AP Inter 2nd Year History Study Material Chapter 2 ప్రపంచ ప్రాచీన నాగరికత – మెసపిటోమియా – వ్రాత విధానం – నగర జీవనం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 2nd Lesson ప్రపంచ ప్రాచీన నాగరికత – మెసపిటోమియా – వ్రాత విధానం – నగర జీవనం Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 2nd Lesson ప్రపంచ ప్రాచీన నాగరికత – మెసపిటోమియా – వ్రాత విధానం – నగర జీవనం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న1.
మెసపిటోమియా నాగరికత ప్రధాన లక్షణాలు రాయండి.
జవాబు:
నాగరికత అనగా మానవ సమాజంలో వచ్చిన మేధాసంపత్తి, సాంస్కృతిక, నిత్యజీవన విధానంలో వచ్చిన అభివృద్ధి. అతి ప్రాచీన ప్రపంచ నాగరికతలలో మెసపిటోమియా నాగరికత మొదటిది. హరప్పా, ఈజిప్ట్, చైనా నాగరికతలు కూడా దాదాపుగా వీటి సమకాలీన నాగరికతలు. మెసపిటోమియా, ఈజిప్ట్ నాగరికతలు అక్కాచెల్లెళ్ళుగా ప్రసిద్ధికెక్కాయి. గ్రీకు భాషలోని ‘మెసోస్’, ‘పోటమస్’ అనే పదాల కలయికతో మెసపిటోమియా ఏర్పడింది. ఈ పదాలకు ‘రెండు నదుల మధ్య ప్రదేశం’ అని అర్థం. మెసపిటోమియా యూఫ్రిటిస్, టైగ్రిస్ అనే రెండు నదుల మధ్య ప్రదేశంలో ఉంది. ప్రస్తుతం ‘ఇరాక్’ అని పిలువబడుతున్న దేశమే మెసపిటోమియా నాగరికత కేంద్రం.

భౌగోళిక పరిస్థితులు: మెసపిటోమియాలో భిన్న భౌగోళిక పరిస్థితులుండేవి. పచ్చని మైదానాలు, ఎత్తు పల్లాలుగా ఉండే భూమి, జలపాతాలు, సెలయేర్లు, పూదోటలు, చక్కని వర్షపాతంతో, పంటలతో ఆహ్లాదకరంగా ఉండేది. వ్యవసాయం, పశుపోషణ ప్రజలకు ప్రధానాధారాలు. మెసపిటోమియా దక్షిణ దిక్కున ఎడారి ప్రాంతం ఉండేది. ఈ ప్రాంతానికి ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణులలో యూఫ్రిటిస్, టైగ్రిస్ నదులు జన్మించాయి. ఈ నదుల ప్రవాహం వలన సారవంతమైన మట్టితో ఆ పరిసర ప్రాంతాలు సారవంతమైన వ్యవసాయ మైదానాలుగా మారాయి.

రాజకీయ పరిస్థితులు: ‘గిల్గిమిష్’ అనే రాజు గురించి రెండు టేబ్లెట్స్ ద్వారా వివరించబడింది. గిల్గి మిష్ “ఉర్క్’ అనే నగర రాజ్య పాలకుడు. ఎంతోమంది ప్రజలకు సహాయపడిన నాయకుడు, గొప్ప స్నేహశీలి. తన ప్రియమిత్రుని మరణంతో విచారానికిలోనై, ప్రపంచంలో సుఖ, దు:ఖాలకు మరణానికి కారణాలు తెలుసుకోవాలని దేశ సంచారం చేసాడు. ఇతడు నగర నిర్మాణంలో ప్రసిద్ధిచెందాడు.

మెసపిటోమియా నగరాలు: 1930లో పురావస్తు శాఖ చేపట్టిన పరిశోధనలలో మెసపిటోమియాలోని అనేక ప్రాచీన నగరాలు బయల్పడ్డాయి.

‘ఉర్’ పట్టణం: ఈ పట్టణంలో వీధులు అతి సన్నగా ఉండేవి. కొన్ని ప్రాంతాలలో బండ్లు తిరగడానికి సాధ్యమయ్యేది. ఈ పట్టణ నిర్మాణానికి సరైన ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) లేదని తెలుస్తుంది.

బాబిలోనియా నగరం: ప్రపంచ నాగరికతలలో ప్రముఖ పట్టణం బాబిలోనియా. ఇది 850 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉండేది. ఈ పట్టణంలో గొప్ప రాజభవనాలు, దేవాలయాలు ఉండేవి. ఈ పట్టణాన్ని క్రీ.పూ 333లో అలెగ్జాండర్ ఆక్రమించినప్పటికీ గొప్ప నగరంగా పేరొందింది.

అబూసలాభిక్ పట్టణం: క్రీ.పూ. 2500 నాటి ఈ పట్టణం పది హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఈ పట్టణ తవ్వకాలలో చేప ఎముకలు, పంది ఎముకలు లభించాయి.

ఉరుక్ పట్టణం: క్రీ.పూ 3000 సంవత్సరానికి చెందిన ఈ నగరం దేవాలయాల నగరంగా పేరొందింది. ఇది దాదాపు 250 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది.

AP Inter 2nd Year History Study Material Chapter 2 ప్రపంచ ప్రాచీన నాగరికత - మెసపిటోమియా - వ్రాత విధానం - నగర జీవనం

ఆర్థిక పరిస్థితులు: మెసపీటోమియా నాగరికత ప్రపంచంలో వ్యవసాయ ప్రక్రియను ప్రారంభించిన నాగరికత. యూఫ్రటిస్, టైగ్రిస్ నదుల వలన వ్యవసాయం విస్తృతంగా సాగింది. గోధుమ, బార్లీ, వేరుశనగ పంటలు విస్తారంగా పండేవి. ప్రజలు గొర్రెలు, మేకలను విస్తృతంగా పోషించేవారు. ఖర్జూరం, తాటికాయలు వేసవిలో సమృద్ధిగా లభించేవి.

మెసపిటోమియా ప్రజలు టర్కీ, ఇరాన్ దేశాల వారితో ఎక్కువగా విదేశీ వ్యాపారాలు ఉండేవి. ఆహార పదార్థాలు, వస్త్రాలను టర్కీ, ఇరాన్లకు ఎగుమతి చేసి వారి నుండి కలప, రాగి, వెండి, బంగారం, సముద్రగవ్వలు, విలువైన రాతి ఆభరణాలు దిగుమతి చేసుకునేవారు. ఎగుమతి, దిగుమతులకు మెసపిటోమియాలోని సహజసిద్ధమైన నదీ మార్గాలు వారికెంతగానో ఉపయోగపడ్డాయి. నాడు ‘మేరీ పట్టణం’ ప్రముఖ నౌకా రవాణా పట్టణంగా వెలుగొందింది.

సాంఘిక పరిస్థితులు: మెసపిటోమియా నాగరికత నగర జీవనానికి ప్రసిద్ధిగాంచింది. అనేక నగరరాజ్యాలు ఏర్పడ్డాయి. వాటి చుట్టూ చిన్న చిన్న గ్రామాలు విస్తరించి ఉండేవి. ఉర్ అబూసలాభిక్, ఉరుక్ ఇటువంటి నగరాలే, బాబిలోనియా నాటికే ప్రసిద్ధి చెందిన మహానగరం.

నాటి సమాజంలో ధనవంతులు, సాధారణ ప్రజల మధ్య వ్యత్యాసం స్పష్టంగా ఉండేది. ధనవంతులు మరింత ధనవంతులు కాగా సామాన్యులు తమ జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి నిరంతరం కృషి చేసేవారు.

మెసపిటోమియా నాగరికత నాటి కుటుంబాలు చిన్నవిగా ఉండేవి. తండ్రి కుటుంబానికి పెద్ద. వివాహసమయంలో కానుకలు ఇచ్చి పుచ్చుకోవడం ఉండేవి. తండ్రి ఆస్తికి కుమారుడు మాత్రమే హక్కుదారులు. కుమారైలకు బహుమతులు ఇచ్చేవారు.

మెసపిటోమియా నాగరికతలో ప్రజలు స్థానిక దేవతలను పూజించడానికి నిర్మించుకున్న దేవాలయాలను జిగూరత్లను నిర్మించుకున్నారు. వీటిని స్వర్గానికి, భూమికి మధ్య వారధిగా భావించేవారు. ప్రజలకు మూఢనమ్మకాలు ఎక్కువని తెలుస్తుంది.

శాస్త్ర – సాంకేతిక అభివృద్ధి:
వ్రాత విధానం అభివృద్ధి: ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా అక్షరాలు రాసే విధానం, జరిగిన సంఘటనలు, లెక్కలు మొదలైన వాటిని రాయడం ప్రారంభించినవారు మెసపిటోమియా ప్రజలు. సుమారు ఐదువేల సంవత్సరాలకు మనుపు రాత విధానాన్ని ప్రారంభించారు. మొదట్లో ఎక్కువగా చిత్రాలు కనిపించేవి. కాలక్రమంలో పదాలు, అర్థాలకు తగిన చిహ్నాలు అభివృద్ధి చెందాయి. ఈ పద్ధతిని ‘క్యూనిఫారమ్’ అంటారు. వీటిని మట్టిబిళ్ళలు సున్నపుముద్ద బిళ్ళలపై రాయించుట, చిత్రించుట ప్రారంభించారు. వీటిని ‘టేబ్లెట్స్’ అంటారు. వీటి వలన అనేక వివరాలు చరిత్రకారులు గ్రహించగలిగారు.

మెసపిటోమియా ప్రజలు ప్రపంచానికి అందించిన గొప్పకానుకలలో గణితశాస్త్ర అభివృద్ధి, కాలనిర్ణయ శాస్త్రం ప్రధానమైనవి. సంఖ్యాశాస్త్రంలో 6 మరియు 10 గుణకాలకు ప్రాధాన్యం ఉండేది. గుణకాలు, విభజనలు, స్క్వేర్, స్క్వేర్రూటు వంటివి మట్టిబిళ్ళలలో లభించాయి. మెసపిటోమియా వాసులు సంవత్సరానికి 12 నెలలు, నెలకు 30 రోజులు, వారానికి 7 రోజులు, గంటకు 60 నిముషాలు అనే కాల నిర్ణయ విభజనను కనుగొన్నారు. ఈ విధానం ఐరోపా, మధ్య ఆసియా దేశాలకు వ్యాపించింది. ఈ విధంగా నగర జీవనానికి, శాస్త్రీయ అభివృద్ధికి మెసపిటోమియా నాగరికత నాంది పలికింది.

ప్రశ్న 2.
వ్రాత విధానంలో మెసపిటోమియా నాగరికత పాత్ర తెలుపుము.
జవాబు:
ప్రాచీన సమాజంలోని ప్రజలు వివిధ శబ్దాలను తమ భావాలను వ్యక్తపరుచుకోవడానికి ఉపయోగించారు. వ్రాత పద్ధతి అనగా ‘ప్రజలు మాట్లాడే పదాలకు కంటికి కనబడే చిహ్నాలు’. ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా అక్షరాలు రాసే విధానం, జరిగిన సంఘటనలు, లెక్కలు మొదలైన వాటిని రాయడం ప్రారంభించినవారు. మెసపిటోమియా ప్రజలు. సుమారు ఐదు వేల సంవత్సరాలకు మునుపు మెసపిటోమియా ప్రజలు తమ భావాలు, వివరాలు, లెక్కలు వంటి వివరాలను భద్రపరచుకోవడానికి వ్రాత విధానాన్ని ప్రారంభించారు. మొదట ఈ లిపిలో ఎక్కువగా చిత్రాలు కనిపించేవి. ఆ కాలం నాటి పంటలు, వాటిపై ప్రభుత్వం విధించే పన్నుల వివరాలు ఈ చిత్రాల ద్వారా వివరించబడ్డాయి. కాలక్రమంలో వ్రాత విధానం ప్రాధాన్యత పెరిగి కొన్ని పదాలు వాటి అర్థానికి తగిన చిహ్నాలు అభివృద్ధి చెందాయి. ఈ పద్దతిని ‘క్యూనిఫారమ్’ అంటారు.

వేల సంవత్సరాల క్రితం మెసపిటోమియా వాసులు ప్రతిరోజు జరిపే లావాదేవీలు, వ్యాపారం, నక్షత్ర పరిశోధనలు, సాహిత్యం మొదలైన వాటిని మట్టిబిళ్ళలపై వ్రాయించుట, చిత్రించుట ప్రారంభించారు. వీటిని టేబ్లెట్స్ అంటారు. క్రీ.పూ 3200 కాలంలో మొదటిసారి మట్టిబిళ్ళపై వ్రాత ప్రారంభమయింది. ఈ బిళ్ళలు మట్టితోను, రాళ్ళతోను తయారుచేయబడ్డాయి. వాటి మీద చిహ్నాలు, అంకెలు ఎక్కువగా కనపడేవి. దక్షిణ మెసపిటోమియా ప్రాంతంలోని ‘ఉరుక్’ నగరంలో ఇటువంటి ‘మట్టిబిళ్ళలు’ లభించాయి. సమాజం అభివృద్ధి చెందే కొద్దీ మానవ వ్యవహారాలను రాసి భద్రపరుచుకోవలసిన అవసరం పెరుగుట వలన వ్రాత విధానం ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. మెసపిటోమియా నాగరికత నగర జీవితానికి సంబంధించినందు వలన ప్రజల మధ్య అనేక రకాలైన వ్యవహారాలు, వృత్తులు, వస్తువిక్రయాలు జరిగి వాటిని వ్రాతపూర్వకంగా భద్రపరచుకోవలసిన అవసరం ఏర్పడింది.

మట్టిబిళ్ళలు – టేబ్లెట్స్: మెసపిటోమియా వాసులు సున్నపు ముద్దతో తయారుచేసిన బిళ్ళలను ఉపయోగించారు. అరచేతిలో సరిపడే సున్నపు ముద్దబిళ్ళ తడిగా ఉన్నప్పుడు దాని ఉపరితలాన్ని నునుపుగా తయారుచేసి దానిపై పదునుగా ఉండే సూదిలాంటి పరికరంతో వివరాలు చెక్కేవారు. తడిగా ఉన్నప్పుడు రాసిన ఈ పలకలను ఎండబెడితే అవి చెరగని ముద్రలతో బిళ్ళలుగా తయారయ్యేవి. అనేక వ్యవహారాలు వ్యాపార లావాదేవీలు ఇటువంటి బిళ్ళలపై చెక్కుట వలన వేల సంఖ్యలో బిళ్ళలు లభించాయి. వీటి ద్వారా చరిత్రకారులు అనేక విషయాలు తెలుసుకోగలిగారు.

క్యూనీఫారమ్: క్రీ.పూ. 2600 నాటికి మెసపిటోమియాలో రాత విధానం ‘క్యూనిఫారం’గా రూపొందింది. వారు వాడిన భాష సుమేరియన్ల అనేక రకాలైన పత్రాలు, నిఘంటువుల తయారీకి ఉపయోగపడింది. రాజపత్రాలు, భూముల, బదలాయింపు, స్థానిక సంప్రదాయాలు మొదలైనవి క్యూనిఫారమ్లో ఉపయోగించబడ్డాయి.

క్రీ.పూ. 2400 నాటికి సుమేరియా లిపికి బదులు అక్కాడియన్ లిపి వాడుకలోకి వచ్చింది. క్రీ.శ మొదటి శతాబ్ది వరకు మెసపిటోమియా ప్రజలు ఉపయోగించింది అక్కాడియన్ లిపి మాత్రమే. సుమారు రెండువేల సంవత్సరాలు ఈ అక్కాడియన్ లిపి వాడుకలో ఉంది.

AP Inter 2nd Year History Study Material Chapter 2 ప్రపంచ ప్రాచీన నాగరికత - మెసపిటోమియా - వ్రాత విధానం - నగర జీవనం

ప్రశ్న 3.
మెసపిటోమియా నగర జీవన విధానాన్ని గురించి రాయండి.
జవాబు:
మెసపిటోమియా నాగరికత నగరజీవితానికి ప్రసిద్ధిగాంచింది. అనేక నగరరాజ్యాలు ఏర్పడ్డాయి. వాటి చుట్టూ చిన్న చిన్న గ్రామాలు విస్తరించి ఉండేవి. పట్టణ ప్రజలు నగరరాజ్యాల పరిధిలో జీవించారు. సాధారణ నగరాలు 20వేల జనాభాతో ఉంటే అంతకంటే పెద్ద నగరాలలో జనాభా 50 వేల వరకు ఉండేది. బాబిలోనియా నాడు అతి పెద్ద నగరం. ఆ నగరంలో జనాభా లక్షమందికి పైన ఉండేవారు.

1930లో పురావస్తుశాఖ చేపట్టిన పరిశోధనలలో మెసపిటోమియాలోని అతి ప్రాచీన నగరాలు బయటపడ్డాయి. అందులో ‘ఉర్’ పట్టణం ఒకటి. ఈ పట్టణ నిర్మాణంలోని లక్షణాలను పరిశీలిస్తే వీధులు అతి సన్నగా ఉండుట వలన కొన్ని ప్రాంతాలకు మాత్రమే బండ్లు తిరగడానికి సాధ్యమయ్యేది. పట్టణ ప్రాంతంలో ఆహార ధాన్యాలు, కట్టెలు చేరవేయుటకు కంచరగాడిదలు ఉపయోగించేవారు. పట్టణ నిర్మాణానికి సరి అయిన ప్రణాళిక లేదు. మెసపిటోమియా నగర నిర్మాణంలో మూఢవిశ్వాసాలు ఎక్కువ. ‘ఉర్’ నగర శ్మశానవాటికలో రాజులు, సామాన్యుల సమాధులు లభించాయి.

ప్రపంచ నాగరికతలలో ప్రముఖ పట్టణం బాబిలోనియా. ఇది 850 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉండేది. దీని చుట్టూ మూడు రక్షణ గోడలు ఉండేవి. ఈ పట్టణంలో గొప్ప రాజభవనాలు, దేవాలయాలు ఉండేవి. ఈ పట్టణాన్ని క్రీ.పూ. 593లో ఆర్కిమేడియన్లు, క్రీ.పూ. 333లో అలెగ్జాండర్ ఆక్రమించాడు. నాటికే ఇది గొప్ప నగరంగా పేరుగాంచింది.

మెసపిటోమియా నాగరికతలో లభించిన మరొక ప్రముఖ పట్టణం ‘అబూసలాభిక్’ క్రీ.పూ. 2500 నాటి ఈ పట్టణం పది హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉండేది. ఈ పట్టణంలో చేపల ఎముకలు, పందుల ఎముకలు లభించాయి. కాబట్టి నాడు ఈ ప్రాంతంలో పందిని కూడా ఆహారంగా స్వీకరించినట్లు తెలుస్తుంది.

మెసపిటోమియా నాగరికతకు చెందిన మరో ప్రముఖ నగరం ఉరుక్. క్రీ.పూ. 3000 సంవత్సరాలకు చెందిన ఈ నగరం దేవాలయాల నగరంగా గుర్తింపు పొందింది. ఇది 250 హెక్టార్ల విస్తరించి ఉండేది. ఈ నగరం హరప్పా నాగరికతలోని మొహంజోదారో పట్టణం కంటే రెండు రెట్లు పెద్దది. క్రీ.పూ. 2800 ప్రాంతాలలో చుట్టు ప్రక్కల గ్రామాల నుండి వచ్చిన ప్రజలతో ఈ నగర విస్తీర్ణం 400 హెక్టార్లుకు పెరిగింది. ఈ నగరంలో అనేక దేవాలయాలు ఉండేవి. వీటి నిర్మాణానికి యుద్ధ ఖైదీలను, స్థానిక ప్రజలను ఉపయోగించేవారు. వీరికి రాజు ఉపాధి కల్పించేవాడు. దేవాలయ నిర్మాణానికి రోజుకు 4500 మంది కూలీలను ఐదు సంవత్సరాల వరకు పనిచేయించారు. నాటి శిల్పులు కూడా నైపుణ్యం కలిగి ఉండేవారు. కుమ్మరి చక్రం ద్వారా అనేక కుటీర పరిశ్రమలు వృద్ధి చెంది, కుండల తయారీ పెద్ద ఎత్తున చేపట్టబడింది.

రవాణా రంగం: పట్టణ నాగరికత అభివృద్ధిలో ప్రధాన అంశం రవాణా సౌకర్యం. అతి చౌకగా రవాణా చేయుటకు నదుల, సముద్ర రవాణా అతి ముఖ్యమైనవి. మెసపిటోమియా ప్రజలు నదుల ద్వారా పడవలలో ఆహార ధాన్యాలు రవాణా చేసుకునేవారు. ప్రాచీన మెసపిటోమియాలోని సహజసిద్ధ నదీమార్గాల ద్వారా వస్తురవాణా జరిగేది. |జమరిలియిన్ రాజు కాలంలో మేరీ పట్టణం ప్రముఖ నౌకా రవాణా కేంద్రం.

సమాజం: మెసపిటోమియా నాగరికత నాటి సమాజంలో ధనవంతులు, సాధారణ ప్రజల మధ్య వ్యత్యాసం స్పష్టంగా ఉండేది. ధనవంతులు మరింత ధనవంతులు కాగా, సామాన్యులు తమ జీవనాన్ని మెరుగుపరుచుకోవడానికి నిరంతరం కృషి చేసేవారు. ధనవంతులు, దేశంలోని అధికశాతం ధనాన్ని, బంగారం, ఆభరణాలు, కలపవస్తువులు, సంగీత పరికరాలు అనుభవించేవారు. ఉర్ నగరం రాజుల సమాధులలో విలువైన ఆభరణాలు లభించాయి.

కుటుంబ జీవనం: నాడు కుటుంబాలు చిన్నవిగా ఉండేవి. తండ్రి కుటుంబానికి పెద్ద. వివాహ సంబంధం విషయంలో వధువు, వరుని కుటుంబాల పెద్దలు ఒక ప్రకటన ద్వారా సమ్మతిని తెలిపేవారు. ఇరువర్గాలు బహుమతులు ఇచ్చి పుచ్చుకునేవారు. తండ్రి సంపాందించిన ఆస్తికి కుమారులు మాత్రమే హక్కుదారులు. కుమార్తెలకు కొంత మొత్తం బహుమతి రూపంలో లభించేది తప్ప, ఆస్తిలో హక్కు ఉండేది కాదు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మెసపిటోమియా భౌగోళిక పరిస్థితులు తెలుపుము.
జవాబు:
మెసపిటోమియా భౌగోళిక పరిస్థితులలో ఎంతో వైవిధ్యముండేది. పచ్చని మైదానాలతో, ఎత్తు పల్లాలుగా ఉండే భూమి, కొండల నుండి జాలువారే జలపాతాలు, సెలయేర్లు, అందమైన పూదోటలు, వర్షపాతం తద్వారా పండే పంటలు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే నీటి వనరులు వంటి అంశాలతో ఆహ్లాదకర వాతావరణం ఉండేది.
మెసపిటోమియాకు దక్షిణాన ఎడారి ప్రాంతం ఉండేది. ఈ ప్రాంతానికి ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణులలో యూఫ్రిటిస్, టైగ్రిస్ నదులు జన్మించాయి. ఆ నదులు ప్రవాహం వలన సారవంతమైన మట్టితో ఆ పరిసర ప్రాంతాలు సారవంతమైన వ్యవసాయ మైదానాలుగా మారాయి. క్రీ.పూ. 7000 6000 సంవత్సరాల మధ్య కాలంలో ఇక్కడ వ్యవసాయం ఆరంభమయిందని చరిత్రకారులు అంచనా. ఇక్కడి ప్రజలు వందలు, వేల సంఖ్యలో గొర్రెలను పెంచుతూ ఉత్తర మెసపిటోమియా పచ్చికబైళ్ళని ఉపయోగించుకుంటూ ప్రజలు జీవించారు.

ప్రశ్న 2.
బాబిలోనియా నగర ప్రాధాన్యత ఏమిటి ?
జవాబు:
ప్రపంచ నాగరికతలలో ప్రముఖ పట్టణం బాబిలోనియా. ఇది 850 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉండేది. దీని చుట్టూ మూడు రక్షణ గోడలు ఉండేవి. ఈ పట్టణంలో గొప్ప రాజభవనములు, దేవాలయములు ఉండేవి. ఆనాటి దేవాలయాన్ని ‘జిగూరత్’ అంటారు. ఈ జిగూరత్లు మెట్లు కలిగిన ఎత్తు నిర్మాణాలు. ఈ పట్టణాన్ని క్రీ.పూ. 593లో ఆర్కిమేడియన్లు ఆక్రమించారు. ఆ తరువాత కాలంలో క్రీ.పూ. 333లో అలెగ్జాండర్ ఆక్రమించారు. అప్పటికే బాబిలోనియా గొప్ప నగరంగా ప్రసిద్ధిగాంచింది.

ప్రశ్న 3.
మట్టిబిళ్ళలను టేబ్లేట్స్ అని ఎందుకంటారు ?
జవాబు:
వేల సంవత్సరాల క్రితం మొసపిటోమియా వాసులు ప్రతిరోజు జరిపే లావాదేవీలు, వ్యాపారం, నక్షత్ర పరిశోధనలు, సాహిత్యం మొదలైనవి మట్టిబిళ్ళలపై వ్రాయించుట, చిత్రించుట ప్రారంభించారు. అరచేతిలో సరిపోయే విధంగా ఈ |బిళ్ళలను మట్టితోను, రాతితోను, సున్నపు ముద్దలతోను తయారుచేసేవారు. అరచేతిలో సరిపడే సున్నపు ముద్ద బిళ్ళ తడిగా ఉన్నప్పుడు దాని ఉపరితలాన్ని నునుపుగా చేసి దానిపై పదునుగా ఉండే సూదిలాంటి పరికరంతో వివరాలు చెక్కేవారు. తడిగా ఉన్న వీటిని ఎండబెడితే అవి చెరగని బిళ్ళలుగా మారేవి. అనేక వ్యవహారాలు, వ్యాపార లావాదేవీలు ఈ బిళ్ళలపై చెక్కుట వలన వేలాదిగా టేబ్లెట్స్ లభిస్తున్నాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 2 ప్రపంచ ప్రాచీన నాగరికత - మెసపిటోమియా - వ్రాత విధానం - నగర జీవనం

ప్రశ్న 4. మెసపిటోమియా సామాజిక పరిస్థితులు రాయండి.
జవాబు:
మెసపిటోమియా నాగరికత నాటి సమాజంలో ధనవంతులు, సాధారణ ప్రజల మధ్య వ్యత్యాసం స్పష్టంగా ఉండేది. ధనవంతులు మరింత ధనవంతులు కాగా, సామాన్యులు తమ జీవనాన్ని మెరుగుపరుచుకోవడానికి నిరంతరం కృషి చేసేవారు. ధనవంతులు దేశంలోని అధికశాతం ధనాన్ని, బంగారం, ఆభరణాలు, కలపవస్తువులు, సంగీత | పరికరాలు అనుభవించేవారు. ‘ఉర్’ నగర రాజుల సమాధులలో విలువైన ఆభరణాలు లభించాయి.

మెసపిటోమియా నాగరికతలో కుటుంబాలు చిన్నవిగా ఉండేవి. తండ్రి కుటుంబానికి పెద్ద. వివాహ సమయంలో ఇరువర్గాలు బహుమతులు ఇచ్చి పుచ్చుకునేవారు. తండ్రి ఆస్తికి కుమారుడు మాత్రమే హక్కుదారులు, కుమార్తెలకు కొంత మొత్తం బహుమతి రూపంలో లభించేది తప్ప వారికి ఆస్తి హక్కు లేదు. నాటి ప్రజలు వ్యవసాయం, పశుపోషణ చేసేవారు. టర్కీ, ఇరాన్ వంటి దేశాలతో విదేశీ వ్యాపారం జరిగేది.

ప్రశ్న 5.
మెసపిటోమియా వ్రాత విధానం గురించి తెలుపుము.
జవాబు:
ప్రాచీన సమాజంలోని ప్రజలు వివిధ శబ్దాలను తమ భావాలను వ్యక్తపరుచుకోవడానికి ఉపయోగించారు. వ్రాత పద్ధతి అనగా ‘ప్రజలు మాట్లాడే పదాలకు కంటికి కనబడే చిహ్నాలు’. ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా అక్షరాలు రాసే విధానం, జరిగిన సంఘటనలు, లెక్కలు మొదలైనవి రాయడం ప్రారంభించినవారు మెసపిటోమియా ప్రజలు.
సుమారు ఐదువేల సంవత్సరాలకు మునుపు మెసపిటోమియా ప్రజలు తమ భావాలు, వివరాలు, లెక్కలు వంటి వివరాలను భద్రపరుచుకోవడానికి వ్రాత విధానాన్ని ప్రారంభించారు. మొదట ఈ లిపిలో ఎక్కువగా చిత్రాలు కనిపించాయి. ఆ కాలం నాటి పంటలు, వాటిపై ప్రభుత్వం విధించే పన్నుల వివరాలు ఈ చిత్రాల ద్వారా వివరించబడ్డాయి. కాలక్రమంలో వ్రాత విధానం ప్రాధాన్యత పెరిగి కొన్ని పదాలు, వాటి అర్థానికి తగిన చిహ్నాలు అభివృద్ధి చెందాయి. ఈ పద్ధతిని క్యూనిఫారమ్ అంటారు. క్రీ.పూ. 3200 కాలంలో మొదటిసారి మట్టిబిళ్ళపై వ్రాత ప్రారంభమైనట్లు చరిత్రకారులు నిర్ధారించారు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
క్యూనిఫారమ్.
జవాబు:
క్రీ.పూ. 3500 – 3200 సంవత్సరాల నాడే ప్రపంచ చరిత్రలో తొలిసారిగా అక్షరాలు రాసే విధానం ప్రారంభించినవారు మెసపిటోమియా ప్రజలు. వారు ప్రారంభించిన వ్రాత విధానంలో తొలినాళ్ళలో ఎక్కువగా చిత్రాలు కనిపించేవి. కాలక్రమంలో పదాలకు వాటి అర్థానికి తగిన చిహ్నాలు అభివృద్ధి చెందాయి. ఈ పద్ధతిని క్యూనిఫారం
అంటారు.

ప్రశ్న 2.
అక్కాడియన్ నాగరికత
జవాబు:
మెసపిటోమియా నాగరికత కాలక్రమంలో సమర్ ‘అక్కడ్’ ప్రాంతాలకు విస్తరించింది. తరువాత అక్కాడియన్ రాజ్యంగా రూపొందింది. అక్కాడియన్ రాజ్యం మెసపిటోమియాను చాలాకాలం పరిపాలించారు. ఈ నాగరికత సెమెటిక్ సుమేరియన్ భాషల వారిని ఒక పాలన క్రిందకు తెచ్చారు. క్రీ.పూ. 2400 నాటికి ఈ భాష అక్కాడియన్ భాషగా పిలవబడింది. ఈ కాలానికి ఈ నాగరికత ఉచ్ఛస్థితిలో ఉంది.

ప్రశ్న 3.
మేరీ భవనం.
జవాబు:
పురావస్తు త్రవ్వకాలలో లభించిన మరొక గొప్ప నిర్మాణం ‘మేరీ భవనం’. ఈ భవనం క్రీ.పూ. 1810-1760 మధ్య కాలంలో పరిపాలించిన జీమరిలియన్ నివాస భవనం. ఈ భవనం ఎంతో విలాసవంతమైనది, విశాలమైనది. ఇందులోని విశాలమైన హాలులో దేశ, విదేశీ అతిధులతో చర్చలు జరిగేవి. ఈ రాజభవనం అందమైన అలంకరణలతో సమారు రెండు నుండి నాలుగు హెక్టార్లలో విస్తరించి ఉండేది. ఇందులో 260 గదులుండేవని తెలుస్తోంది.

ప్రశ్న 4.
ఉరుక్ నగరం.
జవాబు:
మెసపిటోమియా నాగరికతకు చెందిన మరో ప్రముఖ నగరం. ‘ఉరుక్’. క్రీ.పూ. 3000 సంవత్సరానికి చెందిన ఈ నగరం దేవాలయాల నగరంగా గుర్తింపు పొందింది. ఇది 250 హెక్టార్లు విస్తరించి ఉండేది. ఈ నగరం హరప్పా నాగరికతలోని మొహంజోదారో పట్టణం కంటే రెండు రెట్లు పెద్దది. క్రీ.పూ 2800 మధ్య కాలంలో అనేక గ్రామాల నుండి ప్రజలు వచ్చి ఉరుక్ నగరాన్ని విస్తరించారు. దీనిలో నగర విస్తీర్ణం 400 హెక్టార్లకు పెరిగింది. ఈ నగరంలో అనేక దేవాలయాలు ఉండేవి. వీటి నిర్మాణానికి యుద్ధ ఖైదీలను, స్థానికులను వాడుకునేవారు.

ప్రశ్న 5.
గణితశాస్త్ర పరిస్థితులు.
జవాబు:
మెసపిటోమియా ప్రజలు గణితశాస్త్రంలో అనేక కొత్త విషయాలను కనుగొన్నారు. వారి సంఖ్యాశాస్త్రంలో మరియు 10 గుణకాలకు ప్రాధాన్యత ఉండేది. మొదటి క్రమంలో 10 సంఖ్య వరకు ప్రాధాన్యత ఉండేది. తరువాత 6తో కూడిన గుణకాలు ఉపయోగించి 60 నుండి 600 వరకు లెక్కించేవారు. బహుశా 60 అనే సంఖ్య అనేక సంఖ్యలతో విభజనకు అనుకూలంగా ఉండేది. క్రీ.పూ. 1800 సంవత్సరం నాటి మట్టిబిళ్ళలు మెసపిటోమియా గణితశాస్త్ర పరిశోధనకు నిదర్శనం. గుణకాలు, విభజనలు, స్క్వేర్, స్క్వేర్టు విధానాలు ఈ బిళ్ళలలో కనిపిస్తాయి.

ప్రశ్న 6.
యూఫ్రిటిస్, టైగ్రిస్ నదులు.
జవాబు:
మెసపిటోమియా యూఫ్రిటస్, టైగ్రిస్ నదుల మధ్య విలసిల్లిన నాగరికత. తూర్పు టర్కీలోని టారస్ పర్వతాలలో పుట్టి సిరియా మీదుగా ఇరాక్లో ప్రవేశిస్తాయి. తమ ఉపనదులతో కలిపి మెసపిటోమియా (నేటి ఇరాక్)లో సారవంతమైన మట్టిగల మైదాన ప్రాంతాలను ఏర్పరచాయి. దీనితో ఈ ప్రాంతం వ్యవసాయయోగ్య మైదానాలుగా మారాయి. ఈ విధంగా ప్రవహించి ఈ నదులు పర్షియన్ గల్ఫ్ లో కలుస్తాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 2 ప్రపంచ ప్రాచీన నాగరికత - మెసపిటోమియా - వ్రాత విధానం - నగర జీవనం

ప్రశ్న 7.
కాల నిర్ణయ విధానం.
జవాబు:
మెసపిటోమియా వాసులు సంవత్సరానికి 12 నెలలు, నెలకు 30 రోజులు, వారానికి 7 రోజులు, గంటకు 60 నిమిషాలు అనే కాల నిర్ణయ విభజన విధానాన్ని కనుగొన్నారు. ఈ కాల నిర్ణయ విధానం అలెగ్జాండర్ అనంతర కాలం నుండి ఎక్కువగా వాడుకలోకి వచ్చి రోమన్ సామ్రాజ్యానికి, అటు మహమ్మదీయ రాజ్యాలకు, మధ్య ఐరోపా దేశాలకు వ్యాపించింది.

AP Inter 2nd Year History Study Material Chapter 8 ఫ్రెంచి విప్లవం – 1789

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 8th Lesson ఫ్రెంచి విప్లవం – 1789 Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 8th Lesson ఫ్రెంచి విప్లవం – 1789

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఫ్రెంచి విప్లవమునకు ప్రధాన కారణాలు పేర్కొనుము.
జవాబు:
క్రీ.శ 1789లో జరిగిన ఫ్రెంచి విప్లవం ప్రపంచ చరిత్రలోని మహావిప్లవాలలో ఒకటిగా నిలిచింది. ఈ విప్లవం తరువాత ఐరోపాలో, ప్రపంచంలో పూర్వమున్నది ఏది పూర్వం వలె మిగుల లేదు. తరువాత తరాల మీద దాని ప్రభావం శాశ్వతంగా నిలిచింది. ఫ్రెంచి విప్లవం జరగడానికి అనేక కారణాలు తోడ్పడ్డాయి.

బూర్బన్ రాజవంశస్తుల నిరంకుశత్వం: ఫ్రెంచి విప్లవానికి బీజాలు 14వ లూయీ కాలంలోనే పడ్డాయి. 14వ లూయీ పూర్తి నిరంకుశుడు. ‘నేనే రాజ్యాన్ని’ అనేవాడు. ఎన్నో యుద్ధాలు చేసాడు. 15వ లూయీ కాలంలో కూడా నిరంకుశత్వం సాగింది. రాచరికం దైవదత్తమని ప్రజాసమ్మతితో పనిలేదని వీరి విశ్వాసం. రాజు తనకు నచ్చిన చట్టాలు చేయవచ్చును. తనకు తోచిన పన్నులు విధించవచ్చు. ప్రభుత్వాదాయాన్ని తనకు నచ్చినట్లుగా ఖర్చు చేసేవారు. రాజకుటుంబం ఎంతో విలాసవంతంగా బ్రతికేది. దేశ ప్రజలు దయనీయ స్థితిలో ఉండేవారు.

నాటి సాంఘిక పరిస్థితులు: నాటి ఫ్రెంచి సమాజం మూడు ప్రధాన వర్గాలుగా విభజింపబడింది. వీరు ప్రభువులు, మతాధిపతులు, సామాన్యప్రజలు. మొదటి రెండు వర్గాలు ప్రత్యేకమైన హక్కులు కలిగి ఉండేవారు. వీరికి ఎలాంటి పన్నులు చెల్లించవలసిన అవసరం లేదు. అన్నిరకాల పన్నులపై మినహాయింపు ఉండేది. మూడవ వర్గం వారు అధిక పన్నులు చెల్లిస్తూ తీవ్ర నిరాశ, నిస్పృహలలో ఉండేవారు. ఎలాంటి కరువు పరిస్థితులలోనయినా పన్నులు మాత్రం చెల్లించవలసిందే. అధిక పన్నుల భారం, బానిసత్వం, సకల కష్టాలు తీవ్రస్థాయికి చేరుకొని విప్లవానికి దోహదం చేసాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 8 ఫ్రెంచి విప్లవం - 1789

తత్త్వవేత్తలు బోధనలు: ఫ్రెంచి తత్త్వవేత్తలైన మాంటెస్క్యూ, ఓల్టేర్, రూసో బోధనలు విప్లవానికి ప్రజలను ప్రేరేపించాయి.

మాంటెస్క్యూ: మాంటెస్క్యూ విప్లవాన్ని బోధించలేదు, కానీ నిరంకుశత్వాన్ని విమర్శించాడు. అతని ప్రఖ్యాత గ్రంథం ‘స్పిరిట్ ఆఫ్ లాస్’ అనేక దేశముల పరిపాలనా విధానాలను పరిశీలించి రాయబడిన గ్రంథం. మాంటెస్క్యూ, ఇంగ్లాండ్ దేశములోని రాజకీయ అధికార వర్గం అన్నీ దేశముల కంటే ఉత్తమమైనదని భావించాడు.

ఓల్టేర్: ఐరోపా చరిత్ర తిరగరాసిన గొప్ప రాజకీయ తత్త్వవేత్త. ఇతడు మాంటెస్క్యూ సమకాలికుడు. ప్రభువులను మతాధిపతులను విమర్శించి చాలాసార్లు జైలుకు వెళ్ళాడు. రోమన్ కాథలిక్ మతాధిపతులు చేసే ఆకృత్యాలను తీవ్రంగా ఖండించేవాడు. ఇతని దృష్టిలో క్రైస్తవ మతం మానవుని ఆలోచనా స్వేచ్ఛకు అవరోధం కలిగిస్తుంది. అతడు తన శక్తివంతమైన వ్యంగ్య రచనలతో రాచరికాన్ని, చర్చిని లక్ష్యాలుగా చేసాడు.

రూసో: ఫ్రెంచి సమాజాన్ని సమూలంగా మార్చవలసిన అవసరం ఉందని తేల్చిచెప్పాడు. ఇతని ప్రఖ్యాత గ్రంథం ‘సోషల్ కాంట్రాక్ట్’ గ్రంథంలో ‘స్వేచ్ఛగా పుట్టిన మానవుడు అన్నిచోట్ల సంకెళ్ళతో బంధించి ఉన్నాడు’ అని పేర్కొన్నాడు. మానవుడు తన సామాజిక హక్కుల సాధనకై తిరుగుబాటు చేసేలా ఇతని రచనలు ప్రజలను చైతన్యవంతం చేసాయి. ఈ విధంగా మేధావి త్రయమైన మాంటెస్క్యూ, ఓల్టేర్, రూసోల రచనలు ఫ్రెంచి విప్లవానికి విత్తనాలుగా పని చేసాయి.

ఆర్థిక పరిస్థితులు: 14వ లూయీ పాలనాకాలంలో జరిగిన అనేక యుద్ధాలు, వైభవోపేతమైన దర్బార్ నిర్వహణ వ్యయం, 15వ లూయీ కాలం నాటికి అధికమైన ఋణాలు అమెరికా స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం అనేక రంగాలలో ప్రభుత్వ దుబారా వలన ఫ్రాన్స్ ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితికి చేరుకుంది. టుర్గాట్, నెక్కర్, కాలెగ్నెలను ఒకరి తర్వాత మరొకరని సంక్షోభంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి నియమించారు. కానీ ఫలితం లేకపోయింది. చివరకు 16వ లూయీ 175 సంవత్సరాల తర్వాత ఎస్టేట్ జనరల్స్ సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. తనకు కావలసిన ఆర్థిక వనరులను ఇది సమకూర్చగలదని భావించాడు. కానీ 16వ లూయీ ఆశించిన దానికి భిన్నంగా ఈ సమావేశం విప్లవానికి దారితీసింది.

అమెరికా విప్లవ ప్రభావం అమెరికా స్వాతంత్ర్యయుద్ధంలో బ్రిటీష్ వారిపై వ్యతిరేకతతో ఫ్రాన్స్ అమెరికా వారికి సహాయం చేసింది. ఎంతోమంది ఫ్రెంచివారు వాలంటీర్లుగా అమెరికా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. వారు అమెరికా నుంచి తిరిగి వచ్చాక, ఫ్రెంచి ప్రజలలో విప్లవ భావాలను రేకెత్తించి బూర్బన్ నిరంకుశత్వాన్ని కూలదోయాలని ప్రబోధించారు.

టెన్నిస్ కోర్ట్ శపథం: 1789 జూన్ 20న ఎస్టేట్ జనరల్ సమావేశం కొరకు సామాన్యులు రాజధానికి చేరుకున్నారు. కానీ అక్కడి సమావేశపు హాలు తలుపులు మూసిఉండడంతో వారు ప్రక్కనే ఉన్న టెన్నిస్కోర్ట సమావేశమైనారు. “మనమంతా ఎటువంటి పరిస్థితులలో విడిపోకుండా ఒకేదారిలో నడిచి, నూతన రాజ్యాంగము, నూతన పరిపాలనా వ్యవస్థ ఏర్పడేవరకు కలిసి పోరాడతాము”. అని శపథం చేసారు. దీనినే ‘టెన్నిస్కోర్ట్ శపథం’ అంటారు. నూతన రాజ్యాంగం రూపొందించే వరకు జాతీయ అసెంబ్లీని రద్దు చేయమని తాము మాత్రమే జాతీయ అసెంబ్లీ అని ప్రకటించుకున్నారు. మూడవ ఎస్టేట్స్ సభ్యులు రాజాజ్ఞలు ధిక్కరించడంతో విప్లవానికి శ్రీకారం చుట్టడం జరిగింది.

ప్రశ్న 2.
ఫ్రెంచి విప్లవంపై మేధావుల ప్రభావం ఎటువంటిది ?
జవాబు:
ఆధునిక యుగములో అనేక సంస్కరణలకు మూలకారణము సాహిత్యం. సాహిత్యం వలన కొత్త ఆలోచనలు ప్రారంభమై, ఆ ఆలోచనలు ఫ్రాన్స్ దేశమంతా వ్యాపించాయి. 18వ శతాబ్దంలో ఫ్రాన్స్లో విరబూసిన సాహిత్య, తత్త్వవేత్తల ప్రభావం వలనే ఫ్రెంచి విప్లవం ప్రారంభమైనదని చెప్పవచ్చు. మాంటెస్క్యూ, ఓల్టేర్, రూసో, డిడిరో వంటి గొప్ప మేధావులు వ్రాసిన గ్రంథాలు, వ్యాసాలు ఫ్రాన్స్ ప్రజల హృదయాలలో కొత్త ఆలోచనలు, రేకెత్తించడంలో సఫలీకృతమయ్యాయి.

మాంటెస్క్యూ (1685-1755): మాంటెస్క్యూ ప్రభువర్గ కుటుంబంలో జన్మించాడు. న్యాయశాస్త్రం చదువుకొని ‘బోర్డెక్స్’ పార్లమెంట్ లో న్యాయాధిపతిగా పని చేసేవారు. ఇరవై సంవత్సరాల నిరంతర కృషి చేసి ‘స్పిరిట్ ఆఫ్ లాస్’ అనే పుస్తకం రచించాడు. ఈ గ్రంథం అనేక దేశాల పరిపాలనా విధానాల పరిశీలన, రాజకీయ పరిస్థితుల విశ్లేషణకు సంబంధించినది. ఈ గ్రంథంలో వివిధ విషయాలపై చక్కని పరిశీలనతో కూడిన విశ్లేషణతో పాటు, వివిధ రాజకీయ వ్యవస్థలలో ఉన్న మంచి, చెడు లక్షణాలను వివరిస్తుంది. మాంటెస్క్యూ అనేక విషయాలపై వివరణాత్మక పరిశోధన జరిపాడు. ప్రతి రాజకీయ విశ్లేషణలో రెండు, మూడు మంచి సలహాలు, సూచనలు కూడా జోడించాడు.

మాంటెస్క్యూ ఇంగ్లాండ్ దేశములోని రాజకీయ అధికార వర్గం అన్ని దేశముల కంటే ఉన్నతమైనదని భావించాడు. కార్యనిర్వహణాశాఖ, న్యాయశాఖ వేరువేరుగా ఉండటం చాలా అవసరం అని భావించాడు. మాంటెస్క్యూ తన రచనలలో విప్లవాన్ని బోధించనప్పటికీ నిరంకుశత్వాన్ని విమర్శించాడు.

ఓల్టేర్ (1694–1778): ఐరోపా చరిత్రను తిరగరాసిన గొప్ప రాజకీయ తత్త్వవేత్త ఓల్టేర్. మేధావిగా చెప్పబడటానికి అన్ని అర్హతలున్న వ్యక్తి, ఇతను మాంటెస్క్యూ సమకాలికుడు. ఇతడు కవి, చరిత్రకారుడు, నాటకకర్త మరియు శాస్త్రవేత్త. తనదేశంలో సమానత్వం కొరకు పోరాటం జరగడానికి ఇతడు పగటిపూట మబ్బుల వలె, రాత్రిపూట వెలుగునిచ్చే నుంటవలె సహాయపడ్డాడు. ఇతడు ప్రభువుల వర్గాన్ని, మతాధిపతులను విమర్శించి చాలాసార్లు జైలుకు వెళ్ళాడు. ఇతనికి తన దేశంలో ప్రాణభయం ఉండటం వలన ఎక్కువ కాలం ఇతరదేశాలలో గడిపాడు. జైళ్ళలో ఖైదీలకు కల్పించే సదుపాయాలను, పెట్టే చిత్రహింసలను ఓల్టేర్ తీవ్రంగా ఖండించాడు. ఇతడు నాస్తికుడు కాదు. కాని రోమన్ క్యాథలిక్ మతాధిపతులు చేసే ఆకృత్యాలను తీవ్రంగా ఖండించేవాడు., వీరి వలన తను క్రైస్తవ మతానికి వ్యతిరేకం అని ప్రకటించాడు. ఇతని దృష్టిలో మానవుని ఆలోచనాశక్తికి, స్వేచ్ఛకు క్రైస్తవమతం అవరోధం కల్పించుతున్నది. ఇతను రాసిన వ్యాసాలలో రాజకీయ, మతాధికారులపై అనేక వ్యంగ్య విమర్శలు కలవు. ఓల్టర్ ప్రాజ్ఞ నిరంకుశ రాచరికాన్ని ఉత్తమమైన ప్రభుత్వంగా భావించినప్పటికీ ఫ్రాన్స్లో నిరంకుశ, సర్వాధికార, రాచరికపు చర్యలను తీవ్రంగా వ్యతిరేకించాడు. ఫ్రాన్స్ నిరంకుశ రాచరికంపై అతడు సాహితీ సాధనంతో పవిత్రయుద్ధాన్ని కొనసాగించాడు.

రూసో (1712–1778): మాంటెస్క్యూ, ఓల్టేర్, రూసోలు వ్యక్తి స్వేచ్ఛకొరకు సంస్కరణలు కావాలని ఆకాంక్షించాడు. కానీ రూసో విధానాలు, పద్ధతులు వేరుగా ఉంటాయి. రూసో మొత్తం సమాజాన్ని పునర్వ్యవస్థీకరించాలని భావించాడు. సమాజంలోని లోపాలను కొన్ని సవరణలతో కొనసాగించడం వలన వ్యక్తి స్వేచ్ఛకు కావలసిన స్వాతంత్ర్యం లభించదని విశ్వసించాడు.

18వ శతాబ్దం నాటి రూసో ప్రముఖ రాజకీయ రచన సోషల్ కాంట్రాక్ట్ (సామాజిక ఒడంబడిక) ప్రజలను చాలా ప్రభావితం చేసింది. ఈ గ్రంథం “మానవుడు జన్మతః స్వతంత్రుడే ఐనా ప్రతిచోటా శృంఖలాబద్దుడే” అనే తొలి వాక్యాలతో ప్రారంభమౌతుంది. ఇతని ఉద్దేశంలో మనిషి జన్మతః చాలా మంచివాడు, సంతోషంగా జీవించే వ్యక్తి. కానీ నాగరికత వలన ఇతడు అవినీతిపరుడుగా, విలువలు దిగజారిన వ్యక్తిగా మారాడు. అందుచేత మానవుడు తనకు నచ్చిన చట్టములు తయారు చేసుకోవాలి. “ప్రజలే సార్వభౌమాధికారం, ప్రజలందరికీ సమానత్వం ఈ సిద్ధాంతాలే ఫ్రాన్స్లోని సామాన్య ప్రజానీకాన్ని కదిలించివేసింది. అదే విధంగా ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేసింది. మానవులు తమ సామాజిక హక్కుల సాధనకై తిరుగుబాటు చేయాలనేది ఇతని రాజకీయ రచనల సారాంశం.

ఈ రచయితల బోధనలు, ఆనాటి నిరంకుశత్వ స్వభావాన్ని సమాజంలో గల లోపాలను తమ రచనా దృష్టితో – కేంద్రీకరించి, వాటికి వ్యతిరేకంగా ప్రజల ఉద్రేకాలను రెచ్చగొట్టడం ద్వారా పరోక్షంగా విప్లవానికి రంగం సిద్ధం చేసాయి. ఫ్రెంచి మేధావులు వేసిన విత్తనాలు ఫ్రాన్స్లో మంచి పంట పండించాయి. వారి రచనల వలన వచ్చిన మంచి ఫలితాలు విప్లవకాలంలోను, నెపోలియన్ పాలనాకాలంలోను స్పష్టంగా కనబడతాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 8 ఫ్రెంచి విప్లవం - 1789

ప్రశ్న 3.
మొదటి కాన్సల్స్ నెపోలియన్ నిర్వహించిన పాత్ర ఏమిటి ?
జవాబు:
ఫ్రాన్స్లో కొత్తగా తయారైన రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగి, దేశ పాలనా వ్యవస్థను నడపటానికి ఐదుగురు సభ్యులతో కూడిన డైరెక్టరేట్ ఏర్పాటు చేయబడింది. వారు సమర్థవంతంగా వ్యవహరించకపోవడంతో పరిపాలన అలకల్లోలంగా, అవినీతిమయంగా మారింది. ఆర్థిక వ్యవస్థ బలహీనపడి, పాలనావ్యవస్థ గాడితప్పి సంఘవిద్రోహ శక్తులు బలపడసాగారు.

దేశంలో అంతర్గతంగా అల్లకల్లోల స్థితి, డైరెక్టర్పాలన విఫల దశలో నెపోలియన్ విదేశీ దండయాత్రలు ముగించుకొని పారిస్ పట్టణంలో అడుగుపెట్టాడు. అవినీతి బాగా ముదిరిపోయి ప్రజలు విసిగిపోయి ఉన్న సమయం, నెపోలియన్ పరిస్థితిని తనకనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేయడానికి సిద్ధపడ్డాడు. ఫ్రాన్స్ దేశ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఫ్రాన్స్ భాషలో ఈ కుట్రను ‘కూపియట్” అంటారు. దీని అర్థం సైనికబలంతో విధ్వంసకర పద్ధతిలో ఆయుధ దాడితో ప్రభుత్వాన్ని నడిపే బాధ్యతను చేపట్టడం.

నవంబర్ 10, 1799లో సైనికకుట్ర జరిగింది. ఆ రోజున డైరెక్టరేట్లో శాసనసభ్యులు అయిన పెద్దల సభ. 500 మంది కౌన్సిల్ సభ్యుల సమావేశం పారిస్ పట్టణానికి దూరంగా ‘సెయింట్ క్లాడ్’ భవనంలో ఏర్పాటు చేయబడింది. ఆ సమావేశం జరుగుతుండగా నెపోలియన్ తన సైన్యంతో అక్కడకు చేరుకున్నాడు. నెపోలియన్ అతడి సోదరుడు లూసిన్ బోనపార్టీ సైన్యంతో సమావేశ మందిరంలో ప్రవేశించి శాసనసభ్యులను భయభ్రాంతులను చేసాడు. చాలా మంది సభ్యులు పారిపోయారు. సాయంత్రం ఈ కుట్రకు అనుకూలంగా ఉన్న కొద్దిమంది సభ్యులతోనే సమావేశం నిర్వహించి డైరెక్టరేట్ పరిపాలన రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. ప్రత్యామ్నాయంగా ముగ్గురు సభ్యులతో కూడిన ”కాన్సల్’ పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేసారు. ముగ్గురిలో ఒకరు నెపోలియన్ బోనపార్టీ. ఈ విధంగా నెపోలియన్ పాలనా అధికారాలను హస్తగతం చేసుకున్నాడు. నెపోలియన్ నిర్వహించిన ఈ సైనిక తిరుగుబాటుకు ప్రజల మద్ధతు లభించింది. ఈ ముగ్గురు కాన్సల్స్ ఆ సమావేశంలో అధికార బాధ్యతలు చేపట్టి స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాభాగస్వామ్యాలను పరిరక్షిస్తామని శపథం చేసారు.

మొదటి కాన్సల్స్ నెపోలియన్: ఫ్రాన్స్ దేశంలోని ఆంతరంగిక, విదేశీ పరిస్థితులు సక్రమంగా లేవని, ఈ స్థితిలో దేశాన్ని కాపాడగలవారు ఒక్క నెపోలియన్ మాత్రమే అని ప్రజల నమ్మకం. ఈ నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని నెపోలియన్ తన అధికారాన్ని బలపరుచుకున్నాడు. 1799లో తయారు చేయబడిన నూతన పాలనా వ్యవస్థను కాన్సల్ ప్రభుత్వం అంటారు. నాటి నుంచి నెపోలియన్ సర్వాధికారాలలో నియంతగా పాలించాడు. సైనిక అధిపతి అయిన నెపోలియన్ మొదటి కాన్సల్, మిగిలిన ఇద్దరు (అబెనైస్, డ్యూకోస్) ఇతర పరిపాలనా విభాగాలు పరిపాలించేవారు.

నెపోలియన్ దేశంలోని వివిధ పాలనా విభాగాలలో నూతనంగా ఉద్యోగులను నియమించాడు. నెపోలియన్ 1799 నుండి 1804 వరకు కాన్సల్గా పరిపాలన సాగించిన కాలం మరపురానిది. మొదటి కాన్సల్గా నెపోలియన్ విజయవంతం అయ్యాడు. ప్రజలు కోరుకున్న బలమైన ప్రభుత్వాన్ని ఇవ్వగలిగాడు. ఆ కాలంలో అనేక దీర్ఘకాలిక ఫలితాలనిచ్చే సంస్కరణలను రూపొందించడం జరిగింది. మొదటి చర్యగా దేశంలోని అరాచకాన్ని అణచివేసి, శాంతి భద్రతలు స్థాపించాడు. అవసరమైన చోట సైన్యాన్ని వినియోగించి శాంతిభద్రతలు నెలకొల్పాడు. ప్రభుత్వాధికారాన్ని పునరుద్దరించి, పన్నుల విధానాన్ని సంస్కరించి జాతీయాదాయాన్ని అభివృద్ధి చేసాడు. ఫ్రాన్స్ జాతీయ బ్యాంక్ ‘ది బ్యాంక్ ఆఫ్ ఫ్రాంస్’ స్థాపించి వ్యాపార వాణిజ్యాలను మెరుగుపరిచాడు.

నెపోలియన్ చేపట్టిన మరిన్ని చర్యలు: దేశప్రగతికి గణనీయమైన సేవలనందించిన వారిని గౌరవించడానికి ‘లిజియన్ ఆఫ్ ఆనర్’ ను ఏర్పాటు చేసాడు. విద్యా విషయాలపై ఆసక్తితో ఒక జాతీయ విద్యామండలిని ఏర్పాటు చేసాడు. ఫ్రెంచి విశ్వవిద్యాలయం స్థాపించాడు. అనేక వృత్తి విద్యాసంస్థలు ఏర్పాటు చేసాడు.

నెపోలియన్ సంస్కరణలలో పేరొందింది, శాశ్వత కీర్తిని తెచ్చి పెట్టింది ‘నెపోలియన్ కోడ్’ పౌరుల సమానత్వ సిద్ధాంతాలు ఈ చట్టంలో ప్రముఖ స్థానం వహించాయి. ‘పోప్’కు నెపోలియన్కు మధ్య 1801లో మత విషయాలపై జరిగిన ఒడంబడికను ‘కంకార్డెంట్’ అంటారు. దీనిని నెపోలియన్ రాజనీతిజ్ఞతకు నిదర్శనంగా భావిస్తారు.

నెపోలియన్ను ‘విప్లవం కన్నబిడ్డ’ అని అందరూ పొగిడారు. విప్లవం కోరుకున్న ఫలాలను సామాన్య ప్రజలకు అందించడంలో నెపోలియన్ సఫలీకృతుడైనాడు. చివరకు 1804లో నెపోలియన్ కాన్సల్ విధానాన్ని రద్దుచేసి తననుతాను ఫ్రాన్స్కు చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు.

AP Inter 2nd Year History Study Material Chapter 8 ఫ్రెంచి విప్లవం - 1789

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎస్టేట్ జనరల్.
జవాబు:
ఫ్రాన్స్ దేశంలో రాజుకు సహాయపడటానికి, సలహాలు ఇచ్చేందుకు ఎస్టేట్స్ జనరల్ అనే సంస్థ కలదు. మతాధిపతులు, ప్రభువులు మిగిలిన ఫ్రాన్స్ ప్రజానీకంతో ఎస్టేట్స్ జనరల్ ఏర్పడింది. ఆగమ్యగోచరంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి దివాళా తీసిన ఆర్థిక వ్యవస్థను కాపాడి బూర్బన్ రాజవంశస్థులను గట్టెక్కించడానికి | 16వ లూయీ క్రీ.శ. 1789లో 175 సంవత్సరాల తర్వాత ఎస్టేట్ జనరల్ సమావేశం పిలవబడింది. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి నెక్కర్ను ఆర్థిక సలహాదారునిగా నియమించడం జరిగింది.

1789 మే 5న ఎస్టేట్స్ జనరల్ సమావేశం జరిగింది. సుమారు 300 మంది ప్రభువుల వర్గం, 300 మంది మతాధిపతుల వర్గ ప్రతినిధులు, 600 మంది మూడవ వర్గ ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ఓటింగ్ పద్ధతి దగ్గర వివాదం ఏర్పడింది. మొదటి రెండు వర్గాలు ఎస్టేటు ఒక ఓటు ఉండాలని భావించగా, మూడవ ఎస్టేట్ సభ్యులు ఈ వాదనను తోసిపుచ్చి సభ్యునికొక ఓటు ఉండాలని వాదించారు. ఈ వివాదానికి పరిష్కారం దొరకనందున జూన్ 20, 1789న ఎస్టేట్స్ జనరల్ భవనాల దగ్గరలోని టెన్నిస్కోర్ట్లో మూడవ వర్గం వారు సమావేశమై ‘టెన్నిస్కోర్ట్ ప్రతిజ్ఞ చేసారు.’ దీనితో విప్లవానికి శ్రీకారం చుట్టినట్లయింది. 16వ లూయీ ఆశించిన దానికి భిన్నంగా ఎస్టేట్స్ | జనరల్ సమావేశం విప్లవానికి నాంది పలికింది.

ప్రశ్న 2.
రూసో (1712-1778).
జవాబు:
ఫ్రాన్స్ దేశాన్ని ప్రభావితం చేసిన మేధావి త్రయంలో రూసో ఒకరు. రూసో క్రీ.శ 1712లో జెనీవా నగరంలో జన్మించారు. మాంటెస్క్యూ, ఓల్టేర్లతో పోల్చిచూస్తే డీనా జాక్విస్ రూసో విధానాలు, పద్ధతులు వేరుగా ఉంటాయి. రూసో మొత్తం ఫ్రెంచి సమాజాన్ని సమూలంగా అవసరం ఉందని తేల్చి చెప్పాడు. సమాజంలోని లోపాలను కొన్ని సవరణలతో కొనసాగించడం వలన వ్యక్తి స్వేచ్ఛకై కావలసిన స్వాతంత్య్రం లభించజాలదని విశ్వసించాడు.

18వ శతాబ్దమందలి అతని ప్రముఖ రాజకీయ రచన “సామాజిక ఒడంబడిక” ప్రజలను చాలా ప్రభావితం చేసింది. ఈ రచన “మానవుడు జన్మతః స్వతంత్రుడే ఐన ప్రతిచోట శృంఖలాబద్ధుడే” అనే వాక్యంతో ఆరంభమౌతుంది. రూసో ఉద్దేశంలో మనిషి జన్మతః మంచివాడు. సంతోషంగా జీవించే వ్యక్తి కానీ, నాగరికత వలన ఇతడు అవినీతిపరుడుగా
విలువలు దిగజారిన వ్యక్తిగా మారాడు. అందుచేత మానవుడు తనకు నచ్చిన చట్టములు తయారు చేసుకోవాలి అని ప్రబోధించాడు. ప్రజలకే సార్వభౌమాధికారం, ప్రజలందరికీ సమానత్వం ఈ సిద్ధాంతాలే ఫ్రాన్స్లోని సామాన్య ప్రజానీక హృదయాలను తట్టి లేపాయి. అదేవిధంగా ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేసాయి.

ప్రశ్న 3.
బాస్టిలో కోట పతనం.
జవాబు:
పారిస్ పట్టణంలో సామాన్య ప్రజలు 16వ లూయీ జాతీయసభను అణచివేయడానికి చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకంగా దొమ్మీలు, దోపిడీలు, లూటీలు ప్రారంభించారు. బహుశా ప్రజల ఆందోళనకు దృష్టిలో పెట్టుకొని రాణి మేరి అంతు వానెత్ తన పుట్టిల్లు ఆస్ట్రియా నుండి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తెప్పించి తన నివాసమైన బాస్టిల్ కోటలో భద్రపరచింది. ఈ వార్తలు తెలుసుకున్న సామాన్యులు మరింత రెచ్చిపోయి ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు ధ్వంసం చేసారు. అక్కడితో ఆగకుండా 1789 జులై 14న బాస్టిలో కోటపై దాడి చేసారు.

AP Inter 2nd Year History Study Material Chapter 8 ఫ్రెంచి విప్లవం - 1789

కోటలో బంధించబడి ఉన్న రాజకీయ ఖైదీలను విడిపించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సామాన్యులు పారిస్ నగరంలో మునిసిపల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. 16వ లూయీ ఈ మార్పు అంగీకరించక తప్పలేదు. ఫ్రెంచి విప్లవం విజయవంతమైన తర్వాత ఆ దినాన్ని జాతీయ దినంగా ప్రకటించారు. ఎరుపు, తెలుపు, నీలి రంగులతో కూడిన నూతన త్రివర్ణపతాకాన్ని (కొకాడ్) ప్రవేశపెట్టారు. బూర్బన్ల తెల్లరంగు పతాకం తొలగించబడింది.

బాస్టిలో కోట పతనాన్ని నిరంకుశ రాచరిక అంతాన్ని సూచించేదిగా సమకాలీన రచయితలు దాన్ని గొప్ప సంఘటనగా ప్రశంసించారు.

ప్రశ్న 4.
ఫ్రెంచి విప్లవ ఫలితాలు.
జవాబు:
ఫ్రాన్స్ను విముక్తి చేసి స్వేచ్ఛా ప్రపంచంలోకి తీసుకురావటంలో ఎన్నో అడ్డంకులు ఏర్పడ్డాయి. నెపోలియన్ తనకు తాను చక్రవర్తిగా ప్రకటించుకోవడంతో విప్లవం విఫలం అయినట్లు భావించనక్కరలేదు. ఎందుకంటే విప్లవం కోరుకున్న అనేక ఫలములు సామాన్యుడికి అందించబడ్డాయి.

సమాజంలో ప్రభువులకు, మతాధిపతులకు గల ప్రాధాన్యం తొలగిపోయి, వ్యవస్థలో అనేక సంస్కరణలు ప్రారంభమైనాయి. చర్చి ప్రభుత్వానికి లోబడింది. క్రమంగా హేతువాద ప్రాముఖ్యం పెరిగింది. మూఢవిశ్వాసాలు, నమ్మకాలు క్రమంగా క్షీణించి, వాటి స్థానాన్ని హేతువాదం, శాస్త్రీయ దృక్పథం ఆక్రమించింది. విప్లవం కోరుకున్న స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వం ప్రజలకు అందించబడినవి. మానవ హక్కుల ప్రకటన ద్వారా ప్రపంచానికంతటకి ఫ్రాన్స్ మార్గదర్శి కాగలిగింది.

భూస్వామ్యవిధానం అంతం కావడం, బిరుదులు రద్దు కావడం, న్యాయస్థానాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, చట్టం ముందు అందరూ సమానులే అనే భావన ద్వారా దేశ ప్రజలలో సమానత్వం సాధించింది. బానిసత్వాన్ని రద్దు చేసారు. సామాన్యుని శక్తి ముందు రాజులు, ప్రభువులు, మతాధిపతులు అందరూ తలదించవలసిందే అని బుజువయింది. ఆసియా, ఆఫ్రికా ఖండంలోని అనేక దేశాలు ఫ్రెంచి విప్లవం వలన ప్రభావితం అయ్యాయి. ప్రజాస్వామ్య విధానాలు రాజ్యాంగ సవరణలు, ప్రజాప్రాతినిధ్యం మొదలైన అంశాలకు ఫ్రెంచి విప్లవంతోనే ప్రాధాన్యం పెరిగినట్లు పరిశీలకులు భావిస్తారు.

ప్రశ్న 5.
జాతీయసభ ప్రవేశపెట్టిన సంస్కరణలు.
జవాబు:
జాతీయసభ 1789 ఆగస్ట్ 4న దేశంలో భూస్వామ్యవ్యవస్థను రద్దు చేసారు. జాతీయ అసెంబ్లీ సభ్యులైన భూస్వాములు, జమీందార్లు ఒకరి తర్వాత మరొకరు తమ భూస్వామ్య అధికారాలు ప్రత్యేక హక్కులు వదులుకున్నారు. బానిసత్వం రద్దయింది. అలాగే మొదటి వర్గం మతాధిపతులు వసూలు చేస్తున్న ‘టైత్’ పన్నును రద్దు చేసారు.
1789, ఆగస్ట్ 26న నూతన జాతీయ అసెంబ్లీ మానవ హక్కుల ప్రకటన పత్రం విడుదల చేసింది. ఇందులో పౌరుల హక్కులు, వాటి అమలు గురించిన వివరాలు తెలియజేయబడ్డాయి. ఇది ఆధునిక యుగానికి ఒక వరంగా భావించబడింది. మానవ హక్కుల ప్రకటనలో గల పదిహేడు అంశాలలో మానవులందరూ సమానులేనని, ప్రజల చేతనే ప్రభుత్వ అధికారం నిర్ణయించబడుతుందని, శాసనాలు, చట్టాలు ప్రజల అభీష్టం మేరకు చేయబడతాయని ఈ ప్రకటన స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్రం, అసెంబ్లీలోని ప్రభుత్వంలో పాల్గొనడానికి అందరికీ సమాన అవకాశాలు కల్పించింది.

1791 నాటికి జాతీయ అసెంబ్లీ తయారు చేసిన మొదటి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. 745 మంది ఎన్నుకోబడిన సభ్యులతో, రెండు సంవత్సరాల పదవీ కాలంతో అసెంబ్లీ ఏర్పడింది. నామమాత్రపు అధికారాలతో చక్రవర్తి కొనసాగాడు. న్యాయవ్యవస్థను, స్థానిక పరిపాలనా వ్యవస్థను కూడా పునర్వ్యవస్థీకరించారు.

AP Inter 2nd Year History Study Material Chapter 8 ఫ్రెంచి విప్లవం - 1789

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
16వ లూయీ చక్రవర్తి.
జవాబు:
(1774 – 1793) ఫ్రాన్స్లో ఎంతోకాలం పేరుకుపోయిన సమస్యలన్నీ తన నెత్తిమీద వేసుకున్న దురదృష్టవంతుడు 16వ లూయీ చక్రవర్తి. అపరిష్కృత సమస్యలే ఫ్రెంచి విప్లవానికి కారణమయ్యాయి. ఫ్రాన్స్ను పాలించిన బూర్బన్ రాజవంశంలో చివరివాడు ఇతడే. 20 సంవత్సరాల వయసులోనే రాజయ్యాడు. ఇతడు మంచి భావాలు కలిగి ఉన్నవాడు, కానీ మనసుకు సరైన లక్ష్యం లేక పెద్దగా చదువుకోలేదు. నిర్ణయాలు తీసుకోవటంలో సంకోచం, మందకొండితనం, బద్దకం వంటి అవలక్షణాలు కలిగినవాడు. చెప్పుడు మాటలు విని నష్టపోయాడు. ఫ్రెంచి విప్లవం తర్వాత 16లూయీ రాజ్యాన్ని వదిలి పారిపోయే ప్రయత్నం చేసాడు. కానీ ‘వెర్నస్’ సరిహద్దులలో దొరికిపోయాడు. చివరకు కన్వెన్షన్ 1793లో ఇతనిని ఉరితీసింది.

ప్రశ్న 2.
మేరీ అంతు వానెత్.
జవాబు:
మేరీ అంతు వానెత్ (1755-1793) ఆస్ట్రియా రాణి మరియు థెరిస్సా కుమార్తె. ఫ్రెంచి యువరాజు 16వ లూయీని వివాహం చేసుకుంది. ఆమె అందమైనది, చురుకైనది. గట్టి నిర్ణయాలు తీసుకునే శక్తి, ధైర్యం మొదలైనవి ఆమె లక్షణములు. అయితే ఆమెకు విజ్ఞత, సామాన్య ప్రజల మనస్తత్వములు అర్థం చేసుకునే శక్తి లేదు. రాచ కుటుంబంలో జన్మించిన అంతు వానెత్కు తన కంటే తక్కువ ధనవంతుల పట్ల చులకన భావముండేది అంతు వానెల్కు చదువుట, వ్రాయుట కూడా తెలియదు. అహంకారం, గర్వం అతి ఆత్మవిశ్వాసం ఎక్కువ. చివరకు క్రీ.శ 1793లో విప్లవకారులు ట్రిబ్యునల్ విచారణలో దోషిగా తేల్చి ‘గిలిటిన్’ ద్వార మరణశిక్ష విధించారు.

ప్రశ్న 3.
టెన్సిస్ కోర్ట్ శపధం.
జవాబు:
1789 జూన్ 20న ఎస్టేట్స్ జనరల్ సమావేశం కొరకు సామాన్యులు రాజధాని చేరుకున్నారు. కానీ అక్కడ సమావేశం జరగవలసిన హాలు తలుపులు మూసిఉన్నాయి. ఎంతో ఉత్సాహంగా ఉన్న మూడవ వర్గం వారు ప్రక్కనే ఉన్న టెన్నిస్కోర్ట్ నందు సమావేశమయ్యారు. వారంతా ఏకకంఠంతో ఎట్టి పరిస్థితులలో విడిపోకుండా ఒకే దారిలో నడిచి, నూతన రాజ్యాంగము నూతన పాలనా వ్యవస్థ ఏర్పడే వరకు కలిసి పోరాడదాము” అని శపథం చేసారు. దీనినే ‘టెన్నిస్ కోర్ట్ శపథం’ అన్నారు.

AP Inter 2nd Year History Study Material Chapter 8 ఫ్రెంచి విప్లవం - 1789

ప్రశ్న 4.
ఓల్టేర్.
జవాబు:
ఐరోపా చరిత్రను తిరగరాసిన గొప్ప రాజకీయ తత్త్వవేత్త ఓల్టేర్ (1694-1778). ఇతడు కవి, చరిత్రకారుడు, నాటకకర్త మరియు శాస్త్రవేత్త. తన దేశంలో సమానత్వం కొరకు పోరాటం జరగడానికి ఇతడు పగటిపూట మబ్బులవలె, రాత్రి పూట వెలుగునిచ్చే మంటవలె సహాయపడ్డాడు. ప్రభువులను, మతాధిపతులను విమర్శించి ఎన్నోసార్లు జైలు పాలయ్యాడు. రోమన్ క్యాథలిక్ మతాధిపతులు చేసే ఆకృత్యాలను తీవ్రంగా ఖండించి వారి వలనే తాను క్రైస్తవమతానికి వ్యతిరేకం అని ప్రకటించాడు. ఇతని దృష్టిలో మానవుని ఆలోచనాశక్తికి, స్వేచ్ఛకు క్రైస్తవమతం అవరోధం కల్పిస్తున్నది. ఇతని వ్యాసాలలో రాజకీయ, మతాధిపతులపై అనేక వ్యంగ్య విమర్శలు కలవు.

ప్రశ్న 5.
మాంటెస్క్యూ,
జవాబు:
మాంటెస్క్యూ (1685-1755) ప్రభువర్గ కుటుంబంలో జన్మించాడు. న్యాయశాస్త్రం చదువుకొని బోరెక్స్ పార్లమెంట్లో న్యాయాధిపతిగా పనిచేసాడు. 20 సంవత్సరాల నిరంతర కృషి చేసి ‘స్పిరిట్ ఆఫ్ లాస్’ అనే పుస్తకం రచించాడు. ఈ గ్రంథం దేశాల పాలనా, రాజకీయ విధానాలపై నిశిత విశ్లేషణ. ఈ గ్రంథంలో రాజకీయ వ్యవస్థలోని మంచి, చెడులను వివరించాడు. మాంటెస్క్యూ ప్రకారం ఇంగ్లాండ్ దేశంలోని రాజకీయ అధికారం అన్ని దేశముల కంటే ఉన్నతమైనది. మాంటెస్క్యూ తన రచనలతో కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ వేరువేరుగా ఉండటం చాలా అవసరం అని పేర్కొన్నాడు.

ప్రశ్న 6.
గిలిటిన్.
జవాబు:
ఫ్రెంచి విప్లవంలో గిలిటిన్ భయోత్పాతానికి చిహ్నము. గిలిటిన్ అనేది ఒకరకమైన శిరచ్ఛేదనా యంత్రం. కొంతమంది వైద్యులు ప్రతిపాదించిన ఈ మరణదండన విధానం వలన తక్కువ సమయంలో ఎక్కువ మందికి మరణశిక్ష విధించే అవకాశం కలుగుతుంది. ఫ్రాన్స్లో ఆ రోజులలో ఇది ఒక గొప్ప వినోదంగా, వేలాది మంది చూడటానికి వీలుగా ఏర్పాటు చేయబడింది. ఫ్రాన్స్ రాజు 16వ లూయీ, రాణి మేరి అంతువానెత్లు కూడా గిలిటిన్ ద్వారా మరణదండనకు గురైనారు.

ప్రశ్న 7.
టైత్స్.
జవాబు:
ఫ్రెంచి విప్లవానికి ముందున్న ఫ్రాన్స్ సమాజంలో మొదటి వర్గానికి చెందిన మతాధిపతులకు క్రైస్తవుల నుండి ‘టైత్’ అనే పన్నును వసూలు చేసుకునే హక్కు ఉండేది. ప్రతి క్రైస్తవుడు తన ఆదాయంలో కొంత భాగం తప్పనిసరిగా మతాధిపతికి చెల్లించే పన్ను. ఈ పన్ను ద్వారా మతాధికారులకు అధిక మొత్తంలో ఆదాయం లభించేది. చాలా మంది మతాధిపతులు ఈ ధనంతో విలావంతంగా జీవించేవారు.

AP Inter 2nd Year History Study Material Chapter 8 ఫ్రెంచి విప్లవం - 1789

ప్రశ్న 8.
మూడవ వర్గం.
జవాబు:
ఫ్రెంచి సమాజంలో ప్రభువుల, మతాధిపతులు కాకుండా మిగిలిన వారందరూ మూడవ వర్గానికి చెందినవారే. మూడవ వర్గానికి చెందినవారిలో కొంతమంది భూస్వాములు, వృత్తిపనివారు మరియు వ్యవసాయదారులు ప్రధానమైనవారు. ఫ్రాన్స్లో ఎక్కువ మంది మూడవ వర్గానికి చెందినవారే. మూడవ వర్గంలో న్యాయవాదులు, వైద్యులు, సైనికులు, వడ్డీవ్యాపారులు, వస్తువుల తయారీదారులు కలరు. వీరిలో చాలామంది ధనవంతులు, సమాజంలోని అసమానతల పట్ల తీవ్ర వ్యతిరేక భావంతో ఉండేవారు. తమ వర్గానికి రాజకీయ అధికారంలో భాగస్వామ్యం ఉండాలని వీరు కోరుకున్నారు. మూడవ వర్గంలో అత్యంత దయనీయంగా రైతులు జీవించారు. వీరు తమ ఆదాయంలో ఐదింట నాలుగు వంతులు పన్నుల రూపంలో చెల్లించేవారు. మిగిలిన ఆదాయంలో అతను, అతని కుటుంబం జీవించవలసి వచ్చేది.

AP Inter 2nd Year History Study Material Chapter 7 ఆధునిక యుగారంభం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 7th Lesson ఆధునిక యుగారంభం Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 7th Lesson ఆధునిక యుగారంభం

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సాంస్కృతిక పునరుజ్జీవనం గురించి వివరించండి.
జవాబు:
రినైసాన్స్ అనగా పునరుద్ధరణ లేక పునర్జన్మ అని అర్థం. నూతనత్వం, విశాల దృక్పథం విశిష్ట లక్షణాలతో వచ్చిన సాంస్కృతిక పునరుజ్జీవ కాలంగా దీనిని చెప్పవచ్చు. సాంస్కృతిక పునరుజ్జీవ కాలాన్ని ఐరోపాలో గతించిన ప్రామాణిక కాలాన్ని పునఃసమీక్ష చేయడం లేదా పునరుద్ధరించడంగా పేర్కొన్నారు. ప్రాచీన, గ్రీకు, రోమన్ల సంస్కృతిని వెలుగులోకి తెచ్చి, ప్రాచుర్యం కల్పించిన ఉద్యమమే సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం. దీని ద్వారా వ్యక్తి అభిరుచులు, కళాభినైపుణ్యాలు వెలుగులోకి వచ్చాయి. 14, 15 శతాబ్దాలలో ఐరోపాలోని ఫ్లారెన్స్, వెనిస్, రోమ్ నగరాలు కళలకు, సారస్వతానికి కేంద్రాలుగా నిలిచాయి. ఫ్లారెన్స్ సాంస్కృతిక పునరుజ్జీవనానికి మొదటి కేంద్రం. సంపన్న వర్గాలు కళాకారులను, రచయితలను ప్రోత్సహించారు. ముద్రణా యంత్రాలలో ప్రజలకు విరివిగా గ్రంథాలు లభించాయి. ఐరోపాలోని సాంస్కృతిక పునరుజ్జీవనం అనేక రంగాలను ప్రభావితం చేసింది. కొత్తకొత్త భావాలు వ్యాపించాయి.

మానవతావాదం: ఇటలీలోని విశ్వ విద్యాలయాలలో నూతనంగా మానవతావాదం ప్రారంభమయింది. ఇటలీలో పాఠశాల స్థాయి నుండి విశ్వ విద్యాలయం వరకు మానవతావాదం బోధింపబడింది. వీటిలో విద్యతో పాటు సంగీతం, కళలు నేర్పేవారు. వ్యక్తిని శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారుచేయడమే మానవతావాదం యొక్క ముఖ్యోద్దేశం. వ్యక్తిలోని నైపుణ్యాన్ని చర్చలు, గోష్టుల ద్వారా ఆధునీకరించడం మానవతావాద ప్రధానోద్దేశం. విమర్శనాత్మక దృక్పథాన్ని, సృజనాత్మక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడంతో మానవతావాదం బలపడింది.

AP Inter 2nd Year History Study Material Chapter 7 ఆధునిక యుగారంభం

గ్రీకు సారస్వత అధ్యయనం: క్రీ.శ. 14 శతాబ్దంలో అనేకమంది పండితులు ప్లాటో, అరిస్టాటిల్ వంటి వారి రచనలను అనువాదం చేసారు. క్రీ.శ. 1453లో కాన్స్టాంట్్నపుల్ని టర్కీ ఆక్రమించినప్పుడు ఎందరో గ్రీకు పండితులు బైజాంటైన్ నుంచి, ఇటలీ పారిపోతూ తమతోపాటు గ్రీకు రచనలు తెచ్చుకొని ఫ్లారెన్స్ గ్రంథాలయాల్లో దాచుకున్నారు. ఇటలీ పండితులు ఎన్నో గ్రీకు గ్రంథాలు సేకరించారు. పాశ్చాత్యులు గ్రీకు సారస్వతాన్ని పరిశోధించారు, ఆస్వాదించారు. ప్లేటో ప్రవేశపెట్టిన ప్రేరేపిత పద్ధతి వైజ్ఞానిక శాస్త్ర ఆవిర్భావానికి, శాస్త్రీయ పద్ధతిలో సైన్సు అధ్యయనం చేయడానికి సహాయపడింది.

అచ్చుయంత్రం: క్రీ.శ. 1455లో జోహన్స్ గుటెన్ బర్గ్ అచ్చుయంత్రాన్ని కనిపెట్టి 150 బైబిల్ గ్రంథాలు ముద్రించాడు. క్రమంగా యూరప్ అంతా వ్యాపించి 200 మిలియన్లకు పైగా పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పుస్తకాల వలన ఎన్నడూ లేనంత ఆధునిక భావాలు, అభిప్రాయాలు, సమాచారం విస్తృతంగా వ్యాపించాయి. ప్రజలలో విద్య, వైద్య, న్యాయ, ఖగోళ, లోహం వంటి అనేక శాస్త్రాలపై అవగాహన పెరిగింది.

సాహిత్యం: పునరుజ్జీవ కాలంలో ఎందరో రచయితలు చైతన్యవంతమైన రచనలు చేశారు. ‘డివైన్ కామెడీ’ రచించిన డాన్టే సాంస్కృతిక పునరుజ్జీవవానికి ఆద్యుడు. పెట్రార్క్ ఎన్నో పురాతన నాణేలు, వ్రాతప్రతులను భద్రపరచడమే కాక ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం అని బోధించాడు.

కళలు: సాంస్కృతిక పునరుజ్జీవం వలన వాస్తు, శిల్పశాస్త్రాలు, చిత్రలేఖనం వంటి లలితకళలు వికసించి ప్రజలను అమితంగా ప్రభావితం చేసాయి. ఈ కళలను ధనవంతులు ప్రముఖంగా పోషించాయి. పోప్, చర్చి, వందలాది కళాకారులను ప్రోత్సహించారు. ప్రాచీన, గ్రీకు, రోమన్ కళల వైభవాన్ని పునరుద్ధరించారు. ఫ్లారెన్స్కు చెందిన ‘జిట్’ |400 అడుగుల పొడవైన గోపురానికి రూపకల్పన చేసాడు. మరో చిత్రకారుడు మైఖెలాంజిలో ‘ఫైటా’ అనే శిల్పం, లియొనార్డో డావెన్సీ చిత్రాలలో ‘మోనాలిసా’, ‘ది లాస్ట్ సప్పర్ ముఖ్యమైనవి. శిల్పాలలో డోనాటెల్లా యొక్క ‘గట్టమెంట’, మైఖలాంజిలో డేవిడ్ శిల్పాలు ప్రముఖమైనవి.

ఫ్లారెన్స్లోలో గొప్ప నిర్మాణ శైలి అభివృద్ధి చెందింది. పొడవైన గోపురాలు, పెద్ద డోములు, బలమైన గోడలతో చర్చిలు నిర్మించారు.

విజ్ఞాన శాస్త్రాభివృద్ధి: సాంస్కృతిక పునరుజ్జీవ కాలంలో వైజ్ఞానిక శాస్త్రాభివృద్ధి జరిగి, అందులో భాగంగా ప్రకృతి రహస్యాలను ఛేదించి తార్కిక దృష్టితో చూశారు. 17వ శతాబ్దం నాటికి విశ్వానికి, శాస్త్ర సంబంధించిన ఎన్నో కొత్త సూత్రాలు, సిద్ధాంతాలు కనుగొనబడ్డాయి. కోపర్నికస్ సౌరకేంద్ర సిద్ధాంతం చర్చిని, బైబిల్లోని బోధనలను విభేదించింది. తరువాతి కాలంలో కెప్లర్, గెలీలియోలు ఈ సిద్ధాంతాన్నే బలపరిచారు. శాస్త్రీయ దృక్పథం పెరగడంతో సైన్స్ అకాడమీలు ఏర్పడి ఎన్నో ఆవిష్కరణలకు కారణమయ్యాయి.
మత సంస్కరణోద్యమం: కేథలిక్ చర్చి దురాగతాలను వ్యతిరేకిస్తూ, జర్మనీలోని వేదాంత పండితుడు మార్టిన్ లూథర్ ఆధ్వర్యంలో ప్రొటెస్టంట్ మత ఉద్యమం ఏర్పడింది. ఇతను క్యాథలిక్ బోధనలను వ్యతిరేకిస్తూ, సామాన్యులకు విశ్వాసం ఒక్కటే దైవాన్ని చేరుస్తుందని, కర్మకాండలు అవసరం లేదని పేర్కొన్నాడు. యూరప్ లో ఎన్నో దేశాలలో ప్రొటెస్టెంట్ చర్చిలు ఏర్పడ్డాయి. ఫలితంగా క్యాథలిక్లు కూడా తమలోని లోపాలను సరిదిద్దుకుని నూతనోత్సాహంతో పునరంకితమయ్యారు.

ఉద్యమ ప్రభావం: పునరుజ్జీవ కాలంలో సృజనాత్మకత వెల్లివిరిసింది. ఐరోపాలో వచ్చిన సాంస్కృతిక మార్పులు కేవలం రోమ్, గ్రీకులనే కాక అనేక దేశాలను ప్రభావితం చేసాయి. వ్యక్తిలోని స్వేచ్ఛను, సృజనాత్మకతను వెలికితీసి, చర్చి ఆంక్షల నుండి వ్యక్తిని వేరుచేసింది మానవతావాదం. ఫలితంగా ప్రజల శాస్త్రీయ దృక్పథాన్ని ఏర్పరచుకోవడానికి దోహదపడింది. క్రైస్తవమతం కేథలిక్, ప్రొటెస్టెంట్లుగా విడిపోయారు. సారస్వత, వైజ్ఞానిక, శాస్త్ర సాంకేతిక రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాధించగలిగారు.

ప్రశ్న 2.
మత సంస్కరణ ఉద్యమం అనగానేమి ?
జవాబు:
ఇంగ్లాండులోని థామస్ మోర్, హాలెండ్ లోని ఎరాస్మస్ వంటి క్రైస్తవ మానవతావాదులు చర్చి దురాశతో కూడిన వ్యవస్థగా మారిందని, సాధారణ ప్రజల నుండి తమ ఇష్టం వచ్చినట్లు ధనాన్ని వసూలు చేస్తుందని విమర్శించారు. మత గురువులు ‘పాప పరిహార పత్రాలు’ అమ్మడం, ఈ పత్రాలను కొనేవారు తమ పాపభారం నుండి విముక్తులవుతారని చెప్పారు.

చర్చి సంస్కరణల ఆవశ్యకతను ఎరాస్మస్ తన రచనల ద్వారా తెలియజేసాడు. ఇతడు రాసిన ‘ది ప్రెయిస్ ఆఫ్ ఫాలీ’ అనే గ్రంథంలో మూఢ నమ్మకాలపై ఆధారపడిన చర్చి ఆచారాలను, మతాధికారులను అతడు విమర్శించాడు. ఎరాస్మస్ గ్రంథంలో రోమన్ క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా సంబంధించిన విమర్శనాస్త్రాలు పోప్కు హాని కలిగించాయి. మతాధికారుల అతీంద్రీయ శక్తులు, పాపపరిహార పత్రాలు అమ్మటంలోని మోసం, ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడం వంటి అంశాలను ఆయన తన గ్రంథంలో ప్రస్తావించారు. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ధర్మం, ఏది అధర్మం అనే వాటిని ప్రజలకు తెలియజెప్పటం ద్వారా చర్చిలో మార్పులు తేవచ్చని అతడు నమ్మాడు.

థామస్ మోర్ బైబిల్ను స్థానిక భాషలలోకి అనువదించడం వలన క్రైస్తవులు తమ మతం ఎలాంటి తప్పుడు ఆలోచనలను అనుమతించదని అర్థం చేసుకున్నారు. ఐరోపాలోని అన్ని ప్రాంతాల రైతులు చర్చి విధించిన పన్నులను తీవ్రంగా వ్యతిరేకించారు. మతాధికారులకు అధికారం కాన్స్టంటైన్ చక్రవర్తి జారీ చేసిన ‘డొనేషన్ ఆఫ్ కాన్ స్టాంటైన్ న్యాయ మరియు రాజకోశాగారం’ అనే రాజపత్రం నుండి వచ్చిందని చెప్పేవారు. మానవతావాదులు ఇది తరువాత కాలంలో కల్పించబడిన పత్రమని విమర్శించారు. అన్ని వర్గాల క్రైస్తవులు తమ సహనాన్ని కోల్పోయి మతాధికారుల మీద, చర్చి ఐహిక పారదర్శకత మీద తిరుగుబాటు చేసారు.

AP Inter 2nd Year History Study Material Chapter 7 ఆధునిక యుగారంభం

మార్టిన్ లూథర్: చర్చి దురాగతాలను వ్యతిరేకించే వారికి జర్మన్ వేదాంతశాస్త్ర అధ్యాపకుడైన మార్టిన్ లూథర్ (1483-1546) తిరుగుబాటుకు నాయకుడైనాడు. మార్టిన్ లూథర్ క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టాడు. దైవ సంబంధం కోసం మత గురువు అనుమతి అవసరం లేదని అతడు ప్రచారం చేసాడు. విశ్వాసం ఒక్కటే సరైన జీవన విధానమని, దేవునిపై పూర్తి విశ్వాసముంచాలని, అదే స్వర్గానికి దారి చూపిస్తుందని అతడు చెప్పాడు. విశ్వాసం ద్వారా స్వర్గం చేరుకోవచ్చని, మంచిపనులు చేసేవారికి స్వర్గం లభిస్తుందని చెప్పి కాథలిక్ బోధనలను వ్యతిరేకించాడు.

బైబిల్ గ్రంథంపై నమ్మకం ఉండాలన్నాడు. మత గురువులకు, చర్చి అధికారులకు అతీతమైన శక్తులు ఏమీ లేవన్నాడు. బైబిల్ను జర్మనీ భాషలోకి అనువదించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడు. ప్రతి పట్టణంలో ఒక పాఠశాల ఉండాలని, బాలబాలికలు బైబిల్ను చదవాలని చెప్పాడు. ఈ ఉద్యమాన్ని ‘ప్రొటెస్టెంట్ ఉద్యమం’ లేదా ‘మత సంస్కరణ ఉద్యమం’ అంటారు. ఫలితంగా జర్మనీ, స్విట్జర్లాండ్ లోని చర్చిలకు క్యాథలిక్ చర్చితో, పోప్ తో సంబంధాలు తెగిపోయాయి.

స్విట్జర్లాండ్లో ‘ఉల్రిచేజ్వింగ్లి’, జాన్ కాల్విన్లు మార్టిన్ లూథర్ భావాలు ప్రచారం చేసారు. వ్యాపారస్థుల మద్దతుతో సంస్కరణావాదులు పట్టణాలలో ప్రజాదరణ పొందగా గ్రామీణ ప్రాంతాలలో క్యాథలిక్ చర్చి ప్రభావం కొనసాగింది. అనాబాప్టిస్ట్ వంటి జర్మన్ సంస్కర్తలు మరింత తీవ్రవాద మార్గాన్ని అనుసరించారు. అన్ని విధాలుగా సామాజిక, అణచివేతను అంతమొందించాలనే పునర్నిర్మాణ భావాన్ని పెంపొందించాడు. దేవుడు అందరినీ సమంగా సృష్టించాడు. కాబట్టి ఎవ్వరూ పన్నులు చెల్లించనవసరం లేదని ప్రచారం చేసారు. భూస్వామ్య వ్యవస్థలో అణచివేతకు గురైన రైతాంగం ఈ భావాలను ఆదరించింది. క్రీ.శ. 1524లో జర్మనీలో కర్షక తిరుగుబాటు జరిగింది. రైతులు భూస్వామ్య విధానం రద్దు చేయాలని కోరాడు.

మార్టిన్ లూథర్ ఈ తిరుగుబాటును వ్యతిరేకించాడు. దీనిని అణచివేయవలసిందిగా పాలకవర్గాన్ని కోరాడు. అయితే తిరుగుబాటుదారులు ఫ్రాన్స్లోని ప్రొటెస్టెంట్స్క, ఇంతకు ముందు క్యాథలిక్ అధికారులచే ప్రాసిక్యూట్ చేయబడిన వారిని కలిసి ప్రజలకు ఇష్టంలేని అధికారులు అవసరం లేదని, తమకు ఇష్టం వచ్చిన వారిని అధికారులుగా నియమించుకున్నారు. ఫలితంగా ఫ్రాన్స్లో వలే ఇతర ఐరోపా దేశాలలో ప్రొటెస్టాంట్స్కు తమకు ఇష్టం వచ్చిన వారిని ఎన్నుకునే హక్కు క్యాథలిక్ చర్చి ఇచ్చింది. ఇంగ్లాండ్ అధికారులు పోప్తో సంబంధాలు తెగతెంపులు చేసుకున్నారు.

క్యాథలిక్ చర్చి ఈ సంఘటనల ప్రభావం నుండి తప్పించుకోలేకపోవడమే కాక అనేక అంతర్గత సమస్యలకు గురయింది. స్పెయిన్, ఇటలీలలో మత గురువులు పేద ప్రజలకు సహాయం చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. స్పెయిన్లో ప్రొటెస్టెంట్ మతాన్ని ఎదుర్కోవడానికి ఇగ్నేషియాస్లయోలో సొసైటీ ఆఫ్ జీసస్ ను స్థాపించాడు. అతని అనుచరులను జెసూట్స్ అంటారు. పేదలకు సేవ చేయడం, ఇతర సంస్కృతులలో క్రైస్తవాన్ని వ్యాపింపజేయడానికి తమ జీవితాలను అంకితం చేసారు. ప్రొటెస్టెంట్ విప్లవంలో క్యాథలిక్ చర్చి తనను తాను సరిచేసుకుంది.

ప్రశ్న 3.
మానవతావాదం యొక్క లక్షణాలు వివరించండి.
జవాబు:
ఇటలీ నగరంలో విశ్వ విద్యాలయాలు ఆవిర్భవించాయి. 11వ శతాబ్దం నుంచి పాడువ, బొలాగ్నో విశ్వ విద్యాలయాలు న్యాయశాస్త్ర అధ్యయన కేంద్రాలుగా ఉండేవి. వీటి ద్వారా నూతన విద్యా విధానం, మానవతావాదం ఇటలీ నగరంలో ఆదరించబడింది. ఇటలీలో పాఠశాల స్థాయి నుండి విశ్వ విద్యాలయ స్థాయి వరకు అన్ని విద్యా సంస్థలలో మానవతావాదం బోధించబడింది. వీటిలో విద్యతోపాటు సంగీతం, వ్యాయామం బోధించేవారు. ఈ కొత్త విద్యా విధానం వ్యక్తిలో సత్ప్రవర్తన, మంచి జీవితాన్ని తీర్చిదిద్దుకునే మార్గాన్ని నేర్పింది. వ్యక్తిని మానసికంగా, శారీరకంగా, దృఢంగా తయారు చేయడమే మానవతావాదం యొక్క ఉద్దేశ్యం.

15వ శతాబ్ది ప్రారంభంలో మానవతావాది అనే పదాన్ని వ్యాకరణం, అలంకారశాస్త్రం, పద్యభాగం, చరిత్ర, తత్త్వశాస్త్రం బోధించేవారికి వర్తింపచేసారు. లాటిన్ పదమైన మానవశాస్త్రం నుంచి మానవతావాదం అనే పదం అనేక శతాబ్దాల క్రితమే ఆవిర్భవించిందని రోమన్ న్యాయవాది, కథకుడు అయిన సిసిరో పేర్కొన్నాడు. సీజర్ సమకాలికుడైన ఇతడు మానవతావాదం అంటే సంస్కృతి అని పేర్కొన్నాడు. ఇందులోని అంశాలు మత సంబంధమైనవి కాదని సాంఘికంగా వ్యక్తి నైపుణ్యాన్ని చర్చలు, గోష్టుల ద్వారా ఆధునీకరించడం అని పేర్కొన్నాడు. ఈ మానవతావాద విద్య 16వ శతాబ్దం నాటికి ఉత్తర ఐరోపా అంతటా వ్యాపించి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో బహుళ ప్రచారం పొంది చర్చి పాఠశాలల్లో ప్రవేశించింది. ఇంగ్లండ్ లోని ప్రభుత్వ పాఠశాలలైన ఈటన్, హర్లలో ఈ విద్యను బోధించేవారు.

మానవతావాదులు విమర్శనాత్మక దృక్పథాన్ని, సృజనాత్మక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇటలీలోని పెట్రార్క్ సాంప్రదాయక రచనలు, వ్రాత ప్రతులను సేకరించడాన్ని అభిరుచిగా ఎంచుకున్నాడు. మరో మానవతావాది లారెంజోవిల్లా విమర్శనాత్మక దృక్పథాన్ని ఎంచుకున్నాడు. మాకియవెల్లి చారిత్రక అంశాలను చదివి, స్వానుభవంతో రూపకల్పన చేసేందుకు ప్రయత్నించాడు. ప్లాటో విషయాలను గమనించి, నిర్ణయం తీసుకునే విధానాన్ని అనుసరించి ఒక ముగింపుకు వచ్చేవాడు. ఈ మానవతావాదులు వివిధ రకాల మార్గాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. విశ్వ విద్యాలయాల్లో న్యాయశాస్త్రం, వైద్యం, తర్కశాస్త్రం, సాంఘికశాస్త్రం పాఠ్యాంశాలలో క్రమంగా ప్రవేశపెట్టబడ్డాయి. ఇటలీలోనే కాక ఐరోపా అంతటా మానవతావాదం వ్యాపించింది. మానవతావాద ఫలితంగా మానవ జీవితాలపై మతాధిపత్యం బలహీనపడింది. అయితే వీరు మతాన్ని వ్యతిరేకించలేదు.

AP Inter 2nd Year History Study Material Chapter 7 ఆధునిక యుగారంభం

మానవతావాదం క్రమంగా సాహిత్యం, సారస్వతం, సాంకేతిక విద్య, శిల్పకళ, చిత్రకళ, వాస్తుకళ ఇలా అన్ని రంగాలకు ప్రభావితం చేసింది.

సారస్వత రంగం: 14వ శతాబ్దంలో అనేకమంది పండితులు ప్లాటో, అరిస్టాటిల్ వంటివారి రచనలు అనువదించారు. 1453లో కాన్స్టాంట్్నపుల్ ఆక్రమణ సమయంలో గ్రీకు పండితులు బైజాంటైన్ నుంచి ఇటలీ పారిపోతూ, తమతో పాటు అనేక గ్రీకు గ్రంథాలను తీసుకొచ్చారు. ఇటలీ పండితుడు గ్లోవన్ని అరిష్ప 250 గ్రీకు వ్రాతప్రతులను, ఇతర గ్రంథాలను సేకరించాడు. మానవతావాదులు గ్రీకు సాహిత్యాన్ని ఆస్వాదించారు. ప్లాటో ప్రవేశపెట్టిన ప్రేరేపిత పద్ధతి వైజ్ఞానికశాస్త్ర ఆవిర్భావానికి శాస్త్రీయ పద్ధతిలో సైన్సు అధ్యయనం చేయడానికి సహాయపడింది. ఇది సైద్ధాంతిక దృక్పథానికి తోడ్పడింది.

సాంకేతిక పరిజ్ఞానం: అచ్చుయంత్రం కనిపెట్టబడిన తర్వాత ఇటలీ మానవతావాద సంస్కృతి, యూరప్ 15వ శతాబ్దాంతానికి వ్యాపించడానికి కారణం ముద్రిత పుస్తకాలు అందుబాటులోకి రావటం.

సాహిత్యం: లండన్లో ఆంగ్ల మానవతావాది జాన్ కోలేట్, సెయింట్ పాల్ మానవతావాద పాఠశాలలను ప్రారంభించారు. ఇంగ్లాండ్ చక్రవర్తి 8వ హెన్రీ దగ్గర ఛాన్స్లర్గా ఉన్న సర్ థామస్ మోర్ గొప్ప కవి, మానవతావాది. ఇతడు లాటిన్ భాషలో రచించిన యుటోపియాలో ఆదర్శరాజ్యం, సమాజం గురించి వివరించాడు. ఇంకా డాన్టే రచించిన డివైన్ కామెడీ మతపరమైన గ్రంథం. మిగేల్ డీసెర్వాంటెస్ రచించిన డాన్ క్విజోట్ మానవతావాద విలువలను ప్రబోధించేవి.

కళలు: మానవతావాద భావాలు కళలకు, వాస్తు శిల్పానికి కూడా విస్తరించాయి. చిత్రకళ, శిల్పకళ వంటి దృశ్య కళల ద్వారా ఇది యదార్థ రూపాన్ని కలిగి ఉంది. కళాకారులు ప్రకృతిని, ప్రజలను, ప్రదేశాలను యథాతధంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించేవారు. లియోనార్డో డావెన్సీ చిత్రించిన మోనాలిసా చిత్రం, ప్రఖ్యాత శిల్పి డొనాటెల్లో రూపొందించిన కంచు విగ్రహం, గట్టమెలాట, అశ్వికుని విగ్రహం ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. మైఖెలాంజిలో చెక్కిన ‘డేవిడ్’ శిల్పం కూడా ప్రధానమయినది.
మహిళా విద్య పట్ల కూడా క్రమంగా సమాజంలో మార్పు వచ్చింది. వ్యక్తి స్వేచ్ఛ, అతనిలోని సృజనాత్మకతను వెలికితీసి, చర్చి ఆంక్షల నుండి వ్యక్తిని వేరుచేసింది మానవతావాదం.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మైఖెలాంజిలో.
జవాబు:
పాశ్చాత్య ప్రపంచంలోని అత్యుత్తమ చిత్రకారులలో ఒకడైన మైఖెలాంజిలో క్రీ.శ. 1475లో ఇటలీలో జన్మించారు. ఒక శిల్పిగా, చిత్రకారుడిగా, కవిగా, ఆర్కిటెక్ట్ గా ఎన్నో అద్భుత కళాఖండాలను సృష్టించాడు. మైఖెలాంజిలో రోమ్లో పోప్ కోసం సిస్టన్ ఛాపెల్ మీద వేసిన ‘పైటా’ అనే శిల్పం మరియు ‘డేవిడ్’ అనే మరో శిల్పం ఇతనికి ఎంతో కీర్తి, ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. సిస్టెన్ ఛాపెల్ గోడల మీద ఇతను చిత్రించిన ‘లాస్ట్ జడ్జిమెంట్’ అద్భుతమైన చిత్రరాజము. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ ‘లారెంటియన్ లైబ్రరీ’ ని మేనరిస్ట్ విధానంలో నిర్మించాడు. సెయింట్ పీటర్స్ చర్చికి గుండ్రటి పై కప్పు (బాసిల్లా) లాంటి సృజనాత్మక నిర్మాణానికి డిజైన్ని రూపొందించాడు. అయితే ఈ నిర్మాణం మైఖెలాంజిలో మరణం తర్వాత పూర్తయింది. మైఖెలాంజిలో జీవించి ఉండగానే అతని మీద జీవిత చరిత్రలు రచించబడ్డాయి. తన సమకాలికులు ఎంతో ఖ్యాతిని సంపాదించుకుని ప్రపంచంలోని మేటి చిత్రకారులు, శిల్పులలో ఒకడిగా మిగిలిన మైఖెలాంజిలో క్రీ.శ. 1564లో 88 సంవత్సరాల వయసులో మరణించాడు.

ప్రశ్న 2.
మాకియవెల్లి.
జవాబు:
మాకియవెల్లి ఆధునిక కాలంలో రాజనీతిశాస్త్ర పితామహుడిగా పేరొందాడు. క్రీ.శ. 1469లో ఇటలీలో జన్మించారు. మానవతావాదంలో ప్రభావితుడయ్యాడు. మాకియవెల్లి తన గ్రంథం ‘ది ప్రిన్స్’ లో రాజకీయ వ్యవస్థ మీద, ఇటలీ రాజకీయ పరిణామాలపై విరుచుకుపడ్డాడు. మాకియవెల్లి ఫ్లారెన్స్లో దౌత్యాధికారిగా ప్రభువర్గం, వివిధ దేశాల సభలను సందర్శించి అధ్యయనం చేసాడు. ప్రాచీన రోమన్ చరిత్రను అతడు అధ్యయనం చేసాడు. అతడు ‘చర్చి’, ‘రాజ్యం’ రెండూ వేరని, రాజ్యం ఎప్పుడూ అద్భుత శక్తులపై ఆధారపడదని, దీనికొక ప్రత్యేక స్థానం ఉందని అభిప్రాయపడ్డాడు.

రాజ్యం ప్రజల నుండి అధికారం పొందింది కాబట్టి వారి అవసరాలను తీర్చడానికి రాజ్యం తప్పనిసరిగా కృషి చేయాలని అతడు పేర్కొన్నాడు. ఈ విధంగా మాకియవెల్లి రాజ్యం లౌకిక స్వభావాన్ని, సార్వభౌమాధికారాన్ని కలిగి ఉండాలని, ప్రజలను, సంస్థలను, ప్రభుత్వాన్ని క్రమపద్ధతిలో నడపాలని కోరాడు. మాకియవెల్లి క్రీ.శ. 1527లో తన 57వ ఏట
మరణించాడు.

AP Inter 2nd Year History Study Material Chapter 7 ఆధునిక యుగారంభం

ప్రశ్న 3.
ముద్రణాయంత్రం.
జవాబు:
అచ్చుయంత్రం (ముద్రణాయంత్రం) కనిపెట్టబడటం ఆధునిక మానవ చరిత్రలో ఒక ముఖ్య సంఘటన. ప్రప్రథమంగా కాగితాన్ని కనుగొని అచ్చులతో ముద్రించింది చైనీయులు. ఐరోపా వ్యాపారులు మంగోలు చక్రవర్తుల దగ్గర దౌత్యాధికారులుగా పనిచేసి ఈ జ్ఞానాన్ని పొందారు.

క్రీ.శ 1455లో జోహన్స్ గూటెన్బర్గ్ అనే జర్మనీ దేశానికి చెందిన స్వర్ణకారుడు. ఆధునీకరించిన అచ్చుయంత్రాన్ని తయారుచేసాడు. ప్రధమంగా 150 బైబిల్ ప్రతులను ముద్రించారు. నాటి నుండి యూరప్ చరిత్ర మారిందంటే అతిశయోక్తి కాదు. ఎన్నో రకాల శాస్త్రాలకు సంబంధించిన గ్రంథాలు ముద్రితమయ్యాయి. ఇటలీ మానవతావాదం. యూరప్ అంతటా 15వ శతాబ్దాంతానికి వ్యాపించడానికి ముద్రిత పుస్తకాలు అందుబాటులోకి రావడం ప్రధాన కారణం. క్రమంగా ముద్రణ జర్మనీ, నెదర్లాండ్స్, ఇటలీ, ఇంగ్లాండ్లకు వ్యాపించింది. క్రీ.శ. 1560 నాటికి 20 మిలియన్ పుస్తకాలు ముద్రింపబడ్డాయి. తరువాత శతాబ్దానికే 150 నుండి 200 మిలియన్ గ్రంథాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వైద్యం, న్యాయం, జ్యోతిష్యం, లోహ, భూగోళశాస్త్రం వంటి విభిన్న అంశాలపై అపారమైన సాహిత్యం వెలువడింది.

ప్రశ్న 4.
కోపర్నికస్
జవాబు:
పోలెండు చెందిన నికోలస్ కోపర్నికస్ క్రీ.శ. 1473లో జన్మించాడు. ఇతను గణితశాస్త్రంలో, అర్థశాస్త్రంలోను, ఖగోళశాస్త్రంలోను ప్రతిభావంతుడు. తన యొక్క అధ్యయనం, పరిశోధనలతో విశ్వాన్ని గురించిన అనేక రహస్యాలను ఛేదించాడు. నాటికి ప్రచారంలో ఉన్న ‘భూకేంద్ర సిద్ధాంతాన్ని’ తప్పని, ‘సౌరకేంద్ర సిద్ధాంతాన్ని’ ప్రవేశపెట్టాడు. తన పరిశోధనలతో భూమి, చంద్రుడు, నక్షత్రాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని నిరూపించాడు. కోపర్నికస్ సిద్ధాంతం విప్లవాత్మకమైందే కాక చర్చి బోధనలకు వ్యతిరేకమయింది. అర్థ శతాబ్దం తర్వాత కోపర్నికస్ సిద్ధాంతాన్ని జర్మన్ శాస్త్రవేత్త జాన్ కెప్లర్, ఇటాలియన్ శాస్త్రవేత్త గెలీలియో బలపరచారు. ఈ సిద్ధాంతం ఎందరిలోనో పాత నమ్మకాలను, మూఢ నమ్మకాలను తొలగించింది.

ప్రశ్న 5.
మోనాలిసా.
జవాబు:
ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడిగా గుర్తింపు పొందిన లియోనార్డో డావెన్సీ (1452 – 1519) గీసిన చిత్రాలలో మోనాలిసా, ది లాస్ట్ సప్పర్ ముఖ్యమైనవి. వీటిలో బాగా ప్రజాదరణ పొందింది మోనాలిసా, ఇటలీకి చెందిన లియోనార్డో డావెన్సీ క్రీ.శ. 1503-1506 మధ్య కాలంలో ఈ చిత్రాన్ని వేసిఉంటాడని పరిశోధకులు భావిస్తున్నారు. శతాబ్దాలు గడిచినా నేటికీ అందులోని చిరుమందహాసం, స్త్రీ సహజత్వం ఇట్టే చూపరులను ఆకర్షిస్తోంది. లియోనార్డో సమకాలికుల ప్రకారం ఈ చిత్రాన్ని చిత్రించడానికి చాలా కాలం తీసుకున్నాడని తెలుస్తుంది. ఈ చిత్రంపై ఎన్నో కట్టుకథలు ప్రచారంలోకి వచ్చాయి. క్రీ.శ. 1911లో ఈ చిత్రం చోరీకి గురైంది. చివరికి 1913 నాటికి ఈ చిత్రం ఫ్రాన్స్లోని లౌరే మ్యూజియంకి చేరింది. నేటికీ ఈ చిత్రం ఫ్రాన్స్లోని మ్యూజియంలో జనులకు కనువిందు చేస్తుంది.

ప్రశ్న 6.
ది లాస్ట్ సప్పర్.
జవాబు:
ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డావెన్సీ (1452 – 1519) సృష్టించిన మరొక అద్భుత చిత్రం ది లాస్ట్ సప్పర్. ఈ చిత్రాన్ని డావెన్సీ 1495-1498 మధ్య కాలంలో చిత్రించినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రం ఎక్కువమంది విమర్శకుల, పరిశోధకుల నిశిత పరీక్షలకు గురైన చిత్రరాజం. జాన్ సువార్త 13: 21 ప్రకారం ఏసు తన పన్నెండుమంది శిష్యులతో విందుకు కూర్చుని ఉన్న దృశ్యాన్ని అద్భుతంగా చిత్రించాడు. ఈ చిత్రం ఇటలీలోని మిలాన్ నగరంలో ఉంది. లాస్ట్ సప్పర్ చిత్రం ఏసు 12 మంది శిష్యులలో ఒకడు నమ్మకద్రోహం చేయబోతున్నాడు అని చెప్పినపుడు అక్కడున్న వారి హావభావాలను ఆ చిత్రంలో ప్రతిఫలించేటట్లు చేయగలిగాడు. లియోనార్డో ఈ చిత్రంలో ఎన్నో రహస్య సంకేతాలు నిక్షేపం చేసాడని కొందరి నమ్మకం.

AP Inter 2nd Year History Study Material Chapter 7 ఆధునిక యుగారంభం

ప్రశ్న 7.
మార్టిన్ లూథర్.
జవాబు:
రోమన్ క్యాథలిక్ చర్చి దురాగతాలను వ్యతిరేకించే వారికి వేదాంతశాస్త్ర అధ్యాపకుడైన జర్మన్ మత గురువు మార్టిన్ లూథర్ (1483 – 1546) తిరుగుబాటు నాయకుడయ్యాడు. మార్టిన్ లూథర్ క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా ప్రచార ఉద్యమం మొదలుపెట్టాడు.

దైవ సంబంధం కోసం మత గురువు అనుమతి అవసరం లేదని ప్రచారం చేసాడు. విశ్వాసం ఒక్కటే సరైన జీవన విధానమని, దేవునిపై పూర్తి విశ్వాసముంచాలని, అదే స్వర్గానికి దారి చూపిస్తుందని అతడు చెప్పాడు. క్యాథలిక్ బోధనలను వ్యతిరేకించాడు. బైబిల్ గ్రంథంపై నమ్మకం ఉండాలన్నాడు. చర్చి అధికారులకు అతీత శక్తులు ఉండవని బోధించాడు. మార్టిన్ లూథర్ 1524లో జర్మనీలో జరిగిన కర్షక తిరుగుబాటును వ్యతిరేకించాడు. మార్టిన్ లూథర్ బోధనల వలన ప్రొటెస్టెంట్ ఉద్యమం జరిగి, క్యాథలిక్ చర్చికి ప్రతిగా ప్రొటెస్టెంట్ చర్చి ఏర్పడింది. రోమ్లో జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ వంటి దేశాలకు మతపరమైన సంబంధాలు తెగిపోయాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 6 ఐరోపాలో భూస్వామ్య పద్ధతి

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 6th Lesson ఐరోపాలో భూస్వామ్య పద్ధతి Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 6th Lesson ఐరోపాలో భూస్వామ్య పద్ధతి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఐరోపా భూస్వామ్య లక్షణాలను వివరించుము.
జవాబు:
‘ఫ్యూడ్’ అనగా ‘ఒక చిన్న భూభాగం’ అని అర్థం. ఈ వ్యవస్థ ఇంగ్లాండ్, ఫ్రాన్స్, దక్షిణ ఇటలీలలో ఏర్పడింది. మధ్యయుగంలో తరచూ సంభవించే యుద్దాలలో ప్రజల ప్రాణాలను, సంపదను, భూములను కాపాడుకోవడానికి ఏర్పడిన వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ. ఇది ఒక రకమైన సామాజిక వ్యవస్థ ఆర్థికంగా చెప్పాలంటే ఫ్యూడలిజం అనగా భూమి, వ్యవసాయ ఉత్పత్తులు భూమికి సంబంధించిన భూస్వాములు మరియు రైతులు మధ్య ఉండే సంబంధాల వ్యవస్థగా చెప్పవచ్చు.

భూస్వామ్య వ్యవస్థ మూలాలు పవిత్ర రోమన్ చక్రవర్తి కాలం (8వ శతాబ్దం) నుండే ప్రారంభమైనప్పటికి క్రీ.శ. 11వ శతాబ్దం నుండి భూస్వామ్య వ్యవస్థ ఒక జీవన విధానంగా మారింది. దాదాపు ఐరోపాలోని అనేక ప్రాంతాలలో ఏర్పడింది. భూస్వామ్య వ్యవస్థ, రాచరిక వ్యవస్థ బలహీనపడి, రాజ్యపాలన వికేంద్రీకరణ జరిగి, రాజ్యవ్యవస్థకు మూలాధారమైన సైనికులను పోషించడానికి రాజు తనకు విశ్వాసపాత్రులైన కొందరు ప్రభువులకు కొంత ప్రాంతంపై అధికారమిచ్చి వారిని తనకు విశ్వాసపాత్రులుగా ఉంచేవారు. కాలక్రమంలో ఈ వ్యవస్థ వంశపారంపర్యమైంది. భూస్వామ్య వ్యవస్థ రైతుల, సామాన్యుల, శ్రామికుల యొక్క శ్రమను దోపిడీ చేసింది.

సామాజిక వ్యవస్థ: భూస్వామ్య వ్యవస్థలో మతాధికారులు (క్లెర్జీ) అత్యున్నత స్థానంలో ఉండేవారు. రాజులు వీరికిచ్చిన భూములపై స్వతంగా పన్నులు విధిస్తూ రాజుపై ఆధారపడకుండా స్వతంత్రంగా, శక్తివంతంగా ఉండేవారు. చర్చికి ‘పోప్’ ఉన్నతాధికారి, కాగా ఐరోపాలో ఎందరో క్రైస్తవులు, బిషప్లు ఎస్టేట్లు కలిగి ఉండేవారు. పైగా వీరు మొదటి శ్రేణి పౌరులుగా పరిగణింపబడేవారు. వీరికి ఎటువంటి పన్నుల బెడద ఉండేది కాదు.

AP Inter 2nd Year History Study Material Chapter 6 ఐరోపాలో భూస్వామ్య పద్ధతి

సమాజంలో రెండవ స్థానం ప్రభువర్గానిది. వీరికి భూములపై అధికారం ఉండటంచే వీరికి ఆ హోదా లభించింది. భూస్వాములు మెనోరియల్ ఎస్టేట్స్కు అధిపతులుగా ఉండేవారు. వీరి క్రింద ఉండే రైతులు, అర్థ బానిస రైతులు, కార్మికులను తమ అవసరాల కోసం పని చేయించుకునేవారు. వీరిపై పన్నుల బెడద అధికం. శ్రమ దోపిడి విపరీతంగా ఉండేది.

సమాజంలో మూడవ స్థానం రైతులు, సామాన్యులు ఉండేవారు. స్వేచ్ఛ కలిగిన రైతులు తమ ప్రభువుల వద్ద భూమిని, కౌలుకు తీసుకుని సాగు చేసేవారు. వీరిని వెసల్ (కౌలుదారుడు) అనేవారు. కౌలుకిచ్చే భూమిని ‘ఫీఫ్’ అనేవారు. ప్రభువుకు కౌలుదారుడు రక్షణ కల్పించినందుకు రకరకాల సేవలు చేయాలి. రాజు వీరి నుండి ‘టైలీ’ అనే పన్నును వసూలు చేస్తారు. సెర్చ్లోనే బానిసలకు ఏ విధమైన హక్కులుండవు వీరిని అర్థ బానిసలుగా పరిగణించబడేవారు.

ఆర్థిక పరిస్థితులు: క్రీ.శ.11వ శతాబ్దం నుండి ఐరోపాలో ఉష్ణోగ్రతలు ఎక్కువ అవడంతో మంచు తగ్గి, వ్యవసాయ కాలం పెరగడంతో ఐరోపాలో అడవులు తగ్గి, వ్యవసాయ భూమి పెరిగింది. మొదట వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం తక్కువ. మనుషులే పశువులుగా పనిచేసేవారు. ఇంత కష్టపడినా రైతులకు సరైన ప్రతిఫలం లభించేది కాదు. ఇది క్రమంగా సామాజిక ఉద్రిక్తతలకు దారితీసింది.

కాలక్రమంలో సాంకేతికంగా చాలా మార్పులు వచ్చాయి. భారీ యంత్రాలతో అధిక ఉత్పత్తులను సాధించగలిగారు. క్రమంగా భూస్వామ్య ఆర్థిక వ్యవస్థలో డబ్బు ముఖ్యపాత్ర పోషించింది. ప్రభువులు కూడా ధాన్యానికి, సేవలకు బదులు డబ్బు రూపంలో వసూలు చేయసాగారు. రైతులు కూడా తమ పంటలను పట్టణాలకు తీసుకెళ్ళి డబ్బుకు అమ్మటం ప్రారంభించినారు.

వ్యవసాయం విస్తరించడంతో జనాభా పెరిగి క్రమంగా నగరీకరణకు దారి తీసింది. పెరిగిన జనాభా వ్యవసాయ అధిక ఉత్పత్తి పోషించగలిగింది. రైతులు పట్టణాలకు వెళ్ళి కొనుగోలు, అమ్మకాలు చేయడంతో క్రమంగా నగరాలు విస్తరించుకుంటూ పోయి, వాటి నిర్వహణకు ప్రభుత్వ అధికారులు అవసరమయ్యారు. సేవకులు, సేవలకు బదులుగా ప్రభువులకు పన్ను డబ్బు రూపంలో చెల్లించారు. గ్రామాలలోని సేద్యపు బానిసలు పారిపోయి రహస్యంగా నగరాలలో తలదాచుకొనేవారు. ‘పట్టణ స్వేచ్ఛా వాయువునిస్తుంది’. అనే సామెత ఏర్పడింది. 15వ శతాబ్దానికి రాజులు బలపడినందున, ప్రజలలోని వ్యతిరేకత వలన కాని క్రమంగా భూస్వామ్య వ్యవస్థ అంతరించిపోయింది.

ఈ విధంగా భూస్వామ్య (ఫ్యూడల్) వ్యవస్థలో ‘మతం’ పూర్తి అధికారాన్ని చలాయిస్తూ రాజరిక వ్యవస్థను మార్చివేసింది. మతాధికారులు మతం పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేసారు. రాజులు బలహీనులగుటచే మధ్యవర్తులను నియమించి, వారు విలాసాలకు, భోగాలకు, అనవసర యుద్ధాలకు ఖర్చు పెట్టి, ఆ మొత్తాన్ని సామాన్యులు లేక రైతుల నుంచి అధిక పన్నుల రూపంలో దోపిడి చేసేవారు. సేద్యపు బానిసలు సెక్స్లుగా అర్థబానిసత్వంలో జీవించారు. భూస్వాములు చివరకు వీరి వ్యక్తిగత, కుటుంబ జీవితాలలో కూడా జోక్యం చేసుకుని వారి జీవితాలను ఛిద్రం చేసేవారు. అల్ప సంఖ్యాకులు అధికులను దోపిడీ చేస్తూ వారు సుఖంగా ఉంటూ, అధిక సంఖ్యాకులు కష్టాల్లో ఉండే వ్యవస్థే యూరప్ లో సుదీర్ఘకాలం రాజ్యమేలింది.

ప్రశ్న 2.
భూస్వామ్య విధాన నిర్మాణమును తెలియజేయుము.
జవాబు:
ఐరోపా ఖండంలో రాజ్యాల మధ్య తరచు యుద్ధాలు జరుగుతుండేవి. అందువలన ప్రజల ప్రాణాలను, సంపదను, భూమిని రక్షించుకోవడానికి ఏర్పడిన సామాజిక వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ. ‘ఫ్యూడ్’ అనగా ఒక చిన్న భూభాగము అని అర్థం. భూస్వామ్యానికి చెందిన మూలాలు పవిత్ర రోమన్ చక్రవర్తి కాలం నుండే ప్రారంభమై క్రీ.శ. 11వ శతాబ్దం నుండి ఐరోపాలో ఒక జీవన విధానంగా మారినది.

భూస్వామ్య వ్యవస్థ శ్రేణులు: ఫ్రాన్స్లో భూస్వామ్య వ్యవస్థ విభిన్న రకాలుగా విభజితమై ఉంది. వాటిలో మతాధికారులు (క్లెర్జి) మొదట శ్రేణి అధికార వర్గం కాగా, ప్రభువులు (నోబిలిటి) రెండవ శ్రేణి అధికార వర్గం కాగా, రైతులు, సామాన్య ప్రజలు మూడవ శ్రేణి (సామాన్యులు) వర్గంగా ఏర్పడింది.

AP Inter 2nd Year History Study Material Chapter 6 ఐరోపాలో భూస్వామ్య పద్ధతి

మొదటి శ్రేణులు (మతాధికారులు): ఫ్రాన్స్లోని కాథలిక్ చర్చికి తన చట్టాలను తానే తయారు చేసుకోవడం, స్వంత భూములు, రాజులచే ఇవ్వబడిన గ్రామాలపై పన్నులు విధించే అధికారం ఏర్పడింది. ఈ విధంగా రాజుపై ఆధారపడకుండా ఒక శక్తివంతమైన సంస్థగా చర్చి ఉండేది. పశ్చిమ ఐరోపా చర్చికి పెద్దగా ‘పోప్’ వ్యవహరించేవారు. ఐరోపాలోని క్రైస్తవులు, బిష నిబంధనల ప్రకారం నడుచుకునేవారు. వీరికి ఎస్టేట్లు, భూములు ఉండటమే కాక వీరు మొదటి శ్రేణికి చెందినవారుగా పరిగణించబడేవారు.

ప్రజలు ప్రతి ఆదివారం చర్చిలో పూజారి చేసే ప్రార్థనా కార్యక్రమాలు, బోధనలను వినటానికి వెళుతుండేవారు. అయితే ప్రతి ఒక్కరు పూజారి కాలేరు. అదే విధంగా సెర్ఫ్ లు, స్త్రీలు, పూజారులు కావడానికి అనర్హులు. పుజారి వివాహం చేసుకోరాదు. ప్రజలు తమ సంపాదనలో 10 శాతం పన్నుల రూపంలో చర్చికి విధిగా చెల్లించాలి. దీనిని ‘టైత్’ అంటారు. ధనవంతులు చర్చి అభివృద్ధికి ధనసహాయం చేసేవారు. చర్చి అనుబంధ వ్యవస్థ మోనాస్త్రిలు క్రమంగా విద్య, వైద్య, సేవా కేంద్రాలుగా మారాయి.

ప్రశ్న 3.
14వ శతాబ్దంలో జరిగిన మార్పులను తెలియజేయుము.
జవాబు:
క్రీ.శ. 13వ శతాబ్దం చివరి నాటికి ఉత్తర ఐరోపాలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి విపరీతమైన మంచు, చలి పెరగటం వలన పంట, ఉత్పత్తులలో బాగా మార్పులు వచ్చాయి. వ్యవసాయ నేలలు కూడా తగ్గిపోయాయి. దీనికి తోడు తుఫానులు మరియు సముద్ర అలలు ఉవ్వెత్తున చెలరేగడం వల్ల పంట పొలాలు దెబ్బతిని ప్రభుత్వానికి రావలసిన ఆదాయం బాగా తగ్గిపోయింది. నేలను బాగా లోతుగా సంవత్సరాల తరబడి దున్నటం వలన పంట పొలాల మార్పిడి జరిగి ఉత్పత్తి తగ్గిపోయింది. అడవిలో పశువులకు గడ్డి తగ్గిపోయింది. పట్టణాలలో జనాభా విపరీతంగా పెరగడం వలన సహజవనరులు తరిగిపోయి క్షామాలు ఏర్పడ్డాయి. క్రీ.శ 1315, 1317, 1320లలో ఐరోపాలో భయంకరమైన కరువులు ఏర్పడ్డాయి.

సామాజిక అలజడి: క్రీ.శ.1323లో ఐరోపాలోని ప్లాండర్స్లో, 1358లో ఫ్రాన్స్, 1381లో ఇంగ్లాండ్లో రైతులు తిరుగుబాట్లు చేసారు. ప్రభువులు ఈ తిరుగుబాట్లను అణచివేసినప్పటికీ అంతకు ముందు భూస్వామ్య పద్ధతిలో ప్రభువులు అధికారాలు పొందినట్లు పొందలేకపోయారు.

బ్లాక్ డెత్: యూరప్ ఖండాన్ని మొత్తం కుదిపేసిన ఘటన ‘బ్లాక్ డెత్’ సంఘటన. క్రీ. శ. 1346 – 53 వరకు ప్రాణాంతక ప్లేగు మహమ్మారి వ్యాధి యూరప్ అంతటా వ్యాపించింది. ఎటుచూసినా చావులతో ప్రజానీకం అల్లాడిపోయింది. యూరప్ ఖండంలో 75 నుండి 200 మిలియన్ల వరకు ప్రజలు ఈ వ్యాధులతో చనిపోయారని ఒక అంచనా. యూరప్ జనాభాలో 30 నుంచి 60 శాతం వరకు ఈ మహమ్మారి బారిన పడి మరణించారు.

ఇంగ్లాండ్ – ఫ్రాన్స్ల మధ్య వంద సంవత్సరాల యుద్ధం: యూరప్ లోని రెండు ప్రముఖ రాజ్యాలైన ఇంగ్లాండ్ – ఫ్రాన్స్ మధ్య 1338 నుంచి 1453 వరకు అనేక మారులు యుద్ధాలు జరిగాయి. రెండు రాజ్యాలతో ఎన్నో రాజ్యాలుగా సంబంధాలు ఏర్పరచుకుని యుద్ధాలు చేసాయి. మధ్యయుగాలలో జరిగిన యుద్ధాలలో ప్రముఖమైనవి. దాదాపుగా ఐదు తరాల రాజులు యుద్ధాలలో నిమగ్నులయ్యారు. రెండు దేశాలలోను తీవ్రమైన జాతీయ భావనలను రేకెత్తించింది. యుద్ధం ముగిసే సరికి ఫ్యూడల్ ప్రభువులు, సైనికులు ఎక్కువయ్యారు. ఇంగ్లాండ్ ప్రధానంగా ఒక ద్వీపంగా మిగిలింది.

సామాజిక మార్పులతో పాటు రాజకీయాలలో కూడా అదే స్థాయిలో మార్పులు వచ్చాయి. 15,16 శతాబ్దాలలో ఐరోపా రాజులు తమకున్న సైనిక, ఆర్థిక శక్తుల వల్ల బలపడినారు. చరిత్రకారులు వీరిని ‘కొత్తరాజులు’ అని వర్ణించారు. ఫ్రాన్స్లో 11వ లూయి, ఆస్ట్రియాలో మాక్సిమిలయన్, ఇంగ్లండ్లో 7వ హెన్రీ, స్పెయిన్లో ఇజబెల్లా మరియు ఫెర్డినాండ్ రాజులు బలమైన రాజులుగా తయారైనారు. భూస్వామ్య పద్ధతిలో రాజు సైన్యం కొరకు సేవకుడి మీద ఆధారపడి బలహీనంగా ఉన్నవాడు, ఆ పద్ధతి సన్నగిల్లటం తానే ప్రత్యక్షంగా ప్రజలపై పన్నులు వేసి సైన్యాన్ని నిర్వహిస్తూ ప్రభువులకు భూస్వాముల అవసరం లేకుండా పోయింది. ఆ స్థానంలో రాజులు తమ అధికారాలను పెంచుకున్నారు. రాజులే స్వయంగా కాల్బలాన్ని, నూతన తుపాకులు, మందు గుండు సామాగ్రిని తయారు చేసుకొని తను అధికారంలోనికి తెచ్చుకున్నారు.

క్రీ.శ.1461-1559 కాలంలో ఫ్రాన్స్, 1484 – 1556లో స్పెయిన్లో, క్రీ.శ 1485 – 1548 మధ్యకాలంలో ఇంగ్లాండ్లో నూతన రాజరిక వ్యవస్థలేర్పడినాయి. ఇంగ్లాండ్లో 1498, 1536, 1546, 1553లలో తిరుగుబాట్లు రాగా వాటిని అణచి వేశారు. ఫ్రాన్స్లో లూయీ రాజు, డ్యూక్లలో మరియు యువరాజులకు వ్యతిరేకంగా పోరాడటానికి చాలా కష్టపడవలసి వచ్చింది. చిన్న విస్తరణను వ్యతిరేకించారు. 16వ శతాబ్దంలో ఫ్రాన్స్లో భూస్వాములు, స్థానిక అసెంబ్లీల సభ్యులు, రాజులు అధికారం జరిగిన మత యుద్ధాలు ఒక రకంగా రాజు యొక్క అధికారాలకు మరియు ప్రాంతీయ అధికారులు స్వేచ్ఛకు మధ్య జరిగిన యుద్ధంగా అర్థం చేసుకోవచ్చు.

AP Inter 2nd Year History Study Material Chapter 6 ఐరోపాలో భూస్వామ్య పద్ధతి

ప్రభువర్గం చాలా తెలివిగా నూతనంగా అధికారం పొందిన రాజులతో పూర్తిగా ఘర్షణకు దిగకుండా వారిని సమర్ధిస్తూ, వారికి విధేయులుగా మారినారు. అందువల్లనే విపరీతమైన రాజుల అధికార స్వరూపాన్ని, ఆధునిక భూస్వామ్య వ్యవస్థగా భావించవచ్చు. భూస్వామ్య పద్ధతిలో భూస్వాములు ఏ విధంగానైతే సమాజంలో అధికారం చెలాయించారో వీరి పాలనలో పెద్ద పెద్ద ఉద్యోగాలు పొంది అటువంటి అధికారాలనే తిరిగి పొందినారు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మేనర్ పద్ధతి నిర్మాణం.
జవాబు:
ఐరోపాలోని భూస్వామ్య వ్యవస్థలో ప్రముఖమైనది మెనోరియల్ ఎస్టేట్. ప్రభువులు లేక భూస్వాములు తమ అధికారంలో కొన్ని గ్రామాలను ఉంచుకొనేవారు. అయితే అందరు భూస్వాముల ఆధీనంలో నిరిష్ట సంఖ్యలో గ్రామాలు ఉండేవి కావు. చిన్న మేనర్ ఎస్టేట్ అంటే పన్నెండు కుటుంబాలు ఉండే ప్రాంతం. ఈ మేనర్ ఎస్టేట్ లో ప్రభువు నివాస ప్రాంతాన్ని ‘మేనర్స్’ అంటారు. ఆ గ్రామాలలో ఉండే కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, గృహ నిర్మాణదారులు మొదలగువారు ఆయా కార్యక్రమాలు నిర్వహించాలి. స్త్రీలు నూలు వడకడం, బట్టలు నేయడం, పిల్లలు ద్రాక్షరసం (వైన్) తయారు చేయాలి. వ్యవసాయదారులు ప్రభువు కొరకు పంటలు పండించాలి. ఆ ఎస్టేట్లో కార్యక్రమాలన్నీ ప్రభువు కనుసన్నలలో జరగాలి. ఎస్టేట్ సైన్యం ఉండే భవనాన్ని ‘కాజెల్’ అనేవారు.

‘మేనర్’ లు స్వయం సమృద్ధిగా ఉండేవి కావు. అన్ని వస్తువులు మేనర్లో తయారవలేకపోవడం దీనికి ప్రధాన కారణం. ఉదా: ఉప్పు, పిండిమరరాళ్ళు, లోహపు పనిముట్లు మొదలైనవి బయట నుంచి తెచ్చుకోవాలి. ప్రభువులకు ఖరీదైన, విలావంతమైన గృహోపకరణాలు, సంగీత వాయిద్య పరికరాలు, ఆభరణాలు మొదలగు వాటిని ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకునేవారు.

ప్రశ్న 2.
ఫ్రాన్స్లో మతాధికారుల శ్రేణి రూపము.
జవాబు:
ఫ్రాన్స్లో మతాధికారులు మొదటి శ్రేణికి చెందినవారు. సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉంటూ, పాలకులను, ప్రజలను ప్రభావితం చేసే స్థాయిలో ఉండేవారు. మతాధికారులకు పన్నుల నుండి మినహాయింపు ఉండేది. ఫ్రాన్స్లోని కాథలిక్ చర్చికి తన చట్టాలను తానే తయారు చేసుకోవడం, స్వంత భూములు, రాజులచే ఇవ్వబడిన గ్రామాలపై పన్నులు విధించే అధికారం ఏర్పడింది. ఈ విధంగా రాజుపై ఆధారపడకుండా ఒక శక్తివంతమైన సంస్థగా చర్చి ఉండేది. పశ్చిమ ఐరోపా చర్చికి పెద్దగా ‘పోప్ ‘ వ్యవహరించేవారు. ఐరోపాలోని క్రైస్తవులు, బిషప్ నిబంధనల ప్రకారం నడుచుకొనేవారు. వీరికి ఎస్టేట్లు, భూములు ఉండేవి.

ప్రజలు ప్రతి ఆదివారం చర్చిలో పూజారి చేసే ప్రార్థనా కార్యక్రమాలు, బోధనలు వినడానికి వెళుతుండేవారు. అయితే ప్రతి ఒక్కరూ పూజారి కాలేరు. అదే విధంగా సెర్ఫ్లు, స్త్రీలు పూజారులుగా కావడానికి అనర్హులు. పూజారి వివాహం చేసుకోరాదు. ప్రజలు తమ సంపాదనలోని 10శాతం పన్నుల రూపంలో చర్చికి విధిగా చెల్లించాలి. దీనిని ‘టైత్’ అని పిలుస్తారు. ధనవంతులు చర్చి అభివృద్ధికి ధనసహాయం చేసేవారు. ఈ విధంగా మధ్యయుగంలో మతాధికారులు పూర్తి సౌఖ్యాలు అనుభవిస్తూ, రాచరికానికి పూర్తిగా మద్దతు పలికి, మతం పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందికి గురి చేసేవారు.

ప్రశ్న 3.
నాల్గవ శ్రేణి.
జవాబు:
వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందడంతో యూరప్ రోమన్ నాగరికత పతనంతో దెబ్బతిన్న పట్టణాలన్నీ తిరిగి వెలిసాయి. వ్యవసాయ రంగంలోని విపరీత ఉత్పత్తి అధిక జనాభా గల పట్టణాలకు ఆహారాన్ని అందించగలిగింది. రైతులు తమ మిగులు ధాన్యాన్ని పట్టణాలకు వెళ్ళి అమ్ముకొని తమకు కావలసిన దుస్తులు, వస్తువులు, పరికరాలు కొనుగోలు చేసేవారు. కొనుగోలు, అమ్మకాలకు అనువైన స్థలాలు సంతలుగా మారాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 6 ఐరోపాలో భూస్వామ్య పద్ధతి

సేవకులు సేవలకు బదులుగా తమకు దగ్గరగా ఉన్న పట్టణాలలో ప్రభువుకు పన్ను డబ్బు రూపంలో చెల్లించారు. గ్రామాలలో వ్యవసాయ కుటుంబాల నుండి వచ్చిన యువకులకు పట్టణాలలో వారు చేయగల పనులకు నగదు రూపంలో చెల్లింపులు లభించాయి. (పట్టణం స్వేచ్ఛా వాయువును ఇస్తుంది.) అనే సామెత ఏర్పడింది. చాలామంది సేద్యపు బానిసలు గ్రామాల నుండి పారిపోయి పట్టణాలలో రహస్యంగా తలదాచుకున్నారు. ఏ సెర్ఫ్ అయిన ఒక సంవత్సరము ఒక రోజు లోపల ప్రభువుచే కనిపెట్టబడకపోయిన ఆ సెర్ఫ్క స్వతంత్రమొచ్చినట్లు. ఆ విధంగా పొందిన స్వేచ్ఛతో ప్రజలు నైపుణ్యంతో సంబంధం లేని పనులు చేయడానికి అలవాటుపడ్డారు. వీరి సంఖ్య ఎక్కువయ్యే కొలది నైపుణ్యం కలిగిన బ్యాంకర్లు, లాయర్లు అవసరమయ్యారు. పెద్ద పట్టణాలంటే 30,000 మంది ప్రజలు ఉండటం. ఈ ప్రజలే నాల్గవ శ్రేణికి చెందినవారు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సేద్యపు బానిసత్వము.
జవాబు:
మధ్యయుగ యూరప్లో స్వేచ్ఛలేని రైతులను ‘సెర్ఫ్’లు అని పిలిచేవారు. ఈ రైతులకు స్వంత భూములుండవు. వీరు ప్రభువుల భూమిలో రైతు కూలీలుగా పనిచేయాలి. ఆ ప్రతిఫలమంతా ప్రభువుకే చెందుతుంది. వీరికి వేతనాలుండవు. ఎస్టేట్ బయటకు వెళ్ళే స్వేచ్ఛ లేదు. వీరికి సంబంధించిన ప్రతి విషయం ప్రభువుల పర్యవేక్షణలో జరగాలి.

ప్రశ్న 2.
పవిత్ర ఒడంబడిక.
జవాబు:
రైతులు, సామాన్యులు, భూస్వాములకు, మతాధికారులకు సేవకులు. వీరు యజమానికి విధేయుడిగా ఉండాలి. ప్రతిగా ప్రభువు సేవకుడికి రక్షణగా ఉంటాడు. ఇది ఇద్దరి మధ్య జరిగే ఒప్పందం. రైతుకు భూమిని కౌలుకు ఇచ్చే ఈ ఒప్పంద వేడుకలో ప్రభువు, తన సేవకుడికి ఒక రాతప్రతిని గాని, కొంత మట్టిముద్ద కానీ సంకేతంగా ఇస్తూ భూమిపై హక్కులు ఇస్తాడు. దీనికి ప్రతిఫలంగా సేవకుడు బైబిల్ మీద ప్రమాణం చేసి తాము ఎల్లప్పుడూ ప్రభువులకు విధేయులుగా ఉంటామని చర్చిలో ఒప్పందం చేసుకోవాలి.

ప్రశ్న 3.
పవిత్ర రోమన్ చక్రవర్తి.
జవాబు:
పవిత్ర రోమన్ సామ్రాజ్యాన్ని పాలించే ప్రభువు పవిత్ర రోమన్ చక్రవర్తి. ‘పోప్’ ఆశీస్సులతో పవిత్ర రోమన్ చక్రవర్తి నియమింపబడతాడు. పవిత్ర సామ్రాజ్యానికి చక్రవర్తిగా క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తూ, దాని సంరక్షణగా బాధ్యతను చక్రవర్తి స్వీకరించేవాడు. పవిత్ర రోమన్ సామ్రాజ్య వ్యవస్థ క్రీ. శ. 1453లో కాన్స్టాంటినోపుల్ పతనం వరకు కొనసాగింది. క్రీ. శ. 742లో మొదటి చార్లెస్ పవిత్ర రోమన్ చక్రవర్తి అయ్యాడు. వీరి పాలనా కాలంలోనే భూస్వామ్య వ్యవస్థ మూలాలు ఆరంభమయ్యాయి.

ప్రశ్న 4.
మఠం (మోనాస్త్రి).
జవాబు:
క్రైస్తవమతంలో వెలసిన ఒక ప్రత్యేక వ్యవస్థ ‘చర్చి అనుబంధ వ్యవస్థ’ ‘మోనాస్త్రి’. క్రీ. శ. 529లో ఇటలీ దేశస్థుడైన సెయింట్ బెనెడిక్ట్ బుర్గుండీలో స్థాపించాడు. ‘మోనాస్త్రి అనే పదం ‘మోనోస్’ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. మోనోస్ అనగా ఏకాంత జీవితం గడుపుట అని అర్థం. మతంపై ధృఢ విశ్వాసం ఉన్నవారు సన్యాసులుగా మారి దైవ కార్యంలో నిమగ్నులయ్యేవారు. కాలక్రమేణా ఈ మోనాస్త్రీలు పెద్ద భవనాలతో ఎస్టేట్లుగా మారి విద్య, వైద్య, సేవలు చేయడం ఆరంభించాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 6 ఐరోపాలో భూస్వామ్య పద్ధతి

ప్రశ్న 5.
ఇంగ్లాండ్.
జవాబు:
ఆంగ్లిస్ మరియు సాక్షన్ జాతులు మధ్య ఐరోపాలో క్రీ.శ. 6వ శతాబ్దంలో వచ్చి ప్రస్తుత ఇంగ్లండ్ ప్రదేశంలో స్థిరపడినారు. ‘ఇంగ్లాలాండ్’ అనే ప్రాచీన ఆంగ్ల పదమే ఇంగ్లండ్ గా మారింది. ఇంగ్లలాండ్ అనగా లాండ్ ఆఫ్ ఏంజెల్స్ (దేవదూతల ప్రదేశం) అని అర్థం. 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవంతో ఇంగ్లాండ్తో పాటుగా, ప్రపంచ చరిత్రే మారిపోయింది. ప్రపంచంలోని ఎన్నో దేశాలను ఆక్రమించుకుని దోచుకుని, ఆ దేశాలలో వలసలు ఏర్పాటు చేసుకున్నారు. మన దేశం కూడా వీరి చెర నుంచి 1947లో విముక్తి చెందింది.

ప్రశ్న 6.
భూస్వామ్యము (ఫ్యూడలిజమ్).
జవాబు:
‘ఫ్యూడ్’ అనగా ‘ఒక చిన్న భూభాగం’ అని అర్థం. ఈ వ్యవస్థ ఇంగ్లాండ్, ఫ్రాన్స్, దక్షిణ ఇటలీలలో ఏర్పడింది. మధ్యయుగంలో తరచూ సంభవించే యుద్ధాలలో ప్రజల ప్రాణాలను, సంపదను, భూములను కాపాడుకోవడానికి ఏర్పడిన వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ. ఇది ఒక రకమైన సామాజిక వ్యవస్థ, ఆర్థికంగా చెప్పాలంటే ఫ్యూడలిజం అనగా భూమి, వ్యవసాయ ఉత్పత్తులు, భూమికి సంబంధించిన భూస్వాములు మరియు రైతుల మధ్య ఉండే సంబంధాల వ్యవస్థగా చెప్పవచ్చు.

AP Inter 2nd Year History Study Material Chapter 5 సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 5th Lesson సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్ Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 5th Lesson సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మంగోలులను తెలుసుకొనుటకు గల ఆధారాలేవి?
జవాబు:
సంచారజాతుల, తెగల చరిత్రను, వారి జీవన విధానాన్ని తెలుసుకోవడానికి అనేక ఆధారాలు, వృత్తాంతాలు (క్రానికల్స్), యాత్రారచనలు (ట్రావెలోగ్స్), గ్రంథాలు, పత్రాలు, పోర్ట్రెయిట్స్ రూపంలో ఉన్నాయి. కొంతమంది మంగోలులను గూర్చీ యాత్రాకథనాలు రాయగా కొంతమంది మంగోలులు ఆస్థాన పండితులుగా స్థిరపడ్డారు. వారు బౌద్ధ, క్రైస్తవ, కన్ఫూషియస్, తుర్కీ, ముస్లిం మతాలకు చెందినవారు. వీరిలో కొంతమంది మంగోలులను స్తుతిస్తూ, నివాళులర్పిస్తూ రచనలు చేసారు.

మంగోలులపై విస్తృత పరిశోధనలు చేసి, రచనలు చేసినవారు రష్యా పరిశోధకులైన యాత్రికులు, సైనికులు, వ్యాపారులు, పురాతత్వవేత్తలు క్రీ.శ. 18, 19 శతాబ్దాలకు చెందినవారు. క్రీ.శ 20వ శతాబ్దపు తొలినాళ్ళలో రష్యాకు చెందిన బోరిస్ ఎకోప్లెని౫డి మిరోవ్, వాసిలి వ్లాడిమిరోవిచ్ బోరోల్డ్ మంగోలులు భాష, సమాజం, సంస్కృతులపై చక్కని రచనలు చేసారు.

మంగోలుల చరిత్రను తెలిపే ఆధారాలు చైనా, మంగోలు, పారశీక, అరబ్బీ, ఇటలీ, లాటిన్, ఫ్రెంచి, రష్యా వంటి అనేక భాషలలో విభిన్న సమాచారంతో లభిస్తున్నాయి. ఉదాహరణకు చంఘీస్ ఖాన్ను గురించి రాసిన మంగోలుల రహస్య చరిత్ర మంగోలు, చైనా భాషలలో ఉంది. మార్కోపోలో రాసిన మంగోలుల ఆస్థానానికి యాత్రలు (ట్రావెల్స్ టు ది మంగోల్ కోర్ట్) ఇటలీ, లాటిన్ భాషలలో భిన్నంగా ఉంది. అదే విధంగా ఇగోర్ డి రాచెవిట్జ్ రచన మంగోలుల రహస్య చరిత్ర, గెర్హార్డ్ డూ ఫర్ మంగోలు, తుర్కీ పదకోశంపై చేసిన రచనలు పారశీక భాషను కలిగి క్లిష్టంగా ఉన్నాయి. ఇంకా ఐబన్ బటూటా రచనలలో కూడా ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి.

రోమ్కు చెందిన పోప్లతో మంగోలు రాజులు సత్సంబంధాలు నెరపారు. పోట్లు ఎన్నో రాయబారాలు నడిపారు. పోప్ ఇన్నోసెంట్ (IV)కు గ్రేటాన్ గుయుగ్ రాసిన లేఖ వంటివి అనేక వివరాలను తెలియజేస్తున్నాయి. ఇ.ఎ. నాలిసబ్బుడ్జ రచించిన ‘ద మాక్స్ ఆఫ్ కుబ్లయే ఖాన్’ అతని పరిపాలనా కాలాన్ని గురించి మనకు తెలియజేస్తోంది. రషీద్ అల్దన్ రచించిన కంపెండియమ్ ఆఫ్ క్రానికల్స్, గ్రెగర్ ఆఫ్ అకాన్ హిస్టరీ ఆఫ్ ది నేషన్ ఆఫ్ ఆర్చర్స్, ద క్రానికల్స్ ఆఫ్ నొవ్ రోడ్, జువైనా-ద హిస్టరీ ఆప్ ద వరల్డ్ కాంకరర్స్ వంటి చారిత్రక విషయాలను తెలియజేస్తున్నాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 5 సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్

ప్రశ్న 2.
సంచార జాతి సామ్రాజ్య స్థాపనకు దారితీసిన భౌగోళిక పరిస్థితులను తెలపండి.
జవాబు:
క్రీ.శ. 13, 14 శతాబ్దాలలో మంగోలులు చంఘీస్ ఖాన్ నాయకత్వంలో అనేక ఐరోపా, ఆసియా ప్రాంతాలతో మధ్య ఆసియాలో బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. మంగోలు సంచార తెగలు నిబద్దతతో కూడిన సాంఘిక, ఆర్థిక జీవితాన్ని, వినమ్రతతో కూడిన గుణగణాలు కలిగి ఉండేవారని ఒక అభిప్రాయం. అయితే ఈ తెగల వారు చారిత్రకంగా వచ్చే పరిణామాలను, మార్పులను అంగీకరించరు. వీరి సాంప్రదాయాలకు అనుగుణంగా రాజకీయ, సాంఘిక, ఆర్థిక పద్ధతులను పాటిస్తూ తమ అధికారానికి మూలహేతువైన శక్తివంతమైన సైనికవ్యవస్థలకు ప్రాధాన్యత నిచ్చేవారు.

మంగోలులు భిన్న సమూహాలకు చెందినవారు. వారు భాషాపరంగా టాటార్లు, ఖిటాన్, మంచూ, తుర్కీ తెగలకు దగ్గరగా ఉంటారు. వారిలో కొందరు గ్రామీణ జీవితాన్ని గడపగా కొందరు వేటగాళ్ళుగా జీవించారు. గ్రామీణులు గుర్రాలు, గొర్రెలు, ఎద్దులు, మేకలు, ఒంటెలు వంటి జంతువులను పెంచేవారు. వారు మధ్య ఆసియాలోని స్టెప్పీలలో ముఖ్యంగా ఆధునిక మంగోలియా రాజ్యంలో సంచార జీవితం గడిపారు. ఈ ప్రాంతం అల్బాయ్ పర్వతాలతో, గోబిఎడారి, ఆనాన్, తెలంగా నదులు, అనేక ప్రవాహాలతో అందంగా, అద్భుతంగా ఉండేది. ఆటవికులు గ్రామీణులకు ఉత్తర ప్రాంతమైన సైబీరియా అటవీ ప్రాంతంలో ఉండేవారు. గ్రామీణుల కంటే వారు కొంత వినమ్రతతో జంతు చర్మాలు అమ్మి తన జీవితాన్ని గడిపేవారు. ఈ రెండు తరగతుల వారు నివశించే ప్రాంతంలో శీతోష్ణస్థితి పూర్తి భిన్నంగా ఉండేది.

ఈ రెండు సమూహాలు ప్రజలు ఆర్థికంగా స్థిరజీవితాన్ని నిలుపుకోలేక పోవడంతో ఆ ప్రాంతంలో పట్టణాభివృద్ధి జరగలేదు. మంగోలులు గుడారాలలో నివసిస్తూ వేసవి, శీతాకాలాల పచ్చికబయళ్ళలో పరస్పరం మారుతూ సంచరించేవారు. చంఘీస్ ఖాన్ నాయకత్వంలోని మంగోలు, తుర్కీ తెగల సమాఖ్య క్రీ.శ. 5వ శతాబ్దానికి చెందిన | అట్టెలా రాజ్యంతో సమానంగా ఉండేది. అయితే అట్టెలా కూటమి వలె కాక, చంఘీస్ ఖాన్ రాజకీయ వ్యవస్థ శక్తివంతమై ఎక్కువ కాలం కొనసాగే స్వభావం కలది. ఇది బలమైన సైనిక బలాలు కలిగిన చైనా, ఇరాన్, తూర్పు ఐరోపాలను ఎదుర్కొనే శక్తి కలది. మంగోలులు క్లిష్టమైన వ్యవసాయ, ఆర్థికవ్యవస్థలు, పట్టణ స్థిరత్వం, స్వల్ప సామాజిక వ్యవస్థలు కలిగిన పరిపాలన చేసారు. అది వారి సహజ సామాజిక జీవితానికి పూర్తిగా భిన్నమైంది.

సహజంగా పశువులను పెంచుతూ, వాటి గడ్డికోసం పచ్చిక మైదానాలలో సంచరిస్తూ స్థిరజీవితం లేని సంచార జాతులు వారి మనుగడకు ఆధారమయిన పశువులపైనే ఆధారపడేవారు. ఇటీవల కాలంలో ఆధునిక చారిత్రక పరిశోధకులు చంఘీస్ ఖాన్ కాలం నాటికి వాతావరణంలోని మార్పుల వలన గడ్డి సరిగా పెరగక మంగోలులు ఆందోళనకు గురయ్యారని భావించారు. ఇలాంటి పరిస్థితులలో మంగోలులు నాయకుడైన చంఘీన్ ఖాన్ మంగోలు జాతి ప్రజలను, ఇతర తెగలను కలిపి బలమైన సమాఖ్య రాజ్యాన్ని మధ్య ఆసియాలోని స్టెప్పీలనే పచ్చికబయళ్ళ ప్రాంతంలో నిర్మించాడు. ఇది అంతటితో ఆగక ఆసియా, ఐరోపా ఖండాలలోని అనేక దేశాలను ఆక్రమించి ఖండాంతర విశాలమైన సామ్రాజ్య స్థాపనకు దారితీసింది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రాజ్యాన్ని సంచారజాతి తెగలు స్థాపించడం, ఊహకందని, నమ్మలేని విషయంగా పరిశోధకులు భావించారు.

ప్రశ్న 3.
చంఘీస్ ఖాన్ జీవిత విశేషాలు, విజయాలను వివరించండి.
జవాబు:
చంఘీస్ ఖాన్ క్రీ.శ. 1162 ప్రాంతంలో ఆనాన్ నదికి సమీపంలోని నేటి మంగోలియాలోని ఉత్తర ప్రాంతంలో జన్మించాడు. అతనిని తెముజిన్ అని పిలిచేవారు. అతని తండ్రి ఎసుగి బోర్జిగిద్ తెగకు చెందిన కియాట్ సమూహానికి నాయకుడు. తెముజిన్ చిన్న వయసులో అతని తండ్రి చంపబడ్డాడు. అతని తల్లి ఓలన్ – ఇకే అటువంటి కష్టకాలంలో తెముజిన్తో పాటు అతని సోదరులను, సవతితల్లి బిడ్డలను పెంచి పెద్ద చేసింది. తరువాత దశాబ్ద కాలమంతా చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు. తెముజిన్ పట్టుబడి బానిసగా చేయబడ్డాడు. వివాహానంతరం అతని భార్య బోల్టే అపహరించబడగా తెముజిన్ యుద్ధం చేసి ఆమెను పొందాడు. ఈ స్థితిలో బోఘుర్చు, జముఖ అనే కుటుంబ సోదరుడిని స్నేహితులుగా చేసుకున్నాడు. తండ్రి వంక వారితో సంబంధాలు పునరుద్ధరించుకున్నాడు.

క్రీ.శ 1180 – 90 మధ్య కాలంలో తెముజిన్ అంగాన్తో మైత్రి నడుపుతూ తన బద్ధశత్రువులైన జముఖా వంటి వారిని ఓడించాడు. క్రీ.శ. 1203లో తండ్రిని పొట్టన పెట్టుకున్న టాటారులనే తెగ వారిని, కెరెయిట్స్న అంగన్ను ఓడించాడు. క్రీ.శ 1206లో నైమాన్ ప్రజలపై విజయం, శక్తివంతుడైన జముఖాను లొంగదీయడంతో తెముజిన్ శక్తిమంతుడైన నాయకుడిగా గుర్తింపు పొందాడు. ‘చంఘీఖాన్’ అంటే ‘సముద్రాధిపతి’ లేక ‘ప్రపంచరాజు’ అని మంగోలుల సభచే పిలువబడి తెముజిన్ మంగోలుల గొప్ప నాయకుడు అని ప్రకటింపబడ్డాడు.

చైనాను ఆక్రమించడానికి తన సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించి, క్రమశిక్షణ గల సైన్యంగా తీర్చిదిద్దాడు. మంగోలు సైన్యాన్ని మూడు భాగాలుగా చేసాడు. టిబెట్ తెగకు చెందిన హిృహ్సియా ప్రజలను 1209 నాటికి, 1215 నాటికి పెకింగ్ను ఓడించాడు. ఈ విజయాల తర్వాత క్రీ.శ. 1216లో చంఘీస్ ఖాన్ తిరిగి మంగోలియా చేరుకున్నాడు.

AP Inter 2nd Year History Study Material Chapter 5 సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్

క్రీ.శ 1218లో మంగోలులు ఖారాభిటాను ఓడించిన తర్వాత మంగోల్ సరిహద్దులు పశ్చిమోత్తర చైనా, అమూదరియా, ట్రాన్సాక్సియానా, ఖ్వారజం వరకు విస్తరించాయి. ఖ్వారజం పాలకుడు సుల్తాన్ మహమ్మద్ మంగోలు రాయబారులను వధించి చంఘీస్ ఖాన్ ఆగ్రహాన్ని చవిచూసాడు. క్రీ.శ 1219-21 మధ్య కాలంలోని దండయాత్రలలో బట్రార్, బుఖారా, సామరఖండ్, బాల్క్, హీరట్లు లొంగిపోయాయి. వ్యతిరేకించిన పట్టణాలు నేలమట్టమయ్యాయి. నిషాపూర్ వద్ద మంగోల్ రాజును చంపినందుకు ప్రతీకారంగా ఆ పట్టణ ఆక్రమణ సమయంలో యావత్తు పట్టణాన్ని దున్నిపారేసి పిల్లలు, కుక్కలు సైతం లేని స్మశాన వాటికగా ఆ ప్రాంతాన్ని మార్చివేసాడు.

చంఘీస్ ఖాన్ దండయాత్రల వలన అనేక నగరాల విధ్వంసం, లెక్కలేనంత మంది ప్రజల మరణం సంభవించాయి. క్రీ.శ. 1220లో నిషాపూర్లో 17 లక్షల మందిని, క్రీ.శ. 1222లో హీరట్ వద్ద 16 లక్షల మందిని, క్రీ.శ. 1258లో | బాగ్దాద్ వద్ద 8 లక్షల మందిని చంపారని మధ్యయుగ చరిత్రకారులు కొందరు లెక్కలు వేసారు. అయితే పారశీక వృత్తాంతాలు ఇల్కానిడ్ ఇరాన్ను గురించి రాస్తూ చంఘీస్ ఖాన్ వధించిన లేక చంపిన వారి వివరాలను అతిశయోక్తిగా పేర్కొన్నాయని కొందరు చరిత్రకారుల భావన.

మంగోల్ సైన్యాలు సుల్తాన్ మొహమ్మద్ కోసం వెళుతూ అజర్బైజాన్లోకి ప్రవేశించి, క్రిమియా వద్ద రష్యా సైన్యాలను ఓడించి కాస్పియన్ సముద్రాన్ని చుట్టుముట్టాయి. మరో విభాగం సుల్తాన్ కుమారుడు జలాలుద్దీన్ ను వెంటాడుతూ ఆఫ్ఘనిస్తాన్, సింధ్ ప్రాంతాల్లోకి చొచ్చుకువెళ్ళాయి. సింధూనది వద్ద చంఘీస్ ఖాన్ ఉత్తర భారతదేశం, అస్సాంల ద్వారా మంగోలియాకు వెళ్ళడం మంచిదని భావించాడు. కానీ ఆ ప్రాంత భయంకర ఉష్ణతాపం, దుశ్శకునాలను గురించి జ్యోతిష్కుడు చెప్పిన మాటలతో మనసు మార్చుకున్నాడు. అయితే అప్పటికే యుద్ధాలతోను, ఎక్కువ కాలం సైనిక స్థావరాలలో గడపటం వలన చంఘీస్ ఖాన్ ఆరోగ్యం మెరుగుపడక క్రీ.శ 1227లో మరణించాడు.

ఘనత: చంఘీస్ ఖాన్ సైనిక విజయాలు అపూర్వమైనవి. అతడు స్టెప్పీ ప్రాంతాల సైన్యాలను తన శక్తి సామర్థ్యాలతో, తెలివితేటలతో ఆధునీకరించటం వలన అవి శక్తివంతమైనాయి. అతడు మంగోలుల, తురుష్కుల గుర్రపుస్వారీ నైపుణ్యాలను మెరుగుపరచి, సైన్యంలో పరుగు తీవ్రతను పెంచాడు. భయంకరమైన చలి, తీవ్రమైన వేడిని సైతం లెక్కచేయకుండా శత్రువులను వెంటాడి, వధించి విజయాలు సాధించడం, ప్రాంతాలు జయించడం వంటి యుద్ధకాంక్షను మంగోలులో రగిలించాడు.

మంగోలులను ఐక్యపరచి, ఆదివాసీ, సంచార తెగల నిరంతర అంతర్యుద్ధాల నుండి వారికి విముక్తి ప్రసాదించి, చైనా దోపిడీ నుండి కాపాడి, వారిని అభివృద్ధి పథంలో నడిపిన ఒక నాయకుడిగా చంఘీస్ ఖాన్ నిలచిపోయాడు. నేటికీ మంగోలులకు చంఘీస్ ఖాన్ ప్రేరణ కలిగిస్తూ జాతీయనాయకుడిగా ఆ దేశ ప్రజలచే గౌరవింపబడుతున్నాడు. తన విజయాలతో ప్రపంచ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విజేతగా నిలిచిపోయాడు.

ప్రశ్న 4.
స్టెప్పీ సమాఖ్యల ప్రాధాన్యతను తెలపండి.
జవాబు:
మంగోలు – తుర్కీ ప్రజలకు చెందిన మధ్య ఆసియాలోని కొన్ని గొప్ప స్టెప్పీ సమాఖ్యలు ఏమనగా: క్రీ.పూ. 200 సంవత్సరాలకు చెందిన తురుష్కుల సియుంగు, క్రీ.శ. 400 సంవత్సరాలకు చెందిన మంగోలుల జువాన్, క్రీ.శ. 400 సంవత్సరాలకు చెందిన మంగోలుల ఎప్తలైట్ హూణులు, క్రీ.శ. 550 సంవత్సరాలకు చెందిన తురుష్కుల టుచు, క్రీ.శ. 740 సం॥లకు చెందిన తురుష్కుల ఇఝారులు, క్రీ.శ. 940 సంవత్సరాలకు చెందిన మంగోలుల ఖిటాన్లు. వారి ఆక్రమణలు ఒకే ప్రాంతానికి పరిమితం కాక సమంగా లేక వారి ఆంతరంగిక వ్యవస్థ క్లిష్టంగా ఉండేది. సంచార జనాభాపై వారి ప్రభావం ఉండేది. వీరి ప్రభావ తీవ్రత చైనా తదితర దేశాలలో వేరు వేరుగా ఉంది.

క్రీ.శ 13వ శతాబ్దపు తొలిదశకాలలో మంగోలుల నాయకుడైన చంఘీస్ ఖాన్ మంగోలు జాతి ప్రజలను ఇతర తెగల ప్రజలను కలిపి బలమైన సమాఖ్య రాజ్యాన్ని మధ్య ఆసియాలోని స్టెప్పీలనే పచ్చికబయళ్ళ ప్రాంతంలో నిర్మించాడు. ఇతడు తన అధికారాన్ని చైనా, ట్రాన్సాక్సియానా, ఆఫ్ఘనిస్తాన్, తూర్పు ఇరాన్, రష్యా స్టెప్పీలకు వ్యాపింపజేసాడు. తరువాత అతడు అనేక చైనా ప్రాంతాలను, ఐరోపాలోని అనేక ప్రాంతాలను జయించాడు. క్రీ.శ 1220లో ప్రముఖ బుఖారా పట్టణాన్ని వశపరచుకున్నాడు. అతని అనుచరులు మరింత ముందుకు సాగి బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఉదా: చంఘీస్ ఖాన్ ఒక మనువడు మాంగ్ కే (క్రీ.శ. 1251 60) ఫ్రెంచ్ రాజును బెదిరించి కొన్ని ప్రాంతాలు ఆక్రమించుకోగా, మరో మనువడు బాటు, మాస్కో వరకు రష్యా ప్రాంతాలు ఆక్రమించి పోలండ్, హంగరీ, వియన్నా రాజ్యాలను క్రీ.శ 1236-41 మధ్య దాడులలో వశపరచుకున్నాడు.

మంగోలులు భిన్న సమూహాలకు చెందినవారు. వారు భాషాపరంగా టాటార్లు, ఖిటాన్, మంచూ, తుర్కీ తెగలకు దగ్గరగా ఉంటారు. వారిలో కొందరు గ్రామీణ జీవితాన్ని గడపగా కొందరు వేటగాళ్ళుగా జీవించారు. గ్రామీణులు గుర్రాలు, ఎద్దులు, మేకలు, ఒంటెలు వంటి జంతువులను పెంచేవారు. వారు మధ్య ఆసియాలోని స్టెప్పీలలో ముఖ్యంగా ఆధునిక మంగోలియా రాజ్యంలో సంచార జీవితం గడిపారు. ఈ ప్రాంతం అల్బాయ్ పర్వతాలతో, గోబి ఎడారి, ఆనాన్, శిలంగా నదులు. అనేక ప్రవాహాలతో అందంగా, అద్భుతంగా ఉండేది. వేట లేక ఆటవికులు గ్రామీణులకు ఉత్తర ప్రాంతమైన సైబీరియా అటవీ ప్రాంతంలో ఉండేవారు. గ్రామీణుల కంటే వారు కొంత వినమ్రతతో జంతు చర్మాలు అమ్మి తన జీవితాన్ని గడిపారు. ఈ రెండు తరగతుల వారు నివసించే ప్రాంతంలో శీతోష్ణస్థితి పూర్తి భిన్నంగా ఉండేది.

ఈ రెండు సమూహాలు ప్రజలు ఆర్థికంగా స్థిరజీవితాన్ని నిలుపుకోలేకపోవడంతో ఆ ప్రాంతంలో పట్టణాభివృద్ధి జరగలేదు. మంగోలులు గుడారాలలో నివసిస్తూ వేసవి, శీతాకాలాల పచ్చికబయళ్ళలో పరస్పరం మారుతూ సంచరించేవారు. చంఘీస్ ఖాన్ నాయకత్వంలోని మంగోలు, తుర్కీ తెగల సమాఖ్య క్రీ.శ 5వ శతాబ్దానికి చెందిన ‘అట్టెలా’ రాజ్యంతో సమంగా ఉండేది. అయితే అట్టెలా కూటమి వలే కాక, చంఘీసన్ రాజకీయ వ్యవస్థ శక్తివంతమై ఎక్కువ కాలం కొనసాగే స్వభావం కలది. ఇది బలమైన సైనిక బలాలు కలిగిన చైనా, ఇరాన్, తూర్పు ఐరోపాలను ఎదుర్కొనే శక్తి కలిగి ఉండేది.

AP Inter 2nd Year History Study Material Chapter 5 సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్

చంఘీస్ ఖాన్ మరణాంతం మంగోలు సామ్రాజ్యంలోని సంచార, భిన్న వర్గాల మధ్యగల వైషమ్యాలు సరళమవుతూ వచ్చాయి. ఉదాహరణకు 1230లో మంగోలుల ఉత్తర చైనాకు చెందిన చిన్ రాజవంశంపై విజయవంతంగా దండయాత్ర చేయగా, మంగోలు నాయకత్వంలోని ఒక వర్గం రైతులను వధించి, వారి భూములను పచ్చికబయళ్ళుగా మార్చమని ఒత్తిడి చేసింది. తరువాత కాలంలో ఘజన్ ఖాన్ వంటివారు దీనిని వ్యతిరేకించారు. ఇది వారిలో ఉండే సంప్రదాయ రీతి అయిన గడ్డి భూముల పట్ల వారి ప్రాధాన్యతను తెలియజేస్తుంది. చంఘీస్ ఖాన్ తన తదనంతరం తన మొదటి కుమారుడు జోచికి రష్యా స్టెప్పీలను, రెండవ కుమారుడు చగతాయ్కి ట్రాన్సాక్సియానా స్టెప్పీలను, సామీరు పర్వత ఉత్తర భూములను, మూడవ కుమారుడు ఒగొడికి కారకోరమ్ పర్వత ప్రాంతాలని, చివరి కుమారుడు టోలుయ్కి తన పూర్వీకుల మంగోలియా ప్రాంతాలను ఇచ్చాడు.

మంగోలులు క్లిష్టమైన వ్యవసాయం, ఆర్థికవ్యవస్థలు, పట్టణ స్థిరత్వం, స్వల్పసామాజిక వ్యవస్థలు కలిగిన పరిపాలన చేసారు. అది వారి సహజ సామాజిక జీవితానికి పూర్తిగా భిన్నమైంది.

ఎటువంటి సంచారజాతి సామ్రాజ్యాన్ని పరిశీలించినా మంగోలుల వలె చెల్లా చెదురైన వివిధ జాతులు, తెగలు, సమూహాలు చైతన్యవంతులై, ఏకమై ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం ఊహకందనిది, నమ్మలేనిది.

ప్రశ్న 5.
మంగోలుల చరిత్రలో ఘజన్ ఖాన్ స్థానం ఎట్టిది?
జవాబు:
ఘజన్ 1271లో ఇల్-ఖానిడ్ పాలకుడైన ఆర్గున్, తల్లి ఖుత్లుక్ ఖాతున్లకు జన్మించాడు. ఘజన్ చిన్నతనంలో బాప్టిజం ఇచ్చి క్రైస్తవుడిగా పెంచబడ్డాడు. యవ్వనావస్థలో చైనా బౌద్ధ సన్యాసి వద్ద విద్యనభ్యసించాడు. అతని ద్వారా బౌద్ధాన్ని ఆకళింపు చేసుకున్నాడు. ఘజన్ ఖాన్ ను పాశ్చాత్యులు ‘కాసనస్’ అని పిలిచేవారు. ఇలా నిడ్ పాలకులు చంఘీస్ ఖాన్ చిన్న కుమారుడు ‘లొలుయి’ సంతతికి చెందినవారు. ఇతను ఇల్-ఖానిడ్ ఆనిడ్ వంశంలో 7వ పాలకుడు. ఈ ప్రాంతం నేటి ఆధునిక ఇరాన్ ప్రాంతం. 11 ఏళ్ళ వయసుకే వైస్రాయిగా ‘ఖొరాసాన్’ పాలకుడయ్యాడు.

క్రీ.శ 1291లో ఘజన్ తండ్రి ఆర్గున్ చనిపోయే సమయానికి ఘజన్ ఖాన్ ‘నవజ్’ అనే కులీనుడి తిరుగుబాటు, ఛాగాయ్ మంగోలులు, తుర్కీ మంగోలులను ఎదుర్కొనవలసి వచ్చింది. 1295 ప్రాంతాలలో ఘజన్ ఒత్తిడి మేరకు ‘నవ్రజ్’ లొంగిపోయి, ఘజన్ దళ నాయకుడిగా మారాడు. ‘నవ్రజ్’ సహాయంతో కుట్రలను ఛేదించాడు. ‘నవ్రజ్’ ప్రఖ్యాతి చెందిన ముస్లిం అమీర్. నమ్రాజ్ వంటి వారి మద్దతు ఉంటుందని క్రీ.శ 1295లో ఇస్లాంను స్వీకరించాడు. తన పేరును మహమూద్ ఘజన్ గా మార్చుకున్నాడు. ఘజన్ ఇస్లాంను స్వీకరించినప్పటికీ వ్యక్తిగత జీవితంలో ప్రాచీన మంగోల్ సంప్రదాయాలు పాటించేవాడు.

పరమత సహనం: ఘజన్ ఖాన్ ఇస్లాం మతాన్ని స్వీకరించినప్పటికి, పరమత సహనాన్ని ప్రదర్శించాడు. తన చిన్నతనంలో క్రైస్తవుడిగా పెంచబడ్డాడు. యవ్వనంలో బౌద్ధమత గురువు ప్రభావంతో బౌద్ధం వైపు ఆకర్షితుడయ్యాడు. 1295లో రాజకీయ అవసరాల నిమిత్తం ఇస్లాంను స్వీకరించాడు. తన రాజ్యంలోని క్రైస్తవులను జిజియా పన్ను నుంచి మినహాయించాడు. అయితే ఈ పరమత సహనం ‘నవ్రజ్’ వంటి నాయకులు సహించలేకపోయారు. ఎన్నో బౌద్ధరామాలను శాశ్వతంగా ధ్వంసం చేసారు. చివరకు టిబెట్ వెళ్ళదలుచుకున్న బౌద్ధులందరికీ అనుమతినిచ్చాడు. ‘నవ్రజ్’ అతని అనుచరుల ఆగడాలు మితిమీరి పోతుండుటచే ఘజన్ ఖాన్ అతనిని అణచివేసాడు.

తమ చిరకాల శత్రువులైన ఈజిప్ట్ మామ్లుక్ తో యుద్ధం చేయడానికి 1299లో క్రైస్తవులను ఆహ్వానించి వారితో కలిసి యుద్ధానికి వెళ్ళాడు. ఈ యుద్ధంలో మామ్లుక్లలు ఓడించబడ్డారు. తరువాత కాలంలో తుర్క్ మంగోల్ ఛాగ్తాయ్లాతో యుద్ధం చేసాడు. ఈ విధంగా ఎక్కువ కాలం యుద్ధరంగంలోనే గడిపాడు.

సంస్కరణలు: ఘజనాఖాన్ ఇలా నిడ్ సామ్రాజ్యంలో అనేక సంస్కరణలు చేపట్టాడు. తన ప్రాంతంలోని రైతుల సంక్షేమానికి కృషి చేసినట్లు తెలుస్తుంది. ఇతడు మంగోలు తురుష్క సంచార సైన్యాధికారులకు క్రింది సందేశాన్నిచ్చాడు. ఈ సందేశాన్ని అతని వజీర్ రషీదుద్దీన్ తయారుచేసాడని కొందరి అభిప్రాయం.

“నేను పారశీక కర్షకుల వైపు లేను. వారిని నిర్మూలించాలనే తలంపు ఉంటే ఆ పనిని నాకంటే శక్తివంతంగా చేసేవారు మరొకరు లేరు. అయితే మీరు తిండిగింజలను, ఆహారపదార్థాలను పొందాలనుకుంటే మీ పట్ల కఠినంగా వ్యవహరిస్తాను …… వినమ్రతగా ఉన్న కర్షకులను శత్రువులుగా ఉన్న కర్షకుల నుండి వేరుచేసి గౌరవించాలి” అని సందేశమిచ్చాడు.

AP Inter 2nd Year History Study Material Chapter 5 సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్

మిలటరీ సంస్కరణలు: సైన్యంలో ఎన్నో కొత్త దళాలను ఏర్పాటు చేసాడు. మంగోలు రాజ్యంలోని సామాన్యులు ఎందరో తమ పిల్లలను బానిసలుగా అమ్ముతుంటే, వారిని విడిపించి తన మంత్రులలో ఒకడైన బోలాడ్ నేతృత్వంలో వారందరినీ ఒక సైనిక యూనిట్గా ఏర్పరచాడు.

ఆర్థిక సంస్కరణలు: కాగితం కరెన్సీ ప్రవేశాన్ని వ్యతిరేకించిన ఘజన్ ఖాన్ తన రాజ్యం అంతా ఒకేరకమైన నాణేలు ప్రవేశపెట్టాడు. వాటిని గజనీ దినార్స్ అన్నారు. మార్కెట్ వ్యవస్థను క్రమబద్దీకరించాడు.

నిర్మాణాలు, ఘనత: ఘజన్ ఖాన్ ఉన్నత సాంస్కృత విలువలు కలిగినవాడు. ఇతడు అనేక భాషలు మాట్లాడగలడు, కళాపోషణారాధకుడు. చిత్రలేఖనం, రసాయనశాస్త్రం, వ్యవసాయం పట్ల ఎంతో మక్కువగా ఉండేవాడు. తన ప్రజల సంక్షేమం కోసం హాస్టల్స్, హాస్పటల్స్, విద్యాలయాలు, తపాల వ్యవస్థలు ఏర్పాటు చేసాడు. ‘రషీద్-అల్-దీన్’ అనే చరిత్రకారుడుని తన వంశ చరిత్ర రాయమని ఘజన్ కోరాడు. ఇతడు తన సామ్రాజ్యంలో మంగోలియన్ యాసాకోడ్ను అమలుచేసాడు.

ఒక యూరప్ చరిత్రకారుడి ప్రకారం 14వ శతాబ్దంలో ఎందరో యూరోపియన్లు తమ పిల్లలకు మంగోల్ పాలకుల పేర్లు పెట్టుకోవడం గొప్పగా భావించేవారు. ‘గజన్’ పేరును ఎక్కువమంది పెట్టుకునేవారు. ఇంతటి ఘనత వహించి ఘజన్ ఖాన్ క్రీ.శ 1304లో 33 సంవత్సరాల వయసులోనే మరణించాడు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సంచారజాతి సామ్రాజ్యాలు.
జవాబు:
సంచార అంటే ‘దేశ దిమ్మర’, ‘అనాగరిక జాతులు’ అని వ్యవహరించేవారు. మధ్య ఆసియాకు చెందిన మంగోలులు, అరేబియా ద్వీపకల్పంలోని బెడౌన్లు, గౌలులు, హూణులు ఇలాంటివారే. కొన్ని సంచారజాతులు కుటుంబవ్యవస్థను కలిగి ఉండగా, కొన్ని జాతులకు కుటుంబ జీవితం ఉండేది కాదు. వీరి రాజకీయ వ్యవస్థ వెనుకబడి ఉండేది. సామ్రాజ్యం అంటే మిశ్రమ సాంఘిక, ఆర్థిక భావాలతో కూడిన నిర్మాణం. క్రీ.శ 13, 14 శతాబ్దాలలో మంగోలులు చంఘీస్ ఖాన్ నాయకత్వంలో ఐరోపా, ఆసియా ప్రాంతాలతో మధ్య ఆసియాలో బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. మంగోలు సంచార తెగలు నిబద్ధతతో కూడిన సాంఘిక, ఆర్థిక జీవితాన్ని కలిగి ఉండేవారు. ఈ తెగల వారు చారిత్రకంగా వచ్చే పరిణామాలను అంగీకరించరు. వారి సాంప్రదాయాల కనుగుణంగా రాజకీయ, సాంఘిక, ఆర్థిక పద్ధతులు పాటిస్తూ, తమ అధికారానికి మూలహేతువైన, శక్తివంతమైన సైనిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చేవారు.

ప్రశ్న 2.
రష్యా పండితులు.
జవాబు:
మంగోలులపై విస్తృత రచనలు చేసినవారు రష్యా పరిశోధకులైన యాత్రికులు, సైనికులు, వ్యాపారులు, పురాతత్వవేత్తలు క్రీ.శ 18, 19 శతాబ్దాలకు చెందినవారు. 19వ శతాబ్దంలోని చరిత్రకారుడైన N.M కరంజినే టాటర్ల వలన రష్యా వెనుకబడిందని భావించాడు. మరోవైపు మరో చరిత్రకారుడు S.M సొలెవేవ్ మంగోలుల ఆక్రమణ ప్రభావం చాలా స్వల్పకాలికమైన, దీర్ఘకాలక ప్రభావం ఏమీలేదని పేర్కొన్నాడు. వివి. బోర్తోల్డ్, ప్రొఫెసర్ జార్జ్ వెర్నార్డ్స్క వంటివారు కూడా మంగోలుల రష్యా ఆక్రమణ వాటి ప్రభావాలని అంచనా వేసారు.

క్రీ.శ. 20వ శతాబ్దపు తొలినాళ్ళలో రష్యాకు చెందిన బోరిస్ ఎకోఫ్లెవిచ్ వ్లాడిమిర్టోవ్, మంగోలుల భాష, సమాజం, సంస్కృతులపై చక్కని రచనలు చేసారు.

AP Inter 2nd Year History Study Material Chapter 5 సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్

ప్రశ్న 3.
మంగోలుల దండయాత్రలు.
జవాబు:
క్రీ.శ 13వ శతాబ్దంలో మంగోలులు నాయకుడు చంఘీస్ ఖాన్ తన జాతి ప్రజలను, ఇతర తెగలను కలిపి గొప్ప సైన్యాన్ని నిర్మించాడు. ఇతడు తన అధికారాన్ని చైనా, ట్రాన్సాక్సియనా, ఆఫ్ఘనిస్తాన్, తూర్పు ఇరాన్, రష్యా స్టెప్పీలకు వ్యాపింపచేసాడు. క్రీ.శ 1220లో ప్రముఖ బుఖారా పట్టణాన్ని ఆక్రమించాడు. తరువాత కాలంలో చంఘీస్ ఖాన్ మనుమడు మాంగ్ కే ఫ్రెంచ్జును బెదిరించి కొన్ని ప్రాంతాలు ఆక్రమించుకున్నాడు. మరో మనుమడు బాటు, మాస్కో వరకు రష్యా ప్రాంతాలు ఆక్రమించారు. పోలండ్, హంగరీ, వియన్నా రాజ్యాలను వశపరచుకున్నారు.

మంగోలు దండయాత్రల మూలంగా ఎన్నో పట్టణాలు ధ్వంసం చేయబడ్డాయి. వ్యవసాయ భూములు నిరుపయోగమయ్యాయి. లక్షల మంది చంపబడ్డారు. వర్తక, వ్యాపార, హస్తకళలు మూగబోయాయి. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు, బానిసలయ్యారు. మంగోలుల దండయాత్రల ధాటికి చైనా, తూర్పు ఐరోపా, మధ్య ఆసియాలోని ఎన్నో దేశాలు భయోత్పాతాన్ని పొందాయి.

ప్రశ్న 4.
మంగోలు రాజవంశం.
జవాబు:
అనేక మంది స్త్రీలకు భర్త అయిన చంఘీస్ ఖాన్కు అనేక మంది పిల్లలు జన్మించారు. తన మొదటి భార్య బోర్టెకు జన్మించిన నలుగురు కుమారులు మంగోలు వంశవృక్షమయ్యారు. వారి జోచి, చగతాయ్, ఒగొడి, టోలుయిలు. మొదటి కుమారుడు జోచి, కుమారులు లేకపోయినా శక్తివంతంగా పాలించాడు. గుయుక్ మరణానంతరం ఒగొడి వంశస్థులకు మద్దతు ఇవ్వకుండా జోచి కుమారుడు బాటు టొలుయ వైపు మొగ్గు చూపి, మొంగ్కె, కుబ్లట్లకు తెర తెరిచాడు. దీని వలన మంగోలు వంశంలో అంతర్గత పోరు తప్పలేదు.

ప్రశ్న 5.
మంగోలులు చేసిన వినాశనం.
జవాబు:
చంఘీస్ ఖాన్ దండయాత్రల గురించి తయారైన నివేదికలన్నీ అనేక నగరాలను, పట్టణాలను ఆక్రమించి ధ్వంసం చేసినందున, అంతులేనంతమంది ప్రజలు మరణించారని అంగీకరిస్తున్నాయి. క్రీ.శ 1220లో నిషాపూర్ను పట్టుకున్నప్పుడు 17,47,000 మంది ప్రజలు ఊచకోతకు గురికాగా, క్రీ.శ 1222లో హీరట్ వద్ద 16 లక్షల మందిని, క్రీ.శ 1258లో బాగ్దాద్ వద్ద 8 లక్షల మంది చంపబడగా అదే నిష్పత్తిలో చిన్న చిన్న పట్టణాలు నష్టపోయాయి. నాసా వద్ద 70,000 మంది, బాయ్ ఖ్ జిల్లాలో 70,000 మంది, కుహిస్థాన్ ప్రాంతంలోని టున్ వద్ద 12 వేల మందిని ఉరితీసారు. ఇలా నిడ్లో 13 లక్షలమంది చనిపోయారని పారశీక జువైనీ పేర్కొన్నాడు. అయితే పారశీక వృత్తాంతాలు అతిశయోక్తులతో నిండాయని కొందరు చరిత్రకారులు అంచనా. వీరి దండయాత్రల వలన వ్యవసాయ భూములు నిరుపయోగమయి, వర్తక వ్యాపార హస్తకళలు మూగబోయాయి. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఇంకెంతో మంది బానిసలయ్యారు. ఇలా ఎన్నో నగరాలు శాశ్వత విధ్వంసానికి గురైనాయి.

ప్రశ్న 6.
యాసా.
జవాబు:
డేవిడ్ అయలాన్ ప్రకారం ‘యాసా’ అనే న్యాయస్మృతిని చంఘీస్ ఖాన్ క్రీ.శ. 1206వ సంవత్సరంలో జారీ చేసాడు. ఈ పదం ‘యాసఖ్’ అని రాయబడింది. దీని అర్థం ‘న్యాయం’, ‘ఆదేశం’, ‘ఆజ్ఞ’. మరికొన్ని వివరాలను బట్టి యాసఖ్ పరిపాలనా నిబంధనలైన వేటాడే పద్ధతి, సైన్యం, పోస్టల్ వ్యవస్థలను గురించి తెలిపే పద్ధతి. క్రీ.శ. 13 వ శతాబ్దపు మధ్య కాలానికి మంగోలులు దీనిని పోలిన ‘యాసా’ అనే పదాన్ని ‘సాధారణ న్యాయస్మృతి’ అనే అర్థంతో వాడారు.

మంగోలులు తమ ఉనికిని కాపాడుకొని, ప్రత్యేకతను చాటుకొనుటకు వారు యాసాను తమ నాయకుడిచ్చిన పవిత్ర స్మృతిగా ఉపయోగించారు. యాసా అనేది మంగోలు తెగల ఆచార, సంప్రదాయాల సంకలనం. మంగోలులు దీనిని చంఘీస్ ఖాన్ న్యాయస్మృతి అని ప్రజలపై రుద్దారు. ఇది మంగోలుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, తమ సంచారజాతి చిహ్నాన్ని గుర్తించి, ఈ న్యాయస్మృతిని ఓటమి పాలైన వారిపై రుద్దేటట్లు చేసింది.

AP Inter 2nd Year History Study Material Chapter 5 సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్

ప్రశ్న 7.
చైనా గొప్ప ప్రాకార నిర్మాణానికి కారణాలు.
జవాబు:
తన మొత్తం చరిత్రలో అనేక సంచార జాతుల దాడులు, రాజ్యాల ఆక్రమణల వలన చైనా ఎంతో నష్టపోయింది. అందువలన చైనా పాలకులు క్రీ.పూ. 8వ శతాబ్దం నుండీ తమ ప్రజల రక్షణార్థం అనేక కోటలు, ప్రాకారాలు నిర్మించుకున్నారు. తరువాత క్రీ.పూ 3వ శతాబ్దం నుండి ఈ కోటల నిర్మాణాలు అందరి రక్షణ నిర్మాణాలుగా కలిసిపోయి ఈనాడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చైనా గొప్ప ప్రాకారంగా పిలువబడుతోంది. ఉత్తర చైనాలోని వ్యవసాయ సమాజాలపై జరిగే సంచార జాతుల దాడుల వలన కలిగే భయం, కలత చెందటం వంటి వాటి నుండి ప్రజలకు రక్షణ కల్గించేదిగా ఈ నిర్మాణం చక్కని తార్కాణంగా కన్పిస్తుంది. ఈ ప్రాకారాన్ని చిన్ వంశానికి చెందిన షి హ్యాంగ్ అనే రాజు క్రీ.పూ. 221 నుండి 207 వరకు నిర్మించి పాలించాడు.

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు

Students get through AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు

ప్రశ్న 1.
ax2 + bx + c = 0 వర్గ సమీకరణానికి మూలాలు \(\frac{-b \pm \sqrt{b^2-4 a c}}{2a}\) అని చూపండి.
సాధన:
ax2 + bx + c = 0
= 4a(ax2 + bx + c) = 0
= 4a2x2 + 4abx + b2-b2 + 4ac = 0
(2ax + b)2 = b2 – 4ac
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 1

ప్రశ్న 2.
a, b, c ∈ R, a ≠ 0 అనుకొందాం. అప్పుడు R లోని అన్ని x లకు, ax2+b x+c, a లకు ఒకే గుర్తు ఉంటేనే a2+b x+c=0 మాలాలు వాస్తవేతర సంకీర్ణ సంఖ్లావుతాయి.
సాధన:
ax2+b x+c=0 సమీకరణానికి వాస్తవేతర సంకీర్ణ మూలాలు ఉండటానికి నియమం b2-4 a c<0, అంటే 4 ac-b2>0
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 2
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 3
కాబట్టి 4 ac-b2>0, అందువల్ల b2-4 a c<0. ఈ విధంగా అన్ని వాస్తవ x విలువలకు ax2+bx+c, a లకు ఒకే గుర్తు ఉన్నప్పుడు మాత్రమే b2-4 a c<0 అవుతుంది.

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు

ప్రశ్న 3.
ax2+bx+c=0 సమీకరణానికి సమాన మాలాలు ఉంటే, అపుడు x=\(-\frac{b}{2a}\) తప్ప తక్కిన అన్ని వాస్తవ x విలువలకు ax2+bx+ c, లకు ఉంటుంది అని చూపండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 4

ప్రశ్న 4.
α, β లు ax2+bx+c=0 కు వాస్తవ మూలాలు మరియు α<β అయిన
(i) α<β < β అయినపుడు ax2+bx+c=0 లకు వృతరేే గుర్తులా ఉంటాయి.
(ii) x < α లేదా x >β అయినపుడు ax2+bx+ c, లకు ఒకే గుర్తు ఉంటుంది.
సాధన:
α, β లు a x2+b x+c=0 కు మూలాలు కనుక a x2+b x+c=a (x-α) (x-β)
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 5

ప్రశ్న 5.
f(x)=a x2+b x+c వర్గ సమాసం.
(i) a>0 అయినపుడు f(x) కు =\(-\frac{b}{2a}\) వద్ద కనిష్ఠ విలువ \(=\frac{4 a c-b^2}{4a}\) అనీ,
(ii) a<0 అయినప్పుడు f(x) కు x= \(-\frac{b}{2a}\) వద్ద గరిష్ఠ విలువ \(=\frac{4 a c-b^2}{4a}\) అని చూపండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 6
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 7
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 8

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు

ప్రశ్న 6.
a1 x2+ b1 x+c1=0, a2 x2+b2 x+c2=0 వర్గసమీకరణాలకు ఉమ్మడి మూలం ఉండటానికి ఆవశ్యక, పర్యాప్త నియమాలను నిరూపించుము.
సాధన:
దత్త సమీకరణాల ఉమ్మడి మూలం α అనుకొందాం.
అప్పుడు
a1α2 + b1α + c1 0 — (1)
a1α2 + b2α + c2 = 0 — (2)
సమీకరణం (1) ని a2 తో సమీకరణం (2) ను a1 తో గుణిస్తే వచ్చిన సమీకరణాలలో రెండోదాన్ని మొదటి దానినుంచి తీసివేస్తే కక్రింది సమీకరణం వస్తుంది.
a2b1a – a1b2a + a2c1  – a1c2 = 0
అంటే α (a2b1 – a1b2) = a1c2 –  a2c1
అంటే α (a1b2 – a2b1) = c1a2 –  c2a1 — (3)
సమీకరణం (1) ని b2 సమీకరణం (2) ను b1 తో గుణిస్తే వచ్చిన సమీకరణాలలో రెండోదాన్ని మొదటి దానినుంచి తీసివేస్తే క్రింది సమీకరణం వస్తుంది.
a2 (a1b2 – a,b1) = b1c2 – b2c1 — (4)
సమీకరణం (3)ను రెండువైపలా వర్గంచేసి (4) ను ఉపయోగిస్తే పర్యాప్తత
(a1b2 – a2b1) (b1c2 – b2c1) = (c1a2 – c2a1)2 — (5) అనుకొందాం.
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 9
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 10

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు

ప్రశ్న 7.
3 x2+2 x-5=0 సమీకరణం మూలాలు కనుక్కోండి.
సాధన:
a x2+b x+c=0 వర్గ సమీకరణం మూలాలు
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 11
1,\(-\frac{5}{3}\) లు వర్గ సమాసం 3 x2+2 x-5 క శూన్యాలు అయినందువల్ల, అవి 3 x2+2 x-5=0 సమీకరణానికి మూలాలు.

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు

ప్రశ్న 8.
4 x2-4 x+17=3 x2-10 x-17 సమీకరణం మాలాలు కనుక్కోండి.
సాధన:
దత్తసమీకరణాన్ని x2+6 x+34=0 గా రాయవచ్చు. a x2+b x+c=0 వర్గ సమీకరణం మూలాలు
\(\frac{-b \pm \sqrt{b^2-4 a c}}{2a}\)
ఇక్కడ  a=1, b=6, c=34
అందువల్ల దత్తసమీకరణం మూలాలు
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 12

ప్రశ్న 9.
\(\sqrt{3} x^2+10 x-8 \sqrt{3}=0\) కు మాలాలను కనుక్కోండి.
సాధన:
ఇచ్చట a=\(\sqrt{3}\), b=10, c=-8 \(\sqrt{3}\)
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 13

ప్రశ్న 10.
x2-20 x+25=0 సమీకరణం మాలాల స్వభావాన్ని కనుక్కోండి.
సాధన:
ఇచ్చట a = 4, b=-20, c=25
Δ =b2– 4ac
= 400 – 4(4)(25)=0
∴ Δ =0, a, b, c ∈ Q కనుక మూలాలు వాస్తవాలు, సమానములు.

ప్రశ్న 11.
3 x2+7 x+2=0 సమీకరణం మూలాల స్వభావాన్ని తెల్పండి
సాధన:
ఇచ్చట a=3, b=7, c=2
Δ =b2– 4ac
= 49 – 4(3)(2) = 25 = 52 = సంపూర్ణ వర్గం
a, b, c ∈ Q మరియు Δ >0 సంపూర్ణ వర్గం కనుక మూలాలు వాస్తవాలు, విభిన్న అకరణీయ సంఖ్యలు.

ప్రశ్న 12.
x2 -2(1+3 m) x+7(3+2 m) = 0 సమీకరణం మూలాలు సమానమైన, m విలావలను కనుగొనుము.
సాధన:
ఇచ్చట a=1, b=-2(1+3 m), c=7(3+2 m) మూలాలు సమానం కనుక Δ = 0
⇒ b – 4ac = 0
⇒ 4(1 + 3m)2 – 4(1) (7) (3 + 2m) = 0
⇒ 4{(1 + 3m)2 – 7(3 + 2m)} = 0
⇒ 1 + 9m2 + 6m-21-14m = 0
⇒ 9m2=8m – 20 =  0
9m2 – 18m + 10m-20 = 0
9m(m  – 2) + 10(m – 2) =  0
⇒ (m – 2)(9m+ 10)= 0
⇒  m = 2 లేదా m = \(-\frac{10}{9}\)

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు

ప్రశ్న 13.
α, β లు ax 2+bx+c = 0  కు మాలాలు అయిన α22, α33 విలువలు a, b, c లలో కనుగొనుము.
సాధన:
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 14

ప్రశ్న 14.
P,Q,R లు అరణీయ సంఖ్లైన, x-2px -p2– q2+2 qr – r2 = 0 వర్ సమీకరణం మూలాలు అకరోయ సంఖ్యలు అని చూపండి.
సాధన:
ఇచ్చట a=1, b=-2 p, c=p2– q2+2 qr – r2
విచక్షణి (Δ) =b2– 4 ac
= (-2p)2 – 4(1)(p2-q2+2 qr – r2
= 4 p2-4p2 + 4 q2-8 qr + 4 r2
=4(q-r)2
∵ p, q, r లు అకరణీయ సంఖ్లలు కనుక విచక్షణి అనేది 2(q-r) అకరణీయ సంఖ్య వర్గం.
∴ దత్త సమీకరణం మూలాలు అకరణీయ సంఖ్యలు.

ప్రశ్న 15.
ఈ క్రింది మూలాలుగా గల వర్గ సమీకరణాలను కనుక్కోండి. \(2 \sqrt{3}-5,-2 \sqrt{3}-5\).
సాధన:
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 15

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు

ప్రశ్న 16.
మాలాల మొత్తం 1, వాటి వర్గాల మొత్తం 13 గా గల వర్గ సమీకరణాన్ని కనుక్కోండి..
సాధన:
వర్గ సమీకరణానికి మూలాలు α, β లు అనుకుంటే,
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 16

ప్రశ్న 17.
α, β ల a x2+b x+c=0 కు మాలాలు c ≠ 0 అయిన \(\frac{1-\alpha}{\alpha}, \frac{1-\beta}{\beta}\) లు మూలాలుగా గల వర్గ సమీకరణాన్ని కనుక్కోండి..
సాధన:
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 17
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 18

ప్రశ్న 18.
x2/3+x2/3-2 = 0 ను సాధించండి
సాధన:
(x1/3)2 + x1/3 – 2 = 0
x1/3 = a అనుకుందాం
a2 + a – 2 = 0
(a + 2) (a -1) = 0
= a = 1 లేదా a = – 2
= x1/3 = 1 లేదా x3/1 = – 2
x = 1 లేదా x = (-2) = – 8
∴ మూలాలు 1,- 8

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు

ప్రశ్న 19.
x వాస్తవం అయిన 71+x+71-x = 50 ను సాధించుము.
సాధన:
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 19
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 20

ప్రశ్న 20.
\(\sqrt{\frac{x}{1-x}}+\sqrt{\frac{1-x}{x}}=\frac{13}{6}\)
సాధన:
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 21
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 22

ప్రశ్న 21.
ఒక ధన వాస్తవ సంఖ్ల తన ధనాత్మక మూలానికన్నా 12 ఎక్కువ అయిన ఆ సంఖ్యను కనుక్కోండి.
సాధన:
ధనవాస్తవ సంఖ్య ‘x’ అనుకుందాం.
దత్తాంశం ప్రకారం, x=\(\sqrt{x}+12\) ………….. (1)
=x-12= √x
(x – 12)2 = x
= x2 – 24x+ 144= x
= x2 – 25x+ 144 = 0
= (x – 9) (x – 16) =0
= x = 9 లేదా  16
x = 9 అయిన L.H.S.=9,
R.H.S. = √9- 12 = 15,
LH.S. ≠ R.H.S.
x=16 అయిన L.H.S.=16,
R.H.S. = √16+ 12 = 16,
L.H.S. = R.H.S.
∴ కనుక కావలసిన ధన వాస్తవ సంఖ్య =16

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు

ప్రశ్న 22.
x2+4 a x+3=0,2 x2+3 a x-9=0 సమీకరణాలకు ఉమ్మడి మాలం ఉంటే, అప్పుడు a విలువలను, ఉమ్మడి మాలాన్నీ కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 38
(15)2 = (−5a) (−45a)
225 = 225a2 ⇒ a2 = 1 ⇒ a = ±1
a = 1 అయితే దత్త సమీకరణాలు
x + 4x + 3 = 0,
2x2 + 3x – 9 = 0
i.e., (x + 1) (x + 3) = 0;
(2x − 3) (x + 3) = 0
వాటి మూలాలు వరుసగా -1, -3; 3/2, -3
కనుక దత్త సమీకరణాల ఉమ్మడి మూలం -3
ఇట్లే a = -1 అయిన దత్త సమీకరణాలు
x2 – 4x + 3 = 0,
2x2-3x – 9 = 0
i.e., (x – 1) (x – 3) = 0,
(2x + 3) (x − 3) = 0
వాటి మూలాలు వరుసగా 1, 3,\(-\frac{3}{2}\), 3
కనుక దత్త సమీకరణాల ఉమ్మడి మూలం 3.
దత్త సమీకరణాల ఉమ్మడి మూలాలు 3, -3 లు.

ప్రశ్న 23.
రెండు వరుస ధనాత్మక బేసి పూర్ణసంఖ్యల వర్గాల మొత్తం 290 అయ్యేటట్లు ఒకే ఒక జత ఉంటుందని చూపి, వాటిని కనుక్కోండి.
సాధన:
రెండు వరుస ధనాత్మక బేసి పూర్ణ సంఖ్యల భేదం = 2
కనుక వరుస బేసి ధన పూర్ణాంకాలు X, X + 2 అనుకుందాం. దత్తాంశం ప్రకారం
(x)2 + (x + 2)2 = 290
⇒ x2 + x2 + 4x + 4 = 290
⇒ 2 x 2+4 x -286 = 0
⇒ x 2 + 2x – 143 = 0
13x – 11x – 143 = 0
⇒ x(x + 13) − 11(x + 13) = 0
⇒ (x – 11) (x + 13) = 0
⇒ x = 11, x = -13
సమీకరణం (1)ని ధృవీకరించే ఏకైక ధనాత్మక బేసి పూర్ణ సంఖ్య 11.
కనుక 11, 13 అనే ఒకే ఒక జత వరుస బేసి ధనాత్మక పూర్ణాంకాలు ఉంటాయి.

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు

ప్రశ్న 24.
ఒక కేబుల్ తీగ ఖరీదు రూ.35.00 లు. తీగ పొడవు గనక 4 మీటర్లు అదనంగా ఉండి ఉంటే, మీటరు ఖరీదు రూ.1.00 చొప్పున తగ్గి మొత్తం ఖరీదు మారకుండా ఉండేది. అయిన తీగ పొడవెంత?
సాధన:
తీగ పొడవు = ‘l’ మీ అనుకోండి.
మీటరు తీగ వెల = X రూ. అనుకొందాం.
అపుడు lx = 35 ………………. (1)
మరియు (l + 4) (x − 1) = 35
⇒ lx + 4x – 1 – 4 – 35
⇒ 35 + 4x – 1 – 4 = 35
⇒ 4x – 1 = 4
⇒ x = \(\frac{l+4}{4}\)
(1), (2) ల నుండి, \(l\left[\frac{l+4}{4}\right]=35\) ………………… (2)
⇒ l2 + 4l = 140
⇒ l2+4l-140 = 0
⇒ (l+14) (l-10)= 0
⇒ l= 10 లేదా ! = -14
l ఎల్లప్పుడూ ధనాత్మక సంఖ్య కనుక l = 10 .
∴ కేబుల్ తీగ పొడవు (l) = 10 మీ.

ప్రశ్న 25.
మేకల మందలో నాలగోవంతు అడవిలో మేస్తున్నాయి. మందలోని మేకల సంఖ్య య్తొక్క వర్గమూలానికి రెండు రెట్ల్ల కొండమీదికెళ్ళాయి. విగిలిన 15 మేకలా నది గట్టున ఉన్నాయి. మేకల మొత్తం సంఖ్యను కనుక్కోండి.
సాధన:
మందలోని మేకల సంఖ్య ‘x’ అనుకుందాం.
అపుడు అడవిలో మేస్తున్న మేకల సంఖ్య \(=\frac{\mathrm{x}}{4}\)
కొండ మీదకెళ్ళిన మేకల సంఖ్య \(=2 \sqrt{\mathrm{x}}\)
నది గట్టున ఉన్న మేకల సంఖ్య =15
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 23

ప్రశ్న 26.
క్రికెట్టు ఆటలో రవి తీసుకొన్న వికెట్ల సంఖ్యకు రెండు రెట్లు కంటే ఒక వికెట్ తక్కువ అనిల్ తీసుకొన్నాడు. వారిద్దరూ తీసుకొన్న వికెట్ల సంఖ్య లబ్దం 15 అయిన ఒక్కొక్కరూ ఎన్ని వికెట్లు తీసుకొన్నదీ కనుక్కోండి.
సాధన:
రవి తీసుకొన్న వికెట్ల సంఖ్య అనుకుందాం.
అపుడు అనిల్ తీసుకొన్న వికెట్ల సంఖ్య =2 x-1
దత్తాంశం (ప్రకారం (x) (2 x-1)=15
=2x2 – x-15 = 0
2x2 – 6x + 5x -15 = 0
=2x(x – 3) + 5(x -3) = 0
=(x – 3)(2x + 5) = 0
= x = 3 లేదా – \(\frac{5}{2}\)
x≠ – \(\frac{5}{2}\)
∴ రవి తీసుకొన్న వికెట్ల సంఖ్య (x)=3
అనిల్ తీసుకొన్న వికెట్ల సంఖ్య 2x – 1=6-1=5

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు

ప్రశ్న 27.
సమతలం మీద కొన్ని బిందువులను గుర్తించి, బిందు యుగ్మాలను రేఖాఖండాలతో కలపటం జరిగింది. ఇట్లు చేయగా ఏర్పడిన రేఖా ఖండాల సంఖ్య మొత్తం 10 అయితే, తలం మీద గుర్తించిన ఐిందువుల సంఖ్యను కనుక్కోండి.
సాధన:
తలం పై బిందువుల సంఖ్య = x అనుకోండి.
రెండేసి ఏిందువులను కలిపితే ఏర్పడే రేఖా ఖండాల సంఖ్య
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 24
x2-x=20
x2 -x-20=0
⇒ (x-5)(x+4)=0
⇒ x =-4,5
x>0 ⇒  x=5
∴ కనీస బిందువుల సంఖ్ = 5

ప్రశ్న 28.
ax2+b x+c=0, bx2+c x+a=0 వర్గ సమీకరణాలకు ఉమ్మడి మూలం ఉంటీ, a3+b3+ c3= 3abc అని చూపండి.
సాధన.
ఉమ్మడి మూలం ‘α’ అనుకోండి. అపుడు
2+bα+c=0
2+c α +a=0
అడ్డ గుణకార పద్ధతి ప్రకారం
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 25

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు

ప్రశ్న 29.
x యొక్క ఏ  వాస్తవ విలువలకు x2-5 x-14 వర్గ సమాసం ధనాత్మకం అవుతుంది ?
సాధన:
x2-5 x-14 >0
=x2 -7x + 2x – 14 = O
x(x – 7) + 2 (x – 7) > 0
=(x + 2)(x -7) >0
= x2 గుణకం = 1 >0, x2– 5x- 14 >0
x విలువ (-2,7) ల మధ్య ఉండదు.
⇒ X∈ ( – ∞ , – 2) ∩ (7,∞)

ప్రశ్న 30.
ఏయే x విలువలకు -6x2+2 x-3 ఖిణాత్మకం అవుతుంది ?
సాధన:
-6 x2+2 x-3<0 ⇒ 6 x2-2 x+3>0
ఇచ్టట a=6, b=-2, c=3.
Δ = b2-4 ac = 4 – 4 (6) (3)
= 4 – 72 = – 68 < 0
∵ Δ < 0, x2 గుణకం = 6,
కనుక ∀ x ∈ R, 6x2+2x+3>0
లేదా ∀ x ∈ R,- 6x2+2x+3<0

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు

ప్రశ్న 31.
x యొక్క ఏ విలువకు ఈ క్రింది సమాసాలు గరిష్హ లేదా కనిష్ట విలువలు కల్గివంటాయి.

(i) x2+5 x+6
సాధన:
ఇచ్చట a=1, b=5, c=6
∵  a>0, x2+5 x+6 కు x= \(\frac{-b}{2a}\) వద్ద
కనిష్ఠ విలువ ఉంటుంది.
∴ \(x=\frac{-5}{2(1)}=\frac{-5}{2}\)

(ii) 2 x-x2+7
సాధన:
-x2+2 x+7 ఇచ్చట a=-1, b=2, c=7
∵ a<0,-x2+2 +7 కు x = \(\frac{-{b}}{2 {a}}\) వద్ద
గరిష్ఠ విలువ ఉంటుంది.
∴ x = \(-\frac{(2)}{2(-1)}\)=1

ప్రశ్న 32.
ఈ క్రింది వర్గ సమాసాలకు గిిష్ఠ లేదా కనిష్ఠ విలువలను కనుక్రోండి.
(i) 2x-7-5x2
(ii) 3x2+ 2 +11
సాధన:
(i) f(x)=2 x-7-5x2 = -5x2+2 x-7
a x2+b x+c తో పోల్చగా
a = -5, b = 2, c = -7
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 26

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు

ప్రశ్న 33.
x యొక్క అన్ని వాస్తవ విలువలకు 4 x-5 x2+2 గుర్తులలో మార్పలలను కనుక్కోండి. వాటి అంత్య విలువలను కనుక్కోండి.
సాధన:
సమీకరణం 4 x-5 x2+2=0
⇒ 5 x2-4x-2=0
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 27
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 28

ప్రశ్న 34.
x2+x-12 ≤ 0 యొక్క సాధన సమితిని బీజీయ పద్ధతి, గేఖాచిత్త పద్ధతుల ద్వారా కనుక్కోండి.
సాధన:
బీజీయ పద్ధతి : x2+x-12=(x+4)(x-3).
కాబట్టి x2+x-12=0 సమీకరణం -4, 3.
x2+x -12=0 వర్గ సమాసంలో x2 గుణకం ధనాత్మకం
అయినందువల్ల -4<x<3 అయితే x2+ x – 12 రుణాత్మకం, x<-4 గానీ x>3 గానీ అయితే x2+x-12 ధనాత్మకం.
కాబట్టి x2+ x – 12 ≤ 0 ⇔ – 4 ≤ x ≤ 3
అందువల్ల సాధన సమితి {x ∈ R : – 4 ≤ x ≤ 3}.
రేఖా చిత్ర పద్ధతి : y=f(x)=x2+x-12 అనుకొందాం.
x యొక్క కొన్ని ఎంపిక చేసిన విలువలకు y విలువలను క్రింది పట్టికలో ఇచ్చాం.
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 29
పట్టికలోని విలువలను ఉపయోగించి y=f(x) రేఖా
చి(తాన్ని గీశాం. దీన్ని పటం 3.4లో  చూపించాం.

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 30

y=f(x) రేఖా y=f(x) రేఖా చిత్రo నుండి -4 ≤ x ≤ 3 అయితేనే y= x2– x -12<0 అవుతుందని మనం గమనిస్తాం. అందువల్ల సాధన సమితి {x ∈ R : – 4 ≤ x ≤3}.

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు

ప్రశ్న 35.
ఏయే x విలువలకు x2-3 x-10<0, 10x – x2 – 16 > 0 అసమీకరణాలు రెండు వర్తిస్తామో కనుక్కోండి.
సాధన:
x2-3 x-10<0
x2-5 x+2 x-10<0
x(x-5)+2(x-5)<0
(x-5)(x+2)<0
x ∈ (-2,5) …………… (1)
10 x – x2-16>0
x2-10 x+16<0
x2-8 x-2 x+16<0
x(x-8)-2(x-8)<0
(x-8)(x-2)<0
⇒ x ∈ (2,8) …………… (2)
(1), (2) ల నుండి ఉమ్మడి సాధన 2<x<5

ప్రశ్న 36.
\(\sqrt{\mathbf{x}+2}>\sqrt{8-\mathbf{x}^2}\) అసమీకరణాన్ని సాధించండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 31

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు

ప్రశ్న 37.
\(\sqrt{(x-3)(2-x)}<\sqrt{4 x^2+12 x+11}\) అసమీకరణాన్ని సాధించండి.
సాధన:
దత్త అసమీకరణం. ఈ (క్రంది రెండు అసమీకరణాలను ఇస్తుంది.
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 32

ప్రశ్న 38.
\(\sqrt{\frac{6+x-x^2}{2 x+5}} \geq \sqrt{\frac{6+x-x^2}{x+4}}\) అసమీకరణాన్ని సాధించండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 33

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు

ప్రశ్న 39.
\(\sqrt{x^2-3 x-10}>8-x\) అసమీకరణాన్ని సాధించండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 34
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 35

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు

ప్రశ్న 40.
R మీద \(\frac{x^2+14 x+9}{x^2+2 x+3}\) ప్రమేయం గరిష్ఠ విలువను  కనుగొనుము.
సాధన:
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 36

ప్రశ్న 41.
R మీద \(\frac{x^2+34 x-71}{x^2+2 x-7}\) మొక్క ఏ విలువలూ 5, 9ల మధ్య ఉండవని చూపండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 వర్గసమాసాలు 37

AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(f)

Practicing the Intermediate 2nd Year Maths 2B Textbook Solutions Chapter 6 సమాకలనం Exercise 6(f) will help students to clear their doubts quickly.

AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Exercise 6(f)

అభ్యాసం – 6(ఎఫ్)

I. కింది సమాకలనులను గణించండి.

ప్రశ్న 1.
∫ex (1 + x2) dx
సాధన:
∫ex (1 + x2) dx = ∫ex dx + ∫x2 . ex dx
= ex + (x2 . ex – 2 ∫x. ex dx)
= ex + x2 . ex – 2x. ex + 2ex + C
= ex(x2 – 2x + 3) + C

ప్రశ్న 2.
∫x2 e-3x dx
సాధన:
∫x2 e-3x dx = \(\frac{x^2 \cdot e^{-3 x}}{-3}\) + \(\frac{1}{3}\)∫e-3x. 2x dx
= –\(\frac{x^2 \cdot e^{-3 x}}{3}\) + \(\frac{2}{3}\)(\(\frac{x \cdot e^{-3 x}}{-3}\) + \(\frac{1}{3}\)∫e-3xdx)
= \(\frac{-x^2 \cdot e^{-3 x}}{3}\) – \(\frac{2}{9}\)x. e-3x – \(\frac{2}{27}\)e-3x + C
= \(\frac{-\mathrm{e}^{-3 x}}{27}\)(9x2 + 6x + 2) + C

AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(f)

ప్రశ్న 3.
∫x3 eax dx
సాధన:
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(f) 1

II.

ప్రశ్న 1.
n ధన పూర్ణాంకం అయితే
∫xn e-x dx = -xne-x + n∫xn – 1e-x dx
అని చూపండి.
సాధన:
∫xn e-x dx = -xne-x + n∫xn – 1e-x dx
= -xn. e-x + n∫xn – 1e-x dx

ప్రశ్న 2.
పూర్ణాంకము n ≥ 2, 1 = | cosn x dx, అయితే In = \(\frac{1}{n}\) cosn-1 x sin x + \(\frac{n-1}{n}\) అని చూపండి.
సాధన:
In = ∫cosn x dx = ∫cosn – 1. cos x dx
= cosn – 1x. sin x – ∫ sin x. (n – 1) cosn – 2(-sin x) dx
= cosn – 1x. sin x + (n – 1)In – 2 – (n – 1)In
∴ In(1 + n – 1) = cosn – 1x. sin x + (n – 1)In – 2
In = \(\frac{\cos ^{n-1} x \sin x}{n}\) + \(\frac{n-1}{n}\)In-2

III.

ప్రశ్న 1.
ధన పూర్ణాంకము n ≥ 2, I<sub.n = ∫ cotn x dx, కు లఘూకరణ సూత్రాన్ని రాబట్టండి. దాని నుంచి ∫cot4 x dx విలువ రాబట్టండి. (A.P. Mar. ’16 (May ’11))
సాధన:
In = ∫ cotn x dx = ∫ cotn – 2x. cot2 x dx
= ∫cotn-2x. (cosec2x – 1) dx
= ∫cotn-2x. cosec2 x dx – In – 2
= –\(\frac{\cot ^{n-1} x}{n-1}\) – In – 2
n = 4 ⇒ I4 = –\(\frac{\cot ^3 x}{3}\) – I2
n = 2 ⇒ I2 = -cot x – I,sub>0 ఇక్కడ I0 = ∫dx = x
I2 = -cot x – x
I4 = \(-\frac{\cot ^3 x}{3}\) – (-cot x – x) + C
= \(-\frac{\cot ^3 x}{3}\) + cot x + x + C

AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(f)

ప్రశ్న 2.
ధన పూర్ణాంకము n ≥ 2, In = ∫ cosecn x dx కు లఘుకరణ సూత్రాన్ని రాబట్టండి. దాని నుంచి ∫ cosec x dx విలువ రాబట్టండి.
(T.S. Mar. ’16)
సాధన:
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(f) 2
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(f) 3

ప్రశ్న 3.
n ధనపూర్ణాంకం, పూర్ణాంకం m ≥ 2, Im,n = ∫sinmx cosn x dx అయితే
Im,n = –\(\frac{\sin ^{m-1} x \cos ^{n+1} x}{m+n}\) + \(\frac{m-1}{m+n}\)Im-2, n అని చూపండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(f) 4
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(f) 5
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(f) 6

AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(f)

ప్రశ్న 4.
∫ sin5 cos4 dx గణించండి.
సాధన:
లఘుకరణ సూత్రం
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(f) 7

ప్రశ్న 5.
In = ∫(log x)ndx, అయితే In = x (log x)n – n. In-1, అని చూపి, దాని నుంచి ∫(log x)4 dx ను కనుక్కోండి.
సాధన:
సాధన:
In = ∫(log x)n dx
= (log x)n. x – ∫x . n . (log x)n – 1. \(\frac{1}{x}\) dx
= x. (log x)n – n ∫ (log x)<supn – 1 dx
= x (log x)n – n. In-1
I4 = x(log x)4 – 4. I3
I3 = (x log x)3 – 3. I2
I2 = (x log x)2 – 2. I1
I1 = x log x – x
I2 = (x(log x)2 – 2x log x + 2x
(x (log x)3 – 3(x (log x)2 – 2x log x + 2x)
= x. (log x)3 – 3x (log x)2 + 6x (log x) – 6x
I4 = x(log x)4 – 4[x. (log x)3 – 3x (log x)2 + 6x (log x) – 6x] + C
= x(log x)4 – 4(log x)3 + 12(log x)2 – 24 (log x) + 24] + C

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 2 డిమోయర్ సిద్ధాంతం

Students get through AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 2 డిమోయర్ సిద్ధాంతం which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 2 డిమోయర్ సిద్ధాంతం

ప్రశ్న 1.
\(\frac{(\cos \alpha+i \sin \alpha)^4}{(\sin \beta+i \cos \beta)^8}\) సూక్ష్మీకరించండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 2 డిమోయర్ సిద్ధాంతం 1
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 2 డిమోయర్ సిద్ధాంతం 2

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 2 డిమోయర్ సిద్ధాంతం

ప్రశ్న 2.
m,n లు పూర్ణాంకాలు, x =cos α +i  sin α, y = cosβ +i sin β అయితే, \(x^m y^n+\frac{1}{x^m y^n}\) = cos (m α+n β)  మరియు \(x^m y^n-\frac{1}{x^m y^n}\) అని చూపండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 2 డిమోయర్ సిద్ధాంతం 3

ప్రశ్న 3.
n ధనహూర్గాంకం అయితే, (1+i)n+(1-i)n \(2^{\frac{n+2}{2}} \cos \left(\frac{n \pi}{4}\right)\) అని చూపండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 2 డిమోయర్ సిద్ధాంతం 5
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 2 డిమోయర్ సిద్ధాంతం 6

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 2 డిమోయర్ సిద్ధాంతం

ప్రశ్న 4.
ధనహార్ణాంకం అయితే (1+cos θ +i sin θ)n +(1+cos θ -i sin θ)n=2n+1 \(\cos \left(\frac{n \theta}{2}\right)\) అని చూపండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 2 డిమోయర్ సిద్ధాంతం 7

ప్రశ్న 5.
Cos α + Cos β + Cos γ = 0 = sin α + sin β + sin γ అయితే  y cos2 α + cos2 β + cos2 γ = \(\frac{3}{2}\)
sin2 α +sin2 β + sin2 γ అని చూపండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 2 డిమోయర్ సిద్ధాంతం 8
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 2 డిమోయర్ సిద్ధాంతం 9

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 2 డిమోయర్ సిద్ధాంతం 10

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 2 డిమోయర్ సిద్ధాంతం

ప్రశ్న 6.
\((\sqrt{3}+i)^{1/4}\) విలువలు కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 2 డిమోయర్ సిద్ధాంతం 12

ప్రశ్న 7.
x11-x7+x4-1=0 సమీకరణానికి మాలాలు కనుక్కోండి.
సాధన:
x11-x7+x4-1 = o
= x7(x4 – 1) + 1(x4– 1) = 0
(x4 – 1) (x7 + 1) = 0
సందర్భం : x4 – 1 = 0
x4 = 1 = (cos 0 + j sin 0)
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 2 డిమోయర్ సిద్ధాంతం 13

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 2 డిమోయర్ సిద్ధాంతం

ప్రశ్న 8.
ఏకకపు ఘన మూలాలు 1, ω, ω2 అయితే,
(i) (1 – ω+ω2)6+(1 – ω2+ω)6=128= (1 – ω+ω2)7 +(1 + ω – ω2)7
(ii) (a+b)(aω+bω2)(aω2+bω)=a3+b3
(iii) x=ω-ω2-2 అయితే,  x2+4x+7=0 అని చూపండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 2 డిమోయర్ సిద్ధాంతం 18
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 2 డిమోయర్ సిద్ధాంతం 15
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 2 డిమోయర్ సిద్ధాంతం 16

AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 2 డిమోయర్ సిద్ధాంతం

ప్రశ్న 9.
α, β లు x2+x+1=0  కు మూలాలు అయితే α44-1 β-1 =0 అని చూపండి.
సాధన:
α, β  x2 + x +1 = 0 కు మాలాలు అయతే
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 2 డిమోయర్ సిద్ధాంతం 17

AP Inter 2nd Year History Study Material Chapter 4 భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 4th Lesson భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 4th Lesson భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మహ్మద్ ప్రవక్త జీవిత విశేషాలు గూర్చి సంక్షిప్తంగా తెలియజేయుము. ఆయన ఏమి బోధించెను ?
జవాబు:
అరేబియాలోని ఎడారి ప్రాంతంలో గల మక్కా నగరంలో క్రీ.శ. 570లో ఖురేషి జాతికి చెందిన హాష్మయిట్ కుటుంబంలో మహ్మద్ జన్మించాడు. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అనాథ అయిన మహమ్మదు అతని మేనమామ అబూతాలిబ్ పెంచాడు. మామతోపాటు వర్తక వ్యాపారాలలో పాల్గొని మంచి సామర్థ్యం సంపాదించాడు. దక్షిణ అరేబియా, సిరియా వంటి అనేక ప్రాంతాలలో వర్తక బిడారులతో, విస్తృతంగా పర్యటించాడు.

ఖదీజా అనే బాగా డబ్బున్న వితంతువు వద్ద ప్రతినిధిగా చేరి కొద్ది కాలంలోనే ఆమె అభిమానాన్ని, ప్రేమను చూరగొని ఆమెను వివాహమాడాడు. మహమ్మద్ నిరంతరం ఆలోచనా నిమగ్నుడై ఉండేవాడు. మక్కా సమీపంలో ధ్యానం చేసేవాడు. జీవిత సత్యాలకై అన్వేషించాడు. మహ్మద్కు తన 40వ ఏట నిజమార్గం లభించింది. మహ్మద్ తనకు కలిగిన సత్యానుభూతితో ప్రవక్తగా మారాడు. తాను దేవుని దూతనని (రసూల్) భావించాడు. మహ్మద్కు కలిగిన దైవానుభూతితో ‘అల్లా’ ఒక్కడే దేవుడని తాను అల్లా యొక్క ప్రవక్తను అని విశ్వసించాడు. అట్లాగే బోధించాడు. ఇటువంటి విశ్వాసులందరినీ ఒక జనసామాన్యంగా తయారు చేసాడు.

మక్కా ఒక వ్యాపారకేంద్రంగానే కాక పవిత్రమైన దేశంగా మారింది. మక్కాలోని ‘కబ్బా’ అనే ఒక దీర్ఘచతురస్రాకారం రాయి ముసల్మానులకు పవిత్ర స్థలమయింది. ఇస్లాం అనగా దేవుని వలన శాంతిని పొందుట.

AP Inter 2nd Year History Study Material Chapter 4 భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

ఇస్లాం మత లక్షణాలు: దైవం యొక్క ఏకత్వాన్ని, ఆధిక్యతను అంగీకరిస్తూ ఆయనకు సేవలు చేయడం ద్వారా శాంతిని సాధించవచ్చు. అల్లా అనే ఒకే ఒక దేవుడున్నాడని, ఆయన సర్వాధికుడని ఇస్లాం చెబుతుంది. ప్రపంచంలోని ముసల్మానులందరూ సమానులే. వారు సోదర సమానులు. ఏకేశ్వరోపాసన ఇస్లాంలో కనిపిస్తుంది. విగ్రహారాధన లేదు. ఇస్లాంలో పూజారులు లేరు. వారి ఆరాధనలో సులభమైన పద్ధతులు కలవు. ప్రతిరోజు ప్రార్థన, ప్రతి ముసల్మాను తన మతవిధిగా దేవుని పేరుతో పేదలకు దానధర్మాలు చేయుట, దొంగతనాలు చేయకుండుట వంటి నియమాలు అనుసరించాలి. మహ్మద్ చెప్పిన సర్వసమానత్వం కులీనులకు కంటగింపుగా మారింది. ఆ వర్గం మహ్మద్ను అనేక ఇబ్బందులకు గురి చేసింది. ప్రాణాపాయం నుండి తప్పించుకొనుటకు క్రీ.శ.622లో మహ్మద్ మక్కాను వదిలి మదీనాకు ప్రవాసం పోయాడు. ఈ ప్రవాసాన్ని ‘హిజరా’ పేరుతో ముసల్మానుల కేలండర్ ప్రథమ సంవత్సరంగా గుర్తించారు. క్రీ.శ. 632లో మహ్మద్ మరణించే నాటికి అరేబియా అంతా ఒక్కటై గొప్ప మత సమైక్యతను సాధించింది. మహమ్మదీయులు తమ మత ప్రచారం, వ్యాప్తి పట్ల తీవ్రమైన ఉత్సాహం, ఉద్రేకం కలిగి ఉండేవారు.

మహ్మద్ ప్రవక్త బోధనలు: ఈ నూతన మత సారాంశం వారి పవిత్ర గ్రంథమైన ఖురాన్తో కనుగొనవచ్చు. అరబిక్ భాషలో ఖురాన్ అనగా కంఠస్తం చేయడం. మహ్మద్ విగ్రహారాధనను ఖండించాడు. అల్లాను విశ్వసించే భక్తులు సహోదరులు వలె జీవించాలి. దేవుని దృష్టిలో అందరూ సమానులే. ‘లా ఇలాహ ఇల్ అల్లా మహమ్మద్ ఉర్
రసూల్ అల్లా (అల్లా తప్ప మరో దేవుడు లేడు) మహ్మద్ అతని ప్రవక్త, ఇది వారి ప్రార్థనాగీతం, దీని పునఃచరణనే కల్మా అంటారు. మహ్మద్ యొక్క స్వంత తెగ ఖురేషీకి చెందినవారు మక్కాలో నివసించి కాబాపై అధికారం చలాయించారు. ప్రతి ముసల్మాను రోజుకు ఐదుసార్లు ప్రార్థన చేయాలి. దీనినే నమాజ్ అంటారు. శుక్రవారం మధ్యాహ్నం తప్పనిసరిగా మసీదులో ప్రార్ధన చేయాలి.

ఇస్లాం మతానికి పవిత్రమైన రంజాన్ నెలలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి ఎటువంటి ఆహారం తీసుకోరాదు. ప్రతి ముసల్మాను తన మత విధిగా, దేవునికి కానుకగా పేదలకు దానం చేయాలి. ఈ పవిత్రమైన చర్యను ‘జకాత్’ అంటారు. ప్రతి మహమ్మదీయుడు తన జీవితకాలంలో ఒక పర్యాయమైన మక్కాలోని పవిత్ర స్థలాన్ని సందర్శించాలి. ఈ తీర్థయాత్రనే ‘హజీ’ అంటారు. ఇవి కాక మరికొన్ని నియమాలను, ఆచారాలను ముసల్మానులు ఆచరించాలి. అణకువ, దాతృత్వం, నిజాయితీ, మహిళల పట్ల, తల్లిదండ్రుల పట్ల గౌరవం, బానిసలపై కారుణ్యం, జంతువులపై దయ, మధ్యపానం, జూదంలకు దూరంగా ఉండటం వంటి సద్గుణాలకు ప్రాధాన్యత ఇవ్వబడింది.

ఇస్లాం మతం హేతువాదానికి ప్రాధాన్యత ఇచ్చింది. మంత్రతంత్రాలు, అర్థం కాని ఆధ్యాత్మిక సూత్రాలు ఇందులో లేవు. అందరూ సమానులే అన్న సిద్దాంతం ఇస్లాం ఉదారవాదానికి ప్రతీక. మహమ్మదీయులలో విశ్వమానవ సౌభ్రాతృత్వం, దేవునికి మనిషికి మధ్య గల ప్రీతిపాత్రమైన సంబంధం వంటి అనేక లక్షణాలు ఇస్లాం మతాన్ని ప్రపంచ మతాలలో ఒక గొప్ప మానవతామతంగా తీర్చిదిద్దాయి.

ప్రశ్న 2.
ఇస్లాం వారసత్వం గురించి వివరింపుము.
జవాబు:
రోమన్ సామ్రాజ్యం వలె విస్తరణలోను, వివిధ రకాలైన ప్రజలతో కూడుకొని అరబ్ లేదా ఇస్లాం సామ్రాజ్యం కూడా ప్రసిద్ధిగాంచింది. స్పెయిన్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణ ఆసియా ప్రాంతాలకు చెందిన ప్రజలు అరబ్ సామ్రాజ్యంలో అంతర్భాగం. ప్రాజ్ఞులైన ఎందరో ఈ రాజ్యాన్ని పాలించారు. వారిలో హరున్-అల్-రషీద్, ఆయన కుమారుడు మామున్లు మిక్కిలి ఖ్యాతి గాంచారు. హరున్-అల్-రషీద్ పాండిత్యం, కళలు, సాహిత్యం, విజ్ఞానం, వర్తక వ్యాపారులను ప్రోత్సహించాడు.

విద్య: అరబ్బుల ఇస్లాం సామ్రాజ్యంలో గర్వించదగిన బాగ్దాద్, కైరో, డమాస్కస్, కార్గోవా, సెవిలె, బార్సిలోనా వంటి చోట్ల గొప్ప విద్యాకేంద్రాలుండేవి. వీరు ప్రాచీన గ్రీకు మహాకావ్యాలు హైందవుల గణిత గ్రంథాలను తర్జుమా చేసారు. మహమ్మదీయులు ‘మదర్సాలు’ అనే విద్యాకేంద్రాలు స్థాపించారు. మదర్సాలు మసీదులకు అనుబంధ కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి. భారతీయులు ఖగోళ, గణిత శాస్త్రాలలో చేసిన కృషి అరబ్బులనెంతో ఆకర్షించింది. అరబ్బుల ద్వారా ఈ జ్ఞానం యూరపు అందింది. డా. ఇబిన్సినా (980-1037) యొక్క వైద్యగ్రంథాలు అరబ్ దేశాలలో విస్తృతంగా అధ్యయనం చేయబడింది. అవిసెన్నా రచించిన “అలనూన్, ఫిల్ టిబ్” అనే వైద్య గ్రంథంలో 760 రకాల మందులు గురించి పేర్కొన్నారు. ఈ వైద్య గ్రంథం యూరప్లో పాఠ్యగ్రంథంగా చేయబడింది.

అరబ్బులు సంఖ్యామానాన్ని భారతీయుల వద్ద నేర్చుకున్నారు. వారి ద్వారా యూరప్ కు చేరింది. గణితశాస్త్రంలో అరబ్బులు మరిన్ని పరిశోధనలు చేసారు. కళ్ళ జబ్బులు, అంటురోగాల వ్యాప్తికి మందులు కనిపెట్టారు. బస్రాకు చెందిన ‘అల్హసన్’ అనే శాస్త్రజ్ఞుడు దృష్టికి సంబంధించిన మూలగ్రంథాన్ని రచించాడు. ఇది తదుపరి లాటిన్లోకి అనువదించబడి ‘ఆప్లికేథెసారస్’గా ప్రసిద్ధిచెందింది.

ఉత్పత్తులు: అరబ్బులు పేపర్ తయరీ, బ్లాక్ ముద్రణ విధానాలు చైనా వారి నుండి గ్రహించారు. వీరి ద్వారా ఐరోపా వారు గ్రహించారు. అనేక రసాయన సమ్మేళనాలను కనుగొన్నారు. నత్రికామ్లం, సల్ఫ్యూరిక్ఆమ్లం, సిల్వర్ నైట్రేట్ మొదలైన రసాయనాలు తయారుచేసారు. ‘మస్లిన్’ వస్త్రం తయారీ రంగంలో ప్రసిద్ధిగాంచారు. పారసీక తివాచీలు, చర్మకారుల తయారీలు జగత్ప్రసిద్ధి చెందాయి. ఆయుధాలను అందంగా తీర్చిదిద్దడంలో వీరిది అందెవేసిన చేయి. బాకులు, కటారులు మణిఖచితమైన అందాన్ని సంతరించుకున్నాయి.

ప్రయాణాలు, విదేశీ వ్యాపారం: అరబ్బులు అలవాటుపడిన బాటసారులుగా గుర్తింపు పొందారు. వారు వస్తు, విశేషాలతో చైనా, భారతదేశాలకు బిడారులుగా వెళ్ళేవారు. భూ, సముద్ర మార్గాల ద్వారా సుదూర ప్రాంతాలకు దీర్ఘప్రయాణాలు చేసేవారు. అల్బేరూని, ఐఇబన్ బతూత, అల్ ఇద్రిసి వంటి ప్రయాణీకులు ఇట్టివారే. నావికాబలంలోను, సముద్రయానంలోను, నూతన ప్రదేశాల అన్వేషణలో అరబ్బులు అగ్రగణ్యులు. ఈ సముద్రప్రయాణాలు వర్తక, వ్యాపారాలకు ప్రోత్సాహాన్నిచ్చాయి. ఇండియా, చైనా, తీర ఆఫ్రికాతో విస్తృత వాణిజ్య సంబంధాలు పెరిగాయి. అరబ్బులు తమ ప్రత్యేక ఉత్పత్తులను విదేశీ విపణులలో అమ్మేవారు. రగ్గులు, తివాచీలు, పరిమళ వస్తువులు, మల్లుసెల్లాలు, గాజుగుడ్డలు, పండ్ల పానీయాలు మొదలైన వాటికి గిరాకీ. బాగ్దాద్ సిరిసంపదలతో తులతూగుతూ గొప్ప ఖ్యాతినార్జించింది.

AP Inter 2nd Year History Study Material Chapter 4 భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

కళలు, వాస్తు నిర్మాణాలు: అరబ్బులు గొప్ప భవన నిర్మాతలు. అరబ్బుల కళలు ఇరాన్, బైజాంటిన్ సామ్రాజ్యాలచే ప్రభావితం చెందాయి. నిర్మాణంలో వీరిది ప్రత్యేకశైలి. వీరి వాస్తుశిల్పికళా ప్రక్రియలు మసీదులలోనే కాక పుస్తక భాండాగారాలలో, వైద్యశాలల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. నాటి ప్రసిద్ధిగాంచిన నిర్మాణాలలో అల్ హమ్ర్బా (స్పెయిన్లోని గ్రనడా వద్ద), అల్కాజర్ (సెవిల్ వద్ద), గొప్పమసీదు (బాగ్దాద్)లో కలవు. డోమ్, ఆర్చి, మినారట్ల నిర్మాణ ప్రక్రియ వారి వాస్తు శైలికి నిదర్శనం. ఖురాన్ మానవులను, జంతువులను సూచించే బొమ్మలను నిషేధించినందున మహమ్మదీయ కళాకారులు రాజభవనాలు, మసీదు లోపల, వెలుపల గోడలపై చెక్కుడు పనితనాన్ని చూపారు. రాజభవనాల చుట్టూ అందమైన తోటలు, ఎగజిమ్మే నీటి ఊటలు నిర్మించుకున్నారు. సుందరంగా తీర్చిదిద్దినట్లుగా రాయడాన్ని వారు ఒక కళగా అభ్యసించారు. దీనిని కాలిగ్రఫి అన్నారు.

సాహిత్యం, చరిత్ర: అరబ్బుల సాహితీ సేవ వర్ణనాతీతం. అలబారి ‘అన్నాల్స్ ఆఫ్ ది అపోస్టల్స్ మరియు రాజులు’ అనే గ్రంథాన్ని రచించాడు. ఉమర్ ఖయ్యమ్ రాసిన రుబాయత్, ఫిరదౌసీ – షానామా, అరేబియన్ రాత్రులు అనే వేయిన్కొక్క కథలు నాటి సాహితీసంస్కృతికి అద్దం పడతాయి. అరేబియన్ రాత్రులు ప్రపంచంలోని అనేక భాషలలోకి అనువాదమైంది. ఇంకా లుల్డూరీ రచించిన అన్సాబ్ అల్ అష్రఫ్, తబారీ రచించిన తారిఖ్-అల్-రసూల్, వాల్ ములుక్ గొప్ప గ్రంథాలుగా ఖ్యాతిగాంచాయి. అల్బెరూనీ రచన ‘తహకీక్ మలీల్ – హింద్’ లో ఇస్లాంకు అతీతంగా ఇతర సంస్కృతి యొక్క విలువను ప్రస్తుతించే ప్రయత్నం చేయబడింది.

ఆర్థిక రీతి: వ్యవసాయ భూములు రాజ్యాధీనం. భూమి శిస్తు రాజ్యాదాయంలో అధిక భాగం. భూమిశిస్తు (ఖరజ్) పంటలో 1/2 నుండి 1/5 వరకు ఉండేది. మహమ్మదీయ రైతులు ఆధీనంలో గల భూమిపై 1/10వ వంతు పన్ను వసూలు చేసారు. అన్యమతస్థులపై పన్నుల భారం విపరీతంగా ఉండేవి. రకరకాల పంటలు పండించేవారు. యూరపు వాటి ఎగుమతులు కూడా జరిగేవి. మధ్యధరా, హిందూ మహాసముద్రాల మధ్య ఎన్నో వ్యాపార కేంద్రాలు అభివృద్ధి చెందాయి. చైనా, ఇండియా, యూరప్ల మధ్య జరిగే నౌకా మార్గ వ్యాపారం అరబ్బు, ఇరానియన్ వర్తకుల హస్తగతమై ఉండేది. ఆనాటి వాణిజ్యం ప్రధానంగా రెండు మార్గాల గుండా సాగేది.

1) ఎర్ర సముద్రం, పర్షియన్ అఖాతం మీదుగా, 2) ఇరానియన్ వర్తకుల ఆధ్వర్యంలో సిల్క్ రూట్ గుండా చైనాకు ప్రయాణం చేసేవారు. ఈ వ్యాపారంలో బంగారు, వెండి నాణేలు చలామణీలో కొనసాగాయి. సుడాన్ నుండి బంగారం, మధ్య ఆసియా నుండి వెండి లభించేవి. అరువు పత్రాలు సక్ (ఆధునిక కాలపు చెక్కు) వంటివి వర్తకులు, బ్యాంకర్లు ద్రవ్య మార్పిడికి వాడేవారు.

ఈ విధంగా మధ్యయుగ చరిత్రలో అరబ్బులు ప్రముఖ స్థానాన్ని ఆక్రమించారు. వీరి ద్వారా ఐరోపా వారు భారతీయుల పరిజ్ఞానాన్ని, గ్రీసువారి మహాకావ్యాలను గురించి తెలుసుకున్నారు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఖలీఫా
జవాబు:
క్రీ.శ 632లో మహమ్మద్ మరణాంతరం అరేబియాలోని ప్రముఖులు అబూబాకర్ అనే మహమ్మద్ ప్రవక్త స్నేహితుడిని అతని వారసునిగా గుర్తించారు. అతన్ని ఖలీఫా లేదా కాలిఫ్ అని పిలిచేవారు. ఖలీఫా అనే అరబిక్ పదానికి వారసుడు అనే అర్థం ఉంది. అబూబాకర్ తర్వాత ‘ఉమర్’ ఖలీఫా అయ్యాడు. ఖలీఫా అంటే యావత్ ముస్లిం ప్రపంచానికి రాజకీయ, మతపరంగా మహ్మద్ ప్రవక్తకు వారసుడుగా గుర్తింపబడిన వ్యక్తి. అతనికి మత, రాజకీయ అధికారాలు ఉండేవి. మొదటి నలుగురు ఖలీఫాల తర్వాత ఖలీఫా పదవి వంశపారంపర్యమైంది. ‘ఉమయ్యద్లు, ”అబ్బాసిడ్లు,’ ‘ఆట్టోమన్లు’ సుదీర్ఘకాలం ఖలీఫాలుగా ఉన్నారు. ఒక శతాబ్దకాలంలో ఖలీఫాలు ఇరాన్, సిరియా, ఈజిప్ట్, మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికా, స్పెయిన్ ప్రాంతాలలో అతి విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించారు. మతప్రచారం పట్ల వారికున్న ఉత్సాహం, భాగ్యవంతమైన ప్రదేశాలనాక్రమించుకోవాలనే కోరిక వారి అద్భుత విజయాలకు కారణమయింది. సుదీర్ఘకాలం కొనసాగిన ఖలీఫా వ్యవస్థను మొదట ప్రపంచ యుద్ధం తర్వాత ఆధునిక టర్కీ జాతిపిత అయిన ముస్తాఫా కమాల్పాషా 1923లో రద్దు చేసాడు.

ప్రశ్న 2.
క్రూసేడులు.
జవాబు:
క్రీ.శ. 638లో జెరూసలేంను అరబ్బులు ఆక్రమించారు. అయినప్పటకీ క్రైస్తవ యాత్రికులు ఏసుక్రీస్తు జీవితానికి సంబంధించిన పవిత్ర స్థలాలు చూడటానికి అనుమతించబడ్డారు. క్రీ.శ.11వ శతాబ్ది మధ్యకాలానికి పరిస్థితులు మారిపోయాయి. ఐరోపా క్రైస్తవులు, అరబ్బులు మధ్య పరంపరాగత ఘర్షణలు తలెత్తాయి.

సెలుక్ తురుష్కులు మధ్య ప్రాచ్యంలో మత దురహంకారంతో క్రైస్తవ యాత్రికులను బాదించసాగారు. వీరి దుర్మార్గాలను విని చలించిపోయిన ‘పోప్ రెండవ అర్బన్’ క్రైస్తవ రాజ్యాలన్నీ కలిసి తురుష్కులను ఎదుర్కోవాలని ప్రబోధించాడు. పవిత్రభూమిని (పాలస్తీనా) విముక్తి చేయాలని ఆదేశించాడు. ఇది కాస్తా రెండు శతాబ్దాల పాటు రెండు ఏకేశ్వరోపాసన మతాల మధ్య భీకర యుద్ధాలకు, ఎంతో రక్తపాతానికి దారి తీసింది.

AP Inter 2nd Year History Study Material Chapter 4 భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

విశేష క్రైస్తవ ప్రజానీకం పవిత్రయుద్ధానికి సిద్ధమయ్యారు. కులీనులు, వర్తకులు, సైన్యాధికారులు, నేరస్థులు, భూస్వాములు, జులాయిలు, సాహసికులు ఇలా ఎందరో యుద్ధంలో చేశారు. ఫ్రాన్స్, ఇటలీ సైన్యాలు 1099 నాటికి జెరూసలేంను ఆక్రమించుకోవడం జరిగింది. క్రీ.శ 1187 నాటికి సలాదిన్ చక్రవర్తి తిరిగి జెరూసలేంను ఆక్రమించుకున్నాడు. క్రైస్తవ, మహమ్మదీయుల మధ్య నాలుగు ప్రధాన యుద్ధాలు జరిగాయి. కానీ రెండు శతాబ్దాల పోరాటం తరువాత కూడా జెరూసలేం తురుష్కుల చేతిలో ఉండిపోయింది. అంతటా ఇస్లాం వ్యాపించింది. క్రైస్తవుల సంస్కృతి, యుద్ధ పద్ధతులకన్నా ముస్లింల నాగరికత బలమైనదని నిరూపితమయింది. క్రూసేడులలో పాల్గొనుట వలన ప్రభువులు, భూస్వాములు మరణించడంకాని, దరిద్రులవడం కాని జరిగి భూస్వామ్య వ్యవస్థ క్షీణించింది. ఐరోపాలో పోప్ ఆధిక్యత తగ్గింది. క్రూసేడులు మతం వల్ల ఉత్తేజితమై, వర్తక వ్యాపార అభివృద్ధితో పారిశ్రామిక ప్రగతితో, సాంస్కృతిక పునరుజ్జీవనంతో ముగిసాయి.

ప్రశ్న 3.
మధ్య ఇస్లాం ప్రాంతాలు ఆర్థిక రీతి.
జవాబు:
వ్యవసాయ భూములు రాజ్యాధీనం. భూమిశిస్తు రాజ్యాదాయంలో అధికభాగం. భూమిశిస్తు(ఖరజ్) పంటలో 1/2 నుండి 1/5 వరకు ఉండేది. మహమ్మదీయ రైతు ఆధీనంలో గల భూమిపై ఆదాయంలో 1/10వ వంతు వసూలు చేస్తే అన్యమతస్థులపై పన్నుభారం విపరీతంగా ఉండేది. పాలకులు కేటాయించిన భూములను ‘ఇక్తా’లు అనేవారు.
నైలునది లోయలో రాజ్యం ఆధీనంలో గల సాగునీటి వనరులు ఉండేవి. ప్రత్తి, నారింజ, అరటి వంటి అనేక రకాలు పండించబడేవి. యూరప్కు ఎగుమతులు కూడా జరిగేవి. నాడు కూఫా, బస్రా, కైరో, బాగ్దాద్, డమాస్కస్లు ప్రసిద్ధి చెందిన నగరాలు.

మధ్యదరా, హిందూ మహా సముద్రాల మద్య ఎన్నో వ్యాపార కేంద్రాలు అభివృద్ధి చెందాయి. చైనా, ఇండియా, యూరప్ మధ్య జరిగే నౌకా వ్యాపారం అరబ్బు, ఇరానియన్ వర్తకుల హస్తగతమై ఉండేది. ఆనాటి వాణిజ్యం రెండు ప్రధాన మార్గాల గుండా జరిగేది. 1) ఎర్ర సముద్రం పర్షియన్ అఖాతం మీదుగా 2) ఇరానియన్ వర్తకుల ఆధిపత్యంలోని సిల్క్ రూట్ గుండా సమర్ఖండ్ల మీదుగా చైనాకు ప్రయాణం చేసేవారు. ఈ వ్యాపార అల్లిక మార్గంలో ట్రాన్స్ ఆక్సియానా ఒక ప్రముఖ గొలుసు లేదా వలయం. నాటి వ్యాపారంలో బంగారు, వెండి నాణేలు చలామణిలో కొనసాగాయి. సుడాన్ నుండి బంగారం, మధ్య ఆసియాలోని జరఫన్య నుండి వెండి లభించేది. అరువు పత్రాలు, చెట్లు వాటి వర్తకులు, బ్యాంకర్లు ద్రవ్యమార్పిడికి ఉపయోగించారు.

ప్రశ్న 4.
ఇస్లాం మత కట్టడాలు.
జవాబు:
అరబ్బులు గొప్ప భవన నిర్మాతలు. అరబ్బుల కళలు ఇరాన్, బైజాంటియన్ సామ్రాజ్యాలచే ప్రభావితం చెందాయి. వారు ప్రత్యేకమైన నిర్మాణశైలి కలిగి ఉన్నారు. వారి వాస్తు శిల్పకళా ప్రక్రియలు మసీదులలోనే కాక పుస్తక భాండాగారాలలో, వైద్యశాలల్లో, విద్యాసంస్థలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పరిపాలకుల ఆదరణలో ఎన్నో గొప్ప భవనాలు రూపు దిద్దుకున్నాయి. నాటి ప్రసిద్ధ కట్టడాలలో ‘అల్హమ్రా భవనం (స్పెయిన్లోని గ్రనడా వద్ద), అల్కాజర్ (సెవిలె వద్ద) గొప్పమసీదు (బాగ్దాద్) కలవు. డోమ్, ఆర్చి, మినారట్ల ప్రక్రియ వారి వాస్తుశైలికి నిదర్శనం.

ఖురాన్ మానవులను, జంతువులను సూచించే బొమ్మలను నిషేధించినందున మహమ్మదీయ కళాకారులు రాజభవనాల, మసీదుల లోపలి, బయటి గోడలపై చెక్కుడు పనితనాన్ని చూపారు. మసీదు, రాజభవనాల చుట్టూ అందమైన తోటలు, ఎగజిమ్మే నీటి ఊటలు నిర్మించారు. వారి రాజభవనాలలో రోమన్, ససానియన్ కళావిశేషాల్ని మేళవించారు. వాటిలో మితిమీరిన అలంకరణ కన్పిస్తుంది. అబ్బాసిడ్లు సమర్రాలో నిర్మించిన సామ్రాజ్య నగరం తోటలతో, ప్రవహించే నీటి ఊటలతో బహుసుందరంగా ఉండేది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఇస్లాం కాలెండర్.
జవాబు:
ఇస్లాం కాలెండరే హిజరీ కాలెండర్ అంటారు. క్రీ.శ. 622లో హిజరా యుగం ప్రారంభమయింది. ఈ యుగంలో AH (Anno Hegirae(లాటిన్) In the year of the Hijra)తో గుర్తించబడుతోంది. మహమ్మద్ క్రీ.శ. 622లో మక్కా నుండి మదీనాకు ప్రవాసం పోవడాన్ని ‘హిజరా’ గా గుర్తించారు. ఇస్లాం కాలెండర్, చాంద్రమానాన్ని అనుసరించి ఉంటుంది. 12 నెలలు 354 రోజులు ఉంటాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 4 భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

ప్రశ్న 2.
ఫాతిమా.
జవాబు:
ఫాతిమా మహమ్మద్ ప్రవక్తకు, ఖదీజాకు జన్మించిన కుమార్తె. క్రీ.శ 604లో జన్మించింది. ఫాతిమాను ‘ఆలీ’ వివాహమాడాడు. మహ్మద్ ప్రవక్త (తండ్రి)తో ఎంతో సన్నిహితంగా ఉంటూ, తండ్రి కష్టకాలంలో తోడుగా ఉంది. భర్తను పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకొనేది. మహ్మద్ ప్రవక్తకు వారసులు ఫాతిమా ద్వారానే వ్యాపించారు. ఈ విధంగా యావత్ ముస్లిం ప్రపంచంలో ‘ఫాతిమా’ ఒక ఆదర్శమహిళగా గుర్తింపు పొందింది.

ప్రశ్న 3.
ఖురాన్.
జవాబు:
మహ్మద్ ప్రవక్త స్థాపించిన నూతన మత సారాంశం ‘ఖురాన్’ అనే మత గ్రంథంలో కనుగొనవచ్చు. అరబిక్ భాషలో ఖురాన్ అనగా కంఠస్తం చేయడం. ఇస్లాం మత సిద్ధాంతాలకు మూలాధారం ఖురాన్.

అరబిక్ భాషలోని ఖురాన్ 114 అధ్యాయాలు (సురలు)గా విభజింపబడింది. అరబ్బు సంప్రదాయాన్ని బట్టి మహ్మద్ ప్రవక్తకు భగవంతుడు తెలియజేసిన సందేశాల సంపుటియే ఖురాన్. ప్రస్తుతం లభిస్తున్న ఖురాన్లలో అత్యంత ప్రాచీనమైనది. 9వ శతాబ్దానికి చెందినది. ప్రపంచంలోని మేటి గ్రంథాలలో ఒకటిగా ఖురాన్ గుర్తింపు పొందింది.

ప్రశ్న 4.
వైద్య సూత్రాలు.
జవాబు:
వైద్య శాస్త్రంలో అరబ్బుల ప్రగతి గణనీయమైనది. అవిసెన్నా రచించిన ‘అలనూన్ఫెల్ టిబ్’ అన వైద్యగ్రంథంలో 760 రకాల మందుల గురించి పేర్కొన్నారు. లంకణం పరమౌషధమని, కొన్ని వ్యాధులు ఉపవాసం చేయుట ద్వారా తగ్గిపోతాయని ఈ గ్రంథం పేర్కొంది.

ప్రశ్న 5.
షహనామ.
జవాబు:
షానామ అనే దీర్ఘ చారిత్రక కావ్యాన్ని గొప్ప పారశీక కవి ఫిరదౌసి రచించాడు. దాదాపు 60,000 పద్యాలతో ఉన్న ఈ కావ్యంలో ప్రాచీన పర్షియాను పాలించిన రాజుల యొక్క చరిత్ర వివరించబడింది. క్రీ.శ. 977లో ప్రారంభించిన ఈ కావ్యం క్రీ.శ. 1010 సంవత్సరంలో పూర్తయింది. సాహిత్య చరిత్రలోని అత్యుత్తమ కావ్యాలలో ఒకటిగా ఫిరదౌసి
నిలిచింది.

AP Inter 2nd Year History Study Material Chapter 4 భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

ప్రశ్న 6.
మదర్సాలు.
జవాబు:
మదర్సా అనే అరబిక్ పదానికి విద్యాసంస్థ అని అర్థం. మహమ్మదీయులు మదర్సాలు అనే విద్యా కేంద్రాలుగా స్థాపించారు. మదర్సాలు మసీదులకు అనుబంధ కేంద్రాలుగా వృద్ధి పొందాయి. బాగ్దాద్ లో గల ‘ముస్తాన్ సిరియా’ మదర్సా 1233లో నెలకొల్పబడింది. అలెగ్జాండ్రియా, సిరియా, మెసపిటోమియాలోని మదర్సాలలో గ్రీకుతత్త్వ శాస్త్రం, గణితం, వైద్యశాస్త్రం బోధింపబడేది. అనువాదం అనేది మదర్సాలలోని ముఖ్య ప్రక్రియలు ఒకటి. అనేక భారతీయ ఖగోళ, గణిత, వైద్య గ్రంథాలు ఇలా అనువాదం చేయబడ్డాయి.

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం

Students get through AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం

ప్రశ్న 1.
క్రింది అతిపరావలయాలకు కేంద్రం, ఉత్కేంద్రత, నాభులు, నియతరేఖలు నాఖిలంబం పొడవు కనుక్కోండి.
(i) 4 x2-9 y2-8 x-32=0
(ii) 4(y+3)2 -9(x-2)2=1
సాధన:
(i) 4 x2-9 y2-8 x-32=0 అతిపరావలయం సమీకరణ
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం 1
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం 2

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం

ప్రశ్న 2.
ఒక అతిపరావలయం, సంయుగ్మ అతిపరావలయాల ఉత్రేంద్రతలు వరుసగా e, e1 అయతే \(\frac{1}{e^2}+\frac{1}{e_1^2}\)=1 అనిజాపండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం 3

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం 4

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం

ప్రశ్న 3
(i) అతిపరావలయం \(\frac{x^2}{a^2}-\frac{y^2}{b^2}=1\) , lx+my+n=0 స్పర్శశేఖ అయితే, a2l2-b2 m2=n2 అని చూపండి.
(ii) అతిపరావలయం \(\frac{x^2}{a^2}-\frac{y^2}{b^2}\)=15 lx+my=1 అఖిలంబరేఖ అయితే \(\frac{a^2}{l^2}-\frac{b^2}{m^2}=\left(a^2+b^2\right)^2\) అని చూపండి.
సాధన:
(i) స్పర్శ రేఖ సమీకరణం
l x+m y+n=0 ———– (1)
P(θ) వద్ద స్పర్శరేఖ సమీకరణము
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం 5

ప్రశ్న 4.
x2– 4y2=12 అతిపరావలయానికి y=x-7 రేఖకు (i) సమాంతరంగాను (ii) లంబంగాను టంటే స్పర్శరేఖల సమీకరణాలను కనుక్కోండి.
సాధన:
అతిపరావలయ సమీకరణము 3x2 -4y2=12
a2 =4, b2 =3

(i) y=x-7 కు సమాంతర స్పర్శరేఖ
m= స్పర్యరేఖ వాలు = 1
సమాంతర స్పర్శరేఖల సమీకరణము
y=m x ± \(\sqrt{a^2 m^2-b^2}\)
y=x ± \(\sqrt{4-3}\)=x±1

(ii) స్పర్యరేఖ y-x=7 కు లంబంగా ఉంటే
m = స్పర్ళరేఖ వాలు = -1
లంబ స్పర్యరేఖ సమీకరణము
y=(-1) x ± \(\sqrt{4(-1)^2-3}=-x \pm 1\)
x+y=± 1

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం

ప్రశ్న 5.
\(\frac{x^2}{a^2}-\frac{y^2}{b^2}\)=1 అతిపరావలయానికి రెండు లంబ స్పర్శరేఖల ఖండన బిందువు x2+y2=a2-b2 పై ఉంటుందని చూపండి.
సాధన:
పరస్పర లంబంగా ఉన్న అతిపరావలయాల స్పర్శరేఖల ఖండన బిందువు P(x1, y1)
అతిపరాపలయ సమీకరణము \(\frac{x^2}{a^2}-\frac{y^2}{b^2}=1\)
స్శర్శరేఖ సమీకరణాన్ని
\(y=m x \pm \sqrt{a^2 m^2-b^2} \) తీసుకొనవచ్చు.
ఈ స్పర్శరేఖ P(x1, y1) గుండా పోతుంది.
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం 6

ప్రశ్న 6.
ఒక వృత్తం xy = 1 అనే లంబ అతిపరావలయాన్ని (xr, yr), r=1,2,3,4 అనే బిందువులలో ఖండిస్తుంది. x1 x2 x3 x4=y1 y2 y3 y4=1 అని చూపండి.
సాధన:
వృత్త సమీకరణాన్ని x2+y2=a2 అనుకొందాం.
t ≠ 0 అయినప్పుడు \(\left(t, \frac{1}{t}\right)\), xy=1 మీద ఉంటుంది.
వృత్త, అతిపరావలయాల ఖండన బిందువుల నిరూపకాలు t^2+\frac{1}{t^2}=a^2 ను సంతృప్తిపరుస్తాయి.
అప్పుడు \(\mathrm{t}^4-\mathrm{a}^2 \mathrm{t}^2+1=0\)
⇒ t4+0 . t3-a2 t2+0 . t+1=0
ఈ సమీకరణానికి మాలాలను t1, t2, t3, t4 అనుకొంటే t1 t2 t3 t4=1 అవుతుంది.
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం 7

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం

ప్రశ్న 7.
ఒక లంబ అతిపరావలయం మీద ఉండే నాలుగు బిందువులలో ఏ రెండింటినైనా కలుపగా వచ్చిన జ్యా, మిగిలిన రెండింటిని కలుపగా వచ్చిన జ్యాకు లంబంగా ఉంటూ, ఈ బిందువులను, అతిపరావలయ కేంద్రానికి కలుపగా వచ్చిన సరళరీఖలు, అ అతిపరావలయ అనంత స్రర్శరేఖలలో ఏదైనా ఒకదానితో α,β, γ, δ నిమ్నతలు కలిగి ఉంటే tan α, tan β, tan γ, tan δ =1 అని చూపండి.
సాధన:
లంబ అతిపరావలయం సవీకరణ x2-y2=a2 అనుకొందాం. మూలబిందువు దృష్ట్ర X, Y అక్షాలను సవ్య దిశలో \(\frac{\pi}{4}\) కోణంతో జ్రమణం చేయగా x2-y2=a2 క వచ్చే రూపాంతరం సమీకరణ రూపం x y=c2 \(\left(t_r \neq 0\right),\left(c t_r, \frac{c}{t_r}\right)\), r=1,2,3,4 వక్రం మీద నాలుగు బిందువులు అనుకుందాం.
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం 8

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం 10
\(\stackrel{\leftrightarrow}{\mathrm{OA}}, \stackrel{\leftrightarrow}{\mathrm{OB}}, \stackrel{\leftrightarrow}{\mathrm{OC}}, \stackrel{\leftrightarrow}{\mathrm{OA}}{ }\) లు రెండవ అనంత స్పర్శరేఖ అయిన
y-అక్షం ధనదిశతో చేసే కోణాలను α,β, γ, δ అనుకొంటే, వాటి వాలులు వరుసగా cot α, cot β, cot γ, cot δ లవుతాయి. అప్వాడు కూడా tan α, tan β, tan γ, tan δ=(cot α cot β cot γ cot δ)-1=1 అవుతుంది.

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు

Students get through AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు

ప్రశ్న 1.
\(\int_1^2 x^5\) dx ను గణించండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 1

ప్రశ్న 2.
\(\int_0^a \sin\) x dx ను గణించండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 2

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు

ప్రశ్న 3.
\(\int_0^a \frac{d x}{x^2+a^2}\) ను గణించండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 3

ప్రశ్న 4.
\(\int_1^4 x \sqrt{x^2-1}\) ను గణించండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 4

ప్రశ్న 5.
\(\int_0^2 \sqrt{4-x^2}\) dx విలువను గణించండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 5

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు

ప్రశ్న 6.
\(\int_0^{16} \frac{x^{1 / 4}}{1+x^{1 / 2}}\) dx ను గణించండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 6
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 7

ప్రశ్న 7.
\(\int_{-\pi / 2}^{\pi / 2} \sin |x|\)ను గణించండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 8

ప్రశ్న8.
\(\int_0^{\pi / 2} \sin ^n x d x=\int_0^{\pi / 2} \cos ^n x\)dx అని చూపండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 9

ప్రశ్న 9.
\(\int_0^{\pi / 2} \frac{\cos ^{5 / 2} x}{\sin ^{5 / 2} x+\cos ^{5 / 2} x}\) ను గణించండి.
సాధన:
\(f(x)=\frac{\cos ^{5 / 2} x}{\sin ^{5 / 2} x+\cos ^{5 / 2} x}\) dx  అనుకోండి.
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 13

ప్రశ్న 10.
\(\int_0^{\pi / 2} \frac{x}{\sin x+\cos x} d x=\frac{\pi}{2 \sqrt{2}} \log (\sqrt{2}+1)\) అని చూపండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 12
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 14

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు

ప్రశ్న 11.
\(\int_{\pi / 6}^{\pi / 3} \frac{\sqrt{\sin x}}{\sqrt{\sin x}+\sqrt{\cos x}}\) dx ను గణించండి.
సాధన:

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 15

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 16

ప్రశ్న 12.
\(\int_{-a}^a\left(x^2+\sqrt{a^2-x^2}\right)\) ను కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 18

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు

ప్రశ్న 13.
\(\int_0^\pi \frac{x \sin x}{1+\sin x}\) dx కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 19
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 20
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 21

ప్రశ్న 14.
\(\int_0^{\pi / 2} x \sin x\) dx ను గణించండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 22
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 23

ప్రశ్న 15.
అవది వెుత్తం నిశ్చిత నమాకలనిని కనుక్కొనే పద్ధతినుపయోగించి \(\lim _{n \rightarrow \infty} \sum_{i=1}^n \frac{1}{n}\left[\frac{n-i}{n+i}\right]\) కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 24

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు

ప్రశ్న 16.
అవధి మొత్తంగా నిశిళిత సమాకలనిని కనుక్కొనే పద్ధతి నుపయోగించి
\(\lim _{n \rightarrow \infty} \frac{2^k+4^k+6^k+\ldots \ldots+(2 n)^k}{n^{k+1}}\)
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 25

ప్రశ్న 17.
\(\lim _{n \rightarrow \infty}\left[\left(1+\frac{1}{n}\right)\left(1+\frac{2}{n}\right) \ldots\left(1+\frac{n}{n}\right)\right]^{\frac{1}{n}}\) కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 26

ప్రశ్న 18.
f: R → R అవిచ్ఛిన్న ఆవర్తన ప్రమేయం. దీనికి T ఒక ఆవర్తనం అయితే ప్రతి ధన హృా్ణాంకం n కి \(\int_0^{n T} f(x) d x=n \int_0^T f(x)\) dx అని చూపండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 27
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 28

∴  x =m + 1 కు ఫలితము నిజము.
గణితాను గమన సిద్ధాంతం ప్రకారం ధన పూర్ణాంక విలువలన్నింటికి ఫలితము నిజము.

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు

ప్రశ్న 19.
(i) \( \int_0^{\pi / 2} \sin ^4 x \)dx
(ii) \(\int_0^{\pi / 2} \sin ^7 x \)dx
(iii) \(\int_0^{\pi / 2} \cos ^8 x \) dx ను కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 29

ప్రశ్న 20.
\(\int_0^a \sqrt{a^2-x^2}\)
సాధన:
x= a sinθ dx= acosθ . dθ అనుకుంటే
θ = 0=,x = 0,x= a=θ = π/2
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 30

ప్రశ్న 21.
కింది నిశ్చిత సమాకలనులను గణించండి.
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 31
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 32

ప్రశ్న 22.
\(\int_0^{2 \pi} \sin ^4 x \cos ^6 x\) ను కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 33
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 34

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు

ప్రశ్న 23.
\(\int_{-\pi / 2}^{\pi / 2} \sin ^2 x \cos ^4\)xdx కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 35

ప్రశ్న 24.
\(\int_0^\pi x \sin ^7 x \cos ^6\)x dx కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 36
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 37

ప్రశ్న 25.
\(\int_{-a}^a x^2\left(a^2-x^2\right)^{3/2}\) dx కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 38

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు

ప్రశ్న 26.
\(\int_0^1 x^{3 / 2} \sqrt{1-x}\) dx కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 39

ప్రశ్న 27.
[0,2 π] ల f(x)=sin x వక్రం క్రింది వైశాల్యాన్ని కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 40

ప్రశ్న 28.
[0,2 π] అంతరంలో f(x)=cos x వక్రం క్రింది వైశాల్యాన్ని కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 41

ప్రశ్న 29.
y=x2 పరావలయంతోను, x- అక్షం, x=-1, x = 2 రేఖలతో పరిబద్ధపైన ప్రదేశం వైలాల్యం కనుక్సోండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 42

ప్రశ్న 30.
y=0 రేఖ, y=x2-4 x+3 పరావలయాల మధ్య అంతర్లిఖితమైన ప్రదేశ వైశాలృం కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 43

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు

ప్రశ్న 31.
y = sin x, y=cos x వక్రాల రెండు వరుస ఖండన బిందువుల మధ్య పరిబద్ధమైన ప్రదేశం వైశాల్లం కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 44

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 45

ప్రశ్న 32.
y=sin x, y=cos x, x – అక్షంతో పరిబద్ధమైన ఒక వక్రీయరేఖీయ త్రిభజం వైశాల్యం కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 46

ప్రశ్న 33.
సమాకలన ప్రాథమిక సిద్ధాంతం ఉపయోగించి ఆధారం b, ఉన్నతి a గల లంబకోణ త్రిభాజం వైశాల్యం గణించండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 47
O A B లంబకోణ (తిభుజములు ∠B=90°
‘O’ ను మూల బిందువుగాను, OB ని X – అక్షంగా తీసు కుందాం.
O B=b మరియ A B=h, అయితే A నిరూపకాలు (b, h)
OA సథీకరణం y=\(\frac{h}{b}\) x
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 48
ప్రశ్న 34.
y2-1=2 x, x=0 వక్రాల మధ్య వైశాల్యం కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 49

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు

ప్రశ్న 35.
y=3 x, y=6x – x2 వక్రాలతో ఆవృతమైన వైశాల్యం కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 50
y=3 x రేఖ పరావలయాన్ని ఖండిస్తుంది.
y=6 x-x2
3 x=6 x-x2
x2-3 x=0
x(x-3)=0
x=0 text లేదా 3
కావలసిన వైశాల్యము= \(\int_0^3\left(6 x-x^2-3 x\right)\) dx
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 51

ప్రశ్న 36.
y=x2-5 x, y=4-2 x లతో ఆవృతమైన వైశాల్లం కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 52
ప్రశ్న 37.
y=x2, y=\(\sqrt{x}\), x ≥ 0 వక్రాలతో పరిబద్ధమైన వైశాల్యం కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 53
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 54

ప్రశ్న 38.
y2=4 a x, x2=4 b y(a>0, b>0) వక్రాల మధ్య పరిబద్ధమైన వైశాల్యం కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 7 నిశ్చిత సమాకలనులు 55

AP Inter 2nd Year History Study Material Chapter 1 తొలికాలపు మానవ చరిత్ర

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 1st Lesson తొలికాలపు మానవ చరిత్ర Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 1st Lesson తొలికాలపు మానవ చరిత్ర

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1. హోమినాయిడ్స్కు హోమోనిడ్స్కు గల భేదాలు తెలపండి.
జవాబు:
2.4 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రైమేట్స్లో ఒక భాగమైన హోమినాయిడ్స్ ఉద్భవించినట్లు తెలుస్తుంది. హోమోనిడ్స్, హోమినాయిడ్స్ నుండి ఆవిర్భవించడం వలన కొన్ని సారూప్యాలు కనిపించినా, కొన్ని భేదాలు కూడా ఉన్నాయి.
హోమినాయిడ్స్

  1. చిన్న మెదడు.
  2. నాలుగు కాళ్ళపై నడిచే జీవి అయితే ముందరి కాళ్ళు సులువుగా ఉండేవి.
  3. చేతులు అంత సులువుగా ఉండేవి కావు.

హోమోనిడ్స్

  1. పెద్ద మెదడు
  2. నిలువుగా నిలబడి, రెండు కాళ్ళపై నడిచే వ్యక్తి.
  3. చేతులు ఉపయోగించి పనిచేస్తూ భిన్నంగా ఉండేవారు.

AP Inter 2nd Year History Study Material Chapter 1 తొలికాలపు మానవ చరిత్ర

ప్రశ్న 2.
ఆదిమ మానవుని ఆహారపు అలవాట్లు.
జవాబు:
ఆదిమానవుడు ఆహారాన్ని వివిధ రకాలుగా సంపాదించుకున్నాడు. ఉదా: ఆహార సేకరణ, ఆహారాన్ని పోగు చేసుకోవడం, వేట, చేపలు పట్టడం.

ఆహార సేకరణ: ఆహార సేకరణలో విత్తనాలు, బెర్రీలు, పండ్లు, నట్స్ ట్యూబర్స్ మొదలగునవి. మనకు ఎముక అవశేషాలు బాగా లభించినా, మొక్కల అవశేషాలు తక్కువగానే లభించాయి.

ఆహారాన్ని పోగుచేయడం: తొలినాటి హోమోనిడ్లు సహజంగా చనిపోయిన జంతువుల మాంసం లేక ఇతర జంతువులు, పక్షులు మొదలయినవి చంపి తినగా మిగిలిన మాంసం, ఎముకలు పోగుచేసుకున్నారు.

వేట: వేట అనే ప్రక్రియ దాదాపు ఐదు లక్షల సంవత్సరాల నాటిదని తెలుస్తుంది. ఒక పథకం ప్రకారం వేటాడి పెద్ద పెద్ద జంతువులను చంపడం యొక్క ఆధారాలు ఇంగ్లాండ్ లోని బాక్స్ గ్రేవ్, జర్మనీలోని షోనినిజెన్ ప్రాంతాలలో లభించాయి.
చేపలు పట్టుట: ఇది చాలా ముఖ్య ఆహారము. చేపలు, మనుషుల ఎముకలు వివిధ ప్రాంతాలలో లభించాయి.

ప్రశ్న 3.
ప్రాచీన మానవులు తయారుచేసిన పనిముట్లను తెలపండి.
జవాబు:
సుమారు 4 లక్షల సంవత్సరాల నుంచి లక్షా పాతికవేల సంవత్సరాల క్రితం వరకు ప్రాచీన మానవులు వాడిన వేలాది పనిముట్లు లభించాయి. ఉదాహరణకు కెన్యాలో వేలాది చేతి గొడ్డళ్ళు, ప్లేక్ పనిముట్లు లభించాయి. ఈ పనిముట్లను ఆహార సేకరణ, వినియోగం కొరకు ఉపయోగించేవారు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆస్ట్రలోపిథికస్.
జవాబు:
ఆస్ట్రలోపిథికస్ అనే పదము లాటిన్ మరియు గ్రీకు పదాలనుండి వచ్చింది. లాటిన్ పదం ‘ఆస్ట్రిల్’ అనగా దక్షిణ మరియు గ్రీకు పదమైన పిథకస్ అనగా ‘ఏప్’ అని ‘ఆస్ట్రలోపిథకస్’ అనగా ‘దక్షిణప్రాంత ఏప్’ అని అర్థం. ఆస్ట్రలోపిథికస్ రెండు కాళ్ళ మీద నడవటం వలన చేతులతో పిల్లలను కని, బరువులు మోయడానికి వీలుపడింది. కాళ్ళ శక్తి పొదుపు కావడంతో అది పరిగెత్తడానికి కాలక్రమేణా ఉపయోగపడింది.

ప్రశ్న 2.
హోమో సేపియన్స్.
జవాబు:
జర్మనీలోని హెడెల్బర్గీ పట్టణంలో హోమో అవశేషాలు దొరకటం వలన అతనిని హోమో హెడెల్ బర్గెన్సిస్ అని నియాండర్ లోయలో దొరికిన అవశేషాల వలన అతని హోమోసెపియన్ నియాండర్తలనినీస్ అని పిలిచారు. హోమో సేపియన్లకు పెద్ద మెదడు, చిన్న దవడ, చిన్న పళ్ళు ఉంటాయి. మెదడు పరిమాణం పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి,
తెలివితేటలు పెరిగాయి. హోమోసేపియన్ల తొలి ఆధారాలు ఆఫ్రికాలో లభించాయి.

ప్రశ్న 3.
ఆహార సేకరణ.
జవాబు:
ప్రాచీన మానవుడు తనకు లభించిన వాటిని ఆహారం కోసం సేకరించుకొనేవాడు. ఆహారసేకరణలో విత్తనాలు, బెర్రీలు, పండ్లు, నట్స్, ట్యూబర్స్ మొదలైనవి. పరిశోధనలో ఎముకల అవశేషాలు బాగా లభించాయి. మొక్కల అవశేషాలు తక్కువగా లభించాయి. ఇప్పటివరకు పురావస్తు శాస్త్రవేత్తలు మానవుని తొలినాటి కార్బొనైజ్ డ్ విత్తనాల ఆధారాలు తక్కువగానే కనుగొన్నారు.

AP Inter 2nd Year History Study Material Chapter 1 తొలికాలపు మానవ చరిత్ర

ప్రశ్న 4.
నియాండర్తల్ మనిషి.
జవాబు:
నియాండర్తల్ మానవుడు నేటి ఆధునిక మానవజాతియైన హోమో సేపియన్లకు సన్నిహితుడు. జర్మనీలోని నియాండర్ లోయలో ఇతనికి సంబంధించిన అవశేషాలు లభించడం వలన ‘నియాండర్తల్ మనిషి’ అని పిలిచారు. ఇతని శాస్త్రీయ నామం ‘హోమో నియాండర్తలనిస్’ విశాలమైన దవడ, వెడల్పాటి ముక్కు, హోమో సేపియన్లకున్నంత పెద్ద మెదడు ఉండేది.