AP 7th Class Social Important Questions Chapter 11 రహదారి భద్రత

These AP 7th Class Social Important Questions 11th Lesson రహదారి భద్రత will help students prepare well for the exams.

AP Board 7th Class Social 11th Lesson Important Questions and Answers రహదారి భద్రత

ప్రశ్న 1.
రహదారి భద్రతా వారోత్సవాలు ఎప్పుడు, ఎందుకు నిర్వహిస్తారు?
జవాబు:
రహదారి భద్రతా వారోత్సవాలు :
భారతదేశంలోని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం జనవరి నెలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తుంది. రహదారి భద్రత, డ్రైవింగ్ నియమాలు మరియు హెచ్చరికలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మరియు మరణాలకు కారణమయ్యే రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి రహదారి భద్రతకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ప్రశ్న 2.
రహదారి ప్రమాదం అని దేనిని చెప్పవచ్చు?
జవాబు:
రహదారులపై ప్రమాదాలు అనగా ఏదైనా ఆకస్మిక సంఘటన వలన వాహనం, లేదా ప్రయాణీకులు ప్రమాదవశాత్తు గాయపడటం లేదా మరణించడం మరియు భౌతిక ఆస్తులకు నష్టం కలగడం వంటివి. అధిక శాతం రహదారి ప్రమాదాలు మానవ తప్పిదం వల్లనే జరుగుతాయి. ఏదేమైనా ఇవి పూర్తిగా అరికట్టదగినవి.

ప్రశ్న 3.
ట్రాఫిక్ చిహ్నాలు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
ట్రాఫిక్ చిహ్నాలను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి :

  1. తప్పనిసరి గుర్తులు,
  2. సమాచార గుర్తులు,
  3. హెచ్చరిక గుర్తులు

AP 7th Class Social Important Questions Chapter 11 రహదారి భద్రత

ప్రశ్న 4.
క్రింద ఇచ్చిన చిహ్నాలను వాటి అర్ధాలతో జతపరచండి.
జవాబు:
AP 7th Class Social Important Questions Chapter 11 రహదారి భద్రత 1

ప్రశ్న 5.
రహదారి మార్కింగ్ (రోడ్డుపైన సూచించే) సంకేతాలు ఏవి? వాని ప్రయోజనమేమి?
జవాబు:
రహదారి మార్కింగ్ సంకేతాలు :
1. ఫుట్ పాత్ :
ఇది పాదచారులు నడవడానికి ఉద్దేశించబడింది. సిమెంట్ బ్లాక్స్ తో లేదా పెయింట్ చేయబడిన లైన్లతో వేరు చేయబడిన రహదారి భాగాలలో ఇది ఒకటి.
AP 7th Class Social Important Questions Chapter 11 రహదారి భద్రత 2

2. రోడ్డు డివైడర్ :
ఇది సిమెంట్ దిమ్మలతో లేదా పెయింట్ తో రోడ్డును రెండు లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా విభజించడానికి ఏర్పాటు చేయబడుతుంది. రోడ్డు డివైడర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ట్రాఫిక్ గందరగోళం మరియు రోడ్డు ప్రమాదాలను నివారించడం.
AP 7th Class Social Important Questions Chapter 11 రహదారి భద్రత 3

3. జీబ్రా క్రాసింగ్ :
ఇవి రోడ్డుకు సమాంతరంగా చిత్రించిన ప్రత్యామ్నాయ నలుపు మరియు తెలుపు చారలు, సాధారణంగా వీటిని జీబ్రా క్రాసింగ్ అని పిలుస్తారు. ఇది పాదచారులు రోడ్డును ఒక వైపు నుండి మరొక వైపుకు దాటడానికి ఉద్దేశించబడింది.
AP 7th Class Social Important Questions Chapter 11 రహదారి భద్రత 4

ప్రశ్న 6.
ప్రమాదాలను నివారించడానికి డైవరకు ఎలాంటి సలహాలు ఇవ్వవలెను?
జవాబు:
డైవరు సలహాలు :

  1. రహదారికి ఎడమ వైపున ఉండి కుడివైపున వేగంగా వెళ్లే వాహనాలకు దారి వదలాలి.
  2. ఎడమవైపు నుంచి వాహనాలను దాటరాదు.
  3. రక్షిత ప్రయాణానికి ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించాలి.
  4. తక్కువ కార్బన్ మోనాక్సైడ్ వదిలే వాహనాలనే ఉపయోగించాలి.
  5. అనవసరంగా హారన్ మోగించరాదు.
  6. భారీ వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్టులు ఉపయోగించాలి.
  7. ట్రాఫిక్ సిగ్నలను అతిక్రమించరాదు.
  8. తమ వాహనాన్ని మంచి స్థితిలో ఉంచుకోవాలి.

ప్రశ్న 7.
రోడ్డు నియమ నిబంధనలు అంటే ఏమిటో మీ తరగతి గదిలో చర్చించండి.
జవాబు:

  1. రోడ్డు నియమ నిబంధనలు అనగా రోడ్డుపై వెళ్ళువారు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు.
  2. అలా పాటించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
  3. కారణం జనాభా విపరీతంగా పెరగడం వలన, రోడ్లు ఇరుకుగా ఉండటం వలన, రోడ్డు పైకి వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది కాబట్టి ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది.
  4. రోడ్డు పైకి వచ్చేవారు ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు త్వరగా వెళ్ళాలి అనే భావంతో ప్రయాణించడం వలన ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది.
  5. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే రోడ్డుపైకి వచ్చేవారు కొన్ని నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. దానితో ప్రమాదాలను నివారించటానికి అవకాశం ఉంటుంది.

AP 7th Class Social Important Questions Chapter 11 రహదారి భద్రత

ప్రశ్న 8.
ట్రాఫిక్ గుర్తులను ఒకవేళ ఎవరైనా పాటించకుండా వెళితే ఏమవుతుంది?
జవాబు:

  1. ట్రాఫిక్ గుర్తులను పాటించకపోవడం వలన ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుంది.
  2. ప్రమాదాలు ఒక్కొక్కసారి తీవ్ర గాయాలకు, అంగ వైకల్యానికి దారితీయవచ్చు.
  3. ఘోర ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలను కోల్పోవటానికి అవకాశం ఉంటుంది.
  4. ట్రాఫిక్ గుర్తులను పాటించకపోవడం వలన మనకు మాత్రమేగాక ఎదుటివారికి కూడా హాని జరగవచ్చు.
  5. విలువైన వాహనాలు దెబ్బతింటాయి.
  6. అందువల్ల ట్రాఫిక్ గుర్తులను పాటిస్తూ మన ప్రాణాలను కాపాడుకుంటూ, ఎదుటివారి ప్రాణాలకు కూడా రక్షణ కల్పిస్తే మానవ జీవితానికి సార్థకత చేకూరుతుంది.

ప్రశ్న 9.
రోడ్డు భద్రతకుగాను సమాజంలోని వివిధ వర్గాల వారు తీసుకోవాల్సిన చర్యలను సూచించండి (సమాచార నైపుణ్యాలు).
జవాబు:
రోడ్డు భద్రతకుగాను సమాజంలోని వివిధ వర్గాల వారు తీసుకోవాల్సిన చర్యలు :
డ్రైవర్ తీసుకోవాల్సిన చర్యలు :

  1. ఎడమవైపున ఉండి కుడివైపున వేగంగా వెళ్లే వాహనాలకు దారి వదలాలి.
  2. ఎడమవైపు నుంచి వాహనాలను దాటరాదు.
  3. రక్షిత ప్రయాణానికి ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించాలి.
  4. తక్కువ కార్బన్ మోనాక్సెడ్ వదిలే వాహనాలనే ఉపయోగించాలి.
  5. అనవసరంగా హారన్ మోగించరాదు.
  6. భారీ వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్టులు ఉపయోగించాలి.
  7. ట్రాఫిక్ సిగ్నలను అతిక్రమించరాదు.
  8. తమ వాహనాన్ని మంచి స్థితిలో ఉంచుకోవాలి.
  9. ఆల్కహాల్ సేవించి వాహనాలను నడపరాదు.
  10. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపరాదు.

పాదచారులు పాటించాల్సిన నిబంధనలు :

  1. పాదచారులకు నిర్దేశించిన మార్గంలోనే నడవాలి. ఒకవేళ అలాంటి ప్రత్యేక మార్గం లేకుంటే, రోడ్డు ఇరుకుగా ఉంటే రోడ్డుకు కుడివైపునే ఎదురుగా వస్తున్న వాహనాలను పరిశీలిస్తూ నడవాలి.
  2. రాత్రివేళ బయట రోడ్డుపై నడుస్తున్నప్పుడు తప్పనిసరిగా ప్రతిబింబించే దుస్తులను ధరించాలి.
  3. రాత్రివేళల్లో నడిచేటప్పుడు విధిగా టార్చిలైట్ దగ్గర ఉంచుకోవాలి.
  4. రోడ్డును దాటునపుడు ఎడమవైపు, కుడివైపు చూసి వాహనాలు రాకుండా ఉన్నప్పుడు దాటాలి.
  5. ఒకవేళ వాహనాలు రెండు వైపులా, వస్తూ ఉంటే అవి వెళ్లే వరకు వేచి ఉండాలి.
  6. వాహనాలు రాకుండా ఉన్నప్పుడు వేగంగా నడుచుకుంటూ రోడ్డును దాటాలి. రెండు వైపులా వాహనాలు వస్తున్నాయో లేదో గమనించాలి.
  7. రోడ్డును దాటుటకు జీబ్రా క్రాసింగ్ ను ఉపయోగించాలి.
  8. రోడ్డుపై నడుస్తున్నప్పుడు, రోడ్డును దాటుతున్నప్పుడు మొబైల్ ఫోన్ ను ఉపయోగించరాదు.
  9. ట్రాఫిక్ పోలీస్ సహాయంతో రోడ్డును దాటాలి.

ప్రశ్న 10.
రహదారి భద్రతా విద్యను నిర్వచించండి. దాని లక్ష్యాలు ఏమిటి?
జవాబు:

  1. పిల్లలు మరియు యువతకు రహదారిపై బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా అవగాహన కల్పించే విధానాన్ని “రహదారి భద్రతా విద్య” అంటారు.
  2. సమర్థవంతమైన రహదారి భద్రతా విద్య విద్యార్థులకు ట్రాఫిక్ కు సంబంధించిన జ్ఞానాన్ని, నైపుణ్యాలను, వైఖరులను, పెంపొందించుకోవడానికి కావలసిన అవకాశాలను ఏర్పరుస్తుంది.
  3. దీనివల్ల వారికి ట్రాఫిక్ గురించిన అవగాహన, సురక్షితమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఏర్పడుతుంది.
  4. మంచి ట్రాఫిక్ వాతావరణం ఏర్పడుతుంది.
  5. ఇవి వేగ పరిమితులు, మద్యపానం మరియు డ్రైవింగ్ నియమాలు, ట్రాఫిక్ సంకేతాలు మరియు రోడ్ మార్కింగ్ సంకేతాలు వంటి నియంత్రణ వ్యవస్థలకు సంబంధించినవి.

ప్రశ్న 11.
సిగ్నల్స్ వ్యవధి వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరుగా ఉండవచ్చు. ఎందుకు?
జవాబు:
సిగ్నల్స్ వ్యవధి వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరుగా ఉండటానికి కారణం ఆయా రహదారి కూడళ్ళలోని వాహన రద్దీ. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నట్లయితే సిగ్నల్స్ వ్యవధి ఎక్కువగాను, వాహనాల రద్దీ తక్కువగా ఉన్నట్లయితే సిగ్నల్స్ వ్యవధి తక్కువగాను ఉంటుంది.

ప్రశ్న 12.
డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధానం మరియు అవసరమైన పత్రాల గురించి మీ తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులతో చర్చించండి.
జవాబు:
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపరాదు. ఇది ఎవ్వరికీ మినహాయింపు కాదు.
డ్రైవింగ్ లైసెన్స్ రకాలు :
1) లెర్నర్ లైసెన్స్ :
ఇది తాత్కాలికమైనది. డ్రైవింగ్ నేర్చుకొనుటకు ఆరు నెలల కాల పరిమితితో దీనిని జారీ చేస్తారు.

2) శాశ్వత లైసెన్స్ :
తాత్కాలిక లైసెన్స్ జారీ చేసిన ఒక నెల తరువాత నుంచి శాశ్వత లైసెన్స్ పొందుటకు అర్హత లభిస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు డ్రైవింగ్ చేసే విధానం అంతా పరిశీలించి ఇస్తారు కాబట్టి రోడ్డుపై వాహనాలు నడిపేవారికి డ్రైవింగ్ వచ్చి ఉండాలి మరియు డ్రైవింగ్ విధి విధానాలు తెలిసి ఉండాలి. కావున రోడ్డుపై వాహనాలు నడుపువారికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.

లెర్నర్ లైసెన్స్ పొందుటకు అవసరమైన ధృవపత్రాలు :

  1. నివాస ధృవీకరణ (రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్టు).
  2. వయస్సు ధృవీకరణ (పాస్పోర్టు, పాఠశాల ధృవీకరణ, బర్త్ సర్టిఫికేట్, ఆధార్, పాన్ కార్డు) మొ||నవి.
  3. ఫారం 1, 1ఎ, 2, 3లను నింపి అవసరమైన ఫోటోలతో సమర్పించాలి.

శాశ్వత లైసెన్స్ :
ఈ లైసెన్ను లెర్నర్ లైసెన్స్ పొందిన 30 రోజుల తరువాత నుంచి 180 రోజుల లోపుగా దరఖాస్తు చేసుకున్న వారికి నిర్ణీత పరీక్షలు నిర్వహించి శాశ్వత లైసెన్స్ జారీ చేస్తారు.

AP 7th Class Social Important Questions Chapter 11 రహదారి భద్రత

ప్రశ్న 13.
డైవింగ్ చేసేటప్పుడు డైవర్ తనతో ఉంచుకోవలసిన పత్రాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
జవాబు:
డ్రైవర్ తనతో ఉంచుకోవలసిన పత్రాలు :
i) డ్రైవింగ్ లైసెన్స్.
ii) వాహన రిజిస్ట్రేషన్ (‘సి’ బుక్).
iii) వాహనం యొక్క ఇన్సూరెన్స్ పత్రం.
iv) వాహనం యొక్క కాలుష్యరహిత ధృవపత్రం.

ప్రశ్న 14.
గ్రామీణ ప్రాంతాలలో రహదారి ప్రమాదాలకు కారణమేమి?
జవాబు:

  1. రహదారులపై గేదెలు, మేకలు, గొర్రెలు వంటి జంతువులను యథేచ్చగా వదిలివేయుట.
  2. దమ్ము చక్రాలతో ట్రాక్టర్లను నడుపుట.
  3. ప్రొక్లెనర్ వంటి భారీ వాహనాల వినియోగం వలన ఏర్పడే గుంటలు.
  4. రహదారులకు ఇరువైపుల, మూలల్లో గడ్డివాములను, చెత్తా చెదారాలను పోగుగా చేయుట.
  5. గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేసే సంతలు మార్కెట్ల వల్ల ఏర్పడే రద్దీ.
  6. రోడ్ల మీద ధాన్యపు కుప్పలు ఎండబెట్టుట.

ప్రశ్న 15.
పట్టణ ప్రాంతాలలో రహదారి ప్రమాదాలకు కారణమేమి?
జవాబు:

  1. అతివేగం మరియు నిర్లక్ష్యంగా వాహనం నడపడం.
  2. మద్యం సేవించి వాహనం నడపడం.
  3. డ్రైవింగ్ చేస్తూ చరవాణిని ఉపయోగించుట.
  4. డ్రైవర్ పరధ్యానంగా ఉండటం.
  5. రహదారి సంకేతాలను అతిక్రమించటం.
  6. సీట్ బెల్టులు మరియు హెల్మెట్లు ధరించడం వంటి భద్రతా చర్యలను పాటించకపోవడం.
  7. సరైన విధంగా డ్రైవింగ్ చేయకపోవడం మరియు తప్పుడు పద్ధతిలో వాహనాలను అధిగమించడం.

ప్రశ్న 16.
రహదారి ప్రమాదాల యొక్క పర్యావసానాలు తెలియజేయండి.
జవాబు:

  1. తాత్కాలిక లేదా శాశ్వత అంగ వైకల్యం సంభవించవచ్చు.
  2. ప్రాణాపాయ స్థితి రావొచ్చు.
  3. ప్రాణాలు కోల్పోయినచో, వారిపై ఆధారపడిన కుటుంబం ఛిన్నాభిన్నమవుతుంది.
  4. అవయవాలు కోల్పోయినచో, వారి జీవనాధారంపై అధిక ప్రభావం పడుతుంది.
  5. కుటుంబ సభ్యులు అనాథలుగా మారతారు లేదా కుటుంబాలు విచ్చిన్నం అవుతాయి.

ప్రశ్న 17.
పాదచారులు, రోడ్డును వినియోగించేటపుడు భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
జవాబు:

  1. రహదారులపై నడిచేటపుడు ఎల్లప్పుడు ఫుట్పాలను వినియోగించడం వలన పాదచారులు రోడ్డు అంచుల నుండి దూరంగా ఉండటం తద్వారా ఏదైనా వాహనం ఢీ కొట్టి వెళ్ళే ప్రమాదాన్ని నివారించవచ్చు.
  2. ఎదురుగా వాహనాలు వచ్చే విధంగా ఉన్న రోడ్డు వైపున పూర్తిగా చివరి అంచున నడవడం వలన పొరపాటున జరగబోయే ప్రమాదాల నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది.
  3. తెరిచివున్న డ్రైనేజీ కాలువలు, గుంతలు, పండ్లు మరియు కూరగాయల తొక్కల వంటి వాటిని గమనించాలి.

ప్రశ్న 18.
రహదారి భద్రతా విద్య యొక్క ప్రాముఖ్యతను రాయండి.
జవాబు:
రహదారి భద్రతా విద్య యొక్క అవసరం మరియు ప్రాముఖ్యత :

  1. అవగాహనా రాహిత్యం మరియు అజాగ్రత్త మున్నగు ఇతర కారణాల వల్ల ప్రజలు ఎక్కువగా ప్రమాదాలకు గురియగుచున్నారు. ప్రధానంగా రోడ్డును ఎక్కువగా ఉపయోగించే సమూహం యుక్త వయస్కులు.
  2. రహదారి భద్రతా చర్యలను స్పష్టంగా బోధించడం అవసరం. ప్రమాదాలను నివారించడానికి మాత్రమే కాకుండా సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన రహదారి వినియోగానికి కూడా ఇది అవసరమే.
  3. రహదారి భద్రతా విద్య అవగాహన రోడ్డును ఉపయోగించే ప్రతి ఒక్కరి బాధ్యత.
  4. రహదారి భద్రతా నియమాలు పాటించడం ద్వారా మనం సుఖంగా ఉండటమే కాకుండా తోటి ప్రయాణీకులను కూడా సుఖంగా ఉంచవచ్చును.

AP 7th Class Social Important Questions Chapter 11 రహదారి భద్రత

ప్రశ్న 19.
కెర్ట్ డ్రిల్ రోడ్డు దాటడంలో ఆచరించాల్సిన పద్ధతి ఏది?
జవాబు:
కెర్చ్ డ్రిల్ : చిన్నపిల్లలు రహదారిని దాటుటకు ఆచరించాల్సిన పద్ధతి

  1. కాలిబాట అంచు వద్ద ఆగాలి.
  2. మీ కుడి చేతి వైపు చూడాలి.
  3. మీ ఎడమ చేతి వైపు చూడాలి.
  4. మళ్లీ మీ కుడి చేతి వైపు గమనించాలి.
  5. రహదారులపై వాహనాలు లేనప్పుడు రోడ్డు వెంబడి నేరుగా నడవాలి. పరిగెత్తకూడదు.
  6. ఎదురుగా ఏవైనా వాహనాలు వస్తున్నాయేమో గమనించాలి. డ్రైవర్ మిమ్మల్ని గమనించేట్లుగా రోడ్డు దాటండి. అవకాశం ఉన్నచోట రోడ్డు దాటడానికి సబ్ వేలను మరియు ఓవర్ బ్రిడ్జిలను ఉపయోగించండి.

మీకు తెలుసా?

7th Class Social Textbook Page No. 121

ట్రామా కేర్ :
స్వల్ప లేక తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రులకు హాస్పిటల్ కి తీసుకువెళ్ళిన వెంటనే ఇచ్చే తక్షణ చికిత్స.

ప్రథమ చికిత్స :
ప్రమాదానికి గురైన వ్యక్తికి పూర్తి వైద్య సహాయం అందేలోగా ఇచ్చే ప్రాథమిక వైద్యం.

7th Class Social Textbook Page No. 123

బ్రీత్ ఎనలైజర్ :
మద్యం తాగి వాహనాలు నడిపే వ్యక్తులను గుర్తించడానికి ఉపయోగించే పరికరం

స్పీడ్ గన్ కెమేరా :
రహదారి నియమాలను ఉల్లంఘించి అతివేగంగా ప్రయాణించే వాహనాల వేగాన్ని కొలిచే పరికరం.
AP 7th Class Social Important Questions Chapter 11 రహదారి భద్రత 8

7th Class Social Textbook Page No. 125

AP 7th Class Social Important Questions Chapter 11 రహదారి భద్రత 9
రహదారి భద్రతా వారోత్సవాలు :
భారతదేశంలోని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం జనవరి నెలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తుంది. రహదారి భద్రత, డ్రైవింగ్ నియమాలు మరియు హెచ్చరికలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మరియు మరణాలకు కారణమయ్యే రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి రహదారి భద్రతకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

AP 7th Class Social Important Questions Chapter 11 రహదారి భద్రత

7th Class Social Textbook Page No. 135

1. రహదారి భద్రతా క్లబ్ :
రహదారి భద్రతా క్లబ్ లాంఛనంగా జనవరి 2010లో మొదట ఢిల్లీలో ప్రారంభించబడింది. ఈ క్లబ్ ఏర్పాటు వెనుక లక్ష్యం ఏమనగా రహదారి భద్రతా కార్యకలాపాలలో పాఠశాలలను చురుకుగా భాగస్వామ్యం చేయడం మరియు వారిని భద్రతా కార్యకలాపాలలో పాల్గొనేలా చూడటం.

మీ పాఠశాలలో రహదారి భద్రతా క్లబ్ ను ఏర్పాటు చేయండి. ఈ క్లబ్ ద్వారా ఏమేమి కార్యక్రమాలు నిర్వహించాలో చర్చించండి.

2. మోటారు వాహనాలు నడపడానికి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు.
రవాణా వాహనాలు నడపడానికి కనీస వయో పరిమితి 25 సంవత్సరాలు.

AP 7th Class Social Important Questions Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం

These AP 7th Class Social Important Questions 10th Lesson రాష్ట్ర ప్రభుత్వం will help students prepare well for the exams.

AP Board 7th Class Social 10th Lesson Important Questions and Answers రాష్ట్ర ప్రభుత్వం

ప్రశ్న 1.
గవర్నర్ నియామకం మరియు విధులను గురించి వ్రాయండి.
జవాబు:
భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. ప్రధానమంత్రి, కేంద్రమంత్రి మండలి సిఫారసు మేరకు రాష్ట్రపతి అయిదు సంవత్సరాల పదవీ కాలానికి గవర్నర్ ని నియమిస్తారు. ఒక్కోసారి రెండు లేక మూడు రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉంటారు. ఆర్టికల్ 158 (3a) ప్రకారం రెండు లేక ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్ గా నియమించవచ్చు.

గవర్నర్ విధులు :

  1. శాసనసభ : మెజారిటీ పార్టీ నాయకుణ్ణి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించడం.
  2. రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి, దాని గోప్యతను కాపాడతామని వారి చేత ప్రమాణం చేయించటం.
  3. శాసనసభ సమావేశాలు నిర్వహించమని మరియు నిరవధిక వాయిదా వేయమని ఆజ్ఞలు ఇవ్వడం.
  4. హైకోర్టు పరిధిలో పనిచేసే అన్ని న్యాయస్థానాలలో న్యాయమూర్తులను నియమించటం.
  5. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును రాష్ట్రపతికి నివేదించటం.

ప్రశ్న 2.
శాసన సభ నిర్మాణం మరియు శాసన సభకు ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు?
జవాబు:
శాసనసభ :
రాష్ట్ర శాసనసభ ఒక శాసన నిర్మాణ విభాగం. దిగువ సభగా భావించే ఈ సభలో ప్రజలచే ఎన్నుకోబడిన శాసన సభ్యులందరు సమావేశమై, రాష్ట్ర ప్రగతి మరియు సంక్షేమానికి సంబంధించిన వివిధ విషయాలను చర్చిస్తారు. ప్రతి రాష్ట్రాన్ని, ఆ రాష్ట్ర జనాభా ఆధారంగా శాసనసభ నియోజక వర్గాలుగా విభజించారు.

శాసనసభకు ఎన్నికలు :
సాధారణంగా, ప్రతి 5 సంవత్సరములకు ఒకసారి శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి. అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రకటన చేస్తుంది. స్వతంత్ర అభ్యర్థులు, రాజకీయ పార్టీల అభ్యర్థులు వారి మ్యానిఫెస్టోలతో ఎన్నికలలో పోటీ చేస్తారు. స్వతంత్ర అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చే హామీలను మ్యానిఫెస్టో అంటారు.

 AP 7th Class Social Important Questions Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం

ప్రశ్న 3.
శాసన సభ సభ్యుని ఎన్నిక ప్రక్రియను వివరించండి.
జవాబు:

  1. శాసన సభ నియోజక వర్గాలలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సిబ్బందిని ఎన్నికల సంఘం నియమిస్తుంది.
  2. 18 సం|| పైబడి ఓటు హక్కు కలిగిన ఓటర్లందరూ ఎన్నికల రోజున ఆ నియోజక వర్గంలో ఓటు వేస్తారు.
  3. ఓటర్లు ఓటరు గుర్తింపు కార్డును బూత్ స్థాయి అధికారికి చూపించాలి.
  4. రహస్య ఓటింగు విధానం ప్రకారం, ఓటర్లు వారు ఎవరికి ఓటు వేసినది తెలియపరచరాదు.
  5. పోలింగ్ పూర్తి అయిన తరువాత, ప్రకటించిన తేదీ నాడు ఓట్లను లెక్కిస్తారు.
  6. ఓట్ల లెక్కింపు తరువాత ఎవరికైతే ఎక్కువ ఓట్లు (Majority) వస్తాయో వారిని ఆ నియోజకవర్గ యం.ఎల్.ఏ. (శాసనసభ సభ్యుడు) (Member of Legislative Assembly) గా ప్రకటిస్తారు.

ప్రశ్న 4.
శాసన మండలి సభ్యుల కూర్పు, నిర్మాణం గురించి వివరంగా తెలియజేయండి.
జవాబు:
శాసన మండలి :

  1. శాసన నిర్మాణ శాఖలోని ఎగువసభను శాసన మండలి అంటారు.
  2. ద్విసభా విధానములో, శాసన మండలి పరోక్షంగా ఎన్నుకోబడిన వారితో పనిచేస్తుంది.
  3. ప్రతి 2 సంవత్సరాలకు 6 సంవత్సరాల పదవీ కాలం ముగిసిన 1/3 వ వంతు సభ్యులు పదవీ విరమణ చేయగా కొత్త సభ్యులు ఎన్నిక అవుతారు.
  4. ఇది శాశ్వతసభ ఎందుకంటే ఈ సభ రద్దు కాదు. ప్రతి శాసన మండలి సభ్యుడు (MLC) ఆరు సంవత్సరములు పదవిలో కొనసాగుతాడు.

శాసన మండలి నిర్మాణం ఈ క్రింది విధంగా ఉంటుంది :

  1. 1/3 వ వంతు మంది సభ్యులు శాసనసభ సభ్యులచే ఎన్నుకోబడతారు.
  2. 1/3 వ వంతు మంది సభ్యులు స్థానిక ప్రభుత్వ సంస్థల సభ్యులచే ఎన్నుకోబడతారు.
  3. 1/12 వ వంతు మంది సభ్యులు పట్టభద్రులచే ఎన్నుకోబడతారు.
  4. 1/12 వ వంతు మంది సభ్యులు ఉపాధ్యాయులచే ఎన్నుకోబడతారు.
  5. 1/6 వ వంతు మంది సభ్యులు రాష్ట్ర గవర్నర్ చే నామినేట్ చేయబడతారు.

ప్రశ్న 5.
ముఖ్యమంత్రి అధికారాలు మరియు మంత్రి మండలి గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
ముఖ్యమంత్రి అధికారాలు :

  1. మంత్రిమండలి జాబితాను తయారుచేసి గవర్నర్‌కు పంపిస్తారు.
  2. మంత్రులకు శాఖలను కేటాయిస్తారు.
  3. మంత్రిమండలి సమావేశాలు ఏర్పాటు చేసి అధ్యక్షత వహిస్తారు.
  4. ముఖ్యమంత్రి అన్ని శాఖలను సమన్వయం చేస్తారు మరియు పర్యవేక్షిస్తారు.

ఆర్టికల్ 163 (1) ప్రకారం గవర్నర్ తన విధులను నిర్వర్తించడంలో సహాయపడడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రికి మంత్రి మండలి ఉండాలి.

మంత్రిమండలి :

  1. ముఖ్యమంత్రి క్యాబినెట్ సభ్యులకు వివిధ మంత్రిత్వ శాఖలను కేటాయిస్తారు.
  2. ఆ మంత్రులు తమ పరిధిలో ఉన్న విభాగాలకు ప్రభుత్వ విధానాలను నిర్దేశిస్తారు.
  3. ఈ విధానాలను ఆయా విభాగాల అధికారులు నిబంధనల ప్రకారం అమలు చేస్తారు.
  4. సభ ఆమోదం కోసం సమర్పించవలసిన విధానాలు మరియు ప్రణాళికలను సిద్ధం చేయాల్సిన బాధ్యత మంత్రిత్వశాఖపై ఉంది.
  5. సభ ఆమోదం పొందిన విధానాలను కార్యనిర్వాహక శాఖ అమలు చేస్తుంది.

 AP 7th Class Social Important Questions Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం

ప్రశ్న 6.
రాష్ట్రంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నిర్మాణం గురించి వివరణాత్మకంగా తెలియజేయండి.
జవాబు:
న్యాయశాఖ – రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం :

  1. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అంగాలలో ఇది ఒకటి. ఇది చట్టాలను వ్యాఖ్యానించటంతో పాటు వాటిని పరిరక్షించడం మరియు రాష్ట్రంలోని చట్టాల అమలుకు బాధ్యత వహిస్తుంది.
  2. హైకోర్టు రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయ విభాగం.
  3. స్వతంత్ర న్యాయవ్యవస్థలో భాగంగా, దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టు క్రింద పనిచేస్తుంది.
  4. రాష్ట్ర హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు ఉంటారు.
  5. భారత రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు.
  6. ప్రధాన న్యాయమూర్తి ఈ పదవిలో అతనికి / ఆమెకి 62 సంవత్సరముల వయస్సు వచ్చే వరకు కొనసాగుతారు. రాష్ట్ర స్థాయిలో హైకోర్టే కాకుండా ట్రిబ్యునల్స్ మరియు దిగువ స్థాయిలో జిల్లా కోర్టులు ఉన్నాయి.
  7. న్యాయవ్యవస్థ ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రజలకు న్యాయం చేస్తుంది. సయోధ్య మరియు రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించడానికి లోక్ అదాలత్ (ప్రజా న్యాయస్థానం)ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

ప్రశ్న 7.
చట్టాలను ఎవరు తయారుచేస్తారు? ఆధారమేమి?
జవాబు:
చట్టాలను ఎవరు తయారు చేస్తారంటే

  1. రాష్ట్రంలో వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి మనకు చట్టాలు అవసరం.
  2. రాష్ట్రం మరియు దేశం అభివృద్ధి చెందడానికి మరియు ప్రగతి పథంలో పయనించడానికి చట్టాలు సహాయపడతాయి.
  3. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఆ రాష్ట్రానికి చట్టాలను తయారు చేస్తుంది.
  4. ఒక రాష్ట్ర పరిధిలోని పరిపాలన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే.
  5. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ విధులు మరియు అధికారాలు మూడు జాబితాలుగా విభజించబడ్డాయి.
  6. అవి 1. కేంద్ర జాబితా, 2. రాష్ట్ర జాబితా, 3. ఉమ్మడి జాబితా. రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలలో ఉన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను తయారు చేస్తుంది.

ప్రశ్న 8.
చట్ట సభలలో ఒక బిల్లు శాసనం (చట్టం)గా ఎలా రూపొందుతుందో విశదీకరించండి.
జవాబు:

  1. సాధారణంగా, అధికార పక్షానికి చెందిన సభ్యుడు రాష్ట్ర శాసనసభ లేక శాసనమండలిలో బిల్లును ప్రవేశపెడతారు.
  2. ఆర్థిక బిల్లును గవర్నర్ ముందస్తు అనుమతి పొందిన తరువాత మాత్రమే శాసనసభలో ప్రవేశపెడతారు. సభలోని ప్రతి సభ్యునికి బిల్లు ప్రతులను పంచుతారు.
  3. బిల్లుపై సవివరమైన చర్చలు జరిపి అవసరమైతే కొన్ని మార్పులు చేర్పులు చేసిన తరువాత ఓటింగ్ జరుపుతారు.
  4. మెజారిటీ సభ్యుల ఆమోదం పొందిన తరువాత, ఆ బిల్లును రెండవ సభకు పంపుతారు.
  5. మొదటి సభలో జరిగిన విధంగానే రెండవ సభలో కూడా అదే విధానం బిల్లును ఆమోదించడం కొనసాగుతుంది.
  6. రెండు సభల ఆమోదం పొందిన తరువాత బిల్లు గవర్నర్ ఆమోదం కోసం పంపబడుతుంది.
  7. గవర్నర్ ఆమోదం తెలిపి సంతకం చేసిన తరువాతనే బిల్లు చట్టంగా మారుతుంది.
  8. చట్టాన్ని గెజిట్ లో ప్రచురిస్తారు. చట్టాన్ని అమలు చేయడానికి, గెజిట్ ప్రతులను కార్యనిర్వాహక శాఖకు పంపడం జరుగుతుంది.

ప్రశ్న 9.
ఒక అంశంపై బిల్లు చట్టంగా ఎలా రూపొందుతుందో ‘ఫ్లో చార్టు ద్వారా వర్ణించండి.
జవాబు:
AP 7th Class Social Important Questions Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం 1

ప్రశ్న 10.
ఈ క్రింది వారి విధులు, అధికారాలు తెలియజేయండి.
ఎ) పోలీసు సూపరింటెండెంట్, బి) RDO, సి) తహసీల్దార్, డి) VRO
జవాబు:
ఎ) పోలీసు సూపరింటెండెంట్ :
ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయంలో పోలీసు సూపరింటెండెంట్ ఉంటారు. అతను జిల్లా ముఖ్య పోలీసు అధికారి. జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణలో జిల్లా కలెక్టర్‌కు సహాయం చేస్తారు.

బి) రెవెన్యూ డివిజనల్ అధికారి :
సబ్ డివిజన్లో శాంతిభద్రతల నిర్వహణ, భూ రికార్డులు, ఎన్నికల నిర్వహణ మొదలగునవి రెవెన్యూ డివిజనల్ అధికారి బాధ్యతలు. భూ సేకరణ మరియు పునరావాస పనులను మరియు జిల్లా కలెక్టర్ సూచించిన ఇతర పనులను నిర్వహిస్తారు.

సి) తహసీల్దార్ :
మండల స్థాయిలో ఇతను ముఖ్య పరిపాలనా కార్యనిర్వహణాధికారి. మండల స్థాయిలో రెవెన్యూ వ్యవహారాల సక్రమ అంచనా, లెక్కింపు, వసూలు మరియు భూ రికార్డుల నిర్వహణకు బాధ్యత వహిస్తారు.

డి) గ్రామ రెవెన్యూ అధికారి :
గ్రామ రెవెన్యూ రికార్డులు మరియు అకౌంట్లను కచ్చితంగా నిర్వహించడం. గ్రామ స్థాయి పరిపాలనలో రెవెన్యూ విభాగానికి సంబంధించిన భూమి శిస్తు; పన్నులు మరియు ఇతర మొత్తాల వసూళ్ళతో పాటు సర్వే రాళ్లను తనిఖీ చేయడం, స్థానికత, నివాస ధృవీకరణ పత్రాలు జారీ చేయడం మొదలగు విధులు నిర్వహిస్తారు.

ప్రశ్న 11.
జిల్లా మరియు దిగువ స్థాయిలోని న్యాయస్థానాల ఏర్పాటు గురించి వివరించండి.
జవాబు:
జిల్లాలో న్యాయశాఖ :
జిల్లా న్యాయశాఖలో జిల్లా కోర్టులు, డివిజిన్ కోర్టులు ఉంటాయి. డివిజన్ కోర్టులు డివిజన్ స్థాయిలోను జిల్లా కోర్టు జిల్లా స్థాయిలోను న్యాయ పరిపాలన చేస్తాయి.

జిల్లా కోర్టు :
జిల్లా స్థాయిలో ఉన్న కోర్టును జిల్లా కోర్టు అంటారు. జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, మరికొందరు న్యాయమూర్తులు ఉంటారు. జిల్లాలోని వివిధ కేసులను విచారించి తుది తీర్పు ఇవ్వడం ప్రధాన విధి. డివిజనల్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జిల్లా కోర్టులో అప్పీల్ చేయవచ్చు.

సబార్డినేట్ కోర్టు :
జిల్లా మరియు దిగువ స్థాయిలో సబార్డినేట్ కోర్టులు దేశవ్యాప్తంగా దాదాపు ఒకే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఈ కోర్టులు తమ అధికార పరిధిలో పౌర (సివిల్) మరియు నేర (క్రిమినల్) వివాదాలలో CPC (సివిల్ ప్రొసీజర్ కోడ్) మరియు CrPC కోడ్ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్), లకు అనుగుణంగా వ్యవహరిస్తాయి.

ప్రశ్న 12.
AP Board 7th Class Social Solutions Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం 2
పై పటమును పరిశీలించి క్రింది ప్రశ్నలకు సరియైన సమాధానములివ్వండి.
ఎ) ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఎన్ని శాసనసభ నియోజక వర్గాలు కలవు?
బి) అత్యధిక శాసనసభా స్థానాలు కల జిల్లా ఏది?
సి) అత్యల్ప శాసనసభా స్థానాలు కల జిల్లా ఏది?
డి) మీ పాఠశాల ఏ శాసన సభా నియోజక వర్గ పరిధిలో కలదు?
జవాబు:
ఎ) 175
బి) తూర్పు గోదావరి (19)
సి) విజయనగరం (9)
డి) ప్రత్తిపాడు

ప్రశ్న 13.
ఈ పదాలను మీ తరగతిలో చర్చించండి: మెజారిటీ, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, నియోజక వర్గం, రహస్య ఓటింగ్ విధానం, సార్వత్రిక వయోజన ఓటు హక్కు.
జవాబు:
1) మెజారిటీ :
జరిగినటువంటి ఎన్నికల్లో అధిక ఓట్లు / సీట్లు వచ్చినవారు.

2) అధికార పార్టీ :
ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసన సభకు (చట్ట సభలకు) జరిగిన ఎన్నికల్లో మెజారిటీ పొంది (ఎక్కువ సీట్లు గెలుచుకుని) అధికారం పొందిన పార్టీ.

3) ప్రతిపక్ష పార్టీ :
రాజకీయంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువగానీ పార్టీలు అధికార పార్టీని వ్యతిరేకించే పార్టీలు.

4) నియోజక వర్గం :
అక్కడ నివసిస్తున్న ఓటర్లందరూ తమ ప్రతినిధులను ఎన్నుకునే ఒక నిర్దిష్ట ప్రాంతం.

5) రహస్య ఓటింగు విధానం :
ఎన్నికల సమయంలో ఓటరు తాను ఓటు వేసే విషయంలో గోప్యతను కల్గి ఉండటం.

6) సార్వత్రిక వయోజన ఓటు హక్కు :
ఒక నిర్దిష్ట వయస్సు (18 సం||లు) నిండిన భారతదేశ పౌరులందరికి ఎటువంటి తారతమ్యం లేకుండా ఓటు హక్కు కల్పించటం.

 AP 7th Class Social Important Questions Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం

ప్రశ్న 14.
జిల్లా కలెక్టర్ మిగతా విధుల జాబితా తయారుచేయండి.
జవాబు:
రెవెన్యూ పాలన

  1. భూమి శిస్తు వసూలు
  2. రెవెన్యూ రికార్డుల నిర్వహణ పర్యవేక్షణ.
  3. వ్యవసాయ గణాంక సేకరణ.
  4. బంజరు భూముల విస్తీర్ణం అంచనా,
  5. పబ్లిక్ ఎస్టేట్స్ నిర్వహణ మొదలైన రెవెన్యూ కార్యకలాపాల పర్యవేక్షణ.

మెజిస్టీరియల్ అధికారాలు

  1. అల్లర్లు సంభవించినపుడు నిషేధాజ్ఞల విధింపు,
  2. సబార్డినేట్ కోర్టులపై పర్యవేక్షణ.
  3. పోలీసు స్టేషన్ల తనిఖీ.
  4. ఖైదీలకు కనీస సదుపాయాల కల్పన.
  5. కార్మిక సమస్యల పరిష్కారం.
  6. వార్తా పత్రికల ప్రారంభానికి అనుమతివ్వడం.
  7. పేలుడు పదార్థాల తయారీకి, పెట్రోలు బంకులు, సినిమా హాళ్ళ నిర్మాణానికి NOC జారీ చేయుట మొదలైనవి.

ఎన్నికల పర్యవేక్షణ అధికారం

  1. జిల్లా స్థాయిలో ముఖ్య ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తాడు.
  2. ఓటర్ల జాబితా తయారీ, సవరణ, తుది జాబితా ప్రకటన మొదలగు విధుల పర్యవేక్షణ.
  3. రిటర్నింగ్ అధికారుల నియామకం.
  4. జిల్లా సహకార బ్యాంకులు, పాల కేంద్రాలు, నీటి వినియోగ సంఘాలు మొదలైన సంస్థల్లో ఎన్నికల నిర్వహణ.
  5. ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షణ చేయుట.

ప్రకృతి ఉపద్రవాలను ఎదుర్కోవడం (డిజాస్టర్ మేనేజ్ మెంట్) అభివృద్ధి కార్యక్రమాల అమలు

  1. తుఫానులు, వరదలు, భూకంపాలు, కరువు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినపుడు కలెక్టర్ కీలక పాత్ర పోషిస్తాడు.
  2. ఉపశమన, సహాయక చర్యలు చేపడతాడు.
  3. వివిధ అధికారుల మధ్య సమన్వయ కార్యకర్తగా వ్యవహరిస్తారు.
  4. జిల్లాలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తాడు.
  5. వివిధ ప్రభుత్వరంగ సంస్థల నిర్వాహకులతో సమీక్షించి ప్రభుత్వ లక్ష్యాలను సాధించేలా చేయడం.
  6. జిల్లాలో నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు లభించేటట్లు చూస్తాడు.

జనాభా లెక్కలు

  1. కలెక్టరు జిల్లా స్థాయిలో ముఖ్య జనాభా లెక్కల అధికారిగా వ్యవహరిస్తాడు.
  2. జిల్లాలో జనాభా లెక్కల సేకరణకు చర్యలు తీసుకొంటాడు.
  3. అలాగే జిల్లాలో పాడి గేదెలు, పెంపుడు జంతువులు, ఫల వృక్షాలకు సంజా. సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తారు.

వివిధ పథకాలకు అధ్యక్షులు

  1. కుటుంబ సంక్షేమం, మహిళల సాధికారత, గ్రామీణాభివృద్ధి, నీటి యాజమాన్యంల పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూస్తారు.
  2. MGNREGA అమలుకు కృషి.
  3. SSA, DRDA మొదలగు పథకాల అమలు.

స్థానిక సంస్థల పర్యవేక్షణ

  1. జిల్లాలోని స్థానిక సంస్థల సమావేశాలకు కలెక్టరు పదవీ రీత్యా సభ్యుడిగా, శాశ్వత ఆహ్వానితుడి హోదాలో పాల్గొంటాడు.
  2. జిల్లా పరిషత్తు సమావేశాలను ఏర్పాటు చేస్తాడు.
  3. ఆయా సంస్థలకు ప్రత్యేక అధికారి (Special Officer) గా వ్యవహరిస్తాడు.

ఇతర అధికారాలు

  1. మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి సమీక్ష జరపడం.
  2. నీటి పారుదల వసతుల కల్పన.
  3. ట్రెజరీలపై పర్యవేక్షణ.
  4. కేంద్ర ప్రభుత్వ శాఖల విధుల మధ్య సంధానకర్తగా వ్యవహరించడం.
  5. నిత్యావసర వస్తువుల సక్రమ సరఫరా.
  6. శాంతిభద్రతలపై పర్యవేక్షణ.
  7. ముఖ్య ప్రోటోకాల్ అధికారిగా వ్యవహరించడం.
  8. జిల్లాలోని అన్ని జిల్లా సంస్థల అధికారులపై పర్యవేక్షణ.

ప్రశ్న 15.
ఎన్నికలలో నిలబడిన అభ్యర్థి ఏవిధంగా ప్రచారం చేస్తాడో, సమాచారం సేకరించండి.
జవాబు:

  1. ఎన్నికల సంఘం విధించిన ప్రవర్తనా నియమావళి అనుసరించి ఎన్నికలలో నిలబడిన అభ్యర్థి ప్రచారం చేస్తాడు.
    ఉదా : ఎన్నికల ఖర్చు వగైరా.
  2. అభ్యర్థి తన నియోజకవర్గ ప్రజలను కలుస్తూ, వాగ్దానాలను చేస్తూ కాలిబాట, వాహనాల ద్వారా ప్రచారం చేస్తాడు.
  3. వివిధ రకాల మీడియాలలో టివి, యూట్యూబ్, ఫేస్ బుక్ లో ప్రచారం చేస్తాడు.
  4. వార్తా పత్రికలలో ఇంటర్వ్యూల ద్వారా, ప్రకటనల ద్వారా ప్రచారం చేస్తాడు.
  5. పోస్టర్లు అంటించటం, గోడ పత్రికలు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తాడు.

ప్రశ్న 16.
అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు గవర్నరు పేరు మీద వెలువడతాయి. ఎందుకు?
జవాబు:

  1. రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు.
  2. గవర్నర్ రాష్ట్రానికి రాజ్యాంగపరమైన అధిపతి.
  3. గవర్నర్ కార్యనిర్వాహక అధిపతి. పరిపాలన అంతా ఆయన పేరు మీద కొనసాగుతుంది.
  4. అతని అనుమతి తర్వాత మాత్రమే అన్ని బిల్లులు చట్టంగా మారుతాయి.
  5. గవర్నర్ తన అధికారాన్ని ప్రత్యక్షంగా కాని లేదా తను నియమించిన అధికారుల ద్వారా కాని ఉపయోగించవచ్చు.

ప్రశ్న 17.
ప్రజలు ఎన్నికలలో ఓట్లు ఎందుకు వేస్తారు?
జవాబు:
ప్రజలు తమ సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడి తమ అభివృద్ధికి పాటుపడే నాయకుడిని ఎన్నుకోవటం కోసం ఓట్లు వేస్తారు.

ప్రశ్న 18.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుల కూర్పును గురించి మీ ఉపాధ్యాయుని సహాయంతో తెలుసుకోండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు మొత్తం : 58 వీరిలో
శాసనసభ సభ్యులచే ఎన్నుకోబడినవారు (1/3 వ వంతు) : 20
స్థానిక సంస్థల సభ్యులచే ఎన్నుకోబడినవారు (1/3 వ వంతు) : 20
రాష్ట్ర గవర్నర్ చే నామినేట్ చేయబడినవారు : 08
పట్టభద్రులచే ఎన్నిక కాబడినవారు : 05
ఉపాధ్యాయులచే ఎన్నిక కాబడినవారు : 05

మీకు తెలుసా?

7th Class Social Textbook Page No. 93

సంకీర్ణ ప్రభుత్వం అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాజకీయ పార్టీలు సహకరించే ప్రభుత్వ రూపం. రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు ఉమ్మడి లక్ష్యాలతో ఏర్పాటు చేసుకున్న కూటమి. ఎన్నికల తరువాత ఏ ఒక్క పార్టీ కూడా సంపూర్ణ మెజారిటీ సాధించకపోవడమే అటువంటి ఏర్పాటుకు సాధారణ కారణం.

7th Class Social Textbook Page No. 95

ఆర్టికల్ 171 (1) ప్రకారం ఒక రాష్ట్ర శాసనమండలి సభ్యుల సంఖ్య, ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 1/4వ వంతుకు మించరాదు.

7th Class Social Textbook Page No. 99

ఆర్టికల్ 163 (1) ప్రకారం గవర్నర్ తన విధులను నిర్వర్తించడంలో సహాయపడడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి ఉండాలి.

 AP 7th Class Social Important Questions Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం

7th Class Social Textbook Page No. 101

కోర్ట్ ఆఫ్ రికార్డు :
హైకోర్టు జారీ చేసిన అన్ని నిర్ణయాలు మరియు డిక్రీలు ముద్రించబడతాయి. ఇవి కోర్టులు మరియు న్యాయవాదులకు భవిష్యత్ సూచనల కోసం ఒక రికార్డుగా ఉంచబడతాయి.

AP 7th Class Social Important Questions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం

These AP 7th Class Social Important Questions 9th Lesson భారత రాజ్యాంగం – పరిచయం will help students prepare well for the exams.

AP Board 7th Class Social 9th Lesson Important Questions and Answers భారత రాజ్యాంగం – పరిచయం

ప్రశ్న 1.
భారత ప్రభుత్వ చట్టం – 1935లోని ముఖ్యాంశాలేవి?
జవాబు:

  1. రాజ్యాంగం లేదు. బ్రిటిష్ పార్లమెంటు చేసిన చట్టాల ప్రకారం వారు భారతదేశాన్ని పాలించారు. వాటిలో, భారత ప్రభుత్వ చట్టం – 1935 చాలా ముఖ్యమైన చట్టం.
  2. ఈ చట్టం ద్వారా ప్రావిన్సులు (రాష్ట్రాలు) మరియు స్వదేశీ సంస్థానాలతో కూడిన అఖిల భారత సమాఖ్య ఏర్పడింది.
  3. కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాలను మూడు జాబితాలుగా విభజించింది.
  4. కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే విధంగా రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించింది.

ప్రశ్న 2.
బ్రిటిషు పాలనలో భారత రాజ్యాంగానికి సంబంధించి ఏవిధమైన చర్యలు చేపట్టినారు?
జవాబు:
బ్రిటిష్ పాలనలో భారత రాజ్యాంగానికి సంబంధించి చేపట్టిన చర్యలు:

  1. 1928వ సంవత్సరంలో, భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడానికి భారత జాతీయ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఒక కమిటీని ఏర్పాటు చేశాయి.
  2. మోతీలాల్ నెహ్రూ (జవహర్‌లాల్ నెహ్రూ తండ్రి) ఈ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు.
  3. ఈ కమిటీ తన నివేదికను 1929వ సంవత్సరంలో సమర్పించింది. దీనిని నెహ్రూ నివేదిక అని పిలుస్తారు.
  4. ఇది మొదటి రాజ్యాంగ పత్రంగా పరిగణించబడుతుంది. కానీ బ్రిటిష్ వారు అంగీకరించకపోవడం వలన ఇది అమలులోకి రాలేదు.
  5. 1931వ సంవత్సరంలో, కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం స్వతంత్ర భారతదేశం యొక్క రాజ్యాంగం ఎలా ఉండాలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
  6. నెహ్రూ నివేదిక మరియు కరాచీ తీర్మానం రెండూ సార్వత్రిక వయోజన ఓటు హక్కు స్వేచ్ఛ మరియు సమానత్వ హక్కుకు కట్టుబడి ఉన్నాయి.

ప్రశ్న 3.
రాజ్యాంగ సభ అనగానేమి? రాజ్యాంగ సభ నిర్మాణం గురించి వివరించండి.
జవాబు:
రాజ్యాంగ సభ :

  1. రాజ్యాంగాన్ని రూపొందించడానికి, ఎన్నుకోబడిన ప్రతినిధుల చేత ఏర్పడిన సభనే రాజ్యాంగ సభ అంటారు.
  2. చారిత్రకంగా, 1934లో భారత జాతీయ కాంగ్రెస్ ఒక రాజ్యాంగ సభ కోసం డిమాండ్ చేసింది. 1946 కేబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం, రాజ్యాంగ సభకు జులై 1946లో ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ సభ సభ్యులను అసెంబ్లీల సభ్యులు పరోక్షంగా ఎన్నుకున్నారు.
  3. క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ప్రతి బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుండి మరియు ప్రతి స్వదేశీ సంస్థానాల నుండి సీట్లు కేటాయించింది.
  4. దీని ప్రకారం, బ్రిటిష్ పాలనలో ఉన్న రాష్ట్రాలు లేదా ప్రాంతాల నుండి 292 మంది సభ్యులను ఎన్నుకున్నారు.
  5. మరియు స్వదేశీ సంస్థానాలు అన్ని కలిసి 93 మంది సభ్యులను ఎంపిక చేసాయి.
  6. ఢిల్లీ, అజ్మీర్-మేవాడ్, కూర్గ్ మరియు బ్రిటిష్ బెలూచిస్తాన్ నుండి నలుగురు సభ్యులను ఎన్నుకున్నారు.
  7. దీంతో భారత రాజ్యాంగ సభ. మొత్తం సభ్యుల సంఖ్య 389కి చేరుకున్నది.
  8. ఈ 389 మంది సభ్యులలో 26 మంది షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు, 9 మంది మహిళా సభ్యులు.
  9. 1947 ఆగస్టులో దేశ విభజనతో, రాజ్యాంగ సభను, భారత రాజ్యాంగ సభ మరియు పాకిస్తాన్ రాజ్యాంగ సభగా విభజించారు.
  10. భారత రాజ్యాంగ సభలో 299 మంది సభ్యులు ఉన్నారు. దీనికి డా|| బాబు రాజేంద్ర ప్రసాద్ ను అధ్యక్షునిగా ఎన్నుకొన్నారు.

AP 7th Class Social Important Questions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం

ప్రశ్న 4.
భారత రాజ్యాంగ పీఠిక యొక్క ముఖ్య ఆదర్శాలు మరియు వాటి నిర్వచనాలు తెల్పండి.
జవాబు:
భారత రాజ్యాంగ పీఠిక యొక్క ముఖ్య ఆదర్శాలు:

సర్వసతాక
బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం.

సామ్యవాదం
సమాజంలో సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ అసమానతలు తగ్గించడం ద్వారా సామాజిక న్యాయం అందించబడుతుంది.

లౌకిక వాదం
తమకు ఇష్టమైన మతాన్ని అనుసరించడానికి మరియు ప్రచారం చేసుకోవడానికి పౌరులకు హక్కు ఉంది. రాజ్యానికి అధికారిక మతం లేదు. అన్ని మతాలు సమానమే.

ప్రజాస్వామ్యం
ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులచే ప్రభుత్వం నడుపబడుతుంది.

గణతంత్ర వ్యవస్థ
రాజ్యాధినేత ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతారు.

న్యాయం :
భారత రాజ్యాంగం పౌరులందరికీ సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయాన్ని హామీ ఇచ్చింది. కులం, మతం మరియు లింగం ఆధారంగా పౌరుల పట్ల వివక్ష చూపరాదు. ప్రభుత్వం అందరి సంక్షేమం కోసం కృషి చేయాలి.

స్వేచ్చ :
అందరికి స్వేచ్చ అని అర్థం. రాజ్యాంగ ప్రవేశిక పౌరులకు ఒకరి స్వంత నమ్మకం మరియు విశ్వాసం ప్రకారం ఆలోచించడం, వ్యక్తీకరించడం మరియు ఆరాధించడం కోసం స్వేచ్ఛను అందిస్తుంది.

సమానత్వం :
చట్టం ముందు అందరూ సమానమే. పౌరులందరూ అభివృద్ధికి సమాన అవకాశాలు పొందుతారు. భారత రాజ్యాంగం యొక్క ఉపోద్ఘాతం పౌరులందరికీ సమాన హెూదా సాధించడానికి అవకాశాలను కల్పిస్తుంది.

సౌభ్రాతృత్వం :
అనగా సోదర భావం. ఇది ప్రజలందరి మధ్య ఐక్యత, సమగ్రత మరియు విధేయతను ప్రోత్సహిస్తుంది.

ఐక్యత మరియు సమగ్రత :
దేశం యొక్క ఐక్యత మరియు సమగ్రత అనేది మనం దేశం యొక్క అభివృద్ధి మరియు పురోగతి ఐక్యంగా ఉండాలని పేర్కొనడం పీఠికలోని మరొక వాగ్దానం. భారతదేశం సమాఖ్య స్వభావం కలిగి ఉన్నప్పటికీ, ఇది ఏకీకృత న్యాయవ్యవస్థ, ఏక పౌరసత్వం, ఒకే రాజ్యాంగం మరియు ప్రాథమిక హక్కులు మరియు అఖిల భారత సేవల వ్యవస్థను కలిగి ఉంది.

ప్రశ్న 5.
ప్రాథమిక హక్కుల గురించి వివరణాత్మకంగా తెల్పండి.
జవాబు:
ప్రాథమిక హక్కులు :

  1. హక్కులు అనేవి వ్యక్తుల సహేతుకమైన వాదనలు. ప్రాథమిక హక్కులనేవి ఒక దేశం తన పౌరులను రక్షించడానికి రాజ్యాంగం ప్రకారం గుర్తించబడినవి.
  2. ప్రజాస్వామ్య విజయం మరియు పౌరుల సమగ్ర అభివృద్ధి కొరకు ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడ్డాయి.
  3. వీటిని భారత సుప్రీం కోర్టు మరియు హైకోర్టులు నేరుగా పరిరక్షిస్తాయి.
  4. ప్రస్తుతం భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో, ఆర్టికల్ 14 నుండి 32 వరకు ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అవి చిత్రంలో చూపించబడ్డాయి.
    AP 7th Class Social Important Questions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం 1
    i) పీడనాన్ని నిరోధించే హక్కు
    ii) స్వేచ్ఛా హక్కు
    iii) సమానత్వపు హక్కు
    iv) మత స్వాతంత్ర్యపు హక్కు
    v) విద్యా సాంస్కృతిక హక్కు
    vi) రాజ్యాంగ పరిహారపు హక్కు

భారత రాజ్యాంగం ఆవిర్భావ సమయంలో, మనకు ఏడు థమిక హక్కులు ఉండేవి. కాని, 1978వ సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కు తొలగించబడింది.

AP 7th Class Social Important Questions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం

ప్రశ్న 6.
సమాచార హక్కు విద్యా హక్కు చట్టాల గురించి వివరించండి.
జవాబు:
సమాచార హక్కు చట్టం :

  1. సమాచార హక్కు చట్టం ప్రకారం, ప్రతి పౌరునికి ప్రభుత్వం నుండి ఏదైనా సమాచారం తీసుకోవడానికి అధికారం కల్పిస్తుంది.
  2. ఇది పరిపాలనలో పారదర్శకతను నిర్ధారిస్తుంది.
  3. సమాచార హక్కు చట్టాన్ని (ఆర్టీఐ) భారత పార్లమెంట్ 2005లో ఆమోదించింది.
  4. ఈ చట్టం అక్టోబర్ 12, 2005 నుండి అమలులోకి వచ్చింది.

విద్యా హక్కు:

  1. మన పార్లమెంటు స్వేచ్ఛా హక్కులో భాగంగా విద్యను, ప్రాథమిక హక్కుగా గుర్తించింది.
  2. 2002 లో 86 వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు ఆమోదంతో రాజ్యాంగంలో విద్యను ప్రాథమిక హక్కుగా చెప్పే 21ఎ ప్రకరణ ద్వారా చేర్చారు.
  3. “6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలందరికి చట్టం ద్వారా ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలి” అని ఈ చట్టం పేర్కొంటుంది.
  4. బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని 2009 లో భారత పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టం ఏప్రిల్ 1, 2010న అమల్లోకి వచ్చింది.

ప్రశ్న 7.
విలువలు అనగానేమి? మన జీవితంలో వాటి ప్రాధాన్యత ఏమి?
జవాబు:

  1. విలువలు వ్యక్తుల ప్రవర్తనను నిర్ణయించే అంతర్గత ప్రమాణాలు. ఇవి మన చర్యలను ప్రేరేపిస్తాయి.
  2. మన జీవితంలో ఇవి ముఖ్యమైనవి, పవిత్రమైనవి. విలువలను వ్యక్తిలో ఉండే నైతికత అనేవి కుటుంబం, సమ వయస్కులు, సామాజిక నేపథ్యం మొదలైన కారకాలతో ప్రభావితమౌతాయి.
  3. ఒక వ్యక్తిగాని, సమాజం గాని అభివృద్ధిని సాధించాలంటే విలువలు. అనేవి అత్యంత ఆవశ్యకమైనవి. ముఖ్యంగా ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి ఇవి మరింత అవసరం. నీతి, నిజాయితీ, నిబద్ధత, పారదర్శకత, జవాబుదారీతనం, చిత్తశుద్ది మొదలగు విలువలను పౌరులు కలిగి ఉన్నప్పుడు సమాజం అన్ని విధాలుగా ప్రగతి పథంలో పయనిస్తుంది.

ప్రశ్న 8.
రాజ్యాంగం అనగానేమి? భారత రాజ్యాంగం ఏ రూపంలో ఉంటుంది?
జవాబు:

  1. దేశం యొక్క స్వభావం, ప్రభుత్వ రూపం, పౌరుల హక్కులు మరియు విధులను తెలియచేసే నియమనిబంధనలతో కూడిన ప్రాథమిక చట్టమే రాజ్యాంగం.
  2. ఇది లిఖిత లేదా అలిఖితరూపంలో ఉంటుంది. మన భారత రాజ్యాంగం లిఖిత రూపంలో ఉంది. కాని బ్రిటిష్ రాజ్యాంగం అలిఖితరూపంలో ఉంటుంది.

ప్రశ్న 9.
రాజ్యాంగ ముసాయిదా రూపకల్పనలో అంబేద్కర్ పాత్రను గురించి వ్రాయుము.
జవాబు:

  1. 1947, ఆగస్టు 29న రాజ్యాంగ రచనా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చైర్మన్ డా|| బి.ఆర్. అంబేద్కర్.
  2. అంబేద్కర్ తనతోపాటు ఉన్న మిగతా సభ్యుల సహకారంతో ఇతర దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా చదివి మనకు అవసరమైన అంశాలను మన రాజ్యాంగంలో చేర్చడం జరిగింది.
  3. అంటరానితనాన్ని నిర్మూలించేందుకు మరియు అణగారిన వర్గాలను అభివృద్ధిపరచడానికి అంబేద్కర్ కృష చేశారు.
  4. అన్ని వర్గాల వారితో చర్చలు జరిపిన తరువాత భారతదేశానికి అవసరమైన ఒక విశాలమైన రాజ్యాంగాన్ని రూపొందించారు.

ప్రశ్న 10.
పాఠశాల మొత్తానికి ఒక రాజ్యాంగం ఏర్పాటు చెయ్యాల్సి వుంటే ఎవరెవరు అందులో భాగస్వాములు కావాలి?
జవాబు:
పాఠశాల మొత్తానికి ఒక రాజ్యాంగం ఏర్పాటు చెయ్యాల్సి ఉంటే

  1. అన్ని తరగతుల బాలబాలికల ప్రతినిధులు
  2. ప్రధానోపాధ్యాయులు
  3. ఉపాధ్యాయులు మరియు బోధనేతర సిబ్బంది
  4. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు మొదలగువారు భాగస్వాములు కావాలి.

AP 7th Class Social Important Questions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం

ప్రశ్న 11.
ప్రస్తుత సమాజంపై ప్రాథమిక హక్కుల ప్రభావాలు ఏమిటి?
జవాబు:

  1. ప్రాథమిక హక్కులనేవి వ్యక్తి స్వేచ్ఛకు పట్టుకొమ్మలుగాను, భారత ప్రజాస్వామ్యానికి జవసత్వాలు అందించే పునాదులుగాను చెప్పవచ్చు.
  2. మన జాతీయోద్యమ నాయకుల త్యాగాల ఫలితంగానే ప్రాథమిక హక్కులు పౌరులకు లభించాయి.
  3. ప్రస్తుత సమాజంపై ప్రాథమిక హక్కుల ప్రభావం ఎంతైనా ఉంది. విద్యా హక్కు, సమాచార హక్కు స్వేచ్ఛా హక్కులు మొదలైన హక్కులు పౌరుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతున్నాయి.
  4. సమాజంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక సమానత్వానికి ఈ హక్కులు ఎంతో – తోడ్పడుతున్నాయి.
  5. జాతి సమగ్రతకు, సమైక్యతకు, సౌభ్రాతృత్వంనకు ఈ హక్కులు ఎంతో ఉపయోగపడుతున్నాయి.

ప్రశ్న 12.
ప్రపంచ పటంలో ఈ క్రింది దేశాలను గుర్తించండి.
ఎ) భారతదేశం బి) అమెరికా సి) రష్యా డి) బ్రిటన్
జవాబు:
AP 7th Class Social Important Questions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం 2

ప్రశ్న 13.
ఒకవేళ సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా రాజ్యాంగ సభ సభ్యులను ఎన్నుకుంటే, దాని ప్రభావం రాజ్యాంగంపై ఎలా ఉండేది?
జవాబు:

  1. రాజ్యాంగ సభకు రాష్ట్రాలకు, రాజ సంస్థానాలకూ జనాభా ప్రాతిపదిక మీద ప్రాతినిధ్యం కల్పించారు. అదే విధంగా అనేక రంగాలలో నిష్ణాతులైన వారు రాజ్యాంగ సభకు ఎన్నికైనారు. అల్పసంఖ్యాక వర్గాల నుండి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల నుండి కూడా సభ్యులు రాజ్యాంగ సభకు ఎన్నికైనారు. చైతన్యవంతులైనటువంటి నాయకులు రాజ్యాంగ సభకు ఎన్నికవడం మూలంగా, దేశంలోని ఏ వర్గ ప్రజలకు అన్యాయం జరగకుండా దేశ ప్రజలందరిని పరిగణనలోకి తీసుకొని ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ రాజ్యాంగాన్ని రూపొందించారు.
  2. రాజ్యాంగ సభకు, వయోజన ఓటు హక్కు ద్వారా సభ్యులను ఎన్నుకున్నట్లయితే నిష్ణాతులైన, చైతన్యవంతులైన వారు ఎన్నిక కాకపోవచ్చు. తద్వారా అందరి ప్రయోజనాలకు అనుగుణమైన రాజ్యాంగం తయారై ఉండేది కాదు.
  3. వయోజన ఓటు హక్కు ద్వారా అన్ని వర్గాల నుండి, అన్ని ప్రాంతాల నుండి మరియు వయోజనులందరు ఎన్నికలో పాల్గొనే అవకాశం వచ్చేది.

ప్రశ్న 14.
రాజ్యాంగ సభకు సభ్యులుగా స్వదేశీ సంస్థానాలు సభ్యులను నియమించుటకు ఎందుకు అనుమతించారని మీరు అనుకుంటున్నారు?
జవాబు:
రాజ్యాంగ సభకు సభ్యులుగా స్వదేశీ సంస్థానాలు సభ్యులను నియమించుటకు ఎందుకు అనుమతించారంటే, భవిష్యత్తులో స్వదేశీ సంస్థానాలకు కూడా స్వతంత్రం ఇవ్వబడితే అవి భారతదేశంలో భాగమవుతాయని భావించడం మరియు అవి స్వతంత్రంగా ఉన్నను రాజ్యాంగం అవసరం కాబట్టి మరియు అవి కూడా బ్రిటిషు వారి పాలనలోనే ఉన్నాయి కాబట్టి.

ప్రశ్న 15.
ప్రాథమిక హక్కుల పట్టిక అధ్యయనం ఆధారంగా, ప్రాథమిక హక్కులు మీ అభివృద్ధికి ఎలా సహాయపడతాయి? వివరించండి.
జవాబు:
ప్రాథమిక హక్కులు మా అభివృద్ధికి ఎలా సహాయపడతాయంటే :

  1. సమాజంలోని నా తోటి వారందరితో నేను సమానమనే భావన కల్గిస్తున్నాయి.
  2. నా యొక్క భావాన్ని, ఆలోచనల్ని స్వేచ్ఛగా ప్రకటించగల్గుతున్నాను.
  3. నా తోటి వారితో సమావేశం అవుతున్నా, సంఘంగా ఏర్పడుతున్నాము.
  4. భారతదేశంలో నాకు నచ్చిన ప్రాంతానికి వెళుతున్నాను. అవసరమయితే అక్కడ ఉండాలనుకుంటే ఉండగల్గుతున్నాను.
  5. ప్రజలు గౌరవప్రదమైన జీవితాలు గడపటానికి ఈ హక్కులు ఉపయోగపడుతున్నాయి.
  6. నాకు నచ్చిన వృత్తిని నేను స్వీకరించగల్గుతున్నాను.
  7. పర్యావరణ హిత వాతావరణంలో జీవించగల్గుతున్నాను.
  8. వెట్టి చాకిరి నుండి, బాలకార్మిక వ్యవస్థ బారిన పడకుండా ఉండగలిగాను.
  9. నా ప్రాథమిక విద్య అంతా ఉచితంగా అందించబడింది.
  10. నాకు నచ్చిన మతంను స్వీకరించా, ప్రచారం చేసుకోగల్గుతున్నా.
  11. ప్రభుత్వ పాలనలోని అవినీతిని ప్రశ్నించగలుగుతున్నాను.
  12. ప్రభుత్వ నిర్మాణంలో ఓటు హక్కు వినియోగించుకుని భాగస్వామినవుతున్నాను.

ప్రశ్న 16.
స్వేచ్ఛా హక్కు ప్రాథమిక హక్కుగా లేకపోతే మన పరిస్థితి ఏవిధంగా ఉంటుంది?
జవాబు:

  1. స్వేచ్ఛా హక్కు ప్రాథమిక హక్కుగా లేకపోతే మన పరిస్థితి పంజరంలోని చిలక లాగా చాలా అధ్వాన్నంగా ఉంటుంది.
  2. అసలు జీవించే హక్కును కల్పించిన హక్కు స్వేచ్ఛా హక్కు
  3. స్వేచ్ఛా హక్కు లేకపోతే ప్రజలు నిర్బంధంలో, పాలకుల నియంతృత్వంలో ఉండాల్సి వస్తుంది.
  4. భావాన్ని వెళ్ళబుచ్చలేము, నచ్చిన వృత్తిని చేపట్టలేం, సంఘంలా ఏర్పడలేం, నచ్చిన ప్రదేశంను సందర్శించలేం, నివసించలేం.

AP 7th Class Social Important Questions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం

ప్రశ్న 17.
విధులు ఏవిధంగా ముఖ్యమైనవి?
జవాబు:

  1. దేశం ప్రజల వద్ద నుంచి ఆశించే సామాజిక చైతన్యం, ప్రవర్తనా నియమావళీ ప్రాథమిక విధులు.
  2. ప్రాథమిక విధులు భారత పౌరులలో సామాజిక స్పృహను పెంపొందించి బాధ్యతాయుత ప్రవర్తనను అలవరుస్తాయి.
  3. రాజ్యాంగ ఆశయాలు, రాజ్యాంగ చట్టం, ప్రభుత్వ వ్యవస్థలను పౌరులు గౌరవిస్తారు.
  4. భిన్నత్వంలో ఏకత్వ సాధనకు ప్రాథమిక విధులు పాటుపడతాయి.
  5. శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండేలా, మూఢ విశ్వాసాలు పారద్రోలటానికి.
  6. పర్యావరణ పరిరక్షణ వంటి ఆశయాల సాఫల్యానికి ఈ విధులు ఉద్దేశించాయి.

ప్రశ్న 18.
బాధ్యతాయుతమైన పౌరుని లక్షణాలలో ఏయే లక్షణాలు మీలో ఉన్నాయి?
జవాబు:

  1. చట్టాలను మరియు అధికారాన్ని గౌరవించడం.
  2. దేశభక్తి కల్గి ఉండటం.
  3. నిజాయితీ కల్గి ఉండటం.
  4. జవాబుదారీతనం.
  5. బాధితులు మరియు పీడితుల పట్ల దయ కలిగి ఉండటం.
  6. ఇతరుల పట్ల మర్యాద కల్గి ఉండటం.
  7. క్రమశిక్షణతో మెలగటం.
  8. న్యాయంగా ఉండటం వంటి లక్షణాలు నేను కల్గి ఉన్నాను.

ప్రశ్న 19.
భారత రాజ్యాంగం గురించి మరిత సమాచారం కొరకు అంతర్జాలాన్ని సందర్శించండి లేదా మీ ఉపాధ్యాయుని సహాయం తీసుకోండి (ప్రస్తుతం, భారత రాజ్యాంగంలో ఎన్ని నిబంధనలు, షెడ్యూల్స్ మరియు భాగాలు ఉన్నాయో తెలుసుకోండి).
జవాబు:
ప్రస్తుతం భారత రాజ్యాంగంలో
నిబంధనలు : 465
షెడ్యూల్సు : 12
భాగాలు : 25 కలవు.

ప్రశ్న 20.
అంతర్జాలం లేదా లైబ్రరీని సందర్శించడం ద్వారా మన రాజ్యాంగంలో వివిధ దేశాల నుండి స్వీకరించబడిన అంశాలపై పట్టికను తయారు చేయండి. ప్రపంచ పటంలో ఆ దేశాలను గుర్తించండి.
జవాబు:
1. బ్రిటిష్ రాజ్యాంగం :
పార్లమెంటు క్యాబినెట్ తరహా పాలనా పద్దతి. ద్విసభా పద్దతి. సమన్యాయ పాలన, శాసన నిర్మాణ ప్రక్రియ, శాసన సభ్యుల స్వాధికారాలు, స్పీకరు, డిప్యూటీ స్పీకరు, కంప్రోలర్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్, మొదలగు పదవులు మరియు రిట్లు జారీ చేసే విధానం.

2. అమెరికా రాజ్యాంగం :
ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్ష, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయశాఖ, ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్‌గా వ్యవహరించడం, రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు. రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రాలు ఆమోదం తెలపడం.

3. కెనడా రాజ్యాంగం :
బలమైన కేంద్ర ప్రభుత్వం, గవర్నర్లు నియమించే పద్ధతి. అవశిష్ట అధికారాలను కేంద్రానికి ఇవ్వడం, ప్రకరణ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీం కోర్టు సలహాను కోరడం.

4. ఐర్లాండు రాజ్యాంగం :
ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతిని ఎన్నుకునే నైష్పత్తిక ప్రాతినిధ్యం, ఒక ఓటు బదిలీ పద్ధతి, రాజ్యసభకు విశిష్ట సభ్యుల నియామకం.

5. వైమార్ రిపబ్లిక్ (జర్మనీ):
జాతీయ అత్యవసర పరిస్థితి, ప్రాథమిక హక్కులు రద్దు చేసే అధికారం, మొదలగునవి. (వైమార్ అనునది జర్మనీ దేశ రాజ్యాంగ పరిషత్తు సమావేశమైన నగరము.)

6. ఆస్ట్రేలియా :
ఉమ్మడి జాబితా, పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశము (బిల్లు ఆమోదంలో వివాదం ఏర్పడితే) వాణిజ్య, వ్యాపార లావాదేవీలు, అంతర్రాష్ట్ర వ్యాపారము.

7. దక్షిణ ఆఫ్రికా :
రాజ్యాంగ సవరణ విధానం, రాజ్యసభ సభ్యుల ఎన్నిక పద్దతి, మొదలగు అంశాలు.

8. ఫ్రాన్సు :
గణతంత్ర విధానం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, తాత్కాలిక సభాధ్యక్షుల నియామకం.

9. రష్యా :
ప్రాథమిక విధులు, సామ్యవాద సూత్రాలు.

మీకు తెలుసా?

7th Class Social Textbook Page No. 59

భారతదేశం యొక్క ఐక్యతను కాపాడటం మరియు దానికి స్వాతంత్ర్యం ప్రసాదించే లక్ష్యంతో బ్రిటీష్ ప్రభుత్వం నుండి భారత నాయకత్వానికి అధికారాలను బదిలీ చేయడం గురించి చర్చించడానికి ఉద్దేశించిన క్యాబినెట్ మిషన్ 1946లో భారతదేశానికి వచ్చింది. అదే విధంగా రాజ్యాంగ అసెంబ్లీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఈ క్యాబినెట్ మిషన్లో లార్డ్ పెథిక్ లారెన్స్, సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ మరియు A.V. అలెగ్జాండ్ ఇందులో సభ్యులు.

7th Class Social Textbook Page No. 65

1. రాజ్యాంగ దినోత్సవం :
భారత రాజ్యాంగాన్ని 1949, నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. దానికి గుర్తుగా భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవం సంవిధాన్ దివసను ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకుంటున్నాము. రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 2 సంవత్సరాల, 11 నెలల 18 రోజులు పట్టింది.

2.
AP 7th Class Social Important Questions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం 3
13.12.1946 న, రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో ప్రసంగిస్తున్న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ. ఆ రోజు అతడు “లక్ష్యాల తీర్మానం” ను ప్రతిపాదించాడు. ఇదే భారత రాజ్యాంగ పీఠికకు మూలాధారం.

3. ఎ. ప్రకరణ (అధికరణ) అనేది రాజ్యాంగంలోని ఒక నిర్దిష్ట అంశంపై నిర్దిష్ట నియమం లేదా సూత్రాన్ని సూచిస్తుంది.
బి. భాగం అనేది ఒక భావనకు సంబంధించిన ప్రకరణల సముదాయమును సూచిస్తుంది.
సి. షెడ్యూలు అనేది ప్రకరణలలో పేర్కొనబడని అదనపు సమాచారం లేదా వివరాలను సూచిస్తుంది.
డి. ‘సామ్యవాదం’, ‘లౌకిక’ పదాలు 1976 లో 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చబడ్డాయి.

7th Class Social Textbook Page No. 73

బాలల హక్కుల పరిరక్షణ సదస్సులో ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానాలపై మన దేశం కూడా సంతకం చేసింది. ఆ విధంగా మన దేశం కూడా బాలల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంది. ప్రధానమైన బాలల హక్కులు క్రింద ఇవ్వబడ్డాయి.

  1. జీవించే హక్కు
  2. రక్షణ పొందే హక్కు
  3. అభివృద్ధి హక్కు
  4. భాగస్వామ్య హక్కు

AP 7th Class Social Important Questions Chapter 7 మొఘల్ సామ్రాజ్యం

These AP 7th Class Social Important Questions 7th Lesson మొఘల్ సామ్రాజ్యం will help students prepare well for the exams.

AP Board 7th Class Social 7th Lesson Important Questions and Answers మొఘల్ సామ్రాజ్యం

ప్రశ్న 1.
మొఘల్ సామ్రాజ్య స్థాపన, సరిహద్దులను వివరిస్తూ బాబర్ గురించి తెల్పండి.
జవాబు:

  1. ఢిల్లీ సుల్తానులలో చివరి పాలకుడైన ఇబ్రహీం లోడిని క్రీ.శ. 1526లో పానిపట్టు యుద్ధంలో ఓడించి బాబరు మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
  2. దీనితో మొఘల్ సామ్రాజ్యం ప్రారంభమైంది.
  3. ఈ సామ్రాజ్యం పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్, ఉత్తరాన హిమాలయాలు, తూర్పున బెంగాల్, బంగ్లాదేశ్ యొక్క ఉన్నత భూములు మరియు దక్షిణాన గోల్కొండ వరకు విస్తరించి ఉంది.

బాబర్ (క్రీ.శ. 1526-1530) :

  1. బాబర్ మొదటి పానిపట్టు యుద్ధం తరువాత ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించి క్రీ.శ. 1526లో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
  2. యుద్ధ వ్యూహాలను రూపొందించడంలో గొప్ప మేధావి.

ప్రశ్న 2.
మొఘల్ పాలకుడు హుమాయూన్ గురించి వివరించండి.
జవాబు:
హుమాయూన్ (క్రీ.శ. 1530 – 1540 మరియు క్రీ.శ. 1555 – 1556) :

  1. హుమాయూన్ మొఘల్ పాలకులలో రెండవవాడు.
  2. అనుభవం లేకపోవడంతో తన సోదరుల నుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొనెను.
  3. షేర్షా హుమాయూనను చౌసా, కనౌజ్ (1540) లలో ఓడించి ఇరాను తరిమివేసెను.
  4. హుమాయూనకు ఇరాన్లో సఫావిదిషా యొక్క సహాయం లభించెను.
  5. అతడు క్రీ. శ. 1555లో తిరిగి ఢిల్లీని స్వాధీనం చేసుకొనెను.
  6. క్రీ.శ. 1556లో మరణించెను.

AP 7th Class Social Important Questions Chapter 7 మొఘల్ సామ్రాజ్యం

ప్రశ్న 3.
మొఘల్ పాలకులలో ప్రముఖుడు ‘అక్టర్ చక్రవర్తి’, ఇతని గురించి వివరించండి.
జవాబు:
అక్బర్ (క్రీ.శ. 1556-1605) :

  1. తన తండ్రి హుమాయూన్ చనిపోయేనాటికి అక్బర్ వయస్సు కేవలం 13 సంవత్సరాలు.
  2. అక్బర్ చిన్నవాడైనందున అతని సంరక్షకుడు బైరాం ఖాన్ అక్బర్ తరపున పరిపాలన సాగించాడు.
  3. బైరాం ఖాన్ మార్గదర్శకత్వంలో జరిగిన (క్రీ. శ. 1556) రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బర్ హేముని ఓడించినాడు.
  4. ఆ తరువాత మొఘలులు విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించగలిగారు. రాజపుత్ర రాజ్యాలైన మాళ్వా, చూనార్, గోండ్వానాలను తన రాజ్యానికి జోడించాడు.
  5. రాజపుత్రులను ఉన్నత పదవులలో నియమించాడు.
  6. నిజాయితీ, ధైర్య సాహసాలు కలిగిన రాజపుత్ర రాజులతో మంచి సంబంధాలను కొనసాగించాడు.
  7. కాని మేవాడ్ పాలకుడైన మహారాణా ప్రతాప్ అక్బర్ అధికారాన్ని అంగీకరించకుండా పోరాటం చేసాడు.
  8. క్రీ. శ. 1605లో అతడు చనిపోయిన తరువాత జహంగీర్ సింహాసనాన్ని అధిష్టించాడు.

ప్రశ్న 4.
‘జహంగీర్’ గురించి వివరించండి.
జవాబు:
జహంగీర్ (క్రీ.శ. 1605-1627) :

  1. అక్బర్ వారసుడు సలీం. అతడు జహంగీర్ (ప్రపంచ విజేత) అనే బిరుదుతో సింహాసనం అధిష్టించాడు.
  2. ఈయనకు పక్షులంటే అమితమైన ప్రేమ. గొప్ప చిత్రకారుడు.
  3. అతను తన రాజ్య ఆర్థిక అభివృద్ధి కోసం వాణిజ్య, వ్యాపార మరియు స్థానిక పన్నులు ప్రవేశపెట్టాడు.
  4. చివరి కాలంలో అనారోగ్యానికి గురికావడం వల్ల భార్య నూర్జహాన్ పరిపాలన వ్యవహారాలను చూసుకున్నది.

ప్రశ్న 5.
షాజహాన్ గురించి నీకేమి తెలుసో వివరించండి.
జవాబు:
షాజహాన్ (క్రీ.శ. 1628 -1658) :

  1. షాజహాన్ జహంగీర్ కుమారుడు. ఇతనిని ఖుర్రం అని కూడా పిలుస్తారు. ఇతని పాలనలో మొఘల్ సామ్రాజ్యం, సాంస్కృతిక వైభవంలో ఉన్నత స్థాయికి చేరింది.
  2. ఇతని పాలనా కాలంలో నిర్మించిన గొప్ప స్మారక కట్టడాలు బాగా గుర్తుండిపోతాయి.
  3. ముఖ్యంగా ఆగ్రాలోని తాజ్ మహల్, ఢిల్లీలోని జామి మసీద్ (ముత్యాల మసీద్) మరియు ఎర్రకోట.
  4. ఇతని పాలనాకాలంలో దక్కన్ రాజ్యాలైన బీజాపూర్, గోల్కొండ, అహ్మద్ నగలను జయించాడు.
  5. క్రీ.శ. 1658లో షాజహాన్ కుమారుల మధ్య వారసత్వంపై వివాదం ఏర్పడింది. చివరకు ఔరంగజేబు సింహాసనాన్ని అధిష్టించాడు.

ప్రశ్న 6.
ఔరంగజేబు పాలనా కాలం గురించి వివరించండి.
జవాబు:
ఔరంగజేబు (క్రీ.శ. 1658-1707) :

  1. షాజహాన్ యొక్క చిన్న కుమారుడు ఔరంగజేబు.
  2. అతడు ముస్లిం మతాచారముల పట్ల శ్రద్ధా భక్తులు కలిగియుండి, ఖురాన్ బోధనలకు అనుగుణంగా తన జీవితాన్ని గడిపాడు.
  3. భారతదేశానికి చక్రవర్తి అయినప్పటికీ, టోపీలు కుట్టడం ద్వారా సంపాదించిన డబ్బుతో (ఆహారము మరియు దుస్తులతో సహా) తన స్వంత ఖర్చులను భరించేవాడు.
  4. ఇతర మతాల యెడల సహనాన్ని పాటించలేదు.
  5. ప్రధానంగా తనకు మత సహనం లేని కారణంగా అస్సాం, రాజస్థాన్, పంజాబ్, డెక్కన్ మొదలగు ప్రాంతాలలో పెద్దసంఖ్యలో తిరుగుబాట్లను ఎదుర్కొన్నాడు.
  6. గురుతేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్ మరియు శివాజీ మొదలగువారు తిరుగుబాట్లు చేశారు.
  7. శివాజీ స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని స్థాపించుటలో విజయవంతం అయ్యాడు.
  8. శివాజీ మరణం తర్వాత ఔరంగజేబు దక్కన్‌పై దండెత్తాడు.
  9. ఔరంగజేబు 1685లో జాపూర్, 1687లో గోల్కొండను జయించాడు.
  10. అతని మరణం తర్వాత అతని కొడుకుల మధ్య వారసత్వ పోరాటం జరిగింది.

ప్రశ్న 7.
మొఘలులు ఇతర పాలకులతో గల సంబంధాలను తెల్పండి.
జవాబు:
ఇతర పాలకులతో మొఘలుల సంబంధాలు :

  1. మొఘలులు తమకు విధేయత చూపని పాలకులపై దాడి చేసినారు.
  2. వీరు దౌత్యంలో భాగంగా, రాజపుత్ర స్త్రీలను వివాహం చేసుకున్నారు.
  3. వారి ఆస్థానంలో రాజపుత్రులకు ఉన్నత పదవులను ఇచ్చారు.
  4. రాజపుత్రులలోని శిశోడియా వంశస్తులు మొఘలుల అధికారాన్ని అంగీకరించలేదు.
  5. అక్బర్ కాలంలో రాజపుత్రులు, సిక్కులు, ఇతర పరిపాలకులతో ఉన్న సంబంధాలు షాజహాన్ కాలంలో క్షీణించడం ప్రారంభమయ్యాయి.
  6. ఔరంగజేబు కాలంలో ఈ సంబంధాలు అత్యంత క్షీణ దశకు చేరాయి.
  7. ఇతని కాలంలో సామ్రాజ్యంలోని అన్ని భాగాలలో తిరుగుబాట్లు జరిగాయి.
  8. ఔరంగజేబు మరణానంతరము సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది.

AP 7th Class Social Important Questions Chapter 7 మొఘల్ సామ్రాజ్యం

ప్రశ్న 8.
మొఘలుల కాలం నాటి మత జీవనం తెల్పుతూ, అక్బర్ మతంను గురించి వివరించండి.
జవాబు:
మతం :

  1. మొఘలులు సున్ని మతస్తులు.
  2. అక్బర్ మత సహనాన్ని పాటించాడు.
  3. హిందువులపై విధించే జిజియా పన్ను మరియు యాత్రికుల పన్నులను రద్దు చేసాడు.
  4. అక్బర్ ప్రజలు మతపరమైన వేడుకలను బహిరంగంగా జరుపుకునేందుకు అనుమతించాడు.
  5. సమాజంలో ఎక్కువ మంది ప్రజలు హిందువులు. ఆనాటి సమాజంలో హిందువులు, ముస్లింలు మాత్రమే కాకుండా బౌద్ధులు, జైనులు, సిక్కులు మరియు పార్శీలు కూడా ఉండేవారు.
  6. ఔరంగజేబు షరియత్ ఇస్లాం సిద్ధాంతాలను అనుసరించి ప్రజల నైతిక జీవనాన్ని పరిశీలించడానికి ‘ముతావాసిటీ’ అనే మతాధికారులను నియమించాడు.
  7. అక్బర్ క్రీ. శ. 1575 లో ఫతేపూర్ సిక్రీ వద్ద ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు.
  8. 1582లో ‘దీన్-ఇ-ఇలాహి’ అనే నూతన మతాన్ని ప్రకటించాడు.
  9. “దీన్-ఇ-ఇలాహి” అంటే “అందరితో శాంతి” లేదా “విశ్వజనీనశాంతి”.
  10. ఇది విభిన్న మతాల మధ్య శాంతియుత, సమన్వయ సంబంధాలను తెలియజేస్తుంది.
  11. దీన్-ఇ-ఇలాహి మతంలో 18 మంది మాత్రమే చేరారు.
  12. ఇది ఆస్థాన మతంగానే మిగిలిపోయింది.

ప్రశ్న 9.
మొఘలుల కాలం నాటి ఆర్థిక జీవనంను వివరించండి.
జవాబు:
మొఘలుల కాలం నాటి ఆర్థిక జీవనం :

  1. మొఘల్ సామ్రాజ్యంలో భారతీయ ఆర్థిక వ్యవస్థ సుసంపన్నమైనది.
  2. వాణిజ్యం, వ్యవసాయం కూడా అభివృద్ధి చెందినవి. వ్యవసాయం ప్రజల ముఖ్య వృత్తి.
  3. విస్తృతమైన రహదారి వ్యవస్థను నిర్మించడం, దేశమంతా ఒకే రకమైన కరెన్సీని సృష్టించడం మరియు దేశం యొక్క సమగ్రతకు మొఘలులు బాధ్యత వహించారు.
  4. మొఘలులచే నియమింపబడిన ప్రజా పనుల విభాగం ఈ సామ్రాజ్యంలో విస్తృతమైన రహదారి వ్యవస్థను రూపొందించింది.
  5. ఇది సామ్రాజ్యం అంతట పట్టణాలను మరియు నగరాలను కలిపే రహదారులను రూపకల్పన చేసి, నిర్మించి, నిర్వహించింది.
  6. వాణిజ్యం విస్తరించడానికి ఇది కూడా ఒక కారణం.
  7. వ్యవసాయ పన్ను ద్వారా వచ్చే ఆదాయం ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉండేది.

ప్రశ్న 10.
మొఘలుల పాలనలో వ్యవసాయము గురించి తెల్పుతూ, జాబ్ విధానమును గురించి వివరించండి.
జవాబు:
వ్యవసాయము :

  1. మొఘలుల పాలనలో భారత వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది. గోధుమ, వరి, బార్లీ వంటి ఆహార పంటలతో పాటుగా నగదు. పంటలైన ప్రత్తి, గంజాయి, నీలిమందు కూడా పండించారు.
  2. వ్యాపార పంటలయిన మొక్కజొన్న, పొగాకు పంటలను భారతీయ రైతులు విస్తృతంగా పండించడం ప్రారంభించారు.

జల్ట్ :

  1. మొఘల్ వ్యవస్థలో చెప్పుకోదగినది అక్బర్ కాలం నాటి రెవెన్యూ పాలన.
  2. ఇది అతని ప్రఖ్యాత రెవెన్యూ మంత్రి అయిన రాజా తోడర్మల్ పర్యవేక్షణలో బాగా అభివృద్ధి చేయబడినది.
  3. రైతులకు అనుకూలంగా, రాజ్యానికి లాభదాయకంగా ఉండే రెవెన్యూ పద్ధతిని అభివృద్ధి చేసి అమలు చేయడానికి అక్బరు రెండు దశాబ్దాల కాలం పట్టింది.
  4. క్రీ. శ. 1580లో గడచిన 10 సంవత్సరాల ఉత్పత్తి, ధరల హెచ్చు తగ్గులు, స్థానిక రెవెన్యూ వివరాలను సేకరించాడు.
  5. వివిధ పంటలు, వాటి ధరల సగటును లెక్క కట్టి ఉత్పత్తిలో 1/3 వ వంతు నుండి సగం వరకు శిస్తుగా నిర్ణయించారు.
  6. ఈ శిస్తును దామ్ లలో చెల్లించాలి. ఈ విధానాన్ని జఖ్ పద్ధతి అంటారు.

ప్రశ్న 11.
మొఘలుల కాలంలో శివాజీ స్వరాజ్ స్థాపించటానికి కారణమైన పరిస్థితులు ఏమిటి?
జవాబు:

  1. 15, 16 శతాబ్దములలో మహారాష్ట్రలో విజృంభించిన భక్తి ఉద్యమము ప్రజల భాషా, మత, సంస్కృతులలో చైతన్యము పెంపొంది మహారాష్ట్రులనందరిని సమైక్యపరచినది.
  2. మహారాష్ట్రములోని అనేక మంది వ్యక్తులు బీజాపూర్, గోల్కొండ, అహ్మద్ నగర్ సుల్తానుల దర్బారులలో అనేక పదవులు నిర్వహించి అపార అనుభవము గడించిరి.
  3. ఔరంగజేబు అనుసరించిన మత దురహంకార విధానము.
  4. దక్కన్లో పెరిగిపోతున్న సుల్తానుల బలహీనతలు.
  5. షాజీ భోంస్లే స్వతంత్ర మహారాష్ట్రము అనే భావమునకు అంకురార్పణ గావించెను.
  6. మహారాష్ట్ర ప్రజలకు స్వతహాగా ధైర్యసాహసములు, శ్రమకోర్చు గుణముండుట.
  7. ఈ పరిస్థితులన్నింటిని తనకు అనుకూలముగా మలచుకొని శివాజీ మహారాష్ట్ర రాజ్యమును స్థాపించెను.

ప్రశ్న 12.
భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ఆధునిక, తొలి ఆధునిక భారతదేశ చరిత్రలో మొఘల్ సామ్రాజ్య పాత్ర ఏమిటి?
జవాబు:
భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ఆధునిక, తొలి ఆధునిక భారతదేశ చరిత్రలో మొఘల్ సామ్రాజ్య పాత్ర ప్రధానమైనది.

  1. పర్షియన్ కళ సాహిత్యాలు భారతీయ కళతో సమ్మిళితం కావడం.
  2. మొఘలుల దుస్తులు, ఆభరణాలు, వస్త్రధారణల అభివృద్ధి జరిగింది. మస్లిన్, సిల్క్ వెల్వెట్ మొదలగు గొప్పగా అలంకరించబడిన వస్త్రాల వినియోగం జరిగింది.
  3. మొఘల్, భారతీయ కట్టడాల అభివృద్ధి మరియు ఉన్నతీకరణ.
  4. యువకులకు ఖురాన్, ఫత్వా-ఇ-ఆలంగిరీ మొదలైన ఇస్లామిక్ చట్టాలను స్వదేశీ భాషలలో బోధించడానికి మక్తాబ్ పాఠశాలల నిర్మాణము.

ప్రశ్న 13.
శివాజీ బాల్యం గురించి వివరించండి.
జవాబు:

  1. ఉత్తర భారతదేశంలో మొఘలుల అధికారం ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు దక్షిణ భారతదేశంలో మహారాష్ట్రులు మొఘలులకు వ్యతిరేకంగా ఎడతెగని పోరాటం చేశారు.
  2. మారాఠా రాజ్య స్థాపకుడు శివాజీ.
  3. శివాజీ పూనే సమీపంలోని శివనేరి కోటలో జన్మించాడు. అతని తండ్రి షాజీ భోంస్లే. అతను బీజాపూర్ సుల్తాన్ ఆస్థానంలో ఉన్నత పదవిలో ఉండేవాడు.
  4. శివాజీ తన తల్లి జిజియా బాయి సంరక్షణలో పెరిగాడు.
  5. అతడు సమర్థ రామదాస్ మరియు ఇతర మహారాష్ట్ర సాధువుల బోధనలచే ప్రభావితుడైనాడు.
  6. దాదాజీ కొండదేవ్, తానాజీమాల్ సురే వద్ద యుద్ధ విద్యలను అభ్యసించాడు.
  7. మరాఠా – వీరులతోను, మావళి అనే పశ్చిమ కనుమలలో నివసించే కొండజాతి తెగ ప్రజలతో సైన్యాన్ని తయారు చేశాడు.

AP 7th Class Social Important Questions Chapter 7 మొఘల్ సామ్రాజ్యం

ప్రశ్న 14.
మొఘల కాలం నాటి సాహిత్య, చిత్రకళ, సంగీతాభివృద్ధి గురించి విశదీకరించండి.
జవాబు:
సాహిత్యం :

  1. పర్షియన్ భాష అత్యున్నతమైన మరియు అధికార భాషగా చలామణి అయినది.
  2. బాబర్ “బాబర్‌నామాను” రచించాడు. అబుల్ ఫజల్ అక్బర్ పాలనా కాలంలోని గొప్ప పండితుడు.
  3. ఇతను అయిన్-ఇ-అక్బరీ, అక్బర్నామా అనే గ్రంథాలను రచించాడు.
  4. తుజుక్-ఇ-జహంగీరీ అనే గ్రంథం జహంగీర్ ఆత్మకథ.
  5. షాజహాన్ కొడుకు ధారాషికో భగవద్గీత, మహాభారత కథలను పర్షియన్ భాషలోకి అనువదించాడు.
  6. ప్రముఖ హిందీ కవి తులసీదాస్ రామాయణాన్ని రామచరితమానస్ అనే పేరుతో హిందీలో రచించినాడు.

చిత్రకళ :

  1. మొఘలుల కాలంలో మినియేచర్ (సూక్ష్మ) చిత్రకళగా పిలవబడే ఒక ఆధునిక కళాశైలి ప్రారంభమైంది.
  2. జహంగీర్ పోషణలో చిత్రకళ అత్యున్నత స్థాయికి చేరుకుంది.
  3. నెమలి నీలం, భారతీయులు ఉపయోగించే ఎరుపు రంగులు మొఘల్ చిత్రాలలో కొత్తగా చేర్చబడ్డాయి.

సంగీతం :

  1. బాబర్, హుమాయూన్లు సంగీతాన్ని ప్రోత్సహించారు.
  2. కాని ఇది అక్బర్ కాలంలో ఉన్నత స్థితిని పొందింది.
  3. ఔరంగజేబు అన్ని సంగీత కార్యక్రమాలను నిషేధించినాడు.
  4. అక్బర్ ఆస్థానంలో 36 మంది సంగీతకారులు ఉన్నట్లు అబుల్ ఫజల్ పేర్కొన్నాడు. వారిలో తాన్ సేన్, బాజ్ బహదూర్ ప్రసిద్ధులు.
  5. అక్బర్ తాను స్వయంగా నగారాని బాగా వాయించేవాడు.
  6. తాన్ సేన్ అక్బర్ నవరత్నాలలో ఒకడు. అతడు తన సంగీతంతో అద్భుతాలను సృష్టించేవాడు. మేఘ మలర్ రాగంతో వర్షాన్ని, దీపక్ రాగంతో అగ్నిని సృష్టించేవాడని ప్రతీతి.
  7. ప్రస్తుత హిందూస్థానీ సంగీతంలో ఈ శైలులు కనిపిస్తాయి.

ప్రశ్న 15.
మీకివ్వబడిన భారతదేశ పటంలో ‘శివాజీ సామ్రాజ్యం’ ను గుర్తించండి.
జవాబు:
AP 7th Class Social Important Questions Chapter 7 మొఘల్ సామ్రాజ్యం 1

ప్రశ్న 16.
మొఘలుల కాలంలో కేంద్ర పాలనా వ్యవస్థ ఎలా ఉండేది?
జవాబు:
1) మొఘలులది కేంద్రీకృత పరిపాలన. చక్రవర్తికే అన్ని అధికారాలు ఉండేవి.
2) అతనికి పరిపాలనలో మంత్రిమండలి సహాయపడేది.
3) అక్బర్ అనేక పరిపాలనా సంస్కరణలను ప్రవేశపెట్టాడు. అతను తన విస్తారమైన సామ్రాజ్యాన్ని అనేక సుబాలుగా విభజించాడు మరియు ప్రతి సుబాకు ఒక సుబేదార్‌ను నియమించాడు.
4) సుబాలు అనేవి మొఘల్ సామ్రాజ్యంలోని రాష్ట్రాలు. అక్బర్ తన రాజ్యాన్ని 15 సుబాలుగా విభజించాడు.
5) సుబాలను ‘సర్కారులుగా’ విభజించారు. సర్కారులను ‘పరగణాలుగా’ విభజించారు. ఈ విధానాన్ని ఆ తర్వాతి మొఘలు రాజులు కొనసాగించారు.
6) అక్బరు భూమిని సర్వే చేయించి, పండించిన పంట ప్రకారం పన్ను నిర్ణయించే వ్యవసాయ పద్ధతిని ప్రవేశపెట్టాడు.
7) భూమిని నాలుగు రకాలుగా విభజించి 1/3వ వంతు పంటను పన్నుగా వసూలు చేశాడు.
8) అక్బర్ పాలనలో షేర్షా పరిపాలనా ముద్ర కొంత వరకు ప్రస్ఫుటమవుతుంది.

మన్సబ్ దారీ వ్యవస్థ :
9) సైనిక విధానంలో అక్బర్ మున్సబ్ దారీ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. మున్సబ్ దార్ అనే పదం మున్సబ్ కలిగిన వ్యక్తిని సూచిస్తుంది.
10) మన్సబ్ అంటే హోదా లేదా ర్యాంక్. ఇది 1. ర్యాంక్, 2. జీతాలు, 3. సైనిక బాధ్యతలు నిర్ధారించడానికి మొఘలులు ఉపయోగించిన గ్రేడింగ్ పద్దతి.
11) 10 నుండి 10,000 మంది సైనికులు కలిగిన వివిధ స్థాయిల మన్సబ్ దారులు ఉండేవారు.

ప్రశ్న 17.
మొఘల్ సామ్రాజ్య పతనానికి గల కారణాలు తెల్పండి.
జవాబు:
మొఘల్ సామ్రాజ్య పతనం :
మొఘల్ సామ్రాజ్య పతనం షాజహాతో ప్రారంభమై ఔరంగజేబుతో ముగిసింది. ఔరంగజేబు మరణానంతరం చాలా వేగంగా మొఘల్ సామ్రాజ్యం పతనమైంది. ఈ పతనానికి గల కొన్ని కారణాలు

  1. ఔరంగజేబు యొక్క అనుమాన స్వభావము తన కుమారులను గాని, అధికారులను గాని సమర్థులుగా ఎదగడానికి అవకాశం ఇవ్వలేదు. అతని మతమౌఢ్యం కారణంగా జాట్లు , సత్నామీలు, సిక్కులు తిరుగుబాటు చేసారు. రాజపుత్రులు, మరాఠాలతో శతృత్వం అతని సామ్రాజ్యానికి శాపంగా మారింది.
  2. ఔరంగజేబు వారసులు అసమర్థులు. వారిలో చాలామంది విలాస జీవితానికి అలవాటు పడ్డారు.
  3. చాలామంది అధికారులు అవినీతిపరులు అయ్యారు.
  4. సింహాసనం కోసం కుమారుల మధ్య జరిగిన వారసత్వ యుద్దాలు పరిపాలనను బలహీనపరిచాయి.
  5. షాజహాన్, ఔరంగజేబుల దక్కన్ విధానము సామ్రాజ్యాన్ని మరింత బలహీనపరిచింది.
  6. అహ్మద్ షా, నాదిర్షాల దండయాత్రలు, మన్న దారుల తిరుగుబాట్లు కూడా పతనానికి కారణం అయ్యాయి.
  7. 1526లో బాబర్ చే స్థాపించిన మొఘల్ సామ్రాజ్యం క్రీ.శ. 1857లో బహదూర్‌షా – II కాలంలో పతనమైంది.

ప్రశ్న 18.
శివాజీ విజయాలను వివరించండి.
జవాబు:
రాజ్య విస్తరణ :

  1. శివాజీ తన 19 వ ఏట బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షా ఆధీనంలోని తోరణ దుర్గంను జయించాడు.
  2. ఆ తరువాత రాయగఢ్, సింహగఢ్, ప్రతాప్ గఢ్ ను ఒక్కొక్కటిగా జయించాడు.
  3. కోపగ్రస్తుడైన బీజాపూర్ సుల్తాన్ శివాజీని అణచివేయడానికి తన సేనాధిపతి అష్టలను పంపించాడు. అర్జల్ ఖాన్ మోసంతో శివాజీని చంపాలనుకున్నాడు. సంధి చేసుకునే సాకుతో శివాజీని ఆహ్వానించాడు. ముందుగానే ఊహించిన శివాజీ తన వద్దనున్న వ్యాఘ్ర నఖ (పులి గోళ్ళు) అనే ఆయుధంతో అఫ్టలా నన్ను సంహరించాడు.
  4. శివాజీ యొక్క ఈ విజయాలను గ్రహించిన ఔరంగజేబు అతనిని అణచడానికి తన సేనాధిపతి షయిస్తనన్ను దక్కను పంపించాడు. కాని శివాజీ షయిస్తఖానను ఓడించాడు.
  5. దీనితో ఔరంగజేబు కోపగ్రస్తుడైనాడు. రాజా జైసింగ్ నాయకత్వంలో ఒక పెద్ద సైన్యాన్ని శివాజీ పైకి పంపించాడు. జైసింగ్, శివాజీని ఓడించి కొన్ని కోటలను స్వాధీనపరచుకున్నాడు.
  6. చివరికి ఔరంగజేబుతో సంధి చేసుకోవడానికి శివాజీని ఆహ్వానించి ఆగ్రా జైలులో బంధించాడు. శివాజీ తెలివిగా జైలు నుంచి తప్పించుకొని తన రాజధానికి చేరినాడు.
  7. ఆ తరువాత తాను కోల్పోయిన కోటలన్నింటినీ మొఘలుల నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. అతడు సూరత్ పై దండెత్తి దానిని కొల్లగొట్టాడు.

ప్రశ్న 19.
మొఘలులను వ్యతిరేకించిన రాజ్యాల జాబితా తయారు చేయండి.
జవాబు:
మొఘలుల అధికారమును అంగీకరించక వ్యతిరేకించిన రాజ్యాలు :
మేవాడ్, రణతంబోర్, జోధ్ పూర్, బికనీర్, కలింజర్, రేవా, గోండ్వానా, అహ్మద్ నగర్, మహారాష్ట్రులు, దక్కన్ రాజ్యా లు మొ||వి.

AP 7th Class Social Important Questions Chapter 7 మొఘల్ సామ్రాజ్యం

ప్రశ్న 20.
హిందుస్తానీ, కర్ణాటక సంగీతంలోని కొన్ని రాగాల పేర్లు తెలపండి. హిందుస్తానీ, కర్ణాటక సంగీతంలోని కొంతమంది సంగీత విద్వాంసుల పేర్లు తెలపండి. కొన్ని రాగాలను విని మీ అభిప్రాయాలను తెలుపుము.
జవాబు:
i) కొన్ని రాగాల పేర్లు :
భైరవ రాగం, మాల్కాను, దీపక్, శ్రీరాగం, మేఘరాగం, హిందోళం, బిళహరి, మళహరి, మోహనరాగం, థామస్, కళ్యాణ రాగం, వాగేశ్వరి, కనకాంబరి, కాంబోజ, శ్రీరంజని, రఘుప్రియ, సుహాసిని మొదలైనవి.

ii) సంగీత విద్వాంసుల పేర్లు :
తాన్ సేన్, పండిట్ రవిశంకర్, బీమ్ సేన్ జోషి, జాకీరు హుస్సేన్, హరిప్రసాద్ చౌరాసియా/ఫ్లూట్, బిస్మిల్లా ఖాన్, జరాజ్, అలి అక్బర్ ఖాన్, ఎమ్. బాలమురళీకృష్ణ, ఎమ్. ఎస్. సుబ్బలక్ష్మి, అంజాద్ ఆలీ ఖాన్, అల్లరఖా, అన్నపూర్ణా దేవి, గిరిజా దేవి, జయంతి కుమరేష్, శుభామగ్దల్.

ప్రశ్న 21.
షేర్షా ప్రవేశపెట్టిన పరిపాలనా సంస్కరణలు ఏమిటి?
జవాబు:
షేర్షా ప్రవేశపెట్టిన పరిపాలనా సంస్కరణలు.

  1. ప్రజా సంక్షేమము కాంక్షించి, మంత్రిమండలిని ఏర్పాటు చేసే కేంద్ర పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసాడు.
  2. షేర్షా తన సామ్రాజ్యమును పరిపాలనా సౌలభ్యము కొరకు ’47’ సర్కారులుగా విభజించి రాష్ట్ర పాలన చేసాడు.
  3. రాష్ట్రములను తిరిగి పాలనా సౌలభ్యము కొరకు పరగణాలుగా విభజించెను.
  4. సైనిక పరిపాలన వ్యవస్థలో జాగీరులిచ్చు పద్ధతికి స్వస్తి చెప్పి జీతములిచ్చు పద్ధతిని ప్రవేశపెట్టుటతో పాటు అనేక సంస్కరణలు చేసెను.
  5. షేర్షా కీర్తి ప్రతిష్ఠలకు కారణమయిన అంశము ఆయన రూపొందించిన భూమిశిస్తు విధానము లేక రెవెన్యూ సంస్కరణలు.
    ఉదా : భూమిని సర్వే చేయించుట, పట్టాలిచ్చుట మొ||వి.
  6. న్యాయపాలనలో షేర్షా నిష్పక్షపాతంగా వ్యవహరించి ‘న్యాయసింహుడని’ కీర్తించబడెను.
  7. దేశములో శాంతిభద్రతలను పరిరక్షించుటకు షేర్షా పోలీసు వ్యవస్థను పటిష్ఠంగా రూపొందించి, అమలు చేసెను.
  8. షేర్షా వెండి రూపాయిని ప్రవేశపెట్టెను. ఇది 1835 వరకు అమల్లో ఉండెను.
  9. రాజ్యములోని వివిధ పట్టణములను కలుపుతూ రహదారులను నిర్మించెను. వాణిజ్య అభివృద్ధికి కృషి చేసెను.
  10. ప్రజాభిప్రాయమునకు అనుగుణమైన ప్రభుత్వ యంత్రాంగమును రూపొందించుటకు ప్రయత్నించిన తొలి ముస్లిమ్ పాలకుడు షేర్షా.

మీకు తెలుసా?

7th Class Social Textbook Page No.9

  1. బాబర్ తన తండ్రి వైపు తైమూర్ వంశానికి మరియు తల్లి వైపు చెంఘిజ్ ఖాన్ వంశానికి సంబంధించినవాడు. మొఘలులు (మంగోలుల వారసులు) తమను ఛంఘిజ్ యొక్క రెండవ కుమారుడైన ఛగతాయ్ పేరు మీదుగా ఛగతాయిడ్లు అని పిలుచుకోవడానికి ఇష్టపడేవారు.
  2. “మొఘల్” అనే పదం “మంగోల్” అనే పదం నుంచి వచ్చింది.

7th Class Social Textbook Page No. 11

  1. బీర్బల్ : రాజా బీర్బల్ అక్బర్ చక్రవర్తికి సన్నిహితుడు. అక్బర్ ఆస్థానంలో బీర్బల్ గొప్ప గాయకుడు మరియు కవి. అక్బర్ అతని వల్ల ఎక్కువగా ప్రభావితుడు అయ్యాడు.
  2. అహ్మద్ నగర్ రాణి అయిన చాంద్ బీబీ అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన మహిళ.

7th Class Social Textbook Page No. 15

1. జిజియా పన్ను :
ముస్లిమేతరులు వారి మతాచారాలను పాటించడానికి, సైన్యంలో చేరకుండా మినహాయింపు పొందడానికి ముస్లిం పాలకులకు చెల్లించే పన్నును జిజియా పన్ను అంటారు. బానిస వంశస్థాపకుడైన కుతుబుద్దీన్ ఐబక్ దీనిని మొదటగా ప్రవేశపెట్టాడు.

2. యాత్రికుల పన్ను :
ఈ పన్ను ముస్లిం చక్రవర్తులు మతపరమైన లేదా పవిత్రమైన ప్రదేశానికి ప్రయాణం చేయడానికి హిందువులపై విధించే పన్ను.

7th Class Social Textbook Page No. 17

1. అక్బర్ క్రీ.శ. 1575 లో ఫతేపూర్ సిక్రీ వద్ద ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు. 1582లో ‘దీన్-ఇ-ఇలాహి’ అనే నూతన మతాన్ని ప్రకటించాడు. ‘దీన్-ఇ-ఇలాహి’ అంటే “అందరితో శాంతి” లేదా “విశ్వజనీన శాంతి” అని అర్థం. ఇది విభిన్న మతాల మధ్య శాంతియుత, సమన్వయ సంబంధాలను తెలియజేస్తుంది. దీన్-ఇ-ఇలాహి మతంలో 18 మంది మాత్రమే చేరారు. ఇది ఆస్థాన మతంగానే మిగిలిపోయింది.

AP 7th Class Social Important Questions Chapter 7 మొఘల్ సామ్రాజ్యం

7th Class Social Textbook Page No. 29

అష్ట ప్రధానులు :
అష్టప్రధాన్ అనేది మరాఠా సామ్రాజ్యంలో మంత్రివర్గ ప్రతినిధి బృందం. సుపరిపాలన పద్దతులను అమలు చేసిన ఘనత ఈ మండలికే ఉంది.

  1. పీష్వా : ప్రధానమంత్రి – సామ్రాజ్యం యొక్క సాధారణ పరిపాలనను చూస్తారు.
  2. అమాత్య : ఆర్థికమంత్రి – సామ్రాజ్యంలోని ఖాతాలను నిర్వహించడం.
  3. సచివ్ : కార్యదర్శి – రాజశాసనాలు తయారుచేస్తారు.
  4. వాకియానవిస్ : ఆంతరంగిక మంత్రి – గూఢచర్య వ్యవహారాలను చూసే మంత్రి.
  5. సేనాపతి : సర్వ సైన్యాధ్యక్షుడు – రాజ్య రక్షణ మరియు సైనిక వ్యవహారాల నిర్వాహణ
  6. సుమంత్ : విదేశీమంత్రి – ఇతర రాజ్యాలతో సంబంధాలను నిర్వహించే వ్యక్తి.
  7. న్యాయాధీష్ : ప్రధాన న్యాయమూర్తి – పౌర మరియు నేర సంబంధమైన తీర్పులు చెప్పే వ్యక్తి.
  8. పండిత్ రావ్ : ప్రధాన పూజారి – మతపరమైన అంశాలను నిర్వహించే వ్యక్తి.

AP 7th Class Social Important Questions Chapter 6 విజయనగర సామ్రాజ్యం

These AP 7th Class Social Important Questions 6th Lesson విజయనగర సామ్రాజ్యం will help students prepare well for the exams.

AP Board 7th Class Social 6th Lesson Important Questions and Answers విజయనగర సామ్రాజ్యం

ప్రశ్న 1.
విజయనగర సామ్రాజ్య గొప్పతనం గురించి తెల్పండి.
జవాబు:
14 మరియు 15 శతాబ్దాలలో మొత్తం దక్షిణ భారతదేశంలో విస్తరించిన, ప్రపంచంలో రెండవ అతి పెద్ద రాజధాని నగరం గల సామ్రాజ్యపు రాజధాని ఆ సమయంలో లండన్, పారిన్ల కంటే పెద్దదిగా పేరుగాంచినది. ఆ నగర వీధుల్లో వ్యాపారులు రత్నాలు మరియు విలువైన రాళ్ళతో వర్తకం చేసేవారు. విజయనగర సామ్రాజ్యానికి హంపి రాజధానిగా ఉండేది. విజయనగరం ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజ్యం . అంతే కాకుండా అన్ని రకాల కళలు, కవిత్వం, నృత్యం, సంగీతం మరియు శిల్పం ఆ కాలంలో అభివృద్ధి చెందాయి. విద్యారణ్య, సాయన, అల్లసాని పెద్దన, ధూర్జటి, పింగళి సూరన మరియు తెనాలి రామకృష్ణ వంటి ఈ రోజు మనకు తెలిసిన పేర్లన్నీ విజయనగర యుగానికి చెందినవి. మన తెలుగు తరగతులలో మనం చదివే గొప్ప రచనలు వీరివే.

ప్రశ్న 2.
విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగిన విధానము గురించి వివరించండి.
జవాబు:
దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన విజయనగర సామ్రాజ్యము క్రీ.శ. 1336లో సంగమ వంశానికి చెందిన మొదటి హరిహరరాయలు మరియు మొదటి బుక్కరాయ సోదరుల చేత విద్యారణ్యస్వామి వారి ప్రోత్సాహముతో విజయనగర సామ్రాజ్యము స్థాపించబడినది. విజయనగర రాజధాని ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని హంపి. మొదటి హరిహరరాయలు మరియు మొదటి బుక్కరాయలు మొదటగా వరంగల్లుకు చెందిన కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుని ఆస్థానంలో క్రీ.శ. 1323 లో పనిచేసేవారు.

కాకతీయ రాజ్యాన్ని ముస్లింలు అక్రమించడంతో హరిహర, బుక్కరాయ సోదరులు ఇద్దరు కంపిలి రాజ్యానికి (ఆధునిక కర్ణాటకలో) వెళ్ళారు. వారు అక్కడ మంత్రులుగా పనిచేశారు. అయితే కంపిలి పాలకులు ముస్లిం తిరుగుబాటుదారునికి ఆశ్రయం ఇచ్చినందుకు కంపిలిని ముహమ్మద్ తుగ్లక్ ఆక్రమించాడు. మొదటి హరిహరరాయలు మురియు మొదటి బుక్కరాయలను ఇద్దరిని ఖైదు చేసి ఇస్లాం మతంలోకి మార్చారు మరియు కంపిలి రాజ్యంలోని తిరుగుబాట్లను పరిష్కరించడానికి సోదరులిద్దరిని మరలా కంపిలిలో నియమించారు. తరువాత వారు విద్యారణ్యస్వామి చొరవతో హిందూ మతంలోకి తిరిగి వచ్చారు. తుగ్లక్ సామ్రాజ్యము బలహీనపడటంతో వారు కూడా తమ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొన్నారు. క్రీ.శ. 1336లో విజయనగరము అనే కొత్త నగరాన్ని తుంగభద్రా నదికి దక్షిణ ఒడ్డున స్థాపించారు.

AP 7th Class Social Important Questions Chapter 6 విజయనగర సామ్రాజ్యం

ప్రశ్న 3.
విజయనగర రాజుల సైన్యంలో జంతువులు, పక్షుల పాత్ర గురించి తెల్పండి.
జవాబు:
ఏనుగులు నెమ్మదిగా నడిచే జంతువులు అయినప్పటికీ, యుద్ధ సమయాలలో శక్తివంతంగా దాడిచేస్తాయి. యుద్ధ సమయాలలో జంతువులు కీలక పాత్ర పోషించాయి. గుర్రాలు, గాడిదలు మరియు ఒంటెలు పురుషులకు ఆహారం, నీరు, ముందుగుండు సామగ్రి మరియు వైద్య సామగ్రిని అందించడంలో ముందు వరుసలో ఉంటాయి. కుక్కలు మరియు పావురాలు సందేశాలను తీసుకువెళ్తాయి. విష వాయువులను గుర్తించడానికి “పక్షులను” ఉపయోగించేవారు. పిల్లులకు, కుక్కలకు కందకాలలోని ఎలుకల వేటకు ఉపయోగపడే శిక్షణనిచ్చేవారు.

ప్రశ్న 4.
సంగమ రాజవంశం గురించి వివరించండి.
జవాబు:
సంగమ రాజవంశం :
సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడు రెండవ దేవరాయలు. అతను సమర్ధుడైన ‘ఫాలకుడు, యోధుడు మరియు పండితుడు. ఆయనను ప్రౌఢ దేవరాయలు అని కూడా అంటారు. సంగమ రాజ ! వంశం యొక్క పాలకులందరిలో ఆయన గొప్పవాడు. అతను ‘కళింగ సైన్యాన్ని ఓడించాడు. అతను కొండవీడును స్వాధీనం చేసుకొని రాజమండ్రి వరకు తన అధికారాన్ని సుస్థిరం చేశాడు. కానీ అతను బహమనీ సుల్తాన్ అహ్మద్ షా చేత ఓడించబడ్డాడు. ఆయన మరణం తరువాత సంగమ రాజవంశం బలహీనపడింది. విరుపాక్షరాయ, దేవ రాయ, రామచంద్రరాయ మరియు మల్లికార్జున రాయలు మొదలగువారు సంగమ రాజవంశం యొక్క ఇతర పాలకులు.

ప్రశ్న 5.
విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన వంశాలేవి? వాటి పాలనా కాలము మరియు ఆయా రాజవంశాలలో ప్రముఖ రాజుల జాబితాను తయారుచేయండి.
జవాబు:

రాజవంశం పేరుపాలించిన కాలమురాజవంశంలో ప్రముఖ రాజులు
1. సంగమ రాజవంశముక్రీ.శ. 1336 – 1485మొదటి హరిహరరాయలు (క్రీ.శ. 1336-1357)
మొదటి బుక్కరాయలు (క్రీ.శ. 1357-1377)
రెండవ హరిహర రాయలు (క్రీ.శ. 1377-1404)
రెండవ దేవరాయలు (క్రీ.శ. 1426-1446)
2. సాళువ వంశముక్రీ. శ. 1485 – 1505సాళువ నరసింహరాయలు (క్రీ.శ. 1485-1491)
3. తుళువ రాజవంశముక్రీ.శ. 1505 – 1570శ్రీకృష్ణదేవరాయలు (క్రీ.శ. 1509-1529) అచ్యుతరాయలు (క్రీ.శ. 1529-1542)
4. అరవీటి వంశముక్రీ.శ. 1570 – 1646అళియరామరాయలు (క్రీ.శ. 1543-1565)
వెంకటపతి రాయలు (క్రీ.శ. 1585-1614)

ప్రశ్న 6.
సాళువ రాజవంశం గురించి క్లుప్తంగా తెలియజేయండి.
జవాబు:
సాళువ రాజవంశం :
సంగమ రాజవంశం తరువాతి రెండవ రాజవంశం సాళువ రాజవంశం. ఇది సాళువ నరసింహరాయలచే స్థాపించబడింది. అతని తరువాత ఇమ్మడి నరసింహరాయలు రాజ్యపాలన చేశాడు.

ప్రశ్న 7.
అరవీటి వంశము గూర్చి తెల్పుము.
జవాబు:
అరవీటి వంశము :
విజయనగర సామ్రాజ్యం యొక్క నాల్గవ మరియు చివరి రాజవంశం అరవీడు రాజవంశం. తళ్ళికోట యుద్ధం తరువాత విజయనగర సామ్రాజ్యం క్షీణించింది మరియు బీజాపూర్ లోని ముస్లిమ్ రాజ్యాలు ముఖ్యమైనవిగా మారాయి.

AP 7th Class Social Important Questions Chapter 6 విజయనగర సామ్రాజ్యం

ప్రశ్న 8.
విజయనగర రాజుల పాలన గురించి వివరించండి.
జవాబు:
పరిపాలన : విజయనగర రాజుల పాలనాకాలంలో పరిపాలన వ్యవస్థ చక్కగా రూపుదిద్దుకుంది. కార్యనిర్వాహక, న్యాయ మరియు శాసన విషయాలలో రాజు సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉండేవాడు. అతను అత్యున్నత న్యాయాధికారి. రాజ్యాధికారం సాధారణంగా వంశపారంపర్యతపై ఆధారపడి ఉండేది. రాజుకు తన రోజువారీ పరిపాలనలో మంత్రి మండలి సహాయపడుతుంది.

ఈ సామ్రాజ్యాన్ని మండలాలు, నాడులు, స్థలాలు, గ్రామాలుగా విభజించారు. మండల పాలకుని మండలేశ్వరుడు లేదా నాయక్ అని పిలిచేవారు. విజయనగర పాలకుల పరిపాలనలో స్థానిక అధికారులకు ఎక్కువ అధికారాలు ఇచ్చారు. భూ ఆదాయంతో పాటు, సామంతులు మరియు భూస్వాముల నుండి పన్నులు మరియు బహుమతులు వసూలు చేసేవారు. ఓడరేవులలో ఎగుమతి, దిగుమతి సుంకాలు వసూలు చేసేవారు.

వివిధ వృత్తులపై వేసే పన్నులు ప్రభుత్వానికి ఇతర ఆదాయ వనరులు. సాధారణంగా ఉత్పత్తిలో ఆరవ వంతును భూమి శిస్తుగా నిర్ణయించారు. ప్రభుత్వ వ్యయంలో రాజు వ్యక్తిగత ఖర్చులు మరియు అతను ఇచ్చిన విరాళాలు సైనిక ఖర్చులు ఉంటాయి. సైన్యంలో అశ్వికదళం, పదాతిదళం, ఫిరంగి మరియు ఏనుగులు ఉండేవి. మేలు జాతి గుర్రాలను విదేశీ వ్యాపారుల నుండి సేకరించారు. సైన్యంలోని ఉన్నతస్థాయి అధికారులను నాయకులు లేదా పాలిగార్లు అని పిలిచేవారు. వారి సేవలకు బదులుగా వారికి భూమి మంజూరు చేయబడింది. ఈ భూములను అమరం అని పిలిచేవారు. సైనికుల జీతాలు సాధారణంగా నగదు రూపంలో చెల్లించేవారు.

ప్రశ్న 9.
శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలు, వారి రచనల జాబితా తయారుచేయండి.
జవాబు:

కవిరచన
1. అల్లసాని పెద్దనమనుచరిత్ర, హరికథాసారం
2. నంది తిమ్మనపారిజాతపహరణం
3. మాదయ గారి మల్లనరాజశేఖర చరితం
4. ధూర్జటిశ్రీ కాళహస్తీశ్వర మహత్యం
5. అయ్యలరాజు రామభద్రుడుసకల నీతిసార సంగ్రహం
6. పింగళి సూరనరాఘవ పాండవీయం
7. రామరాజ భూషణుడువసుచరిత్ర
8. తెనాలి రామకృష్ణుడుపాండురంగ మహత్యం

ప్రశ్న 10.
విజయనగర సామ్రాజ్యంలో సామాజిక జీవనం గురించి వివరించండి.
జవాబు:
సామాజిక జీవితం :
సమాజం వ్యవస్థీకృతంగా ఉండేది. విజయనగరంలో భవనాల నిర్మాణం వైభవోపేతంగాను మరియు విలాసవంతంగానూ ఉన్నట్లు విదేశీ ప్రయాణికులు తమ రచనలలో తెలిపినారు. దుస్తులుగా ప్రధానంగా సిల్క్ మరియు కాటన్ వస్త్రాలను ఉపయోగించేవారు. పరిమళ ద్రవ్యాలు, పువ్వులు మరియు ఆభరణాలను ప్రజలు ఉపయోగించేవారు. నృత్యము, సంగీతము, మల్ల యుద్దము, జూదము మరియు కోడిపందెముల వంటి కొన్ని వినోదాలు ఉండేవి. మహిళలు విజయనగర సామ్రాజ్యంలో ఉన్నత స్థానాన్ని పొందడమేగాక రాజకీయ, సామాజిక మరియు సాహితీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. వారు విద్యావంతులే కాక కుస్తీ, సంగీతం మరియు లలిత కళలలో శిక్షణ పొందేవారు. కుమారకంపన భార్య గంగాదేవి “మధురా విజయం” అనే ప్రసిద్ధమైన రచన చేసింది. తాళ్ళపాక తిమ్మక్క మరియు ఆతుకూరి మొల్ల ఈ కాలానికి చెందిన తెలుగు ప్రసిద్ధ కవయిత్రులు. న్యూనిజ్ ప్రకారం, రాజభవనాలలో పెద్ద సంఖ్యలో మహిళలు నృత్యకారిణీలు, గృహ సేవకులు మరియు పల్లకీ మోసేవారుగా ఉండేవారు.

ఏకపత్నీవ్రతము సాధారణంగా అమలులో ఉండేది. కానీ రాజ కుటుంబాలలో బహు భార్యత్వం ఉండేది. వితంతువులు తిరిగి వివాహం చేసుకోవచ్చు.

ప్రశ్న 11.
విజయనగర సామ్రాజ్య ఆర్థిక పరిస్థితుల గురించి వివరించండి.
జవాబు:
ఆర్థిక పరిస్థితులు :
విదేశీ ప్రయాణీకుల కథనాల ప్రకారం విజయనగర సామ్రాజ్యం ప్రపంచంలోని అత్యంత సంపన్న ప్రాంతాలలో ఒకటి. వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తిగా కొనసాగింది. నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచబడ్డాయి. వారు వారి నీటిపారుదల వ్యవస్థను నియంత్రించుకొన్నారు. కొత్త చెరువులు నిర్మించారు. తుంగభద్రా నది వంటి వాటిపై ఆనకట్టలు కట్టించారు. అనేక పరిశ్రమలు స్థాపించబడ్డాయి. లోహ కార్మికులు మరియు ఇతర హస్తకళాకారులు అభివృద్ధి చెందారు. కర్నూలు మరియు అనంతపూర్ జిల్లాల్లో వజ్రాల గనులు ఉండేవి.

ప్రశ్న 12.
విజయనగర రాజవంశం కాలంలో సందర్శించిన విదేశీ యాత్రికుల జాబితా తయారుచేయండి.
జవాబు:

యాత్రికుని పేరుఎవరి కాలంలో
1. ఇబన్ బటూటా – మొరాకో యాత్రికుడుహరిహర – I
2. నికోలో కాంటి, ఇటాలియన్ యాత్రికుడుదేవరాయ – II
3. అబ్దుల్ రజాక్, పర్షియన్ యాత్రికుడుదేవరాయ – II
4. డువార్టే హర్బోసా, పోర్చుగీస్ యాత్రికుడుశ్రీకృష్ణదేవరాయ
5. డొమింగో పేస్, పోర్చుగీస్ యాత్రికుడుశ్రీకృష్ణదేవరాయ
6. ఫెర్నాండో నూనిజ్, పోర్చుగీస్ యాత్రికుడుఅచ్చుత దేవరాయ

AP 7th Class Social Important Questions Chapter 6 విజయనగర సామ్రాజ్యం

ప్రశ్న 13.
రెడ్డి రాజ్యము యొక్క స్థాపన, రాజ్య విస్తరణ గురించి తెల్పండి.
జవాబు:
రెడ్డి రాజ్యము (1325-1448) :
రెడ్డి రాజ్యా న్ని దక్షిణ భారతదేశంలో ప్రోలయ వేమారెడ్డి స్థాపించారు. రెడ్డి రాజులు క్రీ.శ. 1325 నుండి 1448 వరకు వంద సంవత్సరాల పాటు తీరప్రాంతముతోపాటు మధ్య ఆంధ్రాను పాలించారు. రెడ్డి రాజులలో ప్రోలయ వేమారెడ్డి, అనపోతారెడ్డి, కొమరగిరి రెడ్డి, పెదకోమటి వేమారెడ్డి మొదలగువారు ముఖ్యులు రెడ్డిరాజ్యం ఉత్తరాన ఒరిస్సాలోని కటక్ మరియు దక్షిణా శాకంచి వరకు మరియు పశ్చిమాన శ్రీశైలం వరకు విస్తరించింది. వీరి మొదటి రాజధాని అద్దంకి (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని ఒక పట్టణం). తరువాత దీనిని కొండవీడుకు మార్చారు. రాజమండ్రి వద్ద అనుబంధ శాఖను ఏర్పాటు చేశారు. విజయవాడకు వాయవ్య దిశలోని కొండపల్లి వద్ద ఒకటి, గుంటూరుకు పశ్చిమాన కొండవీడు వద్ద మరొక పెద్ద పర్వత దుర్గాలను నిర్మించారు. పల్నాడు ప్రాంతంలోని బెల్లంకొండ, వినుకొండ మరియు నాగార్జునకొండలు కూడా రెడ్డి రాజ్యంలో భాగంగా ఉండేవి.

ప్రశ్న 14.
బహమనీ సామ్రాజ్యము గురించి నీకేమి తెలియును?
జవాబు:
బహమనీ సామ్రాజ్యము :
అల్లావుద్దీన్ బహ్మన్‌షా క్రీ.శ. 1347లో బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు. ఇతనిని హసన్‌గంగూ అని కూడా పిలుస్తారు. ఇతని రాజధాని గుల్బర్గా, ఈ రాజ్యాన్ని మొత్తం పద్నాలుగు మంది సుల్తాన్లు పాలించారు. వారిలో, అల్లావుద్దీన్ బహమనీషా, మొదటి మహమ్మద్ షా మరియు ఫిరోజ్ షా ముఖ్యమైనవారు. అహ్మదాలిషా రాజధానిని గుల్బర్గా నుండి బీదరు మార్చాడు. మూడవ ముహమ్మద్ షా పాలనలో బహమనీ రాజ్యం యొక్క బలం బాగా ఉన్నత స్థాయికి చేరుకుంది. వీరి రాజ్యము అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం వరకు విస్తరించింది. పశ్చిమాన ఇది గోవా నుండి బొంబాయి వరకు విస్తరించింది. తూర్పున
ఇది కాకినాడ నుండి కృష్ణా నది ముఖద్వారం వరకు విస్తరించింది. మూడవ ముహమ్మద్ షా విజయానికి కారణం ఆయన మంత్రి మహమూద్ గవాన్ సలహాలు, సేవలు.

ప్రశ్న 15.
తుళువ వంశంలో ముఖ్య రాజులను తెల్పి, శ్రీకృష్ణ దేవరాయల పాలన విశిష్టతను, గొప్పతనమును తెల్పుము.
జవాబు:
తుళువ రాజవంశం :
తుళువ రాజవంశం విజయనగర సామ్రాజ్యంలోని మూడవ రాజవంశం. దీని పాలకులు వీరనరసింహ రాయలు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతదేవరాయలు మరియు సదాశివరాయలు. కృష్ణదేవరాయలు విజయనగరాన్ని పాలించిన పాలకులలో చాలా శక్తివంతమైన పాలకుడు.

శ్రీకృష్ణదేవరాయలు (క్రీ.శ. 1509-1529) :
తుళువ వంశ స్థాపకుడు వీరనరసింహరాయలు. విజయనగర పాలకులలో గొప్పవాడైన శ్రీకృష్ణదేవ రాయలు తుళువ వంశానికి చెందినవాడు. ఇతను సమర్థుడైన పాలకుడు. గొప్ప సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉండేవాడు. ఇతను విదేశీ వాణిజ్యం యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకుని ఓడల ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. అతని మొదటి పని విజయనగరంపై దండెత్తే బహమనీ దళాలను నిరోధించడం. ఇతని కాలం నాటికి బహమనీ రాజ్యం స్థానంలో దక్కన్ సుల్తానుల పాలన ప్రారంభమైనది. దివానీ యుద్ధంలో ముస్లిం సైన్యాలు శ్రీకృష్ణదేవరాయలు చేత నిర్ణయాత్మకంగా ఓడించబడ్డాయి. ఆ తరువాత శ్రీకృష్ణదేవరాయలు రాయ చూర్ దోఆబ్ పై దాడి చేశాడు. దీని ఫలితంగా బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షాతో ఘర్షణ జరిగింది. ఈ యుద్ధంలో శ్రీకృష్ణదేవరాయలు అతన్ని ఓడించి క్రీ.శ. 1520లో రాయచూర్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అతని గొప్ప తెలివైన మంత్రి అయిన తిమ్మరుసు శ్రీకృష్ణదేవరాయలకు తన పరిపాలనలో సహాయకుడుగా మార్గదర్శిగా ఉండేవాడు.
AP 7th Class Social Important Questions Chapter 6 విజయనగర సామ్రాజ్యం 1

ప్రశ్న 16.
మహ్మద్ గవాస్ గురించి నీకేమి తెలియును?
జవాబు:
మహ్మద్ గవాన్ :
మహ్మద్ గవాన్ మార్గదర్శకత్వంలో బహమనీ రాజ్యం ఉన్నత స్థాయికి చేరుకుంది. అతను పర్షియన్ వ్యాపారి. నలభై రెండేళ్ల వయసులో భారత్ కు వచ్చి బహమనీ రాజ్యంలో చేరాడు. ఆయన కొద్ది కాలంలోనే తన వ్యక్తిగత సామర్థ్యాల వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు. అతను రాజ్యానికి విధేయుడిగా ఉన్నాడు. అతను గొప్ప విద్వాంసుడు మరియు సైనిక మేధావి కూడా. అతను విజయనగరం, ఒరిస్సా మరియు కృష్ణ-గోదావరి డెల్టాపై విజయవంతమైన యుద్ధాలు చేశాడు. అతను తన వరుస విజయాల ద్వారా బహమనీ సామ్రాజ్యాన్ని విస్తరించాడు.

మీకు తెలుసా?

7th Class Social Textbook Page No. 157

హంపి వద్ద ఉన్న శిధిలాలు 1805లో ఇంజనీర్, పురాతత్వవేత్త అయిన కల్నల్ కొలిన్ మెకంజీ కాలంలో వెలుగులోకి వచ్చాయి. ఇతడు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి మరియు మొదటి భారతీయ సర్వేయర్ జనరల్.

7th Class Social Textbook Page No. 163

కవిరచన
1. అల్లసాని పెద్దనమనుచరిత్ర, హరికథాసారం
2. నంది తిమ్మనపారిజాతపహరణం
3. మాదయ గారి మల్లనరాజశేఖర చరితం
4. ధూర్జటిశ్రీ కాళహస్తీశ్వర మహత్యం
5. అయ్యలరాజు రామభద్రుడుసకల నీతిసార సంగ్రహం
6. పింగళి సూరనరాఘవ పాండవీయం
7. రామరాజ భూషణుడువసుచరిత్ర
8. తెనాలి రామకృష్ణుడుపాండురంగ మహత్యం

7th Class Social Textbook Page No. 165

1. ఏనుగులు నెమ్మదిగా నడిచే జంతువులు అయినప్పటికీ, యుద్ధ సమయాలలో శక్తివంతంగా దాడిచేస్తాయి.

2. యుద్ధ సమయాలలో జంతువులు కీలక పాత్ర పోషించాయి. గుర్రాలు, గాడిదలు మరియు ఒంటెలు పురుషులకు ఆహారం, నీరు, మందుగుండు సామగ్రి మరియు వైద్య సామగ్రిని అందించడంలో ముందు వరుసలో ఉండేవి. కుక్కలు మరియు పావురాలు సందేశాలను తీసుకువెళ్ళేవి. విషవాయువులను గుర్తించడానికి “పక్షులను” ఉపయోగించేవారు. పిల్లులకు, కుక్కలకు కందకాలలోని ఎలుకల వేటకు ఉపయోగపడే శిక్షణనిచ్చేవారు.

AP 7th Class Social Important Questions Chapter 6 విజయనగర సామ్రాజ్యం

7th Class Social Textbook Page No. 167

విజయనగర రాజవంశం కాలంలో సందర్శించిన విదేశీ యాత్రికుల జాబితా.

యాత్రికుని పేరుఎవరి కాలంలో
1. ఇబన్ బటూటా – మొరాకో యాత్రికుడుహరిహర – I
2. నికోలో కాంటి, ఇటాలియన్ యాత్రికుడుదేవరాయ – II
3. అబ్దుల్ రజాక్, పర్షియన్ యాత్రికుడుదేవరాయ – II
4. డువార్టే హర్బోసా, పోర్చుగీస్ యాత్రికుడుశ్రీకృష్ణదేవరాయ
5. డొమింగో పేస్, పోర్చుగీస్ యాత్రికుడుశ్రీకృష్ణదేవరాయ
6. ఫెర్నాండో నూనిజ్, పోర్చుగీస్ యాత్రికుడుఅచ్చుత దేవరాయ

AP 7th Class Social Important Questions Chapter 5 కాకతీయ రాజ్యం

These AP 7th Class Social Important Questions 5th Lesson కాకతీయ రాజ్యం will help students prepare well for the exams.

AP Board 7th Class Social 5th Lesson Important Questions and Answers కాకతీయ రాజ్యం

ప్రశ్న 1.
కల్యాణి చాళుక్యులు (పశ్చిమ చాళుక్యులు) గురించి క్లుప్తంగా వ్రాయండి.
జవాబు:
కల్యాణి చాళుక్యులు (పశ్చిమ చాళుక్యులు) :
కళ్యాణి చాళుక్యుల వంశ స్థాపకుడు రెండవ తైలపుడు. వీరి రాజధాని బీదర్ జిల్లాలో గల బసవకళ్యాణి. ఈ రాజ్యం 200 సంవత్సరాల పాటు కొనసాగింది. వీరు వేంగికి చెందిన తూర్పు చాళుక్యులు మరియు చోళులతో వీరు సంస్కృత మరియు కన్నడ భాషలను ప్రోత్సహించారు. బిల్హణుడు విక్రమాంక దేవచరిత్రను రాశాడు. రన్నడు అను ప్రసిద్ధ కన్నడ కవి వీరి ఆస్థానానికి చెందినవాడు. కల్యాణి చాళుక్యులు ఘటికలు అనే విద్యాసంస్థలను స్థాపించారు. వీరు హిందూ, జైన మతాలు రెండింటిని ఆదరించారు. వీరశైవ శాఖ కూడా వీరి పాలనలో ప్రాచుర్యం పొందింది.

ప్రశ్న 2.
యాదవులు ఎవరు? వీరి గురించి నీకు ఏమి తెలియును?
జవాబు:
యాదవులు :
యాదవులు మొదట కల్యాణి చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. వారు ప్రస్తుత అహ్మద్ నగర్ మరియు నాసిక్ ప్రాంతాలను పరిపాలించారు. వీరి రాజధాని దేవగిరి బిల్లమ యాదవ రాజవంశం స్థాపకుడు. యాదవులలో సింఘన సుప్రసిద్ధమైనవాడు. వారి రాజ్యం నర్మదా నది నుండి షిమోగా వరకు విస్తరించి ఉండేది. ఢిల్లీ సుల్తానుల దండయాత్రల కారణంగా వీరు తమ పాలనను కోల్పోయారు.

AP 7th Class Social Important Questions Chapter 5 కాకతీయ రాజ్యం

ప్రశ్న 3.
హోయసాలుల గురించి వివరణాత్మకంగా తెల్పండి.
జవాబు:
హోయసాలులు :
హోయసాలులు ద్వార సముద్రంనకు చెందినవారు. వీరు అధికారంలోకి రాకముందు చోళులు మరియు చాళుక్యులకి సామంతులుగా పనిచేశారు. హోయసాలుల పాలన దాదాపు 200 సంవత్సరాలు కొనసాగింది. వీరు ద్వార సముద్రాన్ని తమ రాజధానిగా చేసుకున్నారు. బిత్తిగ విష్ణువర్ధన కాలంలో వీరు ప్రాముఖ్యత పొందారు. నాల్గవ బల్లాలుడు ఈ రాజవంశం యొక్క చివరి పాలకుడు. సంస్కృత, కన్నడ భాషలను వీరు పోషించారు. హోయసాలులు రాజులు జైనమతాన్ని, మధ్వాచార్యులకు చెందిన ద్వైతాన్ని, రామానుజులకు చెందిన విశిష్టాద్వైతాన్ని అనుసరించారు. ఈ మతాలు ప్రాచుర్యం పొందటానికి వీరు మఠాల నిర్వహణను ప్రోత్సహించారు.

ప్రశ్న 4.
పాండ్యుల యొక్క పాలన గురించి తెలియజేయండి.
జవాబు:
పాండ్యులు :
పాండ్యులు మదురైను రాజధానిగా చేసుకొని పాలించారు. వీరు తమ సామ్రాజ్యం విస్తరించడానికి పల్లవులు మరియు చోళుల మధ్య వున్న శత్రుత్వాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ రాజవంశానికి చెందిన కులశేఖరుడు శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రను పూర్తిచేసాడు. మార్కోపోలో అను వెన్నీసు యాత్రికుడు అతని పరిపాలన కాలములో సందర్శించి అతని పాలనను ప్రశంసించాడు. పాండ్యులు రాజ్యపాలన వ్యవహారములో చోళుల పరిపాలనా విధానాన్ని అనుసరించారు. వీరు శైవమతం మరియు వైష్ణవ మతాలను ఆదరించారు. దక్షిణ భారతదేశంలో శ్రీరంగం, చిదంబరం, రామేశ్వరం మొదలైన చోట్ల అనేక దేవాలయాలు నిర్మించారు. విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించారు.

ప్రశ్న 5.
కాకతీయులకు ఆ పేరు ఎలా వచ్చింది?
జవాబు:
“కాకతి” అనే దేవతను ఆరాధించిన కారణంగా, వీరికి కాకతీయులు అను పేరు వచ్చింది. ఆమె “దుర్గాదేవి” యొక్క మరొక రూపం. వీరు కాకతి అనే కోటకు సంరక్షకులుగా ఉండేవారు. కాబట్టి వీరిని కాకతీయులు అంటారని కొందరి భావన. మరికొందరి వాదన ప్రకారం ఒకప్పుడు చోళులు పరిపాలించిన కాకతి పురానికి చెందిన వారే కాకతీయులు.

ప్రశ్న 6.
కాకతీయ రాజ్య ముఖ్య పాలకులు వారి కాలం యొక్క ప్రాముఖ్యతను తెల్పండి.
జవాబు:
కాకతీయ రాజ్య ముఖ్య పాలకులు :

కాకతీయ రాజుపాలన కాలంప్రాముఖ్యత
రెండవ ప్రోలరాజుక్రీ.శ. 1115-1157కాకతీయ పాలన స్వతంత్రముగా ప్రారంభించిన మొదటివాడు
రుద్రదేవుడుక్రీ.శ. 1158-1195హనుమకొండలో రుద్రేశ్వరాలయము నిర్మించినాడు
మహాదేవుడుక్రీ.శ. 1195-1199దేవగిరి కోట ముట్టడి సంఘటనలో మరణించినాడు
గణపతిదేవుడుక్రీ.శ. 1199-1262ఇతని పాలన కాలం స్వర్ణయుగం
రుద్రమదేవిక్రీ.శ. 1262-1289కాకతీయ మహిళా పాలకురాలు
ప్రతాపరుద్రుడుక్రీ.శ. 1289-1323చివరి కాకతీయ పాలకుడు

ప్రశ్న 7.
కాకతీయ రాజులైన రెండవ ప్రోలరాజు, రుద్రదేవుడుల గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
రెండవ ప్రోలరాజు (క్రీ.శ. 1116-1157) :
రెండవ ప్రోలరాజు పాలన కాకతీయ చరిత్రలో ముఖ్యమైన మైలురాయి. అతను రెండవ బేతరాజు యొక్క కుమారుడు. చాళుక్యుల ఆధిపత్యాన్ని ఎదిరించి ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరిచాడు. ఈ రాజ్యం ఇతని వారసుల హయాంలో మొత్తం ఆంధ్రా ప్రాంతాన్ని కలుపుకొని ఒక శక్తివంతమైన రాజ్యంగా రూపొందినది. ఇతడు హనుమకొండ నుండి స్వతంత్ర పాలన ప్రారంభించాడు.

రుద్రదేవుడు (క్రీ.శ. 1158-1195) :
రుద్రదేవుని విజయాలు హనుమకొండ శాసనంలో వివరించబడ్డాయి. అతను అనేక పొరుగు రాజులను ఓడించి తన ఆధిపత్యాన్ని గోదావరి ఒడ్డు వరకు విస్తరించాడు. దక్షిణాన రుద్రదేవుడు తెలుగు చోడ మూలానికి చెందిన నలుగురు రాజులను ఓడించాడు. అతను వేంగిపై కూడా దాడి చేశాడు. అతని పాలన చివరి కాలములో దేవగిరి యాదవులతో యుద్ధం జరిగింది. దీని ఫలితంగా ఓటమి చెంది మరణించినాడు. అతను సంస్కృత భాషలో నీతిసారము అనే గ్రంథం రాశాడు. హనుమకొండలో అద్భుతమైన వెయ్యిస్తంభాల ఆలయాన్ని నిర్మించాడు. అతను స్థాపించిన ఓరుగల్లు అతని వారసులకు రాజధానిగా మారింది.

రుద్రదేవుని తరువాత అతని సోదరుడు మహాదేవుడు నాలుగేళ్ల స్వల్పకాలం పాలనను అందించాడు. ఇతను యాదవ రాజ్యంపై దాడిచేసి, దేవగిరి ముట్టడి సమయంలో యాదవరాజుల చేతిలో మరణించాడు.

AP 7th Class Social Important Questions Chapter 5 కాకతీయ రాజ్యం

ప్రశ్న 8.
కాకతీయ పాలకుడైన ‘గణపతిదేవుడు’ పాలన గురించి వివరించండి.
జవాబు:
గణపతి దేవుడు (క్రీ.శ. 1199-1262) :
గణపతి దేవుడు అనుకూల పరిస్థితులలో తన పాలనను ప్రారంభించి నప్పటికీ, అతని పాలనను ఆంధ్ర చరిత్రలో అత్యంత అద్భుతమైన పాలనగా చెప్పవచ్చు. అతని 63 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో తెలుగు మాట్లాడే ప్రజలు నివసించే దాదాపు మొత్తం భూమిని తన పరిపాలనలోకి తెచ్చుకున్నాడు. ఆయనకు “మహామండలేశ్వర” అనే బిరుదు కలదు.

కాకతీయ పాలకులలో గణపతి దేవుడు అత్యంత శక్తివంతమైనవాడు. ఇతను విస్తృతమైన సామ్రాజ్యాన్ని నిర్మించాడు. గోదావరి ప్రాంతం నుండి మొదలుకొని చెంగల్పట్టు వరకు మరియు ఎలగందల నుండి సముద్రం వరకు విస్తరించి ఉన్న విశాల సామ్రాజ్యాన్ని నిర్మించినాడు. అతను తీరప్రాంతాలపై దాడి చేసి విజయవాడ మరియు దివిసీమ ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అతను మోటుపల్లి శాసనాన్ని జారీ చేశాడు. ఈ శాసనం ప్రకారం పన్నుల విధింపు, విదేశీ వాణిజ్యం, వివిధ వస్తువులపై పన్ను రేట్లు విధించిన తీరును వివరించాడు. అతను సమర్థ పాలకుడు. వాణిజ్యం మరియు వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి చర్యలు తీసుకున్నాడు. జలాశయాలను నిర్మించాడు, నీటిపారుదల కోసం చెరువులు త్రవ్వించాడు. పెద్ద మొత్తంలో అటవీ భూములను సాగులోకి తెచ్చాడు. గణపతి దేవుడు ఆలయ నిర్మాణం, సాహిత్య రచనలను ప్రోత్సహించాడు. అతను ఓరుగల్లు కోట నగర నిర్మాణమును పూర్తి చేశాడు. గణపతి దేవుడు తన కుమార్తెలు మరియు సోదరీమణుల వివాహాలను బలమైన పొరుగు రాజులతో ఏర్పాటు చేయడం ద్వారా ఇతర రాజ్యాలతో తన సంబంధాలను బలపరచుకున్నాడు.

ప్రశ్న 9.
కాకతీయ సామ్రాజ్య వైభవానికి చిహ్నంగా నిలచిన రాణి రుద్రమదేవి పాలనా వైభవాన్ని గురించి తెలియజేయండి.
జవాబు:
రుద్రమ దేవి (క్రీ.శ. 1262-1289) :
క్రీ.శ. 1262లో రుద్రమదేవి పాలన ప్రారంభమైనది. మహిళ పాలనను ఆమోదించలేని సామంత ప్రభువుల తిరుగుబాటులను ఆమె అణిచివేయాల్సి వచ్చింది. కాని బయటి ప్రమాదాలే ఆమెకు ఎక్కువ సమస్యాత్మకంగా నిలిచాయి. యాదవులు, చోళులు, పాండ్యులు మరియు కళింగ గజపతులు ఆమె పాలనను వ్యతిరేకించారు. యాదవ రాజులలో ఒకరైన మహాదేవుడు కాకతీయ రాజ్యంపై దాడి చేశాడు. రుద్రమదేవి అతన్ని ఓడించి శాంతి ఒప్పందం ఏర్పరచుకుంది. నెల్లూరులో రుద్రమదేవి పాలనను వ్యతిరేకించిన కాకతీయ సామంతరాజు అంబదేవుని నుంచి మరో దారుణమైన ఇబ్బంది వచ్చింది. ఆమె తన స్వీయ నేతృత్వంలో పెద్ద సైన్యంతో అతనిపై దండెత్తి, అతన్ని ఓడించి త్రిపురాంతకం మరియు చుట్టుపక్కల ప్రదేశాలను స్వాధీనం చేసుకుంది.

AP 7th Class Social Important Questions Chapter 5 కాకతీయ రాజ్యం 1
రుద్రమదేవి నిస్సందేహంగా ఆంధ్రా ప్రాంతంలోని గొప్ప పాలకులలో ఒకరు. ఆమె ప్రభుత్వంలో చురుకుగా పాల్గొనడమే కాకుండా, చాలా సందర్భాలలో సైన్యాన్ని స్వయముగా నడిపించింది. యుద్ధ విద్యలలో ఆమె చిన్నతనము నుంచి మంచి శిక్షణ పొందడం మరియు పరిపాలనా నైపుణ్యాలలో ఆమె పొందిన అనుభవము పెద్ద సైన్యాన్ని స్వయముగా నడిపించడానికి మరియు మంచి పాలన అందించడానికి సహాయపడ్డాయి. రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో ఆమె పరిపాలనా సామర్థ్యాన్ని ప్రశంసించినాడు. అతని రచనల ప్రకారం ఆంధ్రదేశం విలువైన రాళ్ళు, ఆభరణాలు మరియు వజ్రాల వాణిజ్యానికి ప్రసిద్ధి చెందింది.

రుద్రమదేవి తన తండ్రి గణపతి దేవునిచే ప్రారంభించబడిన ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఆమె వ్యవసాయం కోసం చెరువులను తవ్వించినది. దేవాలయ నిర్మాణాలను ప్రోత్సహించింది. కళలు మరియు విదేశీ వాణిజ్యాన్ని ఆమె తన పాలనా కాలంలో అభివృద్ధి చేసింది. ఆమె ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న నిడదవోలు పాలకుడు చాళుక్య వీరభద్రుడుని వివాహం చేసుకుంది. రుద్రమదేవి తన మనవడు ప్రతాపరుద్రుని తదుపరి వారసుడిగా ప్రకటించింది.

ప్రశ్న 10.
కాకతీయుల కాలములో భూమి రకాలు ఏవి?
జవాబు:
కాకతీయుల కాలములో భూమి రకాలు రాచ పొలం – రాజుకి చెందిన ప్రభుత్వ భూమి వెలిపొలం (వెలిచేను) – నీటి వసతి గలిగిన భూమి తోట పొలం (తోట భూమి) – వివిధ రకాల పండ్ల చెట్లతో కూడిన భూమి

ప్రశ్న 11.
కాకతీయుల కాలం నాటి మతం, సాహిత్యాభివృద్ధి గురించి వివరించండి.
జవాబు:
మతం :
కాకతీయుల కాలంలో శైవ మతం బాగా ప్రసిద్ది చెందింది. దీనితో పాటుగా వైష్ణవం, వీరశైవం కూడా ప్రసిద్ధి చెందాయి. వైష్ణవ మతం కూడా ఆచరణలో ఉంది. వీరశైవ అనుచరులలో ఒకరైన మల్లికార్జున పండితారాధ్యుడు, శివతత్వసారము అనే గ్రంథాన్ని రచించాడు. ఈయన కాకతీయ కాలానికి చెందినవాడు.

AP 7th Class Social Important Questions Chapter 5 కాకతీయ రాజ్యం 2
సాహిత్యం :
కాకతీయ పాలకులు సంస్కృతానికి తమ ప్రోత్సాహాన్ని అందించారు. అనేక మంది ప్రముఖ సంస్కృత . రచయితలు మరియు కవులు వారి ఆస్థానంలో ఉన్నారు. తెలుగు సాహిత్యం కూడా వారి పాలన కాలంలో వృద్ధి చెందింది. బసవపురాణాన్ని పాల్కురికి సోమనాథుడు, కుమార సంభవం అనే గ్రంథాన్ని నన్నెచోడుడు రచించాడు. విద్యానాథుడు సంస్కృతంలో ప్రతాప రుద్రీయమును వ్రాశాడు. గీత రత్నావళి, నృత్య రత్నావళిని జయాపసేనాని సంస్కృతంలో వ్రాయగా వల్లభ రాయడు అనునతడు క్రీడాభిరామమును తెలుగులో వ్రాశాడు. ఈ సాహిత్య రచనలు కాకతీయ కాలం నాటి భాషా విషయాలను సుసంపన్నం చేశాయి.

ప్రశ్న 12.
‘పేరిణి’ నాట్యం గురించి నీకేమి తెలియును?
జవాబు:
పేరిణి నాట్యం :
ఇది కాకతీయ కాలంలో ప్రసిద్ధ నాట్యం ఇది యుద్ధ సమయంలో ప్రదర్శించబడేది. ఇది చాలా ధైర్యంగా యుద్ధంలో చురుకుగా పాల్గొనడానికి సైనికులను ప్రేరేపించింది. పద్మశ్రీ నటరాజ రామకృష్ణ ఈ నృత్యంలో ప్రఖ్యాతిగాంచారు.

AP 7th Class Social Important Questions Chapter 5 కాకతీయ రాజ్యం

ప్రశ్న 13.
కాకతీయ రాజవంశం ఏ విధంగా పతనం చెందింది?
జవాబు:
కాకతీయ రాజవంశం ముగింపు: రెండవ ప్రతాపరుద్రుడి పాలనా కాలంలో ఢిల్లీ సుల్తానులు ఓరుగల్లుపై అనేకమార్లు దండయాత్రలు చేసారు. చివరికి క్రీ.శ. 1323వ సంవత్సరంలో ఉలుగ్ ఖాన్ నాయకత్వంలో ఢిల్లీ సుల్తానులు కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. ప్రతాపరుద్రుడిని ఖైదు చేసారు. ఈ అవమానాన్ని భరించలేక ప్రతాప రుద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా కాకతీయ రాజ్య వైభవం అంతరించిపోయింది. కాకతీయ రాజ్యం పతనమైన తరువాత ఆంధ్ర తీరములో, అద్దంకి, కొండవీడు, రాజమండ్రి, కందుకూరు మొదలగు చిన్న చిన్న రాజ్యాలు ఆవిర్భవించాయి.

ప్రశ్న 14.
ముసునూరి నాయకుల గురించి వివరణాత్మకంగా తెల్పండి.
జవాబు:
ముసునూరి నాయకులు :
ప్రోలయ నాయక : విలస శాసనమును అనుసరించి ఢిల్లీ సుల్తానుల దండయాత్రల వల్ల కాకతీయులు తమ సామ్రాజ్యాన్ని కోల్పోయారు. ఈ దాడుల కారణంగా స్థానిక కాకతీయ సామంతులు ఆయా ప్రాంతాలలో అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిలో ఒకరైన ప్రోలయ నాయకుడు రేకపల్లె రాజధానిగా అధికారంలోకి వచ్చాడు. ఈ ప్రాంతం పాపికొండల సమీపంలో భద్రాచలం అటవీ మధ్య ఉన్న ఇరుకైన శబరి నది లోయలో ఉందని, కొండలు మరియు అడవులను కలిగి ఉండటంతో ముస్లిం దండయాత్రల నుండి వ్యూహాత్మకంగా రక్షించబడింది. ఢిల్లీ సుల్తానులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటంలో గిరిజన వంశపు కొండారెడ్డి తెగవారు ప్రోలయ నాయకులకు సహాయపడ్డారు.

ముసునూరి కాపయ నాయక (క్రీ.శ. 1335-1368) :
ముసునూరి కాపయ నాయకుడు తన సోదరుడు ప్రోలయ నాయకుని తరువాత సింహాసనం అధిరోహించాడు. క్రీ.శ.1336లో తుగ్లక్ పాలనను వరంగల్ నుండి తరిమికొట్టడానికి తిరుగుబాటును నడిపించాడు. ఐతే ఈ విజయం ఎక్కువ కాలం నిలువలేదు. ఆంధ్రాలోని అనేక ప్రాంతాలలో స్థానికంగా చిన్నరాజ్యాలు కొండవీడు, రాజమండ్రి, కందుకూరు మొదలైన చిన్న రాజ్యాలు ఈ కాలంలో ఏర్పడ్డాయి.

ప్రశ్న 15.
రుద్రమదేవి పాలనా కాలములో బొల్లినాయకుడు వేయించిన శాసనములోని కొంత భాగము : “క్రీ.శ. 1270 సం. సంక్రాంతి పర్వదిన సందర్భముగా, కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రవేశద్వార సంరక్షకుడైన బొల్లి నాయకుడు, 10 కొలతలు గల భూమిని కళ్యాణ కేశవ దేవాలయ సేవకులకు కరంజ గ్రామములో తన స్వీయ నాయంకర పరిధిలోని భూమిని తన రాజైన రుద్రదేవ మహారాజుల గౌరవార్థం దానమిచ్చాడు.” ఈ శాసనంలో రుద్రదేవ మహారాజుగా పిలువబడిన వారెవరు?
జవాబు:
ఈ శాసనంలో రుద్రదేవ మహారాజుగా పిలువబడినది “కాకతీయ రాణి రుద్రమ దేవి”.

మీకు తెలుసా?

7th Class Social Textbook Page No. 129

1. చరిత్రకారుడు : మానవులకు సంబంధించిన గడిచిన సంఘటనలను గురించి అధ్యయనం చేసి వ్రాసే వ్యక్తి. 2. పురావస్తు శాస్త్రవేత్త : పురాతన భవనాలు, అవశేషాలు, శిల్పం, శాసనాలు మరియు పురావస్తు త్రవ్వకాల గురించి అధ్యయనం చేసే వ్యక్తి.

7th Class Social Textbook Page No. 131

కాకతీయులకు ఆ పేరు ఎలా వచ్చింది ? : “కాకతి” అనే దేవతను ఆరాధించిన కారణంగా, వీరికి కాకతీయులు అను పేరు వచ్చింది. ఆమె “దుర్గాదేవి” యొక్క మరొక రూపం. వీరు కాకతి అనే కోటకు సంరక్షకులుగా ఉండేవారు. కాబట్టి వీరిని కాకతీయులు అంటారని కొందరి భావన. మరికొందరి వాదన ప్రకారం ఒకప్పుడు చోళులు పరిపాలించిన కాకతి పురానికి చెందిన వారే కాకతీయులు.

1. త్రిలింగదేశం :
కాళేశ్వరము (తెలంగాణ), శ్రీశైలము (రాయలసీమ), ద్రాక్షారామం (తీర ఆంధ్ర ప్రాంతము)లను కలిపి త్రిలింగదేశం అంటారు.

2. ఓరుగల్లు ప్రస్తుత పేరు : వరంగల్, ప్రాచీన నామం : ఏక శిలా నగరం .

7th Class Social Textbook Page No. 135

అన్నపక్షి అనే సంస్కృతపదం పౌరాణికపక్షి హంసను సూచిస్తుంది. ఇది కాకతీయ కళాతోరణం పైన రెండు వైపులా ఉంచబడింది. Page No. 137 రుద్రమదేవికి గల ఇతర పేర్లు రుద్రమాంబ, రుద్రదేవ మహారాజు

7th Class Social Textbook Page No. 137

రుద్రమదేవి పాలనా కాలములో బొల్లినాయకుడు వేయించిన శాసనములోని కొంత భాగము : “క్రీ.శ. 1270 సం. సంక్రాంతి పర్వదిన సందర్భముగా, కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రవేశద్వార సంరక్షకుడైన బొల్లి నాయకుడు, పది కొలతల భూమిని కళ్యాణ కేశవ దేవాలయ సేవకులకు కరంజ గ్రామములో తన స్వీయ నాయంకర పరిధిలోని . భూమిని తన రాజైన రుద్రదేవ మహారాజుల గౌరవార్థం దానమిచ్చాడు.”

AP 7th Class Social Important Questions Chapter 5 కాకతీయ రాజ్యం

7th Class Social Textbook Page No. 139

కాకతీయుల కాలములో భూమి రకాలు

  1. రాచ పొలం – రాజుకి చెందిన ప్రభుత్వ భూమి
  2. వెలిపొలం (వెలిచేను) – నీటి వసతి గలిగిన భూమి
  3. తోట పొలం (తోట భూమి) – వివిధ రకాల పండ్ల చెట్లతో కూడిన భూమి

7th Class Social Textbook Page No. 141

ఇతర పన్నులు దరిశనం, అప్పనం, ఉపకృతి అను పన్నులు నేరుగా చక్రవర్తికి చెల్లించవలసిన పన్నులు.

పేరిణి నాట్యం :
ఇది కాకతీయ కాలంలో ప్రసిద్ధ నాట్యం . ఇది యుద్ధ సమయంలో ప్రదర్శించబడేది. ఇది చాలా ధైర్యంగా యుద్ధంలో చురుకుగా పాల్గొనడానికి సైనికులను ప్రేరేపించింది. పద్మశ్రీ నటరాజ రామకృష్ణ ఈ నృత్యంలో ప్రఖ్యాతిగాంచారు.

7th Class Social Textbook Page No. 143

వెయ్యి స్తంభాల ఆలయం మరియు రామప్ప దేవాలయాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా యునెస్కో గుర్తించింది.

AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు

These AP 7th Class Social Important Questions 4th Lesson ఢిల్లీ సుల్తానులు will help students prepare well for the exams.

AP Board 7th Class Social 4th Lesson Important Questions and Answers ఢిల్లీ సుల్తానులు

ప్రశ్న 1.
చరిత్ర అనగానేమి? చరిత్ర ఎందుకు చదవాలి?
జవాబు:
AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 1

  1. గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర.
  2. వివిధ ప్రదేశాలలోని మానవ సమాజాలకు చెందిన అనేక విషయాలను చరిత్ర తెలియచేస్తుంది.
  3. చరిత్ర వివిధ కాలాలలోని ప్రజలు, వారి సామాజిక జీవనం, నియమ నిబంధనలు, సంస్కృతి, సంప్రదాయాలు వంటి అంశాలను కాలానుగుణంగా ప్రాచీన కాలం నుండి ఇటీవల కాలం వరకు తెలియచేస్తుంది.
  4. గతానికి చెందిన వివిధ అంశాలను ఋజువులుగా అనేక రూపాలలో ఆధారాలను చరిత్ర అందజేస్తుంది.
  5. మెరుగైన పద్దతిలో గతాన్ని తెలుసుకోవడానికి చరిత్రను అధ్యయనం చేస్తాం.
  6. చరిత్ర, నైతికపరమైన అవగాహనకు మరియు దేశంలో తదాత్మైకితకు దోహదం చేస్తుంది.
  7. మంచి పౌరసత్వం కోసం చరిత్రను అధ్యయనం చేయడం చాలా అవసరం.

ప్రశ్న 2.
చారిత్రక ఆధారాలు ఎన్ని? అవి ఏవి? ఉదాహరణలతో వివరించుము.
జవాబు:
చారిత్రక ఆధారాలు :
ఎ) ఒక కాలానికి చెందిన చరిత్ర అధ్యయనం కొరకు కొన్ని ఆధారాలు అత్యంత ముఖ్యమైనవి.
బి) ఈ చారిత్రక ఆధారాలను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించారు. అవి :

  1. పురావస్తు ఆధారాలు
  2. వాజ్మయ ఆధారాలు (లిఖిత ఆధారాలు)

AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 2

ప్రశ్న 3.
భారతదేశ చరిత్ర కాలాలను ఏ విధంగా విభజించారు?
జవాబు:
భారతదేశ చరిత్ర కాలాలు :

  1. ప్రాచీన యుగం : 8వ శతాబ్దం వరకు
  2. మధ్య యుగం : 8 నుండి 18వ శతాబ్దం వరకు
  3. ఆధునిక యుగం : 18వ శతాబ్దం నుండి ప్రస్తుతం

AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు

ప్రశ్న 4.
భారతదేశంపై తొలినాటి దండయాత్రలు ఏవి? భారతదేశంలో ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్య స్థాపన ఎలా జరిగింది?
జవాబు:
భారతదేశంపై తొలినాటి దండయాత్రలు:

  1. తోమార వంశానికి చెందిన రాజపుత్రులు ధిల్లిక లేదా ధిల్లికాపుర (ప్రస్తుత ఢిల్లీ) నిర్మించి రాజధానిగా చేసుకుని పరిపాలించారు.
  2. వీరు 12వ శతాబ్దపు మధ్య కాలంలో అజ్మీర్ కు చెందిన చౌహానుల (చహమనులు) చేత ఓడింపబడ్డారు.
  3. తోమర్, చౌహాన్ వంశస్తుల కాలంలో ఢిల్లీ ముఖ్య వాణిజ్య కేంద్రంగా ఉండేది.
  4. 11వ శతాబ్దపు తొలినాటి కాలంలో జరిగిన తురుష్కుల దండయాత్రలను రాజపుత్ర రాజవంశాలు సమర్థంగా ఎదుర్కొన్నారు.
  5. క్రీ.శ. 1192వ సంవత్సరంలో మహమ్మద్ ఘోరి రెండవ తరాయిన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్‌ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు.
  6. దీనిలో క్రమంగా గంగా – యమున మైదాన ప్రాంతం క్రమంగా తురుష్కుల పాలన పరిధిలోకి వెళ్ళిపోయింది.
  7. మహమ్మద్ ఘోరి హత్యానంతరం అతని ప్రతినిధి అయిన కుతుబుద్దీన్ ఐబక్ మామ్లుక్ లేదా బానిస వంశాన్ని క్రీ.శ. 1206లో ఢిల్లీ పాలకునిగా ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యాన్ని స్థాపించారు.
  8. భారత ఉపఖండంలో ఎక్కువ భాగం ఢిల్లీ సుల్తానుల పాలన క్రింద కొనసాగింది.

ప్రశ్న 5.
బానిస వంశం గురించి నీకేమి తెలుసు?
జవాబు:
బానిస వంశం : (మామ్లుక్ వంశం)

  1. కుతుబుద్దీన్ ఐబక్ క్రీ.శ. 1206వ సంవత్సరంలో బానిస వంశాన్ని స్థాపించాడు.
  2. లాహోర్ రాజధానిగా ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు.
  3. తరువాత ఇల్ టుట్ మిష్ కాలంలో రాజధాని ఢిల్లీకి మార్చబడినది.
  4. అలా అతను ఢిల్లీకి తొలి సర్వ స్వతంత్ర పాలకునిగా, ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకునిగా పరిగణింపబడినాడు.
  5. ఇల్ టుట్ మిష్ తరువాత అతని కుమార్తె రజియా సుల్తానా సింహాసనాన్ని అధిష్టించారు.
  6. ఘియాజుద్దీన్ బాల్బన్ తన పాలనాకాలంలో సుల్తానుల ప్రతిష్టను పునరుద్దరించి అధికారాన్ని కొనసాగించాడు.
  7. బానిస వంశపరిపాలన కైకుబాద్ కాలంలో ముగిసింది.

ప్రశ్న 6.
మంగోలులు ఎవరు? వారి గురించి నీకేమి తెలియును?
జవాబు:
మంగోలులు :
ప్రాచీన కాలంలో మంగోలియాను అనేక సంచార జాతులు పాలించాయి. చంగీజ్ ఖాన్ మంగోలియన్లను ఏకం చేసి క్రీ.శ. 1206వ సంవత్సరంలో మంగోల్ రాజ్యాన్ని స్థాపించాడు. ఢిల్లీ సుల్తానుల పాలనాకాలంలో మంగోలులు క్రీ. శ. 1221-1368 వరకు భారతదేశంపై అనేక సార్లు దండయాత్ర చేసారు.

ప్రశ్న 7.
సయ్యద్ వంశం గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
సయ్యద్ వంశం :
ఢిల్లీ సుల్తానులలో నాలుగవది అయిన సయ్యద్ వంశ స్థాపకుడు కిజర్ ఖాన్. జర్ ఖాన్, ముబారఖ్ షా, మహ్మద్ షా, ఆలమ్ షా ఈ వంశములోని ఇతర పాలకులు. ముబారఖ్ షా రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేశాడు కాని విఫలమయ్యాడు. చివరి పాలకుడు ఆలమ్ షా బహలాల్ చేతిలో ఓడిపోవటంతో లోడీ వంశస్తులకు పాలన సంక్రమించింది.

AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు

ప్రశ్న 8.
లోడి వంశము గూర్చి నీకు తెలిసినది తెల్పుము.
జవాబు:
లోడి వంశము :
బహలాల్ లోడి తన రాజ్యంలోని ప్రభువులను సంతృప్తి పరచడానికి అనేక చర్యలు తీసుకున్నాడు. రెండవ సుల్తాన్ సికిందర్ లోడి రాజ్యాన్ని సుస్థిరపరచేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఢిల్లీ సుల్తానులలో చివరి పాలకుడైన ఇబ్రహీం లోడి పాలన తర్వాత ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతమయ్యింది.

ప్రశ్న 9.
తైమూరు యొక్క దండయాత్రల గూర్చి, వాని ఫలితాలను తెల్పండి.
జవాబు:
AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 3

  1. తుగ్లక్ వంశ పాలనా కాలంలో క్రీ.శ. 1398వ సంవత్సరంలో తైమూరు భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరచుకున్నాడు.
  2. ఆటవిక పద్దతిలో జరిగిన ఈ దాడిలో దేశం భయభ్రాంతులకు లోనగుటయే గాక తీవ్రంగా దోచుకోబడింది.
  3. అనేక నిర్మాణాలు కూల్చి వేయబడ్డాయి.
  4. ఢిల్లీ పునర్నిర్మాణానికి దాదాపు శతాబ్దం పట్టింది.
  5. తరువాత కాలంలో ఇది బాబర్ దండయాత్రకు దారి తీసి మొఘల్ సామ్రాజ్య స్థాపనకు కారణమయ్యింది.

ప్రశ్న 10.
‘చిహల్గని’ అనగానేమి?
జవాబు:
చిహల్గని :
పరిపాలనలో సహకరించడం కొరకు టర్కిష్ ప్రభువులతో కూడిన ఇల్ టుట్ మిష్ చే ప్రారంభించబడిన వ్యవస్థ. దీనినే తుర్కాన్ – ఇ – చిహల్గని లేదా చాలీసా అనేవారు. సుల్తానులకు వ్యతిరేకముగా ఉన్న ప్రభువులను అణచి వేయటానికి ఇది ఉపయోగపడింది.

ప్రశ్న 11.
ఢిల్లీ సుల్తానుల కాలంలో స్వదేశీ నిర్మాణాలలోని పద్ధతులను పట సహాయంతో వివరించండి.
జవాబు:
AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 4

ప్రశ్న 12.
ఢిల్లీ సుల్తానుల పతనం ఏ విధంగా జరిగింది?
జవాబు:
పతనం :

  1. లోడి వంశస్తుల పాలన కాలంలో ఢిల్లీ సుల్తానుల పాలన ముగిసింది. అయితే తుగ్లక్ కాలం నుండే పతనం ఆరంభం అయిందని చెప్పవచ్చు.
  2. 1398 తైమూరు దండయాత్రలలో దేశ సంపదని తరలించి వేశారు. తైమూరు సాధించిన మారణ హోమం నుండి కోలుకోవడానికి ఢిల్లీకి 100 సం||లు పట్టింది.
  3. బలహీన సుల్తానుల పాలనలో అనేక ప్రాంతీయ రాజ్యా లు ఏర్పడ్డాయి. ఉత్తర భారతదేశంలో అధికారం కొరకు తరచూ సంఘర్షణలు జరిగేవి.
  4. దక్షిణ భారతదేశంలో విజయనగర, బహమనీ రాజ్యాలు ఢిల్లీ సుల్తానుల పాలన నుండి స్వతంత్రమయ్యాయి. సయ్యద్, లోడి వంశంలోని అసమర్థత, అసహనంతో కూడిన పాలన పతనానికి దారి తీసింది.
  5. క్రీ.శ. 1526లో మొఘల్ పాలకుడైన బాబర్ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీంలోడిని ఓడించాడు. దీనితో ఢిల్లీ సుల్తానుల పాలన అంతమై మొఘల్ సామ్రాజ్య కాలం ప్రారంభమైనది.

AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు

ప్రశ్న 13.
ఢిల్లీ సుల్తానుల పాలన కాలంలో సాహిత్యాభివృద్ధి గూర్చి తెల్పుతూ, అల్ బెరూని, అమీర్ ఖుస్రూల గూర్చి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
ఢిల్లీ సుల్తానుల పాలన కాలంలో సాహిత్యాభివృద్ధి:

  1. ఈ కాలంలో అనేక మంది పండితులకు ఆశ్రయం ఇచ్చి పోషించారు.
  2. పర్షియా, సంస్కృతం మరియు ప్రాంతీయ భాషలలో సాహిత్యం వికసించింది.
  3. వచనం, కవిత్వం, నాటక రూపాలలో సాహిత్యం ఉండేది.
  4. అనేక సంస్కృత గ్రంథాలు అరబిక్, ఉర్దూ భాషల్లోకి అనువదించబడ్డాయి.
  5. అల్ బెరూనీ, అమీర్ ఖుస్రూ, జియా-ఉద్దీన్-బరూని ఈ కాలంలోని ప్రముఖ పండితులు.

అల్ బెరూని :

AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 5
అల్ బెరూనీ మహమ్మద్ ఘజనీ చేత ఆదరించబడ్డ ప్రముఖ పర్షియన్ పండితుడు. ఈయన సంస్కృత భాషను నేర్చుకుని ఆ భాషలోని కొన్ని గ్రంథాలను అరబ్బీ భాషలోకి అనువదించాడు. ఉపనిషత్తులు, భగవద్గీతచే ప్రభావితమయ్యాడు. తారిక్-అల్-హింద్ (భారతదేశ చరిత్ర) అనే గ్రంథాన్ని రచించాడు.

అమీర్ ఖుస్రూ :
AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 6
ఈయన పర్షియాకు చెందిన గొప్ప కవి, గాయకుడు. అనేక ద్విపద పద్యాలు రచించాడు. ఈయనకు (టుటి-ఐ-హింద్) భారతదేశపు చిలుక (The Parrot of India) అని బిరుదు ఉండేది.

ప్రశ్న 14.
‘సుల్తానా రజియా’ గురించి నీకేమి తెలియును?
జవాబు:

  1. సుల్తానా రజియా క్రీ.శ. 1236-1239 పాలనా కాలం.
  2. ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ.
  3. ఢిల్లీ సామ్రాజ్య స్థాపన తొలినాటి కాలంలో ఆమె తనదైన ముద్ర వేసింది.
  4. టర్కీ ప్రభువుల నుండి (చిహల్గని) స్వంత అన్నదమ్ముల నుండి ఆమెకు తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కొనవలసి వచ్చింది.

ప్రశ్న 15.
ఢిల్లీ సుల్తానత్ పాలించిన వంశములు, వాని స్థాపకులు, కాలము ఆ వంశంలో ప్రముఖ పాలకులతో కూడిన జాబితా తయారుచేయండి.
జవాబు:
AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 7

ప్రశ్న 16.
క్రింది పటంను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సరియైన సమాధానములు ఇవ్వండి.
AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 8
ప్రశ్నలు:
ఎ) పై పటము దేని గురించి తెలియజేస్తుంది?
జవాబు:
తుగ్లక్ వంశ కాలంలో భారతదేశం

బి) దౌలతాబాద్ ప్రస్తుతం ఏ రాష్ట్రంలో కలదు?
జవాబు:
మహారాష్ట్ర

సి) ఢిల్లీ ఏ నది ఒడ్డున కలదు?
జవాబు:
యమునా

డి) నాటి దక్షిణ భారత రాజ్యా నికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
మధురై

మీకు తెలుసా?

7th Class Social Textbook Page No. 101

భారతదేశ చరిత్ర కాలాలు

  1. ప్రాచీన యుగం : క్రీ.శ. 8వ శతాబ్దం వరకు
  2. మధ్య యుగం : క్రీ.శ. 8 నుండి 18వ శతాబ్దం వరకు
  3. ఆధునిక యుగం : క్రీ.శ. 18వ శతాబ్దం నుండి ప్రస్తుతం

7th Class Social Textbook Page No. 105

మామ్లుక్ అనగా బానిస అని అర్ధం.

7th Class Social Textbook Page No. 107

మంగోలులు : ప్రాచీనకాలంలో మంగోలియాను అనేక సంచార జాతులు పాలించాయి. చంగీ ఖాన్ మంగోలియన్లను ఏకం చేసి క్రీ.శ. 1206వ సంవత్సరంలో మంగోల్ రాజ్యాన్ని స్థాపించాడు. ఢిల్లీ సుల్తానుల పాలనాకాలంలో మంగోలులు క్రీ.శ. 1221-1368 వరకు భారతదేశంపై అనేక సార్లు దండయాత్ర చేసారు.

AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు

7th Class Social Textbook Page No. 111

తుగ్లక్ వంశ పాలనా కాలంలో క్రీ.శ. 1398 సంవత్సరంలో తైమూరు భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీన పరచుకున్నాడు. ఆటవిక పధతిలో జరిగిన ఈ దాడిలో దేశం భయభ్రాంతులకులోనగుటయే గాక తీవ్రంగా దోచుకోబడింది. అనేక నిర్మాణాలు కూల్చి వేయబడ్డాయి. ఢిల్లీ పునర్నిర్మాణానికి దాదాపు శతాబ్దం పట్టింది. తరువాత కాలంలో ఇది బాబర్ దండయాత్రకు దారి తీసి మొఘల్ సామ్రాజ్య స్థాపనకు కారణమయ్యింది.

చిహల్గవి :
పరిపాలనలో సహకరించడం కొరకు టర్కిష్ ప్రభువులతో కూడిన ఇల్ టుట్ మిష్ చే ప్రారంభించబడిన వ్యవస్థ. దీనినే తుర్కాన్-ఇ-చిహల్గవి లేదా చాలీసా అనేవారు. సుల్తానులకు వ్యతిరేకముగా ఉన్న ప్రభువులను అణచి వేయటానికి ఇది ఉపయోగపడింది.

7th Class Social Textbook Page No. 115

AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 4

7th Class Social Textbook Page No. 117

ఆల్ బెరూని :
AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 5
ఆల్ బెరూనీ మహమ్మద్ ఘజనీ చేత ఆదరించబడ్డ ప్రముఖ * పర్షియన్ పండితుడు. ఈయన సంస్కృత భాషను నేర్చుకుని ఆ భాషలోని కొన్ని గ్రంథాలను అరబ్బీ భాషలోకి అనువదించాడు. ఉపనిషత్తులు, భగవద్గీతచే ప్రభావితమయ్యాడు. తారిక్-అల్-హింద్ (భారతదేశ చరిత్ర) అనే గ్రంథాన్ని రచించాడు.

అమీర్ ఖుస్రూ :
AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 6
ఈయన పర్షియాకు చెందిన గొప్ప కవి, గాయకుడు. అనేక ద్విపద పద్యాలు రచించాడు. ఈయనకు (టుటి-ఐ-హింద్) భారతదేశపు చిలుక (The Parrot of India) అని బిరుదు ఉండేది.

AP 7th Class Social Important Questions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం

These AP 7th Class Social Important Questions 3rd Lesson పటాల ద్వారా అధ్యయనం will help students prepare well for the exams.

AP Board 7th Class Social 3rd Lesson Important Questions and Answers పటాల ద్వారా అధ్యయనం

ప్రశ్న 1.
పటాల తయారీలో నావికులు, ప్రయాణికుల సహకారం ఎలాంటిది?
జవాబు:

  1. పటాల తయారీలో నావికులు, ప్రయాణికుల సహకారం ఎంతో విలువైనది.
  2. పటాల తయారీదారులు (కార్టోగ్రాఫర్స్) వీరి నుండి సమాచారాన్ని తీసుకొని పటాలను తయారుచేసేవారు.
  3. గుహలలోని చిత్రాలను గమనించడం ద్వారా పటాల తయారీ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు తెలుసుకోవచ్చు.
  4. సుమేరియన్లు, బాబిలోనియన్లు మట్టి పలకలను పటాలుగా ఉపయోగించారు.
  5. తర్వాత గ్రీకు పట తయారీదారులైన అనాక్సిమాండర్, హెకేటియస్, హెరడోటస్ పటంలోని విషయాలను పశ్చిమం నుండి తూర్పు వైపుకు ఉండునట్టుగా పటాలను రూపొందించారు.
  6. అక్షాంశ రేఖాంశ భావనలను గ్రీకులు పటాల తయారీకి అన్వయించారు.

ప్రశ్న 2.
పట శీర్షిక అనగానేమి?
జవాబు:
శీర్షిక :
పటంలోని అంశాలను లేదా విషయాన్ని పట శీర్షిక తెలియజేస్తుంది. ఇది పటంలో చర్చించే విశేష అంశాలను పరిచయం చేస్తుంది. సాధారణంగా శీర్షిక పటంపై భాగంలో అమరి ఉంటుంది.

AP 7th Class Social Important Questions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం

ప్రశ్న 3.
సాంప్రదాయిక చిహ్నాలు అనగానేమి? ఉదాహరణలతో వివరించుము.
జవాబు:
సాంప్రదాయిక చిహ్నాలు:
వాస్తవ అంశాలను పటంలో యథాతథంగా చూపించడం కష్టం. పటాల తయారీదారులు చిహ్నాలను ఉపయోగించి పటంలో ఆ ప్రదేశాల ఉనికిని చూపుతారు. భారత సర్వేక్షణ శాఖ (సర్వే ఆఫ్ ఇండియా) టోపోషీట్స్ తయారీలో సాంప్రదాయక చిహ్నాలు ఉపయోగిస్తుంది. కొన్ని సాంప్రదాయక చిహ్నాలు క్రింద ఇవ్వబడ్డాయి.
AP 7th Class Social Important Questions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 1

ప్రశ్న 4.
MSL (సముద్రమట్టం నుండి ఎత్తు) గురించి నీకేమి తెలియును?
జవాబు:
సముద్రమట్టం నుండి ఎత్తు: సముద్ర ఉపరితలం దాదాపు భూగోళం అంతా ఒకే విధంగా ఉంటుంది. సముద్ర ఉపరితలం దాదాపు అన్ని ప్రదేశాలలో సమానం అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలవడంలో ఎం.ఎస్.ఎల్ (సముద్రమట్టం నుండి ఎత్తు) ను ప్రామాణికంగా స్వీకరిస్తారు.

ప్రశ్న 5.
‘గ్రిడ్’ అనగానేమి? దీని ఉపయోగమేమి?
జవాబు:
గ్రిడ్ :
అక్షాంశ రేఖాంశాలతో ఏర్పడిన గడుల వంటి అమరికను గ్రిడ్ అంటారు. గ్లోబుపై ఒక ప్రదేశం యొక్క ఉనికిని దీని ద్వారా కచ్చితంగా తెలుసుకోవచ్చు. మొదట అక్షాంశాలను, తరువాత రేఖాంశాలను చదవడం ద్వారా గ్రిలోని సమాచారాన్ని పొందవచ్చు.

ప్రశ్న 6.
పటాల తయారీలో రంగుల యొక్క ఆవశ్యకత తెలుపుతూ, వివిధ రంగులను ఏ విధంగా ఉపయోగిస్తారో తెల్పండి.
జవాబు:
రంగులు :
భౌతిక పటాలలోనూ, విషయ నిర్దేశిత పటాలలోనూ ఉపయోగించే రంగులు ప్రత్యేక అంశాలను తెలియచేస్తాయి. సాధారణంగా క్రింద ఇవ్వబడిన రంగులను పటాల తయారీలో ఉపయోగిస్తారు.
AP 7th Class Social Important Questions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 2

ప్రశ్న 7.
నమూనా చిత్రాలను పటాల తయారీలో ఏ విధంగా ఉపయోగిస్తారు?
జవాబు:
నమూనా చిత్రాలు (Patterns): ఒక అంశానికి సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని పటంలో చూపడానికి పటాల తయారీలో వీటిని ప్రత్యేకాంశాలుగా భావిస్తారు. గణాంక వివరాలను పరిమాణాత్మక, గుణాత్మక విశ్లేషణలుగా, (జనసాంద్రత, జనాభా విస్తరణ) వివిధ రకాల ప్రత్యేక భావనలుగా (నేలలు, అడవులు) పటంలో చూపడానికి వీటిని ఉపయోగిస్తారు.
AP 7th Class Social Important Questions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 3

ప్రశ్న 8.
రాజకీయ పటాల గురించి వివరింపుము.
జవాబు:
రాజకీయ పటాలు:

  1. రాజకీయ పటాలు ఒక ప్రదేశం యొక్క పాలనా పరిధిని, పొరుగు దేశాలను, సరిహద్దులను, రాజధానులను తెలియచేస్తాయి.
  2. ఆ ప్రదేశపు ఉనికి కూడా తెలుసుకోవచ్చు. సరిహద్దు రేఖల మందం, రంగు, సరిహద్దు రేఖ తీరును బట్టి ఆ ప్రదేశం జిల్లా లేదా రాష్ట్రం అన్నది తెలుసుకోవచ్చు.
  3. రాజకీయ పటాలలో ఉపయోగించే రంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండదు.
  4. రాజకీయ పటాల అధ్యయనంలో అక్షాంశ రేఖాంశాలకు సంబంధించిన పరిజ్ఞానం ఒక ప్రదేశం లేదా దేశాలను ప్రపంచ పటంలో సులువుగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది.
  5. భారతదేశ రాష్ట్రాలను సులువుగా గుర్తించడానికి పొరుగు దేశాలతో భూభాగ సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు, తీరరేఖ కలిగి ఉన్న రాష్ట్రాలు, అంతర్గత రాష్ట్రాలుగా పరిశీలించడం అనేది ఓ పద్ధతిగా పాటించవచ్చు.
  6. ఒక ప్రదేశపు ఉనికిని గుర్తించడానికి గ్రిడ్, మూలలు, సరిహద్దు రేఖ నుండి దూరం మొ.వాటిని కొండగుర్తులుగా ఉపయోగించవచ్చు.

AP 7th Class Social Important Questions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం

ప్రశ్న 9.
‘లెజెండ్’ అనగానేమి?
జవాబు:
లెజెండ్ :
పటములోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు లేదా చిహ్నాలను కలిగి ఉండే పట్టిక, ఇది పటంలో ఏదేని ఒక మూలన అమరి ఉంటుంది.
లెజెండ్ రాష్ట్ర సరిహద్దు జిల్లా సరిహద్దు రైలు మార్గము బంగారు నడవ ఉత్తర-దక్షిణ నడవ జాతీయ రహదారి తీరప్రాంత మార్గము రాష్ట్ర ప్రధాన కేంద్రం జిల్లా ప్రధాన కేంద్రం ఇతర ప్రదేశాలు
AP 7th Class Social Important Questions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 4

ప్రశ్న 10.
కాంటూరు రేఖలు అనగానేమి? వాని లక్షణాలను తెల్పండి.
జవాబు:

  1. సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే ఊహారేఖలను కాంటూరు రేఖలు అంటారు.
  2. ఒక ప్రదేశమునకు సంబంధించిన భౌతిక స్వరూపాలని (టోపోగ్రఫీ) తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి.
  3. రెండు కాంటూరు రేఖల మధ్య గల దూరం, ఎత్తుల మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతుంది. కాంటూరు రేఖలు దగ్గరగా ఉంటే ఆ ప్రదేశం యొక్క వాలు తక్కువగా ఉంటుంది.
  4. రేఖల మధ్య దూరం ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతం వాలు ఎక్కువగా వుంటుంది.

AP 7th Class Social Important Questions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 5

ప్రశ్న 11.
విషయ నిర్దేశిత పటాల గురించి నీకేమి తెలియును?
జవాబు:
విషయ నిర్దేశిత పటాలు :

  1. ఏదేని ప్రత్యేక అంశము లేదా విషయాలను తెలుపుటకు తయారుచేయబడిన పటాలను విషయ నిర్దేశిత పటాలు అంటారు.
  2. ఉదాహరణకు ఉద్భిజ్జ పటాలు (అడవులను తెలిపే పటాలు), నేలల పటాలు, జనాభా పటాలు, శీతోష్ణస్థితి పటాలు మొదలగునవి.
  3. సాంప్రదాయ చిహ్నాలతో నిర్దిష్ట స్థలాన్ని టోపోట్లుగా వివరించడానికి ఈ పటాలు తయారు చేయబడతాయి.
  4. వీటి సహాయంతో జనాభా వివరాలను, ఖనిజ వనరులను, వలసలు వంటి గణాంక వివరాలను తెలియచేయవచ్చు.

ప్రశ్న 12.
చారిత్రక పటాల గురించి సోదాహరణంగా వివరించండి.
జవాబు:
చారిత్రక పటాలు :

  1. చరిత్రకారులు వివిధ రాజవంశాలకు చెందిన రాజ్య విస్తృతి, శాసనాలు, వాస్తు, శిల్పకళ, వాణిజ్య సంబంధాలు మొదలగు అంశాల అధ్యయనంలో ఈ పటాలను కీలక వనరులుగా వినియోగిస్తారు.
  2. గడిచిపోయిన కాలం యొక్క వివరాలను చూపించే పటాలను ‘చారిత్రక పటాలు’ అంటారు.
  3. అవి ఒక నిర్దిష్ట కాలానికి చెందిన ప్రాంతం, ముఖ్యమైన ప్రదేశాలు, వాణిజ్య మార్గాలు, వివిధ ప్రాంతాల మధ్య సామాజిక, సాంస్కృతిక సంబంధాలు మొదలైన ప్రాదేశిక సమాచారాన్ని అందిస్తాయి.
  4. చరిత్రకారులు ఒక రాజవంశము యొక్క పరిపాలనా ప్రాంతాన్ని అధ్యయనం చేయటానికి పటాలను ముఖ్య ఆధారంగా ఉపయోగిస్తారు.
  5. శాసనాలు, వాస్తు శిల్పం, వాణిజ్య సంబంధాలు మొదలైన సమాచారాన్ని పట అధ్యయనంతో తెలుసుకోవచ్చును.

ప్రశ్న 13.
ప్రక్షేపణం అనగానేమి?
జవాబు:
ప్రక్షేపణం: గోళాకారంగా ఉన్న భూమిపై ఉన్న అంశాలైన ఖండాలు ప్రదేశాలను వాటి ఆకారం, దిశలను సమతల ఉపరితలంపై సవరించి చూపడాన్ని ప్రక్షేపణం అంటారు. పటాల తయారీలో ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టినవారు డచ్ కార్టో గ్రాఫర్ (పటాలను తయారు చేసేవారు) గెరార్డస్ మెర్కేటర్.

AP 7th Class Social Important Questions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం

ప్రశ్న 14.
టోపోగ్రాఫిక్ పటాలు అనగానేమి?
జవాబు:
టోపోగ్రాఫిక్ పటాలు:
ఈ పటాలు భూ ఉన్నతి, భౌతిక స్వరూపము, వ్యవసాయ భూములు, నేలలు, నదులు, జనావాసాలు మొదలైన వివరాలను చూపుతాయి. సాంప్రదాయక చిహ్నాలను ఉపయోగించి సమగ్ర సమాచారం అందించేలా వీటిని రూపొందిస్తారు.

ప్రశ్న 15.
భారతదేశ భౌతిక పటమును గీయండి.
జవాబు:
AP 7th Class Social Important Questions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 6

ప్రశ్న 16.
భారతదేశంలోని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు వాటి రాజధానులను అవుట్ లైన్ పటం నందు గుర్తించండి.
జవాబు:
AP 7th Class Social Important Questions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 7

ప్రశ్న 17.
క్రింది ప్రపంచ పటమును పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు సరియైన సమాధానములు రాయండి.
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 18
ప్రపంచ రాజకీయ పటం
ప్రశ్నలు:
i) భారతదేశం ఏ ఖండంలో ఉంది?
జవాబు:
ఆసియా ఖండం

ii) కర్కట, భూమధ్య, మకర (మూడు) రేఖలు ఏ ఖండంగా పోవుచున్నవి?
జవాబు:
ఆఫ్రికా ఖండం

iii) భారతదేశం మధ్య గుండా పోవుచున్న రేఖ ఏది?
జవాబు:
కర్కట రేఖ

iv) హిందూ మహాసముద్రం భారతదేశంకు ఏ దిక్కున కలదు?
జవాబు:
దక్షిణ దిక్కులో

v) ఆసియాను ఉత్తర అమెరికాను వేరుచేస్తున్న జలసంధి ఏది?
జవాబు:
బేరింగు జలసంధి

మీకు తెలుసా?

7th Class Social Textbook Page No. 75

సముద్రమట్టం నుండి ఎత్తు : సముద్ర ఉపరితలం దాదాపు భూగోళం అంతా ఒకే విధంగా ఉంటుంది. సముద్ర ఉపరితలం దాదాపు అన్ని ప్రదేశాలలో సమానం అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలవడంలో ఎం.ఎస్.ఎల్ (సముద్రమట్టం నుండి ఎత్తు)ను ప్రామాణికంగా స్వీకరిస్తారు.

7th Class Social Textbook Page No. 81

గ్రిడ్ :
అక్షాంశ రేఖాంశాలతో ఏర్పడిన గడుల వంటి అమరికను గ్రిడ్ అంటారు. గ్లోబుపై ఒక ప్రదేశం యొక్క ఉనికిని దీని ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. మొదట అక్షాంశాలను, తరువాత రేఖాంశాలను చదవడం ద్వారా గ్రిడ్ లోని సమాచారాన్ని పొందవచ్చు.

7th Class Social Textbook Page No. 91

టోపోగ్రాఫిక్ పటాలు :
ఈ పటాలు భూ ఉన్నతి, భౌతిక స్వరూపము, వ్యవసాయ భూములు, నేలలు, నదులు, జనావాసాలు మొదలైన వివరాలను చూపుతాయి. సాంప్రదాయక చిహ్నాలను ఉపయోగించి సమగ్ర సమాచారం అందించేలా వీటిని రూపొందిస్తారు.

AP 7th Class Social Important Questions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం

7th Class Social Textbook Page No. 93

ప్రక్షేపణం :
గోళాకారంగా ఉన్న భూమిపై ఉన్న అంశాలైన ఖండాలు ప్రదేశాలను వాటి ఆకారం, దిశలను సమతల ఉపరితలంపై సవరించి చూపడాన్ని ప్రక్షేపణం అంటారు. పటాల తయారీలో ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టినవారు డచ్ కార్టో గ్రాఫర్ (పటాలను తయారు చేసేవారు) గెరార్డస్ మెర్కేటర్.

AP 7th Class Social Important Questions Chapter 2 అడవులు

These AP 7th Class Social Important Questions 2nd Lesson అడవులు will help students prepare well for the exams.

AP Board 7th Class Social 2nd Lesson Important Questions and Answers అడవులు

ప్రశ్న 1.
ప్రపంచంలోని శీతోష్ణస్థితి మండలాల గురించి క్లుప్తంగా వివరింపుము.
జవాబు:
ప్రపంచములో వివిధ శీతోష్ణస్థితి ప్రాంతాలు ఉన్నాయి. ఉష్ణోగ్రత, అవపాతం ఆధారముగా భూగోళ శాస్త్రవేత్తలు శీతోష్ణస్థితి మండలాలను నిర్వచించారు. వీరి ప్రకారం ప్రపంచములో ఏడు శీతోష్ణస్థితి మండలాలు కలవు.
1. భూమధ్యరేఖ / ఉష్ణమండల శీతోష్ణస్థితి ప్రాంతం :
భూమధ్యరేఖకు ఇరువైపులా 5° – 10° ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్నది. ఈ ప్రాంతం సగటున 150 సెం.మీ.లతో అధిక అవపాతాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రాంతములో వృక్షాల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు విస్తారముగా ఉన్నాయి. దట్టమైన అడవులతో ఉన్న ఈ ప్రాంతాన్ని సెల్వాలు అంటారు. అల్ప జనాభా గల ప్రాంతాలలో ఇది ఒకటి. ఆమెజాన్లోని రెండియన్లు, కాంగో పరీవాహకంలోని పిగ్మీలు వంటి ఆటవిక సమూహాలు ఈ ప్రాంతములో నివసిస్తున్నారు. వేట, పోడు వ్యవసాయం వంటి ఆదిమ జీవన శైలిని వీరు కొనసాగిస్తున్నారు.

2. సవన్నాలు :
భూమధ్యరేఖకు ఇరువైపులా 10° – 20° ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. ఇక్కడి సహజ వృక్షజాలం భూమధ్యరేఖకు సమీపముగా ఉన్నచోట దట్టమైన అడవులుగాను, ఉన్నత అక్షాంశాల వైపుగా వెళ్ళే కొద్దీ ఎత్తైన గడ్డిభూములుగా (1-6 మీ.) మారుతాయి. పశుపోషణ ఇక్కడి ప్రజల ప్రధాన జీవనోపాధి.

3. ఎడారి ప్రాంతాలు :
ఖండాలకు పశ్చిమ వైపున 15° – 30° ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఇవి విస్తరించి వున్నాయి. సహారా ఎడారి ఈ ప్రాంతములో అతి పెద్ద ఎడారి. ఇక్కడి వృక్షజాలం దట్టమైన బెరడుతో, చిన్న ఆకులతో, ఆకులు లేకుండా ముళ్ళ పొదలుగా వుంటాయి. ఇక్కడి ప్రజలు గొర్రెలు, మేకలు, ఒంటెలు మరియు గుర్రాలను పోషించి వాటి నుండి పాలు, మాంసం, ఉన్ని పొందుతారు.

4. మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతాలు :
అంటార్కిటికా మినహా మిగిలిన అన్ని ఖండాల పశ్చిమతీరాలలో ఈ విధమైన శీతోష్ణస్థితి విస్తరించి వున్నది. వేసవిలో పొడి వాతావరణము, శీతాకాలములో ఒక మాదిరినుండి అధిక వర్షపాతం ఇక్కడి ప్రధాన లక్షణము. ఆలివ్, కార్క్ వంటి వృక్షాలతో ఇక్కడి వృక్షజాలం విశాలపత్ర సతత హరిత అరణ్యాలుగా ఉంటుంది. ఇక్కడి విశాల క్షేత్రాలలో వాణిజ్య వ్యవసాయం మరియు పశుపోషణ అధునాతన యంత్రాల ద్వారా చేపడతారు.

5. స్టెప్పీ శీతోష్ణస్థితి :
శీతోష్ణస్థితి విశాల ఖండాంతర్గత మైదానాలలో ఇవి విస్తరించి వున్నాయి. అధిక ఉష్ణోగ్రత, చలి కలిగిన ఈ అర్థ శుష్క ప్రాంతాల్లో వర్షపాతం చాలా తక్కువ. కావున ఇక్కడి వృక్షజాలం గడ్డిభూములు, చిన్నపొదలుగా వుంటుంది. విస్తృత వ్యవసాయం ఇక్కడ అమలులో వుంది.

6. టైగా ప్రాంతం :
ఇవి ఉత్తరార్ధ గోళంలో 55° – 70° ఉత్తర అక్షాంశాల మధ్య ఇది విస్తరించి వుంది. ప్రపంచములో అధిక వాతావరణ వ్యత్యాసాలు కలిగి ఉన్న ప్రాంతాలలో ఇది ఒకటి. ఇది ప్రపంచంలో అతి పెద్ద సతత హరిత అరణ్యాలు కలిగిన ప్రాంతం. ఇక్కడ ఫర్ వాణిజ్యము ఎంతో ముఖ్యమైన మరియు ఆకర్షణీయమైన కార్యకలాపము.

7. టండ్రా శీతోష్ణస్థితి :
ఆర్కిటిక్ – ధృవ ప్రాంతాల మధ్య విస్తరించిన ఈ ప్రాంతములో చలి చాలా ఎక్కువ. చెట్లు పెరగడానికి ఇవి అననుకూలం. ఇక్కడి ప్రజలు తమ ఆహారం కోసం జంతువులపై ఆధారపడతారు.

AP 7th Class Social Important Questions Chapter 2 అడవులు

ప్రశ్న 2.
అడవి అనగానేమి? అడవుల యొక్క ఉపయోగాలను తెల్పండి.
జవాబు:

  1. విశాల ప్రాంతంలో సహజ పరిస్థితులలో చెట్లు, పొదలతో కూడిన నిర్దిష్ట ప్రాంతాన్ని అడవి అని పిలుస్తారు.
  2. ఒక ప్రాంతములోని వర్షపాతము, నేలలు, నీటి ప్రవాహ నియంత్రణ, పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నివారణ, పర్యావరణ సమతౌల్యత మొదలైన వాటిని అడవులు ప్రభావితము చేస్తాయి.
  3. ఆదిమ జాతుల మనుగడకు అడవులు ప్రధాన స్థావరాలు.
  4. కలప, ఇతర విలువైన అటవీ ఉత్పత్తులు మనకు లభిస్తాయి.
  5. అడవులు వన్యప్రాణులకు సహజ నివాసాలు మరియు మానవ జీవనోపాధులకు నిలయాలు.
  6. ముడి పదార్థాలైన కలప, వెదురు, బీడీ ఆకులు, తేనె, లక్క మూలికలు, రంగుల వంటి ఉత్పత్తులను అడవుల నుండి పొందుతున్నాము.
  7. పశువుల మేత కొరకు, ఆటవిక జాతులకు నివాసాలుగా, పోడు వ్యవసాయం చేయు భూములుగాను మరియు ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలుగా అడవులు ఉపయోగపడుతున్నాయి.

ప్రశ్న 3.
భారత ప్రభుత్వం అడవులను ఎన్ని రకాలుగా విభజించింది? అవి ఏవి?
జవాబు:
భారత ప్రభుత్వము పరిపాలన సౌలభ్యం కొరకు అడవులను మూడు రకాలుగా విభజించింది.

  1. రిజర్వు అడవులు
  2. రక్షిత అడవులు
  3. వర్గీకరించని అడవులు

1. రిజర్వు అడవులు :
వేట, మేత వంటి కార్యకలాపాలను ప్రభుత్వము ఇక్కడ నిషేధించింది. ఈ అడవులు ప్రభుత్వాల ఆధీనములో ఉంటాయి.

2. రక్షిత అడవులు :
ప్రత్యేక వృక్షజాలం, జంతుజాలాలను రక్షించడానికి ఏర్పాటు చేయబడ్డ అడవులు ఎక్కువ నష్టం కలిగించడానికి అనుమతించవు.

3. వర్గీకరించని అడవులు :
ఈ అడవులలో జీవనోపాధి కొరకు అవసరమైన అటవీ ఉత్పత్తులు సేకరించవచ్చు మరియు పశువులను మేపుకోవచ్చును.

ప్రశ్న 4.
మడ అడవులు లేదా తీర ప్రాంత అడవుల గురించి వివరించుము.
జవాబు:
AP 7th Class Social Important Questions Chapter 2 అడవులు 1
మడ అడవులు / తీరప్రాంత అడవులు :

  1. ఈ అడవులను చిత్తడి అడవులు అని కూడా అంటారు.
  2. సముద్ర అలలచే ప్రభావితమయ్యే నేలలు కలిగిన తీర ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి.
  3. ఇక్కడి చెట్లు సముద్రపు లవణీయతను, అలల తాకిడిని తట్టుకునేలా వుంటాయి.
  4. శ్వాసవేళ్ళు, తీగ జాతి చెట్లు ఇక్కడ ప్రధానమైనవి. మడ వృక్షాలు, తెల్లమడ, సుందరి, పొన్న, బొడ్డు పొన్న మొదలైనవి ఇక్కడ పెరుగుతాయి.
  5. ఈ అడవుల సమీపములో చేపలు విరివిగా లభిస్తాయి.
  6. తీర ప్రాంతాలలోను, వెనుకకు మరలిన జలాలలోనూ, పశ్చిమ బెంగాల్ లోని సుందర్బన్ ప్రాంతాలలోను ఈ అడవులు విస్తరించాయి.

ప్రశ్న 5.
భారతదేశ అవుట్ లైన్ పటంలో మడ అడవులు గల ప్రాంతాలను గుర్తించుము.
జవాబు:
AP 7th Class Social Important Questions Chapter 2 అడవులు 2

ప్రశ్న 6.
పర్వత ప్రాంత అడవుల గురించి వివరించుము.
జవాబు:
AP 7th Class Social Important Questions Chapter 2 అడవులు 3
పర్వత ప్రాంత అడవులు :

  1. పర్వతాలు మరియు కొండ ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి.
  2. చల్లని శీతోష్ణస్థితి గల ప్రాంతాలలో ఈ అడవులు విస్తరించాయి.
  3. ఇక్కడి వృక్షాల ఆకులు సన్నని సూదంటు ఆకారములోనూ, త్రిభుజాకారంలోనూ ఉంటాయి.
  4. మంచు, వర్షపు నీరు సులువుగా జారిపోయేలా ఉంటాయి. హిమాలయ ప్రాంతంలో వివిధ రకాలైన శృంగాకారపు అడవులు ఉన్నాయి.
  5. స్పర్, ఫర్, విల్లో, దేవదారు, సిల్వర్ ఫర్ మొదలైన వృక్షాలు, ధృవపు జింక, మంచు చిరుత ఇక్కడి ప్రధాన జంతు జాలము.

ప్రశ్న 7.
ఆంధ్రప్రదేశ్ లోని అడవుల గురించి విపులంగా తెలియజేయండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లోని అడవులను ప్రధానంగా వర్షపాతం, వాతావరణం మరియు నేలల రకం ఆధారంగా నాలుగు రకాలుగా విభజించారు.

  1. తేమతో కూడిన ఆకురాల్చే అడవులు
  2. శుష్క (పొడి) ఆకురాల్చే అడవులు
  3. పొద అడవులు (ముల్లు అడవులు)
  4. టైడల్ అడవులు / డెల్టా అడవులు

1. తేమతో కూడిన ఆకురాల్చు అడవులు :
125 నుండి 200 సెం.మీ వర్షపాతం గల ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి. ఏజెన్సీ ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలలో ఇవి విస్తరించి ఉన్నాయి. వేగి, ఏగిస, వెదురు, మద్ది, బండారు, జిట్టెగి మరియు సాల వృక్షాలు ఈ అడవులలో పెరిగే చెట్లు.

2. శుష్క ఆకురాల్చు అడవులు :
75 నుంచి 100 సెం.మీ. వర్షపాతం గల ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి. వై.యస్.ఆర్ కడప, కర్నూలు, అనంతపూరు, చిత్తూరు జిల్లాలలో ఈ అడవులు కలవు. ఇక్కడి ముఖ్య వృక్షాలు మద్ది, టేకు, బిల్లు, వెలగ, ఏగిస, వేప, బూరుగ, మోదుగ మరియు ఎర్రచందనం.

3. చిట్టడవులు :
75 సెం.మీ కంటే ఎక్కువ వర్షం కురిసే ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి. రాయలసీమ జిల్లాలయిన కడప, కర్నూలు, అనంతపూర్ మరియు చిత్తూరు జిల్లాలలో (రాయలసీమ) ఈ అడవులు పెరుగుతాయి. ఈ అడవులలో తుమ్మ, బులుసు, రేగు, చందనం, వేప మొదలగు చెట్లు పెరుగుతాయి.

4. మడ అడవులు / డెల్టా అడవులు :
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం 974 కి.మీ. ఈ తీరం వెంబడి ఈ అడవులు ఉన్నాయి. ఉదాహరణ, తూర్పు గోదావరిలోని కోరంగి ప్రాంతం. ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఉరడ, మడ, తెల్ల మడ, పత్రి తీగ, బలబండి తీగ చెట్లు ఇక్కడ పెరుగుతాయి.

AP 7th Class Social Important Questions Chapter 2 అడవులు

ప్రశ్న 8.
అటవీ జాతి అనగానేమి? ఆంధ్రప్రదేశ్లో గిరిజన తెగలు ఏవి?
జవాబు:

  1. సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక, మాండలిక సారూప్యాలు కలిగిన కుటుంబాలు సంప్రదాయ సమూహాలుగా ఉన్న సామాజిక విభాగాన్ని అటవీ జాతి అంటారు.
  2. కొన్ని సమూహాలను ఆదిమ జాతులుగా గుర్తిస్తారు. వారు బోండోలు, చెంచులు, కొండ రెడ్లు, కొండ సవరలు. వీరు కాక గోండు, ఎరుకల మరియు యానాదులు అనబడే మరికొంత మంది ఆదిమ జాతుల వారు కూడ కలరు.

ప్రశ్న 9.
బ్రిటిషు వారి పాలనలో అడవుల యాజమాన్యం గురించి తెల్పండి.
జవాబు:

  1. బ్రిటిష్ వారు 1864లో అటవీశాఖను ఏర్పాటు చేశారు.
  2. ఇది ఆటవిక జాతుల వారిని అడవులలో స్వతంత్రంగా సంచరించడాన్ని నిరోధించింది.
  3. బ్రిటిష్ అటవీశాఖ అధికారులు వీరి నిస్సహాయతను ఆసరాగా చేసుకొని నిరంతరం మోసం చేసి హింసించారు.
  4. అడవులపై తమ హక్కుల కోసం గిరిజనులు పోరాటం చేశారు.
  5. గిరిజనుల కీలక పాత్ర లేనిదే వన సంరక్షణ సాధ్యం కాదని చివరకు ప్రభుత్వం గుర్తించింది.

ప్రశ్న 10.
సామాజిక అడవుల పెంపకం అనగానేమి? దీని ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
జవాబు:

  1. బంజరు భూములలో, ఇతర ప్రదేశాలలో మొక్కలు నాటడం, అడవులను సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని సామాజిక మరియు గ్రామ అభివృద్దులను పెంపొందించడం కోసం చేపట్టిన పథకాన్ని సామాజిక అడవుల పెంపకం అనవచ్చు.
  2. స్థానిక సమాజాల ప్రయోజనాల కొరకు అడవుల నిర్వహణ చేపట్టడమే సామాజిక అడవుల పెంపకం. ఇందులో భాగంగా వాయుకాలుష్యాన్ని తగ్గించి వివిధ రకాల పరిశ్రమలను ప్రోత్సహించడం కొరకు ప్రభుత్వం సామాజిక వనీకరణను చేపట్టింది. పారిశ్రామిక ప్రాంతాలు, బంజరు భూములలో పచ్చదనాన్ని పెంచడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.

ప్రశ్న 11.
అటవీ హక్కుల చట్టం-2006 గురించి వివరించండి.
జవాబు:
అటవీ హక్కుల చట్టం-2006 :

  1. అటవీ హక్కుల చట్టం, భారతదేశం లేదా షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం, గిరిజన హక్కుల చట్టం లేదా గిరిజన భూ చట్టం వంటి ఇతర పేర్లతో కూడా పిలువబడుతుంది.
  2. ఇది అడవులలో నివసించే సమాజాల హక్కులతో వ్యవహరిస్తుంది.
  3. హక్కులు దేశంలో వలస రాజ్యాల కాలం నుండి అటవీ చట్టాలను కొనసాగించడం వల్ల సంవత్సరాలుగా వారికి భూమి మరియు ఇతర వనరులపై హక్కులు నిరాకరించబడ్డాయి.
  4. డిసెంబర్ 2006లో, అటవీ హక్కుల చట్టం ఆమోదించబడింది.
  5. ఇది సాంప్రదాయ అటవీ నివాస వర్గాల హక్కులకు చట్టపరమైన గుర్తింపును ఇచ్చింది. వలస రాజ్యాల కాలం నాటి అటవీ చట్టాల వల్ల జరిగిన అన్యాయాన్ని పాక్షికంగా సరిచేసింది.

6) అటవీ హక్కుల చట్టం ప్రాముఖ్యత -2006 :
తరతరాలుగా ఇటువంటి అడవులలో నివసిస్తున్న అటవీ నివాస షెడ్యూల్డ్ తెగలు (ఎఫ్ డిఎటి) మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల (ఒటిఎడ్జి) అటవీ హక్కులను, అటవీ భూముల ఆక్రమణలను ఈ చట్టం గుర్తిస్తుంది.

7) ఈ చట్టం FDST, OTFD లకు సుస్థిర ఉపయోగము, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సమతౌల్య నిర్వహణా బాధ్యతలను, అధికారాన్ని కట్టబెడుతుంది.
8) అటవీ పర్యావరణ వ్యవస్థ యొక్క మనుగడ మరియు స్థిరత్వానికి కారకులైన ఎడిఎస్, ఒటిఎడిలకు వలస రాజ్యాలు చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఇది ప్రయత్నిస్తుంది.

ప్రశ్న 12.
వన సంరక్షణకై ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు/పథకాలు ఏవి?
జవాబు:

  1. భూమిపై అడవులు కీలక పాత్రను పోషిస్తాయి. కనుక సామాజిక అడవుల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
  2. అడవుల సంరక్షణ, చెట్లను నాటడంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందింపచేస్తున్నది.
  3. ప్రజల సహకారంతో జనావాసాలు, బంజరు భూములలో చెట్లను నాటే కార్యక్రమం చేపట్టాలి. వన సంరక్షణ కొరకు వన మహోత్సవం, వనం-మనం వంటి కార్యక్రమాలు రూపొందించబడుతున్నాయి.
  4. వన మహోత్సవంలో భాగంగా మొక్కలను, విత్తనాలను పంపిణీ చేస్తున్నారు.

ప్రశ్న 13.
చెంచు తెగ గురించి నీకు ఏమి తెలుసు?
జవాబు:
చెంచులు ఒక ఆదిమ తెగ. వీరి సాంప్రదాయ జీవన విధానం వేట మరియు ఆహార సేకరణపై ఆధారపడి ఉంటుంది. వారు చెంచు భాష మాట్లాడుతారు. వీరు నల్లమల అడవిలో ఉంటారు.
AP 7th Class Social Important Questions Chapter 2 అడవులు 4

మీకు తెలుసా?

7th Class Social Textbook Page No. 43

భారత ప్రభుత్వము పరిపాలన సౌలభ్యం కొరకు అడవులను మూడు రకాలుగా విభజించింది.
1. రిజర్వు అడవులు
2. రక్షిత అడవులు
3. వర్గీకరించని అడవులు

1. రిజర్వు అడవులు :
వేట, మేత వంటి కార్యకలాపాలను ప్రభుత్వము ఇక్కడ నిషేధించింది. ఈ అడవులు ప్రభుత్వాల ఆధీనములో ఉంటాయి.

2. రక్షిత అడవులు :
ప్రత్యేక వృక్షజాలం, జంతుజాలాలను రక్షించడానికి ఏర్పాటు చేయబడ్డ అడవులు ఎక్కువ ‘నష్టం కలిగించడానికి అనుమతించబడవు.

3. వర్గీకరించని అడవులు :
ఈ అడవులలో జీవనోపాధి కొరకు అవసరమైన అటవీ ఉత్పత్తులు సేకరించవచ్చు మరియు పశువులను మేపుకోవచ్చును.

7th Class Social Textbook Page No. 47

ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ (ISFR) – 2019 ప్రకారము * భారతదేశములో 8,07,276 చ.కి.మీ. విస్తీర్ణం మేర భూమి అటవీ ప్రాంతములో కప్పబడి వుంది. ఇవి మొత్తము భూభాగములో 24.56% ప్రపంచ అటవీ విస్తీర్ణములో భారతదేశము 10వ స్థానంలో వుంది.

7th Class Social Textbook Page No. 53

ఎర్రచందనం కడప, చిత్తూరు జిల్లాలలోని శేషాచలం అడవులలో పెరిగే అరుదైన వృక్ష జాతి. ఉత్పత్తి మరియు ఎగుమతులలో ఈ వృక్షానికి ఆర్థిక వ్యవస్థలో విశేష స్థానం ఉంది.

7th Class Social Textbook Page No. 53

కడప జిల్లాలోని శ్రీలంకమల్లేశ్వర అభయారణ్యంలో నివసించే కలివి కోడిని ఐయుసిఎన్ (ప్రకృతి మరియు సహజ వనరుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ యూనియన్) అరుదైన జాతులుగా తెలియజేసింది.
AP 7th Class Social Important Questions Chapter 2 అడవులు 5

AP 7th Class Social Important Questions Chapter 2 అడవులు

7th Class Social Textbook Page No. 55

చెంచులు ఒక అదిమ తెగ. వీరి సాంప్రదాయ జీవన విధానం వేట మరియు ఆహార సేకరణపై ఆధారపడి ఉంటుంది. వారు చెంచు భాష మాట్లాడుతారు. వీరు నల్లమల అడవిలో ఉంటారు.
AP 7th Class Social Important Questions Chapter 2 అడవులు 4
చెంచులు

స్వాతంత్ర్యానికి ముంది భారతదేశాన్ని పాలించిన బ్రిటీష్ వారు 1864 మరియు 1878లలో రెండు చట్టాలు చేసి అటవీశాఖను ఏర్పాటు చేసి దానికి అడవులపై నియంత్రణను అప్పగించారు. అడవులను రిజర్వ్ మరియు రక్షిత అడవులుగా వర్గీకరించడం ద్వారా గిరిజనులు మరియు అటవీ వినియోగదారులకు సాంప్రదాయంగా వస్తున్న హక్కులను ఈ చట్టాలు అనుమతించలేదు. రిజర్వ్ అడవులలోకి ఎవరు ప్రవేశించడానికి అనుమతి లేదు. రక్షిత అడవులను ప్రజలు ఉపయోగించుకోవచ్చు. వారు తమ స్వంత ఉపయోగం కోసం కలప మరియు చిన్న అటవీ ఉత్పత్తులను తీసుకోవచ్చు మరియు పశువులను మేపుకోవచ్చు. కాని, ఇక్కడ కూడా చెట్లను కొట్టడం పై అనేక షరతులు ఉన్నాయి. అటవీశాఖ విధించిన పరిమితికి మించి పశువులను మేపకూడదు. 1988 జాతీయ అటవీ విధాన ప్రకటన వన సంరక్షణ, పునరుజ్జీవనం, అడవుల అభివృద్ధిలో గిరిజనులను భాగస్వాములను చేయడం అనేది ముఖ్యమైన అంశంగా ప్రకటించింది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎకో-టూరిజం (పర్యావరణ పర్యాటకం) పేరుతో నూతన సామాజిక ఆధారిత పర్యావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని స్థానిక గిరిజనులను భాగస్వామ్యం చేస్తూ ప్రస్తుత ఎకో-టూరిజం విధానాన్ని బలోపేతం చేసింది.

7th Class Social Textbook Page No. 59

సంవత్సరంచట్టం / సంఘటన
1894అడవుల చట్టం
1950అడవుల పండుగ
1952జాతీయ అటవీ విధానం
1980వన సంరక్షణ చట్టం
2006అటవీ హక్కులు చట్టం

AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి

These AP 7th Class Social Important Questions 1st Lesson విశ్వం మరియు భూమి will help students prepare well for the exams.

AP Board 7th Class Social 1st Lesson Important Questions and Answers విశ్వం మరియు భూమి

ప్రశ్న 1.
విశ్వం ఆవిర్భావం గురించిన సిద్ధాంతమును వివరించండి.
జవాబు:
విశ్వం ఆవిర్భావం గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో ఒక సిద్ధాంతం మహా విస్ఫోటన సిద్ధాంతం (బిగ్ బ్యాంగ్).

మహా విస్ఫోటన సిద్ధాంతం :
విశ్వం యొక్క ఆవిర్భావం గురించి మహా విస్పోటన (బిగ్ బ్యాంగ్) సిద్ధాంతాన్ని మొదట జార్జి లెమైటర్ అనే ఒక బెల్జియం దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ప్రస్తుత విశ్వం 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికీ విస్తరిస్తోందని అతను గట్టిగా నమ్మాడు. ఆ చిన్న అణువు అనంతమైన ఉష్ణోగ్రత మరియు అనంత సాంద్రత కలిగిన చిన్న బంతిలా ఉండేది.

అణువు యొక్క ఉష్ణోగ్రత మరియు సాంద్రత పెరిగిన కారణంగా, అది పేలిపోయి విశ్వమంతా చిన్న ముక్కలుగా విసిరివేయబడింది. ఫలితంగా విశ్వంలో నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఖగోళ వస్తువులు ఏర్పడ్డాయి. విశ్వం యొక్క విస్తరణ నేటికీ జరుగుతూనే ఉంది.
AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి 1

ప్రశ్న 2.
సౌర కుటుంబ ఆవిర్భావం గురించిన సిద్ధాంతాలను తెల్పండి.
జవాబు:
సౌర కుటుంబం ఆవిర్భావం గురించి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలు.
1) భూ కేంద్రక సిద్ధాంతం :
ఈ సిద్ధాంతాన్ని టాలెమి అనే ఈజిప్టు ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం భూమి మధ్యలో ఉండి సూర్యుడు మరియు ఇతర ఖగోళ వస్తువులు దాని చుట్టూ తిరుగుతాయి. ఈ సిద్ధాంతం భూమి విశ్వానికి కేంద్రమని నమ్ముతుంది.

2) సూర్య కేంద్రక సిద్ధాంతం :
ఈ సిద్ధాంతాన్ని పోలిష్ ఖగోళ శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్ ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం, సూర్యుడు కేంద్రస్థానంలో ఉండి, గ్రహాలు, ఉపగ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులు సూర్యుని చుట్టూ తిరుగుతాయి.
AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి 2

3) గ్రహాలు మరియు ఉపగ్రహాలు :
నీహారిక (నెబ్యులర్) పరికల్పన ప్రకారం, గ్రహాలు సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి ఏర్పడ్డాయి. మన సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలున్నాయి. వాటిలో భూమి ఒకటి.

AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి

ప్రశ్న 3.
సౌర కుటుంబం గురించి మీకేమి తెలుసో వ్రాయండి.
జవాబు:

  1. మన సౌర వ్యవస్థ సూర్యుడు మరియు ఎనిమిది గ్రహాలతో రూపొందించబడింది.
  2. ఆ గ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు (అంగారకుడు), బృహస్పతి (గురుడు), శని, వరుణుడు మరియు ఇంద్రుడు.
    AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి 3
  3. సౌర వ్యవస్థలో ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహశకలాలు మరియు ఉల్కలు కూడా ఉన్నాయి.
  4. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 4.6 మిలియన్ సంవత్సరాల క్రితమే మన సౌరకుటుంబం ఆవిర్భవించింది.

ప్రశ్న 4.
పర్యావరణం అంటే ఏమిటో విపులంగా తెలియజేయండి.
జవాబు:

  1. ఒక ప్రాంతంలోని మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులతో కూడిన అన్ని జీవ మరియు జీవరహిత కారకాలతో కలిసి పనిచేసే సహజ వ్యవస్థను పర్యావరణం అని అంటారు.
  2. ఇది సహజ మరియు మానవ నిర్మిత అంశాల రెండింటి కలయిక.
  3. ఇది మన ప్రాథమిక జీవిత సహాయక వ్యవస్థ. ఇది, మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం, జీవించే భూమి వంటి వాటిని మనకు అందిస్తుంది.
  4. ఇది కంటికి కనిపించని ఎన్నో రకాల సూక్ష్మజీవులు, జంతువులు, మొక్కలు మరియు మానవులను కలిగి ఉంటుంది.

ప్రశ్న 5.
శిలావరణము అనగానేమి? శిలావరణము గురించి వివరించండి.
జవాబు:

  1. భూమి యొక్క రాతి పొరను శిలావరణము అంటారు.
  2. శిలావరణము (లిథోస్పియర్) అనే పదం “లిథో” మరియు “స్పెరా” అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది.
  3. లిథో అంటే “రాయి” మరియు “స్పెరా” అంటే “గోళం” లేదా “బంతి” అని అర్థం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న “ప్రపంచ ధరిత్రీ దినోత్సవం”.
  4. ఇది రాళ్ళు మరియు ఖనిజాలతో రూపొంది, మట్టి యొక్క పలుచని పొరతో కప్పబడి ఉంటుంది.
  5. ఇది పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, డెల్టాలు, ఎడారులు మొదలైన వివిధ భూభాగాలతో కూడిన క్రమరహిత ఉపరితలం.
  6. ఈ భూస్వరూపాలను మూడు శ్రేణులుగా విభజించారు. మొదటి శ్రేణి, రెండవ శ్రేణి మరియు మూడవ శ్రేణి.

ప్రశ్న 6.
పర్యావరణం యొక్క అంశాలను తెలుపు ఫ్లో చార్టును గీయండి.
జవాబు:
పర్యావరణం యొక్క అంశాలను సహజ, మానవ మరియు మానవ నిర్మిత అంశాలు అని మూడు భాగాలుగా వర్గీకరించవచ్చు.

AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి 4

ప్రశ్న 7.
భూమి యొక్క అంతర్భాగంను విశదీకరించండి.
జవాబు:

  1. మనం గమనిస్తే భూమి నిర్మాణం కోడి గ్రుడ్డుకి ఉన్నటువంటి వివిధ పొరల మాదిరిగా ఉంటుంది.
  2. ఈ పొరలు ఒకదానికొకటి మందంలో మరియు వాటి భౌతిక మరియు రసాయన కూర్పులో భిన్నంగా ఉంటాయి.
    AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి 5
  3. భూమి మూడు పొరలను కలిగి ఉంటుంది. వాటికి ఈ క్రింది విధంగా పేర్లు పెట్టారు.
    1) భూ పటలము,
    2) భూ ప్రావారము,
    3) భూ కేంద్రము.

ప్రశ్న 8.
జలావరణము అనగానేమి? వివరంగా తెలియజేయండి.
జవాబు:

  1. భూమి యొక్క ఉపరితలంలో ఉన్న అన్ని నీటి వనరులను సమిష్టిగా జలావరణము అంటారు.
  2. “హైడ్రోస్పియర్” (జలావరణము) అనే పదం ‘హైడర్’ మరియు ‘స్పెరా’ అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. ‘హైడర్’ అంటే నీరు మరియు ‘స్పెరా’ అంటే గోళం లేదా బంతి అని అర్థం.
  3. జలమును సమృద్ధిగా కలిగి ఉన్న ఏకైక గ్రహం కనుక భూమిని “జలయుత గ్రహం” అని పిలుస్తారు.
  4. మన గ్రహం మీద జీవం యొక్క ఉనికి ప్రధానంగా నీరు మరియు గాలి పైన ఆధారపడి ఉంది.
  5. భూమి యొక్క ఉపరితలం సుమారు 2/3 వ వంతు (71%) నీటితో ఆవరించి ఉంది.
  6. కేవలం 1% నీరు మాత్రమే మన అవసరాలకు ఉపయోగపడుతుంది.
  7. మిగిలిన 99% నీరు మంచు, ఉప్పు నీరు మొదలగు రూపంలో ఉంటుంది.
  8. జలావరణము నదులు, సరస్సులు, సముద్రాలు, మహాసముద్రాలు వంటి వివిధ రకాల నీటి వనరులను కలిగి ఉంటుంది.
  9. నీటిలో కొంత భాగం భూమి లోపల రాళ్ళ పొరల మధ్య లోతుగా ఉంటుంది. దీనిని భూగర్భ జలం అంటారు.
  10. జలావరణము అన్ని జీవులకు నీటిని అందిస్తుంది.

AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి

ప్రశ్న 9.
వాతావరణంలోని వాయువులు మరియు పొరలను (ఆవరణాలను) గూర్చి తెల్పండి.
జవాబు:
AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి 6

  1. వాతావరణం అనేక వాయువుల మిశ్రమం.
  2. నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలోని ముఖ్యమైన వాయువులు.
  3. ఆక్సిజన్ “ప్రాణ వాయువు”గా పరిగణించబడుతుంది. ఆక్సిజన్ లేకుండా ప్రాణం లేదు.
  4. వృత్త రేఖా చిత్రం (వాతావరణంలోని వాయువులు) మీకు వాతావరణం యొక్క వివిధ వాయువుల శాతాన్ని తెలుపుతుంది.
  5. వాతావరణం సాధారణంగా భూమి యొక్క ఉపరితలం నుండి ఐదు పొరలుగా విభజించబడింది.
  6. అవి ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మెసో ఆవరణము, ధర్మో ఆవరణము మరియు ఎక్సో ఆవరణము.
  7. వీటి మధ్య కచ్చితమైన సరిహద్దు లేదు.

ప్రశ్న 10.
మానవ పర్యావరణం, మానవ నిర్మిత పర్యావరణంల గురించి వివరించండి.
జవాబు:

  1. మానవులతో ఏర్పడిన పరిసరాలను మానవ పర్యావరణం అంటారు. ఇది వ్యక్తి, కుటుంబం, సమాజం, మత, విద్య, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను కలిగి ఉంటుంది.
  2. చారిత్రకంగా స్థిర జీవితం ఏర్పడిన తరువాత, మానవులు ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించడం ప్రారంభించారు.
  3. ఇది మానవ పర్యావరణ స్థాపనకు దారితీసింది.
  4. మానవ నిర్మిత పర్యావరణం : మానవులు తయారు చేసిన పరిసరాలను మానవ నిర్మిత పర్యావరణం అంటారు.
  5. ఇది భవనాలు, కర్మాగారాలు, ఉద్యానవనాలు, రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టులు మరియు స్మారక చిహ్నాలు మొదలైన వాటిని కలిగి ఉంటుంది.

ప్రశ్న 11.
కాలుష్యం అనగానేమి? వాయు కాలుష్య కారకాలను పేర్కొని, వాయు కాలుష్య ప్రాధాన్యతను తెల్పండి.
జవాబు:

  1. పర్యావరణంలోనికి వివిధ రకాల మలినాలు చేరడాన్ని కాలుష్యం అంటారు.
  2. ఇది గాలి, నీరు మరియు నేల యొక్క రసాయన, భౌతిక మరియు జీవ లక్షణాలలో అవాంఛనీయ మార్పు తెస్తుంది.
  3. ఇది అన్ని జీవులలో ఆరోగ్య సమస్యలకు కారణమౌతుంది.
  4. వాయు కాలుష్యం యొక్క కారకాలు : బూడిద, ఉప్పు కణాలు, పొగ, ఆమ్ల వర్షం, ఇంధన వినియోగం, పారిశ్రామిక ధూళి, క్లోరో ఫ్లోరో కార్బన్లు మొదలైనవి.
  5. వాయు కాలుష్యం ప్రభావం : గాలి కాలుష్యం వల్ల భూగోళం వేడెక్కడం, వాతావరణంలో మార్పులు రావడం, ఆమ్ల వర్షాలు కురవడం, పొగమంచు ఎక్కువగా కురవడం, వ్యవసాయ క్షేత్రాల క్షీణత, జంతు జాతులు అంతరించిపోవడం మరియు శ్వాసకోశ ఆరోగ్య సమస్యలు వంటివి సంభవిస్తాయి.

ప్రశ్న 12.
నీటి కాలుష్యం అనగా నేమి? దీనికి కారణాలేవి?
జవాబు:
1) నీటి నాణ్యతలో ఏదైనా భౌతిక, జీవ లేదా రసాయనిక మార్పు జరిగి దానివల్ల జీవులపై దుష్ప్రభావం ఏర్పడి నట్లయితే దానిని నీటి కాలుష్యంగా పరిగణిస్తారు.

2) నీటి కాలుష్యానికి కారణాలు :
వివిధ వ్యర్థాల కారణంగా నీరు కలుషితమవుతుంది. అవి, ఎ) పారిశ్రామిక కాలుష్యాలలో అనేక రకాల సేంద్రీయ మరియు అకర్బన కాలుష్య కారకాలు ఉన్నాయి. ఉదా : కాగితం మరియు కాగితపు గుజ్జు, రంగులు వేసే వస్త్ర పరిశ్రమలు. 2) ఎరువులు మరియు రసాయన పరిశ్రమలు కూడా నీటి కాలుష్యం సమస్యను తీవ్రమైన పర్యావరణ సమస్యగా మార్చాయి.

ప్రశ్న 13.
గాలి, నీరు వంటి సహజ వనరులను పరిరక్షించే మార్గాలు తెల్పుము.
జవాబు:
గాలి, నీరు వంటి సహజ వనరులను పరిరక్షించే మార్గాలు:

  1. పర్యావరణ విద్యను పాఠ్యాంశాల్లో తప్పనిసరిగా చేర్చాలి.
  2. పునర్వినియోగం చేయడం మరియు పునరుత్పాదన చేయడం ద్వారా పునరుత్పాదక వనరుల సామర్థ్యాన్ని పెంచడం.
  3. మన అటవీ సంపదను కాపాడటానికి ఎక్కువ మొక్కలను నాటడం.
  4. పునరుత్పాదకతకు వీలు కాని వనరులకు ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం.
  5. బయోగ్యాస్ మరియు బయో ఇంధనాల వాడకాన్ని పెంచడం.
  6. పారిశ్రామిక వ్యర్థాలను నదీ జలాల్లో కలపడం మానుకోవాలి. విలువైన సముద్ర జీవులను కాపాడుకోవడానికి ఇది అవసరమైన చర్య.

ప్రశ్న 14.
విపత్తు అనగానేమి? విపత్తు రకాలు ఏవి? వాటి నివారణ పద్దతులేవి?
జవాబు:
విపత్తు:

  1. విపత్తు అనేది స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయం.
  2. దీనివలన విస్తృతమైన మానవ, శారీరక, ఆర్థిక లేదా పర్యావరణ నష్టం సంభవిస్తుంది.
  3. ఇది సమాజానికి దాని స్వంత వనరులను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని దూరం చేస్తుంది.

విపత్తుల రకాలు :
ఎ) ప్రకృతి విపతులు : ప్రకృతి విపత్తు అనేది ఒక సహజ ప్రక్రియ లేదా దృగ్విషయం . దీనివల్ల ప్రాణ నష్టం, గాయం లేదా ఇతర ఆరోగ్య ప్రభావాలు, ఆస్తి నష్టం, జీవనోపాధి మరియు – సేవను కోల్పోవడం, సామాజిక మరియు ఆర్థిక అంతరాయం లేదా పర్యావరణ నష్టం సంభవిస్తాయి.
ఉదా :
కరువు : ఉపరితల నీరు లేదా భూగర్భ జలాల నీటి సరఫరాలో దీర్ఘకాలిక కొరత ఏర్పడే పరిస్థితి.

బి) మానవకారక విపత్తులు :
ఇవి సాంకేతిక లేదా మానవ ప్రమాదాల పర్యవసానాలు.

నివారణ పద్దతులు :
సంసిద్ధత, ప్రమాదాల నివారణకు భద్రతా చిట్కాలు పాటించడం ద్వారా గాయాలు కాకుండా నివారించడం మరియు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం, విపత్తుల గురించి సమాచారం కలిగి ఉండటం, అత్యవసర పరిస్థితుల్లో సురక్షితమైన ప్రాంతానికి వెళ్లడానికి ప్రణాళికను కలిగి ఉండటం, అత్యవసర వస్తు సామగ్రి అందుబాటులో ఉండటం, ప్రమాదం జరిగినప్పుడు మీ ఇంటిలో సురక్షితమైన ప్రాంతానికి చేరుకోవడం వంటివి ప్రమాద సమయంలో నష్టాలను తగ్గిస్తాయి.

AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి

ప్రశ్న 15.
విపత్తు నిర్వహణ అనగానేమి ? విపత్తు నిర్వహణ ఎలా చేపడతారు?
జవాబు:

  1. ఏదైనా (విపత్తు) ప్రమాదం లేదా ముప్పును నివారించడానికి అవసరమైన లేదా ఉపయోగకరమైన చర్యలతో ప్రణాళిక రూపొందించడం, నిర్వహించడం మరియు అమలు చేయడం యొక్క నిరంతర మరియు సమగ్ర ప్రక్రియను విపత్తు నిర్వహణ అంటారు.
  2. విపత్తు తీవ్రత లేదా పరిణామాలను తగ్గించడం, ఏదైనా విపత్తును ఎదుర్కోవటానికి సంసిద్ధంగా ఉండడం, సామర్థ్యాన్ని పెంపొందించడం, అనుకోకుండా సంభవించే విపత్తుల పట్ల సత్వరంగా స్పందించడం, విపత్తు యొక్క తీవ్రత లేదా పరిమాణాన్ని అంచనా వేయడాన్ని విపత్తు నిర్వహణ అంటారు.
  3. భారతదేశంలో విపత్తు నిర్వహణ ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాలతో బాధపడుతున్న ప్రజలకు ఉపశమనం మరియు పునరావాసం కల్పించడం వంటి అంశాలకు సంబంధించినది.
  4. పదవ ప్రణాళిక : పదవ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ “అభివృద్ధి అంశం”గా నిర్ణయించబడింది. పదవ ప్రణాళిక విపత్తుల నియంత్రణ కోసం విధాన మార్గదర్శకాలు, కార్యాచరణ మార్గదర్శకాలు, నిర్దిష్ట అభివృద్ధి పథకాలు సూచించినది.

మీకు తెలుసా?

7th Class Social Textbook Page No.7

విశ్వం అనే పదం లాటిన్ పదమైన “యూనివర్సమ్” నుండి ఉద్భవించింది. దీని అర్థం “మొత్తం పదార్థం” మరియు “మొత్తం అంతరిక్షం”. విశ్వం సెకనుకు 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నది. ఖగోళ శాస్త్రవేత్త అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర సహజ వస్తువులను అధ్యయనం చేసే వ్యక్తియే ఖగోళ శాస్త్రవేత్త.

7th Class Social Textbook Page No.9

కాంతి సంవత్సరం అనేది దూరాన్ని కొలిచే ఒక ప్రమాణం. కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించగల దూరం. కాంతి సెకనుకు 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి

7th Class Social Textbook Page No.11

“పర్యావరణం” (ఎన్విరాన్మెంట్) అనే పదం ఫ్రెంచ్ పదం అయిన ఎన్నిరోనర్ అంటే ‘పొరుగు’ అనే అర్థం నుంచి ఉత్పన్నమైంది. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

7th Class Social Textbook Page No. 17

శిలావరణము (లిథోస్పియర్) అనే పదం ‘లిథో’ మరియు ‘స్పైరా’ అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. ‘లిథో’ అంటే ‘రాయి’ మరియు ‘స్పైరా’ అంటే “గోళం” లేదా “బంతి” అని అర్థం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22 ను “ప్రపంచ ధరిత్రీ దినోత్సవం”గా జరుపుకుంటాము.

7th Class Social Textbook Page No. 19

హైడ్రోస్పియర్ (జలావరణము) అనే పదం ‘హైడర్’ మరియు ‘స్పైరా’ అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. ‘హైడర్’ అంటే నీరు మరియు ‘స్పైరా’ అంటే గోళం లేదా బంతి అని అర్థం. ప్రతి సంవత్సరం మార్చి 22ను “ప్రపంచ జల దినోత్సవం”గా జరుపుకుంటాము.

7th Class Social Textbook Page No. 21

వాతావరణం (అట్మాస్ఫియర్) అనే పదం ‘అట్మోస్’ మరియు ‘స్పైరా’ అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. ‘అట్మోస్’ అంటే ఆవిరి అని మరియు ‘స్పైరా’ అంటే గోళం లేదా బంతి అని అర్థం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16ను “ప్రపంచ ఓజోన్ దినోత్సవం”గా జరుపుకుంటాము.

7th Class Social Textbook Page No. 23

జీవావరణం (బయోస్పియర్) అనే పదం గ్రీకు పదాలైన ‘బయోస్’ మరియు ‘స్పైరా’ నుండి ఉద్భవించింది. ‘బయోస్’ అంటే జీవం మరియు ‘స్పైరా’ అంటే గోళం లేదా బంతి.

AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి

7th Class Social Textbook Page No. 29

  1. వరద అనేది సాధారణంగా పొడిగా ఉన్న భూమిని మునిగిపోయేలా చేసే అధిక నీటి ప్రవాహం.
  2. భూకంపం అనగా భూమి అంతర్భాగంలో ఆకస్మాత్తుగా విడుదలయ్యే తరంగాల ప్రభావంతో భూమి ఉపరితలం కంపించడం.

AP Board 7th Class Social Solutions 12th Lesson Markets Around Us

SCERT AP 7th Class Social Study Material Pdf 12th Lesson Markets Around Us Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Social 12th Lesson Questions and Answers Markets Around Us

7th Class Social 12th Lesson Markets Around Us Textbook Questions and Answers

Review of Your Previous Knowledge
AP Board 7th Class Social Solutions 12th Lesson Markets Around Us 1

Introductory Pictures
Question 1.
What do the above pictures convey?
Answer:
The picture tells us about a market.

Question 2.
Why do people gather there?
Answer:
People gather there to buy vegetables, fruits and provisions, clothes etc.

Question 3.
What kind of things are sold there?
Answer:
Fruits, vegetables, clothes, provisions etc., which are our daily needs are sold there.

Improve Your Learning

I. Answer the following questions.

Question 1.
What is a market? Briefly explain different types of markets.
Answer:
A market is a place where buyers and sellers interact with each other.

Types of Markets :
Depending upon the nature and geographical location, markets can be broadly classified into two types. ^

They are :
i) Physical Markets and
ii) E- Markets

1) Physical Markets : A Physical market is a place where buyers can physically meet the sellers and purchase the desired items from them.

Types of Physical Markets :

  1. Local market
  2. Regional market
  3. National market
  4. International Market
  5. Neighbourhood market

2) E – Market: We can place orders through our mobile phone or a computer device with internet and can buy a variety of things which we like without stepping out from our home.

AP Board 7th Class Social Solutions 12th Lesson Markets Around Us

Question 2.
“Weekly markets are gradually disappearing”. Do you agree with this statement? If so, mention the reasons.
Answer:
Yes. I agree with the statement by the following reasons.

  1. Heavy competition from Rythu Bazaars.
  2. Weekly market vendors face mass competition from local shops, supermarket like Big Bazars D-Mart, etc.
  3. Lack of Formal Credit Access.
  4. Lack of space for market, etc.

Question 3.
“Festival days increase sales” do you agree, support your answer.
Answer:
Yes, I agree with this statement.

  1. It’s because, Indian festivals are celebrated in a big way.
  2. Every festival has certain rituals to follow and we worship different gods and goddesses.
  3. Then, there is a practice of wearing new clothes while offering puja as it’s new, fresh and gives sacred feeling.
  4. Sd, people buy new clothes during festivals.
  5. People use to do lots of shopping during festivals to decorate their home, they bring new clothes, sweets and gifts for their relatives and friends.

Question 4.
Prepare a list of goods available in a weekly market and compare them with the goods available in neighbour markets.
Answer:

Goods available in Weekly MarketGoods available in Neightbour markets
1) Vegetables1) Books
2) Grains2) Medicines
3) Animals3) Eatables
4) Forest Products, etc.4) Groceries
5) Toys & Kids articles, etc.

Weekly Markets: Shops are temporary.
Neighbour Markets : Shops are permanent.

Question 5.
What is the aim of Consumer Protection Act 2019?
Answer:
It aims to provide timely and effective administration and settlement of consumer dispute in the digital age.

Question 6.
Write any three consumer rights.
Answer:
Following are the Rights of consumers.
1) Right to safety :
Certain goods may cause serious injuries. These goods are pressure cookers, gas cylinders, electrical goods, etc.

If there is any manufacturing defects in the goods, consumers have right to be protected against their fatal risk.

2) Right to be informed :
A consumer has the right to be informed about the quality, quantity and price of the product.

3) Right to Choose :
The consumer has the right to choose the product of his choice out of the alternative products available.

4) Right to seek redressal :
Consumer have the right to seek redressal against unfair trade practices and exploitation.

Question 7.
Prasad makes a living by selling his two buffalo milk. Can it be called business? If so, what advice would you give to expand his business on a large scale?
Answer:
Yes, it is called a business.
Suggestions to expand the business :

  1. He take the loan from the bank for the business.
  2. Provide best shelter to cattle and nutritious fodder.
  3. Find suitable market and transport facilities.
  4. Tie up with diary products, industries, hotels, etc., to increase business opportunity.

II. Choose the correct answers.

1. A person fixed a sum of amount in a National bank and is getting monthly income on it. This income return is known as.
A) Salary
B) Rent
C) Interest
D) Commission
Answer:
C) Interest

2. In which of the following markets are the goods available at cheaper rates.
A) Shopping Mall
B) Weekly Markets
C) E-Market
D) Neighbour Markets
Answer:
B) Weekly Markets

3. Which of the following goods has a demand in the International market?
A) Gold
B) Jewellery
C) Petroleum
D) All the above
Answer:
D) All the above

4. People who buy goods on large scale are known as.
A) Wholesaler
B) Retailer
C) Trader
D) None
Answer:
A) Wholesaler

5. For online shopping we can pay through the following method
A) Net banking
B) Credit Card
C) Debit card
D) All the above
Answer:
D) All the above

III. Match the following.

1. Internet Bankinga) Shopping Malls
2. International Marketb) Producer
3. Farmerc) Petroleurn
4. Multinational Companiesd) Digital Payments
e) Retailer

Answer:

1. Internet Bankingd) Digital Payments
2. International Marketc) Petroleurn
3. Farmerb) Producer
4. Multinational Companiesa) Shopping Malls

IV. Fill in the blanks with suitable words:
1. ……………… is the return for Land.
2. A person who buys goods and services is known as ………………..
3. The persons who finally sell goods to consumers are known as …………….
4. On which day date we observe National consumers day ………………..
Answer:

  1. Rent
  2. Consumer
  3. Retailer
  4. 24th December

7th Class Social 12th Lesson Markets Around Us InText Questions and Answers

7th Class Social Textbook Page No. 76

Question 1.
Collect and display different images of various shopping malls. Ans. Student Activity.
Answer:
Ex:
AP Board 7th Class Social Solutions 12th Lesson Markets Around Us 2 AP Board 7th Class Social Solutions 12th Lesson Markets Around Us 3

7th Class Social Textbook Page No. 77

Question 2.
Distinguish between shopping malls and shopping complexes.
Answer:
Shopping malls :
Large muity storeyed, air-conditions shops on different floors known as malls. We can buy various branded goods. They also have restaurents, banks, multiplexes, spas etc.

Shopping Complex :
The place where people can buy various products in different shops at one places. These may be identified in small towns as well.

7th Class Social Textbook Page No. 79

Question 3.
Visit a wholesale shop and collect the prices of different goods and compare the same with the prices of a retail shop.
Answer:

Prices in a Wholesale shopPrice in Retail shop
1. Cello pin point Ball pen –
(Pack of 10 pens) – 85/-
Cello pin point Ball pen
(Pack to 10 pens) – 100/-
2. Classmate notebook – 31/-Classmate notebook – 50/-
3. Bicycle price – 8,720/-Bicycle price -10,225/-
4. Idly Ravva – 23/-Idly Ravva – 30/-

Question 4.
Collect the products that come from farms and prepare a list. Categorise them into perishable and non-perishable goods.
Answer:
Agriculture commodities in India :

  1. Rice
  2. Milk
  3. Wheat
  4. Mangoes
  5. Guavas
  6. Sugarcane
  7. Cotton
  8. Bananas
  9. Potatoes
  10. Groundnuts, etc.
Perishable GoodsNon-Perishable Goods
1. Milk1. Rice
2. Mangoes2. Wheat
3. Guavas3. Cotton
4. Sugarcane4. Potatoes
5. Bananas5. Ground Nuts

AP Board 7th Class Social Solutions 12th Lesson Markets Around Us

Question 5.
List the goods that are locally cultivated or manufactured in your area.
Answer:
Goods from agricultural lands :
1) Crops – Food crops & Non-Food Crops

  1. Paddy
  2. Sugarcane
  3. Vegetables
  4. Chillies
  5. Cotton
  6. Pulses etc.

2) Manufactured

  1. Bricks
  2. Paper boxes
  3. Kalamkari products
  4. Handicrafts
  5. Milk products etc.

7th Class Social Textbook Page No. 80

Question 6.
Prepare a list of goods and categories them into paid goods and free goods.
Answer:

Free GoodsPaid Goods
Free goods : Air, River water in the village, sunlight, etc.Paid Goods : Pen, notebooks, clothes, etc.
Services : Education in govt, school.
Health treatment in govt, hospital etc.
Services : Education in Private school.
Health treatment in Private hospital.

Question 7.
Collect the information about occupations of different sectors.
Answer:
Our entire economy is divided into 3 sectors.
1) Primary Sector:
Occupations in Primary Sector :

  1. Agriculture
  2. Cattle rearing
  3. Mining
  4. Forestry
  5. Fishing
  6. Poultry, etc.

2) Secondary Sector:
Occupations in Secondary Sector :

  1. Constructional Activities
  2. Manufacturing Activities

3) Tertiary Sector:
Service Sector occupations : Banking, commerce, communications, real estates, doctors, lawyers, teachers, transportation, etc.

Think & Respond

7th Class Social Textbook Page No. 71 & 72

→ Kamala and her son Balu went to the market on Sunday morning. Balu noticed, a variety of fruits and vegetables there. He also noticed fruit and vegetable shops, as well as grocery and fancy shops, Balu’s mother, bought some fruits and vegetables from the market. Meanwhile, Balu asked the fruit seller for mangoes, but he replied that the mangoes were only available during the summer and now they are not available because of the winter. The boy then asked his mother for a cricket bat. So she bought it. Finally, they left the market with the goods they had bought.
Read the above paragraph and answer the questions (1-3).
1. What did Balu observed in the Market?
Answer:
Baiu observed variety of fruits, vegetables, groceries, and fancy shops, and sports goods like cricket bat etc.

2. What did Baiu and his mother bought in the Market?
Answer:
Fruits, vegetables and cricket bat.

3. Write about the market of your home town / village.
Answer:
I live in a small town. In our town there is a small market next to busstand. It contains various shops like groceries, fruit venders, vegetables venders etc. It get vegetables twice a week from Banglore. Once in a week, local market / santa will be arranged next to the market. People with buy various goods on that day.

7th Class Social Textbook Page No. 72

AP Board 7th Class Social Solutions 12th Lesson Markets Around Us 4
Observe the above pictures and answer the following questions (4-7) :

4. Which shop is in the first picture?
Answer:
Cloth shop, various kinds of clothes, dresses are sold here.

5. What are the persons doing in the first picture?
Answer:
Shop keepers, salesmen show their products to consumers and help them to buy their

6. What do you observe in the second picture?
Answer:
Various kinds of goods / groceries required at home are sold here in grocery shops.

7. Name some items kept in the shelves of the general store.
Answer:
Biscuits, paste, bread, soaps, dish clean items, pens, bread, mosquito coils, popcorn, chips packets etc.

7th Class Social Textbook Page No. 73

Question 8.
Differentiate between National and International Markets.
Answer:
National Markets :
The market which have scope for trade through out the country. Goods will be kept available for consumption across the country. Ex : Coconut products have market across the country.

International Market :
Trading of goods and services among the various countries is known as international market. Ex: Oil from OPEC countries, Electronic goods from Japan, China, Spices from India.

AP Board 7th Class Social Solutions 12th Lesson Markets Around Us

Question 9.
What is the importance of local markets?
Answer:

  1. Goods and services kept available for consumption in our neighbourhood areas.
  2. Farmers, small sale producers find market for their products.
  3. Since they are available from nearby places, the goods may be priced low than international or national markets.
  4. They help to circulate flow of money in their habitation and help to achieve prosperity.

Question 10.
Name some spices which are available in your local markets.
Answer:
Pepper, chilli, turmeric, ginger, dry ginger, oregano, pudina, basil, etc.

7th Class Social Textbook Page No. 74

Question 11.
What kind of shops do you observe in your neighbourhood? What do you purchase from them?
Answer:

  1. Grocery shops, medical shops, fancy stores, shops that sell fruits, vegetables, diary products, tailoring materials, etc.
  2. I used to by stationary, milk products, grocery, fruits and vegetables, etc.

Question 12.
What is a digital payment?
Answer:

  1. The method which requires internet bank facility that can be operated through mobile opp or through website.
  2. Amount will be transfered as payment to trader / seller for the product the consumer purchase.

7th Class Social Textbook Page No. 75

Question 13.
What are the advantages of Rythu Bazar?
Answer:

  1. Rythu Bazar is a place provided for farmers to sell their products to the consumers directly.
  2. These markets provide both the producer and consumer get require benefit in their transation by avoiding mediators.
  3. Consumers get quality products.

Question 14.
“The prices of goods are cheaper at weekly markets than the neighborhood markets or shopping malls”. Why?
Answer:

  1. As the shopkeepers need not pay any rents, and shop maintenance cost will be very less.
  2. No need to apy taxes to government.
  3. No middle men to gain more profit.
  4. As consumers pay immediately, they whish to sell their goods at minimum profits.
  5. No cost or less transportation cost.

7th Class Social Textbook Page No. 75 & 76

→ Sanju and Manu made a visit to a shopping mall, the most exciting and fascinating places they have ever visited. They both wondered at the wandering people Tiere and there. They got on to the battery-operated cars and bikes. They made an exciting trip all around the mall onpayment. Later, their eyes fell on the delicious flavours and different cuisines. They enjoyed the taste of cotton candies, milk shakes and ice creams.

They bought new clothes, shoes, caps and belts. They bought so inany soft toys too. They felt very well satisfied in the mall.
Answer the following questions (15-17) based on the above Information.
Question 15.
Why did Sanju and Manu pay for their enjoyment in the mall?
Answer:
They had ride on battery operated cars and bikes. They purchased eatable products, clothes, shoes, caps, belts, soft toys. They spent their time at various a.musement places.

Question 16.
Why did all the shopping malls make such attractive arrangements as mentioned in the above situation of Sanju and Manu?
Answer:

  1. To provide recreation to the people who are vexed with daily routine.
  2. People can buy various products at one place.
  3. To provide tourist attraction.
  4. Kids can find lot of fun by playing various games.

Question 17.
Prepare a list of goods bought by Sanju and Manu.
Answer:
New clothes, shoes, caps, and belts, soft toys, eat sugar candies, milkshakes, and ice creams.

7th Class Social Textbook Page No. 76

Question 18.
What impact do you think shopping malls run by multinational companies will have on retail business?
Answer:

  1. They attract customers by offering discounts and gift vouchers and with wide range of products.
  2. Retail business of the local area get affected very badly.
  3. Money circulation will shift to out of the state/countries that cause decline on local areas.
  4. Small shopkeepers have to close their business.
  5. Increase unemployment cause poverty.

7th Class Social Textbook Page No. 78

Question 19.
How can you buy goods through online markets?
Answer:

  1. We can buy goods through mobile apps, online shopping websites.
  2. We can verify the colour, quality of products from the information and can place order to deliver our place.

AP Board 7th Class Social Solutions 12th Lesson Markets Around Us

Question 20.
What are the advantages and disadvantages of online .shopping?
Answer:
Advantages:

  1. Can find wide range of products with various choices.
  2. Can compare prices and qualities to choose the best.
  3. Can buy at zero physical stress and product will be door delivered.
  4. Can use cash on delivery, pay later etc.

Disadvantages:

  1. Can’t assess the quality accurately.
  2. Prices may high.
  3. Money transactions may get failed or we may be cheated by fraud sellers.
  4. If required, return policies may not easy.

Question 21.
How do you pay for online shopping?
Answer:

  1. We can pay through credit, debit cards by using digital, payment through online transactions or through UPI payments.
  2. Certain companies, shopping sites allow consumers to pay on delivery.

Question 22.
“Buying goods through online market affects the local traders”. Do you agree/disagree with this statement? Give your reasons.
Answer:
Yes, I agree this statement to some extent. Now-a-days the IT revolution made our life easy access through internet. Most of consumers from urban, semi urban areas and few rural areas can buy goods.

This may affect the local shopkeepers business. Money circulation will be shifted from local areas to outside the country. This will destroy our economy.

7th Class Social Textbook Page No. 79

→ Anwar is a wholesale trader of fruits. He purchases different kinds of fruits in bulk from different areas i.e., Mangoes from Nujiveedu and Ulavapadu, Grapes from Ananthapur and Bangalore, Pomegranate from Sholapur, bananas from Mahanandi and Nandhed and stores them in his warehouse. All the retail fruit merchants and hawkers of the town purchase these fruits from Anwar and then they sell the same to the consumers in the town and in the surrounding villages.

Answer the following questions (23, 24) based on the information given in the above box.
Question 23.
How does a retailer get goods for his shop?
Answer:
He purchase the products (fruits) from wholesale traders.

Question 24.
Why do you think a wholesaler is important in the distribution of goods?
Answer:
Wholesale trader buy goods directly from producer or farmer. He brings products from produced areas to market and keep them availiable for retail traders. They provide market to producers of various places.

Question 25.
“Cottage industries are a boon to the rural unemployed”. Discuss.
Answer:

  1. They provide alternate employment to rural people who can’t accomodate in agriculture.
  2. Women can Work in cottage industries to get additional income.
  3. Various products can have global market which have special qualities.
    Ex : Laces from Narsapur, toys from Kondapalli.

Question 26.
Do you have any cottage industries in your area?
Answer:
Yes, in our village Nandamuru in Krishna district we have carton making factory.

7th Class Social Textbook Page No. 80

Question 27.
What is the source of income for your family?
Answer:
The main source of income for my family is salary of my father.

Question 28.
How does a farmer earn money for his family needs?
Answer:
Farmers grows crops in his farm. He sell the products in market. Few farmers work with their family members in fields. Small farmers and landless labourers work in other fields. Few of them earn money from other farming activities.

7th Class Social Textbook Page No. 81

Question 29.
What is the use of Consumer Protection Acts?
Answer:
Use of Consumer Protection Acts: Consumer Protection Acts provide safety and security of their transaction. Help to get protection against cheating, products of low quality exchange of products etc.

Explore

7th Class Social Textbook Page No. 74

Question 1.
Ask you teacher about different e-payments?
Answer:
Different types of e – payments :
1. Credit / Debit card payments :
Payments through cards are most widely used and popular method.

2. Bank transfers :
Customers enrolled in internet banking can do bank transfers for their online purchase.

3. E Wallets :
E wallets require a sign up from merchants as well as customers. After creating an e – wallet account and linking it to the bank account they can withdraw or deposit funds.

4. Moble payments :
To set up a mobile payment method, the customer has to download and link it to the credit card.

5. Cash :
Cash is often used for physical goods and cash-on-delivery transactions.

7th Class Social Textbook Page No. 77

Question 2.
Collect more information about floating markets and discuss in your class room.
Answer:
A floating market is a market where goods are sold from boats.

Originating in times and places where water transport played an important role in daily life. Most floating markets operating today mainly serve as tourist attractions.

Ex : Kolkata’s Patuli area in West Bengal
Goods : Fruits, vegetables and fish available.

AP Board 7th Class Social Solutions 12th Lesson Markets Around Us

Question 3.
During the Covid 19 pandemic, many people bought goods online. Discuss the reasons for this with your friend.
Answer:
About 59% of people purchased things through online because of, they were practicing social distancing and wanted to minimize their time outside of the home. To avoid the queues in the super market.

7th Class Social Textbook Page No. 73

Question 1.
What are the goods available in your local market?
Answer:
Mostly perishable goods are available in my local markets.
Ex : Vegetables, fish, eggs, milk, etc.

Question 2.
List out the goods which are available in your region.
Answer:
Mangoes, vegetables, dais, onions, jaggery, kalamkari goods, kondapalli toys, etc., are available in my region.

Question 3.
Name some goods which has a National market.
Answer:
Market for airline travel, smart phones, new cars, pharmaceuticals, products and the markets forfinancial services such as banking, martgages etc., has a National Market

Question 4.
Name some goods which have an international market.
Answer:
Gold & Platinum have an international market.

7th Class Social Textbook Page No. 74

Question 5.
Read the song “In the Bazaars of Hyderabad” written by Mrs. Sarojini Naidu.
Answer:
In The Bazaars of Hyderabad
What do you sell O ye merchants?
Richly your wares are displayed.
Turbans of crimson and silver,
Tunics of purple brocade,
Mirrors with panels of amber,
Daggers with handles of fade.
What do you weigh, O ye vendors?
Saffron end lentil and rice.

What do you grind, O ye maidens?
Sandalwood, henna, and spice.
What do you call, O ye pedlars?
Chessmen and ivory dice.

What do you make,0 ye goldsmiths?
Wristlet and anklet and ring.
Bells for the feet of blue pigeons
Frail as a dragon-fly’s wing,
Girdles of gold for dancers,
Scabbards of gold for the king.

What do you cry,0 ye fruitmen?
Citron, pomegranate, and plum.
What do you play ,0 musicians?
Cithar, sarangi and drum,
What do you chant, O magicians?
Spells for aeons to come.

What do you weave, O ye flower-girls
With tassels of azure and red?
Crowns for the brow of a bridegroom.
Chaplets to garland his bed.
Sheets of white blossoms new-garnered

AP Board 7th Class Social Solutions 12th Lesson Markets Around Us 5

7th Class Social Textbook Page No. 78

Question 6.
Observe the above flow chart and with the help of your teacher, find out which way the customer is getting cheaper and the reason for it?
Answer:
Wholesale channel is the best to consumer because wholesale seller brought from producer in a bulk way. To the consumer not necessary the things in* a bulk manner.
So the consumer get the goods with fine quality and quantity and at cheaper prices from wholesale channel.

Question 7.
The price of the products hike if there is an agent between the producers and consumers. Discuss.
Answer:
Generally the prices of the products like if there is an agent between producers and consumers. Because the agent brought the good from the producer, so he add some amount to the real price because he add transportation charges, rents of the shops, worker salaries, electricity charges and his profits also.

Project Work

Question 1.
Visit different e-commerce sites and collect the prices of the following goods and then compare them with one another.
A. Laptop
B. Cellular Phone
C. Jeans Pants
D. Pens
E. Toys
Answer:
A. Laptop : Prices in t:

Amazon – Lenovo -18,700/-, Avita – 21,990/-, HP – 15s – 28,499/-, Acer – 54,999/-

Reliance-HP-14s-41,499/-

Hi laptop.com – Lenovo -18,999/-, Dell – Vlebazar -17,500/-

B. Cellular Phone :
Amazon : Samsung -14,999/-

Gadget store : i phone – 4,999/-, Redmi note – 4 – Bingkart – 5,499/¬

C. Jeans pants : Prices from 1000 to more.
Because Jeans pants are our needs of daily life. So more demand is there.

D. Pens : Cross Bailey light – 1,345/- (in Amazon)
Fountain pen – (IGP.com)-445/- Parket Frontier – 661/- (In amazon)

E. Toys : Toys prices from 50 to more.
But toy’s create recreation. Depends up the income only people demand the toys.

Question 2.
Visit a weekly market and collect information and then prepare a list of goods available in that market.
Answer:
I have visited Undi Doolla santha neat Bhimavaram in West Godavari District. I found different animals there like Buffaloes, cows, sheep , goats and cocks there.

AP Board 7th Class Social Solutions 12th Lesson Markets Around Us

Question 3.
Visit a shopping mall or rythu bazar and write your experience in brief.
Answer:
I visited Trendset in Vijayawada. Really it is a fantastic experience. I enjoyed escalator there. The lift is also very attractive with glasses. I saw different floors with different kinds of shops. One is with clothes, another is with electronics etc. I had my lunch there, but it is very expensive and the items we get there will not be available in our middle class houses. I spent my time nearly 3 to 4 hours by wandering here and there in that mall and enjoyed a lot. I took selfies also with my fathers’ cell phone.

AP Board 7th Class Social Solutions 11th Lesson Road Safety Education

SCERT AP 7th Class Social Study Material Pdf 11th Lesson Road Safety Education Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Social 11th Lesson Questions and Answers Road Safety Education

7th Class Social 11th Lesson Road Safety Education Textbook Questions and Answers

Improve Your Learning

I. Answer the following questions.

1. Prepare slogans to create awareness on the prevention of road accidents.
Answer:

  1. Little attention on road leads you risk free journey.
  2. Stop – Look – Go while you cross the road.
  3. Drive with carefulness because you life is priceless.
  4. Line and signs on the road are the symbols of your safety.
  5. Respect the road rules – Be a responsible citizen.

Question 2.
If you are a traffic officer, which steps would you like to suggest to the students to reach the school safely?
Answer:

  1. I would create indepth awareness about the rules to be followed on road.
  2. Ask the school staff to conduct a mock road usage like Kerb drill.
  3. I will ask the students to follow the basic rules like
    a) Always walk on footpath.
    b) Cross the road at Zebra Crossing only.
    c) If Zebra Cross is not available, find safe place to cross, look first at right, then left, if everything is clear – cross the road safety.
    d) Start early to reach your destination in time and avoid hurriedness on road.
    e) Follow the traffic signs strictly. Use hand signs wherever necessary.
    f) Give adequate space to heavy vehicles and never overtake them.

AP Board 7th Class Social Solutions 11th Lesson Road Safety Education

Question 3.
What are the traffic rules you need to follow while using road?
Answer:
Rules for pedestrians :

  1. Use footpath to walk on road. Else walk on left side margin.
  2. Cross the road only at Zebra Crossing. If it is not available follow Kerb drill.
  3. Be cautious at signal lights and move accordingly.
  4. Don’t go for triple ride on cycle or motor cycle.
  5. Avoid using phones on road and listening to music.
  6. Don’t play on road and let pet animals on road.
  7. Use torch and reflectors during night time
  8. Don’t overtake vehicles from left.
  9. Don’t ride close to heavy vehicles.
  10. Don’t accept gifts from strangers.

Question 4.
What are the duties of a traffic police?
Answer:

  1. Traffic police is the person who assigned the duties of regulating, the traffic and guide the public for safe travel on road.
  2. Inculcate awareness on road usage among public.
  3. Regulate the flow of traffic.
  4. Alert the people regularly to avoid road accidents.
  5. Make arrangements for emergency medical help to the victim of road accidents.
  6. Accord penalties to the road users who violate road safety rules.

Question 5.
Give suggestions to prevent road accidents.
Answer:

  1. Follow the road rules and traffic signs compulsorly.
  2. Use vehicles as per speed limits on road.
  3. Always ride the vehicles in controllable speed.
  4. Use helmet, seat belts.
  5. Avoid using mobile phone on road and listening music.
  6. Inculcate awareness on road usage measures from school life.
  7. Do not rush on roads.
  8. Do not play and let animals on road.
  9. Do not chase or overtake the power driven vehicles.
  10. Driving licence is mandatory for power driven vehicles..
  11. Trauma care must be available on high ways.

II. Choose the correct answers.

1. Which of the following colour lights indicate stop before line?
A) Orange
B) Green
C) Red
D) Yellow
Answer:
C) Red

2. Find out the odd one.
A) Footpath
B) Bridge
C) Divider
D) Zebra crossing
Answer:
B) Bridge

3. Which is a road safety hurdle?
A) Using footpaths by pedestrians
B) Following traffic signals
C) Pedestrians crossing the road at zebra crossing
D) None
Answer:
D) None

AP Board 7th Class Social Solutions 11th Lesson Road Safety Education

III. Match the following.

Group-AGroup-B
1. Footpatha) Road marking sign
2. Red colour lightb) Get ready to go
3. Green colour lightc) Pedestrians
4. Orange colour lightd) Move the vehicle
5. Road dividere) Stop before the line

Answer:

Group-AGroup-B
1. Footpathc) Pedestrians
2. Red colour lighte) Stop before the line
3. Green colour lightd) Move the vehicle
4. Orange colour lightb) Get ready to go
5. Road dividera) Road marking sign

7th Class Social 11th Lesson Road Safety Education InText Questions and Answers

7th Class Social Textbook Page No. 57

Question 1.
Observe the pictures given below and put a tick mark (✓) against pictures that are dangerous.
AP Board 7th Class Social Solutions 11th Lesson Road Safety Education 1

7th Class Social Textbook Page No. 63

Question 2.
Interact with traffic police about traffic rules.
Ans. One day after school hours I met the traffic police who discharges his duties on the road.
Even though he is busy with duties but accepted my request to explained the following traffic rules.

  1. Pedestrains should walk on footpath.
  2. Cross the road at zebra crossing.
  3. Look behind and cross only when there is enough gap.
  4. Never play on the road.
  5. Nevel walk on railway tracts.

7th Class Social Textbook Page No. 67

Question 3.
Let’s pick up the placards and make a rally in your village/ town to aware people on road safety.
AP Board 7th Class Social Solutions 11th Lesson Road Safety Education 4
Answer:

7th Class Social Textbook Page No. 68

Question 4.
Fill up the following with Do’s and Don’ts while using the road.
AP Board 7th Class Social Solutions 11th Lesson Road Safety Education 5
Answer:
AP Board 7th Class Social Solutions 11th Lesson Road Safety Education 6 AP Board 7th Class Social Solutions 11th Lesson Road Safety Education 7

Think & Respond

7th Class Social Textbook Page No. 57

Question 1.
How can you say that traffic problem has increased due to urbanization?
Answer:

  1. Due to rapid industrialisation for employment purpose more people move to the towns & cities.
  2. It led to the increase of traffic.
  3. Maximum number of people have their own vehicles.
  4. For jobs, schools and for own work purposes all the people come on the road at a time.
  5. Growth of population is also an another reason.

7th Class Social Textbook Page No. 60

Question 2.
Identify other reasons for road crashes.
Answer:

  1. Not wearing seat belts and helmets.
  2. Rain or wet roads.
  3. Potholes and Bad road condition.
  4. Tailgating etc.

AP Board 7th Class Social Solutions 11th Lesson Road Safety Education

Question 3.
If a person met with a road crash, how will it effect his / her family?
Answer:
If a person met with an road crash, the entire family will effect by the following,

  1. Sometimes the family may loose the member.
  2. If the family depends on him, they may face financial problems.
  3. Sometimes children may stop their education.

Question 4.
How do you react when somebody met with an crash on the road?
Answer:

  1. At first, I will check how is the person’s condition. If it is ok, means small incident.
  2. I will take the candidate to the hospital in case of minor injures, or I will call 108 in case of major accident.
  3. I will inform to the police and tell about what I saw on the spot of an crash

Question 5.
How a country’s economy effects, if majority of the youth lost their lives in accidents.
Answer:

  1. The economy of any country depends on the productive capacity of the youth of the country.
  2. If majority of the youth lost their lives in accidents, it would damage our economy.

7th Class Social Textbook Page No. 67

Question 6.
Now a days traffic is increasing rapidly. Find out the possible solutions for this.
Answer:

  1. Use of public transportation.
  2. Carpooling is a .very good option.
  3. If we want to go for short distance, we should go on foot.
  4. The government has to allocate sites to hospitals, colleges and offices in the outskirts of city.
  5. Government has to increase more number of public transport facilities.

Question 7.
What will happen if someone doesn’t follow traffic signals?
Answer:
If traffic signals are not followed, there can be more accidents.

Question 8.
What sign boards are required at your school premises?
Answer:
AP Board 7th Class Social Solutions 11th Lesson Road Safety Education 8

  1. School is ahead, go slow.
  2. Drive slowly, children may cross the road.
  3. Blow Horn, save children.

Explore

7th Class Social Textbook Page No. 62

Question 1.
With the help of your teacher collect the remaining signs from RTA office/ Traffic Police. Discuss about them in the classroom. Or Visit: https://morth.nic.in/
Answer:
AP Board 7th Class Social Solutions 11th Lesson Road Safety Education 9

7th Class Social Textbook Page No. 62

Question 2.
Match the following traffic signs with their meanings.
AP Board 7th Class Social Solutions 11th Lesson Road Safety Education 10
Answer:
Mandatory Signs : D, E, A, B, C
Information Signs : B, C, D, E, A
Cautionary Signs : B, C, A, E, D

Project Work

Question 1.
Prepare a model electronic traffic signals with all road marking signs.
Answer:
AP Board 7th Class Social Solutions 11th Lesson Road Safety Education 2
AP Board 7th Class Social Solutions 11th Lesson Road Safety Education 3

Question 2.
Visit traffic police office and learn about road safety.
Answer:
One day I visited traffic police office.
I met some of the traffic police officers here. They are explaining about road safety
measures to persons. Some of the following road safety measures.

  1. Always avoid distractions.
  2. Never break Red Signal.
  3. Keep a safe distance from the vehicle ahead.
  4. Always drive within speed limit.
  5. Always wear a helmet while riding a bike (or) Wear seat belt while driving a car.
  6. Follow the traffic signals.

AP Board 7th Class Social Solutions 11th Lesson Road Safety Education

Question 3.
Write a letter to your friend what precautions to take on the road when going from home to school and when coming home from school.
Answer:

Place: ………….
25-11-2021

Dear Murthy,

I am doing well. How are you doing? I congratulate you for getting the first rank in the first semester. I wish to tell you one thing I faced when I was going to my school. Yesterday when I was going to school I escaped from a big road accident because of my hurry. The traffic police saved and gave me some precautions about road safety. So I want to share those with you also because you are also traveling 3 kms daily from your home to school daily.

Please do follow my suggestions.

  1. Cross the road at the Zebra Crossing….
  2. Do not run on the streets. …
  3. Always walk on the pavement….
  4. Do not stick your hand or head out of a moving vehicle. …
  5. Strap on seatbelts in cars. …
  6. Get off on the safer side of the car….
  7. Gear up for bicycle rides.

Wish you a bright future

Thank you raa.

Yours loving friend
BABU.

To
NLN Murthy
S/o. ………………………..
………………………………..
………………………………..