరిటీ లేని ప్రామిసరీ నోటు, అన్యాక్రాంత మరియు బదిలీ యోగ్యత గల పత్రాన్ని వాణిజ్య పత్రము అంటారు. భారీ మరియు పరపతి గల కంపెనీలు మార్కెట్ రేటు కంటే తక్కువ వడ్డీకి స్వల్పకాలిక నిధులు పెంచుకునేందుకు దీనిని జారీ చేస్తాయి.

ప్రశ్న 9.
డిపాజిట్ల సర్టిఫికేట్.
జవాబు:
సెక్యూరిటీ ఆధారము లేని, బదిలీ యోగ్యత గల స్వల్ప కాలిక సాధనాలు అయిన డిపాజిట్ సర్టిఫికేట్లను వాణిజ్య బ్యాంకులు మరియు అభివృద్ధి చెందిన ద్రవ్య సహాయ సంస్థలు జారీ చేస్తాయి. బ్యాంకు డిపాజిట్ల వృద్ధి తక్కువగా ఉండి, పరపతి అవసరాలు ఎక్కువగా ఉండి, ద్రవ్యత్వము లోపించిన అవసరమైన సంస్థలకు ఈ సర్టిఫికేట్లు జారీ చేయబడతాయి.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 4 విత్త మార్కెట్లు

ప్రశ్న 10.
OTCEI.
జవాబు:
ఇది కంపెనీ చట్టం 1956 క్రింద నమోదైన కంపెనీ. చిన్న మరియు మధ్య తరహా కంపెనీల మూలధన మార్కెట్లో ప్రవేశించి ఫైనాన్స్ సమకూర్చుకోవడానికి ఇది స్థాపింబడినది. ఇది మూలధన మార్కెట్లో పెట్టుబడి కొరకు ఒక అనుకూలమైన పారదర్శక మరియు సమర్థవంతమైన విధానాన్ని పెట్టుబడిదారులకు కల్పిస్తుంది. 1992లో ట్రేడింగ్ ప్రారంభించి పూర్తి కంప్యూటీకరణ, పారదర్శకత మరియు సింగిల్ విండో ఎక్సేంజ్ సౌకర్యం కలదు.

ప్రశ్న 11.
డిమెటీరియలైజేషన్.
జవాబు:
ప్రస్తుతము సెక్యూరిటీల ట్రేడింగ్ అంతా కంప్యూటర్ టెర్మినల్స్ ద్వారా జరుగుతుంది. వ్యవహారాలన్నీ కంప్యూటరీకరించుట వలన సెక్యూరిటీల కొనుగోలు అమ్మకాలు ఎలక్ట్రానిక్ బుక్ ఎంట్రీ పద్దతిన పరిష్కారమవుతున్నాయి. ఈ పద్ధతిలో సెక్యూరిటీలు భౌతిక రూపములో ఉండటం వలన పెట్టుబడిదారులకు ఎలక్ట్రానిక్ ఎంట్రీ లేదా నంబరు ఇవ్వడం వలన తన అకౌంటులో ఎలక్ట్రానిక్ నిల్వ కలిగి ఉంటారు. ఎలక్ట్రానిక్ రూపములో సెక్యూరిటీలు కలిగిఉండే విధానాన్ని డిమెటీరియలైజేషన్ అంటారు.

ప్రశ్న 12.
డిపాజిటరీ.
జవాబు:
డిపాజిటరీ పెట్టుబడిదారుల తరపున సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ రూపములో ఉంచుతుంది. డిపాజిటరీ వద్ద ఖాతాను ప్రారంభించి వాటాలన్నీ డిపాజిట్ చేయబడతాయి. ఖాతాదారుని తరపున అతని సూచనలకు అనుగుణంగా వాటాలను కొనడం, అమ్మడం జరిగినది. ఇది సాంకేతిక పరిజ్ఞానంతో నడపబడే ఎలక్ట్రానిక్ స్టోరేజి పద్ధతి.

ప్రశ్న 13.
సెన్సెక్స్ (SENSEX).
జవాబు:
సెన్సెక్స్: సెన్సెక్స్ను సెన్సిటివ్ ఇండెక్స్ అంటారు. దీనిని BSE – 30 అని కూడా అంటారు. BSE భారతీయ సెకండరీ మార్కెట్ యొక్క ప్రముఖ ఎక్సేంజ్ ఉన్నందు వలన, సెన్సెక్స్ భారతీయ స్టాక్ మార్కెట్కు ముఖ్య సూచికగా ఉన్నది. మార్కెట్ స్థితిగతులను తెలియజేయునపుడు దీనిని తరుచుగా ఉపయోగిస్తారు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 4 విత్త మార్కెట్లు

ప్రశ్న 14.
నిఫ్టీ (NIFTY).
జవాబు: నిఫ్టీ: జాతీయ స్టాక్ ఎక్సేంజ్ని నిఫ్టీ అంటారు. NSE లో నమోదైన వివిధ రంగాల స్టాక్ ల పనితీరు ఆధారముగా దీనిని లెక్కిస్తారు. నిఫ్టీ నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీని తెలుపుతుంది. 24 రంగాలకు చెందిన 50 ప్రముఖ కంపెనీల స్టాక్ సమూహాన్ని నిఫ్టీ కలిగి ఉంటుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Commerce Study Material 3rd Lesson వ్యాపార సేవలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Commerce Study Material 3rd Lesson వ్యాపార సేవలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బ్యాంకును నిర్వచించి, వాటి విధులను వివరించండి.
జవాబు:
బ్యాంకింగ్ నియంత్రణ చట్టము 1949 ప్రకారము “ఖాతాదారుల డిమాండ్లపై చెక్కు ద్వారాగాని, డ్రాఫ్ట్ ద్వారా గాని, మరేదైనా పత్రము ద్వారా గాని, తిరిగి చెల్లించే షరతు మీద డిపాజిట్లను స్వీకరించి ఆ సొమ్మును ఋణాలు ఇవ్వడానికి గాని, పెట్టుబడి కోసం గాని ఉపయోగించడం బ్యాంకింగ్ వ్యాపారము అంటారు.

బ్యాంకులు ఆర్థిక సంస్థలు దేశ ఆర్థిక ప్రగతికి పునాది లాంటివి. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు ప్రముఖమైన పాత్రను వహిస్తున్నవి. ఈ బ్యాంకులు ఎక్కువ భాగము ద్రవ్య సప్లయిని నియంత్రిస్తున్నవి. బ్యాంకులు నిర్వహించే విధులను స్థూలముగా రెండు రకాలుగా విభజించవచ్చును. అవి (ఎ) ప్రాథమిక విధులు, (బి) అనుషంగిక విధులు. ఎ) ప్రాథమిక విధులు: 1. డిపాజిట్లను స్వీకరించడము: బ్యాంకులు వివిధ రకములైన డిపాజిట్లను సేకరిస్తాయి.
అవి:
i) ఫిక్స్డ్ డిపాజిట్లు: ఈ ఖాతాలలో డిపాజిట్ చేయబడిన మొత్తము నిర్ణీత కాల వ్యవధికి ముందు ఉపసంహరించడానికి వీలుకాదు. ఈ కాల వ్యవధి సాధారణముగా ఒకటి, రెండు, మూడు లేదా ఐదు సంవత్సరాలు ఉంటుంది. బ్యాంకులు ఈ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ మొత్తాన్ని చెల్లిస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్లను కాలపరిమితి గల డిపాజిట్లు మరియు టైమ్ డిపాజిట్లు అంటారు.

ii) కరెంట్ డిపాజిట్ ఖాతాలు: ఈ ఖాతాలను వ్యాపారస్తులు తెరుస్తారు. ప్రతిరోజు ఎన్ని సార్లయినా బ్యాంకులో నగదు డిపాజిట్ చేసి, ఉపసంహరించవచ్చును. ఈ ఖాతాలోని నిల్వపై వడ్డీని చెల్లించరు. వీటిని డిమాండు డిపాజిట్లు అని కూడా అంటారు.

iii) సేవింగ్స్ డిపాజిట్ ఖాతాలు: ఈ డిపాజిట్ల ముఖ్య ఉద్దేశము వ్యక్తులు, వ్యాపారస్తులు, సంస్థల నుంచి చిన్న చిన్న పొదుపు మొత్తాలను ప్రోత్సహించడము. డిపాజిట్ల ఉపసంహరణపై కొన్ని సాధారణ నిబంధనలు ఉంటాయి. ఈ డిపాజిట్లపై తక్కువ వడ్డీని చెల్లిస్తారు.

iv) రికరింగ్ డిపాజిట్ ఖాతాలు: తక్కువ ఆదాయాన్ని పొందేవారు చిన్న మొత్తాలలో పొదుపు చేయడానికి ఈ డిపాజిట్లు అనుకూలము. ఈ డిపాజిట్లలో కొంత కాల వ్యవధిలో (ప్రతి వారానికి, నెలకుగాని నిర్ణయించిన మొత్తాలలో నిర్ణీత కాలము పూర్తి అయ్యేవరకు నగదు జమచేస్తూ ఉండాలి. గడువుకాలము పూర్తి అయిన తర్వాత వడ్డీతో కలిపి పూర్తి మొత్తము సొమ్మును డిపాజిట్ దారుకు తిరిగి చెల్లించబడుతుంది. ఈ డిపాజిట్లపై వడ్డీరేటు సేవింగ్స్ డిపాజిట్ల కంటే ఎక్కువగా ఉంటుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

2) ఋణాలు మంజూరు చేయుట: బ్యాంకు విధులలో రెండవది అవసరమున్న వ్యక్తులకు, సంస్థలకు ఋణాలు లేదా అడ్వాన్సులు అందజేయడము, ప్రతి బ్యాంకు కనిష్ట రిజర్వు నిల్వను రిజర్వు బ్యాంకుల వద్ద డిపాజిట్ చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఋణాల రూపములో అందజేస్తుంది. ఇవి ఐదు రకాలుగా ఉంటాయి.
i) ఋణాలు: ఒక నిర్ణీతకాలానికి బ్యాంకులు కాలపరిమితి గల ఋణాలను గాని, డిమాండు ఋణాలనుగాని అంగీకరించిన వడ్డీ రేటుకు మంజూరు చేస్తాయి. ఈ ఋణాలను సాధారణముగా సెక్యూరిటీలపై జారీచేస్తారు.

ii) క్యాష్ క్రెడిట్: ఒక సంవత్సరము లేదా అంతకంటే తక్కువ కాలానికి ఖాతాదారునికు మంజూరు చేసిన ఋణాన్ని క్యాష్ క్రెడిట్ అంటారు. సరుకునుగాని, ఇతర ఆస్తిని గాని హామీగా ఉంచుకొని ఋణాన్ని మంజూరు చేస్తారు. గడువు కాలము పూర్తి అయిన తర్వాత తిరిగి రెన్యువల్ చేసుకోవచ్చు. బ్యాంకు మంజూరు చేసిన ఋణాన్ని అవసరాన్ని బట్టి ఖాతాదారుడు ఒకేసారిగాని లేక కొన్ని వాయిదాలలో తీసుకొనవచ్చును. క్యాష్ క్రెడిట్పై వడ్డీని వాడుకున్న మొత్తము మీద లెక్కిస్తారు.

iii) ఓవర్ డ్రాఫ్ట్: ఖాతాదారుడు డిపాజిట్ చేసిన మొత్తము కంటే ఎక్కువ మొత్తాన్ని వాడుకోవడానికి సౌకర్యము కల్పించబడుతుంది. దీనిని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. డిపాజిట్ మొత్తము కంటే ఎంత మొత్తము అప్పుగా తీసుకోవడం జరుగుతుందో దాని మీదనే వడ్డీని వసూలు చేయడం జరుగుతుంది. కరెంట్ ఖాతాదారులకే ఈ సౌకర్యముంటుంది.

iv) బిల్లును డిస్కౌంట్ చేయడము: బిల్లును కలిగిన వ్యక్తికి నగదు అవసరమైనపుడు ఆ బిల్లును బ్యాంకులో డిస్కౌంటు చేసుకొనవచ్చును. బ్యాంకు కొంతమొత్తము డిస్కౌంట్లుగా తగ్గించి, బిల్లుదారుకు డబ్బును చెల్లిస్తాయి. బిల్లు గడువు తేదీన బ్యాంకు బిల్లు స్వీకర్త నుంచి పూర్తి మొత్తాన్ని వసూలు చేసుకుంటాయి.

v) కోరగానే పిలుపు ద్రవ్యపు ఋణం: కోరిన వెంటనే తిరిగి చెల్లించే షరతుపై ఒక బ్యాంకు మరొక బ్యాంకుకు ఇచ్చే ఋణాన్ని పిలుపు ద్రవ్యము అంటారు. ఋణాన్ని కేవలము ఒక రోజు నుంచి 14 రోజులకు మాత్రమే మంజూరు చేస్తారు. ఈ ఋణాలను అంతర్గత బ్యాంకు ఋణాలు అంటారు. బ్యాంకుల మిగులు నిధులను అవసరమైన బ్యాంకులకు ఒక రోజు నుంచి వారానికి ఋణంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఋణాన్ని ఇచ్చిన రెండవ రోజు లేదా స్వల్పకాల నోటీసుతో తిరిగి చెల్లించడం జరుగుతుంది.

బి) అనుషంగిక విధులు: బ్యాంకులు ప్రాథమిక విధులతో పాటు దిగువ అనుషంగిక విధులు నిర్వర్తిస్తాయి. 1) ఏజెన్సీ సేవలు: ఖాతాదారులకు ప్రతినిధిగా ఈ క్రింది సేవలు అందిస్తాయి.

  1. చెక్కుల ద్వారా మరియు డ్రాఫ్ట్ ద్వారా ద్రవ్యాన్ని ఒక ప్రదేశము నుంచి మరొక ప్రదేశానికి బదిలీచేస్తాయి.
  2. పరపతి సాధనాలు అయిన చెక్కులు, బిల్లులు, ప్రామిసరీ నోట్లపై వసూళ్ళు, చెల్లింపులు చేస్తాయి.
  3. ఖాతాదారుల తరఫున వాటాలు, డిబెంచర్లు, బాండ్లు మొదలైన సెక్యూరిటీలను కొనుగోలు, అమ్మకాలను చేస్తాయి.
  4. బ్యాంకులు ఖాతాదారులు వీలునామాను జాగ్రత్తపరచి, వారి మరణానంతరము వీలునామాను అమలు చేస్తాయి.

2) సాధారణ ప్రజోపయోగ సేవలు:

  1. బ్యాంకులు తమ ఖాతాదారులకు పరపతి లేఖలు జారీ చేస్తాయి.
  2. దూరప్రాంతాలకు ప్రయాణాలపై వెళ్ళినపుడు దొంగల భయం లేకుండా ప్రయాణీకుల చెక్కులను జారీ చేస్తాయి.
  3. విలువైన ఆభరణాలు, వస్తువులు, పత్రాలు దాచుకొనడానికి సేఫ్ డిపాజిట్ లాకర్ల సౌకర్యాలను కల్పిస్తాయి.
  4. విదేశీ బిల్లును అంగీకరించుట లేదా చెల్లించడం చేస్తాయి.

ప్రశ్న 2.
భీమా సూత్రాలను వివరించుము.
జవాబు:
సక్రమమైన కాంట్రాక్టుకు ఉండవలసిన ప్రతిపాదన, స్వీకృతి, స్వేచ్ఛాసమ్మతి, పార్టీల సామర్థ్యము, ప్రతిఫలము, నాయాత్మక ఉద్దేశము మొదలగు సూత్రాలతో పాటు భీమాకు సంబంధించిన దిగువ ప్రాథమిక సూత్రాలను కూడా తృప్తిపరచవలెను.

ఎ) భీమా ఆసక్తి: సక్రమమైన భీమా కాంట్రాక్టుకు ఉండవలసిన ఆవశ్యకాలలో భీమా ఆసక్తి ప్రధానమైనది. భీమా ఆసక్తి లేని ఒప్పందాన్ని జూదము ఒప్పందముగా పరిగణిస్తారు. అది చెల్లని కాంట్రాక్టు అవుతుంది. అటువంటి దానిని కోర్టు ద్వారా అమలుపరచడానికి వీలుండదు. కనుక భీమాపాలసీ తీసుకునే వ్యక్తికి తన జీవితము మీదగాని, ఆస్తిమీద గాని ఆసక్తి కలిగి ఉండాలి. ఉదా: ఒక వ్యక్తికి తన జీవితం మీద, తన భార్య జీవితము మీద ఆసక్తి ఉంటుంది. బ్యాంకరుకు తన వద్ద తనఖా ఉంచిన బాకీదారు ఆస్తిమీద ఆసక్తి ఉంటుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

బి) అత్యంత విశ్వాసము: భీమా కాంట్రాక్టు విషయము సమగ్రముగాను మరియు కాంట్రాక్టు పార్టీలు అందరూ అత్యంత విశ్వాసపూరితముగా ఉండాలి. కాంట్రాక్టునందు నమ్మకము లోపించిన యడల ఆ పార్టీల మధ్య ఒప్పందము చెల్లదు. అనగా అందులో మోసము లేనపుడే ఆ భీమా కాంట్రాక్టు అత్యంత విశ్వాసపూరితమైది. అందువలన భీమా తీసుకునే వ్యక్తి ఒప్పందానికి సంబంధించిన అన్ని వాస్తవాలను భీమా సంస్థకు తెలియజేయాలి లేని యడల విశ్వాసము లోపించినట్లుగా, ఆ కాంట్రాక్టు చెల్లని కాంట్రాక్టు అవుతుంది.

సి) నష్టపూర్తి: సంభవించిన నష్టాన్ని ద్రవ్య రూపేణ భర్తీ చేయడాన్ని నష్టపూర్తి అని అంటారు. ఇది భీమా ఆస్తి విలువకు మించరాదు. ముందుగా ఒప్పందము చేసుకున్న విధముగా ఒక నిర్దిష్టమైన సంఘటన జరిగినపుడు భీమాదారుడు జరిగే నష్టాన్ని అంచనా వేసి, దానిని భీమా సంస్థ చెల్లించడాన్ని నష్టపూర్తి అంటారు. నష్టము జరుగుతున్నప్పుడు భీమాదారుడు నష్టాన్ని తగ్గించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఆ ఆస్తిని తిరిగి పూర్వపు స్థితిలో (యధాస్థితిలో) ఉంచడానికి ఎంత అవుతుందో ఆ మొత్తాన్ని భీమా సంస్థ అంచనా వేసి భీమాదారుకు చెల్లిస్తుంది. జీవిత భీమా కాంట్రాక్టులు మినహా, ఇతర భీమా కాంట్రాక్టులన్నీ నష్టపూర్తి కాంట్రాక్టులు అవుతాయి.

డి) సమీపకారణము: ఇది (causa proxima) అనే లాటిన్ సూత్రము నుండి ఏర్పడినది. దగ్గర కారణము లేదా తక్షణ కారణం దీని అర్ధము. ఒక నష్టము సంభవించడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో వాస్తవమైన కారణాన్ని సమీపకారణము అంటారు. భీమా సంస్థ చెల్లించవలసిన బాధ్యతను లెక్కించునపుడు సుమారు కారణమును పరిగణించకుండా సమీపకారణాన్ని తీసుకుంటారు. సముద్ర భీమా విషయములో ఓడలేదా ఓడలోని సరుకునకు వివిధ కారణాల వలన నష్టము సంభవించినపుడు, ఏ ఒక్క కారణాన్ని లెక్కలోకి తీసుకోకుండా సమీపకారణము అనే సూత్రము ద్వారా నష్టాన్ని లెక్కిస్తారు.

ఇ) హక్కుల సంక్రమణ సిద్ధాంతము: దీనినే హక్కులకు ప్రత్యామ్నాయ సిద్ధాంతము అని కూడా అంటారు. దీని అర్ధము హక్కులను పొందే వ్యక్తిని ఋణదాత స్థానములో ఉంచడము. భీమాదారుకు భీమా ఆస్తిపై మరియు ఇతరులపై గల సర్వహక్కులు భీమా సంస్థకు లభించడాన్ని హక్కుల సంక్రమణ అంటారు. దీనినే ప్రతి నివేశము అని కూడా అంటారు. నష్టపూర్తి జరిగిన తర్వాత భీమాదారునికి గల హక్కులు, ఉపశమనాలు అన్ని భీమాసంస్థకు బదిలీ అవుతాయి, భీమా ఆస్తి మీదనే కాక, నష్టాన్ని పూరించడానికి మూడవవ్యక్తి మీద కూడా భీమా సంస్థకు హక్కులు సంక్రమిస్తాయి.

ఎఫ్) చందా: భీమా ఆస్తికి నష్టము కలిగినపుడు, ఆ ఒప్పందములో వేరే భీమా సంస్థలు ఉన్నప్పుడు, ఆ భీమా సంస్థలు దామాషా పద్ధతిలో బాధ్యతను చెల్లించవలసి ఉంటుంది. భీమాదారుడు తనకు కలిగిన నష్టానికి మించిన మొత్తాన్ని పొందలేడు. అన్ని పాలసీలకు భీమా ఆసక్తి ఉండవలెను.

జి) నష్టము తగ్గింపు: భీమా ఆస్తికి కలిగే నష్ట తీవ్రతను తగ్గించడానికి ఈ సూత్రము వర్తిస్తుంది. భీమాదారుడు భీమా చేయని ఆస్తికి హాని కలిగినపుడు నష్టాన్ని నివారించడానికి లేదా తగ్గించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాడో భీమా చేసినపుడు కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలని ఈ సూత్రం తెలియజేస్తుంది.

ప్రశ్న 3.
జీవిత భీమా పాలసీని నిర్వచించి, వాటి రకాలను తెలపండి.
జవాబు:
జీవితభీమాను దిగువ విధముగా నిర్వచించవచ్చును. “భీమా సంస్థ తాను పొందిన ప్రీమియంకు బదులుగా, ఆ ప్రీమియం ఒకే మొత్తముగా గాని లేదా నిర్ణీత వాయిదాలలో గాని, భీమాదారుడు మరణించినపుడు లేదా నిర్ణీత సమయము పూర్తి అయినపుడు నిర్దిష్టమైన సొమ్ము చెల్లించటానికి చేసుకునే కాంట్రాక్టును జీవితభీమా కాంట్రాక్టు
అంటారు.

జీవిత భీమా పాలసీలో గల రకాలు:
1) యావజ్జీవిత పాలసీ: దీనిని సాధారణ పాలసీ అని కూడా అంటారు. ఈ పాలసీలో భీమా చేసిన వ్యక్తి జీవితాంతము ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. భీమా మొత్తాన్ని భీమా చేసిన వ్యక్తి మరణించిన తర్వాతనే చెల్లిస్తారు. ఈ పాలసీ మీద ప్రీమియం తక్కువ ఉంటుంది. ఇది భీమా చేసిన వ్యక్తి కుటుంబానికి పనికివస్తుంది. ఈ పాలసీలో ముఖ్యమైన లోపము ఏమిటంటే భీమా చేసిన వ్యక్తి ముసిలితనములో, రాబడి ఏమీ లేకపోయినా ప్రీమియం అతడు జీవితాంతము చెల్లించవలెను.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

2) ఎండోమెంట్ పాలసీ: ఈ పాలసీని నిర్దిష్ట కాలానికి అనగా ఎండోమెంట్ కాలానికి తీసుకుంటారు. ఈ పాలసీ నిర్దిష్టకాలము పూర్తి అయిన తర్వాత లేదా ఒక నిర్ణీత వయస్సు వచ్చినపుడు లేదా భీమా చేసిన వ్యక్తి మరణించినపుడు వీటిలో ఏది ముందు జరిగితే అప్పుడు గడుపుకాలము ముగుస్తుంది. ఈ పాలసీలో పెట్టుబడి మరియు రక్షణ కల్పిస్తుంది.

3) లాభాలతో కూడిన, లాభాలు లేని పాలసీలు: లాభాలతో కూడిన పాలసీని జారీచేసినపుడు, పాలసీదారుడు కంపెనీ లాభాలలో భాగాన్ని పంచుకుంటాడు. వీటిని బోనస్ అంటారు. పాలసీ గడువు ముగిసిన తర్వాత భీమా మొత్తాన్ని బోనస్తో కలిపి చెల్లిస్తారు. లాభాలు లేని పాలసీలు అయితే, పాలసీదారునకు లాభాలలో భాగం ఇవ్వరు. పాలసీ గడువు తీరిన తర్వాత భీమా మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తారు. ఈ పాలసీలను భాగమును పంచుకునే మరియు ” భాగాన్ని పంచుకోని పాలసీలు అంటారు.

4) ఉమ్మడి జీవిత భీమా పాలసీ: ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది వ్యక్తులపై ఉమ్మడిగా జీవితభీమా పాలసీ తీసుకోవచ్చు. పాలసీదారులలో ఏ ఒక్కరు మరణించినా జీవించి ఉన్న మిగిలిన పాలసీదారులకు భీమా సొమ్మును చెల్లిస్తారు. ఈ రకమైన పాలసీలను భార్య, భర్తలు తీసుకుంటారు.

5) మార్పిడి చేయదగు యావజ్జీవిత భీమా పాలసీ: దీనిని యావజ్జీవిత భీమా పాలసీగా జారీ చేసినా నిర్దిష్ట కాలము తర్వాత దీనిని ఎండోమెంట్ పాలసీగా మార్చుకోవడానికి అవకాశము ఉంటుంది. పాలసీదారు కోరిన మీదట ఈ పాలసీని మార్పిడి చేస్తారు. పాలసీని మార్పిడి చేసిన తర్వాత పాలసీ మీద చెల్లించే ప్రీమియం పెరుగుతుంది.

6) జనతా పాలసీ: జనతాపాలసీని జీవిత భీమా కార్పరేషన్ మే, 1957లో ప్రవేశపెట్టినది, దీనిని స్వల్ప ఆదాయముగల వారి కోసం ఉద్దేశించబడినది. దీనిన 5, 10, 15, 20 మరియు 25 సంవత్సరాలకు జారీ చేసినా 60 సంవత్సరములో గడువు తీరుతుంది. ఈ పాలసీల మీద ఎలాంటి ఋణాలు మంజూరు చేయరు.

7) వార్షిక పాలసీ: ఈ పాలసీలో పాలసీదారు భీమా సంస్థ వద్ద నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు. నిర్ణీతకాలము లేదా పాలసీదారుడు మరణించిన తర్వాత సొమ్మును భీమాసంస్థ చెల్లిస్తూనే ఉంటుంది.

8) సామూహిక భీమా పాలసీ: కుటుంబ సభ్యులు లేదా సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఈ పాలసీని తీసుకోవచ్చును. 9) పిల్లల ఎండోమెంట్ పాలసీ: పిల్లల చదువులకు అయ్యే మొత్తానికి గాని లేదా వారి వివాహాలకు గాని సొమ్ము చెల్లించే పాలసీలను పిల్లల పేరున తీసుకుంటే అలాంటి పాలసీలను పిల్లల ఎండోమెంట్ పాలసీలు అంటారు. పిల్లలు మేజరు అయిన తర్వాత భీమా సొమ్మును చెల్లిస్తారు.

ప్రశ్న 4.
రవాణా గురించి నీవు ఏమి అర్థము చేసుకున్నావు ? రవాణా ప్రయోజనాలను, పరిమితులను వివరించుము.
జవాబు:
భౌతిక పంపిణీలో రవాణా ఒక భాగము. భౌతిక పంపిణీ మార్కెటింగ్ మిశ్రమములో అంతర్భాగము. భౌతికముగా వస్తువులను, వ్యక్తులను ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతానికి తరలించడమే ‘రవాణా’. వస్తు, సేవల ఉత్పత్తి కొన్ని ప్రాంతాలకే పరిమితము కాగా వాటి వినియోగము దేశమంతటా విస్తరించి ఉంటుంది. రవాణా ద్వారా ఉత్పత్తి కేంద్రాల నుంచి వినియోగదారుల ప్రదేశాలకు వస్తువులను చేరవేస్తారు. ఈ విధముగా స్థల, సమయ అవరోధాలను రవాణా ద్వారా అధిగమించవచ్చును. రవాణా వస్తువులకు స్థల ప్రయోజనాన్ని, కాల ప్రయోజనాన్ని కల్పిస్తుంది.

సాధారణ పరిభాషలో రవాణా అనగా వస్తువులను ఒక ప్రదేశము నుంచి మరొక ప్రదేశానికి తరలించడము. రవాణా వలన ప్రయోజనాలు:
1) సరుకును తరలించడము: వస్తువులను ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతానికి తరలించడమే రవాణా ముఖ్యవిధి. ముడిసరుకులను కర్మాగారానికి, తయారైన వస్తువులను వినియోగ కేంద్రాల (మార్కెట్) కు తరలిస్తుంది.

2) మూలధన, కార్మిక గమనశీలత: రవాణా అభివృద్ధి చెందడం వలన కార్మికులు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు తరలివెళ్ళడానికి ఆస్కారము ఉన్నది. మూలధనాన్ని లాభదాయకమైన దానిలో పెట్టుబడి పెట్టటానికి రవాణా చాలా ఉపయోగపడుతుంది.

3) స్థల ప్రయోజనము: సరుకులు ఎక్కడైతే సమృద్ధిగా లభిస్తాయో అక్కడ నుంచి కొరతగా ఉన్న ప్రాంతానికి రవాణా ద్వారా తరలించవచ్చును.

4) ప్రత్యేకీకరణ మరియు శ్రమ విభజన: రవాణా వలన శ్రమ విభజన సాధ్యపడుతుంది. శ్రమ విభజన వలన ప్రత్యేకీకరణ పొందవచ్చును. రవాణా ద్వారా సహజవనరులను సమర్థవంతముగా ఉపయోగించుకొనవచ్చును. ఉదాహరణకు అరబ్ దేశాలలో పెట్రోలియం, స్విట్జర్లాండులో గడియారాలు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

5) కాల ప్రయోజనము: అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానము వలన రవాణా సమయం తగ్గుతుంది. దీని వలన సరుకు వ్యయాన్ని తగ్గించవచ్చును.

6) ధరల స్థిరీకరణ: సరుకులను ఎక్కువగా ఉన్న ప్రదేశము నుంచి కొరతగా ఉన్న ప్రదేశానికి రవాణా ద్వారా తరలించబడుతుంది. అందువలన ధరలు అన్ని ప్రాంతాలలో సమానముగా ఉంటాయి.

7) జాతీయ ఆదాయానికి సహాయము: రవాణా జాతీయ ఆదాయానికి తన వంతు భాగాన్ని అందిస్తుంది. ఉదా: భారత రైల్వేలు.

8) పెద్దతరహా ఉత్పత్తి వలన ఆదాలు: రవాణా వలన భారీతరహా పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. రవాణా వలన ముడి సరుకులను, కార్మికులను పొందవచ్చు. తయారైన వస్తువులను త్వరగా అమ్మడానికి సాధ్యపడుతున్నాయి.

9) జీవన ప్రమాణ స్థాయిని పెంచుతుంది: తక్కువ ధరకు నాణ్యమైన సరుకు అందుబాటులో ఉండటం వలన ప్రజల యొక్క జీవన ప్రమాణస్థాయి పెరుగుతుంది.

10) దేశ రక్షణ: రవాణా దేశరక్షణను బలోపేతం చేస్తుంది. యుద్ధ సమయాలలో సైనికులను, యుద్ధసామాగ్రి, ఇతర పరికరాలను త్వరగా సరిహద్దు ప్రాంతాలకు తరలించవచ్చును.

రవాణా పరిమితులు:

  1. కుటీర మరియు చిన్న తరహా పరిశ్రమలు వాటి వైభవాన్ని కోల్పోతున్నాయి: రవాణా అభివృద్ధి చెందడం వలన శ్రామికులు పెద్ద పెద్ద కర్మాగారాలలో పనిచేయుటకు ఆసక్తి చూపుతున్నారు. అందువలన కుటీర, చిన్న తరహా పరిశ్రమలలో శ్రామికుల లభ్యత తగ్గుతుంది.
  2. ప్రమాదాలు: రవాణా సౌకర్యాలు వృద్ధి చెందడం వలన ప్రమాదాలు కూడా పెరుగుతున్నవి.
  3. అధిక పట్టణీకరణ: రవాణా అభివృద్ధి చెందడం ద్వారా పెద్ద పెద్ద పట్టణాలు ఏర్పడతాయి. అధిక జనాభా పట్టణాలలో ఉండటం వలన గృహాల సమస్యలు, కాలుష్యము, ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి.

ప్రశ్న 5.
రోడ్డు రవాణాను వివరించి, భారత రోడ్డు రకాలను తెలపండి.
జవాబు:
రోడ్డు రవాణా అతి పురాతనమైనది. స్వల్ప దూరాలకు ఈ పద్ధతి అనుకూలమైనది. రోడ్డు రవాణా ద్వారా ఇంటింటి నుంచి వస్తువుల సేకరణ మరియు బట్వాడా సాధ్యపడుతుంది. చెడిపోయే స్వభావము గల వస్తువులకు ఈ పద్ధతి అనుకూలమైనది. ఈ రవాణా పద్ధతిలో ఎద్దులబండ్లు, గుర్రపుబండి, రిక్షా, జీపు, బస్సు, ట్రక్కు వంటి మోటారు వాహనాలను ఉపయోగిస్తారు. రోడ్డు రవాణా ముఖ్యముగా కాగితపు వస్తువులు, బట్టలు, కంప్యూటర్లు, సిమెంటు, పశువులు మొదలైన వాటికి అనుకూలముగా ఉంటుంది.

ప్రపంచ రోడ్డు రవాణా వ్యవస్థలో భారతదేశము చాలా ప్రముఖ స్థానములో ఉన్నది. భారతీయ రోడ్డు మార్గాలను జాతీయ రహదారిగా, రాష్ట్ర రహదారిగా, జిల్లా రోడ్డు మరియు గ్రామీణ రోడ్లుగా వర్గీకరించవచ్చును.

భారతీయ రోడ్డు రకాలు:
ఎ) జాతీయ రహదారులు: జాతీయ రహదారులు వివిధ రాష్ట్రాల రహదారులను కలుపుతూ సైనికులను చేరవేస్తుంది. ఈ రహదారులు రాష్ట్ర రాజధానులను, మహానగరాలను కలుపుతుంది. జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణ, నియంత్రణను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టినది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

బి) రాష్ట్ర రహదారులు: రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రహదారులను నిర్వహిస్తాయి. జిల్లా ముఖ్య నగరాలను, ఇతర ముఖ్య పట్టణాలను రాష్ట్ర రాజధానితో అనుసంధానము చేస్తూ ఏర్పాటు చేస్తారు. మొత్తము రోడ్డు రవాణా వ్యవస్థలో ఈ రహదారుల వ్యవస్థ 4% మాత్రమే కలిగి ఉన్నది.

సి) జిల్లా రహదారులు: ఈ రహదారులు జిల్లా ముఖ్య రోడ్లను, మహానగరాలను కలుపుతాయి. మొత్తము రోడ్డు రవాణా వ్యవస్థలో ఈ రహదారులు 14% కలిగి ఉన్నాయి.

డి) గ్రామీణ రోడ్లు: ఈ రోడ్లు గ్రామీణ ప్రాంతాలతో సంబంధం కలిగి ఉంటాయి. ఇవి మొత్తము రహదారులలో 80% ఆక్రమించి ఉన్నాయి.

ఇ) సరిహద్దు రోడ్లు -: ఈ రహదారులు ఉత్తర ఈశాన్య సరిహద్దులలో విస్తరించి ఉన్నాయి. సరిహద్దు రహదారి సంస్థవారు నిర్మాణ, నిర్వహణను చేపడతారు. ఈ సంస్థ ఎత్తు ప్రాంతాలలో రోడ్లను నిర్మించి రవాణా సాఫీగా జరగడానికి మంచును తొలగిస్తుంది.

ఎఫ్) అంతర్జాతీయ రహదారులు: భారతదేశము ఇతర దేశాలతో ముఖ్యముగా పొరుగు దేశాలతో మంచి సంబంధాలు ఉండటం కోసం ఈ రహదారులను ఏర్పాటు చేస్తారు.

ప్రశ్న 6.
గిడ్డంగి భావనను వివరించి, దాని ప్రాముఖ్యతను వివరించుము.
జవాబు:
వేర్ హౌసింగ్ అనేది రెండు పదముల కలయిక. వేర్ అనగా వస్తువులు అని అర్ధము. అందువలన వేర్ హౌస్ అనగా వస్తువులను భద్రపరుచు ప్రదేశము. కాబట్టి వేర్ హౌసింగ్ వస్తువులను స్టోర్ చేసే కార్యకలాపము. మామూలు పరిభాషలో వేర్ హౌస్ అంటే గోడౌన్ లేదా గిడ్డంగి. వేర్ హౌసింగ్ మార్కెటింగ్ విధులైన Assembling, గ్రేడింగ్ మరియు రవాణాను నిర్వర్తిస్తుంది.

గిడ్డంగులు రెండు ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. తయారైన వస్తువులను తరలించడం మరియు నిల్వచేయడం చేస్తుంది. వస్తువులను ప్లాంటు నుంచి గిడ్డంగికి, మరియు గిడ్డంగి నుంచి వినియోగదారులకు చేరవేస్తాయి. నిల్వచేసే విధులలో వస్తువులను అమ్ముడు అయ్యేవరకు గిడ్డంగులలో భద్రపరచి అవసరమైనపుడు సరుకును తరలిస్తాయి. గిడ్డంగులు కాల ప్రయోజనాన్ని తక్కువ వ్యయంతో కల్గిస్తాయి. వర్తకములో ఇవి ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నవి.

గిడ్డంగుల ప్రాముఖ్యత:

  1. కొన్ని వస్తువులు కొన్ని కాలాలలో మాత్రమే ఉత్పత్తి అవుతాయి. కాని అన్ని కాలాలలో వినియోగించేందుకు గిడ్డంగులు దోహదపడతాయి.
  2. కొన్ని వస్తువులు సంవత్సరము పొడవునా ఉత్పత్తి అవుతాయి. కాని వాటి డిమాండు కొన్ని కాలాలలో, మాత్రమే ఉంటుంది. కాబట్టి గిడ్డంగులు ఈ విషయములో చాలా ప్రాముఖ్యతను వహిస్తాయి.
  3. పెద్ద పెద్ద మొత్తాలలో సరుకును ఉత్పత్తి చేసి, సరుకులను సప్లయి చేసే కంపెనీలకు గిడ్డంగులు తప్పనిసరి.
  4. గిడ్డంగులు వస్తువులకు డిమాండ్ ఉన్నప్పుడు త్వరగా సప్లయి చేసి కంపెనీలకు సహాయపడతాయి.
  5. వస్తువుల ఉత్పత్తి నిరాటంకముగా ఉండటానికి, ఉత్పత్తి అయిన వస్తువులు సరఫరా కావడానికి గిడ్డంగులు తోడ్పడతాయి.
  6. గిడ్డంగులు ధరల స్థిరీకరణకు ఉపయోగపడతాయి. నిత్యావసర వస్తువులను గిడ్డంగులలో నిల్వచేసి వాటిని నియంత్రిస్తుంది. ధరలలో ఒడిదుడుకులు లేకుండా కాపాడుతుంది.
  7. గిడ్డంగుల ముఖ్య అవసరము ఏమిటంటే ఎక్కువ సరుకులను విభజించడము.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సేవలు, వస్తువులను నిర్వచించుము.
జవాబు:
సేవలు ఒక పని లేదా ప్రక్రియ. ఇవి జాతీయమైనవి. కంటికి కనిపించనివి. వివిధ రకాల వినియోగదారులు వివిధ రకాల డిమాండును కలిగి ఉంటారు. ఒకే సమయములో ఉత్పత్తి మరియు వినియోగం జరుగుతుంది. సేవలను స్టాక్ గా నిల్వ చేయలేము. సేవలను కలుగజేసినపుడు వినియోగదారుడు పాల్గొనవచ్చును.
ఉదా: ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో స్వయం సేవ.

వస్తువు భౌతికమైనది, సజాతీయమైనది. కంటికి కనిపించేది. వివిధ రకాల వినియోగదారులు ప్రామాణికమైన డిమాండ్లను పొందుతారు. ఉదా: మొబైల్ఫోన్.

వినియోగము మరియు ఉత్పత్తిని విడదీయవచ్చును. స్టాక్గా నిల్వచేసుకోవచ్చు. వస్తువును తయారుచేసేటపుడు వినియోగదారుని చేరిక సాధ్యముకాదు. ఉదా: మోటారు కారు తయారీ.

ప్రశ్న 2.
ఈ – బ్యాంకింగ్ ప్రయోజనాలను వ్రాయండి.
జవాబు:
ఈ – బ్యాంకింగ్ వలన క్రింది ప్రయోజనాలు లభిస్తాయి.

  1. తక్కువ వ్యయం: ఈ పద్ధతిలో బ్యాంకింగ్ వ్యవహారములకు అయ్యే వ్యయం తక్కువగా ఉంటుంది. అందువలన బ్యాంకులు ఎక్కువ లాభాలను ఆర్జిస్తాయి.
  2. త్వరితగతిన సేవలు: ఈ – బ్యాంకింగ్లో ఖాతాదారులకు ఖచ్చితమైన సేవలు బ్యాంకులు త్వరగా అందిస్తాయి.
  3. ఎక్కడైనా ఎప్పుడైనా బ్యాంకింగ్: ఈ పద్ధతిలో బ్యాంకింగ్ సేవలు రోజుకు 24 గంటలు వారానికి 7 రోజులు అందిస్తాయి. ఖాతాదారులు తన ఇంటి నుంచి, ఆఫీసు నుంచి తన ఖాతాకు సంబంధించిన సమాచారాన్ని మరియు వ్యవహారాలు నిర్వహించడం జరుగుతుంది.
  4. నగదు రహిత బ్యాంకింగ్: ఈ బ్యాంకింగ్ ఎక్కడికైనా నగదు తీసుకొని వెళ్ళే అవసరము ఉండదు.
  5. ప్రపంచ వ్యాప్తము: ఈ బ్యాంకింగ్ బ్యాంకింగ్ సేవలు ప్రపంచ వ్యాప్తముగా ఏర్పాటు చేస్తుంది.
  6. సెంట్రల్ డేటాబేస్: ప్రతి బ్యాంకు బ్రాంచి దత్తాంశాన్ని కేంద్రీకరించడం జరుగుతుంది. ఖాతాదారు డిపాజిట్ చేయడం గాని, ఉపసంహరణ గాని ఒక బ్రాంచి నుంచి మరొక బ్రాంచికి పంపడం చేయవచ్చు.

ప్రశ్న 3.
మొబైల్ బ్యాంకింగ్ అంటే ఏమిటి ? మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఏయే సేవలు పొందవచ్చునో వివరించండి?
జవాబు:
ఖాతాదారులు సెల్ఫోన్ ద్వారా బ్యాంకు సేవలను వినియోగించుకునే పద్ధతిని మొబైల్ బ్యాంకింగ్ అంటారు. టెలిఫోన్ బ్యాంకింగ్తో పోల్చినపుడు మొబైల్ బ్యాంకింగ్ పరిధి ఎక్కువ మరియు ఉపయోగమైనది. దీనిని దిగువ పద్ధతులలో వినియోగించుకొనవచ్చును.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

ఎ) SMS బ్యాంకింగ్: మొబైల్ఫోన్లకు సంక్షిప్త వివరాలను పంపడాన్ని SMS బ్యాంకింగ్ అంటారు. SMS సమాచారాన్ని ప్రాముఖ్యత, అంత ప్రాముఖ్యత లేని బ్యాంకింగ్ వ్యవహారములకు ఉపయోగిస్తారు. ఏదైనా బ్యాంకు వ్యవహారము జరిగిన వెంటనే ఖాతాదారుడు తన ఖాతా నిల్వ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

బి) జి.యస్.యమ్.టూల్ కిట్: జి.యస్.యమ్. టూల్ కిట్లు అనేవి ఈ టెక్నాలజీ ఉన్న మొబైల్ ఫోన్లకు మాత్రమే వర్తిస్తాయి. ఈ సాఫ్ట్వేర్ మొబైల్ ఫోన్ మెనూలో వచ్చు మార్పులను తెలియజేస్తుంది. ఈ టూల్కిట్ కలిగి ఉన్న మొబైల్ ఫోన్లకు ప్రత్యేక సిన్కార్డులు కలిగి ఉంటాయి. మరియు ఒక స్థిరమైన బ్యాంకు బ్రాంచిలో సంబంధము కలిగి ఉంటాయి. ఖాతాదారుడు ఈ సేవలను ఉపయోగించుకొనవచ్చు.

సి) వేప్: వేప్ అనగా wireless application protocol. వేపు వెబ్ పేజీలతో పోల్చడం జరుగుతుంది. కంప్యూటర్ మానిటర్పై పేజీలు కనపడడమే కాకుండా దాని output చిన్న మొబైల్ ఫోన్లో కూడా చూపుతుంది. వేప్ బ్యాంకింగ్ అంత ప్రాముఖ్యత పొందలేదు. కొన్ని బ్యాంకులు మాత్రమే ఈ సేవలను అందిస్తున్నవి.

ప్రశ్న 4.
ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ దశలను వ్రాయుము.
జవాబు:
ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ క్రింది దశలు ఉంటాయి.
1. ఎ.టి.యం: దీనిని ఆటోమేటిక్ టెల్లర్ మిషీన్ అంటారు. ఖాతాదారులు త్వరిత గతిన నగదు తీసుకొనుటకు, నగదు బదిలీ, బిల్లుల చెల్లింపు, డిపాజిట్లు మొదలగునవి ఎ.టి.యం ద్వారా జరుగుతాయి. వీటిని వివిధ స్థలాలలో ఏర్పాటు చేసి బ్యాంకులోని కంప్యూటర్ అనుసంధానము చేస్తారు. ఖాతాదారుడు బ్యాంకు వారు ఇచ్చిన కార్డు ద్వారా నగదు తీసుకొనవచ్చును.

2. టెలిఫోన్ బ్యాంకింగ్: టెలిఫోన్ నుండి ఖాతాదారులు అనేక వ్యవహారాలు జరుపుతారు. అవి ఖాతాలలోని నిల్వ తెలుసుకొనుట, బదిలీ, బిల్లులు చెల్లింపు, ఆర్డరు నివేదికలు మరియు చెక్కు పుస్తకాలు మొదలైన సేవలు పొందవచ్చును.

3. ఈ – మెయిల్ బ్యాంకింగ్: ఖాతాదారులు ఎలక్ట్రానిక్ మెయిల్ ద్వారా వ్యవహారాలు జరుపుతారు. క్లయింటు యొక్క మెయిల్ బాక్స్కు అకౌంటు నివేదికను తరుచుగా కాల ప్రాతిపదికలో పంపడం జరుగుతుంది.

4. నెట్వర్క్ లేదా ఆన్లైన్ బ్యాంకింగ్: ఇంటర్నెట్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించడాన్ని ఆన్లైన్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటారు. కంప్యూటరీకరణ చేసిన ప్రతిబ్యాంకు బ్రాంచి నెట్వర్క్ ద్వారా ఖాతాదారులు తమ ఆమోదాన్ని ఇంటర్నెట్ ద్వారా తెలుపుతారు. ఆన్లైన్ బ్యాంకింగ్ అనేది ఖాతాదారులు బ్యాంకుకు సంబంధించిన వ్యవహారములు నెరవేర్చుటకు అవకాశమును కల్పిస్తుంది.

5. మొబైల్ బ్యాంకింగ్: ఖాతాదారులు సెల్ఫోన్ ద్వారా బ్యాంకింగ్ సేవలను వినియోగించుకొనే పద్ధతిని మొబైల్ బ్యాంకింగ్ అంటారు. దీని పరిధి చాలా ఎక్కువ. మొబైల్ బ్యాంకింగ్ను SMS, G.S.M, Sim Toolkit, మరియు వేప్ టెక్నాలజీలో వినియోగించుకొనవచ్చును.

ప్రశ్న 5.
భీమా అంటే ఏమిటి ? భీమా విధులను వివరించండి.
జవాబు:
భీమా అనగా ఒప్పందము. భీమాలో ఒక పార్టీ మరొక పార్టీకి ప్రతిఫలము కొంత నగదును, వస్తువులకు నష్టము సంభవించడం వలన, పాడైపోవడం వలన లేదా ఒక అనిశ్చిత సంఘటన వలన కలిగే నష్టాన్ని ఇవ్వడం జరుగుతుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

భీమా విధులు:
i) నిర్దిష్టతను కలుగజేయును: నష్టము సంభవించినపుడు ఒక నిర్ణీత మొత్తాన్ని, భీమా సంస్థ భీమాదారునకు చెల్లించడం జరుగుతుంది. నష్టము సంభవించడం వలనగాని లేక నిర్ణీతకాలము పూర్తి అయిన తర్వాత నిర్ణీత మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. నిర్దిష్టతను కల్పించడానికి భీమా సంస్థకు ప్రీమియం చెల్లించడం జరుగుతుంది.

ii) రక్షణ: భీమా రెండవ ముఖ్యవిధి రక్షణ కల్పించడం. నష్టము సంభవించుటకు గల అవకాశము నుంచి రక్షిస్తుంది. భీమా అనేది ఒక అనిశ్చిత సంఘటనను నిలవరించదు. కాని సంఘటన జరిగినపుడు నష్ట పరిహారాన్ని చెల్లించడం జరుగుతుంది.

iii)నష్టాన్ని పంచుకోవడం: ఒక అనిశ్చిత సంఘటన జరిగినపుడు ఆ నష్టాన్ని భీమా పాలసీదారులు అందరూ పంచుకోవడం జరుగుతుంది. భీమా పాలసీదారులు అందరూ ప్రీమియం సంస్థకు చెల్లిస్తారు. కాబట్టి నష్టాన్ని కూడా పంచుకుంటారు.

iv)మూలధన కల్పనకు సహాయం: ప్రీమియం రూపములో వచ్చిన మొత్తాన్ని తిరిగి వివిధ పథకాలలో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. అందువలన మూలధన కల్పనకు తోడ్పడుతుంది.

ప్రశ్న 6.
భీమా ప్రయోజనాలు, పరిమితులను వివరించండి.
జవాబు:
భీమా ప్రయోజనాలు: భీమా వలన సాధారణ ప్రజలకు, వర్తకులకు, ప్రభుత్వానికి మరియు వివిధ ఏజెన్సీలకు అనేక లాభాలు కలుగుతాయి.
1. నిర్దిష్టతను కల్పించుట: భీమా సంస్థతో ఒప్పందము చేసుకోవడము వలన భీమాదారుడు అనిర్దిష్టతను నిర్దిష్టముగా మార్చుకోడానికి భీమా సహాయము చేస్తుంది. భీమాదారుడు ప్రీమియంను భీమా సంస్థకు చెల్లించడం ద్వారా నష్ట భయము తగ్గుతుంది.

2. నష్టాలను పంచుట: అనిర్దిష్ట సంఘటనల వలన కలిగే నష్టాలను ఎక్కువమంది భీమాదారులకు పంపిణీ చేయడానికి భీమా తోడ్పడుతుంది. భీమాదారుల నష్టభయాన్ని అన్ని భీమా కంపెనీలకు బదిలీ చేసే అవకాశము కలుగుతుంది. ఆర్థిక నష్టాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది.

3. భద్రత కల్పించుట: అనిశ్చిత సంఘటనల వలన కలిగే నష్టభయము నుండి భీమాదారునకు భద్రత కలుగజేస్తుంది. భీమా ప్రీమియం చెల్లించడం వలన అందుకు ప్రతిఫలముగా భీమాదారుకు కలిగే నష్టానికి లేదా పరిహారానికి భీమా కంపెనీ హామీ ఇస్తుంది. దీనివలన భీమాదారునకు నష్టభయం నుండి రక్షణ లభిస్తుంది.

4. మూలధనము సమకూర్చుట: వివిధ సంస్థలలో మూలధన పెట్టుబడులకు అవకాశాలు కల్పించడం ద్వారా ఆర్థిక నష్టభయాలను మరియు నష్టాలను తగ్గిస్తుంది.

5. సామర్థ్యాన్ని పెంచును: నష్టభయాన్ని భీమా తగ్గిస్తుంది. వ్యాపార సామర్థ్యాన్ని పెంచుతుంది. వ్యాపారస్తులకు భద్రత కల్పిస్తుంది. దీని వలన పారిశ్రామిక అభివృద్ధి మరియు పరిశ్రమలను విస్తరించడానికి అవకాశాలు కలుగుతాయి.

6. విదేశీ మారకద్రవ్యము ఆర్జన: అంతర్జాతీయ వ్యాపారుస్తులకు, ఓడల రవాణాదారులకు మరియు బ్యాంకింగ్ సంస్థలకు భీమా భద్రతను కల్పిస్తుంది. దీని వలన విదేశీ వ్యాపారము వృద్ధి చెంది, విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడం జరుగుతుంది. ఫలితముగా దేశ ఆర్థిక వ్యవస్థ పఠిష్టముగా ఉంటుంది.

7. సామాజిక భద్రత: పేదరికము, నిరుఓ’్యగము, రోగాలు, వృద్ధాప్యము, అశక్తత ప్రమాదాలు, అగ్ని మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాల వలన కలిగే అనర్థాలతో పోరాడటానికి భీమా ఒక సాధనముగా పనిచేస్తుంది.

8. పొదుపును ప్రోత్సహించుట: భీమా పొదుపును ప్రోత్సహిస్తుంది. ప్రజలలో ఖర్చు పెట్టే అలవాట్లను మార్చుతుంది. నిర్దిష్టమైన మొత్తాన్ని పొదుపు చేయడానికి ప్రోత్సహిస్తుంది.

భీమా పరిమితులు:

  1. నష్టాన్ని పంచడం: ఒక పాలసీదారుకు కలిగే నష్టాన్ని ఇతర పాలసీదారులందరికి పంచడం వలన తమకు రావలసిన పెట్టుబడి తగ్గిపోతుందని చాలామంది పెట్టుబడిదారులు భీమాను వ్యతిరేకిస్తున్నారు.
  2. ద్రవ్యము వాస్తవిక విలువ: గడువు పూర్తి అయిన చెల్లించే పాలసీ మొత్తము ఎక్కువగా ఉన్నప్పటికి ద్రవ్యము అసలు విలువతో పోలిస్తే తక్కువ.
  3. విశ్వాసంలో లోపము: చాలా మంది పెట్టుబడిదారులకు భీమాపై విశ్వాసము లేకపోవుట వలన తమ పెట్టుబడిని బ్యాంకులు, ఇతర సంస్థలలో ఉంచడానికి ఇష్టపడతారు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

ప్రశ్న 7.
జీవిత భీమా ప్రయోజనాలను తెలపండి.
జవాబు:
జీవిత భీమా వలన కలిగే ప్రయోజనాలు:

  1. పొదుపు అలవాట్లను ప్రోత్సహిస్తుంది: జీవిత భీమాలో ప్రజలు నిర్ణీతకాలానికి ప్రీమియం చెల్లిస్తారు. ఈ విధముగా వారిలో పొదుపు అలవాట్లను ప్రోత్సహిస్తుంది.
  2. పాలసీ తాకట్టు పెట్టుట లేదా బదిలీ: జీవిత భీమా పాలసీపై గల హక్కులను ఇతరులకు బదిలీ చేయడం ద్వారా ఋణాలను పొందవచ్చును. ఇతర భీమా సంస్థలు మరియు ద్రవ్య సహాయక సంస్థలకు భీమా పాలసీలను తనఖా ఉంచి గృహ ఋణాలను, ఇతర ఋణాలను పొందవచ్చును.
  3. పన్ను రాయితీ: భీమాదారుడు చెల్లించే ప్రీమియం మొత్తమునకు కేంద్ర ఆర్థికశాఖ పన్నురాయితీలను ఇస్తుంది.
  4. కుటుంబ సభ్యులకు రక్షణ: భీమాదారునకు అకాలమరణము సంభవించినపుడు, అతని కుటుంబ సభ్యులకు జీవిత భీమా ఆర్థిక సహాయం చేయును. ఈ విధముగా కుటుంబసభ్యులకు ఆధారాన్ని కల్పిస్తుంది.
  5. పెట్టుబడికి మంచి మార్గం: భీమాదారుడు పెట్టిన పెట్టుబడికి జీవిత భీమా నుంచి ఆదాయం వస్తుంది మరియు పెట్టుబడి మొత్తానికి రక్షణను కూడా కల్పిస్తుంది.
  6. సామాజిక భద్రత కల్పిస్తుంది: జీవిత భీమా వృద్ధులు, ఆరోగ్యము ప్రమాదము, అంగవైకల్యం, పిల్లల విద్య, వివాహము మొదలైన వాటికి సామాజిక భద్రతను కల్పిస్తుంది.

ప్రశ్న 8.
సముద్రభీమా లక్షణాలను వివరించుము.
జవాబు:
ఆర్నాల్ట్ ప్రకారము “సముద్ర భీమా ఒక పార్టీ ఎదుటి వ్యక్తి నుంచి పొందిన ప్రతిఫలమునకు సముద్ర ప్రయాణము మరియు ఓడలోకి సరుకు ఎక్కించునప్పుడు నిర్ణీత కాలములో సంభవించిన నష్టాన్ని భర్తీ చేసుకొనుటకు ఒక కాంట్రాక్టు”.

సముద్ర భీమా లక్షణాలు:
1. సాధారణ కాంట్రాక్టు సూత్రాలు అనగా భీమా ఆసక్తి, అత్యంత విశ్వాసము, నష్టపూర్తి, హక్కుల సంక్రమణ, పూచీ, సమీపకారణం మొదలైనవి సముద్ర భీమాకు వర్తిస్తాయి.

2. భీమాదారునకు, భీమా సంస్థకు మధ్య ఒప్పందమే సముద్రభీమా, నష్టభయానికి హామీ ఇచ్చినందుకు భీమాదారుడు నిర్ణీత వ్యవధిలో నిర్దిష్టమైన సొమ్మును భీమా సంస్థకు చెల్లించే బాధ్యత ఏర్పడుతుంది.

3. సముద్ర భీమాలో సముద్రములో సరుకు, ఓడ, సముద్రప్రయాణ ఛార్జీలు మొదలైన వాటికి భీమా ఉంటుంది. ఓడ మునిగిపోవుట, కాలిపోవుట, ఓడలు ఢీకొట్టుకొనుట, ఇసుకమేటలలో చిక్కుకొనిపోవుట, దొంగతనము మొదలైన నష్టభయాలకు సముద్ర భీమా హామీ కల్పిస్తుంది.

4. ఒక వైపు ప్రయాణానికి లేక అనేక ప్రయాణాలకు లేదా ఒక నిర్దిష్ట సమయానికి భీమా చేసుకొనవచ్చును. ప్రధానమైన షరతుపూర్తి అయిన తర్వాత తిరిగి భీమాను పునరుద్ధరణ చేసుకొనవచ్చును.

5. సముద్ర భీమాలో సముద్ర ప్రమాదాల వలన కలిగే నష్టాలను పూరించడానికి సంస్థ హామీ ఇవ్వడం జరుగుతుంది. 6. సముద్ర భీమాలో ఓడ లేదా ఓడలోని సరుకు నిల్వకు కలిగిన నష్టమును భీమాదారుకు చెల్లించబడుతుంది. ఇందులో మూడవ వ్యక్తి ‘భీమా కూడా ఉంటుంది.

ప్రశ్న 9.
అగ్ని భీమాను నిర్వచించి, లక్షణాలు వివరించుము.
జవాబు:
భీమా చట్టము 1938 సెక్షన్ 2(62) అగ్ని భీమాను ఇలా నిర్వచించినది. “ఇతర రకాల భీమా వ్యాపారాలతో సంబంధము లేకుండా, ఉదహరించిన భీమా ఆస్తికి అగ్ని వలన లేదా సాంప్రదాయ సిద్ధముగా అగ్నితో సంబంధము కలిగి ఉండి, దాని వలన కలిగే నష్టభయానికి ఇచ్చిన హామీ భీమా కాంట్రాక్టు”..
అగ్ని భీమా లక్షణాలు:
1. నష్టపూర్తి కాంట్రాక్టు: అగ్ని భీమా నష్టపూర్తి కాంట్రాక్టుకు చెందినది. ఈ కాంట్రాక్టులలో నిర్ణీతమైన పాలసీ మొత్తము లేదా అగ్ని ప్రమాదము వలన కలిగిన నష్టము ఏది తక్కువైతే ఆ మొత్తానికి మించి భీమాదారుడు క్లెయిం చేయలేడు.

2. న్యాయాత్మక ప్రతిఫలము: అగ్ని భీమా కాంట్రాక్టులలో ప్రతిఫలము విధిగా ఉండాలి. కాంట్రాక్టులో భీమాదారుడు చెల్లించిన ప్రతిఫలమును ప్రీమియం అంటారు. ఇది భీమా కాంట్రాక్టు ఆవశ్యకాలలో ఒకటి.

3. భీమా ఆసక్తి: అగ్ని భీమా చేయబడిన ఆస్తి లేదా సరుకు మీద భీమాదారునకు ఆసక్తి ఉండవలెను. అదే విధముగా నష్టము జరిగినపుడు నష్ట పరిహారము క్లెయిం చేసే సమయంలో కూడా అతనికి భీమా ఆసక్తి ఉండాలి.

4. అవశేషానికి క్లెయిం: భీమా సరుకు అగ్ని ప్రమాదములో నష్టానికి గురైనపుడు సంస్థ క్లెయిం చెల్లించగానే మిగిలిన సరుకు లేదా నష్టపోయిన సరుకు సంస్థకు బదిలీ అయి, భీమాదారుడు హక్కు కోల్పోతాడు.

5. ప్రమాదానికి కారణము: ప్రమాదము వలన జరిగిన నష్టానికి కారణము అగ్ని లేదా నిప్పురవ్వలు అయి ఉండాలి. ఏ ఇతర కారణం వలన నష్టము జరిగినా సంస్థ ఆ క్లెయిమును పరిష్కారానికి అంగీకరించదు.

6. అత్యంత విశ్వాసము: అగ్ని భీమా కాంట్రాక్టులో భీమాదారుడు మరియు సంస్థకు ఒకరిపై మరొకరికి అత్యంత నమ్మకము ఉండాలి.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

ప్రశ్న 10.
రోడ్డు రవాణా ప్రయోజనాలు, పరిమితులు తెలపండి.
జవాబు:
రోడ్డు రవాణా ప్రయోజనాలు:

  1. తక్కువ మూలధనము: రైల్వేలు మరియు విమానాలతో పోలిస్తే రోడ్ల నిర్మాణానికి తక్కువ మూలధనము అవసరము. రోడ్ల నిర్వహణ సాధారణముగా రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక సంస్థలు చేపడతాయి.
  2. ఇంటింటికి సేవ: వస్తువులను, ప్రయాణీకులను ఎంత మారుమూల ప్రాంతానికైనా, చేరవేస్తుంది. రోడ్ల నిర్వహణ వ్యయాన్ని తగ్గిస్తుంది.
  3. గ్రామీణ ప్రాంతానికి సేవలు: గ్రామీణ ప్రాంతాల వారికి రోడ్డు రవాణా చాలా అనుకూలము. సరుకులను గ్రామీణ పట్టణ ప్రాంతాలలో అమ్మడానికి ఇది అనువైనది.
  4. తక్కువ నిర్వహణ ఖర్చు రైల్వేలతో పోల్చినపుడు రోడ్డు నిర్వహణ వ్యయము చాలా తక్కువగా ఉంటుంది.
  5. మార్పుకు అనుకూలము: రోడ్డు రవాణా వాహనాలను మార్చుకోవడానికి అనుకూలముగా ఉంటుంది. వ్యక్తిగత అవసరాల ఆధారముగా కాలాన్ని, రహదారులను మార్చుకోవచ్చు.
  6. స్వల్ప దూరానికి అనుకూలము: స్వల్ప దూరానికి వస్తువులను మరియు ప్రయాణీకులను త్వరగా, తక్కువ ఖర్చుతో తరలించవచ్చును.
  7. ఇతర రవాణా వ్యవస్థలకు సహాయకారి: ఏ ఇతర రవాణా వ్యవస్థకైనా రోడ్డు రవాణా సహాయకారిగా ఉంటుంది. అన్ని వస్తువుల తరలింపు రోడ్డు రవాణాతో ప్రారంభం అవుతుంది.
  8. తక్కువ వ్యయం: రోడ్డు రవాణాలో ప్రారంభ మూలధనము, నిర్వహణ ఖర్చులు, ఇతర రవా తో పోలిస్తే తక్కువ.
  9. వేగం ఎక్కువ: రోడ్డు రవాణాలో రవాణాకు పట్టేకాలము తగ్గించవచ్చును. జల రవాణాతో పోలిస్తే రోడ్డు రవాణా వేగవంతమైనది.

రవాణాలో లోపాలు:

  1. ఋతు విధేయమైనది: దూరప్రాంతాలకు రోడ్డు రవాణా అనుకూలమైనది కాదు. వర్షాలు లేక వరదలు వచ్చినపుడు రోడ్డు రవాణా నమ్మదగినది కాదు.
  2. రవాణాలో ప్రమాదాలు: రైళ్ళతో పోలిస్తే రోడ్డు రవాణా అంత సురక్షితం కాదు. మోటారు వాహనాల ద్వారా ప్రమాదాలకు అవకాశాలెక్కువ.
  3. తక్కువ వేగం: ఇతర రవాణాలతో పోల్చినపుడు రోడ్డు రవాణాలో వాహనాలు తక్కువ వేగముతో నడుస్తాయి.
  4. పరిమిత రవాణా సామర్థ్యము: భారీ వస్తువుల రవాణాకు రోడ్డు రవాణా అనుకూలము కాదు. కారణం రోడ్డు రవాణా సామర్థ్యం తక్కువ.
  5. ఖర్చు ఎక్కువ: దూర ప్రాంతాలకు రైలు రవాణాతో పోలిస్తే రోడ్డు రవాణాలో ఖర్చు ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న 11.
రైలు రవాణా ప్రయోజనాలను, లోపాలను వ్రాయుము.
జవాబు:
రైలు రవాణా ప్రయోజనాలు:

  1. దూర ప్రాంతాలకు మోటారు వాహనాల ద్వారా వీలుకాని పెద్ద పెద్ద వస్తువులను రైల్వేలు రవాణా చేస్తాయి.
  2. రైల్వేలు అతిత్వరగా ఖచ్చితముగా వస్తువులను ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశానికి చేరుస్తాయి.
  3. బొగ్గు, ఇతర ముడిసరుకులను సరసమైన రేట్లకు ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతానికి సులభముగా రవాణా చేస్తాయి.
  4. కరువు కాటకాలు మరియు వస్తువులు కొరత ఉన్నప్పుడు అతి త్వరగా వస్తువులను ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి తీసుకొనిపోవడానికి రైల్వేలు సహాయపడతాయి.
  5. శ్రామిక గమనాన్ని ప్రోత్సహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి.
  6. రైలు ప్రయాణము సురక్షితమైనది. ప్రమాదాలు, విఘాతాలకు ఇతర రవాణాలతో పోలిస్తే రైల్వేలో తక్కువ.
  7. రైల్వేలకు వస్తువుల యొక్క రవాణా సామర్థ్యము చాలా ఎక్కువగా ఉంటుంది. అవసరాలను బట్టి రైల్వే వేగను పెంచవచ్చును.

రైల్వే రవాణా లోపాలు:

  1. రైల్వేలకు మూలధనము భారీమొత్తములో అవసరమవుతుంది. నిర్మాణ వ్యయము, నిర్వహణ వ్యయం, పరోక్ష ఖర్చులు మొదలైనవి ఇతర రవాణాలతో పోలిస్తే చాలా ఎక్కువ.
  2. రైల్వే రవాణాలో మరొక లోపము మార్పు లేకపోవడం. వ్యక్తిగత అవసరాలకు అనుగుణముగా రైలు మార్గాన్ని, సమయాన్ని మార్పు చేయలేము.
  3. రైల్వే రవాణా రోడ్డు రవాణా వలె వస్తువులను ఇంటికి తరలించదు.
  4. రైల్వే రవాణా అనేది తక్కువ దూరానికి మరియు తక్కువ బరువు గల వస్తువులను రవాణా చేయడానికి అనుకూలము కాదు.
  5. మోటారు రవాణాతో పోల్చినపుడు రైలు రవాణాలో వస్తువులను లోడింగ్ చేయడానికి, డెలివరీ చేయడానికి ఎక్కువ సమయము, ఎక్కువ శ్రమ అవసరమవుతుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎ.టి.యమ్.
జవాబు:
ఎ.టి.యమ్ అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ అని, ఎనీ టైమ్ మనీమెషీన్ అని కూడా అంటారు. ఖాతాదారులు త్వరగా నగదు తీసుకొనుటకు, బదిలీ, బిల్లుల చెల్లింపు మొదలైనవి ఎ.టి.యమ్ ద్వారా జరుగుతాయి. వీటిని వివిధ స్థానాలలో ఏర్పాటు చేసి బ్యాంకులో కంప్యూటరుకు అనుసంధానము చేస్తారు. ప్రతి ఖాతాదారునకు ఒక కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డు సహాయముతో ఖాతాదారుడు నగదు తీసుకోవచ్చును.

ప్రశ్న 2.
ఆన్లైన్ బ్యాంకింగ్.
జవాబు:
ఇంటర్నెట్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించడాన్ని ఆన్లైన్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటారు. కంప్యూటీకరణ చేసిన ప్రతి బ్యాంకు బ్రాంచి, నెట్వర్క్ ద్వారా ఖాతాదారులు బ్యాంకింగ్ వ్యవహారాలు జరపడానికి అవకాశం ఏర్పడినది. ఖాతాదారులు ఇంటివద్దనే బ్యాంకింగ్ వ్యవహారాలు నిర్వహించుకుంటారు.

ప్రశ్న 3.
టెలీ బ్యాంకింగ్.
జవాబు:
దీనిని హోమ్ బ్యాంకింగ్ అంటారు. టెలీఫోన్ నుండి ఖాతాదారులు అనేక వ్యవహారాలు జరుపుతారు. అవి ఖాతాలోని నిల్వ తెలుసుకొనుట, బదిలీ, బిల్లుల చెల్లింపు, ఆర్డర్ స్టేటుమెంట్లు, చెక్కు పుస్తకాలు మొదలైన సేవలను పొందవచ్చు.

ప్రశ్న 4.
మొబైల్ బ్యాంకింగ్.
జవాబు:
ఖాతాదారులు సెల్ఫోన్ ద్వారా బ్యాంకు సేవలను వినియోగించుకొను పద్ధతిని మొబైల్ బ్యాంకింగ్ అంటారు. టెలిఫోన్ బ్యాంకింగ్తో పోల్చినపుడు మొబైల్ బ్యాంకింగ్ పరిథి ఎక్కువ మరియు ఉపయోగమైనది. మొబైల్ బ్యాంకింగ్ను యస్.యమ్.ఎస్ బ్యాంకింగ్, జి.యస్.ఎమ్. సిమ్ టూల్కిట్ మరియు వేప్ టెక్నాలజీలలో వినియోగించుకొనవచ్చును.

ప్రశ్న 5.
ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్.
జవాబు:
కంప్యూటర్ రాకతో ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ప్రారంభమైనది. 1970లో ఎ.టి.యమ్, 1980లో టెలీ బ్యాంకింగ్ మరియు ఈ మెయిల్ బ్యాంకింగ్ ప్రస్తుతం నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఆచరణలోనికి వచ్చాయి. కొత్త పరికరాలైన క్రెడిట్ కార్డులు, ATM, ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ మరియు ఎలక్ట్రానిక్ క్లియరింగ్ హౌస్ పద్ధతులు ప్రతిభావంతమైన, వేగవంతమైన చెల్లింపులు, పరిష్కార పద్ధతులు. వీటిని అన్నింటిని ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటారు.

ప్రశ్న 6.
భీమా సంస్థ మరియు భీమాదారుడు.
జవాబు:
భవిష్యత్తులో ఒక సంఘటన జరిగినపుడు అందుకు సొమ్ము చెల్లించుటకు అంగీకరించిన వారిని భీమా సంస్థ లేదా ఇన్సూరర్ అంటారు. తనకు అనుకోకుండా జరిగే నష్టానికి భద్రత కోరుతూ, అందుకోసం కొంత సొమ్మును సంస్థకు చెల్లించే వ్యక్తిని భీమాదారుడు లేదా ఇన్సూర్డ్ అంటారు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

ప్రశ్న 7.
ప్రీమియం.
జవాబు:
భీమాదారునకు కలిగే నష్టానికి రక్షణ కల్పించినందుకు బదులుగా, భీమాసంస్థకు నిర్దిష్ట సమయానికి భీమాదారుడు చెల్లించే సొమ్మును ప్రీమియం అంటారు.

ప్రశ్న 8.
భీమా నిర్వచనము.
జవాబు:
భీమా అనగా ఒప్పందము. భీమాతో ఒక పార్టీ మరొక పార్టీకి ప్రతిఫలముగా కొంతనగదు మొత్తాన్ని, వస్తువులకు సంభవించడం వలన గాని, పాడైపోవుట వలన గాని, గాయపడుట వలన గాని లేదా అనిశ్చిత సంఘటన జరుగుట వలన గాని కలిగే నష్టాన్ని ఇవ్వడం జరుగుతుంది.

ప్రశ్న 9.
పునరీమా.
జవాబు:
రెండు లేదా ఎక్కువ భీమా సంస్థల మధ్య జరిగిన భీమా కాంట్రాక్టును పునర్భీమా అంటారు. ఒక భీమా సంస్థ తాను అంగీకరించిన భీమా విషయములో కొంతభాగాన్ని మరొక భీమా సంస్థకు బదిలీ చేస్తూ చేసుకున్న ఏర్పాటునే పునర్భీమా అంటారు. దీని వలన మొదటి భీమా సంస్థ బాధ్యత పరిమితము అవుతుంది.

ప్రశ్న 10.
ద్వంద్వ భీమా
జవాబు:
ద్వంద్వ భీమా అంటే ఒకే ఆస్తిపై ఒకటి కంటే ఎక్కువ భీమా పాలసీలు తీసుకోవడము. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ భీమా పాలసీలను తీసుకోవచ్చు. ఆ పాలసీదారు మరణించినా లేదా నిర్ణీత గడువు తీరినపుడు ఏది ముందు జరిగినా, భీమా సొమ్మును అన్ని భీమా సంస్థలు పూర్తిగా ఎవరికి చెల్లిస్తారు. కాని అగ్ని, సముద్ర భీమాలలో అన్ని భీమా సంస్థలు నష్టాన్ని మించకుండా చెల్లిస్తారు.

ప్రశ్న 11.
హక్కుల సంక్రమణ.
జవాబు:
దీని అర్థము ఋణదాత హక్కులను పొందిన వ్యక్తిని ఋణదాత స్థానములో ఉంచడము. నష్టపరిహారాన్ని చెల్లించిన తర్వాత భీమాదారుకు గల అన్ని హక్కులు భీమాసంస్థకు బదిలీ అవుతాయి. దీనిని హక్కుల సంక్రమణ సిద్ధాంతము లేదా ప్రతినివేశం అంటారు.

ప్రశ్న 12.
సమీపకారణము.
జవాబు:
ఇది causa proxima అనే లాటిన్ సూత్రము నుండి ఏర్పడినది. దీని అర్థము దగ్గర కారణము. ఒక నష్టము సంభవించడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో వాస్తవమైన కారణాన్ని సమీపకారణము అంటారు. భీమా సంస్థ బాధ్యతను లెక్కించుటకు సుమారు కారణంకాక సమీపకారణం లెక్కలోకి తీసుకుంటారు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

ప్రశ్న 13.
భీమా ఆసక్తి.
జవాబు:
సక్రమమైన భీమా కాంట్రాక్టు ఆవశ్యకాలలో భీమా ఆసక్తి ప్రధానమైనది. భీమా ఆసక్తి లేని ఒప్పందము జూదముగా భావిస్తారు. అది చెల్లని కాంట్రాక్టు అవుతుంది. కనుక భీమా చేసే వ్యక్తికి ఆస్తి మీద లేదా జీవితం మీద గాని ఆసక్తి కలిగి ఉండాలి. ఉదా: ఒక వ్యక్తికి తన జీవితం మీద గాని, తన భార్య జీవితం మీద భీమా ఆసక్తి ఉంటుంది.

ప్రశ్న 14.
ఎండోమెంట్ పాలసీ.
జవాబు:
ఎండోమెంట్ జీవిత భీమాపాలసీ ఒక నిర్దిష్ట కాలానికి తీసుకునే పాలసీ. గడువుకాలము పూర్తి అయిన తర్వాత గాని లేక పాలసీదారు మరణించినపుడు గాని వీటిలో ఏది ముందు జరిగినా భీమా సంస్థ హామీ ఇచ్చిన సొమ్మును చెల్లిస్తుంది.

ప్రశ్న 15.
యావజ్జీవిత పాలసీ.
జవాబు:
యావజ్జీవిత పాలసీ జీవితకాలము అమలులో ఉంటుంది. ఈ పాలసీ మీద ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ రిస్క్న భరిస్తుంది. భీమా ప్రీమియం 20 నుంచి 25 సంవత్సరాలు లేదా జీవితకాలం చెల్లించాలి.

ప్రశ్న 16.
సముద్ర భీమా.
జవాబు:
సముద్ర భీమాలో ఒక పార్టీ ఎదుట వ్యక్తి నుంచి ప్రతిఫలమును స్వీకరించినందుకుగాను ఆ వ్యక్తికి సముద్ర ప్రయాణములో ప్రమాదాలు మరియు ఓడలోకి సరుకు ఎక్కించునపుడు, భవిష్యత్ అనగా నిర్ణీత కాలములో సంభవించిన నష్టాన్ని భర్తీ చేయుటకు, చేసుకొనుటకు ఒక కాంట్రాక్టు.

ప్రశ్న 17.
సరుకు భీమా.
జవాబు:
సరుకు రవాణా చేయునపుడు అనేక ప్రమాదాలకు గురి అవుతుంది. నౌకాశ్రయములో దొంగతనము లేదా ప్రయాణములో సరుకునకు నష్టము జరుగుట మరియు ఇతర ప్రమాదాలకు గురి అగును. ఇటువంటి నష్ట భయానికి ఇచ్చే హామీని కార్గో భీమా (సరుకు భీమా) అంటారు.

ప్రశ్న 18.
అగ్ని భీమా.
జవాబు:
“భీమా చట్టము 1938 సెక్షన్ 2(6ఎ) అగ్ని భీమాను ఇలా నిర్వచించినది”. ఇతర రకాల భీమా వ్యాపారాలతో సంబంధము లేకుండా ఉదహరించిన భీమా ఆస్తికి అగ్ని వలన గాని లేదా సంప్రదాయ సిద్ధముగా అగ్నితో సంబంధం కలిగి జరిగే నష్టానికి ఇచ్చిన హామీ భీమా కాంట్రాక్టు”.

ప్రశ్న 19.
అగ్ని భీమా లక్షణాలు.
జవాబు:

  1. అగ్ని భీమా నష్ట పూర్తి కాంట్రాక్టు.
  2. అగ్ని భీమాలో న్యాయాత్మక ప్రతిఫలం ఉండాలి.
  3. భీమాదారుకు ఆస్తి మీద భీమా ఆసక్తి ఉండాలి.
  4. ప్రమాదము వలన జరిగిన నష్టానికి కారణం అగ్ని అయి ఉండాలి.
  5. ఈ కాంట్రాక్టు అత్యంత విశ్వాసము గలది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

ప్రశ్న 20.
జాతీయ రహదారి.
జవాబు:
జాతీయ రహదారులు వివిధ రాష్ట్రాల రహదారులను కలుపుతూ సైనికులను చేరవేస్తుంది. ఈ రహదారి రాష్ట్ర రాజధానులను, మహానగరాలను కలుపుతుంది. జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణ నియంత్రణను ‘నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా’ చేపట్టింది.

ప్రశ్న 21.
పైపులైన్లు.
జవాబు:
పైపులైన్లు ద్రవ పదార్థాలను తరలించడానికి ఎంతో ప్రాముఖ్యత వహించినది. పైపులైన్ల ద్వారా సహజ వాయువు మరియు ముడిచమురు, ఇతర పెట్రోలియం ఉత్పత్తులు పైప్ లైన్ల ద్వారా పంపబడతాయి. పైపులైన్లు ఎటువంటి అంతరాయము లేకుండా తక్కువ ఖర్చుతో నిర్వహించబడతాయి.

ప్రశ్న 22.
బాండెడ్ గిడ్డంగులు.
జవాబు:
ప్రభుత్వము చేత అనుమతి పొంది పన్నులు మరియు కస్టమ్స్ సుంకాలు చెల్లించక మునుపు దిగుమతి చేసుకున్న వస్తువులు నిల్వచేయడానికి ఉపయోగపడే గిడ్డంగులను బాండెడ్ గిడ్డంగులు అంటారు. దిగుమతిదారుడు పూర్తి సుంకాలు చెల్లించలేనపుడు, మొత్తం సరుకు అవసరం లేనపుడు, కస్టమ్స్ అధికారులు బాండెడ్ గిడ్డంగులలో భద్రపరుస్తారు.

ప్రశ్న 23.
గిడ్డంగుల రెండు ప్రాముఖ్యతలు.
జవాబు:

  1. కొన్ని వస్తువులు కొన్ని కాలాలలో మాత్రమే ఉత్పత్తి అవుతాయి. కాని అన్ని కాలాలలో వినియోగించేందుకు గిడ్డంగులు దోహదపడతాయి.
  2. గిడ్డంగులు ధరల స్థిరీకరణకు ఉపయోగపడతాయి. నిత్యావసర వస్తువులను ప్రభుత్వ గిడ్డంగులలో నిల్వచేసి వాటిని నియంత్రిస్తుంది. ధరలలో ఒడిదుడుకులు లేకుండా కాపాడుతుంది.

ప్రశ్న 24.
క్యాష్ క్రెడిట్
జవాబు:
ఒక సంవత్సరానికి లేదా అంతకంటే తక్కువ కాలానికి ఖాతాదారునకు మంజూరు చేసిన ఋణాన్ని క్యాష్ క్రెడిట్ అంటారు. సరుకుగాని, ఇతర ఆస్తి హామీగా ఈ ఋణాన్ని మంజూరు చేస్తారు. ఋణ మొత్తాన్ని ఖాతాదారుడు ఒకేసారి లేదా కొన్ని వాయిదాలలో తీసుకోవచ్చు. ఋణమొత్తముపై కాక ఖాతాదారుడు వాడుకున్న మొత్తంపై వడ్డీని విధిస్తారు.

ప్రశ్న 25.
బిల్లుల డిస్కౌంట్.
జవాబు:
బిల్లుదారు బిల్లు గడువు తేదీకి ముందు నగదు అవసరమయినపుడు బ్యాంకు వద్ద డిస్కౌంటు చేసుకొనవచ్చును. బ్యాంకు బిల్లు మొత్తములో కొంత మొత్తాన్ని తగ్గించి బిల్లుదారుకు చెల్లిస్తుంది. గడువుతేదీన బిల్లు స్వీకర్త నుంచి పూర్తి మొత్తాన్ని వసూలు చేసుకుంటుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

ప్రశ్న 26.
రికేరింగ్ డిపాజిట్.
జవాబు:
తక్కువ ఆదాయము పొందేవారు చిన్న మొత్తాలలో పొదుపు చేయడానికి ఈ డిపాజిట్లు అనుకూలము. ఈ డిపాజిట్లను కొంత కాలవ్యవధి అనగా వారానికి, నెలకు నిర్ణయించిన మొత్తాన్ని నిర్ణీతకాలము పూర్తి అయ్యేవరకు నగదు జమచేస్తూ ఉండాలి. గడువుకాలము పూర్తి అయిన తర్వాత వడ్డీతో సహా మొత్తం సొమ్మును డిపాజిట్ దారుకు చెల్లిస్తారు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్వదేశీ, విదేశీ వర్తకం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Commerce Study Material 2nd Lesson స్వదేశీ, విదేశీ వర్తకం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Commerce Study Material 2nd Lesson స్వదేశీ, విదేశీ వర్తకం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వర్తకము అనగానేమి ? వివిధ రకాల వర్తకాలను వివరింపుము.
జవాబు:
వస్తువులు లేదా సేవల అమ్మకము మరియు కొనుగోలు చేయడాన్ని వర్తకము అంటారు. ఈ అమ్మకము మరియు కొనుగోలు ఇద్దరు వ్యక్తుల మధ్యగాని, రెండు సంస్థల మధ్యగాని లేదా రెండు దేశాల మధ్య జరుగవచ్చును. వర్తకము రెండు రకాలు. 1) స్వదేశీ వర్తకము, 2) విదేశీ వర్తకము.

1) స్వదేశీ వర్తకము : ఒకదేశ సరిహద్దు లోపల కొనుగోలు మరియు అమ్మకాలు జరపడాన్ని స్వదేశీ వర్తకము అంటారు. స్వదేశీ వర్తకాన్ని దేశీయ వర్తకము అని కూడా అంటారు.
స్వదేశీ వర్తకము యొక్క లక్షణాలు :

  1. కొనుగోలు, అమ్మకాలు ఒక దేశ సరిహద్దులలోనే జరుగుతాయి.
  2. వస్తువుల రవాణా సాధారణముగా రోడ్డు లేదా రైల్వే వాహనాల ద్వారా జరుగుతుంది.
  3. స్వదేశీ వర్తకములో చెల్లింపులు స్వదేశీ కరెన్సీ ద్వారానే జరుగుతాయి.
  4. స్వదేశీ వర్తకములో వ్యాపార వ్యవహారాలు ఉత్పత్తిదారులు, మధ్యవర్తులు, వినియోగదారుల మధ్య జరుగుతాయి.
  5. స్వదేశీ వర్తకములో చాలారకాలైన వస్తువులు అందుబాటులో ఉంటాయి.

స్వదేశీ వర్తకాన్ని మరల రెండు రకాలుగా విభజించవచ్చును. అది ఎ) టోకు వర్తకము బి) చిల్లర వర్తకము. ఎ) టోకు వర్తకము : ఉత్పత్తిదారుల నుండి పెద్ద పెద్ద పరిమాణములో వస్తువులను కొనుగోలు చేసి, చిన్నచిన్న పరమాణములో చిల్లర వర్తకులకుగాని, తుది వినియోగదారులకు గాని అమ్మకము చేయడాన్ని టోకు వర్తకమని, ఆ వ్యాపారాన్ని నిర్వహించే వర్తకుడిని టోకు వర్తకుడు అని అంటారు. ఇతడు ఉత్పత్తిదారులకు, చిల్లర వర్తకులకు మధ్య వారధిగా ఉంటారు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్వదేశీ, విదేశీ వర్తకం

బి) చిల్లర వర్తకము : టోకు వర్తకుల నుంచి పెద్ద మొత్తాలలో సరుకును కొనుగోలు చేసి, చిన్న మొత్తాలలో తుది వినియోగదారులకు చేరవేసే వర్తకము చిల్లర వర్తకము. చిల్లర వర్తకము చేసేవారిని చిల్లర వర్తకులు అని అంటారు. వీరు అటు టోకు వర్తకులకు, ఇటు వినియోగదారులకు మధ్య వారధిగా ఉంటారు.

2) విదేశీ వర్తకము : రెండు వేరువేరు దేశాల మధ్య జరిగే కొనుగోలు, అమ్మకాలను అంతర్జాతీయ వర్తకము లేదా విదేశీ వర్తకము అంటారు. విదేశీ వర్తకాన్ని మూడురకాలుగా విభజించవచ్చును. అవి ఎ) దిగుమతి వర్తకము, బి) ఎగుమతి వర్తకము, సి) మారు వర్తకము.

ఎ) దిగుమతి వర్తకము : ఏదైనా ఒక దేశము తన దేశ అవసరాలకు వస్తువులను లేదా సేవలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే అలాంటి వర్తకాన్ని దిగుమతి వర్తకము అంటారు. ఉదా : భారతదేశము చైనా నుంచి అత్యాధునిక ఎలక్ట్రిక్ పరికరాలను కొనుగోలు చేయడము.

బి) ఎగుమతి వర్తకము : ఏదైనా ఒక దేశము తన దేశ అవసరాలకు సరిపడగా, మిగిలిన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడాన్ని ఎగుమతి వర్తకము అంటారు. ఉదా : భారతదేశము వజ్రాలను వేరే దేశాలకు ఎగుమతి చేయడము.

సి) ఎంట్రిపో వర్తకము (మారు వర్తకము) : ఒక దేశము తన దేశ అవసరాల కోసం కాకుండా వేరొక దేశ అవసరాలకు విదేశాల నుండి వస్తువులను దిగుమతి చేసుకొని, వేరొక దేశానికి ఎగుమతి చేసినట్లయితే ఆ వర్తకాన్ని

3. విత్తనాలను ఎంట్రిపో వర్తకము లేక మారు వర్తకము అంటారు. ఉదా : భారతదేశము అమెరికా నుంచి నూనె దిగుమతి చేసుకొని, మలేషియాకు ఎగుమతి చేయడము.

ప్రశ్న 2.
విదేశీ వర్తకము అనగానేమి ? వివిధ రకాల విదేశీ వర్తకాలను తెలుపుము.
జవాబు:
రెండు దేశాల మధ్య జరిగే వర్తకాన్ని అంతర్జాతీయ వర్తకము అంటారు. రెండు దేశాలలోని వ్యాపారస్తుల మధ్య సరుకు మరియు సేవల వినిమయము జరిగితే అది అంతర్జాతీయ వర్తకము అవుతుంది. విదేశీ వర్తకములో రెండు వేరు వేరు దేశాల మధ్య కేవలము వస్తువులే కాకుండా ఆయాదేశాల కరెన్సీ కూడా మారకం జరుగుతుంది. విదేశీ వర్తకము ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఒక దేశములో తయారైన వస్తువులు మరొక దేశములోని వినియోగదారులు ఉపయోగించుకుంటారు.

విదేశీ వర్తకాన్ని మూడు రకాలుగా విభజించవచ్చును. అవి 1. దిగుమతి వర్తకము, 2. ఎగుమతి వర్తకము, 3. మారు వర్తకము (ఎంట్రిపో వర్తకము).
1. దిగుమతి వర్తకము : Import అనే పదము యొక్క భావన ఏమిటంటే వస్తు, సేవలను దేశములోని రేవులకు చేరవేయడము. ఇతర దేశము నుంచి సరుకును కొనుగోలు చేసినపుడు, ఆ దేశము నుంచి కొనుగోలుదారు దేశానికి దిగుమతి చేసుకున్నట్లు భావిస్తారు. ఇలాంటి వర్తకాన్ని దిగుమతి వర్తకము అంటారు. ఉదా : చైనాలో అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు చౌకగా లభ్యమవుతాయి. వాటిని భారతదేశము దిగుమతి చేసుకుంటున్నది.

2. ఎగుమతి వర్తకము : Export అనే పదము యొక్క భావము ఏమిటంటే వస్తు, సేవలను ఇతర దేశాలకు ఓడరేవుల నుంచి బయటకు షిప్పింగ్ చేయడము. ఇతర దేశాలలోని వర్తకులకు సరుకును అమ్మినపుడు, సరుకును ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లుగా భావిస్తారు. ఉదా : మన దేశము ఇతర దేశాలకు వజ్రాలను ఎగుమతి చేస్తుంది.

3. మారు వర్తకము (ఎంట్రిపో వర్తకము) : ఒక దేశము తన అవసరాల కోసం కాకుండా వేరొక దేశానికి అవసరాల కోసం, వస్తువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని, వాటిని మరల ఆ దేశానికి ఎగుమతి చేసే వర్తకాన్ని మారు వర్తకము అంటారు. ఉదా: భారతదేశము అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేసుకొని వాటిని మలేషియాకు ఎగుమతి చేయడము.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్వదేశీ, విదేశీ వర్తకం

ప్రశ్న 3.
విదేశీ వర్తకము అనగానేమి ? వాటి యొక్క ప్రాముఖ్యతను వివరింపుము.
జవాబు:
రెండు దేశాల మధ్య జరిగే వర్తకాన్ని అంతర్జాతీయ వర్తకము అంటారు. రెండు దేశాలలోని వ్యాపారస్తుల మధ్య సరుకు మరియు సేవల వినిమయం జరిగితే అది అంతర్జాతీయ వర్తకము అవుతుంది. విదేశీ వర్తకములో రెండు వేరు వేరు దేశాల మధ్య కేవలం వస్తువులే కాకుండా ఆయా దేశాల కరెన్సీ కూడా మారకము జరుగుతుంది. విదేశీ వర్తకము ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఒక దేశములో తయారైన వస్తువులు మరొక దేశములోని వినియోగదారులు ఉపయోగించుకుంటారు.

విదేశీ వర్తకము ప్రాముఖ్యత : ప్రతి దేశానికి విదేశీ వర్తకము అవసరము అవుతుంది. కారణమేమంటే ఏ దేశమైనా ప్రజల వినియోగానికి అవసరమైన అన్ని వస్తువులను ఉత్పత్తి చేయలేదు. ఈ దిగువ తెలుపబడిన అంశాలను పరిశీలిస్తే విదేశీ వర్తక ప్రాముఖ్యత తెలుస్తుంది.

1. ప్రపంచములోని వివిధ దేశాలలో వివిధ సహజ వనరులు కలిగి ఉంటాయి. మరికొన్ని దేశాలలో సహజ వనరులు ఉండకపోవచ్చును. అటువంటి పరిస్థితులలో ఆ దేశము సహజ వనరులకై ఇతర దేశాలపై ఆధారపడుతుంది.”

2. కొన్ని దేశాలు కొన్ని రకములైన వస్తువులను ముడిపదార్థాల లభ్యత, శ్రామికుల లభ్యత, సాంకేతిక పరిజ్ఞానము మొదలైన కారణాల వలన తక్కువ ఉత్పత్తి వ్యయముతో తయారుచేస్తాయి. అటువంటి పరిస్థితులలో ఎక్కువ వ్యయము వస్తువులను ఉత్పత్తి చేయకుండా, ఆయా దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవడానికి విదేశీ వర్తకము తోడ్పడుతుంది.

3. ప్రతిదేశము ఆ దేశానికి అవసరమైన వస్తువులను ఉత్పత్తి చేసుకోలేదు. కొన్ని దేశాలలో కొన్ని ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల వలన ఆయా దేశాలలో ఆ వస్తువులు తయారుచేయబడతాయి. ఉదా : క్యూబా దేశములో చక్కెర, ఈజిప్టు దేశములో పత్తి ఉత్పత్తి అవుతుంది.

4. ఆర్థిక అసమానతలు తొలగించి, వివిధ దేశాల ఆర్థికాభివృద్ధికి విదేశీ వర్తకము తోడ్పడుతుంది.

5. అంతర్జాతీయ వర్తకము ఇరుదేశాల మధ్య సంబంధాలను, సంస్కృతిని, శాంతిని పెంపొందిస్తుంది.

6. అంతర్జాతీయ వర్తకము వలన వివిధ దేశాలలో వస్తుసేవల ధరలు తగ్గుతాయి.

7. ఈ ప్రపంచీకరణ యుగములో ఏ దేశమైనా స్వయముగా అభివృద్ధి చెందదు. కాబట్టి ప్రతిదేశము మరొక దేశముపై ఆధారపడవలసి వస్తుంది.

ప్రశ్న 4.
స్వదేశీ మరియు విదేశీ వర్తకాల మధ్య భేదాలను తెలుపుము.
జవాబు:
స్వదేశీ వర్తకానికి, విదేశీ వర్తకానికి మధ్య క్రింది తేడాలున్నవి.

విదేశీ వర్తకము

  1. వర్తకము : వర్తకము ఒక దేశ సరిహద్దులలోపు జరుగుతుంది.
  2. కరెన్సీ మార్పిడి : స్వదేశీ వర్తకములో కరెన్సీ మార్పిడి ఉండదు.
  3. ఆంక్షలు : స్వదేశీ వర్తకము ఎలాంటి ఆంక్షలకు లోబడి ఉండదు.
  4. రవాణా వ్యయాలు : స్వదేశీ వర్తకములో రవాణా వ్యయాలు, నష్టభయాలు ఎక్కువ.
  5. స్వభావము : దీనిలో ఒకదేశములో వస్తుసేవల ‘వినిమయము జరుగుతుంది.
  6. సరుకు తరలింపు : సరుకు తరలింపు ఎక్కువగా రవాణా సౌకర్యాలైన రైలు, రోడ్ల అభివృద్ధిపై ఆధారపడుతుంది.
  7. ప్రత్యేకీకరణ : దేశములోని ప్రత్యేకీకరణ లాభాలను అందజేయడంలో సహకరిస్తుంది.
  8. వర్తక పరిమాణము : వర్తక పరిమాణము జనాభా పరిమాణము, ఉత్పత్తి పరిమాణము, బ్యాంకుల అభివృద్ధిపై ఆధారపడుతుంది.
  9. అనుకూలత : ఇది వస్తువులను ఉత్పత్తి కేంద్రాల నుంచి వినియోగిత కేంద్రాలకు తరలిస్తుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్వదేశీ, విదేశీ వర్తకం

స్వదేశీ వర్తకము

  1. వరక్తము ఒక దేశానికి, మరొక దేశానికి మధ్య జరుగుతుంది.
  2. విదేశీ వకర్తములో కరెన్సీ మార్పిడి ఉంటుంది.
  3. విదేశీ వర్తకము అనేక ఆంక్షలకు లోబడి ఉంటుంది.
  4. విదేశీ వర్తకములో రవాణా వ్యయాలు, నష్టభయము తక్కువ.
  5. దీనిలో వస్తువుల ఎగుమతి, దిగుమతి జరుగుతుంది.
  6. సరుకును ఎక్కువగా సముద్రము (నౌకల ద్వారా) తరలిస్తారు.
  7. ప్రపంచ దేశాల ప్రత్యేకీకరణ లాభాలను అందజేయడం సహకరిస్తుంది.
  8. వస్తువులు ఒక దేశములో ప్రవేశించుటకు ఎన్నో ఆంక్షలు ఉంటాయి. డ్యూటీలు, పన్నులను చెల్లించవలెను.
  9. ఏ దేశమైతే వస్తువుల ఉత్పత్తికి అనుకూలముగా ఉంటుందో, వాటిలో ప్రత్యేకీకరణ సాధించడానికి తోడ్పడుతుంది.

ప్రశ్న 5.
విదేశీ వర్తకము యొక్క పరిమితులను తెలుపుము.
జవాబు:
పరిమితులు :

  1. అంతర్జాతీయ వర్తకము ఆర్థికముగా ఇతర దేశాలపై ఆధారపడుటకు దారితీస్తుంది. యుద్ధ సమయములో ఇది సంక్షోభాన్ని సృష్టిస్తుంది.
  2. అంతర్జాతీయ వర్తకము దేశ ఆర్థిక వ్యవస్థలో కొన్ని సెక్టార్లను నిర్లక్ష్యము చేయడానికి దారితీస్తుంది.
  3. దిగుమతులపై ఆంక్షలు లేకపోతే అభివృద్ధి చెందుతున్న దేశాల పారిశ్రామికీకరణపై ప్రభావాన్ని చూపుతుంది.
  4. ఇది వివిధ దేశాల మధ్య అనారోగ్యకరమైన పోటీకి దారితీస్తుంది.
  5. తులనాత్మక వ్యయ సిద్ధాంతాన్ని అనుసరించి కొద్ది పరిశ్రమలలో ప్రత్యేకీకరణ అనేక సమస్యలను సృష్టిస్తుంది.

ప్రశ్న 6.
విదేశీ వర్తకములో లోపాలను తెలుపుము.
జవాబు:
విదేశీ వర్తకములో లోపాలు / నష్టాలు :

  1. ద్రవ్య సమస్య : ప్రతి దేశానికి ఒక ప్రత్యేకమైన ద్రవ్యం ఉండటం వలన వ్యాపార వ్యవహారములు జరిగినప్పుడు ద్రవ్య సమస్యలు ఏర్పడతాయి.
  2. న్యాయసంబంధిత సమస్యలు : ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైన చట్టాలుంటాయి. అంతర్జాతీయ వర్తకములో దేశాల మధ్య న్యాయసంబంధిత చిక్కులు ఏర్పడతాయి.
  3. పరపతి సమస్య : ఎగుమతిదారులు, దిగుమతిదారుల మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఉండవు కాబట్టి ఎగుమతిదారులు, దిగుమతిదారుల ఆర్థిక స్థోమతను గురించి తెలుసుకోవలసి ఉంటుంది.
  4. నష్టభయాలు : వివిధ దేశాల మధ్యదూరము ఎక్కువగా ఉండటము వలన, రవాణాలో వస్తువులకు నష్టము కలిగే అవకాశాలు ఎక్కువ.
  5. కాలయాపన : ఒక దేశము నుంచి సరుకును ఎగుమతి చేయడానికి మరియు ఆ దేశములో సరుకును స్వీకరించి, ధరను చెల్లించడానికి ఎక్కువ సమయం పడుతుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్వదేశీ, విదేశీ వర్తకం

ప్రశ్న 7.
ప్రత్యేక ఆర్థిక మండలి యొక్క లాభాలను తెలుపుము.
జవాబు:
ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్లు) ద్వారా క్రింది ప్రయోజనాలు కలుగుతాయి.

  1. ఉద్యోగ అవకాశాలు : ఉద్యోగ అవకాశాలు కల్పించడములో ప్రత్యేక ఆర్థిక మండళ్ళు సార్థకమైన పనిముట్టుగా పరిగణిస్తారు.
  2. ఆర్థిక అభివృద్ధి : సెజ్లను ఆర్థిక అభివృద్ధి సాధనాలుగా గుర్తించడం జరిగినది. సెజ్లు సక్రమముగా నెలకొల్పితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారతాయి.
  3. శ్రమ ఆధారిత పరిశ్రమల వృద్ధి: సెజ్లను నెలకొల్పడం వలన శ్రమ ఆధారిత పరిశ్రమలు, సేవారంగము ఎక్కువగా వృద్ధి చెందుతాయి.
  4. సమతల ప్రాంతీయ అభివృద్ధి: సమాన ప్రాంతీయ అభివృద్ధికి సెజ్లు ఇతోధికముగా తోడ్పడతాయి.
  5. సామర్థ్య నిర్మాణము దృఢమైన, సామర్థ్య నిర్మాణానికి సెజ్ల ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
  6. ఎగుమతులు (Performance) : ఎగుమతులలో అనవసర టారిఫ్, వర్తక అవరోధాలు, కార్పొరేటు పన్ను విధానము మరియు బ్యూరోక్రసీని తొలగించి ఎగుమతుల performance లో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది.

ప్రశ్న 8.
ప్రత్యేక ఆర్థిక మండలి ధ్యేయాలను తెలుపుము.
జవాబు:
ప్రత్యేక ఆర్థిక మండలి ఒక భౌగోళిక ప్రాంతము. దీనిలోని ఆర్థిక చట్టాలు దేశములోని ఆర్థిక చట్టాల కంటే సరళముగా ఉంటాయి. సెజ్ యొక్క ప్రధాన ధ్యేయము విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే. ఆర్థికాభివృద్ధికి సెజ్లు సాధనాలుగా ఉపయోగపడుతున్నవి. భారతప్రభుత్వం 2000 సంవత్సరములో ప్రత్యేక ఆర్థిక మండలిని స్థాపించినారు. పార్లమెంటులో సెజ్ల చట్టాన్ని 2005లో ఆమోదించినారు. ఎగుమతి ప్రక్రియ అనుభవము నుంచి సెజ్ విధానము ఆవిర్భవించి పరిగణించబడే సుంకాలు చెల్లించనవసరము లేని ప్రత్యేక ప్రాంగణములే ఈ ప్రత్యేక ఆర్థికమండలి.

ధ్యేయాలు / లక్ష్యాలు :

  1. అదనపు ఆర్థిక కార్యకలాపాలను పెంపొందించడము.
  2. వస్తుసేవల యొక్క ఎగుమతులను ప్రోత్సహించడము.
  3. స్వదేశీ మరియు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడము.
  4. ఉద్యోగ అవకాశాలను కల్పించడము.
  5. మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేయడము.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్వదేశీ, విదేశీ వర్తకం

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
టోకు వర్తకుని నిర్వచించుము.
జవాబు:
ఉత్పత్తిదారుల నుండి పెద్దపెద్ద పరిమాణములో వస్తువులను కొనుగోలు చేసి, వాటిని చిన్నచిన్న పరిమాణాలలో చిల్లర వర్తకులకు గాని, తుది వినియోగదారులకు కాని అమ్మకము చేయడాన్ని టోకు వర్తకము అంటారు. టోకు వర్తకము చేసే వ్యాపారులను టోకు వర్తకులు అంటారు. వీరు ఉత్పత్తిదారులు మరియు చిల్లర వర్తకులకు మధ్య వారధిగా ఉంటారు.

ప్రశ్న 2.
చిల్లర వర్తకుడు అనగా ఎవరు ?
జవాబు:
టోకు వర్తకుల నుంచి సరుకు కొనుగోలు చేసి, చిన్న చిన్న మొత్తాలలో తుది వినియోగదారులకు చేరవేసే ప్రక్రియను చిల్లర వర్తకము అంటారు. చిల్లర వర్తకము చేసే వారిని చిల్లర వర్తకులు అంటారు. చిల్లర వర్తకులు వస్తువుల పంపిణీ గొలుసులో చివరి లింకు. చిల్లర వర్తకులు అటు టోకు వర్తకులకు, ఇటు వినియోగదారులకు మధ్య వారధిగా ఉంటారు. అతడి కార్యకలాపాలు స్థానికముగానే ఉంటాయి.

ప్రశ్న 3.
స్వదేశీ వర్తకము అనగానేమి ?
జవాబు:
ఒక దేశ సరిహద్దు లోపల కొనుగోలు మరియు అమ్మకాలు జరపడాన్ని స్వదేశీ వర్తకము అంటారు. అనగా కొనుగోలుదారుడు మరియు అమ్మకపుదారులు ఒకే దేశానికి చెంది ఉండి, వర్తకము కొనసాగించినపుడు దానిని స్వదేశీ వర్తకము అంటారు. స్వదేశీ వర్తకాన్ని ‘దేశీయ వర్తకము’ అని కూడా అంటారు. స్వదేశీ వర్తకములో కరెన్సీ మార్పు
ఉండదు.

ప్రశ్న 4.
ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ) అనగానేమి ?
జవాబు:
ప్రత్యేక ఆర్థిక మండలి ఒక భౌగోళిక ప్రాంతము. దీనిలోని ఆర్థిక చట్టాలు దేశములోని ఆర్థిక చట్టాల కంటే సరళముగా ఉంటాయి. సెజ్ యొక్క ప్రధానమైన ధ్యేయము విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే. ఆర్థికాభివృద్ధికి సెజ్లు సాధనాలుగా ఉపయోగపడుతున్నవి. భారత ప్రభుత్వము 2000 సంవత్సరములో ఎగుమతి, దిగుమతి విధానములో ప్రత్యేక ఆర్థిక మండలిని స్థాపించినారు. పార్లమెంటులో సెజ్ల చట్టాన్ని 2005 సంవత్సరములో ఆమోదించినారు. ఎగుమతి ప్రక్రియ అనుభవము నుంచి సెజ్ల విధానము ఆవిర్భవించి పరిగణించే సుంకాలు చెల్లించనవసరములేని ప్రత్యేక ప్రాంగణాలే సెజ్లు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్వదేశీ, విదేశీ వర్తకం

అదనపు ప్రశ్నలు

ప్రశ్న 1.
సెజ్ ల పని తీరుపై గల విమర్శలను వివరించండి.
జవాబు:

  1. ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు కోసము వ్యవసాయ భూములను స్వాధీనము చేసుకుంటున్నారు అనేది ప్రధానమైన విమర్శ. దీనివలన చాలామంది వారి కులవృత్తులైన వ్యవసాయము, చేపలు పట్టుట మొదలైన వాటికి దూరమై జీవనోపాధిని కోల్పోతున్నారు. సెజ్లు రియల్ ఎస్టేటులో స్పెక్యులేషన్ను ప్రోత్సహిస్తున్నది. చిన్న మరియు మార్జినల్ రైతులు, వీవర్లు, livestock కు సంబంధించిన కులాలవారు సెజ్ల వలన వారి వృత్తులకు దూరమవుతున్నారు.
  2. సెజ్ వలన వాతావరణ కాలుష్యము ఏర్పడి ప్రజల ఆరోగ్యము దెబ్బతింటున్నది.
  3. సెజ్లపైన మరొక విమర్శ ఏమిటంటే తీసుకున్న భూములకు సరైన నష్టపరిహారము చెల్లించడం లేదు. ఇది చాలా తక్కువగా ఉంటోంది. తొలగించబడిన ప్రజలకు పునరావాస చర్యలు తీసుకోవడం లేదు.
  4. సాధారణముగా సెజ్లను మారుమూల ప్రాంతాలలో నెలకొల్పి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే థ్యేయం. పట్టణ ప్రాంతాల దగ్గరలోనే సెజ్లను ఏర్పాటు చేయడం వలన ఈ ధ్యేయము నెరవేరలేదు.

ప్రశ్న 2.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక మండలికి అందించిన ప్రోత్సాహకాలను తెలుపండి.
జవాబు:
బహుళ ఉత్పాదక ప్రాజెక్టుగా మరియు వర్తకపు కార్యకలాపాల నిమిత్తము, విదేశీ భూభాగము పరిగణింపబడి, సుంకాలు అనగా పన్నులు చెల్లించనవసరము లేని ప్రత్యేక ప్రాంగణము సెజ్. పరిశ్రమలను అభివృద్ధి చేయుటకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సదుపాయాలను ఉపయోగించి, ప్రాంతాలను అభివృద్ధి చేసే విధముగా ఈ సెజ్లను ఏర్పాటు చేసినారు. సెజ్లు వస్తూత్పత్తి మరియు సేవారంగములోని పరిశ్రమలకు సహాయం చేస్తాయి.

ఆంధ్రప్రదేశ్ సెజ్ ఉత్పత్తి మరియు సేవా పరిశ్రమలకు ప్రత్యేక మౌళిక సదుపాయాలను కలుగజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ సెజ్ విదేశీ పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ఆర్థిక మరియు పన్నుల ప్రోత్సాహకాలు ఇవ్వడంలో సరళీకృత అనుమతులు ఇస్తున్నది. భారతదేశములో APSEZ ఒక భారీతరహా బహుళ ఉత్పాదక ప్రత్యేకమండలి.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్వదేశీ, విదేశీ వర్తకం

సెజ్ యూనిట్లకు ప్రోత్సాహకాలు :

  1. డ్యూటీలు మరియు ఎక్సైజ్ల నుంచి మినహాయింపు.
  2. 50% నూతన మూలధనం అనగా గత 5 సంవత్సరాలలో పెట్టుబడి.
  3. అంతర్జాతీయ నిధులను ఉపయోగించుకొనుట.
  4. చెల్లించిన డ్యూటీని తిరిగి పొందుట..
  5. సెజ్ యూనిట్లలో హిడ్జింగ్కు అనుమతి.
  6. విదేశాలలో సబ్కాంట్రాక్టులకు అనుమతి.
  7. లోపలే కస్టమ్స్ క్లియరెన్సు.
  8. స్వదేశీ ఎగుమతిదారులకు ప్రత్యక్ష ఎగుమతికి ఆమోదం.
  9. FDI 100%.
  10. AP పారిశ్రామిక విధానము 2010-15 నుంచి ప్రయోజనాలు.
  11. స్టాంపుడ్యూటీ మినహాయింపు.
  12. వాట్, అమ్మకపు పన్ను, ఆల్ట్రాయ్ నుంచి మినహాయింపు.
  13. విద్యుచ్ఛక్తి సబ్సిడీ.
  14. రాష్ట్రస్థాయిలో సింగిల్ విండో సిస్టమ్ క్లియరెన్సు.
  15. పరిశ్రమలకు తక్కువ విద్యుత్ టారిఫ్.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 1 ఎంట్రప్రిన్యూర్షిప్

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Commerce Study Material 1st Lesson ఎంట్రప్రిన్యూర్షిప్ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Commerce Study Material 1st Lesson ఎంట్రప్రిన్యూర్షిప్

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎంట్రప్రిన్యూర్ లక్షణాలను వివరించండి.
జవాబు:
సాధారణ వ్యక్తుల కంటే ఎంట్రప్రిన్యూర్కు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వ్యాపారములో విజేతగా నిలవాలంటే ప్రతి ఎంట్రప్రిన్యూర్కు క్రింది లక్షణాలు ఉండవలెను.
1) నవకల్పన: నూతన వ్యాపారములో నవకల్పన అనే లక్షణము వ్యవస్థాపకుడికి చాలా అవసరము. వ్యవస్థాపకుడు ఒకవైపున ఉత్పత్తిని పెంచుకోవడము, మరో వైపున ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకొనుటకు, నవకల్పనలను ప్రవేశపెట్టుటకు ప్రయత్నిస్తాడు. నవకల్పన వలన ఉత్పత్తి ప్రక్రియలో నూతన పద్ధతులను ప్రవేశపెట్టవచ్చును. లేక ప్రస్తుతమున్న పద్ధతులను అభివృద్ధి చేయవచ్చును. దీనిలో కొత్త మార్కెట్లను కనుగొనడం, ముడిసరుకు మరియు నూతన సాంకేతిక ఉత్పత్తి పద్ధతులను కనుగొనవచ్చును.

2) రిస్కును భరించుట: వ్యవస్థాపకుని మరో లక్షణం రిస్కును భరించుట. ఉత్పత్తికి కావలసిన వనరులను ముందుగానే సమకూర్చుకోవాలి. ఇలాంటి సందర్భాలలో మంచి లాభాలకు లేదా ఎక్కువ నష్టాలకు అవకాశమున్నది. కాబట్టి రిస్కును భరించడం వ్యవస్థాపకుని అంతిమ బాధ్యత. రిచర్డ్ కాంటిలిన్ అభిప్రాయము ప్రకారము వ్యవస్థాపకుడు ఒక ఏజెంటుగా ఉత్పత్తి కారకాలను నిశ్చిత ధరకు కొనుగోలు చేసి, వాటిని ఒక వస్తువు రూపములో చేసి అనిశ్చిత ధరకు అమ్మడము.

3) ఉత్పత్తికి సంబంధించిన వ్యవస్థీకరణ: వ్యవస్థాపకుడు వస్తువులు ఉత్పత్తి చేయుటకు లేదా సేవలు అందించుటకు కావలసిన ఉత్పత్తి కారకాలను సమకూర్చుకొనును. అతను ఉత్పత్తి ప్రక్రియకు కావలసిన భూమి, శ్రామికులు, మూలధనము, ముడిసరుకులను సమకూర్చుకొనును. అన్ని రకాలైన ఉత్పత్తి ప్రక్రియలను అధ్యయనము చేసి తనకు ఎక్కువ అనుకూలమైన పద్ధతిని ఎంపిక చేసుకొనెను.

4) నిర్ణయాలు తీసుకోవడము: వ్యవస్థాపకుడు వ్యాపార సంస్థను స్థాపించడం, దానిని నిర్వహించడము మరియు వివిధ వనరులను సమన్వయపరుచుటకు నిర్ణయాలు తీసుకొనవలెను. వ్యాపారములో ప్రతి పనికి నిర్ణయీకరణ అవసరమవుతుంది. వ్యాపార కార్యకలాపాల గురించి వ్యవస్థాపకుడు ప్రతిరోజు నిర్ణయాలు తీసుకొనవలెను.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 1 ఎంట్రప్రిన్యూర్షిప్

5) నాయకత్వము: వ్యవస్థ విధులను నియంత్రణ చేయుటకు, నిర్ణయించుటకు, ఆదేశించుటకు, నిర్వహించుటకు వ్యవస్థాపకునికి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండవలెను. ఇతను దిగువస్థాయి సిబ్బందికి ఆదర్శముగా ఉండవలెను. ఎందుకనగా ఇతని వ్యక్తిత్వము ఆధీనులపై ప్రభావము చూపును. వ్యవస్థాపకుని లక్షణాలు అతని ఉద్యోగులు అభినందించే విధముగా ఉండవలెను. నాయకుడు మార్గదర్శకుడే కాకుండా సంస్థ లక్ష్యాలను త్వరగా సమర్థవంతంగా సాధించే విధముగా ప్రేరణ కలిగించవలెను.

6) ప్రణాళికీకరణ: వ్యవస్థాపకుడు వ్యాపారములో ప్రతి విషయానికి ఒక ప్రణాళిక తయారుచేస్తాడు. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను బేరీజు వేసుకొని ఎక్కువ ప్రయోజనము పొందుతాడు. ప్రణాళికీకరణ అనేది ఒక ప్రక్రియ. దీనిలో పనిచేసే ముందు ఆలోచించడం ఇమిడి ఉన్నది. ఏమి చేయాలి ? ఎపుడు చేయాలి ? ఎలా చేయాలి ? ఆ పనిని ఎవరు చేయాలి ? వ్యవస్థాపకుడు ఉత్పత్తికి సంబంధించినవి. మార్కెట్ సంబంధించిన ప్రణాళికలే కాకుండా పారిశ్రామిక విధానం ప్రకారం వ్యవస్థలో విధులను నిర్ణయించడానికి ప్రణాళికలు తయారుచేయును.

7) కష్టపడేతత్వము: విజయవంతమైన వ్యవస్థాపకునికి, అపజయాలు పొందిన వారికి మధ్య తేడా కష్టపడి పనిచేయడానికి ఇష్టపడడం మాత్రమే. సంస్థ ఖాయిలా పడే దశకు చేరిననూ తన స్వేదముతో, శ్రమతో ధైర్యముగా నిలువగలుగుతాడు. విజయవంతమైన వ్యవస్థాపకుడు ప్రారంభం నుండి చివరి వరకు నిరంతరము జీవితాంతము శ్రమిస్తూనే ఉంటాడు.

8) ఉన్నత లక్ష్యాలను సాధించాలనే కోరిక వ్యవస్థాపకులు వ్యాపారములో ఉన్నత లక్ష్యాలను సాధించాలనే గాఢమైన కోరికను కలిగి ఉంటాడు. ఈ తపనతోనే అతడు ఎన్ని అవరోధాలు వచ్చినా ఆతురతతో తనకు వాటిల్లిన దురదృష్ట ఘటనలకు భయపడక విజయం వైపు సాగి విజయవంతమైన వ్యాపారం చేయగలడు.

9) ఉన్నతమైన ఆశావాద దృక్పథము: విజయవంతమైన వ్యవస్థాపకులు తను ఎదుర్కొనే సమస్యలకు చలించరు. భవిష్యత్తులో వ్యాపారములో మంచి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయనే ఆశావాద దృక్పథముతో సంస్థను
విజయవంతంగా నడపగలుగుతారు.

10) స్వేచ్ఛ: విజయవంతమైన వ్యవస్థాపకుడు ఇతరులచేత మార్గనిర్దేశించబడడు. తన వ్యాపార వ్యవహారములో స్వతంత్రముగా ఉండుటకు ఇష్టపడతాడు.

11) దూరదృష్టి / ముందుచూపు: వ్యవస్థాపకులు భవిష్యత్తులో వ్యాపార పరిస్థితులు ఎలా ఉంటాయో చక్కటి ముందుచూపు కలిగి ఉంటారు. మార్కెట్లో వచ్చే మార్పులను, వినియోగదారుల అభిరుచులు, సాంకేతిక పరిజ్ఞానములో వచ్చే మార్పులకు అనుగుణముగా తగు చర్యలు తీసుకొనును.

ప్రశ్న 2.
ఎంట్రప్రిన్యూర్ విధులను వివరించండి.
జవాబు:
వ్యవస్థాపకుని ఆలోచన మొదలైనప్పటి నుంచి సంస్థను, స్థాపించే వరకు అన్ని రకాల విధులను నిర్వహిస్తాడు. అందులో ముఖ్యమైనవి:
1) నూతన ఉత్పాదక వ్యవస్థాపన: J.B. Say ప్రకారం ఉత్పత్తి కారకాలను సంఘటిత పరిచి వాటిని నూతన ఉత్పత్తి వ్యవస్థగా రూపొందించడము వ్యవస్థాపకుని విధులలో ఒకటి.

2) నిర్ణయీకరణ: వ్యవస్థాపకుడు క్రింది విషయాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటాడు. అవి:

  1. సంస్థ లక్ష్యాలను నిర్ణయించడము
  2. ఆర్థిక వనరుల లభ్యత
  3. ఉత్పత్తి మిశ్రమము
  4. ధరల విధానము
  5. అభివృద్ధి వ్యూహాలు
  6. అనువైన సాంకేతిక లేక నూతన సాధనాలు

AP Inter 2nd Year Commerce Study Material Chapter 1 ఎంట్రప్రిన్యూర్షిప్

3) నవకల్పన: నవకల్పన అనేది వ్యవస్థాపకుని ముఖ్య విధి. నవకల్పన అనగా కొత్త పనులు చేయడం లేదా పాత పనులను ఒక కొత్త పద్ధతిలో చేయడం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆర్థికపరముగా వాడడము. కాబట్టి శాస్త్ర పారిశ్రామికాభివృద్ధికి మరియు ఆర్థికాభివృద్ధికి నవకల్పన ఎంతో ఆవశ్యకము.

4) నిర్వహణ: వ్యవస్థాపకుడు నిర్వహణ విధులను నిర్వహించును. అవి సేకరణ మరియు నిర్వహణ విధులు, ఉత్పత్తి ప్రణాళికలను తయారు చేయడం, ముడిసరుకు సమకూర్చడము, భౌతిక సదుపాయాలు, ఉత్పత్తి సదుపాయాలు, వ్యవస్థీకరణ మరియు అమ్మకాల నిర్వహణ.

5) రిస్కు భరించుట: అనుకోని సంఘటనల వలన భవిష్యత్తులో సంభవించే నష్టాలకు వ్యవస్థాపకుడే బాధ్యత వహించవలెను. ఋణదాతలకు వడ్డీ, శ్రామికులకు వేతనాలు మరియు భూమికి భాటకం చెల్లించుటకు హామీ ఇవ్వవలెను.

6) పర్యవేక్షణ, నియంత్రణ మరియు దిశా నిర్దేశము: జె.యస్. మిల్ మాటలలో పర్యవేక్షణ, నియంత్రణ మరియు దిశా నిర్దేశనలు వ్యవస్థాపకుని విధులు. పర్యవేక్షణలో పనిని పర్యవేక్షించడం, తక్కువ వ్యయముతో ఎక్కువ ఉత్పత్తిని సాధించడం వంటివి ఇమిడి ఉన్నాయి. వ్యవస్థాపకుడు యంత్రాలను, విత్త వినియోగానికి వస్తువుల పంపిణీని మరియు ఉద్యోగులను నియంత్రిస్తాడు. లక్ష్యాలకు అనుగుణముగా వ్యవస్థను నిరంతరము నడిపిస్తూ ఉంటాడు.

7) ప్రణాళికీకరణ: ప్రణాళిక అనేది. ఒక సంస్థను స్థాపించుటలో మొదటి మెట్టు. వ్యవస్థాపకుడు ప్రారంభించబోయే ప్రాజెక్టుకు సంబంధించి ప్రణాళికను ఒక క్రమ పద్ధతిలో తయారుచేస్తాడు. అధికార సంస్థలు ఆ ప్రణాళికలతో సంతృప్తి చెందిన యెడల న్యాయపరమైన మంజూరు చేయును.

కిల్బి ప్రకారము వ్యవస్థాపకుడు క్రింది నాలుగు ముఖ్యమైన విధులను నిర్వహించును. అవి:
1) వినియమ విధులు:

  • మార్కెటింగ్ అవకాశాలు గుర్తించడం.
  • అరుదైన, కొరతగా ఉన్న వనరులను సాధించుట.
  • ఉత్పాదకాల కొనుగోలు.
  • ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెటింగ్ చేయుట, పోటీని ఎదుర్కొనుట.

2) పరిపాలనా విధులు:

  • ప్రజా బ్యూరోక్రసితో కలిసి వ్యవహరించుట.
  • సిబ్బంది నిర్వహణ.
  • పంపిణీదారులను నిర్వహించడం.
  • వినియోగదారులను ఆకర్షించుట.

3) నిర్వహణ మరియు నియంత్రణ విధులు:

  • విత్త నిర్వహణ.
  • ఉత్పత్తి నిర్వహణ.
  • ఫ్యాక్టరీ నియంత్రణ.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 1 ఎంట్రప్రిన్యూర్షిప్

4) సాంకేతిక పరిజ్ఞాన విధులు:

  • యంత్రాలను, పనిముట్లను సమకూర్చడం.
  • పారిశ్రామిక ఇంజనీరింగ్.
  • ఉత్పత్తి ప్రక్రియలో, వస్తు నాణ్యతలో మెరుగుదల.
  • కొత్త వస్తూత్పత్తి పద్ధతులను, వస్తువులను ప్రవేశపెట్టడం.

ప్రశ్న 3.
ఎంట్రప్రిన్యూర్ రకాలను వివరించండి.
జవాబు:
క్లారెన్స్ డన్ హాఫ్, అమెరికా వ్యవసాయరంగాన్ని పరిశీలించి వ్యవస్థాపకులను వర్గీకరించారు. ఆర్థికాభివృద్ధి ప్రారంభదశలో వ్యవస్థాపకులలో తక్కువ చొరవ, ఉత్సాహము ఉండినది. ఎప్పుడైతే ఆర్థికాభివృద్ధి చెందనారంభించినదో వ్యవస్థాపకులలోనూ తగిన ఉత్సాహము, ఉత్తేజము కలిగినది. దీని ఆధారముగా వీరిని నాలుగు రకాలుగా విభజించారు.

1) నవకల్పన ఎంట్రప్రిన్యూర్లు నవకల్పన వ్యవస్థాపకులు కొత్తరకపు వస్తువులను ప్రవేశపెట్టడము, కొత్త ఉత్పత్తి పద్ధతులను అవలంబించడము, కొత్త మార్కెట్లను రూపొందించడం మరియు సంస్థను కొత్తగా నిర్వహించడము. వీరు ఇదివరకే కొంత అభివృద్ధిని సాధించి ఉంటారు. మరియు మార్పు కోసం, అభివృద్ధి కోసం ముందుచూపుతో
ఉంటారు.

2) అనుకరణ ఎంట్రప్రిన్యూర్లు: వీరు కొత్త పద్ధతులను, సాంకేతికతను విజయవంతమైన వ్యవస్థాపకుల నుండి అనుకరిస్తారు. వీరు కొత్త నవకల్పనలు చేయరు. వీరు అభివృద్ధి చెందుతున్న దేశాలకు సరిపోతారు. వీరు అభివృద్ధి చెందిన దేశాల నుండి వస్తువులను, సాంకేతికతను దిగుమతి చేసుకొని అనుకరిస్తారు.

3) నిదానపు ఎంట్రప్రిన్యూర్లు: వీరు జాగ్రత్తపరులు. వీరు మార్పులను తొందరగా అనుకరించరు. వీరు కొత్త పద్ధతులను అనుసరించవలెనంటే అవి ఖచ్చితముగా నష్టాలు రాని విధముగా ఉంటేనే పాటిస్తారు. వీరు రిస్కు తీసుకోవడంలో వెనుకంజ వేస్తారు.

4) స్థిర చిత్తపు ఎంట్రప్రిన్యూర్లు: వీరు వస్తు తయారీ పద్ధతిలో మార్పులు తీసుకొని వచ్చుటకు అవకాశాలు ఉన్నప్పటికీ, వ్యయాలు తగ్గించుకునేందుకు అవకాశాలు ఉన్నప్పటికి మార్పులు చేయరు. వీరికి నష్టాలు వస్తున్నప్పటికీ ప్రస్తుత తయారీ పద్ధతిలో మార్పులు చేయరు.

ప్రశ్న 4.
ఎంట్రప్రెన్యూర్కి, ఎంట్రప్రిన్యూర్షిప్కి మధ్యగల సంబంధాలను వివరించండి.
జవాబు:
ఎంట్రప్రిన్యూర్ అనువాడు కర్త, ఎంట్రప్రిన్యూర్షిప్ అనేది ఒక ప్రక్రియ. ఎంటర్ప్రైజ్ అనేది ఒక వ్యక్తి యొక్క ” సృష్టి మరియు ఒక ప్రక్రియ ద్వారా ఏర్పడినది.
ఎంట్రప్రిన్యూర్, ఎంట్రప్రిన్యూర్షిప్ అనే పదాల ఉచ్ఛారణలో ఒకే విధముగా ఉన్నప్పటికి వాటి భావములో మాత్రము తేడా ఉన్నది. ఇవి ఒక నాణానికి ఉన్న బొమ్మ, బొరుసులాంటివి.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 1 ఎంట్రప్రిన్యూర్షిప్

ఎంట్రప్రిన్యూర్, ఎంట్రప్రిన్యూర్షిప్కి మధ్యగల సంబంధము:

  1. ఎంట్రప్రిన్యూర్ ఒక వ్యక్తి. ఎంట్రప్రిన్యూర్షిప్ ఒక ప్రక్రియ.
  2. ఎంట్రప్రిన్యూర్ ఒక నిర్వాహకుడు. ఎంట్రప్రిన్యూర్షిప్ ఒక నిర్వాహక సంస్థ.
  3. ఎంట్రప్రిన్యూర్ నవకల్పన కర్త. ఎంట్రప్రిన్యూర్షిప్ నవకల్పన ప్రక్రియ.
  4. ఎంట్రప్రిన్యూర్ నష్టభయాన్ని స్వీకరించేవాడు. ఎంట్రప్రిన్యూర్షిప్ నష్టభయంతో కూడిన చర్య.
  5. ఎంట్రప్రిన్యూర్ ప్రేరణ చేయువాడు. ఎంట్రప్రిన్యూర్షిప్ ప్రేరేపింపబడేది. `
  6. ఎంట్రప్రిన్యూర్ సృష్టికర్త. ఎంట్రప్రిన్యూర్షిప్ సృష్టించబడేది.
  7. ఎంట్రప్రిన్యూర్ మనోదృష్టి కలవాడు. ఎంట్రప్రిన్యూర్షిప్ మనోదృష్టి.
  8. ఎంట్రప్రిన్యూర్ నాయకుడు. ఎంట్రప్రిన్యూర్షిష్ నాయకత్వము.
  9. ఎంట్రప్రిన్యూర్ అనుకరించువాడు. ఎంట్రప్రిన్యూర్షిప్ అనుకరణ.

ప్రశ్న 5.
ఆర్థికాభివృద్ధిలో ఎంట్రప్రెన్యూర్షిప్ పాత్రను వివరించండి.
జవాబు:
ఆర్థికాభివృద్ధిలో ఎంట్రప్రిన్యూర్షిప్ పాత్ర ఒక ఆర్థిక వ్యవస్థకు, మరొక ఆర్థిక వ్యవస్థకు వస్తు వనరుల మీద, పారిశ్రామిక వాతావరణము మరియు రాజకీయ వ్యవస్థపై మారుతూ ఉంటుంది. వీరు ఆర్థిక వ్యవస్థలో తక్కువ అనుకూల అవకాశాలు ఉంటే ఎక్కువ అనుకూల అవకాశాలను కల్పిస్తారు.

భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశము. ఆర్థికాభివృద్ధి సాధించుటకు పారిశ్రామిక వికేంద్రీకరణ జరగవలెను. తద్వారా ప్రాంతీయ అసమానతలను తొలగించవచ్చును. ఈ క్రమములో సమాన ప్రాంతీయ అభివృద్ధిని సాధించుటకు చిన్నతరహా పరిశ్రమలు ముఖ్యమైన పాత్ర వహించును. చిన్నతరహా పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించును. అంతేకాకుండా జాతీయ ఆదాయాన్ని సమానముగా పంచుటకు మరియు మానవ వనరులను, మూలధన వనరులను సమర్థవంతంగా తరలించి ఉపయోగించుకొనును. లేకపోతే అవి వృధాగా ఉండును. ఆర్థికాభివృద్ధిలో ఎంట్రప్రిన్యూర్షిప్ ముఖ్య భూమిక పోషించును. ఒక క్రమ పద్ధతిలో దిగువ తెలిపిన విధముగా పంపిణీ జరిగినట్లయితే ఆర్థికాభివృద్ధి జరుగుతుంది.

  1. ఎంట్రప్రిన్యూర్షిప్ ప్రజల వద్ద నిరుపయోగముగా ఉన్న పొదుపు మొత్తాలను సేకరించి దానిని మూలధనముగా మార్చును.
  2. ఎంట్రప్రిన్యూర్షిప్ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తుంది. తద్వారా దేశములో నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. ఇదే ఆర్థిక, సాంఘిక సమస్యలకు మూలము.
  3. ఎంట్రప్రిన్యూర్షిప్ సమతల ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుంది.
  4. ఆర్థికశక్తుల కేంద్రీకరణను తగ్గించడానికి దోహదపడుతుంది.
  5. దేశ అవసరాల దృష్ట్యా సంపదను, ఆదాయాన్ని మరియు రాజకీయ అధికారాన్ని సమానముగా పంపిణీ చేయడానికి తోడ్పడుతుంది.
  6. నిరుపయోగముగా ఉన్న పొదుపును, మానవ నైపుణ్యాలను, మూలధన అవసరాలకు తరలించును. 7) దేశ ఆర్థికాభివృద్ధిలో వెనుక, ముందు అనుసంధాలను కలుగజేస్తుంది.
  7. ఆర్థికాభివృద్ధికి దోహదపడే ముఖ్యమైన ఎగుమతి వర్తకాన్ని ప్రోత్సహిస్తుంది. కావున ఎంట్రప్రిన్యూర్షిప్ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది.

ప్రశ్న 6.
ఆంధ్రప్రదేశ్లో ఎంట్రప్రిన్యూర్షిప్కు గల అవకాశాలను వివరించండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్లో అతి విలువైన సహజ వనరులు పుష్కలంగా ఉండటమే గాక వ్యవసాయ మరియు అటవీ సంపదతో వ్యవస్థాపకులకు పెట్టుబడులు పెట్టుటకు అనువైన అవకాశాలు ఉన్నవి. క్రియాశీల పారిశ్రామికాభివృద్ధికి అనుకూలము. సాంకేతికపరముగా నిపుణులు అయిన మానవ వనరులతో పాటు శీఘ్రముగా స్పందించే ప్రభుత్వ విధానాలు, అనువైన సౌకర్యాలు, పంట మార్పిడి విధానము, పరిశ్రమలు మరియు గనులు పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయి. సాంప్రదాయ పరిశ్రమలు అయిన బట్టలు, చర్మ పరిశ్రమలు, ఖనిజ మరియు ఆహార వస్తువుల పరిశ్రమలు అభివృద్ధి పథములో ఉన్నాయి. ఇవేకాకుండా సమాచార, సాంకేతిక మరియు పర్యాటక రంగములో మంచి పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 1 ఎంట్రప్రిన్యూర్షిప్

1) సమాచార సాంకేతిక రంగము: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సమాచార సాంకేతిక రంగాన్ని అత్యవసర సేవా నిర్వహణ చట్టముగా ప్రకటించినది. మరియు విద్యుత్ కోతల నుండి మినహాయించినది. రాష్ట్రాన్ని విజ్ఞాన సమాజముగా మార్చాలని, సాంకేతిక విజ్ఞానము పౌరులందరికి ముఖ్యముగా గ్రామీణ ప్రాంతాల వారికి అందుబాటులో ఉండాలని, రాష్ట్రములో పెట్టుబడిదారులు ముందంజలో ఉండాలని చూస్తోంది. మన రాష్ట్రములో నిష్ణాతులైన మానవశక్తి మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా సదుపాయాలున్నవి. ప్రపంచస్థాయి ఐ.టి. కంపెనీలను ఆకర్షించుటకు అవకాశాలున్నవి. మహిళా వ్యవస్థాపకులు, SC, ST వర్గాలకు చెందిన వ్యక్తులు ఐ.టి సంస్థలు స్థాపించినట్లయితే వారి స్థిర మూలధనములో 25 శాతం రాయితీ ఇవ్వబడుతుంది. అంతేగాక ఇతర ఆకర్షణీయమైన వెసులుబాట్లు కూడా ప్రభుత్వము కల్పించింది.

2) ఆటోమొబైల్: నిపుణులైన, శిక్షణ కలిగిన, మానవశక్తి కలిగి ఉన్నందున ఆటోమొబైల్ పరికరాల పరిశ్రమలను స్థాపించుటకు ఆంధ్రప్రదేశ్ అనువైన స్థలము. 100కు పైగా ఆటోమొబైల్ పరికరాల తయారీ పరిశ్రమలు ముఖ్యంగా అల్యూమినియం కాస్టింగ్, అధిక ఒత్తిడి గల డైకాస్టింగ్, ఫోర్జింగ్, యంత్రపరికరాలు, లోహ పరికరాలు, గేర్లు, ఫిస్టన్లు మొదలైన వాటికి ఎక్కువ డిమాండు ఉన్నది. వ్యవస్థాపకులకు ఇది చక్కని అవకాశము.

3) మందుల పరిశ్రమలు: మన రాష్ట్రములో శిక్షణ పొందిన, నైపుణ్యము కలిగిన మానవశక్తి, మౌళిక సదుపాయాలు, పరిశోధన అభివృద్ధి సదుపాయాలు ఉండటము వలన ఔషధ పరిశ్రమల అభివృద్ధికి మంచి అవకాశాలున్నవి. దేశములోని మందుల తయారీలో ఆంధ్రప్రదేశ్లో మూడవవంతు తయారవుతున్నాయి. దీనిని ఔషధ రాజధానిగా పేర్కొన్నారు. అంతేగాక విశాఖపట్టణము చుట్టుప్రక్కల ప్రాంతాలలో ప్రైవేటు భాగస్వామ్యములో ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించినది. అందువలన వ్యవస్థాపకులకు ఎన్నో అవకాశాలున్నవి.

4) గనులు మరియు ఖనిజ సంపద: భారతదేశములో ఆంధ్రప్రదేశ్ రెండవ అతిపెద్ద ఖనిజసంపద గల రాష్ట్రం. బొగ్గు, సున్నపురాయి, స్లాబ్స్, నూనె, సహజవాయువు, మాంగనీస్, ఆస్బెస్టాస్, ముడి ఇనుము, బంగారము, వజ్రాలు, గ్రాఫైటు, సహజ వాయువు మొదలైనవి లభ్యమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వము గనులు మరియు ఖనిజ సంపద రంగాన్ని అభివృద్ధి చెందే పరిశ్రమగా గుర్తించినది. కాబట్టి ఈ రంగములో పెట్టుబడి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

5) వ్యవసాయ మరియు అటవీసంపద: ఆంధ్రప్రదేశ్లో ఎక్కువమంది ముఖ్యవృత్తి వ్యవసాయము. ఆహార పంటలలో వరి ముఖ్యమైనది. అన్ని ఆహారపు ధాన్యాలలో వరి ధాన్యము 77 శాతము, ఇతర ముఖ్య పంటలు జొన్నలు, సజ్జలు, రాగి, అపరాలు, పొగాకు, పత్తి, చెరకు. రాష్ట్రము పండ్ల తోటలకు ముఖ్యముగా మామిడి, నిమ్మ, ద్రాక్ష, అనాస, అరటి, ఉల్లి అనువైనది. మన రాష్ట్రములోనే కొన్ని ముఖ్యమైన అటవీ ఉత్పత్తులు కూడా ఉన్నాయి. అవి టేకు, తైలము, వెదురు, జీడిపప్పు మొదలైనవి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, నూనెగింజల పరిశ్రమలు, ఆహార పదార్థాలు, నూనె శుద్ధి కర్మాగారాలు, ఎక్కువ ప్రొటీన్ గల ఆహార పదార్థాల పరిశ్రమలకు ఎక్కువ అవకాశాలున్నాయి.

6) పర్యాటక రంగము: ఆంధ్రప్రదేశ్ సుందరమైన రాష్ట్రము. ఇందులో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి. సముద్ర తీరాలు, కొండలు, వన్యమృగ అరణ్యాలు, ఓడరేవులు, చారిత్రాత్మక కట్టడాలు, పార్కులు ఉన్నాయి. అంతేగాక శిల్పకళా సంపద గలిగిన దేవాలయాలు, తిరుపతి, అన్నవరం, సింహాచలంలోని దేవాలయాలు, అరకు లోయలు మొదలైనవి వ్యవస్థాపకులకు వ్యాపార సంస్థలు స్థాపించుటకు మంచి అవకాశాలు గల ప్రదేశాలు.

7) మత్స్యసంపద: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము బంగాళాఖాతము ఒడ్డున విస్తరించి ఉన్నది. విస్తారమైన సముద్రతీరము ఉండటం వలన సముద్రపు ఆహారము దొరుకును. రొయ్యల సాగుకు సముద్రతీరం అనుకూలముగా ఉండటం వలన సముద్రపు ఆహారము ఎగుమతులలో ఎక్కువ భాగము ఉన్నది. వ్యవస్థాపకులు సంస్థలు స్థాపించుటకు ఉన్న అవకాశాలు పరిశీలించి స్థాపించుట ద్వారా ఎగుమతి చేయుటకు అవకాశాలు ఉన్నాయి.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 1 ఎంట్రప్రిన్యూర్షిప్

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎంట్రప్రిన్యూర్ అనగా అర్థమేమి ?
జవాబు:
ఎంట్రప్రిన్యూర్ అనే పదము ఫ్రెంచి మూలమైన ఎంట్రప్రిడేర్ (Entreprede) అనే పదము నుంచి ఆవిర్భవించినది. ‘దీని అర్థము ఒక కొత్త పనిని చేపట్టడము. నష్టభయాన్ని స్వీకరించి, ఒక కొత్త సంస్థను స్థాపించడమనే కార్యాన్ని చేపట్టేవాడే ఎంట్రప్రిన్యూర్. ఒక వ్యక్తిగాని, కొంతమంది వ్యక్తులు కలిసి వివిధ రకాల వనరులను సేకరించి ఒక కొత్త సంస్థను ప్రారంభించి తద్వారా వచ్చే రిస్క్ న్ను భరించడము.

ప్రశ్న 2.
ఎంట్రప్రిన్యూర్కు ఒక నిర్వచనము వ్రాయండి.
జవాబు:
పీటర్ ఎఫ్. డ్రక్కర్ ప్రకారము ‘ఎంట్రప్రిన్యూర్’ అనేవాడు ఎల్లప్పుడూ మార్పు కోసం వెదుకుతూ, వచ్చిన మార్పులకు స్పందించి అట్టి మార్పులనే అవకాశాలు చేజిక్కించుకునేవాడు మరియు నూతన రూపకల్పన అనేది ఎంట్రప్రిన్యూర్షిప్ సాధనలో ఉపయోగపడే ఒక సాధనము.

ప్రశ్న 3.
ఎంట్రప్రిన్యూర్షిప్ ను నిర్వచించుము.
జవాబు:
అమెరికాలో జరిగిన ఒక సదస్సులో ఎంట్రప్రిన్యూర్షిప్ ను ఈ క్రింది విధముగా నిర్వచించినారు. “ఎంట్రప్రిన్యూర్షిప్ వ్యాపార అవకాశాలను గుర్తించుట, ఆ అవకాశాలకు అనుగుణముగా రిస్క్న నిర్వహణ చేయడం మరియు నిర్వహణ నైపుణ్యాల ద్వారా మానవ, విత్త, వస్తు వనరులను అవసరమైన వరకు తరలించి వాటికి విలువను సృష్టించడము”.

ప్రశ్న 4.
ఎంట్రప్రిన్యూర్ ఒక లక్షణము వివరించండి.
జవాబు:
నవకల్పన: నూతన వ్యాపారములో నవకల్పన అనే లక్షణము వ్యాపారస్తుడికి చాలా అవసరము. వ్యవస్థాపకుడు ఒక వైపున ఉత్పత్తిని పెంచుకోవడం, మరోవైపున ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకొనుటకు నవకల్పనను ప్రవేశపెట్టుటకు ప్రయత్నిస్తాడు. నవకల్పన వలన ఉత్పత్తి ప్రక్రియలో నూతన పద్ధతులను ప్రవేశపెట్టవచ్చును. లేక ప్రస్తుతము ఉన్న పద్ధతులను అభివృద్ధి చేయవచ్చును. దీనిలో కొత్త మార్కెట్లను కనుగొనడం, ముడిసరుకు మరియు నూతన సాంకేతిక పద్దతులను కనుగొనవచ్చును.

 

ప్రశ్న 5.
ఎంట్రప్రిన్యూర్ ఒక విధిని వివరించండి.
జవాబు:
నిర్ణయీకరణ: వ్యవస్థాపకుడు క్రింది విషయాలకు సంబంధించి వివిధ రకాల నిర్ణయాలను తీసుకుంటాడు.
అవి:

  1. సంస్థ లక్ష్యాలను నిర్ణయించడం
  2. ఆర్థిక వనరుల లభ్యత
  3. ఉత్పత్తి మిశ్రమము
  4. ధరల విధానము
  5. అభివృద్ధి వ్యూహాలు
  6. అనువైన సాంకేతిక లేక నూతన విధానాలు

AP Inter 2nd Year Commerce Study Material Chapter 1 ఎంట్రప్రిన్యూర్షిప్

ప్రశ్న 6.
ఎంట్రప్రిన్యూర్ రకాలను వ్రాయండి.
జవాబు:
ఎంట్రప్రిన్యూర్లలో రకాలు:

  1. నవకల్పన ఎంట్రప్రిన్యూర్లు.
  2. అనుకరణ ఎంట్రప్రిన్యూర్లు
  3. నిదానపు ఎంట్రప్రిన్యూర్లు
  4. స్థిర చిత్తపు ఎంట్రప్రిన్యూర్లు

AP Board 5th Class Maths Solutions 10th Lesson కాలం

Andhra Pradesh AP Board 5th Class Maths Solutions 10th Lesson కాలం Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 5th Class Maths Solutions Chapter 10 కాలం

ఇవి చేయండి: (TextBook Page No.103)

ప్రశ్న 1.
మహిత వాళ్ళ అక్క ఉదయం 6 : 30 గం॥లకు బయలుదేరి 2 గంటలు ప్రయాణించింది. ఆమె ఏ సమయానికి రాజమండ్రి చేరింది ?
జవాబు.
మహిత వాళ్ళ అక్క బయలుదేరిన సమయం = 6:30
ఆమె ప్రయాణించిన కాలం = 2 గం||
మహిత వాళ్ళ అక్క రాజమండ్రికి చేరే సమయం = 6.30 + 2.గం|| = 8:30 గం||లు

ప్రశ్న 2.
మహిత వాళ్ళ అక్క మధ్యాహ్నం 3 : 00 గంటలకు బయలుదేరి 1 గం|| 45 ని॥లకు ప్రయాణించింది. ఆమె ఏ సమయానికి ఏలూరు చేరింది ?
జవాబు.
మహిళ వాళ్ళ అక్క ప్రారంభ సమయం = 3:00 గం||లు
ప్రయాణించిన దూరం = 1 గం|| 45 ని॥లు
మహిళ వాళ్ళ అక్క ఏలూరుకి చేరిన సమయం. = 4 : 45 ని॥లు

ప్రశ్న 3.
ఆమె మొత్తం ఎన్ని గంటలు ప్రయాణం చేసింది ?
జవాబు.
ఆమె మొత్తం ప్రయాణించిన దూరం = 2 : 00 + 1 : 45 = 3 గం|| : 45 ని||లు

AP Board 5th Class Maths Solutions 10th Lesson కాలం 1

ఇవి చేయండి: (TextBook Page No.111)

జతపరచండి.

AP Board 5th Class Maths Solutions 10th Lesson కాలం 2

జవాబు.

AP Board 5th Class Maths Solutions 10th Lesson కాలం 3

I. కింది పట్టికలో విజయవాడ స్టేషన్ కు సంబంధించిన కొన్ని రైళ్ళ రాకపోకలు ఇవ్వబడ్డాయి. ఒక్కొక్క రైలు ప్రయాణించిన సమయాన్ని నమోదు చేయండి.

AP Board 5th Class Maths Solutions 10th Lesson కాలం 4

జవాబు.

AP Board 5th Class Maths Solutions 10th Lesson కాలం 5

అభ్యాసం 1:

ప్రశ్న 1.
12 గం||ల గడియారం చూపే సమయాన్ని బట్టి 24 గంటల సమయాన్ని తెలిపేలా డిజిటల్ గడియారంలో చూపండి. (రంగు నింపండి).

AP Board 5th Class Maths Solutions 10th Lesson కాలం 6

జవాబు.

AP Board 5th Class Maths Solutions 10th Lesson కాలం 7

ప్రశ్న 2.
కొండేపాడు పాఠశాలలో 10:45 am నుండి 3:45 pm వరకు ఆటల పోటీలు జరిగాయి. ఆటల పోటీలు జరిగిన
సమయాన్ని లెక్కించండి.
జవాబు.
పాఠశాలలో ఆటల పోటీలు జరిగిన సమయం = 10:45 am నుండి 3 : 45 pm
ఆటల పోటీలు జరిగిన సమయం = 10 : 45 – 3:45 = 7 గం॥లు

ప్రశ్న 3.
రాబర్ట్ విజయవాడ నుండి సింగపూర్‌కు 22 : 00 గం॥ సమయంలో బయలుదేరాడు. సమయాన్ని 12 గం॥ల గడియారంలో చూపండి.
జవాబు.
రాబర్ట్ విజయవాడ నుండి సింగపూర్ కు బయలుదేరిన సమయం = 22 : 00 గం||లు (24 గం||ల గడియారం పద్ధతిలో)
12 గం||ల గడియార పద్దతిలో ఈ సమయం = 22 : 00 – 12 : 00 = 10:00 p.m.

ప్రశ్న 4.
అభినవ్ ఒక పాఠశాలలో రాత్రి కాపలాదారుడుగా పనిచేయుచున్నాడు. అతడు ప్రతిరోజు 5:30 pm కు పనికి బయలుదేరితే, ఆ సమయాన్ని 24 గంటల రూపంలో చూపండి.
జవాబు.
అభినవ్ ప్రతిరోజు పనికి బయలుదేరే సమయం = 5:30 pm 24 గం||ల రూపంలో
ఈ సమయం విలువ = 12 : 00 + 5:30 pm = 17:30 గం||లు

ప్రశ్న 5.
హిమదాసు ప్రతిరోజూ 4:30 am నుండి 6:15 am వరకు మరియు 4:00 pm నుండి 5:30 pm వరకు యోగా చేస్తాడు. అయితే అతను ఎన్ని గంటలు యోగా చేస్తాడు ?
జవాబు.
మొదటిసారి ప్రాక్టీసు సమయం = 4:30 am నుండి 6.15 pm = 1:45 ని॥లు
రెండవసారి ప్రాక్టీసు సమయం = 4 : 00 am నుండి 5.30 pm = 1 : 30 గం||లు
మొత్తం యోగా ప్రాక్టీసు సమయం = 1:45 + 1:30 = 3:15 గం॥లు

ప్రశ్న 6.
బాబు బృందం కబడ్డీ ఆటను సోమవారం రోజు 6:15 am నుండి 7:05 am వరకు, మంగళవారం రోజు 3:25 pm నుండి 4:15 pm వరకు సాధన చేసింది. రెండు రోజులకు గాను ఎంత సమయం పాటు ప్రాక్టీసు చేశారు?
జవాబు.
సోమవారం రోజు ప్రాక్టీసు సమయం = 6:15 am నుండి 7 : 05 am
= 7:05 – 6:15 = 50 ని॥లు
మంగళవారం రోజు ప్రాక్టీసు సమయం = 3:25 pm నుండి 4 : 15 pm
= 4:15 – 3:25 = 50 ని॥లు
మొత్తం ప్రాక్టీసు చేసిన సమయం = 50 + 50 = 100 ని॥లు (రోజుకు)

ప్రశ్న 7.
ఒక బస్సు 11:20 am కు టర్మినల్ నుండి బయలుదేరి 2:40 pm కు గమ్యస్థానానికి చేరితే ఎన్ని గంటలు’ ప్రయాణం చేసినట్లు ?
జవాబు.
బస్సు బయలుదేరిన సమయం = 11 : 20 am బస్సు
గమ్యస్థానమునకు చేరిన సమయం = 2:40 pm బస్సు
ప్రయాణం చేసిన సమయం = 14 : 40 – 11 : 20 = 3:20 గం||లు

ప్రశ్న 8.
స్నేహ 4:30 pm కు ఇంటిపని మొదలుపెట్టి 80 ని॥ల పాటు చేసింది. ఆమె ఏ సమయానికి పూర్తిచేసింది?
జవాబు.
స్నేహ ఇంటిపని మొదలు పెట్టిన సమయం = 4 : 30 pm
పనిచేసిన సమయం = 80 ని॥లు = 4:30 + 30 + 50
స్నేహ ఇంటిపని పూర్తిచేసిన సమయం = 5: 50 గం॥లు.

అభ్యాసం 2:

ప్రశ్న 1.
2020 లీపు సంవత్సరం, తర్వాత వచ్చే లీపు సంవత్సరం _________
జవాబు.
2024.

ప్రశ్న 2.
2020 సంవత్సరం ముందు వచ్చిన లీపు సంవత్సరం _________
జవాబు.
2016

ప్రశ్న 3.
2300 లీపు సంవత్సరమేనా ? కారణం తెలపండి.
బి.
2300 లీపు సంవత్సరం కాదు. ఎందుకనగా ఇది శత సంవత్సరం కనుక.

ప్రశ్న 4.
ఏదైనా ఒక సంవత్సరానికి సంబంధించిన 12 నెలలలోని రోజులను కూడండి. అది లీపు సంవత్సరం కాదో తెలపండి.
జవాబు.
నేను 2019 క్యాలెండర్ ను తీసుకున్నాను. దీనిలో
జనవరి – 31,
ఫిబ్రవరి – 28,
మార్చి – 31,
ఏప్రిల్ – 30,
మే – 31,
జూన్ – 30,
జూలై – 31,
ఆగస్టు- 31,
సెప్టెంబర్ – 30,
అక్టోబర్ – 31,
నవంబర్ – 30,
డిసెంబర్ – 31.
మొత్తం రోజులు = 31 + 28 + 31 + 30 + 31 + 30 + 31 + 31 + 30 + 31 + 30 + 31
= 7 × 31 + 4 × 30 + 28
= 217+ 120 + 28 = 365
∴ 2019 లీపు సంవత్సరం కాదు.

ప్రశ్న 5.
మొరార్జీ దేశాయ్ గారు 29.02.1896 న జన్మించారు. 10.04.1995 న చనిపోయారు. ఆయన ఎన్ని పుట్టిన రోజులు జరుపుకున్నారు ?
జవాబు.
మొరార్జీ దేశాయ్ జన్మించి తేదీ = 29-02-1896
మొరార్జీ దేశాయ్ మరణించిన తేదీ = 10-04-1995
మొరార్జీ దేశాయ్ వయస్సు 99 సం||లు దేశాయ్
అతని పుట్టిన రోజును ప్రతీ 4 సం||లకు ఒకసారి చేసుకుంటారు.
1896 నుండి 1995 వరకు మధ్యన 24 లీపు సంవత్సరాలు కలవు.
కనుక దేశాయ్ అతని జీవితకాలంలో 24 . పుట్టిన రోజులు జరుపుకొని వుంటారు.

ప్రశ్న 6.
ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ 22.12.1887 న జన్మించి, 26.04.1920 న మరణించారు. ఆయన జీవితకాలంలో ఎన్ని లీపు సంవత్సరాలు వచ్చి ఉంటాయి ?
జవాబు.
శ్రీనివాస రామానుజన్ పుట్టిన తేదీ = 22-12-1887
శ్రీనివాస రామానుజన్ మరణించిన తేదీ = 26-04-1920
శ్రీనివాస రామానుజన్ వయస్సు = 33 సం॥లు
33 సం॥లలో 8 లీపు సంవత్సరాలు వస్తాయి. అవి 1888, 1892, 1896, 1904, 1908, 1912, 1916, 1920.

AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Physics Study Material 2nd Lesson కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Physics Study Material 2nd Lesson కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఒక పుటాకార కటకం నాభ్యాంతరం, వక్రతా వ్యాసార్ధాలను నిర్వచించండి.
జవాబు:
నాభ్యాంతరము (f) :
కటకం యొక్క దృశా కేంద్రం నుండి ప్రధాన నాభి మధ్యగల దూరాన్ని కటకం యొక్క నాభ్యాంతరము అంటారు.
నాభ్యాంతరం (f) = CF
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 1

వక్రతా వ్యాసార్థము :
గోళంలో భాగంగా తీసుకున్న వక్రతా తలం యొక్క వ్యాసార్థాన్ని వక్రతా వ్యాసార్థం అంటారు.

ప్రశ్న 2.
కటకాల విషయంలో నాభి (focus), ప్రధాన నాభి (principal focus) అనే పదాల అర్థం ఏమిటి?
జవాబు:
నాభి :
అనంత దూరంలో ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబము ఏర్పడే బిందువును కటకం యొక్క నాభి అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 2

ప్రధాన నాభి :
ప్రధానాక్షానికి సమాంతరంగా, సన్నని కాంతి కిరణము కటకంపై పతనం చెందినపుడు, వక్రీభవనం చెంది ప్రధానాక్షముపై ఒక బిందువు వద్ద కేంద్రీకరణ చెందును. ఈ బిందువును ప్రధాననాభి అంటారు.
ప్రధానాక్ష

ప్రశ్న 3.
ఒక పదార్థం యొక్క దృశ్య సాంద్రత, ద్రవ్యరాశి సాంద్రతతో ఏ విధంగా విభేదిస్తుంది?
జవాబు:
దృశ్య సాంద్రత :
యానకాలలో కాంతివేగాల నిష్పత్తిని దృశ్య సాంద్రత అంటారు.

ద్రవ్యరాశి సాంద్రత :
ప్రమాణ ఘనపరిమాణంలో ద్రవ్యరాశిని, ద్రవ్యరాశి సాంద్రత అంటారు. ద్రవ్యరాశి సాంద్రత దృశ్య విరళ యానకంలోకన్నా దృశ్య సాంద్రతర యానకంలో తక్కువ.

ప్రశ్న 4.
వక్రతల దర్పణాల పరావర్తన సూత్రాలేమిటి?
జవాబు:

  1. పరావర్తన కోణము, పతన కోణానికి సమానం.
  2. పతన కిరణము, పరావర్తన కిరణము, పరావర్తన తలంకు గీసిన లంబం ఒకేతలంలో ఉన్నాయి.

AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు

ప్రశ్న 5.
ఒక కుంభాకార కటక సామర్థ్యాన్ని నిర్వచించండి. దాని ప్రమాణాన్ని పేర్కొనండి. [TS (Mar: ’16) AP (Mar.’17)]
జవాబు:
కటకం యొక్క సామర్థ్యము ఒక కటకం తనపై పతనమైన కాంతిని ఎంతమేర అభిసరణం (లేదా) అపసరణం చెందించగలదో దాన్ని కొలిచే రాశిని కటక సామర్థ్యం అంటారు. కటకంయొక్క నాభ్యాంతరం వ్యుత్ర మాన్ని మీటర్లలో కొలుస్తారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 3

ప్రశ్న 6.
10cm నాభ్యాంతరం కలిగిన ఒక పుటాకార దర్పణాన్ని ఒక గోడ నుంచి 35cm దూరంలో ఉంచారు. గోడమీద ఒక నిజ ప్రతిబింబం ఏర్పడటానికి వస్తువును గోడ నుంచి ఎంత దూరంలో ఉంచాలి?
జవాబు:
f = 10 సెం.మీ., = 35సెం.మీ.
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 4
గోడ నుండి వస్తువు యొక్క దూరము = 35 – 14 = 21 సెం.మీ.

ప్రశ్న 7.
ఒక పుటాకార దర్పణం తన నుంచి 40cm దూరంలో ఉంచిన నిటారైన, పొడవైన మేకు (pin) ప్రతిబింబాన్ని అదే దూరంలో ఏర్పరుస్తుంది. దర్పణం నాభ్యాంతరాన్ని కనుక్కోండి. [TS (Mar. 17)]
జవాబు:
u = v = 40 సెం.మీ.
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 5
f = 20 సెం.మీ.

8. 40 స్వల్ప కోణంగల పట్టకం ఒక కాంతి కిరణాన్ని 2.48° తో విచలనం చేస్తున్నది. పట్టకం వక్రీభవన గుణకం కనుక్కోండి.
జవాబు:
A = 4°, Dm = 2.48°
Dm = A (µ – 1)
µ – 1 = \(\frac{D_m}{A}=\frac{2.48}{4}\) = 0.62
µ = 1 + 0.62
μ = 1.62

ప్రశ్న 9.
విక్షేపణం అంటే ఏమిటి? సాపేక్షంగా ఏ రంగు అధికంగా విక్షేపణం చెందుతుంది? [Mar. ’14]
జవాబు:
విక్షేపణం :
పట్టకంద్వారా తెల్లని కాంతిని పంపించినప్పుడు ఏడు రంగులుగా విడిపోతుంది. ఈ దృగ్విషయాన్ని విక్షేపణం అంటారు. ఊదారంగు గరిష్ఠంగా విచలనం చెందును.

ప్రశ్న 10.
ఒక పుటాకార కటకం నాభ్యాంతరం 30 cm. వస్తు పరిమాణంలో 1/10 వంతు పరిమాణం గల ప్రతిబింబం ఏర్పడాలంటే వస్తువును ఎక్కడ ఉంచాలి?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 6

ప్రశ్న 11.
కంటి హ్రస్వ దృష్టి అంటే ఏమిటి? దీన్ని ఏ విధంగా సవరించాలి? [TS (Mar.’15)]
జవాబు:
హ్రస్వ దృష్టి (Myopia) :
వస్తువునుండి కంటి కటకం వద్దకు వచ్చే కాంతి అంతఃపటలం (రెటీనా) ముందు భాగంలో ఒక బిందువు వద్ద కేంద్రీకృతమవుతుంది. ఈ రకపు దోషాన్ని హ్రస్వ దృష్టి (దగ్గరి చూపు) అంటారు.

దీనిని సవరించడానికి ప్రతిబింబం అంతః పటలం (రెటీనా) పై ఏర్పడేట్లుగా కావలసిన అపసరణ ఫలితాన్ని పొందడానికి వస్తువు, కన్ను మధ్యగా ఒక పుటాకార కటకాన్ని ప్రవేశపెట్టాలి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 7

ప్రశ్న 12.
కంటి దూర దృష్టి అంటే ఏమిటి? దీన్ని ఏ విధంగా సవరించాలి? [AP (Mar.’16)]
జవాబు:
దూర దృష్టి (Hypermetropia) :
కంటి కటకం తనపై పతనమైన కాంతిని అంతః పటలం వెనకభాగంలోకి ఒక బిందువు వద్ద కేంద్రీకరింపచేసినట్టి దృష్టి దోషాన్ని దూరదృష్టి అంటారు.

కంటి దూర దృష్టిని సవరించడానికి ఒక అభిసారి కటకం (కుంభాకార కటకం)ను వస్తువు, కన్ను మధ్యగా ప్రవేశపెట్టాలి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 8

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కనిష్ఠ విచలన కోణ స్థానంలో అమర్చిన A పట్టణ కోణం కలిగిన ఒక పట్టకం నుంచి కాంతి ప్రసారమవుతున్నది. (a) పతన కోణానికి `సమాసాన్ని పట్టక కోణం మరియు కనిష్ఠ విచలన కోణం పదాలలో రాబట్టండి. (b) వక్రీభవన కోణానికి వక్రీభవన గుణకం పదాలలో సమాసాన్ని రాబట్టండి.
జవాబు:
AQNR సమాంతర చతుర్భుజం నుండి
∠A + ∠QNR = 180° ………………. (1)
QNR త్రిభుజం నుండి, r, + 2 + ∠QNR = 180° …………….. (2)
r1 + r2 = A ……………… (3)
మొత్తం విచలనం (δ) = (i – r1) + (e – r2)
δ = i + e – A …………… (4)
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 9
a) కనిష్ఠ విచలన స్థానం వద్ద, δ = Dm, i = e
మరియు r1 = r2 = r
సమీకరణం (4) నుండి Dm = 2i – A
i = \(\frac{A+D_m}{2}\) ………………. (5)

b) సమీకరణం (3) నుండి, r + r = A
r = A/2 …………….(6)
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 10

AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు

ప్రశ్న 2.
ఒక పుటాకార దర్పణ నాభ్యాంతరాన్ని నిర్వచించండి. దర్పణ వక్రతా వ్యాసార్ధం నాభ్యాంతరానికి రెట్టింపు ఉంటుందని నిరూపించండి. [AP (Mar.’17)]
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 11
పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరము :
దర్పణం యొక్క నాభి (F) మరియు ధ్రువం (P) మధ్య దూరాన్ని పుటాకార దర్పణం యొక్క నాభ్యాంతరము అంటారు.

AB అను కిరణము ప్రధాన అక్షానికి సమాంతరముగా పోతూ పుటాకార దర్పణంపై B వద్ద పతనం చెంది మరియు BF దిశలో పరావర్తనం చెందినది. CB అనునది దర్పణంకు లంబరేఖ. అనునది పతన కోణము, ∠ABC = ∠BCP = θ CP పై BD లంబాన్ని గీయుము.

BCD లంబకోణ త్రిభుజం నుండి,
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 12

ప్రశ్న 3.
ఒక పుటాకార దర్పణం ప్రధానాక్షం వెంబడి ఒక మొబైల్ ఫోన్ (చరవాణి) ని దాని పొడవు సమాంతరంగా ఉండేట్లు ఉంచారు. ఆవర్ధనం ఏకరీతిగా ఎందుకు ఉండదో వివరించండి.
జవాబు:
చరవాణి ప్రతిబింబం ఏర్పడటాన్ని పటంలో చూడండి. ప్రధానాక్షానికి లంబంగా ఉన్న తలంలోని భాగపు ప్రతిబింబం అదే తలంలో ఉంటుంది. అది ఒకే పరిమాణంలో ఉంటుంది. అంటే B’C = BC.
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 13
మీరు స్వయంగా ప్రతిబింబం ఎందుకు విరూపితమయ్యిందో అవగతం చేసుకుంటారు.

ప్రశ్న 4.
దర్పణాలలో కార్టీసియన్ సంజ్ఞా సంప్రదాయాన్ని వివరించండి.
జవాబు:
కార్టీసియన్ సంజ్ఞా సంప్రదాయాన్ని అనుసరించి :
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 14

  1. అన్ని దూరాలనూ దర్పణం ధ్రువం నుంచి (లేదా) కటకం కేంద్రం నుంచి కొలుస్తారు.
  2. పతన కిరణ దిశలో కొలిచే దూరాల న్నింటినీ ధనాత్మకంగా తీసుకుంటాం.
  3. పతన కిరణ దిశకు వ్యతిరేక దిశలో ఊర్ధ్వ దిశలో, కొలిచే దూరాలన్నింటినీ రుణాత్మకం గానూ తీసుకుంటాం.
  4. x అక్షం పరంగా కటకం/దర్పణం ప్రధానాక్షానికి లంబంగా ఊర్ధ్వ దిశలో కొలిచే ఎత్తులను ధనాత్మకంగా తీసుకుంటాం.
  5. అధో దిశలో కొలిచే ఎత్తులను రుణాత్మ కంగా తీసుకుంటాం.

ప్రశ్న 5.
సందిగ్ధ కోణాన్ని నిర్వచించండి. ఒక చక్కని పటం సహాయంతో వివరించండి. [TS (Mar. ’15)]
జవాబు:
సందిగ్ధ కోణం :
సాంద్రతర యానకంలో ఏ పతన కోణానికి, విరళయానకంలో వక్రీభవన కోణం 90° గా ఉంటుంది. ఆ పతన కోణాన్ని సందిగ్ధ కోణం అంటారు.
C = sin-1(\(\frac{1}{\mu}\))
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 15

సంపూర్ణాంతర పరావర్తనం :
కాంతి వికిరణము సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోకి ప్రయాణించినప్పుడు, పతన కోణము, సందిగ్ధ కోణంకన్నా ఎక్కువైతే, అది తిరిగి అదే యానకంలో పరావర్తనం చెందుతుంది. ఈ దృగ్విషయాన్ని సంపూర్ణాంతర పరావర్తనం అంటారు.

వివరణ :
ఒక వస్తువు సాంద్రతర యానకంలో ఉన్నది. అనుకొనుము. OA కిరణము XY మీద పతనం చెంది లంబానికి దూరంగా వంగుతుంది. పతనకోణం పెంచితే, – వక్రీభవన కోణం కూడా పెరుగుతుంది. ఒక నిర్ధిష్ట పతన కోణము వద్ద, వక్రీభవన కోణము XY తలానికి సమాంతరంగా ఉంటుంది (r = 90°).
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 16

పతన కోణాన్ని ఇంకా పెంచితే, కిరణము వక్రీభవనము చెందకుండా సాంద్రతర యానకంలోకి తిరిగి పరావర్తనం చెందుతుంది. ఈ దృగ్విషయాన్ని సంపూర్ణాంతర పరావర్తనం
అంటారు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు

ప్రశ్న 6.
తగిన ఉదాహరణలతో ఎండమావి ఏర్పడటాన్ని వివరించండి. [AP (Mar. ’16)]
జవాబు:
ఎడారులలో, పగటి సమయాలలో ఇసుక బాగా వేడెక్కి భూమికి సమీపంలో ఉన్న గాలి ఉష్ణోగ్రత పెరుగుతుంది. కావున గాలి సాంద్రత తగ్గుతుంది. దీని ఫలితంగా కింది పొరలలో పోల్చితే, పై పొరల సాంద్రత అధికంగా ఉంటుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 17

కాంతి కిరణము చెట్టుపై నుండి విరళయానకంలోకి ప్రయాణిస్తే, అది లంబం నుండి దూరంగా వక్రీభవనం చెందుతుంది. దీని ఫలితంగా, నేలపై గాలిలో, ప్రతిసారి పతనకోణము పెరిగితే ఒక స్థితిని చేరి, పతనకోణము సందిగ్ధకోణం కన్నా ఎక్కువగా ఉండి పతన కిరణము సంపూర్ణాంతర పరావర్తనం చెందుతుంది.

కాబట్టి అతనికి చెట్టు తలక్రిందులుగా కనిపిస్తుంది. ఇదే విధంగా ఎడారులలో ఎండమావులు కనిపిస్తాయి.

ప్రశ్న 7.
ఇంద్రధనస్సు ఏర్పడటాన్ని వివరించండి. [AP (Mar.’15)]
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 18
పటంలో సూర్యకాంతి విడిపోయి, ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుందో తెలుపుతుంది. నీటి బిందువులో విక్షేపణం చెందిన ఊదా మరియు ఎరుపు రంగులు ఎలా అంతర పరావర్తనం చెందుచున్నాయో పటంలో చూడవచ్చు.

43° ల కోణము వద్ద ఎరుపు రంగు కిరణాలు బిందువు నుండి బహిర్గతమగును. మరియు మరొక కోణము 41° వద్ద ఊదారంగు కిరణము బహిర్గతమగును. ఆకాశంలో అనేక నీటిబిందువులవల్ల ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. భూమిపై ఉన్న పరిశీలకుడికి ఇంద్రధనస్సు అర్థ వృత్తాకారంగా కనిపిస్తుంది.

ప్రశ్న 8.
సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు ఎందువల్ల ఎరుపుగా కనిపిస్తాడు? [TS (Mar: ’17) Mar. ’14]
జవాబు:
సూర్యకాంతి భూ వాతావరణంలో ప్రయాణిస్తూ అక్కడ ఉన్న అధిక సంఖ్యలోగల అణువుల నుండి పరిక్షేపణ చెందుతుంది. | ఈ పరిక్షేపణ చెందిన కాంతి సూర్యాస్తమయం మరియు సూర్యోదయం చెందే సమయంలో రంగులకు కారణం.

తక్కువ తరంగదైర్ఘ్యముగల కాంతి ఎక్కువ తరంగదైర్ఘ్యముగల కాంతి కన్నా చాలా బాగా పరిక్షేపణ చెందుతుంది.
పరిక్షేపణం \(\frac{1}{\lambda^4}\).
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 19

నీలంరంగు అధికంగా పరిక్షేపణ చెందుటవల్ల ఆకాశం నీలంగా కనిపిస్తుంది.

సూర్యాస్తమయం. (లేదా) సూర్యోదయం సమ యంలో సూర్యకాంతి వాతావరణంలో అధిక దూరం ప్రయాణిస్తుంది. నీలం రంగులో అధిక భాగం దూరంగా పరిక్షేపణ చెందుతుంది. ఎరుపురంగు తక్కువగా పరిక్షేపణ చెందుతుంది. కావున సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు.

ప్రశ్న 9.
చక్కని సూచికలతో, గీచిన పట సహాయంతో సరళ సూక్ష్మదర్శినిలో ప్రతిబింబం ఏర్పడాన్ని వివరించండి. [TS (Mar.’16) AP (Mar.’15)]
జవాబు:
సరళ సూక్ష్మదర్శిని:
దీనిలో అల్ప నాభ్యాంతరముగల కుంభాకార కటకం ఉంటుంది. ఒక వస్తువును స్పష్టంగా చేసేటట్లుగా దృశ్య కోణాన్ని పెంచుతుంది. దీనిని ఆవర్ధన కటకం (లేదా) రీడింగ్ కటకం అంటారు.

పనిచేయు విధానం :
వస్తువును ప్రధాన నాభి మరియు కటక కేంద్రం మధ్య ఉండేట్లుగా సర్దుబాటు చేసి స్పష్టమైన ప్రతిబింబం సమీప బిందువువద్ద ఏర్పడేటట్లు చేస్తారు. దీనివల్ల ఏర్పడిన మిథ్యా ప్రతిబింబం నిటారుగా మరియు వస్తువు కంటే పెద్దదిగా ఉంటుంది. వస్తువు ఉన్న వైపు స్పష్ట దృష్టి కనిష్ఠ దూరంలో ఉంటుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 20

ఆవర్థన సామర్థ్యము :
మిధ్యా ప్రతిబింబం కంటివద్ద ఏర్పరచే కోణానికి, వస్తువు కంటివద్ద ఏర్పరచే కోణానికిగల నిష్పత్తిని సరళ సూక్ష్మదర్శిని ఆవర్ధన సామర్థ్యము అంటారు. దీనిని m తో సూచిస్తారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 21

ప్రశ్న 10.
ఒక సరళ సూక్ష్మదర్శినిలో వస్తువు స్థానం ఏమిటి? ఒక ఆచరణాత్మక నాభ్యాంతరం గల సరళ సూక్ష్మదర్శిని గరిష్ఠ ఆవర్థనం ఎంత?
జవాబు:
వస్తువును ప్రధాన నాభి మరియు కటక కేంద్రం మధ్య ఉండేట్లుగా సర్దుబాటుచేస్తే మిథ్యా ప్రతిబింబం నిటారుగా, వస్తువు కంటే పెద్దదిగా ఉండి, వస్తువు ఉన్న వైపు ఏర్పడుతుంది.

ఆవర్థన సామర్ధ్యము :
ప్రతిబింబం కంటివద్ద ఏర్పరచే కోణానికి, వస్తువు కంటి వద్ద ఏర్పరచే కోణానికి గల నిష్పత్తిని ఆవర్ధన సామర్థ్యము అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 22
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 23

కటక నాభ్యంతరం తక్కువగా ఉంటే సరళ సూక్ష్మదర్శిని ఆవర్ధక సామర్థ్యము పెరుగుతుంది.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
a) కార్టీసియన్ సంజ్ఞా సంప్రదాయం ఏమిటి? ఒక చక్కని పట సహాయంతో, కార్టీసియన్ సంజ్ఞా సంప్రదాయాన్ని అనువర్తింపచేసి, దర్పణ (సూత్రాన్ని) సమీకరణాన్ని ఉపయోగించి ప్రతిబింబ దూరం కనుక్కోవడానికి ఒక సమాసాన్ని రాబట్టండి.
b) 20 cm వక్రతా వ్యాసార్ధం ఉన్న ఒక పుటాకార దర్పణం నుంచి 15 cm దూరంలో 5 cm ఎత్తున ఒక వస్తువును ఉంచారు. ప్రతిబింబ పరిమాణం కనుక్కోండి.
జవాబు:
కార్టీసియన్ సంజ్ఞా సంప్రదాయాన్ని అనుసరించి :
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 24

  1. అన్ని దూరాలనూ దర్పణం ధ్రువం నుంచి (లేదా) కటకం కేంద్రం నుంచి కొలుస్తారు.
  2. పతన కిరణ దిశలో కొలిచే దూరాల న్నింటినీ ధనాత్మకంగా తీసుకుంటాం.
  3. పతన కిరణ దిశకు వ్యతిరేక దిశలో కొలిచే దూరాలన్నింటినీ రుణాత్మకం గానూ తీసుకుంటాం.
  4. x – అక్షం పరంగా కటకం/దర్పణం ప్రధానాక్షానికి లంబంగా ఊర్ధ్వ దిశలో కొలిచే ఎత్తులను ధనాత్మకంగా తీసుకుంటాం.
  5. అధో దిశలో కొలిచే ఎత్తులను రుణాత్మ కంగా తీసుకుంటాం.

దర్పణ సమీకరణం ఉపయోగించి ప్రతిబింబ దూరం కనుగొనుట:
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 25
పుటాకార కటకం ప్రధాన అక్షముపై దాని వక్రత కేంద్రంకు ఆవల AB అను వస్తువును ఉంచాలి.

AD అను కిరణము ప్రధానాక్షమునకు సమాంతరముగా దర్పణం మీద బిందువు వద్ద పతనంచెంది, దాని నుండి పరావర్తనం చెందిన కిరణము F గుండా పోతుంది. AE కిరణము దాని వక్రతా కేంద్రము C గుండా పోయి తిరిగి అదే మార్గంలోకి పరావర్తనం చెందుతుంది. ఈ రెండు కిరణాలు A’ బిందువు వద్ద ఖండించుకుంటాయి. అందువల్ల A’B’ నిజ ప్రతిబింబం తలక్రిందులుగా C మరియు F బిందువుల మధ్య ఏర్పడుతుంది.

DPF మరియు A’B’ F అనురూప త్రిభుజాలు
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 26
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 27
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 28

AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు

ప్రశ్న 2.
a) ఒక చక్కని వివరణాత్మక పటం సహాయంతో దర్పణ సమీ కరణాన్ని ఉత్పాదించండి. రేఖీయ ఆవర్ధనాన్ని నిర్వచించండి.
b) 15cm నాభ్యాంతరం ఉన్న ఒక కుంభాకార కటకం నుంచి 5cm దూరంలో ఒక వస్తువును ఉంచారు. ప్రతిబింబ స్థానం, దాని స్వభావం ఏమిటి?
జవాబు:
a) దర్పణ సమీకరణం రాబట్టుట :
పుటాకార కటకం ప్రధాన అక్షముపై దాని వక్రత కేంద్రంకు ఆవల AB అను వస్తువును ఉంచాలి.

AD అను కిరణము ప్రధాన అక్షమునకు సమాంతరముగా దర్పణంపై D బిందువువద్ద పతనంచెంది, దాని నుండి పరావర్తనం చెందిన కిరణం F గుండా పోతుంది. AE కిరణము దాని వక్రతా కేంద్రము C గుండాపోయి తిరిగి అదే మార్గంలో వెనక్కి మరలును.

ఈ రెండు కిరణాలు A’ బిందువు వద్ద ఖండించుకుంటాయి. అందువల్ల A’ B’ నిజ ప్రతిబింబం తలక్రిందులుగా C మరియు F బిందువుల మధ్య ఏర్పడుతుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 29

రేఖీయ ఆవర్ధనము :
ప్రతిబింబ పరిమాణము, వస్తువు పరిమాణంకు గల నిష్పత్తిని రేఖీయ ఆవర్ధనం అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 30

b) u = 5 సెం.మీ., f = 15 30.30.
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 31
ప్రతిబింబ స్వభావం మిధ్యా ప్రతిబింబం.

ప్రశ్న 3.
a) ఒక పలుచని ద్వికుంభాకార కటకానికి ఒక సమాసాన్ని రాబట్టండి. ఈ సమాసాన్నే ద్విపుటాకార కటకానికి అనువర్తింపచేయవచ్చా?
b) 15 cm నాభ్యాంతరం కలిగిన ఒక పలుచని ద్వికుంభాకార కటకం నుంచి 20cm దూరంలో ఒక వస్తువును ఉంచారు. ప్రతిబింబ స్థానం, ఆవర్ధనం కనుక్కోండి.
జవాబు:
a)
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 32
i) ఒక కుంభాకార కటకం యొక్క వక్రతా వ్యాసార్థాలు R, మరియు R, మరియు కటకం వక్రీభవన గుణకంలో అనుకొనుము.
ii) P1, P2 లు ధ్రువాలు. C1, C2లు రెండు తలాల వక్రతల కేంద్రాలు మరియు C దృశాకేంద్రము.
iii) కటకం యొక్క ప్రధానాక్షంపై అను వస్తువు ఉన్నది అనుకొనుము మరియు I1 అనునది వస్తువు యొక్క నిజ ప్రతిబింబం
= CI1 ≈ P1I1 = v1
మరియు CC1 ≈ PC1 = R1
CO ≈ P1O = u

iv) విరళయానకం నుండి సాంద్రతర యానకంలోకి వక్రీభవం చెందితే
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 33

v) వక్రీభవన కిరణము మరలా వక్రీభవనం చెందితే, యొక్క తుది నిజ ప్రతిబింబము I
vi) రెండవ తలం వద్ద వక్రీభవనం చెందితే, I1 మిథ్యా వస్తువు, దాని నిజ ప్రతిబింబము I వద్ద ఏర్పడుతుంది.
∴ u ≈ CI1 ≈ P2I1 = V1
CI ≈ P2I = V అనుకొనుము

vii) సాంద్రతర యానకం నుండి విరళయానకంలోనికి వక్రీభవనం చెందితే
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 34
కటకానికి ఎడమవైపు వస్తువు అనంతదూరంలో ఉంటే, ప్రతిబింబం కటకం యొక్క ప్రధాన నాభి వద్ద ఏర్పడుతుంది.
∴ u = ∝, υ = f = కటకం నాభ్యాంతరం
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 35

ప్రశ్న 4.
రెండు పలుచని కుంభాకార కటకాలను ఒకదానితో ఒకటి తాకేట్లు అమర్చిన సందర్భంలో ఫలిత నాభ్యాంతరానికి సమాసాన్ని రాబట్టండి. దాని నుంచి ఈ కటక సంయోగం ఫలిత సామర్థ్యానికి సమాసాన్ని రాబట్టండి.
జవాబు:
i) f1 మరియు f2 నాభ్యాంతరములు గల A మరియు B అను రెండు కటకాలను స్పర్శలో ఉంచాయనుకొనుము.
ii) వస్తువును O బిందువు వద్ద ఉంచితే, మొదటి కటకం I, వద్ద ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఇది నిజ ప్రతిబింబం. ఇది B కటకానికి మిథ్యా వస్తువువలె పనిచేసి తుది ప్రతిబింబాన్ని I వద్ద ఏర్పరుస్తుంది.
iii) A కటకం ఏర్పరచే ప్రతిబింబం
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 36

ప్రశ్న 5.
a) స్నెల్ సూత్రాన్ని నిర్వచించండి. ఒక చక్కని వివరణాత్మక పటం సహాయంతో ఒక సమబాహు త్రిభుజ పట్టక పదార్థ వక్రీభవన గుణకానికి సమాసాన్ని రాబట్టండి.
b) ఒక యానకంలో ఒక కాంతి కిరణం ప్రయాణిస్తూ యానకం-గాలి సరిహద్దు తలం వద్ద 45° కోణంతో పతనమై గాలిలోకి వక్రీభవనం ఏమాత్రం చెందకుండా (సరిహద్దు తలం వెంట) ప్రయాణించింది. యానకం వక్రీభవన గుణకం ఎంత?
జవాబు:
a) స్నెల్ నియమం :
పతన కోణము యొక్క సైన్ విలువకు, వక్రీభవన కోణముయొక్క సైన్ విలువకుగల నిష్పత్తి స్థిరాంకము. దీనిని యానకం యొక్క వక్రీభవన గుణకం అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 37

ABC అనునది గాజు పట్టకం. దాని కోణము A అనుకొనుము. పట్టక పదార్థ వక్రీభవన గుణకం µ అనుకొనుము. AB మరియు AC లు రెండు వక్రీభవన తలాలు. PQ = పతన కోణం RS = బహిర్గామి కిరణం.
పతన కోణము = i1, బహిర్గామి కోణము = = i2
వక్రీభవన కోణము = r1, R వద్ద వక్రీభవన కోణము = r2
కాంతి కిరణం పట్టకం నుండి ప్రయాణించి AC తలంపై పతనంచెంది, RS గా బహిర్గతమవుతుంది.
D = విచనల కోణము
QRT త్రిభుజము నుండి
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 38
r1 + r2 + ∠T = 180° …………. (2)
AQTR చతుర్భుజం నుండి
∠A + ∠T = 180°
∠T = 180° – A. …………. (2)
(1) మరియు (2) సమీకరణాల నుండి
r1 + r2 + \(\hat{T}\) = 180°
r1 + r2 + 180° – A = 180°
r1 + r1 = A …………. (3)
QUR త్రిభుజం నుండి
i1 – r1 + i2 – r2 + 180° – D = 180°
i1 + i2 – (r1 + r2) = D
i1 + i2 – A = D [∵ r1 + r2 = A]
i1 + i2 = A + D …………….. (4)

కనిష్ఠ విచలనం :
పతనకోణాన్ని క్రమంగా పెంచితే, విచలన కోణం కనిష్ఠ విలువను చేరేవరకు తగ్గి తరువాత పెరుగుతుందని ప్రాయోగికంగా తెలిసింది. విచలన కోణం కనిష్ఠ విలువను కనిష్ఠ విచలన కోణం (8) అంటారు.

D తగ్గితే, రెండు కోణాలు i1 మరియు i2 లు కనిష్ఠ విచలన కోణం వద్ద పరస్పరం సమీపిస్తాయి. అనగా i1 = i2
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 39

గమనిక : కనిష్ఠ విచలన కోణము పట్టక పదార్థ వక్రీభవన గుణకము మరియు పట్టక కోణముపై ఆధారపడును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 40

AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు

ప్రశ్న 6.
ఒక సంయుక్త సూక్ష్మదర్శిని పనిచేసే విధానాన్ని చక్కని వివరణాత్మక పటం సహాయంతో వివరించండి. ఆవర్ధనానికి ఒక సమాసాన్ని రాబట్టండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 41
వర్ణన:
ఇది రెండు కుంభాకార (అభిసారి) కటకాలను కలిగి ఉంటుంది. వస్తువుకు దగ్గరగా ఉండే కటకాన్ని వస్తు కటకమని, కంటికి దగ్గరగా ఉండే కటకాన్ని అక్షి కటకమని అంటారు. వస్తు కటకం అల్ప నాభ్యాంతరం, అక్షికటకం ఎక్కువ నాభ్యంతరం కలిగి ఉంటాయి. వస్తువు నుండి వస్తు కటకం దూరాన్ని రాక్ మరియు పినియన్ ఏర్పాటులో సర్దుబాటు చేస్తారు.

పనిచేసే విధానం :
వస్తు కటకం యొక్క నాభి బిందువుకు కొద్దిగా ఆవలంక వస్తువు ఉంటుంది. దాని యదార్థ ప్రతిబింబం I1G1 వస్తు కటకానికి రెండవ ప్రక్కన 2F0 కు ఆవల ఏర్పడుతుంది. ఆ యదార్థ ప్రతిబింబం తలక్రిందులుగా మరియు పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. ఈ ప్రతిబింబాన్ని అక్షి కటకానికి వస్తువుగా తీసుకోవచ్చు. ప్రతిబింబం I1 G1 ను అక్షి కటక ప్రధాన నాభి మరియు దాని కటక కేంద్రం మధ్యలో ఉండేట్లు సర్దుబాటుచేసి తుది ప్రతిబింబం స్పష్ట దృష్టి కనిష్ఠ దూరంలో ఏర్పడేట్లు చేస్తారు. తుది ప్రతిబింబం మిథ్యా ప్రతిబింబం, ఇది తలక్రిందులుగా పరిమాణంలో పెద్దదిశగా కనిపిస్తుంది.

ఆవర్ధన సామర్థ్యం :
సమీప బిందువు వద్ద ఏర్పడిన తుది ప్రతిబింబం కంటి వద్ద ఏర్పరిచే కోణానికి అదే బిందువు వద్ద వస్తువు కంటివద్ద ఏర్పరిచే కోణానికిగల నిష్పత్తిని ఆవర్ధన సామర్థ్యం అంటారు.

కన్ను కటక కేంద్రం ఉన్నట్లుగా ఊహించుకుంటే, తుది ప్రతిబింబం కంటివద్ద చేసే కోణం . వస్తువు సమీప బిందువు వద్ద IJ’ గా తీసుకున్నట్లయితే అది కంటివద్ద చేసే కోణం β.
అవర్ధక సామర్ధ్యము నిర్వచనం ప్రకారం
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 43

meను రాబట్టుట :
అక్షి కటకం సరళ సూక్ష్మదర్శినివలె పనిచేస్తుంది. కాబట్టి అక్షి కటకం ఆవర్థన సామర్థ్యం
∴ me = (1+ ) (∵ fe = అక్షి కటకం నాభ్యంతరం
m0 మరియు me విలువలను (1) వ సమీకరణంలో ప్రతిక్షేపించగా
m = + \(\frac{v_0}{u}\) (1 + \(\frac{D}{f_e}\))
వస్తువు F0 కు అతి దగ్గరలో ఉంటే, వస్తు కటకంవల్ల ఏర్పడిన ప్రతిబింబం అక్షి కటకానికి అతి దగ్గరలో ఏర్పడుతుంది.
u ≈ -f0 and v0 ≈ L
ఇక్కడ L = వస్తు కటకం మరియు అక్షి కటకాల మధ్యదూరం
m = \(\frac{L}{f_0}\) (1 + \(\frac{D}{f_e}\))

లెక్కలు Problems

ప్రశ్న 1.
4 × 104 పౌనఃపున్యం, 5 × 10-7 mతరంగదైర్ఘ్యం కలిగిన కాంతి తరంగం ఒక యానకం ద్వారా ప్రయాణిస్తున్నది. యానక వక్రీభవన గుణకాన్ని అంచనా వేయండి.
సాధన:
υ = 4 × 1014 Hz
λ = 5 × 10-7 m
V = vλ= 4 × 1014 × 5 × 10-7 = 20 × 107
= 2 × 108 m /s
C = 3 ‘ × 108 m /s, అని మనకు తెలుసును
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 44

ప్రశ్న 2.
30° పట్టక కోణం కలిగిన ఒక పట్టకం తలంపై 60° తో ఒక కాంతి కిరణం పతనమైంది. బహర్గామి కిరణం పతన కిరణంతో 30° కోణం చేస్తున్నది. పట్టక పదార్థ వక్రీభవన గుణకాన్ని గణించండి.’
సాధన:
i1 = 60°, r = 30°, i2 = 30°
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 45

ప్రశ్న 3.
– 1.75D, + 2.25 సామర్థ్యంగల రెండు కటకాలను ఒకదానితో ఒకటి తాకేట్లు అమర్చారు. ఈ సంయోగ నాభ్యాంతరాన్ని కనుక్కోండి.
సాధన:
P1 = – 1.75 D, P2 = + 2.25 D.
P = P1 + P2
P = – 1.75 + 2.25
P = 0.5
\(\frac{1}{F}\) = P
F = \(\frac{1}{P}=\frac{1}{0.5}\) = 2m
F = 200cm

AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు

ప్రశ్న 4.
ఒక అభిసారి కటకంపై పతనమయ్యే కొన్ని కాంతి కిరణాలు కటకం నుంచి 20 cm దూరంలో కేంద్రీకృతం అయ్యాయి. ఈ అభిసారి కటకంతో తాకేట్లుగా ఒక అభిసారికటకాన్ని అమర్చినప్పుడు కాంతి కిరణాలు సంయోగానికి 30 cm దూరంలో కేంద్రీకృతం అయ్యాయి. అపసారి కటక నాభ్యాంతరం ఎంత?
సాధన:
u = -20 cm
υ = 30 cm
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 46

ప్రశ్న 5.
15 cm నాభ్యాంతరం కలిగిన ఒక ద్వికుంభాకార కటకాన్ని ఆవర్ధకంగా ఉపయోగించి 3 రెట్ల ఆవర్ధనంతో ఒక నిటారు ప్రతిబింబాన్ని పొందారు. కటకానికి, వస్తువుకూ మధ్య దూరం ఎంత?
సాధన:
f = 15 cm
m = 3
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 47

ప్రశ్న 6.
2cm నాభ్యాంతరంగల ఒక వస్తుకటకం, 5cm నాభ్యాంతరం గల ఒక అక్షికటకంతో ఒక సంయుక్త సూక్ష్మదర్శినిని తయారుచేశారు. ఒక వస్తువును వస్తుకటకం నుంచి 2.2cm దూరంలో ఉంచినప్పుడు తుది ప్రతిబింబం అక్షికటకం నుంచి 25cm దూరంలో ఏర్పడ్డది. వస్తుకటకం, అక్షికటకాల మధ్య దూరం ఎంత? మొత్తం రేఖీయ ఆవర్ధనం ఎంత?
సాధన:
f0 = 2, fe = 5, u0 = 2.2,
D = 25
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 48
m = 10 × 6
m = 60

ప్రశ్న 7.
రెండు బిందు కాంతి జనకాల మధ్య దూరం 24cm. ఈ రెండు జనకాల ప్రతిబింబాలు ఒకే బిందువు వద్ద ఏర్పడటానికై 9 cm నాభ్యాంతరం ఉన్న అభిసారి కటకాన్ని ఎక్కడ ఉంచవలసి వస్తుంది?
సాధన:
రెండు బిందు ఆవేశాల మధ్యదూరం = 24cm
నాభ్యంతరము (f) 9 cm
వక్రతా వ్యాసార్థము (R) = 2f
R = 2 × 9 = 18 cm.
∴ అభిసారి కటకాన్ని 18 cm వద్ద ఉంచాలి (లేదా) అభిసారి కటకం యొక్క రెండవ స్థానం
= 24 – 18 = 6cm.
∴ అభిసారి కటకం యొక్క స్థానము = 18 cm (లేదా) 6cm.

ప్రశ్న 8.
15 cm నాభ్యాంతరం ఉన్న ఒక పుటాకార దర్పణం. వల్ల వస్తువు పరిమాణం కంటే 3 రెట్లుండే ప్రతిబింబం ఏర్పడటానికి వస్తువును ఉంచవలసిన రెండు స్థానాలను కనుక్కోండి.
సాధన:
f = 15cm
m = 3
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 49

ప్రశ్న 9.
వస్తువుకు 25 cm దూరంలో ఒక పుటాకార దర్పణాన్ని ఉంచినప్పుడు 40 cm దూరంలో ఉంచినప్పటికంటే ప్రతిబింబం 4 రెట్లు ఉంటే, రెండు సందర్భాల్లోనూ ప్రతిబింబం నిజ ప్రతిబింబం అయితే దర్పణం నాభ్యంతరం ఎంత?
సాధన:
m = 4
u = 25 cm
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 50

ప్రశ్న 10.
ఒక సంయుక్త సూక్ష్మదర్శినిలో 4 cm నాభ్యాంతరం ఉన్న వస్తుకటకం 6 cm నాభ్యంతరం ఉన్న అక్షికటకం ఉన్నాయి. వస్తుకటకం నుంచి 6 cm దూరంలో ఒక వస్తువు ఉంచిన సూక్ష్మదర్శిని వల్ల పొందగలిగే ఆవర్థనం ఎంత?
సాధన:
f0 = 4 cm, fe = 6 cm, u0 = 6
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 51

అభ్యాసాలు Textual Exercises

ప్రశ్న 1.
2.5 cm పరిమాణం గల ఒక చిన్న కొవ్వొత్తిని 36 cm వక్రతా వ్యాసార్ధం ఉన్న ఒక పుటాకార దర్పణం ముందు 27cm దూరంలో ఉంచారు. ఒక సునిశిత (sharp) – ప్రతిబింబం పొందడానికి తెరను దర్పణం నుంచి ఎంత దూరంలో ఉంచాలి? ప్రతిబింబ స్వభావం, పరిమాణాలను వివరించండి. కొవ్వొత్తిని దర్పణానికి సమీపంలోకి తెస్తే తెరను ఏవిధంగా జరపాలి?
సాధన:
u = – 27 cm, R = – 36 cm, f = -18 cm
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 52
దర్పణం నుండి తెరను 54 cm దూరంలో ఉంచవలెను.
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 53

∴ నిజ, తలక్రిందులుగా మరియు ఆవర్ధన ప్రతిబింబము ఏర్పడుతుంది. కొవ్వొత్తిని దగ్గరగా జరిపితే, తెరను బాగా దూరం, దూరంగా జరపాలి. తెరనుండి 18 cm దగ్గరగా ఉంటే మిథ్యా ప్రతిబింబం ఏర్పడి, తెరపై కనిపించదు.

ప్రశ్న 2.
15cm నాభ్యాంతరం గల ఒక కుంభాకార దర్పణం నుంచి 12 cm దూరంలో 4.5 cm ల సూదిని ఉంచారు. ప్రతిబింబం స్థానాన్ని, ఆవర్ధనాన్ని తెలపండి. దర్పణం నుంచి సూదిని ఇంకా దూరంగా జరిపితే ఏం జరుగుతుందో వివరించండి.
సాధన:
O = 4.5 cm, u = -12 cm, f = 15.cm
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 54
గుండుసూదిని దర్పణం నుండి జరిపితే, ప్రతిబింబం నాభివైపు జరుగుతుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు

ప్రశ్న 3.
ఒక తొట్టెలో నీటిని 12.5 cm వరకు నింపారు. తొట్టెలో అడుగున ఉన్న ఒక సూది దృశ్యలోతును ఒక సూక్ష్మదర్శినితో కొలిచినప్పుడు 9.4 cm ఉన్నది. నీటి వక్రీభవన గుణకం ఎంత? నీటికి బదులుగా 1.63 వక్రీభవన గుణకం ఉన్న ఒక ద్రవంతో తొట్టెని అంతే ఎత్తుకు నింపితే సూదిని చూడటానికై సూక్ష్మదర్శినిని ఎంత దూరానికి సర్దుబాటు చేయాలి?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 55

ప్రశ్న 4.
పటం (a), (b) లలో వరసగా, ఒక కాంతికిరణం, గాజు-గాలి, నీరు-గాలి సరిహద్దు తలాలను సరిహద్దు తలానికి గీచిన లంబంతో 60° కోణంతో పతనమవుతున్నట్లు చూపారు. నీరు-గాజు సరిహద్దు తలం వద్ద పటం (c) నీటిలో పతనకోణం 45° అయితే గాజులో వక్రీభవన కోణాన్ని అంచనా వేయండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 56
సాధన:
మొదటి సందర్భం :
పతన కోణం (i) = 60°
వక్రీభవన కోణం (r) = 35°
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 57
r = 33°54′

ప్రశ్న 5.
80 cm నీటి లోతుగల ఒక నీటి తొట్టె అడుగుభాగం వద్ద ఒక చిన్న బల్బును ఉంచారు. బల్బు నుంచి ఉద్గారమయ్యే కాంతి ఎంత నీటి ఉపరితల వైశాల్యం నుంచి బయటకు వస్తుంది? నీటి వక్రీభవన గుణకం 1.33. (బల్బును ఒక బిందు జనకంగా భావించండి)
సాధన:
r అనునది పెద్ద వృత్త వ్యాసార్థం. గాలి-నీరు అంతః తలానికి సందిగ్ధ కోణం (C) అయిన
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 58

ప్రశ్న 6.
పదార్థ వక్రీభవన గుణకం తెలియని ఒక పట్టకం ఉన్నది. ఒక సమాంతర కాంతి పుంజం పట్టకం ఒక తలంపై పతనమౌతున్నది. పట్టక కనిష్ఠ విచలన కోణం 40° గా కొలవబడింది. పట్టక పదార్థ వక్రీభవన గుణకం ఎంత? పట్టక కోణం 60°. ఒకవేళ పట్టకాన్ని నీటిలో (వక్రీభవన గుణకం 1.33) ఉంచితే సమాంతర కాంతిపుంజం కొత్త కనిష్ఠ విచలన కోణం ఎంత ఉంటుంది?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 59
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 60

ప్రశ్న 7.
1.55 వక్రీభవన గుణకం గల గాజుతో ద్వికుంభాకార కటకాలను తయారుచేయవలసి ఉంది; కుంభాకార తలాల వక్రతా వ్యాసార్ధాలు సమానంగా ఉండాలి. కటకం నాభ్యాంతరం 20 cm ఉండాలంటే వక్రతా వ్యాసార్ధం ఎంత ఉండాలి?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 61

AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు

ప్రశ్న 8.
ఒక కాంతిపుంజం P అనే బిందువు వద్ద కేంద్రీకృతం అవుతుంది. ఇప్పుడు బిందువు P నుంచి 12.cm దూరంలో కాంతిపుంజం మార్గంలో ఒక కటకాన్ని ఉంచారు. (a) కటకం 20 cm నాభ్యాంతరం గల కుంభాకార కటకమైతే కాంతిపుంజం ఎక్కడ కేంద్రీకృతం అవుతుంది? (b) 16 cm నాభ్యాంతరం గల పుటాకార కటకమైతే ఎక్కడ కేంద్రీకృతం అవుతుంది?
సాధన:
మిథ్యా వస్తువు మరియు నిజ ప్రతిబింబానికి
u = + 12 cm
a) f = + 20cm
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 62
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 63
అనగా u = 7.5 cm కటకం నుండి 7.5cm దూరంలో ఉండును.

b) f = – 16 cm
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 64
కటకం నుండి 48 cm దూరంలో ప్రతిబింబం ఉంటుంది.

ప్రశ్న 9.
21 cm నాభ్యంతరం ఉన్న ఒక పుటాకార కటకం ముందు 14 cm దూరంలో 3.0 cm పరిమాణం ఉన్న ఒక వస్తువును ఉంచారు. ఏర్పడే ప్రతిబింబాన్ని వర్ణించండి. కటకానికి ఇంకా దూరంగా వస్తువును జరిపితే ఏం జరుగుతుంది?
సాధన:
‘O’ = 3.0cm
u = – 14 cm, f – -21 cm
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 65
మిథ్యా ప్రతిబింబం తలక్రిందులుగా కటకం నుండి వస్తువువైపు ఏర్పడుతుంది
\(\frac{I}{O}=\frac{υ}{u}\)
υ = \(\frac{8.4}{15}\) × 5 = 1.8 cm
వస్తువు కటకం నుండి దూరం జరిగితే మిథ్యా ప్రతిబింబం కటకం నాభ్యంతరంవైపు జరుగుతుంది.
(u = 21 cm, v = -10.5 cm మరియు u = ∞, v = -21 cm)

ప్రశ్న 10.
నాభ్యాంతరం 30 cm ల కుంభాకార కటకాన్ని 20 cm ల నాభ్యాంతరం ఉన్న పుటాకార కటకంతో తాకుతూ ఉండేట్లు అమర్చితే నాభ్యాంతరం ఎంత ? ఈ వ్యవస్థ ఒక అభిసారి కటకమా? అపసారి కటకమా ? కటకాల మందాలను ఉపేక్షించండి.
సాధన:
f1 = 30 cm, f2 = -20 cm, f = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 66
కాబట్టి వ్యవస్థ 60 cm నాభ్యంతరం గల అపసారి కటకం వలె పనిచేస్తుంది.

ప్రశ్న 11.
ఒక సంయుక్త సూక్ష్మదర్శినిలో నాభ్యంతరం 2.0cm గల వస్తుకటకాన్ని 6.25cm నాభ్యాంతరం గల అక్షికటకం నుంచి 15cm దూరం అమర్చారు. (a) తుది ప్రతిబింబం స్పష్ట దృష్టి కనిష్ఠ దూరం (25cm)లో ఏర్పడటానికి, (b) అనంత దూరంలో ఏర్పడటానికీ వస్తువును వస్తుకటకం నుంచి ఎంత దూరంలో ఉంచాలి? ప్రతి సందర్భంలోనూ సూక్ష్మదర్శిని ఆవర్ధనం ఎంత?
సాధన:
a) ve = −25.cm
fe = 6.25cm.
కటక సూత్రం ప్రకారం,
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 67

b) u0 = -6.25 cm
υ0 = 15 – 6.25 = 8.75 cm
f0 = 2.0 cm
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 68

ప్రశ్న 12.
సాధారణ సమీప బిందువు (25 cm) గల వ్యక్తి ఒకరు 8.0 mm నాభ్యాంతరం గల వస్తుకటకం, 2.5 mm నాభ్యాంతరం గల అక్షికటకం ఉన్న ఒక సంయుక్త సూక్ష్మదర్శిని ఉపయోగిస్తూ, వస్తుకటకం నుంచి 2.0 mm దూరంలో ఉన్న ఒక వస్తువును సునిశితంగా కేంద్రీకరింపచేసి స్పష్టంగా చూడగలుగుతున్నాడు. రెండు కటకాల మధ్య దూరం ఎంత? సూక్ష్మదర్శిని ఆవర్ధన సామర్థ్యం లెక్కించండి.
సాధన:
అక్షికటకం యొక్క కోణీయ ఆవర్ధనం
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 69

ప్రశ్న 13.
ఒక చిన్న దూరదర్శినిలో 144 cm నాభ్యాంతరం గల వస్తు కటకం, 6.0 cm నాభ్యాంతరం గల అక్షికటకం ఉన్నాయి. దూరదర్శిని ఆవర్ధనం ఎంత ? వస్తుకటకం, అక్షికటకాల మధ్య దూరం ఎంత?
సాధన:
a) సహజ సర్దుబాటుకు
మార్గదర్శిని యొక్క ఆవర్ధనం = \(\frac{f_0}{f_e}=\frac{144}{6}\) = 24

b) దూరదర్శిని పొడవు
L = f0 + fe = 144 + 6
= 150 cm.

AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు

ప్రశ్న 14.
a) ఒక వేధశాలలో ఉన్న భారీ వక్రీభవన దూరదర్శినిలో వస్తుకటక నాభ్యాంతరం 15m. 1.0 cm నాభ్యాంతరం గల ఒక అక్షికటకాన్ని వాడితే దూరదర్శిని కోణీయ ఆవర్ధన సామర్థ్యం ఎంత?
b) ఈ దూరదర్శిని చంద్రుణ్ణి చూడటానికై వినియోగిస్తే వస్తుకటకం ఏర్పరచే చంద్ర ప్రతిబింబ వ్యాసం ఎంత ఉంటుంది? చంద్రుని వ్యాసం 3.48 × 106m, చంద్రకక్ష్య వ్యాసార్ధం 3.8 × 108m.
సాధన:
a) కోణీయ ఆవర్ధనం
= \(\frac{f_0}{f_e}=\frac{15}{0.01}\) = 1500

b) d అనునది ప్రతిబింబం యొక్క వ్యాసము
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 70

ప్రశ్న 15.
దర్పణ సూత్రాన్ని ఉపయోగించి :
a) ఒక పుటాకార దర్పణం f, 2f ల మధ్య ఉంచిన వస్తువు నిజ ప్రతిబింబాన్ని 2f కు ఆవల ఏర్పరు స్తుందని
b) ఒక కుంభాకార దర్పణంవల్ల వస్తువు స్థానంతో నిమిత్తం లేకుండా ఎప్పటికీ మిధ్యా ప్రతిబింబమే ఏర్పడుతుందనీ,
c) ఒక కుంభాకార దర్పణం వల్ల ఏర్పడిన మిధ్యా ప్రతిబింబం ఎప్పటికీ పరిమాణంలో చిన్నగా ఉండి ప్రధాన నాభి, దర్పణ ధ్రువం మధ్యలో ఉంటుందనీ, d) ఒక పుటాకార దర్పణం ధ్రువం, ప్రధాన నాభుల మధ్య ఉంచిన వస్తువు మిధ్యా ప్రతిబింబాన్ని, వృద్ధి చెందిన దాన్ని ఏర్పరుస్తుందని చూపండి.
గమనిక : ఈ అభ్యాసం ముఖ్యంగా కిరణ పటాల మూలంగా సాధించిన ప్రతిబింబ ధర్మాలను బీజగణిత పరంగా రాబట్టడానికి సహకరిస్తుంది.]
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 71

కాబట్టి υ = f(m + 1) = f(> 1 + 1) (లేదా) υ > 2f.
పుటాకార దర్పణంలో f రుణాత్మకం, υ రుణాత్మకం నిజప్రతిబింబం 2f ఆవల ఏర్పడుతుంది.

b) దర్పణ సూత్రం,
υ = \(\frac{f}{u-f}\)
కుంభాకార కటకంలో f ధనాత్మకం మరియు u రుణాత్మకం. υ ఎల్లప్పుడూ ధన ప్రతిబింబాన్ని మరియు దర్పణం వెనుక ఏర్పడుతుంది.

c) m = \(\frac{f}{u-f}\)
కుంభాకార దర్పణంలోf ధనాత్మకం, m ఎల్లప్పుడూ రుణాత్మకం మరియు ఒకటికన్నా తక్కువ.

m = \(\frac{υ-f}{f}\), m రుణాత్మకం, υ ఎల్లప్పుడూ f కన్నా తక్కువ. కాబట్టి ప్రతిబింబం ధ్రువం మరియు నాభ్యాంతరం మధ్య ఏర్పడుతుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 72

ప్రశ్న 16.
ఒక టేబుల్ తలంపై బిగించిన ఒక చిన్న నూదిని 50 cm ఎత్తు నుంచి చూడటం జరిగింది. టేబుల్ తలానికి సమాంతరంగా పట్టుకొని ఉన్న ఒక 15 cm మందపు గాజు దిమ్మె నుంచి ఆ సూదిని చూచినప్పుడు అది ఎంత ఎత్తుకు ఉత్థాన ( పైకి లేచినట్లు) మైనట్లు కనిపిస్తుంది? గాజు దిమ్మె వక్రీభవన గుణకం 1.5. సమాధానం గాజు దిమ్మె స్థానాన్ని బట్టి మారుతుందా?
సాధన:
µ = 1.5; నిజమందం. 15 cm
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 73
గుండు సూది 15-10 = 5 cm పెరిగినట్లు కనిపిస్తుంది.

ప్రశ్న 17.
a) 1.68 వక్రీభవన గుణకం కలిగిన ఒక గాజు తంతువుతో తయారుచేసిన కాంతి గొట్టం (నాళం) అడ్డుకోతను పటంలో చూపారు. గాజునాళం బాహ్య పొర 1.44 వక్రీభవన గుణకం గల పదార్థంతో చేయడమైంది. పటంలో చూపిన విధంగా నాళంలో సంపూర్ణాంతర పరావర్తనం సాధ్యం కావడానికి నాళ అక్షంతో పతన కిరణాలు ఏ కోణ వ్యాప్తిలో పతనం చెందాలి?
b) బాహ్యపొర లేదనుకుంటే సమాధానం ఏమై ఉంటుంది?
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 74
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 75
i > 59° అయితే సంపూర్ణాంతర పరావర్తనం చెందుతుంది. rగరిష్ఠం విలువ 0 to 31° వరకు ఉంటుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 76
0 < i < 60° మధ్య అన్ని పతన కిరణాలు సంపూర్ణాంతర పరావర్తనం చెందును.

b) గొట్టానికి వెలుపలి పొర లేకపోతే
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 77
C = 36.5°

ప్రశ్న 18.
క్రింది ప్రశ్నలకు సమాధానాలివ్వండి :
a) సమతల, కుంభాకార దర్పణాలు వస్తువుల మిధ్యా ప్రతిబింబాలను ఇస్తాయని మీరు నేర్చుకొని ఉన్నారు. ఏదైనా కొన్ని పరిస్థితులలో ఈ దర్పణాలు నిజ ప్రతిబింబాన్నిస్తాయా? వివరించండి.
b) ఒక మిధ్యా ప్రతిబింబాన్ని తెరపై పట్టలేమని అంటూ ఉంటాం. అయినప్పటికీ, మనం మిధ్యా ప్రతిబింబాన్ని చూచినప్పుడు మనం స్పష్టంగా దాన్ని కంటి తెరపై (అంటే రెటీనాపై పడుతున్నాం. ఇలా అనుకొన్నప్పుడు ఏదైనా విరోధాభాసం (paradox) ఉన్నదా?
c) నీటిలో ఉన్న ఒక గజ ఈతగాడు (నీటి తలానికి) వాలు కోణంతో తటాకం ఒడ్డున నిలబడి ఉన్న ఒక జాలరిని చూస్తున్నాడు. ఈతగాడికి, జాలరి అసలు పొడవుకంటె పొడవుగానా? లేదా పొట్టిగానా? ఎలా కనిపిస్తాడు?
d) వాలు కోణంతో చూచినప్పుడు తటాకం దృశ్యలోతు మారుతుందా? మారితే దృశ్య లోతు పెరుగు తుందా? లేదా తగ్గుతుందా?
e) సాధారణ గాజు వక్రీభవన గుణకం కంటె వజ్రం వక్రీభవన గుణకం ఎంతో ఎక్కువ. ఈ వాస్తవం వజ్రకారునికి ఏమైనా ఉపయోగపడుతుందా?
సాధన:
a) సమతల (లేదా) కుంభాకార దర్పణం, మిధ్యా వస్తువుకు నిజ ప్రతిబింబాన్ని ఏర్పరచును.

b) పరావర్తన (లేదా) వక్రీభవన కిరణాలు అపసరణ చెందితే, మిధ్యా ప్రతిబింబము అపసరణ కిరణాలు, తెర మీదకు అభిసరణ చెందును. కంటి యొక్క కుంభాకార కటకం నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కావున మిథ్యా ప్రతిబింబం ఏర్పడే చోట తెర ఉండనవసరం లేదు.

c) చేపలు పట్టే వ్యక్తి తల నుండి కాంతి లంబంగా నీటిపై పతనం చెందినప్పుడు ఊర్ధ్వ బిందువునుండి వచ్చినట్లు కనపడుతుంది.
AF అనునది చేపలు పట్టే వ్యక్తి ఎత్తు A నుండి కిరణాలు నీటిపై లంబంగా పడితే A1 నుండి పడినట్లుగా కనిపిస్తుంది. A1 F అనునది దృశ్య ఎత్తు. ఇది నిజ ఎత్తు కన్నా అధికం.

d) ఏటవాలుగా చూడటం తగ్గితే దృశ్య ఎత్తు తగ్గుతుంది.

e) వజ్రం వక్రీభవన గుణకం 2.42, ఇది సాధారణ గాజు కన్నా అధికం. వజ్రం సందిగ్ధ కోణం 24° కన్నా అధికం, ఇది గాజు కన్నా తక్కువ. వజ్రానికి 24° నుండి 90° పతన కోణాలు ఉంటేటట్లుగా వజ్రాన్ని కోస్తారు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు

ప్రశ్న 19.
ఒక గది గోడకు బిగించిన ఒక చిన్న విద్యుద్దీప ప్రతిబింబాన్ని 3m దూరంలో ఎదురుగా ఉన్న గోడపై ఏర్పరచటానికి ఒక పెద్ద కుంభాకార కటకాన్ని వాడవలసి ఉంది. ఈ అవసరానికై కావలసిన కటక నాభ్యాంతరం గరిష్ఠంగా ఎంత ఉండాలి?
సాధన:
υ = + υ
∴ u = -(3 – v)
fగరిష్ఠం = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 78
3υ – υ² = 3f
f గరిష్ఠ కావాలంటే d(f) = 0
d(3υ – υ²) = 0
3 – 2 υ = 0
υ = 3/2 = 1.5 m
కాబట్టి u = – (3 – 1.5)
= -1.5 m
మరియు
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 79

ప్రశ్న 20.
ఒక వస్తువు నుంచి 90 cm దూరంలో ఒక తెరను ఏర్పాటు చేశారు. ఆ వస్తువు ప్రతిబింబం తెరపై ఏర్పరచడానికి ఒక కుంభాకార కటకం 20 cm అంతరం ఉన్న వేరువేరు స్థానాల వద్ద ఉంచవలసి వస్తే కటకం నాభ్యాంతరం కనుక్కోండి.
సాధన:
a) వస్తువు మరియు ప్రతిబింబం దూరం
D = 90 cm = u + υ
కటకం యొక్క రెండు స్థానాల మధ్య దూరం (d) = 20 = u = υ
u = 55 cm మరియు υ = 35 cm.
కటక సూత్రం,
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 80

21. a) అభ్యాసం 10 లోని రెండు కటకాలను 8.0 cm దూరంలో ప్రధానాక్షాలు ఏకీభవించేట్లుగా అమర్చిన సంయోగం ‘ప్రభావాత్మక నాభ్యాంతరాన్ని’ కనుక్కోండి. కటకం సంయోగంలో సమాంతర కాంతికిరణ పుంజం ఏ పక్క నుంచి పతనమౌతుందో దానిపై సమాధానం ఆధారపడి ఉంటుందా? కటక వ్యవస్థ ప్రభావాత్మక నాభ్యాంతరం అనే భావన ఏమైనా లాభదాయకమేనా?
b) 1.5 cm పరిమాణం గల ఒక వస్తువును పై కటక వ్యవస్థలోని కుంభాకార కటకం ముందు ఉంచారు. వస్తువు, కుంభాకార కటకాల మధ్య దూరం 40 cm. ఈ రెండు కటకాల వ్యవస్థ వల్ల ఆవర్ధనం, ప్రతిబింబం పరిమాణాలను కనుక్కోండి.
సాధన:
a) ఇక్కడ f1 = 30 cm, f2 = -20 cm,
d = 8.0 cm, f= ?

i) సమాంతర కాంతి కిరణము, కుంభాకార కటకంపై పతనం చెందినది. రెండవ కటకం లేదు.
u1 = ∞ మరియు f1 = 30cm
\(\frac{1}{υ_1}-\frac{1}{u_1}=\frac{1}{f_1}\)
\(\frac{1}{υ_1}-\frac{1}{\infty}=\frac{1}{30}\)
υ1 = 30 cm
ఈ ప్రతిబింబం, రెండవ కటకానికి మిథ్యా వస్తువుగా పనిచేస్తుంది.
u2 = (30 – 8) = + 22 cm
υ2 = ?, f2 = -20 cm
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 81
υ2 = – 220 cm

రెండు కటకాల వ్యవస్థ కేంద్రంనుండి. 220 – 4 = 216 cm దూరంలో సమాంతర పతన కిరణము అభిసరణ చెందుతుంది.

ii) సమాంతర కాంతి కిరణము మొదటకు ఎడమవైపు పుటాకార కటకంపై పతనం చెందితే
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 82
ఈ ప్రతిబింబం రెండవ కటకానికి ప్రతిబింబంలాగా, పనిచేస్తుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 83
రెండు కటక వ్యవస్థల కేంద్రం నుండి 420 – 4 – 416 cm దూరంలో సమాంతర కాంతి కిరణం అపసరణ చెందుతుంది.

b) ఇక్కడ h1 = 1.5 cm, u1 = 40 cm, m = ?,.
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 84
υ1 = 120 cm
మొదటి కటకం ఆవర్ధనం
(m) = \(\frac{υ_1}{u_1}=\frac{120}{40}\) = 3
మొదటి కటకం ఏర్పరచే ప్రతిబింబం, రెండవ కటకానికి
మిధ్యా వస్తువుగా పనిచేస్తుంది.
ս1 = 120 – 8 = 112 cm, f2 = -20 cm
υ2 = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 85

ప్రశ్న 22.
60° పట్టక (వక్రీభవన కోణం కలిగి ఉన్న పట్టకం తలంపై ఎంత కోణంతో కాంతి కిరణం పతనమైతే రెండవ తలం వద్ద అది ఇంచుకంత (just) సంపూర్ణాంతర పరావర్తనం చెందుతుంది? పట్టక పదార్థ వక్రీభవన గుణకం 1.524.
సాధన:
i1 = ?, A = 60°, µ = 1.524
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 86
sin i1 = 1.524 sin 19°
= 1.524 × 0.3256
= 0.4962
i1 = 29°45′

ప్రశ్న 23.
వేరువేరు పట్టక కోణాలు గల క్రౌను, ఫ్లింట్ గాజు పట్టకాలు ఇవ్వడమైంది.
a) విక్షేపణ రహితంగా తెల్లని కాంతిపుంజాన్ని అపవర్తనం పొందడానికి,
b) అపవర్తన రహితంగా తెల్లని కాంతి పుంజాన్ని విక్షేపణ (మరియు స్థానభ్రంశం) నొందించడానికీ పట్టకాల సంయోగాలను సూచించండి.
సాధన:
i) రెండు పట్టకాలు కోణీయ విక్షేపణం సున్నా (µb – µ) A+ (µb – µ’r) A’ = 0
(µ’b, -µ’r) విలువ క్రౌన్ గాజు కన్నా ఫ్లింట్ గాజుకు అధికం.
A’ < A అనగా ఫ్లింట్ గాజుకు, క్రౌన్ గాజు కన్నా కోణం అధికం..

ii) దాదాపు విచలనం లేనప్పుడు
v – 1) A+ (µ’y – 1) A’ = 0

క్రౌన్ గాజు పట్టకాన్ని కొంత కోణం వద్ద తీసుకుంటే, ఫ్లింట్ గాజు కోణాలు పెంచుతూ షరతు చేరే వరకు చేయాలి. చివరి సంయోగంలో ఫ్లింట్ గాజు కోణాలు, కౌన్ గాజుకన్నా తక్కువ. ఫ్లింట్ గాజులో µ’b క్రౌన్ గాజులో µy, కన్నా అధికం.

AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు

ప్రశ్న 24.
లోపరహిత కంటికి (ఆరోగ్యవంతుడి కంటికి దూర బిందువు అనంతం, స్పష్ట దృష్టి సమీప బిందువు 25cm. కంటి కార్నియా అభిసారి సామర్థ్యం సుమారు 40 డయాప్టర్లు, కార్నియా వెనక కంటి కటకం కనిష్ఠ అభిసారి సామర్థ్యం సుమారు 20 డయాప్టర్లు. ఈ ఉజ్జాయింపుతో కంటి దృష్టి సర్దుబాటు వ్యాప్తిని (అంటే కంటి కటకం అభిసారి సామర్థ్యం వ్యాప్తి) లెక్కించండి.
సాధన:
అనంత దూరంలో వస్తువును చూడటానికి కన్ను కనిష్ఠ అభిసారి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
= 40 + 20 = 60D

కార్నియా నేత్ర కటకం మరియు రెటీనా మధ్య దూరం
= నేత్ర కటకం నాభ్యాంతరం \(\frac{100}{P}=\frac{100}{60}=\frac{5}{3}\)

దగ్గర వస్తువుకు
u = -25 cm, v = 5/3 cm, f = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 87
నేత్ర కటకం సామర్థ్యం = 64 – 40 = 24D
కావున నేత్ర కటకం వ్యాప్తి 20 నుండి 24 డయాప్టర్లు.

ప్రశ్న 25.
కంటి హ్రస్వ దృష్టి (myopia) లేదా కంటి దూరదృష్టి (hypermetropia) పాక్షిక దృష్టి సర్దుబాటు సామర్థ్యం కోల్పోవడాన్ని సూచిస్తాయా? అలాకాకపోతే, ఈ దృష్టి లోపాలకు కారణం ఏమై ఉండవచ్చు?
సాధన:
లేదు, ఒక వ్యక్తి సాధారణ సామర్థ్యం దీర్ఘదృష్టి (లేదా) హ్రస్వదృష్టిపై ఆధారపడును. కంటి బంతి పొడవు తక్కువైతే దీర్ఘదృష్టి ఏర్పడుతుంది.

కంటి బంతి పొడవు సాధారణంగా ఉంటే, నేత్ర కటకం సామర్థ్యం పాక్షికంగా కోల్పోతుంది. దీనిని ప్రిస్ బియోపియా అంటారు.

ప్రశ్న 26.
కంటి హ్రస్వదృష్టి గల ఒక వ్యక్తి – 1.0 దయాప్టర్ సామర్థ్యం కలిగిన కంటి అద్దాలను ఉపయోగిస్తూ ఉన్నాడు. అతడి ముసలి వయసులో + 2.0 డయాప్టర్లు వేరు చదువు కంటి అద్దాలను (reading glasses) వాడవలసి వస్తుంది. ఏమి జరిగి ఉంటుందో వివరించండి.
సాధన:
u = –25cm, v = -50cm, f = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 88

ప్రశ్న 27.
ఒక వ్యక్తి ధరించిన అడ్డు, నిలువు గీతల చొక్కాను రెండవ వ్యక్తి చూస్తున్నప్పుడు అతడు (రెండవ వ్యక్తి) నిలువు గీతలు అడ్డగీతల కంటె ఎక్కువ స్పష్టంగా కనపడ్డాయి. ఈ లోపానికి కారణం ఏమిటి? ఈ రకమైన లోపాన్ని ఎలా సరిదిద్దాలి?
సాధన:
ఈ లోపాన్ని బిందు విస్తరణ అంటారు. వేరువేరు తలాల వక్రత మరియు నేత్ర కటకం వక్రీభవనం ఒకేవిధంగా ఉండదు. లంబ తలంలో వక్రత సరిపోతుంది. క్షితిజ సమాంతర తలంలో ‘వక్రత సరిపోదు.

స్థూపాకార కటకాలను వాడి ఈ లోపాన్ని సవరించవచ్చు.

ప్రశ్న 28.
25 cm సాధారణ సమీప బిందు దూరం గల కళ్ళతో ఒక వ్యక్తి చిన్న అచ్చుగల పుస్తకాన్ని 5 cm నాభ్యాంతరం గల పలుచని కుంభాకార కటకం (ఆవర్ధన కటకం) సహాయంతో చదువుతున్నాడు.
a) ఆవర్ధన కటకంతో చదువుతున్నప్పుడు పుస్తకం పుట నుంచి కటకాన్ని ఎంత సమీపంగానూ, ఎంత దూరంగానూ ఉంచాలి?
b) పై సరళ సూక్ష్మదర్శిని గరిష్ఠ, కనిష్ట కోణీయ ఆవర్ధనం (ఆవర్ధన సామర్ధ్యం) ఎంత?
సాధన:
a) ఇక్కడ f = 5cm, u = ?
దగ్గర దూరానికి v = – 25cm
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 89

ప్రశ్న 29.
ప్రతిదీ 1 mm² వైశాల్యం కలిగిన చతురస్రాకారాలుగా విభజించిన ఒక కార్డును కంటి సమీపంలో ఉంచిన ఒక ఆవర్ధన కటకం (9am నాభ్యాంతరం గల కుంభాకార కటకం) ద్వారా (కార్డును) 9 cm దూరంలో ఉంచి చూస్తున్నారు.
a) కటకం ఆవర్ధన సామర్థ్యం ఎంత? మిధ్యా ప్రతిబింబం లోని ప్రతి చతురస్రగడి వైశాల్యం ఎంత?
b) కటకం కోణీయ ఆవర్ధన సామర్థ్యం ఎంత?
c) (a)లో ఆవర్ధనం, (b)లో ఆవర్ధన సామర్ధ్యం సమానమా? వివరించండి.
సాధన:
a) ఇక్కడ ఒక చదరపు వస్తువు వైశాల్యం = 1mm²,
u = – 9 cm, f = 10 cm
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 90
∴ ప్రతి చదరపు వస్తువు మిధ్యా ప్రతిబింబం వైశాల్యం
= (10)² × 1 = 100 mm²

b) ఆవర్ధన సామర్థ్యం = \(\frac{d}{u}\) = 25/9 = 2.8

c) లేదు (a) లో ఆవర్ధన సామర్థ్యం (b) లో ఆవర్ధన సామర్థ్యానికి సమానం కాదు. తుది ప్రతిబింబం కనిష్ఠ దృష్టి దూరంలో ఏర్పడును.

ప్రశ్న 30.
a) అభ్యాసం 29 లో సాధ్యమైన గరిష్ట ఆవర్ధన సామర్థ్యంతో చతురస్రాలను చూడటానికై పటం నుంచి కటకాన్ని ఎంత దూరంలో ఉంచాలి?
b) ఈ సందర్భంలో ఆవర్ధనం ఎంత?
c) ఈ విషయంలో ఆవర్ధనం, ఆవర్ధన సామర్థ్యానికి సమానమా? వివరించండి.
సాధన:
i) ఇక్కడ υ = -25 cm, f = 10 cm, u = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 91
ఈ సందర్భంలో ఆవర్ధనం మరియు ఆవర్ధన సామర్థ్యంసమానం.

ప్రశ్న 31.
అభ్యాసం 30 లో పటం మిధ్యా ప్రతిబింబంలోని ప్రతి చదరం 6.25 mm3 వైశాల్యం కలిగి ఉండాంటే వస్తువు, -ఆవర్ధన కటకాల మధ్య దూరం ఎంత ఉండాలి? కళ్ళకు అత్యంత సమీపంలో ఆవర్ధకాన్ని ఉంచి చతురస్రాలను స్పష్టంగా చూడగలవా?
గమనిక : 29 నుంచి 31 వరకు ఉన్న అభ్యాసాలు ఒక దృక్ సాధనం పరమ పరిమాణంలో ఆవర్ధనం, కోణీయ ఆవర్ధనం (ఆవర్ధన సామర్థ్యం) ల మధ్య భేదాన్ని స్పష్టంగా అర్ధం చేసుకోవడానికి సహకరిస్తాయి.]
సాధన:
ఆవర్ధన వైశాల్యం = 6.25
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 92
మిధ్యా ప్రతిబింబం 15 cm వద్ద ఏర్పడుతుంది. కావున ప్రతిబింబం కనిపించదు..

ప్రశ్న 32.
క్రింది ప్రశ్నలకు సమాధానాలివ్వండి.
a) కంటి వద్ద ఒక వస్తువు ఏర్పరచే కోణం, ఆవర్ధకం వల్ల ఏర్పడిన మిధ్యా ప్రతిబింబం కంటి వద్ద ఏర్పరచే కోణానికి సమానం. అప్పుడు ఏ అర్థంలో ఆనర్ధకం కోణీయ ఆవర్ధన సామర్థ్యాన్ని ఇస్తుంది?
b) ఆవర్ధకం ద్వారా చూస్తున్నప్పుడు ఒకడు తన కంటిని కటకానికి అత్యంత సమీపంలో ఉంచుతాడు. కంటిని వెనక్కు జరపడం వల్ల కోణీయ ఆవర్ధన సామర్థ్యం మారుతుందా?
c) ఒక సరళ సూక్ష్మదర్శిని ఆవర్ధన సామర్థ్యం కటక నాభ్యాంతరానికి విలోమానుపాతంలో ఉంటుంది. అయితే తక్కువలో తక్కువ నాభ్యాంతరం గల కుంభాకార కటకాన్ని ఉపయోగించి ఎక్కువలో ఎక్కువ ఆవర్ధన సామర్ధ్యాన్ని సాధించడానికి ఏది అడ్డంకిగా ఉంటుంది?
d) ఒక సంయుక్త సూక్ష్మదర్శినిలో వస్తుకటకం, అక్షికటకం రెండూ తక్కువ నాభ్యాంతరాలు తప్పక కలిగి ఉండాలి. ఎందుకు?
e) ఒక సంయుక్త సూక్ష్మదర్శిని ద్వారా చూసేటప్పుడు ఉత్తమ వీక్షణానికి మన కంటిని అక్షికటకానికి అనుకొనేట్లుగా కాకుండా కొంత ఎడంగా ఉంచాల్సి ఉంటుంది. ఎందుకు? ఆ దూరం ఎంత ఉండాలి?
సాధన:
a) ఇది నిజం. ప్రతిబింబ కోణీయ పరిమాణం, వస్తువు యొక్క కోణీయ పరిమాణంకు సమానం. ఆవర్ధన.. గాజును ఉపయోగించి వస్తువును కంటికి దగ్గరగా జరపవచ్చు. దగ్గర వస్తువుకు 25 cm దగ్గర వస్తువు కన్నా అధిక కోణీయ పరిమాణం ఉంటుంది.

b) అవును. కోణీయ ఆవర్ధనం మారితే కన్ను వెనక్కి జరుగుతుంది. కంటి వద్ద చేయు కోణం, కటకం వద్ద చేయు కోణం కన్నా స్వల్పంగా తక్కువ. ప్రతిబింబం బాగా దూరంగా ఉన్నప్పుడు ఈ ప్రభావాన్ని విస్మరించవచ్చు,

c) ఇది నిజం. నాభ్యంతరం తగ్గితే గోళీయ మరియు వర్ణ విపధనాలు రెండూ పెరుగుతాయి. తరువాత తక్కువ నాభ్యంతరం గల కటకాలను తయారు చేయడం కష్టతరం.

d) అర్లీ కటకంయొక్క కోణీయ అవర్ధనం (1 + \(\frac{d}{f_e}\)).
ఇది పెరిగితే f తగ్గుతుంది. వస్తుకటకానికి, వస్తువు దగ్గరగా ఉంటే u = f0 ఆవర్ధనం పెంచాలంటే \(\frac{υ}{f_0}\) లో f0 తక్కువగా ఉండాలి.

e) అక్షి కటకంలో వస్తువుయొక్క ప్రతిబింబంను నేత్ర రింగ్ అంటారు. వస్తువునుండి వక్రీభవనం చెందిన కిరణాలు ఈ రింగ్ గుండా వెళతాయి. మనం కంటిలో ఏ వస్తువునైనా ఆదర్శంగా చూడాలంటే నేత్ర రింగ్ ద్వారా మాత్రమే చూడాలి.

కన్ను, అక్షి కటకానికి బాగా దగ్గరగా ఉంటే దృక్ క్షేత్రం క్షీణిస్తుంది. నేత్ర రింగ్ యొక్క స్థానము వస్తు కటకం మరియు అక్షికటకం మధ్య దూరంపై ఆధారపడుతుంది. అక్షికటకం నాభ్యంతరంపై ఆధారపడుతుంది.

ప్రశ్న 33.
1.25cm నాభ్యాంతరంగల ఒక వస్తుకటకం, 5 cm నాభ్యాంతరం గల కంటి కటకాలను ఉపయోగించి కావలసిన 30X కోణీయ ఆవర్ధన సామర్థ్యాన్ని పొందడానికి సంయుక్త సూక్ష్మదర్శినిని ఎలా కూర్చాలి?
సాధన:
సహజ సర్దుబాటులో ప్రతిబింబం స్పష్ట దృష్టికి కనిష్ఠ
దూరం 25 cm
అక్షి కటకంయొక్క కోణీయ ఆవర్ధనం
= (1 + \(\frac{d}{f_e}\)) = (1 + \(\frac{25}{5}\)) = 6
మొత్తం ఆవర్ధనం = 30
వస్తు కటకం ఆవర్ధనం m = \(\frac{30}{6}\) = 5
m = \(\frac{υ_0}{u_0}\) = 5 (లేదా) υ0 = -5u0

AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 93
వస్తువును వస్తు కటకానికి ముందర 1.5cm దూరంలో ఉంచాలి.
υ0 = -5u0
υ0 = -5(-1.5) = 7.5cm
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 94
వస్తు కటకం మరియు నేత్ర కటకం మధ్య దూరం
= |ue| + |v0|
= 4.17 + 7.5.
= 11.67 cm

ప్రశ్న 34.
ఒక చిన్న దూరదర్శిని 140 cm నాభ్యాంతరం గల వస్తుకటకం, 5.0 cm నాభ్యాంతరం గల అక్షికటకాలను కలిగి ఉన్నది. దూరంగా ఉన్న వస్తువును చూసేటప్పుడు
a) సహజ సర్దుబాటులో (తుది ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడినప్పుడు)
b) తుది ప్రతిబింబం స్పష్ట దృష్టి కనిష్ట దూరంలో (25 cm) ఏర్పడినప్పుడు? ఆవర్ధన సామర్థ్యం ఎంత?
సాధన:
ఇక్కడ f0 = 140 cm, fe = 5.0 cm
ఆవర్ధన సామర్థ్యం = ?

a) సహజ సర్దుబాటులో ఆవర్ధన సామర్థ్యం
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 95

ప్రశ్న 35.
a) అభ్యాసం 2.34 a) లో వర్ణించిన దూరదర్శినికై వస్తుకటకం, అక్షికటకాల మధ్య దూరం ఎంత?
b) 3 km దూరంలో ఉన్న 100 m ఎత్తైన స్తంభాన్ని చూస్తున్నప్పుడు వస్తుకటకం వల్ల ఏర్పడ్డ స్తంభం ప్రతిబింబం ఎత్తు ఎంత ఉంటుంది?
c) 25 cm దూరంలో ఏర్పడ్డ స్తంభ తుది ప్రతిబింబం ఎత్తు ఎంత ఉంటుంది?
సాధన:
a) సహజ సర్దుబాటులో వస్తుకటకం, నేత్రకటకం మధ్య దూరం
= f0 + fe = 140 + 5 = 145 cm

b) 3km వద్ద 100m పొడవైన గోపురం ఏర్పరచే కోణం
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 96

c) అక్షికటకం యొక్క ఆవర్ధనం
= (1 + \(\frac{d}{f_e}\)) = 1 + \(\frac{25}{5}\) = 6
∴ తుది ప్రతిబింబం ఎత్తు = 4.7 × 6 = 28.2cm

ప్రశ్న 36.
పటం 2.33 లోని ఒక కాసెగ్రెన్ దూరదర్శినిలో రెండు దర్పణాలను ఉపయోగించారు. ఆ దూరదర్శినిలో దర్పణాల మధ్య దూరం 20 mm, పెద్ద దర్పణం వక్రతా వ్యాసార్ధం 220 mm, చిన్న దర్పణం వక్రతా వ్యాసార్ధం 140 mm, అయితే అనంత దూరంలో ఉన్న వస్తువు తుది ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది
సాధన:
వస్తు దర్పణం వక్రతా వ్యాసార్ధం (R1) = 220 mm
గౌణ దర్పణం వక్రతా వ్యాసార్ధం (R2) = 140mm
f2 = \(\frac{R_2}{2}=\frac{140}{2}\) = 70mm
రెండు దర్పణాల మధ్య దూరం d = 20 mm.
వస్తువు అనంత దూరంలో ఉంటే, కాంతి కిరణాలు వస్తు దర్పణంపై పతనం చెంది పరావర్తనం చెందును
f1 = \(\frac{R_1}{2}=\frac{220}{2}\) = 110mm
వస్తు దర్పణం నుండి 20mm దూరంలో ఉన్న గౌరీ దర్పణంపై పడిదా
u = f1 – d = 110 – 20 – 90mm
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 97
రెండవ దర్పణంకు కుడివైపు

ప్రశ్న 37.
ఒక గాల్వనా మీటరు తీగచుట్టకు సంధానం చేసిన ఒక సమతల దర్పణంపై లంబంగా పతనమైన కాంతికిరణం, పటంలో చూపినట్లు, వెనకకు మరలి అదే మార్గంలో ప్రయాణిస్తుంది. తీగచుట్టలోని ఒక విద్యుత్ ప్రవాహం 3.5° అపవర్తనాన్ని దర్పణానికి కలుగచేస్తుంది. 1.5 m దూరంలో అమర్చిన తెరపై పరావర్తనం చెందిన కాంతి వల్ల ఏర్పడిన బిందువు స్థానభ్రంశం ఎంత?
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 98
సాధన:
ఇక్కడ θ = 3.5°
x = 1.5 m, d = ?
దర్పణం θ కోణం తిరిగితే పరావర్తన కిరణాలు రెట్టింపు కోణం తిరుగును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 99
≈ 1.5(2θ)
= 1.5 × \(\frac{7 \pi}{180}\)m = 0.18m

AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు

ప్రశ్న 38.
ఒక సమతల దర్పణంపై ఉన్న ఒక ద్రవ పొరతో స్పర్శలో ఉన్న ఒక సమద్వికుంభాకార కటకాన్ని (వక్రీభవన గుణకం 1.50) పటంలో చూపారు. కటక ప్రధానాక్షంపై ఉన్న ఒక చిన్న సూదిని దాని తలక్రిందులైన ప్రతిబింబ సరిగ్గా సూదిస్థానంలో ఏర్పడేట్లుగా సర్దుబాటు చేసి అమర్చారు. సూది కటకం నుంచి 45.0 cm దూరంలో ఉన్నట్లు లెక్కించారు. తరవాత ద్రవపొరను తొలగించి మళ్లీ ప్రయోగాన్ని చేశారు. ఇప్పుడు ప్రతిబింబ దూరం 30cm గా కనుగొన్నారు. ద్రవం వక్రీభవన గుణకం ఎంత?
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 100
సాధన:
కుంభాకార కటకం నాభ్యాంతరం f1 = 30
సమతల పుటాకార కటకం ద్వారా నాభ్యాంతరం = f2
సంయోగ నాభ్యాంతరం F = 45.0 cm
\(\frac{1}{f_1}+\frac{1}{f_2}=\frac{1}{F}\)
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 101
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 102

సాధించిన సమస్యలు Textual Examples

ప్రశ్న 1.
పటంలోని పుటాకార దర్పణం యొక్క పరావర్తన తలాన్ని సగం వరకూ ఒక అపారదర్శక (అపరావర్తక-non- reflective) పదార్థంతో కప్పారు అనుకోండి. అప్పుడు దర్పణం ఎదురుగా ఉంచిన వస్తువు ప్రతిబింబంపై ఎటువంటి ప్రభావం ఉంటుంది?
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 103
సాధన:
వస్తువు సగభాగమే ప్రతిబింబంలో కనిపిస్తుందని మీరు అనుకోవచ్చు. కాని మిగిలిన (కప్పబడని) దర్పణం సగభాగంపై ఉన్న అన్ని బిందువులకూ పరావర్తన సూత్రాలు వర్తిస్తాయి. వస్తువు మొత్తంగా ప్రతిబింబంలో కనబడుతుంది. అయితే దర్పణం పరావర్తన తలం వైశాల్యం తగ్గడం వల్ల ప్రతిబింబం తీవ్రత తక్కువగా (ఈ సందర్భంలో సగమే) ఉంటుంది.

ప్రశ్న 2.
ఒక చరవాణి (mobile phone) ని ఒక పుటాకార దర్పణ ప్రధానాక్షం వెంబడి, పటంలో చూపినట్లు ఉంచారు. తగిన పట సహాయంతో దాని ప్రతిబింబం ఏర్పడటాన్ని చూపండి. ఆవర్ధనం ఎందువల్ల ఏకరీతిగా ఉండదో వివరించండి. ప్రతిబింబ విరూపణ దర్పణం పరంగా చరవాణి స్థానంపై ఆధారపడుతుందా?
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 104
సాధన:
చరవాణి ప్రతిబింబం ఏర్పడటాన్ని పటంలోని కిరణ పటం చూపుతున్నది. ప్రధానాక్షానికి లంబంగా ఉన్న తలంలోని భాగపు ప్రతిబింబం అదే తలంలో ఉంటుంది. అది ఒకే పరిమాణంలో ఉంటుంది. అంటే BC : BC. మీరు స్వయంగా ప్రతిబింబం ఎందుకు విరూపిత మయ్యిందో అవగతం చేసుకొంటారు.

ప్రశ్న 3.
15cm వక్రతా వ్యాసార్థంగల ఒక పుటాకార దర్పణం ఎదురుగా (i) 10 cm, (ii) 5 cm దూరంలో ఒక వస్తువును ఉంచారు. ప్రతి సందర్భంలోనూ ప్రతిబింబ స్థానం, స్వభావం, ఆవర్ధనాలను కనుక్కోండి.
సాధన:
నాభ్యాంతరం f = – 15/2 cm = – 75 cm

i) వస్తు దూరం u = – 10 cm.
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 105
వస్తువు ఉన్నవైపే ప్రతిబింబం దర్పణం నుంచి 30cm దూరంలో ఉంటుంది.
ఆవర్ధనం m = – \(\frac{v}{u}=-\frac{(-30)}{(-10)}\) = – 3
ప్రతిబింబం ఆవర్ధనం చెంది ఉంటుంది, నిజ ప్రతిబింబం తలక్రిందులుగా ఉంటుంది.

ii) వస్తు దూరం u = -5 cm.
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 106
ప్రతిబింబం దర్పణం వెనుక15cm దూరంలో ఏర్పడు తుంది . ఇది మిధ్యా ప్రతిబింబం.
ఆవర్ధనం m = \(-\frac{υ}{u}=-\frac{15}{(-5)}\) = 3
ప్రతిబింబం ఆవర్ధనం చెంది ఉంటుంది. మిథ్యా ప్రతిబింబం, నిటారుగా ఉంటుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు

ప్రశ్న 4.
రోడ్డు పక్కగా నిలిపి ఉన్న కారులో కూర్చొని ఉండగా మీరు R = 2 m పార్శ్వ దృశ్య దర్పణం (side view mirror) లో మందగమనంతో పరుగెత్తుతున్న వ్యక్తి (running jogger) ని చూస్తున్నారు అనుకోండి. అతడు 5ms-1 వడితో పరుగెత్తుతున్నాడనుకొంటే (a) 39m, (b) 29m, (c) 19 m, (d) 9 m దూరంలో ఉంటే అతని ప్రతిబింబం ఎంత వడితో కదిలినట్లు కనపడుతుంది?
సాధన:
దర్పణ సమీకరణం నుంచి v = \(\frac{fu}{u-f}\)
కుంభాకార దర్పణం (పార్శ్వ దృశ్య దర్పణం)
R = 2 m కాబట్టి, f = 1 m. అప్పుడు
u = -39 m కి, v = \(\frac{(39) \times 1}{-39-1}=\frac{39}{40}\)m

పరుగెత్తే వ్యక్తి 5 ms-1 స్థిర వడితో కదులుతుండటం వల్ల, 1s తరవాత ప్రతిబింబ స్థానం υ
(u = – 39 + 5 =- 34) 34/35 m.

ప్రతిబింబ స్థానంలో మార్పు, 1 s లో,
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 107

అందువల్ల, పరుగెత్తే వ్యక్తి దర్పణం నుంచి 39 m, 34m మధ్య ఉన్నప్పుడు ప్రతిబింబ సగటు వడి (1/280) ms-1.
ఇదే విధంగా U = – 29 m లకు, -19 m, 9 m లకు, ప్రతిబింబ దృశ్య వడి వరసగా
\(\frac{1}{150}\)ms-1, \(\frac{1}{60}\)ms-1, \(\frac{1}{10}\)ms-1

పరుగెత్తే వ్యక్తి ఒక స్థిర వడితో గమనంలో ఉన్నా అతని/ ఆమె ప్రతిబింబ దృశ్య వడి, అతడు/ఆమె దర్పణానికి దగ్గరవుతున్నకొద్దీ గణనీయంగా పెరుగుతున్నట్ల నిపిస్తుంది. ఇదే దృగ్విషయాన్ని నిశ్చల కారు లేదా బస్సులో కూర్చొన్న ఏ వ్యక్తి అయినా గమనించగలడు. గమనంలో ఉన్న వాహనానికి సంబంధించి-ఇదే విధమైన దృగ్విషయాన్ని దాని వెనకగా (పృష్ఠ భాగంలో) స్థిర వడితో సమీపించే వాహనం విషయంలో కూడా గమనించవచ్చు.

ప్రశ్న 5.
తన అక్షం చుట్టూ భూమి ఒకసారి భ్రమణం చేయడానికి 24 గంటలు తీసుకొంటుంది. భూమి నుంచి చూచి నప్పుడు 1° విస్థాపనం చెందడానికి సూర్యునికి ఎంత సమయం పడుతుంది?
సాధన:
360 విస్థాపనం చెందడానికి పట్టే సమయం =24గం||
1° విస్థాపనం చెందడానికి పట్టే సమయం
= 24/360గం|| = 4 ని||.

ప్రశ్న 6.
గాలిలో ఉన్న ఒక బిందు జనకం నుంచి కాంతి ఒక గోళాకార గాజు తలం (n = 1.5 వక్రతా వ్యాసార్ధం R = 20 cm) పై పతనమౌతున్నది. గాజుతలం నుంచి కాంతి జనకం 100 cm దూరంలో ఉన్నది. ప్రతిబింబ ఏ స్థానం వద్ద ఏర్పడుతుంది?
సాధన:
సమీకరణంలోని సంబంధాన్ని ఉపయోగిద్దాం. ఇక్కడ
u = – 100 cm, υ = ?. R = + 20 cm, n1 = 1,
మరియు n1 = 1.5.
అప్పుడు
\(\frac{1.5}{υ}+\frac{1}{100}=\frac{0.5}{20}\) లేదా υ = + 100 cm
కాంతి పతనమయ్యే దిశలో గాజుతలం నుంచి 100 cm దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది.

ప్రశ్న 7.
ఒక మాంత్రికుడు (గారడీ చేసేవాడు) తన ప్రదర్శనలో n = 1.47 గల ఒక గాజు కటకాన్ని తొట్టెలో ఉంచి ఒక ద్రవాన్ని దానిలో నింపి కటకం అదృశ్యయ్యేట్లు చేశాడు. ద్రవం వక్రీభవన గుణకం ఎంత? ఆ ద్రవం నీరేనా?
సాధన:
కటకం అదృశ్యమయ్యేట్లు చేయడానికి ద్రవ వక్రీభవన గుణకం 1.47 తప్పక అయ్యి తీరాలి. అంటే n1 = n2. అప్పుడు 1/f = 0 లేదా f → ∞ అవుతుంది. అంటే ద్రవంలోని కటకం సమతల గాజు పలకగా ప్రవర్తిస్తుంది. ద్రవం నీరు కాజాలదు. ఆ ద్రవం గ్లిసరిన్ కావచ్చు.

ప్రశ్న 8.
(i) ఒక గాజు కటకం f – 0.5 m అయితే దాని సామర్ధ్యం ఎంత? (ii) ఒక ద్వికుంభాకార కటక వక్రతా వ్యాసార్థాలు 10 cm, 15cm, కటక నాభ్యాంతరం 12 cm. ఆ కటక పదార్థ వక్రీభవన గుణకం ఎంత ? (iii) గాలిలో ఒక కుంభాకార కటక నాభ్యాంతరం 20. దా నాంతరం నీటిలో ఎంత? (గాలి-నీరు వక్రీభవన గుణకు 1.33,గాలి-గాజు వక్రీభవన గుణకం15.)
సాధన:
i) సామర్థ్యం = + 2 డయాప్టర్

ii) f = + 12 cm,
R1 = + 10 cm, R2 = -15 cm.
గాలి వక్రీభవన గుణకాన్ని 1 గా తీసుకొంటారు. కటక ఫార్ములా సమీకరణంని ఉపయోగిస్తాం. f, R1, R2 లకు సంజ్ఞా సంప్రదాయాన్ని వర్తింపచేయాలి. విలువలను ప్రతిక్షేపిస్తే,
\(\frac{1}{12}\) = (n – 1) (\(\frac{1}{10}\) – \(\frac{1}{-15}\))
దీని నుంచి n = 1.5.

iii) గాలిలోని గాజు కటకానికి n2 = 1.5, n1 = 1, f = + 20cm. కాబట్టి, కటకకారుని సమీకరణం
నుంచి \(\frac{1}{20}\) = 0.5(\(\frac{1}{R_1}-\frac{1}{R_2}\))
ఇదే కటకం నీటిలో ఉంటే
n2 = 1.5, n1 = 1.33. కాబట్టి,
\(\frac{1.33}{f}\) = (1.5 – 1.33)(\(\frac{1}{R_1}-\frac{1}{R_2}\))
పై రెండు సమీకరణాల నుంచి మనకు f = + 78.2 cm వస్తుంది.

ప్రశ్న 9.
ఇచ్చిన కటకాల సంయోగంవల్ల ఏర్పడిన ప్రతిబింబ స్థానాన్ని కనుక్కోండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 108
సాధన:
మొదటి కటకం వల్ల ఏర్పడిన ప్రతిబింబానికి
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 109
మొదటి కటకం ఏర్పరచిన ప్రతిబింబం రెండవ దానికి వస్తువవుతుంది. ఈ ప్రతిబింబం రెండవ కటకానికి కుడివైపున (15 – 5) cm = 10 cm దూరంలో ఉంటుంది. ఈ ప్రతిబింబం నిజ ప్రతిబింబమైనా, ఇది రెండవ కటకానికి మిధ్యా వస్తువు అవుతుంది. అంటే కాంతి కిరణాలు ఈ ప్రతిబింబం నుంచి రెండవ కటకం వైపు వస్తున్నట్లుగా అనిపిస్తుంది.
\(\frac{1}{υ_2}-\frac{1}{10}=\frac{1}{-10}\) లేదా υ2 = ∞

మిధ్యా ప్రతిబింబం రెండవ కటకం ఎడమవైపు అనంత దూరంలో ఏర్పడుతుంది. ఈ ప్రతిబింబం మూడవ కటకానికి వస్తువవుతుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 110

తుది ప్రతిబింబం మూడవ కటకానికి కుడివైపు 30cm వద్ద ఏర్పడుతుంది.

ప్రశ్న 10.
ఒక వ్యక్తికి అతను స్పష్టంగా చూడగలిగిన కనీస దూరం 50 cm అయితే అతడు చదవడానికి ఉపయోగించే కంటి అద్దాలకు నాభ్యాంతరం ఎంత ఉండాలి?
సాధన:
ఆరోగ్యవంతుడి (దృష్టి లోపం లేని) వ్యక్తికి స్పష్ట దృష్టి కనిష్ట దూరం 25cm. అందువల్ల u = -25 cm దూరంలో ఒక పుస్తకం ఉన్నట్లయితే, ప్రతిబింబం υ = – 50 cm వద్ద ఏర్పడుతుంది. కాబట్టి కంటి అద్దాలకు అవసరమైన నాభ్యాంతరం
AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు 111
(కుంభాకార కటకాలను ఉపయోగించాలి).

ప్రశ్న 11.
a) హ్రస్వ దృష్టిగల ఒక వ్యక్తికి కంటి ముందువైపు దూరబిందువు 80 cm. చాలా దూరంలో ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలగడానికి ఎంత సామర్థ్యం ఉన్న కటకాన్ని అతడు వాడవలసి ఉంటుంది?
b) పైన ప్రస్తావించిన వ్యక్తి విషయంలో ఏవిధంగా సవరణ చేయగలిగిన కటకాలు సహాయం చేస్తాయి? కటకం దూరంగా ఉన్న వస్తువుల ప్రతిబింబాలను ఆవర్ధనం చెందించగలవా? శ్రద్ధగా వివరించండి.
c) ఒక పుస్తకాన్ని చదివే సమయంలో పై వ్యక్తి కంటి అద్దాలను తీసివేయాలిన కోరుకుంటాడు. ఎందుకో వివరించండి?
సాధన:
a) ఇంతకుముందు ఉదాహరణలో లాగానే సాధిస్తే – 80 cm కు సమానమయ్యే నాభ్యాంతరం కలిగిన పుటాకార కటకాన్ని అతడు ఉపయోగించాలని మనకు తెలుస్తుంది. అంటే డాని సామర్థ్యం – 1.25 డయాస్టర్లు ఉండాలి.

b) లేదు. నిజానికి ఒక పుటాకార కటకం వస్తువు కంటె తక్కువ పరిమాణం కలిగిన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కాని దూరవస్తువు కంటి వద్ద చేసే కోణం, దూర బిందువు వద్ద ఏర్పడిన ప్రతిబింబం కంటి వద్ద చేసే కోణం సమానంగా ఉంటాయి. దృష్టి లోప సవరణకు ఉపయోగించిన కటకం ఏర్పరచిన ప్రతిబింబాన్ని ఆవర్ధనం చెందించడం వల్ల కాకుండా ఆ కటకం దూర బిందువు వద్ద ఏర్పరచిన వస్తువు యొక్క మిధ్యా ప్రతిబింబాన్ని కంటికటకం రెటీనాపై కేంద్రీకరింపచేయడం వల్ల వస్తువును కన్ను చూడగలుగుతుంది.

c) హ్రస్వదృష్టిగల వ్యక్తికి సమీప బిందువు దూరం 25 cm (లేదా అంతకు తక్కువ) ఉండవచ్చు. కంటి అద్దాలు వాడి ఒక పుస్తకాన్ని చదవడానికి ఉపయో గించాల్సిన పుటాకార కటకం 25cm కు తక్కువ కాని దూరంలో ఏర్పరచే ప్రతిబింబాన్ని చూడటానికి పుస్తకాన్ని 25 cm కంటే ఎక్కువ దూరంలో ఉంచాల్సి వస్తుంది. అధిక దూరంలోని పుస్తకం (లేదా దాని ప్రతిబింబం) కోణీయ పరిమాణం, 25 cm దూరంలో ఉంచిన పుస్తకం కోణీయ పరిమాణం కంటే తక్కువగా ఉంటుంది. అందువల్ల కంటి అద్దాల అవసరం ఉండదు. అకారణంగా వ్యక్తి పుస్తకాన్ని చదవడానికై కంటి అద్దాలను తీసివేయడాన్ని కోరుకొంటాడు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 2 కిరణ దృశాశాస్త్రం, దృగ్ సాధనాలు

ప్రశ్న 12.
a) దూరదృష్టి లోపం కలిగిన వ్యక్తి కంటి నుంచి సమీప బిందువు 75 cm కంటికి 25 cm దూరంలో పట్టుకొన్న పుస్తకాన్ని స్పష్టంగా చూసి చదవడానికి వ్యక్తికి అవసరమైన కటక సామర్థ్యం ఎంత?
b) సవరణచేసే కటకం వ్యక్తికి ఏవిధంగా సహాయ పడుతుంది? కటకం కంటికి దగ్గరగా ఉన్న వస్తువులను ఆవర్ధనం చేస్తుందా?
c) పైన పేర్కొన్న వ్యక్తి ఆకాశంలోకి చూసేటప్పుడు కంటి అద్దాలను తీసివేయాలని కోరుకొంటాడు. ఎందుకో వివరించండి.
సాధన:
a) u = – 25 cm, υ = – 75 cm
1/f = 1/25 – 1/75, ie., f – 37.5cm.
దృష్టి సవరణచేసే కటకానికి అభిసారి సామర్థ్యం +2.67 డయాప్టర్లు.

b) 25amదూరంలో ఉన్న వస్తువు మిధ్యా ప్రతిబింబాన్ని (75cm వద్ద) దృష్టి సవరణ చేసి కటకం ఏర్పరుస్తుంది. ప్రతిబింబ కోణీయ పరిమాణం, వస్తు కోణీయ పరిమాణానికి సమానంగా ఉంటుంది. ఈ అర్థంలో కటకం ప్రతిబింబాన్ని ఆవర్ధనం చెందించకుండా వస్తువును లోపం ఉన్న కంటి సమీప బిందువు వద్ద ఉండేట్లు చేస్తుంది. కంటికటకం దాని ప్రతిబింబాన్ని రెటీనాపై ఏర్పరుస్తుంది. ఏమైనప్పటికీ కంటి అద్దాలు ధరించినప్పుడు సమీప బిందువు (75 cm) వద్ద ఉన్న వస్తువు కోణీయ పరిమాణం కంటె 25 cm వద్ద ఉన్న అదే వస్తువు కోణీయ పరిమాణం ఎక్కువగా ఉంటుంది.

c) దూరదృష్టిలోపం ఉన్న కన్ను సాధారణ దూరబిందువును అంటే అనంత దూరం నుంచి సమాంతరంగా వచ్చే కిరణాలను కుదించుకుపోయి (shortened) కనుగుడ్డు రెటీనాపై కేంద్రీకరింప చేయడానికి చాలినంత అభిసారి సామర్థ్యం కలిగి ఉండవచ్చు. అభిసారి కటకాలు ఉన్న కంటి అద్దాలను (సమీప వస్తువులను చూడటానికై) ఉపయోగించినప్పుడు కంటి అభిసారి సామర్థ్యం సమాంతర కిరణాలకు కావలసిన దానికంటే ఎక్కువ అవుతుంది. అందువల్ల దూరదృష్టిలోపం ఉన్న వ్యక్తి దూరంగా ఉండే వస్తువులను చూసేటప్పుడు కంటి అద్దాలను ఉపయోగించడాన్ని కోరుకోడు.

AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 12th Lesson ప్రభుత్వం Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 12th Lesson ప్రభుత్వం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పార్లమెంటరీ ప్రభుత్వం అంటే ఏమిటో తెలిపి, దాని లక్షణాలను వివరించండి.
జవాబు:
పరిచయం: ఏ ప్రభుత్వ వ్యవస్థలో కార్యనిర్వాహక వర్గం శాసనసభ నుండి ఎన్నుకోబడి శాసనసభ యొక్క విశ్వాసాన్ని కలిగి ఉన్నంతకాలం అధికారంలో కొనసాగుతుందో ఆ ప్రభుత్వ వ్యవస్థనే ‘పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ’ అని అంటారు. ఈ పార్లమెంటరీ ప్రభుత్వానికి పుట్టినిల్లుగా ‘బ్రిటన్ ‘ ను పేర్కొనవచ్చు.

నిర్వచనం: ప్రొఫెసర్ గార్నర్ పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ఈ విధంగా నిర్వచించారు. “పార్లమెంటరీ ప్రభుత్వమంటే నిజమైన కార్యవర్గం, మంత్రిమండలి లేదా మంత్రివర్గం 1) తక్షణం, చట్టబద్ధంగా తన రాజకీయ విధానాలు, చర్యలకు శాసనసభకు 2) అంతిమంగా నియోజకులకు బాధ్యత వహించే వ్యవస్థతో కూడినది”.

పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాలు: పార్లమెంటరీ ప్రభుత్వం ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంది. అవి:
1) నామమాత్రమైన, వాస్తవ కార్యనిర్వాహక అధిపతులు: పార్లమెంటరీ ప్రభుత్వంలో రెండు రకాల కార్యనిర్వాహక అధిపతులు ఉంటారు. వీరిలో నామమాత్రపు వాస్తవ కార్యనిర్వహణ అధిపతులు ఉంటారు. నామమాత్రపు కార్యనిర్వహణ అధిపతికి చక్కటి ఉదాహరణ ‘బ్రిటిష్ రాణి’, జపాన్ చక్రవర్తి, భారత రాష్ట్రపతి. వాస్తవానికి ఈ దేశాలలో కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి చేతిలో ఉంటాయి. అందువల్ల ఈ తరహా ప్రభుత్వంలో నామమాత్రపు కార్యనిర్వాహక శాఖ పేరుకు మాత్రమే ఉనికిలో ఉంటుంది. దీనికి భిన్నంగా ఈ విధానంలో ఒక వ్యక్తి గాని, కొద్దిమంది వ్యక్తుల బృందం గానీ నిజమైన కార్యనిర్వాహకవర్గంగా ఉంటుంది. కార్యవర్గం ఆచరణలో అన్ని కార్యనిర్వాహక అధికారాలను చలాయిస్తుంది.

2) సమిష్టి బాధ్యత: సమిష్టి బాధ్యత అనేది పార్లమెంటరీ ప్రభుత్వ మౌళిక లక్షణం. మంత్రులందరూ శాసననిర్మాణ శాఖలోని దిగువ సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తారు. ప్రధానమంత్రి నాయకత్వాన మంత్రులు అందరూ సమిష్టిగా విధాన నిర్ణయాలను తీసుకొంటారు. శాసనశాఖలోని దిగువసభ విశ్వాసాన్ని కోల్పోయినపుడు మంత్రిమండలి తన బాధ్యతల నుంచి విరమించుకొంటుంది. కేబినెట్ సమావేశంలో ఏ మంత్రి అయినా తన అసమ్మతిని తెలియజేయవచ్చు. కాని అంతిమంగా కేబినేట్ నిర్ణయాన్ని మాత్రం అంగీకరించాల్సిందే. సదరు మంత్రి వ్యక్తిగతంగా, సమిష్టిగా తన శాఖకు సంబంధించి తీసుకొనే అన్ని నిర్ణయాలకు బాధ్యత వహించవలసి ఉంటుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం

3) రాజకీయ సజాతీయత: పార్లమెంటరీ ప్రభుత్వపు సర్వశ్రేష్ఠ ముఖ్య లక్షణం రాజకీయ సజాతీయత. పార్లమెంటరీ ప్రభుత్వంలో మంత్రులందరూ సాధారణంగా ఒకే పార్టీకి చెందినవారై ఉంటారు. కొన్ని సందర్భాలలో ఎప్పుడైతే ఒక రాజకీయపార్టీకి మెజారిటీ లేక ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సంపూర్ణ మెజారిటీ సీట్లు దిగువ సభలో లేనట్లయితే, అటువంటి సందర్భాలలో ఇతర పార్టీల మద్దతును కూడగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారు. ఉదా: ఐక్య ప్రగతి కూటమి (UPA – United Progressive Alliance) లేదా జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA – National Democratic Alliance) వంటివి సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పర్చాయి. ఇటువంటి సందర్భాలలో సంకీర్ణ ప్రభుత్వాలు కనీస ఉమ్మడి కార్యక్రమానికి కట్టుబడి పనిచేస్తాయి.

4) శాసననిర్మాణ, కార్యనిర్వాహక శాఖల మధ్య సమన్వయం: పార్లమెంటరీ ప్రభుత్వం కార్యనిర్వాహక, శాసననిర్మాణ శాఖల మధ్య సమన్వయాన్ని ఏర్పరుస్తుంది. ఎందుకంటే ఆ రెండు శాఖలకు చెందిన సభ్యులు ఒకేసారి శాసనసభలో సభ్యత్వాన్ని కలిగి ఉంటారు. ప్రథమంగా శాసన సభ్యులందరూ ఏదో ఒక సభలో సభ్యులుగా ఉంటారు.
అటు తరువాత కేబినేట్లో మంత్రిగా కొనసాగుతారు. శాసనసభ ఆమోదించిన సంక్షేమ పథకాలను, విధానాలను అమలుచేస్తుంటారు. అదే విధంగా, అనేక విషయాలకు సంబంధించి వారు శాసన సభ్యులకు సలహాలు ఇస్తుంటారు. ఈ కారణాల రీత్యా రెండు శాఖల మధ్య సమన్వయం ఏర్పడుతుంది.

5) పార్టీ క్రమశిక్షణ: నిజమైన పార్లమెంటరీ ప్రభుత్వంలో పార్టీ క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ ప్రభుత్వ విధానంలో ప్రతి రాజకీయపార్టీ తమ సభ్యులందరి మీద తీవ్రమైన క్రమశిక్షణ చర్యలను చేపడుతుంది. ముఖ్యంగా పార్టీ సిద్ధాంతానికి, సూత్రాలు, నియమ నిబంధనలకు కట్టుబడి నడుచుకోవాలని ఒత్తిడి చేస్తుంది. ఇటువంటి విధానం వల్ల సభ్యులందరూ వినయవిధేయతలతో పార్టీకి, ప్రభుత్వానికి అనుగుణంగా నీతినిజాయితీలతో, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా పనిచేసేటట్లు సభ్యులకు శిక్షణ ఇస్తుంటారు. ఈ చర్యల వల్ల రాజకీయ పటిష్టత ఏర్పడి రాజ్యం కొనసాగుతుంది.

6) ప్రధానమంత్రి నాయకత్వం: పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ‘ప్రధాన మంత్రిత్వ ప్రభుత్వ’మని కూడా వర్ణిస్తారు. ఈ తరహా ప్రభుత్వంలో ప్రధానమంత్రి వాస్తవ కార్యనిర్వాహక అధికారిగా వ్యవహరిస్తాడు. ఇతడు దిగువసభలో మెజారిటీ పార్టీ నాయకుడుగా లేదా సంకీర్ణ మంత్రిమండలి అధిపతిగా చాలామణి అవుతుంటాడు. ప్రధానమంత్రి కేంద్ర కేబినెట్, కేంద్ర మంత్రిమండలికి మూలవిరాట్గా నిలబడతాడు. మంత్రిమండలి నిర్మాణం, ఉనికి, కొనసాగింపుకు ప్రధానమంత్రి కేంద్ర బిందువుగా ఉంటాడు. కేంద్ర మంత్రిమండలికి అధ్యక్షత వహించటమే కాకుండా ఎజెండాను కూడా నిర్ణయిస్తాడు.

ప్రశ్న 2.
అధ్యక్ష తరహా ప్రభుత్వ ప్రయోజనాలను, లోపాలను వివరించండి. [Mar. 2016]
జవాబు:
పరిచయం: అధ్యక్షపాలనను బాధ్యతాయుతముకాని ప్రభుత్వమని కూడా అంటారు. ఈ విధానంలో ఆ దేశాధ్యక్షుడు రాజ్యానికి, ప్రభుత్వానికి కూడా అధినేత. ఆయనకు నిజమైన అధికారాలు ఉంటాయి. ఇది ఏకపాలక వర్గ విధానము. అధ్యక్షుడు నియమించుకునే మంత్రులకు శాసనశాఖతో సంబంధం ఉండదు. మంత్రులు ఆయనకు విధేయులై పనిచేసే తాబేదారులు, వారికి శాసనసభ సభ్యత్వం ఉండదు. అధ్యక్షుడు ప్రజలచేత లేదా ఎన్నికలగణాల చేత ఎన్నుకోబడతాడు. అధ్యక్షునకు ఒక నిర్ణీత పదవీకాలం ఉంటుంది. ఆయనను తొలగించడం తేలికకాదు. అధ్యక్షపాలనా విధానానికి అమెరికా మంచి ఉదాహరణ (U.S.A.)

నిర్వచనం: ప్రొఫెసర్ గార్నర్: “అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ కాలపరిమితి, రాజకీయ విధానాలకు సంబంధించి రాజ్యాంగబద్ధమైన స్వతంత్రతను కలిగి ఉంటుంది”.

ప్రయోజనాలు:
1) నియంతృత్వానికి తక్కువ అవకాశం అధ్యక్ష ప్రభుత్వం అధికార వేర్పాటువాద సిద్దాంత ప్రాతిపదికన ఏర్పడినందున ప్రభుత్వంలోని అన్ని అంగాలు స్వతంత్రమైనవిగా ఉంటాయి. అధికారాలన్నీ వివిధ శాఖల మధ్య, ఆయా అంగాల మధ్య విభజించబడి ఉండటం వలన ఈ ప్రభుత్వంలో నియంతృత్వానికి తావులేదు.

2) సుస్థిర ప్రభుత్వం: ఈ ప్రభుత్వ విధానంలో ముఖ్య కార్యనిర్వహణాధిపతి (అధ్యక్షుడు) ఒక నిర్దిష్ట కాలపరిమితికి ఎన్నికవుతాడు. అతడి కాలపరిమితి శాసనసభ విశ్వాసం మీద ఆధారపడి ఉండదు. కాబట్టి పూర్తి కాలపరిమితి వరకు అధ్యక్ష హోదాలో అతడు కొనసాగుతాడు. అందువల్ల ఈ విధానంలో ప్రభుత్వం సుస్థిరంగా ఉండగలదని విశ్వసించవచ్చు.

3) చర్యలలో జాప్యం ఉండదు: అధ్యక్ష ప్రభుత్వ విధానంలో కార్యనిర్వహణాధికారాలన్నీ ఒకే వ్యక్తి చేతిలో ఉండటం వల్ల అతడు సత్వర నిర్ణయాలు తీసుకొనే అవకాశాలుంటాయి. అందువల్ల ప్రజల సమస్యలను తీర్చే సందర్భంలో కార్యదర్శులను (మంత్రులు) సంప్రదించాల్సిన అవసరం లేకుండా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవచ్చును.

4) పాలనా సామర్థ్యం పెరుగుతుంది: ఈ ప్రభుత్వ విధానంలో పాలనా సామర్థ్యం పెరుగుతుంది. సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు వారి వారి అనుభవం, సామర్థ్యాలతో పాలనారంగం భాగస్వామ్యం కలిగి ఉండటం వల్ల ఇది సాధ్యమవుతుంది.

5) బాధ్యతాయుతమైన ప్రభుత్వం అధ్యక్షతరహా ప్రభుత్వం సూత్ర ప్రాయంగా బాధ్యతారహిత ప్రభుత్వమైనప్పటికీ వాస్తవానికి ఇది ఎంతో బాధ్యతాయుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే, ప్రభుత్వ విధానాలను రూపొందించే సందర్భంలో అధ్యక్షుడు దూరదృష్టితో ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను, ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొంటాడు. అధ్యక్షుడు తన అధికారాలను ఉపయోగించే సమయంలో స్వార్థపర వ్యక్తుల పట్ల, స్వప్రయోజనాలను కోరుకునే వ్యాపార వర్గాల పట్ల అప్రమత్తంగా ఉంటాడు.

AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం

6) అత్యవసర సమయాలకు తగిన ప్రభుత్వం: అధ్యక్షతరహా ప్రభుత్వం అత్యవసర పరిస్థితులను, సంఘటనలను పరిష్కరించటంలో ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. అనూహ్య పరిణామాలు సంభవించినపుడు అధ్యక్షుడు సత్వర నిర్ణయాలు తీసుకొంటాడు. అత్యవసర సమయాలలో శాసనసభ లేదా మంత్రివర్గం అమోదానికై ఎదురుచూడకుండా తానే స్వయంగా తగిన నిర్ణయాలు తీసుకొంటాడు. దేశ సంక్షేమం దృష్ట్యా పాలనా చర్యలు వీలైనంత సున్నితంగా ఉండే విధంగా చూస్తాడు.

లోపాలు:
1) శాసన – కార్యనిర్వాహక శాఖల మధ్య వైరుధ్యాలు: అధ్యక్ష ప్రభుత్వం అధికార వేర్పాటువాద సిద్ధాంతం ఆధారంగా ఏర్పడినప్పటికీ వివిధ ప్రభుత్వ అంగాల మధ్య వైరుధ్యాలు జనిస్తూనే ఉన్నాయి. ఈ విధంగా జరగడానికి ప్రభుత్వం విధుల పరంగా విడివిడిగా ఉండటమే కారణమని చెప్పవచ్చు. పెండింగ్ బిల్లులను అమోదించటంలో, ప్రభుత్వ విధి విధానాలను అమలు పర్చటంలో అధ్యక్షుడికి, శాసనసభ్యులకు మధ్య అవగాహన లోపం ఉండటం కూడా రెండు శాఖల మధ్య వివాదాలకు దారితీస్తుంది.

2) బాధ్యతారహితం: అధ్యక్ష ప్రభుత్వ ఆచరణలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది. అధ్యక్షుడు గానీ, శాసనసభ్యులు గానీ, ప్రభుత్వ అంగాలకు పూర్తి బాధ్యత వహించరు. ప్రత్యక్ష ఎన్నికలు, నిర్ణీత కాలపరిమితి, అధికారాల విభజన మొదలైన అంశాలు శాసనాల రూపకల్పనలోను, వాటి అమలులోను బాధ్యతారహితంగా వ్యవహరించే పరిస్థితులను కల్పిస్తాయి.

3) సంపూర్ణ ప్రాతినిధ్యాన్ని కల్పించటంలో విఫలం: అధ్యక్ష ప్రభుత్వం సమాజంలోని భిన్న సమూహాలకు సరియైన ప్రాతినిధ్యాన్ని కల్పించలేదు. ఎన్నికలకు ముందు ఒక ప్రత్యేక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అధ్యక్షుడుగా ఎన్నికై పక్షపాతరహితంగా వ్యవహరిస్తాడని నమ్మలేము. అన్ని సందర్భాలలో, సమయాలలో ఖచ్చితంగా ప్రజాసేవకు అంకితమై నీతి నిజాయితీలతో వ్యవహరిస్తాడని చెప్పలేము.

4) ప్రజాభిప్రాయానికి స్థానం లేదు: ఈ ప్రభుత్వ విధానంలో ప్రజాభిప్రాయానికి చాలా తక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం జరుగుతుంది. ఎన్నికల అనంతరం అధ్యక్షుడితో పాటు శాసనసభ్యులు సైతం అనేక విషయాలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేయరు. ప్రజామోదం గాని, ప్రజల విశ్వాసం గాని, ప్రజా మద్దతు గాని వారి చర్యలకు అవసరం లేదనే విధంగా ప్రవర్తిస్తారు.

5) శాసనసభకు అప్రధాన హోదా: అధ్యక్ష ప్రభుత్వ విధానం, శాసన సభకు ద్వితీయ ప్రాధాన్యతనిస్తుంది. కార్యనిర్వాహక శాఖ అధిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ ప్రభుత్వంలో అధ్యక్షుడిని అత్యంత శక్తివంతమైన, మిక్కిలి పలుకుబడి కలిగిన వ్యక్తిగా గుర్తిస్తారు. దేశానికి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలలో అతి ముఖ్యమైన ప్రచారకర్తగా భావిస్తారు. అధ్యక్షుడు శాసనసభ సమావేవాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన అవసరం లేనందున సభా సమావేశాలు పేలవంగా అప్రాధ్యానతను సంతరించుకుంటాయి.

6) సంప్రదాయ రాజ్యాంగం: సాధారణంగా అధ్యక్ష ప్రభుత్వ రాజ్యాంగ సంప్రదాయకమైనదై ఉంటుంది. ఈ ప్రభుత్వంలో స్వభావరీత్యా దృఢ రాజ్యాంగాన్ని సవరించటం అంత సులభం కాదు. మారిన ప్రజావసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించడం వీలుపడదు. ఈ కారణంవల్ల అనేకమంది రాజనీతిశాస్త్ర విమర్శకులు ఈ తరహా రాజ్యాంగాన్ని ప్రగతికి, అభివృద్ధికి వ్యతిరేకమైనదానిగా భావిస్తారు.

ప్రశ్న 3.
ఏకకేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలను, లోపాలను వివరించండి. [Mar 2018]
జవాబు:
అర్థము: ఏకకేంద్ర ప్రభుత్వమంటే ఒకే ఒక్క ప్రభుత్వమని అర్థము. అధికారాలన్నీ ఒకే ప్రభుత్వం కలిగి ఉంటుంది. ఏకకేంద్ర ప్రభుత్వాన్ని ఆంగ్లంలో ‘Unitary Government’ అంటారు. ‘Uni’ అంటే ఒకటి, ”tary’ అంటే అధికారం అని అర్థం. అంటే ఒకే ఒక్క అధికార కేంద్రమున్న ప్రభుత్వమని అర్థము.

నిర్వచనాలు:

డైసీ: “అత్యున్నత శాసనాధికారాన్ని ఒకే ఒక్క కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తే” దానిని ఏకకేంద్ర ప్రభుత్వం అంటారు.
విల్లోబి: ఏకకేంద్ర ప్రభుత్వ విధానంలో సర్వాధికారాలు కేంద్ర ప్రభుత్వానికే చెంది ఉంటాయి. తరువాత కేంద్ర ప్రభుత్వమే అధికారాలను తన ఇష్టం వచ్చినట్లు ప్రాంతీయ ప్రభుత్వాలను ఇస్తుంది” ఉదా: బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్ దేశాలు.

ప్రయోజనాలు (లేదా) సుగుణాలు:
i) శక్తివంతమైన ప్రభుత్వం (Powerful Government): ఏకకేంద్ర ప్రభుత్వం శాసన మరియు పాలనాపరమైన అంశాలను ఒకేతాటిపై నడిపిస్తుంది. ఒకే ఒక కేంద్రప్రభుత్వ ఆధీనంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయపరమైన శాఖలుండటం వల్ల ప్రభుత్వ యంత్రాంగం శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ కారణంచేత, ఏకకేంద్ర ప్రభుత్వం సమగ్రమైన సుస్థిర పాలనను అందిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం

ii) సమర్థవంతమైన పాలన (Efficient Rule): ఏకకేంద్ర పాలనా వ్యవస్థలో ప్రాంతీయ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సూచనలను, సలహాలను పాటించాల్సి ఉంటుంది. అన్ని రకాల పాలనా పరమైన అంశాలను అత్యంత శక్తివంతంగా, సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఒకే ప్రభుత్వంలో అన్ని అధికారాలుండటం వల్ల ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుంది.

iii) తక్కువ వ్యయం, తక్కువ సమయం (Less expensive and Time saving): ఏకకేంద్ర వ్యవస్థ ప్రభుత్వ యంత్రాంగంలో ప్రాంతీయ ప్రభుత్వాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. తత్ఫలితంగా, ఏకకేంద్ర ప్రభుత్వ నిర్మాణం, నిర్వహణకు తక్కువ ఆర్థిక వనరులు సరిపోతాయి. అంతేకాదు, సంస్థల నిర్మాణంలో నకిలీ ఏర్పాటు ఉండదు. అదేవిధంగా కాలయాపన లేకుండా నిర్ణయాలు త్వరితగతిన తీసుకోవడానికి అవకాశమెక్కువ. దీనివల్ల ప్రజాధనం, |సమయం ఏకకేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో వృధాకావు.

iv) పాలనా పరమైన ఏకత (Administrative uniformity): ఏకకేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో ప్రత్యక్షపాలన ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తాన్ని తన నియంత్రణలో ఉంచుకొంటుంది. ఈ కారణం వల్ల, ఒకే తరహా శాసనాలు, చట్టాలు, నియమ, నిబంధనలు దేశవ్యాప్తంగా వర్తిస్తాయి. దీని వల్ల శాసనాల రూపకల్పన, పాలనా ప్రక్రియలలో సారూప్యత ఏర్పడుతుంది.

v) సత్వర నిర్ణయాలకు అవకాశం (Quick decisions possible): ఏకకేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో ఒకే ఒక ప్రభుత్వ యంత్రాంగం ఉండటం వల్ల అది సమయానుకూలంగా సత్వర నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా, ఏకకేంద్ర ప్రభుత్వం ఊహించని, అకస్మిక పరిణామాలు ఏర్పడినప్పుడు, అత్యవసర సమయాల్లో సత్వర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

vi) ఒకే పౌరసత్వం (Single Citizenship): ఏకకేంద్ర వ్యవస్థలో పౌరులందరికీ ఒకే పౌరసత్వం ఉంటుంది. దీనివల్ల దేశంలోని ప్రజలందరినీ ఎటువంటి వివక్ష ఏ రూపంలోను చూపకుండా అందరినీ సమానమైన పౌరులుగా గుర్తించటం జరుగుతుంది. ఒకే పౌరసత్వం వల్ల అంతిమంగా ప్రజలలో జాతీయ ఐక్యత, సమైక్యత, సమగ్రత, సౌభ్రాతృత్వ | భావాలు పెంపొందించుట జరుగుతుంది.

vii) చిన్న దేశాలకు ప్రయోజనకారి (Useful for small countries): ఏకకేంద్ర ప్రభుత్వం చిన్న దేశాలకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. ఎందుకంటే, తక్కువ జనాభా పరిమితమైన భౌగోళిక ప్రాంతం ఉండటం వల్ల అదేవిధంగా జాతి, భాష, సంస్కృతి, ప్రాంతీయపరంగా సజాతీయతను రూపొందించే అవకాశం ఉంటుంది.

లోపాలు (లేదా) దోషాలు:
i) నియంతృత్వానికి అవకాశం (Scope for Despotism): ఏక కేంద్ర వ్యవస్థలో అన్ని రకాల అధికారాలు ఒకే ఒక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వల్ల అధికారంలో ఉన్న వ్యక్తులు తమ ఇష్టానుసారంగా నియంతృత్వ | ధోరణిలో నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. తత్ఫలితంగా, వ్యక్తుల స్వేచ్ఛకు, హక్కులకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. అంతిమంగా, ఈ పరిణామాలు నియంతృత్వ ధోరణులు ప్రబలడానికి అవకాశాలను కల్పిస్తాయి.

ii) కేంద్ర ప్రభుత్వంపై అధిక భారం (More burden on Central Government): ఈ తరహా ప్రభుత్వ వ్యవస్థలో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన జరగదు. కేంద్ర ప్రభుత్వం మాత్రమే అన్ని రకాల విధులను నిర్వహిస్తుంది. తత్ఫలితంగా, కేంద్ర ప్రభుత్వంపై భారం పెరిగి నిర్ణయాలు తీసుకోవటంలో నిర్లక్ష్యం, ఆలస్యం కావటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

iii) అసమర్థత పెరుగుతుంది (Growth of Inefficiency): ఈ తరహా ప్రభుత్వ వ్యవస్థలో ప్రాంతీయ ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తిగానీ, స్వయం నిర్ణయాధికారం గానీ ఉండదు. ప్రాంతీయ ప్రభుత్వాలు అన్నీ కేంద్ర ప్రభుత్వం మీదనే ఆధారపడవలసి ఉంటుంది. అందువల్ల స్థానిక పాలన వ్యవహారాలలో ప్రజలు రాజకీయంగా చొరవ చూపించటం కుదరదు. ఈ కారణం వల్ల పాలనాపరంగా అసమర్థత పెరగడానికి అవకాశం ఉంది.

iv) పెద్ద రాజ్యాలకు అనువైంది కాదు (Not suitable for large Countries): విభిన్న జాతులు, పలు మతాలు, అనేక భాషలు, బహుళ భౌగోళిక పరిస్థితులు, వివిధ సంస్కృతులు నెలకొని ఉన్న దేశాలకు ఏక కేంద్ర ప్రభుత్వ విధానం అనువైంది కాదు. అంతేకాదు, అధిక జనాభా, విస్తారమైన ప్రదేశం గల దేశాలకు ఈ తరహా ప్రభుత్వ వ్యవస్థ ఎంతమాత్రం ఉపయోగపడదు. పెద్ద దేశాల్లో భిన్నత్వంలో ఏకత్వం సాధించటం అంత సులువైన పనికాదు.

v) బాధ్యతారాహిత్యం (Irresponsibility): ఏకకేంద్ర వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం దేనికి బాధ్యత వహించదు. అంతేకాదు ప్రాంతీయ ప్రభుత్వాలు ఏ విషయంలోనైనా ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేవు. అందువల్ల, కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అవకాశాలు ఉంటాయి.

ప్రశ్న 4.
శాసన నిర్మాణశాఖ విధులు ఏవి ? [Mar 2017]
జవాబు:
శాసనశాఖ ప్రభుత్వాంగాలలో ఒకటి. ఇందులో రెండు సభలుంటే దానిని ద్విశాసనసభ అంటారు. ఉదా: భారత పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ అనే రెండు సభలున్నాయి. అనేక దేశాలలో ద్విశాసనసభ ఉంది. ఉదా: బ్రిటన్, అమెరికా మొదలగునవి. ఇందులో దిగువ సభ ప్రజలచే ఎన్నుకోబడే ప్రతినిధులతో కూడి ఉంటుంది. ఉదా: లోక్సభ (ఇండియా), హౌస్ ఆఫ్ కామన్స్ (ఇంగ్లాండ్) మొదలగునవి. ఎగువ సభ ఒక్కొక్క దేశంలో ఒకరకంగా నిర్మాణమవుతుంది. కొన్ని దేశాలలో వారసత్వం ఆధారంగా, కొన్ని దేశాలలో కార్యనిర్వాహక శాఖచే నియమించడం, కొన్ని దేశాలలో ప్రజలే ఎన్నుకోవడం, కొన్ని దేశాలలో పరోక్ష పద్ధతిలో ఎన్నుకోబడటం ఉన్నది.

శాసనసభ విధులు: ప్రభుత్వంలో మూడు ప్రధానాంగాలుంటాయి. వాటిలో శాసనసభ ఒకటి. ఇది శాసనాలను రూపొందిస్తుంది. ప్రజాస్వామ్యంలో దీనికి ప్రముఖ స్థానం ఉంటుంది. శాసనసభ అధికారాలు ప్రభుత్వ స్వరూపాన్ని బట్టి ఉంటాయి. ప్రజల సమస్యల పరిష్కారానికి శాసనసభ శాఖలో చర్చలు జరిపి, పరిష్కారం కనుక్కోబడుతుంది. అంతేగాక ఆధునిక రాజ్యాల విధులు పెరగడం చేతకూడా శాసనశాఖలు ఈ క్రింద వివరించిన అనేక అధికారాలు కలిగి ఉన్నాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం

1. శాసన సంబంధమైన విధులు: శాసననిర్మాణ శాఖ చట్టాలను తయారుచేస్తుంది. అమలులో ఉన్న చట్టాలను సవరిస్తుంది. అదేవిధంగా, మారుతున్న ప్రజా అవసరాల దృష్ట్యా కొన్ని పాత చట్టాలను రద్దు చేస్తుంది. శాసనాల రూపకల్పనలో సభ్యులు ఎక్కువ సమాయాన్ని కేటాయించటంతోపాటు అంకితభావాన్ని ప్రదర్శించవలసి ఉంటుంది. శాసన నిర్మాణ శాఖ ప్రజాప్రయోజనాల కోసం సభ్యులు చర్చా సమాలోచలను స్వేచ్ఛగా, పక్షపాతరహితంగా బిల్లులను రూపొందించడానికి సహకరిస్తుంది.

2) కార్యనిర్వాహక విధులు: శాసననిర్మాణ శాఖ కార్యనిర్వాహక శాఖపై ప్రత్యక్ష నియంత్రణను కలిగి ఉంటుంది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా పాలనాపరమైన అంశాలమీద శాసనసభ్యులు ప్రశ్నలను, ఉపప్రశ్నలను మంత్రులపై సంధించడం ద్వారా తగిన సమాధానాలను, సమాచారాన్ని రాబడతారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడంలో భాగంగా శాసనసభ వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టి చర్చలను తాత్కాలికంగా నిలుపుదల చేయవచ్చు. అదే విధంగా మంత్రిమండలికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని కూడా శాసనసభలో ప్రవేశపెట్టవచ్చు.

3) ఆర్థికాధికారాలు: శాసననిర్మాణ శాఖకు కొన్ని ఆర్థికపరమైన అధికారాలు కూడా ఉన్నాయి. ఒకరకంగా శాసననిర్మాణ శాఖ జాతీయ నిధికి సంరక్షకుడిగా ఉంటుంది. సంక్షేమం, పాలన మరియు వివిధ రకాల ప్రాజెక్టుల ఆదాయ వ్యయాలకు సంబంధించి ప్రభుత్వాన్ని శాసననిర్మాణ శాఖ నియంత్రిస్తుంది. శాసనసభ్యులు ప్రభుత్వ రెవెన్యూ ఖర్చులను తనిఖీ చేసే అధికారం కలిగి ఉంటారు. ప్రభుత్వ ధనాన్ని వృథా చేయకుండా అధికార పార్టీని అప్రమత్తం చేస్తారు.

4) చర్చాపరమైన విధులు: శాసననిర్మాణ శాఖ చర్చాపరమైన సంస్థగా కూడా వ్యవహరిస్తుంది. సమాజంలోని వివిధ వర్గాల, సమూహాల భిన్నప్రయోజనాలను వ్యక్తపరచడంలో ఒక వేదికగా ఉపయోగపడుతుంది. అదే విధంగా, విధాన నిర్ణయాల రూపకల్పనలో, వాటిని అమలు చేయడంలో కార్యనిర్వాహక శాఖకు సహాయకారిగా ఉంటుంది.

5) న్యాయపరమైన విధులు: శాసననిర్మాణ శాఖ కొన్ని న్యాయసంబంధమైన విధులను కూడా నిర్వహిస్తుంది. రాజ్యాల తమ శాసనశాఖలకు రాజ్యాంగపరమైన సూత్రాలను అతిక్రమించి లేదా దుర్వినియోగపరిచే సందర్భంలో విచారణలు చేపట్టి అవిశ్వాస తీర్మానం ద్వారా సదరు వ్యక్తులను పదవి నుండి తొలగించే అధికారాన్ని ఇచ్చాయి. ఉదా: భారత రాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యులు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మొదలైన వారిని రాజ్యాంగబద్ధ ప్రక్రియ ద్వారా పార్లమెంటు తొలగిస్తుంది.

6) రాజ్యాంగపరమైన విధులు: శాసననిర్మాణ శాఖ కొన్ని రాజ్యాంగపరమైన విధులను సైతం నిర్వహిస్తుంది. శాసననిర్మాణ శాఖ రాజ్యాంగ అధికరణలను సవరించవచ్చు. భారతదేశంలో అన్నిరకాల రాజ్యాంగ సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలు ముందుగా పార్లమెంటులో ప్రవేశపెట్టబడతాయి. ఇదే పద్దతి అమెరికా, బ్రిటన్ దేశాలలో సైతం కొనసాగుతూ ఉంది. వీటన్నింటికి సంబంధించి శాసనసభ తనకుగల రాజ్యాంగపరమైన అధికారాలను అనుసరించి అమలులో ఉన్న పద్ధతుల ప్రకారం వ్యవహరిస్తుంది.

7) ఎన్నికపరమైన విధులు: ప్రపంచంలోని అనేక దేశాల శాసనసభలు కొన్ని రకాల ఎన్నికల విధులను నిర్వహిస్తున్నాయి. భారతదేశంలో పార్లమెంటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి భాగస్వామ్యం కలిగి ఉంది. అదేవిధంగా, పలురకాల కమిటీల సభ్యుల నియామకంలో కూడా పార్లమెంటు కీలకపాత్ర పోషిస్తుంది. సభాపతులు, ఉపసభాపతులను ఎన్నుకొనే అధికారం ఉంది.

ప్రశ్న 5.
కార్యనిర్వాహకశాఖ విధులను చర్చించండి.
జవాబు:
పరిచయం: ప్రభుత్వ నిర్మాణంలో కార్యనిర్వాహకశాఖ అతిముఖ్యమైన రెండవ అంగం. రాజ్య విధానాలను అమలుపరచడంలో కార్యనిర్వాహకశాఖ ముఖ్య సాధనంగా ఉపయోగపడుతుంది. కార్యనిర్వాహకశాఖ అంటే రాజ్యాధిపతులు, వారి మంత్రులు, సలహాదారులు, పరిపాలనాశాఖాధిపతులు కలిసికట్టుగా కార్యనిర్వాహక వర్గంగా ఏర్పడతారు.

కార్యనిర్వాహకశాఖ విధులు (Functions of Executive): ఆధునిక రాజ్యాలలో కార్యనిర్వాహకశాఖ పలురకాల విధులు నిర్వహిస్తుంది. సైద్ధాంతికంగా, ఈ శాఖ శాసననిర్మాణశాఖ రూపొందించిన చట్టాలను అమలుపరుస్తుంది. అయితే ఆయా ప్రభుత్వ రూపాలను బట్టి ఈ శాఖ నిర్వహించే విధుల్లో మార్పు ఉంటుంది. సాధారణంగా * కార్యనిర్వాహకశాఖ ఈ కింది విధులను నిర్వహిస్తుంది.
1) పాలనాపరమైన విధులు (Administrative Functions):

  • చట్టాలను, న్యాయశాఖ తీర్పులను అమలుపరచడం
  • విధివిధానాలను రూపొందించడం.
  • శాంతిభద్రతలను కాపాడటం
  • సివిల్ సర్వెంట్స్ నియామకం, పదోన్నతి, తొలగింపు, (ఉద్యోగంలో నుండి తొలగించడం) మొదలైన విధులు.

AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం

2) దౌత్యపరమైన విధులు (Diplomatic Functions): కార్యనిర్వాహకశాఖ విదేశీ సంబంధాలను నెరపడము, విదేశాల్లో దౌత్యాధికారులను నియమించడం, దౌత్య వ్యవహారాలను చక్కబెట్టడం, అదేవిధంగా, దేశాల మధ్య జరిగే చర్చా సమాలోచనలను, అంతర్జాతీయ ఒప్పందాలను, సదస్సు తీర్మానాలను అమలుపరచడం. అయితే, ఈ చర్యలన్నింటిని శాసన నిర్మాణశాఖ ధృవపరచవలసి ఉంటుంది.

3) సైనికపరమైన విధులు (Military Functions): ప్రపంచ దేశాలలోని అనేక రాజ్యాలలో ముఖ్య కార్యనిర్వహణాధిపతి రక్షణశాఖకు అత్యున్నత దేశాధికారిగా ఉంటాడు. ఇతర దేశాలతో యుద్ధాన్ని గాని, లేదా శాంతి సంధినిగాని కార్యనిర్వాహకశాఖ ప్రకటించవచ్చు. అదేవిధంగా అత్యవసర సమయాల్లో ఈ శాఖ దేశవ్యాప్తంగా మార్షల్ లా (Martial Law) ను విధించి పౌరుల హక్కులను సైతం రద్దు చేయవచ్చు.

4) ఆర్థికపరమైన విధులు (Financial Functions): కార్యనిర్వాహకశాఖ కొన్ని ఆర్థికపరమైన విధులను కూడా నిర్వహిస్తుంది. అవి వరుసగా, ఈ శాఖ వార్షిక ఆదాయ వ్యయపట్టికను ఎంతో జాగరూకతతో తయారుచేస్తుంది. వివిధ రకాల రూపాలలో వచ్చే ప్రభుత్వ రాబడులను గుర్తించేందుకు కృషిచేస్తుంది. పన్నుల వసూళ్ళకు కావలసిన యంత్రాంగాన్ని ఏర్పరుస్తుంది.

5) న్యాయపరమైన విధులు (Judicial Functions): అనేక రాజ్యాలలో కార్యనిర్వాహకశాఖ ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకంతోపాటు వారిని బదిలీ చేయడం వంటి విధులను నిర్వహిస్తుంది. అదేవిధంగా దోషులుగా నిర్ధారించబడ్డ వారి శిక్షలను తగ్గించడం లేదా తొలగించడం, రద్దుచేయడం వంటి విధులను సైతం ఈ శాఖ చేపడుతుంది. అయితే ఇలాంటి అధికారాన్ని కొన్ని ప్రత్యేక సమయాలలో మాత్రమే వినియోగిస్తుంది.

6) రాజ్యాంగపరమైన విధులు (Constitutional Functions): చాలా దేశాల్లో కార్యనిర్వాహకశాఖ రాజ్యాంగ సవరణలకు సంబంధించి శాసననిర్మాణశాఖకు సలహాదారుగా వ్యవహరిస్తుంది. రాజ్యాంగ సూత్రాలను అమలుపరిచే క్రమంలో సమస్యలు ఉత్పన్నమైనట్లయితే వాటిని అధిగమించి ప్రగతిని సాధించడానికి రాజ్యాంగ సవరణలు అవసరమని భావించినట్లయితే వాటిని చేయవలసిందిగా శాసననిర్మాణశాఖకు విన్నవిస్తుంది. అలాంటి చర్యలు చేపట్టవలసిన ఆవశ్యకతను తెలియజేయడానికి ముందస్తు సర్వేలు నిర్వహించి వాటి నివేదికలను పార్లమెంటుకు సమర్పిస్తుంది. సందర్భంగా, కార్యనిర్వాహకశాఖ శాసనసభ్యుల మద్దతును కూడగట్టి తగిన రాజ్యాంగ సవరణలను చేస్తుంది.

7) ఆర్డినెన్స్ జారీ (Promulgation of Ordinances): అనేక రాజ్యాలలో కార్యనిర్వాహకశాఖ ఆర్డినెన్స్లను జారీ చేస్తుంది. క్లిష్టమైన సమస్యలను అత్యవసరంగా పరిష్కరించడానికి ఈ తరహా బాధ్యతలను అది నిర్వహిస్తుంది. శాసనసభల సమావేశం జరిగేంతవరకు ఈ ఆర్డినెన్స్లు అమలులో ఉంటాయి. అంతేకాకుండా నియోజిత శాసనం (delegated legislation) అనేది శాసననిర్మాణశాఖ తరపున చట్టాలను రూపొందించేందుకు కార్యనిర్వాహక శాఖకు వీలు కల్పిస్తుంది. శాసన సభ్యులు కొన్ని బిల్లులను సంపూర్ణమైన వివరాలతో తయారు చేసేందుకు కార్యనిర్వాహకశాఖకు అధికారమిచ్చేందుకు తమ సమ్మతిని తెలియజేస్తారు.

8) సంక్షేమ విధులు (Welfare Functions): నేడు అనేక రాజ్యాలు సంక్షేమ దృక్పథాన్ని కలిగి ఉన్నాయి. తద్వారా ప్రజాసంక్షేమంలో వాటి కర్తవ్యాలు నానాటికి విశేషంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా, సంక్షేమంలో పూర్తిగా విస్మరించబడ్డ వర్గాలు, నిరాకరించబడ్డ, కనీస సౌకర్యాలకు కూడా నోచుకోని ప్రజలను ఉద్దేశించి శాసనాలను రూపొందించి అమలుపరుస్తుంది. ఫలితంగా ఈ శాఖ అనేక బహుళ విధులను, చర్యలను చేపడుతుంది.

9) పాలనాపరమైన న్యాయనిర్ణయ విధులు (Administrative Adjudication Functions): అనేక సందర్భాలలో పరిపాలనకు సంబంధించిన కేసులలో, వివాదాలలో కార్యనిర్వాహకశాఖ పాలనాపరమైన న్యాయనిర్ణేతగా ప్రముఖపాత్రను నిర్వహిస్తుంది. ఇలాంటి చర్యలను చేపట్టడం ద్వారా ఈ శాఖ కొన్ని న్యాయ సంబంధమైన అధికారాలను సైతం కలిగి ఉందని చెప్పవచ్చు.

10) అత్యవసర కార్యక్రమాలు (Emergency Operations): శాంతి భద్రతలు క్షీణించడం, ప్రకృతివైపరీత్యాలు, విదేశీ చొరబాట్లు లేదా మరేవిధమైన అత్యవసర పరిస్థితులు వివిధ సమయాలలో వివిధ ప్రాంతాలలో ఉత్పన్నమైనట్లయితే వాటిని చక్కబెట్టే బాధ్యతను కార్యనిర్వాహకశాఖ చేపడుతుంది. గతకొన్ని సంవత్సరాల నుంచి అనేక దేశాలలో తీవ్రవాదం ఒక ప్రధాన సమస్యగా పరిణమించింది. ఇలాంటి సమస్యలను కార్యనిర్వాహకశాఖ సందర్భానుసారంగా, సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. మరే ఇతర ప్రభుత్వ అంగం కూడా ఇలాంటి పరిస్థితులను చక్కబెట్టలేదు.

11) ఇతర విధులు (Miscellaneous Functions): ప్రభుత్వానికి కార్యనిర్వాహకశాఖ నాయకత్వాన్ని అందిస్తుంది. శాసననిర్మాణ శాఖ, అధికారంలో ఉన్న పార్టీతోపాటుగా మొత్తం జాతికి నాయకత్వం వహిస్తుంది. ఈ శాఖ రాజ్యానికి నాయకత్వాన్ని అందిస్తూ అంతర్జాతీయ సదస్సులు, సంస్థల కార్యకలాపాలలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం

ప్రశ్న 6.
న్యాయశాఖ విధులను పేర్కొనండి. [Mar. 2016]
జవాబు:
ప్రభుత్వాంగాలలో న్యాయశాఖ మూడవది. ఇది శాసనాలను వ్యాఖ్యానిస్తుంది. అవి న్యాయసమ్మతంగా ఉన్నదీ, లేనిదీ నిర్ణయిస్తుంది. “పక్షపాతరహితంగా ప్రజలకు న్యాయం చేకూర్చడంపై దేశ శ్రేయస్సు, ప్రభుత్వ సామర్థ్యం ఆధారపడి ఉంటాయని” లార్డ్ బ్రైస్ అభిప్రాయం. న్యాయస్థానాలు న్యాయశాఖలో భాగం.

న్యాయశాఖ ప్రజాస్వామ్యంలో ప్రజల స్వేచ్ఛను రక్షిస్తుంది. ప్రభుత్వం రాజ్యాంగ పరిధిలో పనిచేసేటట్లు చూస్తుంది. ఆధునిక కాలంలో అనేక విధులను నిర్వహిస్తున్నది. ప్రజల హక్కులను కాపాడి, శాసనాలను వ్యాఖ్యానించి, న్యాయం చేయడమే న్యాయస్థానాల ముఖ్య కర్తవ్యం.

విధులు:
1) శాసనాలను వ్యాఖ్యానించడం: శాసనశాఖ చేసిన శాసనాలకు అర్థవివరణ ఇవ్వడం న్యాయశాఖ ప్రధాన కర్తవ్యం. న్యాయమూర్తులు చట్టాలను వ్యాఖ్యానించి, వివిధ అంశాలపై తమ నిర్ణయాలు తెలుపుతారు. శాసనాల అభివృద్ధికి న్యాయస్థానాలు పరోక్షంగా దోహదం చేస్తాయి.

2) రాజ్యాంగ రక్షణ: రాజ్యాంగ రక్షణ చేసి, దాని మౌలిక స్వరూపానికి భంగం లేకుండా చూడవలసిన బాధ్యత న్యాయస్థానాలకు ఉంది. శాసనశాఖ చేసే చట్టాలను రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే వాటిని చెల్లవని కొట్టివేసే “న్యాయసమీక్షాధికారం” న్యాయస్థానాలకు ఉంది.

3) హక్కుల రక్షణ: న్యాయస్థానాలు ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడతాయి. ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కులకు భంగం కలిగితే వారు న్యాయస్థానాల ద్వారా వాటిని రక్షించుకుంటారు. వ్యక్తి స్వేచ్ఛను రక్షించడానికి హెబియస్ కార్పస్ వంటి రిట్లు (writs) జారీచేసే అధికారం న్యాయస్థానాలకు ఉంది.

4) సమాఖ్య సమతౌల్యత సమాఖ్యలో న్యాయశాఖ అత్యంత కీలక పాత్రను పోషిస్తుంది. న్యాయశాఖ కేంద్రం-రాష్ట్రాల మధ్యగాని, పలు రాష్ట్రాల మధ్యగానీ తలెత్తే వివాదాలను పరిష్కరిస్తుంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ పరిమితులను దాటకుండా ఇది చూస్తుంది.

5) సలహారూపక విధులు: కార్యనిర్వాహక లేదా శాసననిర్మాణశాఖల కోరిక మేరకు న్యాయశాఖ తగిన సలహాలిస్తుంది. ఉదా: భారత రాష్ట్రపతి రాజ్యాంగపర చట్టాలకు సంబంధించి ఏదైనా సందేహం ఉత్పన్నమైనట్లయితే, భారత సుప్రీంకోర్టు సలహాను తీసుకోవచ్చు. ఇంగ్లాండులో ఇలాంటి సలహా సంప్రదింపులు జరపడం సర్వసాధారణం. చట్టానికి సంబంధించిన ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు బ్రిటిష్ రాణి ప్రీవీకౌన్సిల్ న్యాయ కమిటీల సలహాలను తీసుకుంటుంది.

6) అప్పీళ్ళ విచారణ పరిధి: కింది కోర్టులు ఇచ్చిన తీర్పులపై అత్యున్నత కోర్టు అప్పీళ్లను స్వీకరిస్తుంది. కింది కోర్టులు వెలువరించిన తీర్పులను అన్నివేళల పునఃసమీక్షిస్తుంది. కొన్ని సందర్భాలలో వాటికి వ్యతిరేకంగా కూడా తీర్పులను వెలువరిస్తుంది.

7) రికార్డుల నిర్వహణ న్యాయశాఖ తన తీర్పులకు సంబంధించిన రికార్డులతోపాటు ఇతర కేసులకు సంబంధించిన రికార్డులను సైతం భద్రపరుస్తుంది. సదరు రికార్డులు భవిష్యత్తులో న్యాయవాదులకు, న్యాయమూర్తులకు అదే తరహా కేసులు వాదించడానికి లేదా తీర్పులు వెలువరించడానికి ప్రాతిపదికగా ఉపయోగపడతాయి.

8) రాజ్యాధిపతిగా వ్యవహరించడం అత్యున్నత న్యాయస్థానాలలోని ప్రధాన న్యాయమూర్తి కొన్ని ప్రత్యేక సందర్భాలలో కొన్ని దేశాలలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఆయా స్థానాలలో లేనప్పుడు రాజ్యాధిపతిగా వ్యవహరిస్తాడు.

9) పరిపాలనా విధులు: సుప్రీంకోర్టు, హైకోర్టులు కొన్ని పరిపాలనాపరమైన విధులను నిర్వహిస్తాయి. ఉన్నత న్యాయస్థానాలు కింది న్యాయస్థానాలు న్యాయమూర్తుల నియామకంలో కార్యనిర్వాహక అధిపతికి సలహా ఇస్తాయి. అదేవిధంగా అవి కింది న్యాయస్థానాల పనితీరును పర్యవేక్షిస్తాయి. ఉదా: భారతదేశంలోని హైకోర్టులు తమ పరిధిలోని అధీన న్యాయస్థానాల కార్యక్రమాలను పర్యవేక్షించే కర్తవ్యాన్ని కలిగి ఉంటాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రభుత్వాల సాంప్రదాయ వర్గీకరణను చర్చించండి.
జవాబు:
అరిస్టాటిల్ వర్గీకరణను సాంప్రదాయ వర్గీకరణగా భావిస్తారు. అరిస్టాటిల్ ప్రభుత్వాలను రెండు అంశాల ప్రాతిపదికగా వర్గీకరించాడు. అవి: i) రాజ్యాధికారంలో ఉన్న వ్యక్తుల సంఖ్యను బట్టి ii) రాజ్య అంతిమ లక్ష్యాన్ని బట్టి ప్రభుత్వాలను మంచి ప్రభుత్వాలు, చెడు ప్రభుత్వాలుగా పేర్కొన్నాడు.

AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం

అరిస్టాటిల్ ప్రభుత్వాల వర్గీకరణ (Aristotle’s classification of Governments)
AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం 1

అరిస్టాటిల్ అభిప్రాయంలో రాజరికం, కులీనపాలన, మధ్యతరగతి పాలన (Polity) అనేవి మంచి ప్రభుత్వాలు. నిరంకుశత్వం, అల్పజనపాలన, ప్రజాస్వామ్యం అనేవి చెడు ప్రభుత్వాలు. అరిస్టాటిల్ ప్రకారం ఒక వ్యక్తి చేతిలో రాజ్యాధికారముండి ఆ అధికారాన్ని ప్రజా సంక్షేమానికి ఉపయోగించినట్లయితే దానిని రాజరికమంటారు. ఆ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి తన స్వప్రయోజనాన్ని ఆశించినప్పుడు నియంతృత్వమవుతుంది. సమాజంలోని కొద్దిమంది వ్యక్తులు, వారి పుట్టుక, శక్తి సామర్థ్యాలు, సంపద, హోదాల పరంగా రాజ్యాధికారంలో ఉన్నట్లయితే అది కులీన ప్రభుత్వం. ఈ కులీన వర్గం ప్రజాహితాన్ని కోరి పరిపాలించినంత కాలం కొద్దిమంది వ్యక్తుల ప్రభుత్వం అయినప్పటికీ అది మంచి ప్రభుత్వమే కానీ ‘కులీన ప్రభుత్వం ప్రజాహితాన్ని విస్మరించినప్పుడు అల్పజనపాలన’గా మారుతుందన్నాడు. అదే విధంగా సమాజంలోని ఉత్తమ లక్షణాలు కలిగిన అనేక మంది మధ్యతరగతి వ్యక్తులు నిజాయితీగా, నిస్వార్థంగా, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా దూరదృష్టితో లక్ష్యసాధన కోసం పరిపాలించినట్లయితే అటువంటి ప్రభుత్వం ”పాలిటీ’ (Polity) అని అది ప్రభుత్వాలన్నింటి కంటే ఉత్తమమైందన్నాడు. మధ్యతరగతి ప్రభుత్వం (పాలిటి) వికృత రూపంగా మారి స్వార్థపరుల చేత పరిపాలించబడే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం లేదా మూకపాలన (Mobocracy) అన్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రయోజనాలు, కోరికలను విస్మరించి పాలకులు తమ ఇష్టానుసారంగా పరిపాలన చేస్తారని అరిస్టాటిల్ అభిప్రాయపడ్డాడు.

ప్రశ్న 2.
ఏకకేంద్ర ప్రభుత్వ లక్షణాలేవి ?
జవాబు:
‘యూనిటరి’ (Unitary) అనే పదం రెండు ఆంగ్ల పదాల కలయిక. ‘యూని’ (Uni), ‘టరి’ (Tary) అను రెండు ఆంగ్ల పదాల కలయిక. యూని అనగా ‘ఒక్కటి’, టరీ అనగా ‘పాలన’ అని అర్థం. అందువల్ల యూనిటరీ గవర్నమెంట్ను ఏకకేంద్ర ప్రభుత్వం’గా వ్యవహరిస్తారు. ఏకకేంద్ర ప్రభుత్వంలో పాలనాధికారాలన్నీ సమీకృతంగా ఒకే ఒక ప్రభుత్వం చేతిలో ఉంటాయి. రాజ్యాంగం సర్వాధికారాలన్నీ కేంద్రప్రభుత్వం చేతిలో ఉంచుతుంది. కేంద్రప్రభుత్వం ఒక్కటే అధికారాలన్నింటిని అనుభవిస్తుంది. అయితే, కేంద్రప్రభుత్వం ప్రత్యేక రాజకీయ ఉపశాఖలను (Political subdivisions) ఏర్పరచి వాటికి కొన్ని అధికారాలను నిర్వహించే అవకాశాన్ని కల్పించవచ్చు. వివిధ రాష్ట్రాల పాలనాధికారాలను ఆయా ప్రాంతీయ మండళ్ళు (Provincial Units) ద్వారా చక్కబెట్టవచ్చు. ఈ ప్రాంతీయ మండళ్ళు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సహాయక కేంద్రాలుగా పనిచేస్తాయి. ఏకకేంద్ర ప్రభుత్వానికి చక్కటి ఉదాహరణ బ్రిటన్.

ఏకకేంద్ర ప్రభుత్వ నిర్వచనాలు (Definitions of Unitary Government):

  1. ఏ.వి. డైసీ: “అత్యున్నత శాసనాధికారాన్ని ఒకే ఒక కేంద్రప్రభుత్వం సంపూర్ణంగా నిర్వహించేదే ఏకకేంద్ర ప్రభుత్వం.”
  2. హైర్మన్ ఫైనర్: “కేంద్ర స్థాయిలో అన్ని రకాల అధికారాలు, ఆధిపత్యం ఇమిడీకృతమై, తన ఇష్టానుసారంగా లేదా దాని అనుబంధశాఖల ద్వారా భౌగోళిక ప్రాంతానికంతటికి న్యాయపరంగా సర్వశక్తి గల అధికారం గల ప్రభుత్వమే ఏకకేంద్ర ప్రభుత్వం.”
  3. ప్రొఫెసర్. జె.డబ్ల్యు. గార్నర్: “ప్రభుత్వానికి గల సర్వాధికారాలు రాజ్యాంగపరంగా ఒకే ఒక కేంద్ర వ్యవస్థ లేదా వ్యవస్థలకు చెంది ఉండి, వాటి నుంచి స్థానిక ప్రభుత్వాలు తమ అధికారాలను పొందినట్లయితే అటువంటి ప్రభుత్వమే ‘ఏకకేంద్ర ప్రభుత్వం’ అంటారు.

ఏకకేంద్ర ప్రభుత్వం లక్షణాలు (Features of Unitary Government):
ఏకకేంద్ర ప్రభుత్వం ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటుంది.
1. ఏకకేంద్ర వ్యవస్థలో ఒకే ప్రభుత్వముంటుంది (Single Government): దీనినే కేంద్ర ప్రభుత్వమని వ్యవహరిస్తారు.. కేంద్ర ప్రభుత్వం రాజ్య పరిధిలోని అన్ని శాఖలకు సంబంధించిన అధికారాలను నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అత్యున్నతమైన శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయపరమైన అధికారాలను కలిగి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ అధికారం దేశంలోని ప్రజలందరికీ వర్తిస్తుంది.

2. ప్రాంతీయ ప్రభుత్వాలు (Provincial Government): ఏకకేంద్ర ప్రభుత్వ విధానంలో ప్రాంతీయ ప్రభుత్వాల ఏర్పాటు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. ఒకవేళ ప్రాంతీయ ప్రభుత్వాలు ఉన్నట్లయితే, వాటి అధికారాలు మరియు ఉనికి కేంద్ర ప్రభుత్వం మీదనే ఆధారపడి ఉంటాయి. పాలనా సౌలభ్యం కొరకు వీటిని ఏర్పాటు చేయటం జరుగుతుంది. వీటికి స్వయం నిర్ణయాధికారం ఉండదు. అవి కేంద్ర ప్రభుత్వం నుండి తమకు అవసరమైన అధికారాలను పొందుతాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం

3. సరళ రాజ్యాంగం (Flexible Constitution): ఏకకేంద్ర ప్రభుత్వం సాధారణంగా సరళ రాజ్యాంగాన్ని కలిగి ఉంటుంది. దీనితో పాటు లిఖిత రాజ్యాంగాన్ని కలిగి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరుధ్యాలు ఏర్పడే అవకాశం ఎంత మాత్రం ఉండదు. ఈ కారణం వల్ల, వివిధ రాజ్యాంగ వ్యవస్థలు శక్తివంతంగా పనిచేస్తాయి.

4. ఏక పౌరసత్వం (Single Citizenship): ఏకకేంద్ర ప్రభుత్వం పౌరులందరికీ ఒకే పౌరసత్వాన్ని కల్పిస్తుంది. ఏకకేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రాంతంలో జన్మించినా ప్రత్యేక గుర్తింపునిచ్చే పౌరసత్వం కలిగి ఉంటారు. అంతిమంగా ఏక పౌరసత్వం జాతీయ ఏకత, సమైక్యత, సౌభ్రాతృత్వాన్ని ప్రజలలో పెంపొందిస్తుంది.

5. ఏక శాసన సభ (Unicameralism): ఏకకేంద్ర ప్రభుత్వం ఒకే శాసన సభను కలిగి ఉంటుంది. ఆ శాసన సభకు అన్ని రకాల శాసనాధికారాలుంటాయి. ప్రాంతీయపరమైన శాసనసభలు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నట్లయితే అవి కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు తమ విధులను నిర్వహిస్తాయి.

ప్రశ్న 3.
సమాఖ్య ప్రభుత్వ లక్షణాలను చర్చించండి. [Mar, ’18, ’17]
జవాబు:
‘ఫెడరేషన్’ (Federation) అనే ఆంగ్ల పదం ఫోడస్ (Foedus) అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. ‘ఫోడస్’ అనగా ఒడంబడిక లేదా అంగీకారం అని అర్థం. ఆధునిక రాజకీయ వ్యవస్థలో ‘సమాఖ్య విధానం’ ఒక రాజకీయ ఆలోచనా ప్రక్రియగా మారింది. ఈ విధానం అత్యంత బహుళ ప్రాచుర్యం పొందింది. అమెరికా (1789), స్విట్జర్లాండ్ (1848), ఆస్ట్రేలియా (1901), కెనడా (1931) వంటి దేశాలు సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థకు మంచి ఉదాహరణలు.

నిర్వచనాలు:

  1. ఎ.వి. డైసీ: “జాతీయ సమైక్యత, ప్రాంతీయ విభాగాల హక్కులను సమన్వయపరిచే రాజకీయ సాధనమే సమాఖ్య ప్రభుత్వం.”
  2. జె.డబ్ల్యు. గార్నర్: “సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థ అనేది ప్రభుత్వానికి గల మొత్తం అధికారాలను కేంద్రం- రాష్ట్రాల మధ్య జాతీయ రాజ్యాంగం ద్వారా పంపిణీ చేసేది.”

సమాఖ్య ప్రభుత్వ లక్షణాలు (Features of Federal Government): సమాఖ్య ప్రభుత్వం అనేక లక్షణాలను కలిగి ఉంది. వాటిని ఈ క్రింది విధంగా తెలుసుకోవచ్చు.

1. లిఖిత రాజ్యాంగం (Written Constitution): సాధారణంగా సమాఖ్య వ్యవస్థ ఉనికిలో ఉన్న దేశాల్లో. లిఖిత రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగం దేశం మొత్తానికి అత్యున్నత శాసనంగా పరిగణించబడుతుంది. ఆ రాజ్యాంగమే అధికారాలను నిర్వచించి, నిర్ణయించి కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది. ఆ విధంగా సమాఖ్య వ్యవస్థ అవసరమైన, ఆచరణయోగ్యమైన ప్రభుత్వ విధానంగా ఉంటుంది.

2. ద్వంద్వ పౌరసత్వం (Duel Citizenship): సమాఖ్య రాజ్య వ్యవస్థలో పౌరులకు ద్వంద్వ (రెండు) పౌరసత్వం ఉంటుంది. (ఒకటి జాతీయస్థాయి, రెండు సంబంధిత రాష్ట్రస్థాయి) అందువల్ల పౌరులు కేంద్రం, రాష్ట్రాల పౌరసత్వాన్ని పొందుతారు. తత్ఫలితంగా, పౌరులు జాతీయ, ప్రాంతీయ ప్రభుత్వాల ఎన్నిక ప్రక్రియలో ప్రాతినిధ్యం వహిస్తారు.

3. అధికార విభజన (Division of Powers): సమాఖ్య విధానంలో ప్రభుత్వ అధికారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజింపబడతాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలను కాపాడే అంశాలపై నియంత్రణ కలిగి ఉంటుంది. ఉదాహరణకు రక్షణ, విదేశీ వ్యవహారాలు, సుంకాలు, ఎగుమతులు-దిగుమతులు వంటి జాతీయ ప్రాముఖ్యత గల అంశాలను నియంత్రిస్తుంది. అదేవిధంగా, వ్యవసాయం, విద్య, వైద్యం, నీటి పారుదల విషయాలను ప్రాంతీయ ప్రభుత్వాలకు అప్పగించటం జరుగుతుంది.

4. ద్విసభా విధానం (Bicameralism): ద్విసభా విధానమనేది సమాఖ్య వ్యవస్థకు మరో ముఖ్య లక్షణం. సమాఖ్య రాజ్యంలో రెండు సభలు ఉంటాయి. ఎగువ సభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షిస్తుంది. ఎగువ సభలో రాష్ట్రాల జనాభాననుసరించి ప్రాతినిధ్యం కల్పించటం జరుగుతుంది. దిగువసభ ప్రజలకు ప్రత్యక్ష ప్రాతినిధ్యం వహిస్తుంది.

5. దృఢ రాజ్యాంగం (Rigid Constitution): సాధారణంగా, సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగం దృఢ లక్షణాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల రాజ్యాంగ సవరణ అంత సులభం కాదు. కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేయటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. ఈ కారణం వల్ల, అటు కేంద్ర ప్రభుత్వం గానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు గానీ రాజ్యాంగ సూత్రాలను ఏకపక్షంగా సవరించలేవు.

AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం

6. స్వతంత్ర న్యాయశాఖ (Independent Judiciary): సమాఖ్యప్రభుత్వ విధానంలో అతి ముఖ్యమైన లక్షణమేమిటంటే స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయశాఖ. ఎందుకంటే, కేంద్రం, రాష్ట్రాల మధ్యగల వివాదాలను ఒక్క న్యాయశాఖ మాత్రమే తీర్చగలదు. అందువల్ల న్యాయమూర్తులు రాజ్యాంగపరంగా సంక్రమించిన స్వతంత్ర హోదాను
సంతృప్తిగా అనుభవిస్తారు. సాధారణంగా న్యాయమూర్తుల నియామకం ఒకసారి జరిగిన తరువాత వారిని తొలగించడం అంత సులభం కాదు. వారు పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తారు. అంతేకాదు శాసననిర్మాణ, కార్యనిర్వాహక శాఖలు అమలుపరిచే అధికారాలు దుర్వినియోగం జరుగుతున్నట్లు భావించినట్లయితే, ఆ అధికారాలను నియంత్రించేది న్యాయశాఖ మాత్రమే.

ప్రశ్న 4.
పార్లమెంటరీ ప్రభుత్వ ప్రయోజనాలేవి ?
జవాబు:
పార్లమెంటరీ ప్రభుత్వ ప్రయోజనాలను క్రింది విధంగా వివరించవచ్చు.
1. శాసన నిర్మాణశాఖ, కార్యనిర్వాహక శాఖల మధ్య సమన్వయం
(Co-ordination between Legislature and Executive): పార్లమెంటరీ ప్రభుత్వంలో శాసన మరియు కార్యనిర్వాహక శాఖల మధ్య సహకారం, సమన్వయం ఉంటుంది. శాసన సభ్యులను విశ్వాసంలోకి తీసుకొని చట్టాలను రూపొందించటం జరుగుతుంది. ఈ సందర్భంగా శాసననిర్మాణ, కార్యనిర్వాహక శాఖలు సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి సమన్వయంతో ప్రభుత్వ కార్యకలాపాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తాయి. ఈ రెండు |శాఖలు పరస్పరం సహాయ, సహకారాలతో దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సమన్వయాన్ని పాటిస్తాయి.

2. నియంతృత్వానికి అవకాశం లేదు (No Scope for Despotism): పార్లమెంటరీ ప్రభుత్వంలో మెజారిటీ పార్టీ నిరంకుశత్వానికి శాసననిర్మాణ శాఖలోని దిగువసభలో బలమైన అడ్డుకట్ట వేయటం జరుగుతుంది. ఎందుకంటే శాసన సభ్యులు ప్రశ్నలు – అనుబంధ ప్రశ్నలు వేయటం ద్వారా, అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడం ద్వారా అధికారంలో ఉన్న పార్టీని నియంత్రిస్తారు.

3. అధికారాల పంపిణీకి అవకాశాలు (Scope for distribution of Powers): పార్లమెంటరీ ప్రభుత్వంలో రాజకీయ, పరిపాలనాపరమైన అధికారాల పంపిణీ ఉంటుంది. ఈ విధానంలో రాజ్యాంగ యంత్రాంగం ప్రభుత్వ అధికారాలను ప్రజాస్ఫూర్తి, నిబద్ధత, సహేతుక నిర్ణయ సామర్థ్యాలుగల వ్యక్తుల మధ్య విభజిస్తుంది. ఈ తరహా ప్రభుత్వం ఒక వ్యక్తి చేతిలోనో (ప్రధానమంత్రి) లేదా కొద్ది మంది వ్యక్తుల చేతులలోనో (మంత్రిమండలి) అధికారం కేంద్రీకృతం కావటాన్ని అనుమతించదు.

4. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు సులభం (Formation of alternative government easy): పార్లమెంటరీ ప్రభుత్వంలో ప్రత్యామ్నాయ మార్పులను సులభంగా ప్రవేశపెట్టవచ్చు. సాధారణంగా, ఏ ఒక్క పార్టీ లేదా పార్టీలు సార్వత్రిక ఎన్నికల ద్వారా దిగువ సభలో మెజారిటీని సంపాదిస్తాయో ఆ పార్టీ లేదా పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. తదుపరి వెంటనే ప్రభుత్వ పథకాలు, విధానాలు కూడా సులభంగా మార్చటం జరుగుతుంది. అదేవిధంగా, ఎప్పుడైతే అధికారక పార్టీ రాజీనామా చేయటమో లేదా అధికారం నుంచి తొలగించబడుతుందో జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇటువంటి చర్యలు రాజకీయ, పార్టీలపరమైన అస్థిరతలు ఏర్పడకుండా కాపాడతాయి. అంతేకాకుండా మధ్యంతర ఎన్నికలకు దారితీసే పరిస్థితుల పట్ల ప్రజలకు గల భయాందోళనలను తొలగిస్తాయి.

5. తగిన ప్రాతినిధ్యం (Adequate representation): పార్లమెంటరీ ప్రభుత్వం సమాజంలోని విభిన్న వర్గాలకు, ప్రాంతాలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తుంది. ఈ ప్రభుత్వంలో భిన్న స్వరాలకు సంబంధించిన వ్యక్తులందరికీ శాసననిర్మాణ – కార్యనిర్వాహకశాఖలందు ప్రాతినిధ్యం కల్పించడమవుతుంది. ఈ విధానంలో మైనారిటీలతో సహా ఎవ్వరూ కూడా మినహియించబడరు. దీని ఫలితంగా జాతీయ స్ఫూర్తి, ఐకమత్యం ప్రజలలో పెంపొందుతుంది. వివిధ పదవులను కేటాయించడం ద్వారా ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణ మద్దతును అందిస్తారు.

6. రాజకీయ చైతన్యం (Political Dynamism): పార్లమెంటరీ ప్రభుత్వం ప్రజలలో రాజకీయ విషయాల పట్ల చైతన్యాన్ని పెంపొందిస్తుంది. ఈ వ్యవస్థలో నిర్వహించే ఎన్నికల వలన వివిధ ప్రాతినిధ్యం సంస్థల ద్వారా పాల్గొనే ప్రజలలో రాజకీయ చైతన్యం వృద్ధి చెందుతుంది. పార్టీ నాయకులు, అభ్యర్థులు స్థానిక ప్రజలతో సమకాలీన జాతీయ, అంతర్జాతీయ అంశాలను చర్చించటం ద్వారా ప్రజలలో రాజకీయ అవగాహన ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో, పార్టీలు లేదా నాయకులు ప్రజల నుంచి పూర్తి మద్దతును పొంది సుస్థిరమైన, పటిష్టమైన ప్రభుత్వాన్ని అందివ్వగలుగుతారు. అదేవిధంగా, అధికార, ప్రతిపక్ష పార్టీలు చేసే ప్రచారాన్ని బట్టి ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తుంటారు. గ్రామీణ ప్రాంతపు నిరుపేద నిరక్షరాస్యులు సైతం ఎన్నికల సమయంలో సరైన రాజకీయ తీర్పును వెల్లడిస్తారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం

ప్రశ్న 5.
అధికార వేర్పాటువాద సిద్ధాంతాన్ని వివరించండి.
జవాబు:
అధికారాల వేర్పాటువాద సిద్ధాంతానికి ఫ్రెంచి రాజనీతి కోవిదుడైన మాంటెస్క్యూ మూలపురుషుడు. తన గ్రంథమైన “ద స్పిరిట్ ఆఫ్ లాస్” (The Sprit of Laws 1748) లో ఈ సిద్ధాంత సూత్రాలను వివరించాడు. స్వాభావికంగా మాంటెస్క్యూ మానవ విలువలకు, ఔన్నత్యానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు. ఈ నేపథ్యంలో అతను వ్యక్తుల స్వేచ్ఛలను సంరక్షించే విధంగా అధికారాలు వేర్పాటువాద సిద్ధాంతాన్ని బహుళ ప్రచారంలోకి తీసుకువచ్చాడు. ప్రభుత్వానికి గల సర్వ అధికారాలను ప్రభుత్వ అంగాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల మధ్య విభజించాలని వివరించాడు. ప్రతి ప్రభుత్వ అంగం నిర్దిష్ట అధికారాలను, ప్రత్యేక విధులను కలిగి ఉండాలన్నాడు. ప్రతి అంగం తన పరిధిలోని అధికారాలపై తిరుగులేని పెత్తనాన్ని కలిగి ఉంటూ మరొక అంగానికి చెందిన అధికారాల విషయంలో జోక్యం చేసుకోరాదన్నాడు. ఆ విధంగా ప్రతి ప్రభుత్వ అంగం పాటించటం వల్ల వ్యక్తుల స్వేచ్ఛలను సంరక్షించుకోగలదని భావించాడు.

మాంటెస్క్యూ ఈ సిద్ధాంతాన్ని అధికారాల దుర్వినియోగాన్ని నిరోధించటానికి, వ్యక్తుల స్వేచ్ఛలను కాపాడటానికి ప్రతిపాదించాడు. ఆయన అభిప్రాయంలో వ్యక్తుల రాజకీయ స్వేచ్ఛలు కేవలం “ఆధునిక మితవాద ప్రభుత్వాల్లో” మాత్రమే కాపాడబడతాయి. ఇతని సిద్ధాంతం అధికార దుర్వినియోగాన్ని కట్టడి చేయటమే కాకుండా ప్రతి అంగం తన పరిధికిలోబడి చర్యలు చేపట్టే విధంగా తీర్చిదిద్దింది. మాంటెస్క్యూ తన సిద్ధాంతం ద్వారా నిరోధ, సమతౌల్య సూత్రాన్ని (Checks and Balances) ప్రతి అంగం పాటించే విధంగా చెప్పాడు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రభుత్వాన్ని నిర్వచించండి. [Mar. 2017]
జవాబు:
రాజ్యము యొక్క లక్ష్యాలను, ఆశ్రయాలను రూపొందించి అమలుచేసేందుకు తోడ్పడే సాధనమే ప్రభుత్వం. ప్రజలకు సంబంధించి సమిష్టి విధానాలను, ప్రయోజనాలను, చర్యలను చేపట్టి వాటిని నిర్వహించటానికి ఒక సాధనంగా లేదా యంత్రంగా పనిచేసేదే ప్రభుత్వం” అని ప్రొఫెసర్ జె.డబ్ల్యు. గార్నర్ పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
అరిస్టాటిల్ ప్రభుత్వాల వర్గీకరణ గురించి రాయండి.
జవాబు:
అరిస్టాటిల్ ప్రభుత్వాలను రెండు అంశాల ప్రాతిపదికగా వర్గీకరించారు. అవి

  1. రాజ్యాధికారంలో ఉన్న వ్యక్తుల సంఖ్యను బట్టి
  2. రాజ్య అంతిమ లక్ష్యాన్ని బట్టి

మరో విధంగా చెప్పాలంటే ప్రభుత్వాలను మంచి ప్రభుత్వాలు, చెడు ప్రభుత్వాలుగా వర్గీకరించటం జరిగింది. రాజరికం, కులీన పాలన, మధ్యతరగతి పాలన అనేవి అరిస్టాటిల్ దృష్టిలో మంచి ప్రభుత్వాలు. నిరంకుశత్వం, అల్పజనపాలన, ప్రజాస్వామ్యం అనేవి చెడు ప్రభుత్వాలు అని అరిస్టాటిల్ పేర్కొన్నాడు.

ప్రశ్న 3.
కులీనస్వామ్యం అర్థాన్ని వివరించండి.
జవాబు:
రాజ్యాధికారాన్ని సమాజంలో కొద్దిమంది వ్యక్తులకు, వారి పుట్టుక, శక్తిసామర్థ్యాలు, సంపద, హోదా ప్రాతిపదికగా ఇచ్చినట్లయితే అటువంటి ప్రభుత్వ వ్యవస్థను కులీనస్వామ్యం అని అంటారు. ఈ కులీన వర్గం ప్రజాహితాన్ని విస్మరించినట్లయితే ‘అల్పజనపాలన’గా మారుతుందని అరిస్టాటిల్ పేర్కొన్నాడు.

AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం

ప్రశ్న 4.
ప్రజాస్వామ్యాన్ని నిర్వచించండి.
జవాబు:
మధ్యతరగతి ప్రభుత్వం వికృతరూపంగా మారి స్వార్థపరులచేత పరిపాలించబడే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం లేదా మూకపాలన (Mobocracy) అని అరిస్టాటిల్ పేర్కొన్నాడు. స్టీఫెన్ లీకాక్ ప్రకారం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పాలకులు వయోజనులైన పౌరుల చేత ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ఎన్నుకోబడతారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి మెజారిటీ ప్రజల మద్దతు లభిస్తుంది.

ప్రశ్న 5.
ఏకకేంద్ర ప్రభుత్వం అంటే ఏమిటి ?
జవాబు:
“ఏ వ్యవస్థలో రాజ్యము యొక్క సర్వాధికారాలను ఒకే కేంద్రీయ అధికార వ్యవస్థ వాడుకగా వినియోగిస్తుందో, ఆ అధికార వ్యవస్థనే ఏకేంద్ర ప్రభుత్వం” అని ఎ.వి.డైసీ పేర్కొన్నాడు. ఈ విధానంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కటే ఉంటుంది. అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో కేంద్రీకరించబడి ఉంటాయి. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం తన అవసరం మేరకు ఏర్పాటు చేసుకొనే వీలుంది.

ప్రశ్న 6.
సమాఖ్య ప్రభుత్వాన్ని ఎలా అర్థం చేసుకొంటావు ?
జవాబు:
“జాతీయ సమైక్యత, ప్రాంతీయ విభాగాల హక్కులను సమన్వయపరచే రాజకీయ సాధనమే సమాఖ్య ప్రభుత్వం” అని ఎ.వి.డైసీ పేర్కొన్నాడు. సమాఖ్య ప్రభుత్వానికి ప్రధానంగా మూడు లక్షణాలుంటాయని ఎ.వి.డైసీ పేర్కొన్నాడు.

  1. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్పష్టమైన, నిర్దిష్టమైన అధికారాల పంపిణీ.
  2. లిఖిత, దృఢ, ఉన్నత రాజ్యాంగం 3) స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన న్యాయవ్యవస్థ.

ప్రశ్న 7.
అధికార వేర్పాటువాద సిద్ధాంతాన్ని క్లుప్తంగా రాయండి.
జవాబు:
ఫ్రెంచి రచయిత అయిన మాంటెస్క్యూ తాను రచించిన ‘ద స్పిరిట్ ఆఫ్ లాస్’ అనే గ్రంథంలో అధికార వేర్పాటువాద సిద్ధాంతాన్ని పేర్కొనటం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రభుత్వము యొక్క సర్వాధికారాలను మూడు ప్రభుత్వాంగాలైన శాసననిర్మాణశాఖ, కార్యనిర్వాహకశాఖ మరియు న్యాయశాఖల మధ్య విభజించాలి. ప్రతి ప్రభుత్వాంగం తన పరిధిలోని అధికారాలపై తిరుగులేని పెత్తనాన్ని కలిగి ఉంటూ, మరొక అంగానికి చెందిన అధికారాల విషయంలో జోక్యం చేసుకోరాదు అని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది.

ప్రశ్న 8.
ప్రభుత్వ అంగాలు ఎన్ని ? వాటి పేర్లను తెలపండి.
జవాబు:
ప్రభుత్వ అంగాలు మూడు. అవి 1) శాసననిర్మాణశాఖ 2) కార్యనిర్వాహకశాఖ 3) న్యాయశాఖ. శాసననిర్మాణ శాఖ శాసనాలను రూపొందిస్తుంది. కార్యనిర్వాహకశాఖ శాసనాలను అమలుచేస్తుంది. న్యాయశాఖ ఈ రెండు శాఖల మధ్య తలెత్తే సమస్యలను పరిష్కరిస్తూ దేశ ప్రజలందరికి నిష్పక్షపాతంగా న్యాయాన్ని ప్రసాదిస్తుంది.

ప్రశ్న 9.
పార్లమెంటరీ ప్రభుత్వాన్ని గురించి నీకు ఏమి తెలియును ?
జవాబు:
పార్లమెంటరీ ప్రభుత్వమంటే నిజమైన కార్యనిర్వాహకవర్గం, మంత్రిమండలి లేదా మంత్రివర్గం

  1. తక్షణం, చట్టబద్ధంగా తన రాజకీయ విధానాలు, చర్యలకు శాసనసభకు
  2. అంతిమంగా నియోజకులకు బాధ్యత వహించే వ్యవస్థతో కూడుకొన్నది” అని ప్రొఫెసర్ గార్నర్ నిర్వచించటం జరిగింది.

AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం

ప్రశ్న 10.
అధ్యక్ష తరహా ప్రభుత్వానికి గల ఇతర పేర్లు ఏవి ?
జవాబు:
అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహకవర్గం తన చర్యలకు శాసననిర్మాణ శాఖకు ఎటువంటి బాధ్యత వహించదు. దీనిని ‘ఏకసభ్య కార్యనిర్వాహక ప్రభుత్వం’ అని, ‘నిర్ణీత కాలపరిమితిగల ప్రభుత్వమని’, ‘బాధ్యతారహిత ప్రభుత్వమని’ సంబోధిస్తారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 11 రాజ్యాంగం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 11th Lesson రాజ్యాంగం Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 11th Lesson రాజ్యాంగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజ్యాంగాన్ని నిర్వచించి, రాజ్యాంగం లక్షణాలను వివరించండి.
జవాబు:
పరిచయం: ఆధునిక కాలంలో ప్రతి రాజ్యానికి ఒక రాజ్యాంగముంటుంది. రాజ్యాంగంలో రాజ్యానికి సంబంధించిన అన్ని వ్యవస్థల అధికారాలు, విధులు మొదలైన విషయాలను స్పష్టంగా, నిర్దిష్టంగా, క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది. రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు క్రమబద్ధంగా జరగడానికి రాజ్యాంగం చాలా ముఖ్యం.

అర్థం: Constitution అనే ఇంగ్లీషు పదం “Constitutio” అనే లాటిన్పదం నుండి ఉద్భవించింది. లాటిన్ భాషలో కాన్స్టిట్యూషియో అంటే “స్థాపించు” అని అర్థం.

నిర్వచనాలు:

  1. అరిస్టాటిల్: “రాజ్యంలో అత్యున్నతమైన పదవులతో సహా అన్నింటిని క్రమబద్ధంగా ఏర్పాటు చేసేదే రాజ్యాంగం”.
  2. లార్డ్ బ్రైస్: “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం”.
  3. స్టీఫెన్ లీకాక్: “రాజ్యాంగం అంటే ప్రభుత్వరూపం”.

రాజ్యాంగం మౌలిక లక్షణాలు (Essential features of the Constitution): సాధారణంగా రాజ్యాంగాన్ని రాజ్యంలోని ప్రముఖ వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, విషయ నిపుణులు మొదలైనవారు రూపొందిస్తారు. ప్రతి రాజ్యాంగానికి కొన్ని మౌళిక లక్షణాలు ఉంటాయి. వాటిని క్రింది విధంగా వివరించవచ్చు.

1) పీఠిక (Preamble): ప్రతి రాజ్యాంగం ఒక పీఠికను కలిగి ఉంటుంది. ఆ పీఠిక రాజ్యాంగ లక్ష్యాలు, ఆకాంక్షలను వ్యక్తీకరిస్తుంది. పీఠిక రాజ్యాంగానికి ఆత్మగా ఉంటుంది. కాబట్టి రాజ్యాంగపు ఆవశ్యక లక్షణాలలో పీఠిక అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించవచ్చు.

2) స్పష్టత (Clarity): స్పష్టత అనేది రాజ్యాంగపు మరొక ఆవశ్యక లక్షణం. రాజ్యపాలన, ప్రభుత్వ విధానాలను రాజ్యాంగం స్పష్టంగా వివరిస్తుంది. రాజ్యాంగం ఎంతో సులభశైలిలో, స్పష్టమైన భాషలో లిఖించబడి ఉంటుంది. కాబట్టి రాజ్యాంగంలోని వివిధ అంశాలను అర్థం చేసుకోవడంలో ఏ రకమైన సందేహాలకు గానీ, అస్పష్టతకు గానీ అవకాశం ఉండదు. సమాజంలోని అన్ని వర్గాలకు ఎంతగానో సంతృప్తిని కలిగిస్తుంది. సుదీర్ఘ చర్చలు, సంప్రదింపుల తరువాతే రాజ్యాంగ రూపకల్పన జరుగుతుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 11 రాజ్యాంగం

3) ప్రాథమిక హక్కులు (Fundamental Rights): ప్రతి రాజ్యాంగం కొన్ని ప్రాథమిక హక్కులను కలిగి ఉంటుంది. ప్రాథమిక హక్కులనేవి పౌరుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను పరిరక్షించుటకు ఉద్దేశించినవి. విభిన్న రంగాలలో పౌరులు తమ వ్యక్తిత్వాలను పెంపొందించుకొనేందుకు ఈ హక్కులు వీలు కల్పిస్తాయి. రాజ్యంలో పౌరులు సంతోషకరమైన, గౌరవప్రదమైన జీవనాన్ని గడిపేందుకు ఇవి సహాయపడతాయి.

4) క్లుప్తత (Brevity): క్లుప్తత అనేది రాజ్యాంగపు లక్షణాలలో ముఖ్యమైనది. రాజ్యాంగ అంశాలను అర్థం చేసుకోవడంలోను వాటిని వ్యాఖ్యానించడం లోనూ వ్యక్తులలో గందరగోళాన్ని నివారిస్తుంది. రాజ్యాంగంలో అనవసర అంశాలు చేర్చబడవు. కాబట్టి రాజ్యాంగం అనేది క్లుప్తంగా ఉంటుంది. అందులో మితిమీరిన సంఖ్యలో ప్రకరణలు, అధికరణలు, ఇతర నిబంధనలు ఉండవు. రాజ్యాంగంలో లెక్కకు మించిన వివరణలు ఉంటే వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

5) సరళత్వం (Flexibility): ప్రజల ఆకాంక్షలను ఎప్పటికప్పుడు గ్రహించి, వాటిని ఆచరణలో పెట్టేందుకు రాజ్యాంగం సరళమైనదిగా ఉండాలి. అవసరమైనప్పుడు రాజ్యాంగంలోని ప్రకరణలను సవరించే వీలు ఉండాలి. అయితే రాజ్యాంగంలోని అంశాలను పలుసార్లు సవరించకూడదు. అప్పుడే రాజ్యాంగస్ఫూర్తి’ పదిలంగా ఉంటుంది. అలాగే ఆధునిక రాజ్యాలలో రాజ్యాంగంలోని అంశాలను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సవరించేందుకు అవకాశం ఉండాలి. అనుభవజ్ఞులు, మేధావులు రాజ్యాంగంలోని దోషాలను వెల్లడించినప్పుడు, వాటిని రాజ్యాంగం నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి.

6) శాశ్వతత్వం (Permanence): రాజ్యాంగం ముఖ్య లక్షణాలలో శాశ్వతత్వం ఒకటి. మొత్తం జాతి సంక్షేమం దృష్ట్యా రాజ్యాంగం సుదీర్ఘకాలంపాటు పనిచేసే విధంగా కొన్ని విలువలు కలిగి ఉండాలి. ఎందుకంటే రాజ్యాంగమనేది రాజ్యంతో సహా అనేక రాజకీయ సంస్థల నిర్మాణానికి – విధులకు ప్రతీకగా ఉంటుంది. ప్రజల ఆచార సంప్రదాయాలను రాజ్యాంగం గౌరవిస్తూ సామాజిక విలువలతో మమేకమై ఉండాలి.

7) రాజ్యాంగ సవరణ పద్ధతి (Mode of Amemdment): రాజ్యాంగంలోని అంశాలను సవరించే పద్దతిని ప్రతి రాజ్యాంగం సూచిస్తుంది. రాజ్యాంగం రాజ్యంలో నెలకొనే సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. రాజ్యాంగ అంశాల సవరణ పద్ధతుల గురించి రాజ్యాంగంలో ప్రత్యేక అధ్యాయంలో వివరించటం జరుగుతుంది. సాధారణంగా రాజ్యాంగ అంశాలను మూడు రకాలుగా సవరించవచ్చు. అవి 1) కఠినమైన చర్య పద్ధతి 2) సరళమైన పద్ధతి 3) పాక్షిక కఠినమైన, పాక్షిక సరళమైన పద్ధతి.

మొత్తం మీద ప్రతి రాజ్యాంగంలో సరళమైన, కఠినమైన సవరణ పద్ధతులు రెండూ ఉంటాయి. పర్యవసానంగా రాజ్యంలో ప్రభుత్వం స్థిరత్వం కలిగి ఉంటూ అందరి ఆమోదాన్ని పొందగలుగుతుంది. రాజ్యాంగంలోని సరళమైన, కఠినమైన సవరణ పద్ధతులు రెండూ రాజకీయ వ్యవస్థ సాఫీగా, సమర్థవంతంగా పనిచేసేటట్లు దోహదపడతాయని అనేక మంది రాజ్యాంగవేత్తలు వర్ణించారు.

8) వివరణాత్మకమైనది (Explanatory): రాజ్యాంగం వివరణాత్మకమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా ప్రజలకు, ప్రభుత్వానికి రాజ్యానికి సంబంధించిన అనే అంశాలను రాజ్యాంగంలో ప్రస్తావించి చర్చించడమవుతుంది. రాజ్యనిర్మాణం, దాని కార్యకలాపాల పరిధి, విధులకు సంబంధించి ప్రత్యేకంగా రాజ్యాంగంలో పేర్కొనడం జరుగుతుంది.

ప్రశ్న 2.
రాజ్యాంగాన్ని నిర్వచించి సరళ, ధృడ రాజ్యాంగాల మధ్య వ్యత్యాసాలను పేర్కొనండి. (లేదా) రాజ్యాంగాన్ని నిర్వచించి ధృడ, అధృడ (లేదా) పరుష, సరళ రాజ్యాంగాల మధ్య వ్యత్యాసాలను పేర్కొనండి. [Mar. 2016]
జవాబు:
నిర్వచనం:

  1. అరిస్టాటిల్: “రాజ్యంలో అత్యున్నతమైన పదవులతో సహా అన్నింటిని క్రమబద్ధంగా ఏర్పాటు చేసేదే రాజ్యాంగం”.
  2. లార్డ్ బ్రైస్: “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం”.
  3. స్టీఫెన్ లీకాక్: “రాజ్యాంగం అంటే ప్రభుత్వరూపం”.

ధృడ రాజ్యాంగం (లేదా) పరుష రాజ్యాంగం: రాజ్యాంగంలోని అంశాలను అంత సులభంగా సవరించడం సాధ్యంకాని రాజ్యాంగాన్ని ధృఢ రాజ్యాంగం అంటారు. ధృడ రాజ్యాంగం అమలులో ఉన్న రాజ్యాలలో సాధారణ చట్టాల తయారీకి, రాజ్యాంగ చట్టాల రూపకల్పనకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ధృఢ రాజ్యాంగంలోని అంశాలను సవరించేందుకు ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించడం జరుగుతుంది. రాజ్యాంగ అంశాల సవరణలో ధృడ రాజ్యాంగం ఎంతో కాఠిన్యతను ప్రదర్శిస్తుంది. ధృడరాజ్యాంగానికి అత్యుత్తమ ఉదాహరణగా అమెరికా రాజ్యాంగాన్ని పేర్కొనవచ్చు. అమెరికాతో పాటుగా ఆస్ట్రేలియా, స్విజర్లాండ్ వంటి రాజ్యాలలో ధృఢ రాజ్యాంగాలు వాడుకలో ఉన్నాయి.

సరళ లేదా అధృడ రాజ్యాంగం: రాజ్యాంగంలోని అంశాలను అతిసులభంగా మార్చేందుకు అవకాశం ఉన్నట్లయితే దానిని అధృడ రాజ్యాంగం అంటారు. అధృడ రాజ్యాంగంలోని అంశాల సవరణకు ప్రత్యేక రాజ్యాంగ సవరణ పద్ధతిని అనుసరించాల్సిన అవసరం లేదు. సాధారణ చట్టాల వలె రాజ్యాంగంలోని అంశాలను సైతం సవరించే వీలు ఉంటుంది. అందువల్ల అధృడ రాజ్యాంగంలో సాధారణ చట్టాలు, రాజ్యాంగ చట్టాల మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు. అధృడ రాజ్యాంగాలనేవి ప్రాచీన కాలంలో వాడుకలో ఉండేవి. అధృడ రాజ్యాంగానికి బ్రిటన్ మంచి ఉదాహరణ.

AP Inter 1st Year Civics Study Material Chapter 11 రాజ్యాంగం

సరళ లేదా అధృడ మరియు ధృడ లేదా పరుష రాజ్యాంగాల మధ్య వ్యత్యాసాలు:
సరళ లేదా అధృడ రాజ్యాంగం లేదా (Flexible constitution)

  1. రాజ్యాంగంలోని అంశాలు స్పష్టంగా పేర్కొనడం జరగదు.
  2. రాజ్యాంగాన్ని సులభంగా సవరించవచ్చు.
  3. ప్రజల హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను న్యాయశాఖ కాపాడగలుగుతుంది.
  4. ఇది సమాఖ్య రాజ్యానికి సరైనది కాదు.
  5. ఇది న్యాయసమీక్షకు అవకాశం ఇవ్వదు.
  6. ఈ రాజ్యాంగంలో శాసనసభకు అపరిమితమైన అధికారాలు ఉంటాయి.
  7. ఇది మిక్కిలి అస్థిరమైనది.
  8. రాజ్యాంగ చట్టాలకు, సాధారణ చట్టాలకు మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు.
  9. రాజ్యంలో ఒకేరకమైన చట్టాలు ఉంటాయి.
  10. రాజకీయ పురోగతి సాధించిన రాజ్యాలకు అధృఢ రాజ్యాంగం అనువైనది.
  11. విప్లవాలకు వీలు కల్పించదు.
  12. పెద్ద రాజ్యాలకు సరైనది.

పరుష లేదా ధృడ రాజ్యాంగం (Rigid Constitution)

  1. రాజ్యాగంలోని అంశాలు స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది.
  2. రాజ్యాంగాన్ని సవరించేందుకు కఠినమైన పద్ధతి ఉంటుంది.
  3. ప్రజల హక్కులు, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను న్యాయ శాఖ కాపాడలేకపోవచ్చు.
  4. ఇది సమాఖ్య రాజ్యానికి సరైనది.
  5. ఇది న్యాయసమీక్షకు అవకాశం ఇస్తుంది.
  6. శాసనసభ అధికారాలు పరిమితంగా ఉంటాయి.
  7. ఇది ఎంతో స్థిరత్వంతో కూడుకొని ఉంటుంది.
  8. రాజ్యాంగ చట్టాలు, సాధారణ చట్టాల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
  9. రాజ్యంలో రెండు రకాల చట్టాలు ఉంటాయి.
    అవి: 1) రాజ్యాంగ చట్టాలు 2) సాధారణ చట్టాలు. రాజ్యాంగ చట్టాలు సాధారణ చట్టాలపై ఆధిక్యతను కలిగి ఉంటాయి.
  10. అభివృద్ధి చెందుతున్న రాజ్యాలకు ధృఢ రాజ్యాంగం అనువైనది.
  11. విప్లవాలకు అవకాశం ఇస్తుంది.
  12. చిన్న రాజ్యాలకు తగినది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజ్యాంగాన్ని నిర్వచించి, రాజ్యాంగ లక్షణాలను తెలపండి.
జవాబు:
నిర్వచనాలు:

  1. అరిస్టాటిల్: “రాజ్యంలో అత్యున్నతమైన పదవులతో సహా అన్నింటిని క్రమబద్ధంగా ఏర్పాటు చేసేదే “రాజ్యాంగం”.
  2. లార్డ్ బ్రైస్: “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం”.
  3. స్టీఫెన్ లీకాక్: “రాజ్యాంగం అంటే ప్రభుత్వరూపం”.

రాజ్యాంగం మౌలిక లక్షణాలు (Essential features of the Constitution): సాధారణంగా రాజ్యాంగాన్ని రాజ్యంలోని ప్రముఖ వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, విషయ నిపుణులు మొదలైనవారు రూపొందిస్తారు. ప్రతి రాజ్యాంగానికి కొన్ని మౌళిక లక్షణాలు ఉంటాయి. వాటిని క్రింది విధంగా వివరించవచ్చు.

1) పీఠిక (Preamble): ప్రతి రాజ్యాంగం ఒక పీఠికను కలిగి ఉంటుంది. ఆ పీఠిక రాజ్యాంగ లక్ష్యాలు, ఆకాంక్షలను వ్యక్తీకరిస్తుంది. పీఠిక రాజ్యాంగానికి ఆత్మగా ఉంటుంది. కాబట్టి రాజ్యాంగపు ఆవశ్యక లక్షణాలలో పీఠిక అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించవచ్చు.

2) స్పష్టత (Clarity): స్పష్టత అనేది రాజ్యాంగపు మరొక ఆవశ్యక లక్షణం. రాజ్యపాలన, ప్రభుత్వ విధానాలను రాజ్యాంగం స్పష్టంగా వివరిస్తుంది. రాజ్యాంగం ఎంతో సులభశైలిలో, స్పష్టమైన భాషలో లిఖించబడి ఉంటుంది. కాబట్టి రాజ్యాంగంలోని వివిధ అంశాలను అర్థం చేసుకోవడంలో ఏ రకమైన సందేహాలకు గానీ, అస్పష్టతకు గానీ అవకాశం ఉండదు. సమాజంలోని అన్ని వర్గాలకు ఎంతగానో సంతృప్తిని కలిగిస్తుంది. సుదీర్ఘ చర్చలు, సంప్రదింపుల తరువాతే రాజ్యాంగ రూపకల్పన జరుగుతుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 11 రాజ్యాంగం

3) ప్రాథమిక హక్కులు (Fundamental Rights): ప్రతి రాజ్యాంగం కొన్ని ప్రాథమిక హక్కులను కలిగి ఉంటుంది. ప్రాథమిక హక్కులనేవి పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పరిరక్షించుటకు ఉద్దేశించినవి. విభిన్న రంగాలలో పౌరులు తమ వ్యక్తిత్వాలను పెంపొందించుకొనేందుకు ఈ హక్కులు వీలు కల్పిస్తాయి. రాజ్యంలో పౌరులు సంతోషకరమైన, గౌరవప్రదమైన జీవనాన్ని గడిపేందుకు ఇవి సహాయపడతాయి.

4) క్లుప్తత (Brevity): క్లుప్తత అనేది రాజ్యాంగపు లక్షణాలలో ముఖ్యమైనది. రాజ్యాంగ అంశాలను అర్థం చేసుకోవడంలోను వాటిని వ్యాఖ్యానించడం లోనూ వ్యక్తులలో గందరగోళాన్ని నివారిస్తుంది. రాజ్యాంగంలో అనవసర అంశాలు చేర్చబడవు. కాబట్టి రాజ్యాంగం అనేది క్లుప్తంగా ఉంటుంది. అందులో మితిమీరిన సంఖ్యలో ప్రకరణలు, అధికరణలు, ఇతర నిబంధనలు ఉండవు. రాజ్యాంగంలో లెక్కకు మించిన వివరణలు ఉంటే వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

5) సరళత్వం (Flexibility): ప్రజల ఆకాంక్షలను ఎప్పటికప్పుడు గ్రహించి, వాటిని ఆచరణలో పెట్టేందుకు రాజ్యాంగం సరళమైనదిగా ఉండాలి. అవసరమైనప్పుడు రాజ్యాంగంలోని ప్రకరణలను సవరించే వీలు ఉండాలి. | అయితే రాజ్యాంగంలోని అంశాలను పలుసార్లు సవరించకూడదు. అప్పుడే రాజ్యాంగస్ఫూర్తి పదిలంగా ఉంటుంది. అలాగే ఆధునిక రాజ్యాలలో రాజ్యాంగంలోని అంశాలను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సవరించేందుకు అవకాశం ఉండాలి. అనుభవజ్ఞులు, మేధావులు రాజ్యాంగంలోని దోషాలను వెల్లడించినప్పుడు, వాటిని రాజ్యాంగం నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి.

6) శాశ్వతత్వం (Permanence): రాజ్యాంగం ముఖ్య లక్షణాలలో శాశ్వతత్వం ఒకటి. మొత్తం జాతి సంక్షేమం దృష్ట్యా రాజ్యాంగం సుదీర్ఘకాలంపాటు పనిచేసే విధంగా కొన్ని విలువలు కలిగి ఉండాలి. ఎందుకంటే రాజ్యాంగమనేది రాజ్యంతో సహా అనేక రాజకీయ సంస్థల నిర్మాణానికి – విధులకు ప్రతీకగా ఉంటుంది. ప్రజల ఆచార సంప్రదాయాలను రాజ్యాంగం గౌరవిస్తూ సామాజిక విలువలతో మమేకమై ఉండాలి.

7) రాజ్యాంగ సవరణ పద్ధతి (Mode of Amemdment): రాజ్యాంగంలోని అంశాలను సవరించే పద్దతిని ప్రతి రాజ్యాంగం సూచిస్తుంది. రాజ్యాంగం రాజ్యంలో నెలకొనే సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. రాజ్యాంగ అంశాల సవరణ పద్ధతుల గురించి రాజ్యాంగంలో ప్రత్యేక అధ్యాయంలో వివరించటం జరుగుతుంది. సాధారణంగా రాజ్యాంగ అంశాలను మూడు రకాలుగా సవరించవచ్చు. అవి 1) కఠినమైన చర్య పద్దతి 2) సరళమైన పద్ధతి 3) పాక్షిక కఠినమైన, పాక్షిక సరళమైన పద్ధతి.

మొత్తం మీద ప్రతి రాజ్యాంగంలో సరళమైన, కఠినమైన సవరణ పద్ధతులు రెండూ ఉంటాయి. పర్యవసానంగా రాజ్యంలో ప్రభుత్వం స్థిరత్వం కలిగి ఉంటూ అందరి ఆమోదాన్ని పొందగలుగుతుంది. రాజ్యాంగంలోని సరళమైన, కఠినమైన సవరణ పద్ధతులు రెండూ రాజకీయ వ్యవస్థ సాఫీగా, సమర్థవంతంగా పనిచేసేటట్లు దోహదపడతాయని అనేక మంది రాజ్యాంగవేత్తలు వర్ణించారు.

8) వివరణాత్మకమైనది (Explanatory): రాజ్యాంగం వివరణాత్మకమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా ప్రజలకు, ప్రభుత్వానికి రాజ్యానికి సంబంధించిన అనేక అంశాలను రాజ్యాంగంలో ప్రస్తావించి చర్చించడమవుతుంది. రాజ్యనిర్మాణం, దాని కార్యకలాపాల పరిధి, విధులకు సంబంధించి ప్రత్యేకంగా రాజ్యాంగంలో పేర్కొనడం జరుగుతుంది.

ప్రశ్న 2.
లిఖిత రాజ్యాంగం ప్రయోజనాలు, లోపాలు ఏవి ?
జవాబు:
లిఖిత రాజ్యాంగం (Written Constitution): లిఖిత రాజ్యాంగాన్ని ఒక రాజ్యాంగ పరిషత్తు లేదా ప్రత్యేక సదస్సు రూపొందిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన అనేక నియమ నిబంధనలు ఈ రాజ్యాంగంలో ఉంటాయి. లిఖిత రాజ్యాంగానికి భారత రాజ్యాంగం ఒక చక్కటి ఉదాహరణగా పేర్కొనవచ్చు. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా అమెరికా రాజ్యాంగాన్ని పరిగణించడమైనది.

ప్రయోజనాలు (Merits):

  1. లిఖిత రాజ్యాంగం మిక్కిలి సులభమైనది. రాజ్యంలోని వివిధ సంస్థల నిర్మాణ, నిర్వహణలను అవగాహన చేసుకోవడంలో లిఖిత రాజ్యాంగం ఏవిధమైన గందరగోళానికి, అస్పష్టతలకు అవకాశం ఇవ్వదు.
  2. లిఖిత రాజ్యాంగం కొంతమేరకు కఠిన స్వభావాన్ని కలిగి ఉంటుంది. దాంతో అది రాజకీయ స్థిరత్వాన్ని అందించగలుగుతుంది.
  3. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడుతుంది.
  4. కేంద్ర, రాష్ట్రాల మధ్య న్యాయమైన రీతిలో అధికారాల పంపిణి ద్వారా సమతౌల్యతను పాటిస్తుంది.
  5. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుంది. ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వానికి గుర్తుచేస్తుంది.
  6. ప్రభుత్వ అధికారాలపై కొన్ని పరిమితులను విధిస్తుంది.
  7. సమాఖ్యవ్యవస్థ పవిత్రతను, స్ఫూర్తిని కాపాడుతుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 11 రాజ్యాంగం

లోపాలు (Demerits):

  1. లిఖిత రాజ్యాంగం మెరుగైన ప్రభుత్వాన్ని అందించలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీలపై రాజ్యాంగం అనేక ఆంక్షలను విధిస్తుంది.
  2. లిఖిత రాజ్యాంగపు కఠిన స్వభావం రాజ్యం అభివృద్ధికి దోహదపడదు.
  3. ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా ఆ రాజ్యాంగంలోని అంశాలను సవరించడం సాధ్యం కాదు. దాంతో జాతి పురోగతి మందకొడిగా సాగుతుంది.
  4. న్యాయశాఖ ఆధిపత్యానికి లిఖితరాజ్యాంగం అవకాశం ఇస్తుంది.
  5. ప్రభుత్వాంగాల మధ్య ఘర్షణలకు వీలు కల్పిస్తుంది.
  6. సంక్షేమ రాజ్యస్థాపనకు అనుకూలం కాదు.

ప్రశ్న 3.
అలిఖిత రాజ్యాంగం ప్రయోజనాలు, లోపాలను వివరించండి.
జవాబు:
అలిఖిత రాజ్యాంగం (Unwritten Constitution): అలిఖిత రాజ్యాంగం అనేది ప్రత్యేక రాతప్రతిలో పేర్కొనబడని రాజ్యాంగం. అలిఖిత రాజ్యాంగం అనేక ఆచారాలు సంప్రదాయాల ఆధారంగా ఏర్పడినది. వీటినే శాసనాలకు ప్రాతిపదికగా తీసుకుంటారు. ఇటువంటి రాజ్యాంగం అత్యంత ప్రాచీనమైన, చట్టబద్ధమైన పాలనకు అవకాశం కల్పిస్తుందని పలువురు భావించారు. 18వ శతాబ్దం వరకు ప్రపంచంలో అనేక రాజ్యాలలో రాజ్యాంగబద్ధమైన పాలనకు ఇటువంటి రాజ్యాంగాలు ఆధారంగా ఉంటూ వచ్చాయి. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణలో శాసనబద్ధమైన పాలనకు ఈ రాజ్యాంగాలు వీలు కల్పించాయి.

బ్రిటన్ రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగానికి అత్యుత్తమ ఉదాహరణ. బ్రిటన్ లో చట్టాలన్నీ ఆచారాలు, సంప్రదాయాలు, వాడుకలు, అలవాట్ల ఆధారంగా రూపొందించబడ్డాయి.
ప్రయోజనాలు (Merits):

  1. ప్రగతిశీలక శాసన నిర్మాణానికి అలిఖిత రాజ్యాంగం దోహదపడుతుంది. ఇటువంటి రాజ్యాంగం అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది.
  2. అలిఖిత రాజ్యాంగం కాలానుగుణంగా సంభవించిన పరిణామాలకు ప్రతీకగా మార్పు చెందుతూ ఉంటుంది. రాజకీయ వ్యవస్థను ఉత్తమమైందిగా తీర్చిదిద్దేందుకు వీలు కల్పిస్తుంది.
  3. అలిఖిత రాజ్యాంగంలోని అంశాలు వ్యాకోచ స్వభావాన్ని కలిగిఉంటాయి. అందువల్ల ఈ రాజ్యాంగంలో మార్పులను సులభంగా ప్రవేశపెట్టవచ్చు.
  4. ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగంలోని అంశాలను సవరించుకొనే వీలుంటుంది.
  5. అలిఖిత రాజ్యాంగం అవాంఛనీయమైన విప్లవాలు, ఇతర ఆందోళనలకు అవకాశం ఇవ్వదు. ప్రజల డిమాండ్లను పరిష్కరించే వీలు ఈ రాజ్యాంగం కల్పిస్తుంది.

లోపాలు (Demerits):

  1. అలిఖిత రాజ్యాంగంలోని అంశాలను అధికారంలో ఉన్న పార్టీ స్వీయ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా తరచుగా సవరించే అవకాశం ఉంటుంది. దాంతో రాజ్యంలో రాజకీయ సుస్థిరతకు భంగం వాటిల్లే ప్రమాదం ఏర్పడుతుంది.
  2. అలిఖిత రాజ్యాంగం న్యాయమూర్తుల చేతిలో ఆటబొమ్మగా మారే అవకాశాలు ఎక్కువ. న్యాయమూర్తులు యధేచ్ఛగా రాజ్యాంగంలోని అంశాలను వ్యాఖ్యానించే అవకాశం ఉంటుంది.
  3. ప్రజాస్వామ్య రాజ్యాలకు అలిఖిత రాజ్యాంగం అనుకూలమైనది కాదు.
  4. సమాఖ్య రాజ్యాలకు ఇటువంటి రాజ్యాంగం సరిపోదు.
  5. ప్రజల హక్కులు, స్వాతంత్ర్యాలకు అలిఖిత రాజ్యాంగం రక్షణ కల్పించడంలో విఫలమవుతుంది.
  6. రాజ్యాంగంలోని అంశాలు తరచుగా సవరణలకు లోనవుతాయి.
  7. అలిఖిత రాజ్యాంగం మిక్కిలి లాంఛనప్రాయమైనది.

ప్రశ్న 4.
లిఖిత, అలిఖిత రాజ్యాంగం మధ్య వ్యత్యాసాలను పేర్కొనండి. [Mar. 2017]
జవాబు:
లిఖిత రాజ్యాంగం: లిఖిత రాజ్యాంగాన్ని ఒక రాజ్యాంగ పరిషత్తు లేదా ప్రత్యేక సదస్సు రూపొందిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన అనేక నియమ నిబంధనలు ఈ రాజ్యాంగంలో ఉంటాయి. లిఖిత రాజ్యాంగానికి భారత రాజ్యాంగం ఒక చక్కటి ఉదాహరణగా పేర్కొనవచ్చు. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా అమెరికా రాజ్యాంగాన్ని పరిగణించడమైనది.

అలిఖిత రాజ్యాంగం: అలిఖిత రాజ్యాంగం అనేది ప్రత్యేక రాతప్రతిలో పేర్కొనబడని రాజ్యాంగం. అలిఖిత రాజ్యాంగం అనేక ఆచారాలు సంప్రదాయాల ఆధారంగా ఏర్పడినది. వీటినే శాసనాలకు ప్రాతిపదికగా తీసుకుంటారు. ఇటువంటి రాజ్యాంగం అత్యంత ప్రాచీనమైన, చట్టబద్ధమైన పాలనకు అవకాశం కల్పిస్తుందని పలువురు భావించారు. 18వ శతాబ్దం వరకు ప్రపంచంలో అనేక రాజ్యాలలో రాజ్యాంగబద్ధమైన పాలనకు ఇటువంటి రాజ్యాంగాలు ఆధారంగా ఉంటూ వచ్చాయి. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణలో శాసనబద్ధమైన పాలనకు ఈ రాజ్యాంగాలు వీలు కల్పించాయి. ఈ లిఖిత, అలిఖిత రాజ్యాంగాల మధ్య కింద పేర్కొన్న వ్యత్యాసాలను ప్రతి ఒక్కరు అత్యంత సులభంగా గుర్తించవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 11 రాజ్యాంగం

లిఖిత రాజ్యాంగం (Written Constitution)

  1. లిఖిత రాజ్యాంగం అనేది ఒక రాత ప్రతి లేదా కొన్ని నిర్ణీత రాతప్రతులతో రాయబడి ఉంటుంది. ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను ఈ రాజ్యాంగం నియంత్రించేందుకు కొన్ని నియమ నిబంధనలను సూచిస్తుంది.
  2. రాజ్యానికి సంబంధించిన అన్ని ప్రధాన అంశాలు స్పష్టంగా రాయబడి ఉంటాయి.
  3. లిఖిత రాజ్యాంగాన్ని నిర్దిష్ట సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటైన శాసనసభ రూపొందించి ఆమోదిస్తుంది.
  4. లిఖిత రాజ్యాంగాన్ని సులభంగా సవరించడం సాధ్యం కాదు.
  5. లిఖిత రాజ్యాంగంలో ఉదహరించబడిన పౌరుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను న్యాయస్థానాలు పరిరక్షిస్తాయి.
  6. లిఖిత రాజ్యాంగం ఒక నిర్ణీత కాలంలో రూపొందించబడింది.
  7. లిఖిత రాజ్యాంగం రాజకీయ సుస్థిరతను ఏర్పరుస్తుంది.
  8. విద్యావంతులు, అక్షరాస్యులు అధికంగా ఉన్న రాజ్యాలకు లిఖిత రాజ్యాంగం సరైంది.
  9. లిఖిత రాజ్యాంగం సమాఖ్య రాజ్యాలకు తగినది.

అలిఖిత రాజ్యాంగం (Unwritten Constitution)

  1. అలిఖిత రాజ్యాంగం అనేది అనేక ఆచారాలు, సంప్రదాయాలు, వేడుకలు, అలవాట్ల సమాహారం. ఈ రాజ్యాంగంలోని అంశాలు క్రమబద్ధంగా ఒకచోట రాయబడి ఉండవు.
  2. రాజ్యానికి సంబంధించిన అంశాలన్నీ ఆచార సంప్రదాయాలు, వాడుకల రూపంలో ఉంటాయి.
  3. అలిఖిత రాజ్యాంగంలోని అంశాలు నిర్దిష్ట సమయంలో రూపొందినవి కావు. అవి కాలాను గుణంగా శాసనాల రూపంలో, ముఖ్యమైన నిబంధనలు (Charters) ద్వారా వివిధ కాలాలలో అమల్లోకి వస్తాయి.
  4. అలిఖిత రాజ్యాంగాన్ని సవరించడం ఎంతో సులభం.
  5. అలిఖిత రాజ్యాంగాన్ని పౌరుల ప్రాథమిక హక్కులను న్యాయస్థానాలు సులభమైన రీతిలో కాపాడలేవు.
  6. అలిఖిత రాజ్యాంగం మారుతూ ఉంటుంది.
  7. అలిఖిత రాజ్యాంగం రాజకీయ స్థిరత్వాన్ని అందించక పోవచ్చు.
  8. నిరక్షరాస్యులు, విద్యావంతులైన ప్రజలకు అలిఖిత రాజ్యాంగం సరైనది.
  9. అలిఖిత రాజ్యాంగం ఏకకేంద్ర రాజ్యాలకు సరైనది.

ప్రశ్న 5.
దృఢ రాజ్యాంగంలోని ప్రయోజనాలు, లోపాలను వివరించండి. [Mar. 2018]
జవాబు:
దృఢ రాజ్యాంగం: రాజ్యాంగంలోని అంశాలను అంత సులభంగా సవరించడం సాధ్యంకాని రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. ధృడ రాజ్యాంగం అమలులో ఉన్న రాజ్యాలలో సాధారణ చట్టాల తయారీకి, రాజ్యాంగ చట్టాల రూపకల్పనకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ధృడ రాజ్యాంగంలోని అంశాలను సవరించేందుకు ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించడం జరుగుతుంది. రాజ్యాంగ అంశాల సవరణలో దృఢ రాజ్యాంగం ఎంతో కాఠిన్యతను ప్రదర్శిస్తుంది. దృఢ రాజ్యాంగానికి అత్యుత్తమ ఉదాహరణగా అమెరికా రాజ్యాంగాన్ని పేర్కొనవచ్చు. అమెరికాతో పాటుగా ఆస్ట్రేలియా, స్విజర్లాండ్ వంటి రాజ్యాలలో ధృడ రాజ్యాంగాలు వాడుకలో ఉన్నాయి.

ప్రయోజనాలు (Merits):

  1. దృఢ రాజ్యాంగం రాజకీయ స్థిరత్వాన్ని అందిస్తుంది.
  2. దృఢ రాజ్యాంగం రాజకీయ అనుభవానికి ప్రతీకగా ఉంటుంది.
  3. శాసన నిర్మాణంలో తొందరపాటుతో కూడిన ఆలోచనారహిత పద్ధతులను నివారిస్తుంది.
  4. పౌరుల ప్రాథమిక హక్కులను దృఢ రాజ్యాంగం పరిరక్షిస్తుంది.
  5. సమాఖ్య రాజ్యంలో విభిన్న ప్రాంతాల ప్రయోజనాలను పరిరక్షించి, పెంపొందించేందుకు దృఢ రాజ్యాంగం దోహదపడుతుంది.
  6. దృఢ రాజ్యాంగం అన్ని రకాల ప్రజలకు సరిపోతుంది.

లోపాలు (Demerits):

  1. దృఢ రాజ్యాంగాన్ని మారుతున్న అవసరాలకు అనుగుణంగా సులభంగా సవరించడం సాధ్యం కాదు.
  2. రాజ్య ప్రగతికి, వృద్ధికి ధృఢ రాజ్యాంగం ఆటంకంగా ఉండే అవకాశం ఉంటుంది.
  3. అత్యవసర పరిస్థితులలో ఎదురయ్యే సమస్యల పరిష్కారంలో ధృడ రాజ్యాంగం సరైంది కాదు.

ప్రశ్న 6.
అదృఢ రాజ్యాంగంలోని ప్రయోజనాలు, లోపాలను వివరించండి.
జవాబు:
అదృఢ రాజ్యాంగం: రాజ్యాంగంలోని అంశాలను అతిసులభంగా మార్చేందుకు అవకాశం ఉన్నట్లయితే దానిని అదృఢ రాజ్యాంగం అంటారు. అధృడ రాజ్యాంగంలోని అంశాల సవరణకు ప్రత్యేక రాజ్యాంగ సవరణ పద్ధతిని అనుసరించాల్సిన అవసరం లేదు. సాధారణ చట్టాల వలె రాజ్యాంగంలోని అంశాలను సైతం సవరించే వీలు ఉంటుంది. అందువల్ల అధృడ రాజ్యాంగంలో సాధారణ చట్టాలు, రాజ్యాంగ చట్టాల మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు. అదృఢ రాజ్యాంగాలనేవి ప్రాచీన కాలంలో వాడుకలో ఉండేవి. అదృఢ రాజ్యాంగానికి బ్రిటన్ మంచి ఉదాహరణ.

AP Inter 1st Year Civics Study Material Chapter 11 రాజ్యాంగం

ప్రయోజనాలు:

  1. అదృఢ రాజ్యాంగం వ్యాకోచ స్వభావాన్ని కలిగి ఉంటుంది.
  2. ఈ రాజ్యాంగం ప్రజలను విప్లవాల ప్రమాదం నుండి కాపాడుతుంది.
  3. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఈ రాజ్యాంగాన్ని సవరించవచ్చు.
  4. ఈ రాజ్యాంగం సరళంగా ఉంటుంది కాబట్టి అన్ని వేళలా జాతి ఆకాంక్షలను నెరవేరుస్తుంది.
  5. వెనుకబడిన రాజ్యాలు రాజకీయంగా, రాజ్యాంగపరంగా అభివృద్ధి చెందేందుకు ఈ రాజ్యాంగం ఎంతగానో సహాయపడుతుంది.

లోపాలు:

  1. అదృడ రాజ్యాంగం అస్థిర స్వభావాన్ని కలిగి ఉంటుంది.
  2. ప్రజాస్వామ్య రాజ్యాలకు అదృఢ రాజ్యాంగం అనువైనది కాదు.
  3. సమాఖ్య రాజ్యాలకు అదృఢ రాజ్యాంగం సరైనది కాదు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజ్యాంగం అంటే ఏమిటి ? [Mar. ’18, ’17, ’16]
జవాబు:
ప్రజలు, ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని సూచించే కొన్ని నిర్దిష్ట నియమాల సముదాయాన్ని రాజ్యాంగం అని అంటారు. రాజ్యం, ప్రభుత్వాల అధికారాలు, విధులకు రాజ్యాంగం ముఖ్య ప్రాతిపదికగా ఉంటుంది. అదేవిధంగా పౌరుల హక్కులు, బాధ్యతలకు సంబంధించిన ప్రధాన ప్రామాణికతకు నిదర్శనం రాజ్యాంగమే. అందుకనే “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం” అని లార్డ్ బ్రైస్ పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
పరిణామాత్మక రాజ్యాంగం అంటే ఏమిటి ? [Mar. 2018]
జవాబు:
పరిణామాత్మక రాజ్యాంగాన్ని క్రమానుగత రాజ్యాంగం అని కూడా అంటారు. అనేక పరిణామాల పర్యవసానంగా ఈ రాజ్యాంగం రూపొందుతుంది. రాజ్యంలోని రాజకీయ సంస్థలకు ఈ రాజ్యాంగం ప్రాతిపదికగా ఉంటుంది. గతంలో సంభవించిన పరిణామాల ప్రాతిపదికగా ఇది క్రమానుగతంగా వృద్ధి చెందుతుంది. కావున ఏ ఒక్కరి చేతనో ఏ ఒక్క సమయంలోనో ఒకేసారి ఈ రాజ్యాంగం రూపొందదు. అనేక ఆచార సంప్రదాయాలు, వాడుక పద్ధతులు, అలవాట్లు ఈ రాజ్యాంగానికి ఆధారాలుగా ఉంటాయి.

ప్రశ్న 3.
శాసనాత్మక రాజ్యాంగం అంటే ఏమిటి ? [Mar. 2017]
జవాబు:
శాసనాత్మక రాజ్యాంగాన్ని సాంప్రదాయక రాజ్యాంగం అని కూడా అంటారు. ఈ రాజ్యాంగం ఉద్దేశ్యపూర్వకంగా రూపొందుతుంది. రాజ్యాంగ పరిషత్తు అనే ప్రత్యేక సభలో జరిపిన సంప్రదింపుల ఫలితంగా ఈ రాజ్యాంగం రూపొందుతుంది. దీనిని సార్వభౌమాధికారం కలిగిన రాజు లేదా పార్లమెంటు రూపొందించటం జరుగుతుంది. ఇందులోని అంశాలు ఒక ప్రత్యేక ప్రతిలోగాని, కొన్ని ప్రతులలోగాని పేర్కొనడం జరుగుతుంది.

ప్రశ్న 4.
అదృఢ రాజ్యాంగంలోని ఏవైనా రెండు ప్రయోజనాలు, లోపాలను గుర్తించండి.
జవాబు:
ప్రయోజనాలు:

  1. అదృఢ రాజ్యాంగం వ్యాకోచ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ రాజ్యాంగంలోని అంశాలను కాలానుగుణంగా సులభంగా సవరించేందుకు వీలుంటుంది.
  2. అదృఢ రాజ్యాంగం ప్రజలను విప్లవాల ప్రమాదం నుండి కాపాడుతుంది.

లోపాలు:

  1. అదృఢ రాజ్యాంగం ఆర్థిక స్వభావాన్ని కలిగిఉంటుంది.
  2. ప్రజాస్వామ్య రాజ్యాలకు అదృఢ రాజ్యాంగం అనువైనది కాదు.

AP Inter 1st Year Civics Study Material Chapter 11 రాజ్యాంగం

ప్రశ్న 5.
అదృఢ – దృఢ రాజ్యాంగాల మధ్య గల రెండు వ్యత్యాసాలను ఉదహరించండి. [Mar. 2016]
జవాబు:

  1. అదృఢ రాజ్యాంగంలోని అంశాలను స్పష్టంగా పేర్కొనడం జరగదు. దృఢ రాజ్యాంగంలోని అంశాలు స్పష్టంగా పేర్కొనడం జరగదు.
  2. అదృఢ రాజ్యాంగాన్ని సులభంగా సవరించవచ్చు. దృఢ రాజ్యాంగాన్ని సవరించేందుకు కఠినమైన పద్దతి ఉంటుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 10th Lesson లౌకికవాదం Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 10th Lesson లౌకికవాదం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
లౌకిక వాదమంటే ఏమిటో నిర్వచించి, లౌకికవాద భావనలను వివరించండి.
జవాబు:
పరిచయం: లౌకికవాదమనేది ఒక ప్రధానమైన సామాజిక, రాజకీయ దృగ్విషయం. అనేక సమకాలీన ప్రపంచదేశాలు తమ ప్రభుత్వ వ్యవహారాలలో లౌకికతను అనుసరిస్తున్నాయి. లౌకికవాదం ప్రత్యేకంగా మతంతో. సంబంధంలేని, స్వతంత్ర ఆదర్శాలను ప్రభోదిస్తుంది. ప్రభుత్వాలు మతంతో నిమిత్తం లేకుండా నైతికత, విద్యలాంటి సూత్రంపై ఆధారపడతాయనే దృక్పథమే లౌకికవాదం. వర్తమాన ప్రాపంచిక జీవనం దైవికమైనది కాకుండా కొన్ని నైతిక ప్రమాణాలు, పాలనా నియమాలు మానవ కార్యకలాపాలను నిర్ణయిస్తాయని లౌకికవాదం పేర్కొంటుంది. లౌకికవాదానికి మతాన్ని దూషించే ఉద్దేశం లేదు. మతం, రాజ్యం అనేవి రెండు ప్రత్యేక విభాగాలని అది గట్టిగా ఉద్ఘాటించింది.

అర్థం: Secular అనే ఆంగ్ల పదానికి లాటిన్ భాషలో అర్థం “ఇహలోకం” (This World) ఈ పదం మతానికి వ్యతిరేకమనే అర్థాన్ని ఇస్తుంది.

నిర్వచనం:

  1. జి. జె. హోల్యోక్: “లౌకికవాదం అంటే మతవిశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా మతంతో సంబంధంలేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన” గా నిర్వచించారు.
  2. ఎరిక్ ఎస్. వాటర్ హౌస్: “మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని అభిప్రాయపడ్డారు.

లౌకికవాద భావనలు (Concepts of secularism): లౌకికవాదం ప్రధానంగా నాలుగు భావనలను కలిగి ఉంది. అవి

  1. మానవతావాదం, హేతువాద భావన
  2. రాజకీయ, సామాజిక దృక్కోణం
  3. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం
  4. మతం పట్ల వ్యతిరేకత

AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

ఈ నాలుగు భావనలను గురించి ఈ దిగువ పేర్కొన్న విధంగా వివరించవచ్చు.
1) మానవతావాదం, హేతువాద భావన (Humanistic and Atheistic philosophy): లౌకికవాదం అనేక వ్యక్తిగత, సాంస్కృతిక, రాజకీయ, సామాజిక అంతరార్థాలను కలిగి ఉంటుంది. మానవుల శ్రేయస్సును కోరుకొనుట చేత అది మానవతా స్వభావాన్ని కలిగి ఉంటుంది. మానవుడు అన్ని విషయాలకు కొలమానం అనే సామెతకు అది ప్రాముఖ్యతను ఇస్తుంది. ఇది మతాన్ని సమర్థించదు లేదా వ్యతిరేకించదు. వ్యక్తులు తమకు ఇష్టమైన మతాన్ని ఎంపిక చేసుకొని, అనుసరించేందుకు వీలు కల్పిస్తుంది.

2) రాజకీయ, సామాజిక దృక్కోణం (Political and Social dimension): లౌకిక వాదానికి నిర్దిష్టమైన రాజకీయ, సామాజిక దృక్కోణాలున్నాయి. అది సహజసిద్ధమైన, భౌతిక దృక్పథాలతోనూ, రాజకీయ, ఆర్థిక స్వావలంబనలతో కూడిన వ్యవస్థాపనకు ప్రతీకగా ఉంటుంది. కుటుంబానికి, సంస్థలకు మరియు సమాజానికి మత స్వాతంత్య్రానికి ఇది వీలు కల్పిస్తుంది.

3) స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం (Liberty and Democracy): స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి లౌకికవాదం ప్రయోజనకరమైనది. అలాగే ఉదార ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా ఉంటుంది. లౌకికవాదం అధికారిక మత నాయకత్వాన్ని మత సంస్థల ఉనికి, కొనసాగింపు, మనుగడలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రజాసామ్యం, ప్రభుత్వాధికారాల వికేంద్రీకరణను సమర్ధిస్తుంది.

4) మతం పట్ల వ్యతిరేకత (Opposition to Religion): లౌకికవాదం ప్రజా వ్యవహారాలను మతం సమర్థించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మతాధికారుల ప్రాబల్యతలను ఖండిస్తుంది. మానవజీవనానికి సంబంధించిన అప్రధాన అంశాలలో మతం ఒకటిగా పేర్కొంటూ, మత ప్రాధాన్యాన్ని తగ్గిస్తుంది. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలగని రీతిలో ప్రజలు వారి మత విశ్వాసాలను, ఆచారాలను అనుసరించవచ్చని పేర్కొంటుంది. ఇతర మతాలకు చెందిన వారికి ఏ విధమైన అపకారం, ద్వేషం, అసూయలు కలిగించకుండా వ్యక్తులు వారి మత కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని స్పష్టీకరించింది. రాజ్యాంగపు మహోన్నత ఆశయాలు, ఆకాంక్షలను ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుందని ఉద్ఘాటించింది.

ప్రశ్న 2.
లౌకికవాదం అర్థం, విభిన్న దృక్కోణాలు వర్ణించండి.
జవాబు:
అర్థం: Secular అనే ఆంగ్ల పదానికి లాటిన్ భాషలో అర్థం “ఇహలోకం” (This World) ఈ పదం మతానికి వ్యతిరేకమనే అర్థాన్ని ఇస్తుంది.

నిర్వచనం:
1. జి. జె. హోల్యోక్: “లౌకికవాదం అంటే మతవిశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా మతంతో సంబంధంలేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన” గా నిర్వచించారు.

2. ఎరిక్ ఎస్. వాటర్ హౌస్: “మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని అభిప్రాయపడ్డారు.

లౌకికవాదం దృక్కోణాలు (Dimensios of Secularism): లౌకికవాదం దృక్కోణాలు మూడు రకాలు. అవి 1) సామాజిక దృక్కోణం 2) ఆర్థిక దృక్కోణం 3) రాజకీయ దృక్కోణం. వీటిని గురించి క్రింద పేర్కొన్న విధంగా పరిశీలించవచ్చు.

1) సామాజిక దృక్కోణం (Social dimension): లౌకికవాద భావన సామాజిక జీవనంలో మూఢత్వాలను విస్మరించడం లేదా వదిలి వేయడానికి సంబంధించింది. కుల, మత, వర్గాల పరంగా వ్యక్తులు వ్యవహరించడాన్ని లౌకికవాదం ఎట్టి పరిస్థితులలో అనుమతించదు. సమాజంలో ఇరుగు పొరుగు వారితో వ్యవహరించేటప్పుడు వ్యక్తులు అస్త్రశ్యత, వెట్టి చాకిరీ వంటి దురాచారాలను పాటించరాదని అభిలషిస్తుంది. ఇతరులను తమతో సమానంగాను, గౌరప్రదంగానూ చూసుకోవాలని సలహా ఇస్తుంది. కుల వ్యత్యాసాలు, వర్గ వివక్షతలు, జాతి విద్వేషాలు వంటి దుర్గుణాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని బోధిస్తుంది. అంతిమంగా సమాజంలో వ్యక్తుల మధ్య సామరస్య పూర్వక సంబంధాలను సూచిస్తుంది.

2) ఆర్థిక దృక్కోణం (Economic dimension): లౌకికవాదం వ్యక్తులు తమ ఇష్టానుసారంగా తమకు నచ్చిన వృత్తులను ఎన్నుకొని వాటిని ఆచరించటానికి, అనుసరించటానికి, ప్రచారం చేసుకోవడానికి కావలసిన స్వేచ్ఛను లౌకికవాదం కల్పిస్తుంది.

సమాజంలోని సహజ, మానవ, ఆర్థిక సంపదల ఉత్పత్తి కార్యకలాపాలలో వ్యక్తుల మధ్య మతపరమైన వివక్షతలను పాటించడాన్ని లౌకికవాదం నివారిస్తుంది. పారిశ్రామికవేత్తలకు లైసెన్సుల మంజూరులో మతపరమైన అంశాలను రాజ్యాధికారులు పాటించడాన్ని అనుమతించదు. ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక లైసెన్సుల మంజూరు వంటి వ్యవహారాలలో యోగ్యత, నైపుణ్యం, ప్రోత్సాహస్ఫూర్తి వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తుంది.

3) రాజకీయ దృక్కోణం (Political dimension): లౌకికవాదానికి కొన్ని రాజకీయ దృక్కోణాలు ఉంటాయి. లౌకిక వాదం రాజకీయ వ్యవహారాలలో పౌరులందరికీ పూర్తిస్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను అనుమతిస్తుంది. మతం, పరిపాలన, రాజకీయ, చట్టనిర్మాణం, ప్రభుత్వ విధానాల అమలు వంటివి పూర్తిగా మతంతో సంబంధం లేనివిగా విశ్వసిస్తుంది. లౌకిక రాజ్యంలో ప్రజా ప్రతినిధులను ఎన్నుకొనే విషయంలో పౌరులకు అనేక రాజకీయ హక్కులు, స్వాతంత్ర్యాలు ప్రసాదిస్తుంది. మతపరమైన అంశాలతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడు ప్రభుత్వ పదవిని చేపట్టేందుకు అవకాశం ఇస్తుంది. రాజకీయ హక్కులను ప్రసాదించడంలో మతం అనేది ఒక ఆవశ్యక అంశంగా పరిగణించకుండా ప్రజల యొక్క ప్రజాస్వామిక ఆకాంక్షలు, స్వాతంత్ర్యాలకు మార్గాన్ని ఏర్పరుస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే లౌకికవాదపు రాజకీయ దృక్కోణం ఆధునిక రాజ్యపు ప్రజాస్వామిక పనితీరుతో సమానంగా పరిగణించబడుతుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

ప్రశ్న 3.
లౌకికవాదం అర్థం, సుగుణాల గురించి మీకు తెలిసింది రాయండి.
జవాబు:
అర్థం: Secular అనే ఆంగ్ల పదానికి లాటిన్ భాషలో అర్థం “ఇహలోకం” (This World) ఈ పదం మతానికి వ్యతిరేకమనే అర్థాన్ని ఇస్తుంది.

నిర్వచనం: “మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని ఎరిక్. ఎస్. వాటర్ హౌస్ పేర్కొన్నాడు.

లౌకికవాదం సుగుణాలు (Merits of Secularism):
1) సమత (Equity): లౌకికవాదం సమసమాజానికి ప్రాతిపదిక. అన్ని మతాల వారిని సమానంగా పరిగణిస్తుంది. మానవులు సృష్టించిన అసమానతలను గుర్తించదు. అలాగే కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంతీయ భాషాపరమైన వివక్షతలకు తావు ఇవ్వదు. దాంతో ప్రజలు జాతిపట్ల ఎంతో దృఢమైన సానుకూలమైన భావాన్ని కలిగి ఉంటారు.

2) మత స్వాతంత్ర్యం (Religious Freedom): లౌకికవాదం, మత స్వాతంత్య్రాన్ని ప్రజలు సంపూర్ణంగా అనుభవించుటకు దోహదపడుతుంది. రాజ్యం వ్యక్తుల మత వ్యవహారాలలో జోకం్య చేసుకోదు. లౌకిక రాజ్యంలో రాజ్యాంగం, వివిధ చట్టాలు, వ్యక్తులకు తమ ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించుటకు, ప్రబోధించుటకు, ప్రచారం చేసుకొనేందుకు, సంపూర్ణమైన స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తాయి.

3) శాంతి భద్రతలు (Law and Order): వర్తమాన కాలంలో రాజ్యం, ప్రభుత్వం, ఇతర సంస్థలు ఎంతో విచారకరమైన, దుఃఖదాయకమైన మతానుకూల ఉద్యమాలను ప్రోత్సహించడం లేదా ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. దాంతో విభిన్న మతసముదాయాలకు చెందిన ప్రజల మధ్య సామరస్యం సాధించడం అనేది పెద్ద సవాలుగా పరిణమించింది. అటువంటి సందర్భాలలో లౌకికవాదం మతపరమైన ఘర్షణలను, విద్వేషాలను నివారించగలుగుతుంది. అంతిమంగా, ప్రజల మధ్య మత సామరస్యాన్ని లౌకికవాదం పెంపొందించడం జరుగుతుంది.

4) సమన్యాయ పాలన (Rule of Law): లౌకికవాదం సమన్యాయపాలన అనే భావనకు ప్రాధాన్యతనిస్తుంది. లౌకికవాదాన్ని అనుసరించే రాజ ఏ ఒక్క మతానికి కాకుండా అన్ని మతాలకు చెందిన ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను రూపొందించి అమలు చేస్తుంది. చట్ట నిర్మాణ సమయంలో ప్రజలకు మత ఛాందస భావాలను పరిగణనలోనికి తీసుకోదు. అలాగే చట్ట నిర్మాణం, చట్టాల అమలు, చట్టాల వ్యాఖ్యానంలో ప్రజలకు ఏ మతంతో సంబంధం లేకుండా లౌకిక రాజ్యం వ్యవహరిస్తుంది.

5) సహనం (Tolerance): లౌకికవాదం సహనం, దయార్ధ గుణాన్ని ప్రబోధిస్తుంది. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని, భగవంతుడి పితృత్వంల (Fatherhood) పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. దాతృత్వం, జాలి, ప్రేమ, ఔదార్యం, అహింస వంటి మహోన్నత గుణాలను ప్రబోధించి, ప్రచారం గావించి ఆచరణలో ఉంచుతుంది.

6) జాతీయ సమైక్యత (National Integration): లౌకికవాదం, ప్రజలలో జాతీయ సమైక్యత, సమగ్రత భావాలను పెంపొందించే ఉత్తమ సాధనంగా దోహదపడుతుంది. భిన్నత్వంలో ఏకత్వ సాధనకు ఉత్తమ కారకంగా భావించబడుతుంది. విభిన్న మతాలు, వాడుకలు అనుసరించే ప్రజల మధ్య ఐక్యతను సాధిస్తుంది.

7) మైనారిటీల రక్షణ (Protection to the Minorities): లౌకికవాద రాజ్యం అందరినీ ఒకే రకంగా ఆదరిస్తుంది. సమాజంలో మెజారిటీ వర్గం ఇతర వర్గాల మధ్య ఎటువంటి వివక్షతను చూపదు. అదే సమయంలో మతపరమైన మెజారిటీ వర్గం ఆధిపత్యాల నుంచి మైనారిటీ వర్గాల ప్రయోజనాలను పరిరక్షించి, వారికి ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తుంది. మైనారిటీ వర్గాల వారి పట్ల మతసహనాన్ని పాటించాల్సిందిగా ప్రజలకు బోధిస్తుంది.

8) అన్ని రంగాల ప్రగతి (Allround Progress): లౌకికవాదంలోని అత్యంత గొప్ప సుగుణం ఏమిటంటే ప్రజలు అన్ని రంగాలలో ప్రగతిని సాధించేందుకు దోహదపడుతుంది. సమాన్యాయ పాలన, మత సహనం, ప్రభుత్వ తటస్థ వైఖరి వంటి అంశాలు లౌకికవాదంలో ఉండుట చేత ఆ రకమైన ప్రగతి సాధ్యమవుతుంది. ప్రత్యేకంగా సంక్షేమం, సామాజిక న్యాయం, అసౌకర్యానికి గురైన వర్గాల ప్రయోజనాల పరిరక్షణ వంటి విషయాలకు సంబంధించి అన్ని మతాలకు చెందిన ప్రజల ప్రగతికి లౌకిక వాదం కృషి చేస్తుంది.

ప్రశ్న 4.
లౌకిక రాజ్యాన్ని నిర్వచించి, లౌకిక రాజ్యం లక్షణాలు, ప్రాముఖ్యతను విశదీకరించండి. [Mar. 2016]
జవాబు:
నిర్వచనాలు:
1. జి. జె. హోల్యోక్: “లౌకికవాదం అంటే మతవిశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా మతంతో సంబంధంలేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన” గా నిర్వచించారు.

2. ఎరిక్ ఎస్. వాటర్ హౌస్: “మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని అభిప్రాయపడ్డారు.

లక్షణాలు:- లౌకిక రాజ్యం కింది లక్షణాలను కలిగి ఉంటుంది.
1. మతానికి తావు లేదు (No place for religion): లౌకిక రాజ్యం ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపదు. మతపరమైన అంశాల ప్రాతిపదికపై చట్టాలను రూపొందించదు, అమలు చేయదు.

2. సమాన హోదా (Equal status): లౌకికరాజ్యం ప్రజలందరికీ సమాన హోదాను కల్పిస్తుంది. వ్యక్తుల మధ్య కులం, వర్ణం, మతం, తెగ, ప్రాంతం, భాషలవారీగా ఎటువంటి వివక్షతను చూపదు. దాంతో ప్రజలు సంతృప్తి చెంది, వివిధ విధానాలు, కార్యక్రమాల అమలులో ప్రభుత్వానికి సహకారాన్ని అందిస్తారు. విభిన్న మత సముదాయాలకు చెందిన వారందరూ ఇరుగు పొరుగు వారితో సామరస్యంతో కలసిమెలసి నివసిస్తారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

3. అధికారిక మతం లేకుండుట (No State reglion): లౌకిక రాజ్యం ఏ ఒక్క మతాన్ని అధికార మతంగా గుర్తించదు. మత వ్యవహారాలలో తటస్థ వైఖరిని అవలంబిస్తుంది. ప్రజల మతపరమైన భావాలతో సంబంధం లేకుండా వివిధ చట్టాలను, సామాజిక సంక్షేమ కార్యకలాపాలను అమలు చేస్తుంది. ప్రభుత్వ వ్యవహారాలలో ఏ ఒక్క మతానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతను ఇవ్వదు. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయ సంస్థలు వంటి అన్ని ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను ఏ ఒక్క మతంతో సంబంధం లేకుండా నిర్వహిస్తుంది.

లౌకికరాజ్యం ప్రాముఖ్యత (Importance of Secular State): ఇటీవలి కాలంలో లౌకిక రాజ్య భావన ఎంతగానో ప్రాముఖ్యతను సంతరించుకొంది. ప్రజాస్వామిక స్ఫూర్తి, శాస్త్ర సాంకేతికత, రవాణా సదుపాయాల అభివృద్ధి, హేతుబద్ధమైన చింతన, శ్రేయోవాదం వంటి అంశాల ప్రభావం చేత లౌకిక రాజ్య ప్రాముఖ్యత పెరిగింది. మొత్తం మీద | లౌకిక రాజ్య ప్రాముఖ్యతను కింది అంశాల ద్వారా వివరించవచ్చు.

  1. లౌకిక రాజ్యం దేశంలోని వివిధ రంగాలలోని మతేతర శక్తులను బలపరుస్తుంది.
  2. ప్రజల హృదయాలలో పాతుకుపోయిన దురాచారాలను, మూఢ విశ్వాసాలను పారద్రోలుతుంది.
  3. మత పరమైన విద్వేషం, మతమౌఢ్యాలను పారద్రోలడం ద్వారా సామాజిక సంస్కరణలకు దోహదపడుతుంది.
  4. ప్రజలలో శాస్త్రీయ చింతనను పెంపొందించి, వారి మేధోపరమైన వికాసానికి తోడ్పడుతుంది.
  5. విశ్వాసంపై హేతువుకు, కాల్పనికతపై తర్కానికి, కట్టుకథలపై వాస్తవికతలకు ఆధిక్యతనిస్తుంది.
  6. మతపరమైన మైనారిటీ వర్గాలకు భద్రతను కల్పించి వారి రక్షణకు హామీనిస్తుంది.
  7. ప్రతి వ్యక్తి మతపరమైన విశ్వాసాలను గౌరవిస్తుంది.

భారత రాజ్యాంగ మూడవ భాగములో ప్రాథమిక హక్కుల జాబితాలో మత స్వాతంత్య్రపు హక్కు 25వ నిబంధన నుండి 28వ నిబంధన వరకు వివరించబడెను. ఈ హక్కు ప్రకారం భారతదేశంలో మతస్వేచ్ఛ అమలు చేయబడుతుంది.

భారతదేశంలో లౌకిక రాజ్యం – లక్షణాలు:

  1. 25వ నిబంధన ప్రకారం: ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించి పూజ, ఆరాధన కార్యక్రమాలను స్వేచ్ఛగా నిర్వహించుకొనవచ్చును.
  2. 26వ నిబంధన ప్రకారం: మతాభివృద్ధిని చేసుకొనవచ్చును.
  3. 27వ నిబంధన ప్రకారం: మతపరమైన పన్నులు, చందాలు నిర్బంధముగా వసూలు చేయకూడదు.
  4. 28వ నిబంధన ప్రకారం: ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నిర్వహించబడే విద్యాసంస్థలలో మతబోధనలు చేయకూడదు.
  5. 14వ నిబంధన ప్రకారం: భారత ప్రజలందరూ ఏ మతము, ఏ శాఖ వారైనప్పటికిని సమానముగా చూడబడతారు.
  6. సమాజంలో అశాంతి కలగకుండా మత విధానాల వ్యాప్తి, పూజా ప్రార్థనా విధానాలు, పూజా ప్రార్థనా మందిరాల నిర్మాణం చేపట్టవచ్చు.
  7. అవసరమైతే స్వచ్ఛందంగా నిధులు సమకూర్చుకోవచ్చు. స్వచ్ఛందంగా మతస్థుల ద్వారా పన్నులు వసూలు చేసుకోవచ్చు.
  8. ఏ మత కార్యకలాపమైనా పరమత సహనాన్ని కలిగి ఉండాలి.
  9. మరో మతాన్ని లేదా మతాభిప్రాయాలను కించపరచే విధంగా గానీ, రెచ్చగొట్టే విధంగా గాని ఉండరాదు.
  10. మత కార్యకలాపాలు సమాజ శాంతి భద్రతలకు విఘాతం కలిగించరాదు.

భారతదేశంలో ఏ వ్యక్తి పట్ల మతపరంగా విచక్షణ చూపరు. ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా విచక్షణకు గురి కాకుండా ఎలాంటి ఉన్నత పదవులనైనా చేపట్టవచ్చు. ఈ విధంగా రాజ్యాంగం మన దేశాన్ని లౌకిక రాజ్యంగా తీర్చిదిద్దింది. ఆచరణలో మన లౌకికతత్వంలో చిన్న చిన్న పొరపాట్లు దొర్లినా మన మౌలిక లక్ష్యం, గమ్యం లౌకిక రాజ్యస్థాపనే!

ప్రశ్న 7.
భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా రూపొందించేందుకు అవసరమైన చర్యలను సూచించండి.
జవాబు:
భారతదేశంలో హిందూ, ఇస్లామ్, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీ మతాలకు చెందిన ప్రజలు నివశిస్తున్నారు. భారత సమాజపు లౌకిక స్వరూపానికి కొన్ని కులాల మధ్య ఏర్పడిన ఘర్షణలు, పెచ్చరిల్లిన హింస భంగం కలిగించాయి. అటువంటి విచారకర సంఘటనల గురించి పత్రికలు ప్రతిరోజూ వెల్లడిస్తూనే ఉన్నాయి. అటువంటి సంఘటనలన్నింటికి మతమౌడ్యం, కులజాడ్యాలే కారణంగా పేర్కొనవచ్చు. స్వాతంత్య్రం తరువాత కుల, మత ప్రాతిపదికపై అనేక సంఘాలు స్థాపించబడినాయి. రాజకీయ నాయకులు, అసాంఘిక శక్తుల మధ్యగల సంబంధం కుల, మత తత్త్వాలను వెల్లడించాయి. అధికార, ప్రతిపక్ష స్థానాలలోని రాజకీయ నాయకులు రాజకీయ కారణాలతో ప్రజల మధ్య మతపరమైన ఆవేశాలను రెచ్చగొట్టడం సర్వసాధారణమైంది. అంతేకాకుండా కొందరు మతపెద్దలు ప్రజలలో మతపరమైన భావాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకొన్నారు. పైన పేర్కొన్న అంశాలన్నీ సమాజంలో శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తున్నాయి.

కాబట్టి ప్రజల మనస్సులలో పాతుకుపోయిన మతపరమైన సంకుచిత భావాలను నిర్మూలించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ సందర్భంలో ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు క్రింద పేర్కొన్న చర్యలను చేపట్టాల్సి ఉంటుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

  1. మత సంస్థలు నిర్వహించే సమావేశాలలో మంత్రులు, ప్రభుత్వ అధికారులు పాల్గొనరాదు. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాలలో మతపరమైన ప్రార్థనలు, పూజలు జరుపరాదు. ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక అభిమానాన్ని చూపేందుకు ప్రయత్నించరాదు.
  2. జాతీయ లేదా సామాజిక ప్రయోజనాలకు, రాజ్యాంగానికి భంగం కలిగించే మతసంస్థలను ప్రభుత్వం నిషేధించాలి.

ప్రశ్న 5.
భారతదేశంలో లౌకికవాద నేపధ్యాన్ని పేర్కొనండి.
జవాబు:
బ్రిటిష్ ప్రభుత్వపాలన భారతదేశంలో అనేక విద్యా సంస్కరణలను ప్రారంభించింది. శాస్త్రవిజ్ఞానానికి ప్రాముఖ్యతను ఇచ్చింది. అదే సమయంలో భారతదేశంలోని రెండు ప్రధాన మతాలైన హిందువులు, మహమ్మదీయుల మధ్య మతపరమైన విషబీజాలను నాటింది. అందులో భాగంగా చట్టసభలలో మహమ్మదీయులకు ప్రత్యేక స్థానాలను కేటాయించింది. దాంతో భారత రాజకీయాలలో మతపరమైన ఘర్షణలు ఎడతెగని లక్షణంగా పరిణమించాయి. ఈ పరిస్థితి పట్ల చరిత్రకారులు కూడా తీవ్ర విచారాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంలో వారు భిన్నమైన వివరణలను అందించారు. స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశంలో నెలకొన్న విచారకరమైన మత పరిస్థితులకు బ్రిటిష్ పాలకులను వారు నిందించారు. జనాభా పరిమాణం ఆధారంగా బ్రిటిష్ పాలకులు హిందువులు, మహమ్మదీయుల మధ్య ప్రాధాన్యత ఇవ్వటంతో మత అంశాల ప్రాతిపదికపై భారతీయుల మధ్య ఆవేశాలను ప్రోవు చేశారు. దాంతో భారతదేశంలో నివసించే విషయంలో మైనారిటీలలో అభద్రతా భావం నెలకొంది. కాలక్రమేణా మతఘర్షణలు, మతవిద్వేషాలు అనేవి భారతదేశంలో దైనందిన చర్యలుగా పరిణమించాయి. ఈ రకమైన పరిస్థితి అంతిమంగా మహమ్మదాలీ జిన్నా వంటి నాయకులు ‘ద్విజాతి సిద్ధాంతం’ (Two Nations Theory) ప్రతిపాదించేందుకు దారితీసింది. మరొకవైపు హిందూ మహాసభ వంటివి మత ప్రయోజనాలకు ప్రతీకగా నిలిచాయి. ఈ సంస్థలు భారతదేశాన్ని హిందూ ఆధిక్య ప్రధానమైన దేశంగా పరిగణించాయి. 1947 ఆగస్టులో భారత యూనియన్ ఇండియా, పాకిస్థాన్లుగా విడిపోవుటకు రాజకీయ పరిస్థితుల తీవ్రతయే కారణంగా పేర్కొనవచ్చు. దేశ విభజన తరువాత కూడా మతపరమైన విబేధాలు కొనసాగడం మతతత్వానికి పరాకాష్టగా భావించవచ్చు. స్వాతంత్ర్యం సిద్ధించి ఆరు దశాబ్దాలు గడిచినప్పటికీ భారతదేశంలో ఏదో ఒక ప్రాంతంలో మత ఘర్షణలు సంభవించడం లౌకిక వాదానికి సవాలుగా పరిణమించిందని చెప్పవచ్చు.

భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత ఆమోదించబడిన భారత రాజ్యాంగం లౌకిక వాదాన్ని భారతదేశ గణతంత్ర వ్యవస్థకు ప్రధాన ఆలంబనగా పేర్కొన్నది. దాని ప్రకారం భారతరాజ్యాంగం భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించింది. భారతదేశంలోని కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు లౌకిక వాదాన్ని సిద్ధాంతపరమైన ఆచరణాత్మక భావనగా అనుసరించసాగాయి. చట్ట నిర్మాణం, దాని అమలు, రాజ్య పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలలో ఆ ప్రభుత్వాలేవీ మతాన్ని అనుసరించరాదని భారత రాజ్యాంగం పేర్కొంది. భారతీయులు తమకు ఇష్టమైన మతవిశ్వాసాలను ప్రబోధించుకొనేందుకు, ప్రచారంగావించేందుకు సంపూర్ణమైన మతస్వాతంత్ర్యాన్ని కలిగి ఉండేందుకు భారత రాజ్యాంగం వీలు కల్పించింది. భారతదేశంలో రాజ్యం మతానుకూలమైనది, మత వ్యతిరేకమైనది కాదు. అందుకు బదులుగా అది రాజ్య వ్యవహారాలలో తటస్థ వైఖరిని అనుసరిస్తుంది. భారతరాజ్యాంగం మతం ఆధారంగా ప్రజలపై పన్నులు విధించి, వసూలు చేసేందుకు వీలు కల్పించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిధులతో సంపూర్ణంగా గానీ, పాక్షికంగా గానీ నిర్వహించబడే విద్యాసంస్థలలో మతం ఆధారంగా ప్రవేశాలను నిషేదించమని పేర్కొంది. అలాగే పైన పేర్కొన్న సంస్థలలో మత బోధనలను నిషేధించడమైంది. కాబట్టి రాజ్యాంగ పరమైన అంశాల ప్రకారం లౌకిక వాదానికి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు.

భారత రాజ్యాంగ పీఠికలో ‘లౌకిక’ అనే పదాన్ని (42వ సవరణ) చట్టం ద్వారా 1976లో చేర్చడమైంది. పార్లమెంటులో భారత రాజ్యాంగం (42వ సవరణ) ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా భారతదేశ తృతీయ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ కింది విధంగా ప్రకటించారు. “లౌకికవాదం అనేది మతానికి మతానికి మధ్య అభిమానాన్ని, వివక్షతను చూపడం కాదు. అన్ని మతాల ప్రజల పట్ల సమానమైన గౌరవాన్ని ప్రదర్శించడమే లౌకిక వాదం. కేవలం మతసహనాన్ని ప్రదర్శించడం ద్వారానే ఏ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉండదు. ప్రతి మత సముదాయానికి చెందిన వారు ఇతర మతాల సముదాయాలకు చెందిన వారి పట్ల సానుకూల గౌరవాన్ని చూపడమనేది అందరి కర్తవ్యం”.

AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

ప్రశ్న 6.
భారతదేశం లౌకిక రాజ్యమా ? కొన్ని ఉదాహరణల ద్వారా సమర్థిస్తూ జవాబు రాయండి.
జవాబు:
భారతదేశం లౌకిక రాజ్యముగా ప్రకటించబడినది. ప్రాచీన కాలం నుండి భారతదేశములో లౌకిక భావాలు ఉన్నాయి. పరమత సహనము, సహజీవనము భారతీయులలో ఉన్నత ఆదర్శాలుగా ఉన్నవి. భారతదేశంలో క్రైస్తవ, ఇస్లామ్, జైన, సిక్కు, బౌద్ధ, పార్శిక, హిందూ మతాలు సమానంగా ఆదరించబడుచున్నవి.

భారత రాజ్యాంగ పీఠిక భారతదేశాన్ని రాజ్యంగా ప్రకటించింది. భారత రాజ్యాంగాన్ని 1976వ సంవత్సరములో 42వ రాజ్యాంగ సవరణ జరిపి “లౌకిక” అనే పదాన్ని చేర్చడం జరిగింది.

భారత రాజ్యాంగ మూడవ భాగములో ప్రాథమిక హక్కుల జాబితాలో మత స్వాతంత్య్రపు హక్కు 25వ నిబంధన నుండి 28వ నిబంధన వరకు వివరించబడెను. ఈ హక్కు ప్రకారం భారతదేశంలో మతస్వేచ్ఛ అమలు చేయబడుతుంది.
భారతదేశంలో లౌకిక రాజ్యం – లక్షణాలు:

  1. 25వ నిబంధన ప్రకారం: ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించి పూజ, ఆరాధన కార్యక్రమాలను స్వేచ్ఛగా నిర్వహించుకొనవచ్చును.
  2. 26వ నిబంధన ప్రకారం: మతాభివృద్ధిని చేసుకొనవచ్చును.
  3. 27వ నిబంధన ప్రకారం: మతపరమైన పన్నులు, చందాలు నిర్బంధముగా వసూలు చేయకూడదు.
  4. 28వ నిబంధన ప్రకారం: ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నిర్వహించబడే విద్యాసంస్థలలో మతబోధనలు చేయకూడదు.
  5. 14వ నిబంధన ప్రకారం: భారత ప్రజలందరూ ఏ మతము, ఏ శాఖ వారైనప్పటికిని సమానముగా చూడబడతారు.
  6. సమాజంలో అశాంతి కలగకుండా మత విధానాల వ్యాప్తి, పూజా ప్రార్థనా విధానాలు, పూజా ప్రార్థనా మందిరాల నిర్మాణం చేపట్టవచ్చు.
  7. అవసరమైతే స్వచ్ఛందంగా నిధులు సమకూర్చుకోవచ్చు. స్వచ్ఛందంగా మతస్థుల ద్వారా పన్నులు వసూలు చేసుకోవచ్చు.
  8. ఏ మత కార్యకలాపమైనా పరమత సహనాన్ని కలిగి ఉండాలి.
  9. మరో మతాన్ని లేదా మతాభిప్రాయాలను కించపరచే విధంగా గానీ, రెచ్చగొట్టే విధంగా గాని ఉండరాదు.
  10. మత కార్యకలాపాలు సమాజ శాంతి భద్రతలకు విఘాతం కలిగించరాదు.

భారతదేశంలో ఏ వ్యక్తి పట్ల మతపరంగా విచక్షణ చూపరు. ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా విచక్షణకు గురి కాకుండా ఎలాంటి ఉన్నత పదవులనైనా చేపట్టవచ్చు. ఈ విధంగా రాజ్యాంగం మన దేశాన్ని లౌకిక రాజ్యంగా తీర్చిదిద్దింది. ఆచరణలో మన లౌకికతత్వంలో చిన్న చిన్న పొరపాట్లు దొర్లినా మన మౌలిక లక్ష్యం, గమ్యం లౌకిక | రాజ్యస్థాపనే !

ప్రశ్న 7.
భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా రూపొందించేందుకు అవసరమైన చర్యలను సూచించండి.
జవాబు:
భారతదేశంలో హిందూ, ఇస్లామ్, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీ మతాలకు చెందిన ప్రజలు నివశిస్తున్నారు. భారత సమాజపు లౌకిక స్వరూపానికి కొన్ని కులాల మధ్య ఏర్పడిన ఘర్షణలు, పెచ్చరిల్లిన హింస భంగం కలిగించాయి. అటువంటి విచారకర సంఘటనల గురించి పత్రికలు ప్రతిరోజూ వెల్లడిస్తూనే ఉన్నాయి. అటువంటి సంఘటనలన్నింటికి మతమౌడ్యం, కులజాడ్యాలే కారణంగా పేర్కొనవచ్చు. స్వాతంత్ర్యం తరువాత కుల, మత ప్రాతిపదికపై అనేక సంఘాలు స్థాపించబడినాయి. రాజకీయ నాయకులు, అసాంఘిక శక్తుల మధ్యగల సంబంధం కుల, మత తత్త్వాలను వెల్లడించాయి. అధికార, ప్రతిపక్ష స్థానాలలోని రాజకీయ నాయకులు రాజకీయ కారణాలతో ప్రజల మధ్య మతపరమైన ఆవేశాలను రెచ్చగొట్టడం సర్వసాధారణమైంది. అంతేకాకుండా కొందరు మతపెద్దలు ప్రజలలో మతపరమైన భావాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకొన్నారు. పైన పేర్కొన్న అంశాలన్నీ సమాజంలో శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తున్నాయి.

కాబట్టి ప్రజల మనస్సులలో పాతుకుపోయిన మతపరమైన సంకుచిత భావాలను నిర్మూలించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ సందర్భంలో ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు క్రింద పేర్కొన్న చర్యలను చేపట్టాల్సి ఉంటుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

  1. మత సంస్థలు నిర్వహించే సమావేశాలలో మంత్రులు, ప్రభుత్వ అధికారులు పాల్గొనరాదు. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాలలో మతపరమైన ప్రార్థనలు, పూజలు జరుపరాదు.
  2. ఒక్క మతం పట్ల ప్రత్యేక అభిమానాన్ని చూపేందుకు ప్రయత్నించరాదు.
  3. జాతీయ లేదా సామాజిక ప్రయోజనాలకు, రాజ్యాంగానికి భంగం కలిగించే మతసంస్థలను ప్రభుత్వం నిషేధించాలి.
  4. కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో మతసామరస్యానికి భంగం కలిగించే రీతిలో మతపరమైన కట్టడాలను ప్రభుత్వం
    అనుమతించరాదు.
  5. భూసంస్కరణలు, కుటుంబ సంక్షేమం, ఉపాధి విస్తరణ వంటి ఇతర కార్యక్రమాలను మతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం అమలుచేయాలి.
  6. ఎన్నికల సమయంలో ఓట్లను చేజిక్కించుకొనేందుకై రాజకీయ పార్టీలు మతాన్ని వాడుకోవడాన్ని ప్రభుత్వం నిషేధించాలి. అలాగే మతపరమైన అంశాల ఆధారంగా పార్టీల స్థాపన, నిర్వహణలపై నిషేధం విధించాలి. ఎన్నికల సమయంలో మతపరమైన చిహ్నాలను ఎవరూ వినియోగించకుండా చర్యలు చేపట్టాలి.
  7. ప్రభుత్వం పాఠ్యగ్రంథాలను లౌకిక ప్రాతిపదికపై ప్రచురించాలి. పాఠ్యగ్రంథాలలో మతసామరస్యాన్ని పాటిస్తూ, విశ్వమతాలకు సంబంధించిన అంశాలను పొందుపరచాలి.
  8. వివిధ సమాచార ప్రసారాల సంస్థలన్నీ మత ప్రాతిపదికపై వార్తలను ప్రచురించి, ప్రచారంలోకి తీసుకు రాకూడదు. మతపరమైన ఘర్షణలకు అనవసరమైన ప్రాధాన్యతనిస్తూ ఇతర ప్రాంతాలలో ఆ రకమైన ఘర్షణలు చోటుచేసుకొనేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వరాదు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
లౌకికవాద ఆవిర్భావం గురించి రాయండి.
జవాబు:
ప్రాచీన, మధ్యయుగాలలో మతపరమైన రాజ్యాలుండేవి. ఆ యుగాలలో రాజ్య వ్యవహారాలలో మతం ఎంతో ప్రాధాన్యమైన పాత్రను పోషించింది. పాలకులు, ప్రజల మతవిశ్వాసాలను గుర్తించి, గౌరవించి పరిపాలించేవారు. మతం సమాజంలో శాంతి భద్రత, స్థిరత్వాలను అందించి వ్యక్తుల మధ్య సంబంధాలను నియంత్రించింది. దేశ పరిపాలన సాఫీగా కొనసాగేందుకు అవసరమైన రాజకీయ విధేయతను అందించేందుకు మతం దోహదకారి అయింది.

అయినప్పటికీ మతాచార్యులకు, సంస్కరణవాదులకు మధ్య ఘర్షణలు ఏర్పడి సమాజంలో అరాచకం ప్రబలింది. మతం పేరుతో ప్రజల మీద అత్యున్నతాధికారం చెలాయించేందుకు ఆధ్యాత్మికవాదులు, మత పెద్దలు ప్రయత్నిస్తే లౌకిక పాలకులు వారి వ్యూహాలను నిర్వీర్యపరచారు. రాజ్య వ్యవహారాల నుంచి మతాన్ని వేరు చేసారు. ప్రాచీన రోమన్ చక్రవర్తులు క్రైస్తవ మతాన్ని గుర్తించేందుకు నిరాకరించారు. మధ్యయుగంలో మార్టిన్ లూథర్, కాల్విన్ జ్వింగిలాంటి సాంఘిక, మత సంస్కరణవాదులు మత పెద్దల ఆధ్యాత్మిక గుత్తాధిపత్యాన్ని సవాలు చేశారు. మత, ఆధ్యాత్మిక విషయాలన్ని కూడా పూర్తిగా వ్యక్తిగత, స్వీయ వ్యవహారాలుగా వీరు భావించారు. మతపరమైన విషయాలపై వారి ప్రసంగాలు విశేషమైన ప్రభావాన్ని చూపాయి. ఆధునిక కాలంలో మాకియవెల్లి, జీనోడిన్ వంటి రాజనీతి తత్వవేత్తలు రాజకీయాల నుంచి మతాన్ని వేరుచేయాలని గట్టిగా పేర్కొన్నారు. జాన్లాక్ వంటి ఉదారవాద తత్వవేత్తలు మత సహనాన్ని ప్రజలు అనుసరించాలని సూచించారు. పైన పేర్కొన్న తాత్వికుల రచనలు కాలక్రమేణ ప్రజలపై ప్రభావాన్ని చూపటంతో, మతమనేది ఒక వైయుక్తిక, స్వీయ వ్యవహారంగా భావించటం మొదలైంది. అమెరికా దేశాధ్యక్షుడైన థామస్ జఫర్సన్ లౌకికవాదపు నిజమైన అర్థాన్ని వివరిస్తూ రాజ్యం, మతం మధ్య స్పష్టమైన హద్దులు ఉన్నాయని ప్రకటించారు.

కాబట్టి ఆధునిక కాలంలో లౌకికవాదాన్ని పైన పేర్కొన్న కారణాలు ప్రగాఢంగా ప్రభావితం చేసాయని పేర్కొనవచ్చు.

ప్రశ్న 2.
లౌకికవాద వ్యాప్తికి దోహదపడే అంశాలను పేర్కొనండి.
జవాబు:
ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో లౌకికవాద వ్యాప్తికి క్రింద పేర్కొన్న కారకాలు దోహదపడ్డాయని చెప్పవచ్చు.

  1. మూఢనమ్మకాల పట్ల ప్రజలలో వ్యతిరేక ధోరణి.
  2. హేతుబద్ధమైన చింతన, వ్యాప్తి.
  3. ప్రజాస్వామ్య విలువలు, సంస్థల విస్తరణ.
  4. శాస్త్రసాంకేతిక రంగాలలో పురోగతి.
  5. మతపరమైన దోషాల పట్ల అప్రమత్తత.
  6. సామాజిక శాసనాల ప్రభావం.
  7. లౌకిక దృక్పథం, ఆవశ్యకత.
  8. సామాజిక, ఆర్థిక రంగాలలో వ్యక్తుల పురోగతి.
  9. లౌకిక రాజకీయ నాయకత్వ ప్రభావం.
  10. అంతర్జాతీయ శాంతి భావనలకు ప్రాధాన్యత.

AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

ప్రశ్న 3.
లౌకికవాదంలోని ఏ మూడు భావనలైనా విశదీకరించండి.
జవాబు:
లౌకికవాద భావనలు (Concepts of secularism): లౌకికవాదం ప్రధానంగా నాలుగు భావనలను కలిగి ఉంది. అవి

  1. మానవతావాదం, హేతువాద భావన
  2. రాజకీయ, సామాజిక దృక్కోణం
  3. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం
  4. మతం పట్ల వ్యతిరేకత

ఈ నాలుగు భావనలను గురించి ఈ దిగువ పేర్కొన్న విధంగా వివరించవచ్చు.
1) మానవతావాదం, హేతువాద భావన (Humanistic and Atheistic philosophy): లౌకికవాదం కోరుకొనుట అనేక వ్యక్తిగత, సాంస్కృతిక, రాజకీయ, సామాజిక అంతరార్థాలను కలిగి ఉంటుంది. మానవుల శ్రేయస్సును చేత అది మానవతా స్వభావాన్ని కలిగిఉంటుంది. మానవుడు అన్ని విషయాలకు కొలమానం అనే సామెతకు అది ప్రాముఖ్యతను ఇస్తుంది. ఇది మతాన్ని సమర్థించదు లేదా వ్యతిరేకించదు. వ్యక్తులు తమకు ఇష్టమైన మతాన్ని ఎంపిక చేసుకొని, అనుసరించేందుకు వీలు కల్పిస్తుంది.

2) రాజకీయ, సామాజిక దృక్కోణం (Political and Social dimension): లౌకిక వాదానికి నిర్దిష్టమైన రాజకీయ, సామాజిక దృక్కోణాలున్నాయి. అది సహజసిద్ధమైన, భౌతిక దృక్పథాలతోనూ, రాజకీయ, ఆర్థిక స్వావలంబనలతో కూడిన వ్యవస్థాపనకు ప్రతీకగా ఉంటుంది. కుటుంబానికి, సంస్థలకు మరియు సమాజానికి మత స్వాతంత్ర్యానికి ఇది వీలు కల్పిస్తుంది.

3) స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం (Liberty and Democracy): స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి లౌకికవాదం ప్రయోజనకరమైనది. అలాగే ఉదార ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా ఉంటుంది. లౌకికవాదం అధికారిక మత నాయకత్వాన్ని మత సంస్థల ఉనికి, కొనసాగింపు, మనుగడలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రజాసామ్యం, ప్రభుత్వాధికారాల వికేంద్రీకరణను సమర్థిస్తుంది.

4) మతం పట్ల వ్యతిరేకత (Opposition to Religion): లౌకికవాదం ప్రజా వ్యవహారాలను మతం సమర్థించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మతాధికారుల ప్రాబల్యతలను ఖండిస్తుంది. మానవజీవనానికి సంబంధించిన అప్రధాన అంశాలలో మతం ఒకటిగా పేర్కొంటూ, మత ప్రాధాన్యాన్ని తగ్గిస్తుంది. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలగని రీతిలో ప్రజలు వారి మత విశ్వాసాలను, ఆచారాలను అనుసరించవచ్చని పేర్కొంటుంది. ఇతర మతాలకు చెందిన వారికి ఏ విధమైన అపకారం, ద్వేషం, అసూయలు కలిగించకుండా వ్యక్తులు వారి మత కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని స్పష్టీకరించింది. రాజ్యాంగపు మహోన్నత ఆశయాలు, ఆకాంక్షలను ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుందని ఉద్ఘాటించింది.

ప్రశ్న 4.
లౌకికవాదం దృక్కోణాలను క్లుప్తంగా విశ్లేషించండి.
జవాబు:
లౌకికవాదం దృక్కోణాలు (Dimensions of Secularism): లౌకికవాదం దృక్కోణాలు మూడు రకాలు. అవి 1) సామాజిక దృక్కోణం 2) ఆర్థిక దృక్కోణం 3) రాజకీయ దృక్కోణం. వీటిని గురించి క్రింద పేర్కొన్న విధంగా పరిశీలించవచ్చు.

1) సామాజిక దృక్కోణం (Social dimension): లౌకికవాద భావన సామాజిక జీవనంలో మూఢత్వాలను విస్మరించడం లేదా వదిలివేయడానికి సంబంధించింది. కుల, మత, వర్గాల పరంగా వ్యక్తులు వ్యవహరించడాన్ని లౌకికవాదం ఎట్టి పరిస్థితులలో అనుమతించదు. సమాజంలో ఇరుగు పొరుగు వారితో వ్యవహరించేటప్పుడు వ్యక్తులు అస్పృశ్యత, వెట్టి చాకిరీ వంటి దురాచారాలను పాటించరాదని అభిలషిస్తుంది. ఇతరులను తమతో సమానంగాను, గౌరవప్రదంగానూ చూసుకోవాలని సలహా ఇస్తుంది. కుల వ్యత్యాసాలు, వర్గ వివక్షతలు, జాతి విద్వేషాలు వంటి దుర్గుణాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని బోధిస్తుంది. అంతిమంగా సమాజంలో వ్యక్తుల మధ్య | సామరస్యపూర్వక సంబంధాలను సూచిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

2) ఆర్థిక దృక్కోణం (Economic dimension): లౌకికవాదం వ్యక్తులు తమ ఇష్టానుసారంగా తమకు నచ్చిన వృత్తులను ఎన్నుకొని వాటిని ఆచరించటానికి, అనుసరించటానికి, ప్రచారం చేసుకోవడానికి కావలసిన స్వేచ్ఛను లౌకికవాదం కల్పిస్తుంది.

సమాజంలోని సహజ, మానవ, ఆర్థిక సంపదల ఉత్పత్తి కార్యకలాపాలలో వ్యక్తుల మధ్య మతపరమైన వివక్షతలను పాటించడాన్ని లౌకికవాదం నివారిస్తుంది. పారిశ్రామికవేత్తలకు లైసెన్సుల మంజూరులో మతపరమైన అంశాలను రాజ్యాధికారులు పాటించడాన్ని అనుమతించదు. ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక లైసెన్సుల మంజూరు వంటి వ్యవహారాలలో యోగ్యత, నైపుణ్యం, ప్రోత్సాహస్ఫూర్తి వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తుంది.

3) రాజకీయ దృక్కోణం (Political dimension): లౌకికవాదానికి కొన్ని రాజకీయ దృక్కోణాలు ఉంటాయి. లౌకిక వాదం రాజకీయ వ్యవహారాలలో పౌరులందరికీ పూర్తిస్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను అనుమతిస్తుంది. మతం, పరిపాలన, రాజకీయ, చట్టనిర్మాణం, ప్రభుత్వ విధానాల అమలు వంటివి పూర్తిగా మతంతో సంబంధం లేనివిగా విశ్వసిస్తుంది. లౌకిక రాజ్యంలో ప్రజా ప్రతినిధులను ఎన్నుకొనే విషయంలో పౌరులకు అనేక రాజకీయ హక్కులు, స్వాతంత్ర్యాలు ప్రసాదిస్తుంది. మతపరమైన అంశాలతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడు ప్రభుత్వ పదవిని చేపట్టేందుకు అవకాశం ఇస్తుంది. రాజకీయ హక్కులను ప్రసాదించడంలో మతం అనేది ఒక ఆవశ్యక అంశంగా పరిగణించకుండా ప్రజల యొక్క ప్రజాస్వామిక ఆకాంక్షలు, స్వాతంత్ర్యాలకు మార్గాన్ని ఏర్పరుస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే లౌకికవాదపు రాజకీయ దృక్కోణం ఆధునిక రాజ్యపు ప్రజాస్వామిక పనితీరుతో సమానంగా పరిగణించబడుతుంది.

ప్రశ్న 5.
మతరాజ్యం అంటే ఏమిటి ? [Mar. 2016]
జవాబు:
మతరాజ్యం (Theocratic State) అంటే రాజ్యానికి ఒక అధికార మతం ఉంటుంది. సాధారణంగా అధికార మతం ఉన్న మతరాజ్యాలలో ఇతర మతాల నిషేధం ఉంటుంది. లేదా ఇతర మతాల కార్యకలాపాలపై చాలా నియంత్రణ ఉంటుంది. మత రాజ్యాలలో దేశంలోని అన్ని కీలక పదవులకు అధికార మతస్థులనే నియమించడం గానీ లేదా ఎన్నుకోవడానికి గాని అర్హత కలిగి ఉంటారు. రాజ్యం మత కార్యకలాపాలలో అధికారికంగా పాల్గొంటుంది. మత | వ్యాప్తికి, పునరుద్ధరణకు, ప్రార్థనాలయాల నిర్మాణానికి రాజ్యం నిధులు సమకూరుస్తుంది. మతసహనం, సహజీవనం ఈ రాజ్యాలలో చాలా తక్కువగా ఉంటుంది. రాజ్యకార్యకలాపాలలో మతపెద్దల, మతాచారాలకు అగ్రతాంబూలం ఉంటుంది. మతపరమైన న్యాయం, చట్టాలలో, ప్రజల జీవనవిధానంలో ప్రముఖంగా కన్పిస్తుంది. ప్రజల జీవన విధానం, వేషధారణ, ఆహారపు అలవాట్లలో కూడా మత ప్రాధాన్యత ఈ రాజ్యాలలో స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రశ్న 6.
లౌకికరాజ్యం, మతపరమైన రాజ్యం మధ్య వ్యత్యాసాలను పేర్కొనండి. [Mar. 2018]
జవాబు:
లౌకికరాజ్యం, మతపరమైన రాజ్యం ఒకటి కాదు. ఈ రెండూ రాజ్యంలాంటి మానవీయ రాజకీయ సంస్థలుగా ఉన్నప్పటికీ వీటి మధ్య ఈ క్రింది వ్యత్యాసాలు కలవు.

లౌకికరాజ్యం (Secular State)

  1. లౌకికరాజ్యం మతేతర అంశాలపై ఆధార పడుతుంది.
  2. లౌకిక రాజ్యంలో అధికారమతం అంటూ ఏదీ ఉండదు.
  3. లౌకిక రాజ్యంలో అన్ని మతాలకు చెందిన పౌరులు ఏ విధమైన వివక్షతలు లేకుండా మత స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తారు.
  4. లౌకిక రాజ్యంలో సమన్యాయపాలన ఉంటుంది.
  5. ఈ రాజ్యంలో పౌరులందరూ శాసన, పాలన, విద్యా, మత, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో సమాన అవకాశాలు పొందుతారు.
  6. రాజకీయ వ్యవహారాలలో మతాచార్యులకు, ఆధ్యాత్మిక అధిపతులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉండదు.
  7. సర్వమత సమానత్వం అనే సూత్రంపై లౌకిక రాజ్యం ఆధారపడుతుంది.
  8. పన్నుల విధింపులలో మతం అనేది ప్రధాన ప్రాతిపదిక కాదు.
  9. రాజ్యం మతానుకూలంగానూ, మత వ్యతిరేకంగానూ వ్యవహరించదు.
  10. ప్రభుత్వ ఆధీనంలో పూర్తిగాను లేదా పాక్షికంగాను నిర్వహించబడుతున్న విద్యాసంస్థలలో విద్యాబోధన లౌకిక తరహాలో జరుగుతుంది.
  11. తీర్పులను ప్రకటించే, వివాదాల పరిష్కార విషయంలో న్యాయ సంస్థలు మతానికి ప్రత్యేక ప్రాము ఖ్యతను ఇవ్వవు.

AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

మతపరమైన రాజ్యం (Theocratic State)

  1. ఇది ప్రధానంగా మతపరమైన అంశాలపై ఆధార పడుతుంది.
  2. మతపరమైన రాజ్యంలో ఏదో ఒక మతానికి అధికారిక మతహోదా కల్పించబడుతుంది.
  3. అధికారిక హోదా కలిగిన మతానికి సంబంధించిన వారు ఇతర మతాల వారితో పోల్చినట్లయితే ఆధిక్యతను కలిగివుండి, ప్రత్యేక సౌకర్యాలను పొందుతారు.
  4. సాధారణ చట్టాలపై మతపరమైన ఆదేశాలు పైచేయిగా ఉంటాయి. ఆజ్ఞలకు ఆధిక్యం ఉంటుంది.
  5. అధికారిక మతానికి చెందిన వారికి సమాజం, రాజ్యం, ప్రభుత్వ రంగాలలో అధిక ప్రాధాన్యత లభిస్తుంది.
  6. మతాచార్యులకు, ఆధ్యాత్మిక అధిపతులకు అన్ని రంగాలలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది.
  7. ప్రజా వ్యవహారాలలో అధికారిక మతానికి చెందిన వారికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందన్న ప్రమేయంపై మతపరమైన రాజ్యం ఆధారపడి ఉంటుంది.
  8. పన్నుల విధింపులోనూ, పన్ను రాయితీల వర్తింపు విషయంలోనూ మతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు.
  9. రాజ్యం అధికారిక మతానికి సంబంధించిన వారిపట్ల ప్రత్యేక అభిమానాన్ని ఆదరణను ప్రదర్శిస్తుంది.
  10. విద్యా విషయాలలో మతానుకూల అంశాలు అధ్యయనంగా ఉంటాయి.
  11. వివాదాల పరిష్కారంలో మతపరమైన భావాలను, విశ్వాసాలను న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకొంటాయి.

ప్రశ్న 7.
లౌకికవాదంలోని నాలుగు సుగుణాలను వివరించండి.
జవాబు:
లౌకికవాదం సుగుణాలు (Merits of Secularism):
1) సమత (Equity): లౌకికవాదం సమసమాజానికి ప్రాతిపదిక. అన్ని మతాల వారిని సమానంగా పరిగణిస్తుంది. మానవులు సృష్టించిన అసమానతలను గుర్తించదు. అలాగే కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంతీయ భాషాపరమైన వివక్షతలకు తావు ఇవ్వదు. దాంతో ప్రజలు జాతిపట్ల ఎంతో దృఢమైన సానుకూలమైన భావాన్ని కలిగి ఉంటారు.

2) మత స్వాతంత్ర్యం (Religious Freedom): లౌకికవాదం, మత స్వాతంత్ర్యాన్ని ప్రజలు సంపూర్ణంగా అనుభవించుటకు దోహదపడుతుంది. రాజ్యం వ్యక్తుల మత వ్యవహారాలలో జోకం్య చేసుకోదు. లౌకిక రాజ్యంలో రాజ్యాంగం, వివిధ చట్టాలు, వ్యక్తులకు తమ ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించుటకు, ప్రబోధించుటకు, ప్రచారం చేసుకొనేందుకు, సంపూర్ణమైన స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తాయి.

3) శాంతి భద్రతలు (Law and Order): వర్తమాన కాలంలో రాజ్యం, ప్రభుత్వం, ఇతర సంస్థలు ఎంతో విచారకరమైన, దుఃఖదాయకమైన మతానుకూల ఉద్యమాలను ప్రోత్సహించడం లేదా ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. దాంతో విభిన్న మతసముదాయాలకు చెందిన ప్రజల మధ్య సామరస్యం సాధించడం అనేది పెద్ద సవాలుగా పరిణమించింది. అటువంటి సందర్భాలలో లౌకికవాదం మతపరమైన ఘర్షణలను, విద్వేషాలను నివారించగలుగుతుంది. అంతిమంగా, ప్రజల మధ్య మత సామరస్యాన్ని లౌకికవాదం పెంపొందించడం జరుగుతుంది.

4) సమన్యాయ పాలన (Rule of Law): లౌకికవాదం సమన్యాయ పాలన అనే భావనకు ప్రాధాన్యతనిస్తుంది. లౌకికవాదాన్ని అనుసరించే రాజ్యం ఏ ఒక్క మతానికి కాకుండా అన్ని మతాలకు చెందిన ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను రూపొందించి అమలు చేస్తుంది. చట్ట నిర్మాణ సమయంలో ప్రజలకు మత ఛాందస భావాలను పరిగణనలోనికి తీసుకోదు. అలాగే చట్ట నిర్మాణం, చట్టాల అమలు, చట్టాల వ్యాఖ్యానంలో ప్రజలకు ఏ మతంతో సంబంధం లేకుండా లౌకిక రాజ్యం వ్యవహరిస్తుంది.

ప్రశ్న 8.
లౌకికరాజ్యం లక్షణాలేవి ? [Mar. 2017]
జవాబు:
లౌకికరాజ్యం కింది లక్షణాలను కలిగి ఉంటుంది.
1. మతానికి తావు లేదు (No place for religion): లౌకిక రాజ్యం ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపదు. మతపరమైన అంశాల ప్రాతిపదికపై చట్టాలను రూపొందించదు, అమలు చేయదు.

2. సమాన హోదా (Equal status): లౌకికరాజ్యం ప్రజలందరికీ సమాన హోదాను కల్పిస్తుంది. వ్యక్తుల మధ్య కులం, వర్ణం, మతం. తెగ, ప్రాంతం, భాషలవారీగా ఎటువంటి వివక్షతను చూపదు. దాంతో ప్రజలు సంతృప్తి చెంది, వివిధ విధానాలు, కార్యక్రమాల అమలులో ప్రభుత్వానికి సహకారాన్ని అందిస్తారు. విభిన్న మత సముదాయాలకు చెందిన వారందరూ ఇరుగు పొరుగు వారితో సామరస్యంతో కలసిమెలసి నివసిస్తారు.

3. అధికారిక మతం లేకుండుట (No State reglion): లౌకిక రాజ్యం ఏ ఒక్క మతాన్ని అధికార మతంగా గుర్తించదు. మత వ్యవహారాలలో తటస్థ వైఖరిని అవలంబిస్తుంది. ప్రజల మతపరమైన భావాలతో సంబంధం లేకుండా వివిధ చట్టాలను, సామాజిక సంక్షేమ కార్యకలాపాలను అమలు చేస్తుంది. ప్రభుత్వ వ్యవహారాలలో ఏ ఒక్క మతానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతను ఇవ్వదు. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయ సంస్థల వంటి అన్ని ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను ఏ ఒక్క మతంతో సంబంధం లేకుండా నిర్వహిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

ప్రశ్న 9.
లౌకిక రాజ్యం ప్రాముఖ్యత గురించి వ్రాయండి.
జవాబు:
లౌకికరాజ్యం ప్రాముఖ్యత (Importance of Secular State): ఇటీవలి కాలంలో లౌకిక రాజ్య భావన ఎంతగానో ప్రాముఖ్యతను సంతరించుకొంది. ప్రజాస్వామిక స్ఫూర్తి, శాస్త్ర సాంకేతికత, రవాణా సదుపాయాల అభివృద్ధి, హేతుబద్ధమైన చింతన, శ్రేయోవాదం వంటి అంశాల ప్రభావం చేత లౌకిక రాజ్య ప్రాముఖ్యత పెరిగింది. మొత్తం మీద లౌకిక రాజ్య ప్రాముఖ్యతను కింది అంశాల ద్వారా వివరించవచ్చు.

  1. లౌకిక రాజ్యం దేశంలోని వివిధ రంగాలలోని మతేతర శక్తులను బలపరుస్తుంది.
  2. ప్రజల హృదయాలలో పాతుకుపోయిన దురాచారాలను, మూఢ విశ్వాసాలను పారద్రోలుతుంది.
  3. మత పరమైన విద్వేషం, మతమౌఢ్యాలను పారద్రోలడం ద్వారా సామాజిక సంస్కరణలకు దోహదపడుతుంది.
  4. ప్రజలలో శాస్త్రీయ చింతనను పెంపొందించి, వారి మేధోపరమైన వికాసానికి తోడ్పడుతుంది.
  5. విశ్వాసంపై హేతువుకు, కాల్పనికతపై తర్కానికి, కట్టుకథలపై వాస్తవికతలకు ఆధిక్యతనిస్తుంది.
  6. మతపరమైన మైనారిటీ వర్గాలకు భద్రతను కల్పించి వారి రక్షణకు హామీనిస్తుంది.
  7. ప్రతి వ్యక్తి మతపరమైన విశ్వాసాలను గౌరవిస్తుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
లౌకికవాదాన్ని నిర్వచించండి. [Mar. 2017]
జవాబు:

  1. “లౌకికవాదం అంటే మతవిశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా మతంతో సంబంధం లేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన” అని జి.జె. హోల్యోక్ నిర్వచించాడు.
  2. “మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని వాటర్ హౌస్ పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
లౌకికవాదం రకాలు ఏవి ?
జవాబు:
లౌకికవాదం ప్రధానంగా రెండు రకాలు. అవి

  1. వ్యక్తిపరమైన లౌకికవాదం
  2. వస్తుపరమైన లౌకికవాదం

మొదటిది ప్రజల దైనందిన కార్యక్రమాలను మతపరమైన భావాల నుండి విడదీస్తుంది. రెండవది ప్రభుత్వ వ్యవహారాలు, ప్రజా జీవనానికి సంబంధించిన సంస్థలను మతపరమైన వేడుకలు, భావనల నుండి వేరుచేస్తుంది.

ప్రశ్న 3.
లౌకికవాదం గురించి డి.ఇ. స్మిత్ ఇచ్చిన నిర్వచనం ఏది ?
జవాబు:
డి.ఇ. స్మిత్ ప్రకారం లౌకికవాదం మూడు అర్థాలను కలిగి ఉంటుంది. అవి

  1. మత సంబంధమైన స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు.
  2. పౌరసత్వం, సమానత్వపు హక్కు వివక్షతా లేమి, తటస్థతలు.
  3. మతం నుండి రాజ్యాన్ని వేరుచేయటం.

ప్రశ్న 4.
లౌకికవాదం ఆవిర్భావం గురించి రాయండి.
జవాబు:
మతాచార్యులకు, సంస్కరణవాదులకు మధ్య ఘర్షణలు సమాజంలో అరాచకం ఏర్పడటానికి దారితీసినాయి. మతం పేరుతో ప్రజల మీద అత్యున్నతాధికారాన్ని చెలాయించేందుకు ఆధ్యాత్మికవాదులు, మత పెద్దలు ప్రయత్నిస్తే లౌకిక పాలకులు వారి వ్యూహాలను నిర్వీర్యపరచారు. రాజ్య వ్యవహారాల నుండి మతాన్ని వేరు చేసారు. ఈ క్రమంలో ఆవిర్భవించిన వాదమే లౌకికవాదం అని భావించవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

ప్రశ్న 5.
లౌకికవాద వ్యాప్తికి దోహదపడే నాలుగు అంశాలను ఉదహరించండి.
జవాబు:

  1. మూఢనమ్మకాల పట్ల ప్రజలలో వ్యతిరేక ధోరణి.
  2. హేతుబద్ధమైన చింతన, వ్యాప్తి.
  3. ప్రజాస్వామ్య విలువలు, సంస్థల విస్తరణ.
  4. శాస్త్ర, సాంకేతిక రంగాలలో పురోగతి.

ప్రశ్న 6.
లౌకికవాదంలోని ఒక భావన గురించి రాయండి.
జవాబు:
మానవతావాదం, హేతువాద భావన: లౌకికవాదం అనేక వ్యక్తిగత, సాంస్కృతిక, రాజకీయ, సామాజిక అంతరార్థాలను కలిగి ఉంటుంది. మానవుల శ్రేయస్సును కోరుకొనుటచేత అది మానవతా స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది మతాన్ని సమర్థించదు లేదా వ్యతిరేకించదు. వ్యక్తులు తమకు ఇష్టమైన మతాన్ని ఎంపిక చేసుకొని అనుసరించేందుకు వీలు కల్పిస్తుంది.

ప్రశ్న 7.
లౌకికవాదం సామాజిక ధృక్కోణాన్ని తెలపండి.
జవాబు:
సామాజిక దృక్కోణం (Social dimension): లౌకికవాద భావన సామాజిక జీవనంలో మూఢత్వాలను విస్మరించడం లేదా వదిలి వేయడానికి సంబంధించింది. కుల, మత, వర్గాల పరంగా వ్యక్తులు వ్యవహరించడాన్ని లౌకికవాదం ఎట్టి పరిస్థితులలో అనుమతించదు. సమాజంలో ఇరుగు పొరుగు వారితో వ్యవహరించేటప్పుడు వ్యక్తులు అస్త్రశ్యత, వెట్టి చాకిరీ వంటి దురాచారాలను పాటించరాదని అభిలషిస్తుంది. ఇతరులను తమతో సమానంగాను, గౌరప్రదంగానూ చూసుకోవాలని సలహా ఇస్తుంది. కుల వ్యత్యాసాలు, వర్గ వివక్షతలు, జాతి విద్వేషాలు వంటి దుర్గుణాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని బోధిస్తుంది. అంతిమంగా సమాజంలో వ్యక్తుల మధ్య సామరస్య పూర్వక సంబంధాలను సూచిస్తుంది.

ప్రశ్న 8.
మతస్వామ్యం అంటే ఏమిటి ? [Mar. 2018]
జవాబు:
సాంకేతికంగా మతస్వామ్యం అంటే ‘భగవంతుడి పాలన’ అని అర్థం. ఆచరణలో మతాచార్యుల పాలన. భగవంతుడి నుంచి సర్వాధికారాలు సంక్రమిస్తాయనే సిద్ధాంతంపై ఈ భావన రూపొందింది. హిందూమతం, ప్రాచీన యూదు మతం మొదలైన వాటిలో పేర్కొన్నట్లు చట్టాలను వ్యాఖ్యానించే ఏకైక హక్కుతో కూడిన మతాధిపతుల వ్యవస్థను మతపాలన సూచిస్తుంది. వర్తమాన కాలపు ఇస్లాం మతంలో కూడా ఈ భావన ప్రదర్శితమవుతుంది.

ప్రశ్న 9.
లౌకిక రాజ్యానికి, మత రాజ్యానికి మధ్యగల రెండు వ్యత్యాసాలను గుర్తించండి.
జవాబు:

  1. లౌకిక రాజ్యం మతేతర అంశాలపై ఆధారపడుతుంది. మత రాజ్యం మతపరమైన అంశాలపై ఆధార – పడుతుంది.
  2. లౌకిక రాజ్యంలో అధికార మతమంటూ ఏదీ ఉండదు. మత రాజ్యాలలో ఏదో ఒక మతానికి అధికారిక మతహోదా కల్పించబడుతుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

ప్రశ్న 10.
లౌకికవాదం ఏ విధంగా వ్యక్తుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు దోహదపడుతుంది ?
జవాబు:
లౌకిక వ్యవస్థ అమలులో ఉన్న రాజ్యాలలో వ్యక్తులంతా సంపూర్ణ మత, స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను కలిగి ఉంటారు. ప్రతి వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధం ప్రకారం తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు లేదా మతరహితంగా, హేతువాదిగా ఉండిపోవచ్చు. తాను నమ్మిన మత సిద్ధాంతాలను వ్యాప్తి చేసుకోవచ్చు. మతవ్యాప్తికై వెచ్చించే ధనంపై ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదు.

ప్రశ్న 11.
సమన్యాయ పాలన లౌకికవాదాన్ని ఏ విధంగా పెంపొందిస్తుంది ?
జవాబు:
లౌకికవాదం సమన్యాయ పాలన అనే భావానికి ప్రాధాన్యతనిస్తుంది. రాజ్యం ఏ ఒక్క మతానికి కాకుండా అన్ని మతాలకు చెందిన ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను రూపొందించి అమలు చేస్తుంది. చట్ట నిర్మాణ సమయంలో ప్రజల మతఛాందస భావాలను పరిగణనలోకి తీసుకోదు. అందువలన లౌకిక రాజ్యాలలో ప్రజలు సంతృప్తిని, సంతోషాన్ని పొందుతారు.

ప్రశ్న 12.
లౌకిక రాజ్యాన్ని నిర్వచించండి. [Mar. 2018]
జవాబు:
“వ్యక్తులకు స్వీయ, సమిష్టి మత స్వాతంత్ర్యాన్ని హామీ ఇస్తూ వ్యక్తులకు వారి మతంతో సంబంధం లేకుండా పౌరులుగా గుర్తించే రాజ్యమే లౌకిక రాజ్యం” అని డి.ఇ. స్మిత్ పేర్కొన్నాడు.

ప్రశ్న 13.
లౌకిక రాజ్యం రెండు లక్షణాలను గురించి రాయండి. [Mar. 2018]
జవాబు:

  1. మతానికి తావులేదు: లౌకిక రాజ్యం ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపదు. మతపరమైన అంశాల ప్రాతిపదికపై చట్టాలను రూపొందించదు, అమలు చేయదు.
  2. సమాన హోదా: లౌకిక రాజ్యం ప్రజలందరికి సమాన హోదాను కల్పిస్తుంది. వ్యక్తుల మధ్య కులం, వర్ణం, మతం, తెగ, ప్రాంతం భాషల వారీగా ఎటువంటి వివక్షతను చూపదు.

ప్రశ్న 14.
లౌకిక రాజ్యం ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు:
ప్రస్తుత కాలంలో లౌకిక రాజ్య భావన ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొంది. ప్రజాస్వామిక స్ఫూర్తి, శాస్త్ర సాంకేతికత, రవాణా సదుపాయాల అభివృద్ధి, హేతుబద్ధమైన చింతన, శ్రేయోవాదం మొదలగు అంశాల ప్రభావం చేత లౌకికరాజ్యం ప్రాముఖ్యత పెరిగింది.

AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

ప్రశ్న 15.
భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా సమర్థించేందుకు రెండు అంశాలను ఉదహరించండి.
జవాబు:

  1. భారత రాజ్యాంగంలో 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ‘లౌకిక’ అనే పదమును చేర్చడం జరిగింది.
  2. భారత పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులలో మత స్వాతంత్య్రపు హక్కు ముఖ్యమైనది. భారతీయ పౌరులందరూ ఎటువంటి విచక్షణ లేకుండా సంపూర్ణ మత స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను అనుభవిస్తున్నారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 9th Lesson ప్రజాస్వామ్యం Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 9th Lesson ప్రజాస్వామ్యం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రజాస్వామ్యంలోని ప్రయోజనాలు, లోపాలను వివరించండి. [Mar. 2016]
జవాబు:
అర్థం: Democracy అనే ఇంగ్లీషు పదం ‘Demos’ మరియు ‘Kratos’ అనే రెండు గ్రీకు పదాల కలయిక నుంచి ఆవిర్భవించింది. డెమోస్ అంటే ‘ప్రజలు’ క్రటోస్ అంటే ‘అధికారం’ లేదా ‘పాలన’ అని అర్థం.

నిర్వచనం: “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు నిర్వహించబడే ప్రభుత్వం”.

అబ్రహాం లింకన్ ప్రజాస్వామ్యం ప్రయోజనాలు (Merits of Democracy): సమకాలీన ప్రపంచంలో ప్రజాస్వామ్యం విశేషమైన ప్రజాభిమానాన్ని చూరగొంది. దాదాపు ప్రముఖ రాజ్యాలన్నీ ప్రజాస్వామ్యాన్ని తమ రాజకీయ సిద్ధాంతంగా అనుసరిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో కింద పేర్కొన్న ప్రయోజనాలున్నాయి.

1) సమర్థవంతమైన ప్రభుత్వం (Efficient Government): ప్రజాస్వామ్యాన్ని సమర్థవంతమైన, పటిష్టమైన ప్రభుత్వంగా ప్రొఫెసర్ గార్నర్ వర్ణించాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధారణ సమయాలలోనూ, అత్యవసర పరిస్థితులలోనూ ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగానూ, పటిష్టంగానూ కొనసాగుతాయి. ప్రజలచే ఎన్నిక, ప్రజల నియంత్రణ, ప్రజలకు బాధ్యత అనే ప్రజాస్వామ్య సూత్రాలు గోచరిస్తాయి. అవి ఇతర ప్రభుత్వాలతో పోల్చినపుడు ఇందులో సమర్ధతను చేకూర్చుతాయి.

2) వ్యక్తి స్వేచ్ఛల సమర్థన (Upholds Individual Liberties): ప్రజాస్వామ్య ప్రభుత్వం మాత్రమే వ్యక్తి స్వేచ్ఛలను సమర్థిస్తుంది. రాజ్యాంగపరమైన అనేక రక్షణల ద్వారా వ్యక్తుల హామీలకు హామీ ఇస్తుంది. ఈ అంశం ప్రాతిపదికపై జె.ఎస్.మిల్ ప్రజాస్వామ్యాన్ని సమర్థించాడు. ప్రజాస్వామ్యం ప్రజలకు వాక్, సభా, పత్రికా స్వాతంత్రాలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలను ప్రసాదిస్తుందని అతడు ప్రకటించాడు.

3) సమానత్వానికి హామీ (Assures Equality): ప్రజాస్వామ్యం రాజకీయ, ఆర్థిక రంగాలలోని వ్యక్తుల యొక్క సమానత్వానికి హామీ ఇస్తుంది. రాజకీయ రంగంలో పౌరుల కుల, వర్ణం, పుట్టుక వంటి అంశాలతో ప్రమేయం లేకుండా వారికి ఓటు హక్కు, ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు వంటి రాజకీయ హక్కులను పౌరులకు ప్రసాదిస్తుంది. సమాజంలో ఇతర వర్గాలను విస్మరించి కొద్దిమంది వ్యక్తులకు ప్రత్యేక హక్కులను కల్పించడాన్ని వ్యతిరేకిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

4) ప్రజలను విద్యావంతులను చేయడం (Educates the Masses): ప్రజలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రయోగాలకు వీలు కల్పించే సాధనంగా ప్రజాస్వామ్యాన్ని కొందరు వర్ణించారు. వివిధ ప్రాతినిధ్య సంస్థలకు విభిన్న సమయాలలో జరిగే ఎన్నికలు, సంబంధిత ప్రచార ఉద్యమాలు ప్రజాస్వామ్యంలో పౌరులను విద్యావంతులుగా తీర్చిదిద్దుతుంది.

5) దేశభక్తిని పెంపొందించడం (Instills Patriotism): ప్రజాస్వామ్యం ప్రజలలో దేశభక్తిని పెంపొందిస్తుంది. ప్రజాస్వామ్యంలో వివిధ సంస్థల సభ్యుల ఎంపిక, ఎన్నికలలో ప్రజలకు ఎన్నో అవకాశాలు లభిస్తాయి. ప్రాతినిధ్య సంస్థలలో ప్రజలు పాల్గొని అవి విజయవంతంగా పనిచేసేటట్లు జాగ్రత్త వహిస్తారు. వీటి నిర్వహణలో పాల్గొనడాన్ని ప్రజలు ఎంతో గర్వంగా భావిస్తారు. దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రజలు తమ సహాయ సహకారాలను అందించడంలో ఎంతో ఆసక్తిని చూపుతారు. గతంలో ఇండియాపై చైనా, పాకిస్తాన్లు దురాక్రమణ జరిపిన సందర్భాలలో భారతీయులు చూపించిన చొరవ, ప్రదర్శించిన దేశభక్తి ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.

6) స్థిరత్వానికి హామీ (Ensures Stability): ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వం ఉండటం వల్ల విప్లవాల బారి నుంచి దేశాన్ని కాపాడేందుకు అవకాశం ఉంటుంది. ఈ వ్యవస్థలో ప్రజలు ఎన్నికల సమయంలో వ్యతిరేక ఓటు (Negative Vote) వినియోగం ద్వారా ప్రభుత్వాన్ని మార్చివేయగలుగుతారు.

7) ఒకే సమయంలో శాంతి, ప్రగతి (Simultaneous Order and Progress): నియంతృత్వం దేశ ప్రగతిని నిర్లక్ష్యం చేసి భద్రతకు హామీ ఇస్తుంది. అందుకు విరుద్ధంగా ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్దమైన పాలన ద్వారా శాంతి భద్రతల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తుంది. వివిధ రంగాలలో ప్రజల ఔన్నత్యానికి కృషి చేస్తుంది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో దీనిని మనం గమనించవచ్చు. జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలామ్ అజాద్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి ఆదర్శవంతమైన నాయకులు, రాజనీతిజ్ఞులు శైశవదశలో ఉన్న భారత ప్రజాస్వామ్యాన్ని జాతీయ, అంతర్జాతీయ రంగాలలో శక్తివంతమైన, సార్థకమైందిగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో కృషి చేశారు.

8) ప్రజలను బాధ్యతాయుతులుగా చేయడం (Makes the People Responsible): ప్రజాస్వామ్యం వ్యక్తి సామర్థ్యాన్ని గుర్తిస్తుంది. వ్యక్తులలో చొరవను ఏర్పరచేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రజలలో బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందిస్తుంది. ఈ రకమైన పరిస్థితి ఇతర ప్రభుత్వ రకాలలో గోచరించదు. అంతేకాకుండా ప్రజాస్వామ్యం వ్యక్తుల వ్యక్తిత్వ వికాస సాధనకు దోహదపడి వారి ఔన్నత్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

9) పౌరసత్వ శిక్షణ పాఠశాల (Training School for Citizenship): ప్రజాస్వామ్యపు మరొక సుగుణం ఏమిటంటే ఇది ఒక ఉత్తమ పౌరసత్వ పాఠశాలగా వ్యవహరిస్తుంది. ఎన్నికల సమయంలో ఓటుహక్కు, అభ్యర్థులను ఎన్నుకొనే హక్కు వంటి రాజకీయ హక్కులను పౌరులకు అందించడంలో హామీ ఇస్తుంది. అటువంటి హక్కులు, ఇతర రాజకీయ హక్కులలాగా, పౌరసత్వ పాఠాలను నేర్చుకొనేందుకు పౌరులకు సహాయకారిగా ఉంటాయి.

10) హేతుబద్ధమైన ప్రభుత్వం (A Rational Government): “ఏ ఒక్కరూ సంపూర్ణంగా దోషరహితులు ‘కారు’ అనే సూత్రంపై ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది. అధికార దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అవసరమైన చర్యలు, విమర్శలతో కూడిన ప్రక్రియను ప్రజాస్వామ్యం అనుసరిస్తుంది. అంతేకాకుండా రాజకీయ వ్యవస్థ హేతుబద్ధ స్వభావాన్ని ప్రజాస్వామ్యం సంరక్షిస్తుంది.

ప్రజాస్వామ్యం లోపాలు:
1) అజ్ఞానుల పాలన (Rule by Ignorants): అరిస్టాటిల్ ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వ వికృత రూపంగా పరిగణించాడు. ప్రజాస్వామ్యమనేది ఒక రకమైన మూకపాలనగా భావించాడు. అతడి గురువైన ప్లేటో ప్రజాస్వామ్యాన్ని అజ్ఞానుల పాలనగా పిలిచాడు. ప్రజాస్వామ్యంలో ఓట్ల లెక్కింపు మాత్రమే జరుగుతుందని మరికొందరు విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అనేక అంశాలపై నిర్ణయాలనేవి శాసనసభ, మంత్రివర్గ సమావేశాలలో మెజారిటీ సభ్యుల అభీష్టం మేరకు జరుగుతాయి. దాంతో యోగ్యులు, నిజాయితీ గల వ్యక్తులు దూరంగా ఉంచబడి, అజ్ఞానులు, మూర్ఖులు ప్రాధాన్యత కలిగి ఉంటారు.

2) ధనికులకు అనుకూలత (Favours the Rich): ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో అధికభాగం పెట్టుబడిదారీ స్వభావాన్ని కలిగి ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు సంపన్న వర్గాల వారి పట్ల సానుకూలతను ప్రదర్శిస్తాయి. ఎన్నికలనేవి ఒక ప్రహసనంగా మారుతాయి. ప్రజాస్వామ్యంలో ఓటర్లను దైవంగా గుర్తించడమవుతుంది. ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు కులం, వర్ణం, మతం, పుట్టుక, ప్రాంతం వంటి అంశాల వారీగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తారు. వారికి భౌతిక, ధన, కనక వస్తువులను అందించడం ద్వారా ఆకర్షిస్తారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

3) అధిక సంఖ్యాకుల పాలన అనేది ఒక భ్రమ (Majority rule – a Myth): ఒకప్పుడు 1980వ దశకం వరకు ప్రజాస్వామ్యాన్ని అధిక సంఖ్యాకుల పాలనగా పరిగణించడమైంది. ఆ తరువాత జాతీయ, అంతర్జాతీయ రంగాలలో సంభవించిన నాటకీయ పరిణామాల ఫలితంగా అనేక మార్పులు సంభవించాయి. విద్య, అక్షరాస్యత, విజ్ఞాన వికాసం, పత్రికలు, వార్తా దృశ్య సాధనాలు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాలు రాజకీయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చాయి. సంకీర్ణ ప్రభుత్వ రాజకీయ సంస్కృతి సాధారణ రాజకీయ పరిణామంగా మారింది. ప్రాచీన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలుగా పేరుగాంచిన బ్రిటన్ వంటి రాజ్యాలలో సైతం సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటయినాయి. అలాగే అభివృద్ధి చెందుతున్న ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ వంటి దేశాలలో కూడా సంకీర్ణ ప్రభుత్వాలు అనివార్యమవుతున్నాయి.

అందుకు కారణం ఆయా దేశాలలో శాసనసభలలో ఏ ఒక్క పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పరచే సంపూర్ణమైన మెజారిటీ స్థానాలు లభించకపోవడంగా పేర్కొనవచ్చు. దాంతో శాసనసభలలో ఎక్కువ స్థానాలు (మెజారిటీ స్థానాలు కాకుండ) గెల్చుకున్న అతిపెద్ద పార్టీ మిగిలిన చిన్న పార్టీలతో కలసి సంకీర్ణ భాగస్వామ్యంగా ఏర్పడి, కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం సర్వ సాధారణమైంది. అటువంటి ప్రభుత్వాలు శాసనసభలలో మెజారిటీ సభ్యుల మద్దతును పొందక పార్లమెంటరీ ప్రమాణాల పతనానికి దారితీశాయి. భారతదేశంలో 1990వ దశకం ద్వితీయార్థం నుంచి 2014 ప్రథమార్థం వరకు జాతీయ స్థాయిలో ఏర్పడిన ఐక్య సంఘటన (United Front), జాతీయ ప్రజాస్వామ్య కూటమి (National Democratic Alliance), ఐక్య ప్రగతిశీల కూటమి (United Progressive Alliance) ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.

4) సందేహాస్పద ప్రాతినిధ్య సూత్రం (Representative Principle Doubtful): ప్రజాస్వామ్యం ప్రాదేశిక ప్రాతినిధ్యం అనే సూత్రంపై ఆధారపడుతుంది. ఈ సూత్రం ప్రకారం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి భావాలకు, ఒకే శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహించాలి. ఈ విధానం లోపభూయిష్టం మరియు అన్ని వర్గాలకు సరైన ప్రాతినిధ్యం
లభించదు.

5) సమానత్వ సూత్రం దుర్వినియోగం (Abuse of Equality Principle): ప్రజాస్వామ్య ప్రభుత్వ ముఖ్య భావనయైన సమానత్వ సూత్రాన్ని ప్రభుత్వ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ దుర్వినియోగ పరచడమవుతుంది. ప్రజాస్వామ్యం అనేది ప్రతి ఒక్కరూ యోగ్యత, పాండిత్యంతో సంబంధం లేకుండా అందరితో సమానులే అనే అసత్య వాక్యంపై ఆధారపడిందని కొందరు విమర్శించారు..

6) ప్రగతికి ఆటంకం (Impedes Progress): కళలు, సాహిత్యం, శాస్త్ర రంగాలలో ప్రగతికి ప్రజాస్వామ్యం ఆటంకంగా ఉంటుంది. ప్రభుత్వ వ్యవహారాల గురించి అట్టడుగు స్థాయిలో ప్రజలు అంతగా ఆసక్తి చూపించకపోవడమే ఇందుకు కారణం. సాంప్రదాయ దృక్పథం గల సామాన్య ప్రజలు దేశంలో శాస్త్రీయ ప్రగతికి విముఖతను ప్రదర్శిస్తారు.

7) నైతిక విలువలు లేకపోవడం (Lack of Ethical Values): ప్రజాస్వామ్య ప్రభుత్వం నైతిక విలువలు కలిగి ఉండదని కొందరు నినదించారు. వ్యక్తుల నైతికతను ప్రజాస్వామ్యం దిగజారుస్తుందని వారు ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో నిరంతరం నిందలు, అసత్యం వంటి అనైతిక పద్ధతులు ప్రచారంలో ఉంటాయి.

8) వ్యక్తి స్వాతంత్ర్యాల పట్ల వ్యతిరేకత (Opposes Individual Freedoms): ప్రజాస్వామ్యం స్వేచ్ఛాయుత | భావాలను అణచివేసి, హేతువును అడ్డుకొంటుంది. ప్రజాస్వామ్య రాజ్యంలో సృజనాత్మక భావాలు గల తాత్త్వికులు మూర్ఖులుగా పరిగణించబడతారు. ప్రాచీన ఏథెన్స్ పాలకుల ఒత్తిడిచే విషం తాగిన మేధావి సోక్రటీస్ ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్యంలో వ్యక్తిత్వం గల వారిపట్ల ఏ ఒక్కరూ సహనాన్ని కలిగిఉండరు. 9) వ్యయంతో కూడుకున్న ప్రభుత్వం (Expensive One): ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ, ప్రచార కార్యక్రమం భారీ వ్యయంతో కూడుకుని ఉంటుంది. దాంతో సంపద, ఐశ్వర్యం గల వ్యక్తులు మాత్రమే ఎన్నికల బరిలో | ప్రవేశించి విజయపథాన కొనసాగుతారు. అటువంటప్పుడు పేదలు, యోగ్యులు, సేవాతత్పరత గల వ్యక్తులు ఎన్నికల వ్యయాన్ని భరించలేరు. పార్టీ నాయకత్వం కూడా సంపన్న పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రభావిత వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తుంది.

ప్రశ్న 2.
ప్రజాస్వామ్యాన్ని నిర్వచించి సమకాలీన రాజకీయాలలో ప్రజాస్వామ్యం ప్రయోజనాలు, లోపాలను విశ్లేషించండి.
జవాబు:
అర్థం: Democracy అనే ఇంగ్లీషు పదం ‘Demos’ మరియు ‘Kratos’ అనే రెండు గ్రీకు పదాల కలయిక నుంచి ఆవిర్భవించింది. డెమోస్ అంటే ‘ప్రజలు’ క్రటోస్ అంటే ‘అధికారం’ లేదా ‘పాలన’ అని అర్థం.
నిర్వచనాలు:

  1. “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు నిర్వహించబడే ప్రభుత్వం” అని అబ్రహాం లింకన్ పేర్కొన్నాడు.
  2. “పాలనా అధికారం సమాజంలో ఏ ఒక్క వర్గానికో, వర్గాలకో కాకుండా అన్ని వర్గాలకు చెంది ఉండే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం” అని లార్డ్స్ పేర్కొన్నాడు.
  3. “ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యం” అని జే.ఆర్.సీలీ పేర్కొన్నాడు.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

సమకాలీన రాజకీయాలలో ప్రజాస్వామ్యం వలన కలిగే ప్రయోజనాలు:
1) సమర్థవంతమైన ప్రభుత్వం (Efficient Government): ప్రజాస్వామ్యాన్ని సమర్థవంతమైన, పటిష్టమైన ప్రభుత్వంగా ప్రొఫెసర్ గార్నర్ వర్ణించాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధారణ సమయాలలోనూ, అత్యవసర పరిస్థితులలోనూ ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగానూ, పటిష్టంగానూ కొనసాగుతాయి. ప్రజలచే ఎన్నిక, ప్రజల నియంత్రణ, ప్రజలకు బాధ్యత అనే ప్రజాస్వామ్య సూత్రాలు గోచరిస్తాయి. అవి ఇతర ప్రభుత్వాలతో పోల్చినపుడు ఇందులో సమర్థతను చేకూర్చుతాయి.

2) వ్యక్తి స్వేచ్ఛల సమర్థన (Upholds Individual Liberties): ప్రజాస్వామ్య ప్రభుత్వం మాత్రమే వ్యక్తి స్వేచ్ఛలను సమర్థిస్తుంది. రాజ్యాంగపరమైన అనేక రక్షణల ద్వారా వ్యక్తుల హామీలకు హామీ ఇస్తుంది. ఈ అంశం ప్రాతిపదికపై జె. ఎస్. మిల్ ప్రజాస్వామ్యాన్ని సమర్థించాడు. ప్రజాస్వామ్యం ప్రజలకు వాక్, సభా, పత్రికా స్వాతంత్రాలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలను ప్రసాదిస్తుందని అతడు ప్రకటించాడు.

3) సమానత్వానికి హామీ (Assures Equality): ప్రజాస్వామ్యం రాజకీయ, ఆర్థిక రంగాలలోని వ్యక్తుల యొక్క సమానత్వానికి హామీ ఇస్తుంది. రాజకీయ రంగంలో పౌరుల కుల, వర్ణం, పుట్టుక వంటి అంశాలతో ప్రమేయం లేకుండా వారికి ఓటు హక్కు, ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు వంటి రాజకీయ హక్కులను పౌరులకు ప్రసాదిస్తుంది. సమాజంలో ఇతర వర్గాలను విస్మరించి కొద్దిమంది వ్యక్తులకు ప్రత్యేక హక్కులను కల్పించడాన్ని వ్యతిరేకిస్తుంది.

4) ప్రజలను విద్యావంతులను చేయడం (Educates the Masses): ప్రజలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రయోగాలకు వీలు కల్పించే సాధనంగా ప్రజాస్వామ్యాన్ని కొందరు వర్ణించారు. వివిధ ప్రాతినిధ్య సంస్థలకు విభిన్న సమయాలలో జరిగే ఎన్నికలు, సంబంధిత ప్రచార ఉద్యమాలు ప్రజాస్వామ్యంలో పౌరులను విద్యావంతులుగా తీర్చిదిద్దుతుంది.

5) దేశభక్తిని పెంపొందించడం (Instills Patriotism): ప్రజాస్వామ్యం ప్రజలలో దేశభక్తిని పెంపొందిస్తుంది. ప్రజాస్వామ్యంలో వివిధ సంస్థల సభ్యుల ఎంపిక, ఎన్నికలలో ప్రజలకు ఎన్నో అవకాశాలు లభిస్తాయి. ప్రాతినిధ్య సంస్థలలో ప్రజలు పాల్గొని అవి విజయవంతంగా పనిచేసేటట్లు జాగ్రత్త వహిస్తారు. వీటి నిర్వహణలో పాల్గొనడాన్ని ప్రజలు ఎంతో గర్వంగా భావిస్తారు. దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రజలు తమ సహాయ సహకారాలను అందించడంలో ఎంతో ఆసక్తిని చూపుతారు. గతంలో ఇండియాపై చైనా, పాకిస్తాన్లు దురాక్రమణ జరిపిన సందర్భాలలో భారతీయులు చూపించిన చొరవ, ప్రదర్శించిన దేశభక్తి ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.

6) స్థిరత్వానికి హామీ (Ensures Stability): ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వం ఉండటం వల్ల విప్లవాల బారి నుంచి దేశాన్ని కాపాడేందుకు అవకాశం ఉంటుంది. ఈ వ్యవస్థలో ప్రజలు ఎన్నికల సమయంలో వ్యతిరేక ఓటు (Negative Vote) వినియోగం ద్వారా ప్రభుత్వాన్ని మార్చివేయగలుగుతారు.

7) ఒకే సమయంలో శాంతి, ప్రగతి (Simultaneous Order and Progress): నియంతృత్వం దేశ ప్రగతిని నిర్లక్ష్యం చేసి భద్రతకు హామీ ఇస్తుంది. అందుకు విరుద్ధంగా ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్దమైన పాలన ద్వారా శాంతి భద్రతల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తుంది. వివిధ రంగాలలో ప్రజల ఔన్నత్యానికి కృషి చేస్తుంది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో దీనిని మనం గమనించవచ్చు. జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలామ్ అజాద్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి ఆదర్శవంతమైన నాయకులు, రాజనీతిజ్ఞులు శైశవదశలో ఉన్న భారత ప్రజాస్వామ్యాన్ని జాతీయ, అంతర్జాతీయ రంగాలలో శక్తివంతమైన, సార్థకమైందిగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో కృషి చేశారు.

8) ప్రజలను బాధ్యతాయుతులుగా చేయడం (Makes the People Responsible): ప్రజాస్వామ్యం వ్యక్తి సామర్థ్యాన్ని గుర్తిస్తుంది. వ్యక్తులలో చొరవను ఏర్పరచేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రజలలో బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందిస్తుంది. ఈ రకమైన పరిస్థితి ఇతర ప్రభుత్వ రకాలలో గోచరించదు. అంతేకాకుండా ప్రజాస్వామ్యం వ్యక్తుల వ్యక్తిత్వ వికాస సాధనకు దోహదపడి వారి ఔన్నత్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

9) పౌరసత్వ శిక్షణ పాఠశాల (Training School for Citizenship): ప్రజాస్వామ్యపు మరొక సుగుణం ఏమిటంటే ఇది ఒక ఉత్తమ పౌరసత్వ పాఠశాలగా వ్యవహరిస్తుంది. ఎన్నికల సమయంలో ఓటుహక్కు, అభ్యర్థులను ఎన్నుకొనే హక్కు వంటి రాజకీయ హక్కులను పౌరులకు అందించడంలో హామీ ఇస్తుంది. అటువంటి హక్కులు, ఇతర రాజకీయ హక్కులలాగా, పౌరసత్వ పాఠాలను నేర్చుకొనేందుకు పౌరులకు సహాయకారిగా ఉంటాయి.

10) హేతుబద్ధమైన ప్రభుత్వం (A Rational Government): “ఏ ఒక్కరూ సంపూర్ణంగా దోషరహితులు కారు’ అనే సూత్రంపై ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది. అధికార దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అవసరమైన చర్యలు, విమర్శలతో కూడిన ప్రక్రియను ప్రజాస్వామ్యం అనుసరిస్తుంది. అంతేకాకుండా రాజకీయ వ్యవస్థ హేతుబద్ధ స్వభావాన్ని ప్రజాస్వామ్యం సంరక్షిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్యం లోపాలు:
1) అజ్ఞానుల పాలన (Rule by Ignorants): అరిస్టాటిల్ ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వ వికృత రూపంగా పరిగణించాడు. ప్రజాస్వామ్యమనేది ఒక రకమైన మూకపాలనగా భావించాడు. అతడి గురువైన ప్లేటో ప్రజాస్వామ్యాన్ని అజ్ఞానుల పాలనగా పిలిచాడు. ప్రజాస్వామ్యంలో ఓట్ల లెక్కింపు మాత్రమే జరుగుతుందని మరికొందరు విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అనేక అంశాలపై నిర్ణయాలనేవి శాసనసభ, మంత్రివర్గ సమావేశాలలో మెజారిటీ సభ్యుల అభీష్టం మేరకు జరుగుతాయి. దాంతో యోగ్యులు, నిజాయితీ గల వ్యక్తులు దూరంగా ఉంచబడి, అజ్ఞానులు, మూర్ఖులు ప్రాధాన్యత కలిగి ఉంటారు.

2) ధనికులకు అనుకూలత (Favours the Rich): ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో అధికభాగం పెట్టుబడిదారీ స్వభావాన్ని కలిగి ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు సంపన్న వర్గాల వారి పట్ల సానుకూలతను ప్రదర్శిస్తాయి. ఎన్నికలనేవి ఒక ప్రహసనంగా మారుతాయి. ప్రజాస్వామ్యంలో ఓటర్లను దైవంగా గుర్తించడమవుతుంది. ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు కులం, వర్ణం, మతం, పుట్టుక, ప్రాంతం వంటి అంశాల వారీగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తారు. వారికి భౌతిక, ధన, కనక వస్తువులను అందించడం ద్వారా ఆకర్షిస్తారు.

3) అధిక సంఖ్యాకుల పాలన అనేది ఒక భ్రమ (Majority rule – a Myth): ఒకప్పుడు 1980వ దశకం వరకు ప్రజాస్వామ్యాన్ని అధిక సంఖ్యాకుల పాలనగా పరిగణించడమైంది. ఆ తరువాత జాతీయ, అంతర్జాతీయ రంగాలలో సంభవించిన నాటకీయ పరిణామాల ఫలితంగా అనేక మార్పులు సంభవించాయి. విద్య, అక్షరాస్యత, విజ్ఞాన వికాసం, పత్రికలు, వార్తా దృశ్య సాధనాలు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాలు రాజకీయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చాయి. సంకీర్ణ ప్రభుత్వ రాజకీయ సంస్కృతి సాధారణ రాజకీయ పరిణామంగా మారింది. ప్రాచీన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలుగా పేరుగాంచిన బ్రిటన్ వంటి రాజ్యాలలో సైతం సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటయినాయి. అలాగే అభివృద్ధి చెందుతున్న ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ వంటి దేశాలలో కూడా సంకీర్ణ ప్రభుత్వాలు అనివార్యమవుతున్నాయి. అందుకు కారణం ఆయా దేశాలలో శాసనసభలలో ఏ ఒక్క పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పరచే సంపూర్ణమైన మెజారిటీ స్థానాలు లభించకపోవడంగా పేర్కొనవచ్చు. దాంతో శాసనసభలలో ఎక్కువ స్థానాలు (మెజారిటీ స్థానాలు కాకుండ) గెల్చుకున్న అతిపెద్ద పార్టీ మిగిలిన చిన్న పార్టీలతో కలసి సంకీర్ణ భాగస్వామ్యంగా ఏర్పడి, కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం సర్వ సాధారణమైంది. అటువంటి ప్రభుత్వాలు శాసనసభలలో మెజారిటీ సభ్యుల మద్దతును పొందక పార్లమెంటరీ ప్రమాణాల పతనానికి దారితీశాయి. భారతదేశంలో 1990వ దశకం ద్వితీయార్థం నుంచి 2014 ప్రథమార్థం వరకు జాతీయ స్థాయిలో ఏర్పడిన ఐక్య సంఘటన (United Front), జాతీయ ప్రజాస్వామ్య కూటమి (National Democratic Alliance), ఐక్య ప్రగతిశీల కూటమి (United Progressive Alliance) ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.

4) సందేహాస్పద ప్రాతినిధ్య సూత్రం (Representative Principle – Doubtful): ప్రజాస్వామ్యం ప్రాదేశిక ప్రాతినిధ్యం అనే సూత్రంపై ఆధారపడుతుంది. ఈ సూత్రం ప్రకారం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి భావాలకు, ఒకే | శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహించాలి. ఈ విధానం లోపభూయిష్టం మరియు అన్ని వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లభించదు.

5) సమానత్వ సూత్రం దుర్వినియోగం (Abuse of Equality Principle): ప్రజాస్వామ్య ప్రభుత్వ ముఖ్య భావనయైన సమానత్వ సూత్రాన్ని ప్రభుత్వ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ దుర్వినియోగ పరచడమవుతుంది. ప్రజాస్వామ్యం అనేది ప్రతి ఒక్కరూ యోగ్యత, పాండిత్యంతో సంబంధం లేకుండా అందరితో సమానులే అనే అసత్య వాక్యంపై ఆధారపడిందని కొందరు విమర్శించారు.

6) ప్రగతికి ఆటంకం (Impedes Progress): కళలు, సాహిత్యం, శాస్త్ర రంగాలలో ప్రగతికి ప్రజాస్వామ్యం ఆటంకంగా ఉంటుంది. ప్రభుత్వ వ్యవహారాల గురించి అట్టడుగు స్థాయిలో ప్రజలు అంతగా ఆసక్తి చూపించకపోవడమే ఇందుకు కారణం. సాంప్రదాయ దృక్పథం గల సామాన్య ప్రజలు దేశంలో శాస్త్రీయ ప్రగతికి విముఖతను ప్రదర్శిస్తారు.

7) నైతిక విలువలు లేకపోవడం (Lack of Ethical Values): ప్రజాస్వామ్య ప్రభుత్వం నైతిక విలువలు కలిగి ఉండదని కొందరు నినదించారు. వ్యక్తుల నైతికతను ప్రజాస్వామ్యం దిగజారుస్తుందని వారు ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో నిరంతరం నిందలు, అసత్యం వంటి అనైతిక పద్ధతులు ప్రచారంలో ఉంటాయి.

8) వ్యక్తి స్వాతంత్ర్యాల పట్ల వ్యతిరేకత (Opposes Individual Freedoms): ప్రజాస్వామ్యం స్వేచ్చాయుత భావాలను అణచివేసి, హేతువును అడ్డుకొంటుంది. ప్రజాస్వామ్య రాజ్యంలో సృజనాత్మక భావాలు గల తాత్త్వికులు మూర్ఖులుగా పరిగణించబడతారు. ప్రాచీన ఏథెన్స్ పాలకుల ఒత్తిడిచే విషం తాగిన మేధావి సోక్రటీస్ ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్యంలో వ్యక్తిత్వం గల వారిపట్ల ఏ ఒక్కరూ సహనాన్ని కలిగిఉండరు.

9) వ్యయంతో కూడుకున్న ప్రభుత్వం (Expensive One): ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ, ప్రచార కార్యక్రమం భారీ వ్యయంతో కూడుకుని ఉంటుంది. దాంతో సంపద, ఐశ్వర్యం గల వ్యక్తులు మాత్రమే ఎన్నికల బరిలో ప్రవేశించి విజయపథాన కొనసాగుతారు. అటువంటప్పుడు పేదలు, యోగ్యులు, సేవాతత్పరత గల వ్యక్తులు ఎన్నికల వ్యయాన్ని భరించలేరు. పార్టీ నాయకత్వం కూడా సంపన్న పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రభావిత వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

ప్రశ్న 3.
ప్రజాస్వామ్యం విజయవంతమయ్యేందుకు అవసరమైన పరిస్థితులను సూచించండి.
జవాబు:
అర్థం: Democracy అనే ఇంగ్లీషు పదం ‘Demos’ మరియు ‘Kratos’ అనే రెండు గ్రీకు పదాల కలయిక నుంచి ఆవిర్భవించింది. డెమోస్ అంటే ‘ప్రజలు’ క్రటోస్ అంటే ‘అధికారం’ లేదా ‘పాలన’ అని అర్థం.

నిర్వచనం: “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు నిర్వహించబడే ప్రభుత్వం”.

అబ్రహాం లింకన్
ప్రజాస్వామ్య విజయానికి అవసరమైన పరిస్థితులు (Essential conditions to the success of Democracy): ప్రజాస్వామ్య విజయానికి కింద పేర్కొన్న పరిస్థితులు అవసరమవుతాయి.
1) సరైన విద్య (Sound system of Education): ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే పౌరులకు సరైన విద్య ఎంతో అవసరం. అజ్ఞానం, అమాయకత్వం, అవిద్య గల పౌరులు సరైన దృక్పథాన్ని కలిగి ఉండక, భారీ సంస్కరణల పట్ల విముఖత ప్రదర్శిస్తారు. విద్య అనేది వ్యక్తుల వివేకానికి పదును పెడుతుంది. అనేక విషయాల పట్ల సరియైన అవగాహనను పెంపొందిస్తుంది. పౌరులను అప్రమత్తులుగా చేస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ విధానాలను అంచనా వేయడంలో, విమర్శించడంలో విద్య దోహదపడుతుంది.

2) వికాసవంతమైన పౌరసత్వం (Enlightened Citizenship): ప్రజాస్వామ్య రాజ్యానికి వికాసవంతమైన పౌరులు విలువైన ఆస్థిగా పరిగణించబడతారు. వారు ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు. వీరు ప్రభుత్వ వ్యవహారాలలో చురుకుగా పాల్గొని, హక్కులు, విధుల సక్రమ నిర్వహణలో తోటి పౌరులకు సహాయంగా ఉంటారు. ప్రభుత్వం అమలుచేసే అన్ని మంచి కార్యక్రమాలకు సహకారాన్ని అందిస్తారు.

3) స్వతంత్ర పత్రికలు (Independent Press): ప్రజాస్వామ్యానికి స్వతంత్రమైన పత్రికలు ఎంతో ఆవశ్యకమైనవి. పత్రికలు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ఖచ్చితంగానూ, నిష్పక్షపాతంగానూ ప్రజలకు తెలుపుతాయి. ప్రభుత్వ కార్యకలాపాల పట్ల ప్రజలకు సంబంధం కలిగి ఉండేటట్లు చూస్తాయి. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతాయి. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సామరస్యపూర్వక సంబంధాలను పెంపొందించేందుకు కృషి చేస్తాయి.

4) దృఢమైన ప్రతిపక్షం (Strong Opposition): పార్లమెంటరీ ప్రజాస్వామ్య విజయం దృఢమైన, సమర్థవంతమైన ప్రతిపక్షంపై చాలా వరకు ఆధారపడుతుంది. అటువంటి ప్రతిపక్షం ప్రభుత్వ విధానాల లోపాలను వెల్లడించి, వాటి నివారణకు కృషి చేస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో ప్రతిపక్షాలు ప్రశంసనీయమైన పాత్రను పోషిస్తున్నాయనే విషయాన్ని ఈ సందర్భంలో మనం ప్రస్తావించవచ్చు. భారతదేశంలో కూడా ఇటీవలి కాలంలో అధికారంలో కొనసాగిన అధికార పార్టీలకు చెందిన వ్యక్తులు పాల్పడిన కుంభకోణాలను వెలికి తీయడంలో ప్రతిపక్షం బృహత్తరమైన పాత్రను పోషించింది. పైన ఉదహరించిన దేశాలలోని అధికార పార్టీలు అనేక అంశాలలో ఎదురైన చిక్కుముడులను పరిష్కరించడంలో ప్రతిపక్షాల సలహాలను తీసుకోవడమైనది. ఇటువంటి పరిస్థితి అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు రెండింటిలో ప్రజాస్వామ్యపు ఆరోగ్యకర చిహ్నంగా పరిగణించవచ్చు.

5) అధికారాల వికేంద్రీరణ (Decentralization of Powers): ప్రజాస్వామ్య వ్యవస్థ ఆరోగ్యకరంగా పనిచేసేందుకు అట్టడుగు స్థాయిలో అధికారాల వికేంద్రీకరణ అత్యంత ఆవశ్యకం. భారతదేశంలో అట్టుడుగు స్థాయిలోని ప్రాతినిధ్య సంస్థలు (పంచాయితీరాజ్ సంస్థలు) కిందిస్థాయి శాసనసభలుగా వ్యవహరించడం ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. స్థానిక ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు తమ ఓటుహక్కును ఎలా వినియోగించుకోవాలనే విషయంలో | ఇవి పూర్తి అవగాహన కలిగిస్తాయి.

6) ఆర్థిక అసమానతలు లేకుండుట (Absence of economic disparities): దేశంలో ఆర్థిక వ్యత్యాసాలు లేనప్పుడు ప్రజాస్వామ్యం సాఫీగా పనిచేయగలుగుతుంది. దేశంలో ఎక్కువ మంది పేదవారుగానూ, కొద్దిమంది ఐశ్వర్య వంతులుగానూ ఉంటే ప్రజాస్వామ్యం విజయవంతం కాలేదు. వికాసవంతమైన, వివేకవంతమైన పౌరసత్వం గల వ్యక్తులు ఉన్నప్పుడే, ప్రభుత్వ వ్యవహారాలలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. కాబట్టి ప్రజాస్వామ్యం విజయవంతంగా పనిచేసేందుకు ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణానికి కృషి చేయాలి.

7) సాంఘిక సమానత్వం (Social Equality): సాంఘిక సమానత్వం అనేది ప్రజాస్వామ్య విజయానికి మరొక ఆవశ్యకంగా పేర్కొనవచ్చు. కులం, వర్గం, తెగల వ్యత్యాసాలు అనేవి ప్రజాస్వామ్యపు ఆరోగ్యకరమైన పనితీరును అడ్డుకుంటాయి. ఇటువంటి అంశాలు సంకుచిత అంశాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి ఉమ్మడి శ్రేయస్సుకు హాని కలిగిస్తాయి. అట్లాగే భాషా, ప్రాంతీయపరమైన అంశాలు ప్రజాస్వామ్య రాజ్య నిర్వహణకు ఆటంకంగా ఉంటాయి. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే సామాజిక రంగంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలి. సాంఘిక సమానత్వాన్ని సిద్ధాంతరీత్యా ఆచరణలోను ఉంచే ప్రయత్నం జరగాలి.

8) ప్రజాస్వామ్యంపై విశ్వాసం (Faith in Democracy): ప్రజాస్వామ్యానికి సంబంధించిన కొన్ని విలువలైన వ్యక్తి యోగ్యత, విభిన్న వైఖరుల పట్ల సహనం, చర్చల ద్వారా నిర్ణయాలు తీసుకోవడం మొదలగు వాటిని ప్రజలకు నేర్పాలి. ప్రజా జీవనంలో సోదరభావాన్ని ఇతరుల అభిప్రాయాలు, ఆలోచనలకు తగిన ప్రాముఖ్యతను ఇవ్వడంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కాబట్టి ప్రభుత్వాలు ప్రజలలో ప్రజాస్వామ్య విలువల పట్ల విశ్వాసం కల్పించినప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి అవకాశముంటుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

9) ప్రాథమిక అంశాలపై ఆమోదం (Agreement on Fundamental Issues): ప్రజాస్వామ్యం |విజయవంతం కావాలంటే ప్రాథమిక అంశాలపై ఆమోదం కావాలి. లేనట్లయితే ప్రజల మధ్య విపరీతమైన వ్యత్యాసాలు నెలకొంటాయి. అటువంటి వ్యత్యాసాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలి. లేనట్లయితే ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్ధకమై ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ప్రజాస్వామ్య ప్రక్రియపై సమాజంలోని అన్ని ప్రధాన వర్గాలకు గట్టి నమ్మకం ఉండాల్సిన అవసరం ఉంది. తమ మధ్య తలెత్తే ఘర్షణలను చర్చల ద్వారానే పరిష్కరించుకొనేందుకు ప్రజలు సన్నద్ధులుగా ఉండాలి.

10) వివేకవంతమైన నాయకత్వం (Sagacious Leadership): ప్రజాస్వామ్య మౌలిక అంశాలలో వివేక వంతమైన పాలకులు తమ పరిపాలనా సూక్ష్మత, రాజకీయ ఔచిత్యం, సామాజిక అంకిత భావం, ఆర్థిక దృక్పథం వంటి లక్షణాలతో ప్రజాస్వామ్య రాజ్యాన్ని మహోన్నత స్థాయికి తీసుకువెళ్ళగలుగుతారు. చెడు ఆచరణలకు, మహోన్నత ఆదర్శాలకు మధ్యగల వ్యత్యాసాన్ని గుర్తించగలుగుతారు. వివిధ సంఘటనల వల్ల ప్రతిస్పందించే విషయంలో సంకుచిత భావాలను మంచి నిర్ణయాల ద్వారా అధిగమిస్తారు.

11) నిజాయితీ, పారదర్శకతలు (Honesty and Transparency): వివిధ రంగాలకు చెందిన నిజాయితీ పరులైన వ్యక్తులు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించినప్పుడు వారు ప్రజాస్వామ్య విజయానికి కృషి చేస్తారు. అదే విధంగా పాలనలో పారదర్శకత కూడా ప్రజాస్వామ్య విజయానికి ప్రధాన సాధనంగా ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు అసత్య, అనైతికత, అశ్లీల చర్యలకు పాల్పడినప్పుడు ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుంది. అలాగే స్వార్థపరత్వం, అధికార దాహం, వక్రభావాలు గల నాయకులు నిగూఢమైన అజెండాతో వ్యవహరించినట్లయితే దేశం కోలుకోలేని స్థితికి దిగజారిపోతుంది.

12) సైన్యం పెత్తనం లేకుండుట (Absence of militarism): సైన్యం అజమాయిషీ, పెత్తనం లేని దేశాలలో ప్రజాస్వామ్యం పనిచేయగలుగుతుంది. బలప్రయోగానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా, వ్యక్తుల యోగత్యను విశ్వసిస్తుంది. సామర్థ్యం, అంకిత భావం, యోగ్యతల ఆధారంగా వ్యక్తులకు అనేక అవకాశాలను కల్పిస్తుంది. అందుకు విరుద్ధమైన పరిస్థితులు సైన్యం పెత్తనం ఉన్న దేశాలలో నెలకొని ఉంటాయి. సైనిక పాలనలో అధికారాల కేంద్రీకరణ జరిగి, నియంతృత్వం పట్ల అనుకూలత ఉంటుంది. యుద్ధం, సంఘర్షణల పట్ల మొగ్గు చూపుతున్న దేశాలలో సైన్యం పెత్తనం చెలాయిస్తుంది. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యాన్ని పెంచి పోషించాలంటే అందుకు అనుకూలమైన పరిస్థితులు ఉండాలి.

ప్రశ్న 4.
ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలిపి, ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాల గురించి రాయండి. [Mar. ’18, ’17, ’16’]
జవాబు:
పరిచయం: ప్రజాస్వామ్యం ఒక ఆధునిక ప్రభుత్వ స్వరూపం. ఇందులో వివిధ స్థాయిలలో ప్రభుత్వములు ప్రజలచే ప్రత్యక్షముగా గాని లేదా పరోక్షముగా గాని ఏర్పాటు చేయబడి నిర్వహించబడతాయి. ఈ వ్యవస్థలో వంశపారంపర్య పదవులకు ఏ స్థాయిలోనూ అవకాశం ఉండదు.

అర్థం: Democracy అనే ఇంగ్లీషు పదం ‘Demos’ మరియు ‘Krates’ అనే రెండు గ్రీకు పదాల కలయిక నుంచి ఆవిర్భవించింది. డెమోస్ అంటే ‘ప్రజలు’ క్రటోస్ అంటే ‘అధికారం’ లేదా ‘పాలన’ అని అర్థం.

నిర్వచనం: “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు నిర్వహించబడే ప్రభుత్వం”.

అబ్రహాం లింకన్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం: ఈ పద్ధతిలో ప్రజలు ప్రభుత్వ పాలన వ్యవహారాలలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. శాసన సంబంధమైన అధికారాలన్నీ వారు చెలాయిస్తారు. ప్రజలే చట్ట సభలలో పాల్గొని చట్టాలను రూపొందిస్తారు. రాజ్య వ్యవహారాలలో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వామ్యం వహిస్తారు.ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో కొన్ని కాంటన్ల (Cantons) లోనూ, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలోనూ నెలకొని ఉంది.

ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు: ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు నాలుగు రకాలుగా ఉంటాయి. అవి:

  1. ప్రజాభిప్రాయ సేకరణ (Referendum)
  2. ప్రజాభిప్రాయ నివేదన (Initiative)
  3. పునరాయనం (Recall)
  4. ప్రజాభిప్రాయ నిర్ణయం (Plebiscite)

పైన పేర్కొన్న నాలుగు రకాల ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలను కింది విధంగా చర్చించవచ్చు.
1) ప్రజాభిప్రాయ సేకరణ (Referendum): రిఫరెండమ్ (referendum) అనే ఆంగ్ల పదానికి అర్థం “ప్రజాభిప్రాయ సేకరణ”. ఒకానొక అంశంపై ప్రజల అభిప్రాయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకొనే ప్రక్రియనే ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. ఇటువంటి అంశం సాధారణమైనది లేదా రాజ్యాంగపరమైనది కావచ్చు. ఆర్.సి. బ్రూక్స్ ప్రకారం | ప్రజాభిప్రాయ సేకరణ అనేది శాసనసభ అప్పటికే ఆమోదించిన బిల్లు లేదా చట్టంపై నియోజకుల అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు ఉద్దేశించింది.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

ప్రజాభిప్రాయ సేకరణ రకాలు (Types of Referendum): ప్రజాభిప్రాయ సేకరణ రెండు రకాలు. అవి: 1. నిర్బంధమైనవి 2. స్వచ్ఛందమైనవి. ఒకానొక శాసన అంశంపై నియోజకుల అభిప్రాయాన్ని విధిగానూ, ఖచ్ఛితమైన నియమంగానూ పరిగణనలోకి తీసుకొని తెలుసుకోవడాన్ని నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. ఈ రకమైన ప్రజాభిప్రాయ సేకరణ స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా రాజ్యాంగాల సవరణల విషయంలో అనుసరించడమైంది. ఉదాహరణకు స్విట్జర్లాండ్ లోని కొన్ని కాంటన్లలో (రాష్ట్రాలలో) సాధారణ బిల్లులపై కూడా నిర్బంధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరగాలనే రాజ్యాంగ ప్రకరణం ఉంది. అదే విధంగా ఒక నిర్ణీత సంఖ్యలో పౌరులు శాసనసభ ఆమోదించిన అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కోరితే ఆ అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఇటువంటి దానిని స్వచ్ఛందమైన ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. ఉదాహరణకు 30,000 మంది పౌరులుగానీ, ఎనిమిది కాంటన్లు (8 రాష్ట్రాలు) |గానీ ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కోరినట్లయితే ఈ విధమైన ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది.

2) ప్రజాభిప్రాయ నివేదన (Initiative): ప్రత్యక్ష ప్రజాస్వామ్య సమర్థకులు ఒక్క ప్రజాభిప్రాయ సేకరణతో సంతృప్తి చెందలేదు. దాంతో ప్రజలు శాసన నిర్మాణ ప్రక్రియలో ప్రజలు పాల్గొనేలా ప్రజాభిప్రాయ నివేదన గురించి వారు గట్టిగా చెప్పారు. ఉదాహరణకు స్విట్జర్లాండ్లో 50,000 మంది పౌరులు ఏదైనా ఒక అంశంపై చట్టాన్ని రూపొందించాల్సిందిగా శాసనసభను కోరుతూ ఒక అర్జీపై సంతకం చేయవచ్చు. అప్పుడు వారి ప్రతిపాదనను ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి పంపించబడుతుంది. మెజారిటీ పౌరులు ఆ ప్రతిపాదన ఆమోదించినట్లయితే, ఆ అంశం చట్టంగా ఆమోదితమై అమల్లోకి వస్తుంది. స్విట్జర్లాండ్లోని కాంటన్లలో (రాష్ట్రాలలో) సాధారణ అంశాలతోపాటుగా రాజ్యాంగ ప్రాముఖ్యతగల అంశాలపై ప్రజల అభిప్రాయాన్ని కోరడం ఎప్పటి నుంచో వాడుకలో ఉంది. అయితే అటువంటి ప్రతిపాదనపై సంతకం చేసే వారి సంఖ్య ఆ దేశంలో రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటుంది.

ప్రజాభిప్రాయ నివేదన రకాలు (Types of Initiative): ప్రజాభిప్రాయ నివేదన 1. విధాయకమైనది లేదా నిర్ణీత నియమాలతో కూడినది. 2. విధాయకం కానిది లేదా నిర్ణీత నియమాలు లేనిది అని రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిదైన విధాయకమైన అభిప్రాయ నివేదన అనేది ఒక బిల్లులోని అన్ని అంశాలకు సంబంధించినది. ఆ బిల్లు విషయంలో శాసనసభ ప్రజలు ప్రతిపాదించిన అంశాలన్నింటినీ యధాతధంగా ఆమోదించాల్సి ఉంటుంది. లేనియెడల ప్రజల తీర్పును తెలుసుకొనేందుకు ఓటింగ్ నిర్వహణకు పంపించబడుతుంది. ఇక రెండోదైన విధాయకంగాని ప్రజాభిప్రాయ నివేదన అనేది కేవలం బిల్లులోని సాధారణ అంశాల సూచనకు సంబంధించినది. ప్రజల డిమాండ్లు ఏమిటనే విషయంలో ఆ బిల్లులో పేర్కొనడం జరగదు. ఉదాహరణకు స్విట్జర్లాండులో శాసనసభ ప్రజలు పంపిన ప్రతిపాదనలను ఆమోదించి, వాటికి అనుగుణంగా బిల్లు ముసాయిదాను రూపొందించి, ప్రజల నిర్ణయాన్ని తెలుసుకొనేలా ఓటింగ్ జరిగేందుకు చర్యలు గైకొనడం జరుగుతుంది. ఒకవేళ స్విస్ ఫెడరల్ అసెంబ్లీ ప్రజలు పంపిన నివేదనలోని అంశాలను ఆమోదించినట్లయితే, ఫెడరల్ అసెంబ్లీ ప్రతిపాదిత అంశాలతో కూడిన బిల్లు రూపొందించి ఆమోదిస్తుంది. అయితే మొత్తం రాజ్యాంగమంతటిని సవరించాలనే డిమాండు అందుకు భిన్నంగా ఉంటుంది.

రాజ్యాంగ సవరణ గురించి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు ఓటింగు నిర్వహించబడుతుంది. మెజారిటీ స్విస్ పౌరులు పూర్తి సవరణ పట్ల అనుకూలంగా ఉంటే, ఫెడరల్ అసెంబ్లీ రద్దవుతుంది. క్రొత్తగా ఎన్నుకోబడిన ఫెడరల్ అసెంబ్లీ సభ్యులు, పౌరులు ప్రతిపాదించిన రీతిలో ముసాయిదా రాజ్యాంగ బిల్లును రూపొందించి ఆమోదిస్తారు. ఆ తరువాత ఆ బిల్లుపై ప్రజాభీష్టాన్ని తెలుసుకొనేందుకై దేశవ్యాప్తంగా ఓటింగ్ నిర్వహించబడుతుంది. ఆ బిల్లును దేశంలోని మెజారిటీ దేశ ప్రజలు, కాంటన్లు ఆమోదించినట్లయితే ఆ అంశంపై రాజ్యాంగ సవరణ జరుగుతుంది.

3) పునరాయనం (Recall): పునరాయనం అనేది ఒక ముఖ్యమైన ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనం. ఈ పద్దతిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లేదా అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా తమ కర్తవ్యాలను నిర్వహించడంలో విఫలమైతే వారిని ఓటర్లు వెనుకకు పిలిచేందుకు వీలుంటుంది. దీనినే పునరాయనం అంటారు. ఈ రకమైన పద్ధతి అమెరికాలోని అరిజోనా, మోంటానా, లూసియానా, కాన్సాస్, కాలిఫోర్నియా, నెవెడా, ఓరెగాన్ మొదలగు రాష్ట్రాలలో అమలులో ఉంది.

4) ప్రజాభిప్రాయ నిర్ణయం (Plebiscite): ప్రజాభిప్రాయ నిర్ణయం (Plebiscite) అనే పదానికి ఫ్రాన్స్లో మూలాలున్నాయి. ఆ పదం లాటిన్ భాషలోని ప్లెబిస్ (Plebis), సెటిమ్ (Scitum) అనే రెండు పదాల నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో ప్లెబిస్ అంటే ‘ప్రజలు’, సెటమ్’ అంటే ‘నిర్ణయం’ లేదా తీర్పు. ప్రజా నిర్ణయం లేదా ప్రజాతీర్పని అర్థం. అదేవిధంగా ఒకానొక ప్రభుత్వ విధానంపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు అనుసరించే ప్రజాస్వామ్య సాధనమే ప్రజాభిప్రాయ నిర్ణయంగా పేర్కొనవచ్చు. ప్రజా నిర్ణయానికి దైనందిన చట్ట నిర్మాణ కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదు. ప్రజాభిప్రాయ నిర్ణయంలోని ముఖ్య లక్షణం ఏమిటంటే ఈ పద్ధతి ప్రకారం వెలువడిన ప్రజల నిర్ణయాలు అంతిమమైనవి. వాటికి ఏ విధమైన మార్పులు చేయబడవు.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

ఆధునిక కాలంలో 1804లో ఫ్రాన్స్లో ఆనాటి రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు నెపోలియన్ మొదటిసారిగా ఈ సాధనాన్ని వినియోగించాడు. అప్పటి నుంచి దానిని పలు పర్యాయాలు వినియోగించడమైంది.

భారత ఉపఖండంలో ఈ సాధనాన్ని వినియోగించే విషయంలో భారత్ పాకిస్తాన్ల మధ్య గతంలో వాదోపవాదనలు జరిగాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రజాస్వామ్యం వివిధ దృక్కోణాలేవి ?
జవాబు:
ప్రజాస్వామ్యం వివిధ దృక్కోణాలను కలిగి ఉంది. వాటిలో ముఖ్యమైనవి స్వేచ్ఛ, సమానత్వం, రాజకీయ పార్టీలు, సమన్యాయ పాలన, అధికార వికేంద్రీకరణ మొదలగునవి. వాటిని గురించి ఈ క్రింది పేర్కొన్న విధంగా భావించవచ్చు. అవి:
1) స్వేచ్ఛ: ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య దృక్కోణంగా స్వేచ్ఛను పేర్కొనవచ్చు. ఈ వ్యవస్థ అమలులో ఉన్న రాజ్యాలలో నివసించే పౌరులు సంపూర్ణ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను కలిగి ఉంటారు.

2) సమానత్వం: ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ప్రధాన ప్రాతిపదిక సమానత్వం. ఈ వ్యవస్థ అమలులో ఉన్న రాజ్యాలలో నివసించే ప్రజలంతా ఎటువంటి తారతమ్యాలు, వ్యత్యాసాలు లేకుండా ఆర్థిక, రాజకీయ, సాంఘిక, పౌర సమానత్వాన్ని కలిగి ఉంటారు.

3) రాజకీయ పార్టీలు: రాజకీయ పార్టీలను ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క మరొక దృక్కోణంగా మనం భావించవచ్చు. ఈ వ్యవస్థలో నిర్ణీత కాలంలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలలో మెజారిటీ నియోజక వర్గాలలో గెలుపొందిన రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది. రెండవ పార్టీ ప్రతిపక్ష పార్టీగా వ్యవహరిస్తుంది. ఇది ద్విరాజకీయ పార్టీ విధానం అమలులో ఉన్న రాజ్యాలలో జరిగే సాధారణ లేదా సహజ ప్రక్రియ.

4) సమన్యాయ పాలన: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలంతా చట్టం ముందు సమానులే. చట్టాలను అమలు పరచే విషయంలో రాజ్యం, ప్రభుత్వం, జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ ప్రాతిపదికన ఏ వ్యక్తిని ఎటువంటి వివక్షతకు, పక్షపాతానికి గురి చేయకూడదు.

5) అధికార వికేంద్రీకరణ: అధికార వికేంద్రీకరణను ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క ముఖ్యమైన దృక్కోణంగా పేర్కొనవచ్చు. రాజ్యము యొక్క సర్వ అధికారములు ప్రభుత్వ శాఖల మధ్య వికేంద్రీకరించబడతాయి.

ప్రశ్న 2.
ప్రజాస్వామ్యంలోని వివిధ రకాలను వర్ణించండి.
జవాబు:
అర్థం: Democracy అనే ఇంగ్లీషు పదం ‘Demos’ మరియు ‘Kratos’ అనే రెండు గ్రీకు పదాల కలయిక నుంచి ఆవిర్భవించింది. డెమోస్ అంటే ‘ప్రజలు’ క్రటోస్ అంటే ‘అధికారం’ లేదా ‘పాలన’ అని అర్థం.

నిర్వచనం: “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు నిర్వహించబడే ప్రభుత్వం”. – అబ్రహాం లింకన్

ప్రజాస్వామ్యం – వివిధ రకాలు:
1) ప్రత్యక్ష లేదా స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం: ఈ పద్ధతిలో ప్రజలు ప్రభుత్వ పాలన వ్యవహారాలలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. శాసన సంబంధమైన అధికారాలన్నీ వారు చెలాయిస్తారు. ప్రజలే చట్ట సభలలో పాల్గొని చట్టాలను రూపొందిస్తారు. రాజ్య వ్యవహారాలలో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వామ్యం వహిస్తారు.
ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం ప్రస్తుతం స్విట్జర్లాండ్లో కొన్ని కాంటన్ల (Cantons) లోనూ, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలోనూ నెలకొని ఉంది.

2) పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం: ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారా ప్రభుత్వ పాలన నిర్వహించబడటాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం లేదా పరోక్ష ప్రజాస్వామ్యం అని అంటారు. నిర్ణీత సమయానికి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు తమ అధికార, విధుల నిర్వహణలో ప్రజలకు బాధ్యత వహిస్తారు. ప్రజా ప్రతినిధులు తమ అధికార విధుల నిర్వహణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించటంలో విఫలమైతే వారిని ప్రజలు ఎన్నికల సమయంలో పదవుల నుండి తొలగిస్తారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

ప్రశ్న 3.
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారా ప్రభుత్వ పాలన నిర్వహించబడటాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం లేదా పరోక్ష ప్రజాస్వామ్యం అని అంటారు. నిర్ణీత సమయానికి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు తమ అధికార, విధుల నిర్వహణలో ప్రజలకు బాధ్యత వహిస్తారు. ప్రజా ప్రతినిధులు తమ అధికార విధుల నిర్వహణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించటంలో విఫలమైతే వారిని ప్రజలు ఎన్నికల సమయంలో పదవుల నుండి తొలగిస్తారు.

పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంను తిరిగి రెండు రకాలుగా వర్గీకరించడమైనది. అవి: 1) అధ్యక్ష ప్రజాస్వామ్యం 2) పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. అధ్యక్ష ప్రజాస్వామ్య విధానంలో అధికారాలన్నీ ఒకే ఒక కార్యనిర్వాహక అధిపతి వినియోగించడమే కాక కార్యనిర్వాహక అధికారాలన్నీ అధ్యక్షుడి చేతిలో కేంద్రీకృతమై ఉంటాయి. ఉదా: అమెరికా అధ్యక్షుడు అందుకు విరుద్ధంగా పార్లమెంటరీ విధానంలో ప్రధానమంత్రి నాయకత్వంలోని కొందరు మంత్రులు దేశ ‘ అధ్యక్షుడి పేరుతో కార్య నిర్వాహక అధికారాలను వినియోగిస్తారు. ప్రధానమంత్రితో కూడిన మంత్రులు తమ అధికార విధుల నిర్వహణలో పార్లమెంటుకు బాధ్యత వహిస్తారు. ఉదా: బ్రిటన్, ఇండియా, ఆస్ట్రేలియా మొదలైనవి.

ప్రశ్న 4.
ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలను వివరించండి.
జవాబు:
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం: ఈ పద్ధతిలో ప్రజలు ప్రభుత్వ పాలన వ్యవహారాలలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. శాసన సంబంధమైన అధికారాలన్నీ వారు చెలాయిస్తారు. ప్రజలే చట్ట సభలలో పాల్గొని చట్టాలను రూపొందిస్తారు. రాజ్య వ్యవహారాలలో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వామ్యం వహిస్తారు.

ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం ప్రస్తుతం స్విట్జర్లాండ్లో కొన్ని కాంటన్ల (Cantons) లోనూ, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలోనూ నెలకొని ఉంది.
ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు: ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు నాలుగు రకాలుగా ఉంటాయి. అవి: –

  1. ప్రజాభిప్రాయ సేకరణ (Referendum)
  2. ప్రజాభిప్రాయ నివేదన (Initiative)
  3. పునరాయనం (Recall)
  4. ప్రజాభిప్రాయ నిర్ణయం (Plebiscite)

1) ప్రజాభిప్రాయ సేకరణ (Referendum): రిఫరెండమ్ (referendum) అనే ఆంగ్ల పదానికి అర్థం “ప్రజాభిప్రాయ సేకరణ”. ఒకానొక అంశంపై ప్రజల అభిప్రాయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకొనే ప్రక్రియనే ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. ఇటువంటి అంశం సాధారణమైనది లేదా రాజ్యాంగపరమైనది కావచ్చు. ఆర్.సి. బ్రూక్స్ ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ అనేది శాసనసభ అప్పటికే ఆమోదించిన బిల్లు లేదా చట్టంపై నియోజకుల అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు ఉద్దేశించింది.

2) ప్రజాభిప్రాయ నివేదన (Initiative): ప్రత్యక్ష ప్రజాస్వామ్య సమర్థకులు ఒక్క ప్రజాభిప్రాయ సేకరణతో సంతృప్తి చెందలేదు. దాంతో ప్రజలు శాసన నిర్మాణ ప్రక్రియలో ప్రజలు పాల్గొనేలా ప్రజాభిప్రాయ నివేదన గురించి వారు గట్టిగా చెప్పారు. ఉదాహరణకు స్విట్జర్లాండ్లో 50,000 మంది పౌరులు ఏదైనా ఒక అంశం పై చట్టాన్ని రూపొందించాల్సిందిగా శాసనసభను కోరుతూ ఒక అర్జీపై సంతకం చేయవచ్చు. అప్పుడు వారి ప్రతిపాదనను ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి పంపించబడుతుంది. మెజారిటీ పౌరులు ఆ ప్రతిపాదన ఆమోదించినట్లయితే, ఆ అంశం చట్టంగా ఆమోదితమై అమల్లోకి వస్తుంది. స్విట్జర్లాండ్ లోని కాంటన్లలో (రాష్ట్రాలలో) సాధారణ అంశాలతోపాటుగా రాజ్యాంగ ప్రాముఖ్యతగల అంశాలపై ప్రజల అభిప్రాయాన్ని కోరడం ఎప్పటి నుంచో వాడుకలో ఉంది. అయితే అటువంటి ప్రతిపాదనపై సంతకం చేసే వారి సంఖ్య ఆ దేశంలో రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటుంది.

3) పునరాయనం (Recall): పునరాయనం అనేది ఒక ముఖ్యమైన ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనం. ఈ పద్ధతిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లేదా అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా తమ కర్తవ్యాలను నిర్వహించడంలో విఫలమైతే వారిని ఓటర్లు వెనుకకు పిలిచేందుకు వీలుంటుంది. దీనినే పునరాయనం అంటారు. ఈ రకమైన పద్దతి అమెరికాలోని అరిజోనా, ‘మోంటానా, లూసియానా, కాన్సాస్, కాలిఫోర్నియా, నెవెడా, ఓరెగాన్ మొదలగు రాష్ట్రాలలో అమలులో ఉంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

4) ప్రజాభిప్రాయ నిర్ణయం (Plebiscite): ప్రజాభిప్రాయ నిర్ణయం (Plebiscite) అనే పదానికి ఫ్రాన్స్లో మూలాలున్నాయి. ఆ పదం లాటిన్ భాషలోని ప్లెబిస్ (Plebis), సెటమ్ (Scitum) అనే రెండు పదాల నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో ప్లెబిస్ అంటే ‘ప్రజలు’, సెటమ్ అంటే ‘నిర్ణయం’ లేదా తీర్పు. ప్రజా నిర్ణయం లేదా ప్రజా తీర్పని అర్థం. అదేవిధంగా ఒకానొక ప్రభుత్వ విధానంపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు అనుసరించే ప్రజాస్వామ్య సాధనమే ప్రజాభిప్రాయ నిర్ణయంగా పేర్కొనవచ్చు. ప్రజా నిర్ణయానికి దైనందిన చట్ట నిర్మాణ కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదు. ప్రజాభిప్రాయ నిర్ణయంలోని ముఖ్య లక్షణం ఏమిటంటే ఈ పద్ధతి ప్రకారం వెలువడిన ప్రజల నిర్ణయాలు అంతిమమైనవి. వాటికి ఏ విధమైన మార్పులు చేయబడవు.

ప్రశ్న 5.
ప్రజాస్వామ్యాన్ని నిర్వచించి, ప్రజాస్వామ్య ప్రాముఖ్యతను పేర్కొనండి.
జవాబు:
నిర్వచనాలు:
1) “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు నిర్వహించబడే ప్రభుత్వం” అని అబ్రహాం లింకన్ పేర్కొన్నాడు.

2) “ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యం” అని జె.ఆర్.సీలీ పేర్కొన్నాడు. ప్రజాస్వామ్య ప్రాముఖ్యత: ప్రజాస్వామ్యం అనేది ఆధునిక జీవన విధానం. ప్రజాస్వామ్యంలో మాత్రమే వ్యక్తుల స్వీయ గౌరవాలకు హామీ ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలు మొదలుకొని వర్తమాన కాలం వరకు అనుసరిస్తున్నారు. వర్తమాన కాలంలో సమాజం, రాజ్యం, ప్రభుత్వం వంటి అనేక సంస్థల నిర్మాణ నిర్వహణలలో ప్రజాస్వామ్యం ముఖ్యమైన సాధనంగా భావించబడింది.

ప్రజాస్వామ్యం వివక్షతలు లేని సమాజాన్ని ఏర్పాటు చేయాలని ఆశిస్తుంది. ప్రజాస్వామ్యం ప్రజలకు అనేక హక్కులను ప్రసాదిస్తుంది. అదే సమయంలో వారు కొన్ని బాధ్యతలను నిర్వర్తించేలా చూస్తుంది. ప్రజాస్వామ్యం అన్ని కాలాలకు సౌకర్యవంతమైన ప్రభుత్వంగా భావించబడుతుంది. ప్రబలమైన రాజకీయ ఉద్రిక్తతలు, సామాజిక ఒత్తిడులు ఉన్నప్పుడు కూడా ప్రజాస్వామ్యం శాంతియుతమైన, రాజ్యాంగబద్ధమైన పరిష్కారాలను అందిస్తుంది.

ప్రజాస్వామ్యం విభిన్నమైన సామాజిక, ఆర్థిక శక్తులు పరస్పరం పనిచేసేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ సందర్భంలో లార్డ్ బ్రైస్ ప్రజాస్వామ్యం గురించి వ్యాఖ్యానిస్తూ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆస్తి, సామాజిక హోదాలతో సంబంధం లేకుండా స్నేహపూర్వక, సామరస్య ధోరణులతో వ్యవహరిస్తారని పేర్కొన్నాడు. ఒక్క మాటలో ప్రజాస్వామ్యంలో అసమ్మతివాదులు, వ్యతిరేకులు, విరుద్ధ భావాలు గల వారికి కూడా ప్రభుత్వ వ్యవహారాలలో భాగస్వామ్యం ఉంటుంది. ఈ ప్రక్రియలో సంప్రదింపులు, సఖ్యత, రాజీ, ఏకాభిప్రాయం వంటి నాలుగు రకాల సాధనాల ద్వారా నిర్ణయాలను తీసుకోవడమవుతుంది. కాబట్టి పై అంశాలను బట్టి ఆధునిక సమాజాలలో ప్రజాస్వామ్య విలువను గమనించవచ్చు.

ప్రశ్న 6.
ప్రజాస్వామ్యంలోని ఏవైనా మూడు సుగుణాలు, లోపాలను వివరించండి. [Mar. 2017]
జవాబు:
ప్రజాస్వామ్యం ప్రయోజనాలు (Merits of Democracy): సమకాలీన ప్రపంచంలో ప్రజాస్వామ్యం విశేషమైన ప్రజాభిమానాన్ని చూరగొంది. దాదాపు ప్రముఖ రాజ్యాలన్నీ ప్రజాస్వామ్యాన్ని తమ రాజకీయ సిద్ధాంతంగా అనుసరిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో కింద పేర్కొన్న ప్రయోజనాలున్నాయి.
1) సమర్థవంతమైన ప్రభుత్వం (Efficient Government): ప్రజాస్వామ్యాన్ని సమర్థవంతమైన, పటిష్టమైన ప్రభుత్వంగా ప్రొఫెసర్ గార్నర్ వర్ణించాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధారణ సమయాలలోనూ, అత్యవసర పరిస్థితులలోనూ ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగానూ, పటిష్టంగానూ కొనసాగుతాయి. ప్రజలచే ఎన్నిక, ప్రజల నియంత్రణ, ప్రజలకు బాధ్యత అనే ప్రజాస్వామ్య సూత్రాలు గోచరిస్తాయి. అవి ఇతర ప్రభుత్వాలతో పోల్చినపుడు ఇందులో సమర్థతను చేకూర్చుతాయి.

2) వ్యక్తి స్వేచ్ఛల సమర్థన (Upholds Individual Liberties): ప్రజాస్వామ్య ప్రభుత్వం మాత్రమే వ్యక్తి స్వేచ్ఛలను సమర్థిస్తుంది. రాజ్యాంగపరమైన అనేక రక్షణల ద్వారా వ్యక్తుల హామీలకు హామీ ఇస్తుంది. ఈ అంశం ప్రాతిపదికపై జె.ఎస్.మిల్ ప్రజాస్వామ్యాన్ని సమర్థించాడు. ప్రజాస్వామ్యం ప్రజలకు వాక్, సభా, పత్రికా స్వాతంత్రాలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలను ప్రసాదిస్తుందని అతడు ప్రకటించాడు.

3) సమానత్వానికి హామీ (Assures Equality): ప్రజాస్వామ్యం రాజకీయ, ఆర్థిక రంగాలలోని వ్యక్తుల యొక్క సమానత్వానికి హామీ ఇస్తుంది. రాజకీయ రంగంలో పౌరుల కుల, వర్ణం, పుట్టుక వంటి అంశాలతో ప్రమేయం లేకుండా వారికి ఓటు హక్కు, ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు వంటి రాజకీయ హక్కులను పౌరులకు ప్రసాదిస్తుంది. సమాజంలో ఇతర వర్గాలను విస్మరించి కొద్దిమంది వ్యక్తులకు ప్రత్యేక హక్కులను కల్పించడాన్ని వ్యతిరేకిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్యం లోపాలు:
1) అజ్ఞానుల పాలన (Rule by Ignorants): అరిస్టాటిల్ ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వ వికృత రూపంగా పరిగణించాడు. ప్రజాస్వామ్యమనేది ఒక రకమైన మూకపాలనగా భావించాడు. అతడి గురువైన ప్లేటో ప్రజాస్వామ్యాన్ని అజ్ఞానుల పాలనగా పిలిచాడు. ప్రజాస్వామ్యంలో ఓట్ల లెక్కింపు మాత్రమే జరుగుతుందని మరికొందరు విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అనేక అంశాలపై నిర్ణయాలనేవి శాసనసభ, మంత్రివర్గ సమావేశాలలో మెజారిటీ సభ్యుల అభీష్టం మేరకు జరుగుతాయి. దాంతో యోగ్యులు, నిజాయితీ గల వ్యక్తులు దూరంగా ఉంచబడి, అజ్ఞానులు, మూర్ఖులు ప్రాధాన్యత కలిగి ఉంటారు.

2) ధనికులకు అనుకూలత (Favours the Rich): ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో అధిక భాగం పెట్టుబడిదారీ స్వభావాన్ని కలిగి ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు సంపన్న వర్గాల వారి పట్ల సానుకూలతను ప్రదర్శిస్తాయి. ఎన్నికలనేవి ఒక ప్రహసనంగా మారుతాయి. ప్రజాస్వామ్యంలో ఓటర్లను దైవంగా గుర్తించడమవుతుంది. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు కులం, వర్ణం, మతం, పుట్టుక, ప్రాంతం వంటి అంశాల వారీగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తారు. వారికి భౌతిక, ధన, కనక వస్తువులను అందించడం ద్వారా ఆకర్షిస్తారు.

3) అధిక సంఖ్యాకుల పాలన అనేది ఒక భ్రమ (Majority rule-a Myth): ఒకప్పుడు 1980వ దశకం వరకు ప్రజాస్వామ్యాన్ని అధిక సంఖ్యాకుల పాలనగా పరిగణించడమైంది. ఆ తరువాత జాతీయ, అంతర్జాతీయ రంగాలలో సంభవించిన నాటకీయ పరిణామాల ఫలితంగా అనేక మార్పులు సంభవించాయి. విద్య, అక్షరాస్యత, విజ్ఞాన వికాసం, పత్రికలు, వార్తా దృశ్య సాధనాలు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాలు రాజకీయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చాయి. సంకీర్ణ ప్రభుత్వ రాజకీయ సంస్కృతి సాధారణ రాజకీయ పరిణామంగా మారింది. ప్రాచీన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలుగా పేరుగాంచిన బ్రిటన్ వంటి రాజ్యాలలో సైతం సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటయినాయి. అలాగే అభివృద్ధి చెందుతున్న ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ వంటి దేశాలలో కూడా సంకీర్ణ ప్రభుత్వాలు అనివార్యమవుతున్నాయి. అందుకు కారణం ఆయా దేశాలలో శాసనసభలలో ఏ ఒక్క పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పరచే సంపూర్ణమైన మెజారిటీ స్థానాలు లభించకపోవడంగా పేర్కొనవచ్చు. దాంతో శాసనసభలలో ఎక్కువ స్థానాలు (మెజారిటీ స్థానాలు కాకుండ) గెల్చుకున్న అతిపెద్ద పార్టీ మిగిలిన చిన్న పార్టీలతో కలసి సంకీర్ణ భాగస్వామ్యంగా ఏర్పడి, కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం సర్వ సాధారణమైంది. అటువంటి ప్రభుత్వాలు శాసనసభలలో మెజారిటీ సభ్యుల మద్దతును పొందక పార్లమెంటరీ ప్రమాణాల పతనానికి దారితీశాయి. భారతదేశంలో 1990వ దశకం ద్వితీయార్థం నుంచి 2014 ప్రథమార్థం వరకు జాతీయ స్థాయిలో ఏర్పడిన ఐక్య సంఘటన (United Front), జాతీయ ప్రజాస్వామ్య కూటమి (National Democratic Alliance), ఐక్య ప్రగతిశీల కూటమి (United Progressive Alliance) ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 7.
ప్రజాస్వామ్యాన్ని నిర్వచించి, ప్రజాస్వామ్య సుగుణాలను తెలపండి.
జవాబు:
నిర్వచనాలు:
1) “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు పరిపాలించే, నిర్వహించబడే ప్రభుత్వం” అని అబ్రహాం లింకన్ పేర్కొన్నాడు.

2) “ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యం” అని జె.ఆర్.సీలీ పేర్కొన్నాడు.
1) సమర్థవంతమైన ప్రభుత్వం (Efficient Government): ప్రజాస్వామ్యాన్ని సమర్థవంతమైన, పటిష్టమైన ప్రభుత్వంగా ప్రొఫెసర్ గార్నర్ వర్ణించాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధారణ సమయాలలోనూ, అత్యవసర పరిస్థితులలోనూ ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగానూ, పటిష్టంగానూ కొనసాగుతాయి. ప్రజలచే ఎన్నిక, ప్రజల నియంత్రణ, ప్రజలకు బాధ్యత అనే ప్రజాస్వామ్య సూత్రాలు గోచరిస్తాయి. అవి ఇతర ప్రభుత్వాలతో పోల్చినపుడు ఇందులో సమర్థతను చేకూర్చుతాయి.

2) వ్యక్తి స్వేచ్ఛల సమర్థన (Upholds Individual Liberties): ప్రజాస్వామ్య ప్రభుత్వం మాత్రమే వ్యక్తి స్వేచ్ఛలను సమర్థిస్తుంది. రాజ్యాంగపరమైన అనేక రక్షణల ద్వారా వ్యక్తుల హామీలకు హామీ ఇస్తుంది. ఈ అంశం ప్రాతిపదికపై జె. ఎస్. మిల్ ప్రజాస్వామ్యాన్ని సమర్థించాడు. ప్రజాస్వామ్యం ప్రజలకు వాక్, సభా, పత్రికా స్వాతంత్రాలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలను ప్రసాదిస్తుందని అతడు ప్రకటించాడు.

3) సమానత్వానికి హామీ (Assures Equality): ప్రజాస్వామ్యం రాజకీయ, ఆర్థిక రంగాలలోని వ్యక్తుల యొక్క సమానత్వానికి హామీ ఇస్తుంది. రాజకీయ రంగంలో పౌరుల కుల, వర్ణం, పుట్టుక వంటి అంశాలతో ప్రమేయం లేకుండా వారికి ఓటు హక్కు, ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు వంటి రాజకీయ హక్కులను పౌరులకు ప్రసాదిస్తుంది. సమాజంలో ఇతర వర్గాలను విస్మరించి కొద్దిమంది వ్యక్తులకు ప్రత్యేక హక్కులను కల్పించడాన్ని వ్యతిరేకిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

4) ప్రజలను విద్యావంతులను చేయడం (Educates the Masses): ప్రజలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రయోగాలకు వీలు కల్పించే సాధనంగా ప్రజాస్వామ్యాన్ని కొందరు వర్ణించారు. వివిధ ప్రాతినిధ్య సంస్థలకు విభిన్న సమయాలలో జరిగే ఎన్నికలు, సంబంధిత ప్రచార ఉద్యమాలు ప్రజాస్వామ్యంలో పౌరులను విద్యావంతులుగా తీర్చిదిద్దుతుంది.

5) దేశభక్తిని పెంపొందించడం (Instills Patriotism): ప్రజాస్వామ్యం ప్రజలలో దేశభక్తిని పెంపొందిస్తుంది. ప్రజాస్వామ్యంలో వివిధ సంస్థల సభ్యుల ఎంపిక, ఎన్నికలలో ప్రజలకు ఎన్నో అవకాశాలు లభిస్తాయి. ప్రాతినిధ్య సంస్థలలో ప్రజలు పాల్గొని అవి విజయవంతంగా పనిచేసేటట్లు జాగ్రత్త వహిస్తారు. వీటి నిర్వహణలో పాల్గొనడాన్ని ప్రజలు ఎంతో గర్వంగా భావిస్తారు. దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రజలు తమ సహాయ సహకారాలను అందించడంలో ఎంతో ఆసక్తిని చూపుతారు. గతంలో ఇండియాపై చైనా, పాకిస్తాన్లు దురాక్రమణ జరిపిన సందర్భాలలో భారతీయులు చూపించిన చొరవ, ప్రదర్శించిన దేశభక్తి ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.

6) స్థిరత్వానికి హామీ (Ensures Stability): ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వం ఉండటం వల్ల విప్లవాల బారి నుంచి దేశాన్ని కాపాడేందుకు అవకాశం ఉంటుంది. ఈ.వ్యవస్థలో ప్రజలు ఎన్నికల సమయంలో వ్యతిరేక ఓటు (Negative Vote) వినియోగం ద్వారా ప్రభుత్వాన్ని మార్చివేయగలుగుతారు.

7) ఒకే సమయంలో శాంతి, ప్రగతి (Simultaneous Order and Progress): నియంతృత్వం దేశ ప్రగతిని నిర్లక్ష్యం చేసి భద్రతకు హామీ ఇస్తుంది. అందుకు విరుద్ధంగా ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధమైన పాలన ద్వారా శాంతి భద్రతల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తుంది. వివిధ రంగాలలో ప్రజల ఔన్నత్యానికి కృషి చేస్తుంది. భారత
ప్రజాస్వామ్య వ్యవస్థలో దీనిని మనం గమనించవచ్చు. జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలామ్ అజాద్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి ఆదర్శవంతమైన నాయకులు, రాజనీతిజ్ఞులు శైశవదశలో ఉన్న భారత ప్రజాస్వామ్యాన్ని జాతీయ, అంతర్జాతీయ రంగాలలో శక్తివంతమైన, సార్థకమైందిగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో, కృషి చేశారు.

8) ప్రజలను బాధ్యతాయుతులుగా చేయడం (Makes the People Responsible): ప్రజాస్వామ్యం వ్యక్తి సామర్థ్యాన్ని గుర్తిస్తుంది. వ్యక్తులలో చొరవను ఏర్పరచేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రజలలో బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందిస్తుంది. ఈ రకమైన పరిస్థితి ఇతర ప్రభుత్వ రకాలలో గోచరించదు. అంతేకాకుండా ప్రజాస్వామ్యం వ్యక్తుల వ్యక్తిత్వ వికాస సాధనకు దోహదపడి వారి ఔన్నత్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

9) పౌరసత్వ శిక్షణ పాఠశాల (Training School for Citizenship): ప్రజాస్వామ్యపు మరొక సుగుణం ఏమిటంటే ఇది ఒక ఉత్తమ పౌరసత్వ పాఠశాలగా వ్యవహరిస్తుంది. ఎన్నికల సమయంలో ఓటుహక్కు, అభ్యర్థులను ఎన్నుకొనే హక్కు వంటి రాజకీయ హక్కులను పౌరులకు అందించడంలో హామీ ఇస్తుంది. అటువంటి హక్కులు, ఇతర రాజకీయ హక్కులలాగా, పౌరసత్వ పాఠాలను నేర్చుకొనేందుకు పౌరులకు సహాయకారిగా ఉంటాయి.

10) హేతుబద్ధమైన ప్రభుత్వం (A Rational Government): “ఏ ఒక్కరూ సంపూర్ణంగా దోషరహితులు ‘కారు’ అనే సూత్రంపై ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది. అధికార దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అవసరమైన చర్యలు, విమర్శలతో కూడిన ప్రక్రియను ప్రజాస్వామ్యం అనుసరిస్తుంది. అంతేకాకుండా రాజకీయ వ్యవస్థ హేతుబద్ద స్వభావాన్ని ప్రజాస్వామ్యం సంరక్షిస్తుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రజాస్వామ్యమనగానేమి ? రెండు నిర్వచనాలను రాయండి. [Mar. ’18, ’17, ’16]
జవాబు:
ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో ‘డెమోక్రసీ’ అంటారు. ఈ పదము రెండు గ్రీకు పదాలైన ‘డెమోస్’ మరియు ‘క్రటోస్’ ల నుండి గ్రహించబడింది. డెమోస్ అంటే ప్రజలు, క్రటోస్ అంటే అధికారం లేదా పాలన అని అర్థం. అంటే డెమోక్రసీ అంటే ప్రజల అధికారం లేదా ప్రజల పాలన.

  1. “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు పరిపాలించే, నిర్వహించబడే ప్రభుత్వం” అని అబ్రహాం లింకన్ పేర్కొన్నాడు.
  2. “ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యం” అని జె.ఆర్.సీలీ పేర్కొన్నాడు.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

ప్రశ్న 2.
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం గురించి నీకు తెలిసింది రాయండి.
జవాబు:
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం: ఈ పద్ధతిలో ప్రజలు ప్రభుత్వ పాలన వ్యవహారాలలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. శాసన సంబంధమైన అధికారాలన్నీ వారు చెలాయిస్తారు. ప్రజలే చట్ట సభలలో పాల్గొని చట్టాలను రూపొందిస్తారు. రాజ్య వ్యవహారాలలో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వామ్యం వహిస్తారు.

ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం ప్రస్తుతం స్విట్జర్లాండ్లో కొన్ని కాంటన్ల (Cantons) లోనూ, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలోనూ నెలకొని ఉంది.

ప్రశ్న 3.
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం గురించి నీకు గల అవగాహన ఏమిటి ?
జవాబు:
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారా ప్రభుత్వ పాలన నిర్వహించబడటాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం లేదా పరోక్ష ప్రజాస్వామ్యం అని అంటారు. నిర్ణీత సమయానికి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు తమ అధికార, విధుల నిర్వహణలో ప్రజలకు బాధ్యత వహిస్తారు. ప్రజా ప్రతినిధులు తమ అధికార విధుల నిర్వహణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించటంలో విఫలమైతే వారిని ప్రజలు ఎన్నికల సమయంలో పదవుల నుండి తొలగిస్తారు.

ప్రశ్న 4.
ప్రజాస్వామ్య లక్షణాలు ఏవి ?
జవాబు:
ప్రజా ప్రభుత్వం, ప్రజల నియంత్రణ, వ్యక్తి హుందాతనం, ఎన్నికలు, ప్రజలకు జవాబుదారీతనం, ప్రాథమిక స్వేచ్ఛలు, స్వతంత్ర న్యాయశాఖ మరియు సమానత్వం మొదలగు వాటిని ప్రజాస్వామ్య లక్షణాలుగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 5.
ప్రజాస్వామ్య విజయానికి నాలుగు పరిస్థితులను రాయండి.
జవాబు:

  1. సరైన విద్య
  2. వికాసవంతమైన పౌరసత్వం
  3. స్వతంత్ర పత్రికలు
  4. దృఢమైన ప్రతిపక్షం.

ప్రశ్న 6.
ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలను రాయండి. [Mar. ’18, ’17, ’16]
జవాబు:
ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు నాలుగు. అవి:

  1. ప్రజాభిప్రాయ సేకరణ
  2. ప్రజాభిప్రాయ నివేదన
  3. పునరాయనము
  4. ప్రజాభిప్రాయ నిర్ణయం.

ప్రశ్న 7.
ప్రజాభిప్రాయ సేకరణ గురించి నీకు తెలిసింది రాయండి.
జవాబు:
‘ప్రజాభిప్రాయ సేకరణ’ ని ఆంగ్లంలో ‘రిఫరెండమ్ (Referendum)’ అంటారు. ఒకానొక అంశంపై ప్రజల అభిప్రాయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకొనే ప్రక్రియనే ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. ఇటువంటి అంశం సాధారణమైనది కావచ్చు లేదా రాజ్యాంగపరమైనది కావచ్చు. ఆర్.సి. బ్రూక్స్ ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ అనేది శాసనసభ ఇప్పటికే ఆమోదించిన బిల్లు లేదా చట్టంపై నియోజకుల అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు ఉద్దేశించింది.

ప్రశ్న 8.
ప్రజాభిప్రాయ నివేదన అంటే ఏమిటి ?
జవాబు:
శాసన నిర్మాణ ప్రక్రియలో ప్రజలు పాల్గొనేందుకు తోడ్పడే ప్రక్రియనే ప్రజాభిప్రాయ నివేదన అని అంటారు. ఉదా: స్విట్జర్లాండ్లో 50,000 మంది పౌరులు ఏదైనా ఒక అంశంపై చట్టాన్ని రూపొందించాల్సిందిగా శాసనసభను కోరుతూ ఒక అర్జీపై సంతకం చేసినట్లయితే, వారి ప్రతిపాదనను ప్రజల అభిప్రాయానికి పంపబడుతుంది. మెజారిటీ ప్రజలు ఆ ప్రతిపాదనను ఆమోదించినట్లయితే ఆ అంశం చట్టంగా ఆమోదితమై అమల్లోకి వస్తుంది. ఇది రెండు రకాలు:

  1. విధాయక రూపంలో ఉన్న ప్రజాభిప్రాయ నివేదన
  2. విధాయక రూపంలో లేని ప్రజాభిప్రాయ నివేదన.

ప్రశ్న 9.
ప్రజాభిప్రాయ నిర్ణయం అంటే ఏమిటి ?
జవాబు:
ప్రజాభిప్రాయ నిర్ణయాన్ని ఆంగ్లంలో ‘ప్లెబిసైట్’ అంటారు. ఈ పదం లాటిన్ భాషలోని ‘ప్లెబిస్’ మరియు ‘సెటమ్’ అనే రెండు పదాల నుండి గ్రహించబడింది. ప్లెబిస్ అంటే ప్రజలు, సెటమ్ అంటే నిర్ణయం లేదా తీర్పు అని అర్థం. అంటే దీని అర్థం ప్రజా నిర్ణయం లేదా ప్రజాతీర్పు. ఒక ప్రభుత్వ విధానంపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు అనుసరించే ప్రజాస్వామ్య సాధనమే ప్రజాభిప్రాయ నిర్ణయమని భావించవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

ప్రశ్న 10.
పునరాయనం అనగా ఏమిటి ?
జవాబు:
పునరాయనం అనేది ఒక ముఖ్యమైన ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనం. ఈ పద్ధతిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లేదా అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా తమ కర్తవ్యాలను నిర్వహించడంలో విఫలమైతే వారిని ఓటర్లు వెనుకకు పిలిచేందుకు వీలుంటుంది. దీనినే పునరాయనం అంటారు. ఈ రకమైన పద్దతి అమెరికాలోని అరిజోనా, మోంటానా, లూసియానా, కాన్సాస్, కాలిఫోర్నియా, నెవెడా, ఓరెగాన్ మొదలగు రాష్ట్రాలలో అమలులో ఉంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Physics Study Material 1st Lesson తరంగాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Physics Study Material 1st Lesson తరంగాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
తరంగం ఏమి సూచిస్తుంది?
జవాబు:
యానకం స్థానాంతరణ లేకుండా, ఒక బిందువు నుండి మరియొక బిందువుకు శక్తి ప్రసారంను యానకం సూచిస్తుంది.

ప్రశ్న 2.
తిర్యక్, అనుదైర్ఘ్య తరంగాల మధ్య భేదాన్ని గుర్తించండి.
జవాబు:

తిర్యక్ తరంగాలుఅనుదైర్ఘ్య తరంగాలు
1. యానకంలోని కణాలు, తరంగ ప్రసారదిశకు లంబంగా కంపిస్తాయి.1. యానకంలోని కణాలు, తరంగ ప్రసారదిశకు సమాంతరంగా కంపిస్తాయి.
2. శృంగాలు మరియు ద్రోణులు ఏర్పడతాయి.2. సంపీడనాలు మరియు విరళీకరణాలు ఏర్పడతాయి.

ప్రశ్న 3.
ఒక పురోగామి హరాత్మక తరంగాన్ని వర్ణించడానికి ఉపయోగించే పరామితులు ఏమిటి?
జవాబు:
పురోగామి తరంగ సమీకరణం y = a sin (ωt – kx), ఇక్కడ ω = 2πν = \(\frac{2 \pi}{T}\); k = \(\frac{2 \pi}{\lambda}\)

పరామితులు :
1) a = కంపన పరిమతి 2) λ = తరంగదైర్ఘ్యం 3) T = ఆవర్తన కాలం 4) ν = పౌనఃపున్యం 5) k = ప్రసార స్థిరాంకం 6) ω = కోణీయ పౌనఃపున్యం.

ప్రశ్న 4.
ఈ పరామితుల పదాలలో తరంగవేగానికి ఒక సమాసాన్ని పొందండి.
జవాబు:
తరంగవేగము ” పౌనఃపున్యం ‘ν’ మరియు తరంగదైర్ఘ్యం ‘λ’. డోలనావర్తన కాలం ‘T’ అయితే,
అప్పుడు ν = \(\frac{1}{T}\)
కాలం ‘T’ లో తరంగం ప్రయాణించిన దూరం = λ.
1 సెకనులో ప్రయాణించిన దూరం = \(\frac{\lambda}{T}\)
ఇది తరంగ వేగంనకు సమీకరణం ∴ υ = νλ

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 5.
మితీయ విశ్లేషణను ఉపయోగించి ఒక సాగదీసిన తంత్రిలో తిర్యక్ తరంగాల వడికి ఒక సమాసాన్ని పొందండి.
జవాబు:
తరంగ వేగం v α Ta µb ⇒ v =K Ta µb → (1)
v మితులు = M°L¹T-1, తన్యత T = M¹L¹T-2
రేఖీయ ద్రవ్యరాశి µ = M¹L-1, స్థిరాంకం K = M°L°T°
ఇప్పుడు (1)వ సమీకరణం M°L¹L-1 = [M¹L¹T-2]a [M¹L-1]b
M°L¹T¹ = Ma+b La-b T-2a
ఒకే భౌతికరాశి ఘాతాలను పోల్చగా,
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 1

ప్రశ్న 6.
మితీయ విశ్లేషణను ఉపయోగించి ఒక యానకంలో ధ్వని తరంగాల వడికి ఒక సమాసాన్ని పొందండి.
జవాబు:
ధ్వని వేగం v α Baρb = v =KBaρb → (1)
v మితులు = M°L¹T-1, యానకం స్థితిస్థాపకత
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 2

ప్రశ్న 7.
తరంగాల అధ్యారోపణ సూత్రం అంటే ఏమిటి?
జవాబు:
ఒక యానకంలోని రెండు లేక మూడు తరంగాలు వరుసగా ఒక కణంపై పనిచేస్తే, ఫలిత స్థానభ్రంశం వైయక్తిక తరంగాల స్థానభ్రంశాల మొత్తంనకు సమానము.

y1, y2, y3, ……….. లు కణం వైయక్తిక స్థానభ్రంశాలు అయితే, ఫలిత స్థానభ్రంశము y = y1 + y2 + …………….. + yn.

ప్రశ్న 8.
ఏ నిబంధనలకు లోబడి ఒక తరంగం పరావర్తనం చెందుతుంది?
జవాబు:

  1. ఏదైనా బిందువు వద్ద యానకం చివర మారితే
  2. ఏదైనా బిందువు వద్ద యానకం సాంద్రత మరియు దృఢతా గుణకం మారిన తరంగాలు పరావర్తనం చెందుతాయి.

ప్రశ్న 9.
తరంగం దృఢ సరిహద్దు వద్ద పరావర్తనం చెందితే, పతన, పరావర్తిత తరంగాల మధ్య దశా భేదం ఎంత ?
జవాబు:
π రేడియన్ లేక 180°.

ప్రశ్న 10.
స్థావర లేదా స్థిర తరంగం అంటే ఏమిటి?
జవాబు:
రెండు ఒకే రకమైన పురోగామి (తిర్యక్ లేక అనుదైర్ఘ్య తరంగాలు, యానకంలో సరళరేఖలో వ్యతిరేక దిశలలో ప్రయాణిస్తూ అధ్యారోపణం చెందితే, స్థిర తరంగాలు ఏర్పడతాయి.

ప్రశ్న 11.
అస్పందన, ప్రస్పందన పదాల వల్ల మీరు ఏమి అర్థం చేసుకొన్నారు?
జవాబు:
అస్పందన స్థానం :
కణం శూన్య కంపన పరిమితి స్థానంను అస్పందన స్థానం అంటారు.

ప్రస్పందన స్థానం :
కణం గరిష్ఠ కంపన పరిమితి స్థానంను ప్రస్పందన స్థానం అంటారు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 12.
ఒక స్థిర తరంగంలో ఒక అస్పందన, ఒక ప్రస్పందనల మధ్య దూరం ఎంత?
జవాబు:
అస్పందన మరియు ప్రస్పందన స్థానాల మధ్య దూరం = \(\frac{\lambda}{4}\)

ప్రశ్న 13.
సహజ పౌనఃపున్యం లేదా సామాన్య కంపనరీతితో మీరు ఏమి అర్థం చేసుకొన్నారు?
జవాబు:
ఒక వస్తువును స్వేచ్ఛగా కంపించేటట్లు చేసి వదిలితే, ఆ వస్తు కంపనాలను స్వేచ్ఛా లేక సహజ కంపనాలు అంటారు. ఆ వస్తు పౌనఃపున్యంను సహజ పౌనఃపున్యం లేక సాధారణరీతి కంపనం అంటారు.

ప్రశ్న 14.
అనుస్వరాలు అంటే ఏమిటి?
జవాబు:
స్థిర తరంగాలు ఏర్పడే పౌనఃపున్యాలను అనుస్వరాలు అంటారు. (లేక) ప్రాథమిక పౌనఃపున్యాల సహజ గుణిజాలను అనుస్వరాలు అంటారు.

ప్రశ్న 15.
రెండు దృఢ ఆధారాల మధ్య ఒక తంత్రి సాగదీయడమైంది. అటువంటి తంత్రిలో సాధ్యమయ్యే కంపన పౌనఃపున్యాలు ఏవి?
జవాబు:
రెండు దృఢ ఆధారాల మధ్య సాగదీసిన తంత్రి (తీగ)లో సాధ్యమగు కంపనాల పౌనఃపున్యాలను యిచ్చు సమీకరణము
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 3

ప్రశ్న 16.
ఒక చివర మూసిన పొడవైన గొట్టంలో గాలి స్తంభాన్ని కంపింపచేస్తే సాధ్యమయ్యే అనుస్వరాలు ఏమిటి?
జవాబు:
ఒక పొడవాటి మూసిన గొట్టంలో గాలిస్థంభ కంపనంలో సాధ్యమగు అనుస్వరాలను యిచ్చు సమీకరణము
vn = [2n +1] \(\frac{υ}{4l}\) ఇక్కడ n = 0, 1, 2, 3, ………….

ప్రశ్న 17.
రెండువైపుల తెరచిన ఒక గొట్టంలోని గాలి స్తంభాన్ని కంపింపచేస్తే సాధ్యమయ్యే అనుస్వరాలు ఏమిటి?
జవాబు:
ఒక తెరిచిన గొట్టంలో గాలి స్తంబ కంపనంలో సాధ్యమగు అనుస్వరాలను యిచ్చు సమీకరణము
vn = \(\frac{nυ}{2l}\) ఇక్కడ n = 1, 2, 3, ………………

ప్రశ్న 18.
విస్పందనాలు అంటే ఏమిటి?
జవాబు:
విస్పందనాలు :
సమీప పౌనఃపున్యం ఉన్న రెండు ధ్వని తరంగాలు ఒకే దిశలో చలిస్తూ, వ్యతికరణం చెందితే, క్రమ కాల వ్యవధులలో ధ్వని వృద్ధి మరియు క్షీణత ఉండును. ఈ దృగ్విషయంను “విస్పందనాలు” అంటారు.

ప్రశ్న 19.
విస్పందన పౌనఃపున్యం కోసం ఒక సమాసాన్ని వ్రాయండి. దానిలో ఉండే పదాలను వివరించండి.
జవాబు:
విస్పందన పౌనఃపున్య సమీకరణం, ∆ν = ν1 ~ ν2
ఇక్కడ v1 మరియు v2 లు రెండు తరంగాల పౌనఃపున్యాలు.

ప్రశ్న 20.
డాప్లర్ ప్రభావం అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
డాప్లర్ ప్రభావం :
ధ్వని జనకం మరియు పరిశీలకుని మధ్య సాపేక్ష చలనం ఉన్నప్పుడు, పరిశీలకుడు వినే దృశ్య పౌనః పున్యంలోని మార్పును, డాప్లర్ ప్రభావం అంటారు.
ఉదా : ఈల వేస్తున్న రైలు, ఫ్లాట్ఫాంపై నిల్చున్న పరిశీలకుని సమీపిస్తూ ఉంటే, దృశ్య పౌనఃపున్యం పెరుగును. దూరంగా చలిస్తే, దృశ్య పౌనఃపున్యం తగ్గును.

ప్రశ్న 21.
జనకం, పరిశీలకుడు ఒకదానితో మరొకటి సాపేక్షంగా ఒకే దిశలో చలిస్తున్నప్పుడు పరిశీలించిన పౌనఃపున్యానికి ఒక సమాసాన్ని వ్రాయండి.
జవాబు:
పరిశీలకుడు వినే దృశ్య పౌనఃపున్యం,
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 4

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
తిర్యక్ తరంగాలు అంటే ఏమిటి? అటువంటి తరంగాలకు వివరణాత్మకమయిన ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
తిర్యక్ తరంగాలు :
కణాల కంపనము మరియు తరంగ ప్రసార దిశ ఒకదానికొకటి లంబంగా ఉంటే, ఆ తరంగాలను తిర్యక్ తరంగాలు అంటారు.

  1. సాగదీసిన తంత్రి (తీగ)లో ఏర్పడు తరంగాలు తిర్యక్ తరంగాలు.
  2. సాగదీసిన తంత్రిని తాకితే, దాని వెంట తిర్యక్ తరంగాలు ఏర్పడతాయి.
  3. తంత్రిలో కణాలు తరంగ ప్రసార దిశకు లంబంగా కంపిస్తాయి.
  4. తిర్యక్ తరంగాలు ఘన పదార్థంలో మరియు ద్రవం ఉపరితలంపై ప్రసారమవుతాయి.
    ఉదా : కాంతి తరంగాలు, ఉపరితల జల తరంగాలు.

ప్రశ్న 2.
అనుదైర్ఘ్య తరంగాలు అంటే ఏమిటి? అటువంటి తరంగాలకు వివరణాత్మక ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
అనుదైర్ఘ్య తరంగాలు:
తరంగ ప్రసార దిశ మరియు కణాల కంపన దిశలు, ఒకే దిశలో ఉంటే, ఆ తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలు అంటారు.

  1. ఒక సంపీడన స్ప్రింగ్న, వదిలితే అనుదైర్ఘ్య తరంగాలు ఏర్పడతాయి.
  2. స్ప్రింగ్ వెంట సంపీడన మరియు విరళీకరణాలు ప్రసారమవుతాయి.
    AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 5
    C = సంపీడనం; R = విరళీకరణం.
  3. అవి ఘన, ద్రవ మరియు వాయువుల గుండా ప్రయాణిస్తాయి.
    ఉదా : ధ్వని తరంగాలు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 3.
పురోగామి హరాత్మక తరంగానికి సమాసాన్ని వ్రాయండి. ఆ సమాసంలో ఉపయోగించిన విభిన్న పరామితులను వివరించండి.
జవాబు:
పురోగామి అనుస్వర తరంగ సమీకరణం
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 6

పరామితులు:
1) కంపన పరిమితి (a) :
మాధ్యమిక స్థానం నుండి కంపన కణం గరిష్ట స్థానభ్రంశంను కంపన పరిమితి అంటారు.

2) పౌనఃపున్యం (V) :
కంపిస్తున్న వస్తువు ఒక సెకనులో చేయు పూర్తి కంపనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు.

3) తరంగదైర్ఘ్యం (λ) :
ఒక తరంగము ఒక పూర్తి కంపనంలో ప్రయాణించు దూరంను తరంగదైర్ఘ్యం అంటారు. (లేక) రెండు వరుస బిందువులు ఒకే దశలో ఉన్నప్పుడు వాని మధ్య దూరంను తరంగదైర్ఘ్యం అంటారు.

4) కంపన దశ (Φ) :
ఏదైనా క్షణాన కంపిస్తున్న కణం యొక్క స్థానభ్రంశ స్థితిని, ఆ కణం యొక్క కంపన దశ అంటారు. ఇది దశా కోణంను ఇస్తుంది.

ప్రశ్న 4.
ఒక సాగదీసిన తంత్రి కంపన రీతులను ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 7
సాగదీసిన తీగలో కంపన రీతులు:
1) ఒక సాగదీసిన తంత్రి వేర్వేరు పౌనఃపున్యాల వద్ద కంపిస్తే, స్థిర తరంగాలు ఏర్పడతాయి. ఈ కంపన రీతులను అనుస్వరాలు అంటారు.

2) తంత్రి ఒక భాగంగా కంపిస్తే, దానిని ప్రాథమిక అనుస్వరం అంటారు. ఎక్కువ అనుస్వరాలను అతిస్వరాలు అంటారు.

3) తంత్రి రెండు భాగాలుగా కంపిస్తే, రెండవ అనుస్వరంను శ్రీ మొదటి అతి స్వరం అంటారు. ఇదేవిధంగా కంపనాల వరుస పటంలో చూపబడినవి.

4) సాగదీసిన తంత్రి P భాగాలుగా (ఉచ్చులుగా) కంపిస్తే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 8
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 9
అనుస్వరాల పౌనఃపున్యాల నిష్పత్తి ν : ν1 : ν2 = ν : 2ν : 3ν = 1 : 2 : 3

ప్రశ్న 5.
ఒక తెరిచిన గొట్టంలోని గాలిస్తంభపు కంపనాల రీతులను వివరించండి. [A.P (Mar.’17)]
జవాబు:
తెరిచిన గొట్టంలో గాలిస్తంభ కంపన రీతులు :
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 10

  1. తెరిచిన గొట్టం రెండువైపులా తెరిచి ఉండును. తెరిచిన చివరల వద్ద ప్రస్పందన స్థానాలు ఏర్పడును. వాని మధ్య అస్పందన స్థానం ఏర్పడును.
  2. తెరిచిన గొట్టంలో కంపిస్తున్న గాలిస్తంభంలో సాధ్యమగు అనుస్వరాలు, ν = \(\frac{nυ}{2l}\)
    ఇక్కడ n = 1, 2, 3
  3. మొదటి కంపన రీతిలో, n = 1 అప్పుడు v1 = \(\frac{υ}{2l}\)
    (మొదటి అనుస్వరం లేక ప్రాథమిక పౌనఃపున్యం).
  4. రెండవ కంపన రీతిలో, n = 2 అప్పుడు v2 = \(\frac{2υ}{2l}\)
    (రెండవ అనుస్వరం లేక మొదటి అతిస్వరం).
  5. మూడవ కంపన రీతిలో, n = 3 అప్పుడు v3 = \(\frac{3υ}{2l}\)
    (మూడవ అనుస్వరం లేక రెండవ అతిస్వరం).
  6. తెరిచిన గొట్టంలో అనుస్వరాల’ పౌనఃపున్యాల నిష్పత్తి
    v1 : v2 : v3 = v : 2v : 3v = 1 : 2 : 3

ప్రశ్న 6.
అనునాదం అంటే మీరు ఏమి అర్థం చేసుకొన్నారు? గాలిలో ధ్వని వేగాన్ని కనుక్కోవడానికి అనునాదాన్ని మీరెలా ఉపయోగిస్తారు?
జవాబు:
అనునాదం :
కంపిస్తున్న వస్తు సహజ పౌనఃపున్యము, బాహ్య ఆవర్తన బలం పౌనఃపున్యంనకు సమానం అయితే, ఆ రెండు వస్తువులు అనునాదంలో ఉన్నాయంటారు. అనునాదం వద్ద వస్తువులు పెరుగుతున్న కంపన పరిమితితో కంపిస్తాయి.

అనునాదంను ఉపయోగించి గాలిలో ధ్వనివేగంను నిర్ణయించుట:
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 11
1) అనునాద గొట్టంలో, గాలిస్తంభం కంపిస్తున్న శృతిదండాంలో కంపిస్తుంది. నిర్ధిష్ట గాలిస్తంభం పొడవు వద్ద, పౌనఃపున్యంనకు సమానమైన పౌనఃపున్యం వద్ద గాలి స్తంభం కంపిస్తుంది. అప్పుడు గాలిస్తంభం, గరిష్ఠ కంపన పరిమితి మరియు తీవ్రతతో ధ్వని ఏర్పడును.
2) తెరిచిన గొట్టం పైన తెలిసిన పౌనఃపున్యం (ν) ఉన్న కంపిస్తున్న శృతిదండాన్ని ఉంచుదాము.
3) గాలిస్తంభం పొడవును క్రమంగా పెంచితే, రెండు వేర్వేరు గాలిస్తంభ పొడవుల వద్ద ఎక్కువ శబ్దం (booming sound) వినిపిస్తుంది.
4) మొదటి అనునాదంలో, గాలిస్తంభ పొడవు l, అయితే, అప్పుడు
\(\frac{\lambda}{4}\) = l1 + C ………….. (1)

ఇక్కడ λ ఉరించు ధ్వని తరంగదైర్ఘ్యం మరియు c గొట్టం తుది సవరణ.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 12

5) రెండవ అనునాదంలో, గాలి స్తంభం పొడవు l1 అయితే,
అప్పుడు \(\frac{3 \lambda}{4}\) = l2 + C ………….(2)
(2) – (1) ⇒ \(\frac{\lambda}{2}\) = l2 – l1
λ = 2 (l2 – l1)

ధ్వని వేగం, v = v2(l1 – l1)
∴ v = 2v (l2 – l1)

6) v1, l1, l2 లు తెలిసిన ధ్వని వేగంను గణిస్తారు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 7.
స్థిర తరంగాలు అంటే ఏమిటి? ఒక సాగదీసిన తంత్రిలో స్థిర తరంగాలు ఏవిధంగా ఏర్పడతాయో వివరించండి.
జవాబు:
స్థిర తరంగాలు లేక స్థావర తరంగాలు:
రెండు సర్వ సమ పురోగామి (తిర్యక్ లేక అనుదైర్ఘ్య తరంగాలు, యానకంలో ఒకే రేఖలో వ్యతిరేక దిశలలో అధ్యారోపణం చెందితే, ఏర్పడు ఫలిత తరంగంను, స్థావర తరంగం అంటారు.

సాగదీసిన తీగలో స్థావర తరంగం ఏర్పడుట :

  1. రెండు ‘స్థిర బిందువుల మధ్య ‘l’ పొడవు ఉన్న తండ్రిని దృఢంగా బిగించి, కంపింపచేస్తే, తంత్రి వెంట తిర్యక్ పురోగామి తరంగం ప్రయాణిస్తుంది.
  2. తరంగం, దృఢంగా బిగించిన రెండవ చివర నుండి పరావర్తనం చెందును.
  3. పతన మరియు పరావర్తన తరంగాలు వ్యతికరణం పల్ల, స్థావర తరంగాలు ఏర్పడతాయి.
  4. అస్పందన మరియు ప్రస్పందన స్థానాలతో ఏర్పడిన స్థావర తరంగం పటంలో చూపబడింది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 13

ప్రశ్న 8.
ఒక సాగదీసిన తంత్రిలో ధ్వని వేగాన్ని కొలవడానికి ఒక పద్ధతిని వర్ణించండి.
జవాబు:
ప్రాథమిక రీతిలో సాగదీసిన తంత్రి వెంట, ప్రయాణించు తిర్యక్ తరంగం వేగం v = 2vl, ఇక్కడ υ = పౌనఃపున్యం, l = అనునాదం పొడవు.

సోనోమీటర్ ఉపయోగించి సాగదీసిన తండ్రి (తీగ) వెంట ధ్వని వేగంను నిర్ణయించుట :
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 14

  1. సరైన భారంతో తంత్రిని స్థిర తన్యతకు గురి చేస్తారు.
  2. పౌనఃపున్యం (v) ఉన్న కంపిస్తున్న శృతి దండం కాడను, సోనోమీటర్ పెట్టె పై ఉంచుతారు
  3. రెండు బ్రిడ్జిల మధ్య స్థిర దూరంలో అనునాదం వద్ద B1 B2 ల మధ్య పేపర్ రైడర్ పడిపోతుంది.
  4. రెండు బ్రిడ్జిల మధ్య అనునాదం పొడవు ‘l’ ను, స్కేలుతో కొలుస్తారు.
  5. v మరియు l లు తెల్సుకొని, తరంగవేగం v = 2vl నుపయోగించి కనుగొంటారు.

ప్రశ్న 9.
మూసిన గొట్టంలో స్థిర తరంగాలు ఏర్పడటాన్ని పటం సహాయంతో వివరించండి. ధ్వని జనకం పౌనఃపున్యాన్ని కనుక్కోవడానికి దీన్ని ఏవిధంగా ఉపయోగించవచ్చు?
జవాబు:
మూసిన గొట్టంలో స్థిర తరంగాలు ఏర్పడుట :
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 15
1) మూసిన గొట్టంలో ఒక చివర మూసి, రెండవ చివర తెరిచి ఉండును. తెరిచిన చివర ప్రస్పంద స్థానం, మూసిన చివర అస్పందన స్థానం ఏర్పడును.

2) మూసిన గొట్టంలో, కంపిస్తున్న గాలిస్తంభంలో సాధ్యమగు అనుస్వరాలను యిచ్చే సమీకరణం vn = \(\frac{(2n + 1)v}{4l}\)
ఇక్కడ n = 0, 1, 2, 3,

3) మొదట కంపన రీతిలో, మూసిన గొట్టంలో గాలిస్తంభ పౌనఃపున్యం ν1
= \(\frac{υ}{4l}\)(మొదటి అనుస్వరం లేక ప్రాథమిక పౌనఃపున్యం)

4) రెండవ కంపనరీతిలో, మూసిన గొట్టంలో గాలిస్తంభ పౌనః
పున్యము, ν3 = \(\frac{3υ}{4l}\) (మూడవ అనుస్వరం లేక మొదటి అతిస్వరం)

5) మూడవ కంపనరీతిలో, మూసిన గొట్టంలో గాలిస్తంభ పౌనః
పున్యం, ν5 = \(\frac{5υ}{4l}\) (ఐదవ అనుస్వరం లేక రెండవ అతిస్వరం)

ధ్వని జనకం పౌనఃపున్యంను నిర్ణయించుట :
1) తెరిచిన గొట్టంపైన, తెలియని పౌనఃపున్య శృతి దండం (v) ను ఉంచుదాము.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 16
2) రిజర్వాయర్ను నెమ్మదిగా క్రిందికి జరుపుతూ, బిగ్గరగా శబ్దం వినబడే వరకు జరపాలి. మొదటి అనునాదం గాలి స్తంభం పొడవు l1 ను కొలుద్దాం.

3) రిజర్వాయరు, రెండవ అనునాదం బిగ్గరగా శబ్దం వినబడేటట్లు క్రిందికి జరపాలి. రెండవ అనునాద గాలిస్తంభ పొడవు l2 ను కొలుద్దాం.

4) 0°C వద్ద తరంగవేగము υ = 331m/s.

5) ν = \(\frac{υ}{2(l_2-l_1)}\) సమీకరణంలో ν, l1 మరియు l2 లను ప్రతిక్షేపించి, శృతిదండం తెలియని పౌనఃపున్యం కనుక్కోవచ్చును.

ప్రశ్న 10.
విస్పందనాలు అంటే ఏమిటి? అవి ఎప్పుడు సంభవిస్తాయి? వాటి ఉపయోగాలు ఏమైనా ఉంటే వివరించండి.
జవాబు:
దాదాపు సమాన పౌనఃపున్యం ఉన్న రెండు ధ్వని తరంగాలు, ఒకే దిశలో ప్రయాణిస్తూ, వ్యతికరణం చెందితే, ఫలితంగా ధ్వని తరంగాల తీవ్రత, క్రమకాలవ్యవధులవద్ద గరిష్ఠ ధ్వని మరియు కనిష్ఠ ధ్వని ఏర్పడటాన్ని విస్పందనాలు అంటారు. కంపిస్తున్న వస్తువుల పౌనఃపున్యాలలో స్వల్ప తేడా ఉంటే, విస్పందనాలు ఏర్పడతాయి. విస్పందనాల సంఖ్య.
∆ν = ν1 ~ ν2

ప్రాముఖ్యత :

  1. మ్యూజికల్ పరికరాలను ట్యూన్ చేయుటకు విస్పందనాలు ఉపయోగిస్తారు.
  2. విషవాయువులను గుర్తించుటకు విస్పందనాలు ఉపయోగిస్తారు.

విస్పందనాలతో మ్యూసికల్ పరికరాలను ట్యూన్ చేయుట-వివరణ :
మ్యుజీషియన్స్, మ్యూజిక్ పరికరములను ట్యూన్ చేయుటకు విస్పందనాలను ఉపయోగిస్తారు. ఒక పరికరంను ధ్వనింపచేసి, ప్రామాణిక పౌనఃపున్యంనకు దగ్గరగా ఉంచి విస్పందనాలు అదృశ్యమయ్యే వరకు ట్యూన్ చేస్తారు. అప్పుడు పరికరం ప్రామాణిక పౌనఃపున్యంతో ట్యూన్ చేయబడింది అంటారు.

ప్రశ్న 11.
డాప్లర్ ప్రభావం అంటే ఏమిటి? వివరణాత్మకమయిన ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
డాప్లర్ ప్రభావం :
ధ్వని జనకం మరియు పరిశీలకులు సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు, పరిశీలకుడు వినే దృశ్య పౌనః పున్యంలో మార్పును డాప్లర్ ప్రభావం అంటారు.

ఉదాహరణలు :

  1. ఈల వేస్తున్న రైలు ఫ్లాట్ఫాంపై ఉన్న పరిశీలకుని సమీపిస్తూ ఉంటే, పరిశీలకుడు వినే ధ్వని దృశ్య పౌనఃపున్యం పెరుగును. రైలు ఇంజన్ పరిశీలకుని దాటి వెళ్తూ ఉన్నప్పుడు, అతడు వినే ధ్వని దృశ్య పౌనఃపున్యం తగ్గును.
  2. ఈల వేస్తున్న అంబులెన్స్ పరిశీలకుని సమీపిస్తూ ఉంటే, అతడు వినే దృశ్య పౌనఃపున్యం పెరుగును. అంబులెన్స్ పరిశీలకుని దాటి వెళ్తూ ఉన్నప్పుడు, అతడు వినే దృశ్య పౌనఃపున్యం తగ్గును.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సాగదీసిన తంత్రుల్లో స్థిర తరంగాలు ఏర్పడటాన్ని వివరించండి. దాని నుంచి సాగదీసిన తంత్రుల్లో తిర్యక్ తరంగాల నియమాలను ఉత్పాదించండి.
జవాబు:
ఒక పొడవాటి లోహపు తంత్రి రెండు చివలను దృఢ ఆధారాల మధ్య బిగించి, మధ్య బిందువు వద్ద మీటితే, ఒకే పౌనః పున్యం, ఒకే కంపన పరిమితిగల రెండు పరావర్తన తరంగాల తీగవెంట వ్యతిరేక దిశలలో ప్రయాణిస్తూ కలుస్తాయి. అప్పుడు ఏర్పడు ఫలిత తరంగాలను స్థావర లేక స్థిర తరంగాలు అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 17

ఒకే కంపన పరిమితి ‘a’, ఒకే తరంగదైర్ఘ్యం ‘λ’ మరియు ఒకే పౌనఃపున్యం ‘ν’ ఉండి, వ్యతిరేక దిశలలో ప్రయాణించు రెండు పురోగామి తరంగాలు వరుసగా,
y1 = a sin (kx – ωt) మరియు y2 = + a sin (kx + ωt)
ఇక్కడ 1 = 2πν మరియు k = \(\frac{2 \pi}{\lambda}\)
ఫలిత తరంగం, y = y1 + y2
y = a sin (kx – ωt) + a sin (kx + ωt)
y = (2a sin kx) cos ωt
2a sin kx = ఫలిత తరంగం కంపన పరిమితి

ఇది ‘kx’ పై ఆధారపడును
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 18
ఈ స్థానాలను అస్పందన స్థానాలు అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 19
ఈ స్థానాలను ప్రస్పందన స్థానాలు అంటారు.
తంత్రి రెండు భాగాలలో కలిస్తే, దాని రెండవ అనుస్వరం లేక మొదటి అతిస్వరం అంటారు. ఇదేవిధంగా కంపనాలు వరుసలు పటంలో చూపబడినవి.

‘l’ పొడవు ఉన్న ఒక తంత్రి p (ఉచ్చులలో) భాగాలలో కంపిస్తే ప్రతి భాగం పొడవు = \(\frac{l}{p}\)
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 20

p = 1 అయితే, దానిని ప్రాధమిక పౌనఃపున్యం (లేక) మొదటి హరాత్మక పౌనఃపున్యం అంటారు.

సాగదీసిన తంత్రి (తీగ) వెంట తిర్యక్ తరంగాల నియమాలు :
కంపన తీగ (తంత్రి) ప్రాథమిక పౌనఃపున్యం v = \(\frac{1}{2 l} \sqrt{\frac{\mathrm{T}}{\mu}}\)

మొదటి నియమము :
తంత్రి తన్యత (1) మరియు రేఖీయ సాంద్రత (u) లు స్థిరంగా ఉన్నప్పుడు, కంపిస్తున్న తంత్రి పౌనఃపున్యం (V), దాని పొడవు (1) కు విలోమానుపాతంలో ఉండును.
∴ v ∝ \(\frac{1}{l}\) ⇒ vl = స్థిరాంకం

రెండవ నియమము :
తంత్రి పొడవు (I) మరియు రేఖీయ సాంద్రత (m) లు స్థిరంగా ఉన్నప్పుడు, కంపిస్తున్న తంత్రి | ప్రాథమిక పౌనఃపున్యం (v), రేఖీయ సాంద్రత వర్గమూలంనకు అనులోమానుపాతంలో ఉండును.
∴ v ∝ √T ⇒ \(\frac{v}{\sqrt{T}}\) = స్థిరాంకం

మూడవ నియమము :
తంత్రి పొడవు (l) మరియు తన్యత (T) లు స్థిరంగా ఉన్నప్పుడు, కంపిస్తున్న తంత్రి ప్రాథమిక పౌనఃపున్యం (υ) తంత్రి రేఖీయ సాంద్రత (m) వర్గమూలమునకు విలోమానుపాతంలో ఉండును.
v ∝ + ⇒ V VI = స్థిరాంకం

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 2.
తెరచిన గొట్టంలో ఆవృతమైన గాలి స్తంభంలో స్థిర తరంగాలు ఏర్పడటాన్ని వివరించండి. ఉత్పత్తి అయ్యే అనుస్వరాల పౌనఃపున్యాలకు సమీకరణాలు ఉత్పాదించండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 21
రెండువైపులా తెరిచి ఉన్న గొట్టాలను తెరిచిన గొట్టం అంటారు. తెరిచిన గొట్టంలోనికి, ధ్వని తరంగంను పంపితే, భూమి వల్ల పరావర్తనం చెందును. ఒకే పౌనఃపున్యం ఉన్న పతన మరియు పరావర్తన తరంగాలు వ్యతిరేక దిశలో అధ్యారోపణం చెంది గొట్టంలో స్థిరతరంగాలు ఏర్పడును.

తెరిచిన గొట్టంలో అనుస్వరాలు :
i) తెరిచిన గొట్టంలో స్థిర తరంగం ఏర్పడుటకు, గొట్టం చివరల రెండు ప్రస్పందన స్థానాలు మరియు మధ్యలో ఒక అస్పందన స్థానం ఉండాలి.
అప్పుడు కంపన పొడవు (l)
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 22

(ii) రెండవ అనుస్వరం (మొదటి అతిస్వరం) లో మూడు అనుస్వరాలు మరియు రెండు అతిస్వరాలు ఏర్పడును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 23

ఇదే విధంగా మూడవ అనుస్వరంలో (రెండవ అతిస్వరంలో) నాల్గు ప్రస్పందన స్థానాలు మరియు మూడు అస్పందన స్థానాలు ఏర్పడును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 24
తెరిచిన గొట్టంలో అనుస్వరాల పౌనఃపున్యాల నిష్పత్తి ν : ν1 : ν2 = 1 : 2 : 3 ………

ప్రశ్న 3.
మూసిన గొట్టాలలో స్థిర తరంగాలు ఏవిధంగా ఏర్పడతాయి ? విభిన్న కంపనరీతులను వివరించండి. వాటి పౌనఃపున్యాలకు సంబంధాలను పొందండి. [AP & TS (Mar. ’15)]
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 25
గొట్టం ఒకవైపు మూసి ఉండి, రెండవ వైపు తెరిచి ఉన్న గొట్టంను మూసిన గొట్టం అంటారు. మూసిన గొట్టం తెరిచిన చివర ధ్వని తరంగంను పంపితే, తరంగము మూసిన చివర నుండి పరావర్తనము చెందును. పతన మరియు పరావర్తన తరంగాలు ఒకే పౌనఃపున్యంతో, వ్యతిరేక దిశలలో అధ్యారోపణం చెందుటవల్ల మూసిన గొట్టంలో స్థిర తరంగాలు ఏర్పడును.

మూసిన గొట్టంలో స్థిర తరంగము ఏర్పడుటకు కనీసం మూసిన చివర అస్పందన స్థానం మరియు తెరిచిన చివర ప్రస్పందన స్థానం ఏర్పడాలి. అప్పుడు గొట్టం ప్రాథమిక పౌనః పున్యంతో కంపిస్తుంది. అప్పుడు గొట్టం పొడవు (l) తరంగదైర్ఘ్యంలో నాల్గవ వంతుకు సమానం.
∴ l = \(\frac{\lambda_1}{4}\) ⇒ λ1 = 4l
‘ν1‘ ప్రాథమిక పౌనఃపున్యం అయితే,
ν1 = \(\frac{υ}{\lambda_1}\) ఇక్కడ ‘υ’ గాలిలో ధ్వని వేగం.
ν1 = \(\frac{υ}{4l}\) = ν ………….. (1)

మూసిన గొట్టంలో తరువాత అనుస్వరంను ఏర్పరుచుటకు గొట్టంలో రెండు అస్పందన మరియు రెండు ప్రస్పందన స్థాయి ఏర్పడాలి. అప్పుడు మూసిన గొట్టము మూడవ అనుస్వరంతో కంపిస్తుంది. అప్పుడు మూసిన గొట్టం పొడవు తరంగదైర్ఘ్యంనకు
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 26

ఇదే విధంగా రెండవ అతిస్వరం లేక ఐదవ అనుస్వరం మూడు అస్పందన మరియు మూడు. ప్రస్పందన స్థానాలలో ఏర్పడును. అప్పుడు గొట్టం పొడవు, తరంగదైర్ఘ్యం λ5 కు \(\frac{5}{4}\) రేట్లు
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 27
(1), (2) మరియు (3) సమీకరణాలనుండి అనుస్వర పౌనఃపున్యాల నిష్పత్తి
ν1 : ν3 : ν5 = ν : 3ν : 5ν
ν1 : ν3 : ν5 = 1 : 3 : 5

ప్రశ్న 4.
విస్పందనాలు అంటే ఏమిటి? విస్పందన పౌనఃపున్యానికి ఒక సమాసాన్ని పొందండి. విస్పందనాలు ఎక్కడ, ఎలా ఉపయోగపడతాయి?
జవాబు:
విస్పందనాలు :
సమీప పౌనఃపున్యంగల రెండు ధ్వని తరంగాలు ఒకే దిశలో ప్రయాణిస్తూ, వ్యతికరణం చెందితే, క్రమ కాలవ్యవధుల వద్ద, ఫలిత ధ్వని తీవ్రత వృద్ధి మరియు క్షీణత ఉండు దృగ్విషయంను విస్పందనాలు అంటారు.

ఒకే దిశలో అధ్యారోపణం చెందు ధ్వని తరంగాల పౌనఃపున్యాలు ν1 మరియు ν2 అయితే, ఒక సెకనులో వినే విస్పందనాల సంఖ్య ∆ν = ν1 – ν2.

స్పష్టంగా వినటానికి సెకనుకు వినే గరిష్ఠ విస్పందనాల సంఖ్య 10.

విస్పందన పౌనఃపున్యంనకు సమానము:

  1. దాదాపు సమాన పౌనఃపున్యాలు, ఒకే కంపన పరిమితిగల రెండు ధ్వని తరంగాలను భావిద్దాం.
  2. రెండు తరంగాల పౌనఃపున్యాలు ν1 మరియు ν2. ν1 > ν2 అనుకుందాము.
  3. విస్పందన ఆవర్తన కాలం T సెకనులు
  4. మొదటి తరంగం T సెకనులలో చేయు కంపనాల సంఖ్య = ν1T
    [∵ 1 సెకనులో కంపనాల సంఖ్య = ν]
    [T సెకనులో కంపనాల సంఖ్య = νt]
  5. రెండవ తరంగం T సెకనులలో చేయు కంపనాల సంఖ్య = ν2 T
  6. T కాలవ్యవధిలో రెండవ తరంగంకన్నా మొదటి తరంగం ఒక పూర్తి భ్రమణంను అధికంగా కలిగి ఉండును.
  7. కావున, ν1T – ν2T = 1 లేక ν1 – ν2 = \(\frac{1}{T}\)
  8. ఒక సెకనులో ఏర్పడే విస్పందనాల సంఖ్య = \(\frac{1}{T}\) ఇక్కడ T విస్పందన ఆవర్తన కాలం.
  9. ∵ విస్పందన పౌనఃపున్యం = \(\frac{1}{T}\) = ν1 – ν2 = ∆ν
  10. విస్పందన పౌనఃపున్యం, రెండు తరంగాల పౌనఃపున్యాల భేదంనకు సమానము.

విస్పందనాల ప్రాయోగిక అనువర్తనాలు:

  1. శృతిదండం తెలియని పౌనఃపున్యంను కనుగొనవచ్చును.
  2. సంగీత పరికరములను ట్యూన్ చేయుటకు ఉపయోగిస్తారు.
  3. సినిమాటోగ్రఫిలోని ప్రత్యేక ప్రభావం ఉత్పత్తిచేయుటకు ఉపయోగిస్తారు.
  4. గనులలో విషవాయువులను గుర్తించుటకు ఉపయోగిస్తారు.

ప్రశ్న 5.
డాప్లర్ ప్రభావం అంటే ఏమిటి? నిశ్చల స్థితిలో ఒక పరిశీలకుని దృష్ట్యా జనకం చలనంలో ఉన్నప్పుడు వినపడే ధ్వని దృశ్య పౌనఃపున్యానికి ఒక సమాసాన్ని పొందండి. [T.S (Mar. ’17) AP (Mar.’16) (Mar. ’14)]
జవాబు:
డాప్లర్ ప్రభావము :
ధ్వని జనకము మరియు పరిశీలకుడు సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు, పరిశీలకుడు విని దృశ్య పౌనఃపున్యంలోని మార్పును, డాప్లర్ ప్రభావము అంటారు.

ఈల వేస్తున్న రైలు ఇంజన్, ప్లాట్ఫాంపై ఉన్న పరిశీలకుని సమీపిస్తూ ఉంటే, పరిశీలకుడు వినే దృశ్య పౌనఃపున్యం పెరుగును. రైలు ఇంజన్ పరిశీలకుని దాటితే, పరిశీలకుడు వినే దృశ్య పౌనఃపున్యం తగ్గును.

ధ్వనిజనకం చలనంలో మరియు పరిశీలకుడు నిశ్చలంగా ఉన్నప్పుడు, దృశ్య పౌనఃపున్యంనకు సమాసము :
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 28
S = ధ్వని జనకం
O = పరిశీలకుడు

ధ్వని జనకం, ‘S’ నిశ్చలంగా ఉన్న పరిశీలకుని వైపు ‘υs‘ వేగంతో చలిస్తుందని భావిద్దాం.
ఆవర్తన కాలం T లో జనకం ప్రయాణించు దూరం = υs T
వరుస సంపీడనాలు మరియు విరళీకరణాలు పరిశీలకునికి దగ్గరగా గీయబడినవి.
∴ దృశ్య తరంగదైర్ఘ్యం, λ’ = λ – υsT.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 29

∴ దృశ్య పౌనఃపున్యం, నిజ పౌనఃపున్యం కన్నా ఎక్కువ.

ఇదేవిధంగా, ధ్వని జనకం, నిశ్చలంగా ఉన్న పరిశీలకుని నుండి దూరం చలిస్తుంటే, పరిశీలకుడు వినే దృశ్య పౌనఃపున్యం . పరిశీలకుడు వినే దృశ్య పౌనఃపున్యం, నిజ పౌనఃపున్యం కన్నా తక్కువ.

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 6.
డాప్లర్ విస్థాపనం అంటే ఏమిటి? నిశ్చల స్థితిలో ఒక జనకం దృష్ట్యా పరిశీలకుడు చలనంలో ఉన్నప్పుడు వినపడే ధ్వని దృశ్య పౌనఃపున్యానికి ఒక సమాసాన్ని పొందండి.
జవాబు:
డాప్లర్ విస్థాపనం :
సాపేక్ష చలనంలో ధ్వని జనకము, పరిశీలకుని దగ్గరకు వచ్చినపుడు, దృశ్య పౌనఃపున్యం, నిజ పౌనఃపున్యం కన్నా ఎక్కువ. ధ్వని జనకము, పరిశీలకునికి దూరంగా ఉన్నప్పుడు, దృశ్య పౌనఃపున్యం నిజ పౌనఃపున్యంకన్నా తక్కువ. దృశ్య మరియు నిజ పౌనఃపున్యాల భేదంను డాప్లర్ విస్థాపనం అంటారు.

చలన పరిశీలకుడు వినే దృశ్య పౌనఃపున్యంనకు సమానము:

సందర్భం (1) :
పరిశీలకుడు జనకంవైపు చలిస్తూ ఉన్నప్పుడు : పరిశీలకుడు ‘O’, vo వేగంతో నిశ్చలంగా ఉన్న జనకం ‘S’ వైపు పటములో చూపినట్లు చలిస్తుందని భావిద్దాం. అందువల్ల పరిశీలకుడు ప్రతి సెకనులో గ్రహించే తరంగాల సంఖ్య ఎక్కువ.
ఒక సెకనులో పరిశీలకుడు ప్రయాణించు దూరం = υ0
పరిశీలకుడు గ్రహించే అదనపు తరంగాల సంఖ్య = \(\frac{υ_0}{\lambda}\)
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 30
∴ దృశ్య పౌనఃపున్యం, నిజ పౌనఃపున్యం కన్నా ఎక్కువ.

సందర్భం (2) :
పరిశీలకుడు నిశ్చలంగా ఉన్న జనకం నుండి దూరంగా చలిస్తూ ఉన్నప్పుడు
పరిశీలకుడు, నిశ్చలంగా ఉన్న జనకం నుండి దూరంగా చలిస్తూ ఉన్నప్పుడు, పరిశీలకుడు కోల్పోయే తరంగాల సంఖ్య \(\frac{ν_0}{\lambda}\)
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 31

లెక్కలు Problems

ప్రశ్న 1.
0.6m పొడవు గల ఒక సాగదీసిన తంత్రి ప్రాథమిక కంపనరీతిలో 30Hzల పౌనఃపున్యంతో కంపిస్తుందని పరిశీలించారు. తంత్రి 0.05 kg/m ల రేఖీయ సాంద్రత కలిగి ఉంటే (a) ఆ తంత్రిలో తిర్యక్ తరంగాల ప్రసార వేగాన్ని (b) తండ్రిలో తర్వతుడు కనుక్కోండి.
సాధన:
v = 30Hz; l = 0.6 m ; µ = 0.05 kg m-1
υ = ?; T = ?
a) υ = 2vl = 2 × 30 × 0.6 = 36 m/s
b) T = vu = 36 × 36 × 0.05 = 64.8 N

ప్రశ్న 2.
3cm వ్యాసం గల ఒక ఉక్కు కేబుల్ను 10kN తన్యతకు లోబడి ఉంచారు. ఉక్కు సాంద్రత 7.8 g/cm³. ఆ కేబుల్ వెంట ఎంత వడితో తిర్యక్ తరంగాలు ప్రయాణిస్తాయి?
సాధన:
T = 10 kN = 104

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 32

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 33

ప్రశ్న 3.
ఒక సాగదీసిన తంత్రి వెంబడి ప్రయాణిస్తున్న రెండు పురోగామి తరంగాలు y = 0.07 sinπ (12x- 500t), y2 = 0.07 sinπ (12x + 500t) అస్పందనాలు, ప్రస్పందనలను ఏర్పరుస్తున్నాయి. (a) అస్పందనలు (b) విస్పందనల వద్ద స్థానభ్రంశం ఎంత ? స్థిర తరంగం తరంగదైర్ఘ్యం ఏమిటి ?
సాధన:
A1 = 0.07; A2 = 0.07; K = 12π
a) అస్పందన స్థానాల వద్ద, స్థానభ్రంశము,
y = A1 – A2 = 0.07 0.07 = 0.

b) ప్రస్పందన స్థానాల వద్ద, స్థానభ్రంశము,
y = A1 + A2 = 0.07 + 0.07 = 0.14 m

c) తరంగదైర్ఘ్యం λ = \(\frac{2 \pi}{K}=\frac{2 \pi}{12 \pi}\) = 0.16m

ప్రశ్న 4.
ఒక తంత్రి 0.4m పొడవు, 0.16g ద్రవ్యరాశి కలిగి ఉంది. తంత్రిలో తన్యత 70N అయితే, దాన్ని మీటినప్పుడు అది ఉత్పత్తిచేసే మూడు అత్యల్ప పౌనః పున్యాలు ఏమిటి?
సాధన:
l = 0.4 m; M = 0.16g = 0.16 × 10-3 kg;
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 34
v2 = 2v1 = 2 × 523 = 1046 Hz
v3 = 3v1 = 3 × 523 = 1569 Hz

ప్రశ్న 5.
ఒక లోహపు కడ్డీని దాని మధ్య బిందువు వద్ద బిగించి నప్పుడు దాని ప్రాథమిక పౌనఃపున్యంలో, 4kHz పౌనః పున్యంగల అనుదైర్ఘ్య తరంగాలతో అనునాదం చేస్తుంది. ఆ బిగింపును ఒక చివరికి జరిపితే దాని ప్రాధమిక అనునాద పౌనఃపున్యం ఎంత అవుతుంది?
సాధన:
l పొడవు ఉన్న ఒక లోహపు కడ్డీ మధ్యలో బిగింపు ఉంచి ప్రాధమిక రీతిలో కంపింపచేస్తే, మధ్యలో ఒక అస్పందన స్థానం, కడ్డీ రెండు స్వేచ్ఛా చివరల ప్రస్పందన స్థానంబు ఏర్పడును.
l = \(\frac{\lambda}{2}\) ⇒ λ = 2l
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 35

ప్రాథమిక’ రీతిలో కడ్డీ పౌనఃపున్యం = తరంగ పౌనః పున్యం = 4 kHz.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 36

ప్రశ్న 6.
70 cm పొడవు గల ఒక మూసిన ఆర్గాన్ పైపును ధ్వనింపచేశారు. ధ్వనివేగం 331 m/s అయితే గాలి స్తంభపు కంపన ప్రాథమిక పౌనఃపున్యం ఎంత? [A.P (Mar. ’17)]
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 37

ప్రశ్న 7.
ఒక నిట్టనిలువు గొట్టాన్ని నీటితో నిల్చి ఉండేటట్లు ఉంచారు. దానిలో నీటి మట్టాన్ని సర్దుబాటు చేయవచ్చు. ఆ గొట్టంపై నుంచి 320 Hz పౌనఃపున్యం గల ధ్వని తరంగాలను పంపించారు. రెండు వరుస నీటిమట్టాలు 20cm, 73 cm వద్ద స్థిర తరంగాలు ఏర్పడితే, ఆ గొట్టపు గాలిలో ధ్వని తరంగాల వడి ఎంత?
సాధన:
v = 320 Hz; l1 = 20cm = 20 × 10-2 m
l2 = 73 cm = 73 × 10-2m; υ = ?
υ = 2v (l2 – l1)
= 2 × 320 (73 × 10-2 – 20 × 10-2)
∴ υ = 339 m/s

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 8.
65cm, 70cm పొడవులు గల రెండు ఆర్గాన్ పైపులను ఒకేసారి ధ్వనింపచేస్తే, ఆ రెండు పైపుల ప్రాథమిక పౌనఃపున్యాల మధ్య సెకనుకు ఎన్ని విస్పందనాలు ఉత్పత్తి అవుతాయి? (ధ్వని వేగం = 330 m/s).
సాధన:
l1 = 65 cm = 0.65 m
l2 = 70 cm = 0.7 m
υ = 330 m/s
ఒక సెకనులో విస్పందనాల సంఖ్య ∆ν = ν1 – ν2

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 38

ప్రశ్న 9.
ఒక రైలు ఒక లెవెల్ క్రాసింగ్ను సమీపిస్తున్నప్పుడు, దాటేప్పుడు ఈల వేస్తుంది. ఆ క్రాసింగ్ వద్ద ఉన్న ఒక పరిశీలకుడు ఆ రైలు సమీపిస్తున్నప్పుడు 219 Hz పౌనః పున్యంగా, అది వెళ్ళేటప్పుడు 184 Hz పౌనఃపున్యంగా కొలిచాడు. ధ్వని వడిని 340 m/s గా తీసుకొంటే ఆ రైలు వడిని, దాని ఈల పౌనఃపున్యాన్ని కనుక్కోండి. [T.S (Mar.’17)]
సాధన:
ఈల వేస్తున్న ఒక రైలు క్రాసింగ్ వద్ద ఉన్న పరిశీలకుని సమీపిస్తూ ఉంటే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 39
ఈల వేస్తున్న ఒక రైలు క్రాసింగ్ వద్ద ఉన్న పరిశీలకుని నుండి దాటి వెళ్ళేటప్పుడు,
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 40
ఇక్కడ v’. = 219 Hz; v” = 184Hz;
υ = 340 m/s
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 41

ప్రశ్న 10.
60 kmph, 70 kmph వడులతో రెండు ట్రక్కులు వ్యతిరేకదిశలలో ఎదురవుతూ సమీపిస్తున్నాయి. మొదటి ట్రక్కు చోదకుడు (driver) 400Hz పౌనఃపున్యంతో హారన్ ధ్వని చేస్తున్నాడు. రెండవ ట్రక్కు చోదకుడు ఎంత పౌనఃపున్యాన్ని వింటాడు? (ధ్వని వేగం 330 m/s). ఆ రెండు ట్రక్కులు ఒకదానిని మరొకటి దాటిన తరవాత రెండవ ట్రక్కు చోదకుడు ఎంత పౌనః పున్యాన్ని వింటాడు?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 42
రెండు ట్రక్కులు ఒకదానికొకటి సమీపిస్తూ ఉంటే, రెండవ ట్రక్కు చోదకుడు వినే పౌనఃపున్యం
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 43
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 44

రెండు ట్రక్కులు ఒకదానికొకటి దాటిన తరువాత,
రెండవ ట్రక్కు చోదకుడు పౌనఃపున్యం
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 45

అభ్యాసాలు Textual Exercises

ప్రశ్న 1.
2.50 kg ద్రవ్యరాశి గల ఒక తంత్రి 200 N తన్యతకు లోబడి ఉన్నది. సాగదీసిన తంత్రి పొడవు 20.0 m. ఆ తంత్రి ఒక చివర తిర్యక్ కుదుపును కలిగిస్తే, ఆ అలజడి మరొక చివరకు చేరడానికి ఎంత సమయం పడుతుంది?
సాధన:
M = 2.50 kg, T = 200N, T = 20.0M
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 46

ప్రశ్న 2.
300m ఎత్తుగల ఒక గోపురం పైభాగం నుంచి ఒక రాయిని జారవిడిస్తే అది దాని పీఠం దగ్గర ఉన్న కొలనులోని నీటిలో పడింది. గాలిలో ధ్వని వడి 340 ms-1 గా ఇస్తే నీటిలో పడినప్పుడు వచ్చే శబ్దం పైభాగాన ఎప్పుడు వినిపిస్తుంది? (g = 9.8m s-2)
సాధన:
h = 300m, g= 9.8 m/s²), υ = 340 m/s.
నీటి మడుగు ఉపరితలంపై రాయి తాకుటకు పట్టు కాలం t1 అయితే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 47
ధ్వని గోపురం పైకి చేరుటకు పట్టుకాలం
t2 = \(\frac{h}{ν}=\frac{300}{400}\) = 0.88s
రాయి నీటిని తాకిన తరువాత శబ్దం వినుటకు పట్టు కాలం = t1 + t2 = 7.82 + 0.88 = 8.70s.

ప్రశ్న 3.
ఒక ఉక్కు తీగ 12.0 m పొడవు, 2.10 kg ల ద్రవ్యరాశి కలిగి ఉంది. ఆ తీగపై తిర్యక్ తరంగ వడి, 20° C వద్ద గల పొడి గాలిలో ధ్వని వడి 343 m s-1 కు సమానం అయితే ఆ తీగలో తన్యత ఎంత ఉండాలి?
సాధన:
l = 12.0m, µ = 2.10 kg, T = ?
v = 343 m/s
ప్రమాణ పొడవుకు ద్రవ్యరాశి µ = \(\frac{m}{l}=\frac{2.10}{12.0}\) = 0.175 kg/m
v = \(\sqrt{\frac{\mathrm{T}}{\mu}}\)
T = υ².µ = (343)² × 0.175 2.06 × 104 N.

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 4.
v = \(\sqrt{\frac{\gamma \mathbf{P}}{\rho}}\) ఫార్ములాను ఉపయోగించి ఈ క్రింది వాటిని వివరించండి.
a) గాలిలో ధ్వని వడి పీడనం మీద ఆధారపడదు.
b) గాలిలో ధ్వని వడి ఉష్ణోగ్రతతో పెరుగుతుంది.
c) గాలిలో ధ్వని వడి తేమతో పెరుగుతుంది.
సాధన:
పీడన ప్రభావము:
వాయువులలో ధ్వని వడి υ = \(\sqrt{\frac{\gamma \mathbf{P}}{\rho}}\)
స్థిర ఉష్ణోగ్రతవద్ద, PV = స్థిరాంకము
P\(\frac{\mathrm{m}}{\rho}\) = స్థిరాంకము ⇒ \(\frac{\mathrm{P}}{\rho}\) = స్థిరాంకము
పీడనం పెరిగిన, P కూడా పెరుగును. కావున గాలిలో ధ్వని వడి, పీడనంపై ఆధారపడదు.

ఉష్ణోగ్రత ప్రభావము :
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 48
STP వద్ద నీటిఆవిరి సాంద్రత, పొడిగాలి సాంద్రత కన్నా తక్కువ. గాలిలో తేమ, గాలిసాంద్రత తగ్గించును. ధ్వనివడి సాంద్రత మార్గమూలంనకు విలోమానుపాతంలో ఉండును. ధ్వని పొడిగాలిలో కన్నా తేమ గాలిలో ఎక్కువ వడితో ప్రయాణించును. కావున ధ్వని వడి υ ∝ తేమ.

ప్రశ్న 5.
ఏకమితీయంలో ప్రయాణించే తరంగాన్ని y = f(x, t) అనే ఒక ప్రమేయంతో సూచిస్తారని మీకు తెలుసు. ఇక్కడ x, t లు x – υt లేదా x + υt ల సంయోగంగా కనిపిస్తుంది. అంటే, y = f(x ± υt). దీని విపర్యయం సత్యమా? y యొక్క క్రింది ప్రమేయాలు ప్రయాణ తరంగాలను సూచిస్తాయో లేదో పరీక్షించండి:
a) (x – υt)²
b) log[(x + υt) / x0]
e) 1/(x + υt)
సాధన:
కాదు, విలోమము సత్యం కాదు. X మరియు t విలువలకు ప్రయాణించు తరంగంను సూచించుటకు తరంగ ప్రమేయం కావాలి. తరంగ ప్రమేయం నిర్ణీత విలువ కలిగి ఉండును.

ఇచ్చిన ప్రమేయంలలో, ప్రమేయంను ఏది కూడా సంతృప్తపరచదు.
∴ ప్రయాణించు తరంగంను ఏది కూడా సూచించదు.

ప్రశ్న 6.
ఒక గబ్బిలం 1000 kHz పౌనఃపున్యం గల అతిధ్వనిని గాలిలో విడుదల చేస్తుంది. ఆ ధ్వని ఒక నీటి ఉపరితలాన్ని తాకితే, (a) పరావర్తిత ధ్వని (b) ప్రసారిత ధ్వనుల తరంగదైర్ఘ్యం ఎంత? గాలిలో ధ్వని వడి 340 m s-1, నీటిలో ధ్వని వడి 1486 m s-1.
సాధన:
υ = 100KHz = 105 Hz, υa = 340 m/s,
υw = 1486 ms-1

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 49

ప్రశ్న 7.
ఒక వైద్యశాలలో అతిధ్వని క్రమ వీక్షణాన్ని (ultrasonic scanner) కణజాలకంలోని కణతుల స్థానాన్ని గుర్తించ దానికి ఉపయోగిస్తున్నారు. ఆ కణజాలకంలో ధ్వని వడి 1.7 km s-1 అయితే దానిలో ధ్వని తరంగదైర్ఘ్యం ఎంత? ఆ క్రమ వీక్షణ లేదా స్కానర్ పనిచేసే (ప్రచాలనమయ్యే) పౌనఃపున్యం 4.2 MHz.
సాధన:
v = 1.7 Kms-1 = 1700 ms-1
v = 4.2 MHz = 4.2 × 106Hz
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 50

ప్రశ్న 8.
ఒక తంత్రిపై ఒక తిర్యక్ హరాత్మక తరంగాన్ని ఈ విధంగా వర్ణించారు.
y(x, t) = 3.0 sin (36 t + 0.018 x + π/4)
ఇక్కడ x, y cm లో; t సెకను (S) లలో ఉన్నాయి. x ధన దిశ ఎడమ నుంచి కుడివైపుకు ఉంది.
a) ఇది ప్రయాణించే తరంగమా లేదా స్థిర తరంగమా? ఇది ప్రయాణించేది అయితే దాని ప్రసార వడి, ప్రసార దిశ ఏమిటి?
b) దాని కంపనపరిమితి, పౌనఃపున్యం ఎంత?
c) మూల బిందువు వద్ద దాని తొలిదశ ఏమిటి?
d) ఆ తరంగంలో రెండు వరస శృంగాల మధ్య కనిష్ఠ దూరం ఎంత?
సాధన:
ఇచ్చిన సమీకరణంను, కుడి నుండి ఎడమ వైపుకు υ వడితో ప్రయాణించు ‘r’ కంపన పరిమితిగల సమతల పురోగామి తరంగంతో పోలిస్తే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 51

a) ఇచ్చిన సమీకరణం, కుడి నుండి ఎడమకు ప్రయాణించు తిర్యక్ హరాత్మక తరంగంను సూచిస్తుంది.
b) ఇచ్చిన సమీకరణంను ఇంకొక విధంగా వ్రాస్తే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 52

తరంగం రెండు వరుస శృంగాల మధ్య
కనిష్ట దూరము = తరంగదైర్ఘ్యం
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 53

ప్రశ్న 9.
అభ్యాసం 8 లో వివరించిన తరంగానికి, స్థానభ్రంశం (y), కాలం (t) గ్రాఫ్ను x = 0.2, 4 cm లకు గీయండి. ఈ గ్రాఫ్ ఆకారాలు ఏమిటి? ప్రయాణ తరంగంలోని డోలన చలనం, ఏ రీతిలో ఒక బిందువు నుంచి మరొక బిందువుకు కంపనపరిమితి, పౌనఃపున్యం లేదా దశలు విభేదిస్తాయి?
సాధన:
తిర్యక్ హరాత్మక తరంగము y(x, t) = 3.0
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 54

వేర్వేరు t విలువలకు, (i) ను ఉపయోగించి yని గణించి, పట్టికలో పొందుపరచుదాము.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 55

x = 2 cm మరియు x = 4 cm కు ఇదేవిధము అయిన గ్రాఫ్లు వస్తాయి. తరంగ ప్రయాణంలో డోలన చలనం ఒక స్థానం నుండి మరియొక స్థానంనకు దశ పడములలో వేర్వేరుగా ఉండును. కంపన పరిమితి మరియు పౌనఃపున్యాలు మూడు సందర్భాలలో డోలన చలనం స్థిరంగా ఉండును.

ప్రశ్న 10.
ప్రయాణించే హరాత్మక తరంగానికి y(x, t) = 2.0 cos 2 π (10 – 0.0080 x + 0.35) ఇక్కడ x, y cm లో, t సెకను (S) లో ఉన్నాయి. క్రింద ఇచ్చిన దూరంతో వేరుచేసిన డోలన చలనం చేసే రెండు బిందువుల మధ్య దశా భేదాన్ని గణించండి.
a) 4 m
b) 0.5 m
c) λ/2
d) 3λ/4
సాధన:
ఇచ్చిన సమీకరణంను ఇంకొక విధంగా వ్రాస్తే
y = 2.0 cos[2л(10t – 0.0080x) + 2л × 0.35]
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 56
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 57

ప్రశ్న 11.
ఒక తంత్రి (రెండు చివరలు బిగించి ఉన్న) తిర్యక్ స్దాన భ్రంశాన్ని y(x, t) = 0.06 sin (\(\frac{2 \pi}{3}\) x) cos (120 πt) తో సూచిస్తున్నారు. ఇక్కడ x, y m లో t సెకన్ (s) ఉన్నాయి. ఆ తంత్రి పొడవు 1.5 m, ద్రవ్యరాశి 3.0 × 10-2 kg.
క్రింది వాటికి జవాబు ఇవ్వండి.
a) ఆ ప్రమేయం ఒక ప్రయాణ తరంగాన్ని లేదా ఒక స్థిర తరంగాన్ని సూచిస్తుందా?
b) ఆ తరంగాన్ని వ్యతిరేక దిశలలో ప్రయాణించే రెండు తరంగాల అధ్యారోపణంగా అర్థం చేసుకోండి. ప్రతీ తరంగపు తరంగదైర్ఘ్యం, పౌనఃపున్యం వడి ఎంత?
c) ఆ తంత్రిలో తన్యతను కనుక్కోండి.
సాధన:
ఇచ్చిన సమీకరణం
y(x, t) = 0.06 sin\(\frac{2 \pi}{3}\) x cos 120 πt ………… (i)

a) సమీకరణం x మరియు tలతో హరాత్మక ప్రమేయం కలిగి, స్థావర తరంగంన తెల్పును.
b) తరంగము
y1 = r sin \(\frac{2 \pi}{\lambda}\) (υt + x)
ధన X-అక్షం దిశలో ప్రయాణిస్తూ, పరావర్తన తరంగం
y2 = -r sin \(\frac{2 \pi}{\lambda}\) (υt + x) తో వ్యతిరేక దిశలో అధ్యారోపణం చెందితే, స్థావర తరంగం
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 58

రెండు తరంగాలు ఒకే తరంగదైర్ఘ్యం, ఒకే పౌనఃపున్యం మరియు ఒకే వడిని కల్గి ఉండును.
c) తిర్యక్ తరంగ వడి
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 59

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 12.
i) అభ్యాసం 11లో ఇచ్చిన ఒక తంత్రిపై ఉన్న తరంగానికి, ఆ తంత్రిపై ఉన్న అన్ని బిందువులు ఒకే (a) కంపనపరిమితి, (b) దశ, (c) పౌనఃపున్యంతో డోలనాలు చేస్తాయా? మీ జవాబులను వివరించండి. (ii) ఒక చివర నుంచి 0.375 m దూరంలో ఉన్న ఒక బిందువు కంపనపరిమితి ఎంత?
సాధన:
తీగపై అన్ని స్థానాల వద్ద
i) అస్పందన స్థానాల వద్ద (పౌనఃపున్యం సున్న) తప్ప మిగిలిన అన్ని స్థానాల వద్ద ఒకే పౌనఃపున్య విలువను కలిగి ఉండును.
ii) అస్పందన స్థానాల వద్ద తప్పు ఉచ్చులో ఎక్కడైనా ఒకేఒక దశ కలిగి ఉండును. వేర్వేరు స్థానాల వద్ద కంపన పరిమితులు వేర్వేరుగా ఉండును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 60

ప్రశ్న 13.
ఒక స్థితిస్థాపక తరంగ స్థానభ్రంశాన్ని (తిర్యక్ లేదా అనుదైర్ఘ్య) సూచించడానికి x, tలలో కొన్ని ప్రమేయాలు కింద ఇవ్వడమైంది. వీటిలో ఏవి (i) ఒక ప్రయాణించే తరంగాన్ని, (ii) ఒక స్థిర తరంగాన్ని లేదా (iii) ఏదీ కాని దాన్ని సూచిస్తాయి?
a) y = 2 cos (3x) sin (10t)
b) y = \(2 \sqrt{x-v t}\)
c) y = 3 sin (5x-0.5t) + 4 cos (5x-0.5t)
d) y = cos x sin t + cos 2x sin 2t
సాధన:
a) సమీకరణంలో x మరియు t లు వేరుగా ఉన్న హరాత్మక ప్రమేయంలతో స్థావర తరంగంను సూచించును.

b) ఏ రకమైన తరంగంను సూచించదు.

c) ఇది పురోగామి లేక హరాత్మక తరంగంను సూచిస్తుంది.

d) ఈ సమీకరణం రెండు ప్రమేయాల మొత్తం ఒక్కొక్కటి స్థావర తరంగంను సూచిస్తుంది. ఇది స్థావర తరంగాల అధ్యారోపణంను సూచిస్తుంది.

ప్రశ్న 14.
రెండు దృఢ ఆధారాల మధ్య సాగదీసిన తీగ 45 Hz పౌనఃపున్యంతో దాని ప్రాథమిక రీతిలో కంపిస్తుంది. ఆ తీగ ద్రవ్యరాశి 3.5 × 10-2 kg రేఖీయ ద్రవ్యరాశి సాంద్రత 4.0 × 10-2 kg m-1. (a) ఆ తీగపై తిర్యక్ తరంగ వడి, (b) ఆ తీగలో తన్యత ఎంత?
సాధన:
v = 45Hz, u = 3.5 × 10-2 kg
ద్రవ్యరాశి/పొడవు = u = 4.0 × 10-2 kg/m-1

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 61

ప్రశ్న 15.
ఒక మీటరు పొడవు గల ఒక గొట్టం ఒక చివర తెరవబడి, మరొక చివర కదలగలిగే పిస్టన్ (ముషలకం)తో ఒక స్థిరమైన పౌనఃపున్యం గల జనకం (340 Hz పౌనః పున్యం గల శృతిదండం) తో గొట్టం పొడవు 25.5 cm లేదా 79.3 cm ఉన్నప్పుడు అనునాదంలో ఉన్నది. ప్రయోగ ఉష్ణోగ్రత వద్ద గాలిలో ధ్వని వడిని అంచనా వేయండి. అంచు ప్రభావాలను (edge effects) ఉపేక్షించవచ్చు.
సాధన:
గొట్టంలో ముషలకం ఒక చివర ఉంటే, మూసిన గొట్టం వలె ఉండి బేసి అనుస్వరాలను ఉత్పత్తి చేయును.

గొట్టం ప్రాథమిక పౌనఃపున్యంతో అనునాదంలో ఉండి మూడవ అనుస్వరం 79.3 సెం.మీ ఘమారు 25.5 సెం.మీ.కు 3 రెట్లు ఉండును.

ప్రాథమిక అనుస్వరం వద్ద \(\frac{\lambda}{4}\) = l1 = 25.5
λ = 4 × 25.5 = 102 cm = 1.02 m
గాలిలో ధ్వని వడి
v = vλ = 340 × 1.02
= 346.8 m/s

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 16.
100 cm పొడవు ఉన్న ఒక ఉక్కు కడ్డీని దాని మధ్య భాగంలో బిగించారు. ఆ కడ్డీ అనుదైర్ఘ్య కంపనాల ప్రాథమిక పౌనఃపున్యాన్ని 2.53 kHz లుగా ఇస్తే ఉక్కులో ధ్వని వడి ఎంత?
సాధన:
l = 100 cm = Im, v = 2.53 KHz
= 2.53 × 10³ Hz

కడ్డీని మధ్యలో బిగిస్తే, కడ్డీ ప్రాథమిక కంపన పద్ధతిలో, మధ్యలో అస్పందన మరియు చివరల స్పందన స్థానాలు ఏర్పడును.
పటం నుండి
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 62

ప్రశ్న 17.
20 cm పొడవు గల గొట్టం ఒక చివర మూసి ఉన్నది. 430 Hz ల ఒక జనకంతో ఉత్తేజపరిస్తే, ఆ గొట్టపు ఏ అనుస్వరరీతి అనునాదంలో ఉంటుంది? ఆ గొట్టం రెండు చివరలు తెరచి ఉంటే అదే జనకంతో అనునాదంలో ఉండగలదా?
(గాలిలో ధ్వని వడి 340 m s-1).
సాధన:
l = 20 cm = 0.2m, vn = 430 Hz
υ = 340m/s
0.2m, vn = 430 Hz,
మూసిన గొట్టం nవ సాధారణ కంపన స్థితిలో పౌనఃపున్యం
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 63
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 64

n ఇంటిజిర్ను కల్గి ఉంటే, తెరిచిన గొట్టం జనకంతో అనునాదంలో ఉండును.

ప్రశ్న 18.
A, B అనే రెండు సితార్ తంత్రులతో ‘గ’ స్వరాన్ని వాయిస్తున్నప్పుడు కాస్తంత శృతి తప్పి 6 Hz పౌనః పున్యంగల విస్పందనాలను ఉత్పత్తి చేసాయి. A తంత్రిలో కాస్తంత తన్యతను తగ్గిస్తే విస్పందన పౌనఃపున్యం 3 Hz లకు తగ్గిందని కనుక్కొన్నారు. A అసలు పౌనఃపున్యం 324 Hz అయితే, B పౌనఃపున్యం ఎంత?
సాధన:
A సితార్ తంత్రి యదార్థ పౌనఃపున్యం na మరియు B సితార్ తంత్రి యదార్ధ పౌనఃపున్యం nb.
1 సెకన్ ఏర్పడు విస్పందనాల సంఖ్య = 6
nb = na ± 6 = 324 ± 6 = 330 లేక 318Hz.
∴ Aలో తన్యత తగ్గిస్తే పౌనఃపున్యం తగ్గును.
(∴ n ∝ √T).
ఒక సెకనుకు విస్పందనాల సంఖ్య 3 కు తగ్గితే,
B పౌనఃపున్యం = 324 – 6
= 318Hz.

ప్రశ్న 19.
ఎందుకు (లేదా ఎలా) వివరించండి :
a) ధ్వని తరంగంలో స్థానభ్రంశ అస్పందనమే పీడన ప్రస్పందనం, స్థానభ్రంశం ప్రస్పందనమే పీడన అస్పందనం.
b) ఏవిధమైన ‘కళ్ళు’ లేకుండానే గబ్బిలాలు అడ్డంకుల దూరాలను, దిశలను, స్వభావాన్ని, పరిమాణాలను రూఢీపరచుకోగలవు –
c) ఒక వయోలిన్ స్వరం, సితార్ స్వరం ఒకే పౌనః పున్యాన్ని కలిగి ఉండవచ్చు. అయినప్పటికీ మనం ఆ రెండు స్వరాల మధ్య తేడా తెలుసుకోగలం.
d) ఘనపదార్థాలు అనుదైర్ఘ్య, తిర్యక్ తరంగాలు రెండింటిని ప్రసారం చేయగలవు. కాని వాయువులలో అనుదైర్ఘ్య తరంగాలు మాత్రమే ప్రసరిస్తాయి.
e) ఒక విక్షేపక (dispersive) యానకంలో స్పందన ఆకారం ప్రసార సమయంలో విరూపణ చెందుతుంది.
సాధన:
a) అస్పందన (N) స్థానం వద్ద డోలన కంపన పరిమితి శూన్యం (మరియు పీడనం గరిష్ఠం). ప్రస్పందన (A) స్థానంవద్ద డోలన కంపన పరిమితి గరిష్ఠం (పీడనం కనిష్ఠం). ఈ అస్పందన, ప్రస్పందనాలు పీడన అస్పందన మరియు ప్రస్పందనాలతో ఏకీభవించవు. నిర్వచనాల నుండి స్పష్టంగా N, పీడన ప్రస్పందన మరియు A, పీడన అస్పందన స్థానాలతో ఏకీభవించును.

b) గబ్బిలాలు ఎక్కువ పౌనఃపున్యమున్న అతిధ్వనులను ఉద్గారం చేయును. ఈ తరంగాలు అవే మార్గంలో. వస్తువుల నుండి పరావర్తనం చెందును. అవి దూరం, దిశ, పరిమాణం మరియు వస్తువు స్వభావం గూర్చిన ఉపాయంను ఇస్తుంది.

c) వయోలిన్ మరియు సితార్ ల స్వర పౌనఃపున్యం సమానం, అప్పుడు అతిస్వరాలు ఏర్పడును. వాని ప్రతిచర్య బలాలు వేరుగా ఉండుట వలన రెండు స్వరాలను వేరుపరచవచ్చును.

d) ఘనపదార్థాలు, ఘనపరిమాణం స్థితిస్థాపకత మరియు వియోటన స్థితిస్థాపక కలిగి ఉండును. కాని వాయువు ఘనపరిమాణ స్థితిస్థాపకతను మాత్రమే కల్గి ఉండును.

e) ధ్వని సంకేతం, వేర్వేరు తరంగదైర్ఘ్యాలగల తరంగాల సంయోగం వేర్వేరు తరంగదైర్ఘ్యాలగల తరంగాలు యానకంలో వేర్వేరు వడులతో వేర్వేరుగ ప్రయాణించును. కావున ధ్వని తరంగ సంకేతము విరూపణ చెందును.

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 20.
ఒక రైల్వే స్టేషన్లో బయటి సిగ్నల్ వద్ద నిలబడిన రైలు నిలకడ గాలిలో 100 Hz పౌనఃపున్యంతో ఈల వేసింది. i) ఆ రైలు (a) 10ms-1 వడితో ప్లాట్ఫామ్న సమీపిస్తున్నప్పుడు, b) 10 m s-1 వడితో ప్లాట్ఫామ్ నుంచి దూరంగా పోతున్నప్పుడు, ప్లాట్ఫామ్ మీద పరిశీలకుడు వినే ఈల పౌనఃపున్యం ఏమిటి? ii) ప్రతి సందర్భంలో ధ్వని వడి ఎంత?’ నిలకడ గాలిలో ధ్వని వడిని 340 m s-1 గా తీసుకోవచ్చు?
సాధన:
v = 400Hz, υ = 340m/s-1

a) ప్లాట్ఫాం దగ్గరకు రైలు సమీపిస్తుండగా ఉంటే,
υ = 10m/s
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 65

b) రైలు ప్లాట్ఫాంను వదులుతూ ఉన్నప్పుడు,
υs = 10m/s
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 66

ii) ప్రతి సందర్భంలో ధ్వని సమానం = 340m/s

ప్రశ్న 21.
ఒక రైల్వే స్టేషన్-ప్రాంగణ స్థలం (station-yard)లో నిల్చున్న రైలు నిలకడ గాలిలో 400 Hz ల పౌనః పున్యంతో ఈల వేసింది. 10ms-1 వడితో స్థలం నుంచి ప్రాంగణం దిశలో పవనం వీయడం మొదలయితే ఆ ప్రాంగణ ప్లాట్ఫామ్ మీద నిల్చొన్న పరిశీలకుడు వినే ధ్వని పౌనఃపున్యం, తరంగదైర్ఘ్యం, వడి ఎంత? ఈ పరిస్థితి గాలి నిలకడగా ఉండి, పరిశీలకుడు స్థలంవైపు 10 m s-1 వడితో పరిగెత్తే సందర్భంతో కచ్చితంగా సర్వసమంగా ఉంటుందా? నిలకడ గాలిలో ధ్వని వడిని 340 m s-1 గా తీసుకోవచ్చు.
సాధన:
v = 400 Hz, υm = 10ms-1, υ = 340m/s-1
గాలి ధ్వని ప్రయాణ దిశలో చలిస్తే, ధ్వని తుల్యవడి
= υ + υm = 340 + 10 = 350m/s-1
జనకం మరియు పరిశీలకుడు విరామ స్థితిలో ఉంటే, పౌనఃపున్యం మారదు.
i.e. v = 400 Hz.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 67

జనకం విరామ స్థితివద్ద ఉంటే, తరంగదైర్ఘ్యం మారదు.
i.e, λ¹ = λ = 0.875M.
ధ్వని వడి = υ + υm = 340 + 0 = 340 m/s
పై రెండు సందర్భాలలో పరిస్థితులు పూర్తిగా వేరుగా, ఉండును.

అదనపు అభ్యాసాలు Additional Exercises

ప్రశ్న 22.
ఒక తంత్రిపై ప్రయాణించే ఒక హరాత్మక తరంగాన్ని ఈ విధంగా వర్ణిస్తే,
y(x, t)= 7.5 sin (0.0050x + 12t + π/4)
a) x = 1 cm, t = 1 s వద్ద ఉన్న ఒక బిందువు డోలన స్థానభ్రంశం, వేగం ఎంత? ఈ వేగం తరంగ ప్రసార వేగానికి సమానంగా ఉంటుందా?
b) t = 2s,11s ల వద్ద x = 1 cm బిందువులాగా స్థానభ్రంశాలు, వేగాలు కలిగి ఉన్న బిందువుల స్థానాలను గుర్తించండి.
సాధన:
a) హరాత్మక తరంగము y(x, t)
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 68
(1) నుండి, y(1, 1) = 7.5 sin (732.55°)
= 7.5 sin (720 + 12.55°)
7.5 sin12.55° = 7.5 × 0.2173 = 1.63 cm
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 69
= 90 cos (732.55°)
= 90 cos(72) + 12.55°)
υ = 90 cos (12.55°)
= 90 × 0.9765
= 87.89 cm/s.
ఇచ్చిన సమీకరణంను ప్రమాణ రూపంతో పోల్చగా
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 70
x = 1 cm t = 1 sec వద్ద వేగం, తరంగ ప్రసార వేగంనకు సమానం కాదు.

b) x = 1cm నుండి అన్ని స్థానాల దూరాలు ±λ, ± 2λ, ± 3λ లు ఒకే తిర్యక్ స్థానభ్రంశము మరియు వేగం కలిగియుండును. λ = 12.56 m అయిన t = 2sec, 5 sec మరియు 11 sec ల వద్ద x = 10m నుండి అన్ని స్థానాల దూరాలు ±12.6m, ±25.2m ,±37.8m

ప్రశ్న 23.
ఒక సన్నని ధ్వని స్పందనను (ఉదాహరణకు, ఒక చిన్న పిప్ (pip) ఈల) ఒక యానకం ద్వారా పంపారు. (a) ఆ స్పందనకు ఒక నిర్ణీత (i) పౌనఃపున్యం, (ii) తరంగదైర్ఘ్యం, (iii) ప్రసార వడి ఉంటాయా? (b) స్పందన రేటు ప్రతి 20 s తరవాత 1 ఉంటే (అంటే ఆ ఈలను ప్రతి 20 సెకనుల తరవాత రెండవ స్పందన వెలువడేటట్లు అతిస్వల్ప సెకండు వరకు ఊదితే) ఆ ఈల ఏర్పరచే స్వర పౌనఃపున్యం 1/20 లేదా 0.05 Hz లకు సమానం అవుతుందా?
సాధన:
a) ఒక చిన్న పిప్ ఈలను ఊదితే, నిర్దిష్ట తరంగదైర్ఘ్యంను మరియు నిర్దిష్ట పౌనఃపున్యం కలిగి ఉండవు. ప్రసార వడిని స్థిరంగా ఉంచితే, అది గాలిలో ధ్వని వడినకు సమానము.

b) కాదు. ఈల ఏర్పరచు ధ్వని పౌనఃపున్యం = 1/20 = 0.05 Hz. ఒక చిన్న పిప్ ఈల వల్ల పునరుత్పాదన పౌనఃపున్యం = 0.05 Hz

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 24.
రేఖీయ ద్రవ్యరాశి సాంద్రత 8.0 × 10-3 kg m-1 ఉన్న ఒక పొడవైన తంత్రి ఒక చివర విద్యుత్ నడిచే 256 Hz పౌనఃపున్యం గల ఒక శృతిదండానికి కలిపారు. రెండవ చివరను కప్పి మీదగా పోయేటట్లు చేసి 90 kg ద్రవ్యరాశి గల ఒక పళ్ళానికి కట్టారు. కప్పీ చివర వస్తున్న మొత్తం శక్తిని శోషించుకోవడంవల్ల ఆ చివర పరావర్తనం చెందే తరంగ కంపనపరిమితి ఉపేక్షించే విధంగా ఉంటుంది. t = 0 వద్ద, ఆ తంత్రి ఎడమ చివర (దండం చివర) ×=0, శూన్య తిర్యక్ స్థానభ్రంశం (y = 0) కలిగి ఉండి, ధన y-దిశలో చలిస్తుంది. ఆ తరంగ కంపనపరిమితి 5.0 cm. ఆ తంత్రిపై రంగాన్ని వర్ణించే తిర్యక్ స్థానభ్రంశం y ని x, tల ప్రమేయంగా వ్రాయండి.
సాధన:
m = 8.0 × 10-3 kgm-1, v = 256 Hz,
T= 90kg = 90 × 9.8 = 882N.
తరంగ వేగము, = 5.0m = 0.05m.
తీగవెంట ప్రసారించు తిర్యక్ తరంగ వేగము
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 71

తరంగము ధన x-అక్ష దిశలో ప్రసారమయితే, తరంగ సమీకరణము
y(x, t) = r sin (ωt – kx) = 0.05 sin (1.61 × 10³t – 4.84x)
ఇక్కడ x, y లు మీటర్లు మరియు t secలలో ఉండును.

ప్రశ్న 25.
ఒక జలాంతర్గామిలో అమర్చిన ఒక సోనార్ (SONAR) వ్యవస్థ 40.0 kHz పౌనఃపున్యం వద్ద పనిచేస్తుంది. ఆ సోనార్ వైపు ఒక శత్రు జలాంతర్గామి 360 km h-1వడితో చలిస్తుంది. ఆ శత్రు జలాంతర్గామి పరావర్తనం `చేసే ధ్వని పౌనఃపున్యం ఎంత? నీటిలో ధ్వని వడిని 1450 m s-1 గా తీసుకోండి.
సాధన:
సోనార్ పౌనఃపున్యం,
v = 40kHz = 40 × 10³ Hz.
పరిశీలకుని/శత్రు జలాంతర్గామి వడి
υL = 360 km/h 360 ×\(\frac{5}{18}\) ms-1 = 100ms-1

నీటిలో ధ్వని తరంగ వడి υ = 1450 ms-1.

నిశ్చల స్థితిలో ఉన్న జనకంవైపు పరిశీలకుడు చలిస్తున్నప్పుడు, శత్రు జలాంతర్గమి గ్రహించే దృశ్య పౌనఃపున్యము
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 72

ఈ పౌనఃపున్యంను శత్రు జలాంతర్గామి (జనకం) పరావర్తనం చేయును. దీనిని సోనార్ పరిశీలించును. ఈ సందర్భంలో
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 73

ప్రశ్న 26.
భూకంపాలు భూమిలోపల ధ్వని తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. ఒక వాయువు లాగా కాకుండా భూమిలో తిర్యక్ (S), అనుదైర్ఘ్య (P) ధ్వని తరంగాలు రెండూ ప్రసరిస్తాయి. విలక్షణంగా S తరంగ వడి సుమారు 4.0 km s-1. P తరంగానికి అది 8.0 km s-1. ఒక భూకంపం నుంచి ఒక భూకంపలేఖిని (seismograph P, S తరంగాలను నమోదు చేస్తుంది. మొదటి P తరంగం మొదటి S తరంగం కంటే 4 నిమిషాలు ముందుగా చేరుతుంది. ఆ తరంగాలు సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తాయని ఊహిస్తే, ఆ భూకంపం ఎంత దూరంలో సంభవించినట్లు?
సాధన:
S తరంగాలు మరియు తరంగాల వేగాలు υ1 మరియు υ2. సెస్మోగ్రాఫ్ను చేరుటకు వాటికి పట్టుకాలాలు t1 మరియు t2. సెస్మోగ్రాఫ్ నుండి భూకంపం ఏర్పడిన దూరం 1.
అప్పుడు l = υ1t1 = υ2t2 ……… (i)
υ1 = 4 kms-1 మరియు υ2 = 8 kms-1
∴ 4t1 = 8t2 లేక t1 = 2t2 ……… (ii)
t1 – t2 = = 4min = 240s.

(ii) నుపయోగించి 2t2 – t2 = 240s, t2 = 240s
(i) నుండి l = υ1t1 = 4 × 480 1920 km.
కావున భూకంపం, భూకంపలేఖిని నుండి 1920 km వద్ద ఏర్పడును.

ప్రశ్న 27.
ఒక గబ్బిలం తన రెక్కలను రెపరెపలాడిస్తూ అతిధ్వని శబ్దాల ద్వారా మార్గాన్ని నిర్దేశించుకొంటూ ఒక గుహలో అటు ఇటు తిరుగుతుంది. గబ్బిలం వెలువరిచే ధ్వని పౌనఃపున్యాన్ని 40 kHz గా ఊహించండి. ఆ గబ్బిలం గాలిలో ధ్వని వడికి 0.03 రెట్ల వడితో చలిస్తున్నప్పుడు, ఎదురుగా ఉన్న ఒక పెద్ద గోడ ఉపరితలాన్ని దూరం నుంచి అకస్మాత్తుగా ఎదుర్కొన్నది. ఆ గోడ నుంచి పరావర్తనాన్ని ఆ గబ్బిలం ఎంత పౌనఃపున్యంతో వింటుంది?
సాధన:
గబ్బిలం వెలువరించు ధ్వని పౌనఃపున్యం, v = 40kHz.
గబ్బిళం వడి υs = 0.03υ, ఇక్కడ υ ధ్వని గోడను తాకు ధ్వని దృశ్య పౌనఃపున్యం,
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 74

ఈ పౌనఃపున్యంను గోడ పరావర్తనం చెందించును మరియు గబ్బిలం గోడవైపు చలించేటప్పుడు గ్రహించును. అందువలన υs = 0.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 75

సాధించిన సమస్యలు Textual Examples

ప్రశ్న 1.
క్రింద ఇచ్చిన తరంగ చలనానికి కొన్ని ఉదాహరణలు. ప్రతి సందర్భంలో తరంగ చలనం తిర్యక్, అనుదైర్ఘ్య లేదా ఆ రెండింటి కలయికలలో ఏది అవుతుందో తెలపండి.
a) ఒక అనుదైర్ఘ్య స్ప్రింగ్ ఒక చివరను పక్కలకు స్థానభ్రంశం చెందిస్తే, ఆ స్ప్రింగ్లో ఉత్పన్నమయ్యే నొక్కు (kink) చలనం.
b) ద్రవంతో నిండిన స్తూపం ముషలకం (piston) స్థానాన్ని ముందుకు, వెనకకు కదిలిస్తే స్తూపంలో ఉత్పన్నమయ్యే తరంగాలు.
c) మోటారు పడవను నీటిలో నడిపినప్పుడు ఉత్పన్నమయ్యే తరంగాలు
d) కంపించే క్వార్డ్ స్పటికంపల్ల ఉత్పన్నమయ్యే గాలి లోని అతిధ్వని తరంగాలు.
సాధన:
a) తిర్యక్, అనుదైర్ఘ్య
b) అనుదైర్ఘ్య
c) తిర్యక్, అనుదైర్ఘ్య
d) అనుదైర్ఘ్య

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 2.
ఒక తీగ వెంబడి ప్రయాణించే ఒక తరంగాన్ని ఈ విధంగా వర్ణించారు. y(x, t) = 0.005 sin (80.00 x 3.0t), ఇందులో సంఖ్యా స్థిరాంకాలు SI ప్రమాణాలలో ఉన్నాయి (0.005 m, 80.0 rad m-1, 3.00 rad s-1) ఆ తరంగం (a) కంపనపరిమితి, (b) తరంగదైర్ఘ్యం, (c) ఆవర్తన కాలం పౌనఃపున్యాలను గణించండి. x = 30.0 cm దూరం వద్ద, కాలం t = 20 s వద్ద ఉన్నప్పుడు కూడా ఆ తరంగ స్థానభ్రంశం y ని గణించండి.
సాధన:
ఇచ్చిన స్థానభ్రంశ సమీకరణాన్ని y(x, t) = a sin (kx – ωt + Φ) తో పోల్చగా y(x, t) = a sin (kx – ωt) దీని నుంచి,
a) ఆ తరంగ కంపనపరిమితి 0.005m – 5 mm.
b) కోణీయ తరంగ సంఖ్య k, కోణీయ పౌనఃపున్యం ω లు k = 80.0 m-1, ω = 3.0 s-1 అని తెలుస్తాయి.
λ = \(\frac{2 \pi}{k}\) లేదా k = k = \(\frac{2 \pi}{\lambda}\)

అప్పుడు మనం సమీకరణం (1.6) ద్వారా తరంగ దైర్ఘ్యం λ ని k కి సంబంధపరుస్తాం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 76

c) ఇప్పుడు T ని ω పరంగా రాస్తే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 77
x = 30.0 cm, కాలం t= 20s వద్ద స్థానభ్రంశం
y = (0.005 m) sin (80.0 × 0.3 – 3.0 × 20)
= (0.005 m) sin (-36 + 12π)
= (0.005 m) sin (1.699)
= (0.005 m) sin (97°) ≅ 5 mm

ప్రశ్న 3.
0.72 m పొడవు గల ఒక ఉక్కు తీగ 5.0 × 10-3 kgల ద్రవ్యరాశి కలిగి ఉంది. ఆ తీగ 60 N తన్యతకు లోనయితే తీగపై తిర్యక్ తరంగ వడి ఎంత?
సాధన:
తీగ ఏకాంక పొడవుకు ద్రవ్యరాశి
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 78

ప్రశ్న 4.
ప్రామాణిక ఉష్ణోగ్రత, పీడనాల వద్ద గాలిలో ధ్వని వడిని అంచనావేయండి. 1 mole గాలి ద్రవ్యరాశి 29.0 × 103 kg.
సాధన:
ప్రామాణిక ఉష్ణోగ్రత, పీడనాలు (STP) వద్ద 1 mole ఏ వాయువైనా 22.4 లీటర్లు ఆక్రమిస్తుంది. అందువల్ల STP వద్ద గాలి సాంద్రత :

ρ0 (ఒక మోల్ గాలి ద్రవ్యరాశి) / (STP వద్ద ఒక మోల్ గాలి ఘనపరిమాణం).
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 79

యానకంలో ధ్వని వడికి న్యూటన్ ఫార్ములా ప్రకారం, STP వద్ద గాలిలో పొందగలిగే ధ్వని వడి,
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 80

ప్రశ్న 5.
30.0cm పొడవు గల ఒక గొట్టం రెండు చివరలు తెరచి ఉన్నాయి. ఆ గొట్టం ఏ అనుస్వరం 1.1 kHz జనకంతో అనునాదంలో ఉంటుంది ? ఆ గొట్టం ఒక చివరను మూసివేస్తే అదే జనకంతో అనునాదాన్ని గమనించవచ్చా? గాలిలో ధ్వని వడిని 330 ms-1 గా తీసుకోండి.
సాధన:
మొదటి అనుస్వర పౌనఃపున్యం,
v1 = \(\frac{υ}{\lambda_1}=\frac{υ}{2L}\) (తెరచిన గొట్టం)

ఇక్కడ L అనేది గొట్టం పొడవు. దాని nవ అనుస్వర పౌనఃపున్యం:
vn = \(\frac{nυ}{2L}\), n = 1, 2, 3, ……………. (తెరచిన గొట్టం)
తెరచిన గొట్టపు మొదటి కొన్ని కంపనరీతులు పటంలో చూపడమైంది.
L = 30.0 cm. υ = 330 m s-1

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 81

(a) తెరచిన గొట్టంలో స్థావర తరంగాలు, మొదటి నాలుగు అనుస్వరాలు :
స్పష్టంగా 1.1 kHz పౌనః పున్యం గల జనకానికి, గాలి స్తంభం υ2 వద్ద అనునాదం చెందగలదు. అంటే రెండడ అనుస్వరం వద్ద, ఇప్పుడు ఆ గొట్టం ఒక చివర మూసివేస్తే ప్రాథమిక పౌనఃపున్యం.
ν1 = \(\frac{υ}{\lambda_1}=\frac{υ}{4L}\) (ఒక చివర మూసిన గొట్టం)
బేసి సంఖ్య అనుస్వరాలు మాత్రమే, కింద చూపినట్లు, ఉంటాయి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 82

(2) ఒక చివర తెరచిన మరొక చివర మూసిన ఒక గాలి స్థంభపు సామాన్య కంపనరీతులు. కేవలం బేసి అనుస్వరాలు మాత్రమే సాధ్యమవుతున్నట్లు తెలుస్తుంది.
ν3 = \(\frac{3υ}{4L}\), ν5 = \(\frac{5υ}{4L}\)

L = 30 cm, υ = 3300 m s-1కు, చివర మూసిన గొట్టపు ప్రాథమిక పౌనఃపున్యం 275 Hz దాని నాల్గవ అనుస్వరానికి జనక పౌనఃపున్యం అనురూపంగా
ఉంటుంది.

ప్రశ్న 6.
A, B అనే రెండు సితార్ తంత్రులు ‘ద’ స్వరాన్ని వాయించేటప్పుడు వాటి కృతిలో కొద్ది తేడా వల్ల అవి 5 Hz పౌనఃపున్యం గల విస్పందనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. B తీగ తన్యతను కొద్దిగా పెంచితే విస్పందనాల పౌనఃపున్యం 3 Hz కు తగ్గినట్లు కనుక్కొన్నారు. A పౌనఃపున్యం 427 Hz అయితే B అసలు పౌనఃపున్యం ఎంత?
సాధన:
తీగ తన్యతలో పెరుగుదల దాని పౌనఃపున్యాన్ని పెంచుతుంది. B అసలు పౌనఃపున్యం (νB), A(νA), కంటే ఎక్కువగా ఉంటే, νB లోని మరింత పెరుగుదల విస్పందన పౌనః పున్యాన్ని పెంచుతుంది. కాని విస్పందన పౌనఃపున్యం తగినట్లు కనుక్కొన్నారు. దీని ద్వారా తెలిసేదేమిటంటే
νB < νA, νA – νB = 5 Hz, νA = 427 Hz కాబట్టి
νB = 422 Hz.

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 7.
ఒక రాకెట్ 200 m s-1 వడితో ఒక స్థిర లక్ష్యం వైపు చలిస్తున్నది. చలిస్తున్నప్పుడు అది 1000 Hz పౌనఃపున్యం గల ఒక తరంగాన్ని ఉద్గారిస్తుంది. లక్ష్యాన్ని చేరే ధ్వనిలోని కొంత భాగం ఒక ప్రతిధ్వనిలాగా రాకెట్ వైపుకు వెనుకకు పరావర్తనం చెందుతుంది. 1) లక్ష్యం గుర్తించిన ధ్వని పౌనఃపున్యాన్ని, 2) రాకెట్ గుర్తించిన ప్రతిధ్వని పౌనః పున్యాన్ని లెక్కించండి. [AP (Mar.’16)]
సాధన:
1) పరిశీలకుడు నిశ్చల స్థితిలో ఉన్నాడు. జనకం 200 msā వడితో చలిస్తుంది. ఇది ధ్వని వేగం 330 ms-1 తో పోల్చదగినదిగా ఉన్నందువల్ల
(\(\frac{1+υ_s}{υ}\))-1 సమీకరణం υ = υ0 ని ఉపయోగించాలి. కాని ఉజ్జాయింపు ని కాదు. జనకం స్థిరంగా
సమీకరణం ν0 (1 – \(\frac{υ_s}{υ}\))ఉన్న లక్ష్యాన్ని సమీపిస్తున్నందువల్ల υ0 = 0, νsని బదులు -υs ని తీసుకోవాలి. అందువల్ల,
υ0 = 0 (\(\frac{1+υ_s}{υ}\))-1
(దీనిలో ν0 జనకం ఉద్గారించే పౌనఃపున్యం).
ν = 1000 Hz × [1 – 200 m s-1/330 m s-1]-1 ≅ 2540 Hz

2) ఇప్పుడు లక్ష్యం జనకం (ఎందుకంటే ఇది ప్రతిధ్వని జనకం), రాకెట్ శోధకం ఇప్పుడు పరిశీలకుడు (ఎందుకంటే అది ప్రతిధ్వనిని గుర్తిస్తుంది). అందువల్ల, υ0 = 0, υ0 ఒక ధనాత్మక విలువను కలిగి ఉంటుంది. జనకం (లక్ష్యం) ఉద్గారించే ధ్వని పౌనః పున్యం ν లక్ష్యం అడ్డగించే ధ్వని పౌనఃపున్యం అవుతుంది. అది ν0 మాత్రం కాదు. అందువల్ల, రాకెట్ నమోదు చేసే పౌనఃపున్యం
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 83